జగన్ పరామర్శ అయినా, పలకరింపైనా రాజకీయ ప్రయోజనం ఉంటేనే?

నువ్వు మా ఇంటి కొస్తే ఏం తెస్తావ్.. నేను మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్ అన్న రీతిలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ తీరు ఉంటుంది. తాజాగా ఆయన గురువారం (జనవరి 4) హైదరాబాద్ వెళ్లి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను కలవడం కూడా ఆ కోవలోకే వస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కానీ, ఆయన తన ఫామ్ హౌస్ లో జారి పడి తుంటి ఎముక మార్పిడి చికిత్స చేయించుకున్నప్పుకు కానీ కనీసం పరామర్శించని జగన్ ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన దాదాపు 20 రోజుల తరువాత, అదీ తన సోదరి షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తరువాత హడావుడిగా కేసీఆర్ వద్దకు వెళ్లారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ప్రభావం ఏపీలో ఏ మేరకు ఉంటుంది? తాను భావించినట్లు కేవలం సిట్టింగులను మార్చక పోవడం వల్లే కేసీఆర్ పార్టీ అక్కడ ఓటమి పాలయ్యిందా? తదితర అంశాలన్నీ బేరీజు వేసుకుని, తన రాజకీయ గురువుగా భావించే కేసీఆర్ నుంచి ఏపీలో ఓటమిని తప్పించుకోవడానకి ఏం చేయాలన్న దానిపై సలహాలూ, సూచనలూ తీసుకునేందుకు మాత్రమే పరామర్శ పేరుతో జగన్ హైదరాబాద్ ప్రయాణం పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   మామూలుగా అయితే  జగన్ హైదరాబాద్ వెళ్లి కేసీఆర్ ను పరామర్శించి ఉంటే అదేం పెద్దగా చెప్పుకోవలసిన అవసరం కాదు. కానీ ఇరువురూ పరస్పరం రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరికొకరు చేసుకున్న సహాయం, అందించుకున్న సహకారం నేపథ్యంలో ఈ పరామర్శ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.    2019 ఎన్నికల సమయంలో ఏపీలో జగన్ విజయం కోసం కేసీఆర్ చేసిన సహాయం, అందించిన తోడ్పాటు తెలియంది కాదు. అదే విధంగా ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కష్ట కాలంలో ఉన్న కేసీఆర్ ను ఆయన పార్టీనీ ఆదుకునేందుకు నాగార్జునసాగర్ డ్యాం వద్ద జగన్ సృష్టించిన హైడ్రామా కూడా తెలిసిందే.   సాగర్ డ్యామ్ వద్ద హంగామా సృష్టించి  తెలంగాణ సెంటిమెంట్ రగిలించి తద్వారా ఆ ఎన్నికలలో కేసీఆర్ పార్టీ లబ్ధి పొందేందుకు జగన్ తన శాయశక్తులా కృషి చేశారు.  ఇక ఇప్పుడు  కేసీఆర్ గాయపడి శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చేసిన 20 రోజుల తరువాత జగన్ పరామర్శ పేరుతో ఆయనను కలిసింది.. త్వరలో జరగనున్న ఏపీ ఎన్నికలలో  గెలుపు మార్గాల అన్వేషణలో తోడ్పాటు కోరేందుకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ పరామర్శ ప్రభావం ఏమిటన్నది త్వరలో బహిర్గతం కాకమానదని అంటున్నారు. 

జగన్ పాలన చూసేశారుగా.. ఇక డెసీషన్ ప్రజలదే!

ఏపీలో ఎన్నికల ఏర్పాట్లు మొదలైపోయాయి.  ఫిబ్రవరి నెలలో ఎన్నికల నోటిఫికేషన్ , మార్చి మొదటి వారంలో ఎన్నికలు జరిపే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు  ఎన్నికల సన్నాహాలు మొదలు పెట్టేశాయి. ఇప్పటికే అధికార  వైసీపీ వరసగా అభ్యర్థుల జాబితా లు ప్రకటించేస్తున్నది.  వైసీపీ అభ్యర్థులను బేరీజు వేసుకొని ప్రతిపక్ష టీడీపీ, జనసేన  కూటమి కూడా అభ్యర్థుల ప్రకటనకు రెడీ అవుతోంది.  కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో మళ్ళీ పుంజుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. ఇప్పటికే సీఎం జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. త్వరలోనే ఆమె ఏపీలో కాంగ్రెస్ నేతగా చురుకుగా వ్యవహరించనున్నారు. ఎవరికి వారు గెలుపు అవకాశాల వేటలో ఉన్నారు.  అసంతృప్తి పేరిట వైసీపీ సిట్టింగ్ అభ్యర్థులను భారీగా మార్చేస్తున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ అభ్యర్థులతో పాటు పార్లమెంట్ అభ్యర్థులను మార్చేస్తూ జగన్ మొండిగా దూకుడు మీదున్నారు. అయితే  వైసీపీ, టీడీపీలో ఈసారి విజయం ఎవరిది అంటే ఇప్పటికే ప్రజల అభిప్రాయాల ఆధారంగా ఎన్నో సర్వేలు తేల్చేశాయి. ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ విజయం  ఖాయమని సర్వేలు తేల్చేయగా.. జనసేన కలిస్తే వైసీపీకి ఘోర ఓటమి తప్పదని కుండబద్దలు కొట్టేశాయి. అయితే, మరోసారి అధికారం మాదే అంటూ వైసీపీ   మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. ఈలోగా షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంతో వైసీపీకి ఇక గెలుపు తలుపులు పూర్తిగా మూసుకుపోయాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే, వైసీపీపై అసలు ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఎలా , ఎందుకు మూటగట్టుకుందో చెప్పేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది గత చంద్రబాబు ప్రభుత్వంతో జగన్ ప్రభుత్వ పాలనకు పోలిక. తె లంగాణలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొమ్మిదేళ్లు కేసీఆర్ పాలించారు. దీంతో ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. దాన్ని కాంగ్రెస్ చాకచక్యంగా అనుకూలంగా మలచుకుని అధికారం దక్కించుకుంది. కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో  విభజన తరువాత ఏపీ ప్రజలు చూడలేదు. కానీ కేసీఆర్ పాలన పట్ల ప్రజా వ్యతిరేకత కారణంగానే  కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కిందని మాత్రం అర్ధం అవుతుంది. అయితే, ఏపీలో  మాత్రం జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్ పై సానుకూలతగా మారే పరిస్థితి లేదు. రాష్ట్ర విభజన అనంతరం గత పదేళ్లలో ఏపీ ప్రజలు రెండు ప్రధాన పార్టీలకు చెరొక అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం, వైసీపీ.. ఇలా రెండు ప్రభుత్వాల పాలననూ   ప్రజలు చూశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలన ఎలా ఉంది,  జగన్   పనితీరు ఎలా ఉందన్నది  కళ్లారా చూశారు. దీంతో ఈసారి అధికారం ఎవరికి ఇవ్వాలి..  సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలన్న విషయంలో  ప్రజలు ఇప్పటికే స్పష్టమైన నిర్ణయంతో ఉండే అవకాశం ఉంది.  ఐదేళ్లు చంద్రబాబు, ఐదేళ్లు జగన్ పాలన చూశారు కనుక  ఇప్పుడు ఇద్దరిలో ఎవరు కావాలో  తేల్చుకోవలసింది ప్రజలే. అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం,  ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమలు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు.. వాటిని ఖర్చు చేసే ఆవశ్యకత,  విద్యా, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత ఇలా ఎన్నో అంశాలలో రెండు ప్రభుత్వాల మధ్య పనితీరును బేరీజు వేసుకొనే అవకాశం ఏపీ ప్రజలకు ఉంది.   అయితే, ఇలా గత పదేళ్లలో చంద్రబాబు, జగన్ పాలనను పోల్చి లెక్కలేస్తే చంద్రబాబు విజయం నల్లేరు మీద నడకే అనిపించ కమానదు. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తే.. జగన్ ఆ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు హయంలో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తే జగన్ అసలు ఆ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నిధులు, అప్పుల విషయంలో జగన్ ఆర్ధిక  అరాచకత్వం కారణంగా పన్నుల రూపంలో ప్రజలపై విపరీతమైన పన్నుల భారం పడింది. చంద్రబాబు ఇతర దేశాలలో ఉన్న వారిని కూడా రాష్ట్రానికి రప్పించి ఉపాధి పెంచేందుకు కృషి చేస్తే.. జగన్ హయంలో ఏపీ ప్రజలకు ఉపాధి కరువై వలసలు పెరిగిపోయాయి. నేరాలు-ఘోరాలలో జగన్ పాలన కొత్త రికార్డులు సృష్టించింది.  ఏకంగా దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని వెంటపెట్టుకొని తిరగడంతో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. విద్య, వైద్యంలో హంగు, ఆర్భాటాలు తప్ప జగన్ సాధించేదేమీ లేదు. ఇలా ఎలా చూసినా చంద్రబాబు పాలన వెయ్యి రెట్లు మేలు అనేలా జగన్ పాలన సాగింది. దీంతో ప్రజలు ఇప్పటికే వచ్చే ఎన్నికలలో ఎవరికి ఓటు వేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు. ప్రజల ఆ నిర్ణయమే సర్వే ఫలితాలలో వెల్లడైంది. 

