కేంద్రం సాంకేతిక ఆలోచ‌న‌.. విద్యుత్ వాహ‌నాలు

ఉన్న‌ది వండి వార్చ‌డం రాదుగాని వ‌డియాలు పెడ‌దామ‌న్న‌దిట వెన‌క‌టికి  ఓ పెద్దామె. అస‌లే దేశంలో విద్యుత్ రంగం అధ్వాన్నంగా వుంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుంటే మోదీ స‌ర్కార్ విద్యుత్ వాహ‌నాల‌కు వీలు క‌ల్పించే ప‌నిలో ప‌డింది. పైగా కాలుష్య నివార‌ణ‌కు ఇదే  గొప్ప మార్గమ‌ని  బిజెపీ స‌ర్కార్  ప్ర‌క‌టిం చింది. కాలుష్యం పెరిగిపోతోంద‌న్న‌ది దేశంలో ఎవ‌ర్న‌డిగినా చెబుతారు. కానీ కాలుష్య‌ నియంత్ర ణ సంస్థ ల నిర్వాకం గురించి గ‌ట్టిగా ఏ ప్ర‌భుత్వ‌మూ ప‌ట్టించుకున్న‌పాపాన పోలేదు. ఇపుడు హ‌ఠాత్తుగా  విద్యుత్ వాహ‌నాలకు హైవేల‌ను   అనువుగా మార్చ‌డానికి  ప‌థ‌క ర‌చ‌న చేస్తున్నారు. దేశంలో టెక్నాలజీ పెరిగిపోతోంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర సర్కార్‌ భారీ ప్రణాళికలు  రచిస్తోం ది. టెక్నాలజీని ఉపయోగించి వాహనాలకు మెరుగైన హంగులు అద్దుతోంది. విద్యుత్‌తో నడిచే రైళ్ల మాదిరి గానే  ఇక వాహనాలు కూడా నడవనున్నాయి. హైవేల వెంట ఎలక్ట్రిక్‌ వైర్లను ఏర్పాటు చేసిన వాహనాలు విద్యుత్‌తో నడిచే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది కేంద్రం. విద్యుత్ వాహ‌నాలు ఉత్ప‌త్తిచేస్తున్న‌వారు వాటి వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని గ్ర‌హించి వెన‌క్కి తీసుకోవ‌డం చూస్తున్నాం. ఇపుడు  ప్ర‌త్యేకించి విద్యుత్ లైన్లు వేసి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించి విద్యుత్ వాహనాలను ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. కానీ చీటికీ మాటికీ ఓవ‌ర్‌లోడ్‌, వ‌ర్షాల తో విద్యుత్ లైన్లు దెబ్బ‌తినే ప‌రిస్థితి వున్న మ‌న దేశంలో ఈ సాంకేతిక ఆలోచ‌న ఏ మేర‌కు స‌ఫ‌ల‌మ‌వు తుంద‌న్న‌ది ఆలోచించాలి.  ఇక ఢిల్లీ  ముంబై మధ్య ఎలక్ట్రిక్ హైవే నిర్మిం చాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, అక్కడ ఓవర్ హెడ్ వైర్ల సాయంతో వాహనాలకు విద్యుత్ సరఫరా చేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపిన విష యం తెలిసిందే. అన్ని జిల్లాలను నాలుగు లేన్ల రహదారితో అనుసంధానించాలని ఆయన మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కాలుష్యాన్ని తగ్గించేం దుకు భారీ వాహన యజమానులందరూ ప్రత్యామ్నాయ ఇంధ నాలైన ఇథనాల్, మిథనాల్, గ్రీన్ హైడ్రోజన్ ఈజ్‌లను ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఎలక్ట్రిక్‌ హైవే అంటే వాహనాలు ఈ రహదారులపై వెళ్తున్న క్రమంలో ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ లైన్‌ సరఫరా చేస్తారు. రైల్వే ట్రాక్‌ల మాదిరిగానే ఈ విద్యుత్‌ లైన్లు ఉంటాయి. హైవే పొడవున ఓవర్‌ హెడ్‌ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేస్తారు. ట్రాలీ బస్సులు, ట్రాలీ ట్రక్కులను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని నిర్మూలించ డంతో పాటు రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.  అన్ని జిల్లా కేంద్రాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానం చేయనున్నా రు. రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరుగుతుండటంతో  ఆర్‌టీఓల ద్వారా అందే సేవలను డిజిటలైజ్‌ చేస్తామని మంత్రి వెల్లడించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను తగ్గించడమే తమ లక్ష్య మని అన్నారు.

సీత‌క్క పొర‌పాటు ప్ర‌భావితం చేస్తుందా?

దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఓటు వేసి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క.. ఓటింగ్‌లో భాగంగా తప్పిదం చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన త‌ర్వాత జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక ఇదే మొద‌టిది కావ‌డం, ఓటింగ్‌లో అప శృతి దేనికి దారితీస్తుందా అని కాంగ్రెస్ వ‌ర్గాలు ఆందోళ‌లో ప‌డ్డాయి. ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌ప‌రిచిన య‌శ్వంత్ సిన్హాకు ఓటు వేయాల్సిన సీత‌క్క పొర‌పాటున ఎన్‌డిఏ బ‌ల‌ప‌రిచిన ద్రౌప‌ది ముర్ముకు ఓటువేశారు. ఇది నిజంగానే సాంకేతిక త‌ప్పిదంలా జ‌రిగిపోయింద‌నే  అంటున్నారు. అంటే ఓటింగ్ విధానంలోని సాంకే తిక‌త ఆమెను కాస్తంత కంగారుపెట్టింద‌నే అనుకోవాలి. ఎందుకంటే ఆమె ఆ త‌ర్వాత  మీడియాతో పొర పాటు ప‌డిన‌ట్టే చెప్పారు. అంతే కాదు.. తాను పొరపాటున ఒకరికి వేయాల్సిన తొలి ప్రాధాన్యతా ఓటు మరొకరికి వేశాననీ, తన బ్యాలెట్ క్యాన్సిల్ చేసి మరొకటి ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని కోరారు కూడా. అయితే ఆయన నిరాకరించడంతో చేసేది లేక తొలి ప్రాధాన్యతా ఓటు ముర్ముకు వేసిన బ్యాలెట్ పేపర్ నే ఓటు బాక్సులో వేశారు. ప్ర‌తిప‌క్షాల‌న్నీ య‌శ్వంత్ సింగ్ వంటి రాజ‌కీయానుభ‌వం మెండుగా వున్న‌ వ్యక్తిని రాష్ట్ర‌ప‌తి గా చూడాల‌ని ఎంతో ఆశిస్తున్నారు. బిజెపీ స్వార్ధ ప్ర‌యోజ‌నాల‌కు ముర్మును రాష్ఠ్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించి దేశ‌మంతా భారీ ప్ర‌చారం చేశారు. ఆమె కేవ‌లం వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు చెందిన మ‌హిళ‌గానే కాకుండా  జార్ఖండ్ గ‌వ ర్న‌ర్ గాను, బిజెపి సీనియ‌ర్ల అభిమానిగాను విజ‌యావ‌కాశాలున్నాయనే ప్ర‌చారం వుంది.  కానీ  య‌శ్వంత్ కే అవ‌కాశాలు మెండుగా వున్నాయ‌న్నది విప‌క్షాలు అంచ‌నాలు బాగా ప్రచారంలో వున్నాయి. 2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోవ‌డంతో ఇపుడు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల‌కు ప్ర‌త్యేకంగా ఓటు విలువ నిర్ధారించ‌వ‌ల‌సి వ‌చ్చింది.  దీని ప్ర‌కారం తెలంగాణా నుంచి ఎన్నిక‌యిన 119 ఎమ్మెల్యేల ఓటు విలువ 15,708 అని అంచ‌నా. కాగా ఏపీ నుంచి ఎన్నిక‌యిన 175 మంది ఎమ్మెల్యేల ఓటు విలువ 27,825 వుంది.  ఎంపీల విష‌యానికి వ‌స్తే, తెలంగాణా నుంచి 17 లోక్‌స‌భ‌, 7 రాజ్య‌స‌భ మంది  స‌భ్యులు న్నారు. అంటే  మొత్తం  ఓటు విలువ 16,992 .  ఆంధ్రాకు సంబంధించి 25 మంది లోక్‌స‌భ‌, 11 మంది రాజ్య‌స‌భ స‌భ్యుల విలువ 25,488.

బడుగులపై బిజెపీ జీఎస్టీ బండ‌!

జీతం జీవులు పాల‌కుల  దృష్టిలో మ‌నుషులు కారు   ఓట్లు  మాత్రమే.. అంటాడు ఒక క‌థ‌లో ఒక ప్ర‌భుత్వోద్యోగి.  ఇది నిత్య స‌త్యం. ఓట్లు వేయ‌డానికి  కాస్తంత బ‌లంగా వుండాలంటే తినాలి క‌దా అని తిన‌డానికి ప‌ప్పు, ఉప్పు, నూనె తెచ్చుకోవ‌డ‌మే త‌ప్ప అవి మ‌న‌ల్ని మింగేస్తున్నాయ‌న్న‌ది మెల్ల‌గా ప్ర‌భుత్వాలే చ‌ల్ల‌గా ప్ర‌క టన‌ల‌తో చెబుతూన్నాయి. త‌రాలు మారినా మారని అక్ష‌ర స‌త్యం ఇది . బొత్తిగా మింగుడుకి  ఇష్ట‌ప‌డ‌ని నిజం.  ఇప్పుడు బిజెపి ప్ర‌భుత్వం కూడా అదే ప‌ని చేసింది. మీ జీవితాల‌కు మాది భ‌రోసా అంటూనే  జీఎస్టీ స్లాబు ల్లో తీవ్ర మార్పులు చేప‌ట్టింది. దీంతో జున్ను, బెల్లం, పాలు, మ‌జ్జిగ, గోధుమ‌లు, ఆటా   ధ‌ర‌లు పెరుగు తాయి. ఇక దుకాణం వాడు వాడి బీడీ, రిక్షా, ఆటో ఖ‌ర్చూ క‌లిసి మ‌రో వంద వేసుకుంటాడు.  ఇప్పటి వరకు జీఎస్టీ వర్తించని పాలు, మజ్జిగ, వెన్న, జున్ను, ఆటా వంటి నిత్యావాసరాలపై జీఎస్టీ మోత మొదలు కానుంది. పనీర్, పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగపై 5 శాతం జీఎస్టీ అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబుల్లో పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే.  జీఎస్టీ స్లాబుల్లో చేసిన మార్పులు సోమ‌వారం నుంచి అమల్లోకి వచ్చేశాయి.  పనీర్, పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ, ఆటా, పప్పులు, బియ్యం, బెల్లం, గోధుమలు, బజ్రా, జొన్నలు వంటి వాటిపై కూడా 5 శాతం జీ ఎస్టీ అమలు చేయనున్నారు.  ఆసుపత్రిలోని రూ. 5000 గదులపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీ ఎస్టీ విధించనుంది.  దేశంలో అన్ని ప్రాం తాల్లోనూ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల కంటే ప్ర‌యివేటు ఆస్ప‌త్రులే మేటి సాంకేతిక‌త‌తో ఆక‌ట్టుకుంటు న్నాయి. అక్క‌డ గ‌దులు క‌నీసం రూ.5000 ఉంటాయి. ఏదో ఒక జ‌బ్బుతో అక్క‌డ చేరితే ఆస్ప‌త్రి వ‌ర్గాలు క‌నీసం వారం రోజులు వుంచి బికారిని చేసే పంపుతాయి. ఈ ప‌రిస్థితుల్లో ఇపుడు ఈ జీఎస్టీ పేర మ‌రో ర‌కం దాడి అస‌లు బ‌త‌క‌డమే క‌నాక‌ష్టం అయ్యే పరిస్థితిని తీసుకువస్తుంది. ఆస్ప‌త్రులంటే భ‌యోత్పా తానికి పురి కొల్పుతుంది ప్ర‌భుత్వ నిర్ణ‌యం. అందువ‌ల్ల  ఆస్ప‌త్రుల్లో జిఎస్టీ బాదుడు వ‌ద్ద‌ని అభ్య‌ర్ధ‌న‌లు మొద‌ల‌య్యాయి.  రూ. 1000 హోటల్ గదులపై 12 శాతం జీఎస్టీ, బ్లేడ్లు, పేపర్ కత్తెరలు, పెన్సిల్ షార్పనర్లు, స్పూన్లపై 18 శాతం జీఎస్టీని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇటీవల చండిగడ్ లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమా వేశంలో ఆమోదం పొందిన తదుపరి.. నేటి నుంచి నూతన వడ్డింపులు అమల్లోకి రానున్నాయి. జీఎస్టీ పేరుతో సామాన్యుల‌కు అవ‌స‌ర‌మైన‌, అందుబాటులో వున్న తినుబండారాలు, వ‌స్తువుల‌న్నింటినీ వారికి దూరం చేయ‌డానికే కంక‌ణం క‌ట్టుకున్న‌ట్టుగా వుంది. ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను అన్ని విధాలా ఆదుకుంటా మ‌ని ప్ర‌చారం చేసుకుంటూనే మ‌రోవంక ఈ విధంగా జీఎస్టీ పేరుతో బాదడం ఎంత‌వ‌ర‌కూ స‌మంజ‌సం అని విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు.

