కాళిదాసు చమత్కారం!

మహాకవి కాళిదాసు గురించి అందరికీ తెలుసు. ఆయన అంత సుప్రసిద్ధుడు. శతాబ్దాల గడుస్తున్నా వన్నె తగ్గని కీర్తి ఆయనది.  సాధారణ విషయాలను కూడా ఎంతో చమత్కారంగా చెప్పడం, అడగడం ఆయనకే చెల్లింది అంటారు పండితులు.ఆయన కాలంలో జరిగిన ఒక ఆసక్తి కథనం ఇది. అది ధారా నగరంలో వారవనితల వీధి. ఆ వీధిలో ఒక రంగుటద్దాల మేడ! ఆ మేడ వసారాలో, పూసల తెరల వెనుక, పందొమ్మిదేళ్ళ పడుచుపిల్ల తూగుటుయ్యాలలో ఊగుతూ ఏవేవో శ్లోకాలు రాగయుక్తంగా వల్లె వేస్తోంది. అదే వీధి గుండా పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ భవభూతి, కాళిదాసు వెళ్తున్నారు. వాళ్ళు వీనుల విందుగా వినబడుతున్న ఆ స్వరానికి ఆకర్షితులై అటు వైపు చూసారు. తాంబూల చర్వణంతో ఎర్రగా పండిన ఆ అమ్మాయి అధరాలు చూడగానే వారిరువురికి తాంబూలం గుర్తుకువచ్చింది. వెంటనే వాళ్ళ దగ్గరున్న తాంబూలపు పెట్టె తెరచి చూసారు. భవభూతి పెట్టెలో సున్నం అయిపోయింది.  అప్పుడు భవభూతి ఆ అమ్మాయిని ఉద్దేశించి, “తూర్ణమానీయతాం చూర్ణమ్ పూర్ణచంద్రనిభాననే” అని అడిగాడు. అనగా, “పున్నమి చంద్రునివంటి ముఖము గల ఓ సొగసరీ! కాసింత సున్నం తెచ్చిపెట్టు” అని అర్థం.  తరువాత కాళిదాసు తన పెట్టెలో తమలపాకులు కూడా లేకపోవడం చూసి, వెంటనే “వర్ణాని స్వర్ణపర్ణాని కర్ణంతాకీర్ణలోచనే” అంటూ శ్లోకాన్ని పూర్తి చేసేడు. అనగా, “చెంపకి చేరడేసి కళ్ళు గల ఓ చక్కని చుక్కా! పసిడివన్నె గల లేత తమలపాకులు కూడా ఇవ్వూ!” అని అర్థం. మహాకవులు వలె ఉన్న ఆ ఆగంతుకులని చూచి, చటుక్కున లేచి, అంజలి ఘటించి, వారిరువురికి కూర్చోవడానికి ఆసనాలు చూపించి, లోపలికి వెళ్లి ఆకులూ, వక్కలు, సున్నం ఉన్న వెండి పళ్లెం వారి ముందు ఉంచి, వినయము, విలాసము ఉట్టిపడుతూ ఉండగా మొదట కాళిదాసుకి తమలపాకులు, తరువాత భవభూతికి సున్నం అందించిందిట ఆ అమ్మాయి. ఈ ప్రవర్తన చూసి భవభూతికి కోపం వచ్చింది., “ఏమిటీ పక్షపాతం? సున్నం తెమ్మని ముందుగా అడిగింది నేను. తరువాత కదా కాళిదాసు ఆకులు అడిగింది? ఇదెక్కడి ధర్మం?” అని నిలదీసి అడిగేడట. దానికి ఆ అమ్మాయి సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో, “క్షమించాలి. పూజా వ్యతిక్రమం జరిగితే మన్నించాలి. సామాన్య ధర్మం మాట ఎలా ఉన్నా, మా వృత్తి ధర్మం ప్రకారం మిక్కిలి రొక్కము ఇచ్చినవారంటేనే మా కులంవారు ఎక్కువ మక్కువ ప్రదర్శిస్తారు. తక్కినవాళ్లు తరువాతే!” అని గడుసుగా సమాధానం చెప్పిందిట! ఆ జవాబు విని ఆ అమ్మాయి సమయస్ఫూర్తికి, సంవాద చాతుర్యానికి ముచ్చటపడి, కవులిద్దరూ ఆమెని మనసారా ఆశీర్వదించి, ముందుకి కదిలి వెళ్లిపోయారట! అదీ కథ!! పై విషయం చదివిన వాళ్లకు ఒక అనుమానం వస్తుంది. భవభూతి కాళిదాసు ఇద్దరూ ఆ అమ్మాయికి ఎలాంటి డబ్బూ ఇవ్వలేదు కదా మరి వాళ్ళు ఏమిచ్చారు?? ఎప్పుడిచ్చారు?? ఆ అమ్మాయి ఎప్పుడు తీసుకుంది?? అనే అనుమానాలు.  పైన శ్లోకంలో ఒక చమత్కారం ఉంది. అదే కథకి ఆయువుపట్టు. భవభూతి చెప్పిన శ్లోక పాదంలో తూర్ణ, చూర్ణ, పూర్ణ అనే మాటలలో మూడు “ణ” లు ఉన్నాయి. కాళిదాసు పూర్తి చేసిన పాదంలో వర్ణ, స్వర్ణ, పర్ణ, కర్ణ, అకీర్ణ అనే మాటలలో అయిదు “ణ” లు ఉన్నాయి. తెలుగువారు ణ అనే అక్షరాన్ని “అణా” అని ఉచ్చరిస్తారు: ట, ఠ, డ, ఢ, అణా. కానీ అణా అనేది ఒక నాణెం కూడా కదా! ఈ కోణంలో చూస్తే భవభూతి ముట్టజెప్పినది మూడు అణాలు, కాళిదాసు ఇచ్చినది అయిదు అణాలు అని మనం అన్వయించుకోవాలి.  ఇలా ఎన్నో చమత్కారాలతో కవుల కాలం అద్భుతంగా సాగిందని ఇలాంటి విషయాలతో అర్థమవుతుంది.                            ◆వెంకటేష్ పువ్వాడ.

రాక్ ఫెల్లర్ జీవితం చెప్పిన కథ ఇది!

ప్రపంచాన్ని డబ్బు శాసిస్తోంది. డబ్బు మనిషిని శాసిస్తోంది. కానీ మనిషి డబ్బు దగ్గర ఓడిపోతున్నాడు. నిజానికి మనిషి డబ్బును సంపాదించి తాను గెలిచాను అనుకుంటాడు.కానీ డబ్బు సంపాదిస్తే అది గెలుపు కాదు, డబ్బుకు లొంగకుండా జీవితాన్ని ఏ సమస్యా లేకుండా, వచ్చిన సమస్యలను అధిగమించినప్పుడే గెలిచినట్టు.  జాన్ డి రాక్‌ఫెల్లర్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ప్రపంచంలోనే మొదటి బిలియనీర్ కూడా.  25 సంవత్సరాల వయస్సులో, అతను USలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకదానికి యజమాని అయ్యాడు. 31 సంవత్సరాల వయస్సులో, అతను ప్రపంచంలోనే చమురు శుద్దిచేసేవాళ్ళలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తరువాత  38 సంవత్సరాల వయస్సులో U.Sలో 90%  చమురును శుద్ధిచేసేవాడిగా గుర్తింపబడ్డాడు.  50 సంవత్సరాల వయసుకు దేశంలోనే అత్యంత ధనవంతుడుగా మారిపోయాడు.  ఈయన యువకుడిగా ఉన్నప్పుడు  ప్రతి నిర్ణయం, వైఖరి మరియు సంబంధం అతని వ్యక్తిగత శక్తిని మరియు సంపదను సృష్టించడానికి అనుగుణంగా ఉండేది. దానివల్ల అతను చమురు ఉత్పత్తి చేసే వ్యాపారంలో తనకంటూ ఓ గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడు. అయితే అంతా సవ్యంగా జరిగితే జీవితాల్లో వింతేముంది అన్నట్టు  ఈయన 53 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురయ్యారు. ఆ అనారోగ్య ప్రభావం వల్ల అతని శరీరం మొత్తం నొప్పితో నిండిపోయింది. ఆ నొప్పి తలుకూ ప్రభావాల వల్ల తన వెంట్రుకలను కోల్పోయాడు. దాని వల్ల పూర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, తనకు కావాల్సింది ఏదైనా కొనగల వ్యక్తి కేవలం సూపులు మాత్రమే తాగి వాటిని మాత్రమే జీర్ణించుకునే స్థాయికి దిగజారిపోయాడు.  ఆ సమయంలో ఆయన స్నేహితుడు ఒకడు ఇలా అన్నాడు "రాక్ పెల్లర్  నిద్రపోలేడు, నవ్వలేడు. జీవితంలో అతనికి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు" అని. అతని దగ్గర వ్యక్తిగతంగా ఎంతో గొప్ప నైపుణ్యం కలిగిన  వైద్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆయనతో సంవత్సతంలోపు చనిపోవడం ఖాయం అని చెప్పారు.  ఆ సంవత్సరం చాలా నెమ్మదిగా గడిచిపోయింది. అతను మృత్యువుకు చేరువవుతుండగా అతనిలో ఆలోచనలు పెరిగాయి. చనిపోయిన తరువాత తన సంపదలో దేనినీ తనతో పాటు తీసుకెళ్లలేను అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత అతనిలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.  ఒకరోజు ఉదయమే లేచి   "నా జీవితాన్ని నేను నియంత్రించుకోలేదు" అని అనుకున్నాడు.అప్పుడే అతనిలో ఒక ఆలోచన రూపు దిద్దుకుంది.  అతను తన న్యాయవాదులు, అకౌంటెంట్లు, మేనేజర్‌లను పిలిచి, తన ఆస్తులను హాస్పిటల్స్, రీసెర్చ్ మరియు ఛారిటీ వర్క్‌లకు పంపాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. జాన్ డి. రాక్‌ఫెల్లర్ తన ఫౌండేషన్‌ని స్థాపించాడు. ఈ కొత్త దిశ చివరికి పెన్సిలిన్ యొక్క ఆవిష్కరణకు దారితీసింది, మలేరియా, క్షయ మరియు డిఫ్తీరియాకు నివారణల నివారణకు పెన్సిలిన్ ఎంతగానో సహాయపడింది  రాక్‌ఫెల్లర్ జీవితంలో అత్యంత అద్భుతమైన విషయం ఒకటుంది. అదేమిటంటే అతను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని అందరికీ పంచడం మొదలుపెట్టిన తరువాత అతని శరీరం మందులకు పాజిటివ్ గా స్పందించడం మొదలుపెట్టింది. ఫలితంగా అతనిలో అనారోగ్యం క్రమంగా తగ్గిపోయి సాధారణస్థితికి చేరుకున్నాడు.   53 సంవత్సరాల వయస్సులో చనిపోవాల్సిన వ్యక్తి ఆశ్చర్యంగా 98 సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతను తన జీవితంలో కృతజ్ఞత అనే విషయన్ని ఎప్పటికీ వదలకుండా తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని సామాజిక సేవ కోసం వినియోగించారు.పూర్తిగా కొలుకున్న తరువాత ఆయన తన సంపాదన మొత్తాన్ని  దానం చేయడానికే నిర్ణయించుకున్నాడు.  ఆయనఆ తన మరణానికి ముందు తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు.  “అన్నీ అతనికే చెందుతాయి, నేను అతని కోరికలను నెరవేర్చడానికి ఎంపికను మాత్రమే. ఒక తెలుయని శక్తి నాలో చోటుచేసుకున్న కొత్త ఆలోచనలు, జీవితంలో కొత్త మలుపులకు కారణం అయ్యింది" "నా జీవితం ఒక సుదీర్ఘమైన, సంతోషకరమైన సెలవుదినం. పూర్తి పని, పూర్తి ఆటతో నేను ఆందోళనను దారిలో వదిలిపెట్టాను. దేవుడు తో ప్రతిరోజూ నాకు మంచిరోజు.” అని. పై విషయం అంత తెలుసుకుంటే మనిషి తన జీవితంలో సంపాదించే దాంట్లో కొంత భాగాన్ని దానం చేయడం వల్ల కూడా జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి అద్బుతాలు చేస్తాయని అర్థమవుతుంది. ◆వెంకటేష్ పువ్వాడ.

క్రాక్ చెయ్యాలంటే కొన్ని తెలియాలి!

