ఆశ!

అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు. యుద్ధంలో తలలు తెగిపడుతున్నాయి. తీవ్రంగా గాయపడినవారు జీవచ్ఛవాల్లా సైనిక ఆసుపత్రుల్లో పడి ఉన్నారు. అలాంటి ఓ ఆసుపత్రిలో ఇద్దరు రోగులు పక్కపక్కనే ఉన్నారు. వారిలో ఒకరికి కాస్త లేచి కూర్చనేంత ఓపికైనా ఉండేది. మరొకరు మాత్రం ఆ అవకాశం కూడా లేదు. తూట్లు పడిన శరీరంతో నిస్సహాయంగా మంచం మీద పడి ఉన్నాడు.`ఈ మందులన్నీ దండుగ. నేను చచ్చిపోవడం ఖాయం. లేచి కూర్చోలేనివాడిని నా కాళ్ల మీద ఇంకెప్పటికీ నిలబడలేను కదా!`అంటూ ఏడ్చేవాడు రెండో సైనికుడు.  `అబ్బే అదేం కాదు! నువ్వు సుబ్బరంగా లేచి తిరుగుతావు. నాదీ హామీ. అసలు నా పక్కన ఉన్న కిటికీని చూశావూ… ఈ కిటికీలోంచి కనిపించే ప్రపంచాన్ని చూస్తే రోజురోజుకీ నాలో జీవించాలన్న ఆశ పెరిగిపోతోంది` అన్నాడు మొదటి సైనికుడు. `మరి నాకా భాగ్యం లేదు కదా! ఈ నాలుగు గోడలూ తప్ప ఉత్సాహం కలిగించేది ఏదీ నాకు కనిపించడం లేదు` అని వాపోయాడు రెండో సైనికుడు.  `అయితే ఓ పని చేద్దాం! నేను రోజూ కిటికీలోంచి కనిపించే అందమైన ప్రపంచాన్ని నీకు వర్ణిస్తూ ఉంటాను. నువ్వు హాయిగా కళ్లు మూసుకుని వాటిని ఊహించుకో` అని సూచించాడు మొదటి సైనికుడు.  రెండో సైనికుడికి ఈ పద్ధతి బాగుంది. మొదటి సైనికుడు రోజూ బయట ఉన్న వాతావరణాన్ని వర్ణించేవాడు. అందమైన సూర్యోదయాల గురించీ, చిగురించే చెట్ల గురించీ, చిరుజల్లుల గురించీ వర్ణించేవాడు. దూరంగా ఉన్న సరస్సునీ, దాని మీద వాలుతున్న కొంగలనీ, అందులో ఈత కొడుతున్న పిల్లలనీ వర్ణించేవాడు. ఆసుపత్రి పక్కగా వెళ్తున్న మనుషుల గురించీ, వారి హావభావాల గురించీ, కేరింతల వర్ణించేవాడు. మొదటి సైనికుడు కళ్లు మూసుకుని అవన్నీ ఊహించుకోసాగాడు. అతనిలో రోజురోజుకీ జీవించాలన్న ఆశ పెరిగిపోసాగింది. ఎలాగైనా ఆరోగ్యం బాగుపడాన్నల కోరిక బలపడింది. తను కూడా ఆ సూర్యోదయాలను చూడగలగాలి, తన పిల్లలతో తిరిగి సంతోషంగా గడపగలగాలి… అవే తన లక్ష్యాలు!  రెండో సైనికుడి ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడింది. `రేపటి నుంచీ నువ్వు లేచి ఓ నాలుగు అడుగులు వేయవచ్చు` అని వైద్యులు కూడా చెప్పారు. ఆ రేపటి కోసం ఎదురుచూస్తూ హాయిగా నిద్రపోయాడు రెండో సైనికుడు. మర్నాడు ఉదయం నిద్రలేచి చూసేసరికి తన పక్కనే ఉన్న మంచం ఖాళీగా కనిపించింది.  `ఈ మంచం మీద ఉన్న వ్యక్తి ఏమయ్యాడు` అంటూ ఆతృతగా అడిగాడు నర్సుని. `అతను ఇవాళ తెల్లవారుజామున చనిపోయాడు` అన్న సమాధానం వినిపించింది. తనలో ఇన్నాళ్లుగా ఆశని రేకెత్తించిన వ్యక్తి చనిపోవడం అతనికి చాలా బాధని కలిగించింది. ఆతృతగా లేచి వెళ్లి కిటికీలోంచి తొంగిచూశాడు. ఆశ్చర్యం! ఆ కిటికీకి దగ్గరలోనే మరో గోడ అడ్డంగా ఉంది. అందులోంచి అసలు సూర్యోదయం కూడా కనిపించే అవకాశం లేదు.  `రోజూ ఈ కిటికీలోంచి చూస్తూ నా మిత్రుడు ఎన్నో దృశ్యాలను వర్ణించేవాడే` అని ఆశ్చర్యపోయాడు సైనికుడు. `అసాధ్యం. ఎందుకంటే అతను ఈ ఆసుపత్రిలో చేరేనాటికి అతనికి చూపు లేదు!` అంది నర్సు నింపాదిగా! - అంతర్జాలంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఓ కథకు అనువాదం.  

20 ఏళ్లకే ముసలితనం!

ఎవరన్నా పెద్దవారు చురుగ్గా ఉంటే ‘అరవైలో ఇరవై’ ఏళ్లవాడిలా ఉన్నారంటూ పొగిడేస్తాము. కానీ ఇప్పటి తరాన్ని కనుక పరిశీలిస్తే ఇరవైలో అరవై ఏళ్లవాడిలా నిస్సారంగా మారిపోతున్నారని గుండెలు బాదుకోక తప్పదు. వైద్యరంగంలో ప్రతిష్టాత్మకమైన Johns Hopkins University పరిశోధనలో వెలుగు చూసిన విషయమిది...   ఏ పనీ చేయకుండా ఉండటం, ఒకవేళ పనిచేసినా కూడా ఒళ్లు అలవకుండా ఉండటం ఇప్పటి జీవనశైలి. దానినే మనం sedentary lifestyle అంటున్నాము. పోనీ ఒళ్లు అలవడం లేదు కదా అని వ్యాయామం అన్నా చేస్తున్నామా అంటే అదీ లేదు కదా! కాబట్టి వయసుని బట్టి మనుషుల శారీరిక శ్రమ ఏ తీరున ఉందో తెలుసుకోవాలనుకున్నారు. ఇందుకోసం 12,529 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. వీరందరినీ వయసుల వారీగా ఐదు విభాగాలుగా విభజించారు. 6- 11 ఏళ్లు, 12- 19 ఏళ్లు, 20- 29 ఏళ్లు, 31- 59 ఏళ్లు, 60- 84 ఏళ్లు అన్నవే ఆ విభాగాలు. వీరంతా రోజూ ఎన్ని కేలొరీలు ఖర్చు చేస్తున్నారో తెలుసుకొనేందుకు ఓ పరికరాన్ని అమర్చారు.   ఒక వారంరోజుల పాటు అభ్యర్థుల జీవనశైలిని గమనించిన పరిశోధకులకు ఆశ్చర్యకరమైన విషయాలు బోధపడ్డాయి. 60 ఏళ్లు పైబడినవారు ఒళ్లు కదపకుండా ఎంత బద్ధకంగా జీవిస్తున్నారో, 19 ఏళ్లవారు కూడా అంతే నిస్సారంగా ఉన్నారట. 20 నుంచి 29 ఏళ్లలోపు ఏదో కాస్త ఒంటిని కష్టపెట్టడం కనిపించింది. కానీ ఆ తర్వాత నుంచీ ఒంటికి అసలు శ్రమ అన్నదే తెలియకుండా జీవిచేస్తున్నారట. ఇక 35 ఏళ్లు దాటినవారి గురించైతే అసలు చెప్పనే అక్కర్లేదు! సాధారణంగా ఆడవారికంటే మగవారు ఎక్కువ శ్రమ చేస్తారని అనుకుంటాం. కానీ ఒక వయసు దాటిన తర్వాత అటు ఆడా, ఇటు మగా కూడా ఒంటికి ఎలాంటి పనీ కల్పించడం లేదనీ తేలింది.   పెద్దవారైన తర్వాత పని ఒత్తిడి వల్లనో, అలసట చేతనో, ఆనారోగ్యంతోనో శారీరిక శ్రమకి దూరంగా ఉంటున్నారే అనుకుందాం. కానీ 5 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు వారు కూడా ఒంటికి అలవనియ్యకపోవడం ఆశ్చర్యకరం. ప్రపంచ ఆరోగ్యం సంస్థ 5 – 17 ఏళ్ల పిల్లలు రోజులో కనీసం ఓ గంటపాటైనా బాగా అలసట కలిగేలా శ్రమించాలని పేర్కొంటోంది. కానీ 19 ఏళ్లు వచ్చేసరికి... మగపిల్లలలో 50 శాతం మంది, ఆడపిల్లలలో 75 శాతం మంది ఎలాంటి శ్రమా లేకుండా గడిపేస్తున్నారట.   ఈ రీసెర్చిలో అమెరికాకు చెందిన వ్యక్తులే పాల్గొన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా బహుశా ఇలాంటి గణాంకాలే నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మన దేశంలో ఆటలకి సమయాన్ని కేటాయించకుండా, కేవలం చదువుకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడాన్ని గమనిస్తే.... 19 ఏళ్లు ఏం ఖర్మ! బహశా పదేళ్ల వయసులోనే మన పిల్లలు వృద్ధులతో సమానంగా నిస్తేజంగా మారిపోతూ ఉండవచ్చు. - నిర్జర.  

దేశంలో సంక్రాంతి – ఒకోచోట ఒకోలా!

సంక్రాంతి తెలుగువారికి ముఖ్యమైన పండుగ అన్న విషయం తెలిసిందే! మన పక్కనే ఉన్న తమిళనాడులో కూడా పొంగల్‌ పేరుతో దీనిని ఘనంగా జరుపుకుంటారనే విషయమూ చాలామందికి తెలుసు. కానీ దేశంలోని అనేక రాష్ట్రాలలో దీనిని వేర్వేరు పేర్లతో ఘనంగా చేసుకుంటారు. వాటిలో కొన్ని... పౌష్‌ సంక్రాంతి (పశ్చిమబెంగాల్):- పుష్య మాసంలో వస్తుంది కాబట్టి బెంగాలీయులు ఈ పండుగను పౌష్‌ సంక్రాంతి అని పిలుచుకుంటారు. వీరి పంటలు కూడా ఇప్పుడే ఇళ్లకు చేరుకుంటాయి. అలా ఇంటికి చేరిన కొత్త బియ్యానికి, ఖర్జూరపు బెల్లాన్ని కలిపి రకరకాల పిండివంటలు చేసుకుంటారు. మూడురోజులపాటు జరుపుకొనే ఈ పండుగ రోజుల్లో వీరు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఇక మకరసంక్రాంతి రోజునే గంగావతరణ జరిగిందని ఓ నమ్మకం. అది జరిగింది కోల్‌కతాకు సమీపంలో ఉన్న గంగాసాగర్ అనే ప్రాంతంలో కాబట్టి, అక్కడ ఉన్న గంగానదిలో స్నానామాచరించేందుకు లక్షలమంది తరలివెళ్తారు. పంజాబ్‌ (మాఘి):- తెలుగువారు భోగి జరుపుకొనే రోజునే పంజాబీయులు లోరి అనే పండుగ చేసుకుంటారు. ఈ రోజున విశాలమైన మైదానాలలో మంటలు వేసుకుని దాని చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ భాంగ్రా అనే సంప్రదాయ నృత్యం చేస్తారు. దీనికి అనుగుణమైన భాంగ్రా పాటలు పాడుతూ, డోలు వాయిస్తూ సాగే కోలాహలం చూసి తీరాల్సిందే! ఇక లోరి మర్నాడు ‘మాఘి’ పేరుతో పండుగ చేసుకుంటారు. పంజాబీల కాలమానం ప్రకారం మాఘి, మాఘమాసంలోని తొలిరోజు. మాఘినాడు పాలు, చెరుకురసంతో ఖీర్‌ చేసుకుంటారు. ఘుఘుటి (ఉత్తరాఖండ్‌):- ఉత్తరాఖండ్‌లోని కుమావ్‌ వంటి ప్రాంతాలలో సంక్రాంతిని భలే చిత్రంగా జరుపుకొంటారు. ఈ రోజుని వారు ఉత్తరాయణంలో మొదటి రోజుగా భావిస్తారు. చలికాలంలో వలస వెళ్లిపోయిన పక్షులన్నీ ఈ రోజు తిరిగివస్తాయని నమ్ముతారు. బహుశా పూర్వీకుల ఆత్మలకు ప్రతిరూపాలన్న నమ్మకం అనో ఏమో నల్లకాకులను కూడా ఈ రోజు స్వాగతిస్తారు. వాటి కోసం వెతికి మరీ రకరకాల తీపిపదార్థాలను అందిస్తారు. అందుకనే ఈ పండుగకు ‘కాలా కవ్వా’ (నల్లకాకి) అన్న పేరు కూడా ఉంది. సుగ్గి (కర్ణాటక):- కన్నడ భాషలో సుగ్గి అంటే పంట లేదా విందు అన్న అర్థం వస్తుంది. ఈ రోజున కన్నడిగులు కొత్తబట్టలు, పూజాపునస్కారాలతో పండుగన ఘనంగా చేసుకుంటారు. దీనికి తోడుగా అక్కడ ఓ చిత్రమైన సంప్రదాయం కూడా కొనసాగుతూ వస్తోంది. ఎల్లు బిరోదు పేరుతో నువ్వుల ఉండలను ఇచ్చిపుచ్చుకుంటారు. కర్ణాటకలోని స్త్రీలు ఈ నువ్వుల ఉండలతో పాటుగా, అరటిపళ్లు, చెరుకుగడలు, పసుపుకుంకుమలను ముత్తయిదువలకు పంచుతారు. మాఘ బిహు (అసోం):- అసోంలో సంక్రాంతి కూడా చాలా చిత్రంగా సాగుతుంది. సంక్రాంతి ముందురోజున వెదురు, ఎండుగడ్డి వంటివాటితో గుడిసెలను నిర్మించుకుంటారు. ఆ రోజంతా ఈ పాకలలో ఆడుతూపాడుతూ గడిపేస్తారు. మర్నాడు ఉదయం వీటిని తగలబెట్టేస్తారు. మన గోదావరి జిల్లాలలో కనిపించే కోడిపందాలు, ఎడ్లపందాల వంటి ఆటలు అసోంలో కూడా జరుగుతాయి. కొబ్బరి, నువ్వులతో రకరకాల పిండిపదార్థాలను చేసుకుంటారు. పైన చెప్పుకొన్న రాష్ట్రాలే కాదు! బీహార్‌, హర్యానా, గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్‌... ఇలా ప్రతి రాష్ట్రంలోనూ సంక్రాంతి ఏదో ఒక పేరున విభిన్నంగా జరుగుతూనే ఉంటుంది. దేశం ఒక్కటే అయినా అందులోని ప్రతి ప్రాంతానికీ తనదైన సంప్రదాయం ఉందన్న విషయాన్ని రుజువు చేస్తుంటుంది.   - నిర్జర.

