మూగ జీవాలు మనసు రాగాలు

మనిషికో మాట గొడ్డుకో దెబ్బ!! ఇది పెద్దల మాట.  ప్రస్తుత కాలంలో ప్రేమ, అభిమానం, నమ్మకం ఇవన్నీ దొరుకుతున్న సందర్భాలు చాలా తక్కువ. మనిషికి మనిషికి మధ్య అర్థం చేసుకునే సామర్థ్యము చాలా తగ్గిపోయింది.పసిపిల్లలు, మూగజీవాల దగ్గర దొరికే ఆనందం, ప్రేమ మరెక్కడా దొరకవు అనేది ఒప్పుకోవలసిన నిజం. ముఖ్యంగా జంతువులతో స్నేహం చేసేవారి మనసు ఎంతో జాలి, దయ, కలిగి ఉంటాయని అంటుంటారు.  జంతువుల పెంపకం ఎలా ఎక్కడ మొదలయ్యిందో కానీ, మనిషికి, ప్రకృతికి మధ్య ఈ జంతువులు అనుసంధాన కర్తలుగా మారిపోయాయని చెప్పవచ్చు.  మొదట అవసరాల కోసం జంతువులను పెంచుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు అదొక విలాసవంతమైన జీవితానికి స్టేటస్ లా మారిపోయింది. కాసింత అన్నం పెట్టామంటే రోజంతా ఇంటి ముందరే ఉంటూ తమ విశ్వాసాన్ని ప్రకటిస్తాయి. ఎక్కడికైనా వెళ్తుంటే వెంట వచ్చి నేనున్నా నీతో అనే స్నేహహస్తాన్ని ఇస్తాయి. ప్రమాదాలను పసిగడతాయి, రక్షణ కల్పిస్తాయి. ఇలా బోలెడు సంగతులున్నాయి పెంపుడు జంతువుల గురించి.  అయితే కాలంతో పాటు కొన్ని మారినట్టు జంతువుల విషయంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని జంతువుల ఉనికి మెల్లిగా మాయమైపోతోంది. పక్షులు, జంతువులు మానవుడి నాగరిక కృత్యాలకు అంతరించిపోతున్నాయి.  మాంసం, అవయవాలు, చర్మం వీటికోసం కొన్ని జంతువులను మనిషి చంపుకుంటూ పోతూ చివరికి ఆ జంతు జాతులను అంతం చేస్తున్నాడు. అడవి జాతుల జంతువులు ఇలానే తగ్గిపోయాయి, ఇంకా తగ్గిపోతూ ఉన్నాయి. అడవులను ఇష్టానుసారం నరికేయడం వల్ల వాటికి నివసించే వెసులుబాటు లేక, అవి ప్రజల మధ్యకు వస్తున్నాయి కానీ, లేకపోతే వాటికి అడవిలో ఉన్నంత హాయి మరెక్కడా ఉండదని ఆలోచించరేం?? జంతువులను హంగు కోసం పెంచేవాళ్ళు ఉంటారు. అలాంటివాళ్ళు వాటిని కట్టేస్తూ, కొడుతూ, వాళ్ళు చెపినట్టు వినాలని, వాటి నుండి ఎంటర్టైన్ పొందాలని చూస్తారు. ఇది చాలా తప్పు అని విషయం మాత్రం వాళ్ళు గ్రహించరు. డబ్బు పెట్టి పెట్స్ ను కొనుక్కున్నంత మాత్రాన వాటిని హింసించే అధికారం ఎవరికి ఉండదు అనే విషయం అందరూ తెలుసుకోవాలి.  పిల్లలకు ప్రేమ, జాలి, దయ పెంపొందాలంటే మొక్కల పెంపకం, జంతువుల పెంపకానికి మించిన ఉత్తమ మార్గం వేరొకటి లేదని చెప్పాలి. జంతువులను ట్రీట్ చేసే విధానం, వాటికి ఆహారం పెట్టడం, అసహ్యించుకోకుండా ఉండటం వంటివి పిల్లలకు నేర్పాలి. ముఖ్యంగా వీధి కుక్కలు, పిల్లులు,పిచ్చుకలు, కాకులు  మొదలైనవాటికి ఆహారం, నీరు వంటివి పెట్టడం ద్వారా వ్యక్తిత్వ విలువు పెరగడం గమనించవచ్చు. జంతు సంరక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చినా అవన్నీ కూడా చట్టలుగా మిగలకుండా ఆచరణలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ వాటి విషయంలో బాధ్యతగా ఉండాలి.  అయితే ఈ పెంపుడు జంతువుల విషయంలో మరొక విషయం కూడా చెప్పుకోవాలి. ప్రస్తుత కాలం  అనుసరించి మనిషికి సంక్రమించే జబ్బులకు జంతువులు కూడా కాస్తో, కూస్తో కారణం అవుతున్నాయి. కాబట్టి వాటిని పెంచుకోవడంలో అభ్యంతరాలు ఉండకూడదు కానీ, వాటిని పడక గదిలో, వంటగదిలో, అందరూ భోజనం చేసే స్థలాలు మొదలైన వాటికీ దూరంగా ఉంచాలి. వాటిని ముద్దుపెట్టుకోవడం వంటివి చేయకూడదు.  జంతువులు కూడా ఈ ప్రపంచంలో మనుషులతో పాటు నివసించే జీవులే. వాటి కంటే మనిషి పరిధి విస్తృతం అయినంత మాత్రాన వాటిని తక్కువగా చూస్తూ వాటి పట్ల అమానుషంగా ప్రవర్తించకూడదు.  అక్టోబర్ 4, world animal day సందర్భంగా అయినా ఈ విషయాలు పిల్లలకు కూడా తెలియబరిచి జంతువుల పట్ల మనుషుల వైఖరి ఉన్నతంగా ఉండేలా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే జంతువులు మునుషులకంటే ఉన్నతమైన హృదయం కలిగినవి మరి!! ◆ వెంకటేష్ పువ్వాడ  

జై జవాన్ జై కిసాన్ జయహో శాస్త్రీజీ!!

అక్టోబర్ 2 ప్రత్యేకత ఏమిటని అడిగితే భారతమంతా గాంధీ పేరు చెబుతుంది. కానీ దేశం కోసం పాటు పడిన శాస్త్రీ గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. భారత చరిత్రలో గర్వంగా చెప్పుకోదగ్గ పేరు లాల్ బహదూర్ శాస్త్రీ. విలువల జీవితాలు ఎప్పుడైనా చదవాలని అనిపిస్తే అందులో మొదటి వరుసలో లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితాన్ని చేర్చవచ్చు. స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి, గాంధీకి నెహ్రు కు ఎంతో ప్రియమైన వ్యక్తిగా మెలిగిన శాస్త్రి గారి గురించి భారత ప్రజలకు సరిగా తెలియని ఎన్నో ఆసక్తికర  విషయాలు ఉన్నాయి. భారతదేశానికి మొట్టమొదటి రైల్వే మంత్రిగా పనిచేసిన శాస్త్రి గారు, తరువాత హోం మినిష్టర్ గా,  తరువాత ప్రధానమంత్రిగా కూడా చేసినా మరణించే వరకు తనకంటూ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోలేదు అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. అణువంత స్థానం దొరకగానే దొరికిన వరకు దోచుకోవాలని అనుకునే రాజకీయాల్లో ఎంతో నిజాయితీ కలిగిన శాస్త్రి గారిలాంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు.  శాస్త్రి గారి వ్యక్తిత్వమెలాంటిదో ఒక చిన్న ఉదాహరణ!! లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన పెద్దకొడుకు హరికృష్ణ శాస్త్రి అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ రాగానే ఎంతో సంతోషించిన హరికృష్ణశాస్త్రి మరుసటిరోజు లాల్‌ బహదూర్‌ శాస్త్రి గారి దగ్గరకు వెళ్లి, తనకు ప్రమోషన్ వచ్చిన విషయం  తెలిపాడు. అప్పుడు శాస్త్రి గారు ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేను ఊహించగలను. ఇప్పుడు ప్రమోషన్ ఇస్తారు మళ్లీ కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయం చేయమని నీ ద్వారా నాదగ్గరకు వస్తారు. నేను వాళ్లకు సహాయం చేశాను అనుకో  దేశ ప్రజలు ఏమనుకుంటారో తెలుసా!! శాస్త్రి గారి అబ్బాయి పనిచేసే కంపెనీ కాబట్టే శాస్త్రి గారు సహాయం చేసారు అని అనుకుంటారు. నీటి నిజాయితీల ఆధారంగా, ధర్మ బద్దంగా ఉండాల్సిన ప్రధానమంత్రి కొడుకు కోసం ఆ సంస్థకు సహాయం చేసారు అని చెప్పుకుంటారు.  నేనే అలా.చేస్తే సామాన్య ప్రజలు ఇలా విలువల గురించి ఆలోచిస్తారా??  నీకూ తెలుసు. పాలకుల నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’’ అన్నారట. లంచాల కోసము, కొడుకుల భవిష్యత్తు కోసం ఎన్నెన్నో స్కామ్ లలో దిగుతున్న నేటి రాజకీయ నాయకులు అలవాటు చేసుకోవలసిన వ్యక్తిత్వం శాస్త్రి గారిది. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో సైనికుల కోసం, దేశంలో ఆహారం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోకుండా, సొంతంగా మన దేశమే అధిక దిగుబడులు సాదించాలంటే రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో  "జై జవాన్ జై కిసాన్" నినాదాన్ని భారతానికి అందించిన శాస్త్రి గారు, ఆయన జీవితం, ఆయన నమ్మిన విలువలు, ఆచరించిన విధానం అన్ని కూడా ప్రతి ఒక్కరికి గొప్ప పాఠాల్లాంటివి!! కాదంటారా?? ◆ వెంకటేష్ పువ్వాడ

గాంధేయ మార్గమే భవిష్యత్ సోపానం!!

మామ కాని మామ ఎవరు?? చందమామ!! బావ కాని బావ ఎవరు?? కాకి బావ!! కోడి కాని కోడి ఏది?? పకోడి  చిన్నపిల్లలకు సరదాగా చెప్పే ఈ మాటల్లో మరొకటి చేర్చాలి. యావత్ భారతము ఒక్కే పలుకుగా పలికే మరొక మాటను కూడా చేర్చాలి. ప్రతి కుటుంబంలో పిల్లలు, పెద్దలు అందరూ తమ సొంతమన్నట్టు ఆప్యాయంగా పిలుచుకునే పలుకు చేర్చాలి. అదే… తాత కాని తాత ఎవరు?? గాంధీ తాత!! ప్రతి ఒక్కరూ ఏక కంఠంగా చెప్పే మాట ఇది. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుల జాబితాలో మొదటగా స్మరించుకునే పేరు మహాత్మా గాంధీ!! ఎందరో ఎన్నో పోరాటాలు చేసినా గాంధీని ఎక్కువగా చెప్పుకోవడానికి కారణం ఏమిటని చూస్తే కనిపించేదే అహింసా ఆయుధం!! నిజమా చెప్పాలంటే ప్రతి మనిషిని తమ జీవితంలో దేన్నీ వదిలేస్తే హాయిగా సంతోషంగా ఉండగలడో దాన్నే వదిలి పోరాటం చేయమన్నాడు గాంధీ!!  బాపూజీ అని కూడా పిలుచుకునే మన గాందీ జీవితం విశ్లేషణగా తెలుసుకుంటే ఎన్నో అర్థమవుతాయి. మానసికంగా, వ్యక్తిగతంగా కూడా ఎంతో మార్పు మనిషిలో చోటు చేసుకుంటుంది!!  అహింసా ఆయుధం!! చాలామంది గాంధీ అహింసను భోదించాడు దానివల్ల నష్టం ఎంతో జరిగిందని అనుకుంటారు కానీ ఆ అహింస అనే మార్గం అప్పటికప్పుడు పుట్టినది కాదు. ఆయన జీవన ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో సందర్భాల ఫలితాల నుండి పుట్టినదే ఆ ఆలోచన. ఇది అర్థం చేసుకోలేని వారు నిజంగా ఆలోచనా శక్తి లేనివాళ్లే అనుకోవాలి. ప్రతి మనిషి మరొక మనిషిని, లేదా జంతువును, లేదా పక్షులను ఇలా ఇతర జీవులను హింసించే స్వభావం అంతర్లీనంగా కలిగి ఉంటారు. వాటిని కొన్ని మార్గాల ద్వారా నిర్మూలించుకుని హింసకు దూరంగా ఉంటూ సకల జీవులను ప్రేమించే గుణాన్ని పెంపొందించుకోవచ్చు. అయితే ఆ హింసా ప్రవృత్తిని వదిలిపెట్టకపోతే మనిషిలో సాత్విక గుణం అనేది నశించిపోయి మృగానికి సమానమైన వ్యక్తిత్వానికి చేరుకుంటాడు. అందుకే అహింసా మార్గం ఎంతో గొప్పది. చిన్న పిల్లలకు కూడా బాగా తెలిసిన కథ మూడు ప్రమాణాలు, వాటినే three promises  అనే పేరుతో కథలుగా చెబుతుంటారు కూడా. గాంధీ దక్షిణాఫ్రికా ప్రయాణంలో తల్లికి చేసిన ప్రమాణాలు లేదా మాటలే ఎంతోమందికి మార్గదర్శకాల వంటివి. మద్యానికి దూరంగా ఉండటం మాంసాన్ని దూరంగా ఉండటం స్త్రీల మీద వ్యామోహం లేకుండా ఉండటం. ప్రస్తుత సమాజంలో ఈ మూడింటి వల్ల నష్టపోయేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ముఖ్యంగా, మద్యం,  స్త్రీల మీద వ్యామోహం ఉన్న మగవాడు బాగుపడుతున్న ఛాయలు ఎక్కడా లేవనేది నిజం. సత్యాగ్రహ సాధనం ఆయుధాలు చేతబట్టి యుద్ధంతో చేయలేని పనిని మౌనాన్ని ఆయుధంగా చేసుకుని సాదించడ్సమ్ ఎలాగో నేర్పినవాడు మహాత్ముడు. చంపారన్ సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం ఇలా ఎన్నో గాంధీ ఆధ్వర్యంలో జరిగాయి. వీటిలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ "do or die" అని దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు ఎంతో శక్తిమంతంగా పనిచేసింది. ఇంకా తన నూలు తానే వడకటం, తన బట్టలు తానే ఉతుక్కోవడం,  గాంధీ తన ఆశ్రమంలో క్రమశిక్షణగా ఉంటూ అందరికి ఆదర్శవంతంగా ఉండటం చూస్తే!!  మనిషి మరొకరికి ఏదైనా చెప్పే ముందు తాను సక్రమంగా ఉండాలి అని విషయం గుర్తొస్తుంది. దేశానికి, ప్రపంచానికి అహింసాను భోదించింది, సత్యమేవ జయతే అనే మాటను విశ్వసించి, దాన్ని అక్షరాలా తన జీవితంలో ఆచరణలో పెట్టిన మహాత్ముడి గురించి ఇలా నాలుగు మాటలు చెప్పుకుని నిశ్శబ్దం అవ్వకూడదు. నేటి బాలలకు గాంధీ జీవితాన్ని పరిచయం చేసి విలువల కోటలను నిర్మించాలి. ◆ వెంకటేష్ పువ్వాడ

