కన్నులపండువగా సీతారాముల కల్యాణం
posted on Apr 12, 2011 @ 12:28PM
భద్రాచలం: భూలోక వైకుంఠమైన భద్రాచలంలో మంగళవారం శ్రీసీతారామచంద్రస్వాముల వారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామాలయ సమీపంలోని మిథిలా స్టేడియంలో సరిగ్గా మధ్యాహ్నం 12.గంటలకు ఆగమ శాస్త్ర ప్రకారం అభిజిత్ లగ్నంలో సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం ఉంచారు. ఆతర్వాత రామదాసు చేయించిన తాళిబొట్టుతో కూడిన మంగళ సూత్రాన్ని రాముని తరపున అర్చకులు సీతమ్మకు అలంకరించారు. అనంతరం సీతమ్మ, రామయ్యల తలంబ్రాల వేడుక జరిగింది. ఈ వేడుకను కన్నులారా తిలకించి తరించేందుకు దేశనలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో భద్రాచలం పట్టణంలోని వీధులన్నీ జనసంద్రమయ్యాయి. 12సంవత్సరాలకో మారు జరిగే పుష్కర పట్టాభిషేకాన్ని కూడా తిలకించాలనే తలంపుతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, రెండు గంటలకు తిరువారాధన, నాలుగు గంటలకు అభిషేకరం నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు దేవాలయంలోని ధ్రువ మూర్తుల కళ్యాణం, తొమ్మిది గంటలకు అలంకారం చేశారు. తొమ్మిదిన్నర గంటలకు మూర్తులను ఊరేగింపుగా మంటపానికి తెచ్చారు. సరిగ్గా పన్నిండు గంటలకు కళ్యాణం జరిగింది. రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు వాహన సేవలో భాగంగా చంద్రప్రభ వాహనంపై స్వామివారికి తిరువీధీ సేవ నిర్వహిస్తారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున ఆయన భద్రాద్రి రాముడికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు.