తెలుగుదేశంలోకి దండు యాత్ర.. జర జాగ్రత్త!

ఎన్నికలు సమీపిస్తున్నాయి.  అలాంటి సమయంలో.. ఓ రాజకీయ పార్టీలో నుంచి మరో పార్టీలోకి గాలి వాటం నేతలు.. అంటే అయారాం.. గయారాంలు మళ్లీ... పార్టీ కండువా మార్పిడి  కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు కదం తొక్కుతున్నారు. ఇప్పటికే అలాంటి దండు.. మిడతల దండులా దూసుకొస్తున్నదని.. అలాంటి వారి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని లేకుంటే.. తెలుగుదేశం పార్టీ మళ్లీ పూర్వ స్థితిలోనే కొనసాగే అవకాశముందని.. తెలుగుదేశం  శ్రేణుల్లో  ఆందోళనగా వ్యక్తమవుతోంది.  ఎందుకంటే.. 2019 ఎన్నికల్లో  వైసీపీ విజయం సాధించడంతో తెలుగుదేశం  ప్రతిపక్షానికే పరిమితమైంది.  గతంలో అంటే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ  ప్రతిపక్ష పాత్ర పోషించినా.. ఏనాడు పడని ఇబ్బంది..  విభజిత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ  అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ఎదుర్కొంది. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి  కింద స్థాయి కార్యకర్తవరకూ జగన్ పార్టీ వేధింపులను ఎదుర్కొన్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  జగన్ ముఖ్యమంత్రి గా అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రజా వేదిక కూల్చివేత నుంచి..   స్కిల్  కేసులో  చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం వరకూ సీఎంగా జగన్ చేసిన ప్రతి పనీ విపక్షాన్ని వేధించడమే లక్ష్యంగా సాగింది.   తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోని.. రాజకీయ ఓనమాలు దిద్దుకొన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్లు..  జగన్ పార్టీలో చేరిన తర్వాత  చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇదంతా జగన్ ప్రోద్బలంతోనే, ఆయన ఆదేశాలతోనే జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వీరిద్దరే అని కాదు..  జగన్ తొలి, మలి కేబినెట్‌లోని మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. తెలుగుదేశం అధినేత  చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై రకరకాలుగా వ్యంగ్య బాణాలు సంధించారు.. అయితే ఆ సమయంలో ఇలా మాట్లాడడం తప్పు.. చాలా పెద్ద తప్పు.. రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కొండి.. అంతేకానీ.. వారి ఫ్యామిలీని ఇలా కించ పరచడం.. ఇంట్లో వారిని బయటకు లాగడం ద్వారా రాజకీయ లబ్ది పొందడం చాలా దారుణమంటూ.. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ.. ఫ్యాన్ పార్టీలో అగ్రనేతలు కానీ... ప్రజాధనాన్ని లక్షలకు లక్షలు జీతాలుగా తీసుకుంటున్న సలహాదారులు కానీ..  