జీవితాన్ని అప్డేట్ చెయ్యండి

కాల గమనంలో జీవిత చిత్రం మునపటిలా లేదు. చాలా మార్పు వచ్చింది. ప్రపంచం ఇపుడు స్మార్ట్ ఫోన్ రూపంలో మన చేతిలోకి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే స్మార్ట్ ఫోన్ మనిషికి శరీరంలో భాగం అయిందంటే అతిశయోక్తి కాదు. ఈమధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూసి ఆశ్చర్యపోయాను. ఫోన్ వ్యాపకంలో పడి ఆటో లో బాబుని మర్చిపోయు వెళ్తుంది. అది గమనించిన ఆటో డ్రైవర్ ఆ పాపని ఎత్తుకొని వెళ్లి ఫోన్ ప్రపంచంలో ఉన్న తల్లికి ఇస్తాడు. ఇదీ పరిస్థితి  పత్రికల్ని చదవడానికి ఆన్లైన్ న్యూస్, బ్రష్ పేస్ట్ నుంచి కూరల్లో కరివేపాకు వరకు ఆన్లైన్ ఆర్డర్స్, స్నాక్స్ కావాలంటే స్విగ్గీ జామాటో లో నచ్చినవి ఇంటికి తెచ్చిపెట్టే సంస్థలు. వీటన్నింటికీ ఆవాసం స్మార్ట్ ఫోన్. అందుకే ఇది లేకుండా ప్రస్తుత జీవన విధానాన్ని ఊహించలేము. ఇంట్లో కూర్చున్న కుర్చీలోంచి లేవకుండా కావాల్సిన అవసరాలు తీరిపోతాయి.  అయితే వీటి కారణంగా మనిషి తెలియని ఒత్తిడికి లోనవుతున్నాడు. ఆర్డర్ చేసినవి సక్రమంగా వచ్చాయో లేదో! లేకుంటే తిరిగి ఆర్డర్ చేయడం, చేసినదానికోసం పడిగాపులు కాయడం, ఒక సైజ్ ఆర్డర్ చేస్తే ఇంకో సైజ్ రావడం ఇలాంటివన్నీ మనిషి కచ్చితత్వాన్ని ప్రశ్నిస్తాయి. అంతేకాదు  అంతర్లీనంగా బద్దకాన్ని  కూడా అలవాటు చేస్తుంది. ఈ కొత్త లైఫ్ స్టైల్ లో కొన్ని అవసరం లేని సౌకర్యాలను కత్తిరించుకొని బద్దకానికి ఆలవాలం అయిన వాటిని ట్రిమ్ చేస్తే జీవితం స్మాట్ గా ఉంటుంది. పొద్దున్నే పేపర్ కొని చదవండి. ఇంట్లోకి కనీస అవసరాలు అయిన వంట సామాను, కూరగాయలు, పేస్ట్, బ్రష్ షాప్ కి వెళ్లి స్వయంగా కొని తెచ్చుకోండి. బయట ప్రపంచం స్థితిగతులు,మార్కెట్ హెచ్చుతగ్గులు తెలుస్తాయి. వాస్తవిక ప్రపంచానికి దూరం కాకుండా ఉంటారు. అప్డేట్ అంటే అర్థం ఉన్న స్థితి కంటే ఇంకా సౌకర్యం అయిన స్థితికి రూపాంతరం చెందటం. కానీ ఇక్కడ మనం అచేతనమైన స్థితికి దిగజారుతున్నాము. అందుకే అవసరం లేని సౌకర్యాలను తీసేసి ఆరోగ్యకరమైన జీవితంగా అప్డేట్ చేసుకోండి. అప్పుడే సమాజం చేతనవంతమై ప్రకాశిస్తుంది. ◆ వెంకటేష్ పువ్వాడ  

మనసు తెరచి హృదయానికి వైద్యం చేద్దాం!!

సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే గా నమోదు అయింది. అయితే ఈరోజున ఇప్పటి పరిస్థితుల గురించి మాట్లాడుకోవడం కాసింత బాధగా అనిపిస్తుంది. కారణం గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి ఏడాదికి పెరుగుతూ పోవడమే. గత రెండు సంవత్సరాల నుండి అయితే ఈ గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు. కారణం మహమ్మారి కరోనా!! ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 18.6 మిలియన్ల మంది గుండె సంబంధ సమస్యల వల్ల మరణిస్తున్నారంటే దాని ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మనుషుల జీవన సరళిలో అలవాట్లు అయిన ధూమపానం, మద్యపానం, మధుమేహం, ఊబకాయం వంటివి కాకుండా బయటి నుండి ఎదురయ్యే వాయుకాలుష్యం వంటివి కూడా గుండె సమస్యలకు కారణం అవుతాయి.  సమస్య ఎక్కడ?? జీవన శైలిని మారుతున్న కాలానికి తగ్గట్టు మార్చుకుంటే పర్వాలేదు కానీ ఆ మారుతున్న కాలంతో పూర్తిగా లీనం చేస్తే శరీరానికి నష్టం కలుగుతుంది. అలాంటివే ఆరోగ్య సమస్యలు. మానవ శరీరానికి కొన్ని నియమాలు, మరికొన్ని మార్గనిర్దేశకాలు ఎప్పటి నుండో ఉన్నాయి. అయితే వాటిని మూలన పడేసి కాలంతో పరిగెడుతూ కాలం తెచ్చే మార్పులకు శరీరాన్ని మౌల్డ్ చేస్తే శరీరం ఇబ్బంది పడక ఇంకేమి చేస్తుంది. మనిషి మానసికంగా కాలానికి తగ్గట్టు మారాలి. శారీరకంగా ఒక పటిష్టమైన వలయాన్ని నిర్మించుకోవాలి. ఇది ఎవరు గుర్తించడంలేదు కాబట్టే ప్రస్తుత కాలంలో శరీరం జబ్బులకు లోనవుతోంది. వాటిలో గుండె సమస్య కూడా ఒకటి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, పనులు చేయకపోవడం, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం మొదటి కారణాలు. పరిష్కారాలు ఏమిటి?? గుండె సంబంధ సమస్యలకు మొదటి పరిష్కారం మానసిక ప్రశాంతత. కానీ మనుషులు మానసికంగా కష్టపడుతూ, శారీరకంగా నష్టపోతున్నారు. శారీరకంగా కాశగాపడి, మానసికంగా బలపడటం మంచి మార్గం. అలాగని చాలా కష్టం చేసేయ్యక్కర్లేదు. గుండె సంబంధ సమస్యలు లేనివాళ్ళు శారీరక కష్టం ఎక్కువ చేస్తే ఆ సమస్యలు ఏవి దరిదాపుల్లోకి రావు.  ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండాలి. దీనివల్ల ఒక నిశ్చింత. సినిమాలు, పార్టీలకు ఖర్చు పెట్టె డబ్బును ఆరోగ్యం కోసం ఖర్చు చేయవచ్చు కదా!! అందుకే చెకప్ అనేది ముఖ్యమైనది. ఈ కరోనా కాలంలో చెకప్ లకు వెళ్లలేక చాలామంది ఇబ్బంది పడ్డారు. అలాంటి వాళ్ళు ఆన్లైన్ లో డాక్టర్ ను కన్సల్ట్ అవ్వడం ఉత్తమం. ఇంటర్నెట్ సౌకర్యం లేనివాళ్ళు, అవగాహన లేనివాళ్ళు చుట్టుపక్కల చిన్న క్లినిక్ లలో ఉన్న డాక్టర్ల సహాయంతో ఆన్లైన్ కన్సల్ట్ అవ్వచ్చు. కరోనా వల్ల ఎవరితో ఎక్కువగా కలవలేకపోతున్నామని బెంగ అక్కర్లేదు. మొబైల్ లోనే కాన్ఫెరెన్సు కాల్స్, వీడియో కాల్స్ వంటి వాటితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ స్నేహితులు మరియు బంధువుల నుండి భరోసా పొందొచ్చు. తిండి, నిద్ర, వ్యాయామం చాలా ముఖ్యమైనవి. ప్రతి రోజు వీటి విషయంలో జాగ్రత్తలు అవసరం ఏమి తింటున్నాం అనే విషయం నుండి, నిద్ర, వ్యాయామం విషయంలో ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోవాలి.  ఇష్టమైన పనిని ఇష్టంగా చేయడం వల్ల మనసుకు హయిగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచే మార్గమిది. అనవసర విషయాలు నెత్తిమీదకు వేసుకుని ప్రశాంతతను పోగొట్టుకోకూడదు. "Heart donation is the promotion of humanity"  ప్రతి సంవత్సరం గుండె సంబంధ సమస్యలతో మరణిస్తున్నవారి సంఖ్య 18.6 మిలియన్ల మంది అయితే అన్ని కారణాల వల్ల ప్రతి సంవత్సరం మరణిస్తున్నవారి సంఖ్య 60 మిలియన్లుగా నమోదు అయింది. దీన్ని బట్టి చూస్తే యాక్సిడెంట్లు, ఆకస్మిక మరణాలు వంటి వాటి ద్వారా మరణించే వారి గుండెను దానం చేయడం వల్ల 18.6 మిలియన్ల మరణాల్లో కనీసం ఒక్కరి ప్రాణాన్ని రక్షించగలిగినా ఈ సమాజంలో మానవత్వపు ఛాయలను పెంపొందించవచ్చు. రేపటి తరానికి మనం ఇవ్వగలిగే అతిగొప్ప బహుమతి కూడా ఇలాంటి మనవత్వపు విలువల ప్రాముఖ్యత తెలియజేయడమే. కాబట్టి బతికున్నతవరకు గుండెను కాపడుకోవడమే కాదు, చనిపోయిన తరువాత గుండెను దానం చేయడం వల్ల కూడా మళ్లీ బతికే అవకాశం పుష్కలంగా ఉంది సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ

