ప్ర‌తిప‌క్షాల ఐక్య‌త‌కు మ‌రో ప్ర‌య‌త్న‌మా?

బీహార్‌లో మహాకూటమికి చెందిన ఇద్దరు అగ్రనేతలు - ముఖ్యమంత్రి నితీష్ కుమార్ , రాష్ట్రీయ జనతా దళ్ నేత  లాలూ యాదవ్  ఆదివారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలవను న్నారు. ఆరేళ్ల తర్వాత వీరి కలయిక ఇదే తొలిసారి. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరవుతారని ఇద్దరు బీహార్ నేతలు కూడా ఆశిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి. కానీ  గాంధీ కేరళలో ఉన్నారు, కాంగ్రెస్ కన్యాకుమారి నుండి కాశ్మీర్ భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్నారు. 2015లో బీహార్ ఎన్నికల కు ముందు జరిగిన ఇఫ్తార్‌లో నితీష్ కుమార్, సోనియా గాంధీ చివరిసారిగా కలుసుకున్నారు. బీహార్ ముఖ్యమంత్రి ఈ నెల ప్రారంభంలో తన చివరి ఢిల్లీ పర్యటనలో రాహుల్ గాంధీని కలిశారు. ఆ సమయంలో శ్రీమతి గాంధీ వైద్య చికిత్స నిమిత్తం విదేశాల్లో ఉన్నారు. యాదవ్ విషయానికొస్తే, ఆయ‌న 2018లో  పశుగ్రాసం కుంభకోణం కేసుల్లో జైలు పాలయ్యారు, ఆ తర్వాత మహమ్మారి కోవిడ్  విధించిన ఒంటరి తనం వచ్చింది. రాబోయే వారాల్లో, బెయిల్‌పై ఉన్న అనారోగ్యంతో ఉన్న నాయకుడు  కిడ్నీ మా ర్పిడి కోసం సింగపూర్‌కు వెళ్లనున్నారు.  కాగా ఆదివారం స‌మావేశం  మర్యాదపూర్వక పర్యటన అని రాజ కీయ‌వ‌ర్గాలు సూచించగా, మహాకూటమిని జాతీయ స్థాయికి తీసుకెళ్లడం సహా కొన్ని ముఖ్య‌ విషయా లను చ‌ర్చించే అవకాశం కూడా ఉంది.  ప్రతిపక్షాల ఐక్యతను నెలకొల్పేందుకు ఒక అడుగు ప‌డ‌వ‌చ్చు. బీహార్‌లోని నాయకులు ఆ అవకాశాన్ని అన్వేషిస్తున్నారు, ముఖ్యంగా 2024 జాతీయ ఎన్నికలకు ముందు బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఒక సంఘటిత ఫ్రంట్‌గా ఏర్ప‌డ‌టంపై నీతిష్‌ కుమార్ కృషి చేస్తున్నారు. తన చివరి ఢిల్లీ పర్యటనలో, కుమార్ చాలా కీలక ప్రతిపక్ష నాయకులతో సమావేశమ య్యారు. ఈ జాబి తాలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, వామపక్ష నేతలు ఉన్నారు. సెప్టెంబర్ 25న నితీష్, లాలూ విడివిడిగా రాజ ధానికి చేరుకుని సాయంత్రం సోనియా గాంధీని కలుస్తారని మహాఘటబంధన్ వర్గాలు తెలిపాయి. అదేరోజు హర్యానాలోని ఫతేహాబాద్‌లో జరిగే ఇండియన్ నేషనల్ లోక్దళ్ (ఐఎన్‌ ఎల్‌డి) ర్యాలీకి హాజరైన తర్వాత నితీష్ సోనియాను కలుస్తారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐఎన్‌ఎల్‌డి ర్యాలీకి హాజర య్యేందుకు బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వీ ప్రసాద్ యాదవ్ పాట్నా నుండి నితీష్‌తో పాటు వెళతారు.  బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యత నెలకొల్పేందుకు ఈ ర్యాలీని ప్రాథమిక చర్యగా పరిగణిస్తున్నారు.సెప్టెంబర్ 25న నితీష్, లాలూ విడివిడిగా రాజధానికి చేరుకుని సాయంత్రం సోనియా గాంధీని కలుస్తారని మహాఘటబంధన్ వర్గాలు తెలిపాయి. అదే రోజు హర్యానాలోని ఫతేహాబాద్‌లో జరిగే ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డి) ర్యాలీకి హాజరైన తర్వాత నితీష్ సోనియాను కలుస్తారని రాష్ట్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐఎన్‌ఎల్‌డి ర్యాలీకి హాజరయ్యేందుకు బీహార్ డిప్యూటీ సిఎం తేజస్వీ ప్రసాద్ యాదవ్ పాట్నా నుండి నితీష్‌తో పాటు వెళతారు.

పీకేని కేసీఆర్ పీకేశారా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దూరం పెట్టారా? మీకూ మీ సర్వేలకూ ఓ దణం అంటూ పీకేని తెరాస ఎన్నికల వ్యూహకర్త పోస్టు నుంచి పీకేశారా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఔనని అనిపించక మానదు. పీకే టీం సర్వేలు, సేవలు ఇక అవసరం లేదని కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పీకే బృందం సర్వేలు అవసరం లేదనీ పీకేకు ఖరాఖండీగా చెప్పేయడంతో ఇక టీఆర్ఎస్ తో పీకే బంధం తెగిపోయినట్లేనని అంటున్నారు. ఆఖరికి మునుగోడు ఉప ఎన్నిక కు కూడా ఐప్యాక్ సేవలు అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్పడంతో తెలంగాణలో పీకే టీంకు పని లేకుండా పోయింది. కారణాలేవైనా ఈ పరిణామం పట్ల తెరాస శ్రేణులు, నేతలు, ముఖ్యంగా సిట్టింగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఇలా హఠాత్తుగానే తీసుకుంటారని పార్టీ శ్రేణులే అంటున్నారు. ఆయన ఆగ్రహం అయినా, అనుగ్రహం అయినా ఒకింత తీవ్ర స్థాయిలోనే ఉంటుందని చెబుతుంటారు. పీకేను టీఆర్ఎస్ వ్యూహకర్తగా నియమించిన సమయంలో ఆయనకు ప్రగతి భవన్ లోనే బస ఏర్పాటు చేసి, వీఐపీ ట్రీట్ మెంట్ ఇచ్చిన కేసీఆర్.. తన జాతీయ రాజకీయ ప్రవేశానికి అవసరమైన సలహాలూ, సూచనలూ తీసుకున్నారని చెబుతారు. అంతేనా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలంటే పీకే వ్యూహాలను తు.చ. తప్పకుండా అనుసరించాల్సిందేనని పార్టీ ముఖ్యులకే తేల్చి చెప్పేశారు. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్లు ఇచ్చేది కూడా పీకే టీం సర్వేల ఆధారంగానేనని తేల్చి చెప్పేశారు. చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాలలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని పీకే టీం సర్వేలు వెల్లడించాయని, వారందరికీ టికెట్లు ఇచ్చేది లేదనీ కూడా ప్రకటించేశారు. కేసీఆర్ కుమారుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అయితే ఏకంగా ఒక సభలోనే  పీకే సర్వేల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పేశారు. ఇంతటి ప్రాధాన్యత ఇచ్చి.. అంత హఠాత్తుగా కేసీఆర్ పీకేకు ఎందుకు బైబై చెప్పేశారన్న సందేహం పార్టీ శ్రేణుల్లో కలుగుతున్నప్పటికీ.. పీకేను కేసీఆర్ పక్కన పెట్టేయడం పట్ల పార్టీ నేతల్లో ముఖ్యంగా సిట్టింగులలో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇంతకీ పీకేను కేసీఆర్ పక్కన పెట్టేయడానికి   ఇటీవల తెలంగాణలో పీకే టీం సర్వేలు   టీఆర్ఎస్‌కు నెగెటివ్ గా ఉండటమే కాకుండా, ఆ సర్వేలు లీక్ అవ్వడం సామాజిక మాధ్యమంలో వైరల్ అవ్వడం కారణమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  పార్టీ కోసం రహస్యంగా చేయించిన సర్వేలను పీకే లీక్ చేయడం పట్ల కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారంటున్నారు.  ఆ కారణంగానే పీకే సేవలకు ఇక సెలవు అన్న నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. పీకేను పీకేయడం పట్ల తెరాస సిట్టింగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  పార్టీ అధినేత కేసీఆర్ అయినా తమకు పార్టీ టికెట్లను నిర్ణయించేది పీకేయే అన్నంతగా బిల్డప్ ఇవ్వడంతో సిట్టింగులు ఇంత కాలం ఆందోళనలో ఉన్నారు. పీకే సర్వేలేమిటో.. అవి తేల్చేదేమిటో అని వారిలో వారు మథన పడ్డారు. ఇప్పుడు కేసీఆర్ పీకే సేవలు అవసరం లేదని నిర్ణయించడంతో వారు ఆనందంలో ఉన్నారు.  

అమ్మ‌వ‌వుతావ‌ని ఆశ‌లు పెట్టారు...వెలుగులోకి డాక్ట‌ర్ల మోసం

మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సిని మా గుర్తండే ఉంటుంది. అందు లో చ‌నిపోయిన వ్య‌క్తికి ఆప‌రేష‌న్ చేయాలంటూ ల‌క్ష‌లు గుంజు తారు ఓ ఆస్ప‌త్రివారు. అస‌లు సంగ‌తి తెలుసుకుని చిరు వారి నుంచే డ‌బ్బులు ఇప్పిస్తాడు. దాదాపు ఇదే సీన్ కాకినాడ‌లో జ‌రిగింది. తూర్పు గోదావరిజిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన సత్యనారా యణతో వివా హం అయ్యింది. ఈ ఏడాది జనవరిలో సత్యనారా యణ తన భార్యను వైద్య పరీ క్షల కోసం కాకినాడ గాంధీనగర్‌లోని రమ్య ఆసుపత్రికి తీసు కెళ్లారు. గర్భందాల్చిందని చెప్పి వైద్యులు తొమ్మిది నెలలు తిప్పించుకుని.. ట్రీట్‌మెంట్‌ చేశారు. పరీక్షల కోసం తరచూ అదే ఆస్పత్రికి వెళుతున్నారు. డాక్టర్లు వెళ్లిన సమయంలో స్కానింగ్, మందులు రాసిచ్చేవారు. అంతటితో ఆగకుండా ఆరో నెలలో స్కా నింగ్‌ తీసి.. సెప్టెంబర్‌ 22న ప్రసవం అవుతుందని డాక్టర్లు చెప్పారు.  ఆ తర్వాత మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లగా..కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంతలో అక్కడి డాక్టర్లు స్కానింగ్‌ తీసి అసలు మహాలక్ష్మి గర్భవతి కాదని తేల్చి చెప్పారు. దీంతో మహాలక్ష్మితో పాటు కుటుంబ సభ్యు ల‌కు నోట మాట‌రాలేదు.. ఆశ్చ‌ర్యంతో, మోసపోయామ‌న్న ఆందోళ‌న‌తో ఉండిపోయారు. ఆందోళనకు గురైన మహాలక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి కాకినాడ రమ్య ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ స్కానింగ్‌ తీయాలని కోరారు. ఆమెను ఆస్పత్రి సిబ్బంది స్కానింగ్‌కు పంపారు. స్కానింగ్‌ తీసే వ్యక్తి మహాలక్ష్మి గర్భంలో శిశువు లేదని  చెప్పడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఇదేంటని డాక్టర్‌ను ప్రశ్నించగా.. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పారు. తొమ్మిది నెలల నుంచి తమను ఆస్పత్రికి తిప్పి వేల రూపాయలు ఖర్చు పెట్టించారని మహాలక్ష్మి తల్లి ఆరోపించారు. గర్భంలో బిడ్డ ఆరో గ్యంగా ఉందని చెప్పి ప్రతి నెలా మందులు రాసిచ్చారని.. వాటిని వాడాక తమ కుమార్తె పొట్ట పెద్దదైందని వాపోయారు. కాసుల కోసం అమ్మతనంతో ఆటలు ఆడిన  రమ్య ఆస్పత్రి డాక్టర్ల పై  చర్యలు తీసుకోవాలని వారు ఆందోళనకు దిగారు. కాకినాడ రమ్య ఆసుపత్రి వివాదం మరింత ముదిరింది. లేని గర్భాన్ని ఉన్నట్లు నమ్మించి దొంగ‌ రిపోర్టులు ఇచ్చి తమను మోసం చేశారని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఆమెకు గర్భం రాలేదని తాము కూడా చెప్పామంటున్నారు రమ్య ఆసుపత్రి డాక్టర్లు. ప్రతీ గ‌ర్భ‌వ‌తికి మూడో నెల, ఆరో నెల, తొమ్మిదో నెలలో స్కానింగ్‌ తీయిస్తామన్నారు. స్కానింగ్‌ చేయిం చుకోవాలని తాము ఎన్నిసార్లు చెప్పినా.. వాళ్లు చేయించుకోలేదని తెలిపారు. ఆగస్టు 25న 8వ నెలలో స్కానింగ్‌ చేయించి నప్పుడు బిడ్డ లేదని స్పష్టం చేశామన్నారు. కానీ, ఆ రిపోర్టును వారు చూపడం లేదని అంటున్నారు. మహాలక్ష్మినే..ఫాల్స్‌ ప్రెగ్నెన్సీ ఊహించుకుందని.. ప్రతీసారి బేబీ కదులుతోందని చెప్పిందన్నారు రమ్య ఆసుపత్రి డాక్టర్లు. అసలు, తాము డెలివరీ డేటే ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎవ‌రిని న‌మ్మాలి. ఆస్ప‌త్రులు, డాక్ట‌ర్ల మోసాల‌కు అంతులేకుండా పోతోంది. 