ఒక్క మాట చెప్పిన పాపాన పోలేదు. అలాగే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత..  తెలుగుదేశం  అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నుంచి ఆ పార్టీలోని సాధారణ కార్యకర్త వరకు అందరిపైనా పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి.  అలాంటి సమయంలో సైతం.. అధికారం అనేది ఎవరికీ శాశ్వతం కాదని.. నేడు అధికారం మీ వద్ద ఉంటే.. రేపు మరో పార్టీ పరం అవుతుందని.. అలాంటి పరిస్థితుల్లో.. ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుందని.. ఇంకా చెప్పాలంటే.. రేపు ఇదే పరిస్థితి మనకు మన పార్టీలోని వారికి ఎదురైతే.. మన పరిస్థితి ఎలా ఉంటుందో ఓ ఆలోచన చేయాలని సూచించాల్సిన పెద్దలు..  జగన్ పార్టీలో లేరని.. ఎవరైనా ఉన్నా వారు మౌనముద్రే వహించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే దాదాపుగా ఇదే విషయాన్ని గతంలో అంటే.. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల వేదికగా.. ఆయన ముఖ్య అనుచరుడు సుబ్బారావు గుప్తా.. ప్రస్తావించి.. సదరు ఎమ్మెల్యే గారి ప్రధాన అనుచరుడు సుభానీ చేతిలో గుప్తాకు తకదిన తోం తకదిన తోం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.     ఇక టోటల్‌గా చెప్పోచ్చేదేమిటంటే.. అధికార వైసీపీ నుంచి వచ్చేసిన వారు.. వస్తున్న వారు.. రావాలనుకుంటున్న వారు.. గతంలో వారు తెలుగుదేశంలో ఉన్నవారైనప్పటికీ  పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. ఎలా వ్యవహరించారన్న విషయాన్ని గమనించాలని.. లేకుంటే అలాంటి వారు .. పార్టీలోకి మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం వల్ల... పార్టీలో జెండా కర్రలాగా పాతుకుపోయిన అసలు సిసలు నేతల నుంచి శ్రేణుల వరకు హోల్ సేల్‌గా దెబ్బయిపోతారని.. ఎందుకంటే.. ఈ సారి ఎన్నికల్లో పార్టీ  గెలిచినా.. భవిష్యత్తులో ఓ వేళ మళ్లీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తే.. ఇలా పార్టీలు మారే అయారాం గయారాంలు..  ఇట్టే గోడలు దూకేస్తారని.. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చిన వారు ఎవరు, మన వాడా, మన బాగు, పార్టీ బాగు కోరే వాడా? కాదా? వాడిలో లేశమంత అయినా .. నీతి నిజాయితీ గట్రా లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదా... అనేవి పరిశీలించాలని.. పార్టీ అధినాయకత్వానికి హార్డ్ కోర్ ఫ్యాన్స్  సూచిస్తున్నారు. అలా కాకుంటే.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంటే..  ఆ పార్టీ కుండువా కప్పుకొని.. ఆ పార్టీ రంగు చొక్కా తొడుక్కొని.. పండగ వేళ.. చందాల కోసం వచ్చిన.. వస్తున్న బాపతు లాంటి వాళ్లా అన్నా ఆలోచన చేయాలని పార్టీలోని కీలక నేతలకు సైకిల్ పార్టీ శ్రేణులు ఓ సూచన చేస్తోంది.

