పబ్ జీ ఆడుకుంటున్నావా జగన్! విశాఖలో చంద్రబాబు విశ్వరూపం
posted on Feb 16, 2021 @ 3:38PM
స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖ నగరం లేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తుంటే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. జగన్ ఎక్కడున్నావ్.. పబ్జీ ఆడుకుంటున్నావా? విశాఖను దోచుకోవాలనుకుంటున్నారా? అంటూ చంద్రబాబు నిలదీశారు. ఆనాడు ఉక్కు ఉద్యమంలో ఎవరూ తుపాకులకు భయపడలేదని, 32 మంది ప్రాణత్యాగాలు చేశారని చంద్రబాబు అన్నారు. ఇందిరాగాంధీ అంతటివారు సైతం దిగొచ్చారని తెలిపారు. నాడు అంతమంది ప్రాణత్యాగం చేస్తే, వారి ప్రాణత్యాగాల విలువ తెలియని వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఓట్లు వేశాక జగన్ రెడ్డికి ప్రజలతో అవసరం తీరిపోయిందని, అందుకే హోదా గురించి మాట్లాడడంలేదని అన్నారు. ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి రాష్ట్రంలో విధ్వంస పాలన షురూ చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించిన సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ అని, దీని ద్వారా రూ.33 వేల కోట్ల పన్నులు చెల్లించారని చంద్రబాబు వివరించారు. ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు కూడా పన్నులు కట్టారని తెలిపారు.తాను మెచ్చే నగరం ఎప్పటికీ విశాఖపట్నమేనని ఉద్ఘాటించారు. విశాఖ మంచివాళ్లు ఉండే నగరం అని చంద్రబాబు అభివర్ణించారు. ఇక్కడి ప్రజలు ఎంతో నీతి నిజాయతీపరులని, అందుకే ఈ నగరాన్ని తాను అమితంగా ఇష్టపడతానని వివరించారు. ఒకప్పుడు చిన్నగ్రామంగా ఉన్న విశాఖ నేడు ఆసియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉందన్నారు టీడీపీ అధినేత.
‘విశాఖ ఆత్మను అమ్మితే మీరు ఆమోదిస్తారా? విశాఖ స్టీల్ సిటీని స్టోలెన్ సిటీగా చేస్తే మీరు అంగీకరిస్తారా? విశాఖ ఉక్కపై సీఎం ఎందుకు మాట్లాడటం లేదు. నోరు పడిపోయిందా? విశాఖ ప్రజలు మంచివాళ్ళు అయినా పిరికివారు. విశాఖ ఉక్కు సంకల్పాన్ని అమ్మిస్తే.. ఊరుకోం. విశాఖపట్నం నాకు ప్రాణం.. అందర్నీ అడిగే అమరావతి ప్రకటించాను. విజయసాయిరెడ్డి అంతు చూస్తాం. ముఖ్యమంత్రి తేలు కుట్టిన దొంగ. రేపు దొంగ స్వామిని కలవటానికి సీఎం వస్తున్నారు. అందరూ నన్ను నువ్వు చేతగానివాడివి... తిట్టలేవు అని అంటారు. విశాఖ స్టీల్ సాధిస్తావా? లేక నా వల్ల కాదు అని రాజీనామా చేసి జైలుకు పోతావో పో’ అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైజాగ్ లో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన దీక్షకు టీడీపీ అధినేత చంద్రబాబు మద్దతు పలికారు. విశాఖ వచ్చిన చంద్రబాబు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లాను కలిసి సంఘీభావం ప్రకటించారు. దీక్ష శిబిరం వద్ద భారీగా హాజరైన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమానికి పల్లా శ్రీనివాసరావు తన దీక్షతో ఊపిరి పోశారని చెప్పారు చంద్రబాబు.