నేటి బాలలే రేపటి దేశముదుర్లు

మన తెలుగు క్యాలెండర్ లో ఎంతో గొప్పధనం ఉంది. వారాలు, తిథులు, నక్షత్రాలు, నెలలు, ఋతువులు, పండుగలు, సంవత్సరాలు ఇలా ఎన్నో. పిల్లల భాషా సామర్త్యానికి వీటన్నింటినీ ప్రాథమికంగా నేర్పడం మొదటి మెట్టు అని నమ్మేవాళ్ళు ఒకప్పుడు. తల్లిదండ్రుల నుండి బడిలో ఉపాధ్యాయుల వరకు అందరూ కూడా వీటిని బోధించేవారు. అయితే రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు అనే  పెద్దల సామేత ఇప్పుడు నిజమైందని అనుకోవచ్చు. అవును మరి పిల్లల విషయంలో, ముఖ్యంగా చదువు విషయంలో ఎటు పోతోంది ఈ సమాజం అని ప్రశ్నించుకోవలసి వస్తోంది. ఏమి నేర్పుతున్నారు అసలు?? ఈకాలంలో పిల్లలు పుట్టగానే వారిని ఏ కోర్స్ లో చేర్పించాలి, ఏ ఫీల్డ్ లో తోయాలి, ఏ వృత్తిలో చూడాలి వంటివి నిర్ణయం జరిగిపోతున్నాయంటే పిల్లల మీద ఎంత ఒత్తిడి పెంచుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు అమ్మా, నాన్నా అనే మాటలు వదిలి మామ్, డాడ్ అనే మాటలే పిల్లల తొలిపలుకులు  అవుతుంటే తెలుగు వారిగా సిగ్గుపడాలి కదా అనిపిస్తుంది.  నర్సరీలు, ఎల్.కె.జీ లు, యు. కె.జీ లు వీటితోనే ర్యాంకుల గోల మొదలై, ప్రాథమిక తరగతిలో ప్రాథమికోన్నత చఫువులు, ప్రాథమికోన్నత తరగతిలో ఐటి చదువులు, ఇలా అంతకంతకూ పిల్లల మానసిక సామర్త్యాన్ని అర్థం చేసుకోకుండా చదువుల పట్టిక పెంచుకుంటూ, తమ పిల్లలు తొందరగా అన్ని నేర్చుకుని గొప్ప ఉద్యోగాలలో చేరిపోవాలని తల్లిదండ్రులు, పిల్లలు మంచి ర్యాంకులు తెచ్చుకుంటే తమ విద్యాసంస్థలకు మరింత ఆర్థిక స్థాయి మరియు పేరు కూడా మెరుగవుతుందని విద్యాసంస్థలు ఇలా ఆలోచిస్తూ పిల్లల గురించి మాత్రం కొద్దిగా కూడా ఆలోచించడం లేదు.  ఏమి జరుగుతోంది?? ఈ విపరీత ధోరణి వల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరిగి చదువు అంటేనే విరక్తి కలిగేలా తయారవుతున్నారు. చదువును పోటీగా తీసుకోవడం వల్ల దాన్ని ఆస్వాదించలేకపోతున్నారు.  ప్రతినిత్యం టార్గెట్లు, ర్యాంకుల వలయంలో నలిగిపోతూ, చదవకపోతే ఎదురయ్యే పనిష్మెంట్లు, తల్లిదండ్రుల నుండి ఎదుర్కోవలసిన తిట్లు మొదలైన వాటికి భయపడి కృత్రిమంగా పుస్తకాలలో విషయాన్ని చదువుతూ, పరీక్షలు రాస్తూ, ర్యాంకులు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ కృత్రిమత్వం అంతా కలగలిసి వారి జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తోంది. మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ కనుమరుగై ఎలాగైతే పుస్తకాలను యాంత్రికంగా తిరిగేశారో అదే విధంగా మనుషుల విషయంలో కూడా చేస్తున్నారు. ఫలితంగా మనుషుల మధ్య బాంధవ్యాలు చాలా పెళుసుగా ఉంటున్నాయి. చిన్నచిన్న గొడవలకే బంధాలను తెంచుకోవడానికి సిద్ధమైపోతున్నారు.  ఏమి చేయాలి?? పిల్లలకు చిన్నతనం నుండే జీవిత విలువలు తెలిసేలా చేయాలి. పిల్లలకు చదువు ముఖ్యమే, ఇంగ్లీష్ భాష ప్రస్తుత పోటీ ప్రపంచానికి అవసరమే. అయితే ఇక్కడ గుర్తించాల్సింది మాతృభాషలో పిల్లల మానసిక నైపుణ్యం పదింతలు మెరుగ్గా పెంపొందుతుంది. మాతృభాషలో ఉన్న జీవం, అందులో అర్థమైన నవరసాలు వేరే ఇతర భాషలో పిల్లలు గ్రహించలేరు. దీనివల్ల పిల్లల్లో ఒకానొక ఆస్వాదించే గుణాన్ని చిన్నతనంలోనే కోల్పోతారు.  పిల్లలు ఎన్ని భాషలలో చదువుకున్నా ఇంట్లో మాతృభాషలో మాట్లాడేలా అలవాటు చేయాలి. చాలామంది తల్లిదండ్రులకు పిల్లలు చిన్నతనంలోనే మొబైల్స్, గాడ్జెట్స్, సిస్టం ఆపరేట్ చేస్తుంటే చాలా గొప్పగా సంబరంగా చెప్పుకుంటారు. దానివల్ల పిల్లలకు ఎదురయ్యే చెడు గురించి పెద్దలు పెద్దగా పట్టించుకోరు. కాబట్టి వాటిపై దృష్టి పెట్టాలి. కళల ద్వారా పిల్లలు తొందరగా నేర్చుకునే నైపుణ్యాన్ని సాదించగలుగుతాడు. పిల్లలను సంప్రదాయ ఆటల్లో మరియు, స్కిల్స్ పెంపొందెందుకు ఉపయోగపడే ఆటలలో ప్రోత్సహించాలి. కథలు చెప్పడం, కథలు చెప్పించడం, పిల్లలతో చిన్న చిన్న సంఘటనలు రాయించడం ఇలాంటివి చేయడం వల్ల పిల్లల దృష్టి విస్తృతం అవుతుంది. చివరగా పిల్లల విషయంలో తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్త పిల్లలను పిల్లలుగా ఉండనివ్వాలి. బాల్యాన్ని ఆస్వాదించేలా చేయాలి. ఎప్పుడైతే సంపూర్ణ బాల్యాన్ని వాళ్లకు అందివ్వగలుగుతామో వాళ్ళు సంపూర్ణ మేధస్సును పెంపొందించుకుని, ఉపయోగించుకోగలుగుతారు. ◆వెంకటేష్ పువ్వాడ

శాంతి కపోతాలను తయారు చేద్దాం

ప్రతి మనిషి తన జీవితంలో ఎక్కువగా అనే మాట మనశాంతి కరువైంది అని. ఈ మనశాంతి మనసులో ఎలాంటి అలజడులు లేకుండా కలిగే ఒకానొక అనిర్వచనీయ భావన. అయితే ఇది కేవలం మనిషికి మాత్రమే కాదు. మనిషి నుండి సమాజానికి, సమాజం నుండి రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం ఇలా అన్నిటికి పాకుతూ ఉంటుంది. ఒక మనిషి విషయంలో దీన్ని మనశాంతి అని సంభోదిస్తే, సమాజం, రాష్ట్రం, దేశం, ప్రపంచం వీటన్నిటి కోణంలో శాంతి అని పిలుస్తాము.  సెప్టెంబర్ 21ని ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే కేవలం ఇలా జరుపుకోవడంతో శాంతి చేకూరుతోందా?? దేశాల మధ్య సామరస్యత కోసం, యుద్ధాలు జరగకుండా ఉండాలని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఈ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని అయినా కాసింత ప్రశాంతంగా ఆలోచించాలిప్పుడు. ప్రారంభం ఎక్కడ?? హింస అనేది మనిషితో మొదలై సమాజంలో వేళ్ళూనుకుని అది కాస్తా పెరిగి పెద్దదై రాక్షసి రూపం దాల్చి సమాజాన్ని, దేశాన్ని ప్రపంచాన్ని కూడా అతలాకుతలం చేస్తుంది. ఇరుగు పొరుగు ఇళ్లలో మనుషులు కొట్టుకున్నట్టు, గొడవ పడినట్టు, ఇరుగు పొరుగు దేశాల గొడవలు, యుద్ధాలు. ఇవన్నీ మెల్లిగా మొదలై విశ్వరూపం దాల్చే విషవాయువులు. ఎంతో మందిని బలితీసుకుంటాయి. చర్యలు ?? ప్రపంచ దేశాల మధ్య శాంతి కోసం జరిగే ఒప్పందాల కంటే మనుషుల మధ్య కలగాల్సిన అవగాహన చాలా ఎక్కువ ఉంది. ఇది ముమ్మాటికీ నిజం. కులం పేరుతోనో, మతం పేరుతోనో, ఆర్థిక, సామాజిక అసమానతల వల్లనో మనుషులను మనుషులు ఇబ్బంది పెట్టుకోవడం, బాధపెట్టుకోవడంలో అధిక అశాంతి నెలకొంటున్నది అనేది వాస్తవం. మనిషి అధికార దాహం కోసం చేసే చర్యలు కూడా మనుషుల మధ్య వైరానికి అశాంతి నెలకొనడానికి కారణం అవుతాయి.  ఏమీ చేయాలి?? మనిషి నేరుగా ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు కానీ తన కుటుంబాన్ని, తన చుట్టూ ఉన్న కొందరిని అయినా మార్చగలడు.  ◆మొదట ఇంట్లో పిల్లలకు అహింస, శాంతి అంటే ఏమిటో వివరించి వారిని అహింసాయుత జీవితం వైపు నడిపించాలి. ఇక్కడ ముఖ్య విషయం వాళ్ళను నడిపిస్తూ వాళ్ళతో పాటు తల్లిదండ్రులు నడవడం ముఖ్యం. ◆ప్రతి పాఠశాలలో ఈ విషయం గురించి కేవలం వారానికి ఒకసారి చర్చ ఏర్పాటు చేయాలి. దీనిద్వారా పిల్లల్లో హేతుపూర్వకమైన అవగాహన తొందరగా వస్తుంది. ◆ గౌతమ బుద్ధుడు ఒకమాట చెబుతాడు. మనం ఆచరించినపుడే ఇతరులకు దాన్ని చెప్పాలని. కాబట్టి ఎపుడైనా ఎవరికైనా వీటి గూర్చి చెప్పాలని అనుకున్నప్పుడు తమని తాము మొదట విశ్లేషణ చేసుకుని తాము సరిగ్గా ఉన్నామని అనిపించినపుడు ఇతరులకు చెప్పాలి. ◆ ఒకమనిషి, ఒక కుటుంబం, ఒక వీధి, ఒక ఊరు ఇలా ప్రతి ఒకటి ఎలాంటి అలజడులకు లోను కాకుండా ఉంటే శాంతియుత సమాజం సాధ్యమవుతుంది. కాబట్టి వీలైనంతవరకు ప్రతి ఒక్కరు మరొకరితో సామరస్యంగా ఉండాలి.  ◆శాంతి కావాలంటే మొదట త్యజించాల్సినవి కోపం, అసూయ,ద్వేషం వంటి గుణాలు. నిజానికి మనిషిలో అలజడికి కారణాలు కూడా ఇవే. మనుషుల మధ్య శత్రుత్వానికి దారి తీసేవి ఇవే. వీటిని వధులుకుంటే శాంతి సాధ్యమే. ◆ప్రతి ఏడాది శాంతి అంటూ కపోతాలు ఎగిరేయగానే ప్రపంచం అంతా శాంతి నెలకొనదు. ఎగిరిన పావురం స్వేచ్ఛగా ఉండగలిగినపుడే దానికి సార్థకత. అంతేకానీ అలా ఎగరగానే మరొక చోట దాన్ని కబళించే హస్తాలు ఉండకూడదు మరి. పెద్ద పెద్ద అంతరార్థాలలోకి కాకుండా పిల్లలకు వీలైనంత వరకు నిత్యజీవితంలో ఉత్తమంగా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇరుగుపొరుగు తర్ఫీదునిస్తే. మన పిల్లలే శాంతి కపోతాలు అవుతారు. ప్రపంచ శాంతిని నెలకొల్పుతారు. కాదంటారా మరి!! ◆ వెంకటేష్ పువ్వాడ