జగన్ పార్టీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై?.. కాంగ్రెస్ గూటికి మల్లాది విష్ణు?

నిన్నటి వరకూ అదిగో ఇదిగో అంటూ ఉత్కంఠ రేపిన వైసీపీ సెకండ్‌ లిస్ట్‌ వచ్చేసింది. మొదట జాబితాలో 11 మందిని మార్చేయగా.. ఇప్పుడు 27 మందిని మార్చేశారు. మొత్తంగా వైసీపీ 38 మంది ఇన్‌ఛార్జ్‌ల్ని ఇప్పటివరకు మార్చేసింది. ఫస్ట్‌ లిస్ట్‌లో కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటిస్తే, సెకండ్‌ లిస్ట్‌లో  ఎంపీ టికెట్స్‌ కూడా ప్రకటించేశారు. సెకండ్‌ లిస్ట్‌లో 11 మంది సిట్టింగ్‌లకు షాక్‌ ఇచ్చారు జగన్‌.  వీళ్లల్లో 10 మంది ఎమ్మెల్యేలు కాగా, ఒకరు ఎంపీ. వీరిలో కొందరు తీవ్ర ఆగ్రహంతో ఉండగా.. మరికొందరు అసలు పోటీ చేసేవరకూ నమ్మకం లేదని తెలుస్తున్నది. ఇక టికెట్ లేదని తేలిన వారు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే బాబు వంటి కొందరు ఎమ్మెల్యేలు తాము చేసిన తప్పేంటో చెప్పాలని, తమకు టికెట్ ఎందుకు నిరాకరిస్తున్నారో వెల్లడించాలని జగన్ ను   ప్రశ్నిస్తున్నారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న వారిలో విజయవాడ సెంట్రల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఒకరు.‌   విష్ణుకు జగన్ షాకిచ్చారు. సెంట్రల్‌ ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి వెల్లంపల్లిని నియమించడంతో విష్ణు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఆయన అనుచరులైతే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. తనకు టికెట్ లేదన్న అధిష్టానం నిర్ణయంతో మల్లాది విష్ణు అనుచరుల ఆందోళన బాట పట్టారు. బందరు రోడ్డులో విష్ణు అనుచరులు బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీకీ, జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విష్ణుకి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ వైపు మల్లాది విష్ణు వెళతారానే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. విష్ణును మార్చడంపై అసంతృప్తితో రగిలిపోతున్న విష్ణు వర్గం త్వరలోనే జింఖానా మైదానంలో సమావేశమై.. జగన్ తో తాడో పేడో తేల్చుకోవాలని.. తమ డిమాండుకు తలొగ్గకపోతే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  నిజానికి విష్ణు వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన నేత. జగన్ తండ్రి రాజశేఖరరెడ్డికి విష్ణు అంటే ప్రత్యేక అభిమానం అని చెప్పుకుంటారు. అలాంటి విష్ణుకు జగన్ హ్యాండిచ్చేశారు. మల్లాది విష్ణు కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ హయాంలో వుడా చైర్మన్‌గా కూడా పని చేశారు. ఆ తర్వాత విష్ణు వైసీపీకి మారారు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుండి విజయం సాధించారు. దీంతో జగన్ విష్ణుకు ఏపీ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా నియమించి ఆయనకు కేబినెట్ హోదాను కూడా కల్పించారు. రెండేళ్ల పాటు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవిలో కొనసాగారు. ఈసారి ఎలాగైనా అదే సెంట్రల్ నుండి పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. కానీ, జగన్ ఆయనకు షాక్ ఇస్తూ ఆయనను అక్కడ నుండి లేపేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తన రాజకీయ ప్రస్థానం ఏ పార్టీతో మొదలైందో మళ్ళీ అదే పార్టీకి వెళ్లడానికి డిసైడైపోయారని ఆయన అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగ్రేటం చేసిన మల్లాది విష్ణు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ గూటికే చేరనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే మల్లాది షర్మిలతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. షర్మిల కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేస్తుండడంతో పాటు ఏపీపై ఫోకస్‌ పెడతారన్న ప్రచారం సమయంలో విష్ణు మళ్లీ తిరిగి హస్తం గూటికే చేరే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు. ఆ మాటకొస్తే విష్ణు ఒక్కడే కాదు.. అదే బాటలో చాలామంది అసంతృప్త వైసీపీ ఎమ్మెల్యేలకు షర్మిల బెస్ట్ ఛాన్స్ గా మారేలా కనిపిస్తుంది. వైసీపీలో గెలుపు అవకాశం లేని ఎమ్మెల్యేలు, స్థానాల మార్పునకు ఇష్టపడని నేతలు, అసంతృప్త ఎమ్మెల్యేలు అందరికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బెస్ట్ ఛాయిస్ గా మారినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే షర్మిల వెంట నడుస్తూ.. కాంగ్రెస్ లోకి వెళ్లే తొలి వైసీపీ ఎమ్మెల్యే తానేనని కూడా ప్రకటించేశారు. ఈ క్రమంలో ఇదే బాటలో ఎంతమంది నడవనున్నారో చూడాల్సి ఉంది.

హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి బళ్లారి మహిళ.. గాలి బంధమేనా?

