ఏపీ రోడ్ల వైభోగం చూడ తరమా..!
posted on Jul 18, 2022 @ 12:17PM
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై తెలుగుదేశం, జనసేన ప్రారంభించిన డిజిటల్ క్యాంపెయిన్ కు బ్రహ్మాండమైన స్పందన వస్తోంది. చెత్త రోడ్లు.. చెత్త సీఎం అంటూ తెలుగుదేశం, గుడ్ మార్నింగ్ సిఎం సర్ అంటూ జనసేన రోడ్ల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించిన సంగతి తెలసిందే. వారి క్యాంపెయిన్ కు మద్దతుగా నెటిజనులు సైతం ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిపై సామాజిక మాధ్యమంలో వ్యంగ్య కార్టూన్లు, వ్యాఖ్యలతో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ పోస్టులన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జనాలను ఆకర్షిస్తున్నాయి. సామాన్య జనులు సైతం రోడ్ల దుస్థితిపై వాస్తవ పరిస్థితికి సామాజిక మాధ్యమం అద్దం పడుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అద్దాల్లా ఉన్నాయని అధికార పార్టీ కొన్ని ఫొటోలు పెట్టి సొంత భుజాలను తడుముకుంటోంది. అదే సమయంలో రోడ్ల దుస్థితిపై ప్రతిపక్షాల విమర్శలపై మండి పడుతోంది. అయితే నెటిజన్లు మాత్రం ఏపీలోని రోడ్ల బండారాన్ని సామాజిక మాధ్యమం సాక్షిగా బట్టబయలు చేసేశారు. రోడ్ల పరిస్థితిపై వ్యంగ్య బాణాలు సంధిస్తూ ప్రభుత్వ నిర్వాకాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. చూడగానే ఆకట్టుకునే కార్టూన్లతో సామాజిక మాధ్యమాన్ని హోరెత్తిస్తున్నారు. రోడ్ల దుస్థితిపై నెటిజన్ల పోస్టులు ఇప్పడు సమాజిక మాధ్యమంలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. దీనిపై సామాన్యులు సైతం స్పందిస్తున్నారు.
పెద్ద పెద్ద గోతులతో ఛిద్రమైన రహదారుల చిత్రాలు, వీడియోలకు బలమైన పంచ్ డైలాగులతో... సినిమాలలోని చిత్రాలతో కూడిన మైమ్ లను జోడించి నెటిజన్లు చేస్తున్న పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గుడ్ మార్నింగ్ సీఎం సర్ అంటూ జనసేన ప్రారంబించిన హాష్ ట్యాగ్ డిజిటల్ క్యాంపైన్ విపరీతంగా పాపులర్ అయ్యింది. అలాగే తెలుగుదేశం సోషల్ మీడియా వేదికగా చేస్తున్నప్రచారానికీ ప్రజా స్పందన అమోఘంగా ఉంది. రాష్ట్ర రహదారులపై రాజమహేంద్ర వరంలో ఒక కార్యక్రమంలో చేసిన ప్రసంగంలో చిన జీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
అలాగే ఏప్రిల్ 19న మంత్రి కేటీఆర్ ఏపీ రోడ్లపై చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాలలోనూ సంచలనం సృష్టించాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు నొచ్చుకున్న వైకాపా నేతలు తెలంగాణలో రోడ్లు, కరెంట్ పరిస్థితులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఎంతగా ఎదురుదాడి చేసినా కేటీఆర్ ఏపీ రోడ్లపై చేసిన వ్యాఖ్యలకు వచ్చినంత స్పందన వైసీపీ నేతల విమర్శలకు రాలేదు. అసలు వైసీపీ విమర్శలను రెండు రాష్ట్రాలలో కూడా పట్టించుకున్న నాథుడే లేకపోయాడు.
ఆ వ్యాఖ్యలను బేస్ గా చేసుకుని ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వ్యంగ్య వైభోగం సామాజిక మాధ్యమంలో బ్రహ్మాండంగా పేలుతోంది. జగన్ నిర్వాకం వల్ల ఏపీలో కార్లు, బైకుల మెకానిక్ లు బాగుపడుతున్నారంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో జులై 15నాటికి రోడ్లపై ఒక్క గుంత కూడా ఉండకూడదు అంటూ జగన్ ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపైనా నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.