గ్రాండ్స్ గోల్స్ అంటే చాలామంది మనసులో ఐ.ఏ.యస్, ఐ.పి.యస్ వంటి ఉద్యోగాల పేర్లు ఉండిపోతాయి. నిజానికి అవి ఎంతో ఉన్నతమైన ఉద్యోగాలు కూడా. ప్రభుత్వం స్వయంగా ఎంపిక చేసే ఈ వర్గాలలో ఉద్యోగం సంపాదించడం చాలామంది కల. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆ కలను నెరవేర్చుకోవాలని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు కూడా. అయితే సాధారణ గ్రామీణ ప్రాంతాల వ్యక్తులు కూడా ఈ వైపు సక్సెస్ అవ్వాలంటే అందరూ తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది.  సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించేవాళ్లకు డిగ్రీ అయిపోయాక ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరడం తప్పనిసరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కారణంగా అలా చేస్తారు.  ఓ  మధ్యతరగతి వ్యక్తికి ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవ్వడం సరైనదేనా అనే విషయం ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు ముక్కుసూటిగా మాట్లాడుకోవాలి. ఇప్పుడే మొదలు పెట్టినట్లైతే.. మొదలు పెట్టిన పని పూర్తి చేయడం  అనేది వయసు మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇంటర్, డిగ్రీ, ఎం.ఏ, ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వాళ్లకు అటు ఇటుగా సుమారు పాతిక సంవత్సరాల వయసు ఉండే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ వైపు ఆలోచనలు కూడా దాదాపుగా 22-25 సంవత్సరాల వయసు వారికే ఎక్కువ ఉంటుంది కూడా. చాలామంది ప్రాక్టీకల్ గా ఆలోచించలేక నోటి లెక్కలు వేసుకుని పాతిక సంవత్సరాల వయసులో నిర్ణయం తీసుకుని ర్యాంకులు కొడతాము అనుకుంటారు. అయితే అక్కడే ఒక తప్పు జరిగిపోతుంది.  చాలా మంది జాబ్ కొట్టిన వాళ్ళు, ఐ.ఏ.యస్, ఐ.పి.యస్ క్లియర్ చేసినవాళ్ళు వల్ల ఫ్యామిలీ ఇంకా స్నేహితులు మీడియా ముందు ఎన్నెన్నో చెబుతూ ఉంటారు. వాటిలో చాలామంది జాబ్ చేసుకుంటూ రాత్రి పగలు కష్టపడి చదివేసి, నిజాయితీగా ఉంటూ ప్రిపేర్ అయినట్టు చెబుతారు. అయితే వాటిలో నిజం చాలా తక్కువగా ఉంటుంది.ఆ మాటలు అన్నీ బాగా షేక్ చేసిన కూల్ డ్రింక్ బాటల్ ఓపెన్ చేయగానే ఎలాగైనా బుస్సు మని పొంగుతుందో అలాంటివే. సినిమాటిక్ గా జరిగే వాటికి రియాలిటికి ఉన్న తేడాను అందరూ అర్థం చేసుకోవాలి.  ఐ.ఏ.యస్, ఐ.పి.యస్  పరీక్షలు నెగ్గాలంటే కొన్ని లక్షణాలుండాలి. అవి కొన్ని పుట్టుకతోనూ ఉంటయి, మరికొన్ని  పెంపకం తో వస్తాయి.కొన్ని ఏం చేసినా రావు. ఓ స్థిర నిర్ణయం!! ఏ పని అయినా సరే చేయాలా వద్దా అనేదానికోసం ఒక స్థిరనిర్ణయం ముఖ్యం. అలాగే దేనికి ఇంపోర్టెన్స్ ఇవ్వాలనే విషయం కూడా ముఖ్యమే. ఇద్దరు వ్యక్తులు సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. వాళ్లలో ఒకడికిజాబ్ కొట్టాలి అంటే దేశభక్తి ఎక్కువ ఉండాలి, సమాజాసేవ బాగా చేసే గుణం ఉండాలి అనుకుని చదువుకుంటూ సమాజాసేవ కార్యక్రమాలకు అటెండ్ అవుతాడు, ఇంకొకడు అన్ని వదిలేసి సివిల్స్ కు చదువుతూ ఉంటాడు. ఉన్న సమయంలో తాను చేరాలనుకున్నా లక్ష్యం గురించి ఆలోచించేవాడే దాన్ని చేరగలడు. అందుకే కేవలం బాగా చదువుకున్న వాడే ఆ లక్ష్యాన్ని చేరగలిగాడు. ప్రిపేరేషన్ మీద ఒక స్థిరనిర్ణయంతో ఉండాలి. కష్టం!! కష్టం అందరూ చేస్తారు కానీ పది లక్షలమంది పోటీదారులు నుండి కేవలం 180 మాత్రమే ఎంపిక అవుతారు. మరి మిగిలిన వాళ్ళు చదవలేదనా?? కానీ కాదు కాబట్టి  కష్టం చేసినంత మాత్రాన ఫలితం దక్కాలనే రూల్ లేదు. దాదాపు పది సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి, ఆరు అట్టెంప్ట్ ల తర్వాత ఒక్క మార్కుతో క్లియర్ కాని వాళ్ళెందరో ఉన్నారు. పర్ఫెక్ట్ మార్గం!! కొందరికి కుటుంబం లో, కాలేజీ లో గైడెన్స్ దొరుకుతుంది. లేకపోతే కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా ఉండనే ఉన్నాయి. ఇంకా ఇప్పటి టెక్నాలజీ వల్ల ఆన్లైన్ లో చూసి నేర్చుకోవచ్చు. కానీ కోచింగ్ తీసుకునేవాళ్లకు సమయం కలిసొస్తుంది. అంటే ఇక్క టైమ్ మేనేజ్మెంట్ ఎంతో ముఖ్యం. కోచింగ్ వల్ల అందరికీ లభించేది అదే. అలాగే పర్ఫెక్ట్ గా ఏమి చదవాలి అనే విషయం గురించి క్లారిటీ ఉండాలి కూడా. అవగాహన లేకుండా అనవసరమైన విషయాలు చదువుతూ ఉంటే ఎప్పటికీ చదవాల్సిన విషయాలను సగం కూడా క్లియర్ చెయ్యలేరు.  ఆప్షన్స్!! సాదారణంగా ఇలాంటి పెద్ద పెద్ద లక్ష్యాలకు ఎలాంటి ఇతర ఒత్తిడి ఉండకూడదు. అది ఇంటి పని కావచ్చు, ఇతర ఉద్యోగం కావచ్చు, బాధ్యతలు కావచ్చు, ఇతర చదువులు కావచ్చు. ఇవన్నీ చేస్తూ ప్రిపేరేషన్ అంటే నెలలు, సంవత్సరాల కొద్దీ అయ్యేదేనా అనే విషయం కొంచెం ఆలోచించుకోవాలి. సంవత్సరాల కొద్దీ చదివినా తరగని  నిదిలా ఉండే ఆ సిలబస్ లను కవర్ చేయాలంటే పూర్తి సమయాన్ని దానికి ఇచ్చేయ్యాలి.  వేగంగా రాసినా అందంగా ఉండే దస్తూరి, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, అదృష్టం.. ఇవి ఒకదానికి ఒకటి లింక్ అయి జటాయి.  ప్రశాంతంగా ఉండాలంటే ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వంటివి ఉండకూడదు. ప్రిపేరేషన్ మొదలు పెడితే, ప్రేపరషన్ కి1.5 సంవత్సరం, పరీక్షకి 1 సంవత్సరం. ఒక అట్టెంప్ట్ కి రెండున్నర సంవత్సరాలు పెట్టాలి. వీటన్నింటినీ లెక్కేసుకుంటే సగటు మధ్యతరగతి వ్యక్తికి 5 సంవత్సరాలు ఇక్కడ అయిపోతాయి. అంటే 25 నుండి 30 కి జంప్ అవుతారు. సీరియస్ గా చేసే అటెంప్ట్ లో మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటూ బాధ్యతగా ఉంటూ మానసిక ఒత్తిడి భరిస్తూ చదవడం కుదిరేపనేనా??  22 కల్లా ఐఏఎస్ అయినవాడు 16 ఏట నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తాడు. బయటికి చెప్పరు అంతే.  ఒకసారి హైదరాబాద్ లో ఐ.ఏ.యస్ కోచింగ్ అకాడమీకి వెళ్తే అక్కడ కోచింగ్ తీసుకుంటున్న అవల్లలో ఇంటర్ పిల్లకాయలు కూడా కనబడి ఆశ్చర్యపోయేట్టు చేస్తారు. అంటే ఇదంతా డిగ్రీ అయిపోయాకనో, ఎం.ఏ అయిపోయాకనో మొదలుపెట్టే పని కానే కాదు.  ఉద్యోగం చేస్తూ క్లియర్ చేసినవాళ్లకు ఒక ఆప్షన్ ఉంటుంది. క్లియర్ కాకపోయినా ఒక జాబ్ అంటూ ఉంది కదా అనే నిశ్చింత. అది లేకుంటే ఒకసారి అటెంప్ట్ కు టోటల్ గా 5 సంవత్సరాలు నష్టపోయి వేరే ఉద్యోగాల విషయంలో కూడా వెనుకబడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో పెద్ద లక్ష్యాలు చేరాలంటే చాలా తొందరగా వాటి కోసం కసరత్తు చేయాలి. అలాగని ఇప్పుడు ఆశ వదిలేసుకోమని కాదు. ఏమో అదృష్టమనే ఆప్షన్ కూడా ఉంటుంది.                                ◆వెంకటేష్ పువ్వాడ.

శరణుజొచ్చినవాడికి అభయమిద్దాం!

సాకారుడైన హరి శరణుజొచ్చిన చాలు అంటాడు అన్నమయ్య తన కీర్తనలో. హరి అంటే విష్ణువు అని అర్థం. ఆ మహావిష్ణువును శరణు కోరితే, ప్రార్థిస్తే ఆయన సమస్యలను పరిష్కరిస్తాడు అని అర్థం. బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అనేది అందరికీ తెలిసిన మాట. బుద్ధుడికి లొంగిపోవడం, సంఘానికి లొంగిపోవడం, ధర్మానికి లొంగిపోవడం అనేవి అర్థాలు. బుద్ధుడు చెప్పిన విషయాలు అన్నీ సమాజాన్ని మార్చే శక్తివంతమైన వాక్యాలు. అహింసను పాటించడం, దుఃఖాన్ని జయించడం, కోర్కెలను జయించడం ప్రశాంతమైన జీవితాన్ని గడపడం ఇవన్నీ. కానీ ఇవి ఎలా సాధ్యం అంటే హింస లేనప్పుడు, స్వేచ్ఛగా బతకగలిగినపుడు.  ఎక్కడైతే హింస చోటు చేసుకుంటుందో, అక్కడ మానవ జీవితాలు ప్రభావితం అవుతాయి. సమస్యలు చిన్నగా మొదలై స్వేచ్ఛ కోల్పోవడం దగ్గర నుండి చివరకి తిండి దొరడం కష్టమయ్యి, ప్రాణహాని సంభవించేవరకు దారితీస్తుంటాయి. అలాంటి వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఇంకొకరి సహాయం కోసం ఎదురుచూడటం లేదా ఎక్కడైనా కాసింత తిండి, ఉండటానికి షెల్డర్ దొరుకుతుందేమో అని ఉన్న ప్రాంతాన్ని వదిలి మరొకచోటుకు వెళ్లిపోవడం చేస్తుంటారు. ఇలా కష్టసమయంలో ఒకచోటి నుండి మరొకచోటుకు సహాయం కోసం వలస వెళ్లే వాళ్ళను శరణార్థులు అంటారు.  ఉద్యోగాల కోసం, బ్రతుకు తెరువు కోసం ఒక ప్రాంతం  నుండి మరొకప్రాంతనికి  వెళ్ళేవాళ్ళు వలసదారులు అయితే, సర్వం కోల్పోయి సహాయం కోరుతూ వెళ్లేవాళ్ళు శరణార్థులు అనబడతారు. ప్రశ్నార్థక జీవితాలు! తినడానికి తిండి, ఉండటానికి నివాసం, కాసింత ప్రాణ రక్షణ, కొద్దిగా స్వేచ్ఛ ఉంటే ఎవరూ ఉన్న ప్రాంతాలను వదిలి వెళ్లిపోరు. ముఖ్యంగా కొందరు కష్టపడి సంపాదించుకుని భూములు కొని, ఇళ్ళు కట్టుకుని, స్థిరస్థులను పొగుచేసుకుని ఎంతో చక్కగా ఉంటారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఉన్న ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయి పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా యుద్ధాలు జరిగే ప్రాంతాలలో, కరువులు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినపుడు బాధిత ప్రాంతాలలో నష్టం చాలా ఘోరంగా ఉంటుంది. అన్ని వదిలేసుకొని కట్టుబట్టలతో వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక్కసారిగా నిర్వాసితులు అయిపోతారు. అలాంటి వీళ్ళు సహాయం దొరుకుతుందనే ఆశతో వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రభుత్వాలు అలాంటి వాళ్ళను తరలించి ప్రభుత్వ సంరక్షణ హొమ్స్ లో కొద్దిరోజుల పాటు ఉంచుకుంటారు. కానీ జీవితంలో మళ్ళీ ఏదో ఒక అడుగు ముందుకు వెయ్యాలి కదా సొంతంగా ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతుకు బండి నెట్టుకురావాలి. కానీ అలాంటి వాళ్లకు కొన్నిచోట్ల తగినంత ఆదరణ లభించదు.  అపన్నహస్తం! హిందువులు అయినా, ముస్లింలు అయినా ఇతర వర్గాల వాళ్ళు అయినా వాళ్ళ వాళ్ళ మతాలలో ఉన్న ముఖ్యసారం ఇతరులను ఆదుకోవడం, ఇతరులకు సహాయం చేయడం , ఇతరుల పట్ల ప్రేమ, అభిమానం, జాలి, కరుణ వంటివి కలిగి ఉండటమే అనే ముఖ్య విషయం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్ననాడు ఇతరుల విషయంలో మానవత్వాన్ని కలిగి ఉంటాడు. నాకెందుకులే సమస్య నాది కాదు కదా అనే స్వార్థబుద్దిని ఎప్పుడూ ప్రదర్శించడు. మన చుట్టూనే! ఒకప్పుడు గొప్పగా బ్రతికిన వాళ్ళు పరిస్థితుల ప్రభావం వల్ల సర్వం కోల్పోయి నిస్సహాయతతో బ్రతికిస్తూ ఉంటారు. గుడులు, రైల్వే స్టేషన్ లు, బస్టాండ్ లు, చుట్టూ ఉన్న ప్రాంతాలలో బయటకు అడగలేని వ్యక్తిత్వంతో కూడా ఉంటారు. మరికొందరు ఎక్కడినుంచో వలస వచ్చి కష్టాలు పడుతూ ఉంటారు. ప్రభుత్వాలు, స్వచ్చంధసంస్థలు చేసేవి ఎవరికీ పూర్తిగా భరోసాను ఇవ్వలేవు. అందుకే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి శరణార్ధుల విషయంలో బాధ్యతగా ఉండాలి. శరణుజొచ్చినవాడు శత్రువు అయినా వాడిని ఆదుకోవాలని చెబుతుంది మన భారతీయ సంస్కారపు సంస్కృతి. ఎన్నెన్నో దేశాల నుండి భారతదేశానికి శరణంటూ వచ్చి ఇక్కడే ఉన్న విదేశీయులు ఎందరో ఉన్నారు. పక్కదేశాలకు మన దేశం ఆవాసం కల్పించినప్పుడు మన పక్కవాడికి కష్టం వస్తే మనం తోచిన సహాయం చేయలేమా?? ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి సుమారు 20 మంది తమ స్వంత ప్రాంతాలను వదులుకుని ఇతర ప్రాంతాలకు సహయాలకోసం తరలివెళ్లిపోతున్నారు. వీళ్ళలో ఎక్కువ బాగం  చిన్నపిల్లలు, మహిళలే ఉంటున్నారు. ఇలాంటి  వాళ్ళను ఆదుకోవడం ప్రతిఒక్కరి బాద్యతనే కదా!!                                ◆వెంకటేష్ పువ్వాడ.

జోక్యం చేసుకుంటే జోక్ అయిపోతారు!