దారీ తెన్నూ లేని బీజేపీ.. రాష్ట్రంపై కమలం హైకమాండ్ లోనూ అయోమయం?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఒక దారీ తెన్నూ ఉన్నట్లు కనిపించడం లేదు. గత నాలుగున్నరేళ్లుగా, ఆ మాటకొస్తే 2019 ఎన్నికలకు ముందు నుంచీ కూడా అంటే తెలుగుదేశం ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన క్షణం నుంచీ కమల నాథులు రాష్ట్రంలో వైసీపీతోనూ, ఆ పార్టీ అధినేత జగన్ తోనూ బహిరంగంగానే రహస్య మైత్రి కొనసాగిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీని బలహీనం చేయడం అన్నది ఒక్కటే ఎజెండాగా ఆ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలను బలి చేసి మరీ రాజకీయం చేసింది. 2019 ఎన్నికలలో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి తన వంతు సహకారం అందించింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో తన విధానాలతో, వ్యవహారశైలితో తన ప్రతిష్టనే కాకుండా, తనకు అండదండగా నిలిచిన బీజేపీ ప్రతిష్టనూ మంటగలిపేశారు. ఆ విషయాన్ని ఒకింత ఆలస్యంగానైనా బీజేపీ అధిష్ఠానం గుర్తించింది. అయినా జగన్ తోనే రాష్ట్రంలో తన భవిష్యత్ అని భావిస్తూ, భ్రమిస్తూ..జగన్ కు సహకారం కొనసాగిస్తూ వచ్చింది. అడ్డగోలు అప్పులకు అంతే అడ్డగోలుగా అనుమతులిస్తూ, కేంద్ర పథకాలకు జగన్ తన ఫొటోలు పెట్టుకుని సొంత వ్యవహారంగా బిల్డప్ ఇచ్చినా చూసిచూడనట్లు వ్యవహరిస్తూ వచ్చింది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి కన్నాను తప్పించి సోము వీర్రాజుకు బాధ్యతలు కట్టబెట్టినప్పటి నుంచీ రాష్ట్రంలో బీజేపీ, వైసీసీ వేరువేరు కాదన్న భావన  వచ్చేలా ఆ రెండు పార్టీల బంధం పెనవేసుకుంది.   దీంతో అప్పట్లో బీజేపీ అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎందుకు ఎదగడం లేదు. ఏపీలో బీజేపీ అడుగు పెందుకు కదలడం లేదు?  రాష్ట్రంలో బీజేపీ ప్రజలకు ఎందుకు దూరం అయ్యింది. ఏ వర్గం ప్రజలనూ  ఎందుకు  ఆకట్టుకోలేక పోతోంది? దేశమంతా మోడీ.. మోడీ అంటున్నా.. ఏపీలో మాత్రం పార్టీనీ, మోడీనీ ఎందుకు ఛీ కొడుతున్నారు? అంటున్నా ఏపీలో మాత్రం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా, పార్టీ ఎందుకు పడకేసింది? ఎందుకు పార్టీలో ఏ ఇద్దరు నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేకుండా పోయింది? రాష్ట్ర  అధ్యక్షునిగా .. మీ సంజాయిషీ సమాధానం  ఏమిటి?  అని ప్రశ్నిస్తే అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు  ఆడ లేక మద్దెల ఓడన్న సామెతను గుర్తుకు తెచ్చేలా  ఓ పొడుగాటి లేఖ రాశారు. ఆ లేఖలో  తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తమను ఎదగ నీయడం లేదనీ, అడుగడుగునా అడ్డు పడుతున్నారనీ వాపోయారు.  అప్పుడే కాదు.. ఇప్పుడు సోము వీర్రాజు స్థానంలో పార్టీ రాష్ట్ర సారథ్య బాధ్యతలు దగ్గుబాటి పురంధేశ్వరి చేపట్టిన తరువాత కూడా ఏపీలో బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు  రెండడుగులు వెనక్కు చందంగానే ఉంది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత పురంధేశ్వరి జగన్ సర్కార్ పై విమర్శల దాడిని రోజు రోజుకూ ఉధృతం చేస్తూ, ఏపీలో బీజేపీ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందన్న అభిప్రాయం జనసామాన్యంలో కలిగేలా చేయడంలో ఫుల్ గా సక్సెస్ అయ్యారు. అయితే అదే సమయంలో కొందరు నేతల తీరు కారణంగా ఏపీలో బీజేపీ ఎటు? ఆ పార్టీ వైఖరి ఏమిటి? అన్న విషయంలో అనుమానాలూ, సందేహాలూ మాత్రం అలాగే ఉండిపోయాయి.  తాజాగా గురువారం (జనవరి 4)న జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో మెజారిటీ నేతలు తెలుగుదేశం, జనసేనతో కలిసే వచ్చే ఎన్నికలలో పోటీకి దిగాలని నిర్ద్వంద్వంగా చెప్పేశారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ మద్దతు దారులు కూడా తమ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు తెలుగుదేశం పార్టీకి వేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అంటే వచ్చే ఎన్నికలలో సైతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకే వెళుతుందని కుండబద్దలు కొట్టారు. ఈ పరిస్థితుల్లో కూడా పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఈ మాత్రం ఉనికి కూడా బీజేపీ రాష్ట్రంలో కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనలకు వచ్చిన సందర్భాలలో ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి వెళ్లడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఏపీలో బీజేపీ, వైసీపీ ఒక్కటే అన్న భావన పోయేలా పార్టీ కార్యాచరణ ఉండాలని మెజారిటీ   నేతలకు అభిప్రాయపడ్డారు. స్కిల్ కేసులో చంద్రబాబును జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో మెజారిటీ ప్రజలు బీజేపీని అనుమానించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగుదేశం, జనసేనతో పొత్తుకు వెడితేనే రాష్ట్రంలో బీజేపీ బతికి బట్టకడుతుందనీ, అంతకంటే ముందు రాష్ట్ర రాజధాని అమరావతేనని ప్రకటించాలనీ సూచించారు.    సింగిల్ గా వెళ్తే బీజేపీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదనీ, గెలవడం మాట అటుంచి కనీసం డిపాజిట్లు కూడా రావనీ కుండబద్దలు కొట్టారు.  అయితే ఈ సమావేశం తరువాత పార్టీ నేత సత్యకుమార్ మాత్రం మీడియా ముందు డాంబికాలు పోయారు.  రాష్ట్రంలో ఒక్క శాతం ఓటు స్టేక్ కూడా లేని బీజేపీతో ఎవరైనా పొత్తు పెట్టుకోవాలంటే ప్రతిపాదన వారి నుంచే రావాలన్నారు. ముందుగా తెలుగుదేశం పొత్తు ప్రతిపాదనతో వస్తే అప్పుడు ఆలోచిస్తామన్నట్లుగా ఆయన మాట్లాడారు.  ఇటువంటి వైఖరితోనే బీజేపీ ఏపీలో ఇప్పటికీ వైసీపీతోనే అంటకాగుతోందన్న అభిప్రయాం ప్రజలలో బలంగా నాటుకుపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ వైఖరి ఏమిటి?  పొత్తు విషయంలో ఆ పార్టీ నిర్ణయం ఏమిటి అన్న విషయంలో అయోమయం అలాగే కొనసాగుతోంది. 

ఇక వార్ వన్ సైడే.. పని మొదలెట్టేసిన కేశినేని చిన్ని!

కేశినేని బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ కు చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టేశారు. పార్టీ ఎవరికి మద్దతుగా నిలుస్తుందన్నది చెప్పేశారు. దీంతో తిరువూరు సభ ఏర్పాట్ల బాధ్యతలు చేపట్టిన కేశినేని చిన్ని పని మొదలెట్టేశారు.  తిరువురూలో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్ల బాధ్యతను పార్టీ ఇలా అప్పగించిందో లేదో అలా కార్యాచరణ ప్రారంభించేశారు. పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తూ లేఖ రాశారు.  విషయమేంటంటే.. గత కొంత కాలంగా పార్టీకి తలనొప్పిగా మారిన విజయవాడ ఎంపీ కేశినేనిని పార్టీ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దనీ, వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వడం లేదనీ చంద్రబాబు విస్పష్టంగా తేల్చేశారు. ఆ విషయాన్ని కేశినేని నానికి పార్టీ పెద్దలను పంపి వారి ద్వారా తెలియజేశారు. చంద్రబాబు సందేశాన్ని మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆయన నివాసానికి వెళ్లి మరీ తెలియజేశారు. అలాగే ఈ నెల 7న తిరువూరులో జరగనున్న చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్ల బాధ్యతను కేశినేని చిన్నికి అప్పగించినట్లు స్పష్టం చేశారు.   అయితే కేశినేని నానికి ఈ విధంగా స్పష్టమైన సందేశం అందించడానికి ముందు పార్టీ అధినేత ఆయనకు చాలా అవకాశాలు ఇచ్చారు. వాస్తవానికి 2019 ఎన్నికలలో విజయవాడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచిన నాటి నుంచే ఆయన శైలి వివాదాస్పదంగా మారింది. తరచూ పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ కంటే తానే మిన్న అన్నట్లుగా ఆయన తీరు ఉంది. పార్టీ అధినేతపైనే పలు సందర్భాలలో విమర్శలు చేశారు. అయినా చంద్రబాబు తొలి నుంచీ పార్టీలో ఉన్న వ్యక్తి అన్న ఉద్దేశంతో ఆయనపై చర్య తీసుకోకుండా సముదాయించేందుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.   అయితే  తాజాగా తిరువూరులో చంద్రబాబు సభ ఏర్పాట్ల సన్నాహాక సమావేశానికి అనుచరులతో కలిసి వచ్చి రచ్చ రచ్చ చేశారు. కేశినేని నాని సోదరుడు కేశినేని సోదరుడు శివనాథ్  అలియాస్ చిన్ని పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అయితే కేశినేని నాని బ్రదర్స్ మధ్య ఎప్పటి నుంచో సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో పార్టీలో చిన్ని చురుకుగా వ్యవహరించడాన్ని సహించలేని నాని   తిరువూరు సభ సన్నాహక సమావేశంలో  రభస సృష్టించారు. దీంతో పార్టీ  కమాండ్ ఇక ఉపేక్షించరాదని నిర్ణయానికి వచ్చింది.  కేశినేని నానికి మూడో చాన్స్ లేదని,   సైలెంట్ గా ఉండాలని స్పష్టంగా చెప్పేసింది.  ఈ నేపథంలోనే తిరువూరులో చంద్రబాబు సభ విజయవంతమే లక్ష్యంగా పని చేయాలంటూ కేశినేని చిన్ని పార్టీ క్యాడర్ కు బహిరంగ లేఖ రాశారు. శుక్రవారం నుంచి కార్యాచరణ ప్రారంభించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు తిరువూరు సభ విజయవంతం చేయడమే ప్రథమ లక్ష్యంగా పని చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న ప్రతికూల ప్రచారాన్ని పట్టించుకోవద్దనీ, సభ విజయవంతం, వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం విజయం లక్ష్యంగా పని చేయాలని ఆయన ఆ లేఖలో క్యాడర్ కు పిలుపునిచ్చారు.  

రోడ్డు ప్రమాదంలో  వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తలకు బలమైన గాయాలు..

తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆయన విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా.. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో గురువారం అర్ధరాత్రి రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఎమ్మెల్సీ కారుకు ముందు వెళుతున్న లారీ టైరు పంక్చరు కావడంతో ఒక్కసారిగా నెమ్మదిగా వెళుతోంది. ఆ క్రమంలో కారు వెళ్లి లారీ వెనుక భాగంలో ఢీకొని డివైడర్‌పై పడిపోయింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌రెడ్డి పీఏ అక్కడికక్కడే చనిపోగా.. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయి. ఇదే సమయంలో ఆ రోడ్డులో వస్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. తన కారులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆస్పత్రిలోకి తరలించారు.. ప్రమాదాన్ని చూసి కారు ఆపిన జానీ మాస్టర్‌.. ఎమ్మెల్సీకి బలమైన గాయాలు కావడంతో.. తలకి కట్టుకట్టారు.. ఆ తర్వాత ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు క్షతగాత్రులను తన కారులో నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించి తన మంచి మనసు చాటుకున్నారు ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను నెల్లూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారి వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వైసీపీ నుంచి వీళ్లూ జారిపోతారా? దారెటు?

ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు వైసీపి అభ్యర్ధుల రెండో జాబితా ప్రకటనతో వైసీపిలో అసమ్మతి సెగలు జ్వాలలయ్యాయి. పెను మంటలుగా మారుతున్నాయి. అసలు జగన్ తీరేంటో, ఉద్దేశమేంటో పార్టీ నేతలకే అర్ధం కావడంలేదు. వీర విధేయులను కూడా తిరగబడేలా చేసుకుని జగన్ ఏం సాధిద్దామనుకుంటున్నారు?  అంటూ వైసీపీలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని పక్కన పెట్టి ఆ స్థానాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కేటాయించడం ద్వారా జగన్ అటు మల్లాదినీ, ఇటు వెల్లంపల్లినీ దూరం చేసుకున్నట్లే అంటున్నారు. ఇప్పటికే మల్లాది విష్ణు అనుచరులు జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. మల్లాది కూడా షర్మిల వెంట నడిచేందుకు అంటే కాంగ్రెస్ గూటికి చేరిపోవడానికి డిసైడైపోయారని చెబుతున్నారు. ఇప్పటికే తన అనుచరులతో వరుస భేటీలు, ఆత్మీయ సమ్మేళనాలు జరిపిన మల్లాది విష్ణు పార్టీ మారే విషయమై వారితో చర్చించారు.  వైఎస్ షర్మిల ఎలాగూ ఏపీ కాంగ్రెస్‌ తలుపులు తెరువబోతున్నారు కనుక దానిలోకి జంప్ అయితే మంచిదని విష్ణు భావిస్తున్నారని అంటున్నారు.   ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు కనుక ముందు వచ్చిన వారికి ముందు సీటు అన్నట్లుగా  ఇప్పటికే  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన దారిని ప్రకటించేశారు. ఇప్పుడు మల్లాది విష్ణూ అదే దారిలో నడవడానికి డిసైడైపోయారు.  పరిశీలకుల విశ్లేషణల మేరకు జగన్ టికెట్లు నిరాకరించిన వారూ, నియోజకవర్గాలు మార్చిన వారిలో అత్యధికులు అదే దారిలో నడిచే అవకాశం ఉంది. ఈ పరిణామం కాంగ్రెస్ కు ఏ మేరకు లాభిస్తుందో తెలియదు కానీ, నైతికంగా జగన్ పార్టీని ఇంకా ఇంకా బలహీనం చేస్తుందని అంటున్నారు.   ఇక విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ ఈస్ట్ కు మార్చడంతో వెల్లంపల్లి కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇంత కాలం విజయవాడ వెస్ట్ లో పని చేస్తూ పట్టు సాధించుకున్నానని భావిస్తున్న వెల్లంపల్లి తన సీటును మార్చడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ అంటే ఓటమేనని భావిస్తున్నారు.  ఈ విషయంలో అధినేతను కలిసి మాట్లాడేందుకు తాడేపల్లి వెళ్లారు కూడా. అక్కడ ఏం జరిగిందన్నది తెలియదు కానీ, జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ససేమిరా అన్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.   ఇక ఒంగోలు విషయానికి వస్తే తన పంతం నెగ్గించుకున్నాననీ, ఒంగోలు నుంచే బరిలోకి దిగుతాననీ ధీమాగా ప్రకటించిన ఆయనకు పార్టీ అధినేత షాక్ ఇచ్చేందుకే రెడీ అయిపోయారని అంటున్నారు. బాలినేనికి ఒంగోలు టికెట్ ఇచ్చే అవకాశం లేదనీ, ఇప్పటికే ఆయనకు ఆ విషయాన్ని జగన్ తేల్చి చెప్పారనీ, ఆయనను గిద్దలూరు నుంచి బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారనీ చెబుతున్నారు.  ఈ మేరకు ఇప్పటికే పార్టీ  పెద్దల నుంచి ఆయనకు ఫోన్ ద్వారా సమాచారం అందిందని చెబుతున్నారు. అయితే బాలినేని మాత్రం సీటు మారడం కాదు పార్టీయే మారతానని వారికి తెగేసి చెప్పినట్లు వైసీపీ వర్గాల సమాచారం. ఇక ఒంగోలు నుంచి   సిద్దా రాఘవరావు కుమారుడు సుధీర్‌ని బరిలో కి దింపా లన్నది జగన్ యోచనగా చెబుతున్నారు. అదే విధంగా మరో మంత్రి చెల్లుబోయినకు కూడా జగన్ షాక్ ఇచ్చేశారు. ఆయనను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి కాకుండా  రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయాలంటూ పంపేశారు. రామచంద్రపురం నుంచి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ ను నిలబెట్టాలని నిర్ణయించారు. దీంతో చెల్లుబోయిన వేణుగోపాల్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  ఇక జగన్ భజనలో ఆరితేరి, తన గుడ్డు సిద్ధాంతంలో బ్రహ్మాండమైన గుర్తింపు పొందిన  మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న అనకాపల్లి నుంచి మరో సారి బరిలోకి దిగే అవకాశం లేదని జగన్ స్పష్టం చేసేయడంతో ఆయన బహిరంగంగానే భోరు మన్నారు. వీరూ, వీళ్లతో పాటు పార్టీలో పెద్ద సంఖ్యలో అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్న నేతలు  పార్టీ నుంచి జారిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరి వారి అడుగులు ఎటో, వారి దారి ఏదో చూడాలి.

కేశినేని నానికి చంద్రబాబు చెక్.. పార్టీ వ్యవహారాలలో జోక్యం వద్దని ఆదేశం

కేశినేని బ్రదర్స్ వివాదానికి చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టేశారు. వచ్చే ఎన్నికలలో కేశినేని నానికి బెజవాడ ఎంపీ టికెట్ లేదని స్పష్టం చేసేశారు. గత కొంత కాలంగా కేశినేని బ్రదర్స్ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుకు ముగింపు పలికేశారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్న సమయంలో కేశినేని బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారింది.  రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ  విజయమే లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగుతుంటే.. ఏపీకి పొలిటికల్ క్యాపిటల్ అయిన బెజవాడలో మాత్రం అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి తలనొప్పిగా మారింది. కేశినేని బ్రదర్స్ మధ్య పొలిటికల్ వార్ పార్టీకి, అధిష్ఠానానికీ కూడా ఇబ్బందికరంగా మారింది. ఈ నెల 7న ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడి సభ ఏర్పాట్ల విషయంలో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తరువాత ఇక ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టి తీరాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చేశారు.  టీడీపీ సమన్వయ భేటీ ఫ్లెక్సీలో కేశినేని నాని ఫొటో  విషయంలో తలెత్తిన వివాదం చినికిచినికి గాలివానగా మారి నాని, చిన్నీ వర్గీయుల మధ్య బాహాబాహీకి దారి తీసింది.  ఈ ఘటనపై  పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తిరువూరు సెక్టార్ 1 ఎస్సై సతీష్ ఫిర్యాదు మేరకు  36 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో కేశినేని బ్రదర్స్ వ్యవహారంపై తెలుగుదేశం అధిష్ఠానం సీరియస్ గా దృష్టి పెట్టింది. పార్టీ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నానికి చెక్ పెట్టకతప్పదన్న భావించారు. తొలి నుంచీ కూడా అంటే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పరాజయం తరువాత నుంచీ విజయవాడ ఎంపీ కేశినేని నాని తీరు వివాదాస్పదంగానే ఉంటూ వచ్చింది. ఒక సమయంలో ఆయన పార్టీ మారుతారన్న వార్తలు కూడా బలంగా వినిపించాయి. ఈ క్రమంలో తిరువూరు ఘటన తరువాత కేశినేని నానికి  చెక్ పెట్టాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.   తిరువూరు సభ ఏర్పాట్ల విషయంలో ఎటువంటి జోక్యం చేసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ విషయాన్ని కేశినేని నాని స్వయంగా సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలు కేశినేని నానితో భేటీ అయ్యారు. ఆ భేటీలో తిరువూరులో చంద్రబాబు సభ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా చెప్పారు. ఇది చంద్రబాబు ఆదేశమని తెలియజేశారు.  అంతే కాకుండా పార్టీ వ్యవహారాలలో కూడా జోక్యం వద్దన్నది చంద్రబాబు ఆదేశంగా కేశినేని నానికి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తాను పార్టీ ఆదేశాలను శిరసావహిస్తానని నాని చెప్పారు. ఈ విషయాన్ని నాని స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో విజయవాడలో కేశినేని నాని బ్రదర్స్  పోలిటికల్ వార్ కు తెరపడినట్టేనని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఇలా ఉండగా తిరువూరు సభ బాధ్యతలను కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్నికి అప్పగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కేశినేని నానికి  ఎన్నికలలో పార్టీ  టికెట్ ఇచ్చేది లేదని కూడా స్పష్టత ఇచ్చేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? 

