టీడీపీ ఆందోళనతో దిగొచ్చిన మోడీ..?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాపై అరుణ్‌జైట్లీ ప్రకటనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే ఇవాళ తెలుగుదేశానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దీంతో కేంద్రంలో కదలిక వచ్చింది..ప్రధాని మోడీతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదాపై చర్చించారు. ప్యాకేజీపై కసరత్తు పూర్తి చేయాలని వెంకయ్యకు ప్రధాని సూచించారు. అలాగే చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీకావాలని అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడును కోరారు.   ప్యాకేజీపై కసరత్తు పూర్తి చేసిన తర్వాత ప్రకటన చేద్దామని వెంకయ్యతో ప్రధాని మోడీ చెప్పినట్లు సమాచారం. అంతకు ముందు ప్రధానితో ఫోన్‌లో మాట్లాడిన వెంకయ్య , తెలుగుదేశంతో దూరం పెరగడం మంచిది కాదని అన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు బీజేపీ స్వయంగా ప్రత్యేకహోదా హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన, అవకాశం ఉన్నంత మేరకు ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చాలని వెంకయ్య, మోడీకి సూచించినట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రత్యేక హోదా సెగ.. ఏపీ బంద్

  ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ మొత్తం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పార్లమెంట్లో ఉభయ సభలు కూడా ఏపీ ప్రత్యేక హోదాపై నిరసనలతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైకాపా రాష్ట్ర బందుకు పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మోసం చేస్తున్నాయని.. బంద్ ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తుందని.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా కావాల్సిందే అని... హోదా సాధించే వరకు పోరాడతామని..  ఇది ప్రజల కోసం, ప్రజల తరఫున తాము చేస్తున్న పోరాటమని ఆయన వెల్లడించారు. ఇప్పటికే తమకు చాలా మంది మద్దతు తెలిపారని అన్నారు.

చంద్రబాబు అలిగితే ఎలా ఉంటుందో తెలుసా.. ఎంపీ

  ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో టీడీపీ ఎంపీలు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని.. ఏపీకి న్యాయం చేయాలని ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలగటమే తెలియని నేతని, ఆయన అలిగిన రోజు బీజేపీ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే టీడీపీకి బీజేపీ మిత్రపక్షమైనప్పటికీ ప్రత్యేక హోదా గురించి పోరాడాల్సి వస్తుంది అని అన్నారు. చంద్రబాబు నాయుడు ధర్మరాజు లాంటి వాడు.. ఆయనకు కోపంకాని.. ఆవేశం కాని అంత త్వరగా రాదు కనుక ఇంకా తలొగ్గి మాట్లాడుతున్నారు.. అలుగుటయే ఎరుగని ఆ అజాతశత్రువు చంద్రబాబునాయుడు.. ఆయన అలిగిన రోజు ఎటువంటి పరిస్థితులు వస్తాయో బీజేపీ వారు అర్థం చేసుకోవాలి" అన్నారు.   ఇప్పటికే రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి దుమారం రేగుతుండగా..ఈరోజు ప్రత్యేక హోదాపై లోక్ సభ మారుమోగిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించి తీరాల్సిందేనని టీడీపీ, వైసీపీ ఎంపీలు దాదాపు గంటసేపు సభను అడ్డుకున్నారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు.

హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం.. బాధితుడితో షూ పాలిష్

  ఉత్తరప్రదేశ్ లోని ఓ హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం బయటపడింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ బాధితుడితో అమానుషంగా ప్రవర్తించాడు. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్లో  ముజఫర్ నగర్ జిల్లాలో ఓ పెద్ద మనిషి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అయితే అంతా విన్న హెడ్ కానిస్టేబుల్.. నీకు న్యాయం చెయ్యాలన్నా, కేసు నమోదు చెయ్యాలన్నా మేము చెప్పిన పని చెయ్యాలంటూ తమాషా చేశాడు. అక్కడితో ఆగకుండా ఆ పెద్ద మనిషితో నా షూ పాలిష్ చెయ్యి అంటూ ఆదేశాలు జారీ చేశాడు. కాళ్లకు మసాజ్ చేయించుకున్నాడు. అయితే ఈ తతంగం అంతా పక్కన ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి.. ఆవీడియో కాస్త సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. దీంతో అసలు విషయం బయటపడింది. దీనిపై స్పందించిన అధికారులు సదరు హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు. 

