తోటి విద్యార్థిని తరగతి గదిలో కాల్చి చంపిన టెన్త్ క్లాస్ స్టూడెంట్
posted on Dec 31, 2020 @ 10:01PM
టెన్త్ క్లాస్ చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య తరగతి గదిలో కూర్చునే సీటు కోసం జరిగిన గొడవ ఏకంగా ఒక బాలుడి ప్రాణాలు బలి తీసుకొంది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. క్లాస్ రూములో సీటు కోసం పదో తరగతి విద్యార్థులు ఇద్దరు నిన్న గొడవ పడ్డారు. దీంతో కోపంతో రగలిపోయిన ఒక బాలుడు ఈ ఉదయం స్కూలుకు వస్తూ తన అంకుల్ తుపాకిని వెంట తెచ్చుకున్నాడు. అతడు వచ్చీ రావడంతోనే నిన్న తనతో గొడవకు దిగిన స్నేహితుడిపై కాల్పులు జరిపాడు. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో రెండు పిరియడ్లు ముగిసిన తర్వాత ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.
ఆ బాలుడు మొత్తం మూడుసార్లు కాల్పులు జరిపాడని, వాటిలో ఒక తూటా పొట్టలోకి, మరొకటి చాతీలోకి, మూడోది తలలోకి దూసుకుపోయినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ కాల్పులలో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు చెప్పారు. అయితే కాల్పుల జరిపిన తరువాత నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అంతేకాకుండా పై అంతస్తు నుంచి కిందికి వచ్చిన అతడు తనను పట్టుకునేందుకు వచ్చిన వారిని బెదిరించేందుకు మరోసారి గాల్లోకి కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. చివరికి కొంత మంది ఉపాధ్యాయులు అతికష్టం మీద ఆ బాలుడిని పట్టుకుని తుపాకి లాక్కున్నారు. అయినప్పటికీ అతడు వారిని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసాడు. ఈలోగా ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు వచ్చి బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడైన బాలుడు తుపాకిని తన అంకుల్ నుంచి దొంగలించి తీసుకు వచ్చినట్లుగా గుర్తించారు. ఆ బాలుడి అంకుల్ సైన్యంలో పనిచేస్తుంటారని, ఆయన సెలవులపై ఇంటికి రాగా.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా అయన లైసెన్స్డ్ తుపాకిని తీసుకొచ్చి ఈ అఘాయిత్యనికి పాల్పడినట్టు పోలీసు అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. బాలుడి పుస్తకాల సంచిలో మరో నాటు తుపాకి కూడా ఉందని, పోలీసులు దానిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అయన తెలిపారు.