దేశంలో ఏదో జరుగుతోంది ఏమిటది ?

దేశంలో ఏదో జరుగుతోంది. ఏమి జరుగుతోంది అనే  విషయంలో ఎవరికీ అంత స్పష్టత లేక పోయినా, ఏదో జరుగుతోందనే అనుమానాలు మాత్రం సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఓ వంక రాష్ట్రీయ స్వయం సీవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ముస్లిం సమాజంతో సయోధ్య యత్నాలకు శ్రీకారం చుట్టింది. సంఘ్ అధినేత మోహన్ భగవత్ ఇతర సంఘ్ పెద్దలతో కలిసి, ఆల్ ఇండియా ఇమాం అసోసియేషన్ అధిపతి ఇమాం ఉమేర్ అహ్మద్ ఇల్యాసి తో సమావేసమయ్యారు. ఢిల్లీ లోని కస్తూరిబా గాంధీ మార్గ్ చర్చిలో    బుధవారం(సెప్టెంబర్21) సుమారు గంటకు పైగా ఈ రహస్య సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో  మోహన్ భగవత్ తో పాటు సంఘ్ ప్రముఖులు కృష గోపాల్, రామ్ లాల్, ఇంద్రేష్ కుమార్ కుడా పాల్గొన్నారు.  అయితే, ఈ సమావేశానికి  ప్రత్యేక ప్రధాన్యత ఏదీ లేదని, ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ చెప్పారు. దేశంలో మత సామరస్యాన్ని బలోపేతం చేసేందుకు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ముస్లిం మేథావులతో చర్చలు జరుపుతున్నారని, అందులో భాగంగానే ఈ సమావేశం జరిగిందని అంతకు మించి ఈ భేటికీ ప్రత్యేక ప్రధాన్యత లేదని అయన చెప్పారు. సంఘ్ అధినేత అన్ని వర్గాల ప్రజలతో నిరంతరం నిర్వహించే, ‘సంవాద్’ కార్యక్రమంలో భాగంగానే మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఇమాం అసోసియేషన్ అధిపతి ఇమాం ఉమేర్ అహ్మద్ ఇల్యాసి కలిశారని చెప్పారు.   కానీ అదే సమయంలో దేశ వ్యాప్తంగా పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు కొనసాగుతున్నాయి. మరోవంక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హోం శాఖ సీనియర్ అధికారులతో కీలక భేటీ నిర్వహించారు. అలాగే, హోంమంత్రి నిర్వహించిన సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధొభాల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌ దినకర్‌ గుప్తా సహా పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు. పీఎఫ్‌ఐ కార్యకర్తలు, ఉగ్ర అనుమానితుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షా ఈ భేటీలో చర్చించినట్లు ఓ అధికారి వెల్లడించారు. దీంతో  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఏదో తీసుకునే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.  నిజానికి  పీఎఫ్‌ఐ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా మరికొన్ని రాష్ట్రాలలో  మత ఉద్రిక్తలకు దారి తీసిన సంఘటనల వెనక, పీఎఫ్‌ఐ హస్తం ఉందని ఎన్‌ఐఏ నిర్ధారణకు వచ్చింది. అలాగే మొదటి నుంచి కూడా యువతకు శిక్షణ పేరుతో పీఎఫ్‌ఐ చట్ట విరుద్ధ కార్యకలపాలు సాగిస్తోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటి ఆరోపణలు రావడంతో ఎన్‌ఐఏ, ఈడీ సంయుక్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై దాడులు చేపట్టింది. ఈ దాడుల అనంతరం కేంద్రం పీఎఫ్‌ఐపై నిషేధం విధించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమిత్ షా అత్యవసర భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  కాగా నిషేధం విధిస్తే ఎదురయ్యే పరిణామాలను దృష్టిలో ఉంచుకునే ఆర్ఎస్ఎస్ అధినేత్ మోహన్ భగవత్ ముస్లిం పెద్దలు, మేథావులతో సమావేసమై ఉంటారని అంటున్నారు. అలాగే ఇటీవల మహ్మద్ ప్రవక్త పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను, అదే విధంగా హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను బీజేపే అధినాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జరుగతున్న పరిణామాలు, గతంలో జరిగిన పరిణామాలు ఒకదానికొకటి  సంబంధం లేనట్లు కనిపించినా ఎక్కడో ఏదో సంబంధం ఉన్నట్లే ఉందని, అందుకే దేశంలో ఏదో జరుగుతోందని అనుమానించ వలసి వస్తోందని అంటున్నారు.

ధ్వ‌జ‌స్తంభం తాకాడ‌ని రూ.60వేల జ‌రిమానా!

పండ‌గ‌రోజు, ఏద‌యినా ప్ర‌త్యేక‌మైన రోజు గుడికి వెళుతూంటారు. కుటుంబ‌స‌మేతంగా వెళ్లి దేవుడి ద‌ర్శ నం చేసుకుని రావ‌డం ఆన‌ వాయితీ. ఇది ప్ర‌తీ ప్రాంతం లోనూ సాధార‌ ణంగా క‌ని పించే దృశ్య‌ మే. అయితే అలా కుటుంబ‌స‌మేతంగా వెళ్లిన‌పుడు పిల్ల‌ల్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌న్న ఆలోచ‌న ఉండ‌క‌పోవ‌చ్చు. వ‌చ్చింది గుడికి కాబ‌ట్టి దేవుడి మీదే దృష్టి ఉంటుంది. పిల్ల‌లు ఆడుతూ పాడుతూ కాస్తంత అవ‌త‌లికీ, ఇవ‌త‌ల‌కీ వ‌చ్చి ధ్వ‌జ‌స్తంభం చుట్టూ తిరుగుతూ ఆడుతుంటారు, లేదా గుడి ఆవ‌ర‌ణ‌లో విగ్ర‌ హాలు తాకుతూ ఆడుతూంటారు. వారిని ఎవ్వ‌రూ ప‌నిగ‌ట్టుకుని త‌ప్పు ప‌ట్ట‌రు.. పిల్ల‌లు గ‌నుక‌. కానీ క‌ర్ణాట‌క కోలార్ జిల్లాలో ఒక ద‌ళిత కుటుంబానికి మాత్రం భారీ జ‌రిమానా ప‌డింది.  మ‌ల్హూర్ జిల్లా ఉల్లెర‌హ‌ళ్లి గ్రామంలో గ‌త‌వారం ఒక ద‌ళిత కుటుంబం గ్రామంబ‌య‌ట ఉన్న ఒక గుడికి వెళ్లారు. అక్క‌డి సిద్ధిరా న్న ద‌క్షిణాదిన గ్రామాల‌లో ప్ర‌జ‌లు ఎంతో న‌మ్మే దేవ‌త గుడి. గ‌త‌వారం అక్క‌డ భూత‌య‌మ్మ సంత జ‌రిగింది. ఈ దేవ‌తను ద‌ర్శించుకోవ‌డానికి పెద్దసంఖ్య‌లో ద‌ళితులూ వెళ్లారు. కానీ దేవాల‌య అధికారులు వారిని లోప‌లికి వెళ్ల‌కుండా అడ్డుకున్నారు. శోభ‌మ్మ‌, ర‌మేష్ల కుమారుడు 12ఏళ్ల కుర్రాడు గుడి ఆవ‌ర‌ణ‌లో అంద‌రితోపాటు వ‌స్తున్నాడు. గుడి ఆవ‌ర‌ణ‌ లో ఒక పెద్ద ధ్వ‌జ‌ స్తంభం ఉంది. జ‌నంలో వ‌స్తూ ఆ పిల్ల‌వాడు దాని స‌మీపంలోకి రాగానే దాన్ని ప‌ట్టుకుని ఆడాడు. అంతే కాదు, లోప‌లికి వెల్లిన త‌ర్వాత దేవ‌త విగ్రహాన్ని కూడా తాకాడ‌ని అక్క‌డివారు కోప‌గించుకుని తిట్టారు.  ఈ కంప్యూట‌ర్ యుగంలోనూ ఇటువంటి అర్ధంలేని నిబంధ‌న‌లు ఉండ‌టం, అమ‌లు చేయ‌డ‌మే దారుణం. పిల్ల‌వాడు చేస్తున్న‌ది ఒక గ్రామ‌స్తుడు చూసి అక్క‌డి అధికారుల‌కు చెప్పేడు. అంతే ప్ర‌పంచం ముని గిపోయిన‌ట్టు నానా యాగీ చేశాడా పెద్ద‌మ‌నిషి. ఆ కుటుంబాన్ని బ‌య‌టికి పంపించ‌డంతో  ర‌భ‌స ముగిసిం ద‌నుకున్నారంతా. కానీ వారిని గుడి ఆవ‌ర‌ణ నుంచి బ‌య‌టికి రాగానే పంచాయితీ పెట్టి కుటుంబంపై రూ.60 వేలు జ‌రిమానా విధించారు. అదీ అక్టోబ‌ర్ ఒక‌టో తేదీనాటికి క‌ట్టేయా ల‌న్నారు. ఒక‌వేళ క‌ట్ట‌ని ప‌క్షం లో ఆ కుటుంబం గ్రామం నుంచి బ‌య‌టికి వెళ్ల‌వ‌ల‌సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.  ఉల్లెర‌హ‌ళ్లి గ్రామంలో సుమారు 75 ద‌ళిత కుటుంబాలున్నాయి. వారంతా ఒక్క‌లింగ తెగ‌కు చెందిన‌వారు. ఈ తెగ‌కు సంబం ధించి ప‌ది కుటుంబాలున్నాయి. వాటిలో శోభ‌మ్మ కుటుంబం ఒక‌టి. వీరు  గ్రామ వెలుప‌లే ఉంటున్నారు. వీరి పిల్ల‌ వాడు ప‌క్క‌నే ఉన్న టెక్క‌ల్ గ్రామంలో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. శోభ‌మ్మ భ‌ర్త ర‌మేష్ అనారోగ్యంతో బాధ‌ప‌డు తున్నాడు. శోభ‌మ్మ బెంగుళూరు వైట్‌ఫీల్డ్‌లో ఒక అపార్ట్‌మెం టులో ప‌నిచేస్తూ నెల‌కు రూ.13వేలు సంపాదిస్తోంది. ఈ ప‌రిస్థితుల్లో వారు జ‌రిమానా రూ.60వేలు ఎలా చెల్లిస్తార‌ని ఆ గ్రామంలోని ద‌ళితులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.  ఇదిలాఉండ‌గా, ఈ జ‌రిమానా విధించిన గ్రామ‌పంచాయితీ స‌భ్యుడు నారాయ‌ణ‌స్వామి, గ్రామ‌ప్ర‌ధాన్ వెంక‌ట‌ప్ప‌ల మీద హ‌క్కుల సంఘం నేత‌లపై  పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

తాత మీద ప్రేమ మాటలకే పరిమితమా ఉత్తర కుమార!

కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టుగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ తీరు. మాటకు ముందు తాత, మాటకు తర్వాత తాత అంటూ తన తాతగారు నందమూరి తారక రామారావుపై ఎనలేని అభిమానం, గౌరవం, భక్తి ఉన్నాయని చెప్పుకునే జూనియర్.. తన తాత మానస పుత్రిక అయిన 'డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ' పేరు మారిస్తే "అమ్మతోడు అడ్డంగా నరికేస్తా" అనే రేంజ్ లో స్పందిస్తాడు అనుకుంటే 'అమ్మ అయ్యా' అని బతిమాలుతున్నాడు.  తన కట్టె కాలే దాకా తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని గతంలో చెప్పిన జూనియర్.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. అసలు ఆయన ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఉద్దరించాలని టీడీపీ శ్రేణులు, నందమూరి అభిమానులు సైతం కోరుకోవడం లేదు. తాత అంత కాకపోయినా సినిమాల్లో అంతో ఇంతో రాణిస్తే మంచిదేగా అని మద్దతిస్తున్నారు. అయితే తన కుటుంబ సభ్యులకు అవమానం జరిగినా.. ఎవరికో భయపడో లేక ప్రత్యర్థి పార్టీలో ఉన్న తన మిత్రుల మెప్పు కోసమో అన్నట్టుగా మెతక వైఖరి చూపించడమే నందమూరి అభిమానులకు, టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది.  తన మేనత్త భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అధికారిక పార్టీ నేతలు అవమానిస్తే.. ‘అలా మాట్లాడటం తప్పు’ అంటూ ఏదో ఆటో వెనక రాసే కొటేషన్ లా సింపుల్ గా చిన్న వీడియో బైట్ రిలీజ్ చేసి మమ అనిపించాడు. మేనత్త మీద ఆయనకున్న ప్రేమ అంతేనేమో లేక సినిమాల్లో చూపించే రౌద్రం బయట చూపించలేడేమో అనుకున్నారంతా. కానీ ఇప్పుడు తన దైవం అని చెప్పుకునే తాతకి అవమానం జరిగినా ఆయన తీరు అలాగే ఉంది. ఆటం బాంబులా పేలతాడు అనుకుంటే.. తడిసిన చిచ్చుబుడ్డిలా తుస్సుమనిపించాడు.  ‘‘ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు’’ ఇదీ జూనియర్ చేసిన ట్వీట్. ఉప్పు వేయకుండా పప్పు చేసినట్టు, మసాలా లేకుండా నాన్ వేజ్ వండినట్టు.. విషయం లేని ట్వీట్ ఒకటి చేసి చేతులు దులుపుకున్నాడు. పైగా ఆ ట్వీట్ లో వైఎస్సార్ భజన ఎన్టీఆర్ అభిమానులను ఆగ్రహం తెప్పించేలా చేసింది.  తాతగారి పేరుని తొలగించడాన్ని ఖండిస్తున్నాను  అని సింపుల్ గా ఒక ముక్కలో ట్వీట్ వేసినా  సర్లే ఈ జూనియర్ తీరు అంతే  అనుకొని అభిమానులు సరిపెట్టుకునేవారేమో. కానీ  మా తాత, మీ తండ్రి గొప్పోళ్ళు  అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మనస్సుకి హాయి కలిగించే మాటతో ట్వీట్ ప్రారంభించి అభిమానులకు మంట పుట్టేలా చేశాడు. అంటే తన దృష్టిలో ఎన్టీఆర్, వైఎస్సార్ సమానమేనా? ఇద్దరి స్థాయి ఒక్కటేనా?. తాత పేరుని తొలగిస్తే ఆగ్రహం వ్యక్తం చేయాల్సింది పోయి.. ఆయనతో వైఎస్సార్ ను పోలుస్తూ ఈ భజన ఏంటి?  సినిమాల్లో పడి జూనియర్ గతం మరచినట్టున్నాడు. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరపున జూనియర్ ప్రచారం చేస్తే 'బుడ్డోడు' అంటూ హేళన చేశారు వైఎస్సార్. దాంతో జూనియర్ అప్పట్లో ఆయనపై ఓ రేంజ్ లో విమర్శలు చేశాడు. అంతేనా తాను నటించిన ఒక సినిమాలో "బుడ్డోడా బుడ్డోడా అంటే గుడ్డలూడదీసి కొడతా" అనే డైలాగ్ కూడా పెట్టుకున్నాడు. మరి ఆ ఫైర్ ఇప్పుడేమైంది. తన తాతని అవమానిస్తే  మీరు చేసింది తప్పు  అని నేరుగా జగన్ సర్కార్ ని ఒక్క మాట అనలేక.. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ గొప్ప నాయకులు అంటూ ఈ దిక్కుమాలిన ట్వీట్ ఏంటి? నీ కంటే వైఎస్సార్ కుమార్తె, జగన్ సోదరి షర్మిల నయం. 'ఎన్టీఆర్ పేరు మార్చడం తప్పు' అని విస్పష్టంగా చెప్పింది. నీ జీవితం తాతకి అంకితం అని చెప్తావుగా, మరి అలాంటి తాతని అవమానిస్తే.. ఆవేదనతో, ఆగ్రహంతో ఇది తప్పని చెప్పాల్సింది పోయి.. నీ స్వార్థం కోసం ఈ ఉత్తరకుమార ట్వీట్ చేస్తావా అంటూ అభిమానులు ఆగ్రహంతో    విరుచుకుపడుతున్నారు. 

తూచ్ .. జగన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడు కాదు

చెప్పేవాడికి వినేవాడు లోకువ. ఆ చెప్పేది శ్రీ సర్కార్ స్వామి అయితే, ఇక చెప్పడానికి ఏముండదు. ఎప్పుడో కాదు, జస్ట్ ఓ రెండు నెలల కిందట, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ, అధికార దర్పంతో అత్యంత ఘనంగా ప్లీనరీ సమావేశాలు నిర్వహించింది. ఈ సమావేశాల్లోనే జగన్ రెడ్డి తల్లి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను సగౌరవంగా పార్టీ నుంచి సాగనంపారు. అదే సమావేశాల్లో   జగన్ మోహన్ రెడ్డిని వైసీపీ జీవిత కాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇదేమీ రహస్యంగా జరిగిన తంతు కాదు. బహిరంగంగానే జరిగింది. ప్లీనరీలో జగన్‌ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లుగా, మరెవరో కాదు, పార్టీలో నంబర్ 2  విజయసాయి రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. నాయకులు జగన్ రెడ్డిని అభినందనలతో  ముంచెత్తారు. శాలువాలు కప్పారు, బొకేలు ఇచ్చారు. జగనన్న గొప్పదనాన్ని వేనోళ్ళ పొగిడారు. జగన్ రెడ్డి రాజ దర్పంతో చిరునవ్వు చెరగకుండా ఈ మొత్తం క్రతువును చక్కగా ఎంజాయ్ చేశారు. అలాగే, తనపై విశ్వాసం ఉంచి, పార్టీ శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు పార్టీలోని ప్రతి ఒక్కరికీ తనదైన స్టీల్లో చేతులెత్తి కృతజ్ఞలు చెప్పారు. ఇదంతా పార్టీ క్యాడర్ కన్నుల పండగగా చూశారు. చప్పట్లు కొట్టారు, చిందులేశారు.  అయితే, ఇప్పుడు  నా పార్టీ నా ఇష్టం, అంటే కుదరదని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ముఖ్యమంత్రి  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ‘శాశ్వత’ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెత్తిన అక్షింతలు వేసింది. ఒక పద్దతి ప్రకారం, ప్రజాస్వామ్య పద్దతిలో అధ్యక్షుని ఎన్నిక జరగాలని తాఖీదు ఇచ్చింది. సరే జరిగిందేదో జరిగిందని, అలా ఉరుకుంటే ఎలా ఉండేదో ఏమో కానీ,  ఏపీ ప్రభుత్వ ‘అల్ ఇన్ వన్’ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, రాజును మించిన విధేయతను చూపించారు. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లు మీడియా ముందు అబద్ధాలు చెప్పడంలో తమ  అనుభవం మొత్తాన్నిరంగరించి, అందమైన అబద్ధాలను అలవోకగా ప్రవచించారు.  జగన్ రెడ్డిని శాశ్వత అధ్యక్ష పదవిన ఎన్నుకున్నది నిజమే కానీ, ఆయన అంగీకరించలేదని, అందుకే ప్లీనరీ మినిట్స్ లో చేర్చ లేదని చక్కగా చెప్పుకొచ్చారు. అంగీకరించకపొతే  ఆ అభినందనలు , హారతులు ఎందుకు? ఆ చిరు నవ్వులు ఎందుకు, అదే విషయం అప్పుడే అక్కడే  ఆయనే చెప్పి ఉంటే, కేంద్ర ఎన్నికల సంఘం లేఖలు రాయవలసిన అవసరమే ఉండేది కాదు కదా  అంటే, దానికి సజ్జల దగ్గర సమాధానం లేదు. పోనీ అప్పుడు కాకపోయినా, ఆ తర్వాత ఎన్నికల్ సంఘం నుంచి  రెండో మూడో తాఖీదు లేఖలు అందిన తర్వాత అయినా  ఒక ప్రకటన ఇస్తే ఇంతవరకు రాకపోను కదా, అంటే  అందుకూ సమాధానం లేదు. అందుకే అంటారు, అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలని. అయినా పుర్వాశ్రయంలో పాత్రికేయులుగా పని చేసిన సజ్జల వారికి, ప్రజాస్వామ్యంలో శాశ్వత పదవులు ఉండవని.. తెలియక పోవడం ఏమిటని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైలుకు వైఎస్సార్ పేరు పెట్టుకోండి.. తెలుగువన్ ఎండి కంఠంనేని రవిశంకర్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు పేరున ఉన్న హెల్త్ యూనివ‌ర్సిటీ పేరును వైఎస్సార్ వ‌ర్సిటీగా మార్చేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి తీసుకున్న‌నిర్ణ‌యం ప‌ట్ల స‌ర్వ‌త్రా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. హెల్త్‌వ‌ర్సిటీ పేరు మార్చాలని ఏపీ అసెంబ్లీ సవరణ బిల్లు ఆమోదించడం దౌర్బాగ్యమని తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ అన్నారు.   ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం కంటే   రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు, రాష్ట్రంలో ఇత‌ర  కేంద్ర కారాగారాలకు  వైస్సార్ పేరు పెడితే ముందుముందు  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కి, ఆయన సహచరులకూ ఎంతో ఉపకరిస్తుందని   తెలుగు దేశం నాయ‌కుడు, తెలుగువ‌న్ ఎండీ  కంఠ‌మ‌నేని ర‌విశంక‌ర్ అన్నారు.  ఒక ఫ్యాక్ష‌నిస్టు ముఖ్య‌మంత్రిగా ఉంటే దోచుకోవ‌డ‌మే జ‌రుగుతుంద‌ని, అది వారి స‌హ‌జ‌ల‌క్ష‌ణ‌ మ‌ని ర‌విశంక‌ర్ ఎద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రికి రాష్ట్ర అభివృద్ధి ఎలా చేయాలో చాతకాదనీ, ఒక పరిశ్రమకానీ, ఒక ప్రాజెక్టు కానీ ఈ సీఎం హయాంలో రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని ఆయన అన్నారు. జగన్ను నమ్మి, జగన్ పాలనను నమ్మి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క పారిశ్రామిక వేత్త కూడా రారనీ, అందుకే 36 ఏళ్ల కిందట ఎన్టీఆర్ స్థాపించిన ప్రపంచ వ్యాప్త గుర్తింపు సాధించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తన తండ్రి పేరు పెట్టుకోవాలన్న దురాలోచతోనే జగన్ ఈ దుస్సాహసానికి ఒడిగట్టారని రవిశంకర్ అన్నారు.  ఫ్యాక్ష‌నిస్టుల‌కు దోచుకోవడం, ఆక్రమించడమే తెలుసనీ, ప్రగతి, సంక్షేమం పట్టవని విమర్శించారు.  రాష్ట్రాన్ని ప‌రిపాలించ‌డంలో విఫ‌ల‌మై, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోకుండా రాజ‌కీయ మ‌నుగ‌డ కోస‌మే ఇలాంటి అర్ధంలేని ఎత్తుగ‌డ‌ల‌తో ఇటువంటి దౌర్బాగ్యపు పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు.   అయినా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అంత సులువు కాదనీ ఐఎంఏ అంగీకరించదనీ కంఠంనేని అన్నారు.