రాజ్ నాథ్ సింగ్ ను రానియ్యకండి..పాక్ కు హెచ్చరికలు

  ఈనెల 3న పాకిస్తాన్ లో దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి(సార్క్)  సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కూటమికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా హాజరు కానున్నారు. ఈనేపథ్యంలో హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాఉద్దీన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాశ్మీర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు రాజ్ నాథ్ సింగే కారణమని.. ఆయన తన బలగాలను అక్కడికి పంపి  అమాయక ప్ర‌జ‌ల‌పై విరుచుకుప‌డుతూ రక్తపాతాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తిని పాక్ లో అడుగుపెట్టనీయవద్దని.. రాజ్ నాథ్ ను పాక్ ఆహ్వానించడం అంటే కాశ్మీర్ ప్రజలను అవమానించడమేనని సయిద్ అన్నారు. 'భారత్ దాడులను ఒకవైపు ఖండిస్తూనే మరోవైపు ఆ దేశ నేతలను ఆహ్వానించడం విడ్డూరంగా ఉందని' సయిద్ పాక్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.

ఎంపీ చెంప చెళ్లుమనిపించిన లేడీ ఎంపీ.. స‌స్పెండ్ చేసిన జయలలిత

  అన్నాడీఎంకే ఎంపీ శ‌శిక‌ళ డీఎంకే ఎంపీ తిరుచి శివ‌పై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. తమిళనాడు వెళ్లవలసిన ఇద్దరు విమానాశ్రయంలో వెయిట్ చేస్తుండగా.. శశికళ హఠాత్తుగా ఎంపీ శిల దగ్గరకి వెళ్లి అతని చెంప చెళ్లుమనిపించింది. ఇక దీనిపై ఈరోజు రాజ్యసభలో దుమారం రేగింది. ఈ విషయంపై శశికళ మాట్లాడుతూ.. తనకు ప్రాణ హాని ఉందని.. అందుకే తాను తమిళనాడు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. జరిగిన దానికి తాను ఎంపీ శివను క్షమాపణలు కోరారని.. శివ కూడా క్షమాపణలను అంగీకరించారని.. కానీ ఇప్పుడు కొంతమంది తాను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.. తాను మాత్రం రాజీనామా చేసేది లేద‌ని తేల్చిచెప్పారు. మ‌రోవైపు అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత మాత్రం పార్టీకి చెడ్డ పేరు తెచ్చార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఎంపీ శ‌శిక‌ళ‌ను స‌స్పెండ్ చేశారు.

కోహినూర్ ను వెనక్కి తీసుకురండి..

కోహినూర్ వజ్రాన్ని భారత్ కు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట వజ్రాన్ని తీసుకురావడం కుదరదని చేతులెత్తేసిన కేంద్రం.. ఆ తరువాత మాత్రం వజ్రాన్ని భారత్ కు తెప్పించడానికి బాగానే ప్రయత్నాలు చేపట్టింది. అయితే బ్రిటన్ మాత్రం వజ్రాన్ని వెనక్కి ఇచ్చేది లేదని ఎప్పుడో తేల్చిచెప్పింది. అయినప్పటికీ.. కోహినూర్‌పై తమ ప్రయత్నాలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) ప్రధాన కార్యదర్శి హరిచరణ్ సింగ్ వజ్రాన్ని భారత్ తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేయాలని కోరారు. దీనిలో భాగంగానే ఆయన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ తో భేటీ అయ్యారు. కోహినూర్ వెనక్కి తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ అంశంపై వచ్చేనెలలో బ్రిటన్ ప్రభుత్వంతో మాట్లాడుదామని సుష్మ మహేశ్ శర్మకు చెప్పినట్టు తెలుస్తున్నది. విలువైన కోహినూర్ వజ్రాన్ని అప్పగించాలని భారత్‌తో సహా మరో నాలుగు దేశాలు బ్రిటన్‌ను కోరుతున్నాయి.