రిటర్న్ గిఫ్ట్  ఇవ్వడానికి మీడియా సంస్థలు అతీతం కాదు తెలంగాణలో మరోమారు  రుజువయ్యింది. తొమ్మిదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో  రెండు ప్రముఖ టీవీ చానెల్    ప్రసారాలను నిలిపి వేయాలని  అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వం నిషేధిస్తే పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న  కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మై భీ హూ అన్నట్లు వ్యవహరిస్తోంది. తెలంగాణలో అధికారం చేజిక్కించుకోగానే అదే టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక మీడియా సంస్థ టార్గెట్ గా పావులు కదుపుతోంది.  పార్టీ కార్యకలాపాలు నిర్వహించాల్సిన చోటే  వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తుందనే అభియోగంతో రెవిన్యూ శాఖ నోటీసులు జారీ చేసింది.  భవనాన్ని ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో   రెండు చానెల్స్ ప్రసారాలను నిలిపివేయడాన్ని ఖండిస్తూ గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగినప్పటికీ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు వ్యవహరించింది. ప్రజాస్వామ్య దేశంలో మీడియాకు స్వేచ్ఛ ఉంది. దాన్ని హరించే హక్కు ప్రభుత్వాలకు లేదు.   ఆ చానెల్స్‌పై నిషేధాన్ని కొన్ని నెలలుగా కొనసాగించడం అన్యాయం, అక్రమం. పైపెచ్చు.మీడియాతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం లేదా రాజకీయ పార్టీ మనుగడ కొనసాగించినట్టు చరిత్రలో లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఈ రెండు చానెల్స్‌ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన వెంటనే నిషేధం విధించడం సిగ్గుచేటు అని ప్రజాస్వామికవాదులు  నినందించారు. కేవలం కక్షసాధింపు చర్యలో భాగంగానే అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విధంగా వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు మండిపడ్డారు. ఈ చానెల్స్  ప్రసారాలు  నిలిపి వేయడం వల్ల ఎంతో మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు.జర్నలిస్టుల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణాలో ఈ రెండు టీవీ చానెల్స్  ప్రసారాలపై విధించిన నిషేధాన్ని తొలగించాలని ప్రజాస్వామిక వాదులు  డిమాండ్ చేశారు. ఆనాటితో పోలిస్తే నేడు  కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందిపెద్ద నేరం కాదు. టిఆర్ఎస్ స్వంత మీడియా సంస్థను  తరలించమని నోటీసులు ఇవ్వడం పెద్ద తప్పేం కాదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  టిఆర్ఎస్ కార్యకలాపాల నిర్వహణకు  కాంగ్రెస్ ప్రభుత్వం స్థలం కేటాయించింది. పార్టీ కార్యాలయాల కోసం స్థలం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. పార్టీ కార్యకలాపాలతో సంబంధం లేకుండా అధికార పార్టీ మీద అక్కసుతో వ్యవహరిస్తున్న చానల్స్  మీద ఉక్కు పాదం మోపాలని నిర్ణయం తీసుకోవడంలో భాగంగా తెలంగాణ భవన్ కు నోటీసులు అందాయి. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు  తెలంగాణ కాంగ్రెస్  కమిటీ అధికార ప్రతినిధి ఉమేష్ హైకోర్టునాశ్రయించినప్పటికీ కెసీఆర్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కాలేదు. జర్నలిస్టులు కొనుగోలు చేసిన స్థలాలను అప్పజెప్పాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును అమలు చేయని బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మూఠ గట్టుకుని అధికారం కోల్పోయింది. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ అన్ని లెక్కలు తీస్తుంది. 

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యరు. దీంతో వారిరువురూ తమతమ ఎమ్మెల్సీ సభ్యత్వానికి చేసిన రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆ రెండు స్థానాలకూ ఎన్నిక అనివార్యమైంది. వాస్తవానికి కడియం, కౌశిక్ రెడ్డిల ఎమ్మెల్సీ గడువు 2027 నవరంబర్ 30 వరకూ ఉన్నప్పటికీ వారు రాజీనామా చేయడంతో ఎన్నికలు జరగనున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ మేరకు ఈ నెల 11 రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమౌతుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు జనవరి 18 కాగా, జనవరి 19న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జనవరి 22 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు. ఇక జనవరి 29న పోలింగ్ జరగనుంది.  

ఓటమి ముంగిట.. జగన్ సింపతీ గేమ్!.. వర్కౌట్ అవుతుందా?

ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అనుకున్నదొకటైతే.. జరిగేది పది రకాలుగా కనిపిస్తుంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు, సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేయడం.. ఆమె ఏపీ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం  చాలా కాలంగా ఊహిస్తున్నదే. ఈ మేరకు గురువారం (జనవరి 4)షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక అతి త్వరలోనే ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అందుకోవడం గ్యారంటీగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వేంటనే పార్టీ అండమాన్ లో పని చేయమన్నా చేస్తానంటూ షర్మిల విధేయత చాటారు. ఇలా ఉండగా గురువారం(జనవరి 4) షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోగా అంతకు ముందు వారం రోజుల నుండి షర్మిల ఏపీలోనే పర్యటిస్తున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వానాలు అందించడం, కుమారుడు, కాబోయే కోడలితో కలిసి ఇడుపుల పాయ వెళ్లి తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద ప్రార్ధనలు చేయడం, అక్కడే షర్మిల కాంగ్రెస్ పార్టీతో తన ప్రయాణంపై ప్రకటనలు చేయడం ఆసక్తిగా కలిగించాయి. అలాగే తల్లి విజయమ్మతో కలిసి తాడేపల్లికి వెళ్లి అన్న జగన్ ను ప్రత్యేకంగా ఆహ్వానించడం మరింత ఆసక్తిని రేపింది. మొత్తంగా జనవరి తొలి వారంలో ఏపీ రాజకీయాలలో షర్మిల కేంద్రబిందువుగా మారారు.  ముఖ్యంగా షర్మిల ఏపీ పర్యటన సందర్భంగా  ఊహించని మలుపులు, కలయికలు కనిపించాయి. షర్మిలకు అన్న జగన్ తో చాలా కాలంగా సత్సంబంధాలు లేవు. ఇది అందరికీ స్పష్టంగా తెలిసిన అంశమే. ఇప్పుడు షర్మిల ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి అన్న జగన్ మోహన్ రెడ్డితోనే తలపడడానికి రెడీ అయ్యారు. ఇలాంటి సమయంలో షర్మిల జగన్ నివాసానికి వెళ్లి మరీ కలవడం ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా షర్మిల అన్నతో ఏం మాట్లాడారు? వెంట వచ్చిన తల్లి విజయమ్మ జగన్ ను ఏం కోరారు? షర్మిల ఏపీలో రాజకీయ ప్రయాణంపై జగన్ ఏమైనా చర్చించారా? అసలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై జగన్ స్పందన ఏంటి? ఇలా ఎన్నోరకాల ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాలలో చర్చకు వచ్చాయి. అలాగే నిన్న మొన్నటి వరకూ జగన్ మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి షర్మిలతో కలిసి జగన్ నివాసానికి వెళ్లారు. అన్నపై షర్మిల యుద్దానికి తొలి సైనికుడిని తానే అంటూ ఆర్కే ఇప్పటికే ప్రకటించి మరీ జగన్ గడపతొక్కి వచ్చారు. షర్మిల ఏపీ పర్యటనలో మరో ఆసక్తికర కలయిక కూడా కనిపించింది.  జగన్ ప్రత్యర్థితో షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ భేటీ. షర్మిల తాడేపల్లికి వెళ్లి అన్నను కలిశారు. కానీ, షర్మిలతో వచ్చిన ఆమె భర్త అనిల్ కుమార్ మాత్రం జగన్ నివాసానికి వెళ్ళలేదు. కేవలం షర్మిల, ఆమె కుమారుడు, కుమార్తె, కాబోయే కోడలు, తల్లి విజయమ్మ జగన్ నివాసానికి వెళ్లారు. అనిల్ కుమార్ కూడా కడప నుండి విజయవాడ వచ్చినా జగన్ నివాసానికి వెళ్ళలేదు. అలాగే అనిల్ కుమార్ జగన్ ప్రత్యర్థి, పులివెందుల టీడీపీ ఇంచార్జి బీటెక్ రవితో భేటీ అయ్యారు. బ్రదర్ అనిల్ కుమార్ కడప నుంచి విజయవాడకు బయల్దేరే సమయంలో కడప విమానాశ్రయంలో బ్రదర్ అనిల్ తో టీడీపీ నేతలు బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డితో భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీగా బీటెక్ రవి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కానీ, ఇది చూస్తే అలా అనిపించడం లేదు. జరిగిన, జరుగుతున్న పరిణామాలు చూస్తే జగన్ మోహన్ రెడ్డిలో వణుకు మొదలైపోయినట్లే. అందుకే జగన్ ఇప్పుడు సింపతీ గేమ్ మొదలు పెట్టినట్లు కనిపిస్తున్నది. తన కుటుంబంలో చిచ్చు పెట్టే కుట్ర చేస్తున్నారంటూ ఫ్యామిలీ డ్రామాను హైలెట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.  జగన్‌ ఆడుతున్న ఈ ఫ్యామిలీ సింపథీ గేమ్ వర్కవుట్ అవుతుందా?. ఎందుకంటే ఇన్నాళ్లూ వదిలేసిన కుటుంబం జగన్‌కు ఇప్పుడే గుర్చొచ్చిందా అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఇప్పటికే వచ్చే ఎన్నికల కోసం ఎన్నో రకాల ఎత్తులు వేసిన జగన్.. ఇప్పుడు ఎన్నికల్లో గెలుపు కోసం ఆఖరికి కుటుంబాన్ని కూడా వాడేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీకి షర్మిల రాకపై జగన్‌ ఆందోళన చెందుతున్నారు. రాజకీయంగా తనకు నష్టం తప్పదని ఫిక్సయిపోయారు. విషయం ఇప్పుడు తన దాకా వచ్చే సరికి ఉలిక్కి పడుతున్నారు. గత ఎన్నికల్లో తాను ఎన్నో విన్యాసాలను చేయగా.. ఇప్పుడు అవన్నీ కలిసి తన మెడకే చుట్టుకుంటుండటంతో బెంబేలెత్తుతున్నారు. దీంతో ఇప్పుడు జగన్ కు ఉలిక్కిపాటు తప్ప ఇంకేం మిగిలేలా కనిపించడం లేదని తమ కుటుంబంలో చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నారంటూ విపక్ష నేతపై విమర్శలకు గుప్పించడం విడ్డూరంగా ఉందని పరిశీలకులు అంటున్నారు.

కాళేశ్వరం బిల్లుల చెల్లింపు నిలిపివేత.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

కాళేశ్వరం బిల్లుల చెల్లింపు నిలిపివేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం మొదటి లింకులోని మూడు బ్యారేజీల బిల్లుల చెల్లింపులను పెండింగ్ లో ఉంచాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగడం, సుందిళ్ల బ్యారేజికి సంబంధించి సమస్యలు  ఉన్నాయంటూ నేషనల్ సేఫ్టీ డ్యాం అధికారులు పేర్కొన్న నేపథ్యంలో  తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ సంబంధిత బిల్లుల చెల్లింపులు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడిగడ్డ బ్యారేజి పనులు చేసిన ఎల్అండ్ టీకి రూ.400 కోట్లు,   అన్నారం బ్యారేజీ పనులు చేసిన అప్కాన్స్ సంస్థకు రూ.161 కోట్లు, సుందిళ్ల బ్యారేజీ పని చేసిన నవయుగకు కూడా తుది బిల్లులు పెండింగ్‌లో  పెట్టారు.  అన్నారం పంపు హౌస్ మరమ్మతులకు సంబంధించి మేఘా ఇంజినీరింగ్‌కు రూ.74 కోట్లు బిల్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. పునరుద్ధరణ పనులపై తుది నిర్ణయం తర్వాతే మూడు బ్యారేజీలకు సంబంధించిన   బిల్లులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.  