హరిలో రంగ హరి!!

ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ఆ మహావిష్ణువు నిద్ర నుండి మేల్కొంటాడని, ఆ దేవతలు అందరూ కూడా అన్నిరోజులూ ఆయన దర్శనం కోసం ఎదురుచూసి ఎదురుచూసి, వైకుంఠ ద్వారాలు తెరవగానే వాళ్ళు కూడా మహావిష్ణువు దర్శనం చేసుకుంటారని. ఒకరు ఇద్దరూ కాదు ముక్కోటి దేవతలు ఒకేచోట ఆ మహావిష్ణువును కీర్తిస్తూ, స్తుతిస్తూ  ఉంటారని చెబుతారు.  ఇదంతా ఒకటైతే ధనుర్మాసం మొదలవ్వగానే హరినామస్మరణ చేసుకుంటూ గ్రామాలు, వీధులు తిరిగే హరిదాసుల సందడి మాత్రం ఎంతో ప్రత్యేకం.  ఒకప్పుడు ధనుర్మాసం ప్రారంభం అవ్వగానే పట్టు పంచె, పట్టు కండువా నడుముకు కట్టుకుని, మెడలో పూల హారం, నొసటన ఆ నారాయణుడి నిలువు నామాలు, నెత్తిమీద అక్షయపాత్ర, ఒకచేతిలో చిడతలు, మరొక చేతిలో నారదుని తుంబుర లాంటి వీణ, కాళ్ళకు గజ్జెలు. ఇలా అన్నిటి కలయికలో గ్రామాలలో వీధి వీధి తిరిగి ఆ శ్రీమన్నాయణుడి గురించి గీతాలు ఆలపిస్తూ, పరిస్థి ఇల్లు ఇచ్చే బియ్యం, కూరగాయలు, డబ్బులు ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి పుచ్చుకుని వెళ్ళేవాళ్ళు. ఇలా ధనుర్మాసం మొత్తం ముగిసేదాక చేసేవారు. ఆ మాసం మొత్తం వారికి బోలెడు బియ్యం, పప్పులు, డబ్బులు సమకూరేవి. అయితే కాలంతో పాటు సంప్రదాయాలు సన్నగిల్లినట్టే హరిదాసు కుటుంబాలు తగ్గాయో లేదా వారు చక్కగా చదువుకుని ఇతర వృత్తులను చేపట్టి ఉద్యోగాలు చేసుకుంటూ అలా ఇల్లిల్లు తిరగడం దండగని మాసం మొత్తం ఉన్న ఆచారాన్ని పండుగకు పరిమితం చేశారు కాబోలు హరిదాసుల ఉనికి అప్పటికీ ఇప్పటికీ తగ్గిపోయిందని చెప్పచ్చు. ఇక ఈ హరిదాసు రూపం వెనుక ఆ శ్రీమన్నారాయణుడి స్వరూపం ఉందని ప్రజల విశ్వాసం. అందుకే ఈ హరిదాసు గ్రామాలలో వీధులన్నీ తిరిగేటప్పుడు  బీదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు అనే తేడా లేకుండా అందరి ఇళ్లకు వెళతాడు. అలాగే ప్రతి ఇంటివారు ఇచ్చినది తీసుకుంటాడు తప్ప ఖచ్చితంగా ఇంత ఇవ్వాలనే నియమం ఏది పెట్టడు. సంక్రాంతి వండుగ రోజు పట్టు పరికిణీలు, పట్టు చీరల్లో మెరిసిపోయే అమ్మాయిలు, ఇంటి ముందు రంగురంగుల ముగ్గు మధ్యలో పెట్టిన గొబ్బెమ్మ చుట్టూ చేరి గొబ్బెమ్మను గురించి పాటలు పాడుతుంటే, హరిదాసు తలమీద అక్షయపాత్రను పెట్టుకుని ఆ ఇంటి ముందుకు వస్తే, ఆడపిల్లలు అందరూ హరిదాసు అక్షయపాత్రలో బియ్యం పోయడానికి పోటీలు పడుతుంటే ఆ సన్నివేశం నిజంగా ఎంతో అబ్బురంగా ఉంటుంది.  కళారూపం జీవం గుర్తొచ్చే సమయం!! జానపద కళారూపాలలో ఎన్నో ఉన్నాయి. వాటిలో వీధులు తిరుగుతూ కథలు కథలుగా జరిగిన వాటిని కావ్యాలుగా మార్చి ఆలపించి ప్రాచారం చేయడం కూడా ఒకటి. వీటిని జానపద పాటలు అంటారు. తెలంగాణ బతుకమ్మ సంబరాల్లో ఇలాంటి జానపద పాటలు ఎన్నో వినబడుతాయి. అలాంటివే గొబ్బిళ్ళ చుట్టూ తిరుగుతూ అమ్మాయిలు పాడే పాటలు మరియు వీధులు వీధులు తిరుగుతూ హరిదాసులు ఆలపించే భక్తిపరమైన అలాపనలు. విచిత్రం ఏమిటంటే ఉదయాన్నే హరిదాసులు నెత్తి మీద అక్షయపాత్ర పెట్టుకుని భిక్ష కోసం బయలుదేరినప్పుడు మొదలుపెట్టే ఆ భగవంతుని స్మరణ తిరిగి చీకటి పడే వేళకు ఇంటికి చేరినప్పుడు మాత్రమే ఆగుతుంది. మధ్యలో ఎక్కడా వారు ఎవరితో మాట్లాడరు కూడా.  రూపం రసరమ్యం!! హరిదాసు రూపం ఆ మహావిష్ణు రూపమని, ఆయన తలమీద ఉండే అక్షయపాత్ర సాక్షాత్తు భూదేవి అని ఆయన భూదేవిని మోసుకుంటూ ఇలా ప్రజల మధ్య తిరుగుతూ వస్తాడని చెబుతారు. ఇంతటి లోతైన తత్వం ఈ రూపంలో ఉంది మరి. రంగురంగుల ముగ్గులు కొత్త జీవితాన్ని ఆ రంగుల్లా కళగా ఉండమని చెబుతుంటే హరిలో రంగ హరి!! అనే హరిదాసుకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుందాం!! ◆ వెంకటేష్ పువ్వాడ

ఇంటింటి భోగి "మంటలు"!!

రంగురంగుల ముంగిళ్ళ పండుగ, ముగ్గుల పోటీల పండుగ సంక్రాంతి. సూర్యుడు మఖరరాశిలో ప్రవేశించడంతో ప్రారంభమయ్యే వెలుగుల ప్రతాపానికి మొదలు ఇదే అవుతుంది. భోగి, సంక్రాంతి, కనుమగా ముచ్చటగా మూడు రోజులు అలరించే ఈ పండుగ కళ ప్రతి ఏడాది అంతకంతకూ తగ్గుతోందనే చెప్పాలి. ఉద్యోగాలు, చదువుల నిమిత్తం దూరం వెళ్లిపోయిన కొందరు మాత్రమే స్వగ్రామాలకు తిరిగి వెళ్లి పండుగ సంబరాలలో భాగస్వాములవుతారు. అయితే నేటి కాలంలో కారణాలు ఎన్ని ఉన్నా మనుషుల మధ్య సఖ్యత తక్కువగా ఉందని చెప్పవచ్చు. ఒకప్పటి ఆప్యాయత, బాధ్యత ఇప్పట్లో ఏ కుటుంబంలో మెండుగా ఉండటం లేదు. దానికి కారణాలు తెలుసుకుని వాటన్నిటినీ సంక్రాంతి భోగిమంటలలో వేసి కుటుంబాలలో ఉన్న మనస్పర్థలు, దూరాలు చెరిపేసుకోండి. ప్రాధాన్యత!! ప్రస్తుతం ఇంట్లో వైఫై, మొబైల్, లాప్టాప్, టీవీ, ఇంకా ఎన్నెన్నో వస్తువులు వీటికున్న ప్రాధాన్యత మనుషులకు అసలు ఇవ్వడం లేదంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంటికి నెట్ పెట్టిస్తే నెల నెలా దానికి క్రమం తప్పకుండా బిల్ పే చేయాలనే బాధ్యత ఉంటుంది కానీ కనీసం రోజులో ఒకసారి అయిదు నిమిషాలు లేదూ తీరిక లేకుంటే వారానికి కనీసం ఓ గంటసేపు కుటుంబ సభ్యులు అందరూ ఒకదగ్గర కూర్చుని మనసువిప్పి మాట్లాడుకునే సంఘటనలు ఇప్పటి తరం ఎంతమాత్రం కనబడుతున్నాయో ఎవరికి వారు ఆలోచన చేసుకోవాలి. అందుకే డబ్బు, బంధాలు రెండింటినీ తూకం వేయకూడదు.  సమస్యలు పరిష్కారాలు!! సమస్య ఏదైనా తప్పక పరిష్కారం ఉంటుంది. కుటుంబంలో ఆర్థిక, బంధాల మధ్య సమస్యలు రావడం సహజం. ఆయితే వాటిని కుటుంబ వ్యక్తులే పరిష్కారం చేసుకోవాలి కానీ గోరంత సమస్యను బెట్టు చేసి, మొండి పట్టులో కొండంత సమస్యగా పెంచకూడదు.  తరాల మధ్య తేడా గమనించాలి!! "మేము మీలగా ఉండేవాళ్ళం కాదు మీ వయసులో ఉన్నపుడు" ఇది తరచుగా చాలా ఇళ్లలో పెద్దలు అనే మాట. అయితే గమనించాల్సిన విషయం కాలం కూడా అలాగే లేదు. నిన్న మొక్క ఈరోజు వృక్షం అయినట్టు నిన్నటి వాళ్ళు ఈరోజు బాధ్యతలతో ఉంటారు. మొక్క నిన్న కేవలం ఎదుగుదలలో ఉంటుంది, పెద్దయ్యాక పండ్లు, పూలు ఇస్తుంది. అలాగే మనుషులూనూ. అందులోనూ వేగవంతమైన కాలంలో స్థిరంగా ఏదీ ఉండదు. మార్పులకు తగ్గట్టు మనిషి ఆలోచనలు కూడా మారతాయి. అదే విషయాన్ని పెద్దలు గుర్తించాలి. తరాల మధ్య తేడాను ఆ తేడాకు సర్దుకుపోవడాన్ని అర్థం చేసుకోవాలి.  దాంపత్యాలు దృఢమవ్వాలి!! ప్రపంచంలో భార్యాభర్తలకు మించిన గొప్ప స్నేహితులు ఉండరు. అలాగే ఆ ఇద్దరూ ఎడమోహం, పెడమోహంగా ఉంటే వాళ్లకు మించిన శత్రువులు వేరే ఎక్కడా కనిపించరు. వచ్చిన చిక్కల్లా ఆ ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వస్తే జడ్జిమెంట్ పేరుతో మూడో మనిషి చేతిలో సమస్యను పెట్టి ఎవరిది తప్పు చెప్పమని అడగడం. ఇక్కడి నుండి సమస్యలు మొదలవుతాయి. నిజానికి ఒకరికి ఒకరు అనుకునే గొప్ప బంధంలో తప్పులు ఉండవు పొరపాట్లు ఉంటాయి. జరిగేవాటిని పొరపట్లుగా చూసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటే విడాకులు అనే పదం వినిపించడం ఆగిపోవచ్చు కూడా. స్వేచ్ఛకు సంకెళ్లు వేయద్దు!! పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరికీ ఆలోచన ఉంటుంది. పున్నాగపూలు అనే నవలలో ప్రముఖరచయిత్రి జలందర గారు చెబుతారు "పిల్లలకు ఆదుకోవడం నేర్పిస్తాము, మాట్లాడటం నేర్పిస్తాము, తినడం నేర్పిస్తాము, నడవడం నేర్పిస్తాము కానీ ఆలోచించడం నేర్పించము ఎందుకు??" అని. పెద్దరికాన్ని చూపించాలనో, పెత్తనం చెలాయించాలనో, లేక అతి ప్రేమ వల్లనో తల్లిదండ్రులు పిల్లలని ఒక కీ ఇచ్చే బొమ్మలా తయారుచేస్తారు. అందుకే చాలామందికి చదవడం, తినడం, మార్కులు తెచ్చుకోవడమే కర్తవ్యం అనే అజ్ఞానం పేరుకుపోయి ఉంటుంది. ఇలాంటి వాళ్లే ఒకవయసు వచ్చాక స్వేచ్ఛ రుచి తెలిసాక గొడవలు పడి దూరం వెళ్లిపోవడం లేదా తల్లిదండ్రులను ద్వేషించడం చేస్తారు. అందుకే పిల్లలకు చిన్నతనం నుండే వాళ్ళకూ ఓ ఆప్షన్ ఇచ్చేయ్యాలి. ఆ తరువత దాని ముందు వెనుకలు వివరించి చెప్పాలి తుది నిర్ణయం వారికే వదిలేయాలి. పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా ప్రతి కుటుంబంలో అర్థం చేసుకోలేకపోవడం, ఆర్థిక సమస్యలు, బయటి వ్యక్తుల జోక్యం వల్ల ఎదురయ్యే సమస్యలు, అనారోగ్యాలు ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఈ చిటపటలన్నీ పెద్దగవ్వకుండా భోగిమంటల సాక్షిగా మెల్లిగా మాట్లాడుకుని వాటన్నింటినీ నిప్పుల్లో గుమ్మరించేయండి. హాయిగా కలసిమెలసి ఉండండి. ◆ వెంకటేష్ పువ్వాడ

సంక్రాంతి పతంగుల పండుగ!! 

