రాజకీయం వ్యాపార సామ్రాజ్యంగా మారింది

హైదరాబాద్: రాజకీయం ప్రస్తుతం క్రూరమైన వ్యాపార సామ్రాజ్యంగా మారిందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. రాజకీయ పార్టీలు, ఓటింగ్ శాతం, ప్రజల మనోభావాలు చెప్పుకునేందుకు పార్టీ అనలిస్ట్ అనే వెబ్ సైట్ ని జేపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ కడప ఎన్నికల్లో వంద కోట్ల రూపాయల మేర ఖర్చయ్యే అవకాశం ఉందని చెప్పారు. తమిళనాడులో ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు హక్కు విలువ తెలుసుకోవాలని యువతకు ఆయన సూచించారు. రాజకీయాల్లో నిజాయితీ కొరవడిందని విద్యావేత్త చుక్కారామయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ వ్యాపారాలపై డీఎల్ దృష్టి

కడప: మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలపై దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. కడప జిల్లాలోని జమ్మలమడుగు పోలీసు స్టేషన్‌లో కర్ణాటక మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్‌పై క్రిమినల్ కేసు నమోదయింది. అయితే దానిని మంత్రి డిఎల్ ధృవీకరించారు. అంతేకాదు ఆయన గాలి జనార్ధన్ రెడ్డి, జగన్ వ్యాపారాలపై వ్యాఖ్యలు కూడా చేశారు. బ్రాహ్మిణి స్టీల్స్ విషయంలో యాజమాన్యం ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చిందని ఆరోపించారు. తప్పుడు నివేదికలతో యాక్సిస్ బ్యాంకు నుండి రూ.350 కోట్లు తీసుకున్నారని అన్నారు. రాయల్టీలు చెల్లించకుండా జీరో వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. బ్రాహ్మణితో పాటు భారతీలో కూడా జీరో వ్యాపారం సాగుతుందని ఆరోపించారు. ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు అందించిన కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా వైయస్ బొమ్మ పెట్టుకునే హక్కు కాంగ్రెసు పార్టీకి మాత్రమే ఉందని, జగన్‌కు లేదని డిఎల్ అన్నారు.

ఉప ఎన్నికలకు ప్రాధాన్యం లేదు: బొత్స్త

హైదరాబాద్: కడప, పులివెందుల ఉప ఎన్నికలకు తాము అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో అన్నారు. అయినప్పటికీ ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ తప్పకుండా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలు, సెంటిమెంటు తమకు ప్రధాన అంశం అని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పథకాలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. కాంగ్రెసు ప్రభుత్వంలో వైయస్ పథకాలను ఓటర్లలోకి తీసుకువెళతామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెసును ఓటర్లు గెలిపించాలని కోరారు. కాంగ్రెసును గెలిపించి కాంగ్రెసు, వైయస్ఆర్ పేరును ఓటర్లు నిలబెట్టాలని కోరారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల కోసం ఇంకా నియోజకవర్గాల వారిగా ఇంఛార్జులను నియమించలేదన్నారు. త్వరలో నియామిస్తామని చెప్పారు.

టీటీడీ ఈవోపై నేతల ఆగ్రహం

తిరుపతి: టీటీడీ కార్యనిర్వహణాధికారి కృష్ణారావు నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని తిరుపతి అఖిలపక్షాల నాయకులూ మండిపడుతున్నారు. టీటీడీ పరిపాలన భవనంలో ఎటువంటి నిరసన కార్యక్రమాలు, దీక్షలు చేపట్టరాదని నిషేధం విధించిన నేపథ్యంలో అఖిలపక్ష పార్టీల నాయకులూ ఇవాళ సమావేశమయ్యారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా 13వ తేదీన పరిపాలన భవనం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని అఖిలపక్ష పార్టీలు తీర్మానించాయి. ఏడుకొండలవాడి నిధులను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నారని ఉద్యోగులను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. ఏకపక్ష నిర్ణయాలతో నిత్యం వివాదాలు రేపుతున్నారంటూ ఈవో కృష్ణారావు తీరుపై నాయకులూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హజారేను విభేదించిన రాందేవ్ బాబా