ఏపీలో అధికార  వైసీపీ చిత్ర విచిత్ర రాజకీయ విన్యాసాలు చేస్తున్నది. ఆ పార్టీ అధినేత,  సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓటెద్దు పోకడలతో ఇష్టారాజ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను మార్చేస్తూ తాను సీతయ్యనని, ఎవరి మాటా వినననీ రుజువు చేసుకుంటున్నారు.  ఇప్పటికే ఇలా అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ఖరారు చేస్తూ రెండు జాబితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మంత్రులు, సీనియర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.  అంతేకాదు గెలిచే అవకాశాలున్నాయంటూ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి కూడా పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు. ఇలా తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో   కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎంపీని ఇలా పార్టీలో చేర్చుకుని అలా అవకాశం ఇచ్చేశారు. ఇంకా చెప్పాలంటే ఉదయం కర్ణాటకలో ఫ్లైట్ ఎక్కి బెజవాడ రావడం.. తాడేపల్లి వెళ్లి జగన్ కు కలిసి పార్టీలో చేరడం.. మళ్ళీ తిరిగి ఆమె కర్ణాటకకు వెళ్లే లోపే ఆమెను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. దీంతో అవాక్కవడం ఏపీ వైసీపీ నేతల వంతైంది.   ఇంతకీ ఎంపీ అభ్యర్థిగా ఛాన్స్ కొట్టేసిన ఆ మహిళ ఎవరు అన్న వివరాల్లోకి వెడితే..  ఈ సారి నోరెళ్ల బెట్టడం ప్రజల వంతైంది. ఆ మహిళ పేరు జే శాంత. ఈమె కర్ణాటకలో బీజేపీ నాయకురాలు. అదే పార్టీ నుండి గెలిచిన మాజీ ఎంపీ కూడా. మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శాంత ముఖ్యమంత్రి జగన్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఏపీలో సీఎం జగన్‌ చేస్తున్న అభివృద్ధి చూసే పార్టీలో చేరానని  తెలిపారు.  వైసీపీలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తానన్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు తనను ఆశీర్వదించాలని కోరారు. వాల్మీకి వర్గానికి సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారన్న శాంత.. అవకాశం ఇస్తే వచ్చే ఎన్నికల్లో హిందూపురం ఎంపీగా పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక ఆమె అలా అన్నారో లేదో అదే రోజు సాయంత్రానికి ఇలా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చేశారు జగన్. గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్న హిందూపురం లోక్ సభ స్థానానికి ఆమెను ఇంచార్జ్ గా నియమించారు. వచ్చే ఎన్నికల్లో గోరంట్లకు మొండి చేయి చూపించేసి హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా శాంత పోటీ చేయడం  ఖరారైంది.  దీంతో అసలు ఈ శాంత ఎవరు? ఆమెకు జగన్ పిలిచి మరీ ఎంపీ టికెట్ ఇవ్వడం ఏంటి? అసలు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇలా ఎన్నో రకాల చర్చలు మొదలయ్యాయి. హిందూపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న శాంత బీజేపీ మాజీ ఎంపీ, కర్ణాటక బీజేపీ ముఖ్యనేత జే. శ్రీరాములుకు స్వయానా సోదరి. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన శ్రీరాములు గత బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2009లో బీజేపీ నుంచి బళ్లారి ఎంపీగా శాంత చేత పోటీ చేశారు. ఆమె ఎన్‌వై హనుమంతప్ప పై కేవలం 2వేల పై చిలుకు ఓట్లతో ఎంపీగా గెలిచారు. అప్పటి బీజేపీ ప్రభుత్వంలో జే.శ్రీరాములు, గాలి జనార్దన్‌రెడ్డి, గాలి కరుణాకర్‌ రెడ్డి మంత్రులు కాగా గాలి సోమశేఖర్‌రెడ్డి కేఎంఎఫ్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కర్ణాటకలో గాలి బ్యాచ్‌ అంతా ఓడిపోగా.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీరాములు చిత్తుగా ఓడిపోయారు. ఇలాంటి సమయంలో శ్రీరాములు సోదరి శాంత ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టారు. నిజానికి శాంత భర్త స్వస్థలం ఏపీలోని గుంతకల్లు. అయితే  వారు  బళ్లారిలో స్థిరపడ్డారు. శాంత స్వస్థలం కర్ణాటకనే కావడంతో ఆమె అక్కడే రాజకీయాలలో ఉన్నారు. అయితే, ఇప్పుడు ఇలా వైసీపీలో చేరడం వెనుక హైద్రాబాదుకు చెందిన ఒక రెడ్డి సామాజిక వర్గ వ్యక్తి కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. అలాగే గాలి సోదరులతో జగన్ మోహన్ రెడ్డికి వ్యాపార లావాదేవీలు, అవినీతి భాగస్వామ్యం ఉన్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే గాలి వర్గానికి చెందిన శాంతను ఇప్పుడు ఏపీకి దిగుమతి చేశారని అంటున్నారు. అయితే శాంత రాకతో స్థానిక వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాల్మీకి సమాజానికి చెందిన వారు ఏపీలో లేక కర్ణాటక నుండి దిగుమతి చేసుకున్నారా అంటూ మండిపడుతున్నాయి. ఇంతకాలం పార్టీలో ఉన్న వారిని కాదని ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి మాపై రుద్దడం ఏంటని నిలదీస్తున్నాయి. అలాగే ఒక బీజేపీ నేతకు వైసీపీ కండువా కప్పేసి ఆమెకు సీటు ఇచ్చేయడంతో  వైసీపీ బీజేపీకి బీటీం అనేది నిర్ధారణయిపోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

షర్మిల కోడలు బ్యాక్ గ్రౌండ్ గురించి అసలు నిజాలివే!

