వారంలో 9 శాతం పెరిగిన మృతులు! 60 దేశాల్లో కరోనా స్ట్రెయిన్
posted on Jan 20, 2021 @ 3:08PM
ఏడాది దాటినా ప్రపంచం ఇంకా కరోనా మహమ్మారితో అల్లాడుతూనే ఉంది. కొత్త రూపంలో విజృంభిస్తూ వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త రకం వైరస్.. కరోనా స్ట్రెయిన్ శరవేగంగా ప్రపంచం మొత్తం పాకేస్తోంది. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో బ్రిటన్ కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. బుధవారం కొవిడ్ వీక్లి రిపోర్టును విడుదల చేసిన డబ్ల్యూహెచ్ వో.. అందులో ఈ విషయాన్ని పేర్కొంది. గత వారంలోనే 10 దేశాలకు కరోనా స్ట్రెయిన్ వ్యాపించిందని వెల్లడించింది. దీంతో పాటు దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన మరో రకం కరోనా 23 దేశాలకు విస్తరించిందని చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా గత వారంలో 47 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసులు 6 శాతం తగ్గాయి. అయితే కరోనా మరణాలు మాత్రం పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రికార్డ్ స్థాయిలో ఒక్క వారంలోనే 93 వేల మంది కరోనాకు బలయ్యారు. అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 9 శాతం అధికం.
మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9.3 కోట్ల మందికి కరోనా సోకగా.. 20 లక్షల మందికపైగా మరణించారని తన నివేదికలో వివరించింది డబ్ల్యూహెచ్ వో.
చాలా దేశాల్లో ప్రస్తుతం విద్యా సంస్థలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లల సేఫ్టీ కోసం పలు సూచనలు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. స్కూళ్లు తెరవాలనుకుంటే కరోనా కేసులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పాఠశాలల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా.. అతి తక్కువ మంది విద్యార్థులతో తరగతులు నిర్వహించాలని సూచించింది. సామూహిక వ్యాప్తి ఉన్న చోట కరోనా కేసులు ఎక్కువయ్యే ప్రమాదముందని, అలాంటి చోట విద్యార్థులు, సిబ్బందికి మహమ్మారి సోకకుండా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. విద్యార్థుల తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు పరిస్థితిపై చర్చించాలని చెప్పింది డబ్ల్యూహెచ్ వో.