న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లు కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్‌పై సంఘ సంస్కర్త అన్నాహజారేకు, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా మధ్య విభేదాలు కనిపించాయి. లోక్‌పాల్ బిల్లు కోసం అన్నాహజారే ఎన్నుకున్న ఐదుగురు సభ్యులలో శాంతి భూషణ్ ఆయన తనయుడికి ప్యానెల్‌లో చోటు కల్పించడంపై రాందేవ్ బాబా ప్రశ్నించారు. ఒకే కుటుంబం నుండి ఇద్దరి వ్యక్తులకు ప్యానెల్‌లో చోటు కల్పించడంపై రాందేవ్ ప్రశ్నించారు. కాగా రాందేవ్ బాబా వ్యాఖ్యలను అన్నాహజారే ఖండించారు. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నిక జరిగిందని ఆయన చెప్పారు. కాగా ఒకే కుటుంబం నుండి ఇద్దరిని ఎంపిక చేయడంపై మాత్రం స్పందించనట్టుగా సమాచారం.   కాగా, డెకాయిట్ల మాదిరి దోపిడీ చేసిన మంత్రులే జనలోక్'పాల్ బిల్లు కమిటీలో ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. ప్రధాన మంత్రికి కూడా మినహాయింపులేకుండా బిల్లు పరిధిలోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. కమిటీలో అన్ని పార్టీలకు స్థానం కల్పించాలన్నారు. అలా కాకుంటే ఈ కమిటీ వృధా అన్నారు.

ప్రభుత్వానికి జగన్ తో వంద కోట్ల నష్టం

కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయల నష్టమని కడప కాంగ్రెసు పార్లమెంటు అభ్యర్థి, మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ఆదివారం అన్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. ఆయనకు ఎన్నడూ ప్రజా సంక్షేమం, బాగోగులు, అభివృద్ధి పట్టదు అన్నారు. ప్రజా సంక్షేమం ఎన్నడూ పట్టించుకోని వ్యక్తి సువర్ణ పాలన తెస్తానని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. జగన్ రాజీనామా చేసి అనవసరంగా ఉప ఎన్నికల బరువును ప్రజలపై రుద్దారన్నారు. ఆయన చేసిన పని వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు రూ.వంద కోట్లు నష్టమన్నారు.

జగన్ ను హెచ్చరించిన ఉండవల్లి

రాజమండ్రి : మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం నిప్పులు గక్కారు. తన రాజకీయ అవసరాల కోసమే జగన్, ఆయన మద్దతుదారులు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెసు పార్టీని కానీ, సోనియాగాంధీని కానీ విమర్శిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. సోనియాను విమర్శించే ముందు ఇడుపులపాయలో వైయస్ సమాధి వద్ద పుస్తకంలో సోనియా ఏం రాశాలో చదవండి అని సూచించారు. తమ అభిమాన నాయకుడు తనయుడు కాబట్టి ఇన్నాళ్లూ చూస్తూ ఊరుకున్నామని హెచ్చరించారు. వైయస్ పాదయాత్ర చేసినప్పుడు చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు కూడా జగన్ తండ్రిని చూడటానికి రాలేదన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు తండ్రి గురించి మాట్లాడటం ఏమిటని అన్నారు.

నాన్నే చెబుతారు: జూ ఎన్టీఆర్

హైదరాబాద్: నారా - నందమూరి కుటుంబాల మధ్య వచ్చిన విభేదాలపై తాను ఏమీ మాట్లాడనని, తన తండ్రి హరికృష్ణ వాటిపై స్పందిస్తారని ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. విభేదాలపై నాకేమీ తెలియదని నాన్నగారు మాట్లాడుతారని చెప్పారు. రాజకీయాల గురించి తానేమీ మాట్లాడదల్చుకోలేదన్నారు. అయినా వాటిపై తాను స్పందించడానికి ఇది సందర్భము కాదు, వేదిక కాదని చెప్పారు. కాగా నారా - నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు లేవని ఎన్టీఆర్ చెప్పక పోవడం విశేషం. పెళ్లి షాపింగ్ పూర్తయిందని చెప్పారు. పెళ్లికి పట్టుపంచెతో తయారు కావాలని తనకు ఆశగా ఉందని చెప్పారు. అమ్మకు నచ్చినట్టుగా తాను ముస్తాబు అవుతానని చెప్పారు. ప్రణతి ఏ చీరతో వస్తే తనకు అదే ఇష్టమైన కలర్ అని చెప్పారు.