వ‌ర్సిటీ పేరు మార్పు అడ్డుకోండి... గ‌వ‌ర్న‌ర్‌కు బాబు విన‌తి

హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్  పేరును కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విశ్వ భూష‌ణ్ హ‌రిచంద‌న్కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు  విజ్ఞప్తి చేశారు. గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన త‌ర్వాత  చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలను గవర్నర్ దృష్టికి తెచ్చామన్నారు. 1986లో హెల్త్‌ యూనివర్సిటీని ఎన్టీఆర్‌ స్థాపించారని చంద్రబాబు చెప్పారు. తాను సీఎంగా ఉన్నప్పుడు జిల్లాకో మెడికల్‌ కాలేజీ  తీసుకువచ్చామన్నారు. టీడీపీ హయాంలో 18 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశా మన్నారు. సీఎం జగన్‌రెడ్డిదుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడే వన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. హెల్త్‌ వర్సిటీ పేరు మారుస్తూ  జీవో తెచ్చారని, హెల్త్‌ వర్శిటీకి ఎన్టీఆర్‌ పేరు కొన సాగించేంతవరకూ పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్‌ పాలనలో 3 మెడికల్‌ కాలేజీలకు మాత్రమే గుర్తింపు వచ్చిందని చంద్రబాబు అన్నారు. రాత్రి వాళ్ల నాన్న (వైఎస్సార్) ఆత్మతో మాట్లాడి హెల్త్‌ వర్సిటీ పేరు మార్చారా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ కంటే వైఎస్ ఆర్‌ ఎలా గొప్ప వ్యక్తి? అంటూ నిలదీశారు. వైఎస్‌ఆర్‌, జగన్ కలిసి ఎన్ని మెడికల్‌ కాలేజీలు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌ కొత్త మెడికల్‌ కాలేజీ నిర్మించి.. వైఎస్‌ఆర్‌ పేరు పెట్టుకోవా లన్నారు. వైద్య రం గాన్ని జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశారని చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెరాసలో గిరిజన రిజర్వేషన్ల జీవో టెన్షన్, టెర్రర్

తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన గిరిజన రిజర్వేషన్ ప్రకటన అధికార తెరాస నేతలకు కొత్త తలనొప్పులను తెచ్చిపెట్టింది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకతతో సతమతమౌతున్న పార్టీకి ఇప్పుడు ముఖ్యమంత్రి చేసిన గిరిజన రిజర్వేషన్ ప్రకటన ఆ వ్యతిరేకతను మరింత పెంచేదిగా మారిందంటున్నారు.   అదెలాగంటే.. కేంద్ర ప్రభుత్వానికి ఒక వ్యూహం, సరైన విధానం లేదనేది  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, తెరాస నాయకులు నిత్యం జపంలా చేస్తున్న ఆరోపణ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సరైన ఆలోచన, ప్రణాళిక లేక పోవడం వల్లనే అన్ని వర్గాల ప్రజలు అవస్థల పాలవుతున్నారన్నది వారు చేస్తున్న మరో ఆరోపణ. కేంద్ర ప్రభుత్వానికి అసలు తలకాయే లేదని,  ఇలా తెరాస నాయకులు తరచూ చేసే ఆరోపణలు ఇంకా చాలానే ఉన్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం చేతగానితనం సంగతి ఎలా ఉన్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్  గిరిజన రిజర్వేషన్ల ప్రకటనతో అవే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. అది కుడా రాజకీయ ప్రత్యర్దుల నుంచి కాదు, నేరుగా బాధితుల నుంచే ఈ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. కొద్ది నెలల కిందట, అసెంబ్లీ శీతాకాల సమావేశాల సమయంలో, నిరుద్యోగులు వీధుల కెక్కిన ఆందోళన చేస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్రంలో 80 వేలఉద్యోగాల  భర్తీకి  దశల  వారీగా  నోటిఫికేషన్లు జారీ చేస్తామని  అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ సంవత్సరం ముగిసే సమయానికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి, నెక్స్ట్ ఇయర్ నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకటించి, ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ  చేస్తామని, చాలా నమ్మకంగా చెప్పారు. గడచిన ఐదారు నెలలో ఆ ప్రక్రియ కొంత ప్రారంభమైంది, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల కూడా విడుదల అవుతున్నాయి. ఇప్పటికే పోలీస్‌ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష కూడా ముగిసింది. అక్టోబర్‌లో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ జరగనుంది.అలాగే ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత పరీక్ష, టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌)ను కూడా ప్రభుత్వం ఇటీవలే నిర్వహించింది. ఫలితాలు కూడా వచ్చాయి. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులు, ఉపాధ్యాయ ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటచేసిన నాటినుంచి 52 వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇంకా గ్రూప్‌–2, గ్రూప్‌–4 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ రావాల్సి ఉంది. నోటిఫికేషన్లు ఎప్పుడైనా రావొచ్చని మంత్రులు, ప్రకటిస్తున్నారు. మరో వంక ఎంతో కాలంగా, నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు,చిరుద్యోగులు ఇతర వ్యాపకాలు అన్నీ పక్కన పెట్టి, పరీక్షలకు సిద్దమవుతున్నారు. అయితే, ఇంతలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్ 17న పిడుగు లాంటి ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో బంజారా, ఆదివాసీ భవన్‌లను ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సభలో రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. ఈమేరకు వారం రోజుల్లో నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. అయితే.. ఈ రిజర్వేషన్లు ఇకపై  విడుదలయ్యే నోటిఫికేషన్లకు మాత్రమే వర్తిస్తుందా? లేదా.. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు కూడా వర్తిస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. పది శాతం గిరిజన రిజర్వేషనలకు సంబంధించి జీవో విడుదల అయితనే గానీ ఈ విషయంలో స్పష్టత రాదు. అయితే, ఒక వేళ ప్రభుత్వం జీవోలో స్పష్టత ఇచ్చినా, గిరిజనులు లేదా గిరిజనేతరులు ఎవరు, ఏ సాకున కోర్టును ఆశ్రయించినా, ఇప్పటికే మొదలైన నియామక ప్రక్రియ మొత్తం నిలిచిపోయే ప్రమాదం ఉందాని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నిరుద్యోలు, చిన్నాచితక  ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్న యువత, ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు ఇదే ఆఖరి అవకాశంగా భావిస్తున్నారు. అందుకే, చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలను వదిలేసి మరీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. లక్షలాది మంది యువకులు వేల రూపాయలు వెచ్చించి హైదరాబాద్‌ లోని కోచింగ్‌ సెంటర్ల బాట పట్టారు.  అయితే.. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసేఆర్ చేసిన గిరిజన రిజర్వేషన్ ప్రకటనతో మొత్తం నియామక ప్రక్రియ నిలిచి పోతుందని నిరుద్యోగులు ఆందోళన వ్యక్త చేస్తునారు.  ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం తమ  పాలిట శాపంగా మారిందని, ఆవేదన,ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు. గిరిజన రిజర్వేషన్ల పెంపు జీవోతో 80 వేల ఉద్యోగాల్లో లబ్ధి పొందే గిరిజనులు 4 వేలు, కానీ ఈ జీవో కారణంగా నోటిఫికేషన్లు రద్దు చేస్తే మాత్రం లక్షల మంది నిరుద్యోగుల ఆశలు అడియాశలవుతాయి. అందుకే, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం  ఉద్దేశపూర్వకంగానే, గిరిజన రిజర్వేషన్ల ప్రకటన చేసిందని అనుమానిస్తున్నారు. మరోవంక ఇప్పటికే, వందల మంది నిరుద్యోగ యువకుల ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో, ఇంకా ఇప్పటికీ నిరుద్యోగుల కలలు నెరవేరలేదు సరికదా, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు ఆగలేదు. ఇక  ఇప్పడు, ఈ అవకాశం కూడా చేజారిపోతే, ఇదే చివరి అవకాశంగా ఆశలు పెంచుకున్న నిరుద్యోగ యువత ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది మరింత ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. ఈ అంతటికీ ముఖ్యమంత్రి అనాలోచిత ప్రకటనే కారణమని అధికారులు సైతం ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. అదే విధంగా, అధికార పార్టీ నాయకులూ, ఎమ్మెల్యేలు కుడా గిరిజన రిజర్వేషన్ జీవో వస్తే ఒక ఒక తంటా , రాకుంటే మరో తంటా అంటూ తలలు పట్టుకుంటున్నారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై భగ్గుమన్న ఏపీ

ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి వైఎస్సార్ వర్సిటీగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ భగ్గుమంది.  ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై వైసీపీ సర్కార్ పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేం దిక్కుమాలిన నిర్ణయం, అనవసరంగా ప్రజల భావోద్వేగాలను జగన్  సర్కార్ రెచ్చగొడుతోందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విపక్ష టీడీపీ సభ్యులు అసెంబ్లీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. చివరికి వైసీపీ  నేతల నుంచి కూడా ఎన్టీఆర్ పేరు తొలగించడంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. హెల్త్ వర్శిటీని స్థాపించిన దివంగత ఎన్టీఆర్ కుటుంబం వైసీపీ సర్కార్  చర్యను తప్పుపడుతూ ప్రకటన చేసింది. ఇక జగన్  ఏరి కోరి స్వయంగా  అధికార భాషా సంఘం, తెలుగు ప్రాధికార సంఘం, హిందీ అకాడమీ అధ్యక్ష పదవులలో నియమించిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పునకు నిరసనగా   రాజీనామా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్చడంపై ఫైరయ్యారు. జగన్ సర్కార్ కు చేతనైతే కొత్తగా సంస్థలు ఏర్పాటు చేసి మీ పేరు పెట్టుకోండంటూ నిప్పులు చెరిగారు. జగన్ సర్కార్ దివాళాకోరు తనానికి ఈ పేరు మార్పు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండాలనే సంకల్పంతో 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ వర్శిటీని ఏర్పాటు చేశారని అన్నారు. ఎన్టీఆర్ మరణానంతరం ఆయన జ్ఞాపకార్థం 1998లో తమ ప్రభుత్వం ఈ సంస్థకు ఎన్టీఆర్ పేరు పెట్టినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హెల్త్ వర్శిటీ పేరును 36 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడం అర్థరహితమని దుయ్యబట్టారు. జగన్ ఏ ఆత్మతో మాట్లాడి ఎన్టీఆర్ వర్శిటీ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నారో అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. తెలుగుజాతి మొత్తం బాధపడే నిర్ణయం జగన్ తీసుకున్నారని విమర్శించారు. ‘మేం అధికారంలోకి వచ్చాక ఇదీ రీతిలో అన్ని పేర్లు మార్చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండని  లోకేశ్ హెచ్చరించారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందిస్తూ.. వ్యక్తుల పేర్లు మార్చగలరు కానీ.. చరిత్రను మార్చలేరన్నారు. ఎన్టీఆర్ పేరును హెల్త్ వర్శిటీకి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ గొల్లపూడిలోని ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా చేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ కు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు. హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం జగన్ రెడ్డి తుగ్లక్ చర్య అని టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ వర్శిటీగా మారుస్తూ.. అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అడ్డుకునేందుకు టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. జగన్ సర్కార్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందంటూ అసెంబ్లీని అట్టుడికించారు. ఎన్టీర్ పేరు మార్చొద్దని, ఎన్టీఆర్ జోహార్ అంటూ సభలో   నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు.   హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ అధికార భాషా సంఘం, తెలుగు ప్రాధికార సంఘం, హిందీ అకాడమీ అధ్యక్ష పదవుల నుంచి యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తప్పుకున్నారు. తెలుగు గంగ ప్రాజెక్టుకు ఇప్పటి సీఎం జగన్ తండ్రి, అప్పటి సీఎం వైఎస్సార్ ‘ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టు’గా పేరుపెట్టారని యార్లగడ్డ గుర్తుచేశారు. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరును వైఎస్సార్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చడంపై జనసేన అధినత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. పేర్లు మార్చి ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. సంస్థల పేర్ల మార్పిడితో వివాదాలు సృష్టించాలని వైసీపీ సర్కార్ చూస్తోందని ఆరోపించారు. వర్శిటీ పేరు మార్చడానికి సహేతుక కారణాన్ని జగన్ రెడ్డి సర్కార్ వెల్లడించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వర్శిటీలో మెరుగు పరచాల్సిన మౌలిక వసతులను పక్కన పెట్టి.. పేరు మార్చడం సరికాదన్నారు. ఎన్టీఆర్ స్థానంలో వైఎస్సార్ పేరు వస్తే.. వర్శిటీలో వసతులు మెరుగవుతాయా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక జగన్ సోదరి వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల కూడా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడాన్ని తప్పుపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని ఆమె విస్పష్టంగా పేర్కొన్నారు.  పేరు మార్పు వల్ల యూనివర్సిటీ పవిత్రత దెబ్బతింటుందని షర్మిల అన్నారు. ఇలా ఉండగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడం అసెంబ్లీలో సవరణ బిల్లు ఆమోదించినంత తేలిక కాదని బెజవాడకు చెందిన వైద్య ప్రముఖుడు డాక్టర్ అమ్మన్న అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై యూజీసీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ)ల గుర్తింపు రావాల్సి ఉంటుందని, ఇందకు కనీసం నాలుగేళ్లు పడుతుందని ఆయన వివరించారు.  ఒక పక్కన హెల్త్ వర్శిటీ నుంచి ఎన్టీఆర్ పేరు తొలగిస్తూనే.. మరో పక్కన చంద్రబాబు కంటే తానే ఎన్టీఆర్ కు ఎక్కువ గౌరవం ఇస్తానం’టూ జగన్ చెప్పడం ఈ ఏటి మేటి జోక్ లలో పెద్ద జోక్ అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

టీ-20 టిక్కెట్ల కోసం తొక్కిస‌లాట ఒక‌రి మృతి

చాలాకాలం త‌ర్వాత హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌నున్న టీ-20 క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మ‌కాలు  తొక్కిస‌లాట‌, కొట్లా ట‌లు, లాఠీచార్జ్, ఒక మ‌హిళ మృతికీ దారితీసింది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ వేదిక గా జరగ నున్న టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు గురువారం నుంచి మొదలుకానున్నట్లు హైదరా బాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంఖానా గ్రౌండ్‌లో టికెట్ల అమ్మకాలకు కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రతినిధులు తెలిపారు. కానీ టిక్కెట్ల కోసం జ‌నం గురువారం తెల్ల‌వారుజామునుంచే క్యూక‌ట్టారు.  ఒక వ్యక్తికి రెండు టికెట్లు మాత్రమే విక్రయించడం జరుగుతుందని, టికెట్లు కొనేవారికి ఆధార్‌ కార్డు తప్పనిసరి అని హెచ్‌సీఏ స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా మ్యాచ్ టికెట్ల అమ్మకాలపై అభిమానుల్లో గందర గోళం నెలకొంది. ఫ్యాన్స్ డిమాండ్‌తో హైదరాబాద్‌ క్రికెట్ అసోసియేషన్‌ దిగిరాక తప్పలేదు. టీ - 20మ్యాచ్‌ టికెట్ల కోసం క్రికెట్‌ అభిమానులు సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్‌ వద్ద ఆందో ళన చేపట్టారు. సెక్యూ రిటీ సిబ్బంది లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. జ‌నం ప‌రు గులు, తొక్కిస‌లాట‌లో ఒక మ‌హిళ తీవ్రంగా గాయ‌ప‌డింది. ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా దారిలోనే ఆమె మ‌ర‌ణించింది.   మ్యాచ్‌ టికెట్లు సికింద్రాబాద్‌ జింఖానా హెచ్‌సీఏ కార్యాలయంలో మంగళవారం నుంచి లభిస్తాయని సోష ల్‌ మీడియాలో వైరల్‌ కావడం తో నగరంతో పాటు, వివిధ జిల్లాల నుంచి క్రికెట్‌ అభిమానుల తెల్ల వారు జాము నుంచే గ్రౌండ్‌ వద్ద బారులు తీరారు. సెక్యూరిటీ సిబ్బంది గేట్లకు తాళాలు వేయడంతో గోడ దూకి లోపలికి దూసుకెళ్లారు. సెక్యూరిటీ గార్డులు లాఠీలకు పని చెప్పడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ చెల్లా చెదురై బయటికి  పరుగులు తీశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవే శం చేసి ట్రాఫి క్‌ను క్లియర్‌ చేశారు. చాలాకాలం త‌ర్వాత టీ-20 మ్యాచ్‌ని అదీ భా ర‌త్‌, ఆసీస్‌ల మ‌ధ్య మ్యాచ్‌ని  ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు వ‌చ్చిన గొప్ప అవ‌కాశాన్ని ఏమాత్రం వ‌దులుకోవ‌డం అభిమానులు ఇష్ట‌ప‌డ‌రు. టికెట్ల  కోసం విరుచుకు ప‌డ్డారు.  క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మ‌కాల విష‌యంలో సంబంధిత అధికారులు ముందు జాగ్ర‌త్త‌లు తీసుకో లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆదివారం జ‌రిగే మ్యాచ్‌కి  టికెట్ల అమ్మ‌కం విష‌యంలో ముందుగానే త‌గిన ఏర్పాట్లు తీసుకోలేద‌న్న‌ది గురువారం జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిస‌లాట‌, కుమ్మ‌ లాట‌, యువ‌కులు గాయప‌డ‌టం మ‌రింత స్ప‌ష్టం చేసింది.   

దినదిన ప్రవర్ధమానంగా దిగజారుతున్న జగన్ గ్రాఫ్

రాజకీయాలు మారిపోయాయి. రంగు రుచి వాసన మార్చుకున్నాయి. ఇపుడు సర్వం సర్వేలే, అన్న విధంగా అన్ని పార్టీలు, సర్వేల  మీదనే  ఆధార పడుతున్నాయి. సర్వే ఏది చెపితే అదే వేదం. అదే మంత్రం అన్నట్లుగా రాజకీయ పార్టీలు, నాయకులు వ్యవహరిస్తున్నారు. ఒక విధంగా కళ్ళకు గంతలు కట్టుకుని, ముందుకు సాగుతున్నాయి, సాగుతున్నారు.  ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే సర్వేలే సర్వస్వంగా రాజకీయ ‘వ్యూహ’ రచన చేస్తున్నారు. ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి మొదలు ప్రభుత్వం వేసే ప్రతి అడుగుకూ సర్వేలే  ఆధారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.    అయితే, ఇప్పడు ఏపీలో ఆ సర్వేలే అధికార వైసేపీలో చిచ్చు తెచ్చాయని, అంటున్నారు.  సర్వేకి అటు సర్వేకి ఇటు అన్నట్లుగా పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి పార్టీకి ,పార్టీకి ప్రజాప్రతినిదులకు,ప్రజా ప్రతినిధులకు, పార్టీ క్యాడర్ కు మధ్య సర్వేలు అడ్డు గోడలు కడుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా నియోజక వర్గాల స్థాయిలో సర్వేలు సమస్యలు సృష్టిస్తున్నాయని అంటున్నారు.  రాష్ట్రంలో వైసీపీ ‘సుందర’ పాలన మొదలై మూడేళ్ళు నిండిన సందర్బంగా, గడప గడపకు ప్రభుత్వం పేరిట అన్ని గ్రామాలకు వెళ్లి ప్రతి ఇంటి తలుపు తట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. అయితే, ప్రజలలోకి వెళ్ళే దైర్యం లేకనో ఏమో, చాలా వరకు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఆదేశాలను పక్కన పెట్టేశారు. అంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే, అదే గెలుపు మంత్రంగా  తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, గడపగడపకు కార్యక్రమంపై కూడా సర్వే. కాదు ఏకంగా మూడు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకున్నారు. ఇప్పుడా సర్వే నివేదికలు ముందు పెట్టుకుని  ముఖ్యమంత్రి తన దగ్గర రెండు సర్వేలు ఉన్నాయని, ఎవరి పర్‌ఫామెన్స్‌ ఏంటో ఈ నివేదికల్లో ఉందని, ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేస్తునట్లు తెలుస్తోంది. నిజానికి సర్వే నివేదికల్లో ఏముందో ఏమో, కానీ, కొంతమంది ఎమ్మెల్యేలను, నియోజక వర్గంలో అప్పుడే మాజీలుగా చూస్తున్నారని  అంటున్నారు.   ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి దగ్గర ఉన్నాయని చెపుతున్న మూడు సర్వే రిపోర్టులో ఒకటి, ఐప్యాక్‌ (పీకే) బృందం ఇచ్చింది. మరొకటి క్రాస్‌ చెక్‌ చేసుకునేందుకు మరో ఏజెన్సీ ద్వారా చేయించారు. అలాగే మరో సర్వే  సర్కార్ వారి నిఘా వర్గాలు నిర్వహించిన సీక్రెట్ సర్వే.  అయితే, చిత్రంగా, సర్వేలు, సర్వే చేసిన సంస్థలు వేరైనా సత్యం ఒకటే, అన్నట్లుగా, అన్నీ కూడా జగన్  ప్రభుత్వ గ్రాఫ్ దినదిన ప్రవర్థమానంగా దిగజారిపోతోందన్న ఒకే ఒక నిజాన్ని బయట పెట్టాయి.  “అయ్యా .. ముఖ్యమంత్రిగారు. ప్రభుత్వ గ్రాఫ్ రోజు రోజుకు దిగజారుతోంది. ఎమ్మెల్యేల గ్రాఫ్ మాత్రమే కాదు. మీ  గ్రాఫ్ కూడా పతనం వైపు పరుగులు తీస్తోంది.. తస్మాత్ జాగ్రత్త” అని అన్ని సర్వేలూ ఒకే ఒక్క వాస్తవాన్ని వెల్లడించాయని పార్టీ శ్రేణులే అంటున్నాయి. అలాగే, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా, అన్ని వర్గాలలోనూ  ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందనీ,   గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరిలోనూ ఏ అసంతృప్తి రగులుతోందని,  మూడు సర్వేలన్నీ తేల్చి చెప్పాయని అంటున్నాయి. ఇసుక, మద్యం, అధ్వాన రహదారులు, కాంట్రాక్టర్‌లకు బిల్లులు ఇవ్వకపోవడంతో కిందిస్థాయి వరకూ వ్యతిరేకత ఉందని సర్వేలు వెల్లడించాయి. ఎమ్మెల్యేల పని తీరుపైనా సర్వేలన్నీ ఒకే రకంగా ఉన్నాయి. దాదాపుగా 60 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదని, సంక్షేమ కార్యక్రమాల అమల్లో వారి పాత్ర లేకపోవడం, అభివృద్ది కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోవడం కూడా వైసీపీకి మైనస్‌గా మారిందని  చెప్పాయి.  ఎమ్మెల్యేలే కాదు మంత్రుల పనితీరు విషయంలోనూ ప్రజాలు పెదవి విరుస్తున్నారు.  అయినా, ఏకంగా ముఖ్యమంత్రి పనితీరే బాగాలేదని, మీటలు నొక్కడమే పరిపాలన అనుకుంటే ఎలా అని ప్రజలు నేరుగా ప్రశ్నిస్తున్నప్పుడు, ఒకరి తీరు బాగుంది, ఒకరి తీరు బాగాలేదని  అనుకోవడం ఎందుకు, యథా జగన్ తథా పార్టీ.