స్నేహితులు, చుట్టాలు, ఇరుగు పొరుగు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు, సహోద్యోగులు ఇలా మన లైఫ్ లో చాలామంది ఉంటారు. వీళ్ళందరిలో కొందరు కేవలం తెలిసిన వాళ్ళలా ఉండిపోతే మరికొందరు చాలా సన్నిహితులు అవుతారు. దగ్గరితనం వల్లనో లేక వయసులో అవతలి వాళ్ళకంటే  కాస్త పెద్దవాళ్ళం అవడం వల్లనో మొత్తానికి కారణం ఏదైనా వాళ్ళ లైఫ్ లో కొన్ని ముఖ్యమైన విషయాలు, వాటిలో వాళ్ళ సమస్యలు చెప్పి సలహాలు అడుగుతూ ఉంటారు. అయితే విన్నవాళ్ళు తోచిన సలహా ఏదో ఇస్తూ ఉంటారు. మరికొందరు అత్యుత్సాహంతో సాధ్యం కాని సలహాలను సొల్యూషన్ గా సజెస్ట్ చేస్తుంటారు. అయితే ఇలా ఇతరులు అడిగితేనో లేక సాన్నిత్యం ఉందనే అనే కారణంతోనో సలహాలు ఇచ్చేస్తే ఆ తరువాత ఎదుటివారి దృష్టిలో మీ పట్ల ఉన్న అభిప్రాయాలు మారిపోతాయి. ఎందుకని? జీవితంలో సమస్యలు, సందేహాలు అనేవి సహజమే. వాటి సొల్యూషన్ కోసం చాలామంది తమకు సన్నిహితులుగా  ఉన్నవారిని అడుగుతూ ఉంటారు. అయితే ప్రతి విషయం ఆ వ్యక్తి మానసిక, ఆర్థిక, సామాజిక స్థితికి తగ్గట్టు ఎక్కువ ప్రభావవంతంగానూ ఉండచ్చు, సాధారణంగానూ ఉండచ్చు. ముఖ్యంగా వాటిని మోసేవాళ్లకే ఆ సమస్యల బరువు వాటి తాలూకూ ఎమోషన్స్ స్పష్టంగా తెలుస్తాయి. కానీ సలహా అడిగారు కదా అని బుర్రకు తోచిన ఐడియా ఇచ్చేస్తే అది ఆచరణలోకి వచ్చేసరికి ఇంకా పెద్ద ప్రాబ్లెమ్ తెచ్చి పెట్టడం లేదా ఏదైనా నష్టాన్ని కలిగించడం వంటి వాటికి కారణం కావచ్చు. అసలే సమస్యతో ఏడుస్తున్నవాళ్లకు పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ ఎదురయ్యే సమస్య ఇంకా ఎక్కువ ఇర్రిటేషన్ తెప్పించి చెత్త సలహా ఇచ్చి సచ్చారు అనే మాట ఇన్నర్ వాయిస్ గా దొర్లిపోతుంది అవతలి వాళ్లకు.  మరేం చెయ్యాలి? ఎవరైన ఏదైనా చెప్పుకుని సలహా లేదా సొల్యూషన్ అడిగినప్పుడు అవగాహన గనుక ఉంటే వాళ్ళ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి, దాన్ని అన్ని కోణాల నుండి ఎలా చూడాలి, దానికి కారణం ఏంటి?? దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు వంటి విషయాలను మాత్రం చెప్పాలి. అవన్నీ చెప్పిన తరువాత వాళ్ళకే అర్థం అయిపోతుంది ప్రాబ్లెమ్ లో ఉన్న మెయిన్ రీసన్ ఏంటి దానికి ఏమి చెయ్యాలి అనేది.  ఫోర్స్ చేయద్దు! బాగా పరిచయం ఉన్నవాళ్లు, ఎంతో సన్నిహితంగా ఉన్నవాళ్లు వాళ్ళ సమస్యను షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనకు ఎంతో ఇష్టం లేక అభిమానం అయి ఉంటే అలా చేసుకో ఇలా చేసుకో ఇదే కరెక్ట్, ఇలాగైతేనే బాగుంటుంది అంటూ ఒకటే చెప్పేస్తూ ఉంటారు. ఇంకా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటే గనుక చెప్పినట్టు వినూ, తం వేస్ట్ చేసుకోకు, తరువాత లాస్ అవుతావు అని కూడా చెబుతూ ఉంటారు. అయితే ప్రతి మనిషికి సమస్యలో ఉన్నప్పుడు ఒక స్టెప్ వేయడానికి సొంతంగా ఒక క్లీయరెన్స్ అనేది ఎంతో ముఖ్యం. అది లేకుండా వేసే స్టెప్ వల్ల ఎదుటివారిని దానికి బాధ్యులుగా చేసేస్తారు. కాబట్టి ఎవరి సమస్యనూ చేతుల్లోకి తీసుకుని వాళ్ళను ఫోర్స్ చేయద్దు. తోడుగా ఉండాలి తేడాగా కాదు! కొందరు సమస్యలు చెప్పినప్పుడు అది ఎంతో సిల్లిగానూ, కామెడిగానూ అనిపిస్తుంది. అలాంటి వాటిని గురించి బాగా నవ్వేసి ఆ తరువాత ఎదో చెత్త సలహా ఒకటి పడేసి వేరే పనుల్లోకి వెళ్లిపోతుంటారు. అయితే సమస్య ఎంతో ఇబ్బంది పెట్టేది అయితే తప్ప మనతో చెప్పుకునేవాళ్ళు అంత ఎమోషన్ అవ్వరు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సమస్యకు సలహా ఇవ్వకపోయినా పర్లేదు కానీ హేళన చేయడం అనేది చాలా తప్పు. దానివల్ల మరింత మానసిక బాధ అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. సమస్యకు సలహా ఇవ్వకపోయినా పర్లేదు కానీ హేళన చేయడం అనేది చాలా తప్పు. దానివల్ల మరింత మానసిక బాధ అనుభవిస్తారు.  కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే మీరు జోక్ అయిపోతారు.                                  ◆వెంకటేష్ పువ్వాడ.

వెలిగే సూర్యుడు నాన్న!

సూర్యుడు ఈ సృష్టికి వెలుగు పంచేవాడు. ఉదయాన్నే లేలేత ఎండతోనూ, మధ్యాహ్నం భగభగ మండే ఎండతోనూ, సాయంత్రానికి చల్లబడి మెల్లిగా తన ప్రతాపం తగ్గిస్తూ ఉంటాడు. కానీ సూర్యుడు రాత్రి పూట కూడా తన పని తాను చేస్తూ ఉంటాడు. అయితే అది మనకు కనిపించదు. దాన్ని చీకటని, రాత్రి అని, ఇంకా వేరే వేరే పేర్లు పెట్టుకుంటాము. ఈ భూమండలం పెద్దది కాబట్టి సూర్యుడు మరొకవైపుకు వెళ్ళినప్పుడు ఆ వెలుగు మనకు కనిపించదు. బహుశా దీన్ని అవతలి కోణం అని కూడా అనచ్చేమో. ఇప్పుడు సూర్యుడి గురించి ఎందుకు?? అని అందరికీ సందేహం వస్తుందేమో కానీ మన ఇంట్లో నాన్న కూడా సూర్యుడి లాంటివాడే. నాన్న ప్రేమ ఉదయాన్నే సూర్యుడి వెలుగులా ఉంటుంది. నాన్న కోపం మధ్యాహ్నపు ఎండలా ఉంటుంది. నాన్న కష్టం అస్తమిస్తున్న సూర్యుడిలా నిశ్శబ్దంగా ఉంటుంది. నాన్న ఓర్పు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే సూర్యుడి గమనంలా ఉంటుంది.  నాన్నంటే!! నాన్నంటే ఓ ధైర్యం, ఓ భరోసా, ఇంట్లో అందరి అవసరాలు తీరుస్తూ అందరి బాధ్యత మోస్తూ నిత్యం వెలిగే సూర్యుడి లాంటి వాడు నాన్న. అమ్మను అమ్మ ప్రేమను ఎప్పుడూ బయట పెడుతూ ఉంటాము. అమ్మను దేవతతో పోల్చి గొప్పగా పొగుడుతూ ఉంటాము. కానీ నాన్న విషయంలో మాత్రం అంతగా బయటకు చెప్పము. నాన్న ఎంత గొప్ప వాడు అయినా పిల్లల ముందు ఓడిపోవడానికే ఇష్టపడతాడు. అమ్మ ప్రేమ అమ్మ త్యాగం ఎప్పటికప్పుడు బయటకు కనిపించేవి అయితే నాన్న ప్రేమ, నాన్న త్యాగం కనిపించని ప్రాణవాయువు లాంటివి. గాలి కంటికి కనిపించదు కానీ అది లేకుంటే సమస్ధానికి మరణమే గతి. అలాగే నాన్న ప్రేమ, నాన్న త్యాగం బయటకు కనిపించవు కానీ నాన్న లేకుంటే ఏ కుటుంబం నిశ్చింతగా ఉండదు. నాన్న ఎందుకో చిన్నబోయాడు!! అమ్మ నవమాసాలు మోస్తుంది, నొప్పులు భరించి బిడ్డలకు జన్మనిస్తుంది. పాలిస్తుంది,. తన కొంగు వెనుక దాచుకుని పెంచుతుంది. ఇల్లాలకు ఏదైనా అవసరం వస్తే మొదట అమ్మ దగ్గరకే వెళ్తారు, బడి వయసు వచ్చేదాకా అమ్మ చేతుల్లోనే ఉంటారు పిల్లలు. అందుకే అమ్మకు దగ్గరగా ఉంటారు. నాన్నంటే అదొక భయం. ఉదయం లేచి ఏదో తిని, క్యారియర్ లో కట్టుకుని ఉద్యోగానికి వెళ్ళిపోయి ఎప్పుడో సాయంత్రం చీకటిపడే ముందు నాన్న ఇంటికి చేరుకుంటాడు. పాపం తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డల్ని ప్రేమగా ఎత్తుకోవాలని, ముద్దాడాలని అనుకుంటాడు. కానీ ఇంట్లో పిల్లలు అలసిపోయి అన్నం తిని నిద్రపోతూ ఉంటారు. చిన్న పిల్లలు అంటే నిద్రలోనే ఎక్కువ గడుపుతారు. పిల్లలు కొంచెం పెద్దయ్యాక వాళ్ళు బడికి అలవాటు పడ్డాక, నాన్నలో ఆశ మొలకేస్తుంది. నా బిడ్డ మంచి స్థాయికి చేరుకోవాలి అని. అందుకే బాగా చదువుకోవాలని, మంచి మార్కులు రావాలని కొప్పడతాడు, అప్పుడప్పుడూ దెబ్బ వేస్తాడు. కోపం వెనుక, దెబ్బల వెనుక ప్రేమను అర్థం చేసుకోవడం మనవల్ల కాదప్పుడు. అందుకే అందరి మనసుల్లో నాన్న ఒక విలన్ లాగా ముద్రించుకుపోయి వెనుకబడ్డాడు. అన్ని విషయాల మెజ్నదు ప్రాధాన్యత లేని వ్యక్తిలా కనిపిస్తాడు. నాన్నకు ఒక ఉత్తరం!! ఓ పాతికేళ్ల వ్యక్తితో తన తండ్రికి ఉత్తరం రాయమంటే ఏమి రాయాలి అనే నిర్లక్ష్య సమాధానం వస్తుందేమో, కానీ తండ్రి స్థానానికి మారిన తరువాత అదే వ్యక్తితో ఉత్తరం రాయమని చెబితే తప్పకుండా ఎంతో బావిద్వేగంతో కూడుకున్న ఉత్తరం రాస్తాడు. అవును మరి బాధ్యత మీద పడితే తప్ప నాన్న సంఘర్షణ, నాన్న ప్రేమ, నాన్న ఆరాటం, నాన్న ఆశ, నాన్న త్యాగం ఇవ్వేమీ తెలిసిరావు.  ఎప్పుడూ అమ్మ అమ్మ అమ్మ అని అమ్మకోసమే కాదు ఆకాశమంత వ్యక్తిత్వం కలిగి, నిశ్శబ్దంగా తన పిల్లలకోసం తలవంచే నాన్న కోసం కూడా కొద్దిగా సమయం కేటాయించండి. అమ్మ అనే పదాన్ని కలుపుకున్నంత సులభంగా నాన్న అనే పదాన్ని కలుపుకోలేం మరి.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి!

ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి అంటారు పల్లె ప్రజలు. అరుద్రలో పడే వాన అమృతంతో సమానమని వ్యవసాయదారులు భావిస్తారు. మృగశిర కార్తెలో వర్షాల కదలిక మొదలైతే ఆరుద్ర కార్తెలో ఆ వర్షాలు ఇంకొంచెం పుంజుకుంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే భూమి పుష్కలంగా తడిసి రైతులు వారి నాట్లు, జొన్న, మొక్కజొన్న, ప్రతి వంటి పంటల సాగుకు ఇక నడుం కట్టినట్టే. వ్యవసాయంలో ఎంతో ముఖ్యమైన అంశం అయిన మార్పులు చోటుచేసుకునే కాలాన్ని వ్యవసాయ పంచాంగంలో ఆరుద్ర కార్తె అని పిలుస్తారు.  ఆరుద్ర పురుగు! వ్యవసాయదారులకు ఈ ఆరుద్ర కార్తెలో కనిపించే గొప్ప అతిథి ఆరుద్ర పురుగు. ఎరుపు రంగులో వెల్వెట్ క్లాత్ చుట్టుకుని ఉందా అన్నట్టుగా కనిపించే ఈ ఆరుద్ర పురుగు పంట పొలాల్లో, వ్యవసాయ భూముల్లో కనిపిస్తే ఇక రైతులు తమ పని గట్టిగా ముందుకు లాగాల్సిందే అని సోఇచన ఇచ్చినట్టు అంట. వ్యవసాయం, వాతావరణ పరిస్థితుల మీద గొప్ప అవగాహన ఉన్న వాళ్లకు ప్రకృతి మార్పులను అనుసరించి ఎప్పుడు ఏ పని చేయాలి అనేది బాగా అర్థమయ్యేది. దాన్ని అనుసరించి మంచి పంటలు సాగుచేసి పుష్కలమైన దిగుబడి సాధించేవాళ్ళు. వ్యవసాయదారుల నేస్తం అయిన ఈ ఆరుద్ర పురుగు కేవలం సంవత్సరంలో ఒక్కసారి, ఆరుద్ర కార్తె సమయంలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆరుద్ర పురుగును చూసి నాట్లు వేయడానికి కదిలిపోవచ్చు రైతన్నలు. చాలామంది ఎవరైనా కనిపించడం తగ్గిపోయినప్పుడు, చాలారోజులు దూరంగా వెళ్ళినప్పుడు చాలా నల్లపూస అయిపోయావు, ఆరుద్రపురుగులాగా అంటూ ఉంటారు. దాని అర్థం ఆరుద్ర పురుగు కూడా సంవత్సరంలో ఒకసారి మాత్రమే కనబడుతుంది అని, అలా చాలా బిజీ అయిపోయి బొత్తిగా కనబడటం లేదని అర్థం. ఆరుద్ర కార్తెలో కోలాహలం! ఆరుద్ర కార్తెలో రైతన్నలు కోలాహలం చాలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పంటలు వేసేవాళ్ళు చాలా హడావిడిగా కనిపిస్తారు. వరి పంట వేసేవాళ్ళు నారుమళ్లలో అంతరకృషి చేస్తారు. అంటే బాగా తడిసిన  భూమిని దుక్కి దున్నడం, వారి నట్లు వెయ్యడం, వంటివి చేస్తారు. వర్షం సమృద్దిగా పడితే వరి నాట్లు వేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ మొదటి దశలో జరిగేవి. ఇప్పుడే ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా వంగడాల విషయంలో మంచి అవగాహన, సలహాలు, సూచనలు కలిగి ఉంటారు.  జొన్న పంట వేసేవాళ్ళు దుక్కులు దున్నడం, రసాయనిక ఎరువులు వేయుట, విత్తనం వేయడం వంటివి చేస్తారు. విత్తనాల ఎంపిక ఎంతో కీలకమైంది. మొక్కజొన్న పంటలు వేసేవాళ్ళు సస్యరక్షణ  చేపడతారు. అప్పటికే నాటిన మొక్కజొన్నకు రెండవ సారి ఎరువులు వేయడం వంటి పనులు చేస్తారు. అలాగే ఎరువుల ఎంపిక ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రత్తి పంట వేసేవాళ్ళు అంతరకృషి చేస్తారు, మొక్కలను పలుచన చేయడం చేస్తారు.   గోగు  పంట వేసేవాళ్ళు అంతరకృషి చేయడం, మొక్కలను పలుచన చేయడం చేస్తారు. ఇక పంటల నుండి తోటల పెంపకంలోకి వస్తే పండ్ల తోటల సాగు చేసేవారిలో అరటి, మామిడి, జామనాట్లు వేయడం చేస్తారు. అలాగే కొబ్బరి చెట్లకు ఎరువులు వేయడం, రేగు, దానిమ్మ వంటి చెట్ల నాట్లు వేయడం చేస్తారు. పప్పుధాన్యాల తరహా పంటలు పండించేవారు చాలా ఆలోచన చేస్తారు. వీటికి నీటి అవసరం ఎంతో ఉంటుంది.  వర్షాలు ఆలస్యం అయితే కంది పంట విత్తడానికి భూమిని తయారు చేయడం, విత్తడం చేస్తారు.   కూరగాయల పంటలు ఏడాది పొడవునా సజీవి అయినా వీటిని మొదటగా అరుద్రకార్తెలో నాటితే ఏడాది మొత్తం వాటి దిగుబడి బాగుంటుందని నమ్ముతారు.  బీర, సొర, పొట్ల, గుమ్మడి మొదలైన విత్తనాలు విత్తడం చేస్తారు. ఇకపోతే సువాసన మొక్కలు అయిన నిమ్మగడ్డి, కామాక్షిగడ్డి, సిట్రొనెల్లా వంటి నాట్లు కూడా ఇదే సమయంలో వేస్తారు. ఇవన్నీ పెద్దగా సాగులో లేకపోయినా పండిన వరకు ఎన్నో లాభాలు ఇస్తాయి. ఇలా ఆరుద్ర కార్తెలో పంటల సాగులో రైతన్నలు మునిగి తేలతారు.                                   ◆వెంకటేష్ పువ్వాడ.

