వైసీపీలో మరో ట్రబులా‘ర్’!

ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీలో లుకలుకలు, ఒకటొకటిగా బయట పడుతున్నాయి. వైసీపీ  నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు బాటలో తిరుగుబాటు జెండా ఎగరేసే నాయకుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పుడు ఆ జాబితాలో మరో పేరు వచ్చి చేరిందని అంటున్నారు. నిజానికి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి చాలా కాలంగా, ప్రభుత్వ పనితీరును, ఎక్కడి కక్కడ ఎండగడుతూనే ఉన్నారు. అయితే, రఘురామ కృష్ణం రాజులా నేరుగా  కాకుండా, ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండా, అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లు అధికారుల మీద ఫైర్ అవుతున్నారు. అయితే, తాజాగా ముసుగును కాస్త పక్కకు తీసి, తన అసహనాన్ని, ఆగ్రహాన్ని ముఖ్యమంత్రి మీదకు ఎక్కు పెట్టారని అంటున్నారు.   ఈ నేపధ్యంలో అయన, అధికారులు మంచివారేన‌ని, కానీ ఎక్క‌డో తేడా ఉందంటూ న‌ర్మ‌గ‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేకెత్తించాయ. రాష్ట్రంలో ఒక్క ప‌ని కూడా ముందుకు సాగ‌డంలేద‌ని, అభివృద్ధి ఎక్క‌డా లేద‌ని,  మాగుంట పరోక్షంగా ముఖ్యమంత్రి, మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ల్యాండ్ నిధులకు లెక్కలు లేవని, ఏమి చేశారని నిలదీశారు. ఇలా అయితే ప్రజల్లో ప్రభుత్వ పరువు పోతుందని, కొంచే ఘాటుగా సొంత పార్టీ ప్రభుత్వం పైనే విమర్శలు గుప్పించారు.  నిజానికి, గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాగుంట మొదటి నుంచీ పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న అనుయాయులు చెబుతున్నారు. వైసీపీలోని ఇత‌ర నేత‌ల‌తో మొద‌టి నుంచి ఆయ‌న‌కు సఖ్యత లేదంటూ వార్త‌లు వ‌చ్చాయి. పార్టీ కార్యక్రమాలకు కూడా అయన దూరంగానే ఉంటున్నారు. మరో వంక వ్యాపార వ్యవహారాలను చక్క పెట్టుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో, తెలుగు దేశం సహా అన్నిపార్టీల నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్నారని వైసీపీ నేతలు పలు సందర్భాలలో ఆరోపించారు.  నిజానికి ఇటు అధికారుల నుంచి, అటు పార్టీ వర్గాల నుంచి కూడా మాగుంటఫై ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఫిర్యాదులు అందుతూనే ఉన్నా, ఆయన పెద్దగా పట్టించుకోలేదని పార్టీ నాయకులు, అధికారులు అంటున్నారు. అయితే, మాగుంట చేసిన తాజా వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇక ఉపేక్షించి లాభం లేదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే, పార్టీ నాయకులు, అధికారులతో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి, చెప్ప వలసినంత వరకు చెప్పాం, అయినా ఆయన మారడం లేదు, ఇక ఆయన్ని వదిలేయండి, అని చెప్పినట్లు సమాచారం.  ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశం వచ్చిన నేపధ్యంలో, అధికారులు ఎంపీని అసలుకే పట్టించుకోవడం లేదని అంటున్నారు. తాజాగా, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి, ఒంగోలు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను చర్చించేందుకు, సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశానికి నగరపాలక సంస్థ అధికారులుకానీ, సిబ్బందికానీ ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఎంపీ కార్యాలయం నుంచి పదే పదే ఫోన్లు చేస్తే ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఒకరిని పంపించి చేతులు దులుపుకున్నారు. దీంతో, ఎంపీ మాగుంట వైసీపీలో ఉన్నారా ?  లేరా ? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  అదలా ఉంటే వైసీపీ నేతలు ఎవరూ ఆయన్ని కలవొద్దని, ఒకవేళ ఆయన కటువైన వ్యాఖ్యలు చేసినా వైసీపీ శ్రేణులెవరూ స్పందించవద్దని అధిష్టానం సూచించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో రాబోయే ఎన్నిక‌ల్లో మాగుంట వైసీపీ త‌ర‌ఫున పోటీచేసే అవ‌కాశాలు లేనట్లేనని,  ఆయ‌న తిరిగి తెలుగుదేశం గూటికే చేరుకుంటారంటూ ప్రకాశం జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనూ జోరుగా చర్చ జరుగుతోంది. అదలా  ఉంటే ఎంపీలు , మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా  ఒకరొకరు పార్టీకి దూరం అవుతున్న నేపధ్యంలో, వైసీపీ నిట్టనిలువునా చీలే రోజు ఎంతో దూరంలో లేదని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.

పిల్ల‌డికి  హిందీ నేర్పుతున్న కొరియా త‌ల్లి

పిల్లాడు ప‌రుగున లోప‌లికి వ‌చ్చి మ‌మ్మీ అన‌గానే పొంగిపోతుంది త‌ల్లి. మ‌మ్మీ గిమ్మీ ఏమిటే.. చ‌క్క‌హా అమ్మా అని పిల‌వ‌డం నేర్పించ‌కుండా.. అంటూ పిల్లాడి అమ్మ‌మ్మ‌గారు గొంతుచించుకుంటుంది... ఇది దాదాపు అంద‌రి ఇళ్ల‌లోనూ ఇటీవ‌లి కాలంలో క‌నిపించే సీన్‌. నిజ‌వే మ‌న భాష‌లో ప‌ల‌క‌రించుకోవ‌డం, తిట్టుకోవ‌డం లో అందం వేరు. చిత్ర‌మేమంటే విదేశీయులు చ‌క్క‌గా తెలుగు నేర్చుకుని ఇంట్లో ప్రాక్టీసు చేస్తున్నారు. భార‌తీయుల‌ను స్నేహం చేసుకోవ‌డమే కాకుండా వారికి తెలిసిన భార‌తీయ భాష‌ను  కూడా  నేర్చుకోవడంలో వారికి అదో ఆనందం. ఇపుడు కొరియా వాళ్లూ హిందీ  నేర్చుకుని, వారి పిల్ల‌ల‌కూ మెల్ల‌గా నేర్పు తున్నార‌ట‌. అందుకు ఉదాహ‌ర‌ణ కిమ్‌.  ఇంగ్లీషు వ్యామోహం మ‌రీ పెచ్చు మీరిపోతోంద‌ని స్కూళ్ల‌లో ఉపాధ్యాయులూ అంటున్నారు. ఇంగ్లీషు నేర్చుకోవ‌డం వేరు, అదే రోజూవారీ జీవితంగా చేసుకోవ‌డం ఎంతో వేరు. పెద్ద‌వారంటే ఉద్యోగాలు, వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ ఆంగ్లం మాట్లాడ‌టం త‌ప్ప‌నిస‌రి. కానీ పిల్ల‌ల‌కూ అదే నేర్పి అదో అద్బుతం  అని ఉప్పొంగిపోతే ఎలా? ఇక మ‌న భాష పిల్ల‌ల‌కు ఎలా వ‌స్తుంది? మ‌న భాషా రావాలి, అటు ఇంగ్లీషూ  రావాలి క‌దా?! కానీ కొరియాకు చెందిన కిమ్ అనే అమె త‌న పిల్ల‌వాడికి చిన్న‌చిన్న‌ప‌దాలు నేర్పుతోంది. మొన్నా మ‌ధ్య ప‌కోడీ కూడా త‌యారు చేసింది. ఏ ప‌కోడీ హై అంటూ చిన్న‌ముక్క‌ను ప‌ట్టుకుని ఫోటో కూడా తీయిం చుకుంది.  విదేశీ భాష నేర్చుకోవ‌డంలో ఉన్న ఆస‌క్తి మ‌న భాష మీద లేక‌పోవ‌డం విచార‌క‌రం. మ‌న భాష మీద వారికి ఉన్న ఆస‌క్తి హ‌ర్ష‌ణీయ‌మే.. కానీ వారు వారి మాతృ భాష‌ను మాత్రం మ‌ర్చిపోవ‌డం లేదు. ఇది మ‌న‌వాళ్లు గుర్తుంచుకోవాలి. 

అవును ..అ ఇద్దరూ దగ్గరయ్యారు !