బీసీల‌కు జ‌గ‌న్ ఏం చేశారు... చంద్ర‌బాబు

రాష్ట్రంలో బీసీల‌కు రాజ‌కీయ ప్రాధాన్య‌తనిచ్చింది తెలుగుదేశం పార్టీయేన‌ని, అంత‌కుముందు అంద‌ రూ వారిని కేవ‌లం ఓటు బ్యాంకుగా మాత్ర‌మే చూశార‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు అన్నారు. నిజానికి ఎన్టీఆర్ వ‌చ్చిన త‌ర్వాత‌నే బీసీల‌కు రాజ్యాధికారం సాధ్య‌మ యిందన్నారు. విజయవాడ ఎ కన్వెన్షన్ లో జరిగిన  తెలుగు దేశం పార్టీ బిసి రాష్ట్ర విభాగం, సాధికార కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. బిసిలలో నాయకత్వం తయారు కావాల‌ని, 142 కులాల నుంచి నాయకత్వం కోసం సాధికార కమిటీలు పెట్టామ‌ని ఆయ‌న అన్నారు.  బీసీల‌నాయ‌క‌త్వం పెంచ‌డానికే స్థానిక‌సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్ పెట్టామ‌ని, ఎన్టీఆర్ 24 శాతం చేస్తే, తాము దాన్ని 34 శాతానికి పెంచామ‌ని, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత బిసిల రిజర్వేషన్లను పది శాతం తగ్గాయన్నారు. జగన్ కారణంగా 16 వేల మంది బిసి సోదరులు పదవులకు దూరం అయ్యారు. టిడిపి 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు...వైసిపి ఎందుకు అమలు చెయ్యలేకపోయిందని ప్ర‌శ్నించారు.  బిసి లకు సబ్ ప్లాన్ తెచ్చిన ఏకైక ప్రభుత్వం టిడిపి ప్రభుత్వ‌మేన‌ని అన్నారు. జగన్ ఏర్పాటు చేసిన 54 కార్పొ రేషన్ లు ఏం చేస్తున్నాయ‌న్నారు.  కార్పొరేషన్ ల ద్వారా ఒక్కరికి అయినా సాయం చేశారా అని ప్ర‌శ్నిం చారు.  జగన్ ఎప్పుడు ఎన్నికలకు వచ్చినా నేను సిద్దంగా ఉన్నామ‌న్నారు.  సిఎం జగన్ భయపడుతున్నాడు కాబట్టే జగన్ కు అసహనం...అసెంబ్లీలో కూడా అది జగన్లో కనిపించింది. వైసిపి నాయకులు ఇప్పుడు పిల్లులు అయ్యారని ఎద్దేవా చేశారు. బటన్ అవుట్ కంటే బటన్ ఇన్ ఎక్కువ అయ్యిందని,  ఎప్పుడో ఒక సారి జగన్ పొట్ట పగిలి  అన్ని డబ్బు లు బయటకు వస్తాయని ఎద్దేవా చేశారు.  మెడికల్ కాలేజీ కోసం ప్రత్యేకంగా మెడికల్ యూనివర్సిటీ  తె చ్చింది ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ పేరు మార్పు తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బ తీయడమే. దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్ కు ప్రాముఖ్యత ఇచ్చింది తామేన‌న్నారు. జగన్ అబద్దం చెపితే కనీసం అతికేటట్లు చెప్పాలన్నారు. నిజానికి తాము కాద‌నుకుంటే క‌డ‌ప‌కు రాజశేఖర్ రెడ్డి పేరు ఉండేదా అని, హర్టికల్చర్ యూనివర్సిటీకి వైఎస్ ఆర్ పేరు ఉండేదా అని అన్నారు. జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి, చెన్నారెడ్డి, కృష్ణకాంత్ వంటి వారి పేర్లుపెట్టి సంస్థలు నిర్మిం చామ‌ని. మళ్లీ అధికారంలోకి రాగానే  అప్పు డు జగన్ రెడ్డి కథ చెపుతామ‌ని బాబు అన్నారు. మళ్లీ ఎన్టీఆర్ పేరు వర్సిటీకి పెట్టే వరకు నిద్ర పోయేది లేదన్నారు. 

ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను.. కమలం ఉచ్చులో పవన్

ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను, ఏ సినిమాలోదో ఏమో కానీ,ఈ సాంగ్ ఒక్పప్పుడు బాగా పాపులర్ అయిన పాటల్లో ఒకటి. అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ,   ఈ పాటకు స్టెప్పులేస్తుంటే హల్లో ఈలలే ...ఈలలు. అయితే, ఇప్పుడు  సిట్యువేషన్, అది కాక పోయినా, రాజకీయ నాయకుడిగా అవతారం ఎత్తిన, ప్రముఖ హీరో, జన సేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉందని అంటున్నారు. కమలం ఉచ్చులో గిలగిలలాడుతున్న ఆయన పరిస్థితి రాజకీయాలలోకి ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను అని మధన పడేలా ఉందని పరిశీలకులు అంటున్నారు. ఆయన అభిమానులు. బీజేపీ, జనసేన మిత్ర పక్షాలు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత మళ్ళీ బీజేపీతో జట్టు కట్టారు. మాంగల్యానికి మూడు ముళ్ళు అన్నటుగా బీజేపే మెడలో మరో మూడు ముళ్ళు వేశారు. అయితే, ఆ తర్వాత, ‘చెలియ లేదు చెలిమి లేదు, వెలుతురే లేదు’ అన్నట్లుగా, ‘చేసుకున్న బాసలు, చెప్పుకున్న ఉసులు’ ఏమై పోయాయో కానీ, ఎవరి దారిన వారు, అడుగులు వేస్తున్నారు,నడక సాగిస్తున్నారు.  అయినా, బీజేపీ నాయకులు టీవీ చర్చల్లో జనసేన తమ మిత్ర పక్షం అనే అంటారు. 2024 ఎన్నికల్లో ఇద్దరం కలిసి దుమ్ముదులిపేస్తాం అంటారు.అధికారం మాదే అంటారు. అంతే, అంతకు మించి ఇంకొక్కమాట మాట్లాడరు. అలాగే, ముఖ్యమంత్రి ఎవరన్నది బీజేపీ నాయకులు వాళ్ళంతట వాళ్ళు చెప్పరు. చివరకు, జనసేన నాయకులు సిగ్గువిడిచి, నోరు తెరిచి అడిగినా, బీజేపే నేతలు పెదవి విప్పరు. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని ప్ల  కార్డులు పట్టుకుని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఎదుట ప్రదర్శనలు చేసినా, పట్టించుకోరు.   ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా, పార్టీ జాతీయ నాయకులు వచ్చి పోతుంటారు, కానీ, రాష్ట్రంలో మిత్ర పక్షం ఒకటుందని ఒక్కరు కూడా కనీసం గుర్తించనైనా గుర్తించరు. ఒక పిలుపు ఒక పలకరింపు ఏవీ ఉండవు.  మెగా ఫ్యామిలీ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్నా ఆయన్ని పట్టించుకోరు, కానీ అదే అమిత్ షా జూనియర్ ఎన్టీఅర్ తో గంటలు భేటీ అవుతారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డా, మరో హీరో నితిన్ తో భేటీ అవుతారు. సరే ఆయన కలుద్దామనుకున్నది నితిన్ ను కాదు, మరో కుర్ర హీరో నిఖిల్ ని అనీ, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ తో అల జరిగిపోయిందని అంటున్నారు. సరే, ఆయన కలవాలనుకున్నది నితిన్ అయినా నిఖిల్ లేదా హీరో ఎవరైనా ఆది ఇప్పడు అప్రస్తుతం. మెగా ఫ్యామిలీ పవర్ స్టార్ అని కాకపోయినా, మిత్ర పక్షం అధ్యక్షుడిగా అయినా జాతీయ నాయకులు రాష్ట్రానికి వచ్చినప్పుడు,పవన్ కళ్యాణ్ ను కనీసం హలో అని అయినా పలకరించాలి కదా, అని ఆయన అభిమానులు నొచ్చుకుంటున్నారు. బీజేపీ ఉచ్చులో చిక్కుకుని, పవన్ కళ్యాణ్  ఎటూ కాకుండా, త్రిశంకు నరకంలో తేలియాడుతున్నారని అంటున్నారు.  అయితే, కొంచెం చాలా ఆలస్యంగానే అయినా పవన్ కళ్యాణ్  బీజేపీ గేమ ప్లాన్ అర్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మిత్ర పక్షం పేరును అడ్డుపెట్టుకుని జనసేనను బీజేపీ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని, అందుకే, పవన్ కళ్యాణ్ బిగ్ బ్రదర్, మెగా స్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ సహా అనేక మంది హీరోలను తమ గూటికి తెచ్చుకునే ప్రయత్నం కమల దళం  చేస్తోందని అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీ కబంధ హస్తాల నుంచి ఎంత త్వరగా బయట పడితే అంత మంచిదని పవన్ కళ్యాణ్ హితేషులు సూచిస్తున్నారు. నిజానికి, పవన్ కళ్యాణ్ మార్చిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలోనే, వైసీపీ ప్రభుత్వ  అరాచక పాలనను అంతం చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అందుకే, వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెదిరి పోకుండా చూడాలని స్పష్టం చేశారు. అలాగే జనసేన ముందు మూడు ప్రత్యన్మాయాలున్నాయని వివరించారు. అయితే, బీజేపీ మాట తప్పి పక్క చూపులు చూస్తున్న తాజా  పరిణామాల నేపధ్యంలో, బీజేపీతో పొత్తు ఆప్షన్ ఇక లేనట్లేనని అంటున్నారు. ఈ నేపద్యంలో  పవన్ కళ్యాణ్ ముందు రెండే ప్రత్యన్మాయాలున్నాయని, అందులో ఒంటరిగా పోటీచేసే ఆప్షన్ , మరొకటి తెలుగు దేశంతో పొత్తు ఆప్షన్  అని అంటున్నారు. అయితే, దేనికైనా సరైన సమయం రావలసి ఉంటుందని అంటున్నారు. అయితే పవర్ స్టార్ అభిమానులు మాత్రం ఎదురు చూపులు ఇక చాలు అంటున్నారు. అంతేకాదు, పవర్ స్టార్ అభిమానులే కాకుండా మెగా అభిమానులు కూడా బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

ఊ అంటారా.. రాహుల్ ఊహూ అంటారా?