మాజీ సీఎంలకు సుప్రీం ఝలక్... వెంటనే ఖాళీ చేయండి

మాజీ సీఎంలకు సుప్రీంకోర్టు ఓ ఝలక్ ఇచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు సీఎంలు ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలు, ఇళ్లలో ఉంటారు. అయితే కొంత మంది మాత్రం అధికారం పోయిన తరువాత కూడా అక్కడ ఉంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఓ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తరప్రదేశ్లో ఆరుగురు ముఖ్యమంత్రులు అధికారం కోల్పోయిన తరువాత కూడా ప్రభుత్వ వసతి పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే వారంతా ప్రభుత్వ బంగ్లాలు విడిచిపెట్టాలని..  రెండు నెలల్లో అవి ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. కాగా ప్రభుత్వ వసతి పొందుతున్న వారిలో.. ఎన్డీ తివారీ, కల్యాణ్ సింగ్, మాయావతి, ములాయం సింగ్, రాజ్ నాథ్ సింగ్, రాం నరేష్ యాదవ్ లు ఉన్నారు.

ఏపీ ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీల నిరసన...

  ఏపీ ప్రత్యేక హోదాపై నిరసన సెగలు మొదలయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పకనే చెప్పారు. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఇక బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ కూడా కేంద్రం వ్యవహరించిన తీరుపై మండిపడుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని గట్టిగానే డిమాండ్ చేశారు. ఇక ఈరోజు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేయకపోతే.. మోడల్ బంపరాఫర్..

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ అధ్యక్ష బరిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే డొనాల్డ్ ట్రంప్ కు, హిల్లరీ క్లింటన్ కు మధ్య జరగనుంది. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ మోడల్ ఒక బంపరాఫర్ ప్రకటించింది. ఇంతకీ ఏంటా ఆఫర్ అనుకుంటున్నారా..? జెస్సికా రాబిట్ అనే మోడల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు కనుక ఓటు వేయలేదని స్యాక్ష్యం చూపితే తన నగ్న చిత్రాలను పంపుతానంటూ సంచలన ప్రకటన వెలువరించింది. ఇప్పటికే జెస్సికా రాబిట్  'ట్రాంప్స్ అగనెస్ట్ ట్రంప్' పేరిట ప్రచారం నిర్వహిస్తుంది. అంతేకాదు ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. తనకు ట్రంప్ మద్దతుదారులతో సంబంధాలు ఉన్నాయని.. ఒక్కొక్కటీ నెమ్మదిగా బయటకు వస్తాయని వ్యాఖ్యానించింది. అయితే తనకు ఎంత వరకూ తెలుసో.. లేదో తెలియదు కానీ.. ఇది హిల్లరీ క్లింటక్ ను ప్లస్ పాయింటే అంటున్నారు కొంతమంది. చూద్దాం ఏం బయటపడతాయో..

కాబూల్‌లో విదేశీయుల గెస్ట్‌హౌస్‌పై ఆత్మాహుతి దాడి

ఆఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తెల్లవారుజామున విదేశీయులు ఉంటున్న గెస్ట్‌హౌస్‌పై ట్రక్ బాంబుతో దాడి చేశారు. అమెరికా నిర్వహణలో ఉన్న బగ్రాం ఎయిర్‌‌బేస్‌కు సమీపంలో ఓ హోటల్‌లోకి నార్త్‌గేట్ ద్వారా భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో నిండి ఉన్న ట్రక్‌తో ప్రవేశించి హోటల్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. బాంబు పేలుడు శబ్ధం కిలోమీటర్ల మేర వినిపించింది. చాలా ఇళ్ల కిటికీల అద్దాలు ధ్వంసం కావడం దాడి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ప్రమాదంలో ఎంత మంది చనిపోయారన్న సమాచారం తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు పాల్పడింది తామేనని తాలిబన్ సంస్థ ప్రకటించింది. 

హనీమూన్‌కు వచ్చిన జంటను కంగారుపెట్టిన చిరుత..