రొమాంటిక్ డే

ఒక రొమాంటిక్ మూమెంట్ కావాలంటే పెద్ద హంగామా అక్కర్లేదు. కేవలం ఒక గులాబీ చాలు. గుండెల్లో దిగబడిపోయేంత ప్రేమను గమ్మత్తుగా, అంతే నిశ్శబ్దంగా ప్రసరించేలా చేస్తుంది గులాబీ. ముఖ్యంగా అమ్మాయిలకు, ప్రేమకు, గులాబీ కి ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు.  చాలామందికి గులాబీల దినోత్సవం అనగానే ఫిబ్రవరి నెలలో వచ్చే వాలెంటైన్స్ డే సందర్భం గుర్తొస్తుందేమో కానీ, ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 22 ను ప్రపంచ గులాబీల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ ప్రపంచ గులాబీల దినోత్సవం ఎలా పుట్టింది?? ఈ గులాబీ రోజు ప్రత్యేకత ఏమిటంటే….. గులాబీల దినోత్సవం గులాబీల దినోత్సవం అనగానే చాలామంది ప్రేమ దోమ అనుకుంటూ హార్ట్ బీట్ పెంచుకుంటూ ప్రపోజ్ చేయడానికి పరిగెడతారేమో అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. కెనడాలో మొట్టమొదటిసారిగా కాన్సర్ పేషెంట్ లు తొందరగా కోలుకోవాలని వాళ్లకు ఆహ్లాదాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇవ్వడానికి గులాబీ పూలను ఇచ్చారట. పువ్వులు అంటేనే ఆశకు, మానసిక పరిపక్వతకు సూచిక. అలాంటి పువ్వులను అనారోగ్యంతో ఉన్నవారికి ఇవ్వడం వల్ల వారిలో నూతనోత్తేజం ఉత్పన్నమవుతుందని నమ్మకం. అలా కెనడా లో పుట్టిన ఈ అలవాటు అన్ని దేశాలకు విస్తరించింది. అదే ప్రస్తుతం అన్ని చోట్లా కూడా ఎవరైనా అనారోగ్యానికి గురైనపుడు వారిని పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు గులాబీ పువ్వులను తీసుకెళ్లడంలో అంతార్థం. చాలామందికి ఈ విషయం తెలియకపోయినా ఒక ఫార్మాలిటీగా అలా ఫాలో అయిపోతుంటారు.  ఇక ఈ గులాబీలు మాత్రమే ఎందుకు ఇచ్చారు ఇన్ని పువ్వులు ఉండగా అనే ప్రశ్న కూడా చాలమందిని తొలిచేస్తూ ఉంటుంది కాబోలు. ఈ గులాబీ చరిత్ర తెలిస్తే దాన్ని ఇలా వాడటం సబబే అనిపిస్తుంది. దాదాపు 35 మిలియన్ సంవత్సరాల కిందటే గులాబీలు ఉన్నాయినంటే ఆశ్చర్యం వేస్తుంది.  ఈజీపు మహారాణి క్లియోపాత్ర కాలంలో ఈ గులాబీ ప్రేమకు ప్రతిరూపంగా వాడటం మొదలుపెట్టారు.  గులాబీలను మనం అలంకరణ కోసం లేదా తలలో పెట్టుకోవడానికి లేదా ఎవరికైనా ఇవ్వడానికి ఇలా మాత్రమే వాడతాం. అందుకే మనకు గులాబీల రహస్యం తెలియదు. పాశ్చాత్య దేశాల్లో గులాబీ రేకులతో టీ చేసుకుని తాగుతారు. ఆయుర్వేదపరంగా ఇది ఎంతో మంచిది. పంచదార, గులాబీరేకులు కలిపి తయారు చేసే గుల్కండ్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. స్వచ్ఛమైన రోజ్ సిరప్ వంటివి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడంలో దోహాధం చేస్తాయి. ఇవే కాకుండా గులాబీలను సౌందర్య సాధనంగా విరివిగా ఉపయోగిస్తారు. సౌందర్య ఉత్పత్తులలో అగ్రస్థానం గులాబీలదే. మగువ అందాన్ని, మగువకు సరితూగే మనోహరాన్ని గులాబీల మాత్రమే చూడగలం అంటే అతిశయోక్తి కాదు.  అంతేకాదండోయ్ గులాబీ ఏ విధంగా చూసినా నెంబర్ వన్ గా దూసుకుపోతుంది. సాహిత్యంలో కవులకు గులాబీ ఒక స్వర్గ ద్వారం లాంటిదంటే వారి మనసులో దాని స్థానం ఏమిటో అర్థం చేసుకోండి. పాశ్చాత్యులకు, ప్రణయ కథకులకు, ప్రేమకు, పరామర్శకు  ఇలా ప్రతి దానికీ గులాబీకి ఓట్ వేసేవారు ఎక్కువ. అయితే అభివృద్ధి చెందుతున్న కాలంతో పాటు ఈ గులాబీ కూడా కొత్త సొబగులు అద్దుకుని నిత్యవసంతంలా తయారైపోతుంది ఎలా అంటే….. ఎన్నెన్నో వర్ణాలు అన్నిట్లో  అందాలు…. రంగులు రంగుల పువ్వులు, అందులో ఒకే పువ్వు రంగులు మాత్రం అబ్బో ఎన్నో….  ఇంద్రధనస్సును కూడా చిన్న బుచ్చుకునేలా చేస్తాయి ఈ గులాబీ కుసుమాలు. అయితే ఈ గులాబీలలో ఒకో రంగు పువ్వుకు ఒకో ప్రత్యేకత, అందులో నిఘూడార్ధం ఉన్నాయి. రంగుల్లో రహస్యం ఎరుపు : ఎరుపు గులాబీ ఎవరికైనా ఇవ్వాలన్నా, ఎవరి నుండి అయినా అందుకున్నా అది నిజమైన  ప్రేమకు చిహ్నం. దీన్ని ఎక్కువగా ప్రేమికులు వాడేస్తుంటారు. పసుపు : ఈ పాసులు రంగు గులాబీకి ఎక్కువ గుణాలు ఇచ్చేసారు రంగుల గూర్చి విశ్లేషించిన వాళ్ళు. ఆనందం, స్నేహం, సంతోషం, జ్ఞాపకం మొదలైనవాటిని వ్యక్తం చేసేటపుడు పసుపు గులాబీ ఉపయోగించాలట. తెలుపు :  తెలుపు అంటే ఒక శాంతి, స్వచ్ఛత,  పవిత్రత.  అలాంటి సందర్భాలలో తెలుపు గులాబీ వాడాలి. ముదురుగులాబీ : ఏవరైనా మనకోసం ఏదైనా చేసినపుడు వారికి  కృతజ్ఞతా పూర్వకంగా ముదురు గులాబీని ఇవ్వచ్చు. నారింజ : ఈ గులాబీ తమలో ఉన్న ఉత్సుకతను తెలిపే సందర్భంలో, తమ మనసులో చోటు చేసుకున్న ఊహ ప్రపంచానికి గుర్తుగా వాడుతుంటారు. ఎరుపు-పసుపు మిశ్రమం : సాదారణంగా కలయిక అనేదే సంతోషం కలిగించేదిగా భావిస్తారు. అలాగే ఎరుపు-పసుపు రంగుల గులాబీని సంతోషం వ్యక్తం చేసే సందర్భాలలో ఉపయోగిస్తారట ముధుర గోధుమ-ఎరుపు : ఈ రెండిటి కలయికలో ఉన్న గులాబీ ఆనందాన్ని కోరుకోవడం, లేదా వ్యక్తం చేయడం కోసం ఉపయోగిస్తారు. ఎరుపు-తెలుపు : ఇవి రెండు రంగులు ఐకమత్యంను తెలుపుతాయి. అందుకే మరి మనుషుల మధ్య ఐకమత్యం పెంపొందాలి. ఈ ఎరుపు తెలుపుల విరబూయాలి. లేత పసుపుపచ్చ : ఇది చాలా రొమాంటిక్. మనసులో కోరికను వ్యక్తం చేయడానికి ఈ లేత పసుపుపచ్చ గులాబీని ఉపయోగిస్తారు. ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తల మధ్య ఈ లేత పసుపు గులాబీ ఎక్కువగా తిరుగుతుంటుంది. గులాబీ వెనుక, ఈ ప్రపంచ గులాబీ దినోత్సవం వెనుక, గులాబీ రంగుల వెనుక ఇంత కథ ఉందన్న మాట. అందరికీ ఎరుపు-తెలుపు గులాబీలతో ప్రపంచ గులాబీల దినోత్సవ శుభాకాంక్షలు. ◆ వెంకటేష్ పువ్వాడ

ఆలోచనలు మారాలి !

పిల్లలు ఇంట్లో తిరగాడుతుంటే ఆ కళ వేరు. పిల్లల ముద్దు పలుకులు చూస్తే ఆ సంతోషం వేరు. కానీ ఈ మధ్య పిల్లలు విగతజీవులు అయిపోతున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో చాలా ఘోరం గా తయారవుతోంది ఈ సమాజం. నెలల పసికందు అయినా పండు ముసలి అయినా కామంతో రగిలే మగాడి కంట పడితే ఇక జీవితం ముగిసినట్టే అవుతోంది పరిస్థితి. ఇట్లా ప్రవర్తించేవాళ్ళు అసలు అలా ఎలా చేయగలుగుతారు అనేది అందరూ వేసే ప్రశ్న. ప్రతిసారి ఇట్లాంటివి జరిగినపుడు ప్రశ్నలు గుప్పించడం. తరువాత కొన్ని రోజులకు అన్ని మర్చిపోవడం. తప్పు చేసినా వాళ్లను శిక్షించినా తరువాత మళ్ళీ ఏదో ఒక రోజు, ఎక్కడో ఒకచోట ఉలిక్కిపడేలా మళ్ళీ దారుణాలు పునరావృతమవుతూనే ఉన్నాయి. అసలు సమస్య ఎక్కడుంది??  వస్త్రధారణ అని చాలా మంది అంటారు మరి నెలల పసిబిడ్డలు, పదేళ్లు కూడా నిండని బుజ్జి తల్లులు ఎలాంటి బట్టలు వేసుకోవాలి?? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పెంపకంలో తప్పుందా?? ప్రతి తల్లిదండ్రి తమ బిడ్డలను ఉత్తమంగా ఉండేలానే పెంచుతారు. ఎవరు కూడా తమ బిడ్డలు తప్పులు చేసి జైలు కు వెళ్లాలని, పసిబిడ్డల ప్రాణాలు, ఆడపిల్లల మానాలు తీసేట్టు ప్రేరేపించి పెంచరు. మరి ఎక్కడుంది అసలు సమస్య అంటే….. సమాజంలో ఉంది. ఇప్పటితరం పిల్లలకు సెక్స్ అనే పదం చాలా కామన్ అయిపోయింది. నెట్ సెంటర్ లలో విచ్చలవిడిగా బ్లూ ఫిల్మ్ వీడియోస్ చాలా తక్కువ ధరకు మొబైల్ లో ఎక్కించేస్తారు. వయసుతో తేడా లేకుండా పిల్లలు కూడా వాటిని చూస్తారు. ఒక తండ్రి తన మొబైల్ లో బ్లూ ఫిలిమ్స్ పెట్టుకుంటే కొడుకు ఏదో అవసరానికి మొబైల్ తీసుకుని పొరపాటున వాటిని ఓపెన్ చేయచ్చు, ఒక ఉపాధ్యాయుడు పిల్లలను పనికిమాలిన విషయాలకు ఉపయోగించుకుంటే తద్వారా ఆ విద్యార్థి పెద్దవుతూ పనికిమాలినవాడిగానే ఎదుగుతాడు. ఒకచోట దారుణం జరుగుతూ ఉన్నపుడు ఎవరూ స్పందించకుండా మాకెందుకు లెమ్మని ఉంటే, అక్కడున్న ఏ పిల్లవాడో ఒక బాధ్యతారహితమైన వాడిగా రూపాంతరం చెందవచ్చు. ఒకమనిషి ఒక పెద్ద తప్పు చేసాడు అంటే దానికి మూలమైన విత్తనం ఎక్కడో ఎప్పుడో ముందే పడింది అని అర్థం. 90% ఆ విత్తనం సమాజం నుండి రాలిపడినదే అని అర్థమవుతుంది కూడా. ఎందుకంటే ఎదిగే పిల్లల మీద కుటుంబంతో పాటు  సమాజం ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడేం చేయాలి?? ప్రతిసారి ఏదో జరిగిపోయాక ఆవేశంతో ఊగిపోవడం, తప్పు చేసినవాళ్లను శిక్షించాలని డిమాండ్ చేయడం, కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ఉద్యమాలు వంటివి చేసెబదులు  ఎవరికి సాధ్యమైనంత మేరకు వారి చుట్టూ వాతావరణాన్ని కాస్త మార్చగలిగేలా ముందగుడు వేయాలి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?? ప్రతి తల్లిదండ్రి ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఇష్టమొచ్చినట్టు ఉండి, పిల్లలను సరైన  దారిలో ఉండమంటే అది జరగదు. అక్కడే పిల్లల్లో విరుద్ధ భావాలు మొదలవుతాయి. పిల్లలు ఏమి చేస్తున్నారు అనే విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. స్నేహితులను, ఉపాధ్యాయులను కలుస్తూ వారితో మాట్లాడుతూ పిల్లల గురించి తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలతో స్నేహంగా ఉండాలి. నిజానికి పిల్లలతో తల్లిదండ్రులమనే అధికారంతో కంటే స్నేహితుల్లా కలిసిపోయి మాట్లాడుతూ ఉంటే బయట స్నేహాలకు అంత తొందరగా లొంగిపోరు పిల్లలు.  "మగపిల్లాడు వాడికేం దర్జాగా బతుకుతాడు. వాడి గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు" ఇది చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం. సరిగ్గా ఈ అభిప్రాయమే ఆ పిల్లలు దారితప్పడానికి కారణం అవుతోంది.  మగవాళ్ళు తమ ఇంట్లో ఉన్న మహిళకు గౌరవం ఇస్తూ ఆ మహిళ అభిప్రాయాలకు స్వేచ్ఛ ఇస్తూ, వారిని గుర్తిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా బయట సమాజంలో స్త్రీల పట్ల కూడా గౌరవం కలిగివుంటారు. కాబట్టి ఇంటి నుండి మొదలవ్వాలిది. ఇక సమాజంలో జరుగుతున్నవాటిని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలావరకు ఘోరాలు మద్యం మత్తులోనూ, బ్లూ ఫిల్మ్ లు, రొమాంటిక్ వీడియో లు చూడటం ద్వారావచ్చే ఉద్రేకాన్ని ఆపుకోలేక చేస్తున్నవే. వీటిని కట్టడి చేయాల్సిన అవసరం సమాజంలో అందరి మీద ఉంది. మీ చుట్టూ ఉన్న నెట్ సెంటర్లు, మీ ఇంట్లో ఉన్న మొబైల్ హిస్టరీ వంటివి గమనిస్తూ ఉండాలి. పిల్లలకు చిన్నప్పటి నుండి పుస్తక పఠనం, క్రమశిక్షణ అలవాటు చేయాలి పిల్లల దృష్టిలో జీవితాన్ని గొప్పగా వర్ణించాలి. ఆ దిశగా వాళ్ళను నడిపించాలి.  ఎప్పుడూ చట్టాన్ని, ధర్మాన్ని, ప్రభుత్వాన్ని నిందించకుండా మీ వంతు ఏమి చేస్తున్నారో ఆలోచించుకుని చూడండి. అలాంటపుడే సమాజంలో జరుగుతున్నవాటిని కొంత అయినా కట్టడి చేయగలం. మార్పు మనతోనే ప్రారంభం అవ్వాలి కదా!! ◆ వెంకటేష్ పువ్వాడ

అదృష్టం కావాలా నాయనా??