ఆత్మ సాక్షిగా సీతక్క ఓటు!

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా,  రాష్ట్ర పతి ఎన్నికల్లో ఓటు హక్కున ప్రతి ఒక్కరూ, తమ ఆత్మ సాక్షి మేరకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. సిన్హాజీ, అధికార ఎన్డీఎ కూటమి పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలను ముఖ్యంగా బేజేపీలోని మాజీ మిత్రులను ఉద్దేశించి ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. అయితే, ఆయన విజ్ఞప్తిని అటు వారు ఎంతవరకు విన్నారో లేదో గానీ, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క మాత్రం, ‘ఆత్మ సాక్షి’ గానే, ఎన్డీఎ అభ్యర్ధి సాటి గిరిజన మహిళ ద్రౌపతి ముర్ముకు తొలి ప్రాధాన్యత ఓటు వేశారు.  అయితే, ఆమె కావాలని ముర్ముకు ఓటు వేయలేదని, పొరపాటున అలా జరిగిపోయిందని వివరణ ఇచ్చారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటు వేయబోయి పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్మూకు వేశారు. ఆ తర్వాత స్థిమితంగా నాలుక కర్చుకుని, పోరాపాటు జరిగిపోయిందని, ఒంకొక బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని, ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరారు. అయితే అందుకు, నిబంధనలు అనుమతించవని రిటర్నింగ్ అధికారి, ఆమె అభ్యర్ధనను తిరస్కరించారు. దాంతో ఆమె చేసేది లేక ఆ బ్యాలెట్ పేపర్’ నే పూర్తి చేసి డబ్బాలో వేశారు.  అయితే సీతక్క పొరపాటున మొదటి ప్రాధాన్యతా ఓటును ముర్మూకి వేశారా? లేదంటే, కావాలనే ముర్ముకు ఓటేశారా? అనే చర్చ మొదలైంది. నిజానికి, సేతక్క పార్టీతో సంబంధం లేకుండా ఓటేయాలంటే, ముర్ముకే వేయాలి,  సీతక్కలానే ముర్ము కూడా, సమాజంలో  అణగారిన వర్గాలాకు ప్రతినిధిగా రాజకీయాలలో ఉన్నారు. ఒక్క పార్టీ కట్టుబాట్లు మినహా మిగిలి అన్ని విషయాల్లోనూ ఇద్దరిదీ ఒకటే స్వభావం. ఒకటే నైజం .సో .. ఆమె ముర్ముకు పొరపాటున ఓటేసినా, మనసు చెప్పిందనే ఓటేసినా, సేతక్క ఓటు చేరవలసిన వారికే చేరిందని అంటున్నారు.

పవన్ కల్యాణ్ లో అస్పష్టత.. జనసేనలో గందరగోళం!

యుద్ధానికి వెళ్లాలా వ‌ద్దా అనే దానిలో రాజుకి రెండు ఆలోచ‌న‌లు వుండ‌కూడ‌దు. ప్ర‌జా ర‌క్ష‌ణ‌కు కంక‌ణం క‌ట్టుకున్నాన‌ని ప్ర‌గ‌ల్భాలు పలికితే సరిపోదు,   రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు దిగాలి లేదా  రంగంలోకి దూకేయాలి.  గ‌ట్టుమీద కూచుని మ‌రిదీ ఎటెళితే బావుంట‌దంటావ్ అని సంబంధంలేని వాడిని అడిగితే ఎలా?  అదుగో అలా వుంది ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం. అధికార కాంక్ష బాగానే వున్న‌ప్ప‌టికీ, అంతే స్థాయిలో లోపల ఉన్న ఓటమి భయాన్ని బయట పడకుండా ఉత్తర కుమార ప్రగాల్బాలతో పబ్బం గడిపేసుకుందామంటే కుదరదు.   ఒక‌సారి ఒక‌ ర‌కంగా మ‌రోసారి మ‌రో ర‌కంగా ప్ర‌క‌ట‌న‌లు చేస్తే   వీరాభిమానులు కూడా మ‌రో నిర్ణ‌యం తీసునే ప్రమాదం ఉంది. రాజ‌కీయ‌ రంగంలోకి కాళ్లూ చేతులూ పెట్టేసిన త‌ర్వాత ఇంకా తెర మీదే వున్నాన‌కుంటే ఎలా జనసేనానీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జనం కోసమే తన రాజకీయాలు అంటూ చెబుతున్న మాటలపై ఎవరికీ అపనమ్మకం లేదు. అయితే ఆ జనం కోసం ఆయన అధికారంలోకి వచ్చి పని చేయా లనుకుం టున్నారా.. లేక ప్రశ్నించే పార్టీగా అధికారానికి దూరంగా ఉండాలనుకుంటున్నారా అన్న విషయంలోనే ఆయన ప్రసంగాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. అధికారం కాదు.. ప్రజలకు అండగా నిలవడమే ముఖ్యమంటూనే.. ఆయన కాబోయే ముఖ్యమంత్రిని తానేనంటూ ప్రకటనలు చేస్తున్నారు. అదే సమయంలో అదే ప్రసంగంలో ఎన్నికలలో ఓడిపోయినా..ప్రజల పక్షానే నిలబడతానంటూ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే ఆయన   ఆయనపై ఆయన రాజకీయ ప్రస్థానంపై జనంలో పూర్తి విశ్వాసం కనిపించడం లేదు. 2014 ఎన్నికలలో ఎన్నికలకు దూరంగా ఉండి.. తెలుగుదేశం, బీజేపీలకు బయట నుంచి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఆ తరువాత ఏపీలో తెలుగుదేశానికి అధికారాన్ని కట్టబెట్టినది తానేనంటూ క్లెయిమ్ చేసుకోవడం ప్రారంభించారు. సహజంగానే తెలుగుదేశం పార్టీ దానికి ఖండించింది. దాంతో ఇరు పార్టీల మధ్యా దూరం పెరిగింది. ఆ తరువాత 2019 ఎన్నికలలో   తెలుగుదేశం,  బీజేపీలకు దూరం జరిగి సొంతంగా జనసేన ఎన్నికల బరిలోకి దిగింది. అయితే ఆ ఎన్నికలలో పార్టీ  ఘోర పరాజయాన్ని చవి చూసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాలలోనూ పరాజయం పాలయ్యారు. ఇందుకు ప్రధాన కారణం ఆయన ప్రసంగాలలో విజయం పట్ల విశ్వాసం కనిపించకపోవడమేనని అప్పట్లో పరిశీలకులు పలు విశ్లేషణలు చేశారు. ఇది జరిగి మూడేళ్లు అయ్యింది. అప్పటికీ, ఇప్పటికీ ఆయన ప్రసంగాలలో అదే అస్పష్టత, అదే సందిగ్ధం. అంతెందుకు.. ఆయన రాజకీయ అరంగేట్రం చేసినప్పటి కన్య్ఫూజన్ ఇప్పటికీ అలాగే ఉందని పరిశీలకులు అంటున్నారు.   ఆయన ప్రసంగాల్లో ఆయనలోని విశ్వాస లేమి ప్రస్ఫుటంగా ప్రతిధ్వనిస్తుంటుంది. ఒక గందరగోళం విన్నవారికి కలుగుతుంది. అసలు ఆయనలోనే స్పష్టత లేదన్నది తేటతెల్లమౌతుంది.  అసలు ఆయన జనసేనకు ఓటేయమని కోరారా.. వద్దని చెప్పారా అన్న అసుమానం కలుగుతుంది. ఇటీవల ఆయన తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో జరిగిన రైతు భరోసా యాత్ర సభలోనూ  అదే చెప్పారు. అధికారం కోసం రాలేదని విస్పష్టంగా ప్రకటిస్తూనే.. తానే సీఎం, జనసేనదే అధికారం అన్నారు. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనలే ఆయన రాజకీయ నిబద్ధతపై, సీరియస్ నెస్ పై జనంలో సందేహాలకు కారణమౌతున్నాయి. అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని అధినేత విస్పష్టంగా ప్రకటిస్తే జనం ఆయన పార్టీకి ఎందుకు ఓటేస్తారు. పైగా అభ్యర్థిని చూసి కాదు.. అధికారం అక్కర్లేదంటున్న తనను చూసి ఓటేయమని అడిగితే ఎందుకు వేస్తారు. కౌలు రైతులకు సహాయం చేయడం, పేద విద్యార్థులకు సహాయం చేయడం వంటి సామాజిక కార్యక్రమాలు సంపన్నులు చేసే ఛారటీలకు తేడా ఏముంది? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.    అధికార కాంక్ష లేదంటూనే జనసేన అధికారంలోకి వస్తుందనిప్రకటిస్తారు. అధికారం కోసం రాలేదని చెప్పడం జనంలోకి ఎటువంటి ప్రతికూల సంకేతాలు పంపుతుందో..  అధికారం వస్తే ఇవి చేస్తాం అవి చేస్తాం అని అదే నోటితో ప్రకటనలు చేయడం జనసేనానికి, జనసేన పార్టీకి అంత కంటే ఎక్కువ నష్టం చేస్తుందని పరిశీలకుల భావన. అసలు ఒక రాజకీయ పార్టీ అధినేత.. గెలవకపోయినా, అధికారంలోకి రాకపోయినా ఫర్వాలేదని చెప్పాల్సిన అవసరం ఏమిటి? ఏ మూలో తనలో ఉన్న అభద్రతా భావాన్ని చాటుకోవడం తప్ప. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హాజరుకాలేదు.  భాజపాతో పొత్తు ఉన్నప్పటికీ పవన్‌ కల్యాణ్‌.. ప్రధాని సభలో ఎందుకు పాల్గొనలేదనే దానిపై భిన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో భీమవరం పర్యటనలో ఉన్న పవన్‌ కల్యాణ్‌  ప్రధాని పాల్గొనే సభకు తనకు ఆహ్వానం అందిందన్నారు. అయితే  స్థానిక ఎంపీకి ఆహ్వానం అందకపోవడం సరికాదన్న భావనతోనే ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పారు. ఈ మాటల ద్వారా బీజేపీతో దాదాపు తెగతెంపులు జరిగాయన్న సంకేతాలు ఇచ్చారు. ఇక ఓట్ల కోసం తాను కులాన్నే నమ్ముకుంటానన్న అర్ధం వచ్చేలా పవన్ మాట్లాడటం ద్వారా తనలోని రాజకీయ డొల్లతనాన్ని బయట పెట్టేసుకున్నారు. మరో సందర్భంలో అసందర్బంగా రాష్ట్రంలో పొత్తుపొడుపుల చర్చకు తెరతీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల నివ్వను అనడం ద్వారా తానే పొత్తులకు సిద్ధంగా ఉన్నానన్న సంకేతాన్ని ఇచ్చారు. ఆ వెంటనే పొత్తులకు జనసేన ఆప్షన్స్ అంటూ అసాధ్యాలను ఆప్షన్స్ గా పెట్టి ఆచరణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికకే తాను పని చేస్తున్నానని చెప్పకనే చెప్పారు.  ఇన్ని పరస్పర విరుద్ధ వ్యాఖ్యలతో ఆయన జనసేన పార్టీని ఏ దిశగా తీసుకువెళుతున్నారు అన్న సందేహం పార్టీ శ్రేణుల్లోనే కలిగేలా చేస్తున్న పవన్ ఇక జనంలో కలిగిస్తున్న అయోమయానికి, ఆయనలో ఉన్న గందరగోళమే కారణమని పరిశీలకులు అంటున్నారు. 