కాంగ్రెస్, తెరాస పార్టీలు దగ్గరవుతున్నాయా? అ రెండు పార్టీల  మధ్య దూరం తరుగుతోందా?  అసెంబ్లీ ఎన్నికల తర్వాత అవసరం అయితే, చేతులు కలిపేందుకు కేసీఆర్ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారా? అంటే, రెండు వైపుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని ఇంటి పార్టీగానే భావిస్తూ వచ్చారు. కాంగ్రెస్ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యేలను కారెక్కించడం పెద్ద కష్టం కాదనే సత్యాన్ని  అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు.   2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రస్ ఎమ్మెల్యేలులో మూడొంతులకు పైగా సంవత్సరం తిరగకుండానే తెరాస గూటికి చేరిపోయారు  గులాబీ కడువా కప్పుకున్నారు.  సో.. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ తెరాసకు ప్రత్యర్ధి పార్టీగా గతంలో భావించలేదు ఇప్పుడూ భావించడం లేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ ప్రత్యర్ధి పార్టీగా  కంటే ఫ్రెండ్లీ పార్టీగానే ట్రీట్  చేస్తూ వచ్చారు. ఇది అందిరకీ తెలిసిన నిజం. జగమెరిగిన సత్యం.  అయితే, రేవంత్ రెడ్డి పీసీసి అధ్యక్షుడు అయిన తర్వాత రెండు పార్టీల మధ్య దూరం కొంత పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ టార్గెట్’గా రేవంత్ రెడ్డి తెరాస ప్రభుత్వం పై దాడి చేస్తున్నారు. అటు నుంచి కేసీఆర్, కేటీఆర్ కు అదే స్థాయిలో దాడి కొనసాగించారు.అయితే ఇప్పుడు, కేసీఆర్ కాంగెస్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలెట్టారని ఢిల్లీ నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించిన నేపధ్యంలో కీడెంచి మేలెంచడం మంచిదనే ఉద్దేశంతో, ముఖ్యమంత్రి కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నేతలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు, సోనియా, కేసీఆర్ మధ్య స్నేహ బంధాన్ని పెంచేందుకు కాంగ్రెస్, తెరాస పార్టీలలలో ఉన్న పీసీసీ మాజీ అధ్యక్షులు ఇద్దరు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కీలక బాధ్యతలను నిర్వహించిన   ప్రస్తుత తెరాస రాజ్యసభ సభ్యుడు, ఆంధ్ర్ ప్రదేశ్’కు చెందిన ఇంద్దరు మాజీ ఎంపీలతో  కూడిన ఒక బృందం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల వరకు ఉభయ పార్టీల మధ్య ప్రత్యక్ష పొత్తు ఉండదని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత మాత్రం రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఖాయమని అంటున్నారు.  నిజానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ ఉంటేనే, తెరాస గెలుపు సులువు అవుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీల బలాబలాలను బేరీజు వేసుకుంటూ, బ్యాలెన్సు చేసుకుంటూ వచ్చారు. అదే సమయంలో  రెండు జాతీయ పార్టీలను  ఒకే గాటన కట్టేసి   విమర్శిస్తూ  వచ్చారు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యాన్మాయంగా ప్రాంతీయ పార్టీల కూటమి / పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు ప్రాంభించారు, అయితే, ప్రయత్నాలు ఫలించక పోగా, రాష్ట్రంలోనూ పరిస్థితులు తల్లకిందులు  అయ్యే సంకేతాలు స్పష్టం కావడంతో, కేసీఆర్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్ధి విషయంలో, కాంగ్రెస్ ఉన్న కూటమిలో తెరాస ఉండదని ఖరాఖండిగా చెప్పిన కేసీఆర్, ఆ తర్వాత కాంగ్రెస్ సారథ్యంలో 18 జాతీయ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హాను  సమర్ధించడమే కాకుండా, ఆయనకు ఏ రాష్ట్రంలో, ఏ పార్టీ ఇవ్వని స్థాయిలో హైదరాబాద్ లో  గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు. కటవుట్లు పెట్టి, బ్యానర్లు కట్టి, బైక్ ర్యాలీ నిర్వహించి ఘన  స్వాగతం పలికారు. అఫ్కోర్స్ అందుకు, మోడీని అవమానించడం అనే వేరే కారణం ఉన్నా, ఉభయతారకంగా కాంగ్రెస్ కు దగ్గరయ్యే దూరాలోచన కూడా లేకపోలేదని, తెరాస వ్యూహ బృందం సమాచారం.  అలాగే, యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి కేటీఆర్ స్వయంగా హాజరయ్యారు. రాహుల్ గాంధీ పక్కన చేరి ముచ్చట్లాడారు. ఆ ఇద్దరు ఏమి మాట్లాడుకున్నారో ఏమో  కానీ, ఆ తర్వాత నుంచి కేసీఆర్, కేటీఆర్ కాంగ్రెస్  జోలికి వెళ్ళడం లేదు. రెండున్నర గంటల ప్రెస్ మీట్ పెట్టిన రండు నిముషాలు అయినా కాంగ్రెస్ పార్టీకి కేటాయించలేదు. ఇక ఇప్పుడు  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నేరుగా, కాంగ్రెస్ పార్టీ అడగక ముందే, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వాకు తెరాస మద్దతు ప్రకటించింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్, తెరాస దగ్గరవుతున్నాయి అనేందుకు సంకేతాలని పరిశీలకులు భావిస్తున్నారు.   అదలా ఉంటే కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ ఖాన్, అయితే, అసెంబ్లీ ఎన్నికల తర్వాత  కాంగ్రెస్, తెరాస, ఎంఐఎం పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని మీడియా సాక్షిగా కుండ బద్దలు కొట్టారు.  అంతే కాదు, రెండున్నర సంవత్సరాలు తెరాస (కేసీఆర్/కేటీఆర్), రెండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ (రేవంత్ రెడ్డి) ముఖ్యమంత్రిగా ఉంటారని  చెపుతున్నారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా ఢిల్లీ వేదికగా కదులుతున్న రాజకీయ ఎత్తుగడలు, అనివార్యతల దృష్ట్యా కాంగ్రెస్ అవసరం తెరాసకుంది, తెరాస అవసరం కాంగ్రెస్ పార్టీకి వుంది. సో .. రేవంత్ రెడ్డి ఎంతగా కాదన్నా, ఆ ఇంటి మీద కాకి, ఈ ఇంటి మీద వాలేందుకు వీలు లేదన్నా చివరకు కాంగ్రెస్, తెరాస కల్సి కాపురం చేయక తప్పదని పరిశీలకులు అంటున్నారు.

వ‌ర‌ద‌బాధితుల సంగ‌తి ప‌ట్ట‌ని బీజేపీ, టీఆర్ ఎస్‌

ఇల్లు కాలి ఒక‌డు ఏడుస్తుంటే. ఎదురిళ్ల‌వారు స‌హాయానికి వెళ్లి కొట్టుకున్నార‌ట‌. అదుగో ఆలా ఉంది బీజేపీ, టీఆర్ ఎస్ వారి తంతు. అస‌లే వ‌ర‌ద‌ల‌తో గూడూ, గోతం న‌ష్ట‌పోయి  జ‌నం బాధ‌ప‌డుతున్నారు.  జ‌నానికి  ప్ర‌భుత్వం స‌హాయ స‌హ‌కారాలు అందించాలి. కానీ బీజేపీ, టీఆర్ ఎస్ నేత‌లు గొడ‌వ‌ల‌కు దిగారు. మంచిర్యాల ఐబీలో వరద బాధితులను ఆదుకోవాలని బీజేపీ నేతలు దీక్ష చేశారు. అయితే జీఎస్టీ  పెంపును నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నేతలు  కూడా నిరసన తెలిపారు. పరస్పర విమర్శలతో ఇరు పార్టీల నేతలు కొట్టు కున్నారు. రంగంలోకి దిగి ఇరు పార్టీల నేతలను పోలీసులు చెదరగొట్టారు.  జిల్లాలో గతవారం రోజులనుంచి కురిసిన భారీవర్షాలు వరదల కారణంగా జిల్లాలో పెద్ద ఎత్తున పంట లకు నష్టం వాటిల్లింది. ఈ నష్టం కార ణంగా దాదాపు 10 వేల మంది అన్నదాతలు కొలుకోలేని పరిస్థితికి చేరుకు న్నారు. వ్యవసాయాధికారులు యుద్ధ ప్రాతిపాదికన రూపొందించిన ప్రాథమిక పంటలనష్టం అంచనాలను సర్కారుకు నివేదించారు.  ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పత్తి, సోయాబీన్‌, మొక్కజొన్న, కందుల పంటలు పెద్దఎత్తున దెబ్బ తినడంతో ఇక మళ్లీ ఆ పంటలను సాగుచేయడం రైతులకు సవాలుగా మారనుంది. పంటలసాగు ఆలస్యం  కానున్నం దున దిగుబడుల సమయం మరింత దూరమవుతుందని చెబుతున్నారు.

నాగబాబు, నారాయణ వివాదం టీ కప్పులో తుపాను

మెగా స్టార్  చిరంజీవిపై సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలతో ఉవ్వెత్తున లేచిన వివాదం టీ కప్పులో తుపానుగా చల్లారిపోయింది. నటుడు చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ పై సీపీఐ నారాయణ ఇటీవల విమర్శలు గుప్పించారు. చిరంజీవిని రంగులు మార్చే ఊసరవిల్లితో పోల్చారు.   ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఇటీవల భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ హాజరైన సంగతి విదితమే.  ఆ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఊసరవిల్లిలా రంగులు మార్చే చిరంజీవిని కాకుండా అల్లూరి సీతారామరాజుపై సినిమా నిర్మించి, నటించిన సూపర్ స్టార్ కృష్ణకు ఆహ్వానించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. అలాగే పవన్ కల్యాణ్ ను ల్యాండ్ మైన్ తో పోల్చి ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఆయనకే తెలియదని సెటైర్లు వేశారు. దీంతో నారాయణపై జనసైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా బ్రదర్ నాగబాబు అయితే మరింత తీవ్రంగా స్పందించారు. సీపీఐ నారాయణ అన్నం తినడం మానేసి చాలా కాలమైందనని అంటూ ఆయన కేవలం గడ్డి, చెత్తా చెదారం తింటున్నారంటూ విమర్శించారు.   మెగా అభిమానులంతా కలిసి ఆయన చేత గడ్డి తినడం మాన్పించి అన్నం తినడం అలవాటు చేయాలని పేర్కొన్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ పై తను చేసిన వ్యాఖ్యల వివాదం ముదురుతున్న నేపథ్యంలో సీపీఐ నారాయణ బేషరతుగా క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు.   అదే సమయంలో తన వ్యాఖ్యలను కేవలం భాషా దోషంగా భావించి మన్నించాలని కోరారు. నారాయణ క్షమాపణులు కోరి, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో మోగా బ్రదర్ పవన్ కల్యాణ్ శాంతించారు. క్షమాగుణం జనసైనికుల ధర్మం అని పేర్కొన్నారు. అలాగే తప్పు ఎవరు చేసిన క్షమించమని కోరితే క్షమించాలని పేర్కొన్నారు. సీపీఐ నారాయణ వయస్సును దృష్టిలోఉంచుకుని ఆయనను ట్రోల్ చేయడం మానుకోవాలని జనసైనికులకు పిలుపు నిచ్చారు.  

తోపుడుబండి వ్యాపారి.. గ‌న్‌మెన్‌ల ప‌హారా! 

మొన్నామ‌ధ్య అదేదో సినిమాలో బ్ర‌హ్మానందానికి ఇద్ద‌రు తుపాకులు ధ‌రించిన బాడీగార్డుల‌ను చూసి జ‌నం తెగ‌న‌వ్వుకున్నారు. ఈయ‌న‌కెందుకా అని. అది సినిమా కాబ‌ట్టి ఏదో స‌ర‌దా సీన్‌. కానీ అంత‌కంటే విచిత్ర‌మేమంటే తోపుడు బండి వ్యాపారికి కోర్టు గ‌న్‌మెన్‌ల‌ను ఏర్పాటుచేయ‌డం. ఇది వాస్త‌వం. అస‌లు తోపుడు బండివాడికి అంత సీన్ ఎందుకా అని ఇప్ప‌టికే తెగ ఆలోచిస్తున్నారుగ‌దా. అత‌గాడికి కాదు ఆయ‌న ఊళ్లో భూమి త‌గాదా ఆయ‌న‌కు గ‌న్‌మెన్‌ల‌తోటే తిర‌గాల్సిన ప‌రిస్థితి క‌ల్పించింది.  ఆయ‌న పేరు రామేశ్వ‌ర్ ద‌యాళ్‌.  ఉత్త‌రప్ర‌దేశ్ ఎటా జిల్లా నివాసి. ఆయ‌న తోపుడు బండి మీద దుస్తు లు అమ్ము తూంటాడు. అలా రోజంతా ఊళ్లో తిరుగుతూ రోజుకు 200 నుంచి 300 రూపాయ‌లు సంపాదిస్తాడు. ఇటీవ‌ల రామేశ్వ‌ర్ అక్క‌డి ఎస్పీ నేత మాజీ ఎమ్మెల్యే రామేశ్వ‌ర్ సింగ్ సోద‌రుడు జుగేంద్ర సింగ్‌ను క‌లిశాడు. త‌న భూమికి ప‌ట్టా ఇప్పించాల‌ని కోరాడు.   వాస్త‌వానికి భూమికి ప‌ట్టా ఇప్పించ‌డం అనేది మాజీ ఎమ్మెల్యే త‌మ్ముడికి పెద్ద లెక్కేమీ కాదు. కానీ భూమిని కాజేద్దామ‌ని ఆలోచ‌న వ‌చ్చే ఉంటుంది. అందుకే ఏదో ఒక గొడ‌వ‌పెట్టుకోవాల‌నుకున్నాడు. రామేశ్వ‌ర్‌ను కులం పేరుతో తిట్టాడు. అంతే కులం మాట ఎత్త‌గానే వారి మ‌ధ్య చిన్న‌గొడ‌వ చిలికి చిలికి  గాలివానై ఏకంగా క‌న‌ప‌డితే చంపుతాన‌ని బెదిరించేదాకా పోయింది. భ‌యంతో రామేశ్వ‌ర్ ద‌యాళ్ ప‌రుగున పోలీసు స్టేష‌న్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. కానీ జుగేంద్ర అక్క‌డితో ఆగ‌క అస‌లా భూమి నాదే అంటూ హైకోర్టును ఆశ్ర యించాడు. రామేశ్వ‌ర్‌ను కోర్టువారు ర‌మ్మ‌న్నారు. అత‌ను ఒక్క‌డే భ‌యం భ‌యంగా వెళ్లాడు. అత‌నితో ఎవ్వ‌రూ లేక‌పోవ‌డం సంగ‌తి  విని కోర్టు  అత‌నికి వెంట‌నే  భ‌ద్ర‌త  క‌ల్పించ‌ మ‌ని పోలీసుల‌ను  ఆదేశిం చింది. కోర్టు ఆదేశాన్ని శిర‌సావ‌హించి పోలీసులు రామేశ్వ‌ర్‌కు ఇద్ద‌రు బాడీగార్డుల‌ను నియ‌మించారు. అంతే కాదు వారిద్ద‌రికి ఏకే 47 రైఫిళ్ల‌నూ ఇచ్చారు. రామేశ్వ‌ర్ ఇపుడు తోపుడు బండి మీద దుస్తులు అమ్ముతూ రాజ‌కీయ‌నాయకుడిలా నిటారుగా  తిరుగుతున్నాడు. మ‌రి ఏకే 47 తో వున్న‌వారిని వెంటేసుకుని తిర‌గ‌డం అంత ధైర్యాన్నిస్తుంది క‌దా! 