రాబోయే రోజుల్లో కాబోయే కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? ఇప్పుడు, ఇదే  కాంగ్రెస్ పార్టీ ముందున్న ప్రధాన ప్రశ్న. నిజానికి, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామ చేసినప్పటి నుంచి,కాంగ్రెస్ అధ్యక్ష పీఠం ఖాళీగానే వుంది.అనివార్య పరిస్థితుల్లో సోనియా గాంధీ, తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టినా ఆమె పార్టీ బాధ్యతలను నిర్వహించలేక పోతున్నారు. ఓ వంక వయో భారం, మరో వంక అనారోగ్యం, ఆమెను వెంటాడుతున్నాయి.ఈ కారణంగా ఆమె క్రియాశీలంగా వ్యవహరించలేక పోతున్నారు. మరో వంక పార్టీ సీనియర్ నాయకులు ఒకరొకరుగా పార్టీని వదిలి పోతున్నారు.  ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం పార్టీ అధ్యక్ష ఎన్నికలకు ముహుర్తహం ఖరారు చేసింది. ఓ 15/20 రోజుల క్రితం పార్టీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పోటీ అనివార్యమైతే అక్టోబరు 17న పోలింగ్‌ జరుగుతుంది. అధ్యక్ష ఎన్నికల్లో అర్హులైన పార్టీ సభ్యులు ఎవరైనా పోటీ చేయవచ్చని, పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది. అయితే ఎవరు పోటీ చేస్తారు? అసలు ఎవరైనా పోటీ చేస్తారా? అనే విషయంలో ఇంతవరకు అయితే స్పష్టత లేదు. ఓ వంక  కాంగ్రెస్ ఎంపీ శశి  థరూర్ సహా మరికొందరి పేర్లు వినిపిస్తున్నా,ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా, ఖాయంగా పోటీ చేస్తామని ప్రకటించలేదు. అదలా ఉంటే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయం ఏమిటి అనే విషయంలో మొదటి నుంచి ఉన్న సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. నిజానికి, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలోనే తమ మనసులోని మాటను స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు మరోమారు తీసుకుఎంది లేదని తేల్చి చెప్పారు. అంతే కాదు  గాంధీ కుటుంబం వెలుపలి వ్యక్తులు పార్టీ అధ్యక్ష బాద్యత తీసుకోవాలని, సిడబ్ల్యూ సంవేసంలోనే తెగేసి చెప్పారు. మూడేళ్ళుగా అయన అదే మాట మీదున్నారు.  అయినా, ఇంకెవరు ముందుకు రాకపోవడం వల్లనే, సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా నెట్టుకొస్తున్నారు.  మరో వంక ఆమె నిరాసక్తత కారణంగానే కావచ్చును కానీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా స్వతత్రంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. విమర్శలు ఎదుర్కుంటున్నారు. రాహుల్ గాంధీ అప్రకటిత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని, జీ23 నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ గాంధీ సదిగ్ధ వైఖరి కారణంగానే పార్టీ నష్ట పోయిందని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. నిన్న మొన్న పార్టీని వదిలి వెళ్ళిన, పార్టీ సీనియర్  నాయకుడు గులాంనబీ ఆజాద్,ఇంకా పార్టీలోనే ఉన్నఆనంద శర్మ, మనీష్ తివారీ వంటి ఇతర సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ నిర్వాకం వల్లనే పార్టీ కోలుకోలేని విధంగ్ బలహీనమైందని, మండి పడుతున్నారు. నిజానికి, ఇప్పటికైన రాహుల గాంధీ తెగించి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు, సై’ అంటే అధ్యక్ష ఎన్నిక అవసరమే ఉండదు. కానీ ఇప్పటికీ అయన దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నారు. తాజాగా, భారథ్ జోడో యాత్రలో ఉన్న రాహుల గాంధీ, నిన్న(శుక్రవారం) విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ... అదే సందిగ్ధత, సస్పెన్సు కొనసాగించారు. “అధ్యక్ష బాధ్యతల విషయంలో ఎప్పుడోనే  నిర్ణయం తీసేసుకున్నను, ఈ విషయంలో నాకెలాంటి అయోమయమూ లేదు. అధ్యక్షుడిని అవుతానో లేదో ఎన్నిక జరిగినప్పుడు స్పష్టత వస్తుంది. అప్పటివరకు వేచి చూడండి” అంటూ, అటూఇటూ కాని, సమాధానం ఇచ్చారు. అంతే కాదు, “ఒకవేళ పోటీచేయకుంటే విలేకరులు తనను అడగొచ్చని.. అందుకు జవాబు చెబుతాను” అంటూ మరో మెలిక పెట్టారు. అంటే రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు సిద్డమయ్యారని అనికోవాలా?  లేదని సరిపుచ్చుకోవాలో’ అర్థం కాక కాంగ్రెస్ శ్రేణులే తలలు పట్టుకుంటున్నాయి.  అదలా ఉంటే రాహుల గాంధీ సాగిస్తున్న, భారత్ జోడో యాత్ర లక్ష్యం విషయంలోనూ అదే సందిగ్దత వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ సహా పార్టీ సీనియర్ నాయకులు, ఓ వంక ఇది రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేస్తున్న యాత్ర కాదని అంటారు. మరో వంక, యాత్ర ద్వారా రాహుల్ గాంధీ పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తున్నారని అంటున్నారు. అదెలా ఉన్నప్పటికీ, అధ్యక్ష పదవి విషయంలో సందిగ్దత తోలిగితేనే కానీ, కాంగ్రెస్ భవిష్యత్ ఏమిటన్నది తేలదని, రాహుల్ గాంధీ, ఇప్పటిలా బాధ్యతలు లేని అధికారం చెలాయించాలని కోరుకుంటే, పార్టీ పరిస్థితి కూడా  ఇప్పటిలానే దినదిన ప్రవర్తమానంగా దిగాజారుతుందని అంటున్నారు.

జమ్మూ కాశ్మీర్ సినీమా హాళ్లలో ఆర్ఆర్ఆర్ సందడి

జమ్మూకాశ్మీర్ లో వేగంగా సాధారణ పరిస్థితులు  నెలకొంటున్నాయి. మూడు దశాబ్దాలుగా థియోటర్లలో సినీమా చూసేందుకు నోచుకోని కాశ్మీరీ ప్రజ ఇప్పుడు రాష్ట్రంలో థియేటర్లు తెరుచుకుని హాయిగా బిగ్ స్క్రీన్ మీద సినీమా చూసే అవకాశం లభించింది. అలా లభించిన వారికి మాంఛి విజువల్ ట్రీట్ కూడా లభ్యమైంది. ఎందుకంటే మూడు దశాబ్దాల తరువాత తెరుచుకున్న కాశ్మీర్   సినిమా థియేటర్లలో ప్రదర్శితమైన తొలి సినీమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామచరణ్ నటించిన, దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్. ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలనూ ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినీమా కాశ్మీర్ థియోటర్లలో సందడి చేస్తోంది. నిజానికి  జమ్మూ-కశ్మీరు,అనగానే ముందుగా గుర్తుకొచ్చేది, ఉగ్రవాదుల తుపాకుల మోత. నిత్యకృత్యంగా సాగే నరమేథం,మారణహోమం. నగరం నడివీదుల్లో ఉగ్రవాదుల వీరంగం,  సైనికుల ఎదురు కాల్పులు. సరిహాద్దులో క్షణం క్షణం భయభయంగా బతికే అమాయక ప్రజలు. ఎంతో కాలంగా, ఎన్నో  దశాబ్దాలుగా సాగిన ఉగ్రవాద నరమేధంలో ఎన్ని వందల వేల మంది అమాయకులు అమరులయ్యారో, ఎన్ని వేల కుటుంబాలు, అనాధలుగా మిగిలాయో, వేరే చెప్ప నక్కర లేదు. అంతే కాదు, సాధారణ ప్రజల జీవితాలను ఉగ్రవాదం ఎంతలా  చిన్నాభిన్నం చేసిందో, చెప్పేందుకు మాటలు చాలవు. జమ్మూ-కశ్మీరులో 30 ఏళ్లకు పైగా సినిమా హాల్స్ ముతపడే ఉన్నాయి, అంటే, పరిస్థితి ఏమిటో వివరించవలసిన అవసరం లేదు. నిజానికి కొద్ది సంవత్సరాల క్రితం వరకు కూడా జమ్మూ-కశ్మీరులో మళ్ళీ సాధారణ పరిస్థితులు నెల కొంటాయని ఆశించే పరిస్థితి కూడా లేదు.  కానీ, మూడేళ్ల క్రితం 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత పరిస్థితి క్రమంగా అదుపులోకి ర్వడం మొదలైంది. విభజన అనంతరం కొంతకాలం రాజకీయ అలజడి కొనసాగినా, కేంద్ర పలనలో మెల్లమెల్లగా పరిస్థితి మారుతూ వచ్చింది. జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇందుకు, మూడు దశాబ్దాల తర్వాత శ్రీనగర్, పుల్వామా, షోపియాన్‌లలో మళ్లీ సినిమా థియేటర్లు తెరుచుకోవడమే నిదర్శనంగా, విశ్లేషకులు భావిస్తున్నారు.  దక్షిణ కశ్మీర్‌లోని సోఫియాన్‌, పుల్వామాల్లో ఏర్పాటు చేసిన మల్టీఫ్లెక్స్‌లను నిన్న (ఆదివారం) జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ప్రారంభించారు. వీటిని ప్రభుత్వ ఆధ్వర్యంలోని మిషన్‌ యూత్‌ విభాగం, ఆయా జిల్లా యంత్రాంగాలు కలిసి నిర్మించాయి. నిజానికి, ఇవి కేవలం సినిమా థియేటర్లు మాత్రమే కాదు. బహుళ ప్రయోజన శిక్షణా కేంద్రాలు ఇక్కడ సినిమాల ప్రదర్శనలతో పాటు, సమాచారం, యవత నైపుణ్యాభివృద్ధికి సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. త్వరలో ప్రతి జిల్లాలోనూ ప్రారంభిస్తామని వెల్లడించారు. ఒక థియేటర్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌, మరో మల్టీఫ్లెక్స్‌’లో  భాగ్‌ మిల్కా భాగ్‌లను ప్రదర్శించారు. 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే.   శ్రీనగర్‌లోని సోంవార్‌ ప్రాంతంలో నిర్మించిన మొట్టమొదటి మల్టీప్లెక్స్‌ మంగళవారం ప్రారంభం కానుంది. ఇందులో 520 సీట్ల సామర్థ్యంతో మూడు థియేటర్లు ఉన్నాయి. లాల్‌ సింగ్‌ ఛడ్డా సినిమాతో ఇవి ప్రారంభం కానున్నాయి.  పుల్వామా, షోపియాన్లలోని సినిమాహాళ్ల ప్రారంభం సందర్భంగా మనోజ్ సిన్హా   ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక దినమని తెలిపారు. సినిమా హాళ్ళ ప్రారంభానికి సంబందించిన ఫొటోలను షేర్ చేశారు. బాలీవుడ్ చిత్రం ‘భాగ్ మిల్కా భాగ్’ను మనోజ్ సిన్హా వీక్షించారు.‘‘జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతానికి ఇది చరిత్రాత్మక దినం! పుల్వామా, షోపియాన్లలో మల్టీపర్పస్ సినిమా హాల్స్‌ను ప్రారంభించాను. ఇక్కడ మూవీ స్క్రీనింగ్, ఇన్ఫోటెయిన్‌మెంట్, యువతకు నైపుణ్య శిక్షణ వంటి సదుపాయాలు ఉన్నాయి’’ అని సిన్హా కార్యాలయం ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొంది.  జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదం పెచ్చరిల్లడంతో 1990వ దశకం ప్రారంభం నుంచి సినిమా హాళ్లు మూత పడ్డాయి. సుమారు 10 సినిమా హాళ్ళు ఉండేవి, కానీ వాటి యజమానులకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చేవి. శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న రీగల్ సినిమా థియేటర్‌పై 1999లో గ్రెనేడ్ దాడి జరిగింది. దీంతో వాటిని మూసేశారు. కొన్ని థియేటర్లను పునఃప్రారంభించడానికి చేసిన ప్రయత్నాలు అప్పట్లో సఫలం కాలేదు. జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ, 2019 ఆగస్టు 5న భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేశారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు.  గత సంవత్సరంగా జమ్మూ, కాశ్మీర్ పారిశ్రామిక విధానం, 2021లో భాగంగా మూతబడిన సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడానికి సిద్ధపడింది. ప్రస్తుతం ఉన్న సినిమా హాళ్లను ఆధునీకరించడానికి, అత్యాధునిక సినిమా హాళ్లను నిర్మించడానికి కూడా ప్రోత్సాహకాలు ప్రకటించింది. మరోవంక, సినిమాల నిర్మాణంకు, షూటింగ్ లకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ప్రకటించింది. ఒకప్పుడు కశ్మీర్‌ షూటింగ్‌లకు స్వర్గధామంలా ఉండేది. ఆ వైభవాన్ని పునరుద్ధరించేందుకు నూతన ఫిల్మ్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. తిరిగి అటువంటి వాతావరణం కల్పించడంకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సినీ నిర్మాణం, చిత్రీకరణలకు గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి కృషి జరుగుతోంది. జమ్మూ-కశ్మీరు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కృషితో సినిమాల ప్రదర్శనతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు అందజేయడం కోసం మల్టీపర్పస్ హాల్స్‌ను నిర్మిస్తున్నారు.