మత విద్వేషాల‌కంటే మాన‌వ‌త్వం అవ‌స‌రం.. భ‌విష్య‌వాణి

అంతా స్వార్ధ‌మే రాజ్యం చేస్తోంది. త‌మ అధికారం, త‌మ వారి బాగోగులు, త‌మ భూములు  త‌ప్ప ప్ర‌జ‌ల్ని పాలకులు త‌మ బిడ్డ‌లుగా చూసుకోవ‌డంలేద‌ని ఉజ్జ‌యినీ మ‌హాకాళి ఆగ్ర‌హించింది. సికింద్రాబాద్‌ ఉజ్జ యినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతర సందర్భంగా రెండోరోజు సోమవారం రంగం  కార్యక్రమం  నిర్వ హించారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి  వినిపించారు.  కేంద్ర‌, రాష్ట్ర‌ప్రభుత్వాలు త‌మ అధికార దాహంతో ఒక‌రిపై మ‌రొక‌రు ఆధిప‌త్య‌పోరులో ప్ర‌జ‌ల్ని, మ‌త సామర‌స్యాన్ని నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌న్న‌ది మాతంగి స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య‌వాణి గూడార్ధం కావ‌చ్చు. ప్ర‌భుత్వాలు  ప్ర‌జాసంక్షేమానికి పాటుప‌డాలిగాని, ప్ర‌జ‌ల మ‌ధ్య‌, ముఖ్యంగా మ‌తాల‌మ‌ధ్య చిచ్చుపెడుతూ, త‌మ అవ‌స రాల‌కు మ‌తాన్ని, కులాల‌ను వాడుకుంటూ దేశ భిన్న‌త్వంలో ఏక‌త్వ భావ‌న‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వహ‌రిం చ డం రాజ్య‌కాంక్షే త‌ప్ప ప్ర‌జాసంక్షేమానికి ప్రాధాన్య‌నీయ‌డం ఎలా అవుతుంది?  దేశంలో అరాచ‌కం రాజ్యమేలుతోంది. ప్ర‌జ‌ల‌కు ధ‌న‌, మాన ర‌క్ష‌ణ క‌రువైపోతోంది. ప్ర‌తీ రంగాన్ని రాజ కీయ కేంద్రాలుగా మార్చి త‌మ ఆదేశాలు, మాట చెల్లుబాటు చేసుకోవ‌డంలోనే పాల‌కులు దృష్టి పెట్ట‌డం స‌మాజానికి చేటుగా మాతంగి చూచాయిగా ప్ర‌క‌టించారు. సామాజిక అంశాల్లో ప్ర‌జ‌ల‌కు, మ‌రీ ముఖ్యంగా సామాన్యుల‌కు ఏ మేరకు మేలు జ‌రుగుతున్న‌దీ ప‌రిశీలించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది. న్యాయం, పోలీసు వ్య‌వ‌స్థ‌, విద్యా,ఆరోగ్య రంగాల‌న్నీ రాజ‌కీయ రంగు పులుముకుంటున్న ఈ రోజుల్లో సామాన్యుల‌కు స‌మ‌న్యాయం ద‌క్కేలా ప్రభుత్వాలేవీ త‌గిన చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. చ‌ట్టాలు, కోర్టులు స‌మ‌స్తం రాజ‌కీయ నాయ‌కుల క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నాయి. ఈ కార‌ణంగానే అక్ర‌మాల‌కు, అన్యాయా ల‌కు బ‌లైపోతున్నావారి సంఖ్య పెరుగుతోందే గాని, న్యాయం కోసం కోర్టు మెట్లెక్కుతున్న‌వారికి నిజంగా న్యాయం జ‌ర‌గ‌డం లేదు. అన్నింటా మొక్క‌బ‌డిగానే సాగిపోతోంది గాని న్యాయ‌ప‌రంగా ప్ర‌జా సంక్షేమానికి పాటుప‌డుతున్న దాఖ‌లాలు క‌న‌ప‌డ‌టం లేదు.  మ‌హిళ‌లు, పిల్ల‌ల ఆరోగ్యం, ర‌క్ష‌ణ  అంశాల్లో ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య వైఖ‌రి అనేక సంద‌ర్భాలు స్ప‌ష్టం చేస్తు న్నాయి. దేశంలో దాదాపు అన్నిప్రాంతాల్లోనూ  మ‌హిళ‌ల దాడులు, అవ‌మానాలు మితిమీరిపో తుండ‌డం దేశానికి చేటు అని మాతంగి ఆగ్ర‌హాం తెలియ‌జేస్తుంది. రాజ‌కీయాల‌కు ఇస్తున్న ప్రధాన్య‌త సామాజిక న్యాయానికి ఇవ్వ‌డంలేదు. పార్టీలు, నాయ‌కులు, అధికారం చేజిక్కించుకోవాల‌న్న పోరాటాల్లో త‌ల‌మున క‌లై మాన‌వత్వం, భారీ భార‌త బంగారు భ‌విత‌కు కృషి త‌ల‌పెట్ట‌డంలో వెనుకంజ‌లోనే వుండిపోతున్నారు. పిల్ల‌లు, యువ‌త అంద‌రూ రాజ‌కీయ విభేదాల మురుగులో భ‌విష్య‌త్తు ప‌ట్ల భ‌యాందోళ‌న‌తోనే కాలం వెళ్ల‌దీయ‌డం దారుణం. ఈ భ‌యాందోళ‌నల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడ‌వ‌ల‌సిన బాధ్య‌త నిజంగానే నాయ‌కులు తీసుకోవాల్సిన అవ‌స‌రం వుంద‌న్న‌ది మాతంగి వాక్కు సారాంశం. 

పార్లమెంట్ పరీక్ష ఎవరికి?

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ( సోమవారం) నుంచి మొదలవుతున్నాయి. వచ్చేనెల (ఆగష్టు) 12వ తేదీ వరకూ మొత్తం 14 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు జరుగ నున్నాయి. ఈ సమావేశాల్లో  మొత్తం 32 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అందులో 14 బిల్లులు సిద్డమయ్యాయి. మరో వంక ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధం అయ్యాయి.  త్రివిధ దళాల్లో తాత్కాలిక నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్ పథకం, ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తాలని విపక్షాలు భావిస్తున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విపక్షాలు తమ అజెండాను ప్రభుత్వం ముందుంచాయి. అదే సమావేశంలో పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రతిపక్షాలను కోరారు. అలాగే నిబంధనల ప్రకారం అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అగ్నిపథ్, ఆర్ధిక పరిస్థితి, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల. ద్రవ్యల్బణం ఏదంటే అది చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని అయితే, అందుకు ప్రతిపక్షాలు నిబంధనలు పాటించాలని షరతు విధించారు. అయితే  ఇదంతా రొటీన్ గా జరిగే వ్యవహారమే. ఇందులో కొత్తదనం లేదు. చివరకు సభలో ఏమి జరుగుతుందో, అదే నిజం. అదే కీలకం. గత అనుభవాలను గుర్తు చేసుకుంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనేది అందరికీ తెలిసిన విషయమే. లోతుల్లోకి వెళ్ళవలసిన అవసరం లేదు.  అయితే ఏది ఏమైనా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీ వేడీగా సాగే సూచనలు అయితే  స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ వరస ఎన్నికల విజయాలతో మాంచి జోష్ మీదున్న అధికార బీజేపీ / ఎన్డీఎ కూటమి కంటే, వరస ఓటములతో కుదేలైన కాంగ్రెస్ సారథ్య విపక్షానికే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పరీక్ష కాబోతున్నాయని అంటున్నారు. పార్లమెంట్ సమావేశాల తొలి రోజునే రాష్ట్రపతి ఎన్నిక రూపంలో విపక్షాలకు తొలి పరీక్ష ఎదురవుతోంది. ప్రతిపక్షాల ఉమ్మడి  అభ్యర్ధి యశ్వంత్ సిన్హా చివరి యత్నంగా ఆత్మ ప్రబోధం అపీల్ చేశారు. కానీ, అది పనిచేసే వాతావరణం   కనిపించడం లేదని ప్రతిపక్షాలే పెదవి విరుస్తున్నాయి. ప్రతిపక్ష అభ్యర్ధి గెలిచే అవకాశాలు లేవు. అది అందరికీ తెలుసు.   అయితే ఆశించిన మేరకు అయినా యశ్వంత్ సిన్హాకు మద్దతు లభించే అవకాశం ఉందా అంటే అదీ లేదని తేలిపోయింది. ఎందుకంటే ప్రతిపక్ష కూటమి భాగస్వామ్య పార్టీలే ఎన్డీఎ అభ్యర్ధి ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించాయి. చివరికి కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ నుంచి క్రాస్ వోటింగ్ ఉంటుంది అని అంటున్నారు.  అధికార ఎన్డీఎ కూటమి గిరిజన మహిళా ద్రౌపతి ముర్మును అధికార కూటమి అభ్యర్ధిగా ప్రకటించడంతోనే  సీన్ మారిపోయిందని మమతా బెనర్జీనే బహిరంగంగా అంగీకరించారు.  ఈ నేపధ్యంలో యశ్వంత్ సిన్హాకు, ఆశించిన శాతం ఓట్లు రాకపోతే,  ప్రతిపక్షాల  ఐక్యత మరోమారు నవ్వుల పాలవుతుంది. ఎండమావిగా తెలిపోతుందని అంటున్నారు. ఒక విధంగా రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్ష పార్టీల   ఉమ్మడి  ఓటమికి మరో నిదర్శనంగా నిలుస్తుందని, ఆ ప్రభావం రానున్న రోజుల్లో దేశ రాజకీయాలపై ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఇక ఉప రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్ధి మార్గరెట్ ఆల్వా విషయంలోనూ ప్రతిపక్షాలలో అప్పుడే  లుకలుకలు మొదలయ్యాయి. మార్గరెట్ ఆల్వా తన జీవిత చరిత్రలో, కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీకి వెస్ట్ ల్యాండ్ కుంభకోణంతో సంబంధమున్న  విషయాన్ని ప్రస్తావించిచారని బీజేపీ బయట పెట్టింది. ప్రతిపక్ష కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు గాంధీ కుటుంబంపై అంత తీవ్ర ఆరోపణలు చేసిన మార్గరెట్ అల్వాకు కాంగ్రెస్ పార్టీ ఎలా మద్దతు ఇస్తుందని కొందరు  కాంగ్రెస్ నాయకులే ప్రశ్నిస్తున్నారు. మరో వంక, తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ, తెరాసకు కూడా కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతు ఇచ్చే విషయంలో అభ్యంతరాలున్నట్లు తెలుస్తోంది.  ఇతర పార్టీల విషయం ఎలా ఉన్నా, రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా తెరాస మద్దతు ఇచ్చే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా తెలంగాణ రాష్ట్ర పర్యటన సందర్భంగా, కాంగ్రెస్, తెరాసల మధ్య పెద్ద రచ్చే జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెరాస ఆహ్వానం మేరకు రాష్ట్రానికి వచ్చిన యశ్వంత్ సిన్హాను, కాంగ్రెస్ నాయకులు ఎవరూ కలవడానికి వీలు లేదని, హుకుం జారీ చేశారు. కాదని కలిస్తే గోడకేసి కొడతానని హెచ్చరించారు. అంతే కాదు, ఆ ఇంటి (ప్రగతి భవన్) మీద వాలిన కాకి ఈ ఇంటి ( గాంధీ భవన్) మీద వాలేందుకు వీలు లేదని పేర్కొన్నారు. అదీగాక, జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక స్టాండ్ తీసుకున్న కేసీఆర్ మార్గరెట్ అల్వాకు మద్దతు ఇస్తారా?  ఇస్తే, అందుకు అయన ఎలాంటి సాకు చూపుతారు అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.  సో .. ఎలా చూసినా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రభుత్వం, అధికార కూటమి కంటే, ప్రతిపక్షాలకే పెద్ద పరీక్షగా నిలిచే అవకాశమే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఏపీ రోడ్ల వైభోగం చూడ తరమా..!

ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై తెలుగుదేశం, జనసేన ప్రారంభించిన డిజిటల్ క్యాంపెయిన్ కు బ్రహ్మాండమైన స్పందన వస్తోంది. చెత్త రోడ్లు.. చెత్త సీఎం అంటూ తెలుగుదేశం, గుడ్ మార్నింగ్ సిఎం సర్ అంటూ జనసేన రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించిన సంగతి తెలసిందే. వారి క్యాంపెయిన్ కు మద్దతుగా నెటిజనులు సైతం ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిపై సామాజిక మాధ్యమంలో వ్యంగ్య కార్టూన్లు, వ్యాఖ్యలతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ పోస్టులన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనాలను ఆకర్షిస్తున్నాయి. సామాన్య జనులు సైతం రోడ్ల దుస్థితిపై వాస్తవ పరిస్థితికి సామాజిక మాధ్యమం అద్దం పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అద్దాల్లా ఉన్నాయని అధికార పార్టీ కొన్ని ఫొటోలు పెట్టి సొంత భుజాలను తడుముకుంటోంది. అదే సమయంలో రోడ్ల దుస్థితిపై ప్రతిపక్షాల విమర్శలపై మండి పడుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఏపీలోని రోడ్ల బండారాన్ని సామాజిక మాధ్యమం సాక్షిగా బట్టబయలు చేసేశారు. రోడ్ల పరిస్థితిపై వ్యంగ్య బాణాలు సంధిస్తూ ప్రభుత్వ నిర్వాకాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.  వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. చూడగానే ఆకట్టుకునే కార్టూన్లతో సామాజిక మాధ్యమాన్ని హోరెత్తిస్తున్నారు. రోడ్ల దుస్థితిపై నెటిజన్ల పోస్టులు ఇప్పడు సమాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. దీనిపై సామాన్యులు సైతం స్పందిస్తున్నారు.   పెద్ద పెద్ద గోతులతో ఛిద్రమైన రహదారుల చిత్రాలు, వీడియోలకు బలమైన పంచ్ డైలాగులతో... సినిమాలలోని చిత్రాలతో కూడిన మైమ్ లను జోడించి నెటిజన్లు చేస్తున్న పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  గుడ్ మార్నింగ్ సీఎం సర్ అంటూ జనసేన ప్రారంబించిన హాష్ ట్యాగ్ డిజిటల్ క్యాంపైన్ విపరీతంగా  పాపులర్ అయ్యింది. అలాగే తెలుగుదేశం  సోషల్ మీడియా వేదికగా చేస్తున్నప్రచారానికీ ప్రజా స్పందన అమోఘంగా ఉంది. రాష్ట్ర రహదారులపై రాజమహేంద్ర వరంలో ఒక కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అలాగే ఏప్రిల్ 19న మంత్రి కేటీఆర్ ఏపీ రోడ్లపై చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాలలోనూ సంచలనం సృష్టించాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు నొచ్చుకున్న వైకాపా నేతలు తెలంగాణలో రోడ్లు, కరెంట్ పరిస్థితులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఎంతగా ఎదురుదాడి చేసినా కేటీఆర్ ఏపీ రోడ్లపై చేసిన వ్యాఖ్యలకు వచ్చినంత స్పందన వైసీపీ నేతల విమర్శలకు రాలేదు. అసలు వైసీపీ విమర్శలను రెండు రాష్ట్రాలలో కూడా పట్టించుకున్న నాథుడే లేకపోయాడు. ఆ వ్యాఖ్యలను బేస్ గా చేసుకుని ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వ్యంగ్య వైభోగం సామాజిక మాధ్యమంలో బ్రహ్మాండంగా పేలుతోంది. జగన్ నిర్వాకం వల్ల ఏపీలో కార్లు, బైకుల మెకానిక్ లు బాగుపడుతున్నారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.  రాష్ట్రంలో జులై 15నాటికి రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండకూడదు అంటూ జగన్ ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపైనా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.  

టీడీపీకి అనుకూల పరిస్థితుల్లోనూ మాడుగుల త‌ల‌భారం

ప‌రిస్థితులు అనుకూలిస్తున్న‌పుడు పాత స‌మ‌స్య‌లు వెన్నాడితే ఇబ్బందే. స‌మ‌సిపోయి ఉండ‌వ‌చ్చ‌ని అనుకోవ‌డ‌మే పొర‌పాటు. ఇపుడు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబుకి ఉమ్మ‌డి విశాఖ జిల్లా మాడుగుల నియోజ‌క‌వ‌ర్గం మార‌ని గాయంగానే త‌యార‌యింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో అంత‌టా అనుకూల గాలులు వీస్తుండ‌గా మాడుగుల వ‌ర్గ‌పోరు ప‌రిష్కారానికి స్వ‌యంగా రంగ‌ప్ర‌వేశం చేయాల్సిన వ‌స్తుంది. ఇపుడు ఎక్క‌డ‌యినా స‌రే చిన్న‌పాటి విభేదాలు, వ‌ర్గ‌పోరులు ప్ర‌స్తుతం పార్టీకి ఉన్న అవ‌కాశాలపై ప్ర‌భావం చూప‌క పోవు. అందువ‌ల్ల మాడుగ‌ల‌లో మూడు వ‌ర్గాల‌ను ఒక్క‌టిగా చేయాల్సిన భారం బాబు పైనే ప‌డింది. అయితే స‌మ‌స్య‌ను అక్క‌డివారు త‌మ అధినేత‌, పార్టీ ప్ర‌తిష్ట దృష్ట్యా ప‌రిష్క‌రించుకుంటే బాబుకు మేలు చేసిన‌వారే అవుతార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.   ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లా మాడుగుల నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి   పెద్ద  స‌మస్య‌గా మారింది. ఇక్క‌డ 2014, 2019లోనూ టీడీపీ వ‌ర్గ‌పోరు బ‌య‌ట‌ప‌డ‌టంతో వైసీపీకి గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక‌  ఓడిపోయింది. ఆ రెండు ప‌ర్యాయాలు వైసీపీ త‌ర‌ఫున బూడి ముత్యాల‌నాయుడు విజ‌యం సాధించారు. అప్పుడు టీడీపీ త‌ర‌ఫున పోటీచేసిన గ‌విరెడ్డి నాయుడు ఓడిపోయారు.  ముత్యాల నాయుడు ప్ర‌స్తుతం జ‌గ‌న్ మంత్రి వ‌ర్గంలో ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు.  2009లో ఇదే నియోజకవర్గం నుంచి గవిరెడ్డి రామా నాయుడు గెలుపొందడం గమనార్హం. గవిరెడ్డి  రామానాయుడు అంత కీలకంగా ఉండటం లేదని భావించిన టీడీపీ అధిష్టానం ఇటీవల పివీజీ కుమార్ కి ఇన్ ఛార్జి బాధ్యతలు అప్పగించింది.  గవిరెడ్డి రామానాయుడు ఆ సమయంలో ప్రతి గ్రామంలోనూ సీనియర్లను నిర్ల‌క్ష్యం చేయ‌డంతో వారు అసమ్మతివాదులుగా తయారై ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. 2014  ఎన్నికల్లో ఈ గ్రూపు  విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు నాయ కత్వంలో గవిరెడ్డి రామానాయుడిని ఓడించారని చెబుతున్నారు. ఇప్పటికీ ఈ అసమ్మతి గ్రూపు కొనసాగుతోందని  ఇక్క‌డ ప్ర‌చారంలో వుంది. గతంలో టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా గవిరెడ్డి రామా నాయుడు ఉన్నప్పుడు ఆయన గ్రూపుతో పాటు పైలా ప్రసాదరావు గ్రూపు ఉండేది. నియోజకవర్గంలో పార్టీ కేడర్ ని   ఏకం చేయడంలో గవిరెడ్డి విఫలమ య్యారని భావించిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇన్ఛార్జి బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించారు. అప్పట్లో  పార్టీ కార్య‌క‌లాపాల్లో చురుగ్గా ఉన్న‌  పీవీజీ కుమార్ కి ఆ బాధ్యతలు  అప్పగించారు. దీంతో మాడుగుల నియోజకవర్గంలో మూడు గ్రూపులు ఏర్పడ్డాయి. ఒక  గ్రూపుకు గవిరెడ్డి రామానాయుడు, రెండో గ్రూపు పీవీజీ కుమార్,  మూడ‌వ‌ గ్రూపు  పైలా ప్రసాదరావు నాయకత్వం  వహిస్తు న్నారు. టీడీపీ అధిష్టానం ఆశించింది ఒకటైతే,  ఇక్కడ జరిగింది మరొకటి .  పార్టీలో రెండు గ్రూపులు కాస్తా మూడు గ్రూపులు కావ‌డంతో నియోజకవర్గంలోని టీడీపీ కేడర్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని  అంటు న్నారు. దీంతో ఏమి చెయ్యాలో అర్థంకాక టీడీపీ అధినేత చంద్రబాబు తల పట్టుకుంటున్నారని పేర్కొం టున్నారు. ఇటీవల చోడవరంలో జరిగిన అనకాపల్లి జిల్లా టీడీపీ మినీ మహానాడుకు కార్యకర్తలను తరలించడం లోనూ కుమార్ వెనుకబడ్డారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజక వర్గ సమీక్షా సమావేశంలో ఈ గ్రూపులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో వైపు ఇదే సమయంలో పైలా పౌండేషన్ చైర్మన్ పైలా ప్రసాదరావు టీడీపీకి రూ.25 లక్షలు విరాళాన్ని అంద జేశారు. ఈ నేపథ్యంలో మాడుగుల అసెంబ్లీ సీటును చంద్రబాబు వీరి ముగ్గురిలో ఎవరికి కేటాయిస్తారో అని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుం టున్నారు.

మంత్రిని నిలదీసిన మహిళపై మద్యం కేసు!

రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది సామెత. ఇప్పుడు జగన్ సర్కార్ తలచుకుంటే కేసులకు కొదవా అని ఆ సామెతను మార్చుకోవలసిన పరిస్థితి ఏపీలో ఉంది. విపక్ష నేతలు, సొంత పార్టీ ఎంపీ.. సామాన్యులు, మాన్యులు అన్న తేడా లేదు. సర్కార్ ను విమర్శించినా, ప్రశ్నించినా కేసులు పెట్టడానికి పోలీసులు రెడీ అయిపోతుంటారు. కేసు పెట్టినా పెట్టకున్నా పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి కూర్చోబెడతారు. అక్కడ నుంచి రాయబారాలు, హెచ్చరికలు, బెదరింపులు. అవేవీ ఫలించకపోతే.. ఇక కేసు పెట్టి జైల్లో తోయడమే.  జగన్ సర్కార్ ను ఎదిరించినా, నిలదీసినా ఇక అంతే సంగతులు. అలా సర్కార్ ను నిలదీసిన వారు విపక్ష నేతలైనా, సామాన్య జనులైనా వారిని వెంటాడి వేధించడం ఏపీలో షరా మామూలే అన్నట్లుగా తయారైంది. తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి సంగతి తీసుకున్నా, ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడైనా, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. ఇలా చెప్పుకుంటూ పోతే అంకెలు కూడా సరిపోవు. అంతెందుకు ప్రభుత్వ విధానాలను విమర్శించిన సొంత పార్టీ ఎంపీపై కూడా కేసులు పెట్టి వేధించిన చరిత్ర జగన్ సర్కార్ ది. ఇప్పుడు జగన్ సర్కార్ తాజాగా నమోదు చేసిన కేసు చూస్తుంటే ఇక రాష్ట్రంలో ప్రభుత్వానికి తందానా అనకపోతే కేసులు ఎదుర్కొని జైళ్లలో కూర్చోవడం తప్ప మరో గత్యంతరం లేదా అనిపించక మానదు. ఇంతకీ విశేషమేమిటంటే, గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సత్య సాయి జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి సత్యనారాయణను ఓ మహిళ నిలదీశారు. తనకు  పిఛన్ తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తన ఇంటికి రావద్దనీ, వస్తే చెప్పుతో కొడతాననీ హెచ్చరించారు. సహజమే.. ఇంత కాలం వచ్చిన పింఛన్ ను కారణం లేకుండా తీసేస్తే ప్రశ్నించడం సహజమే. ఒకింత ఆగ్రహం ఎక్కువ అయితే.. ఇంటికి రావద్దనడమూ.. ముఖం మీదే తలుపులు మూసేయడమూ, వస్తే మర్యాదగా ఉండదని హెచ్చరించడమూ తప్పెలా అవుతుంది. ఆమె తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇంటికి ఆహ్వానించడమైనా, రావద్దని అనడమైనా.. ఆ ఇంటి యజమానుల ఇష్టం. దానికి కాదనడానికి ఏ ప్రభుత్వానికీ అధికారం లేదు. ఒక సామాన్య మహిళ జగన్ ప్రభుత్వంపై, మంత్రి శంకర నారాయణపై తన ఆగ్రహాన్ని అలా వెళ్లగక్కింది. అప్పటికి ఊరుకుని వెనుదిరిగిన మంత్రి ఆ తరువాత తన అధికార ప్రతాపాన్ని చూపారు. మంత్రిని నిలదీసిన మహిళను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లారు. మద్యం కేసు పెట్టారని అంటున్నారు. అయితే ఆ విషయం ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ ఆమెను పోలీసు స్టేషన్ కు తీసుకు వెళ్లడం నిజం. ఆ తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేయడమూ నిజం. సరిగ్గా మంత్రి శంకరనారాయణను నిలదీసి ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేసిన మరునాడే పోలీసులు ఆమెను స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఎస్టీ వర్గానికి చెందిన ఆ మహిళ ఒక కూలీ. కూలి పని చేసుకుని పొట్టపోసుకునే ఆమె కూలీ పనులు చేసే చోట ఓ ఇసుక దిబ్బలో కర్నాటక బ్రాండ్ మద్యం ప్యాకెట్లు  దొరికాయంటూ పోలీసులు ఆమెను స్టేషన్ కు తీసుకువెళ్లారు.  