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్. ప్రేమికులు, ప్రకృతి ప్రియులకు ఒక అద్భుత విహార కేంద్రం. అలాగే కొత్తగా పెళ్లయిన జంటలకు ఫస్ట్ హనీమూన్ ఛాయిస్. సుమిత్, శివానిలకు కొత్తగా పెళ్లయింది..మ్యారేజ్ వెకేషన్‌ను ఎంజాయ్ చేయడానికి హనీమూన్ స్పాట్‌గా నైనిటాల్‌ను ఎంచుకుంది ఈ జంట. అక్కడున్న వాటిలో మంచి హోటల్ ఒకదాంట్లో గది బుక్ చేసుకున్నారు. అయితే తెల్లవారుజామున ఉన్నట్లుండి పెద్ద శబ్ధం వచ్చింది.   ఏంటా అని చూస్తే..బాత్రూంలో చిరుతపులి..అంతే ఆ జంట పై ప్రాణాలు పైనే పోయాయి. అయితే వీళ్లను చూడగానే మీద పడుతుందేమోనుకుంటే అది మాత్రం భయం భయంగా ఓ మూల నక్కి కూర్చుంది. షాక్ నుంచి తేరుకున్న భర్త బాత్రూం తలుపు గడియ పెట్టి హోటల్ యాజమాన్యానికి విషయం చెప్పాడు. వారు వెంటనే పోలీసులకు ఫోన్ చేయడంతో వాళ్లు అటవీ శాఖాధికారులతో పాటు హోటల్‌కు వచ్చారు. అయితే వారు వచ్చే లోపలే చిరుత ఎలాగోలా పారిపోయింది. చిరుతను చూసి కాస్త భయపడినా దానిని అంత దగ్గర నుంచి చూడగలిగినందుకు చాలా సంతోషంగా ఉందని ఆ జంట చెప్పింది.

స్మగ్లర్లకు సహకరిస్తోన్న పాక్ ఎయిర్‌లైన్స్..

పాకిస్థాన్..కరడు గట్టిన ఉగ్రవాదులకు, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌కు భూతల స్వర్గం. ప్రపంచంలో పేరు మోసిన కిలాడీలంతా ఆ దేశాన్ని ఒక గెస్ట్‌హౌస్‌లాగా వాడుకుంటూ ఉంటారు. ఆ దేశ ప్రభుత్వం అన్ని రకాల రాచమర్యాదలు చేస్తూ వారి సేవలో తరిస్తోంది. ప్రభుత్వమే ఇలా ఉంటే మేమేం తక్కువ తినలేదంటున్నారు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది. విమానాశ్రయాల్లో మాదకద్రవ్యాలు, బంగారం అక్రమ రవాణా తరలించడం అంత సులభమైన పని కాదు. మూడంచెల భద్రతలో ఎక్కడో ఒక చోట దొరికిపోవడం ఖాయం. అయితే ఎయిర్‌లైన్స్ సిబ్బందే అక్రమ రవాణాకు పాల్పడితే..? లాహోర్ నుంచి దుబాయ్ వెళ్తోన్న విమానంలో పెద్ద ఎత్తున మత్తుపదార్ధాలు తరలిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ ఫోర్స్..సదరు విమానం టాయ్‌లెట్‌లో 6 కిలోల హెరాయిన్‌ను గుర్తించింది. దీని విలువ సుమారు ఆరు కోట్లు ఉంటుందని అంచనా. ఈ వ్యవహరంలో ప్రమేయమున్న 12 మంది ఎయిర్‌లైన్స్ సిబ్బందిని అరెస్ట్ చేశారు. 

దోపిడీ, ఆపై తల్లీకూతుళ్లపై గ్యాంగ్ రేప్

ఉత్తరప్రదేశ్‌లో దారుణాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కారులో వెళుతున్న ఓ కుటుంబాన్ని అడ్డగించి, దోపిడీకి పాల్పడి, తల్లీకూతుళ్లపై సామూహికంగా అత్యాచారం చేశారు దోపిడీ దొంగలు. నోయిడాకు చెందిన ఓ కుటుంబం తమ కారులో షాజహాన్‌పూర్‌కి బయలుదేరింది. ఈ క్రమంలో ఢిల్లీ-కాన్పూర్ హైవేపై వెళుతుండగా బులంద్ షహర్ వద్ద గుర్తుతెలియని వస్తువు ఒకటి కారును ఢీకొట్టింది.   దీంతో కంగారుపడ్డ కుటుంబీకులు వాహనాన్ని ఆపి కిందకి దిగారు. అంతే దాదాపు 10 మంది దుండగులు ఒక్కసారిగా మీదపడ్డారు..షాక్‌కు గురైన ఆ కుటుంబం నుంచి డబ్బు, ఆభరణాలను దోచుకున్న దుండగులు కుటుంబానికి చెందిన మగవారిని చెట్లకు కట్టేసి, మహిళను, ఆమె 14 ఏళ్ల కూతురిని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఎలాగోలా కట్లు విడిపించుకుని అక్కడి నుంచి తప్పించుకున్న ఒక కుటుంబసభ్యుడు జరిగిన దారుణాన్ని బులంద్ షహర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోగా దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తల్లీకూతుళ్లను ఆసుపత్రిలో చేర్పించిన పోలీసులు, 15 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ఏపీని ఎందుకు విభజించారు

