తెలుగుదేశంపై మాట్లాడని పురంధేశ్వరి

విజయవాడ: తెలుగుదేశం పార్టీలో అంతర్గత తగాదాలు చోటు చేసుకున్నాయనే వార్తలపై మాట్లాడడానికి కేంద్ర మంత్రి, స్వర్గీయ ఎన్టీ రామారావు కూతురు దగ్గుబాటి పురంధేశ్వరిపై నిరాకరించారు. నారా చంద్రబాబు నాయుడికి, నందమూరి కుటుంబ సభ్యులకు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయనే వార్తలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, తెలుగుదేశం అంతర్గత వ్యవహారాలపై తాను మాట్లాడబోనని ఆమె శనివారం అన్నారు. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కదా అని ఆమె అంటూ వెళ్లిపోయారు. బంధుత్వం వేరు, రాజకీయాలు వేరని ఆమె చెప్పారు. రాజకీయాల కోసం బంధుత్వాలను ఉపయోగించుకునే సంకుచిత మనస్తత్వం తనది కాదని ఆమె అన్నారు. మీ నాన్నగారు స్థాపించిన పార్టీ కదా అని మీడియా ప్రతినిధులు అంటే కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు.

కాంగ్రెసు అంటే వైయస్సార్: వివేకా

కడప: కాంగ్రెసు అంటే వైయస్సార్ అని, వైయస్సార్ అంటే కాంగ్రెసు అని రాష్ట్ర మంత్రి, పులివెందుల నియోజకవర్గం కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు. పులివెందుల శానససభా నియోజక వర్గంలో వైయస్ వివేకానంద రెడ్డి తన వదిన, వైయస్సార్ సతీమణి వైయస్ విజయలక్ష్మిపై పోటీకి దిగుతున్నారు. కాంగ్రెసును, వైయస్సార్‌ను విడివిడిగా చూడలేమని ఆయన అన్నారు. పులివెందులలో తనను గెలిపిస్తే ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయని ఆయన అన్నారు. తనకు ఓటర్ల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. మంత్రి పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని వైయస్ వివేకానంద రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డిని కోరుతున్నారు.

'హజారేకు జగన్ మద్దతు విడ్డూరం'

న్యూఢిల్లీ: అవినీతిపై సమరభేరీ మోగించిన సామాజిక కార్యకర్త అన్నా హజారేకు అవినీతి రారాజులు గాలి జనార్ధన్ రెడ్డి, వైఎస్.జగన్మోహన్ రెడ్డిలు మద్దతు తెలుపడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 16 లేదా 18వ తేదీల్లో కడప లోక్‌సభ ఉప ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి జరుగుతున్నవిగా ఆయన పేర్కొన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకున్న వైఎస్.జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

హరికృష్ణ సంచలన లేఖ

హైదరాబాద్: నందమూరి హరికృష్ణ శనివారం విడుదల చేసిన లేఖ టీడీపీలో కలకలం రేపింది. అన్నాహజారేకు మద్దతుగా చంద్రబాబునాయుడు చేపట్టిన ర్యాలీలో హరికృష్ణ పాల్గొనకుండా అదే సమయంలో ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేయటం చర్చనీయాంశం అయ్యింది. ఆ లేఖలో హరికృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై రాజీలేని పోరాటం చేసిన ఎన్‌టీఆర్ ఆశయాల కోసం త్వరలో మీముందుకు వస్తున్నా ఆశీర్వదించండంటూ హరికృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాల పరిరక్షణ కోసం తాను పోరాడతానని తెలిపారు. కుంట భూమి లేనివారు కూడా కోట్లాది రూపాయలు సంపాదించారని హరికృష్ణ తన లేఖలో వ్యాఖ్యలు చేశారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న ఖాతాలను వెలికి తీయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు ర్యాలీలో హరికృష్ణ అనుచరులు ఈ లేఖ పత్రులను పంచారు.