మూడు రాజధానుల బిల్లు కోసమేనా..?

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలు ప్రకటించడం, వాయిదా వేయడం ఏపీ సర్కార్ కు ఒక ఆనవాయితీగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. సాధారణంగా అసెబ్లీ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ లేదా అక్టోబర నెలలలో నిర్వహిస్తుంటారు. అయితే జగన మాత్రం ఈ సారి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను జూలైలోనే నిర్వహిస్తామని ప్రకటించారు. అంతా నిజమే కాబోలు అనుకున్నారు. అయితే ఇప్పుడు సమవేశాలు జూలైలో కాదంటున్నారు. ఏలిన వారు ఏం చెబితే అది వినాలి అంత కంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఇంతకీ జగన్ అసలు అసెంబ్లీ సమావేశాలను జూలైలోనే నిర్వహించాలని ఎందుకు భావించారు? మళ్లీ అంతలోనే ఎందుకు వాయిదా వేశారు? ఈ ప్రశ్నలకు సమాధానం జగన్ పార్టీ శ్రేణుల నుంచే వస్తోంది. జగన్ కేబినెట్ లో మంత్రి గుడివాడ అమర్నాద్ ఉరుములేని పిడుగులా అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోనే మళ్లీ మూడు రాజథానుల బిల్లును తీసుకువస్తామని ప్రకటించారు. అసెంబ్లీ వాయిదాకు ఆ బిల్లు రూపకల్పన ఇంకా పూర్తికావడమే కారణమై ఉండవచ్చునని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవంగా ఈ మూడేళ్లలో జగన్ సర్కార్ ఎన్నడూ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పట్ల శ్రద్ధ చూపలేదు. ఇక తప్పదు నిర్వహించి తీరాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మళ్లీ వాయిదా వేసింది.  ఈ సారి అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కీలక బిల్లులు పెట్టబోతున్నట్లు మీడియా సాక్షిగా జగన్ సర్కార్ పలు లీకులు ఇచ్చింది. కీలకం అనగానే జగన్ సర్కార్ కు అన్నిటి కంటే కీలకం, ప్రధానం, ప్రాముఖ్యం మూడు రాజధానులేనని తెలిసిందే. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పటి నుంచి.. అంటే మూడు రాజధానుల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా ఉపసంహరించుకున్నప్పటి నుంచీ న్యాయపరమైన సలహాలు తీసుకుని మరో సారి ఆ బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకురావలన్న లక్ష్యంతోనే వైసీపీ సర్కార్ ఉంది.  ఇటీవలి   వైసీపీ ప్లీనరీలో కూడా తమ విధానం మూడు రాజధానులేనని విస్పష్ట ప్రకటన కూడా చేశారు.   అసెంబ్లీలో మూడు రాజధానుల  బిల్లు మళ్లీ ప్రవేశపెట్టనున్నట్లు కూడా చెప్పరు.  అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టంగా ఉంది.ఆ తీర్పును సవాల్ చేస్తూ  ప్రభుత్వం ఇంకా సుప్రీం కోర్టుకు వెళ్లలేదు.    సుప్రీంలో సవాల్ చేసినా ఫలితం ఉండదన్న న్యాయ నిపుణుల సలహాతోనే జగన్ సర్కార్ సుప్రీం కు వెళ్లలేదని పరిశీలకులు అంటున్నారు. ఇక మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఉన్న ఏకైక ఆప్షన్ అసెంబ్లీలో మరో సారి బిల్లు ప్రవేశ పెట్టడమే.  అందుకోసమే ఈ నెలలోనే నిర్వహించాలని భావించిన అసెంబ్లీ వర్షాల సమావేశాలను వాయిదా వేశారని చెబుతున్నారు. పకడ్బందీగా బిల్లు రూపొందించి  అసెంబ్లీ సమావేశాలలో ప్రవేశ పెట్టడానికి జగన్ సర్కార్ నిర్ణయించుకుందనీ, అందుకే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను వాయిదా వేసిందనీ విశ్లేషిస్తున్నారు.

ఎనిమిదేళ్ల కైలీ.. మ‌న‌సు బ‌హు దొడ్డ‌ది!

బాల్యంలో తండ్రిని కోల్పోవ‌డం జీవితంలో ఎదిగేకొద్దీ పెనుబాధ‌నే ఇస్తుంది. వెన్నుద‌న్నుగా ఉండా ల్సిన తండ్రి లేక‌పోవ‌డం ఆర్ధికంగా, మాన‌సికంగానూ పిల్ల‌ల‌కు స‌మ‌స్యే. పెద్ద‌వారు ఆ ప‌రిస్థితుల‌ను అర్ధంచేసుకుని భ‌విష్య‌త్ జీవితానికి గ‌తాన్ని వ‌దిలే య‌గ‌ల్గుతారు. కానీ  పిల్ల‌లు ఆట‌పాట‌లు, స్కూలు జీవితంలో ప్ర‌తీ సంద‌ర్భంలో తండ్రి లోటు బాగా స‌మ‌స్యాత్మ‌కంగా మారు తుంది. స్కూలు స్నేహితులు, చుట్టుప‌క్క‌ల వారి పిల్ల‌లు, వారి త‌ల్లిదండ్రుల‌ను చూస్తున్న‌పుడు తండ్రిలేని పిల్ల‌ల ప‌రిస్థితి వ‌ర్ణ‌నా తీతం. బ‌య‌టికి చెప్పుకోలేని బాధ వెన్నాడుతూనే వుంటుంది. ఇలాంటి ప‌రిస్థితులు త‌న స్నేహి తులుగాని, మ‌రెవ్వ‌రుగానీ ఎదుర్కోరాద‌ని షెబోయ్‌గాన్‌కు చెందిన కైలీ బ్రూనెట్ అనే ఎనిమిదేళ్ల పిల్ల అనుకుంది.  ఆమె తండ్రి ఆత్మహత్యచేసుకున్నాడ‌ని తెలుసుకున్న‌ది. అస‌లు ఆత్మ‌హ‌త్య ఎందుకు చేసుకుంటా ర‌న్న‌ది ఆమెకు తెలియ‌లేదు. అనేకానేక కార‌ణాలు ఉండ‌వ‌చ్చ‌ని ఎంద‌రో చెప్పారు. కానీ దానికి సంబంధించిన‌ అవగాహన కోసం డబ్బును సేకరించేందుకు ఎనిమిదేళ్ల చిన్నారి నిమ్మరసం స్టాండ్‌ను ఏర్పాటు చేసింది. ఎనిమిదేళ్ల విస్కాన్సిన్ అమ్మాయి, ఇతర పిల్లలు తల్లిదండ్రులు లేకుండా ఎదగ కుండా చూసుకోవడానికి తన వంతు సహాయం చేయాలనుకుంది. ఆత్మహత్య నివారణ కోసం ఆమె నిమ్మరసం 800 షిల్లింగులు సేకరించింది. షెబోయ్‌గాన్‌కు చెందిన కైలీ బ్రూనెట్, తన తండ్రి 32 ఏళ్ల జోర్డాన్ వేక్‌ఫీల్డ్‌తో కలిసి డిస్క్ గోల్ఫ్, వీడియో గేమ్‌లు ఆడటం పార్కు లకు వెళ్లడం గుర్తుచేసుకుంది. అతను చాలా స‌ర‌దా మ‌నిషి, త‌న పట్ల శ్రద్ధ వహించేవాడు. అతను ఎప్పుడూ ఏ విష‌యంలోనూ అస్స‌లు కూతురుని కోప‌గించుకునే వాడు కాదు. కైలీ తండ్రి నవంబర్ 2019లో ఆత్మహత్యతో చనిపోయాడు. అప్ప‌టికి ఆమె చాలా చిన్న వయస్సులో ఉన్నందున, అతను ఎలా చని పోయాడో ఆ సమయంలో కైలీ తల్లి ఆమెకు చెప్పలేదు. ఆమె  తల్లి  30 ఏళ్ల బ్రిటనీ బ్రూనెట్-తిమ్మెస్చ్ ఆ  అపరాధ భావం తోనే ఉండేది.  కానీ ఆమె ఆ సంద‌ర్భాన్ని, సంఘ‌ట‌ న‌ను వివ‌రించే మాన‌సిక స్థితిలో లేదు. అంద‌రూ ఆమెను అర్ధంచేసుకుని చాలాకాలం నుంచి మౌనం వ‌హించారు.  షెబోయ్‌గాన్ ఏరియా స్కూల్ డిస్ట్రిక్ట్ సబ్ సెక్రటరీ అయిన బ్రూనెట్-తిమ్మెష్ కి  తన కూతురు  కైలీ థెరపిస్ట్ ఒక‌రోజు క‌లిశారు. మాట‌ల మ‌ధ్య‌లో ఆమె కైలీకి  అర్ధ‌మ‌య్యేలా మెల్ల‌గా చెప్ప‌మ‌ని కోరారు.  మీరు చివరికి ఆమెకు ఏదో ఒక రోజు చెప్పవలసి ఉంటుంది. ఆమె పెద్ద‌ద‌వుతోంది. పిల్లలు మాట్లా డటం మొదలుపెట్టబోతున్నారు అనీ హెచ్చ‌రించారు. కానీ కొన్ని నెలల క్రితం, కైలీ తన తల్లిని అడిగింది.. తన తండ్రి ఎలా చనిపోయాడో తెలుసుకోవాలనుకుంటున్నానని. కానీ ఆమెకు ఆ సంగ‌తి తెలియ కుండా వుండ‌డ‌మే అవసరమ‌ని  ఆమె తల్లి చెప్ప‌లేదు.  మ‌రో రెండు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ వారి మధ్య పెద్ద చ‌ర్చ‌ జరిగింది. ఈ సంవత్సరం జూలై 9న తన తండ్రి   పుట్టినరోజును పురస్క రించుకుని, కైలీ అతని జ్ఞాపకార్థం నిమ్మరసం స్టాండ్‌ను ఏర్పాటు చేయా లని నిర్ణయించుకుంది, తద్వారా వచ్చిన మొత్తాన్ని షెబోగాన్‌లోని మెంటల్ హెల్త్ అమెరికాకు విరా ళంగా ఇచ్చింది. సేవలను పొందలేని వ్యక్తులకు సేవలను పొందేందుకు సహాయం చేయాలని ఆమె కోరుకుంది, తద్వారా ఇది మరొక వ్యక్తికి జరగదు లేదా మరొక పిల్లవాడు తల్లిదండ్రులు లేకుండా వెళ్లవలసిన అవసరం లేదని ఆమె తల్లి వివరించింది. కైలీ జులై 1, జూలై 8న రెండు రోజులలో నిమ్మ రసం విక్రయించి మొత్తం 800 షిల్లింగులు వసూలు చేసింది. ఇప్పుడు, ఆమె దీనిని వార్షిక సంప్రదా యంగా మార్చాలని యోచిస్తోంది. కైలీ చిన్న‌పిల్లే.. మ‌న‌సు దొడ్డ‌ది.

క్లౌడ్‌బ‌ర్‌స్ట్‌... వ‌రుణుడి అస్త్ర‌మా.. విదేశీ అస్త్ర‌మా? !

గ‌త ప‌ది రోజులుగా అన్ని ప్రాంతాల్లోనూ వ‌ర్షాలు కుమ్మ‌రించిన‌ట్లు ప‌డుతున్నాయి. మంచి  వ‌ర్షాకాలం కాకున్నా కుంభ‌వృష్టి ప‌డింది, ప‌డుతోంద‌న్న వార్త‌లే వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఇవేమంత‌గా మ‌రీ ఆనందం పంచ‌డం లేదు. మేఘారే.. మేఘా..మేఘా.. అంటూ గెంతులెయ్య‌డానికీ వీలులేదు.  అకాల వ‌ర్ష‌మే. అన్ని ప్రాంతాలూ భారీగా న‌ష్ట‌పోయాయి. కానీ స‌మ‌యంగాని స‌మ‌యంలో వ‌చ్చిన ఈ కుంభ‌వృష్టి  వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌ల‌ను ఆలోచించేట్టు చేసింది. తెలంగాణా ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం దీన్ని విదేశీ కుట్ర‌గానే భావిస్తున్నారు. మ‌రి ఇవి వారు పంపిన మేఘ‌శ‌రాలా లేదా క్లౌడ్ బ‌ర్‌స్ట్ అనేది శాస్త్ర‌వేత్త‌లే తేల్చాలి.   ఈ కుంభవృష్టి అనేది చాలాకాలం నుంచి వింటున్న మాట‌. ఇటీవ‌లి కాలంలో వాతావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు అంటున్న మ‌రొక ప‌దం  క్లౌడ్ బ‌ర్‌స్ట్‌! అంటే ఒక గంటలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 110 మిల్లీ మీ టర్ల వర్షం పడితే దానిని కుంభ వృష్టి లేదా క్లౌడ్ బ‌ర్‌స్ట్‌ అంటారు. కుంభం అంటే కుండ అలాగే ఒక కుండ బద్దలు అయ్యి దాని లోని  నీళ్ళు  ఒకేసారి  బయటికి వస్తే ?  క్లౌడ్ బ‌ర్‌స్ట్ అనేది చాలా  అరుదుగా  జరిగే  ప్రక్రియ. దీనిని  కృత్రి మంగా సృష్టించలేరు. అలా చేయాలంటే ఒకే చోట మేఘాలని ఆపేసి అవి  కురి సేట్లుగా చేయాలి. కానీ మేఘాలు ఏమన్నా మేకలు, గొర్రెలా ?  ఒకే చోట ఆపి అవి వర్షం పడేట్లుగా చేయ డానికి ? కృత్రిమ మేఘాలని సృష్టించ వచ్చు అదీ ఆ ప్రాంతంలో కొద్దో గొప్పో మేఘాలు ఉండాలి. కృత్రిమ మేఘా లని సృష్టించి కృత్రిమంగా వర్షాలు కురిపించ వచ్చు అదీ చాలా కొద్ది మొత్తంలో మాత్రమే. గతంలో రాజ శేఖర రెడ్డి గారి హయాంలో కృత్రిమ వర్షం కురిపించడానికి వెదర్ రాడార్ [డాప్లర్ రాడార్] లని  నెల కొల్పి ఆకాశం నుండి విమానం ద్వారా సాలిడ్ సిల్వర్ అయోడిన్[సిల్వర్ అయోడిన్ స్ఫటికములు రూపంలో ] మేఘాలలోకి వదులుతారు అలా వదిలిన సిల్వర్ అయోడిన్ స్ఫటికములు మేఘాలలోని తెమని గ్రహించి వాటిని వర్షంలా కురిసెట్లు చేస్తాయి. విమానం ఖర్చు,సిల్వర్ అయోడిన్ ఖర్చు తడిసి మోపడయింది కానీ వర్షాలు పడలేదు అప్పట్లో దాంతో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అలాంటిది దట్టమ యిన మేఘాలని అదీ ఒకే చోట నిలిపి ఉంచి అవి వర్షించేట్లుగా చేయడం అసంభవం.  గత వారం రోజులుగా పడుతున్న వర్షాలు ఎక్కడా కూడా ఒకే రకంగా పడలేదు. కుండాపోతాగా అదీ ఒక్క గంటలో 100 మిల్లీ మీటర్ల వర్షం ఎక్కడ పడ్డది ? క్లౌడ్ బ‌ర్‌స్ట్ అనేది 2015 లో ముంబై నగరంలో అదీ ఒకే రోజులో 110 మిల్లీ మీటర్ల వర్షం పడ్డది. దాంతో ముంబై నగరం వారం రోజులుపాటు స్తంబించిపోయింది. పల్లపు ప్రాంతాలు 4 అడుగుల లోతు నీళ్ళలో మునిగిపోయాయి అదీ వరదనీరు అరేబియా సముద్రం లోకి దారి తీసే డ్రైనేజీ వ్యవస్థ మూసుకు పోవడం ఒక కారణం అయితే సముద్రం నీరు భూమి మీదకి ఎదురు తన్నడం రెండవకారణం నీళ్ళు నిలిచిపోవడానికి. ఒక గంటలో ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతంలో 100 లేదా 110 మిల్లీ మీటర్ల వర్షం పడితే దానిని క్లౌడ్ బ‌ర్‌స్ట్‌ అంటారు కానీ ఈ మధ్య కాలంలో అలాంటి సంఘటన జరిగిన దాఖలాలు లేవు.  ఇక అమరనాథ్  లో వారం క్రితం వచ్చిన దానిని ఫ్లాష్ ఫ్లడ్ అంటారు. హిమాలయ ప్రాంతాలలో ఇవి సర్వ సాధారణంగా జరిగేదే ! వర్షాకాలం మేఘాలు హిమాలయ పర్వత శ్రేణుల దగ్గర ఆగిపోతాయి ఎందుకంటే అంతకంటే ఎత్తులో అవి వెళ్లలేవు వాతావారణం చల్లగా ఉండడం వలన మేఘాలు ఎక్కువ ఎత్తులోకి వేళ్ళలేక అక్కడే ఆగిపోయి ఆ మేఘాలు వర్షించడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు ఏర్పడ్డప్పుడు అవి వర్షిస్తాయి. అమరనాథ్  ప్రాంతంలో ఎత్తైన పర్వత ప్రాంతాలు ఉన్నాయి అక్కడ మంచు కరిగి ఆ నీళ్ళు అక్కడే నిలవ ఉంటాయి వాటికి తోడు పెద్ద వర్షం పడితే ఆ నీరు బురదని తనతో తీసుకొని కిందకి వేగంగా ప్రవహిస్తుంది. ఇది నిత్యం జరిగేదే అక్కడ. డానికి విదేశీ కుట్ర అని ప్రజలకి అర్ధంకాని టెక్నికల్ పదాలని వాడి అయోమయం పడేట్లు చేస్తున్నారు కొందరు.    ఇక మహారాష్ట్రలోని గోదావరి పరీవాహక ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద నీరు ఎప్పుడూ లేనిది నాశిక్ పట్టణాన్ని కూడా ముంచేసింది  అయితే వరద  నీరు వెళ్ళే  ప్రాంతాలు  కబ్జాకి గురవడం మూలంగా ఎటూ పోక చివరకి నాశిక్ పట్టణాన్ని ముంచేసి అలాగే దిగువకి ప్రవహించి తెలంగాణ లోని పరీవాహక ప్రాంతాలని ముంచేసింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో ఎక్కడా క్లౌడ్ బ‌ర్‌స్ట్‌ అయినట్లు వాతావరణ శాఖ ప్రకటించలేదు. వారం రోజులుగా ఆగకుండా కురిసిన వర్షాల వల్ల వచ్చిన సమస్య ఇది.  ఇక మూసీ నది కాచ్మెంట్ ప్రాంతాలలో ఎలాంటి కట్టడాలు కట్టడాన్ని నిషేధించే 111 GO రద్దు చేయడం ఇప్పుడు చర్చకి దారి తీస్తుంది. కాచ్మెంట్ ఏరియాలో కట్టాడాల మీద నిషేధం ఉంటేనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఆ ప్రాంతాలలో ఇల్లు,అపార్ట్మెంట్ లు కడితే నీళ్ళు ఎక్కడికి పోతాయి ? కాళేశ్వం పంప్ హౌస్ మునిగిపోయి అందులో ఉన్న హెవీ పంప్ లు చెడిపోవడం వాటిని కాపాడే ఫ్లడ్ వాల్ మూడేళ్ళ కిందటే కూలిపోవడం వలన నీళ్ళు పంప్ హౌస్ లోకి వెళ్ళి పంప్ లు చెడిపోయాయి వాటిని  మళ్ళీ పనిచేయెట్లు చేయాలంటే కానీసం 1000 కోట్లు ఖర్చు అవుతుందేమో ? పంప్ లలోకి బురద వెళ్ళి పోయి నీళ్ళు మొత్తం వెనక్కి వెళ్ళిపోయి వాటిని పనిచేయించాలంటే కనీసం 6 నెలలు పడుతుంది. అంచేత క్లౌడ్ బ‌ర్‌స్ట్‌ అని విదేశీ కుట్ర అని ఏవేవో చెప్పేస్తే అవి విని నమ్మే వాళ్ళకి కొంచెం ఊరట.

విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా

ఉప రాష్ట్రప‌తి ఎన్నికలో విప‌క్షాల అభ్య‌ర్థిగా మాజీ గ‌వ‌ర్న‌ర్ మార్గ‌రెట్ అల్వా పోటీ లో దిగనున్నారు.   ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ నివాసంలో సమావేశమైన విపక్షాలు మార్గరెట్ అల్వా అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశాయి. ఆ తరువాత శరద్ పవార్ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పేరును ప్రకటించారు.  తనను విప‌క్షాల ఉమ్మడి ఉప రాష్ట్రప‌తి తనను ఎంపిక చేయడాన్ని  గౌర‌వ‌ంగా భావిస్తున్నట్లు అల్వా పేర్కొన్నారు.  తన మీద మీద న‌మ్మ‌కం ఉంచినందుకు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నానని  ట్వీట్ చేశారు. కాగా, ఆమె గ‌తంలో గోవా, రాజ‌స్థాన్, గుజ‌రాత్, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేశారు. మ‌రోవైపు, విప‌క్ష పార్టీలు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల కేంద్ర మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్ స్పందిస్తూ… త‌మ‌కు మెజారిటీ ఉంద‌ని, ఇత‌ర అభ్య‌ర్థి గెలిచే అవ‌కాశం లేద‌ని అన్నారు. విప‌క్షాలు అభ్య‌ర్థిని పోటీకి దింప‌క‌ుండా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.  1969లో   రాజకీయాల్లోకి ప్రవేశించిన అల్వా కాంగ్రెస్‌లో  కీలక పదవులు చేపట్టారు. 1974లో తొలిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. 1980,1986,1992లో వరుసగా రాజ్యసభకు నియమితులయ్యారు. 1999లో ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో పోటీ చేసి మార్గరెట్‌ అల్వా పరాజయం పాలయ్యారు.  2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్‌ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ఆ తర్వాత నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేశారు. గోవాకు 17వ గవర్నర్‌గా సేవలందించారు. గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా పనిచేశారు.  