పతంగం అంటే గాలిపటం. రెండు కాగితాలు వాటి మధ్యన వెదురు బద్దలు, దారం, రంగులు, కాసింత జిగురు ఇవన్నీ ఉంటే అందరికీ ఎంతో ఇష్టమైన గాలిపటం తయారైపోతుంది. తొమ్మిది మైళ్ళ తొకతో ఆకాశంలోకి ఎగిరి వయ్యారాలు పోయే గాలిపటం అంటే చెప్పలేనంత సరదా. తెలుగువారి పెద్ద పండుగ, రైతన్నలు సంబరంగా జరుపుకునే పండుగ, కొత్త అల్లుళ్ళ కోరికల పండుగ, ఎద్దుల పందేలు, ఎడ్ల బండ్ల సందడి నెలకొనే పండుగ. ఇంకా చెప్పాలంటే పిండివంటల పసందైన పండుగ. ఇంత గొప్ప సంక్రాంతి రోజున గాలిపటాల హంగామా తోడైతే చెప్పలేనంత సంతోషం నెలకొంటుంది. అయితే ఈ పతంగుల సంబరాన్ని ఏదో గాలిపటం ఎగరేసినట్టు కాకుండా ప్రత్యేక పండుగగా కూడా జరుపుకుంటారు. కైట్ ఫెస్టివల్ పేరుతో పాశ్చాత్యదేశాలలో కూడా సందడి చేస్తుంది గాలిపటం. అయితే ఈ గాలిపటాల సంబరంలో అపశృతులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాటివల్ల తీరని నష్టం జరుగుతుంటుంది. జాతీయ అంతర్జాతీయ విషయాల గురించి కాదు కానీ ప్రతి వ్యక్తి చేతిలో కొంత బాధ్యత ఉంటుంది. దాని ప్రకారంగా ఏది చేసినా నష్టాన్ని నివారించవచ్చు. పతంగుల పండుగ ఆస్వాదించాలంటే నివరించాల్సినవి, పాటించాల్సినవి తెలుసుకోవాల్సిందే మరి. ప్రమాదకరమైన పరిసరాలు!! గాలిపటాలు ఎగరేయడానికి విశాలమైన ప్రాంతాలు ఉండేలా చూసుకోవాలి. బిల్డింగ్ లు, చెట్లు, కరెంట్ స్తంభాలు వంటి వాటి చుట్టూ గాలిపటాలు ఎగరేయడం మంచిది కాదు. శీతాకాలపు మంచు వల్ల కరెంట్ తీగలు, స్తంభాలు వంటి చోట్ల తేమ ఉంటుంది. గాలిపటాలు ఆ తేమ బారిన పడితే ఘోరమైన కరెంట్ షాక్ కొట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిసరాల్లో గాలిపటాలు ఎగరేయడానికి ఉవ్విళ్లూరకండి. విహంగాల మరణానికి బాధ్యులు కారాదు!! విహంగాలు మనుషుల స్వేచ్ఛకు ఒక గొప్ప ఉపమానాలు. అయితే ఈ గాలిపటాల గందరగోళంలో వేలకొద్ది పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయంటే ఎంతో విచారం కలుగుతుంది. గాలిపటాలు తెగిపోయి ఎక్కడెక్కడో చెట్ల కొమ్మల్లోనూ, కరెంట్ తీగల్లోనూ, టెర్రస్ ల మీద ఇరుక్కుపోయి అవి కాస్తా పక్షుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. పక్షుల రెక్కలకు బిగుసుకుని, కాళ్ళకు బిగుసుకుని, గొంతులకు ఉచ్చులా మారి పక్షులను నేలరాలుస్తున్న పాపం ఈ గాలిపటాల మాంజాలదే. మన వినోదం కాస్తా పక్షుల పాలిట యమపాశం అవుతుంటే సిగ్గుపడాల్సిన విషయమే ఇది. మాంజా కు గాజుపెంకుల పొడి పూస్తారు. ఫలితంగా  ఆ దారం ఎంతో పదునుగా ఉండి తొందరగా పక్షులమీద ప్రభావం చూపిస్తోంది. పందేలు శృతిమించరాదు!! గాలిపటాలు ఎగరేయడం గమ్మత్తైన ఆట. ఇదొక పందెమే. సంక్రాంతి కోడి పందెల్లానే గాలిపటాల పందేలు కూడా జోరుగానే సాగుతాయి చాలాచోట్ల. ఈ గాలిపటాల హొయలును తెలుపుతూ నాటి పాత సినిమాలో  పదపదవే వయ్యారి గాలిపటమా….. అని పాటతో పసందు చేసినా, గాలిపటమా పద పద పదా  హంసలాగా పదపద  ఆకాశమే మరి మనకిక హద్దుకాదు పదపద అని ఆలపిస్తూ పైకి పోయే పతమే, ఇది పందెం గెలిచే పతమే, సూపరు స్టారు పవరే పతంగం అని ఇప్పటికీ ఉర్రూతలూగించినా అది గాలిపటాల పందెంలో ఉన్న ఉల్లాసమే అని గుర్తించాలి. అదేమీ కాకుండా మనసులో కోపం, ద్వేషం పోగేసుకుని పళ్ళునూరుతూ కళ్ళల్లో కారాలు చిమ్ముతూ పందేలు పెట్టుకుని దాన్ని గొడవలకు దారితీసుకోకూడదు. కాబట్టి చెప్పొచ్చేదేమిటంటే పందెం కూడా ఆరోగ్యకరంగా ఉండాలని. పై విషయాలు మాత్రమే కాకుండా మనం ఏమి చేసినా అది చుట్టుపక్కల ఉన్నవారికి ఏ విధంగానూ ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు. కాబట్టి పతంగుల పండుగను విశాలమైన ప్రాంతాలలో, పక్షులకు హాని కలగకుండా, ఎటువంటి ప్రమాదాలకు గురవ్వకుండా, గొడవలకు దారితీయకుండా ఉండేలా జరుపుకోవాలి. అప్పుడే గాలిపటమా పద పద పదా అంటూ ఆ క్షణాలను ఆస్వాదించగలుగుతారు. ◆ వెంకటేష్ పువ్వాడ  

ప్రపంచ వ్యాప్తమైన వివేక వాణి!!

  వివేకం అంటే బుద్ధి. ఆలోచన కలిగినది, అర్థం చేసుకోగలది, పరిపక్వత కలిగి అన్నిటినీ సమ దృష్టితో చూడగలిగేది వివేకం యొక్క గొప్ప లక్షణం. ఈ వివేకాన్ని మెండుగా కలిగిన వారు వివేకులు. వివేకులు ఎప్పుడూ స్థిరంగా ఉంటారు. వారిలో ఖచ్చితమైన దృఢచిత్తం ఉంటుంది. దేనికీ భయపడరు, బాధపడరు, ప్రపంచాన్ని అన్నివైపుల నుండి చూస్తూ అన్ని కోణాలలో అన్ని విధాలుగా అర్థం చేసుకోగలుగుతారు. అలాంటి వివేకాన్ని తన పేరులో నింపుకుని, ప్రపంచానికి వివేకాన్ని పంచిన మహనీయుడు స్వామి వివేకానంద!!ఈయన పేరు వింటే ప్రపంచదేశాలలో భారతీయ హైందవ ప్రవచనాల పరంపర గుర్తొస్తుంది. బాధ్యతాయుతమైన యువతరపు నెత్తురు ఉరకలేస్తుంది. 1863 జనవరి 12వ తేదీన జన్మించిన వివేకానందుడి అసలు పేరు నరేంద్రుడు. రాజు సభలో బుల్లిరాజు!! బాల్యం నుండే నరేంద్రుడిలో భావి మహత్వ సూచనా లక్షణాలు కానవచ్చాయి. ఇతడు మహోత్సాహ వంతుడు, వ్యాకుల మనస్కుడు. అప్పుడప్పుడు హఠాత్తుగా ఇతడు ఉద్రిక్తుడయ్యేవాడు. తల్లి దీనికొక విచిత్రమైన నివారణోపాయాన్ని కనుగొంది. ఇతణ్ణి కుళాయి నీళ్లకింద కూర్చోబెట్టి శివనామాన్ని జపింప చెయ్యటమే ఆ చికిత్స, నరేంద్రుడు ఎదిగేకొద్దీ అతడిలో అసాధారణ ఉదార ప్రవృత్తులు కనిపించసాగాయి. బిచ్చగాళ్లకు, సన్న్యాసులకు విలువైన వస్తువులను మరో ఆలోచన లేకుండా ఇచ్చి పంపేవాడు. పెంపుడు జంతువులన్నా, పక్షులన్నా ఇతడికి ఎంతో ఇష్టం. ఆవు, కోతి, నెమలి, పావురం, రెండు మూడు గినీ పందులను ఇతడు పెంచేవాడు. కొరడా చేతపుచ్చుకొని గుర్రపుబండిని తోలే 'కోమ్మాన్' ఈ పసివాడి ఊహాలోక నాయకుడు. నరేంద్రుడు తన తోటి బాలుర మన్ననలకు పాత్రుడైన నేత, 'రాజు సభ' అనే ఆటంటే ఇతడికెంతో ఇష్టం. దాన్లో నరేంద్రుడు ఎప్పుడూ రాజు' పాత్రను వహించేవాడు, మిత్రులను అధికారులుగా నియమించేవాడు. ఇలా చిన్ననాటి నుండే ఈయణలో నాయకత్వ లక్షణాలు పురుడుపోసుకున్నాయి. అధ్యాత్మ అద్భుత మార్గం!! చిన్నప్పటి నుండి తెలియకుండానే ధ్యానంలో కూర్చోవడం నరేంద్రుడి జీవితంలో అనుకోకుండా జరిగిపోయేది. అలా ధ్యానం చేయడం కూడా ఈయనకు ఆటగా అనిపించేది. అది క్రమంగా పెరుగుతూ ఆయన్ను ఆధ్యాత్మిక సాధన వైపుకు తీసుకెళ్లి రామకృష్ణుల వారి శిష్యుడిని చేసింది. బెలూరులో రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాన్ని స్థాపించారు ఈయన. ప్రపంచ దేశాలకు భారతీయ హిందూ ధర్మం గురించి ప్రచారం చేసి, అదే విదేశాలలలో పర మతం ముందు భారతీయ సనాతన ధర్మం విశిష్టతను, అందులో మార్మికాన్ని, ఆఫహ్యాత్మికథను, తాత్వికతను ఎలుగెత్తి చాటిన మహనీయుడు. కెరటాల ఆదర్శప్రాయుడు!! కెరటం నా ఆదర్శం. లేచి పడినందుకు కాదు, పడి కూడా మళ్లీ లేచినందుకు అంటాడు వివేకానందుడు. ప్రయత్నాల పోరాటంలో వైఫల్యాలను అధిగమించి గెలుపుకై సాగిపోవాలని యువతకు ఉగ్గుపోసినట్టు తన మాటల అస్త్రాలతో ఎన్నెన్నో సూక్తులను చెప్పి భావిభారత అభివృద్ధికి యువతే ముఖ్యమని వారు ఎప్పుడూ విల్లు విడిచిన బాణాల్లా దూకుపోయి దేశాన్ని వెలిగించాలని పిలుపునిచ్చినవాడు. సోదర, సోదరీ బందానికి మూలకర్త!! ఈయన చికాగో ప్రసంగం ఎంతో ఖ్యాతి పొందింది. ఆనాటి ఆయన ప్రసంగంలో విదేశీయులను, అక్కడున్న సకల ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మొదటి మాట  "సోదరసోదరీమణులారా" అని. ఆ ఒక్క మాటతో మనుషులు, దేశాలు, ఖండాల మధ్య ఉన్న వ్యత్యాసం అంతా తుడిచిపెట్టుకుపోయి అందరూ ఒకటే అనే భావనను కలుగజేసింది. ఇట్లా ఆధ్యాత్మికం, తత్వం, వేదాంతం అన్నిటినీ మేళవించుకున్న వివేకానందుడు భారతీయ యువతకు గొప్ప ఉత్ప్రేరకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈయన తన 39 సంవత్సరాల వయసులో అనారోగ్యం బారిన పడి మరణించారు. ఆ 39 సంవత్సరాల కొద్ది కాలంలోనే యావత్ ప్రపంచానికి తన వాణిని వినిపించాడని, అది అందరి మీద ప్రభావం చూపిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా!!  ఆయన జన్మదినాన్ని యువజన దినోత్సవంగా జరుపుకుని యువత తమ వంతు పాత్రగా దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకొస్తే అదే ఆయనకు ఇచ్చే నివాళి అవుతుంది. ◆వెంకటేష్ పువ్వాడ

అలసట వీడని వలస ప్రయాణం !!

  ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో ఎక్కువగా కనబడేది వలస. ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి పొట్టకూటి కోసం కొందరు, బతుకు తెరువు కోసం కొందరు, బతుకును ఇంకా మెరుగు పరుచుకోవాలని కొందరు, ఆశాజనకమైన జీవితంలో అందలాలు ఎక్కాలని కొందరు ఇలా కారణాలు ఎన్నో ఉన్నా వలస అనేది నేటి భారతాన్ని పత్తి పీడిస్తున్న పెద్ద సమస్య.పల్లెల నుండి పట్టణాలకు, పట్టణాల నుండి రాష్ట్రాలకు, రాష్ట్రాల నుండి దేశాలకు సాగుతున్న ఈ వలస దారుల పరంపర భారతదేశ అభివృద్ధినిపై కూడా ప్రభావం చూపిస్తోందని చెప్పవచ్చు. ఒకప్పుడు!! గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు పడక, పంటల కళ లేక, కరువు తాండవించి, భూములు బీడెక్కి తిండి గింజ లేక, కొనుక్కోవడానికి పైసా చేతిలో లేక ఎన్నో అవస్థలు పడేవాళ్ళు. అలా గ్రామీణ ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలలో ఒకరో ఇద్దరో పట్టణాలకు వెళ్లి అక్కడ భవన నిర్మాణ పనులు, రోడ్డు నిర్మాణ పనులు, ఫ్యాక్టరీలలో పనులు, రోజు వారీ కూలీలుగా ఇలా ఎన్నో పాత్రలలోకి మారిపోయి నాలుగు కాసులు జేబులో నింపుకుని, తాము తిని అంతో ఇంతో పల్లెల్లో ఉన్న కుటుంబాలకు కూడా పంపేవారు.  అయితే ఈ వలస కూడా క్రమంగా కొత్త పుంతలు తొక్కుతూ వస్తోంది. నయా వలసల మేళా!! నిజానికి  ఏదో కాలం బాగోలేక పల్లెల్లో బాగుకు బారమై పట్టణాలకు వెళ్ళడాన్ని వలసగా చిత్రించిన సమాజం, నేటి ధనవంతులు, విద్యాదికులు చేస్తున్నదానికి ఆ పదాన్ని అపాదించడానికి తటపటాయిస్తుంది ఎందుకో మరి. చక్కని చదువు, మంచి ఉద్యోగం, ఆశించినంత వేతనం. ఇవన్నీ ఉన్నా నేటి యువత విదేశాలకు వినీలాకాశంలో రెక్కలు కట్టుకుని వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ఎంతో మేధస్సు కలిగిన భారత యువత తమ తెలివితేటలను పక్క దేశాలకు అమ్మేస్తూ వారి చెంతన అతిథులుగా ఉంటున్నారు. నిజానికి ఈ డిజిటల్ యుగంలో అన్ని చోట్లా తమదైన ముద్ర వేస్తున్న వాళ్లలో భారతీయులే ఎక్కువ ఉన్నారు. అదే ప్రతిభ పుట్టిన దేశం కోసం వినియోగిస్తే భారత్ కూడా సాంకేతిక అభివృద్ధిలో కొత్త దారుల్లో పరుగుపెట్టి, నిరుద్యోగ విలాపాన్ని తగ్గించుకుంటుంది. ఇలా కొత్తరకపు విద్యావంతుల వలస కూడా భారతదేశ ఆర్థిక, అభివృద్ధి, సామాజిక తీరుపై ఎంతో ప్రభావం చూపిస్తోంది. విదేశాలకు తరలిపోవడం ఒక స్ట్రేటజీగా భావిస్తున్న వాళ్ళు ఆ రెక్కల లోకం అంతా ఆకాశం లాంటిదే అని, ఎప్పటికీ పుట్టిన దేశమే నడక నేర్చిన భూమే తల్లిలాంటిదని తెలుసుకునే సమయం రావాలి. రంగుల జీవితం, మాటల మాయలో గందరగోళం!! ఇవన్నీ ఒక ఎత్తైతే అసలైన వలస మరొకటి ఉంది. ఎక్కువ జీతం ఇస్తారనే ఆశతో కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాలకు వలస పోతున్న వాళ్ళు భారతదేశంలో కోకొల్లలు. తీరా అక్కడికి వెళ్ళాక అడ్డమైన చాకిరీ చేయలేక ఆ అరబ్బుల హింసలు భరించలేక, దొంగ వీసాలు, వీసా కాలం చెల్లిపోయి తిరిగి రాలేక సతమతం అవుతున్న వాళ్ళు ఎందరో!! వాళ్లలో ఆడవాళ్ళ జీవితాలు మరీ ఘోరంగా ఉంటాయి.  పిల్లలను చదివించాలని, పెళ్లిళ్లు చేయాలని, తిండి లేక అల్లాడుతున్న కుటుంబాల కళ్ళలో వెలుగు నింపాలని ఇలా ఎడారి దేశాలకు వలస పోయి, అక్కడ దుర్భరమైన జీవితాలు వెళ్లదీస్తున్న వారిని ఉద్దేశిస్తూ సినిమాలు, సాహిత్యంలో కథలు, కథల పుస్తకాలు కూడా వెలువడ్డాయి అంటే ఆ జీవితాలు ఎంత ప్రభావితం అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.  సమైక్య సంపాదనే పరిష్కారం!! జీవించడం ఖరీదుగా మారిపోతోంది. కాలంతో పాటు ఖర్చులు పెరిగిపోతున్నాయి. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకరి సంపాదనతో జీవించం ఈ కాలంలో ఎంతో కష్టం. అందుకే సమైక్య సంపాదనే జీవితాలు బాగుండటానికి పరిష్కారమని అర్థం చేసుకోవాలి. కనీసం రెండు చేతుల సంపాదన సాధ్యమైతే కుటుంబం కాస్త ప్రశాంతంగా ఉండగలదు. ముఖ్యమైన సూత్రం!! అందరూ చదువుకుంటేనే ఉద్యోగం అనుకుంటారు. చదువుకు ఉద్యోగానికి సంబంధం ఉన్న, చదువు లేకుండా వ్యాపారాలు చేస్తూ విజృంభిస్తున్న ఎన్నో జీవితాలు భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి చదువును చదువుగా చూస్తూ, చదువు ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకుని, జీవితానుభవాల ద్వారా సమాజాన్ని చదువుతూ సంపాదనకు సోపానాలు నిర్మించుకోవాలి. లేకపోతే వలస అనే రాకాసి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. ◆ వెంకటేష్ పువ్వాడ

పంచభూతాల ఆకలి తీర్చాలి!! 

ఈ ప్రపంచాన్ని నిలబెడుతున్నవి ఏవి అంటే పంచభూతాలే. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఇవన్నీ అద్భుతాలు. హేతువాదులు భూతం లేదు వాతం లేదు అని కొట్టి పడేసినా వాటిని సైన్స్ పరంగానూ, సోషల్ పరంగానూ ఆవరణాలు, భౌతిక రసాయన కేంద్రకాలు అని మాట్లాడినా మొత్తం మీద ప్రపంచాన్ని రక్షిస్తున్నవి అవే. అయితే మనిషి తన స్వార్థంతో వీటిని అంతకంతకూ అదుపులో పెట్టాలని, అణచాలని చూస్తున్నాడు. కానీ అది ఎంత తప్పో అపుడపుడు ప్రకృతీ వైఫరిత్యాల ద్వారా అర్థమవుతూనే ఉన్నా చీమ కుట్టినట్టు కూడా అనిపించదు మనిషికి. చెట్లను నరికేస్తాడు, పచ్చదనాన్ని అనిచేస్తాడు, ప్రవాహలను అడ్డుకుని ప్రాజెక్టులు కడతారు, నీటిని, గాలిని కాలుష్యం చేస్తాడు. ఇట్లా మనిషి తన పరిధిలో ఉన్న ప్రతి దాన్ని అడ్డుకుంటూ ఆ ప్రకృతిని కూడా శాసించాలని చూస్తున్నాడు. ఈ పంచభూతాలకు ప్రకృతి అని, దాన్ని కూడా ఒక దేవతగా భావించి పూజించే ప్రత్యేకత మన భారతదేశానిది. అయితే క్రమంగా పాశ్చాత్య దేశాల ప్రభావం మన దేశ పౌరులపై పడి ఆ ప్రకృతిని హింసిస్తున్నాడు మనిషి. చెట్లు ఆరోగ్యానికి మెట్లు. చెట్లు నాటడం అంటే గొప్ప యజ్ఞం చేయడం. మొక్క నాటి సంరక్షించి దాన్ని పెంచి పెద్ద చేస్తే వంద యజ్ఞాలు పూర్తి చేసినంత పుణ్యం వస్తుంది. అది ప్రకృతికి సేవ చేసినట్టే అవుతుంది. ఆ ప్రకృతి ఆకలి తీర్చినట్టే అవుతుంది. భూమి తాపం తీర్చాలి!! ఎక్కడ చూసినా సిమెంట్ తో కప్పబడిన రహదారులే. ఇంటి ముంగిలి నుండి, రహదారులు పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇళ్లలో కూడా చలువరాతి బండలు పరిచి ఉంటాము. ఇంకా ఒకదాని మీద మరొకటి అంతస్థుల మీద అంతస్తులు అవన్నీ కలసి మనిషి మనుగడకు ఎంత సమస్య తెచ్చిపెడుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. మనిషి పుట్టాక జీవితకాలంలో ఎలా మార్పులు చెందుతూ ఉంటాడో అలాంటిదే ఈ భూమి విషయంలో కూడా జరుగుతుంది. అయితే మనిషి ఎన్ని దశలు మారినా శరీరానికి తగిన పోషణ ఇవ్వడం మాత్రం మానుకోడు. మరి భూమి విషయంలో ఎవరూ ఆలోచించరేం. ఒకప్పుడు ఎక్కడ చూసినా మట్టి నేల. వర్షం పడితే ధారగా భూగర్భంలోకి చొచ్చుకుపోయే నీళ్లుఇప్పుడు కాంక్రీటు రోడ్ ల మీద ప్రవహించి చివరికి ఏ మురికి కాలువలోనో కలసిపోతున్నాయి. పలితంగా భూమిలోపల విపరీతంగా వేడి పెరిపోయి అది భూకంపాలకు, భూమి నిస్సారతకు కారణం అవుతోంది. జలకాలుష్యం, వాయు కాలుష్యం! ఇవి రెండూ తలచుకుంటే  బాబోయ్ అనిపిస్తుంది. ఒకప్పుడు నదీ జలాలకు ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, పుష్కరాలు జరుపుతూ ఉంటే అదంతా ప్రకృతీ ఆరాధనలో భాగంగా ఉండేది. అయితే ఫ్యాక్టరీలు ఏర్పడ్డాక వాటి వ్యర్థాలు నీళ్లలోకి వదులుతూ జలకాలుష్యం బాగా పెరిగిపోయింది. కానీ మూర్ఖుల వాదన ఎలా ఉంటుంది అంటే నదీజలాల ప్రత్యేక పూజలు వల్లే జలకాలుష్యం జరుగుతోందని వాదిస్తారు. అంతేనా ప్రకృతిని ఆరాధించడం మూర్ఖత్వం అని కూడా అంటారు.  మన భారతీయులకు ప్రతిభ లేదు, వారు కనిపెడుతున్న అన్ని రకాల యంత్రాల సహయంతోనే నేడు మనిషి ఎంతో సంతోషంగా ఉంటున్నాడు అని గొంతు అరచి చెప్పే నాస్తిక, మూర్ఖత్వ వాదులకు ఆ యంత్రాల వల్ల వెలువడుతున్న పొగే వాయు కాలుష్యానికి మూలమని తెలియదు ఎందుకో!! ఒకప్పటి మహర్షుల నుండి ఇప్పుడు కూడా అక్కడక్కడా  జరుగుతున్న యజ్ఞాలు, యాగాలు, హోమాలు వంటివి వాయు కాలుష్యాన్ని శుద్ధి చేయడానికి ఎంతో గొప్పగా దోహదపడతాయని అందరూ వాదించే సైన్స్ పరంగానే ఆధారాలు లభ్యమవుతున్నా మనుషులు మాత్రం తమ పద్దతి మార్చుకోరు. పద్దతిగా  ఉండేవాళ్లను ఉండనివ్వరు. ఇప్పుడేం చెయ్యాలని సందేహమా!! పర్యావరణాన్ని కాపాడుకోవాలి. పంచభూతాల ఆకలి తీర్చాలి. నీటిని శుద్ధి చేస్తూ వాతావరణాన్ని మార్చుకోవాలి. కాలుష్యాన్ని నివారించాలి. భూమి తాపాన్ని తగ్గించాలి. నదులు సముద్రాలు పిల్ల కాలువలు వీటిని కలుషితం చేయకూడదు. ఇన్ని సంవత్సరాల నుండి మనిషి ప్రకృతిని ఇష్టమొచ్చినట్టు వాడుతూ గందరగోళం చేసాడు కాబట్టి ఇప్పుడు ప్రకృతికి రుణాన్ని తిరిగిచ్చేయాలి. ప్రకృతిని పసిపాపలా చూసుకోవాలి. ◆ వెంకటేష్ పువ్వాడ

ముక్తి మార్గానికి తొలిమెట్టు!!

