ఆ తర్వాతే నామినేషన్: వివేకా
posted on Apr 7, 2011 @ 2:56PM
కడప: మంత్రి పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదిస్తేనే పులివెందుల శాసనసభా స్థానానికి కాంగ్రెసు అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డి నామినేషన్ వేస్తారనే మాట వినిపిస్తోంది. రాజీనామాను ఆమోదించిన తర్వాతనే వైయస్ వివేకానంద రెడ్డి పులివెందుల స్థానానికి వివేకానంద రెడ్డి నామినేషన్ వేస్తారని కడప జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు అశోక్ బాబు గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పులివెందుల నుంచి విజయం సాధించిన తర్వాత వివేకానంద రెడ్డి మంత్రి పదవి స్వీకరిస్తారని ఆయన అన్నారు. కాగా, తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు వివేకానంద రెడ్డిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. మంత్రిగా కొనసాగుతూ పులివెందులలో వైయస్ వివేకానంద రెడ్డి పోటీ చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు. పులివెందులలో ఓడిపోతే మండలి పదవి ఇచ్చి మంత్రిగా కొనసాగిస్తామని వైయస్ వివేకానంద రెడ్డికి కాంగ్రెసు నాయకత్వం హామీ ఇచ్చిందని, అందుకే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయడం లేదని ఆయన అన్నారు.