రెడ్ అలెర్ట్!

రెడ్ అలెర్ట్ అనేది ప్రమాద సూచన. ప్రమాదం ఏ విషయంలో అంటే ఏదైనా కావచ్చు. కానీ అందులో ఉన్న రెడ్ హెడ్లైన్ గా మరి డేంజర్ బెల్స్ మోగిస్తే. ఇదేదో క్రైమ్ సీన్ కు ఎక్స్ప్లేన్టేషన్ ఇచ్చినట్టు ఉందేంటి అనుకోకండి. ఈ రెడ్ అలర్ట్ అంతా మనలో ఉన్న రెడ్ గురించే. అదే అదే మనలో ఉన్న ఎరుపు అంటే మనిషి శరీరంలో ఉండే రక్తమే. అందరి శరీరాల్లో ఉండే రక్తం రంగు ఎరుపు అయినా కొందరి శరీరంలో రక్తం విషయంలో సమస్యలు బాగా వచ్చేస్తున్నాయ్. చాలామంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళల్లో……. భారతదేశంలో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది అనిమియా!! శరీరంలో రక్తం తగినంత లేకపోవడం, రక్తకణాల క్షీణత, హిమోగ్లోబిన్ లోపించడం వంటి సమస్యలు మహిళలను భూతాళ్లా వెంటాడుతున్నాయి. ఎన్నిరకాల మందులు వాడినా అవి వాడినన్ని రోజులు బాగుండి తరువాత మళ్ళీ సమస్య మొదటికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ రక్తహీనత అనే సమస్య మహిళల్లో వేరే సమస్యలను సృష్టిస్తుంది. మహిళల్లో నెలసరి సమస్యలను అటు ఇటు చేసి మహాసికంగా, శారీరకంగా మహిళలను ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. ఇదంతా ఒక కోణం అయితే మరొక కోణం ఉంటుంది. అదే అత్యవసర సమయాల్లో రక్తం దొరకకపోవడం. ఎమర్జెన్సీ!! ఇప్పటి కాలంలో రోడ్ లు, వాహనాల రూపురేఖలు చాలా మారిపోయాయి. ఎక్కడికక్కడ ఆక్సిడెంట్ లు చాలా సాధారణ విషయాలు అన్నట్టు జరిగిపోతూ ఉన్నాయి. అలాంటి సందర్భాలలో బాధితులు హాస్పిటల్ వెళ్లెవరకు బతకడం వారి అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే హాస్పిటల్ కి వెళ్లిన తరువాత అవసరము అయ్యే  రక్తం అనుకున్న సమయానికి దొరకక ఎన్నో ప్రాణాలు గందరగోళంలో పడిపోతున్నాయి.  బ్లడ్ డోనర్స్!! ఈ సమాజంలో బ్లడ్ డోనర్స్ పాత్ర నిజంగా ఎంతో అభినందనీయమైనది. రక్తదాతలు కేవలం రక్తాన్ని దానం చేసినవాళ్ళు మాత్రమే కాదు, ప్రాణాలను దానం చేసినవాళ్ళు, ప్రాణాన్ని నిలబెట్టినవాళ్ళు. కొంతమంది అత్యవసర సమయాల్లో ఎవరైనా ఎమర్జెన్సీ ఉందంటూ కాల్ చేస్తే ఉన్న పనులు వదిలిపెట్టుకుని మరీ హాస్పిటల్స్ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటి బాధ్యతాయుతమైనవాళ్ళు  హాస్పిటల్స్ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటి బాధ్యతాయుతమైనవాళ్ళు  చాలా కొద్దిమంది ఉన్నారు. కనిపించే దేవుళ్ళు అని పిలిచినా వీళ్ల రుణం తీర్చుకోలేము. బ్లడ్ డోనర్స్ డే!! రక్తదాతల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అనే ఆలోచన ఎవరికైనా వస్తుందో లేదో తెలియదు కానీ కొందరు ఈరోజు సామాజిక సేవల కింద రక్తాదాన శిబిరాలు నిర్వహించడం, రక్తాన్ని దానం చేయడం చేస్తుంటారు. మరికొందరు రక్తదానం చేసినవారి ఆరోగ్యం కోసం పండ్లు ఇస్తుంటారు. ఎవరెవరి ఆలోచన వాళ్ళది.  అయితే 1901 సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్ లాండ్ స్టీనర్ అనే వ్యక్తి రక్తాన్ని వర్గాలుగా విభజించారు. ఈయన నోబెల్ బహుమతి గ్రహీత కూడా. రక్తాన్ని వర్గాలుగా విభజించడం వల్లనే ఈరోజు ఇంతమంది ప్రమాధాలలో ఉన్నప్పుడు అత్యవసరంగా వర్గాల వారిగా రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడుతున్నారు. అందుకనే ఈయన పుట్టినరోజు గుర్తుగా రక్తాదాన దినోత్సవాన్ని అదేనండి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ని నివాహిస్తున్నారు.  కొంచెం ఆలోచించండి!! రక్తం అనేది కృత్రిమంగా తయారుచేసే ద్రవం కాదు. అది శరీరంలో ఉత్పత్తి అయ్యేది. మహిళల్లో నెలవారీ రక్తం పోతున్నా తిరిగి తీసుకునే ఆహారపదార్థాలు వల్ల ఆ రక్తం భర్తీ అవుతూ ఉంటుంది. కాబట్టి రక్తాన్ని ఇవ్వడంలో సమస్య ఏమీ ఉండదు. కాకపోతే శరీరంలో రక్తం పుష్టిగా ఉన్నవాళ్లు రక్తాన్ని దానం చేస్తే ఎంతో మంచిది. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవాళ్లు రక్తాన్ని దానం చేయచ్చు. తినే ఆహారం వల్ల వృద్ధి చెందే రక్తాన్ని అప్పుడప్పుడు దానం చేయడం వల్ల మరొకరి ప్రాణాన్ని కాపాడటమే కాకుండా కొత్త రక్తం వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి శరీరంలో రక్తం మలినమైందేమో అనే పిచ్చి ఆలోచనలు కూడా ఉండవు.  ఆలోచించండి మరి. ◆వెంకటేష్ పువ్వాడ.

సముద్రాలకు రక్షణ ఎక్కడ?

బిందువు బిందువు కలిస్తే సింధువు అవుతుంది అనే మాట మనకు అందరికీ తెలిసినదే. చుక్క చుక్క నీటి బొట్టు కలిస్తేనే సముద్రమైనా ఏర్పడేది. లేకపోతే సముద్రానికి మాత్రం రూపమెక్కడ. అంటే సముద్రం ఉనికి చుక్క నీటిబొట్టులో కూడా ఉందని అర్థం. సముద్రాలు ఈ భూమి మీద ప్రధాన పాత్రలు పోషిస్తాయి. నింగి, నేల, నీరు, నిప్పు, గాలి వంటి పంచభూతాలలో నీటిని నింపుకున్నవి సముద్రాలు. ఇవి కేవలం నీటి వనరులుగా కాకుండా ఎన్నో రకాల ఖనిజసంపదలకు  నిలయం. దేశాలను, ఖండాలను వేరు చేస్తూ ఉన్న ఈ సముద్రాలు జలమార్గానికి అనువైనవి. వాణిజ్యానికి అందులో ముఖ్యమైన ఎగుమతులు, దిగుమతులకు ఎక్కువభాగం సముద్రాలే ఉపయోగపడుతున్నాయి. జరుగుతున్న నష్టాలు! సముద్రాలు ఎంత గొప్పవో అందరికీ తెలిసిందే. అయితే చాలామంది వీటిని పుస్తకాల్లో చదువుకోవడం, టీవీలలో చూడటం జరుగుతూ ఉంటుంది. కొందరు మాత్రమే సముద్ర తీర ప్రాంతాలలో నివసించేవారు, పర్యాటకం  మీద ఆసక్తి ఉన్నవారు సముద్రాలను దగ్గరగా చూస్తూ ఉంటారు. అలాంటివాళ్లకు సముద్రపు నీళ్లలో ఎక్కువగా కనిపించేవి ఏవి అని అడిగితే బాగా సమాధానం ఇస్తారు. ఇంతకూ సముద్రపు నీళ్లలో ఎక్కువగా కనబడుతున్నది ఏమిటంటే ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ అనేది కవర్ల రూపంలో ఈ పర్యావరణాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద భూతం అని చెప్పుకోవచ్చు. సముద్రతీర ప్రాంతాలలో ఫ్యాక్టరీలు గనుక ఉంటే ఫ్యాక్టరీలు విడుదల చేసే వ్యర్థాలు, రసాయనాలు, చెత్త అంతా సముద్రంలోకే వదిలేస్తున్నారు. ఫలితంగా సముద్రాలకు చెప్పలేనంత నష్టం వాటిల్లుతోంది. అది మాత్రమే కాకుండా ఈ రసాయనాల ప్రభావం వల్ల సముద్రంలో పెరిగే ఎన్నో రకాల సముద్ర జాతి జీవులు చనిపోవడం మాత్రమే కాకుండా అంతరించిపోతున్నాయి కూడా. స్వార్థపు అడుగులు! మనుషులకు స్వార్థం ఎక్కువ. అందుకే ఎక్కడ ఏమి దొరికినా దాన్ని చేజిక్కించుకుంటూ పోతాడు. అదే పద్దతిలో సముద్రాలను కూడా ఇష్టమొచ్చినట్టు నాశనం చేస్తుంటాడు. సముద్రగర్భంలో లభ్యమయ్యే ఖనిజ సంపదలు అయిన పెట్రోలియం వంటి చమురు నిక్షేపాల కోసం నిక్షేపంగా ఉండే సముద్రాల గర్భాలను అల్లకల్లోలం చేస్తున్నారు. అలాగే సముద్రంలో ఎంతో విలువైన ముత్యాలు, బంగారు గనులు వంటివి కూడా చాలా మిస్టరీగా ఉంటాయి. వాటికోసం ఇప్పటికీ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. సముద్ర గర్భాలలో జరిగే కదలికల వల్ల సముద్రపు విస్ఫోటనాలు, సునామీలు సంభవిస్తూ ఉంటాయి. సముద్రంలో కలుస్తున్న వ్యర్థాల వల్ల చేపలు కూడా విషపూరితంగా మారిపోతూ ఉంటాయి. ఎన్నో అరుదైన సముద్ర జాతులు అంతరించిపోతూ ఉంటాయి.  మన కర్తవ్యం! నిజానికి సముద్రాలకు నష్టం జరుగుతున్న మార్గం తెలిస్తే అవన్నీ అంతర్జాతీయ సమస్యలుగా అనిపిస్తాయి. కానీ మనుషులు పీలుస్తున్న ఆక్సిజన్ లో 70% సముద్రాల నుండి లభిస్తున్నదే అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అలాంటి సముద్రాలు మాత్రం ఆమ్లాన్ని నింపుకుని కలుషితం అయిపోతున్నాయి. సముద్రాల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మత్స్యకారులు మాత్రమే కాకుండా సాముధ్రాంతర్గత కార్యకలాపాల మీద ఆధారపడున్నవాళ్ళు  చాలామంది ఉన్నారు. ఎక్కువభాగం అగ్నిపర్వతాల పేలుళ్లు సముద్రాలలో సంభవిస్తున్నాయి. అదే సముద్రాల మనుగడ కష్టమైనప్పుడు మానవ సంచార ప్రాంతాలలో అవి సంభవిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోండి.  ఇవి మాత్రమే కాకుండా సముద్రాల వలన తెలియని ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయి. వాటి వల్లనే చాలామంది ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. సముద్ర ప్రయాణంలో ఆటుపోట్లు అనేవి ఎలాంటివో సముద్రాలను నాశనం చేస్తే మనుషుల మనుగడ అలాగే అటుపోట్లలో చిక్కుకున్నట్టు అవుతుంది. కాబట్టి సముద్రాలను కాపాడుకోవడం అందరి బాధ్యత. బీచుకు వెళ్తే మీ వంతుగా నష్టం కలిగించకండి మరి.  ◆వెంకటేష్ పువ్వాడ

మృగశిరకార్తెతో జర జాగ్రత్త!