రైతుల్ని ప‌ల‌క‌రించిన   కొత్త  అతిథి 

మ‌న ఊరు, మ‌న గుడి, మ‌న గుట్ట‌.. అనుకుని ఓ పెద్దామె చాలారోజుల త‌ర్వాత చెట్ల‌పొద‌లు తొల‌గి స్తుంటే స‌ర్రున నాగ‌రాజు లేచి ప‌ల‌క‌రించాడు. అంతే బామ్మ‌గారు అమాంతం వెల్ల‌కిలా ప‌డి లేచి ఇంటి దాకా ప‌రిగె త్తింది. పాములు, క‌ప్ప‌లు, తేళ్ల‌కు వీలు చిక్కాలే గాని ఇళ్ల‌లోకి రావ‌డానికే మ‌హా తొంద‌ర‌ ప‌డుతూంటా యి. ఇపుడు వాటి ఆ స‌ర‌దానే భ‌ద్రాచ‌లం జిల్లాలో ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది.  భారీవ‌ర్షాలు, ఇటివల కురిసిన భారీ వర్షాలకి భద్రాచలం జిల్లా అతలాకుతలం అయిన సంగతి తెలిసిం దే. ఇప్పుడిప్పుడే అక్కడ ప్రజలు కొంత కోలుకుంటున్నారు.భారీ వర్షాలతో గోదావరి తీవ్ర రూపం దాల్చిన విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కాగా  ఇప్పుడిప్పుడే  గోదారమ్మ శాంతి స్తుంది. ఈ క్రమంలో పునరావాసాల నుంచి ఇళ్ల బాట పడుతున్న ముంపు గ్రామాల  బాధితులు  ఇళ్లను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు.  వరదనీటితోపాటు ఇళ్లలో, వాడల్లో పాములు,  తేళ్లు, మొసళ్లు, ఇతర ప్రమాదకర జీవులు చేరి గజగజ వణికిస్తున్నాయి. వాటికి మ‌నుషులు లేక‌పోతే ఆ ఇల్లు త‌మ‌దేన‌న్న భావ‌న ఉంటుందేమో!  ఇళ్ల‌లోకి వ‌చ్చిన‌వాటి సంగ‌తి స‌రే. పొలంలోకి  ఎప్పుడు వ‌చ్చిందో బుర‌ద నీటిలో హాయిగా ప‌డుకున్న మొస‌లి పిల్ల కంట‌ప‌డింది. అంతే పొలంలోకి వెళ్లిన రైతులు భ‌యంతో ప‌రుగులు తీశారు. ఎక్క‌డో ఉండాల్సిన మొస‌లి పిల్ల‌ద‌యినాస‌రే ఇలా  తార‌స‌ప‌డ‌టం ఖంగారుపెట్టింది.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  అశ్వాపురం మండలం నెల్లిపాకలో పొలం పనులకు వెళ్లిన రైతులు కంగుతిన్నారు.  బురదలో ఏదో  క‌ద‌ల‌డం చూశారు. దగ్గరికి వెళ్లగా అది మొసలి పిల్లగా నిర్ధారించారు.  పొలంలో బురదలో ఇరుక్కుని ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటున్న మొసలి గురించి రైతులు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థ‌లానికి చేరుకున్న యానిమల్​ రెస్క్యూ టీమ్‌  పంట పొలంలో ఉన్న మొసలి పిల్లను పట్టుకు న్నారు.  అనంతరం హైదరాబాద్‌లో నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. వరదలకు అడవుల్లోని విష పురుగులు ఊర్లలోకి రావడంతో ఎప్పుడు ఏ ప్రమాదం బారిన పడవలసి వస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.వీటిని గుర్తిస్తే చంప కుండా. . తమకు సమాచారం అందించాలని కోరారు. మరోవైపు నల్లాలను శుభ్రం చేయకుండా వాడితే కలుషిత నీళ్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రజ లంతా నల్లాలను శుభ్రం చేసుకున్న తర్వాతే నీటిని వాడుకోవాలని కోరుతున్నారు.

బటన్ నొక్కితే బాధ్యత తీరిపోయినట్లేనా జగన్.. జనసేనాని

భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చాలా గ్రామాలు దెబ్బ‌తిన్నాయి. వ‌ర్షం నీరు మోకాల్లోతు ఉన్నా య‌ని రోడ్డు క‌నిపించాక‌నే వెళ్లి బంధువుల్ని ప‌ల‌క‌రిస్తానంటే ఎలా కుదురుతుంది. కేవ‌లం స‌మాచారం అందుకోవ‌డం, అధికారుల‌కు ఆదేశాలు జారీచేసినంత మాత్రాన స‌హాయ‌క చ‌ర్య‌లు  వాటంత‌ట అవి జ‌రిగిపోవు. వాస్త‌వంగా పున‌రావాస కేంద్రాల్లో ప‌రిస్థితుల‌ను స‌మీక్షించి స‌హాయ‌క‌చ‌ర్య‌ల‌ను మ‌రింత వేగిరం చేయాలి. కానీ ప్ర‌భుత్వం తీరు అందుకు భిన్నంగా ఉంద‌ని విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. నాలుగు ట‌మాటాలు, రెండు ఆలూలు, నూనె ఇచ్చేసినంత మాత్రాన చాలా సేవ చేసిన‌ట్టు అవుతుందా? అది కూడా ప్ర‌భుత్వం చెప్పిన‌ది ఒక‌టి అక్క‌డ అమ‌లు చేస్తున్న‌ది మ‌రో విధంగా ఉంద‌ని విప‌క్షాలు తేల్చాయి. క‌నీసం మాన‌వత్వంతో చేయ‌వ‌ల‌సిన ప‌నులు కూడా చేయ‌లేని దుస్థితిలో ప్రభుత్వం ఉంద‌ని భావించాల్సి వ‌స్తోందని విప‌క్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.  గోదావ‌రి క‌న్నెర్ర చేసింది, గోదావ‌రి తీర ప్రాంతాలన్నీ దెబ్బ‌తిన్నాయి. రైతాంగం తీవ్ర‌ంగా న‌ష్ట‌పోయింది. చాలా గ్రామాల్లో ప్ర‌జ‌లు అన్నీ కోల్పోయి పున‌రావాస కేంద్రాల్లో బికుబికుమంటూ ఉన్నారు. క్ర‌మేపీ ప‌రిస్థి తులు శాంతించాయి. కానీ పున‌రావాస కేంద్రాల్లో ఉన్న‌వారి క‌ష్టాల‌ను ప్రభుత్వం విన్న పాపాన‌పోలేద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో వంద‌లాది గ్రామాల్లో వ‌ర‌ద నీరు ఇళ్ల‌లో నిలిచిపోయి ప్ర‌జ‌లు తిరిగి వెళ్ల‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. వారి ప‌రిస్థితిని ఆకాశ‌మార్గాన ప‌ర్య‌టించి చూడ్డం కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేల‌ను పంపి మ‌రీ తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.  ప్రభుత్వ ప‌థ‌కాల అమ‌లు గురించి వాక‌బు చేయ‌డానికి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు అంటూ గొప్ప‌కార్య‌క్ర‌మంతో అంద రి ద‌గ్గ‌రికీ వెళ్లిన నాయ‌కులు ఇపుడు వెళ్లి వారికి ఎలాంటి స‌హాయం చేయాలో తెలుసుకుంటే బాగుంటుం ద‌ని, కేవ‌లం మాట‌లు, ప్ర‌చారాలు కాకుండా ఇలాంటి స‌మ‌యంలోనే అస‌లు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టా ల‌న్న విమ‌ర్శ‌లు విన‌వ‌స్తున్నాయి. వరదనీరు ఇళ్లల్లోకి చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప‌వ‌న్  ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వర దల కారణాల వేలాది మంది  బాధితులు  ఇబ్బదులకు గురవుతుంటే.. ఏపీ ప్రభుత్వం పునరావాస కేంద్రా లు నామ మాత్రంగానే ఏర్పాటు చేసిందని ఆరోపించారు. వరదలపై ప్రభుత్వం చేస్తున్న చర్యలను చూ స్తుంటే ప్రభుత్వం అప్రమత్తంగా లేదని అర్థమవుతోందన్నారు. బటన్‌ నొక్కితే  బాధ్యత తీరిపోయిందని వైసీపీ నాయకత్వం భావిస్తోందని విమర్శించారు.  మానవత్వంతో స్పందించి వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలి. కానీ, వరద బాధితుల గోడును పాలకులు పట్టించుకోవడం లేదని ప‌వ‌న్ ఆరోపించారు. బాధితులను ఆదుకోవాలని కోరితే రాజకీయం చేస్తున్నామని అంటూ.. పాలనా వైఫల్యాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు కనీసం పడవలు కూడా ప్రభుత్వం సమకూర్చలేకపోయిం దని, ఆహారం కూడా ఇవ్వలేదని విమర్శించారు.  ప్ర‌జ‌ల్ని ఈ క‌ష్ట‌కాలంలో ఆదుకోవ‌డంతో పాటు వారి భ‌విత‌కు భ‌రోసా ఇవ్వాలి. కానీ ప్రభుత్వానికి అలాంటి ఆలోచ‌నేమీ ఉన్న‌ట్టు లేదు. ప్ర‌కృతి వైప‌రీత్యం క‌నుక  తామేమీ చేయ‌లేమ‌ని చేతులెత్తేస్తే ఇక  ముంపు గ్రామాల ప్ర‌జ‌లు స‌హాయం కోసం ఎవ‌రి ద‌గ్గ‌రికి వెళ‌తారు. ప‌థ‌కాలు, ఓట్ల గురించి ఇంటింటికీ అత్యుత్సా హంతో తిరిగిన‌వారు  ఇక ఇప్పుడు వ‌ర‌ద భ‌యం త‌గ్గిన ఈ స‌మ‌యంలోనైనా స‌హాయ‌క‌చ‌ర్య‌లు వేగిరం చేప‌ట్టి ముంపుగ్రామాల ప్ర‌జ‌ల‌కు ధైర్యం ఇవ్వాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వం పై ఉన్న‌ది.