సాధారణంగా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మనం ఎక్కువగా వినే మాట. అదృష్టం లేదురా!! దేనికైనా రాసిపెట్టి ఉండాలి అని.  ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసినపుడు చివరలో అది తమకు కాకుండా పోయినప్పుడు, ఏవైనా ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి అనే ఆశతో ఉన్నపుడు అది లాభాన్ని ఇవ్వనపుడు ఇట్లాంటి పెద్ద విషయాల నుండి, నచ్చిన కలర్ డ్రెస్ దొరకనపుడు, తినాలని అనుకున్నది తినలేకపోయినపుడు, విచిత్రంగా పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చి ర్యాంక్ వెనుకబడ్డపుడు ఇవి మాత్రమే కాకుండా ఈ లిస్ట్ చాంతాడంత ఉంటుంది. ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమయ్యేది ఒకటే. అదృష్టం అంటే లాభం చేకూర్చేది అని.  కానీ మనుషులు ఎందుకు ఇలా అనుకుంటున్నారు?? ఒక వ్యక్తి ప్రమోషన్ వస్తుందని ఆశ పడతాడు. అతను మంచి ఉద్యోగస్తుడే కావచ్చు, చాలా ఎక్స్పీరియన్స్ ఉండి ఉండచ్చు, కానీ అతనికి ప్రమోషన్ రాకపోతే అదృష్టం లేదనుకునేస్తారు. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, అతనికంటే మంచి ఉద్యోగస్తుడు, ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి దానికి ఎంపిక చేయబడ్డాడు ఏమో!! ఇలా ప్రతి చోట కూడా మనకు ఏదైనా దక్కకపోతే మన ఆలస్యమో, లేక మనకంటే మెరుగ్గా ఉన్నవారు అవకాశాన్ని అందుకుని ఉండచ్చని అనుకోవచ్చు  కదా!! కానీ ఎవ్వరూ ఇలాంటివి ఆలోచన చేయరు.  [[ అదృష్టం అంటే ఏమిటి?? ]] చాలా మందికి అదృష్టం అంటే కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉన్నప్పుడు తమదగ్గరకు వెతుక్కుంటూ వచ్చే ఒకానొక తాత్కాలిక సంతోషం. వందమంది పేర్లు కొన్ని చిన్న కాగితాలలో రాసి ఒక గాజు సీసాలో వేసి వాటిలో ఒక్కటి బయటకు తీస్తే అందులో ఉండే పేరును అదృష్టం అంటారు. దాని మీద ఆశ అనేది ఉండకూడదు. ఎందుకంటే మందలో మెరుపు ఎక్కడో ఎవరికి తెలుసు. కానీ అందరూ ఏమి చేస్తారు తమ పనులు వదులుకుని మరీ ఆ వచ్చే కాగితంలో తమ పేరు ఉంటుందని మానసికంగా ఫిక్స్ అయిపోయి ధీమాగా ఉంటారు. తమ పేరు రాకపోయేసరికి అదృష్టం లేదు అనుకుంటారు. చాలా ఫ్యూలిష్ గా అనిపించడం లేదూ ఈ ప్రవర్తన. మనకు దక్కకుండా మరొకరికి దక్కితే మనది అదృష్టం కాదు, మరి అవతలి వారిది అదృష్టమేనా?? లేక వారి కష్టపలమా. ప్రతి మనిషి ప్రతివిషయంలో తన పూర్తి శక్తి సామర్త్యాలు ఉపయోగించే అడుగేస్తే ఫలితం ఎట్లా ఉంటుంది?? ప్రతి మనిషి చేయబోయే పని గురించి పూర్తిగా తెలుసుకుని, బాగా ఆలోచించి ప్రణాళిక వేసుకుంటే ఫలితం ఎలా ఉంటుంది. అన్ని జీవులలోకి ఎంతో ఆలోచనా పరులు అయిన మనుషులే ఈ విషయాన్ని విస్మరించి చెట్టు కొమ్మ చివరి అంచున వాలిన పక్షి లాంటి అదృష్టం కోసం చెట్టెక్కితే ఎలా?? కదలికకు ఆ పక్షి ఎగిరిపోయినట్టే, తగినంత కష్టం లేక మన ఫలితం కూడా దూరమైపోదా?? అదృష్టం ఎక్కడుంది?? నిజానికి మనిషి రోజులో కనీసం ఒక్కసారి అయినా అదృష్టం గురించి అనుకుంటారు.  నిజానికి ఇలా అదృష్టం గూర్చి అనుకునేవాళ్లకు స్వశక్తి మీద తమ సామర్థ్యం మీద నమ్మకం లేని వాళ్లేమో అనిపిస్తుంది.  కొందరు పేరులో అదృష్టం అంటారు కొందరు సంఖ్యలలో అదృష్టం అంటారు కొందరు జాతకంలో అదృష్టం అంటారు కొందరు రంగులో అదృష్టం అంటారు కొందరు దిక్కులో అదృష్టం అంటారు. వీటన్నిటి కోసం ఎంతో ధనం వృథా చేస్తారు  కానీ కష్టే ఫలి అన్న పెద్దల మాటలు తెలిసిన తెలియనట్టే చేస్తారు. వెర్రి వేయి విధాలు అన్నట్టు వస్తుందో రాదో, మనది అవుతుందో లేదో అనే మీమాంసలో ఉన్న విషయం పట్ల ఎందుకింత ఆసక్తి మనుషులకు. నిజమైన అదృష్టం  నిజనికి మనిషి ధీమాగా బతకడానికి కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు ఇలా శరీర అవయవాలు అన్ని సక్రమంగా ఉండి ఉంటే చాలదూ.  కష్టపడాలి, సంపాదించుకోవాలి, బుద్ధి ఉపయోగించాలి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి.  మనిషి పూర్తి ఆరోగ్యస్తుడిగా ఉండటమే గొప్ప అదృష్టమని, అదే నిజమైన అదృష్టమని తెలుసుకుంటే మనిషి జీవితం కొత్త మలుపు తిరగడం ఖాయం మరి. ◆ వెంకటేష్ పువ్వాడ

డ్యూటీ విత్ డెమోక్రసి

సెప్టెంబర్ 15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం. ఈ ప్రజాస్వామ్యం అనే పదంలోనే ప్రజలు ఇమిడిపోయి ఉన్నారు.  ప్రజలచేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారని అబ్రహం లింకన్ నిర్వచించారు. అట్లాగే భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే ప్రజలు మాత్రం దానికి అనుగుణంగా ఉన్నారా అంటే ఆలోచించాల్సిందే మరి.  ప్రజల చేత…. ప్రజల కొరకు… ప్రజలే ఎన్నుకోవడం…… పై మూడు పదాలను మళ్ళీ మళ్ళీ చెడితే అర్ధమయ్యే విషయం ప్రజలకు దేశం గూర్చి బాధ్యత ఉండాలని. కానీ ఈ దేశంలో బాధ్యాతాయుత పౌరులు ఎందరు అన్నది ప్రశ్నార్థకం. ఇది ఒక మనిషినో, ఒక సమూహన్నో, ఒక సంఘాన్నో, ఒక సమాజాన్నో కాకుండా యావత్ భారతీయులందర్ని అడగాల్సిన ప్రశ్న మరి.  అసలు బాధ్యత అంటే ఏమిటి?? ఇల్లు, ఇంట్లో కుటుంబ సభ్యులు. వాళ్ళు అందరూ కూడా ఉదయం నుండి రాత్రి వరకు, అలా ప్రతి రోజు పనులు చేస్తూ ఉంటారు. అమ్మ వంట చేస్తుంది, నాన్న సంపాదించుకొస్తాడు, పిల్లలు చదువుకుంటారు, ఆడపిల్లలు ఇంట్లో పనులు చేస్తుంటారు, మగపిల్లలు బయటకెళ్లి చేయాల్సిన పనులు చేస్తారు. ఇలా ఒకరికొకరు సహకరించుకుంటూ సాగిపోతారు. ఇదంతా ఇంట్లో ఉన్న మనుషుల బాధ్యత. మరి ఇలాంటి బాధ్యత సమాజం విషయంలో, దేశం విషయంలో అక్కర్లేదా?? రోజు ఇంట్లో పనులు చేస్తుంటే పడక గది నుండి, వంట గది దాకా అన్ని చోట్లా నుండి చెత్త పొగవుతుంది. పొడి చెత్త తడి చెత్త కూడా. వాటిని అట్లాగే రోజుల తరబడి ఇంట్లో ఉంచుకుంటే ఇల్లంతా దుర్గంధమే. ఈ విషయం మనకు తెలుసుం అందుకే చక్కగా దాన్ని తీసుకుపోయి ఇంటికి అవతల లేదా వీధి చివర వేస్తాం. దాన్ని అక్కడ శుభ్రం చేయకపోతే వీదంతా కంపు గొడుతుంది. కానీ నాకెందుకు అని పట్టించుకోమ్. అట్లాంటి బాధ్యత రహితాలే క్రమంగా  పెరిగి దేశం పట్ల కూడా బాధ్యతా రహితంగా ఉంటున్నారు నేటి జనం.  మనిషి తన పని కోసం ఎంత నిజాయితీగా, క్రమశిక్షణతో ప్రయత్నం చేస్తాడో అలాగే తనకున్న బాధ్యత విషయంలో సమాజం పట్ల, దేశం పట్ల కూడా స్పందించగలగాలి.  కేవలం ప్రభుత్వ విషయానికే ప్రజాస్వామ్యం అనేది వర్తిస్తోందని అనుకోవడం మూర్ఖత్వం. దేశం మీద ప్రజలకు ఉన్న బాధ్యతను గుర్తు చేసుకుంటే దేశంలో ఎన్నో పరిస్థితులలో మార్పులు చాలా సులువు అవుతాయి. ప్రజాస్వామ్యం గురించి తమ బాధ్యతల గురించి ప్రతి మనిషి తమలో తాము డెమో నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని గ్రహించి ఇప్పుడే మొదలుపెడితే. ముందు వచ్చేది ఆరోగ్యకరమైన మార్పే!! అదే అసలైన ప్రజాస్వామ్యం అవుతుంది. ◆ వెంకటేష్ పువ్వాడ  

ఎకో ఫ్రెండ్లీ గణపతితో ఫ్రెండ్షిప్ చేద్దాం!!

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో  భారతదేశం రెండవ స్థానంలో ఉంది. మనదేశం సర్వమతాలకు నిలయం. ఇలాంటి దేశంలో ఒకోప్రాంతంలో ఒకో రకమైన పండుగలు జరుపుకుంటారు. కానీ దేశం యావత్తు జరుపుకునే పండుగలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో వినాయక చవితి కూడా ఒకటి.  మహారాష్ట్ర, ముంబై ప్రాంతాల్లో దుర్గ నవరాత్రుల కంటే గొప్పగా వినాయక నవరాత్రులు జరుపుకుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయకుణ్ణి తొమ్మిదిరోజుల పాటు అలంకారాల మధ్య, పూజలతో ముంచెత్తుతారు.  అయితే ఏ మతంలో అయినా, సంప్రదాయం అయినా, పండుగ అయినా అది ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఏర్పాటు చేశారు పెద్దలు. కానీ ప్రకృతి కాస్త వికృతి అయినట్టు నేటి మన తరాల పండుగలు అన్ని పర్యావరణానికి శత్రువులుగా మారి కూర్చున్నాయి. సమస్య ఎక్కడుంది?? సమస్య మొత్తం మనుషులు చేస్తున్న అతిలోనే ఉంది. ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసుకున్న పండుగను అత్యుత్సాహంతో రానురాను సాంప్రదయాన్నే వేలెత్తి చూపే విధంగా తయారు చేసుకుంటున్నారు.  అసలు ఏది సాంప్రదాయం?? సంప్రదాయం అంటే మతాన్నో, కులాన్నో సపోర్ట్ చేసేది అంటే అసలు ఆమోదించకూడదు. సంప్రదాయం అంటే జీవితాన్ని, మన పర్యావరణాన్ని, ముఖ్యంగా ప్రకృతిని కాపాడుకునేదిగా ఉండాలి. చాలామంది పండుగ పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారని అంటుంటారు, అసలు పండుగే తప్పని, పండుగ మూర్ఖత్వమని అంటుంటారు. అయితే ఈ పండుగలు అన్ని ఏర్పాటయిన కాలంలో ఇప్పటిలా వీధి వీధికి ఒక పది అడుగుల విగ్రహం, ఊరు ఊరుకు యాభై అడుగుల విగ్రహం, రాష్ట్రానికొక వంద అడుగుల విగ్రహం లాంటివి లేవు. అప్పుడంతా స్వచ్ఛమైన బంకమన్ను చెరువు ప్రాంతాల నుండి తెచ్చి సొంతంగా వినాయకుని విగ్రహాలు చేసి, పూజ చేసుకుని తిరిగి ఆ  మట్టి గణపతిని చేరువుల్లోనే నిమజ్జనం చేసేవారు. కానీ ఇప్పుడు అలా ఎక్కడుంది?? ఎక్కడ చూసినా రసాయనాలతో చేసిన పెద్ద పెద్ద వినాయక విగ్రహాలు, వాటికి రసాయనాల పూతల రంగులు, అవి కూడా పూర్తిగా భక్తితో కాదు ఈ వీధికి, పక్క వీధికి మధ్య పోటీగా పెడుతున్నారు. అవన్నీ తీసుకెళ్లి చెరువుల్లో నిమజ్జనం చేస్తే ఏర్పడేది కాలుష్యమే.  మరేం చేయాలి??  వినాయక పూజలో ఉపయోగించే పత్రి ఎంతో శక్తివంతమైనది. ఆషాఢమాసం ముగిసి శ్రావణం  మొదలవ్వగానే వర్షాలు కూడా ప్రారంభం అవుతాయి. ఆ వర్షాల వల్ల జరిగే నీటి కాలుష్యాన్ని అరికట్టడానికి ఈ వినాయక పూజలో ఉపయోగించే పత్రి ఎంతగానో దోహదపడుతుంది. నీటిని శుద్ధి చేసే ఔషధ గుణం పత్రిలో ఉంటుంది. కానీ ప్రస్తుతం పెద్ద వినాయక విగ్రహాల వల్ల కలుషితం బాగా పెరిగిపోతోంది. పైగా ఫ్యాక్టరీలు  విడుదల చేసే రసాయనాలు కూడా కలుషితనికి దోహాధం చేస్తాయి.  ఇప్పుడందరూ చేయాల్సింది ఒకటే. వీలైనంతలో ప్రకృతి సహజంగా సొంతంగా మట్టి వినాయకుణ్ణి తయారు చేసుకోవడం. గొప్పలు పోకుండా పెద్ద వినాయకుళ్లను తగ్గించడం. దీనివల్ల ఎవరికి వారు ప్రకృతిని కాపాడుకున్నట్టు ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ నిర్వర్తించాల్సిన కర్తవ్యం కూడా.  ప్రస్తుతం ప్రకృతి మరియు పర్యావరణ స్పృహ పెరిగి చాలామంది ఎకో ఫ్రెండ్లీ గణపతి వైపు మొగ్గు చూపుతున్నారు.  ఒకవేళ మీరు బయట నుండి కృత్రిమ రసాయనాలు వాడిన వినాయకుణ్ణి తీసుకురావాలి అనుకునేముందు  ఒక్కసారి ప్రకృతి గురించి ఆలోచించి ప్రకృతికి మేలు చేసే మార్గాలలో పండుగ చేసుకునేవైపు ఆలోచించండి.  వినాయకుడికి, ప్రకృతికి మధ్య ఉన్న అవినాభావసంబందం చాలా గొప్పది సుమా!! అందుకే మరి ఎకో ఫ్రెండ్లీ గణపతితో ఫ్రెండ్షిప్ చేద్దాం. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ◆ వెంకటేష్ పువ్వాడ