రోహిణీలో రొకళ్ళు పగిలితే మృగశిరలో ముంగిళ్ళు తడుస్తాయి అనే మాట అందరూ వినే వుంటారు.  వైశాఖం, జైష్టంలలో వేసవి విసురుల నుండి ఆషాడంలో కురిసే వర్షాలు కొత్త ఉపిరిని ఇస్తాయి. మృగశిర కార్తె తో మొదలయ్యే వర్షాల సందడితో వ్యవసాయదారులు కూడా బిజీ అయిపోతారు. అయితే వ్యవసాయాన్ని మినహాయించి చూస్తే మృగశిర కార్తె కు ఒక ప్రత్యేకత ఉంది. అదే చేపలు. మృగశిర కార్తె వచ్చిందంటే చేపల కొనుగోళ్ళు ఊపందుకుంటాయి. ప్రతి ఇంట్లో చేపలతో చేసే వంటకాలు ఘుమఘుమలాడుతూ ఉంటాయి. అన్ని మాసాలలో, అన్ని కార్తెలలో లేని ఈ చేపల ఆచారం మృగశిర కార్తెలో ఎందుకొచ్చినట్టూ? చేప రహస్యం! ఇదేమీ చేపలో ఉండే రహస్యం కాదు. చేపలు తినడం వెనుక రహస్యం గురించే ఇక్కడ విషయం. అందరూ చెప్పుకునేదాని ప్రకారం వేసవిలో ఉష్ణోగ్రతల మధ్య నుండి ఒక్కసారిగా మృగశిరలోకి ఎంటర్ అవ్వగానే వర్షాలు, గాలులు చల్లని వాతావరణం వల్ల శరీరానికి ఒకానొక అసౌకర్యం ఏర్పడుతుంది. వాతావరణానికి ప్రభావితమై శరీరం జబ్బులకు లోనవుతుంది. అలాంటి పరిస్థితులను అధిగమించాలనే చేపలు తింటారు. సాధారణంగా ఇలాంటి వాతావరణానికి ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకు చేపమందు పంపిణీ చేయడం అందరూ చూస్తూనే ఉంటారు. ఇలా మృగశిర కార్తెలో చేపలు తినడం వెనుక కూడా అలాంటి ఆరోగ్యకర కారణమే ఉంది.  ఇక చేపలలో  కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజ పోషకాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి మాత్రమే కాకుండా  లైసిన్, మిథియోనిన్, ఐసాల్యూసిన్ వంటి ఆమ్లోనో ఆమ్లాలు పుష్కలంగా ఇందులో లభిస్తాయి. థయామిన్‌, రైబోప్లవిన్‌, నియాసిన్‌, పెరిడాక్సిన్‌, బయోటిన్‌, పెంటోదినిక్‌ ఆమ్లం, బీ 12 వంటి విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్ఏ , ఈపీఏ వంటివి కంటి చూపు మెరుగ్గా ఉండేలా చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. చేపల్లో ట్రై గ్లిసరైడ్స్‌ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది శరీర రక్త పీడనంపై ముఖ్యంగా గుండెపై మంచి ప్రభావం చూపుతుంది. గుండె జబ్బు, అస్తమా వ్యాధిగ్రస్తులు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే చాలా మంచిది. నమ్మకమే వ్యాపారం! కొన్ని నమ్మకాలు వ్యాపారాలను నడిపిస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలు తినాలి అనే నమ్మకమే దీనికి పెద్ద ఉదాహరణ. అలాగని ఇదేమీ మూఢనమ్మకం కాదు ఈ సీజన్ ను అనుసరించి చేపలు తినడం మంచిదే. అయితే ఖచ్చితంగా ప్రారంభం రోజే తినాలనేది కొంచెం అతినమ్మకమే. కానీ ఈ సీజన్ లో వీలును బట్టి చేపలు తినడం అనేది ఉత్తమమైన మార్గం. మరి శాఖాహారుల సంగతేంటో! చేపల్ని పట్టేవాళ్ళు, ముట్టేవాళ్ళు, తినేవాళ్ళు సరే. మరి శాఖాహారులు ఉంటారు వాళ్లకు అనారోగ్య సమస్యలు రావా?? వాళ్లకు రోగనిరోధకశక్తిని పెంచుకునే మార్గం ఏంటి అనే ఆలోచన కనుక వస్తే దానికి కూడా పరిష్కారం చూపించారు మన పెద్దలు. శాకాహారులు బెల్లం, ఇంగువ రెండూ కలిపి దంచి చిన్న గోళీల్లా తయారుచేసి వాటిని తింటారు. బెల్లం స్వతహాగా వేడి చేసి గుణం కలిగి ఉంటుంది. ఇక ఇంగువకు ఆహారాన్ని జీర్ణం చేసే సామర్థ్యము ఎక్కువ. జీర్ణసంబంధ సమస్యలను చక్కగా పరిష్కరిస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల పరిష్కారం దొరికినట్టె, శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. పురాణ కథ! ప్రతి విషయానికి ఒక పురాణ కథ ఉండటం గమనిస్తూ ఉంటాం.  ముఖ్యంగా ఆచారం ప్రకారం వచ్చే కొన్ని సందర్భాలకు ఇవి బలాన్ని చేకూర్చుతూ ఉంటాయి. మృగశిరకార్తె కు కూడా అలాంటి ఒక కథ ఉంది.  పురాణ కథ ప్రకారం మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అనే వృతాసురుడు తనకున్న వరం ప్రభావం వల్ల పశువులను, పంటలను నాశనం వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం, వర్షాలకు అడ్డుపడటం చేసేవాడు. అతనికున్న వరాల వల్ల  అతనిలో అహంకారం ఇంకా ఎక్కువగా ఉండేది. బాగా ఆలోచించిన ఇంద్రుడు సముద్ర అలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి ఆ వృతాసురుడిని చంపేస్తాడు. ఇదీ కథ. అప్పుడు ప్రకృతి మార్పు ప్రభావం ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు వైపు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తెను అందరూ ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇదీ పురాణ పరంగానూ, ఆరోగ్య పరంగానూ మృగశిరకార్తె వెనుక ఉన్న అసలైన విషయం!! ◆వెంకటేష్ పువ్వాడ.

తగ్గేదేలేదంటున్న తాతగారు!

50 ఏళ్ళు దాటిందంటే ఇక వాళ్ళ పని ఖతం, హాయిగా తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, విశ్రాంత జీవితంలోకి మెల్లిగా జారుకుంటారు ప్రతి ఒక్కరూ. అయితే ఒక తాతయ్య మాత్రం తగ్గేదెలేదంటున్నారు. ఇంతకూ ఏ విషయంలో అనే సందేహం వస్తే మనం టోక్యో కబుర్లలోకి వెళ్లిపోవాలి.  జపాన్ కు చెందిన కెనెచీ హోరీ అనే తాతయ్య వయసు అక్షరాలా 83 సంవత్సరాలు. ఇదేమీ పెద్ద నెంబర్ కాదులే భారతదేశంలో వందేళ్లు దాటిన తాతలు బామ్మలు పుష్కలంగా ఉంటారు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మరైతే ఈ హోరీ తాతయ్య ప్రత్యేకత ఏమిటంటా అనే డౌట్ వస్తే తెలుసుకునేయ్యాలి ఇక. హోరీ తాతయ్య వయసు ప్రస్తుతం 83 సంవత్సరాలు. ఈయన జపాన్ కు చెందినవాడు. సముద్రప్రయాణాలు అంటే ఈయనకు అదొక పిచ్చె అనుకోవచ్చు. ఎప్పుడో 23 సంవత్సరాల వయసులో అంటే 1962లో ఈయన సముద్రాలలో అతిపెద్దది అయిన  జపాన్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో వరకు విస్తరించిన పసిఫిక్ మహాసముద్రం ప్రయాణం మొత్తం ఒక్కడే పూర్తి చేశాడు. 23 సంవత్సరాల ఉత్సాహమున్న వయసులో అలాంయి సాహసాలు చేయడం పెద్ద వింతేమీ కాదు అనిపించవచ్చు కానీ ఇప్పుడు  మళ్లీ దాన్ని రిక్రియేట్ చేయడం మాత్రం అద్బుతమే కదా!! ఇప్పుడేంటి విషయం? 83 సంవత్సరాల వయసులో ఈ హోరీ తాతయ్యకు బోర్ కొట్టిందో ఊరికే ఉండటం నచ్చలేదో మొత్తానికి తన గత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ శాన్ ఫ్రాన్సిస్కో నుండి కేవలం ఆరు మీటర్ల పొడవు ఉన్న చిన్న పడవలో ప్రయాణం మొదలుపెట్టి జపాన్ తీరంలో ఉన్న కీ జలసంధికి చేరుకున్నాడు. ఇదంతా 69 రోజులపాటు, 8500 కిలోమీటర్ల ప్రయాణం కావడం గమనార్హం. పెరిగే బిపిలు, పడిపోయే ఉష్ణోగ్రతలు, ఎండ, గాలి, వాన వంటి వాటిని భరిస్తూ 83 సంవత్సరాల వయసులో ఇంత సాహసం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం కదా. ప్రపంచంలో ఈ సముద్ర ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు తెచ్చేసుకున్నాడు హోరీ తాతయ్య. 80 వయసు దాటగానే కంటి చూపు మందగించడం, వినికిడి లోపం రావడం, నీరసం, శరీరంలో ఇబ్బందులు వంటి సమస్యలు అటాక్ అయ్యే పరిస్థితులలో ఒక్కడే ఇంత చేయడం నిజంగా తగ్గేదేలే అని అందరికీ చెప్పినట్టు లేదు. హోరీ తాతయ్య మాత్రం "నా 23 సంవత్సరాల వయసులో నాకు పాస్పోర్ట్ లాంటివి లేకపోయినా కుతూహలం కొద్దీ దొంగగా ప్రయాణం చేసాను. అయినా కూడా అప్పుడు నేను చేసింది సాహసం కాబట్టి అందరూ నన్ను క్షమించేసి నా సాహాసాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేవు.ప్రయాణంలో కూడా కుటుంబసభ్యులతో కాంటాక్ట్ లో ఉన్నాను ఫోన్ ద్వారా అని చెప్పారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే హోరీ తాతయ్య 1974 సంవత్సరంలో సముద్రమార్గ ప్రయాణంలో ఏకంగా ప్రపంచాన్నే చుట్టేసాడు. అందుకే హోరీ తాతయ్య సూపరో సూపర్!! ◆వెంకటేష్ పువ్వాడ.

ఆహారమే మహాభాగ్యం!

మనుషుల శక్తివనరు ఆహారం. ఆహారం ద్వారానే అందరికీ శక్తి లభిస్తుంది. శక్తి ఉంటేనే మనిషి మనిషి తన పనులు తను చేసుకోగలడు. కేవలం ఒక్కరోజు ఆహారం లేకపోతేనే మనిషిలో నీరసం చోటు చేసుకుంటూ ఉంటుంది. అత్యవసర ప్రయాణాలలో ఆహారం దొరక్కపోయినప్పుడు, దేవుడి భక్తిలో భాగంగా ఉపవాసాలు చేస్తున్నప్పుడు ఒక పూట తిండి తినకపోతేనో లేక ఒక రోజు తిండికి దూరంగా ఉంటేనో సాధారణ సమయాల కంటే చురుగ్గా ఉండలేరు. తిరిగి శరీరానికి తగిన మోతాదులో ఆహారం లభిస్తేనే కాసింత పుంజుకుంటారు. జంతువులకు, మనుషులకు, పక్షులకు సకల జీవరాశులకు ఆఖరికి మొక్కల పెరుగుదలకు కూడా ఎరువుల రూపంలో శక్తి అవసరమే. ఇలా ప్రపంచమంతా ఆహారం మీదనే బ్రతుకుతోంది. ఇంకా చెప్పాలంటే ఆహార సంపాదన కోసమే మనుషులు పనులు చేస్తారు కూడా. మరి అలాంటి ఆహారం విషయంలో ఎంతవరకు బాధ్యతగా ఉంటున్నారు అందరూ?? ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు. ఆహారపు అలవాట్లు! చాలామంది అనారోగ్యం పాలవుతున్నది ఆహారం అలవాట్ల వల్లనే. ఈ ప్రపంచంలో అధిక రకాల ఆహారపదార్థాలను విభిన్న రకాలుగా వండుకుని తినే దేశం భారతదేశం అనే మాట వింటేనే తెలిసిపోతుంది. మన దేశంలో ఆహారానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో. ఆదిమ కాలం నుండి అభివృద్ధి చెందిన దేశం వరకు మార్పులను గమనిస్తే ఆహారం విషయంలో చెప్పలేనని మార్పులు, లెక్కలేనన్ని రుచులు వచ్చి పడ్డాయి. చాలామంది ఆహారం విషయంలో జాగ్రత్తగా లేకపోవడం వల్ల ఆరోగ్యాలు పాడుచేసుకుంటారు. ముఖ్యంగా రుచి కోసం చేసే ప్రయోగలలో ఆహారంలో ఉండే పోషకాలు నశించి కేవలం కడుపు నిండుతుంది తప్ప అందులో ఉండే పోషకాలు ఏమి లభించవు. ఇక ముఖ్యమైనది నిల్వ చేసుకోవడం. పచ్చళ్ళు ఉరగాయలు వంటివి ఆనాధిగా వస్తున్నవే వాటిలో ఆరోగ్యాన్ని నాశనం చేసే గుణాలు ఏమీ ఉండవు. వచ్చే చిక్కంతా పాత వంటకాలకు కొత్త మెరుగులు దిద్దుతూ వాటిని కలగాపులగం చేయడం వల్ల. అతి ఎప్పటికైనా నష్టమే అనే విషయాన్ని మరచి ఆ పచ్చళ్ళను కూడా ఇష్టం కొద్దీ తినేయడం వల్ల ఎదురయ్యే సమస్యలు ఉంటాయి అంతే.  ఇవి తప్పిస్తే వండుకున్న పదార్థాలను నిల్వచేయడం, కూరలు పచ్చళ్ళు, అన్నం వంటి వాటిని మళ్ళీ మళ్ళీ వేడి చేసుకుని తినడం, కృత్రిమ రసాయనాలు కలిపిన పళ్ళ రసాలు తాగడం, కృత్రిమ రంగులు జోడించిన పదార్థాలు తినడం సీజన్ దాటిపోయిన తరువాత లభ్యమయ్యేవి, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల పోకడలు ఫాలో అవుతూ అడ్డదిడ్డమైనవి అతి చల్లని పదార్థాలు తినడం చాలా సమస్యలు సృష్టిస్తాయి. వాటిలో పెప్సీ, థమ్సప్, కోలా వంటి యాసిడ్లు నిండిన శీతల పానీయాలు మనుషుల్ని దారుణంగా దెబ్బతీస్తాయి. నిర్లక్ష్యం! గంధపుచెట్లు విరివిగా పెరిగే ప్రాంతాలలో కొందరు ఆ గంధం చెక్కలను పొయ్యిలో పెట్టడానికి వాడతారట. అలాగే ఆహారం పుష్కలంగా లభ్యమయ్యే వాళ్లలో కొందరికి ఆహారం విలువ సరిగ్గా తెలియదు అని చెప్పుకోవచ్చు. ఆహారాన్ని వృధా చేయడం, అతిగా వండటం, దాన్ని కుళ్ళిపోయేలా చేయడం, చివరికి చెత్తబుట్టలోకి వేయడం ఒకరకం అయితే, పెళ్లిళ్లు, ఫంక్షన్స్ లలో ఎన్నో రకాల పదార్థాలు హంగు కోసం వండి చివరికి వేస్ట్ చేస్తూ ఉంటారు. మనిషిలో ఉన్న ఆశ అనేది ఆహారం వ్యర్థం కావడానికి కారణం అవుతోంది. కాబట్టి ఆహారాన్ని చాలా పరిమితంగా జాగ్రత్తగా వాడుకోవాలి. పరిష్కారం! ఆహారం పొదుపు చేయడం అనేది ఎంత గొప్ప విషయమో అలాగే ఆహారాన్ని సృష్టించడం అనేది కూడా అంతే గొప్ప విషయం. ఈ విషయంలో రైతుల కష్టం ఎంతో గొప్పది. వాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలి. వాళ్లకు ఇచ్చే గౌరవం ఏదైనా ఉందంటే వాళ్ళు పండించే ఆహారాన్ని వృధా చేయకపోవడమే. కొన్ని దేశాల్లో మాంసాన్ని ఎండించి నిల్వ చేసుకుని తింటారు. కానీ భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదు. పాడి, వ్యవసాయం, పంటలు అన్నీ బాగుంటాయి. మనుషులు చేయాల్సిందల్లా వీటిని సంరక్షించుకోవడమే. ఒక్క బియ్యపు గింజ పండాలి అంటే ఎంతో కష్టం చెయ్యాలి అనే విషయం గ్రహించాలి. ఆహారాన్ని వృధా చేయకూడదు తినే పదార్థాలను గౌరవించాలి ప్రకృతికి దగ్గర ఉండేలా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి భూమిని సంరక్షించుకోవాలి పిల్లలలో ఆహారం గురించి అవగాహన పెంచాలి. ఆహారమే మహాభాగ్యం మరి! ◆వెంకటేష్ పువ్వాడ

పర్యావరణాన్ని ప్రేమిద్దాం!