మళ్లీ తెరపైకి సమైక్యాంధ్రప్రదేశ్?

రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్- తెలంగాణ మళ్లీ కలిసిపోనున్నాయా? లేదా? మరో పదేళ్ల పాటు ఇరు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే ఉంచుతారా? విభజనతో అన్ని విధాలా నష్టపోయిందని, పీకి అన్యాయం జరిగిందని ఇప్పటికే పలుమార్లు చెప్పిన ప్రధాని మోడీ తలచుకుంటే ఏపీ- తెలంగాణ రాష్ట్రాలను కలిపేయడం పెద్ద కష్టమేమీ కాబోదంటున్నారు పరిశీలకులు. కాదంటే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే యోచన కూడా ఉండి ఉండొచ్చని కూడా  చెబుతున్నారు. ఈ మేరకు మోడీ స్కెచ్ వేశారని, అందులో భాగంగానే ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్’ ‘హైదరాబాద్ రాజధాని’ వ్యాఖ్యలు చేశారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విభజన తర్వాత రాజధాని హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోయిందని, దాంతో ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని, హైదరాబాద్ ను మళ్లీ పూర్వం మాదిరిగా ఏపీకి కలిపేయమని అడిగితే ఎలా ఉంటుందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు? అలా ఐతే హైదరాబాద్ ను ఏపీలో కలిపేయమనండి.. తప్పులేదు అంటున్నారాయన. రాష్ట్ర విభజనను రద్దు చేసి, రెండు తెలుగు రాష్ట్రాలను మళ్లీ పూర్వంలాగే సమైక్యంగా మార్చేయండి   అభ్యంతరం లేదు అని బొత్స మంగళవారం ఒక సందర్భంలో అన్నారు.   మాట్లాడిన సందర్భం ఏదైనా  ఏపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది.  దక్షిణ భారతదేశంలో బీజేపీ ఉనికి కేవలం కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే కనిపిస్తోంది. ఉత్తరాదిలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న బీజేపీ దక్షిణాదిలో కూడా పాగా వేయాలని అనేక యత్నాలు చేస్తూ వస్తోంది. అయితే అవేమీ పెద్దగా ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదు.   ముందుగా తెలంగాణపై కన్నేసిన కమలదళం పలు రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీ పైన, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ పైనా తీవ్ర స్థాయి విమర్శలతో చెలరేగిపోతున్నారు. కేంద్రంలో బీజేపీ రహిత పరిపాలనకు బాటలు వేయాలంటూ విపక్షాలను కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.   ఈ నేపథ్యంలోనే విభజన సమయంలో ఏపీకి నష్టం జరిగిందని  ప్రధాని మోడీ కొన్నిసార్లు స్వయంగా చెప్పడం గమనార్హం. దీంతో కేసీఆర్ స్పీడుకు, టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయాలనే వ్యూహాలు మోడీ రచిస్తున్నారనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం  అయ్యాయి. రాజధాని నగరంలేని ఏపీకి హైదరాబాద్ నే మరో పదేళ్ల పాటు రాజధానిగా కొనసాగించాలనే యోచన ఇందులో భాగమేనంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా ఇప్పుడు ‘ముగిసిన అధ్యాయం’ అని కేంద్రం పార్లమెంట్ లో తాజాగా మరో మారు స్పష్టం చేయడంఈ సందర్భంగా  గమనార్హం. ప్రత్యేక హోదా ఇవ్వనందువల్ల ఆర్థికంగా నష్టపోతున్న ఏపీకి కొంత వెసులుబాటు కల్పించాలని, లేదా తెలంగాణతో మళ్లీ కలపడం ద్వారా మేలు చేయాలనే ఆలోచన కూడా కేంద్రం పెద్దల్లో, ముఖ్యంగా ప్రధాని మోడీలో ఉందంటున్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు ప్రధాని మోడీ తలుచుకుంటే.. తెలుగు రాష్ట్రాలను మళ్లీ విలీనం చేయొచ్చని, లేదా హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించి, ఆదాయంలో భాగం పంచవచ్చని,  అదీ కాకపోతే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి తెలంగాణలో కేసీఆర్ ను బలహీనం చేయడం, అదే సమయంలో ఏపీలో బలం పెంచుకునే అవకాశం కల్పించుకోవడం అన్న యోచనతో మోడీ తన వ్యూహాలకు పదును పెడుతున్నారన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   మోడీ స్కెచ్ లో భాగమే  ఏపీ మంత్రి బొత్స   ఉమ్మడి రాజధాని, ఇరు రాష్ట్రాల విలీనం అంశాలను ప్రస్తావించారని పరిశీలకులు భావిస్తున్నారు.

క్రికెట్‌రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గ‌చ్చు

సాగినంత‌కాలం తానే రాజ‌నుకుంటాడు.. సాగ‌క‌పోతే ఊర‌క చ‌తికిల ప‌డ‌తాడు..ఇదెక్క‌డో విన్న‌మాట‌లా ఉంది గ‌దా.. పోనీ భ‌గ‌వ‌ద్గీత‌లోదే అనుకుందాం.. కింగ్ కోహ్లీకి  ఇపుడు భ‌గ‌వ‌ద్గీత  విన‌డం అవ‌స‌ర‌మ‌ని అత‌ని వీరాభిమానులు అంటున్నారు. కానీ గ‌వాస్క‌ర్ వంటి  సీనియ‌ర్లు  అలా అన‌డం లేదు. ఒక్క ఇర‌వై నిమిషాలు స‌మ‌యం ఇస్తే.. కోహ్లీకి మ‌ళ్లీ సెంచ‌రీ కొట్టే స‌త్తాకి మార్గం బోధిస్తాన‌న్నాడు.  కోహ్లీ.. క్రికెట్‌లో క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ త‌ర్వాత  క్రికెట్ అభిమానుల హృద‌యాల్లో నిలిచిన సూప‌ర్ డూప‌ర్ స్టార్‌. మామూలుగానే స‌చిన్‌తో ప్ర‌తీ క్రికెట్ స్టార్‌నీ పోల్చ‌డం దేశంలో ఆన‌వాయితీ.  కానీ ఆట తీరులో కాస్తంత‌యినా వ్య‌త్యాసం ఉంటుంద‌న్న‌ది గ్ర‌హించాలి. కానీ కోహ్లీ క్రీజులోకి రాగానే ప్రేక్ష‌కు డికి మ‌రో స‌చిన్ వ‌చ్చేడ‌నే  భావ‌న బ‌లంగా  నాటుకుపోయింది. అందువ‌ల్ల  కోహ్లీ త‌న‌కు తాను ఏమ‌ను కుంటాడ‌నేది వేరే సంగ‌తి ప్రేక్ష‌కులు, క్రికెట్ పిచ్చాళ్ల దృష్టిలో అత‌ను స‌చిన్ లానే ప‌రుగుల వ‌ర‌ద సృష్టించాల్సిందే. అది రూలు .. రూల్ ఈజ్ రూల్ ఫ‌ర్ ఆల్‌!! కానీ, కాల‌క్ర‌మంలో అనేక సీరీస్‌లు ఆడిన త‌ర్వాత బ్యాటింగ్ ప‌దును కాస్తంత త‌గ్గుతుంద‌న్నది గ‌వాస్క‌ర్ కాలం నుంచి ఉన్న‌ది, గ‌మ‌నిస్తున్న‌దీను. దానికి గ‌వాస్క‌ర్ వంటివ‌రూ అంగీక‌రిస్తున్నారు.  ఫామ్ దెబ్బ‌తిన గానే హ‌ఠాత్తుగా సూప‌ర్ స్టార్, గాడ్‌.. అనే పీఠాన్నుంచి అమాంతం తోసేయాల్సిన అవ‌స‌రం అయితే లేదు. కానీ క్రికెట్ వీరాభిమానుల‌కు అదేం ప‌ట్ట‌దు. ప‌రుగుల వ‌ర‌ద సృష్టించ‌లేన‌పుడు గ‌వాస్క‌ర్ అయినా, స‌చిన్ అయినా.. ఇపుడు కోహ్లీ అయినా ఒక్క‌టే. త‌ప్ప‌దు వారి భావోద్వేగం అలాంటిది మ‌రి.  కోహ్లీ 2019 న‌వంబ‌ర్ నుంచి ఒక్క అంత‌ర్జాతీయ సెంచ‌రీ చేయ‌లేదు. దానిక్కార‌ణం అత‌ను ఆఫ్‌స్టంప్ లైన్ తో ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని స్ఫుర‌ద్రూపి అయిన గ‌వాస్క‌ర్ ఇట్టే ప‌ట్టేశాడు. ఎంత‌యినా బ్యాట‌ర్ సంగ‌తి మ‌రో బ్యాట‌ర్‌కే తెలుస్తుంది. గ‌వాస్క‌ర్ అంత‌ర్జాతీయ అనుభ‌వంతో పాటు అతి ప్ర‌మాద‌క‌ర బౌల‌ర్ల ను ఎదుర్కొన్న ధీరుడుగా  పేరు గ‌డించిన పొట్టివాడు, గ‌ట్టివాడు!  కోహ్లీ సెంచ‌రీ కాదు అర్ధ సెంచ‌రీ దాట డానికి నానా యిబ్బందీ ప‌డుతున్నాడ‌ని అనేకానేక వంక‌ర కామెంట్లు అత‌న్ని ఇబ్బంది పెడుతున్నాయి. ప్లేయ‌ర్ అన్న‌వాడికి ఎపుడో ఒక‌ప్పుడు ఇలాంటి లీన్ పాచ్ రావ‌డం చాలా స‌హ‌జం. దీనికి  కోహ్లీ  మ‌రీ గుమ్మ‌డి లా  బాధ‌ప‌డిపోన‌క్క‌ర్లేదు. కాస్తంత విశ్రాంతి తీసుకుంటే జూనియ‌ర్ ఎన్టీఆర్‌ లా విజృంభించే అవ‌కాశాలూ లేక‌పోలేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  తాజాగా లెజండ‌రీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ కోహ్లీ వైపు మొగ్గుచూపి, అత‌గాడిది మ‌రీ దిగులుప‌డి పోయేంత ప‌రిస్థితేమీ కాద‌న్నాడు. చిన్న‌పాటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అధిగ‌మించ‌డానికి తాను మందు వేస్తాన‌ని అన్నాడు. కామెంట్ల కంటే అత‌ని ఆటతీరులో వ‌చ్చిన చిన్న‌పాటి లోపాల్ని స‌రిది ద్దుకునేందుకు వీలు క‌ల్పించే మార్గాల్ని తోటి ప్లేయ‌ర్లు, సీనియ‌ర్లు క‌ల్పించాల‌ని గ‌వాస్క‌ర్ భావం కావ‌చ్చు. సాధార‌ణంగా బొంబాయి వాళ్ల‌నే నెత్తినెక్కించుకునే గ‌వాస్క‌ర్‌కు హ‌ఠాత్తుగా కోహ్లీ మీద అపార ప్రేమ‌, అభిమానం పొంగ డానికి కార‌ణం బొంబాయి కుర్రాడు శ‌ర్మ ఫామ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.  క్రికెట్ రాజ‌కీయాలు బ‌య‌ట రాజ‌కీయాల‌కు ఆట్టే తేడా లేదు. కాబోతే బిసిసిఐ మేధావుల రాజ‌కీయాల ప్ర‌భావం త‌ర్వాత‌నే వెలుగులోకి వ‌స్తుంది. అప్ప‌టికి జ‌ర‌గాల్సిన అన్యాయం ప్లేయ‌ర్ల‌కు జ‌రుగుతుంది. ఇది పాతికేళ్లుగా సాగుతున్న‌దే. గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి వారికీ బొంబాయి మేధావుల రాజ‌కీయ సెగ త‌గిలింది. ఎవ‌రు అద్భుతంగా రాణిస్తున్నా, ఎవ‌రు స‌చిన్‌ను, శ‌ర్మ‌నో మించిపోతున్నా వెంట‌నే బొంబాయికి చెందిన కామెంటేట‌ర్లు, మాజీ ప్లేయ‌ర్లు త‌మ గూగ్లీల‌తో దాడి చేయ‌డం చాలా స‌హ‌జం. వారికి బొంబాయి, శివాజీ పార్కు ప్లేయ‌ర్ల కంటే లోకంలో మ‌రే ప్లేయ‌రూ అస‌లు ప్లేయ‌రే కాదు.   ధోనీ విజృంభిస్తు న్న స‌మ‌యంలో ఈ గ‌వాస్క‌ర్లంతా నోరు మూసుకోవాల్సి వ‌చ్చింది. ధోనీ ఆట‌లో స్పీడు, ఆలోచ‌న‌ల అమ‌లు, విజ‌యాల‌ను బేరీజు వేసుకుంటే ఏ బొంబాయి ప్లేయ‌రూ అత‌ని ముందు దిగ‌తుడుపే కావ‌డంతో ఎవ్వ‌రూ అత‌న్ని కాద‌న‌లేక‌పోయారు. ధోనీ అంటే విజ‌యం అనే ప్ర‌శంస‌ల‌తో అత‌ని హ‌వా సాగ‌నిచ్చేరు.  ఇపుడు కోహ్లీ మీద  అంత తొంద‌ర‌గా ఏమీ అన‌లేని ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అందుకే కేవ‌లం ఆట‌లో చిన్న‌పాటి పొర‌పాట్ల‌ను స‌ద్దితే స‌రిపోతుంది, అది నా వ‌ల్లే అవుతుంద‌ని గ‌వాస్క‌ర్ త‌న వ‌ద్ద‌కు పిలిచాడు. మ‌రి వెళ్లాలా, వ‌ద్దా అన్న‌ది కోహ్లీ ఆలోచించుకోవాలి. 