సస్యశ్యామలంగా..సుభిక్షంగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఎందుకు విభజించారని..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రత్యేకహోదాపై అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలపై ఆయన పార్టీ ఎంపీలు, మంత్రులతో విజయవాడలో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వనరులు లేవని అనుకున్నపుడు విభజనకు ఎందుకు ఒప్పుకున్నారని బాబు బీజేపీని ప్రశ్నించారు.   విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలని బీజేపీ నేతలే పట్టుబడ్డారని...కాంగ్రెస్ ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానంటే..పదేళ్లు కావాలని బీజేపీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉన్నందువల్ల ఆ హామీని నెరవేర్చాలన్నారు. కానీ ఇపుడు ఆర్ధిక సంఘం సిఫార్సులను అడ్డు పెట్టుకుని ప్రత్యేకహోదా ఇవ్వలేమని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ విభజనకు సహకరించిన బీజేపీకి రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత లేదా..? అని చంద్రబాబు ప్రశ్నించారు. రేపు కేంద్ర మంత్రులు, ఎంపీలతో కూడిన ప్రజా ప్రతినిధుల బృందాన్ని ఢిల్లీకి  పంపనున్నామని తెలిపారు.   

ముంబైలో కూలిన భవనం..ఆరుగురు కూలిలు మృతి

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో భవనాలు పేక మెడల్లా కూలిపోతున్నాయి. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబై భివండి ప్రాంతంలోని గాయిబీనగర్‌లో తెల్లవారుజామున రెండంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు దుర్మరణం పాలవ్వగా..20 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. పురాతన భవనం కావడంతో చాలా కాలంగా ప్రమాదకరస్థితిలో ఉందని అధికారులను హెచ్చరించినా వారు పట్టించుకోలేదని బాధితులు తెలిపారు.

పతకాల వేట ప్రారంభించండి

త్వరలో జరిగే రియో ఒలింపిక్స్‌లో ప్రతి అథ్లెట్ తన శక్తి మేరకు రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు భారత ప్రధాని నరేంద్రమోడీ. రియో ఒలింపిక్స్ సందర్భంగా ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ మైదానంలో రియో పరుగును ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 20 వేల మంది విద్యార్ధులు పాల్గొన్నారు. అనంతరం మోడీ మాట్లాడుతూ 119 మంది క్రీడాకారుల బృందాన్ని రియో ఒలింపిక్స్‌కు పంపిస్తున్నామని తెలిపారు. వచ్చే  ఒలింపిక్స్‌కు మరింత పెద్ద బృందాన్ని పంపుతామని వెల్లడించారు. బ్రెజిల్‌లో ఆటగాళ్లకు ఇష్టమైన భారతీయ వంటకాలు సిద్ధం చేయబడ్డాయని, సరైన ఆహారం లభించదన్న ఆందోళన అవసరం లేదని..ఇష్టమైన పదార్థాలు తినవచ్చని, ఆపై కష్టపడి పతకాల వేటలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పరుగు ధ్యాన్‌చంద్ జాతీయ మైదానం నుంచి నెహ్రూ మైదానం వరకు కొనసాగింది.

మోడీ, చంద్రబాబులపై జేసీ సంచలన వ్యాఖ్యలు..

జేసీ దివాకర్ రెడ్డి..ఏ పార్టీలో ఉన్నా, పదవిలో ఉన్నా..లేకపోయినా తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పి ముక్కుసూటి మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తత్వంతోనే చాలాసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు జేసీ. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ, ఏపీ సీఎం చంద్రబాబులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీకి చంద్రబాబు ప్రధాన శత్రువుగా కనబడుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఉద్దేశ్యం బీజేపీకి లేదని అందుకే రూల్స్ పేరు చెప్పి ఆ పార్టీ తప్పించుకుంటోందని ఆరోపించారు. ప్రధానికే గనుక హోదా ఇవ్వాలనే ఉద్దేశ్యం ఉంటే రూల్స్ ఏమీ అడ్డు రావన్నారు. రాబోయే ఎన్నికల్లో మోడీకి ప్రాంతీయ పార్టీల సహకారం అవసరమని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేది చంద్రబాబు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమారేనని చెప్పారు.