ఈ ప్రపంచం ప్రకృతి మీద ఆధారపడింది. భారతదేశం అయినా అమెరికా అయినా చైనా అయినా ఇలా ప్రపంచంలో దేశాలు అయినా ప్రజలు లేని ప్రాంతాలు అయినా మొత్తం అణువణువు ఈ ప్రకృతి ఆవరించి ఉన్నదే. ఈ ప్రకృతిలో నివసించే మనుషులు, జంతువులు, వస్తువులు, వివిధ రకాల జీవులు, చెట్లు ఇలా అన్నిటినీ కలిపి పర్యావరణం అని అంటారు. అయితే ఈ పర్యావరణం కలుషితం అవుతూ ఉంటుంది. వీటికి కారణాలు చెప్పాలంటే బోలెడు ఉన్నాయి. కానీ ప్రధాన కారణం మాత్రం మనిషే. మనిషి చేసే పనులు వలనే పర్యావరణం కాలుష్యానికి గురి అవుతోంది.  ప్రకృతి ప్రేమికులు పర్యావరణాన్ని కాపాడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అందరూ దాన్ని పాటించరు.  పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రణాళికలు, మరెన్నో స్లొగన్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి, ఉంటాయి. కానీ మనుషుల్లో ఆలోచన తద్వారా మార్పు రానప్పుడు ఎవరు ఎంత గీపెట్టి అరిచినా పర్యావరణం బాగవ్వదు, ప్రకృతి ప్రశాంతంగా ఉండదు. ఓజోన్ పొర దెబ్బతినడం, ప్రకృతి విపత్తులు, అకాల వర్షాలు, భగభగ మండే ఎండలు, ఋతువులు అటు ఇటు అయిపోయి వాతావరణం గందరగోళం అవ్వడం, నీటి కొరత, పంటలు సరిగా పండకపోవడం ఇలా చెబితే ఈ పర్యావరణ కాలుష్యం ద్వారా జరుగుతున్న నష్టాలు కోకొల్లలు. విచిత్రంగా పర్యావరణ కలుష్యమని చెప్పేది, వాటి వల్ల నష్టాలు వస్తున్నాయని ఏడ్చేది, తిరిగి ఆ పర్యావరణానికి నష్టం కలిగించేది మొత్తం మనుషులే.  మొక్కల్ని పెంచాలి!! ప్రకృతి పచ్చగా ఉండాలన్నా, వర్షాలు పడాలన్నా మొక్కల పెంపకం ముఖ్యమైనది. పెంచగానే కాదు వాటిని ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉండాలి అప్పుడే నిజమైన పచ్చదనం నిలబడుతుంది. మంచిగా వర్షాలు పడతాయి, ఋతువులు వాటి పని సరిగ్గా చేస్తాయి.  పొల్యూషన్ అరికట్టాలి!! చేతిలో డబ్బులుండాలి అంతే ఎక్కడికైనా మోటార్ వెహికల్స్ వేసుకుని పోవడమే ఈకాలంలో అందరికీ తెలిసినపని. కనీసం నడుచుకుని వెళ్లి చేసే పనులకు కూడా బైకులు వాడే మహామహులున్నారు. భాగ్యనగరం, ముంబయ్ వంటి రాజధాని ప్రాంతాల్లో, ఇంకా అభివృద్ధి చెందిన పట్టణాల్లో వాహనాల ట్రాఫిక్ జామ్ లు చూస్తే పిచ్చెత్తి పోతుంది. జీవన శైలి దృష్ట్యా వాహనాల వాడకం తప్పనిసరి కావచ్చు. కానీ కొందరు అతిగా వాడటం, ముఖ్యంగా యూత్ తమా దూకుడు ప్రదర్శిస్తూ చేసే పనులు కూడా చాలా నష్టమే కలిగిస్తాయి. ఇక ఫ్యాక్టరీల తలనొప్పి గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటిని అరికట్టడం పూర్తిగా ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆవైపుగా ప్రభుత్వాలు అడుగులు వెయ్యాలి. అడవులను రక్షించుకోవాలి, నీటిని పొదుపు చెయ్యాలి!! చెప్పిందే ఎన్నిసార్లు చెబుతారో, అన్నిటికీ ఇదే మాట చెబుతారేంటి వంటి ఆలోచనలు రావచ్చు. కానీ వినేవాళ్ళు వింటున్నారా ఏమైనా. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు ఎవరు వినిపించుకుంటున్నారు. అభివృద్ధి పేరుతో అడవులను నరికేస్తారు, నీటిని కాలుష్యం చేస్తారు. అందుబాటులో ఉన్నాయని ఇష్టమొచ్చినట్టు వాడేస్తారు. జంతువులు నచ్చినంత తింటాయి, నచ్చిన్నత తాగుతాయి కానీ మనుషులే అన్నీ వృధా చేస్తారు. ప్లాస్టిక్ వాడకం అరికట్టాలి!! ఈ కలియుగంలో అతిపెద్ద నష్టం ఏదైనా ఉందంటే అది ప్లాస్టిక్ అనే రాక్షసినే. భూమిలో కలవక, కాలిస్తే గాలిని కాలుష్యం చేసే ఈ భూతం అతిపెద్ద సమస్య అయి కూర్చుంది. అన్ని దేశాలు ప్లాస్టిక్ ను నిషేధించి, కంట్రోల్ చేసి దాని నష్టాన్ని తగ్గించుకుంటూ ఉంటే భారత్ మాత్రం దానిమీద నియంత్రణను తీసుకురాలేకపోతోంది. మనుషులు విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లు వాడేస్తారు. ఇవి మాత్రమే కాకుండా పశువుల పెంపకం, పాడి, వ్యవసాయం ప్రకృతిని కాపాడే మార్గాలు. అభివృద్ధి దేశానికి ముఖ్యమే, కానీ పర్యావరణాన్ని నాశనం చేస్తూ జరిగే అభివృద్ది విపత్తులకు కారణం అవుతుంది. కాబట్టి పర్యావరణాన్ని ప్రేమించాలి సహజంగా ఉంచుకోవాలి.                                   ◆వెంకటేష్ పువ్వాడ.

సాయం విలువ!

  చలికాలం. పైగా ఆ రోజు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ఉదయం ఎనిమిదిగంటలైనా కూడా వెలుగు జాడ కనిపించడం లేదు. జనం ఇళ్లలోంచి అడుగుపెట్టే సాహసమే చేయడం లేదు. ఎవరి ఇంట్లో వాళ్లు అలా వెచ్చగా ఉండగా ఒక నడివయసు మనిషి మాత్రం వీధి పక్కనే కూర్చుని వణుకుతూ ఉన్నాడు. ఇంతలో...ఎక్కడి నుంచో ఒక కారు వచ్చి అక్కడ ఆగింది. అందులోంచి ఒక యువతి బయటకు దిగింది. ఆ నడివయసు మనిషి వంక చూడగానే ఆమె మనసు కరిగిపోయినట్లుంది. నిదానంగా అతని దగ్గరకు వెళ్లింది. ‘‘మీరు చలికి బాగా వణికిపోతున్నట్లు ఉన్నారు!’’ అని అడిగింది ఆ యువత. ఆ మాటలకి పెద్దాయన ఉలిక్కిపడ్డాడు. తనని పలకరించిన యువతిని ఓమారు తేరిపార చూశాడు. ‘సమస్యే లేదు. ఈవిడ బాగా డబ్బున్నావిడే. నా పేదరికాన్ని ఎగతాళి చేయడానికే ఇలా అడుగుతోంది,’ అనుకున్నాడు. అందుకే ‘‘ఆహా బ్రహ్మాండంగా ఉన్నాను. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోతే ఇంకా ప్రశాంతంగా ఉంటాను,’’ అంటూ ఈసడించుకున్నాడు. ఆ మాటలకు ఆమె పెద్దగా బాధపడినట్లు లేదు. పైగా ‘‘మీరు ఆకలిగా ఉన్నారా!’’ అని అడిగింది. ఆ ప్రశ్నకి పెద్దాయన మరింత మండిపడ్డాడు. ‘‘అబ్బే ఇప్పుడే కడుపునిండా భోజనం చేసి వచ్చాను. నేను వదలేసిన తిండితో ఇంకో నలుగురు కడుపు నిండుతుంది,’’ అని నిష్టూరమాడాడు. పెద్దాయన ఎగతాళిని ఆ యువతి అంతగా పట్టించుకోలేదు సరికదా... ఆయన దగ్గరకి వెళ్లి భుజం మీద చేయి వేసి ‘‘పదండి. ఆ హోటళ్లో తింటూ మాట్లాడుకుందాం!’’ అంటూ ఎదురుగుండా ఉన్న హోటల్లోకి ఆయనను నడిపించుకుని వెళ్లింది. ఆ యువతి చర్యతో పెద్దాయనకి నోటమాట రాలేదు. హోటల్ మేనేజరు కూడా ఏదో అనబోయాడు. కానీ యువతి ఖరీదైన దుస్తులు చూసి లేని మర్యాదని తెచ్చిపెట్టుకున్నాడు. ‘‘ఏం కావాలి మేడం!’’ అంటూ వారి టేబుల్‌ దగ్గరకి వచ్చి వినయాన్ని ఒలకబోశాడు. ‘‘ఈయనకి ఏం కావాలో అన్నీ తీసుకురండి,’’ అని హుకుం జారీచేసింది యువతి. యువతి చలవతో పెద్దాయన కడుపునిండా తిన్నాడు. ఆకలి తీరాక, కాస్త వేడివేడి టీ నోట్లో పోసుకున్నాడు. ‘‘ఇదంతా మీరు నాకెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు!’’ అన్నాడు పెద్దాయన కాస్త కుదుటపడిన తర్వాత. ‘‘మీరు ఇంకా నన్ను గుర్తుపట్టినట్లు లేదు జేమ్స్!’’ అంది యువతి చిరునవ్వుతో. ఆ యువతి తనని పేరు పెట్టి పిలవడంతో పెద్దాయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఆశ్చర్యం నుంచి తేరుకునేలోగా ఆ యువతి తన కథని ఆయనకు గుర్తుచేసేందుకు సిద్ధపడింది. ‘‘సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం నేను కాలేజి చదువు ముగించుకుని, ఉద్యోగం కోసం ఈ ఊరికి వచ్చాను. ఎంత తిరిగినా నాకు ఉద్యోగం దొరకనేలేదు. చేతిలో ఉన్న డబ్బు కాస్తా అయిపోయింది. అద్దె కట్టలేదని ఒకరోజు ఇంట్లోంచి కూడా నడివీధిలోకి గెంటేశారు. నిలువ నీడ లేదు, విపరీతమైన ఆకలి. ఆ ఆకలిలో ఏం చేయాలో తెలియక ఇదే హోటల్‌ ముందుకి వచ్చి నిలబడ్డాను...’’ ‘‘అవును ఆ రోజు నాకు గుర్తుంది. అప్పుడు నేను ఇదే హోటల్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. నీకు ఏదన్నా ఆహారం పెడదామంటే దానికి హోటల్‌ నిబంధనలు ఒప్పుకోవని చెప్పాను...’’ అంటూ గుర్తుచేసుకున్నాడు పెద్దాయన. ‘‘అయినా మీరు నన్ను ఈసడించుకోలేదు. నాకు ఆహారం ఇచ్చి, ఆ బిల్లు మీ జేబులోంచి చెల్లించారు. అనుకోకుండా నాకు ఓ చిన్న ఉద్యోగం దొరికింది. ఆ ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ సొంతగా ఓ కంపెనీ పెట్టుకునే స్థాయికి ఎదిగాను. ఈ ఇరవై ఏళ్లలో ఇటువైపుగా వచ్చిన ప్రతిసారీ మీరు కనిపిస్తారేమో కృతజ్ఞతలు చెప్పుకుందామని అనుకున్నాను. మీ గురించి ఎంతగా వాకబు చేసినా లాభం లేకపోయింది. చివరికి ఇవాళ మీరు కనిపించారు. ఇక నుంచి మీకు ఏ లోటూ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది,’’ అంటూ తన విజిటింగ్ కార్డుని అతని చేతిలో పెట్టింది ఆ యువతి. ‘‘అబ్బే ఆ రోజు నేను నీకు చేసిన సాయం చాలా చిన్నదే! అలాంటి సాయం నేను చాలామందికి చాలాసార్లు చేశాను. అంత చిన్న సాయానికి నువ్వు ఎందుకింతగా తిరిగి చెల్లించుకోవాలని అనుకుంటున్నావు?’’ అని అడిగాడు పెద్దాయన. ‘‘కొన్ని సాయాలు మనకి చాలా చిన్నవిగానే తోచవచ్చు. కానీ ఆ చిన్న పనుల ఇతరుల మనసులో కొత్త ఆశలని నింపుతాయి. ఆ రోజు జరిగిన సంఘటనలతో నాకు మానవత్వం మీద నమ్మకం పోయింది, జీవితం మీద విరక్తి కలిగింది. కానీ మీరు చేసిన పనితో మనుషులలో మంచితనం ఇంకా మిగిలి ఉంది అన్న నమ్మకం కలిగింది. ఎలాగైనా జీవించాలన్న ఆశ ఏర్పడింది. మీరు కల్పించిన ఆశకీ, నమ్మకానికీ తిరిగి ఎంత చెల్లించినా తక్కువే కదా!,’’ అంటూ చిరునవ్వుతో బదులిచ్చింది ఆ యువతి. నిజమే కదా!!! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)  

నీడలే కాటేస్తాయ్!