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా తన కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి ఇడుపులపాయకు వెళ్లి ప్రత్యేక పార్ధనలు నిర్వహించారు. కుమారుడి వివాహ మొదటి పత్రికను వైఎస్సార్ ఘాట్ వద్ద ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షర్మిల వెంట ఆమె తల్లి వైఎస్ విజయమ్మ, కొంత మంది బంధువులు కూడా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మనవడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి కాబోతుందని, వైఎస్సార్‌తో పాటు ప్రజలందరి దీవెనలు కొత్త దంపతులపై ఉండాలని షర్మిల అన్నారు. ఈ సందర్భంగా రాజారెడ్డి, ఆయన కాబోయే భార్య  ప్రియా అట్లూరి జంటకి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అసలు ఇంతకీ రాజారెడ్డి చేసుకోబోయే ప్రియా అట్లూరి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? రాజారెడ్డి-ప్రియా అట్లూరి పరిచయం ఎలా జరిగింది అన్నది ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రియా ఎవరనేదానిపై చాలా రకాల ఊహాగానాలు కూడా ఇప్పటికే హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ప్రియా ఎవరన్నది ఆసక్తిగా మారింది. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి అమెరికాలో చదువుకుంటున్న సమయంలో ప్రియా అట్లూరితో పరిచయం ఏర్పడగా.. అది కాస్త ప్రేమగా మారిందని చెబుతున్నారు. అయితే, ఈ ప్రేమికులిద్దరూ తమతమ కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. ఇక, ప్రియా అట్లూరి చట్నీస్ హోటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలని తొలుత ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదు. బ్రదర్ అనిల్ స్నేహితుడు అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తె అట్లూరి ప్రియా కాగా.. అట్లూరి శ్రీనివాస్‌కు అమెరికాలో కన్సల్టెన్సీ సంస్థ ఉందని తెలుస్తోంది. బ్రదర్ అనిల్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీలుకూడా ప్రియా తండ్రే చూస్తున్నారని చెప్తున్నారు. కాగా అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. అమెరికా పౌరసత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రియా కుటుంబం ఎప్పుడో  క్రైస్తవ మతాన్ని స్వీకరించారని కూడా తెలుస్తోంది. మొత్తంగా అట్లూరి కుటుంబానికి బ్రదర్ అనిల్‌తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని చెప్తున్నారు.  జనవరి 18న వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియాల నిశ్చితార్థం వేడుక జరగనుండగా.. ఫిబ్రవరి 17న వివాహ వేడుక జరగనుంద‌ని తాజాగా స్వయంగా ష‌ర్మిలనే ప్రకటించారు. రాజారెడ్డి, ప్రియా వివాహం రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలెస్ లో నిర్వహించనున్నట్లు సమాచారం ఉండగా.. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరగబోయే వీరి పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇక, అంతకు ముందే హైదరాబాద్ లో నిశ్చితార్థం వేడుకను భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు చెప్తున్నారు. ఈ వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ప్లాన్ చేశారట. ఇప్పటికే బంధువులకు ఆత్మీయులకు స్నేహితులకు ఇన్విటేషన్ కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంగళవారం (జనవరి 2న) కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రికను ఘాట్ వద్ద పెట్టి ఆశీర్వాదం తీసుకొని పూజలు నిర్వహించారు. ఇక, ఇడుపుల పాయలో మీడియాతో మాట్లాడిన షర్మిల సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అతి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్టీపీ విలీనం ప్రక్రియ పూర్తి కానున్నట్లు, కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించనున్నట్లు షర్మిల వెల్లడించేశారు. దీంతో హైదరాబాద్ లో జరగనున్న నిశ్చతార్థం వేడుకపై ప్రత్యేక ఆసక్తి మొదలైంది. షర్మిల ఇంట పెళ్లి భజంత్రీలతో పాటు ఈ జనవరి నెలలలోనే షర్మిల రాజకీయ జీవితంలో కూడా కీలక మలుపులు తిరగనున్నట్లు కనిపిస్తుంది. షర్మిల ఏపీకి రానుండడం, స్వయంగా అన్న జగన్ మీదనే తలపడనుండడంతో.. షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహానికి జగన్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇక షర్మిల తాడేపల్లికి వెళ్లి స్వయంగా బుధవారం అన్న జగన్ ను కలిసి కుమారుడు పెళ్లికి ఆహ్వానం పలికారు.  కాగా ఈ సందర్భంగా అన్నా చెళ్లెళ్ల మధ్య ఏం జరిగిందీ, షర్మిల కాంగ్రెస్ గూటికి చేరనుండటంపై జగన్ ఏమైనా వ్యాఖ్యలు చేశారా?  షర్మిల ఏం మాట్లాడారు? వంటి అంశాలపై  రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద షర్మిల వైఎస్సార్టీపీ పెట్టుకుని పొరుగురాష్ట్రం వెళ్లిన తరువాత ఇరువురూ కలిసిన సందర్భం ఇదే కావడం గమనార్హం. షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని ఏపీ రాజకీయాలలో క్రీయాశీలం కావడం జగన్ కు కచ్చితంగా ఇబ్బంది కలిగిస్తుందన్న విశ్లేషణల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. 