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాన్తిమాప్నోతి నైష్టికీమ్| అయుక్తః కామకారేణ ఫలే సక్తి నిబధ్యతే ॥ యుక్తుడు అయిన వాడు కర్మఫలములను వదిలిపెట్టి, పరమ శాంతిని పొందుతాడు. యుక్తుడు కాని వాడు కోరికలు తీరడం కోసం కర్మలు చేస్తూ, ఆ కర్మఫలముల ఆసక్తితో బంధనములకు లోనవుతున్నాడు. కర్మఫలాన్ని వదిలిపెడితే ఏం జరుగుతుంది. కర్మఫలాన్ని ఆశిస్తే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పాడు పరమాత్మ, బంధనములకు కారణం ఆశ. మోక్షమునకు కారణం ఆశ లేకుండా ఉండటం. ఆశను వదిలిపెడితే బంధనములు ఉండవు. జ్ఞానం, ఆత్మ శాంతి కలుగుతుంది, ఆశతో కర్మలు చేస్తే బంధనాలు, దుఃఖము, పతనము కలుగుతుంది. ఆశగానీ ప్రతిఫలాపేక్ష గానీ లేకుండా కర్మలు చేస్తే చిత్తము నిర్మలంగా ఉంటుంది. అప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు. శాంతిని పొందుతారు. కాబట్టి కర్మయోగమైనా జ్ఞాన యోగమైనా పొందేది శాంతి. కాని కర్మయోగంతో కలిగే శాంతి తాత్కాలికము. జ్ఞాన యోగంతో కలిగే శాంతి శాశ్వతము. అందుకే దానిని ప్రశాంతి అంటే ప్రకృష్టమైన శాంతి అని అన్నారు. కాబట్టి యుక్తుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి కలిగిన వాడు. ఏ కర్మచేసిన ఈ పని నేను చేస్తున్నాను అనే కరత్వభావనతో కాకుండా, ఈ పని నా స్వలాభం కోసం చేస్తున్నాను అని కాకుండా, ఈ పని భగవంతుని పరంగా చేస్తున్నాను. దీని ఫలితం భగవంతునికే అర్పిస్తున్నాను అనే భావనతో చేయాలి. అలా చేస్తే ముందు మనసు నిర్మలం అవుతుంది. తరువాత ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆఖరున ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. అయుక్తుడు అంటే నిశ్చయాత్మక బుద్ధి లేని వాడు ఏ పని చేసినా తన స్వలాభం కొరకే చేస్తాడు. కర్మబంధనములలో చిక్కుకుంటాడు. తీవ్రమైన అశాంతికి గురి అవుతాడు. కాబట్టి ఆర్జించే ధనము, సిరిసంపదలు, పదవులు శాంతిని ఇవ్వలేవు. పైగా అవి పోతాయేమో అనే నిరంతర భయంతో అశాంతికి గురి అవుతాడు. ఈ శ్లోకంలో "నిభధ్యతే" అని వాడారు. అంటే ఆశతో, ప్రతిఫలాపేక్షతో కర్మలు చేస్తే బంధనములు తప్పవు అని నిర్ద్వంద్వంగా చెప్పాడు. కాబట్టి ముందు ఆశ, ప్రతిఫలాపేక్ష వదిలిపెట్టాలి అని తెలుస్తూ ఉంది. ఈ శ్లోకంలో పరమాత్మ పరమ శాంతి కలగడానికి మార్గం ఏమిటి అనేది. స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మానవుడూ మనశ్శాంతిని వెదుకుతున్నాడు. మనశ్శాంతి కొరకు బాబాలను, దేవుళ్లను, తీర్థయాత్రలను ఆశ్రయిస్తున్నాడు. కాని మనశ్శాంతి తన చేతిలోనే ఉందని తెలుసుకోలేకపోతున్నాడు. అదే అజ్ఞానము, అవిద్య, కేవలం, మనసులో నుండి ఆశను దూరం చేసి, ఫలితం ఆశించకుండా కర్మలు చేస్తే ఆత్మశాంతి దానంతట అదే వస్తుండ్హి. ఇదే ఇందులో రహస్యం కాకుండా ఆశతో ఫలితం ఆశించి పనులు చేస్తే దుఃఖం వస్తుంది. ఆ దుఃఖాలను తాత్కాలికంగా మరిచిపోవడానికి సాయంత్రం బార్లను, డ్రగ్సును ఆశ్రయిస్తున్నారు. చేయవలసిన పని చేయడం లేదు. చేయకూడని పని చేస్తున్నారు. అదే నాకంతా తెలుసు అని అహంకారము, ఏమీ తెలియని తనం అంటే అవిద్య, కేవలము మనస్సును ఇటు నుండి అటు మళ్లిస్తే సరిపోయేదానికి రోజూ వందలు వేలు తగలేస్తున్నారు. అప్పులపాలై అప్పులు తీర్చలేక, దుఃఖంతో మరలా అదే వ్యసనానికి బానిస అవుతున్నారు. కాబట్టి ముందు మనలో ఉన్న తెలియనితనాన్ని పోగొట్టుకుంటే, బుద్ధి సక్రమంగా పని చేస్తుంది. విచక్షణా జ్ఞానం వస్తుంది. ఏ పని చేయాలో ఏపని చేయకూడదో, చేసే పని ఎలా చేయాలో అనే విషయం తెలుస్తుంది. మనస్సు ప్రాపంచిక విషయాల నుండి నివృత్తి మార్గంలోకి మళ్లుతుంది. అదే ముక్తిమార్గానికి తొలిమెట్టు. ◆ వెంకటేష్ పువ్వాడ  

కొత్త సంవత్సరపు లాంఛనం??

వచ్చేస్తోంది వచ్చేస్తోంది ఆంగ్ల సంవత్సరం కొత్త సంఖ్యను మోసుకొచ్చేస్తోంది. నిజానికి అన్ని సంఖ్యల లాగే ఇది కూడా, ఈ సంవత్సరం తరువాత మళ్ళీ ఇంకో కొత్త సంఖ్య, ఇంకో కొత్త సంవత్సరం. ఇట్లా మారుతున్న సంఖ్యలు చూసుకుని మురిసిపోతే జీవితం  మారిపోతుందా??  కొత్త సంవత్సరం అనగానే ఎక్కడలేని హుషారుతో, సంప్రదాయ పండగలకు కూడా చేయనంత హడావిడి చేస్తూ కేకులు, స్వీట్లు, నైట్ పార్టీలు, విందులు, వినోదాలు ఇలా ఒకటి, రెండు కాదు. ఇక ముఖ్యంగా చెప్పుకుంటే అందరికీ తెలిసిన విషయం ఈ కొత్త సంవత్సర వేడుకలలో ఇంత హంగామా సృష్టించే వాళ్లలో యూత్ ఏ ఎక్కువ. ముందు రోజు రాత్రి  మొత్తం పార్టీలతో, పబ్బులలో గడుపుతూ, వీధులన్నీ బైక్ లలో చక్కర్లు కొడుతూ చేసే గోలలో సంతోషాన్ని చూసుకునే వాళ్ళు కొందరు.  నిజానికి మన భారతీయులు పంచాంగం పరంగా తెలుగు సంవత్సరాదిని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉగాదికి ప్రాధాన్యం  ఇవ్వాలని చెప్పుకున్నా, ఈ ఆంగ్ల సంవత్సరాన్ని వేడుకగా చేసుకోవడంలో తప్పేమీ లేదనే అభిప్రాయం కూడా నిజమే కావచ్చు. అయితే!! ఈ కొత్త సంవత్సర సందర్భంగా చాలామంది కొన్ని కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా సంవత్సరం ప్రారంభమయిన కొన్ని రోజులకు తూ తూ మంత్రంగా సాగుతుంటాయి. కొత్త నిర్ణయాలు సాధ్యాసాధ్యాలు చూసుకునే తీసుకోవాలి!! నిర్ణయం తీసుకోవడం సమస్య కాదు. కానీ దాన్ని జీవితంలో అమలుపరచడం కొద్దిగా కష్టం. నిజానికి అది కూడా కష్టం కాదు, ఆ నిర్ణయం పట్ల సీరియస్ గా ఉన్నవాళ్లు అయితే దాన్ని తప్పకుండా పాటిస్తారు కూడా. కానీ ఎటొచ్చి ఆ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒక ఫాషన్ గానూ, స్టేటస్ గానూ భావించి నలుగురిని అట్రాక్ట్ చేయడానికి చేసేవి అవుతున్నాయి చాలామంది విషయంలో. ఛాలెంజ్ లు ఒత్తిడులు వద్దు! ఈ ఇయర్ స్టార్టింగ్ నుండి నేను బరువు తగ్గడం మొదలు పెట్టేయాలి. ఈసారి అయినా డ్రింకింగ్, స్మోకింగ్ అలవాటు మానుకోవాలి. ఈసారి ఎదో ఒక విధంగా జాబ్ కొట్టాలి.  ఇలాంటి మాటలు చాలామంది దగ్గర చూస్తుంటాం. ఇలాంటి ఛాలెంజ్ లు మీరైతే తీసుకోవద్దు. అసలు ఛాలెంజ్ ఎందుకు చేసుకోవాలి. పేరుకు కొత్త సంవత్సరమే అయినా  కాలం ఏమి కొత్తగా ఎవరికోసం ఆగదు, ఎదురుచూడదు. ప్రత్యేకంగా ఎవరికోసం కాస్త మెల్లగా జరగదు. అలాంటప్పుడు ఇలాంటి ఒత్తిడి పెంచే ఛాలెంజ్ లు తీసుకుని తరువాత ఆ ఒత్తిడి వల్ల ఉన్న ప్రశాంతత పోగొట్టుకోకుండా. ఉండటం ఉత్తమం. అలాగని అలాంటివి వ్యర్థం అనడం లేదు. కానీ ఆ చేసేది ఏదో ఛాలెంజ్ లా కాకుండా లైఫ్ స్టైల్ లో ఒక భాగం చేసుకుంటే ఆహా!! రోజులో అదీ ఒక ప్రాముఖ్య విషయంగా మారి సమస్యలను సులువుగా తగ్గిస్తుంది. నిన్నటి కంటే ఈరోజు!!  ఈరోజు కంటే రేపు!! ఉత్తమంగా ఉండాలని చెప్పడం పరిపాటి. అందులో అర్థం మనుషులు మెరుగవాలని. ఎలా అవుతారు అంటే కొన్ని మంచి అలవాట్లు లైఫ్ స్టైల్ లో భాగం చేసుకోవాలి.  పుస్తక పఠనం!! ప్రపంచ జ్ఞానాన్ని అందించేవి పుస్తకాలు. అలాంటి పుస్తక పఠనాన్ని లైఫ్ స్టైల్ లో భాగం చేసుకోవాలి. మొబైల్ లో గంటల తరబడి బ్రౌజింగ్ చేసెబదులు కనీసం రోజులో గంట సేపు అయినా పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. ఇదొక గొప్ప అలవాటుగా మారితే జీవితంలో ఎంతో గొప్ప మార్పు వస్తుంది. ఆలోచన నుండి, జీవితంలో ఆచరించే ఎన్నో విషయాల్లో స్పష్టత తెలుసుకుంటారు. ఆరోగ్యం!! ప్రస్తుతం భారతదేశం యావత్తు బాధపడుతున్న సమస్యలు ఆరోగ్యపరమైనవే. అన్నీ జబ్బులు, విపత్తులు. వీటి ద్వారాయా మనిషి శారీరకంగా నష్టపోతున్నాడు.. అలాంటి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆహారం, అలవాట్లు, దినచర్య వంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పర్యావరణాన్ని కాపాడుకుంటూ తమను తాము రక్షించుకోవాలి. వ్యసనాలకు దూరంగా!! ఏ అలవాటు అయినా మరీ అతి అయితే అది వ్యసనమే అవుతుంది. మంచి విషయాలు అయినా సరే వ్యసనం అవ్వడం మంచిది కాదు. ఏది ఎంతలో ఉండాలో అంత ఉంటే మంచిది. ఎందుకంటే వ్యసనంగా మారే ప్రతిదీ జీవితంలో మిగతా విషయాల మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మంచి విషయలు కూడా వ్యసనం కాకూడదు. ఎవరి సంతోషం వాళ్ళ చేతుల్లో!! నిజమే. ఎవరి సంతోషం వాళ్ళ చేతుల్లో ఉండాలి. కొన్ని నిర్ణయాలు, కొన్ని ఇష్టాలు, కొంత స్వేచ్ఛ ఇవన్నీ అంతో ఇంతో ప్రతి మనిషికి ఉండాలి. అలా ఉంటే సంతోషం కోసం ఎక్కడో వెతనక్కర్లేదు. అది మనసులోనే ఉంటుంది అప్పుడు. కాబట్టి కొత్త సంవత్సరాన్ని ఛాలెంజ్ ల పరంపరలో కాకుండా లైఫ్ స్టైల్ తో లాంఛనంగా ప్రారంభించండి. ◆ వెంకటేష్ పువ్వాడ  

పోలిక…కారాదు పొలికేక!!