ఆడపిల్లకు మగవాడు రక్షణ. ఈ సమాజంలో ఇలాగే ఉంది. ఒక కూతురికి తండ్రి రక్షణ, తరువాత తమ్ముళ్లు, లేక అన్నలు. తరువాత భార్యకు భర్త రక్షణ, తల్లిదండ్రులు లేక, భర్త లేక నిస్సహాయంగా ఉన్నవారికి భర్త తమ్ముడో, భర్త తండ్రి(మామయ్య), ఇంకా ఇతర బంధాలు కలిగినవాళ్ళు బాసటగా నిలుస్తూ మేమున్నాం అనే ధైర్యం చెబుతూ ఉంటారు. అలాంటి ధైర్యంతో జీవితాన్ని ముందుకు సాగించే వాళ్ళు ఎందరో ఉన్నారు.  అయితే ఇలా మేమున్నామని ధైర్యం ఇవ్వాల్సిన వాళ్లే వెన్నుపోటు పొడిస్తే. ఒక ఆడపిల్లకు ఈ కాలంలో లోపించిన రక్షణ ఏదంటే నిస్సందేహంగా మాన రక్షణ లేదని చెప్పుకోవచ్చు. ప్రతి అడ్డమైన వెధవకూ అమ్మాయిల్ని చూస్తే అదొక కోరిక పుట్టేస్తుంది. వాడు బలవంతుడు అయితే బలవంతంగానే అమ్మాయిల్ని పాడుచేస్తాడు. ఇలాంటివి బయట ఎక్కడో జరిగితే అందరూ అనే మాట ఒకటి ఉంది. ◆"ఉద్యోగమని ఏదో పొడిచేద్దామని తెగ తిప్పుకుంటూ పోయిందిగా ఏమయ్యింది ఎవడో మాయమాటలు చెప్పి ఎక్కడికో తీసుకెళ్లి చేయాల్సింది చేసాడు" ◆"వీళ్ళేదో వీరనారులు అనుకుని ఫీలవుతూ సాయంత్రం అయినా ఇంటికి పోవడంలేదు. ఇక ఏమవుతుంది ఎక్కడో తాగిన వెధవలు చూసి వెంటబడి వాడి పని వాడు చేసుకుపోయాడు" ◆"అయినా ఒంటరిగా పోవడం ఎందుకు?? అంత పర్సనల్ పనులు ఏముంటాయి. ఏదో గూడు పుటానీ ఉంటుందిలే" ◆"బట్టలు సరిగ్గా వేసుకుంటే కదా!! ఫాషన్ పేరుతో వగలు పడతారు. మగవాళ్లను రెచ్చగొడతారు"  ఇలా ఒక్కొక్కరు ఒకో మాట మాట్లాడతారు ఎక్కడైనా ఏదైనా రేప్ జరిగిందని తెలిస్తే. సరే వీటన్నిటికీ కారణాలు ఉంటాయి. కానీ వేరే సంగతి ఏంటి?? తాగిన మత్తులో కూతుర్ని తండ్రి బలవంతం చేయడం. భర్త చనిపోయి ఇంట్లో ఉంటున్న కోడల్ని మామ బలవంతం చేయడం. అన్న భార్య మీద మనసు పడి మరిది వదినను బలవంతం చేయడం. సమాజంలో వావి వరుస అనేవి ఎప్పుడో అంతరించి పోయాయి అనే డైలాగ్ కు నిదర్శనంగా ఎక్కడ చూసినా ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి.  వీటన్నిటికి ఎవరు ఏమని సంజాయిషీ ఇస్తారు??  జాగ్రత్తలు కావాలిప్పుడు!! ఇలా జరుగుతున్నప్పుడు ఎవరు ఎవరినీ ఏమనీ నిందించలేం. చాలామంది జరుగుతున్న వాటికి కారణాలు చెప్పి, విమర్శలు చేసి, శిఖలూ వేస్తారు కానీ పరిష్కారాలు ఏంటి అనేది మాత్రం తక్కువే. ఇక్కడ పరిష్కారం అంటే అమ్మాయిలకు నష్టం జరిగిపోయాక వేసే శిక్షలు, ఇచ్చే నష్టపరిహారాలు అనుకుంటున్నారు అందరూ. కానీ అది చాలా తప్పు, అది కాదు కావాల్సింది అసలు ఇలంటివి జరగకుండా చూడాలి. అమ్మాయిలు తమను తాము రక్షించుకోగలిగే సామర్థ్యము కలిగి ఉండాలి. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలి. ఈ కాలానికి తగ్గట్టు ఒకరి మీద ఆధారపడటం మానేయాలి, అలాగే మగవాళ్లను చనువుగా మాట్లాడించడం మానుకోవాలి. లేకపోతే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే మహామహులు ఉంటారు.  తోడుగా!! అమ్మాయిలకు జరుగుతున్న ఈ ఘోరాలను ఆపాలి అంటే ఒకరి నుండి మరొకరికి సపోర్ట్ చాలా అవసరం. అమ్మాయిలు ఏదైనా చెయ్యాలని అనుకున్నప్పుడు ఒంటరిగా కాకుండా కలసికట్టుగా చెయ్యాలి. స్నేహితులు, చుట్టాలు, చనువుగా ఉన్నవారు ఇలా మగవాళ్లను ఎవరిని కూడా అతిగా  నమ్మేయకూడదు. ఎవరితో కూడా వెళ్లకూడదు.  పైనవి ఎన్ని చెప్పుకున్నా ఈ సమాజంలో పక్కనుండి ఇలా పాముకాటు వేసేవాళ్ళు ఎక్కువైపోతూనే ఉన్నారు. అందుకే అమ్మాయిలూ…… జాగ్రత్త!!                                 ◆వెంకటేష్ పువ్వాడ.

సన్నద్దానికి పలు మార్గాలు!

ఎల్. కె.జీ బుడ్డోళ్ల నుండి గ్రూప్స్, సివిల్స్ టార్గెట్ గా ఉన్న యంగ్ డైనమిక్స్ వరకు అందరికీ ఈ కాలంలో పరీక్షల గోల తప్పదు, పుస్తకాలు పట్టుకుని చదవడం అంతకన్నా తప్పదు. ఒకప్పుడు ఇంట్లో పెద్దోళ్ళు బెత్తం పట్టుకుని, ముందు కూర్చుని పిల్లలకు చదివించేవాళ్ళు. ఇప్పుడు నువ్వు చదువుకొని ఎక్సమ్స్ బాగా రాయిరా బాబు నీకు కావలసింది కొనిస్తాం అని లంచాల ఆశ చూపిస్తారు. ఇదంతా పిల్లొళ్ల గోల. మరి పెద్దోళ్ళ గోల సంగతేంటి?? బుక్ తీస్తే పక్కనే ఉన్న మొబైల్ టింగుమని వాట్సాప్ లేదా fb మెసేజ్ అలర్ట్ ఇస్తుంది. మొబైల్ ను దూరంగా పెట్టేసామా కుంకుమపువ్వొ, కార్తీక దీపమో లేక ఇంకా వేరే ఛానెల్స్ పేర్లయినా పెటుకొండి వాటి తాలుకూ డైలాగులు హింసగా సాగిపోయే సెంటమెంట్లు, పిన్ చేంజ్ పెన్సిల్ లాగా పైకి కిందకి ఎక్కి దిగుతూనే ఉంటాయి. వాటి గోల ఒకటి. పోనీ అవి కూడా లేనప్పుడు, మొబైల్  దూరంగా ఉన్నప్పుడు, చదువుకోడానికి ఇంటరెస్ట్ పుట్టినప్పుడు అప్పుడే ఇంట్లో అమ్మ, లేదా నాన్న టింగుమని పిలిచి బయట షాపుకెళ్లి ఏదో ఒకటి తెమ్మని చెబుతారు.  ఇలా యూత్ కు మా చెడ్డకాలం నడుస్తూ ఉంటుంది. దాన్ని మార్చుకోవడానికి ఒక్కొరు ఒకో దారి ఎంచుకుంటారు, వాటిని ఫాలో అవుతారు.  ఇంతకూ ఏంటవి?? ఫ్రెండ్స్ తో గ్రూప్ స్టడీ!! ఇందులో బాగుపడటానికి ఎంత అవకాశం ఉంటుందో, చెడిపోవడానికి అంతే అవకాశం ఉంటుంది. చదువుకోవాల్సిన టైమ్ లో చదువుకోకుండా  మూడు కోతులు కలిసి నాలుగో కోతిని కూడా చెడగొట్టినట్టు కాస్తో, కూస్తో చదవాలనే ఇంటరెస్ట్ ఉన్నోడు కూడా నాశనం అయిపోతాడు. కాబట్టి సీరియస్ గా ప్రిపేర్ కావాలని అనుకున్నవాళ్ళు కలసి గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ చదివితే చాలా కొద్ది సమయంలోనే బోలెడు డౌట్స్ క్లియర్ అయిపోతాయి. పైగా ఒక్కొక్కరు ఒకో బుక్ తెచ్చుకుని నలుగురు డిస్కస్ చేసుకుంటే అన్నీ అర్థమవుతాయి. కావాల్సిందల్లా సీరియస్నెస్ మాత్రమే.  ఏకాంతం!! చాలామంది బుక్స్ ఎత్తుకుని ఏ పార్క్ కో, లేక ఏ చెట్ల కిందకో వెళ్ళిపోతారు. అబ్బాయిలకు ఈ మార్గం బాగానే ఉంటుంది. కానీ అమ్మాయిలకు ఇబ్బంది. సెక్యూరిటీ ఉండదు. పైగా ఏదైనా వేరే బుక్ లేదా నోట్స్ లాంటివి అవసరం అయితే తిరగడానికి టైమ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి సైకిల్, బైక్ ల మీద వెళ్లే వాళ్లకు ఇది కొంచెం బెస్ట్. లైబ్రరీ!! అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఇదే. ఎలాంటి భయం ఉండదు, బుక్స్ చేతుల్లో మోసుకుపోవాల్సిన అవసరం ఉండదు. న్యూస్పేపర్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి హాయిగా రెగులర్ కరెంట్ అఫైర్స్ తో పాటు జనరల్ నాలెడ్జ్ రౌండ్ కొట్టేయచ్చు. అలాగే పోటీ పరీక్షలకు కావల్సిన ఎన్నో బుక్స్ లైబ్రరీలలో ఉంటాయి కాబట్టి చక్కగా చదివేసుకోవచ్చు. అనవసర చర్చలు, మాటలు లేకుండా కీప్ సైలెన్స్ బోర్డ్ ఉంటుంది కాబట్టి ఏ గోలా లేకుండా హాయిహయిగా ఇంటరెస్ట్ గా చదివేయచ్చు. ఇలా ఒకటికి మూడు మార్గాలతో నచ్చిన దారిలో పుస్తకాలతో కుస్తీ పడితే పరీక్షల అంతు చూడచ్చు. ఎడ్యుకేషన్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఎలిజిబుల్ ఎక్సమ్ కావచ్చు. అన్నిటినీ చీల్చి చెండాటమే కావలసింది.  అయితే ఓ మాట. చదివే ముందు మరీ ఫుల్లుగా తినద్దు, తినకుండా చదువులో మునగద్దు, తాగడానికి ఒక మంచినీళ్లు బాటల్ దగ్గరే పెట్టుకోండి. ఇక బస్ చదుకోండి!!                                ◆వెంకటేష్ పువ్వాడ.

ఒక్కసారి ఇటు చూడండి!

★కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఎందుకుచుకు పంచాయతీ పరిధిలోని జీలగలగండి కాలనీ ఉంది. కాలనీలో  700 మంది ప్రజలు ఉంటారు. వాళ్ళందరూ మూడు కిలోమీటర్ల దూరంలో పొలాల్లో ఉండే బావులతో మంచినీళ్లు బిందెలతో తెచ్చుకుంటారు. ★ఎలూరు జిల్లాలోని 215 పల్లెలకు తాగునీరందించే సత్యసాయి రక్షిత నీ పథకం మూలన పడింది. వింజరం పంచాయతీలో బక్కబండారు గూడెంలో 200 మంది గిరిజనులకు ఆ నీళ్లే దిక్కుగా ఉండేవి. వీళ్ళు 5 కిలోమీటర్ల దూరంలో ఆర్వో ప్లాంట్ కు వెళ్లి నీళ్ల క్యాన్ లు కొనుక్కోచ్చుకుంటారు. ఒకవైవు నీళ్లు, మరోవైపు వెహికల్స్ పెట్రోల్ ఖర్చు. ★ కర్నూలు జిల్లా  ఆస్పరి మండలంలో డి. కోటకొండరి అనే ఊరుంది. అక్కడ మూడు బోర్లున్నా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ప్రభుత్వాలు ట్యాంకర్లతో వాటర్ సప్లై చేయలేదు. అక్కడున్న 2500 దూరంగా ఉన్న పొలాలలో నీళ్లు తెచ్చుకుంటారు. ఒకేసారి ఎనిమిది బిందెలు. రిక్షా లాంటి మూడుచక్రాల బండిలో. ★ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంలో ప్రయివేడులో 100 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ నీటి సదుపాయం మాయమయ్యింది. ఒక బోర్ లో రోజుకు కేవలం గంట సేపు మాత్రమే నీళ్లొస్తాయ్. ఆ గంటసేపులో వందకుటుంబాలు ఇంటికి సరిపడా నీళ్లను పట్టుకోగలరా?? పై విషయాలు అన్నీ ఏంటి న్యూస్ ఛానెల్ లో టెలికాస్ట్ చేసినట్టు వాయిస్ మాత్రమే తక్కువయ్యింది అనిపిస్తుంది ఇవి చదివే అందరికీ. ఇవి కేవలం అక్కడక్కడా నీటికి కొట్టుమిట్టాడుతున్న గ్రామాలు, గ్రామాలలో నివసించే ప్రజల సంగతి మాత్రమే. నీటికోసం ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. కానీ కొందరికి నీళ్ళంటే విలువ తెలియడం లేదు. సరికదా డబ్బు పెడుతున్నాం, నీటి సౌకర్యం ఉంది, కాబట్టే వాడుకుంటాం అనే అహంకార ధోరణికి పోతారు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం వాళ్లకు ఎదో చెయ్యమని వాళ్ళను ఉద్ధరించమని కాదు. అలాంటి పరిస్థితి మనకూ వస్తే!! అనే ప్రశ్న వేసుకోవడం. రోజూ రెండుపూటలా స్నానాలు, హాయిగా సింక్ టాప్ ఆన్ చేసి అంట్లు కడుక్కోవడం, షవర్ ఆన్ చేసి నీళ్లతో ఆటలు ఆడటం,  నీళ్లను ఇష్టానుసారం  వేస్ట్ చెయ్యడం ఇలా చాలా రకాలుగా నీటి శాతాన్ని తగ్గించేస్తూ ఉన్నాం. పైన చెప్పుకున్నట్టు నీటి కొరత ఏర్పడితే?? కనీసం బిందెలు మోయడం కూడా మర్చిపోయిన పట్టణ ప్రజలలో నీటి ఎద్దడి వచ్చి పడితే, ఉదయం ఎప్పుడో ఆఫీసులకు వెళ్లి రాత్రిప్పుడో ఇంటికి చేరుకునే ఉద్యోగాల మధ్య, ఆడ, మగ అనే తేడా లేకుండా ఉరుకులు, పరుగుల జీవితాలలో కనీసం ఒక్క బిందె నీళ్లు స్వయంగా తెచ్చుకోగలమా?? అప్పుడొకసారి చెన్నై లో నీటికి ఎద్దడి ఏర్పడి చివరికి ట్రైన్లలో నీళ్లను చేరవేసి అక్కడి ప్రజల గొంతులు తడిపిన కథనాలు అందరూ మరచిపోగలరా??  ఉన్నప్పుడు నీటిని సరైన విధంగా జాగ్రత్త చేసుకోకపోతే విదేశాల శైలిలో టాయిలెట్ పేపర్లు, టెంపరరీ వంట పాత్రలు, బట్టలు, ఇతర వస్తువులు ఉపయోగించాల్సి వస్తుందేమో కదా!!  అసలు ఇవన్నీ తలచుకుంటే చేతిలో ఉన్న ఒక గ్లాస్ నీళ్లే అమృతంలాగా అనిపించేయవూ. వర్షం నీటిని భూమిలో ఇంకెలా చేయడమో, మొక్కల్ని పెంచడం, నీటిని జాగ్రత్తగా వాడుకోవమూ ఇవన్నీ ప్రతి ఒక్కరూ చేస్తే భవిష్యత్తులు కాస్త బాగానే ఉంటాయి. లేదూ మాకు ఏమి అవసరం అని అంటారా?? సరే పోండి మీ ఖర్మ!! భవిష్యత్తరాలు ఏడుస్తూ ఉంటాయంతే!! ప్రకృతి కూడా మనుషుల స్పందనలకు ప్రతిస్పందలను ఇస్తుంది.             ◆ వెంకటేష్ పువ్వాడ.

పల్నాడు యుద్ధం నిజంగా జరిగిందా?? యుద్ధానికి కారణాలు ఏంటి?