ఒక్క నిర్ణ‌యం రెండు ప‌రాభ‌వాలు!

అదేదో సినిమాలో హీరో అంటాడు.. వ‌న్ షాట్ టూ బ‌ర్డ్స్ అని. ఓ సినిమాలో క‌మెడియ‌న్ హీరోయిన్ నుంచి పువ్వు అందుకుంటాడు, వెనక్కి తిర‌గ్గానే హీరో అత‌గాడి చెంప ఛెళ్లుమ‌నిపిస్తాడు! రెండూ ఊహించ‌నివే! కొండ‌క‌చో ఏపీ ముఖ్య‌మంత్రికి ఇలాంటి అనుభూతే క‌లిగి ఉంటుంది. ఎన్టీఆర్ హెల్త్ వ‌ర్సిటీ పేరు మార్చి దేశంలోని ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఇంకా తిట్లు తింటూనే ఉన్నారు. తెల్లార‌ గానే ఎల‌క్ష‌న్ కమిష‌న్ జ‌గ‌న్‌కు  పార్టీ శాశ్వ‌త అధ్య‌క్ష‌ప‌ద‌వి ఉండ‌కూడ‌ద‌ని షాక్ ఇచ్చింది.  ఇది ఊహించ‌ని చ‌ర్య‌, ప్ర‌తిచ‌ర్య అన్నారు చాలామంది. ఎవ్వ‌రికీ న‌చ్చ‌ని ప‌నిచేస్తే దాని ప్ర‌భావం వెం ట‌నే కాకున్నా త‌ర్వాత‌యినా అనుభ‌వించాల్సి వ‌స్తుంద‌ని సామాజిక శాస్త్ర‌వేత్త‌ల మాట‌. అది రాజ‌కీయా ల‌కీ వ‌ర్తిస్తుంది. నాయ‌కులు ఆచీ తూచీ వ్య‌వ‌హ‌రించాలి. అధికారంలో ఉన్న ధీమాను, మొండిత‌నాన్ని ప్ర‌ద‌ర్శిస్తే పార్టీ ఫాలోయ‌ర్లు కూడా దూర‌మ‌వుతారు. అందుకు తాజా సాక్ష్యం వైపీసీ అధినేత, ఏపీ ముఖ్య మంత్రి జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం. ఒక్క నిర్ణ‌యం రెండు ప‌రాభ‌వాల‌నిచ్చింది. ఇది ఎవ‌రికీ జ‌రిగి ఉండ కాపోవ‌చ్చు.  వైసీపీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ బుధ‌వారం రాత్రి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ సెటైరికల్ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్సార్ యూనివ‌ర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా మారుస్తూ ఈ రోజు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇది జ‌రిగిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే వైసీపీ శాశ్వ‌త అధ్యక్షుడిగా జ‌గ‌న్ ఎన్నిక చెల్ల‌దంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓ ప్ర‌క‌ట‌ న‌ను విడుద‌ల చేసింది.  వ‌రుస‌గా జ‌రిగిన ఈ రెండు కీల‌క ప‌రిణామాల‌ను ప్ర‌స్తావిస్తూ జ‌గ‌న్‌పై నారా లోకేశ్ సెటైర్ సంధించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాడు.. తన పార్టీకి తానే అధ్యక్షుడు కాకుండా పోయాడు అంటూ లోకేశ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా  ఈ  రెండూ  ఒకే రోజు జ‌రిగాయ‌ని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని, జ‌గ‌న్ భ‌విష్య‌త్తు ఏమిటోన‌ని కూడా లోకేశ్ వ్యంగ్యం ప్ర‌ద‌ర్శించారు. త‌న ట్వీట్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం వైసీపీకి రాసిన లేఖ ప్ర‌తిని కూడా ఆయ‌న జ‌త చేశారు. 

అధ్యక్ష ఎన్నికల తర్వాత రాహుల్ రోల్ ఏమిటి?

ఎంత మంది ఎన్ని విధాలా విజ్ఞప్తులు చేసినా, పీసీసీతీర్మానాలు చేసి రిక్వెస్టులు పంపినా రాహుల్ గాంధీ మారలేదు. మనసు మార్చుకోలేదు. 2019లో తీసుకున్న నిర్ణయానికే కట్టుబడ్డారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వస్రమైన అర్హతలన్నీ, మీకే, మీఒక్కరికే ఉన్నాయి, కాదనకండి, కరునించండి, అని దేశం వ్యాప్తంగా ఉన్న లక్షలాది కాంగ్రెస్ శ్రేణులు సంతకాలు చేసి విజ్ఞాపనలు పంపినా, రాహుల్ గాంధీ మాత్రం మాట మీదనే నిలబడ్డారు. దటీజ్ హిజ్ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్.   రాహుల్ నో అన్నారు కాబట్టే, ఇప్పడు, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రేసు మొదలైంది. ముందు ఇద్దరే అన్నారు. ఇప్పడు ముగ్గురయ్యారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్, కేరళ ఎంపీ శశి థరూర్’ తోపాటుగా తాజాగా, దిగ్విజయ సింగ్’ కూడా బరిలో దిగేందుకు రెడీ అంటున్నారు.  ఈ నెంబర్ ఇంకా పెరిగిన పెరగవచ్చును.  నిజానికి, ఇంకా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈరోజే ( సెప్టెంబర్ 22) ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. 25 వ తేదీ నుంచి నామినేషన్ల ఘట్టం మొదలవుతుంది. 28 వరకు కొనసాగుతుంది. సో అంతవరకు ఎవరు ఏమి చెప్పినా అవ్వన్నీ ఊహాగానాల, వ్యూహాగానాలో కావచ్చును. అసలు కథ ఏమిటన్నది, నామినేషన్లు, స్క్రూటినీ, ఉప సంహరణలు పూర్తయితేనే కానీ తేలదు. అంత వరకు  రేసులో ఎవరున్నారు, ఎవరు లేరు అన్న విషయం చెప్పలేము. అందులోనూ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయవచ్చని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చారు. సో .. మన రేవంత్ రెడ్డో, మన జగ్గా రెడ్డో  ఇంకొక రెడ్డో కూడా బరిలో దిగినా దిగవచ్చును. అయితే ఇప్పడు, ఎవరు బరిలో దిగుతారు,ఎవరు పార్టీ సారధ్య బాధ్యతలు చేపడతారు, అనేది ప్రశ్న కానే కాదు.  ఎన్నికలు అయిపోయిన తర్వాత, నూతన అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత, రాహుల్ గాంధీ, ఏమి చేస్తారు? ఎలాంటి రోల్ ప్లే చేస్తారు? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న కీలక  ప్రశ్న. నిజానికి, రాహుల్ గాంధీ మూడేళ్ళ క్రితం పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కానీ, అధ్యక్షుడిగానే వ్యవహరిస్తున్నారనే విమర్శ వినవస్తూనే వుంది. ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, గులాం నబీ ఆజాద్’ కూడా అదే విమర్శ చేశారు. సోనియా గాంధీ పేరుకు మాత్రమే పార్టీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారని, కీలక నిర్ణయాలన్నీ ఆయన చుట్టూ చేరిన కొద్ది మంది, అనుభవం, అవగాహనా లేని నాయకులూ తీసుకుంటున్నారని ఆరోపించారు. అంతే కాదు, రాహుల్ గాంధీ కోటరీని ఉదీసించి ఆజాద్, తీవ్ర వ్యాఖ్యలే చేశారు. కీలక నిర్ణయాలన్నింటినీ రాహుల్ సెక్యూరిటీ గార్డులు, పీఏలు తీసుకుంటోన్నట్లు కనిపిస్తోందని అన్నారు.  నిజానికి, ఆజాద్ చేసిన ఆరోపణలు నిజం లేక పోలేదని, గత మూడు సంవత్సరాలుగా జరుగుతన్న పరిణామాలను గమనిస్తున్న సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరిస్తున్నారు. పంజాబ్’ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుల మార్పు వంటి కీలక నిర్ణయాలు కూడా, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా తీసుకున్నారని, ఫలితం ఏమిటో ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉందని అంటున్నారు. అలాగే, తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకం విషయంలోనూ ఇలాంటి ఆరోపణలే ఉన్నాయి.  నిజానికి, రాహుల్ గాంధీ డిఫాక్టో అధ్యక్షుడిగా వ్యవహరించడం మాత్రమే కాదు, పార్టీలో కొద్ది మంది సీనియర్ నాయకులు మినహా మిగిలిన చిన్నాపెద్ద నాయక్లులు ,పార్టీ శ్రేణులు రాహుల గాంధీనే, నాయకుడిగా గుర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు. పార్టీ అధినాయకునిగా ఆరాధిస్తున్నారు.అందుకే రాహుల్ గాంధీ బాధ్యతలకు దూరంగా ఉన్నా అధికారాలు మాత్రం ఆయన చేతుల్లోనే ఉన్నాయి. సరే, ఇంతవరకు, సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు కాబట్టి, రాహుల్  గాంధీ, ప్రియాంకా వాద్రా కన్న బిడ్డలుగా ఆమె బాధ్యతలను కొంత పంచుకున్నారు, అనుకోవచ్చును. కానీ, రేపు సోనియా గాంధీ పకక్కు తప్పుకున్న తర్వాత కూడా రాహుల్ గాంధీ ఇదే విధంగా, డిఫ్యాక్టో అధ్యక్షుడిగా, బాధ్యతలు లేని అధికారాలను  చెలాయిస్తారా,?ఇదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న.