"ఆ పక్కింటి అబ్బాయిని చూసి నేర్చుకో ఎంతబాగా చదువుతాడో, నువ్వూ ఉన్నావు. వేలు తగలడేస్తున్నా చదవనే చదవవు. ఏమి చేస్తాం అంతా మా కర్మ" ఒక ఇంట్లో కొడుకుపై ఒక తండ్రి గొంతు ఇది. "అసలు ఆడపిల్లలా ఉండనే ఉండవు. ఈ చుట్టుపక్కల నీలాంటి అమ్మాయిలు అసలు ఉండరు. నువ్వు ఒక్క పని చేయవు, ఎప్పుడు చూసినా మగరాయుడిలా ఉంటావు. ఏమీ లేకపోయినా ఆ చదువు ఉందని నీకు తెగ పొగరు. చక్కగా ఇంటి పని వంట పని నేర్చుకోమంటే అది ఇదీ చెప్పి ఎగ్గొడుతుంటావు. నువ్వు అడపిల్లగా పుట్టాల్సిన దానివి కాదు" మరొక ఇంట్లో కూతురి మీద  తల్లి ప్రచండ యుద్ధం ఇది. "అసలు నువ్వెప్పుడైనా నన్ను సుఖపెట్టావా?? సంపాదించడం సరిగా చేతకాదు. బొత్తిగా తెలివిలేని మనిషిని కట్టబెట్టారు మా వాళ్ళు. మా అక్క మొగుడు చూడు ఎంత పని చేస్తాడు, ఎంత తెలివిగా ఉంటాడు, ఎంత బాగా సంపాదిస్తాడు. మా తమ్ముడు నీకంటే, నా కంటే చిన్నోడు అయినా వాడే నయం. పెళ్ళానికి బంగారం తీసాడు, పిల్లల పేరున డిపాజిట్లు వేసాడు. నువ్వూ ఉన్నావు ఎందుకూ" సంసారంలో ఓ భార్య చేతిలో నలిగిపోతున్న భర్త పరిస్థితి ఇది. నాకు ఈ డ్రెస్ వద్దు, మా క్లాస్మేట్ వేసుకున్న డ్రెస్ బాగుంది అలాంటిది కావాలి" ఓ బుడ్డోడి మొండితనం. "మా ఫ్రెండ్స్ అందరి దగ్గరా మొబైల్స్ ఉన్నాయి, నాకు తీసివ్వండి లేకపోతే అన్నం తినను" తల్లిదండ్రుల దగ్గర ఓ కూతురి బ్లాక్మైల్. "వాడికి చూడు ఎన్ని మార్కులు వచ్చాయో, ఒకే స్కూల్, ఒకే తరగతి, ఒకే టీచర్ ను. అయినా నువ్వు ఒట్టి మొద్దు శుంఠవు" ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిపై మండిపాటు. పరిస్థితులు, సందర్భాలు, వ్యక్తులు ఇలా అన్నీ వేరు అయినా అక్కడ తొంగిచూసే కారణం 90% పోలిక. ఈ పోలిక ఎలాంటిదంటే సముద్రం ఎంతో ఆహ్లాదంగా ఉన్నా దానిలో దిగితే ఇక గల్లంతు అయిపోయే మనిషిలా, ఆ పొలికకు గురయ్యే మనిషి మనసు అంతే ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది.  ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరొక మనిషికి భిన్నంగా ఉంటాడు, భిన్నంగా ఆలోచిస్తాడు, అట్లాగే జీవన సరళి, దానికి తగ్గ శక్తి సామర్త్యాలు కూడా భిన్నంగా ఉంటాయి.  కాబట్టే మనుషులు చేసే పనులలో బిన్నత్వం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవ్వరూ దాని గురించి ఆలోచించరు. సాదారణంగా మనిషి సామర్థ్యము 90% అంతర్గతమైనదే. కేవలం 10% మాత్రమే బాహ్య ప్రభావాలకు లోనవుతూ ఉంటుంది. కానీ ఆ పదిశాతం ఏర్పాట్లు సరిగా సమకూర్చి, మిగిలిన తొంభై శాతాన్ని దెబ్బ తీస్తూ ఆ వ్యక్తి సరిగా ఉండటం లేదని పోల్చి చూడటం ఎంత వరకు సమంజసం. పుటైన దగ్గర నుండి ప్రతి దశలోనూ, ప్రతి విషయంలోనూ ఇలాంటి పోలిక పెళ్లి చూడటం, పోల్చుకోవడమనే వలయంలో పడి, ప్రతి మనిషి తమలో ఉన్న ప్రత్యేకతను చేతులారా కోల్పోతున్నారు అంటే ఆశ్చర్యంగానూ, బాధగానూ ఉంటుంది. ప్రతి మనిషి అంతర్గత శక్తి సామర్త్యాలను గుర్తించుకుని వాటిని క్రమంగా మెరుగుపరుచుకుంటూ ఉంటే ఒకనాటికి ఆ విషయంలో ఎంతో గొప్ప ప్రావీణ్యత పొందిన వారిగా గుర్తింపు పొందగలుగుతారు.  అంతేకానీ సమాజాన్ని చూస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళను చూస్తూ పోల్చుకుని, చేతకాని వాళ్ళలా ఏమీ రాదు అనుకుంటూ  ఉంటే మానసిక సంఘర్షణ ఎక్కువై. చివరకు నిజంగానే చేతకాని వాళ్ళలా మారే పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే ఎవరినీ ఎవరూ ఇతరులతో పోల్చుకోరాదు, ఎవరినీ ఇతరులతో పోల్చి తక్కువ చేసి చూడరాదు. ప్రపంచంలో ప్రతి వస్తువుకూ దేని ప్రత్యేకత దానికి ఉన్నట్టే మనిషికి కూడా ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. ఈ విషయం తెలుసుకుని వారిదైన జీవితాన్ని ప్రోత్సహిస్తే, ఈ పోలికలు పొలికేకల్లా గందరగోళం సృష్టించవు జీవితాలలో. ◆ వెంకటేష్ పువ్వాడ

సహాయానికి రెక్కలు ఇవ్వద్దు!!

  మనిషికి ఉన్న గొప్ప గుణాలలో సాటి మనిషికి సహాయం చేయడం కూడా ఒకటి. నిజానికి ఇలాంటి సహాయగుణం అందరికీ ఉండదు కూడా. అడపాదడపా బయట వాళ్లకు సహాయం చేస్తూ ఉండే వాళ్ళు నా అనుకున్న వాళ్లు సమస్యల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఇంకెంత ముందుంటారో మాటల్లో చెప్పక్కర్లేదు. అయితే  ఈ సహాయ గుణం మెండుగా ఉన్నవాళ్లు పెద్ద తప్పు చేస్తున్నారని ఎవరో కొందరికే అర్థమవుతుంది. సహాయమా సోమరితనాన్ని పోషించడమా?? అసలు సహాయం అంటే ఎలా ఉండాలి?? సమస్యలకు పరిష్కారం చూపేలా ఉండాలా లేక పూర్తిగా సమస్య నుండి బయటపడేలా చేయాలా?? సమస్య నుండి బయట పడేస్తే ఆ సమస్య నుండి బయట పడినవాళ్ళు సంతోషంగా ఉంటారేమో కానీ ఆ సమస్య తాలూకూ ఇబ్బంది తెలియకుండా సమస్యను సమస్యగా అర్థం చేసుకోలేరు వాళ్ళు అన్నది ఒక ముఖ్య విషయం. చెప్పుకోవడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజం కూడా. సమస్యలలో ఉన్నపుడు ఆ సమస్యను భరించే సామర్థ్యాన్ని, లేదా దాన్ని అధిగమించే మార్గాన్ని చూపించాలి. అంతే కానీ ఒక కాలువ దాటడానికి ఇబ్బంది పడుతున్నపుడు ఇతవతల గట్టు నుండి అవతల గట్టుకు తీసుకెళ్లి కూర్చోబెడితే మధ్యలో ఉన్న ఆ కాలువ లోతు, దాని ప్రవాహ వేగం, దాన్ని తట్టుకుని దాటగలిగే నేర్పు ఇవన్నీ అర్థం కావు. సరిగ్గా ఇదే విషయమే సమస్యలలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలియజేయాలి. అనుభవమే ఆప్తమార్గం!! సమస్య వచ్చిందీ అని మొర పెట్టుకోగానే సహాయ గుణం కలిగిన వాళ్ళు పరిగెత్తికుంటూ వెళ్లి, అయ్యో పాపం అనుకుంటూ తమలో ఉన్న నేర్పు, చాకచక్యంతో ఆ సమస్యను చిటికెలో పరిష్కరిస్తే అవతలి వాళ్లకి ఆ సమస్య ఎలా అర్థమవుతుంది అనే విషయం అర్థం చేసుకున్నవాళ్ళు పరిష్కార మార్గాన్ని సూచిస్తారు. సలహాలు ఇస్తారు. ఫలితంగా సమస్యను నేరుగా భరిస్తూ పరిష్కరించుకునే అవకాశం బాధితులకు లభిస్తుంది. అదే సమస్య మరొక్కసారి ఎదురైనప్పుడు ఎవరి సహయమూ లేకుండా సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. అదే అనుభవం నేర్పే పాఠం. అనుభవం ఇచ్చే ధైర్యం. అత్యుత్సాహం అనర్థదాయకం!! కొందరుంటారు. వాళ్లకు నేర్పు ఎక్కువగా ఉంటుంది. సమస్యలను అధిగమించే నైపుణ్యం ఉంటుంది. అయితే ఇతరులు సమస్యలలో ఉన్నపుడు అత్యుత్సాహంతో వాళ్ళ  ముందు తమ ప్రతిభను చూపెట్టాలనో, వాళ్ళను ఆకర్షించాలనో వాళ్ళ సమస్యను తమ సమస్యగా భావించి సులువుగా పరిష్కరిస్తారు. దీని ఫలితంగా జరిగేది ఒకటే ఆధారపడిపోయే గుణాన్ని ఎదుటి వ్యక్తిలో పెంచడం. ఇలా ఆధారపడే గుణం పెరిగిపోతూ ఉంటే ఒకానొక సందర్భంలో ఎంత చిన్న సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించుకోలేక సహాయం కోసం చుట్టూ చూసే స్తాయికి దిగజారిపోతారు. కాబట్టి సహాయం ఎప్పుడూ అత్యుత్సాహంతో చేయకూడదు. ఎదుటి వారి సమస్యను దాని ప్రభావాన్ని బట్టి సలహా, సూచన, పరిష్కార మార్గం అన్నిటి తరువాత స్వయంగా తోడ్పాటు అందించడం వంటివి చేయాలి. అంతేకానీ ఎదుటి వారి సమస్యను మనది చేసుకుని వాటిని పరిష్కరిస్తూ ఉంటే మనం ఈ సమాజంలో చేతకాని వాళ్ళను తయారుచేస్తున్నట్టే లెక్క. పై విషయాలు అన్ని గమనిస్తే ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఇదే రకమైన మార్గాలు అనుసరిస్తూ ఉంటారు. అంటే తమ పిల్లలను తామే చేతగానివాళ్లుగా తయారుచేస్తున్నారని అర్థం.  ఇలా మీ సహాయానికి రెక్కలు ఇచ్చి, పిల్లల రెక్కలు ఎదగనివ్వకుండా, వాటి సహాయంతో వాళ్ళు స్వయంగా ఎగరలేకుండా చేయకూడదు. చేశారంటే తల్లిదండ్రులు, పిల్లలు కూడా నష్టపోతారు సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ  

మీరు షాపింగ్ ఎందుకు చేస్తున్నారో తెలుసా?

తెల్లారిలేస్తే ఎదో ఒకటి కొనాలనిపిస్తుందా? కనిపించిందల్లా కొనకుండా ఉండలేకపోతున్నారా? అయితే.."కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్" ఉందేమో చూసుకోండి అని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. ఆ మధ్య ప్రజల షాపింగ్ అలవాట్లు ఎలా ఉన్నాయో చూద్దామని... స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ "స్కూల్ ఆఫ్ మెడిసిన్" పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు. అందులో తేలిన విషయం... ప్రతి 20మందిలో ఒకరికైనా ఈ "కంపల్సివ్ బైయింగ్ డిజార్డర్" ఉందని... ఏమంత అవసరం లేని వస్తువులని కూడా కొనెయ్యటం, తరుచూ షాపింగ్ మాల్స్ కి వెళ్ళటం, తెల్లారి లేచి ఎదో ఒకటి కొనాలనే తాపత్రయం... ఇదో రుగ్మత స్థాయికి చేరి, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబ పరంగా... ఎన్నో ఇబ్బందులు ఎదుర్కునే స్థాయికి చేరటం గమనించారు. ఆ అధ్యయనంలో ముఖ్యంగా ఆడవారిలో, అలాగే టీనేజ్ వారిలో ఈ డిజార్డర్ ఎక్కువగా ఉందట. మరి మీరు కూడా అవసరానికి షాపింగ్ చేస్తున్నారా లేక అనవసరంగా కేవలం సరదా కోసం షాపింగ్ చేస్తున్నారో తెలుసుకొని జాగ్రత్తపడితే మంచిది.  

జనారణ్యంలో అడవి మృగాల ఆర్తనాదాలు!! 

మనుషులు నివసిస్తున్న ఈ పట్టణాలు, గ్రామాలు వగైరాలను జనారణ్యం అని పిలుస్తుంటారు  అడవిలో ఉండేది మృగాలు అది మృగాల అరణ్యం అయితే, మనుషులు నివసిస్తున్న ఈ ప్రాంతాలను జనారణ్యం అంటుంటారు. మనుషులు కానీ  జంతువులు కానీ నివాస ప్రాంతాలను బట్టి జీవితాన్ని కొనసాగించడం పరిపాటి. అయితే మనుషుల్లో కూడా కాస్త మార్పులు వచ్చి మృగ లక్షణాలు పెరుగుతూ, తను అనుకున్నది సాధించడం అనే ఒక అహంకారపు గుణాన్ని బాగా పెంపొందించుకున్నారు. ఇలాంటి మనుషులను చాలామంది జంతువులతో పోలిక పెట్టి మాట్లాడుతూ ఉంటారు కూడా.  ఇక ఈ మనుషులు చాలా తెలివైనోళ్లు, తను ఈ ప్రపంచాన్ని ఈ ప్రకృతిని క్రమంగా అక్రమించుకుంటూ పోతున్నాడు. వాటికి తగ్గట్టు చట్టాలను రూపొందించుకుంటాడు, తరువాత అక్రమాలు చేసి డబ్బు సమకూర్చుకుంటాడు. ఈ భూమండలంలో భూమి, నీరు, అడవులు ఉండాల్సిన శాతంలో క్రమంగా అడవులను భూమిగా మారుస్తూ పోతున్నాడు. ఫలితంగా అడవుల శాతం మాత్రమే కాదు, నీతి శాతం ముఖ్యంగా భూగర్భ జలాలు కూడా తగ్గిపోతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆ అడవులలో నివసిస్తున్న అడవి జంతువుల ఆవేదన ఎవరూ అర్థం చేసుకోలేనిది. అడుగు భూమిని ఎవడైనా ఆక్రమిస్తే ఎన్నో గొడవలు, పంచాయితీలు, కోర్ట్ కేసులు ఎంతో తతంగం చేసే మనుషులు జంతువుల ప్రపంచం అయిన అడవులను అక్రమిస్తూ తిరిగి వాటినే మళ్లీ శిక్షకు గురిచేస్తూ ఉంటారు. అటవీ  విసీర్ణం తగ్గిపోవడం వల్ల చిన్న చిన్న జంతువులకు ఆహారం నీరు కొరత ఏర్పడి చచ్చిపోతున్నాయి. మరికొన్ని మనుషుల చేతుల్లోనే అదృశ్యమవుతున్నాయి. అలాంటి చిన్న జంతువులను ఆహారంగా వేటాడే పెద్దజంతువులు ఈ చిన్న జంతువుల సంఖ్య తగ్గిపోవడమూ, నీటి కొరస్థ ఏర్పడటం వల్ల దిక్కుతోచని స్థితిలో అటవీ  మార్గం నుండి జనవాసాల మధ్యకు వస్తున్నాయి.  కానీ మనిషి ఏమి చేస్తాడు. అలా జనాల మధ్యకు వచ్చిన మృగాలను  కొట్టడమో, గాయపరచడమో చేస్తాడు. ముఖ్యంగా పాములు  కనబడితే 90% మంది వాటిని వెంటనే చంపేయడం జరుగుతోంది. పులులు, సింహాలు వంటి పెద్ద మృగాలంటే మనుషులు భయపడతారు కాబట్టి అటవీ శాఖ వాళ్లకు సమాచారం ఇచ్చి వాటిని పట్టిస్తుంటారు. ఇక గమనించదగ్గ విషయం ఏమిటంటే తన కంటే తక్కువ స్థాయి ఉన్న జంతువులను అయినా ప్రాణులను అయినా మనిషి నిరంతరం అణిచివేస్తూనే ఉంటడం అది జంతువులే కానక్కర్లేదు కనీసం మనుషులు అయిన తమకంటే తక్కువ స్థాయి ఉన్నవాళ్లను అణిచివేయడం సహజం.  కానీ ఏ ప్రాణి ప్రాధాన్యత, ఏ ప్రాణి జీవించే హక్కు దానిదే అని గుర్తించి దేని ప్రపంచాన్ని దానికి వదిలేయడం ఉత్తమం కదా!! కానీ స్వార్థంలోనూ, అభివృద్ధిలోనూ ఉన్న మనుషులకు వాటి ప్రపంచాన్ని అక్రమించుకోవడం పెద్ద తప్పుగా అస్సలు అనిపించదు. ఫలితంగా ప్రతిరోజూ పేపర్లలోనూ, టీవీ లలోనూ వార్తలు చూస్తూనే ఉంటాము. మనుషుల మధ్యకు సింహం లేదా పులి అని. పులి హల్చల్ అని, సింహం వీరవిహారం అని. కానీ వాటి కోణంలో వాటి మనసుతో ఆలోచిస్తే తిండి, నీళ్లు దొరక్క మనుషుల మధ్యకు వచ్చి మనుషులు పెడుతున్న హింసకు గురవుతూ ఆ గందరగోళంలో ఎవరినో ఒకరిని కరవడమో, వెంబడించడమో చేస్తాయి. ఆ మాత్రం అర్ధం చేసుకోలేని మనుషులు ఆ దేవుడు ఇచ్చిన విచక్షణా జ్ఞానాన్ని ఏమి చేస్తున్నట్టు.  మనుషులలో మృగాలుగా మారిపోతూ మృగాలను హింసిస్తున్నట్టా?? కొత్త చట్టాలు తెచ్చుకుని అంతటినీ తన గుప్పెట్లో పెట్టుకోవాలనే మూర్ఖపు ఆలోచనలో ఉన్నట్టా?? ◆ వెంకటేష్ పువ్వాడ  