మైనర్ పై వర్చువల్ గ్యాంగ్ రేప్!

బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇది మన రాష్ట్రం, దేశంలో మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, దౌర్జన్యాలూ పెరిగిపోతున్నాయి.   ప్రపంచవ్యాప్తంగా ఈ నేరాలపై కఠిన శిక్షలు అమల్లో ఉన్నా  మృగాళ్లలో మార్పు రావడం లేదు. అయితే  భౌతిక అత్యాచారాలే కాదు.. ఆన్ లైన్  వర్చువల్ అత్యాచారాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకూ వర్చువల్ సమావేశాలు, వర్చువల్ ప్రోగ్రామ్స్, వర్చువల్ ప్రారంభోత్సవాలు మాత్రమే మనకు తెలుసు. దిగ్భ్రాంతి గొలిపే విధంగా ప్రపంచంలోనే తొలి సారిగా వర్చువల్ గ్యాంగ్ రేప్ జరిగింది. ఓ పదహారేళ్ల బాలిక ఫిర్యాదుతో ఈ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది.  యూకేలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రపంచంలోనే ఈ తరహా తొలి కేసుగా నమోదైంది.  16 ఏళ్ల బాలికపై వర్చువల్‌గా ఆన్‌లైన్ ‘మెటావర్స్’లో సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. దర్యాప్తు సాగుతోంది. ఆ బాలిక వర్చువల్ రియాలిటీ గేమ్‌ ఆడుతుండగా.. తన డిజిటల్ అవతార్, డిజిటల్ క్యారెక్టర్‌పై ఆన్‌లైన్‌లో అపరిచిత వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  నిజానికి ఆ బాలిక గేమ్ అడుగుతున్న సమయంలో మానసికంగా డిజిటల్ అవతార్ లోకి లీనం అయ్యింది. అపరిచిత వ్యక్తులు ఆమె డిజిటల్ అవతార్ పై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక తనపై నిజంగానే లైంగిక దాడి జరిగినట్లు భావిస్తూ.. తీవ్ర మనోవేదన అనుభవిస్తున్నట్లు ది న్యూ యార్క్ వార్తాసంస్థ పేర్కొంది. టీనేజ్ బాలికలపై ఇలాంటి సంఘటనలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక్కడ కూడా ఈ టీనేజ్ అమ్మాయి ఆన్‌లైన్ గేమ్‌లో మునిగితేలుతుండగా, కొందరు వ్యక్తులు వర్చువల్ గాఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రియాలిటీలో బాలికపై అసలు అత్యాచారం జరగలేదు, బాలికకు ఎలాంటి గాయాలు కూడా కాలేదు. కానీ, ఆమె అత్యాచారానికి గురయ్యాన్న మానసిక వేదనకు గురవుతోందని పోలీసులు తెలిపారు. కాగా, ప్రపంచంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తున్న మొదటి వర్చువల్ రేప్ క్రైమ్ కేసు ఇదే. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులలో ఒకరు మాట్లాడుతూ.. బాలికపై శారీరకంగా అత్యాచారం జరగకపోయినా.. మానసికంగా ఆమె లైంగిక దాడికి గురైనట్లు భావిస్తుండడంతో చాలా బాధ పడుతుందని పేర్కొన్నారు. ఈ దాడి తనను చాలా కాలం పాటు ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఇలాంటి కేసులపై నిర్దిష్టమైన చట్టాలు లేవు. అసలు ప్రపంచంలోనే ఇది తొలికేసు కావడంతో ఈ కేసులో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. ఆ బాలిక ఏ గేమ్‌ ఆడుతోందనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఈ కేసు దర్యాప్తుతో వర్చువల్ నేరాలు కొనసాగాలా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకూ ఉన్న చట్టాల ప్రకారం చూస్తే ఆమెపై దాడి జరగలేదు.. కానీ, బాలికకు అన్యాయం జరిగింది.. మానసికంగా దాని తాలూకు క్షోభకూడా అనుభవిస్తుంది. కనుక ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరగాల్సి ఉంది. మరి ఈ కేసును ఎలా విచారించనున్నారన్నది ముందు ముందు తెలుస్తుందని చెప్పారు. ఇక ఈ వర్చువల్ రేప్ ఉదంతంపై యూకే హోంశాఖ కార్యదర్శి జేమ్స్ మాట్లాడుతూ.. బాలిక లైంగిక వేధింపులకు గురైందన్నారు. బాలిక సెక్సువల్ ట్రామాలోకి వెళ్లిందని చెప్పాడు. అయితే హారిజోన్ వరల్డ్‌లో వర్చువల్ సెక్స్ నేరాలపై అనేక నివేదికలు ఉన్నాయి. ఇది మెటా నిర్వహించే ఉచిత వీఆర్ గేమ్ అనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, దీనిపై మెటా కూడా స్పందించింది. మా ప్లాట్‌ఫాంలో ఇలాంటి వాటికి స్థానం లేదని, మా వినియోగదారులకు ఆటోమెటిక్ రక్షణ ఉంటుందని, అపరిచిత వ్యక్తుల్ని దూరంగా ఉంచుతుందని మెటా ప్రతినిధి చెప్పారు. దీంతో అసలు ఈ కేసు దర్యాప్తు సాగుతుందా? వర్చువల్ నేరగాళ్లకు శిక్ష పడుతుందా? ఇలాంటి వాటి కోసం కొత్త చట్టాలను ఏమైనా తీసుకొస్తారా? అసలు ఆ బాలికకు న్యాయం జరుగుతుందా అన్న దానిపై యావత్ ప్రపంచ టెక్నాలజీ నిపుణులతో ఆసక్తి కనిపిస్తుంది. మరి యూకే ప్రభుత్వం, పోలీసులు ఈ కేసును ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది.

అప్పుల ఊబిలో భారత్.. దివాళా దిశగా అడుగులు?

భారత్ వెలిగిపోతుందా నిజంగా అంటే నిస్సందేహంగా లేదు. ఎందుకంటే భారత దేశ జనాభా 140 కోట్లు ఉంటే.. దేశం అప్పు మాత్రం రూ. రూ.200 లక్షల కోట్ల వరకూ ఉండొచ్చన్నది ఒక అంచనా. ఈ అప్పుల వ్యవహారంలో 70 ఏళ్ల భారత దేశ చరిత్ర అంతా ఒక లెక్క అయితే ఈ గడిచిన తొమ్మిదిన్నరేళ్ల   చరిత్ర ఇంకొక లెక్కగా చెప్పుకోవాలి.  ఎక్కడైనా అప్పు ఇచ్చేవారు నీ బాకీ పెరిగిపోతోందని మనల్ని హెచ్చరించారంటే దాని లెక్క దానికి ఉంటుంది. అంతర్జాతీయ ఆర్ధిక సంస్థ ప్రతినిధులు కూడా దాదాపు ఏటా ఒక సారి దేశ ఆర్ధిక పరిస్థితిని అంచనా వేసి ఒక నివేదిక ఇస్తారు. అయితే, ఈసారి ఈ నివేదికలో హెచ్చరిక వుంది. గతంలో ఎన్నడూ ఇలాంటి  హెచ్చరిక   లేదు. ఈసారి మాత్రం గట్టి హెచ్చరికే కనిపించింది. ఇదే ప్రతికూల ఆర్థిక పరిణామాలు కొనసాగితే 2027-28 నాటికి భారత   రుణం జీడీపీలో 100 శాతం, లేదా అంతకు మించి ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా ప్రకటించింది. ఈ అంచనాను మన ప్రభుత్వం తోసిపుచ్చినా ఆర్ధిక నిపుణులు మాత్రం ఇది తీవ్రాతి తీవ్రమైన  హెచ్చరికగానే పేర్కొంటున్నారు. భారత రుణ భారంపై ఇటీవల  చర్చ కూడా జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్ప చేసిందనే విమర్శ కూడా పెద్ద ఎత్తున వినవస్తున్నది. ప్రధాని మోడీ తొలి సారి అధికార పగ్గాలు చేపట్టే నాటికి అంటే  2014 మార్చి నాటికి దేశ అప్పు రూ. 53 లక్షల 11 వేల 81 కోట్లు. అయితే ఇప్పుడది  రూ. 155.6 లక్షల కోట్లు.  అంటే ఈ తొమ్మిదేళ్లలో దేశం రుణం మూడింతలు పెరిగింది.  గడిచిన నాలుగున్నర ఏళ్లలో తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు 10 లక్షల కోట్లపై మాటే. ఇక తెలంగాణ రాష్ట్ర అప్పు 6,71,757 కోట్లు. ఈ లెక్కన దేశంలో మిగిలిన రాష్ట్రాల అప్పుల పరిస్థితి ఏంటి? అసలు ఇబ్బడిముబ్బడిగా తీసుకొస్తున్న ఈ అప్పులకి లెక్కలు ఉన్నాయా? అసలు ఈ అప్పుల ఘనత   ఎవరిది? ఏం చూసి ఇంత అప్పు చేస్తున్నారు? ఎక్కడ నుండి పుడుతున్నది ఇంత అప్పు? ఎందుకోసం చేస్తున్నారు? ఎవరు తీర్చాలి? సామాన్య ప్రజలా.. పాలకులా? దేశం మీద అంతో ఇంతో ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరినీ ఈ ప్రశ్నలు వేధిస్తున్నాయి. ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారు కదా పోనీ ఏం ఒరగబెట్టారు అంటే.. ఏం లేదనే సమాధానమే వస్తోంది.   తెచ్చిన అప్పులు కనిపిస్తున్నాయి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ కనిపించడం లేదు. దేశం ఇంతగా అప్పుల ఊబిలో కూరుకుపోయినా  ప్రజల సౌకర్యాలు పెరగలేదు.. ఆదాయం పెరగలేదు.. సంపద పెరగలేదు.. ఉపాధి పెరగలేదు. కనీసం ఉపాధి అవకాశాలను మెరుగు పడలేదు. చెప్పుకో తగ్గ పరిశ్రమలు రాబట్టిందీ లేదు..  విద్యా, వైద్య రంగంలో గుణాత్మక మార్పులూ రాలేదు. పేరుకు దేశమంతా ఉచిత వైద్యం ఉన్నా.. అది ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు లేవు. నిత్యావసరాల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేవు. పెట్రోల్, డీజిల్ తదితర ఇంధన ధరలు అందనంత ఎత్తులోకి వెళ్లిపోయాయి. కొత్తగా ప్రభుత్వ సంస్థలు నెలకొల్పిన దాఖలాలు లేవు. పైగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేస్తున్నారు. అవి కాకుండా మిగిలినవేమైనా ఉంటే అవి దివాళాకు చేరువలో ఉన్నాయి.   ఎగువ మధ్య తరగతికి సౌకర్యాలు పెరిగాయి తప్ప రైల్వేలో సామాన్యుడికి బోగీల సంఖ్య పెరిగలేదు. టోల్ టాక్స్ లు తగ్గించలేదు. ఇంత అప్పులు చేసినా దేశంలో పేదరికం తగ్గలేదు. మధ్య తరగతి అనే పదం రూపు మాసిపోలేదు. ధనిక వర్గాల దగా దోపిడీ ఆగలేదు. వందలు వేల కోట్లలో అప్పులు తీసుకొనే బడా పారిశ్రామిక వేత్తలు మళ్ళీ ఆ అప్పులు తిరిగి కట్టకపోగా మళ్ళీ వారికే బ్యాంకులు అప్పలు ఇస్తున్నాయి. కానీ, ఆరుగాలం శ్రమించే రైతులకు హామీలు  లేకుండా అప్పులు పుట్టడం లేదు. నిర్మాణ రంగం, ఉపాధి రంగం నిలదొక్కుకున్నది లేదు. కనీసం అందులో కార్మికులకు భరోసా లేదు. కానీ, ప్రభుత్వాలు మాత్రం అన్ని రంగాల్లో ముందున్నాం అంటూ ఘనంగా చెప్పుకుంటోంది. నిజంగా అన్ని రంగాల్లో ముందుంటే   దేశం ఇంతగా  అప్పుల్లో ఎందుకు కూ రుకుపోయింది? ఆయా రంగాల నుండి ఉత్పత్తి అవుతున్న సంపద ఏం అవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే నాథుడే కనిపించడం లేదు. సమాధానం చెప్పాల్సిన ప్రధాని మోడీ మౌనముద్ర మాటున దాక్కుంటున్నారు.  విపక్షాలను విమర్శించడానికి, తన ఘనతలను చాటుకోవడానికీ తప్ప, కీలకమైన ఏ అంశంపైనా ఆయన నోరు పెగలదు, నోట మాట రాదు. ఇక దేశం ఇంతగా  లక్షల కోట్లు అప్పుల ఊబిలో కూరుకుపోయిందంటే  దేశం వృద్ధి రివర్స్ గేర్ లో ఉందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అయితే పాలకులు చెప్పే, చేపే సంపద  ఎక్కడిది?  విదేశాల్లో ఉన్న భారతీయులు   కష్టపడి చెమటోడ్చి ఏటా ఒక 10 లక్షల కోట్లు తమ తల్లి తండ్రులకి పంపిస్తూ ఉంటే వాళ్ళు ఇక్కడ భూములు స్థిరాస్తులు కొంటున్నారు. దానివలన చుట్టు పక్కల ఉన్న భూములు ఆస్తుల విలువ పెరిగి కాస్త స్థిరంగా ఉంటున్నది. విదేశాల్లో ఉన్న వాళ్లు ఇక్కడికి సొమ్ము పంపుతుంటే.. దేశంలో ఆ ఎకానమీ చూపించి నేతలు, పాలకులు ఇదంతా తమ గొప్పే, తాము సాధించిన అభివృద్ధే అంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. ఎకానమీలో జెనరేట్ అయిన సొమ్మును జనాలకి ఉచిత పథకాల పేరుతో పంచుతూ పన్నుల రూపంలో తిరిగి ప్రజల నుండే గుంజుతున్నారు. నిజంగా దేశం అభివృద్ధి చెందుతూ సంపదతో విరాజిల్లుతుంటే ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు లాంటివి పెరగాలి. కానీ అవి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే  అన్నట్లున్నాయి.  పాలకులు కూడా ఏం చేయాలో  అది చేయడం మానేసి.. ఎన్నికల్లో ఎలా గెలవాలి అన్నది మాత్రమే ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం అన్న తేడా ఇసుమంతైనా లేదు. అందరిదీ ఇదే దారి. ముఖ్యంగా మోడీ పాలనా పగ్గాలు చేపట్టిన తరువాతే దేశంలో ఆర్థిక అరాచకత్వం పెట్రేగిపోయింది. పరిస్థితి ఇలాగే  కొనసాగితే భారత్ ని అప్పు అనే అనకొండ మింగేయడం గ్యారంటీ. -జ్వాల