దొంగిలించబడని ఆయుధాన్ని దర్జాగా చేతబట్టాలి!

యుద్ధమూ శాంతి, రెండు విరుద్ధమైన విషయాలు. కానీ జీవితంలో యుద్ధమూ, శాంతి రెండూ ఎంతో ప్రాధాన్యత గల విషయాలు. మనిషి జీవితం నిరంతరం యుద్ధమే. తనతో తను, సమాజంతోనూ, ఎన్నో విషయాలతోనూ. కానీ ఎక్కువ మంది యుద్ధం చేసేది పేదరికంతోనూ, ఆకలితోనూ. ఇది జగమెరిగిన వాస్తవం. కలలు, కోర్కెలు, అందని తీరాలను అందుకోవాలనే ఆరాటాలు ఇవన్నీ సగటు మనిషి జీవితంలో ఉన్నా వాటిని నెరవేర్చుకోవడానికి కొన్ని ఇబ్బందులు అడ్డొస్తూ ఉంటాయి. ఇలా అడ్డొచ్చే వాటిలో చాలా వరకు పేదరికం, ఆర్థిక ఇబ్బందులే ఉంటాయి.  అయితే చాలామంది వాటన్నిటినీ అందని ద్రాక్షగానే చూస్తారు. అందుకోవాలనే ప్రయత్నాలు చేసినా అవన్నీ ఇతరుల సహాయంతోనో, లేక ఎవరో ఒకరు దయతలచి వాటిని అందుకుని తమకు ఇస్తారనో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సహాయాలు అన్ని తాత్కాలికమైనవే అనే విషయం వాళ్లకు భోధపడదు. ఎందుకంటే జీవితానికంటూ సరైన లక్ష్యం, జీవితం మీద సరైన అవగాహన అసలు ఉండటం లేదు ఎవరికి.  మనిషి ఎంత శారీరకంగా కష్టపడినా, ఎంత సంపాదించినా, ఎన్ని భవంతులు కట్టినా చెడ్డ కాలం వస్తే అన్ని తుడిచిపెట్టుకుపోతాయి. ఇక్కడ చెడ్డ కాలం అంటే ఏ గ్రహాలో శాపాలు పెట్టడం కాదు. చేసే వ్యాపారం, ఆర్థికపరమైన కార్యకాలాపాలలో ఘోరమైన నష్టాలు రావచ్చు అని అర్థం. అలాంటివి ఎదురైతే మళ్ళీ చేసేది ఏంటి?? శారీరక కష్టం నుండి మొదలు పెట్టడమా??  కష్టం మంచిదే మనిషికి ఎన్నో గొప్ప పాఠాలు నేర్పుతుంది. కానీ కష్టానికి తోడు ఒక ఆయుధం కావాలి. ఎవ్వరూ దొంగిలించని ఆయుధం కావాలి. బుద్దికి పదును పెట్టి కష్టాన్ని తగ్గించి సులభ సాధ్యమయ్యే దారులవైపు అందర్నీ నడిపించే ఆయుధం కావాలి.  దొరలు దోచలేరు దొంగ లెత్తుకపోరు భ్రాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణజాల తెలుగుబాల. ప్రముఖ రచయిత, కరుణశ్రీ గా పేరొందిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తెలుగు బాల శతకంలో ఇలా చెబుతారు….. విద్య అనే సంపదను దొరలు అంటే ధనవంతులు, చాకిరీ చేయించుకునేవాళ్ళు దోచుకోలేరు, దొంగలు కూడా దొంగలించలేరు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు వచ్చి దాన్ని ఆస్తిని పంచినట్టు  పంచుకోరు. అలా ఎవ్వరికో దాసోహం కాకుండా మనవెంటే ఉండి మనతో ఉండేది కేవలం విద్య మాత్రమే. ఈ  ప్రపంచాన్ని అభివృద్ధి చేసేది కూడా విద్య మాత్రమే! ప్రస్తుత వేగవంతమైన ప్రపంచంలో మనిషిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలిగేది, ఆలోచనా పరంగా మనిషి స్థాయిని పెంచి గొప్ప శక్తిగా ఎదగడానికి తోడ్పడేది కేవలం విద్య  మాత్రమే. ధనిక పేద తారతమ్యాలు విద్యను అభ్యసించడానికి ఖర్చు చేయడంలో ఉంటుందేమో కానీ, ప్రస్తుతం ఉంటున్న విద్యావకాశాలతో పేదవాడు కూడా సువర్ణాక్షరాలతో ఈ చరిత్రలో లిఖించబడే విధంగా ఖచ్చితంగా తయారవగలడు. కావలసిందల్లా సంకల్ప బలం.  ఆ సంకల్ప బలంతో విద్య అనే ఆయుధాన్ని చేత బడితే జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యకు అయినా సవాల్ విసరచ్చు!! సెప్టెంబర్ 8 అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవ సందర్బంగా అక్షరాన్ని ఆయుధం చేసుకునే వారి సంఖ్య పెరగాలని, అందుకు అందరమూ తగిన కృషి చేయాలని కోరుకుంటూ……  అక్షరాస్యతా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ◆ వెంకటేష్ పువ్వాడ

రాశి ఫలాలు కాదు - మన రాత మన చేతుల్లోనే !

దాదాపు చాలా మందికి ఓ అలవాటు ఉంటుంది. ప్రతి వారం ఆదివారం రాగానే సండే బుక్స్ లోనో, లేక టీవీ లో స్వామిజీలు చెప్పేవో లేక మొబైల్ లోనే లభ్యమయ్యే బోలెడు మ్యాగజైన్ లలోనో రాశి ఫలాలు చూసుకోవడం. అందులో తమ రాశి ఫలం ఎలా ఉందో చూసుకుని ఆ వారానికి మంచిగా ఉంటే ఇక ఉల్లాసంగా మారిపోవడం. ఏదైనా నష్టమో, అనారోగ్యమో కలుగుతుందని ఉంటే ఇక నిరాశ పడిపోయి, పరిహారాల కోసం, అవి ఇవి చేయించడానికి అంటూ ఖంగారు పడిపోతూ ఉంటారు.  నమ్మకాలు మంచివే కావచ్చు కానీ మరీ ఇలా ప్రతి వారం వారం, బి అలర్ట్ అన్నట్టు ఠంచనుగా వాటిని చెక్ చేసుకొని ఉన్న ఉత్సాహాన్ని నీరు గార్చుకోవడం అవసరమా??  రోజులు మారినా, కాలం మారినా, గ్రహాలు మారినా మనిషి దృఢసంకల్పం అలాగే ఉండాలి కానీ, ముఖ్యమైన దృఢసంకల్పం మారిపోతే రాశి ఫలాలు మాత్రమే కాదు, జాతకాలు, గండాలు, సుడిగుండాలు అన్ని కూడా కట్టకట్టుకుని మీ మీదకు వచ్చినట్టు ఉంటాయి. అవునా??  కాదా?? ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే!! ఏదైనా సమస్య వస్తేనో, లేక ఇబ్బందులు ఎదురైతేనో వెంటనే రాశి ఫలాలు, గ్రహాల తీరు చూస్తూ కూర్చుంటారు చాలా మంది. మరికొందరేమో ఏకంగా ఎక్కడో ఉన్న స్వామిజీలకు ఫోన్ లు చేసి పరిస్థితులు చెప్పుకుని జేబులు ఖాళీ చేసుకుంటారు. ప్రశ్నాపత్రం చేతిలో ఉంటే మీరు రాయాల్సింది జవాబులు మాత్రమే కాదు  మొదట ప్రశ్నను అర్థం చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు మీ స్థితి గతులను మీరు ప్రశ్నించుకుని వాటిని అర్థం చేసుకుంటే సమాధానం కూడా చాలా సులువుగా దొరుకిపోదూ!! అందరూ అంటూ ఉంటారు ఏది ప్లాన్ చేసినట్టు జరగదు అని. కానీ ఎందుకు జరగదు?? అసలు ఎప్పుడైనా ఒక్కరోజును అయినా ప్లాన్డ్ గా మలిచి చూసారా??  ఉదయం లేవగానే ఈ రోజు ఈ పనులు చేయాలి అని ప్రణాళిక వేసుకుని దానికి తగ్గట్టు సమయాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ సాగితే ఆ రోజు నిద్రపోయే ముందు మీరోజు గడిచిన విధానాన్ని చూస్తే కచ్చితంగా కళ్ళలో మెరుపు మెరవడం ఖాయం!! పూర్తి కాకపోయినా 90 శాతం మీ ప్రాణాలిక అమలవుతుంది. ఒకవేళ మొదటిసారి ఫెయిల్ అయ్యారా?? మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. కాలంతో ప్రయాణం చేయడం ఎంతో మంది చేస్తారు కానీ, ఒక్కసారి కాలాన్ని గుప్పెట్లో పెట్టుకుని దాన్ని శాసించడం నేర్చుకుంటే జీవితాన్ని నచ్చినట్టు మలచుకోవచ్చు.  రాశి ఫలాలు, రంగులు, అనుకూల దిశ ప్రయాణాలు, రాహు కాలం, యమగండం ఇవన్నీ నమ్మచ్చు, నమ్మక పోవచ్చు కానీ జీవితం మీద,  ముఖ్యంగా  భవిష్యత్తు మీద వీటి ప్రభావం ఎంత అంటే, వాటి పేరుతో ఎవరికి వారు చేసే నిర్లక్ష్యం, కాలయాపన, అన్నిటికి మించి అతి విశ్వాసం, వీటి వల్ల ఎన్నో కలల పార్శ్వాలు అంచుల నుండే జారిపోతాయి. అందుకే మరి రాశిఫలాల రాతలు వదిలి ఎవరి పలితాలు వారు రాసుకోవడానికి ప్రయత్నించండి. జీవితం ప్రశ్నలు సందిస్తూనే ఉంటుంది మరి!! ◆  వెంకటేష్ పువ్వాడ  