భారతీయులు దేశం వదిలేస్తున్నారు

చదువు కోసమో, ఉపాధి వ్యాపారాల కోసమో విదేశాలకు వెళ్ళే భారతీయుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. అమెరికా, యూకే, బ్రిటన్, జర్మనీ ఇలా ఈ దేశం ఆ దేశం అని కాదు, ప్రపంచ పటంలో ఉన్న ఏ దేశం వెళ్లినా భారతీయులు కనిపిస్తారు. ప్రపంచంలో భారతీయులు లేని దేశం లేదంటే  అతిశయోక్తి కాదు. నిజానికి, ఇప్పుడు ప్రతి భారతీయ కుటుంబంలో కనీసం ఒక్కరి వంతున విదేశాల్లో స్థిరపడుతున్నారు. అమెరికా వంటి కొన్ని దేశాల్లో అయితే రెండు మూడు తరాలుగా అక్కడే స్థిరపడి చుట్టం చూపుగా ఎప్పుడో ఒకసారి స్వదేశానికి వచ్చి వెళుతున్న కుటుంబాలు కోకొల్లలు. నిజమే, ఇప్పుడు కాదు, చాలా కాలంగా, స్వాతంత్రానికి ముందు నుంచి కూడా  విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల కోసం భారతీయులు విదేశాలకు వెళుతున్నారు. ఆ సంఖ్య క్రమక్రమగా పెరుగుతోంది. అయితే, గతంలో వెళ్ళిన వారు,వెళ్ళిన పని పూర్తి చేసుకుని వెనక్కి వచ్చి స్వదేశంలో స్థిరపడేందుకు ఇష్ట పడే వారు. జాతిపిత మహత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, ఇంకా ఎందరో స్వాతంత్ర సమరయోధులు విదేశాలలో చదువుకుని, వెనక్కి వచ్చి స్వాతంత్ర పోరటంలో పాల్గొన్నారు.  అయితే, ఇప్పడు ట్రెండ్ మారింది. ఏటి కేడాది విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య పెరిగి పోతోంది. మరో వంక అలా వెళ్ళిన వారిలో ఎక్కువగా  విదేశాల్లో   స్థిరపడుతున్నారు. అక్కడే ఆస్తులు ఏర్పరచు కుంటున్నారు.అంతే కాదు, భారత పౌరసత్వాన్ని వదులుకుని, ఆయా దేశాల పౌరసత్వాన్ని స్వీకరించేందుకు మొగ్గు చుపుతున్నారు. ఈ నేపధ్యంలో గత కొన్నేళ్లుగా భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2019లో 1,44,017 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు, కాగా, 2020లో బహుశా కొవిడ్ కారణంగా కావచ్చును, 85,256 కు తగ్గింది. 2021లో అయితే ఏకంగా 1,63,370 మంది మన దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభలో వెల్లడించారు. అన్ని దేశాలలో ఇదే పరిస్థతి ఉన్నా, ఇప్పటికీ భారతీయుల ఫస్ట్ డెస్టినేషన్ అగ్రరాజ్యం అమెరికానే.  గత మూడేళ్లలో భారత పౌరసత్వాన్ని త్యజించిన వారిలో ఎక్కువ మంది అమెరికా పౌరసత్వాన్ని పొందారని గణాంకాలను బట్టి తెలుస్తోంది.  అమెరికాలో నివసిస్తోన్న భారతీయుల్లో 2019 లో 61 వేల మందికిపైగా మన దేశ పౌరసత్వాన్ని వదులుకోగా.. 2020లో 30 వేల మందికిపైగా, 2021లో 78,284 మంది భారత పౌరసత్వాన్ని త్యజించారు. అంటే గత ఏడాది భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారిలో దాదాపు 48 శాతం మంది అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా వుంది. గత ఏడాది 23,533 మంది భారతీయులు ఆస్ట్రేలియా పౌరసత్వం పొందారు. 2019లో 21,340 మంది, 2020లో 13,158 చొప్పున భారతీయులు ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని పొందారు.కెనడా పౌరసత్వం పొందడం కోసం కూడా భారతీయులు ఎక్కువగానే ఆసక్తి చూపుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా తర్వాతి స్థానంలో యునైటెడ్ కింగ్‌డమ్ ఉంది. 2019లో 14,309 మంది భారతీయులు యూకే పౌరసత్వాన్ని పొందగా.. ఆ తర్వాతి రెండేళ్లలో వరుసగా 6489, 14637 మంది చొప్పున యూకే సిటిజన్‌ షిప్ పొందారు. యూకే, ఇటలీ, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల పౌరసత్వం పొందిన భారతీయుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. గత ఏడాది 41 మంది భారతీయులు పాకిస్థాన్ పౌరసత్వం తీసుకోవడం గమనార్హం. అంతకు ముందు ఏడాది కూడా ఏడుగురు భారతీయులు పాకిస్థాన్ పౌరసత్వం పొందారు. కాగా, 2015 నుంచి చూస్తే.. 2021 సెపెంబర్ వరకు 8,81,254 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని త్యజించారని కేంద్ర హోం శాఖ 2021 డిసెంబర్లో పార్లమెంట్‌లో వెల్లడించింది..

శిక్ష‌ణ‌లో సాంకేతిక‌ప‌రిజ్ఞానానికి  ప్రాధాన్య‌త‌నివ్వాలి..  షా

పోలీసుల శిక్ష‌ణా విధానంలో మార్పులు తీసుకురావ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అభిప్రాయ‌ప‌డ్డారు.  దేశ‌భ‌క్తి, క్ర‌మ‌శిక్ష‌ణ‌, బాధితుల ప‌ట్ల సౌమ్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వీటితో పాటు అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగించు కోవ‌డంలో మెళ‌కువ‌లు పోలీసుల శిక్ష‌ణ‌లో భాగంగా ఉండా ల‌ని ఆయ‌న అన్నారు.  పోలీసు శిక్ష‌ణా సంస్థ‌ల రివ్యూ స‌మావేశంలో మాట్లాడుతూ పోలీసుల‌కు ఈ రోజుల్లో సాంకేతిక‌త‌, ఆధునిక ఆయుధాల శిక్ష‌ణ‌,  వినియోగం త‌ప్ప‌కుండా తెలియాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. డ్యూటీ ప‌ట్ల బాధ్య‌తాయుతంగా ఉండ‌టం, ల‌క్ష్యాల‌ను సాధించాల‌న్న ప‌ట్టుద‌ల కూడా శిక్ష‌ణ‌లో భాగంగా ఉండాల‌ని  షా సూచించారు. ప్ర‌ధాని మోదీ ఆరంభించిన మిష‌న్ క‌ర్మ‌యోగి  కార్య‌క్ర‌మం క్రింద  పోలీసు కానిస్టేబుల్, స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌, డిఎస్‌పి స్థాయిల వ‌ర‌కూ పోలీసు అధికారుల శిక్ష‌ణ క‌ట్టుదిట్టంగా జ‌ర‌గాల‌ని అన్నారు.  పోలీసుల‌కు 60 శాతం శిక్ష‌ణ అంద‌రికీ స‌మానంగా ఉండాల‌ని, 40 శాతం మాత్రం ఆయుధాల వినియోగం ఆధారిత ప్ర‌త్యేక శిక్ష‌ణ ఉండాల‌ని హోం మంత్రి సూచించారు. ఎప్పటికప్పుడు మారుతున్న భద్రతా సవాళ్ల స్వభావానికి సత్వర, ప్రభావంతమైన ప్రతిస్పందనలను అందించడానికి పోలీసు సిబ్బంది సామ ర్థ్యాలను పెంపొందించడానికి సరైన సమయంలో సరైన శిక్షణ  ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ కేంద్ర పోలీసు శిక్షణా సంస్థలచే ప్రదర్శనలు  చేప‌డుతున్నారు. శిక్షణా అవస రాల విశ్లేషణ, శిక్షణ వనరుల ఉత్పాదకత   ప్రాముఖ్యతతో సహా  శిక్షణా పద్ధతులు అమ‌లుచేస్తున్నారు.