మంత్రులకు ప్రచార బాధ్యతలు

హైదరాబాద్: కడప లోక్'సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలకు నియోజవర్గానికి ఒక మంత్రిని నియమించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఉప ఎన్నిలలో అనుసరించవలసిన వ్యూహంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టేలా మంత్రులకు ఎలా ప్రచారం చేయాలో కిరణ్ కుమార్ కొన్ని సూచనలు  చేశారు.  ప్రచారంలో ఎక్కడా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని విమర్శించవద్దని చెప్పారు. వైయస్ కాంగ్రెసు పార్టీ నేత అన్నారు. వైయస్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలను ఓటర్లలోకి తీసుకు వెళ్లాలని సూచించారు. సోనియాను వైయస్ పొగిడిని సీడీలే ప్రధానం అస్త్రంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉప ఎన్నికలలో తెలంగాణ మంత్రులు కూడా పాల్గొనాలని సూచించారు. ఏడు నియోజకవర్గాలకు ఏడుగురు మంత్రులను ఇంఛార్జులుగా నియమించారు. కపడ నియోజకవర్గానికి మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కమలాపురం నియోజకవర్గానికి మంత్రి రఘువీరారెడ్డి, పులివెందులకు ఆనం రామనారాయణ రెడ్డి, జమ్మలమడుగుకు బొత్స సత్యనారాయణ, బద్వేలుకు మహీధర రెడ్డి, ప్రొద్దుటూరు టిజి వెంకటేష్, మైదుకూరుకు మంత్రి ధర్మాన ప్రసాదరావులను నియమించాలని నిర్ణయించినట్లు తెలిసింది.   కాగా సమావేశం అనంతరం మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ విలేకరులతో మాట్లాడారు. జగన్ కారణంగానే ఎన్నికలు వచ్చాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే ఎన్నికలు వచ్చేలా చేశారన్నారు. వైయస్ బొమ్మను వాడుకునే హక్కు కేవలం కాంగ్రెసు పార్టీకే ఉందన్నారు. వైయస్ కాంగ్రెసు సొత్తు అని అన్నారు. వైయస్ జగన్ పార్టీ సొత్తు కాదన్నారు.

సూర్యుడిని ఆపలేరు

కడప: ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని మాజీ మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని ఆమె అన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ముందు తన నియోజకవర్గంలో మెజార్టీతో గెలిచి, ఆ తరువాత మిగతావారి గురించి మాట్లాడాలని అన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ పేరు ఎత్తే అర్హత డిఎల్ కు లేదని ఆమె అన్నారు. డిఎల్‌కు దమ్ముంటే దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బొమ్మ తన ప్రచారంలో వాడుకోవద్దని చాలెంజ్ చేశారు. తాను సొంతగా గెలిచానంటున్న డిఎల్ వైయస్ ఫోటోను వాడవద్దన్నారు. వైయస్ ఫోటో డిఎల్ వాడితే తరిమి కొట్టాలని ఆమె కడప వోటర్లకు సూచించారు.   కాగా, డీఎల్ మాత్రం మైదుకూరు నియోజకవర్గంలో తాను వైఎస్ఆర్ ప్రాపకంతో గెలవలేదన్నారు. తన ప్రాపకంతోనే తాను గెలిచానన్నారు. ఆదివారం ఖాజీపేటలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడారు. అయితే ఈ సమావేశంలో ఆయన తెలుగుదేశం పార్టీని ఒక్క మాట కూడా అనలేదు.   ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పేదల పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చల్లబసాయిపల్లెలో జరిగిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు నీతికి, అవినీతికి, ధర్మానికి, అధర్మానికి, వైఎస్ఆర్ కు సోనియాకు, కడపకు, ఢిల్లీకి మధ్య జరిగే యుద్ధం అన్నారు. విశ్వసనీయతను పక్కన పెట్టితే తనకు కేంద్ర మంత్రి పదవి వచ్చేదని అలా అయితే ఈ ఉప ఎన్నికలు వచ్చేవి కావన్నారు.