సోనియా చుట్టూ చిక్కు ముళ్ళు

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వయసు 76 సంవత్సరాలు. దేశానికి స్వాతంత్రం రావడానికి  ఇంచుమించుగా ఒక ఒక సంవత్సరం ముందు, 1946 డిసెంబరు 9న ఆమె జన్మించారు. సోనియా గాంధీ ఎక్కడో ఇటలీలో పుట్టినా, భారత రాజకీయాల్లో ఆమె, చాలా కీలక భూమికను పోషించారు. ఇంచు మించుగా1998 నుండి. రెండు దశాబ్ధాలకు పైగా, ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. మధ్యలో, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినా, 2019 ఎన్నికలలో పార్టీ వరసగా రెండవ సారి ఘోరంగా ఓడిపోయిన నేపధ్యంలో ఆయన కాడి దించేశారు. అప్పటికే సోనియా వయసు, 70 ప్లస్... అయినా ఆమె మరో మారు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికీ, ఆమె అదే పదవిలో కొనసాగుతున్నారు. అంతేకాదు, 2004 నుంచి 14 వరకు పదిసంవత్సరాల పాటు,దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాజకీయ నాయకురాలిగా కితాబులు అందుకున్నారు.  అయితే, ఇప్పడు పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఇప్పుడు ఆమె అన్ని వైపులా నుంచి సమస్యలు ఎదుర్కుంటున్నారని, ఎవరో కాదు, కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. రాజకీయ విశేషకులూ అదే అంటున్నారు. ఓ వంక, వయసు, వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలు. మరో వంక రాజకీయంగా ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు ఆమెను కదలకుండా చేస్తున్నాయి. మరో  వంక కాంగ్రెస్ పార్టీని వరస ఓటములు వెంటాడుతున్నాయి. సీనియర్ నాయకులు చాలా వరకు పార్టీకి దూరమయ్యారు. సమస్యల సుడి గుండం నుంచి గట్టేక్కించే సామర్ధ్యమున్న గులాం నబీ ఆజాద్ వంటి నాయకులు ఇప్పటికీ ఇంకా పార్టీలో ఉన్నా, ప్రత్యేక గ్రూప్ ( జీ 23) గా ఏర్పడి  పార్టీ వ్యవహరాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, యధేచ్చగా సాగుతున్న వలసలు పార్టీ నాయకత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  ఈ నేపధ్యంలో సోనియా గాంధీ ఇంతవరకు ఎప్పుడూ ఎదుర్కోని  సమస్యలను ఎదుర్కుంటున్నారని అంటున్నారు. అవన్నీ ఒకెత్తు అయితే, కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అగ్ర నాయకత్వం, కాంగ్రెస్ పుంజుకునే సంకేతాలు కనిపించిన ప్రతి సందర్భంలోనూ, పాత దస్త్రాలు తిరగేసి కేసులను తిరగతోడుతోందని, ముఖ్యంగా గాంధీ ఫ్యామిలీ టార్గెట్  గా బీజేపీ, ముందరి కాళ్ళకు బంధాలు వేసేందుకు సిబిఐ, ఈడీ ఇతర కేంద్ర విచారణ సంస్థలను ఉసిగోలుపుతోందని, కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే  నేషనల్ హెరాల్డ్ కేసులో సొనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారణ ఎదుర్కుంటున్నారు. ఇద్దరికీ సమన్లు జారీ అయ్యాయి. రాహుల్ గాంధీని ఈడీ ఐదు రోజుల పాటు విచారించింది. అయితే, అనారోగ్యం (కొవిడ్) కారణంగా గతంలో విచారణకు హాజరు కాలేక పోయిన సోనియా గాంధీకి జూలై 22 విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున, ఈడీ విచారణ మరోసారి వాయిదా వేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.  అదలా ఉంటే ఇప్పుడు తాజాగా, 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్ల వ్యవహారంలో ఆ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి, (ప్రస్తుత ప్రధాని) నరేంద్ర మోడీని అప్రతిష్ఠ పాలుచేసి  గుజారత్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సోనియా గాంధీ కుట్ర చేశారనే .. ఆరోపణను బీజేపీ  తెరపైకి తెచ్చింది. గుజరాత్‌ అల్లర్లపై దర్యాప్తు చేస్తున్న సిట్‌.. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో చేసిన కీలక వాఖ్యల ఆధారంగా  రాజకీయ దుమారానికి  బీజేపీ శ్రీకారం చుట్టింది.  గుజరాత్ అల్లర్లను అడ్డు పెట్టుకుని , మోడీని అప్రతిష్ఠపాలు చేయడంతో పాటుగా   గుజారత్ ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు సోనియా గాంధీ కుట్ర చేసారని,  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర తీవ్ర ఆరోపణ చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ పాత్ర కూడా ఈ కుట్రలో ఉందన్నారు. సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు ఆయన రూ.30లక్షలు ఇచ్చారని  వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న సోనియా గాంధీ చుట్టూ చిక్కు ముళ్ళు విచ్చుకుంటున్నాయి అనేది మాత్రం నిజం అంటున్నారు.

సీఎం కామెంట్స్ పై పొలిటికల్ క్లౌడ్ బరస్ట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన, ఈ మాట మేఘాల మాటేమో కానీ, రాజకీయాలలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది. పెద్ద దుమారాన్నే రేపింది. ఇప్పుడు, వరదలు, ప్రజల కష్టనష్టాల విషయం పక్కకు పోయింది, కాళేశ్వరంలో మునక వివాదమూ పక్కకు పోయింది. ‘క్లౌడ్డ్ బరస్ట్’ చుట్టూనే రాజాకీయ దుమారం చెలరేగుతోంది., రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం కావచ్చని, అనుమానం వ్యక్తం చేస్తూనే, ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశాల కుట్ర  కోణాన్ని కూడా తెరమీదకు తెచ్చారు.   నిజానికి, ముఖ్యమంత్రికి అలాంటి అనుమానం ఏదైనా ఉంటే, అందుకు సంబదించి సమాచారం ఏదైనా తమ వద్ద ఉన్నా, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళితే, ఎవరికీ అభ్యతరం ఉండేది కాదు. పోనీ కేంద్రంతో మాటలు లేవు, కాబట్టి, కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లక  పోయినా, సంబంధిత అధికారాలను లేదా శాస్త్ర వేత్తలను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చినా  అదో రకంగా ఉండేది. కానీ, ముఖ్యమంత్రి కేసిఆర్ అదేమీ లేకుండా, ఒక మాట అనేశారు. నిజానికి, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రాజకీయ నాయకులు ఇలాంటి అసత్యాలు, అర్థ సత్యాలను ఆశ్రయించడం కొత్తేమీ కాదు. అందులోనూ, కేసీఆర్  అలాంటి విద్యలో సిద్దహస్తులనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు.  ముఖ్యమంత్రి కనీసం హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులను సంప్రదించినా, కొంత క్లారిటీ వచ్చేది కావచ్చును. నిజానికి, హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తనకైతే క్లౌడ్ బరస్ట్ గురించి పెద్దగా తెలియదని, తమ వద్ద ఉన్న సమాచారం మేరకు  వాతావరణ హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు. ప్రకృతిలో వచ్చిన మార్పుల కారణంగా మాత్రమే వర్షాలు కురిసి వరదలు సంభవించాయని చెప్పారు. అంటే, ముఖ్యమంత్రి చెప్పిన క్లౌడ్ బరస్ట్ కథ కట్టు కథ కావచ్చనే అనుమానం వ్యక్త పరిచారని అనుకోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి ఏ ఆధారాలు లేకుండా, విదేశాలు కుట్రతో "క్లౌడ్‌ బరస్ట్‌" చేయడం వల్లే వరదలు వచ్చాయని, బహిరంగ ప్రకటన ఎందుకు చేశారు? ఏ ఉద్దేశంతో, ఈ వ్యాఖ్యలు చేశారు? అలాగే. గతంలో ఒకసారి  కశ్మీర్’లోని లద్ధాక్ – లేహ్’లో మరోమారు ఉత్తరఖండ్ లో చేశారని అన్నారు. ఈమధ్య గోదావరి పరివాహక ప్రాంతంలోనూ చేస్తున్నారని గ్లూమీ .. గ్లూమీ ( అస్పష్ట) సమాచారం ఉందని అన్నారు. కావచ్చును, ముఖ్యమంత్రి ఏదీ  నిర్దారణగా చెప్పా లేదు, ఎవరి మీద వేలెత్తి చూపలేదు. కానీ, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తమకే స్పష్టత లేని సమాచారం ఆధారంగా, అంత సీరియస్ వ్యాఖ్య, ఇంత బేఫర్వాగా ఎలా చేస్తారు, అనేదే ఇప్పడు రాజకీయ వర్గాల్లో వివాదం అవుతోంది. మరోవంక, చైనా పేరు కూడా తెరమీదకు వచ్చింది.  నిజానికి వరదల విషయంలో మొదటి నుంచి ప్రభుత్వం బేఫర్వా గానే వ్యవహరిస్తోంది. విపత్తు ముంచు కోస్తోందని హెచ్చరికలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు.నిమ్మకు నీరెత్తి నట్లు వ్యహరిస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి, కూడా వర్షాలు, వరదల మీద అధికారులతో రివ్యూ చేసినా,  విలేకరుల సమావేశంలో  రెండే రెండు ముక్కల్లో ఆ విషయన్ని తేల్చేశారు. ఆ  తర్వాత రెండున్నర గంటలు రాజకీయ విమర్శలకు వినియోగించుకున్నారు. ఆ తర్వాత, కాళేశ్వరం మునకతో ప్రభుత్వం మరింత ఇరకాటంలో పడింది. చివరకు, గవర్నర్ తమిళి సై, వరద పోటెత్తిన భద్రాచలంలో పర్యటించేందుకు కదిలిన తర్వాత గానీ, ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలలో పర్యటించే ఆలోచన చేయలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపద్యంలో ముఖ్యమత్రి క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలు రాజకీయ దుమారం సృష్టించాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, అయితే, విదేశాలు కుట్రతో "క్లౌడ్‌ బరస్ట్‌" చేయడం వల్లే వరదలు వచ్చాయని స్వయాన సీఎం కేసీఆర్‌ చెప్పడంపై కేంద్రం వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి,హోదాలో మాట్లాడిన మాటలను కేంద్రం పరిగణనలోకి తీసుకుని కేసీఆర్ నుంచి కుట్ర సమచారాన్ని రాబట్టాలన్నారు. ఇలాంటి సమాచారం ఏదైనా ఉంటే కేంద్ర భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వాల్సిన భాధ్యత కేసీఆర్‌కు ఉందని గుర్తుచేసిన రేవంత్‌.. అలా చేయని పక్షంలో కేంద్రమే కస్టడీలోకి తీసుకుని విచారించాలన్నారు. కేసీఆర్‌ దోపిడీకి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని రేవంత్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న లోపాలు, అవినీతిని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగానే క్లౌడ్ బరస్ట్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆక్షేపించారు.  మరో వంక  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందంటూ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఈ శతాబ్దపు పెద్ద జోక్‌ అని ఎద్దేవా చేశారు. తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్‌ పడరాని పాట్లు పడుతున్నారని, విదేశీ కుట్ర పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని ఆరోపించారు. అదలా ఉంటే ఇప్పుడు కేసేఆర్ చేసిన,  విదేశీ కుట్ర వ్యాఖ్యలు రాష్ట్రంలో మాత్రమే కాదు, దేశంలోనూ దుమారం రేపుతున్నాయి.జాతీయ టీవీ చానల్స్’లోనూ కేసీఆర్ వ్యాఖ్యలఫై చర్చ మొదలైంది. ఇక ఇప్పుడు ఈ ‘పొలిటికల్ క్లౌడ్’  ఎటు తిరుగుతుందో, ఏమౌతుందో ..