ఏపీలో విపక్షానికి ఆయుధాన్ని అందించిన కేంద్రం!

ఆంధ్రప్రదేశ్ లో విపక్ష తెలుగుదేశానికి కేంద్రం పదునైన ఆయుధాన్ని అందించింది. రాష్ట్రాన్ని అప్పులకుప్పలా మార్చేసిన జగన్ రాష్ట్ర భవిష్యత్ ను అంధకారం చేస్తున్నారంటూ తెలుగుదేశం చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చేలా ఏపీ మరో శ్రీలంకలా మారి పోతున్నదంటూ కేంద్రం వ్యాఖ్యానించింది. ఇంత కాలం రాష్ట్రంలోని జగన్ సర్కార్ అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని దివాళా అంచుకు తీసుకువచ్చిందని తెలుగుదేశం విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలసిందే. ఇంత కాలం ఆ విమర్శలను పట్టించుకోకుండా.. రాష్ట్రానికి మరిన్ని అప్పులు చేయడానికి అనుమతులిస్తూ ప్రోత్సహించిన కేంద్రం.. ఉన్నట్టుండి ఏపీ ఆర్థిక పరిస్థితిపై బాంబు పేల్చి ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదంటూ ఏపీ సర్కార్ పై ఫైర్ అయ్యింది. శ్రీలంక సంక్షోభంపై చర్చించేందుకు మంగళవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పరిమితికి మించి అప్పులు చేస్తున్నాయంటూ ఓ పది రాష్ట్రాలను వేలెత్తి చూపిన కేంద్రం.. ఆ పది రాష్ట్రాలలోనూ ఏపీ పరిస్థితి మరింత దారుణంగా ఉందని తేల్చేసింది. కేంద్రం మంగళవారం నాటి అఖిలపక్ష భేటీలో పది రాష్ట్రాలను ప్రస్తావించినా, అందులో ఆర్థిక క్రమశిక్షణ ఏ మాత్రం పాటించని రాష్ట్రంగా ఏపీ ముందుపీటిన ఉంది. కేంద్రం అప్పుల విషయంలో రాష్ట్రాలకు చేసిన సూచనలు సలహాలను పక్కన పెడితే.. ఏపీ తీరు అత్యంత దారుణంగా ఉందని కుండబద్దలు కొట్టింది.  ఏపీ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యంపై కేంద్రం చేసిన వ్యాఖ్యలు విపక్ష తెలుగుదేశంకు  పదనైన ఆయుధాన్ని అందించినట్లే అయ్యింది. ఇంత కాలంగా తాము ఏం చెబుతున్నామో అది వాస్తవమేనని కేంద్రం ఖరారు చేసిందని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. కేంద్రం మంగళవారం ఒక్క రోజే కేంద్రం గాలి తీసేసేలా మూడు అంశాలపై క్లారిటీ ఇచ్చింది. అవి ఒకటి పోలవరం, రెండు ప్రత్యేక హోదా, మూడు క్రమశిక్షణా రాహిత్యం. ఈ మూడు విషయాలలోనూ తెలుగుదేశం ఇప్పటి వరకూ ఏ విమర్శలైతే చేస్తూ వస్తోందో అవన్నీ అక్షర సత్యాలని కేంద్రం తేల్చేసింది. పోలవరం జాప్యానికి గత తెలుగుదేశం ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలే కారణమని ఇంత కాలం బుకాయిస్తూ వచ్చిన జగన్ సర్కార్ కు కేంద్రం రాజ్యసభ సాక్షిగా ఇచ్చిన సమాధానం శరాఘాతంలా తగిలింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే పోలవరం పనులు నెమ్మదించాయనీ, ఇందుకు జగన్ సర్కార్ తీరే   కారణమని కేంద్రం కుండ బద్దలు కొట్టేసింది. అవసరాలకు సరిపడా నిధులు విడుదల చేయడం దగ్గర నుంచి, ప్రణాళికా రాహిత్యం, సమన్వయలోపం, అవగాహనా రాహిత్యం కారణంగానే పోలవరం సకాలంలో పూర్తి కాలేదని తేల్చేసింది. దీంతో ఇంత కాలం జగన్ సర్కార్ చెబుతున్న విషయాలన్నీ అసత్యాలని కేంద్రం తేల్చేసింది. అలాగే ప్రత్యేక హోదాపై వైసీపీ సర్కార్ కేంద్రంతో లాలూచీ పడిందన్న విమర్శలు వాస్తవమేనని తేల్చేస్తూ కేంద్రం రాజ్యసభ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ప్రకటించింది. గతంలో ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అంగీకరించడంపై విపక్ష నేతగా ఉన్న జగన్ విమర్శలు గుప్పించి, తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రత్యేక హోదా సాధిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ఆయన ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడమే కాకుండా.. కనీసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద కేంద్రం ఇస్తానన్న నిధుల కోసం కూడా అడగలేదు.  ఇలా ఒకే రోజున కేంద్రం ఏపీలోని జగన్ సర్కార్ బండారాన్ని బయటపెట్టే మూడు అంశాలపై స్పష్టత ఇచ్చేయడంతో జగన్ దిక్కుతోచని స్థితిలో పడ్డారు.  సంక్షేమ పథకాల మాటున రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేస్తున్నారని.. ఆర్థిక దివాళాకోరు దిశగా రాష్ట్రం ప్రయాణిస్తోందని ప్రధాన విపక్ష నేత చంద్రబాబు చేస్తున్న ఆరోపణలన్నీ అక్షర సత్యాలని కేంద్రం చెప్పకనే చెప్పింది.  

వరద బీభత్సంలో కోన‌సీమ ప్రాణం కొబ్బ‌రి ఆవిరి

పల్లెలంటేనే ఓ అందం. అందులో ఆంధ్రాలో కోన‌సీమ మ‌రీ అందం. ఈ ఊరూ .. ఈ గాలి.. సెల‌యేరూ.. అంటూ తెలుగు వాళ్లు నేల‌కు ఓ అడుగు ఎత్తునే ఆనందంలో తేలియాడుతారు.. హిందీవాళ్ల‌యితే గోరీ తేరా గావ్ బ‌డా ప్యారా.. మైతో గ‌యా హారా ఆకే య‌హారే..! అంటూ ఓల‌లాడ‌తారు. కోన‌సీమ అన‌గానే ముం దుగా వ‌చ్చే మాట కొబ్బ‌రిముక్క‌, కొబ్బ‌రి నీళ్లు... ఎవ‌ర్ని క‌దిలించినా.. కొబ్బ‌రి నీళ్ల మ‌గిమ‌.. మ‌రి.. అంటా రు.  అస‌లు కోన‌సీమంటే మరో కేర‌ళ‌తో స‌మానం. అదంతెహె! అని కాస్తంత  ఆనందం పెల్లు బికిన  గ‌ర్వంతో కూడిన ప్రేమ‌తో ప‌ల‌క‌రించ‌డం స‌దా ఆక‌ట్టుకుంటుంది.  ప్ర‌కృతి అందాలు అంటే ఛండాలంగా  అస‌హ్య‌మైన ఫ్రేముల్లో ఇళ్ల‌లో పెట్టుకునే పెయింటింగ్ బొమ్మ‌లు కాదు.   ప్ర‌తీ ప్రాంతానికి ఓ ప్ర‌త్యేక‌త ఉన్న‌ట్టే కోన‌సీమ ప్ర‌త్యేక‌త కొబ్బ‌రి అన్నాం గ‌దా. కానీ ఇటీవ‌లి ప్ర‌కృతి వైప రీత్యాల‌తో కొబ్బ‌రి రైతు విల‌విల‌లాడుతున్నాడు. వరద రూపం లో  గోదావరి  విలయ తాండవానికి వరద ప్రభావిత ప్రాంత ప్రజలు ఒక పక్క ఆకలి కేకలు,మరో పక్క సహాయక చర్యలు అందక ఇబ్బందులు పడు తుంటే,మరో పక్క కొబ్బరి చెట్లు నీట మునిగి కాపు రాక  రైతులు రోదిస్తున్నారు. కోనసీమ జిల్లా మామిడికుదురు, పాశర్ల పూడి గ్రామాలలో పాటు మరి కొన్ని చోట్ల కొబ్బరి రైతులు వరద నష్టం పై ఆందోళన చెందుతున్నారు.  ఈ జులై కోన‌సీమ అందాన్ని చింద‌ర‌వంద‌ర చేసింది. ముఖ్యంగా వరదల వల్ల  కొబ్బ‌రి నేల రాలి పోవడంతో  కోట్లలో నష్టం వచిందని వ్యాపారాలు గోల పెడుతున్నారు. కొబ్బరి కాయలు పూర్తిగా తడిసి పోయాయని, తొమ్మిది రూపాయలు పలికే ది  కనీసం రెండు రూపాయలు పలకడం లేదని వాపోతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా  జూలై నెలలో వరదలు వచ్చాయి అని, దాని వల్ల చాలా నష్టపోయాం అని చెప్తున్నారు.వరద నీటి లో తడిసి కొబ్బరి కాయలు కుళ్ళిపోయి ఎందుకూ పనికి రాకుండా పోయాయని కన్నీరు పెట్టుకుంటున్నా రు. కోనసీమ నుంచి దేశం నలుమూలలకి  కొబ్బరి ఎగుమతులు వున్నాయి. అలాంటి కొబ్బరి కాయలు కుళ్ళి ఎగుమతికి పనికి రాకుండా పోయింది అని రోదిస్తున్నారు. ప్రభుత్వం తగిన సహాయం చేయాలనీ రైతులు అభ్య‌ర్ధిస్తున్నారు.  లంక గ్రామాలలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. లంక గ్రామాల్లో వరదలు తీవ్ర నష్టా న్ని మిగిల్చాయి. వరద ముంచెత్తడంతో  పంటలన్నీ నాశనమయ్యాయి. రైతులు దిక్కుతోచని  స్థితిలో పడ్డారు. లంక గ్రామల్లో దాదాపు వేల ఎకారాల్లో పంట నీటిలో మునిగిపోయింది. ఈ  వరదల  కారణంగా  కోట్ల రూపా యిల్లో నష్టం వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవా లని కోరుతున్నారు.   