హజారే విజయానికి సంఘీభావ ర్యాలీ

హైదరాబాద్: అవినీతిపై పోరాటంలో అన్నా హజారే సాధించిన విజయం నేపథ్యంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయాలకు అతీతంగా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సికింద్రాబాద్ రాణీగంజ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. దేశంలో పేదరికానికి అవినీతే మూలకారణమన్నారు. అవినీతిపై ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకే ఈ ర్యాలీ చేపట్టినట్లు బాబు చెప్పారు. జన్ లోక్‌పాల్ పై కేంద్రం తీసుకున్న చర్యలు ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇది ఉద్యమరూపం దాలుస్తుందని చంద్రబాబు అన్నారు. పార్టీలు, జెండాలకు అతీతంగా తెలుగుదేశం ఈ ర్యాలీ చేపట్టింది. ఈ సంఘీభావ ర్యాలీలో పలువురు మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇది ప్రజలందరి విజయం: అన్నా హజారే

న్యూఢిల్లీ: ఇది ప్రజలందరి విజయమనీ, ఈ పోరాటంలో మన పాత్ర ఇక్కడితో ఆగిపోకూడదని అన్నా హజారే అన్నారు. అవినీతి మీద ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. మద్దతుదారులందరి చేతా హజారే దీక్ష విరమింపజేశారు. ఆ తర్వాత తానూ నాలుగు రోజులుగా చేస్తున్న నిరాహార దీక్ష విరమించారు. హజారే దీక్ష సుమారు 96 గంటలపాటు సాగింది. ఆగస్టు 15 లోగా జన్ లోక్‌పాల్ బిల్లును ఆమోదించకపొతే మళ్ళీ ఉద్యమిస్తానని అన్నా హజారే చెప్పారు. జన్ లోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పన కోసం సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రమంత్రి కపిల్ సిబల్ స్వామి సంయుక్త కమిటీ ఏర్పాటుకు కేంద్రం జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రతిని స్వామి అగ్నివేశ్‌కు అందచేశారు. జీవో జారీ చేయటంతో హజారే ఈ సందర్భంగా సోనియాగాంధీ, ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దీక్షా శిబిరం వద్ద సామాజిక కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఇండియా గేటు వద్ద విజయోత్సవ వేడుకలలో పాల్గొనాలని హజారే పిలుపునిచ్చారు. అవినీతి నిర్మూలనకు తాము చేపట్టిన ఈ దీక్ష ఇంతటితో ఆంతం కాలేదని, ఇది ఆరంభం మాత్రమేనని స్వామి అగ్నివేశ్ అన్నారు.