క్యాలెండర్ కోసం లక్షల్లో ఉద్యోగం వదిలేసిన షణ్ముఖ

ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అక్కడ జరిగే మానవాభివృదికి సాహిత్యం మరకతమణి కిరీటం లాంటిది. అందులో భాగమైన కథ, కవిత్వం, నవల, జానపదం ఇలా అనేక సాహిత్య ప్రక్రియల్లో ఎన్నో రచనలు చేసి జన జాగృతికి అపార అక్షర సంపదను ఇచ్చి వెళ్లిన మహానుభావులను ప్రస్తుతం యువత ఎంతమంది గుర్తుపట్టగలరు అంటే వేళ్లపై లెక్కపెట్టవచ్చు. మన అడుగుజాడ గురజాడ, అక్షరాలను నిప్పులు చేసి దోసిల్లో ఆడుకున్న శ్రీశ్రీ, భావ కవిత్వం దేవులపల్లి ఇంకా ఎందరో మహానుభావులు ఎన్నో రచనలు చేసి సమాజం మనో ఫలకం పై చెరగని చైతన్యపు సంతకం చేసి వెళ్లారు. విశాలమైన సాహితీ వనంలో పూలై విరాజిల్లుతున్నారు. అనంతపురం కదిరికి చెందిన తెలుగు ఉపాధ్యాయులు సున్నపురాళ్ల శ్రీనివాస్, ధర్మపత్నీ యశోద వారి కుమారులు షణ్ముఖ ముగ్గురూ కలిసి రేపటి తరం కోసం ప్రముఖ రచయితల ముఖచిత్రాలతో " తెలుగు సాహితీ కాల చక్రం" పేరుతో క్యాలెండర్ (కాలమాని) ని ముద్రించి నేటి సమాజం నిత్యం వారిని దర్శించే మహత్తర కర్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ మహాప్రస్థానమైనా ఆటుపోటులతోనే ప్రారంభం అవుతుంది. అలాగే వీరి ప్రయాణం కూడా అంతే! మీకెందుకు ఖర్చు? ప్రభుత్వాలకే పట్టకుంటే సొంత ఖర్చులతో ఇలా చేయడం కరెక్ట్ కాదని బంధువులు స్నేహితులు చెప్పారు. కొంతమంది నిందించారు. కానీ వారు వెనకడుగు వేయలేదు. మహా సంకల్పంతో ముందుకు కదిలారు. *తల్లిదండ్రుల బాటలో కుమారుడు షణ్ముఖ ముఖ్యంగా వారి కుమారులు షణ్ముఖ గురించి చెప్పాలి. ఎం బి ఏ పట్టభద్రుడు. బెంగళూర్ లో లక్షల జీతాన్నీ, విలాసవంతమైన జీవితాన్నీ వదిలేసి గత మూడు నాలుగేళ్లుగా ఇదే కార్యక్రమంలో అంకితమయ్యారు అంటే వారి కృషి అనిర్వచనీయం అని చెప్పాలి. క్యాలెండర్ లను ముద్రించడం ఒక ఎత్తయితే  పరమపదించిన రచయితల నిజ సమాచార సేకరణ ఎంతో ప్రయాసతో కూడుకున్నది. అరుదైన వారి చిత్రాలు, రచనల సేకరించడంలో కుమారుడు షణ్ముఖ చేసిన చేస్తున్న కృషి అద్భుతం.  * సాహితీ కాలమానం క్యాలెండర్ వీరి కృషి వలన గోడకు వేలాడే క్యాలెండర్ సాహితీమూర్తుల చిత్రాలతో కొత్తగా అలంకరించుకుంది. ఈ క్యాలెండర్ లో ప్రతి నెల పేజీ లో ఆ నెలలో జన్మించిన మరియు మరణించిన తెలుగు రచయితల చిత్రాలు జనన మరణ తారీకుల్లో అందంగా ఆకర్షణీయంగా ముద్రించబడ్డాయి. తేదీలకు ఒకవైపు మహోదయం పేరిట ఆ నెలలో పుట్టినవారిని, మరోవైపు మహాస్తమయమని చనిపోయినవారివి ఉన్నాయి. ఇలా ఈ క్యాలెండర్ లో 160 మంది రచయతల్ని పరిచయం చేస్తూ సాహితీ కాలమానం క్యాలెండర్ రూపుదిద్దుకుంది. దీని మూలంగా నేటి తరానికి మన రచయతులెవరో తెలిసే అవకాశం ఉంది. ఈ క్యాలెండర్ మన విద్యాలయాల్లో గ్రంధాలయాల్లో, వసతి గృహాల్లోనే కాదు ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. ఇలా ఉండటం వలన ఏదొక సందర్భంలో మన రచయితల గురించి వారి రచనల గురించి చర్చకు వస్తుంది. తద్వారా సాహిత్యం ప్రాధాన్యత పెరిగి మాతృ బాష యొక్క విలువ ఏంటో నేటి టెంగ్లీష్ యువజనానికి తెలుస్తుంది.   *ఉపరాష్ట్రపతి ప్రశంసలు దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు కానీ ప్రస్తుతము దేశభాషలందు తెలుగు లెస్సు అనేలా ఉంది పరిస్థితి అని ఒక సందర్భంలో బాధపడ్డారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అయితే శ్రీనివాస్ భార్య యశోద కుమారులు షణ్ముఖ త్రయం చేస్తున్న సాహిత్య కృషి,బాషాభివృద్ది గురించి తెలుసుకొని సంతోషించి అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని పంపారు ఉపరాష్ట్రపతి. *ఆదర్శనీయం ఇష్టమైన పనిని చేసుకు వెళ్తుంటే ఆ ప్రయాణంలో దొరికే ఆ సంతృప్తి వేరు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగే వారి విజయాలు ఎంత కష్టాన్నైనా కరిగిస్తాయి. తెలుగు సాహితీ సేవలో కొత్త కోణాన్ని ఎంచుకున్న ఈ ఉపాధ్యాయ కుటుంబం అందరికీ ఆదర్శనీయం. ముఖ్యంగా కుమారుడు షణ్ముఖ కృషి అనిర్వచనీయం. వీరు సేకరించిన సమాచారం తెలుగు జాతికి, భాషకు ఎంతో విలువైనది. ఏదొక రూపంలో అది ప్రతి ఇంటికీ చేరాల్సిన అవసరముంది. ముగ్గురు వ్యక్తుల స్తోమతకు, శ్రమకు మించిన కార్యక్రమం ఇది. ఈ మహా సంకల్పం నిర్వఘ్నంగా సాగాలంటే బాషాప్రేమికులు,సాహితీ సంఘాలు, ప్రభుత్వ సంస్థలు కలిసి తోడు నిలవాల్సిన సమయం ఇది. ఇప్పటికే కొంతమంది ముందుకొచ్చి బాధ్యతగా తాము చదువుకున్న లేదా సొంతూరు పాటశాల కు ఈ క్యాలెండర్స్ ని బహుకరిస్తున్నారు. తెలుగు సాహితీ కాలచక్రం క్యాలెండర్ కావాలని తలిచినవారు 9492087089 కి కాల్ చేసి షణ్ముఖను సంప్రదించండి. ◆ వెంకటేష్ పువ్వాడ  

ఒక్కో నీటిబొట్టు వందేళ్ల జీవితం

రెండు ఇళ్ళు పక్కపక్కనే. ఒకటి పెద్ద మేడ, మరొకటి రెండు గదుల చిన్న ఇల్లు. ప్రతిరోజు రెండు ఇళ్లలో నీటి వాడకం మాములే, కానీ వాడే విధానం, వాడుతున్న పరిమాణం పోలిస్తే ఎంతో తేడా!! నీటిని కొంటున్నామనో, కరెంట్ బిల్ కడుతున్నామనో కారణాలు మరెన్నో కావచ్చు కానీ వ్యర్థం చేస్తున్న నీటిని తిరిగి ఉత్పత్తి చేయగలమా?? నీరు ప్రాణాధారమైనది. అన్ని జీవరాశులకు ఎంతో ముఖ్యమైనది. మనిషి జీవితంలో ప్రతి సందర్భంలో నీటి అవసరం ఎంతో ఉంటుంది. తినేటప్పుడు, కాలకృత్యాలు తీర్చుకోవడానికి, ఇంటి పనుల కోసం ఇలాంటి వాటి నుండి, అందరికి అవసరమైన ఆహార ధాన్యాలు, పంటలు పండించడానికి, పెద్ద పెద్ద భవంతులు, నిర్మాణాలకు కూడా నీరు ఎంతో అవసరం. ఒకప్పుడు………. కొన్ని సంవత్సరాల కిందట గ్రామాలు, బావులు, చెరువులు ఇవన్నీ నీటితో, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పచ్చదనంతో ఎంతో ఆహ్లాదంగా ఉండేవి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేక, నీరు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నవారు కిలో మీటర్ల కొద్దీ కాలి నడకన వెళ్లి బావులలో నీటిని తెచ్చుకునేవారు. వాటినే తాగడానికి నిత్యావసరాలకు కూడా ఉపయోగించుకునేవారు. బహుశా ఆ కాలంలో నీటిని తెచ్చుకోడానికి పడే ఇబ్బందుల పరిష్కారం వైపు ఆలోచన మరియు అభివృద్ధి వెంట పరుగులు పెట్టిన మేధస్సు అన్ని కలసి ఈరోజును సమస్యగా నిలిపిందేమో అనిపిస్తుంది. ఎందుకలా??..... పట్టణీకరణ పెరిగినకొద్ది ప్రకృతి తగ్గిపోతూ వస్తోంది అన్నమాట నిజం. ప్రతి ఇంట్లో ఎక్కడిక్కడ వాటర్ సప్లై, కష్టపడక్కర్లేకుండా కుళాయి తిప్పితే దూసుకువచ్చే జలధార. పది నిమిషాలు మోటార్ వేస్తే నీటి ట్యాంకులు నిండిపోతాయి. కిచెన్ లో కుళాయి ఆన్ లో పెట్టి అంట్లు తోముతూ ఉంటే ఎన్ని నీళ్లు డ్రైనేజీ పైపులలోకి వెళ్లిపోతున్నాయో!! బట్టలు ఉతికడానికి ప్రతి ఇంట్లో వాషింగ్ మెషిన్. దానికి ఎన్ని నీళ్లు ఖర్చవుతున్నాయో!! పెద్ద పెద్ద ఇళ్ళు, పని మనుషులు, ప్రతి రోజు ఇల్లంతా తుడవడాలు, షవర్ స్నానాలు, నిత్య జీవితంలో మన శ్రమను తగ్గించే ఇలాంటివి ఎంత నీటిని వృధా చేస్తున్నాయో!! వేసవి వస్తే నీటి ఎద్దడి అనేవారు ఒకప్పుడు. మరి ఇప్పుడో!! కాలంతో, ఋతువుతో సంబంధం లేకుండా నీటి కొరతతో కటకటలాడుతున్న ప్రాంతాలు ఎన్నో!! కానీ కొన్ని ఇళ్లకు ఎద్ద కష్టం అనిపించకుండా నీటి వసతి బాగానే ఉంటుంది. అలాంటి వారు మాకేం సమస్య లేదు అనుకుంటారు. కానీ ఆలోచించట్లేదు సుమా!! రేపటి తరానికి నీటి చుక్కను ప్రశ్నార్థకం చేసే పరిస్థితి తెస్తున్నారేమో అనిపిస్తుంది. ఏం చేయాలిప్పుడు?? చిన్న పిల్లల దగ్గరకు వెళ్లి నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఠక్కున వచ్చే సమాధానం. కుళాయి లో నుండి అని, అబ్బే అది కూడా కాదు లెండి టాప్ ఆన్ చేస్తే వస్తాయి అంటారు. అంటే వాళ్లకు నీళ్లు టాప్ లో వస్తాయని తెలుసు కానీ భూగర్భ జలాల గూర్చి తెలియదు. వర్షాలు పడినా నీటి కొరత ఏమిటో అర్థం కాదు. భూమిని మొత్తం సిమెంటు తో కప్పేసి, వర్షాన్ని భూమిలో ఇంకకుండా చేసి భూగర్భ జలాలు తగ్గిపోవడానికి కారకులం అవుతున్నాం. కానీ ఆ విషయాన్ని ససేమిరా ఒప్పుకొము. ఎందుకంటే మనుషులం మరి.  పుస్తకాలలో పాఠ్యాంశాలు, వాటి విశ్లేషణ కేవలం తరగతి గదులకు, నోటు పుస్తకాల్లో పేజీలకు పరిమితం అయిపోతుంటే పిల్లలకు ఎలా అర్థమవుతుంది మరి. బిజీ బిజీ బతుకుల్లో అవన్నీ చెప్పడం ఎలా కుదురుతుంది అనుకునేవాళ్ళు కొందరైతే, డబ్బు పోస్తున్నాం కాబట్టే వాడుకుంటున్నాం అని సమర్థించుకునేవాళ్ళు కూడా కొందరు.  జనాభా పెరిగేకొద్దీ ఆవాస ప్రాంతాల విస్తీర్ణం కూడా పెరుగుతూ వస్తోంది. ఎన్నెన్నో వ్యవసాయ భూములు మేడలుగా మారిపోతున్నాయి. అడవుల విస్తీర్ణం తగ్గిపోతోంది. మనిషి శరీరంలో 60 నుండి 70% నీరు ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. నీటి శాతం తగ్గిందంటే ఎన్నో అనారోగ్యాలు మొదలవుతాయి, ప్రాణానికి ప్రమాదం కూడా. మరి భూమి విషయంలో ఎవరైనా ఆలోచించారా?? కనీసం ఎప్పుడైనా ఈ విషయం బుర్రలో మెదిలిందా?? అయినా కూడా ఈ భూమి మనల్ని మోస్తూనే ఉంది. తన శక్తి మేర పంటల్ని ఇస్తూనే ఉంది. కానీ మనం ఏమి చేస్తున్నాం?? భూమి సారం అవుతుందని, పంటలు బాగా పండుతాయని రసాయనాలు చల్లుతున్నాం. దానివల్ల ఇంకా చిక్కి శీల్యమయ్యి చివరకు బీడు భూమిగా మారిపోతోంది. ఇలా ఎన్ని రకాలుగా నష్టం జరగాలో అన్ని రకాలుగా జరిగిపోతోంది. అందరి సహకారం ఇప్పుడే అవసరం. ఇది నిజం సుమా!! నీరు, భూమి పరస్పర సంబంధం కలిగివున్న వనరులు.  ◆ఉన్న నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవలసిన అవసరం కొందరిది. ◆అడవులను నరికి వర్షపాత సాంద్రత తగ్గడానికి కారణం కాకుండా ఉండాల్సిన బాధ్యత మరి కొందరిది ◆వీలున్న ప్రతి  వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందేందుకు కృషి చేయవలసిన బాధ్యత కొందరిది. ◆చెట్లను పెంచి ప్రకృతిని కాపాడుకునే బాధ్యత, మన దగ్గర ఉన్న నీటిని కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తించడం అందరి సమిష్టి బాధ్యత. అందుకే నీటి బొట్టు కోసం కాస్త ఆలోచన చేయండి. ఆలోచనతో ఆగిపోక ఆచరణలో ముందుకెళ్లండి.  ◆ వెంకటేష్ పువ్వాడ  

చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి

నాలుగు రోడ్ల కూడలి. సాయంత్రం ఐదు ఆరు అవుతుంది. పనులు ముగించుకొని అందరూ ఇంటికెళ్లే సమయం. కానీ ట్రాఫిక్ జామ్. నగరాల్లో ప్రతిరోజు కనిపించే చిత్రం ఇది. ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేదు. ట్రాఫిక్ పోలీస్ లేడు. బహుషా ఉన్నా గానీ అత్యవసరం అయ్యి ఎక్కడికైనా వెళ్లి ఉండొచ్చు. ఆ కీకరబాకర వలయంలో ఎవరి గోల వారిది. ఎవరూ పట్టించుకోకుంటే ఎంత సేపు అయినా అదే పరిస్థితిలా అనిపించింది. చిన్న సందు దొరికినా దూరిపోయే చాకచక్యం అందరికీ ఉంది కానీ సమస్య పరిస్కారం గురించి ఎవరూ ఆలోచించరు. నేను కూడా ఆ గుంపులో ఒకన్ని కానీ బండి దిగి మనమే కాసేపు ట్రాఫిక్ విధులు నిర్వహిస్తే సమస్య తీరిపోతుందేమో అనే ఆలోచన వచ్చినా గానీ ఎదో సంకోచం వెనక్కు లాగుతుంది. నాకే కాదు అక్కడ ఉన్న తకిమా యువకులు కూడా అదే ఆలోచన వచ్చి ఉంటుంది. కానీ కొంతమంది బిడియంతో ఆగి ఉంటారు. మరి కొంతమంది హా మనకెందుకులే అని నిర్లక్ష్యంగా ఉంటారు . ఉన్నట్లుండి ఆ ట్రాఫిక్ వలయంలోకి అంబులెన్స్ వచ్చింది. ఎవరికి వాళ్లు గాబరా పడిపోతున్నారు. ముందు అంబులెన్స్ కి దారి ఇద్దాము అని. అప్పటికే ఒకరి వెనుకాల ఒకరు వాహనాలను ఇరికిచ్చేయడంతో ఎటూ కదలలేని పరిస్థితి. అప్పుడే నా వెనుకనుంచి ఒక పెద్దావిడ బండి దిగి సర్కిల్ సెంటర్ లో నిల్చొని వాహనాలను వరుస క్రమంలో పంపిస్తుంది. ముందు అంబులెన్స్ ఉన్న లైన్ ని పంపారు. ఆమెను చూసి ఇంకో ఇద్దరు తోడుగా వెళ్లారు. ట్రాఫిక్ అయిదు నిమిషాల్లో క్లియర్ అయింది. నిజానికి ఆ సమయంలో స్పందించాల్సింది అక్కడ ఉన్న యువత. సమాజంలో ఎవరూ మనకి ఫలానా మంచి పని చేయమని ఉద్భోధించరు సందర్భానుసారం సొంత నిర్ణయం తీసుకొని ముందుకు కదలాలి.  ఇలాంటి సమయాల్లో చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అంటే కర్ర పెత్తనం కాదు. భాధ్యతను నిర్వర్తించడం.ఆ సమయానికి ఆ పెద్దావిడ నాకు ఒక హీరో లా అనిపించారు. ఇక నుంచి ఇలాంటి సమస్య ఎక్కడ ఎదురైనా యువత స్పందిస్తే బాధ్యతాయుత సమాజాన్ని చూడగలం. ◆ వెంకటేష్ పువ్వాడ    

ఎలాంటి ధైర్యం కావాలి?

గాంధీజీకి, సుభాష్ చంద్రబోస్ కి చాలా ధైర్యం. బ్రిటిష్ వాళ్లను ఎదిరించి పోరాడి స్వాతంత్రం సిద్ధింపచేశారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మన దేశం నుండి వెళ్లగొట్టారు.. మరి ధైర్యం అనేది మంచిదే కదా అనుకుంటున్నారా? కానీ ఒసామా బిన్ లాడెన్ హిట్లర్ లాంటి వాళ్లను గమనిస్తే, ఇలాంటి వాళ్లకు కూడా చాలా ధైర్యం ఉంది. కానీ వాళ్ల వల్ల దేశానికి అప్రతిష్ఠ వచ్చింది. ఎన్నో మారణహోమాలు చేశారు. ఎందరో కన్నీటికి కారణమయ్యారు. మరి అలాంటి ధైర్యం మంచిదా? అసలు ధైర్యం అంటే ఏంటి?? మీరు ఒక ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నారు. ఆఫీస్ కి టైం అవుతుంది. దాంతో మీరు సిగ్నల్ క్రాస్ చేసి పోలీస్ ముందు నుండి వెళ్లిపోయారు. మీరు చాలా ధైర్యవంతులు. మీరు ఇంకొక సందర్భంలో అర్ధరాత్రి ఎవరు లేని సమయంలో కూడా రెడ్ లైట్ చూసి దాని అతిక్రమించ లేదు. ఆగి వెళ్లారు. దీనికి కూడా ధైర్యం ఉండాల్సిందే. ఏమంటారు? ఈ రెండు సందర్భాల్లో ఏ సమయంలో మీకు ధైర్యం ఎక్కువగా ఉంది? ఆలోచించి చెప్పండి .. ఎటువంటి ధైర్యం మీకు రాత్రిపూట మనశ్శాంతిగా నిద్రపోయే అవకాశాన్ని ఇస్తుంది? కచ్చితంగా మొదటిది అయితే కాదు.  మీరు ఒక సినిమాకి వెళ్లారు.. అందులో విలన్ కి కూడా ధైర్యం ఉంటుంది. హీరో కూడా చాలా ధైర్యవంతుడు. మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు హీరోనా ?విలనా? ఖచ్చితంగా హీరోయే అందరికీ నచ్చుతాడు అవునా? ఒక్కోసారి మనం నో అని చెప్పడానికి కూడా సంకోచిస్తాము. ఈ మధ్యనే నేను నో చెప్పడం అలవాటు చేసుకున్నాను. ముఖ్యంగా మనకి బాగా పరిచయస్తులకి ,సన్నిహితులకు నో చెప్పడం చాలా కష్టం. వారిని నొప్పించకుండా నో అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. నా స్నేహితుడు ఒకరు నాతోపాటు చదువుకుంటాను అని కంబైండ్ స్టడీస్ పేరుతో రోజంతా నాతో గడిపేవాడు. ఆ రోజులో చదువు కన్నా మా మధ్య వేరే సంభాషణలే ఎక్కువగా ఉండేవి. రోజంతా ఇలా గడిపేసాక, అయ్యో అని బాధపడడం తప్ప నేను చేసేది ఏమీ ఉండేది కాదు. అతనికి రావద్దు నన్ను ఒంటరిగా చదువుకోని అని చెప్పాలంటే ఎక్కడ ఫీల్ అవుతుందేమోనని నాలో తెలియని భయం. ఇలా కొన్ని రోజులు గడిచాక నేను అందుకోవలసిన టార్గెట్ అందుకోలేక పోయాను. సిలబస్ కంప్లీట్ అవలేదు. అలాంటప్పుడు ఓ రోజు ధైర్యం చేసి అతనికి రావద్దని మెల్లగా చెప్పాను. అదేంటో అతను కూడా "నేను కూడా అదే అనుకుంటున్నాను. మనిద్దరం కలుస్తుంటే మాటలు ఎక్కువగా దొర్లుతున్నాయి. నేను రాను అని చెప్తే నువ్వు బాధపడతావ్ ఏమోనని చెప్పలేకపోయాను. మనం ఒంటరిగానే చదువుకుందాం. ఆదివారం పూట మనం వారమంతా ఏం చదివామో చర్చించుకుందాం" అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది. నేను కొద్దిగా ధైర్యం చేసి ఈ విషయం ముందే అతనికి చెప్పి ఉంటే ఇన్ని రోజులు వృధా అయ్యేవి కాదేమో అనిపించింది. మీకు మొదటిసారి సిగరెట్ తాగాలన్నా లిక్కర్ తాగాలన్న ధైర్యం కావాలి. కానీ ఆ ధైర్యమే మీ పతనానికి దారి తీస్తుంది అయితే మీ జీవితాన్ని నిర్మిస్తున్నదో అటువంటి ధైర్యం నీలో పెంపొందించుకోవాలి. కాలేజీ కుర్రాళ్ళ ని చూస్తూ ఉంటాను. అమ్మాయిలను ఏడిపిస్తూ ఉంటారు. బైక్ మీద విన్యాసాలు చేస్తారు పెద్దవాళ్ళను ప్రొఫెసర్లను ఎగతాళి చేస్తారు. వీటన్నిటికి కూడా ధైర్యం కావాలి. కానీ బాధ్యతాయుతమైన ధైర్యం మాత్రం వీళ్లలో మచ్చుకైనా కనిపించదు. ఇటువంటి సాహసపరులలో ఎంతమంది ఇది దేశ రక్షణలో భాగస్వాములై ఒక సైనికుడిలా సన్మార్గంలో నడుస్తారో వేళ్ళతో లెక్కించవచ్చు. ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం కాదు. భయంతో పాటు పయనించడం. మీరు కొత్తగా ఆఫీస్ లో చేరారు కొద్దిగా భయం ఉంటుంది అయినా భయాన్ని చిరునవ్వుల దాచేస్తూ మీ కొలీగ్స్ తో సత్ సంబంధాలు ఏర్పరుచుకుని హాయిగా జీవితాన్ని నిర్మించుకుంటున్నారు అంటే మీరు కూడా ధైర్యవంతులే. గొప్ప గొప్ప సాహసాలు చేస్తేనే సాహసవంతులు గారు. మిమ్మల్ని ఎవరూ చూడకపోయినా మీరు మీలా ఉండడానికి ఇష్టపడుతున్నారు అంటే మీరు ధైర్యవంతులు. బాధ్యతాయుతమైన ధైర్యంతో , మీ సాటి వారికి మార్గదర్శనం ఇస్తారో, లేదా బాధ్యత లేని ధైర్యంతో ఒక వార్నింగ్ లాగా మిగులుతారో మీరే నిర్ణయించుకోవాలి. ◆ వెంకటేష్ పువ్వాడ  

Lesser known facts about Independence

People often won’t recognise the value of freedom unless they lose it! So Independence day is not just a celebration, but also stands as a reminder of the struggle we have mad t achieve it. On such occasion let’s gather some lesser known facts regarding our days of Independence... First Independence Day - 1930 Since the 18th century, many movements and agitations were run to achieve freedom from the British rule. Most of us are even aware of the Sepoy Mutiny that took place in 1857. But the call for complete sovereignty was on rise by 1920’s. The congress had to join the call and demand for `Purna Swaraj’ in 1929 at a session in Lahore. It even had announced that from there on, January 26th would be celebrated as an Independence Day. Till 1947, January 26th was indeed observed as Independence Day to invoke pride among the Indians.   Why was August 15 chosen? England was fed up with the rebellions in India and exhausted from the Second World War. It has no other way than to grant Independence for India. So it has sent Lord Mountbatten to wrap up the issue. Though everything was resolved by the July of 1947, Mountbatten has chosen to wait till August 15. The reason! It was the second anniversary of Japan's surrender to Allied Forces in World War II. (Britain was a part of those Allied Forces)   565 states! There were around 565 princely states in India at the time of Independence. They were ruled by various rulers. Each ruler acted as if his kingdom is unique and independent from the neighbouring territories. Bringing all such Princely states under the control of Indian Government was a Hercules task. The first Deputy Prime Minister of India- Sardar Vallaabhai Patel achieved such task. Through pampering and threatening... Patel saw that states were dissolved into one single nation. That is the reason why his birthday is being celebrated as Ekta Diwas!   Operation Polo It was a code name given to the military operation on Hyderabad! As the princely states began to join the Indian nation one by one... a few states dreamt of being independent forever. Hyderabad was one such state. Osman Ali Khan, the Nizam of Hyderabad by that time has not only resisted joining the nation but also started a private militia named Razakars. After the failure of diplomatic process, Indian government has led its military over Hyderabad on 13th September 1948. After five days of military action, Nizam had to accept his defeat and join the nation and that was 18th September. Controversy of National Anthem Everyone is aware of `Jana Gana Mana’ to be our national anthem. It was written a long ago in 1911 and was sung at the Congress session of Calcutta on 27th December 1911. Many critics began to blame that the words "Bharat Bhagya vidhata" and "Adhinayaka Jayahe" were used to praise the then visiting ruler of England - Geroge V. But Tagore has categorically denied this again and again. He once said- `That Lord of Destiny, that Reader of the Collective Mind of India, that Perennial Guide, could never be George V, George VI, or any other George’. On 24th January 1950, Jana Gana Mana was adopted as the National Anthem by the Constituent Assembly.     - Nirjara.