ముంపు బాధితులను పట్టించుకోని జగన్ సర్కార్.. చింతమనేని

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలోని వేలూరుపాడు, కక్కునూరు గ్రామాలతోపాటు గోదావరికి అవతల ఒడ్డున ఉన్న విలీన గ్రామాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం సహాయ చర్యల్లో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోన్న విషయాన్ని గుర్తించిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే  తెలుగుదేశం నాయకుడు చింతమనేని ప్రభాకర్  నేరుగా రంగంలోకి దిగారు. ఆ క్రమంలో పోలవరం నియోజకవర్గంలోని పలు మండలాల్లో.. గోదావరి   ముంపునకు గురై పునరావాస కేంద్రాల్లో తలదాచుకొంటున్న వారికి అందుతున్న సహాయక చర్యలను  స్వయంగా పరిశీలించారు. అందులో భాగంగా వరద బాధితులతో  నేరుగా మాట్లాడారు. అయితే తమకు ప్రభుత్వం అందిస్తున్నానని చెబుతోన్న కనీస నిత్యవసర వస్తువులు   అందడం లేదని బాధితులు చింతమనేని వద్ద వాపోయారు. అదీకాక.. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటించినవి ఏవీ తమకు అందడం లేదని చెప్పడంతో  చింతమనేని ప్రభాకర్.. స్థానిక అధికారులను బాధితుల ఎదుటే నిలదీశారు. అంతే కాకుండా వరద బాధితుల కోసం టీడీపీ ఆధ్వర్యంలో 15 టన్నుల కూరగాయలను ఆయన కొనుగోలు చేశారు. ఆ క్రమంలో వేలేరుపాడు మండలంలోని వరద బాధిత కుటుంబాలకు ప్రతి రోజు పాల ప్యాకేట్స్ పంపిణీ చేయిస్తున్నారు. ఈ సందర్బంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్నా... లేకున్నా ఆపదలో ఉన్న బాధితులను ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ సిద్దాంతమని స్పష్టం చేశారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో  జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.  గత 4 రోజులుగా భాదితులకు కడుపు నిండా అన్నం పెట్టలేని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన పేర్కొన్నారు.  తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వరద ముంపు గ్రామాల్లో పర్యటించనున్నారనీ, అందుకే ప్రభుత్వం ఈ మాత్రమైనా సాయం అందించడానికి ముందుకు వచ్చిందనీ, లేకుంటే  బాధితులను   జగన్ ప్రభుత్వం పట్టించుకునేది కాదని ఆయన పేర్కొన్నారు.  గోదావరి ఉగ్రరూపంతో జిల్లాలోని కుక్కునూరు, వేలూరుపాడు మండలాల్లో 80 శాతం కుటుంబాలు నిర్వాసితులయ్యారని ఆయన చెప్పారు. మరోవైపు .. వరద బాధితులు చాలా కష్టాల్లో ఉన్నారని వారిని దయచేసి ఆదుకోవాలంటూ ఏలూరు జిల్లాలో వరదలపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి కాటంనేని భాస్కర్‌ను కలిసి   చింతమనేని ప్రభాకర్ విజ్జప్తి చేశారు.

చెట్ల‌పెంప‌క‌మే  క‌రీముల్లా జీవితం

చెట్లు పెంచ‌డం స‌ర‌దాగా మారింది ఈ రోజుల్లో. చెట్లు పెంచ‌డం పిల్ల‌ల్ని పెంచ‌డంతో స‌మానంగా భావిం చేవారు పూర్వీకులు. క‌లీముల్లా తెల్లారుతూనే లేచి సుమారు మైలు దూరంలో వున్న పెద్ద మామిడి చెట్టు ద‌గ్గ‌రికి వెళుతూంటాడు. ఇది ఆయ‌న నిత్య‌కృత్యం. 82 ఏళ్ల పెద్దాయ‌న ఎందుకంతగా అవ‌స్త‌ప‌డుతున్నా డ‌ని అంద‌రూ అనుకుంటూంటారు. కానీ 120 ఏళ్ల‌నాటి ఆ మామిడి చెట్టంటే ఆయ‌న‌కు ప్రాణ స‌మానం. ప‌రుగున వెళ్లి మాను తాకి, ఆకుల‌తో మాట్లాడి, ఆ గాలిని పీలిస్తేగాని ఆయ‌న‌కు  తాను ఇంకా  బ‌తికే ఉన్నా న‌ని అనిపించ‌ద‌ట‌!  మామిడికాయ‌ల‌కు ఆయ‌న స‌చిన్ అని, ఐశ్వ‌ర్య అనీ పేర్లు పెట్టుకున్నారు! ఎవ‌ర‌న్నా అడిగితే ఇది మీకు కేవ‌లం చెట్టే కానీ ఏళ్ల‌త‌ర‌బ‌డి క‌ష్టానికి ఫ‌లం. దీన్ని కేవ‌లం చెట్టుగా చూస్తే అలానే క‌న‌ప‌డుతుంది. క‌ల్ప‌వృక్షంలా చూస్తే అనేక ర‌కాల మామిడిప‌ళ్ల నిల‌యంగా క‌న‌ప‌డుతుంది అంటారాయ‌న‌. బ‌డికి ఏనాడూ వెళ్ల‌ని క‌రీముల్లా బాల్యంలోనే చెట్లు నాట‌డం, పెంచ‌డం మీద మ‌క్కువ ఏర్ప‌డి అదే జీవితంగా మార్చుకున్నారంటే ఒక్కింత ఆశ్చ‌ర్య‌మే. ఇలాంటివారివ‌ల్ల‌నే ప‌ర్యావ‌ర‌ణ స్పృహ అంటూ జ‌నాల‌కి క‌లుగుతోంది. 1987 నుంచీ అనేక ర‌కాల మామిడి పండ్లు అందించ‌డంలో ప్ర‌సిద్ధుడ య్యారు. దీనికి తోడు వాటికి విచిత్ర‌మైన పేర్లూ పెడుతూ జ‌నాన్ని బాగా ఆక‌ట్టుకున్నారు క‌రీముల్లా.   30 అడుగుల ఎత్తు, విశాలమైన కొమ్మ‌ల‌తో ఎంతో చ‌ల్ల‌ని నీడ‌నిస్తూండే చెట్లు ఏవ‌యినా త‌ల్లిలాంటివే అన్న‌ది ఆయ‌న ప్ర‌గాఢ విశ్వాసం. అదే ఆయ‌న తెలిసినవారంద‌రికీ ప్ర‌చారం చేస్తున్న‌ది. ఆయ‌న‌కు కాస్తంత సినిమా, క్రికెట్ పిచ్చి కూడా ఉంద‌ని వాళ్ల‌బ్బాయి అంటూంటాడు. అందుక‌నే  అనేక ర‌కాల‌కు ఐశ్వర్యారాయ్, మోదీ, స‌చిన్ టెండూల్క‌ర్‌, అనార్క‌లీ వంటి పేర్లు పెట్టారు.  ఇప్ప‌టికీ అన్ని ప్రాంతాల వారినీ  అవి  ఆక‌ట్టుకుంటున్నాయి.  చేతి వేళ్ల‌లానే పండ్లు వేటిక‌వే ప్ర‌త్యేక రుచి అంటారాయ‌న‌. చెట్ల‌ను పెంచ‌డంలో ఆయ‌న ప్ర‌త్యేక‌ల‌కు చాలామంది ఫిదా అయ్యారు. చెట్లు పెంచ‌డం అంటే మొక్క‌లుగా ఉన్న‌పుడు నీళ్లు పోయ‌డం, కాస్తంత జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే కాదు వాటిని క‌న్న‌బిడ్డ‌ల్లా చూసుకుంటూం డాలి అనే సిద్ధాంతానికి క‌రీముల్లా క‌ట్టుబ‌డి ఉన్నారు. అందుకే ఆయ‌న కృషిని లోకం గుర్తించింది.  యుఏ ఇ నుంచి కూడా ఆయ‌న‌కు ఆహ్వానం అందింది. 2008లో భార‌త దేశ అత్యంత ఉన్న‌త సౌర స‌త్కారం పొందారు. ఎడారిలో సైతం మామిడి చెట్ల‌ను పెంచ‌గ‌ల‌న‌న్న‌ది ఆయ‌న ధీమా.  పంట పాడ‌వుతోంది, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల‌తో ఆశించినంత పంట అంద‌టం లేద‌నే రైతాంగం మాట‌ల్ని క‌రీముల్లా అస్స‌లు ప‌ట్టించుకోరు. పంట‌కు కావ‌ల‌సిన‌ది నాణ్య‌మైన ఎరువులు, గింజ  త‌ప్ప వాతావ‌ర‌ణ మార్పుల‌తో ఎలాంటి స‌మ‌స్యా వుండ‌ద‌న్న‌ది ఆయ‌న అభిప్రాయం. భారీ న‌ష్టాలు వ‌స్తున్నా య‌ని గోడుపెడుతూండే రైతులు చాలామంది త‌క్కువ‌లో వ‌స్తున్నాయ‌ని, నాణ్య‌త లేని ఎరువులు, గింజ లు వాడుతుండ‌డం వ‌ల్ల‌నే ఏ పంట‌యినా దెబ్బ‌తింటుంది. దానికి ప‌ర్యావ‌ర‌ణానికి అస్స‌లు సంబంధం లేద‌ని క‌రీముల్లా అంటున్నారు. 

వర‌ద‌ సాయంలోనూ అవ‌క‌త‌వ‌క‌లేనా..?

బాధితుల‌ను ఆదుకోమ‌ని బియ్యం మూట‌లు పంపిస్తే బావ‌మ‌రిది దారి మళ్లించి ఇంటికి చేర్చాడ‌నే మాట విన ప‌డుతూంటుంది. ముఖ్యంగా ఇలాంటి ప్రకృతి వైప‌రీత్యాల స‌మ‌యంలోనే. అస‌లే  గూడు, తిండి గింజ‌లు, దుస్తులూ పోయి, బ‌తుకు జీవుడా అని శిబిరాల్లో ఉండేవారి ప‌ట్ల ద‌య‌తో, ప్రేమ‌తో వారి అవ‌స‌రాల‌కు కావ‌ల‌సిన వ‌స్తువుల‌ను స‌ర్దుబాటు చేయాలి. ఇది ఏ ప్ర‌భుత్వ‌మ‌యినా చేస్తుంది. చేయాలి. కానీ ఇందులో కూడా అస్మ‌దీయులు, త‌స్మ‌దీయులు అని గీత గీసుకుంటే దానికంటే దారుణం మ‌రోటి ఉండ‌దు. అస‌లు బాధితుల‌కు అందాల్సిన‌వి వేరే వారికి చేరేస్తే అంత‌క‌న్నా దుర్మార్గం మ‌రోటి ఉండ‌దు.  గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌కు రాష్ట్ర స‌ర్కారు ప‌దివేల రూపాయ‌ల చొప్పున ప‌రిహారం ఇస్తామ‌ని  ప్ర‌క‌టిం చింది.  ఈ ప‌రిహారం అందు కునే అర్హులు ఎవ‌ర‌న్న‌  జాబితా త‌యారీలో అధికారులు నిమ‌గ్నమ‌య్యా రు.  అయితే పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందిన వారినే అర్హులుగా పరిగణిస్తున్నారని.. స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఉన్న బాధితులను పరిగణనలోకి తీసుకోవడం లేదని, పైగా వరద బాధితులు  కాని వారి పేర్లనూ జాబితాలో చేరుస్తున్నారంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  భద్రాచలంలోని ఆర్యవైశ్య సత్రంలో వరద బాధితుల పేర్లు నమోదు చేస్తున్నారని తెలిసి.. అక్కడికి బాధి తులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. తమ పేర్లు రాయాలంటూ ఒత్తిడి తేవడంతో సిబ్బంది అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం  పోలీసుల సాయంతో తహసీల్దార్‌ జాబితా సేకరణ ప్రక్రియను చేపట్టా రు. అలాగే భద్రాచలం నన్నపనేని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల పునరావాస కేంద్రం, మణుగూరులోని కేంద్రంలో కూడా బాధితులు ధర్నా చేపట్టారు. బూర్గంపాడు మండలం మోరంపల్లి బంజర గ్రామంలో ఏర్పాటు చేసి న పునారావాస కేంద్రాన్ని ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సందర్శించారు.  ఈ క్రమంలో పరిహారం సర్వేలో అక్రమాలు జరుగుతున్నాయని, తమ లాంటి అసలైన బాధితులకు అన్యాయం జరుగుతోందంటూ భాదితులు ఆయనను చుట్టు ముట్టారు. సర్వే చేసే అధికారులు పేర్ల నమో దులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్‌కు వివరించారు.  భద్రాద్రి ముంపు ప్రాంతాల్లో రెండు రోజు లుగా  బియ్యంతో పాటు  నిత్యవసర సామగ్రిని పంపిణీ చేస్తుండగా కొందరికి సన్నబియ్యం, మరికొందరికి దొడ్డు బియ్యం వస్తున్నాయంటూ బాధితులు నిరసన తెలిపారు. బాధితులందరికి సన్నబియ్యమే ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. అన్నారం గ్రామానికి  చెందిన కొందరు మహిళలు తమకు బియ్యం అందడం లేదని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