జెండా సరే... అజెండా ఏదీ

హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని  స్థాపించిన జగన్‌ జెండాను ఏర్పాటుచేసుకోగలిగారు కానీ పార్టీ విధివిధానాలను ఇంతవరకు రూపొందించుకోలేని దుస్థితిలో ఉన్నారని పిసిసి విమర్శించింది. విధివిధానాలు కూడా తెలియని స్థితిలో జగన్‌ ఉన్నారని పేర్కొంది. గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పిసిసి అధికార ప్రతినిధి బి.కమలాకర్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీని ఇటలీ కాంగ్రెస్‌ అని వ్యాఖ్యానించడం జగన్‌ అహంకార ధోరణీకి ఆయన అనుభవరాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. బెంగళూరులో వ్యాపారం చేసుకొనే జగన్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఆదరించి టిక్కెటు ఇస్తే ఈ రోజు అదే పార్టీని ఆయన విమర్శిం చేస్థాయికి ఎదిగారని ధ్వజమెత్తారు. విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్‌ కాంగ్రెస్‌ పట్ల ఏమాత్రం విశ్వసనీయతతో వ్యవహరించారో ప్రజలకు తెలుసని చెప్పారు. ఆర్థిక అవినీతిపరులపైనే కాదు రాజకీయ అవినీతిపరులపై చర్యలు తీసుకొనేలా చట్టాలు రావాలని ఆయన ఆకాంక్షించారు.

బాబా కళ్ళు తెరిచారు

పుట్టపర్తి: సత్యసాయి బాబా కళ్ళు తెరిచి చూస్తున్నారని ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని బాబాకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఆదివారం తాజా బులెటిన్ లో పేర్కొన్నారు. బాబా రక్తపోటు సాధారణ స్థాయిలోనే ఉందని వారు పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్ తగ్గిందని, డయాలసిస్ కొనసాగుతోందని తెలిపారు. బాబాకు కామెర్లు వ్యాధి సోకినట్లు వైద్యులు తెలిపారు. దాని వల్ల లివర్ కొంచెం దెబ్బతిందన్నారు. చికిత్స ప్రారంభించినట్లు తెలిపారు. డాక్టర్ నాగేశ్వర రెడ్డి, డాక్టర్ రవిరాజ్ లు బాబా ఆరోగ్యాన్ని పరీక్షించారు. రక్తపోటు మందుల మోతాదు తగ్గించారు. బాబా ఆరోగ్యం గురించి భక్తులు ఆందోళన చెందవలసిన అవసరంలేదన్నారు.

కల్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

భద్రాచలం ‌: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఈ నెల 12న అంగరంగ వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. కల్యాణానికి మరో రెండు రోజులే గడువు ఉండటంతో అప్పడే భక్తుల తాకిడి పెరిగింది. ఒకవైపు పుష్కర పట్టాభిషేకంలో భాగంగా శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి, అహోబిల రామానుజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో శ్రీ రామాయణ మహా క్రతువు జరుగుతోంది. అంతే కాకుండా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు భద్రాద్రికి తరలివస్తున్నారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామిని కనులారా వీక్షించేందుకు భక్తులు ఈ ఏడాది ముందుగానే చేరుకుంటున్నారు. ఈ నెల 12న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి, 13న గవర్నర్‌ నర్సింహన్‌ రానుండటంతో పోలీస్‌ ఉన్నతాధికారులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. వీరితో పాటు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు రానుండటంతో జిల్లా ఎస్పీ క్రాంతి రాణా టాటా ఆధ్వర్యంలో 3 వేల పోలీస్‌ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.