భారతీయ చరిత్రలో రాజులు, రాజ్యాలు, యుద్ధాలు అన్నీ ఎంతో ఆసక్తిని కలిగిస్తాయి. వాటి గురించి వినడం, తెలుసుకోవడం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలనాడు ప్రాంతంలో జరిగిన పల్నాడు యుద్ధం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే బ్రహ్మనాయుడి పేరు కూడా ఎంతో గొప్పగా వెలిగింది. నిజంగానే పల్నాటి యుద్ధం జరిగిందా?? దానికి కారణాలు ఏంటి??  పల్నాటి యుద్ధం నిజంగా జరిగింది. ఈ యుద్ధం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు జరిగింది చరిత్రకారులు గుర్తించారు. చరిత్ర గ్రంధాలలో కూడా పూర్తి వివరాలతో వ్రాయబడింది. పలనాడు (ఈనాటి గుంటూరు జిల్లా ) వెలనాటిచోడుల సామంతులైన హైహయ వంశస్థులు (యాదవులు) అధీనంలో ఉండేది.పలనాటి పరిపాలకుడు 'అనుగురాజు' వెలనాటి గొంకరాజు కుమార్తె అయిన మైలాంబను వివాహం చేసుకుని తన పరపతిని పెంచుకున్నాడు. వారిద్దరికి  నలకామ/నలగామ అనే కొడుకు పుట్టాడు. అతడికి మరో ఇద్దరు భార్యలు. వాళ్ళ  పేర్లు వీరవిద్యా దేవి, భూరమదేవి. వీరవిద్యా దేవి కొడుకులు పెద మలిదేవ, చిన మలిదేవ, బాల మలిదేవ.  భూరమ దేవి కొడుకులు కామరాజు,నరసింగ రాజు, జత్తి రాజు, పెరుమాళ్ళు రాజు.  అంతఃపుర కలహాలతో అనుగురాజుకి పరిస్థితి దుర్భరంగా మారింది. ఆఖరికి అనుగు రాజు హత్య చేయబడ్డాడు. అతడి మరణం తరువాత క్రీ.శ.1170లో నలగామ' పల్నాడు పాలకుడయ్యాడు. కానీ అతడు తన మంత్రియైన రేచర్ల బ్రహ్మనాయుడి చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. రేచర్ల బ్రహ్మ నాయుడు వెలమ కులస్థుడు. ఆనాడు ఆంధ్ర దేశంలో వీర వైష్ణవ, వీరశైవ మతాలు ప్రాచుర్యం పొందుతున్నాయి. బ్రహ్మ నాయుడు వీరవైష్ణవ మతావలంబి. ఆ మతాన్ననుసరించి, వేర్వేరు కులాలమధ్య బేధాలు తొలగించి, సహపంక్తి భోజనాలు, దళితులకు ఆలయప్రవేశం చేయించడం మొదలైన సామాజిక సంస్కరణలు చేపట్టాడు .నలగామకు ఇవన్నీ రుచించలేదు. అతడు తమ హైహయ వంశీకులందరి వలె శివభక్తుడు. ఈలోగా బ్రహ్మనాయుడు నలగామ సవతిసోదరులను మంచిచేసుకున్నాడు. నలగామ కి నచ్చజెప్పి పెదమలిదేవకు చిన్న సంస్థానం వంటిది ఇప్పించాడు. తరువాత బ్రహ్మనాయుడి సహాయంతో ఆ చిన్నరాజ్యం బాగా అభివృద్ధి చేసి మాచెర్ల రాజధానిగా చేసుకున్నాడు. ఈలోగా నలగామరాజు దగ్గర నాగమ్మ అనే రెడ్డి కులానికి చెందిన స్త్రీ నాయకురాలిగా చేరింది. ఆమె శివభక్తురాలు. మాచెర్ల అభివృద్ధి చెందడం చూసి, అది చేజిక్కించుకోవడానికి నలగామ, నాగమ్మలు పధకం ప్రకారం పెదమలి దేవుడిని కోడిపందాలకి ఆహ్వానించారు. పందెంలో తన రాజ్యం ఓడిపోయాడు పెదమలిదేవుడు. అందువల్ల 7 సంవత్సరాలు రాజ్యం విడిచిపెట్టి ఏడు సంవత్సరాలయ్యాక బ్రహ్మనాయుడు రాజైన పెద మలిదేవుడికి రాజ్యం తిరిగి ఇవ్వాలని కోరాడు. కానీ నలకామ అందుకు ఒప్పుకోలేదు. ఈ కారణం వల్ల సవతి సోదరుల మధ్య యుద్ధం మొదలయింది. క్రీ.శ.1185 లో కారెంపూడిలో నాగులేటి ఒడ్డున మహా సంగ్రామం జరిగింది. నలకామ పిలుపుకి స్పందించి కాకతీయులు, హోయసల, కోట, కాలచూరి, వెలనాటి చోడులు యుద్ధంలో పాల్గొన్నారు. మూడురోజుల్లో ముగిసిన యుద్ధంలో పెద మలిదేవుడు పక్షం ఓడిపోయింది. తనవారందరూ మరణించడంతో విరక్తి చెందిన బ్రహ్మనాయుడు పలనాడుని శాశ్వతంగా విడిచిపెట్టి తీర్ధయాత్రలకి వెళ్ళిపోయాడు. ఈ యుద్ధం వెలనాటి చోడులకు తమ సామంతులపై నియంత్రణ కోల్పోయారని లోకానికి వెల్లడైంది. ఈ బలహీనత గ్రహించిన కాకతీయులు 12 శతాబ్ధం చివరికల్లా కోస్తాంధ్ర ప్రాంతాన్ని కాకతీయ రాజ్యంలో భాగం చేసుకున్నారు. ఈ యుద్ధంలో గెలిచిన,ఓడిన పక్షాల నాయకులు (ఆంధ్ర నాయకులు) కాకతీయ రాజ్యంకి వలసపోయి, కాకతీయ సైన్యంలో నాయకులుగా ప్రసిద్ధి చెందారని, వారే కాకతీయ రాజ్య పతనానంతరం ముస్లింల దాడిని ఎదుర్కోవడానికి 'నాయక సమాఖ్య' గా ఏర్పడ్డారని చరిత్రకారుల కధనం. ఓడిపోయిన బ్రహ్మనాయుడి పేరు అంత గొప్పగా ఎందుకు మారింది అనే సందేహం అందరికీ వస్తుంది. ఆ కాలానికే కులమతాలను పక్కనపెట్టి అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టినవాడు బ్రహ్మనాయుడు. ఆయన్ను ఒక సంఘసంస్కర్తగా చెప్పుకోవచ్చు.  ◆వెంకటేష్ పువ్వాడ.

ఈ దొంగకు మీరూ ఫాన్ అయిపోతారు!!

మార్చి 19, 1987 ముంబై పోలీసు ప్రధాన కార్యాలయంలో అరవింద్ ఇనామ్‌దార్‌కు అత్యవసరమైన ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ లో అరవింద్ కు త్రిభువన్ దాస్ భీంజీ జావేరీ వారి ఒపెరా హౌస్‌ శాఖలో ఏదో తేడా జరుగుతుందనే విషయం చెప్పారు.  ముంబై నగరంలోని ఒపెరా హౌస్ ప్రాంతంలో చాలా ఆభరణాల దుకాణాలు ఉంటాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధ ఆభరణాల వ్యాపారి త్రిభువన్ దాస్ భీంజీ జావేరీ(టి.బి.జెడ్)లో సిబిఐ దాడి జరిగింది. బృందం లోపలికి వచ్చి, షట్టర్ క్రిందికి లాగి, సిబ్బందిని ఇంకా ఖాతాదారులను "రిజిస్టర్లను పరిశీలించేవరకు వేచి ఉండండి కాల్ ద్వారా అరవింద్ తెలుసుకుంటారు"  అని చెప్పారు.  సాధారణంగా సిబిఐ దాడులు జరిగినప్పుడు ఎలాంటి ఫోన్ కాల్స్ జరగకుండా ఎవరితో మాట్లాడకుండా ఎప్పుడూ పాటిస్తుంది సిబిఐ. అలాగే ఇక్కడ కూడా జరిగింది. కానీ అదంతా జరిగిన తర్వాతనే ఆయనకి తేడా కొట్టింది. సిబిఐ టీమ్ చాలా ఆభరణాలతో బయలుదేరినట్లు ఇనామ్‌దార్‌కు కాల్ చేసి చెప్పారు ఆభరణాల షాప్ లో పనిచేసేవాళ్ళు.  అది అతనికి వింతగా అనిపించింది. అరవింద్ అక్కడికి తన టీమ్ తో ఆ ఆభరణాల షాప్ ల దగ్గరకు చేరుకున్నాక తెలిసిన  విషయాలు అతనికి మరింత విచిత్రంగా అనిపించాయి. ఆ సిబిఐ టీమ్ మొత్తం అక్కడే ఉంది. కేవలం వారి నాయకుడు - మోహన్ సింగ్ తప్ప. అసలు ఈ మోహన్ సింగ్ ఎవరూ అనే అనుమానం అందరికీ వస్తుంది. అదే అనుమానం అరవింద్ కు కూడా వచ్చింది.  లోతుగా విచారిస్తే ఇది అసలు సిబిఐ బృందం కూడా కాదు, వారు ఏదో ఒక ఉద్యోగం వస్తుందనే ఆశతో ఉన్న బృందసభ్యులు మాత్రమే అని ఆయనకు తెలిసింది. ఇదేంటి ఏదో ఒక ఉద్యోగం కోసం సిబిఐ లా రైడ్ చేయడం ఏంటి అని అనుమానం ఈ దొంగతనం గురించి మొదటిసారి వినేవాళ్లకు కూడా వస్తుంది.  విషయం ఏమిటంటే  "ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్స్ పోస్ట్ల కోసం డైనమిక్ గ్రాడ్యుయేట్లు కావాలి" అని కోరుతూ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రకటన వేయించాడు మోహన్ సింగ్. అసలే నిరుద్యోగుల దేశం కదా. ఆ ప్రకటన చూసి ఇంటెలిజెన్స్ విభాగం మీద ఆసక్తి ఉన్న ఎంతో మంది అప్లై చేసుకున్నారు. ఇంటర్వ్యూ కోసం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తాజ్ ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌కి రావాలని ప్రకటనలో ఆయన చెప్పారు. అలా మోహన్ సింగ్  చివరకి ఇరవై ఆరుగురు వ్యక్తులని ఎన్నుకున్నాడు. వారిలో అప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేస్తున్నా దానికంటే మెరుగైన ఉద్యోగం కోసం వెతుకుతున్నవాళ్ళు కొందరు ఉన్నారు.   ఈ ఇరవై ఆరు మందిని మరుసటి రోజు ఉదయం 11 గంటలకు రిపోర్ట్ చేయమని ఆ తరువాత మోహన్ వారికి గుర్తింపు కార్డులను అందజేస్తానని చెప్పాడు. వచ్చిన గంట తరువాత, సింగ్ వాళ్ళందరిని బస్సులో ఎక్కించి  "మనమిప్పుడు ట్రయల్ రెయిడ్ కోసం టి.బి.జెడ్ కు వెళ్తున్నాము. కాబట్టి మీరు మీ బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఫైనల్ గా జాబ్ కు సెలెక్ట్ అవుతారు" అని చెప్పాడు వాళ్లకు. బస్సు ప్రయాణంలో వాళ్ళందరిని ఆయన ఎంత తయారు చేసారంటే అక్కడికి చేరాక వారి ప్రవర్తన టి.బి.జెడ్ సిబ్బంది అందరికి నిజమైన సిబిఐ అధికారుల రైడ్ లాగే అనిపించింది. దాడి జరుగుతున్న మధ్యలో సింగ్ చుట్టూ తిరుగుతూ కొన్ని షోకేసులలో ఆభరణాలను 'శాంపిల్స్' గా తీసుకొని వాటిని పాలిథీన్ సంచులలో పెట్టి, ప్రభుత్వ ముద్రను చూపించే స్లిప్‌లతో సంచులని మూసారు. మోహన్ ఆ సంచులను తీసుకుంటూ దగ్గరలో ఉన్న మరో దుకాణంలో తనిఖీ చేస్తాను, నాకోసం వెయిట్ చేయండి అని తన సిబ్బందికి చెప్పాడు. తరువాత అతను బస్సులో ఎక్కి, తిరిగి హోటల్‌కు వెళ్లి, ఖాళీ చేసి, టాక్సీ ఎక్కి, మధ్యలో ఒక చోట ఆటోలోకి మారి వెళ్ళిపోయాడు. ఈ విషయం అంతా నిజమైన సీబీఐ ఆఫీసర్  అరవింద్ అక్కడ చేరుకున్నాక తెలుసుకోగలిగాడు. ఆ తరువాత మోహన్ సింగ్ కోసం ఎంత వెతికినా ఎంత ప్రయత్నించినా అతడు దొరకలేదు.  కొన్ని నెలల తరువాత తాజ్‌లో విచారించినప్పుడు మోహన్ సింగ్ త్రివేండ్రంకు చెందినవాడు అని తెలిస్తే, పోలీసులు దేశం మొత్తం అప్రమత్తం చేయించి, ఒక బృందాన్ని కేరళకు పంపారు. జార్జ్ అగస్టిన్ ఫెర్నాండెజ్ అనే వ్యక్తిని అక్కడ అరెస్టు చేశారు, కాని అతను ఒక చిన్న దొంగ అని తెలియడంతో అతనిని వదిలేసారు. పోలీసులు దేశ వ్యాప్తంగా ఎన్ని విధాలుగా ఎంత ప్రయత్నించినా మోహన్ సింగ్ ను పట్టుకోలేకపోయారు. చివరికి మోహన్ సింగ్ దొరకలేదు.  ఈ దోపిడీకి  మోహన్ సింగ్ ఎంతో తెలివిగా ఆలోచించాడు. చిన్నా చితకా హోటల్‌ను ఉపయోగించకుండా, చాలా ఖరీదైన తాజ్ నే వాడాడు. ఇంటెలిజెన్స్ వర్గాలు మరీ డబ్బా హోటల్స్ లో ఇంటర్వ్యూలు చేస్తాయా అనే అనుమానం రాకూడదు అండ్ మోహన్ సింగ్ మీద అటు హోటల్ వారికి, ఇటు అతని దగ్గరకు వచ్చిన వారికి అనుమానం రాకుండా.  అతడు కొత్తగా ఎంపిక చేసుకున్న వ్యక్తులకు ఒకరి గురించి మరొకరికి తెలియదు అంతే కాదు మోహన్ సింగ్ గురించి కూడా తెలియదు కాబట్టి వాళ్ళను తెలివిగా వాడేసుకున్నాడు. ఆభరణాల షాప్ లో సిబ్బందికి రియల్ సీబీఐ అనిపించేలా వాళ్ళను ప్రిపేర్ చేయడమే అతని తెలివికి నిదర్శనం. చివరి విషయం ఏంటంటే ఇంతచేసినపుడు ఇదంతా సినిమాటిక్ గా ఉందని అనుకుంటారు అందరూ. కానీ విచిత్రంగా సినిమాటిక్ రేంజ్ లోనే అతను తప్పించుకుని మాయమైపోయాడు. ఎక్కడైనా తేడా జరిగితే అనే జంకు లేకుండా ఇంత చేసాడు అంటే అతడు ఎంతో ధైర్యవంతుడు కదా. దొంగే కావచ్చు, తప్పే చేసుండచ్చు. కానీ దొరకకుండా తప్పించుకోవడం అతడి తెలివితేటలు విన్న తరువాత దొంగను కూడా హీరోలా మెచ్చుకునేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మీకు ఏవైనా సినిమాలు గుర్తొస్తాయేమో!!                               ◆వెంకటేష్ పువ్వాడ.