టీఆర్ఎస్‌లో వారసత్వ పోరు

హైదరాబాద్: ఐదు రాష్ట్రాల ఎన్నికలనంతరం జూన్‌లో కేంద్రం తెలంగాణపై ఏదో ఒక ప్రకటన చేస్తుందనే ప్రచారం నేపథ్యంలో గులాబీ గడీలో వారసత్వ పోరు పుంజుకుంది. ఎప్పటికైనా కేసీఆర్ వారసుడు ఆయన కుటుంబం నుంచే వస్తారనేది బహిరంగ రహస్యం. ఆయన కుటుంబం నుంచి ప్రస్తుతం ప్రజా జీవితంలో క్రియాశీలకంగా ఉన్న హరీశ్, కేటీఆర్, కవితలో ఎవరికి వారసత్వం దక్కుతుందనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వీధికెక్కనప్పటికీ, పార్టీలో హరీశ్-కేటీఆర్-కవిత మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు సాగుతోంది. టీఆర్ఎస్ స్థాపించిన కొత్తలో కేసీఆర్.. "నేనూ.. నా భార్య మాత్రమే ఇక్కడ ఉన్నాం. నా కొడుకు, కూతురు అమెరికాలో ఉన్నారు. నాకు ఏ బాదరబందీలేదు. తెలంగాణ వచ్చే వరకు కొట్లాడుతా'' అని చెబుతుండేవారు. అప్పట్లో కేసీఆర్ మేనల్లుడు హరీశ్‌రావు ఆయనకు అన్నీ తానై వ్యవహరించేవారు. 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్.. కాంగ్రెస్-వామపక్షాలతో పొత్తు పెట్టుకొని 26 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాల్లో గెలిచింది. సిద్ధిపేట అసెంబ్లీ, కరీంనగర్ లోక్‌సభ స్థానాల నుంచి గెల్చిన కేసీఆర్.. సిద్ధిపేట స్థానానికి రాజీనామా చేశారు. అక్కడ హరీశ్‌ను నిలబెట్టి గెలిపించారు. తొలిసారి గెలిచిన హరీశ్‌కు మంత్రి పదవి ఇప్పించిన కేసీఆర్.. తన వారసుడు మేనల్లుడేనని చెప్పకనే చెప్పారు. దీంతో పార్టీ శ్రేణుల్లో హరీశ్ గట్టి పట్టు సాధించారు. 2006లో కరీంనగర్ ఉప ఎన్నికతో హరీశ్‌కు పార్టీలో ఎదురుగాలి సన్నగా మొదలైంది. కేటీఆర్, కవిత రంగ ప్రవేశం చేసింది అప్పుడే! ప్రచారంలో పాల్గొన్న వారిద్దరికీ మంచి ఆదరణే లభించింది. వారు అమెరికాను వదిలి ఇక్కడే 'సెటిల్' కానున్నట్లు 2008 ఉప ఎన్నికలకు తేటతెల్లమైంది. 2006 కరీంనగర్ ఉప ఎన్నికలో హరీశ్‌దే హవా అయితే.. 2008 ఉప ఎన్నికలో కేటీఆర్ హవా. 2008లో పోలింగ్‌కు ముందు కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహణలో కేటీఆర్ వైఫల్యాన్ని హరీశ్ సామర్థ్యంతో పోల్చి మరీ కేసీఆర్ చివాట్లు పెట్టారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. అనామకుడైన హరీశ్‌రావు.. కేసీఆర్, పార్టీ పేరు వాడుకొని ఆర్థికంగా ఎదిగారని, ఇప్పుడు పెద్దవాడై తమపైనే పెత్తనం చేయ చూస్తున్నారనే భావన కేటీఆర్‌లో ఉన్నట్లు ఆయన వర్గీయులు చెబుతుంటారు. టీఆర్ఎస్ఎల్పీ నేత ఎన్నిక సహా పార్టీ పదవులన్నింటిలోనూ హరీశ్, కేటీఆర్, కవిత వర్గాలు మొదలయ్యాయని చెబుతారు. ఆర్థిక లావాదేవీలూ హరీశ్, కేటీఆర్, కవిత మధ్య చిచ్చుకు కారణమంటుంటారు. హరీశ్ విషయంలో కేటీఆర్, కవిత ఒక్కటవుతారని ప్రచారం ఉంది. అలాగే.. కేటీఆర్‌కు, కవితకు మధ్య అంశాల వారీ వైరుధ్యాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవితకు రాజకీయాలెందుకనేది కేటీఆర్ అభిప్రాయమని సమాచారం. కేసీఆర్ కుటుంబం తనను కావాలని దూరం చేస్తుందనే భావనలో ఉన్న హరీశ్‌రావు తన దారి తాను చూసుకుంటున్నారని, జనంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తండ్రిలాగే తన వాక్చాతుర్యంతో పార్టీపై పూర్తి పట్టు సాధించే పనిలో కేటీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. కవిత వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ లోక్‌సభ స్థానాల్లో ఏదో ఒక దాని నుంచి పోటీ చేసి.. 'తెలంగాణ కనిమొళి'గా గుర్తింపు పొందాలని ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం ఉంది.  ఈ క్రమంలో ముగ్గురి మధ్య ఆధిపత్య పోరులో చివరికి ఎవరిది పైచేయి? వారసత్వం ఎవరిది? ఇది తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే!

చిరు సినిమాల్లోనే హీరో

హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సినిమాల్లోనే హీరో అని, రాజకీయాల్లో జీరో అని తెలుగుదేశం పార్టీ అధినేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. తమిళనాడులో చిరంజీవి ఎన్నికల ప్రచారం చేపట్టడంపై గాలి స్పందిస్తూ తమిళనాడులో చిరు ప్రచారానికి ఆదరణ ఎక్కడా కనిపించడం లేదన్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే అధికారంలోకి రావడం, కడప ఉప ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని జోస్యం చెప్పారు. ఇకపోతే.. కడప జిల్లాకు చెందిన తమ పార్టీ నేత కందుల బ్రదర్స్‌కు రాజకీయాలు తెలియవన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లకు కన్పించి తర్వాత కనుమరుగయ్యే అలాంటివారు తెదేపాలో ఉన్నా లేకపోయినా ఒక్కటేనన్నారు.