అవినీతిపై నారాయణ పోరాటం

విజయవాడ: సిపిఐ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు 17వ వర్థంతి సందర్భంగా అవినీతికి వ్యతిరేకంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ విజయవాడలో 48 గంటల నిరాహార దీక్షను శనివారం చేపట్టారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నారాయణ దీక్షను విజయవాడ తొలి మేయర్‌ టి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. నారాయణ చేపట్టిన దీక్ష ఆదివారానికి రెండవరోజుకు చేరుకుంది. శిబిరంలో నారాయణతో పాటు పలువురు సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న ఉదయం పదిగంటలకు ప్రారంభమైన దీక్ష సోమవారం ఉదయం పదిగంటలవరకు అంతే 48 గంటలపాటు కొనసాగనుంది. పలువురు రాజకీయ పార్టీ నాయకులూ దీక్ష ప్రాంగణానికి వచ్చి నారాయణకు మద్దతు తెలుపుతున్నారు. నారాయణ మీడియాతో మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తిమంతంగా మెలిగిన విషయాన్ని గుర్తు చేశారు. అవినీతిపై నిరంతర పోరాటం కొనసాగాల్సిందేనన్నారు. దేశంలో అన్ని విభాగాల్లోనూ అవినీతి ఎక్కువైందన్నారు. 'జన లోక్‌పాల్‌ బిల్లు' పెట్టినంత మాత్రాన అవినీతి అంతం కాదనీ, దాన్ని సమర్థవంతంగా అమలు చేయించేందుకు నిత్యం పోరాటాలు కొనసాగాల్సిందేననీ చెప్పారు. 2జి స్పెక్ట్రం, కామన్వెల్త్‌ క్రీడలు, ఆదర్శ హౌసింగ్‌ ఇలా చెప్పుకుంటూ పోతే అవినీతికి అంతే లేకుండా పోతోందన్నారు. ఈ నేపథ్యంలో అన్నిస్థాయిల్లోనూ అవినీతి వ్యతిరేక పోరాటాలు సాగినప్పుడే అవినీతి అంతమవుతుందన్నారు.

ఎట్టకేలకు నిజం ఒప్పేసుకున్న చిరంజీవి

తమిళనాడు: పీఆర్‌పీ అధ్యక్షుడు, సినీనటుడు చిరంజీవి ఎట్టకేలకు నిజాన్ని ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ (ప్రజారాజ్యం) రెండు బలమైన పార్టీల మధ్య చిక్కి నలిగిపోయిందనే నిజాన్ని ఆయన అంగీకరించారు. కాంగ్రెస్, టీడీపీ లను ఉద్దేశించి ఆయన ఆవిధంగా అన్నట్లుగా తెలుస్తోంది. హోసూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కె.గోపినాథ్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో 33 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులున్నా రాష్ట్రాభివృద్ధికి ఏవిధమైన కృషి చేయడం లేదని మండిపడ్డారు. తమిళనాడు ఎంపీలు మాత్రం వారి రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేశారని కొనియాడారు.

రాజీనామాను ఆమోదింపచేసుకున్న వివేకా

హైదరాబాద్: రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి వైఎస్.వివేకానంద రెడ్డి రాజీనామాపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదముద్ర వేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్‌కు పంపించారు. అదేవిధంగా కడప జిల్లాకు చెందిన పార్టీ ఇన్‌ఛార్జులు, మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. కడప, పులివెందుల స్థానాలకు వచ్చే నెల ఎనిమిదో తేదీన ఉప ఎన్నికలు జరుగనున్న విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో భాగంగా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్.వివేకానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేకేఆర్ తిరస్కరించారు. అయితే, వైఎస్.వివేకానంద రెడ్డి మాత్రం ఏమాత్రం పట్టువీడకుండా తన రాజీనామాను ఆమోదించాల్సిందేనని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం వివేకా రాజీనామాపై ఆమోదముద్ర వేశారు. రాజీనామా ఆమోదంతో వైఎస్.వివేకా ఇకపై ఉప ఎన్నికల ప్రచారంలో మరింతగా నిమగ్నం కానున్నారు.

ఎన్టీఆర్ ఆశయాలను పురంధేశ్వరి మరిచారు

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీపై వ్యాఖ్యానించిన కాంగ్రెసు నాయకురాలు, కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిపై తెలుగుదేశం సీనియర్ నాయకుడు కె. ఎర్రన్నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీపై మాట్లాడే హక్కు పురంధేశ్వరికి లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎన్టీ రామారావు ఆశయాలకు అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ నడుస్తోందని, ఎన్టీ రామారావు ఆశయాలను మరిచిపోయి పురంధేశ్వరి కాంగ్రెసు పార్టీలో కొనసాగుతున్నారని ఆయన అన్నారు. పురంధేశ్వరి కాంగ్రెసులో చేరి నాన్నగారి ఆశయాలకు తిలోదకాలిచ్చారని ఆయన విమర్శించారు. పురంధేశ్వరి మూడు పార్టీలు మారారని ఆయన అన్నారు. ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ కుట్ర చేసి నాదెండ్ల భాస్కరరావును ప్రయోగించిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ కుట్రలకూ కుతంత్రాలకూ నిలయమని, అటువంటి పార్టీలో పురంధేశ్వరి ఉన్నారని ఆయన అన్నారు. మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.