పుస్తకాల పండుగ వచ్చేసిందోచ్!!

ఇదేంటిది బడిలో పిల్లలకు సెలవు ఇచ్చినపుడు ఎగిరి గంతేసి సంబరపడినట్టు అనుకుంటారు చాలామంది! కానీ ఆ సంతోషం ఎలాంటిదో పుస్తక ప్రియులకే బాగా తెలుస్తుంది.  హైదరాబాద్ వినాయక చవితి ఉత్సవాలు, ఖైరతాబాద్ గణేష్ రాజసం, పొంగలి కుండల బోనాలను నెత్తిన పెట్టుకుని తన్మయత్వమైపోయే బోనాల జాతర, ఒక్కేసి పువ్వేసి సందామామా ఒక్కజాము ఆయె సందామామా అనుకుంటూ పువ్వులో తేలే తెలంగాణ బతుకమ్మ పండుగ. ఇలా వీటితో సమానంగా హైదరాబాద్ లో ప్రాధాన్యత సంతరించుకున్నది పుస్తకాల ప్రదర్శన. 1985 సంవత్సరంలో మొదటిసారిగా జరిగిన ఈ పుస్తక ప్రదర్శన ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈనాడు 34 వ సారి అందరినీ కనువిందు చేయబోతోంది. కాగితాల రెక్కలు కట్టుకుని ఎక్కడెక్కడి నుండో ఎగిరొచ్చి అందరికీ ఎన్నెన్నో కథలు, కవితలు, చరిత్ర సాక్ష్యాలు, ఆత్మకథలు, సామాజిక సమస్యలు, సమాధి అయిపోయిన నిజాలు ఇట్లా ఎన్నింటినో తనలో నింపుకుని, తనకోసం లక్షల మంది వస్తున్నట్టే, లక్షల మంది కోసం పుస్తకమూ పతంగమంత మనసుతో వచ్చి వాలిపోనుంది. ఒకటా… రెండా… మూడా…. ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనలో ఏర్పాటు చేసే దుకాణాల సంఖ్య మెల్లిగా పెరుగుతూ వస్తోంది. చివరి ఏడాది కరోనా కారణంగా పుస్తకప్రదర్శన అసలు జరలేదు. అందుకే  ఈసారి కరోనాను దృష్టిలో ఉంచుకుని నిబంధనల మధ్య, నియమాల మధ్య ఎంతో జాగ్రత్తగా నిర్వహించబోతున్నారు. సుమారు 250 పుస్తకాల దుకాణాలు ఏర్పాటు కానున్నాయని సమాచారం. అంటే వందల కొద్దీ పుస్తకాల దుకాణాలు, లక్షలకొద్దీ పుస్తకాల పలకరింపులు. ప్రముఖులు, రచయితల మెరుపులు!! ప్రజలలో పుస్తకాల పట్ల ఆసక్తిని పెంచి పాఠకాదరణను పెంపొందించే దిశగా చేస్తున్న ప్రయత్నమే ఇది. ప్రముఖ రచయితల పుస్తకాలు పుస్తక పడదర్శనలో ఉండటమే కాదు బోలెడు మంది రచయితలు కూడా ఆ పుస్తక దుకాణాల దగ్గర ఉంటూ తమ అభిమాన పాఠకులను అంతే అభిమానంగా పలకరిస్తూ ఉంటారు. ఇంకా ఎందరో సెలబ్రిటీలు కూడా పుస్తక ప్రదర్శనకు విచ్చేసి పుస్తకాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. సాయంత్రం పూట చార్మినార్, బేగం బజార్ ఎంత రద్దీగా సందడిగా ఉంటుందో అంతకంటే సందడి పుస్తక ప్రదర్శన జరిగినన్ని రోజులు ఉంటుంది . కొంచం ఇష్టంగా మరికొంచెం జాగ్రత్తగా!! ఏడాది విరామం తరువాత మళ్ళీ పుస్తక ప్రదర్శన ఎలా ఉండబోతోంది అంటే చాలా రోజుల తరువాత తమ స్నేహితులను కలుసుకోవడానికి ఎంత ఉవ్విళ్లూరుతారో అంత సంతోషంగా ఉంది ప్రస్తుతం భాగ్యనగరం. అయితే ఆ సంతోషంలో జాగ్రత్తలు మరచిపోకూడదు. ఎవరి ప్రాథమిక కర్తవ్యం వారిది అన్నట్టుగా ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి. మరియు శానిటైజర్ వెంట ఉంచుకోవాలి. ఇంకా వీలైనంత వరకు గుంపులు గుంపులుగా ఉన్న చోటికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటే అదే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. ప్లానింగ్ తో హ్యాపీ హ్యాపీగా!! పెద్ద అరటి ఆకు, దాని నిండా విందు భోజనం. అందులో ఎన్నో అద్భుతమైన షడ్రుచులు. పొట్ట ఏమో చిన్నది. ఏది తినాలో అర్థం కాదు. పుస్తకాలు అంటే ఇష్టపడే వాళ్లకు కూడా సేమ్ ఇదే సమస్య ఎదురవుతుంది పుస్తక ప్రదర్శనలో. బోలెడు పుస్తకాలు ఎదురుగా ఉంటాయి, అన్నీ కొనాలని అనిపిస్తుంది.  చేతిలో బడ్జెట్ కూడా వెక్కిరిస్తూ ఉంటుంది. కొందరి సలహాలు, మరికొందరి అభిప్రాయాలతో బుక్స్ కొనేసి ఆ తరువాత అయ్యో వేరే తీసుకుని ఉంటే బాగుండేమో అనే పరిస్థితిలోకి వెళ్లకుండా హాయిగా హ్యాపీగా ఒక చిట్టా రాసుకుని వెళ్లి తీసుకోవడం మంచిది. పర్లేదు డబ్బుదేముంది అనుకునేవాళ్ళు అయితే లక్షణంగా ప్రతి స్టాల్ తిరిగి విలక్షణమైన పుస్తకాలను ఎంచుకోవచ్చు. అయితే నేటి డిజిటల్ యుగంలో పిడిఎఫ్ ల రూపంలో ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వచ్చినా పుస్తకాన్ని  చేత్తో పట్టుకుని, ప్రతి పేజీని స్పర్శిస్తూ అక్షరాలను మనసులోకి ఒంపుకునే ఫీల్ వేరే ఏ విధంగానూ రాదన్నది అందరూ ఒప్పుకునే విషయం. గుండె జేబులలో(మనసులలో) పదిలంగా పది కాలాల పాటు పుస్తకాన్ని నిలబెట్టడానికి, సాహిత్య సమీరాలను ఎప్పుడూ వీచేలా చేయడానికి పుస్తక ప్రియుల కోసం అవకాశం వచ్చింది.  తెలంగాణ కళాభారతి మైదానం(ఎన్టీఆర్ స్టేడియం)లో పుస్తకాల జాతరకు పోదాం పదండి అందరూ….!! ◆ వెంకటేష్ పువ్వాడ  

అవినీతికి  నీతి పాఠాలు చెప్పాలిప్పుడు!! 

ప్రస్తుత సమాజంలో ప్రతి పని కొన్ని నిర్ణీత షరతులకు లోబడి జరుగుతుంది. అయితే ఆ పనిని అదే షరతులతో జరపకుండా లేదా జరగనివ్వకుండా వక్ర మార్గంలో స్వప్రయోజనాల కోసం, స్వార్థం కోసం ఇష్టమొచ్చినట్టు చేసే వాళ్ళు ప్రస్తుతం బోలెడు మంది ఉన్నారు. పేరుకే రాజ్యాంగం, అందులో చట్టాలు. వాటిని కచ్చితంగా పాటిస్తూ ఉన్నవాళ్లు ఏ కొద్దీ మందో. ఆ కొద్దీ మందిని తప్పిస్తే మిగినవాళ్ళు అందరూ తమంతకు తాము కొత్త నియమాలను సృష్టించినట్టు దౌర్జన్యంతో బతికేస్తుంటారు. చట్టంలో కొన్ని పనులను చేయకూడదు అనే నియమాలు ఉంటాయి. కానీ వాటిని చేస్తూ ఆ చట్టాన్ని వెక్కిరించే ఉద్దండులు ఎందరో. ప్రస్తుత భారతదేశంలో అవినీతి వేళ్ళూనుకుపోయింది. ఎంతగా అంటే మాటల్లో చెప్పలేనంతగా. అన్ని రంగాలలో, అన్ని కార్యకలాపాలలో, అన్ని విధాలుగా ఈ అవినీతి జరుగుతూనే ఉంది, ముఖ్యంగా ఈ అవినీతి ఉక్కు పిడికిలిలో ఇరుక్కుపోయేది చిన్న స్థాయి, పేద, మధ్య తరగతి ప్రజలు. తమ జీవితాలకు, తాము పొందవలసిన ఎన్నింటినో అవినీతి మూలంగా కోల్పోతున్నారు. దీని వెనుక సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాలు ఎన్నో ఉండచ్చు. అర్హత కలిగిన పథకాలు పొందలేకపోవడం!! సగటు మనిషికి ప్రభుత్వం కొన్ని పథకాలు నిర్దేశించింది. అవి ఆహార భద్రత, ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రత ఇలా జీవితంలో సగటు మనిషికి అవసరమైనవి అన్నీ. కానీ ఇక్కడ రాజకీయ కోణాలు ప్రభావం చూపిస్తాయి. ఆ పథకానికి పౌరుడు అర్హుడా, కాదా అని విషయం కాకుండా పార్టీ, నాయకుడి కోణంలో వాటిని కేటాయించడం జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా పౌరుడు నష్టపోతాడు. లంచాల పరంపర!! ప్రస్తుత కాలంలో లంచం ఒక సాధారణ విషయం అయిపోయింది. ఉద్యోగస్తుల బల్ల కింద, గోడల చాటున కరెన్సీ చేతులు మారడం పరిపాటి. మండల ఆఫీసులు, జిల్లా ఆఫీసులు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు వంటి చోట్ల ఈ లంచం లేకుండా పని జరగడం అంటూ ఉండదు. ఒకవేళ అది లేకుండా పని జరుగుతుంది అంటే అది ఏ రాజకీయ నాయకుడి రికమెండషనో అయి ఉంటుంది. ఇలా సాధారణ వ్యక్తి లంచాలు ఇచ్చుకుంటూనో, రాజకీయ నాయకుల దయాదక్షిణ్యాల వల్లనో బతుకుసాగిస్తూ ఉంటాడు. ఇది ఒక విషయం అయితే రెండోవైపు ఇంకో విషయం ఉంటుంది. అర్హత లేకపోయినా పలుకుబడితో, రాజకీయ అండతో సామాన్యులకు వెళ్లాల్సిన లబ్ధిని కాజేసేవారు. దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఉద్యోగాలు, పెన్షన్లు, ప్రభుత్వం కేటాయించే ఇంటి స్థలాలు దోచేసేవాళ్ళు. అక్రమంగా స్థలాలు కబ్జా చేసి రాజకీయ అండతో పెత్తనం చేలాయించే వాళ్ళు. పేదవాళ్ళ కడుపు కొట్టి దోపిడీ చేసేవాళ్ళు. వాళ్ళను మోసం చేసేవాళ్ళు.  ఇక విద్యార్థుల జీవితాలతో కులం పేరుతోనూ, రిజర్వేషన్ల పేరుతోనూ పై స్థాయి చదువులు చదవలేక పోతున్నవాళ్ళు. అధికారుల సంతకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నవాళ్లు. స్కాలర్షిప్పులు, రియింబర్స్మెంట్ లు రావడానికి చేతులు తడపాల్సిన  పరిస్థితిలో ఉన్నవాళ్లు. ప్రతిభ ఏమీ లేకున్నా ప్రభా పత్రాలు సృష్టించి ఉద్యోగాలు పొందేవాళ్ళు. వీటి వల్ల నిజమైన ప్రతిభ ఉన్నవారు ఎందరో నిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఇదంతా సాధారణ అవినీతి అయితే రాష్ట్రాలు, దేశాల మధ్య దొంగ రవాణా, స్మగ్లింగ్, దొంగ నోట్లు, సైబర్ నేరాలు, డబ్బు అడ్డు పెట్టుకుని ఘోరమైన తప్పులకు శిక్షలు తప్పించించజకునే మహానుభావులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, ఎన్నెన్నో. ఇవన్నీ  కూడా సగటు సాధారణ పౌరుడి జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కానీ సిగ్గు పడాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వాలు ఈ అవినీతి కార్యకలాపాలను చూసి చూడనట్టు, నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోతుంది. అందుకే సగటు పౌరుడు అవినీతికి వ్యరేకంగా మాట్లాడినా ఆ పౌరుడే మళ్ళీ శిక్ష అనుభవిస్తాడు. కాబట్టి అవినీతి అనేది పైనేక్కడో పెద్ద పెద్ద వేర్లతో విస్తరించుకుంది. అది కూకటివేర్లతో సహా పెకించుకుని నేల కూలిపోవాలి. కనీసం రేపటి పౌరులను అయినా అవినీతికి వ్యతిరేకంగా పెంచితే రేపటి భారతంలో కాసింత నీతిమాలిన జీవితాలు కనబడతాయేమో. అందుకే అవినీతికి నీతి పాఠాలు చెప్పాలి!!  ◆ వెంకటేష్ పువ్వాడ  

దీర్ఘ మేర ఆరోగ్య మ(శి)స్తు!!

