'పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే వేటు తప్పదు'
posted on Apr 8, 2011 @ 4:06PM
హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికలు దేనికీ రెఫరెండం కాదని చెప్పారు. ఇన్ని రోజులు వేరు... ఇక ఉపేక్షించేది లేదని ఆయన శుక్రవారం ఇక్కడ అన్నారు. అవసరం అయితే వారిపై అనర్హత వేటు తప్పదని డీఎస్ స్పష్టం చేశారు. కాంగ్రెసు పార్టీ చేసిన అభివృద్ధి పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని చెప్పారు. రెండు నియోజకవర్గాలలోని పార్టీ అభ్యర్థులే గెలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీకి అందరూ విశ్వాసంగా ఉండాలన్నారు. కాంగ్రెసు పార్టీ కొత్తవారికి గాలం వేస్తుందన్న వ్యాఖ్యలను డిఎస్ కొట్టి పారేశారు. కొత్తవారికి గాలాలు వేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. వైయస్ ప్రభావం పార్టీకి అనుకూలంగా ఉంటుందన్నారు. ఉప ఎన్నికలలో ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా పని చేయవద్దని అన్నారు. పార్టీకి నష్టం కలిగించే చర్యలు ఎవరూ పూనుకోవద్దని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్న కాంగ్రెసుకు ప్రజలు పట్టం గడతారని అన్నారు.