దండోపాయ‌మే వైసీపీ అస్త్రమా?.. అచ్చెంనాయుడు

యుద్ధానికి వ్యూహాలు ఉంటాయి, ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి ఎత్తుగ‌డ‌లూ ఉంటాయి. కానీ  అరాచ‌కాన్ని ఆయు ధంగా చేసుకుని గెలిస్తే అది విజ‌య‌మ‌ని ఎలా అంటారు. భ‌య‌పెట్టి, మ‌భ్య‌పెట్టి దండోపాయాన్నే అమ లు చేసి ఎలాంటి ఎన్నిక‌యినా గెలిచేయాల‌న్న త‌ప‌న మ‌హా ప్ర‌మాద‌కారి. ఇది వ్యూహం అనిపించు కోదు, కుట్రతో  కూడిన ఎత్తుగ‌డ మాత్ర‌మే. దీన్ని పూర్తిగా న‌మ్మి, అమ‌లు చేసి ఎలాంటి ఎన్నిక‌ల్లోనైనా గెల‌వ‌డా నికి సిద్ధ‌ప‌డ‌ట‌మే  వైసీపీకి తెలిసిన  విద్య అంటూ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షులు  అచ్చెన్నాయుడు ఆరోపిం చారు.  తిరుప‌తి టౌన్ బ్యాంకు ఎన్నిక‌ల్లోనూ ఎక్క‌డ ఓడిపోతామోన‌న్న భ‌యంతో వైసీపీ అడ్డ‌దారులు తొక్కుతోం ద‌ని, గెల‌వ‌లేనేమోన‌న్న భీతి వారిని వెన్నాడుతోంద‌ని అచ్చెంనాయుడు ఘాటుగా విమ‌ర్శించారు. ఇలాంటి వ్యూహాల‌తో ఎన్నిక‌ల్లో పాల్గొన‌డం, ఏక‌ప‌క్షంగా ఓట్లు వేయించుకోవ‌డానికి ఇక ఎన్నిక‌ల‌తో ప‌నేమి ట‌ని ఆయన ఆగ్ర‌హించారు.  టీడీపీ నేతలను గృహ నిర్భంధం చేసి ఏకపక్షంగా ఓట్లు వేసుకోవడానికి ఇక ఎన్నిక లెందుకని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పట్టపగలే  ప్రజాస్వామ్యాన్ని దారు ణంగా హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. పోలీసులున్నది అధికార పక్షానికి కొమ్ము కాయడానికా ? లేక ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణంతో టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు,  వైసీపీ నేతలను ఎందుకు అరెస్టులు చేయలేదని ప్ర‌శ్నించారు.   జగన్ రెడ్డి ఎన్నికల నియమాలను ఉల్లంఘించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నా రని దుయ్యబట్టారు. దొంగ ఐడీ కార్డులు ముద్రించి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లను అడ్డుకుంటామనే టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారన్నారు. మూడేళ్లుగా దోచుకున్న డబ్బు ను అక్రమంగా గెలిచేందుకు వెదజల్లుతున్నారని  వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంబలంతో, ఈ ఎన్ని కల్లో గెలిచినా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జగన్ రెడ్డికి ఓటమి తప్పదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

జగన్ సర్కార్ కు ఇక చుక్కలే..!

ఇక ఏపీలో జగన్ సర్కార్ కు కేంద్రంలోని మోడీ సర్కార్ చుక్కులు చూపించనుందా? జగన్ కు గతంలోలా పీఎంతో భేటీలకు అప్పాయింట్ మెంట్ అంత సులువుగా దొరకదా? అన్న ప్రశ్నలకు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం రాక మానదు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీ అవసరం ఎంతో ఉందని భావించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఆ పబ్బం గడుపుకునేందుకు జగన్ ను ఆ ఒక్కటి దక్క (ప్రత్యేక హోదా) ఏ వరం కోరుకున్నా ఇచ్చేస్తానని హామీ ఇచ్చింది. పాపం జగన్ గారికి ప్రత్యేక హోదా అడుగుదామన్న యోచనే లేదు. అసలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ఏం కోరడానికి ఆయన ఈ మూడేళ్లలో ఎన్నడూ కనీసం ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఎంత సేపూ నవరత్నాలకు డబ్బులెలా? అప్పులెలా? అన్న యోచనతోనే కాలం గడిపే పరిస్థితాయె. సరే తీరా రాష్ట్ర పతి ఎన్నిక సమయం దగ్గర పడే సరికి మహారాష్ట్ర పరిణామాలూ, అనూహ్యంగా విపక్షాల నుంచి ముర్ము అభ్యర్థిత్వానికి వచ్చిన సానుకూల స్పందనతో బీజేపీకి వైసీపీ అవసరం అంతాగా అవసరంలేని పరిస్థితి వచ్చింది. అందుకే ముర్ము అభ్యర్థిత్వానికి తాము వైసీపీ మద్దతు కోరలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కుండబద్దలు కొట్టేశారు. ఏ రకంగా చూసినా వైసీపీ తమకు అంటరాని పార్టీయేనని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు రాష్ట్రపతి ఎన్నికకు ముందు సంచలనం సృష్టించాయి. అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్రపతి ఎన్నికకు ముందు అనవసర రాద్ధాంతం ఎందుకు అనుకున్న బీజేపీ అగ్రనాయకత్వం వైసీపీ మద్దతు కోరామనీ, సత్యకుమార్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమనీ ఓ ప్రకటన చేసి ఊరుకుంది. అయితే అక్కడితో కథ ముగియలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీజేపీ తన అసలు ఉద్దేశమేమిటో ఎటువంటి భేషజాలూ లేకుండా వెల్లడించేసింది. ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థికి జగన్ మద్దతు ప్రకటించారు. బీజేపీ ఆయనను మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిందా లేదా అన్నది పక్కన పెడితే ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వైసీపీకి ఆహ్వానం అందలేదు.  దీనిని బట్టే ముందు ముందు వైసీపీ విషయంలో బీజేపీ తీరు ఎలా ఉండబోతున్నదన్నది అవగతమైపోతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ వైసీపీని ఇక లెక్కలోకి తీసుకునే అవకాశమే లేదంటున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో వైసీపీకి జరిగిన మర్యాదే ఈ విషయాన్ని తేటతెల్లం చేసిందని చెబుతున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్‌కడ్‌ నామినేషన్‌లో ప్రధాని, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు పాల్గొన్నాయి. కానీ వైసీపీ ఎంపీల జాడ మాత్రం కనిపించలేదు.   ఎందుకంటే వారికి ఆహ్వానం రాలేదు. మద్దతు ప్రకటించినా ఎందుకు ఆహ్వానం అందలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకడం పెద్ద కష్టమేమీ కాదు.   ఏది ఏమైనా ఇంత కాలం కేంద్రాన్ని వైసీపీ  కోరినవన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధం లేని వ్యక్తిగత విషయాలేననీ, అందుకే ఇక ఆ పార్టీని సాధ్యమైనంత దూరం పెట్టాలనీ బీజేపీ అధిష్ఠానం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేసిందంటున్నారు. వాస్తవానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ బీజేపీకి వైసీపీ అంటరాని పార్టీ అన్న వ్యాఖ్య  చేయడానికి బీజేపీ అధిష్ఠానం నిర్ణయమే కారణమని కూడా పరిశీలకులు అంటున్నారు. ఇందుకు నిదర్శనంగా మంగళవారం హస్తినలో జరిగిన అఖిలపక్ష భేటీని వారు ఉదాహరణగా చెబుతున్నారు. శ్రీలంక సంక్షోభంపై చర్చించడానికి నిర్వహించిన ఆ భేటీలో రాష్ట్రాల అడ్డగోలు అప్పులపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. కేంద్రం తీరును టీఆర్ఎస్ ఖండించగలిగింది కానీ.. వైసీపీ కిమ్మనలేని పరిస్థితిలో పడింది. వాస్తవానికి మంగళవారం నాటి అఖిల పక్ష భేటీలో అప్పులపై కేంద్రం చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లక్ష్యం రెండు తెలుగు రాష్ట్రాలే అనడంలో సందేహం లేదు. పేరుకు పది రాష్ట్రాలలో అప్పులు ప్రమాదకర స్థాయికి చేరాయని కేంద్రం పేర్కొన్నా.. కేంద్రం దృష్టి మాత్రం ఏపీ, తెలంగాణపైనే ఉందన్నది సుస్పష్టం. తెలంగాణ పేరును ప్రస్తావించడంపై తెరాస ఎంపీలు మండి పడ్డారు. కేంద్రం అప్పుల మాటేమిటని నిలదీశారు. అదే సమయంలో వైసీపీ మాత్రం ఆమోదయోగ్యం కాని మౌనం పాటించింది. కేంద్రం టార్గెట్ చేసిందని స్పష్టమౌతున్నా కనీస స్పందన కూడా కరవైంది. అడ్డగోలు అప్పులకు ఇంత కాలం అంతే అడ్డగోలుగా అనుమతులిస్తూ వైసీపీకి ఫేవర్ చేసిన కేంద్రం ఇప్పుడు ఒక్క సారిగా జగన్ పార్టీని కార్నర్ చేయడంలోనే ఆ పార్టీ పట్ల ముందు ముందు కేంద్రం వైఖరి ఎలా ఉండబోతోందో అవగతమైందని పరిశీలకులు విశ్లేషిన్తున్నారు. ఇక ముందు వైసీపీకి అప్పలు పుట్టడం గతంలోలా కేక్ వాక్ గా ఉండదని అంటున్నారు. బటన్ నొక్కాలంటే జగన్ ఇక వంద సార్లు ఆలోచించాల్సిందేనంటున్నారు. ఇప్పటికే సంక్షేమంలో కోతపై జనంలో తీవ్ర నిరసన వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఇక వైసీపీ సర్కార్ కు ప్రతి రోజూ గండంగానే గడుస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.