జీవితంలో ఎంత సంపాదించుకున్నా ఆరోగ్యం మంచిగా లేకపోతే సంపాదించుకున్నది అంతా మనల్ని చూసి వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది. అంతేనా ఆరోగ్యం సరిగా లేకపోతే సంపాదన  మొత్తం హాస్పిటల్స్ కు, డాక్టర్స్ కు శిస్తు కట్టినట్టు కట్టాల్సి వస్తుంది. ఇప్పట్లో రోగం లేని మనిషి అంటూ లేడు. బీపీలను, షుగర్లను వెంట పెట్టుకుని తిరుగుతూనే ఉన్నారు మనుషులు. ఒకప్పుడు జబ్బులనేవి తక్కువ. నిజానికి జీవితం ఖరీదు అవుతుంటే జబ్బులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. జీవితంలో ప్రతి ఒక్కటీ ఎంతో ఖర్చుతో సమకూర్చుకోవలసి వస్తుంది. అందుకే బాగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. వీటిలో ఆరోగ్య సమస్యలు అన్నిటికంటే ఒక మెట్టు పైనే ఉన్నాయి.   ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి??  గత యాభై సంవత్సరాలు ఇంకా కనీసం పది, ఇరవై సంవత్సరాలతో పోల్చుకుంటే జనాబాకు జబ్బుల దాడి ఎక్కువయ్యింది. అదేనండి సమస్యలు ఎక్కువ అయ్యాయి. కారణం ఏమిటి అని ఆలోచిస్తే వ్యవసాయ పంటలలో  పోషణ తగ్గింది. పెద్దలు చెబుతూ ఉంటారు ఒకప్పుడు గింజలు, విత్తనాల రుచి వేరు అని. అది నిజమే కావచ్చు. సేంద్రీయ వ్యవసాయం నుండి పురుగుమందులు ఉపయోగించి పంటలు పండించడం వల్ల రుచి తగ్గిందనేమాట వాస్తవం. అయితే ఇది కాకుండా మరొకటి ఉంది. అదే పాశ్చాత్యుల ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం.  పొరుగింటి పుల్లకూర రుచి!! ఓకేప్రాంతంలో ఉండేవాళ్ళు ఒకేరకమైన వాతావరణంలో ఉంటారు. పొరుగింటి పుల్లకూర తిన్నా పర్లేదు ఏమీ కాదు. విదేశాలు పూర్తిగా భారతదేశ వాతావరణానికి భిన్నంగా ఉంటాయి. అక్కడి వాతావరణం, అక్కడ పండే పంటలు వారు తింటారు. అయితే అవి తెచ్చి ఇక్కడ తినడం వల్ల వస్తున్నవే ఆరోగ్య సమస్యలు. వారు అక్కడ వాడే పదార్థాలు వారికి దొరికే స్వఛ్చమైనవి అయి ఉండచ్చు, కానీ అవి ఇక్కడికి పచ్చేసరికి  50% పైగా కలుషితం అవుతాయి. వాటి మీద లేబుల్స్ మెరుస్తూ, మేడ్ ఇన్ ఇండియా స్టిక్కర్లు అతికిస్తూ విదేశీ ఫుడ్ ఎంతగానో జనాల్లోకి చొచ్చుకుపోయాయి. ఇంకా చెప్పాలంటే ప్యాకింగ్ ఫుడ్స్ ను ఇన్స్టంట్ ఫుడ్స్ ను పరిచయం చేసింది విదేశీ వ్యాపారాలే. నిజానికి విదేశాలలో కూడా జీర్ణసంబంధ సమస్యలు, పేగు క్యాన్సర్లు ఎక్కువ. కారణం వారు తినే ఆహారం, వారి అలవాట్లు కూడా.  అవసరాలు, ఆహారం అయ్యో!! అయ్యో!! చాలా ఇళ్లలో ఆహారం విషయంలో అయినా నిర్లక్ష్యం చేస్తారు కానీ అవసరాలు తీర్చుకోవడంలో మాత్రం అస్సలు తగ్గేది లేదు. నిజానికి ప్రతి కుటుంబంలో ఆహార ఆవశ్యకత గురించి ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ అని చెప్పచ్చు. ఏ రోగమో, రొప్పో వచ్చినప్పుడు మందులతో ఆ రోగానికి  టెంపరరీ సొల్యూషన్స్ వెతుక్కోవడం, శరీర సామర్థాన్ని  రోజు రోజుకూ దిగజార్చుకోవడం, అలా ఆరోగ్యాన్ని ఖూనీ చేసుకునే లెజెండ్స్ ఎక్కువయ్యారని చెప్పచ్చు. మన భారతదేశానికి మహర్షులు ప్రసాదించిన ఆయుర్వేదాన్ని కాదని చిటికెలో తలనొప్పులు, గొంతు గరగరలు తగ్గించే ఇంగ్లీష్ మెడిసిన్ మీద ఆధారపడి జీవితకాలన్ని తగ్గించుకుంటున్నారు.  అందుకే జీవితంలో సంపాదించే దానిలో మొదట ఆహారం కోసం ఎక్కువ మొత్తం వెచ్చిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ఉండాలి. అలా ఉంటేనే ఇప్పటి కాలంలో ఆరోగ్యం సొంతమవుతుంది. ఆయుర్వేదంలో సూచించబడిన ఎన్నో అద్భుత మొక్కలను రోజువారీ సమస్యలలో ఉపయోగించవచ్చు. పలితం శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.  లేదూ సరిపడని తిండి, వ్యతిరేకమైన అలవాట్లు ఫాలో అవుతామని అంటే అలాగే కానివ్వండి. అయితే సంపూర్ణ ఆరోగ్యం కోల్పోయి దానికి శిస్తు కడుతూ శిక్ష అనుభవిస్తారు తప్పనిసరిగా!! ◆ వెంకటేష్ పువ్వాడ  

అందంతో విశ్వాన్ని గెలిచేసింది!! 

చాలామంది అందంది ఏముందిలే మనసు బాగుండాలి కానీ అంటారు. అవును నిజం మరి అందం లేకపోయినా మనసు బాగుంటే చాలు. కానీ అదే మనుషులు ఇతరులలో  లోపాలను ఎత్తి చూపుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు అందం ఉన్నా వ్యర్థమే. అయితే మనసు, అందం రెండూ ఉన్నవాళ్లు కొంతమంది ఉంటారు. కానీ బయటకు ఎక్కువగా తెలియదు వీళ్ళందరి గురించి కారణం వాటి గురించి అందరికీ తెలిసే సందర్భం రాకపోవడమే. అందాన్ని మనసును స్ఫూర్తి వంతమైన వ్యక్తిత్వాన్ని కలిగి విశ్వానికి అంతటికీ విజేతగా నిలిచిన మన భారతీయ మగువ విజయాన్ని చూస్తే గర్వాంగానూ, ముచ్చటగాను అనిపిస్తుంది. 2000 సంవత్సరంలో లారా దత్తా మిస్ యూనివర్స్ గా ఎంపికైన తరువాత సుమారు 21 సంవత్సరాలకు భారతదేశం ఖాతాలో మిస్ యూనివర్స్ కిరీటం చేరడం పట్ల దేశం మొత్తం ఆనంద సంబరాల్లో ఉందనే చెప్పాలి.  సంధూ విజయ కేతనం!! పంజాబ్ రాజధాని చండీఘడ్ కు చెందిన హర్నాజ్ కౌర్ సంధూ భారతదేశం నుండి చివరిసారిగా 2000 సంవత్సరంలో మిస్ యూనివర్స్ గా లారా దత్తా ఎంపికైనప్పుడే పుట్టారు. ఈమె ప్రస్తుతం మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. ఈమె వయసు 21 సంవత్సరాలు, భారతదేశానికి ఈమె 21 సంవత్సరాల తరువాత యూనివర్స్ కిరీటాన్ని అందించారు. ఈ అంకెలు ఇలా కలవడం యాదృశ్చికమే అయినా కాసింత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కూడా. అందాల పోటీలలో పాల్గొంటూ ఒక్కో మెట్టూ ఎక్కి వచ్చిన హర్నాజ్ కౌర్ సంధూ 2017 లో మిస్ చండీగఢ్ గానూ, 2018 లో మిస్ మాక్స్ ఎమర్జింగ్ స్టార్ గానూ, 2019లో ఫెమినా మిస్ ఇండియా  పంజాబ్ గానూ నిలిచారు. ఇక 2021 సంవత్సరంలోనే లీవా మిస్ దివా యూనివర్స్ కిరీటాన్ని కూడా అందుకున్నారు. ఈమె కొన్ని పంజాబీ చిత్రాలలో కూడా నటించారు.  అలాంటి సంధూ 2021 సంవత్సరంలో తొలిసారిగా ప్రపంచ అందాల పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన ఇజ్రాయెల్ లో అందాల పోటీలో పాల్గొని విశ్వసుందరిగా విజయకేతనం ఎగరేశారు. ఈ పోటీలో సుమారు 79 మంది పాల్గొనగా అందరినీ దాటుకుని విజయాన్ని ఒడిసిపట్టారు. ఓ ప్రశ్న ఓ జవాబు!! అందాల పోటీలు అంటే శరీరాన్ని చూసి ఇచ్చే బహుమతులు, తలమీద పెట్టె కిరీటాలు అనుకుంటే పొరపాటే. వ్యక్తిత్వాన్ని, ఆలోచనను ఇంకా చెప్పాలంటే మనోవిజ్ఞానశాస్త్ర ఆధారంగా మనుషుల ఆలోచనా తీరు ఎలాంటిది?? ఏ సమస్యకు ఎలాంటి నిర్ణయం తీసుకోగలుగుతారు?? ఏ ప్రశ్నకు ఎలాంటి సమాధానం ఇస్తారు అనేది కూడా పరీక్షించడం జరుగుతుంది.  అలా సంధూ కు ఒక ప్రశ్న ఎదురయ్యింది. దానికి సరైన సమాధానం ఇచ్చి సంధూ విజేతగా నిలబడింది. యువతకు ఒక స్ఫూర్తి మంత్రం!! ప్రస్తుతం యువత ఒత్తిడి ఎదుర్కొంటున్నారు వాళ్ళు ఒత్తిడిని జయించడానికి నువ్వైతే ఎలాంటి సలహా ఇస్తావు అనే ప్రశ్నను ఆమె  ముందు ఉంచారు న్యాయనిర్ణేతలు. తమ మీద తమకు పూర్తిస్థాయి నమ్మకం లేకపోవడమే యువత ఒత్తిడి ఎదుర్కోవడంలో ఎక్కువగా కారణం అవుతుంది.  ఎవరి ప్రత్యేకత వారు గుర్తించడంలోనే నిజమైన అందం దాగి ఉంటుంది. బయటకు రండి, మీకోసం మీరు గొంతెత్తండి, మీ జీవితానికి మీరే నాయకులు, నాకు నామీద పూర్తి నమ్మకం ఉంది అందుకే ఈరోజు నేను ఇక్కడిదాక రాగలిగాను. అని స్ఫూర్తివంతమైన సమాధానం ఇచ్చింది సంధూ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైనవారే, ఎవరూ మరొకరికి పోటీ కాదు, పోలిక అసలే కాదు. ఎప్పుడైతే ఎవరి జీవితాన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవడం మొదలుపెడతారో అప్పుడే వాళ్ళు నిజమైన విజయాలను చవిచూడగలరు  వంటి ఎన్నో అంతర్గత విషయాలు సంధూ ఇచ్చిన సమాదనంలో దాగున్నాయి. ఇలాంటి పరిపక్వత కలిగిన సమాధానాన్ని ఇచ్చింది కాబట్టే విశ్వసుందరిగా నిలిచింది అనుకోవడంలో సందేహం లేదు. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే ప్రపంచంలో యువతకు ఎన్నో రంగాలు ఉన్నాయి. ఎవరి ఆసక్తిని బట్టి వాళ్ళు కృషి చేస్తూ ఉంటే తప్పకుండా విజేతలు అవుతారు.  విశ్వాన్ని కూడా జయించగలుగుతారు. ◆ వెంకటేష్ పువ్వాడ