సోనియా చొరవతీసుకోవాలి
న్యూఢిల్లీ : తన శరీరంలో ప్రాణం ఉన్నంతవరకూ జన్ లోక్పాల్ బిల్లు కోసం పోరాడతానని అన్నా హజారే స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సీబీఐ లాంటి సంస్థలు అవినీతిని నిరోధించటంలో విఫలం అయ్యాయన్నారు.
ఈనెల 12వ తేదీ నుంచి జైలు భరోకు అన్నాహజారే జాతికి పిలుపునిచ్చారు. అవినీతికి పాల్పడిన మంత్రలెవరైనా జైలుకు వెళ్లారా, ఐఏఎస్ అధికారులు ఎవరైనా ఊచలు లెక్కించారా అని ఆయన ప్రశ్నించారు. లోక్పాల్బిల్లు ఆమోదానికి చొరవ తీసుకోవాలని హజారే యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాయనున్నారు.
కాగా, హజారేకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజ సంఘాలు, విద్యార్థులు మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే చిత్ర కథా నాయకుడు, నిర్మాత డాక్టర్ మంచు మోహన్బాబు అన్నా హజారే దీక్షకు మద్దతుగా గురువారం సాయంత్రం తిరుపతిలో తమ పాఠశాల విద్యార్థులతో శాంతి ర్యాలీ చేపట్టనున్నట్టు చెప్పారు. ఇక నెక్లస్ రోడ్డులో పలు విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రజా సంఘాలు అన్నాకు మద్దతు తెలుపుతున్నాయి. ఆయనకు మద్దతుగా శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీక్షలు చేస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా అన్నా దీక్షకు మద్దతు ప్రకటించారు. మేధాపట్కర్ హైదరాబాదులో జల విహార్ నుండి ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా లోక్సత్తా ఆధ్వర్యంలో సామూహిక సత్యాగ్రహాలు చేపడుతున్నారు. కెబిఆర్ పార్కులో పలువురు వాకర్స్ గాంధీ టోపీలు ధరించి వాకౌట్ చేశారు. ఇక జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పలువురు దీక్ష చేపట్టనున్నారు. కాగా అన్నాహజారేకు మద్దతు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ర్యాలీలు, దీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా దీక్షలు, ర్యాలీలో పాల్గొన్న యువత కేవలం రాజకీయ నాయకులలో మార్పు కోరుకుంటే అది సాధ్యం కాదని, ప్రజలలో కూడా మార్పు రావాలని ఆకాంక్షించారు. అవినీతి రాజకీయ నాయకులను మనమే అందలం ఎక్కిస్తున్నామని వారికి బుద్ది చెప్పాలని అన్నారు. అన్నాహజారే దీక్ష యావద్భారతాన్ని కదిలించిందన్నారు.