సోనియా ఆదేశాల మేరకే జగన్‌పై కేసు

విజయనగరం: గుట్టు రట్టయింది. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పై హస్తిన స్థాయిలోనే పక్కా స్క్రిప్టు ప్రకారం పకడ్బందీగా కుట్ర జరుగుతోందని ‘అధికారికంగా’ తేలిపోయింది. ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ జగన్‌ కాంగ్రెస్ నుంచి బయటికి రావడం, ఆ వెంటనే ఆయనపై ప్రభుత్వపరంగా, ఇతరత్రా పలు రకాలుగా వేధింపులు మొదలవడం తెలిసిందే. ఇవన్నీ కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్లోనే జరుగుతున్నాయని విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా చేనేత, జౌళి మంత్రి పి.శంకర్రావు చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేశాయి. సోనియాగాంధీ ఆదేశాల మేరకే జగన్‌పై కేసు వేశామని ఏకంగా మీడియా సమావేశంలోనే ఆయన ప్రకటించారు! ముందుగా ఈ విషయాన్ని ప్రస్తావించిన విలేకరులు, కేసు ఎంతవరకు వచ్చిందని అడిగారు. అది కోర్టులో ఉన్నందున వ్యాఖ్యానించబోనని శంకర్రావు చెప్పారు. సోనియాకు తెలిసే కేసు వేశారా అని ప్రశ్నించగా, ఆమె ఆదేశాల మేరకే వేసినట్టు వెల్లడించారు. ‘‘సోనియా గాంధీ విష్ మాపై ఉంది. ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా సంస్థ తదితర అంశాలలో సోనియా విష్ మేరకే జగన్‌పై ఆరోపణలు చేశాం, కేసులూ వేశాం’’ అని స్పష్టంగా చెబుతూ వెళ్లిపోయారు. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు, జగతి ఆస్తులపై పలు ఆరోపణలతో శంకర్రావు హైకోర్టుకు లేఖ రాయడం తెలిసిందే. వీటి వెనక ఉన్నది సాక్షాత్తూ కాంగ్రెస్ అధిష్టానమేనని ఆయన తాజా వ్యాఖ్యలతో నిరూపణ అయింది.

వివాదాల్లోకి లాగొద్దని మీడియాకు బాలయ్యవినతి

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా నందమూరి కుటుంబ సభ్యులు రాజకీయం నడుపుతున్నారనే వార్తలపై హీరో బాలకృష్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తనను అనవసరంగా వివాదాల్లోకి లాగి పార్టీ కార్యకర్తల్లో లేనిపోని సందేహాలు కలుగజేయొద్దని ఆయన అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కొద్ది రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు తనకు బాధ కలిగించాయని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైన ఏ కార్యక్రమంలోనూ తాను భాగస్వామిని కాబోనని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరే

హైదరాబాద్: నటనలో తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వారసుడు ఆయన మనవడైన జూనియర్ ఎన్టీఆరేనని కేంద్ర మంత్రి పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. తన తండ్రి ఎలా సంచలనాలు సృష్టించారో అదేవిధంగా సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ రికార్డులు సృష్టిస్తున్నాడని పొగడ్తల జల్లు కురిపించారు. ఎన్టీఆర్ కుటుంబం అంటే తనకు ఎనలేని ప్రేమాభిమానాలున్నాయని అన్నారు. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులకు తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన చెప్పారు. అయితే కొంతమంది ఎన్టీఆర్ కటుంబసభ్యులను అవసరానికి వాడుకుని ఆ తర్వాత కరివేపాకులా తీసి పారేయడమే బాధ కలిగిస్తోందన్నారు. సినిమాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో మాత్రం ఆచితూచి అడుగులేయాలన్నారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెసు గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

దీక్ష విరమించనున్న అన్నా హజారే

న్యూఢిల్లీ: అవినీతిపై అస్త్రాన్ని ఎక్కుపెట్టిన ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే శనివారం ఉదయం తన దీక్షను విరమించనున్నారు. లోక్‌పాల్ బిల్లు ఏర్పాటుపై ఆయన పెట్టిన అన్ని డిమాండ్లతో కమిటీ ఏర్పాటుకు కేంద్రం మొగ్గు చూపడంతో ఆయన దీక్షను విరమిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతిని అణచడానికి రూపొందిస్తున్న లోక్‌పాల్ బిల్లుపై తాము చేస్తోన్న డిమాండ్లకు కేంద్రం అంగీకరించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అన్నా హజారే ప్రకటించారు. తమ డిమాండ్లకు కేంద్రం తలొగ్గడం ఇది భారత ప్రజల విజయమని పేర్కొన్నారు. కాగా, ఇది చాలా సంతోషకరమైన రోజు.. ఇది ప్రజాస్వామ్యాం విజయం అని కేంద్రమంత్రి కపిల్ సిబాల్ ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల సానుకూలంగా స్పందించి తాను చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను విరమించేందుకు ముందుకు వచ్చిన అన్నా హజారే నిర్ణయాన్ని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ హర్ష వ్యక్తం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. కాగా సంయుక్త కమిటీ ఏర్పాటుకు సంబంధించి శనివారం గెజిట్ విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు.

అవినీతిపై మన్మోహన్ సాకులు

హైదరాబాద్: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సామాజిక కార్యకర్త అన్నా హజారేను కాంగ్రెసు నాయకులు ఎగతాళి చేశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జన్ లోక్‌పాల్ బిల్లు కోసం నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన హజారేను ప్రధాని మన్మోహన్ సింగ్ చర్చలకు ఆహ్వానించి ఉంటే బాగుండేదని, అలా చేయకపోగా కాంగ్రెసు నేతలు హజారేను ఎగతాళి చేస్తూ మాట్లాడారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అవినీతిపై ప్రధాని మన్మోహన్ సింగ్ సాకులు చెబుతున్నారని ఆయన విమర్శించారు. జన్ లోక్‌పాల్ బిల్లుపై కేంద్రం కాలయాపన చేస్తోందని, హజారే దీక్షతోనైనా కేంద్రానికి కనువిప్పు కలగాలని ఆయన అన్నారు. హజారే పెళ్లి కూడా చేసుకోకుండా ప్రజల కోసం బతుకుతున్నాడని ఆయన అన్నారు. అవినీతిని, నల్లధనాన్ని అరికట్టడానికి పకడ్బందీ చట్టాలు లేవని, ఇందుకు పనిచేస్తున్న సంస్థల్లో ప్రభుత్వం నియమించినవారే ఉంటున్నారని, దానివల్ల అవి సమర్థంగా పనిచేయలేకపోతున్నాయని ఆయన అన్నారు.  

హజారే దీక్షకు మెట్టుదిగిన కేంద్రం

న్యూఢిల్లీ: అవినీతిని అడ్డుకోవడానికి జన్‌ లోక్‌పాల్ బిల్లును తీసుకురావాలని గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ సంఘ సంస్కర్త అన్నాహజారే దెబ్బకు కేంద్రం మెట్టు దిగింది. అన్నాహజారే డిమాండ్‌లను ఒప్పుకుంటున్నట్లుగా తెలిపింది. అన్నాహజారే మద్దతుదారుడు స్వామి అగ్నివేష్‌ను చర్చలకు ఆహ్వానించింది. హజారే దీక్ష తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అసోం ఎన్నికలలో ప్రభావం పడుతుందని భావించి దిగివచ్చినట్లుగా తెలుస్తోంది. కాగా లోక్‌పాల్ బిల్లు ప్రతిని స్వామి అగ్నివేష్‌కు కేంద్రం పంపించింది. సాయంత్రం చర్చలకు రమ్మని ఆహ్వానించింది. వచ్చే పార్లమెంటు సమావేశాలలో లోక్‌పాల్ బిల్లును పెట్టడానికి అంగీకరించింది. లోక్‌పాల్ బిల్లుపై జాయింట్ డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పాటుకు సిద్ధమని ప్రకటించింది. కమిటీలో 10 మంది ఉంటారు. అందులో 5గురు సామాజిక, క్రియాశీలక కార్యకర్తలను నియమించేందుకు సిద్ధమని ప్రకటించింది. ప్యానల్ కన్వీనర్‌గా కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఉంటారు. కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలో సమావేశం ఉంటుందని చెప్పారు. ప్రజావాణికి కేంద్రం దిగి వచ్చినప్పటికీ అన్నాహజారే పెట్టిన ఐదు డిమాండ్లలో రెండు డిమాండ్లపై కేంద్రం మాత్రం నోరు మెదపడం లేదని తెలుస్తోంది. అందులో నోటిఫికేషన్ జారీ చేయడం ఒకటి కాగా, చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జెఎస్ వర్మని తీసుకోవాలని రెండు డిమాండ్లపై నోరు మెదపడం లేదు. అయితే అన్ని డిమాండ్లకు కేంద్రం ఒప్పుకోకుంటే దీక్ష విరమించేది లేదని అన్నా చెబుతున్నారు. కేంద్ర ప్రతిపాదనలను అన్నా హజారే తిరస్కరించారు. కాగా అన్నాహజారేతో పాటు దీక్ష చేపట్టిన 15 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఐపీఎల్-4.. ధోనీ వర్సెస్ గంభీర్

