కనకపు సింహాసనంపై శునకం కూర్చొన్నట్లు: మండిపడ్డ బాలకృష్ణ
posted on Jan 8, 2021 @ 9:57AM
అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే.. ఢిల్లీ తరహా ఉద్యమం తప్పదని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రెండు రోజులుగా తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన వర్షానికి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ-క్రాప్ బుకింగ్లో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ ప్రభుత్వంపై అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఏం చెప్పినా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అయన మండిపడ్డారు.
‘‘కనకపు సింహాసనంపై శునకం కూర్చొన్న విధంగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన సాగుతోంది. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోగా... పంట ఉత్పత్తులను దళారుల పాలుచేస్తోంది’’ అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు. అనంతపురం జిల్లా లేపాక్షి మండలం శిరివరంలో ప్రస్తుతం కల్లాలలో ఉన్న మొక్కజొన్నలను పరిశీలించి, రైతులతో ఆయన మాట్లాడారు. కులాలు, మతాల పేరుతో సమాజాన్ని విచ్ఛిన్నం చేసి పాలన సాగిస్తున్నారని అయన ఆరోపించారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులపైనా అయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను కనుక నెరవేర్చకపోతే త్వరలో ఢిల్లీ తరహా రైతు ఉద్యమాన్ని చేపడతామని బాలకృష్ణ ఈ సందర్భంగా హెచ్చరించారు.