ఆర్జీవీ ఫిర్యాదు వెనుక జగన్ కుట్ర వ్యూహం?

మందు, మగువ, మాఫియాలకు సంబంధించిన విషయాలు, విశేషాలు విని, తెలుసుకుని వీలైతే చూసి ఆనందిద్దామనుకునే వాళ్లకు ఆర్జీవీ అంటే కచ్చితంగా ఇష్టం ఉంటుంది. అయినా నిత్యం వివాదాలతో సహవాసం చేసే రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ అంటే తెలుగు రాష్ట్రాలలో అందరికీ పరిచయమైన పేరే.  చాలా మంది రామ్ గోపాల్ వర్మ కాదు రాంగ్ గోపాల్ వర్మ అంటుంటారు. అదే పేరుతో ఆయనపై ఓ సినిమా కూడా తీశారనుకోండి అది వేరే విషయం. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఆ ఉపోద్ఘాతం, ప్రస్తావన ఎందుకంటే.. ఎవరినీ లెక్క చేయను, ఎవరికీ భయపడను అంటూ గొప్పగా బిల్డప్ ఇచ్చుకునే రామ్ గోపాల్ వర్మ ఇప్పుుడ వణికి పోతున్నారు. నా సినిమా, నా ఇష్టం వచ్చినట్లు తీస్తాను, మీకు ఇష్టం ఉంటే చూడండి లేకపోతే మానేయండి అని ధీమాగా చెప్పే రామ్ గోపాల్ వర్మ తన వ్యూహం విడుదల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక విషయమేమిటంటే. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఓ టీవీ చర్చా వేదికలో ఆర్జీవీ తలపై కోటి రూపాయలు ఫత్వా ప్రకటించారు. ఆ ప్రకటనే ఇప్పుడు ఆర్జీవీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నో మాఫియా సినిమాలలో హత్యా కాండను అత్యంత బీభత్సంగా చూపించిన రామ్ గోపాల్ వర్మ తన తల వద్దకు వచ్చే సరికి ఆ తలను ఎక్కడ దాచుకోవాలో తెలియకు బెంబేలెత్తిపోతున్నారు. వాస్తవానికి కొలికిపూడి శ్రీనివాసరావుకు ఆర్జీవీ తల తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇచ్చే ఆర్థిక స్తోమత ఉందా లేదా అన్నది అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందు కంటే ఆయనకు అంత ఆర్థిక స్థోమత లేదు. మరి అలాంటి వ్యక్తి ప్రకటనకు ఆర్జీవీకి అంత బెదురెందుకు? దీనికి సమాధానం కావాలంటే.. ఆయన కొలికిపూడి శ్రీనివాసరావుపై చేసిన ఫిర్యాదును ఒక సారి చూడాలి. రామ్ గోపాల్ వర్మ ఉండేది హైదరాబాద్ లో, కొలికిపూడి శ్రీనివాసరావు టీవీ చానల్ లో చేసిన ప్రకటన హైదరాబాద్ లోనే అటువంటప్పుడు రామ్ గోపాల్ వర్మ నిజంగా ఫిర్యాదు చేయదలచుకుంటే హైదరాబాద్ లో చేయాలి. కానీ ఆయన ఆల్ దీ వే విజయవాడకు వెళ్లి అక్కడ ఫిర్యాదు చేశారు. ఇంకేముంది.. అది తమ పరిధిలోకి వస్తుందా? రాదా అన్నది కూడా చూసుకోకుండా, ఏపీ సీఐడీ రంగంలోకి దిగిపోయింది. హైదరాబాద్ వచ్చి కొలికిపూడి ఇంటిపైకి వెళ్లి  మరీ హడావుడి చేసింది.   నోటీసులు ఇచ్చి విజయవాడ విచారణకు పిలిచింది. విచారణకు వచ్చిన కొలికిపూడిని అరెస్టు చేసినంత పని చేసింది. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా ప్రశ్నలు వేసి ఆ తరువాత మళ్లీ పిలిస్తే రావాలని చెప్పి వదిలేసింది.   ఈ మొత్తం వ్యవహారంలో ఆర్జీవీ వ్యూహం సంగతేంటో తెలియదు కానీ, జగన్ తాడేపల్లి ప్యాలెస్ వ్యూహ కుట్రో, కుట్ర వ్యూహమో ఉందని మాత్రం పరిశీలకులు అంటున్నారు.  ఎందుకంటే తన విధానాలను విమర్శించే వారు, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తేవారు ఎవరైనా సరే ఉండాల్సింది జైళ్లోనే అన్నట్లగా వ్యవహరించే జగన్.. నిత్యం తన ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ, విమర్శిస్తూ నిలదీసే కొలికిపూడి విషయంలో మరోలా ఎందుకు వ్యవహరిస్తారు? అందుకే  ఆర్జీవీ ద్వారా ఫిర్యాదు చేయించి కేసులతో వేధించే వ్యూహం జగన్ సర్కార్ దేనని అంటున్నారు.  నిజమే మరి వ్యూహం వారిది!

లోకసభ ఎన్నికలలో 15  కాంగ్రెస్ ఒకటి సిపిఐ... రేవంత్ వ్యూహం ఇదేనా ?

తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్ తో పార్లమెంట్ ఎన్నికలలో మెజారిటీ స్థానాలలో గెలుపొందే దిశగా అడుగులు వేస్తోంది. వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో ఎన్డిఏ కూటమిని దించడానికి ఏర్పాటైన ఇండియా కూటమి దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ హస్తగతం కావడంతో మరింత ఉత్సాహంతో అడుగులు వేస్తోంది. తెలంగాణలో మొత్తం 17 లోక సభ నియోజకవర్గాలలో 15 స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికలలో సిపిఐతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా మిత్ర ధర్మం పాటించాలని కాంగ్రెస్, సిపిఐలు భావిస్తున్నాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కమ్యూనిస్ట్ లకు కంచుకోట అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. గతంలో తాను పోటీ చేసిన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని సిపిఐ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొత్తగూడెం సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావ్ తరపున నారాయణ విస్తృతంగా ప్రచారం చేశారు. ఉద్యమాలే ఊపిరిగా ప్రజా క్షేతంలో ఉన్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను తెలంగాణలో కనిపించకుండా బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ వేసిన స్కెచ్ లో సిపిఐ,సిపిఎం పార్టీలు బలయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ (అప్పటి టిఆర్ఎస్ ) అభ్యర్థి గెలుపుకు కృషి చేశాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా మిత్రధర్మాన్ని పాటించాలని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అనుకున్నప్పటికీ కెసీఆర్ పొమ్మనక పొగ బెట్టాడు.  కమ్యూనిస్ట్ లను దగ్గరకు రానీయకపోవడానికి మరో కారణం ఉంది.  దేశ రాజకీయాల్లో బిజెపి కూటమి  ఎన్ డి ఏ వర్సెస్ కాంగ్రెస్  కూటమి ఇండియా ఉంది. ఇండియా కూటమిలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి.  ఈ కారణంగానే బిఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలతో ఎటువంటి చర్చలు జరపకుండా మొత్తం 119 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది.  దీంతో ఇండియా కూటమికి నేతృతం వహిస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలకు ఆపన్న హస్తం అందించింది. సీట్ల సర్దుబాటులో కొత్తగూడెం సిపిఐ కి కేటాయించింది. 1999 అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ అభ్యర్థిగా గెలిచిన కూనంనేని సాంబశివరావు కే ఈ సారి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. ఈ ఎన్నికలలో  బిజెపి బి టీం బిఆర్ఎస్ అని తెలంగాణ  ప్రజలకు అర్థం అయ్యింది. రాజకీయాలలో టక్కుటమారా గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన కెసీఆర్ ఈ ఎన్నికలలో హ్యట్రిక్  కొట్టాలని ఆశించి భంగపడ్డారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత  ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ కనబడకుండా కెసీఆర్ వేసిన ఎత్తుగడ. మెజార్టీ స్థానాలు టిఆర్ఎస్ గెలిచినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ లో చేర్చుకుంది. ఈ ఎన్నికలలో  కాంగ్రెస్ వేవ్ తీవ్రంగా ఉండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. కమ్యూనిస్ట్ లు కాంగ్రెస్ ను గెలిపించారు. సీట్ల సర్దుబాట్లలో సిపిఎం కు మిర్యాలగూడ ఇస్తామని కాంగ్రెస్ హామి ఇచ్చినప్పటికీ సిపిఎం కినుక వహించి వైదొలగింది. సిపిఎం ఒంటరిగా 19 స్థానాల్లో పోటీచేసి అన్ని స్థానాల్లో ఓడిపోయింది. లోకసభ ఎన్నికలలో తిరిగి కాంగ్రెస్ పార్టీతో మైత్రి కొనసాగించాలని సిపిఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

జగన్ తో ప్రత్యక్ష యుద్ధానికి షర్మిల శంఖారావం!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి , తన సోదరుడు వైఎస్‌ జగన్‌ తో వైఎస్‌ షర్మిల  ప్రత్యక్ష యుద్ధానికి శంఖారావం మోగించేశారు.   తన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని  కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయడం ద్వారా ఆమె పూర్తిగా కాంగ్రెస్ నాయకురాలిగా పరివర్తనం చెందారు.  దీంతో  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి రాజకీయ వారసత్వాన్ని కాంగ్రెస్‌ హస్తగతం చేసేశారు.  వైఎస్‌ రాజశేఖర రెడ్డి తాను జీవించి ఉన్నంత కాలం కాంగ్రెస్‌ నాయకుడే ఆయినప్పటికీ రాష్ట్ర విభజన అనంతరం ఆయన కుమారుడు జగన్ సొంతంగా వైసీపీ పార్టీని స్థాపించి వైఎస్ రాజకీయ వారసత్వాన్ని సొంతం చేసుకున్నారు. అప్పట్లో వైఎస్ భార్య విజయమ్మ, తనయ షర్మిల కూడా జగన్ తో పాటే అడుగులు వేశారు. దాంతో వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం పూర్తిగా తెగిపోయింది.  అయితే  ఇప్పుడు వైఎస్ తనయ షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డగా తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానని, రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలన్న తన తండ్రి వైఎస్ కలను సాకారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రకటించడం ద్వారా మళ్లీ వైఎస్ వారసత్వాన్ని కాంగ్రెస్ చేతుల్లో పెట్టేశారు. మరో వైపు వైఎస్ కుమారుడు జగన్ తన పాలనా వైఫల్యాలతో వైసీపీకి వైఎస్ తో ఉన్న అనుబంధాన్ని తుంచేశారు. వైఎస్ అనుచరులు, అభిమానులూ కూడా వైసీపీ వైఎస్ రాజకీయ పరంపరను కొనసాగించడం లేదని బాహాటంగానే చెబుతున్నారు. ఇక వైఎస్ కుటుంబ సభ్యులు కూడా దాదాపుగా జగన్ కు దూరం అయ్యారు. దీంతో వైసీపీకి వైఎస్ రాజకీయ సిద్ధాంతానికీ ఉన్న సంబంధం కూడా పుటుక్కుమని తెగిపోయినట్లే భావించాల్సి ఉంటుంది. అటువంటి తరుణంలో షర్మిల తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తానంటూ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తానంటున్నారు. దీంతో ఇక షర్మిలే వైఎస్ రాజకీయవారసురాలిగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం ఏపీలో రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చేసినట్లైంది. నాలుగున్నరేళ్ల పాలనలో సీఎంగా జగన్ అన్ని రంగాలలో విఫలమయ్యారు. దీంతో విపక్ష తెలుగుదేశం రాష్ట్రంలో బలంగా పుంజుకుంది. మరో ప్రతిపక్షం జనసేన కూడా తెలుగుదేశంతో చేతులు కలిపింది. ఇక జనగ్ పార్టీలో అసమ్మతితో రగిలిపోతున్న వారందరికీ  ఇప్పటి వరకూ తెలుగుదేశం, జనసేన పార్టీలలో ఒక దానిలో చేరడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అయితే షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంతో జగన్ పార్టీలో అసమ్మతి, అసంతృప్తి వాదులందరికీ ఇప్పుడు తమ రాజకీయ గమ్యం కాంగ్రెస్ గా మారిపోయింది. దీని వల్ల విపక్ష కూటమి తెలుగుదేశం, జనసేనకు రెండిందాల మేలు జరుగుతుంది. ఒకటి వైసీపీ నుంచి కుప్ప తెప్పలుగా వచ్చి పడే అసమ్మతి నేతలను తమ పార్టీలలో ఎలా అకామిడేట్ చేయాలా అన్న మీమాంస పోతుంది. రెండు జగన్ ను వ్యతిరేకించి కాంగ్రెస్ లో చేరే వారి సంఖ్య పెరగడంతో.. జగన్ ఓటు వైసీపీ, కాంగ్రెస్ ల మధ్య చీలిపోయి.. వైసీపీని మరింత బలహీనం చేస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇప్పటికే తెలుగుదేశం, జనసేన కూటమికి దఖలు పడిపోయిందని సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి.తటస్థులూ జగన్ పాలనకు చరమగీతం పాడేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనన్న నిర్ణయానికి వచ్చేశారని పరిశీలకులు అంటున్నారు. ఇక ఏపీలో జగన్ కు పడే ఓట్లేమైనా ఉన్నాయంటే.. అవి కాంగ్రెస్ ఓట్లే.. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంతో కాంగ్రెస్ ఓటు మళ్లీ కాంగ్రెస్ పార్టీకే వెడుతుందని విశ్లేషిస్తున్నారు.  తాజా సర్వేలలో  వచ్చే ఎన్నికలలో వైసీపీ 9శాతం ఓట్లు కోల్పోతుందని తేలింది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీలో క్రియాశీలంగా వ్యవహరిస్తే వైసీపీ కోల్పోయే ఓట్ల శాతం మరింత పెరుగుతుందని అంటున్నారు.  షర్మిల చేరిక వల్ల కాంగ్రెస్ కు ఇప్పటికిప్పుడు అంటే వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు కానీ,  వైసీపీని వెనక్కు నెట్టి  రెండో స్థానంలో బలంగా నిలబడేందుకు దోహదపడుతుందని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు.  

లాంఛనం పూర్తయ్యింది.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న షర్మిల

షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడమన్న లాంఛనం పూర్తయ్యింది. గురువారం (జవనరి 4) ఉదయం హస్తినలో  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో వీలీనం కార్యక్రమం కూడా పూర్తయ్యింది. ఇక ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేతపట్టి కాంగ్రెస్ ను రాష్ట్రంలో  బలోపేతం చేయడంతో పాటు, ఏపీ సీఎం అన్న పాలనలోని అవకతవకలను, ఆర్థిక అరాచకత్వాన్ని ఎండగడుతూ ముందుకు సాగుతారా, పార్టీ అధిష్ఠానం ఆమెకు అప్పగించే బాధ్యతలు ఏమిటన్నది ఇహనో ఇప్పుడో స్పష్టమౌతాయి. కానీ షర్మిలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించడమే ఏపీలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను ఆమెకు అప్పగించడానికేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సాధారణంగా ఒక పార్టీ రాష్ట్ర బాధ్యతలను చేపట్టే విషయంలో ఏ పార్టీలోనైనా పోటీ ఉంటుంది. రేసులో నలుగురైదుగురు ఉంటారు. కానీ ఏపీ విషయంలో మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు రుద్రరాజుతో సహా పార్టీలోని సీనియర్ లు అందరూ కూడా షర్మిలకే ఆ బాధ్యతలకు అప్పగించాలని ముక్తకంఠంతో కోరారు. రాష్ట్ర విభజనతో ఏపీలో ఉనికి మాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ ను అధికార రేసులోకి తీసుకురావాలంటే షర్మిలకు బాధ్యతలు అప్పగించడమే మేలని అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రాష్ట్రం విభజనకు ముందే కాంగ్రెస్ తో విభేదించి  దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ సొంత కుంపటి పెట్టుకున్నారు. ఆయన ఏర్పాటు చేసిన వైసీపీలోకి కాంగ్రెస్ లో అంతో కొంతో ప్రజాదరణ ఉన్న నేతలంతా చేరిపోయారు. మరీ ముఖ్యంగా వైఎస్ తో అనుబంధం ఉన్న వారు, ఆయనపై అభిమానం ఉన్న వారూ అందరూ కూడా వైఎస్ వారసుడిగా జగన్ ను భావించి ఆయన పంచన చేరిపోయారు. అలాగే  వైఎస్ విశేష జనాదరణ ఉన్న నేత కావడంతో కాంగ్రెస్ క్యాడర్ కూడా జగన్ పార్టీకే షిఫ్ట్ అయిపోయారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ  లీడర్, కేడర్ కూడా లేకుండా  మిగిలిపోయింది. రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా ఆ పార్టీకి చట్ట సభలో ప్రాతినిథ్యం కూడా లభించలేదు.  ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడంతో ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పుడు ఏపీపై కూడా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇక గత నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ అన్ని విధాలుగా ప్రజల అభిమానాన్ని దూరం చేసుకున్నారు. కరుడుగట్టిన వైఎస్ అభిమానులు కూడా జగన్ ఎంత మాత్రం వైఎస్ రాజకీయ వారసుడు కాదన్న నిర్ధారణకు వచ్చేశారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలూ జగన్ పాలన పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇక పార్టీలో కూడా జగన్ ఒంటెత్తు పోకడలపై అసంతృప్తి పీక్స్ కు చేరింది. అయితే జగన్ తో పాటు ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచీ అడుగులు వేస్తున్న పాత కాంగ్రెస్ నేతలు, వైఎస్ అభిమానులు మరో గత్యంతరం, ప్రత్యామ్నాయం లేక అయిష్టంగానే వైసీపీలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆ సమయంలో  షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడంతో జగన్ పార్టీలో  ఇష్టం లేకపోయినా గత్యంతరం లేక కొనసాగుతున్న వారందరికీ ఒక గమ్యం దొరికినట్లైంది.  ఇక షర్మిల విషయానికి వస్తే.. జగన్ వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన క్షణం నుంచీ తన అన్న జగన్ ను సీఎం చేయడమే లక్ష్యంగా పని చేశారు. అన్న అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళ్లి నప్పుడు పార్టీని ముందుండి నడిపించారు. అన్న కోసం కాళ్లరిగేలా పాదయాత్ర చేశారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జనంలో  సెంటిమెంటును రగిల్చారు. తన శక్తికి మించి కృషి చేసి అన్నను సీఎంగా చూశారు. 2019 ఎన్నికలలో జగన్ నేతృత్వంలోని వైసీపీ ఘన విజయంలో షర్మిల పాత్ర విస్మరించలేనిదనడంలో సందేహం లేదు. అటువంటి షర్మిలను, సొంత చెల్లి అని కూడా చూడకుండా సీఎం అయిన తరువాత పార్టీకి దూరం పెట్టారు. అసలు రాష్ట్రంలోనే ఉండలేని పరిస్థితులు కల్పించి తెలంగాణకు తరిమేశారు. అక్కడ షర్మిల తండ్రి ఆశయాల సాధన కోసం సొంత రాజకీయ పార్టీ వైఎస్సార్టీపీ పెట్టుకున్నారు. అయితే అక్కడా ఆమెకు అడుగడుగునా అవరోధాలు కల్పించారు. ఎవరి నుంచీ ఆమెకు ఎటువంటి సాయం అందకుండా చేశారు.  ఇప్పుడు ఆమె అన్నతో ఢీ కొనేందుకు ఏపీ రాజకీయాలలోకి ప్రవేశించారు. ఆమెకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది.  ఆమె ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తారన్నది స్పష్టం అవ్వడంతోనే జగన్ పట్ల అసంతృప్తి ఉన్న వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ బాట పడుతున్నారు. వీరిలో నిన్నమొన్నటి వరకూ జగన్ కు అత్యంత ఆప్తుడిగా గుర్తింపు పొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే ఒకరు. షర్మిలమ్మ వెంటే తన అడుగులు అంటూ ఆయన బహిరంగంగా ప్రకటించేశారు. తాజాగా దివంగత వైఎస్ కు అనుయాయిగా పేరొందిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా వైసీపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం ఆయన తన అనుచరులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే షర్మిలతో టచ్ లోకి వచ్చారని కూడా అంటున్నారు. ఆయన అడుగులు కాంగ్రెస్ వైపే పడుతున్నాయనడానికి నిదర్శనంగా ఆయన అనుచరులు జగన్ కు, వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విజయవాడలో ధర్నాలు నిర్వహించారు. మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధమయ్యారు.  రానున్న రోజులలో ఇలా కాంగ్రెస్ గూటికి చేరు వైసీపీ నేతల సంఖ్య మరింత పెరుగుతుందని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరిపోవడంతో సిట్టింగులను మార్చేస్తున్న జగన్ ముందు ముందు అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితుల్లో పడ్డా ఆశ్చర్యపోనవసరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

షర్మిల ఎంట్రీ.. ఇక జగన్ ఎగ్జిట్టేనా!?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత  జగన్‌ సోదరి   షర్మిల  కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. గురువారం(జనవరి 4) ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. అదే రోజు ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.  తన వైఎస్సార్టీపీ ని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ రాజకీయాలలో  క్రియీశీలంగా వ్యవహరిస్తారు. ఆమె కాంగ్రెస్ ప్రవేశం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి తీరని నష్టం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఓటమి ఖరారై.. సిట్టింగుల మార్పు మంత్రంతో ఓటమి అంతరాన్ని తగ్గించుకోవాలని తపన పడుతున్న జగన్ కు షర్మిల కాంగ్రెస్ చేరిక మింగుడుపడదనడంలో సందేహం లేదు.   షర్మిల రాజకీయ అడుగులు ఏపీలో అధికార వైసీపీ కాళ్ల కింద భూమిని కదిపేస్తున్నాయి.  మిణుకు మిణుకు మంటున్న గెలుపు ఆశలను ఆవిరి చేసేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కు స్వయాన సోదరి అయిన షర్మిల అన్నకు వ్యతిరేకంగా ఏపీలో కాంగ్రెస్ తరఫున క్రియాశీలంగా వ్యవహరించడానికి నిర్ణయించుకోవడంతో  వైసీపీలో అత్యధికులు తాము మునిగిపోయే నావలో  ఉన్నామని భావిస్తున్నారు. అవకాశం చిక్కితే గోడ దూకేయడమే తరువాయి అన్నట్లు వేచి చూస్తున్నారు.  ఆ అవకాశం స్వయంగా జగన్ వారికి ఇచ్చినట్లు కనిపిస్తోంది. తన ప్రభుత్వంపై వెల్లువెత్తుతన్న ప్రజా వ్యతిరేకతను తగ్గించుకునేందుకు  చేపట్టిన సిట్టింగుల మార్పు కార్యక్రమం ద్వారా జగన్ స్వయంగా తన పార్టీ నేతలకు గోడదూకే అవకాశాన్ని కల్పించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైసీపీలో వచ్చే ఎన్నికలలో పోటీకి టికెట్ దక్కని ఆశావహులు, నియోజకవర్గ మార్పు పట్ల అసంతృప్తితో ఉన్న సిట్టింగులు, జగన్ వైఖరితో విసిగిపోయిన నేతలు, కార్యకర్తలు ఇలా వైసీపీలో అసంతృప్తి, అసమ్మతి వాదులందరూ షర్మిల చేరిక తరువాత కాంగ్రెస్ బాట పట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి  తన అడుగులు షర్మిల వెంటేనని ప్రకటించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అలాగే తనకు టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా వైసీపీని వీడి కాంగ్రెస్ లో చేరుందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. వీరిరువురే కాకుండా కేవలం వైఎస్ పై అభిమానంతో ఆయన కుమారుడి పార్టీలో కొనసాగుతున్న అనేక మంది షర్మిల బాటలో అడుగులు వేసే అవకాశాలున్నాయంటున్నారు. షర్మిల చేరికతో ఏపీలో  కాంగ్రెస్ ఏదో మేరకు బలోపేతమౌతుందనడంలో సందేహం లేదు. అయితే అది ఓట్లు, సీట్లు గెలుచుకునేందుకు ఎంత మేరకు దోహదపడుతుందన్నది చెప్పలేం కానీ, వైసీపీ మాత్రం కోలుకోలేని విధంగా దెబ్బతింటుందనడంలో సందేహం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిలను బుజ్జగించేందుకు, ఆమె కాంగ్రెస్ గూటికి చేరకుండా ఆపేందుకు పలు ఆఫర్లతో జగన్ తరఫునుంచి   రాయబేరాలు జరిగాయనీ, వైఎస్ కుటుంబానికి దగ్గర బంధువైన వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ఈ రాయబారం నడిపారని, అయితే షర్మిల మాత్రం ఖరాకండీగా అన్న పంచన చేరే ప్రశక్తే లేదని తెగేసి చెప్పారనీ కూడా వార్తలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం అంటే.. ఏపీలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకం అవ్వడమేనని అంటున్నారు.  వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. షర్మిల ఏ పార్టీలో చేరినా మాకు అభ్యంతరం లేదు, ఆమె కాంగ్రెస్ లో చేరడం వల్ల చీలేది ప్రభుత్వ వ్యతిరేక ఓటేనంటూ, అది తమకే ప్రయోజనం అని చెప్పుకుంటున్నా.. నిజానికి షర్మిల కాంగ్రెస్ తరఫున ఏపీలో  క్రియాశీలంగా వ్యవహరించడం వల్ల జగన్ ప్రతిష్ట మసకబారడమే కాకుండా, సొంత చెల్లిని, తల్లిని రాష్ట్రం నుంచి గెంటేశారన్న అంశం మళ్లీ తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తల్లి విజయమ్మ కనీసం కుమారుడి ఇంటికి కూడా రావడానికి ఇష్టపడటం లేదంటున్నారు. ఆమె విజయవాడ వచ్చినా.. తాడేపల్లి ప్యాలెస్ గుమ్మం ఎక్కలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.   ఇక రాష్ట్ర విభజనతో  ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా తుడిచిపెట్టుకు పోయిన కాంగ్రెస్   షర్మిల చేరిక ఏదో మేరకు పుంజుకుంటుంది. ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ మై కమాండ్ షర్మిలను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఏపీలో కీలక పాత్ర పోషించేలా ప్రోత్సహిస్తున్నారు.  జగన్ కు వ్యతిరేకంగా ఏపీలో తన గళం విప్పేందుకు షర్మిల రెడీ అయిపోయినట్లే తెలుస్తోంది. షర్మిల భర్త బ్రదర్ అనీల్ బుధవారం తెలుగుదేశం నాయకుడు బీటెక్ రవితో కాకతాళీయంగా కలిశారు. ఆ సందర్భంగా ఆయన తన భార్య షర్మిల ఏపీ కాంగ్రెస్ లో క్రీయాశీలంగా పని చేయడం ఖాయమనీ, జగన్ వేధింపుల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.   ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో జగన్ కు ఆయన పార్టీకీ ఎదురీత తప్పదని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.