తెలంగాణాతో  కేంద్రం  కొత్త  ర‌చ్చ‌

గొడ‌వ‌ప‌డాల‌నుంటే ముగ్గు స‌రిగాలేద‌నీ గొడ‌వ‌ప‌డొచ్చు. మ‌న ప‌ని పొరుగువారికి న‌చ్చ‌కున్నా చిన్న చిత‌కా కార‌ణాల‌తో సూటి పోటీ మాట‌ల‌తో యుద్ధానికి సన్న‌ద్ధ‌మ‌వుతారు. కేంద్రానికి, రాష్ట్రాల‌కు మ‌ధ్య స‌త్సంబంధాలు లేక‌పోతే దేనిక‌యినా స‌మ‌స్య‌లు, లేనిపోని త‌గ‌వుల‌కు దిగ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం మోదీజీ నాయ‌క‌త్వంలోని  బిజెపి ప్ర‌భుత్వం తెలంగాణా టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌తీదానికి క‌న్నెర్ర‌జేయ‌డంతో పాటు ఏదో ఒక కార‌ణం చెప్పి ఇర‌కాటంలో ప‌డేస్తోంది. ఇపుడు తాజాగా  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై రాజకీయ చిచ్చు రాజుకుంది. ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు, అక్రమాలు జరిగాయని, అసలు ఆ పథకం నిబంధనలకే విరుద్ధమైన పనులు చేశా రంటూ కేంద్ర ప్రభుత్వం తమ అధికారులతో రాష్ట్రంలో తనిఖీలు చేయిస్తోంది. దీన్ని క‌క్ష‌సాధింపు చ‌ర్య‌గానే రాష్ట్రం భావిస్తోంది.  కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఏకంగా 16 బృందాలను తెలంగాణకు పంపింది. వీరు రాష్ట్రంలోని 18 జిల్లాల్లో ఉపాధి హామీ పనులను పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల ఆయా జిల్లాల కలెక్టర్లను కూడా వెంటబెట్టుకుని వెళ్తున్నారు. చాలా పనులు నిబంధ నల ప్రకారం జరగలేదని, కొన్నిరకాల పనులు అసలు ఈ పథకం కింద చేయకూడనివి ఉన్నాయని తేల్చేస్తున్నారు. వాటికి సంబంధించిన నోటీసులు ఇవ్వడం, కేంద్రానికి లేఖ రాయడం వంటి ప్రక్రియలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే రాష్ట్ర ప్రభు త్వం మాత్రం ఉపాధి హామీ పథకంలో రైతు వేదికలు నిర్మిస్తే తప్పా? అని ప్రశ్నిస్తోంది. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ తనిఖీలేంటని తప్పుబడుతోంది. పశ్చిమ బెంగాల్‌లో ఉపాధి హామీ పథకాన్ని ఆపి నట్లుగా ఇక్కడ కూడా ఆపేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని సీఎం కేసీఆర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.  వాస్తవానికి ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏటా భారీ ఎత్తున నిధులు  వస్తున్నాయి. ఆ నిధులను పథ కంలో నిర్దేశించిన పనులకే వాడాలి. అదే సమయంలో పనులు సక్రమంగా ఉండాలి. అయితే ఈ రెండు విషయాల్లోనూ తేడాలు న్నాయని కేంద్రం భావిస్తోంది. రైతు వేదికలు, కల్లాల నిర్మాణానికి ఈ పథకం కింద అనుమతి లేదని చెబుతోంది. అయితే  రైతు వేదికలు, కల్లాల నిర్మాణాలకు కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించామని కొన్ని సంద ర్భాల్లో రాష్ట్ర నేతలు చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పుడు మాత్రం నరేగా కింద రైతు వేదికలు నిర్మిస్తే తప్పేంటని, ఆస్తుల కల్పనే చేశామని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణ నుంచి దేశానికి ఇచ్చింది ఎక్కువ, దేశం నుంచి తెలంగాణకు వచ్చింది తక్కువ అన్న వాదనను కూడా బలంగా తెరపైకి తెచ్చారు.  అస‌లే  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇప్పటికే ధాన్యం కొనుగోలు అంశంపై యుద్ధం జ‌రుగుతోంది. తాజాగా తలెత్తిన ఉపాధి హామీ పనుల వివాదం మ‌రో త‌ల‌భారం కానుంద‌ని టిఆర్ఎస్ భావిస్తోంది.  నరేగా పథకం కింద ఏటా రాష్ట్రానికి రూ.4 వేల కోట్లకు పైగా నిధులొస్తాయి. 2021-22లో రూ.4,763 కోట్లు వచ్చాయి. 11 కోట్ల పని దినాలు ఇప్పుడు సుమారుగా 15 కోట్ల పనిదినాలకు పెరిగాయి. వాస్తవానికి ఈ నిధుల అంశంపైనా కొంతకాలం నుంచీ బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య వివాదం ఉంది. నరేగా నిధులను కేంద్రమే భారీగా ఇస్తోందని చెప్పేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే కూలీలకు ఇవ్వాల్సిన వేతనాలను కూడా కేంద్రం ఇచ్చినంతగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తక్కువగా ఇస్తోందని ఆరోపి స్తోంది. పనుల్లో నాణ్యత కూడా లేదని, కొన్ని పనులను చేయకుండానే బిల్లులు తీసుకుంటున్నార‌న్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలం క్రితం నుంచి కేంద్రమే నేరుగా ఉపాధి హామీ కూలీల బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల్లోకి నిధులు వేయడం ప్రారంభించింది. బీజేపీ నేతల వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ నాయకులు కూడా ప్రతి విమర్శలు చేస్తూ వస్తున్నారు. అన్ని రాష్ట్రాలతోపాటే తెలంగాణకూ ఇస్తున్నారని, తాము మాత్రం ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా దేశం కోసం కేంద్రానికి నిధులు ఇస్తు న్నామ‌ని అంటున్నారు. మొత్తంమీద ఇన్నివేల కోట్లకు సంబంధించిన పథకం వల్ల వచ్చే ఓట్ల ప్రయోజనాన్ని ఎవరు పొందా లన్న విషయంలో నూ రాజకీయం మొదలైంది. అది క్రమంగా పెరిగి పెరిగి వివాదంగా మారింది.    ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రైతు వేదికలు, కల్లాల నిర్మాణం, చెరువుల పూడికతీత, కందకాలు, ఇతర నిర్మాణ పనులు చేపట్టిన విధానంపై కేంద్ర బృందాలు ఈ రెండురోజుల నుంచి ఆరా తీస్తున్నాయి. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని నిజామాబాద్‌, పెద్దపల్లి, మెదక్‌, సిద్డిపేట, సూర్యాపేట, కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూ బాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, ములుగు తదితర జిల్లాల్లోని గ్రామాల్లో పర్యటించి ఈ బృందాలు క్షేత్రస్థాయి విచారణ జరుపుతున్నాయి. ఆదివారం కూడా ఈ బృందాలు తమ తనిఖీలను కొనసాగించనున్నాయి. కాగా జూన్‌ 9 నుంచి 12 వరకు కూడా ఐదు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్దంగా పనులు జరిగినట్లు గుర్తించాయి. ఉన్నత స్థాయి అనుమతులు పొందకుండానే  పనులు విభజించారని ఆక్షేపించాయి. దీంతోపాటు సోషల్‌ ఆడిట్‌, వివాదాల పరి ష్కార వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా 18 జిల్లాల్లో మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను పంపించడమే మ‌రో గొడ‌వ‌కు దారితీస్తోంది. ఇది ఖ‌చ్చితంగా టిఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని అవ‌మా నించ‌డ‌మేన‌నే అభిప్రాయాలు విన‌ప‌డుతున్నాయి. 

శంక‌రా..నారాయ‌ణా.. ఎంత‌టి అవ‌మానం!

పాల‌న బాగుంటే అంద‌రూ ఆద‌రిస్తారు. పాల‌న బాగుంటే అంద‌రికీ గౌర‌వం ల‌భిస్తుంది. క‌బుర్లు చెబుతూ ప‌బ్బం గ‌డుపు దామ‌నుకుంటే అవ‌మానాల‌కు సిద్ధం కావాలి. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని అంత సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేద‌న్న‌ది మ‌రోసారి రుజువ‌యింది. గ‌డ‌ప గ‌డ‌ప‌కు అనే కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్ర‌జ‌ల నుంచి తిరుగుబాటు, అవ‌మానాలు ఎదుర్కొంటున్నారు. ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాలు, అందిస్తున్న ప‌థ‌కాల ఫ‌లాల గురించి వాక‌బు చేయ‌డా నికి వెళుతోన్న‌వారికి ప్ర‌జ‌ల నుంచి తిట్ల దండ‌క‌మే ప‌డుతోంది. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని శెట్టిపల్లి తండాలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి,  వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణకు చేదు అనుభవం ఎదురైంది.  వితంతు పింఛన్‌ను రద్దు చేసినందుకు ఓ గిరిజన మహిళ రగిలిపోయింది. తన ఇంటి వద్దకు ఇంకోసారి వస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించింది. శనివారం మధ్యాహ్నం పెనుకొండ మండలం శెట్టిపల్లి తండాకు అధికారులు, పార్టీ నాయకులతో కలిసి శంకర నారాయణ గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్లారు. ఈ క్రమంలో లలితాబాయి ఇంటి వద్దకు చేరుకోగానే ఆమె బంధువులు పింఛన్‌ రద్దు విషయాన్ని ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఇంతలో లలితా బాయి అనే మ‌హిళ బయటకు వచ్చి తన భర్త ఆనందనాయక్‌ పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, అప్పటి నుంచి తనకు వితంతు పింఛన్‌ వచ్చేదని తెలిపింది. స్థానిక వైసీపీ నాయకులు తనకు పింఛన్‌ రాకుండా చేశారని, 11 నెలల నుంచి పింఛన్‌ అందడంలేదని ఎమ్మెల్యేకి వివరిం చింది. అంతా విన్న ఎమ్మెల్యే, తరువాత చూద్దాంలే.. అని చెప్పి, తేలిగ్గా తీసుకుని ముందుకు వెళ్లిపోయారు. దీంతో లలితా బాయి రగిలి పోయింది. ఏమిచ్చి పోగొట్టుకున్నారని మా ఇంటికాడికి వచ్చినార్రా.. ఇంకోసారి మా ఇంటి ముందుకొస్తే చెప్పుతో కొడతా. ఒకసారి మా ఇంటిని చూడండిరా..అని ఆగ్రహం వ్యక్తంచేసింది. నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇక్కడికి రా.. అని ఎమ్మెల్యేపై  తొడ కొట్టింది. శెట్టిపల్లికి చెందిన లలితాబాయి, ఆనందనాయక్‌ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఆనంద్‌ పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భర్త చనిపోయాక లలితాబాయి కూలి పనులకు వెళ్లి బిడ్డలను పోషించింది. స్థానికంగా పనులు లేనప్పుడు బెంగళూరుకు వలస వెళ్లి వస్తుంటుంది. స్థానికంగా ఉండదన్న సాకుతో వైసీపీ నేతలు ఆమె పింఛన్‌ను రద్దు చేయించినట్లు తెలిసింది.ఈ విషయాన్నే విన్నవించినా ఎమ్మెల్యే తేలిగ్గా తీసుకోవడంతో లలితాబాయి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.

 లడఖ్ లో  ప్లాస్టిక్ వ్యర్థాలతో  రోడ్లు

హిమాలయ ప్రాంతంలో పర్యావరణ పరిరక్షణ, కార్బన్ తగ్గించే లక్ష్యంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లను నిర్మించాలని లడఖ్ ప్ర‌భుత్వం నిర్ణయించింది. కనీసం ప‌ది శాతం రోడ్లు ప్లాస్టిక్‌తో నిర్మించనున్నారు. దీని కోసం సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టి ట్యూట్ (సిఆర్ ఆర్ ఐ) స్థానిక ఇంజ నీర్లకు శిక్షణనిచ్చింది. లడఖ్‌లోని రోడ్డు నిర్మాణంలో ప్రాక్టీస్ వ్యర్థాలను తప్పనిసరిగా ఉప యోగిం చాలని లడఖ్‌లోని పిడబ్ల్యుడి శాఖ కార్య‌ద‌ర్శి ఈ విషయమై ఒక ఉత్తర్వు జారీ చేశారు. లడఖ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు స్థిరమైన పరిష్కారాన్ని కనుగొనడానికి, లడఖ్‌లోని అన్ని తారు రోడ్లు ప్లాస్టిక్ సీసాలు, కంటై నర్లు మొదలైన వాటితో సహా కనీసం ప‌ది శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను కలిగి ఉండాల‌ని ఉత్త‌ర్వులో పేర్కొన్నారు. లేహ్, కార్గిల్‌లో ప్లాస్టిక్ మెషీన్లను ముక్కలు చేసేలా డిపార్ట్‌మెంట్ నిర్ధారిస్తుంది. రోడ్ల నిర్మాణంలో కనీసం ప‌ది శాతం ప్లాస్టిక్‌ను ఉప యోగించాలని ఉత్త‌ర్వు పేర్కొంది. లడఖ్ అడ్మినిస్ట్రేషన్ స్థానిక ఇంజనీర్లకు శిక్షణను ప్రారంభించింది, ఇక్కడ సిఆర్ ఆర్ ఐ, న్యూఢిల్లీ శాస్త్రవేత్తలు గ్రామీణ ఇంజనీ రింగ్ రింగ్, గ్రామీణాభివృద్ధి విభాగం, సరిహద్దు రోడ్ల సంస్థ (బిఆర్ ఓ), నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొ రేషన్ (ఎన్‌హెచ్ ఐడిసి) నుండి ఇంజనీర్ల కోసం వర్క్‌షాప్‌లు లేహ్, కార్గిల్ జిల్లాలలో నిర్వహించారు. ఈ శిక్షణ లడఖ్‌లోని శీతల వాతావరణ పరిస్థితులలో రహదారి నిర్మాణ కార్యకలాపాలలో మెరుగుదలలను తెస్తుందిని, రహదారి నిర్మాణ సాంకేతి కతలలో ప్లాస్టిక్ వ్యర్థాలను బాగా ఉపయోగించడంలో ఇంజనీర్లకు సహాయపడుతుందని కమిషనర్ కార్య‌ద‌ర్శి అజిత్ కుమార్ సాహు తెలిపారు. న్యూఢిల్లీలోని సిఆర్ ఆర్ ఐకి చెందిన ఐదుగురు ప్రధాన శాస్త్రవేత్తల బృందం గత వారం నుండి స్థానిక ఇంజనీర్‌లతో శిక్షణా సమా వేశాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు, శిక్షణ సమయంలో ఆ ప్రాంతం ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం, స్థానికంగా లభించే వ‌స్తు వినియోగం, వేగవంతమైన రహదారి నిర్మాణం కోసం కోల్డ్ మిక్స్ టెక్నాలజీని జోడించింది. గత కొన్ని సంవత్సరా లుగా లడఖ్‌లో పేరుకుపోయిన టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేసేందుకు ఇటువంటి సాంకేతికతపై పని సహాయపడు తుందని డివిజనల్ కమిషనర్ లడఖ్ తెలియజేశారు. లడఖ్ అధికారులు, ఇంజనీర్లు రోడ్డు నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి ఉపయోగించేందుకు అధునాతన పద్ధతులను నేర్చుకుంటారు, ఇది కార్బన్ త‌ట‌స్థ‌ లడఖ్‌ను తయారు చేయా లనే దృక్పథానికి అనుగుణంగా లడఖ్ పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడుతుంద‌ని ఆయన చెప్పారు.