చెన్నై: ఈరోజు చెన్నై లోని చెపాక్ స్టేడియంలో భారతదేశం మొత్తం ఎదురుచూస్తున్నటువంటి ఐపిఎల్ ప్రారంభం కాబోతుంది. ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటలకు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్,  కోల్‌కత్తా నైట్ రైడర్స్ తలపడనున్నారు. ఇక డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై.. ధోనీ, రైనా, విజయ్‌, అశ్విన్‌, బద్రీనాథ్‌, అనిరుద్ధ.. అల్బీ మోర్కెల్‌, మైక్‌ హసి, బొలింజర్‌ లాంటి పాత ఆటగాళ్లనే నమ్ముకుని బరిలోకి దిగుతుంటే.. కోల్‌కత మాత్రం దాదాపుగా కొత్త జట్టుతో లీగ్‌లో అడుగుపెడుతోంది. ఫైనల్లో కలిసి పోరాడి, భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన ధోనీ, గంభీర్‌లు.. ఎవరికి వారుగా ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచేందుకు తొలి పోరులో ఢీకొట్టనున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ ప్రారంభానికి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆడిపాడనున్నారు. ఐపీఎల్ గీతానికి కింగ్ ఖాన్ స్టెప్పులేయనున్నాడు. కాగా, ఐపిఎల్ 4వ సీజన్‌లో బిసిసిఐ బిజిగా ఉంది. ఐపిఎల్ 3 జరిగినప్పుడు బిసిసిఐకి కేవలం రూ 450-500 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే వచ్చింది. కానీ ఈసారి ఐపిఎల్ లోకి కొత్తగా రెండు జట్లు వచ్చి చేరడం వల్ల దీని ఆదాయం డబుల్ అయింది. అంటే ఐపిఎల్ 4వల్ల బిసిసిఐకి వచ్చిన లాభం రూ 900కోట్లు. బిసిసిఐ ఆఫీసియల్ కధనం ప్రకారం ప్రస్తుతం ఐపిఎల్ టీమ్ లోకి కొత్తగా వచ్చినటువంటి పూణే వారియర్స్, కొచ్చి టీమ్‌లను ప్రాంచైజీలు రూ 3, 235కోట్లకు కొనడం జరిగింది. ఇక బిసిసిఐ మూడు సంవత్సరాలకు కలిపి మీడియా రైట్స్‌ని నింబస్ టెలివిజన్‌కు గాను రూ 260కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక బ్రాడ్ కాస్టింగ్ రైట్స్, సెంట్రల్ స్పాన్సరింగ్ ద్వారా వచ్చేటటువంటి డబ్బుని పది టీమ్‌లు సమానంగా పంచుకుంటాయి. ఇందులో బిసిసిఐ 20శాతం వాటాని అడిగింది. ఇదిమాత్రమే కాకుండా బిసిసిఐకి మల్టీ స్క్రీన్ మీడియా, సెట్ మాక్స్ టెలివిజన్ సంస్ద దాదాపు రూ 420కోట్లు చెల్లించి బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ తీసుకుంది.

ఎన్టీఆర్ ఫామిలీ కలిసేవుంది

హైదరాబాద్: ఎన్టీఆర్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు శుక్రవారం అన్నారు. నందమూరి కుటుంబానికి, చంద్రబాబునాయుడు కుటుంబం మధ్య పార్టీ అధిపత్యం విషయంలో విభేదాలు వచ్చినట్లు వచ్చిన వార్తలో ఎలాంటి నిజం లేదన్నారు. ఇరు కుటుంబాలు కలిసే ఉన్నాయన్నారు. అందరూ చంద్రబాబుకు మద్దతుగా నిలబడ్డారన్నారు. కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ ఉప ఎన్నికలలో భారీ అక్రమాలకు పాల్పడుతున్నదని అన్నారు.

జగన్ పై మైసూరా ఆరోపణలు

హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి హయాంలో భారీగా అవినీతికి పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థి ఎం.వి.మైసూరా రెడ్డి శుక్రవారం ఆరోపించారు. జగన్ తన అవినీతి సొమ్ముతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారని అన్నారు. జగన్ చేసిన అవినీతి కారణంగా ఆయనకు ఈ ఉప ఎన్నికలలో ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదన్నారు. తాను పోటీ చేస్తున్న కడప పార్లమెంటులో శాసనసభ్యులకు బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. పులివెందుల, కడప రెండింటిలోను తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ నెల 18వ తారీఖున మైసూరా రెడ్డి పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.