బొత్స క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన డిఎస్సీ అభ్యర్థులు 

సీఎం వైయస్ జగన్.. నిరుద్యోగుల విషయంలో మాత్రం మొదటి నుంచి శీతకన్ను వేశారన్నది నిజం. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినా.. అది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చలేదు. దాంతో జగన్ ప్రభుత్వంపై నిరుద్యోగులు గుర్రుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికల ముంగిట వారిని సంతృప్తి పరిచే దిశగా జగన్ అడుగులు వేయబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంకేతాలిచ్చారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి బొత్స ప్రకటించారు. ఆ డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహిస్తామని.. అలానే యూనివర్సిటీలు, ట్రిఫుల్ ఐటీల్లో కలిపి సుమారు 3,238 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు కూడా మంత్రి ప్రకటించారు. కానీ ఆచరణలో ఆమడ దూరంలో ఉన్నారు. దీంతో ఎపిలో నిరుద్యోగులు మండిపడుతున్నారు.  మెగా డిఎస్సీ ప్రకటించాలని  డిమాండ్ చేస్తూ డివైఎఫ్ ఐ ఆధ్వర్యంలో డిఎస్ సి అభ్యర్థులు బుధవారం విజయవాడలోని మంత్రి  బొత్స సత్యనారాయణ  క్యాంపు కార్యాలయాన్ని విజయవాడలో  ముట్టడించారు.  వందలాది నిరుద్యోగులు ముట్టడించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆందోళన కారులు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ ప్రకటించకపోతే వైకాపా  ప్రభుత్వానికి  ప్రజలు బుద్ది చెబుతారన్నారు. తెలంగాణలో నిరుద్యోగులు కెసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టిన విధంగా జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తారన్నారు. మెగా డిఎస్ సితో బాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. జగన్ అధికారంలో  వచ్చినప్పటి నుంచి జాబ్ కేలండర్ ప్రకటించలేదనే ఆరోపణ మూఠగట్టుకున్నారు. 

పబ్బుల్లో ఆ డాన్సులేంటి.. రోజాపై బాలకోటయ్య ఫైర్!

నటి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేరు వివాదాలలో తప్ప సాధారణంగా వినిపించదు. మంత్రిగా ఆమె చేపట్టే కార్యక్రమాలు, అమలు చేసే పథకాల విషయం ఎలా ఉన్నా, తన వ్యవహారశైలితో, తనకే సాధ్యమైన విమర్శనా పటిమతో మాత్రం ఆమె నిత్యం వార్తల్లో ఉంటారు. ఏదో సినిమాలో అన్న నడిచొస్తే మాస్తు.. అన్న లుక్కెస్తే మాస్ అన్న అ పాటలా  రోజా డ్యాన్స్ చేస్తే వివాదం, రోజా మాట్లాడితే వివాదం అన్నట్లుగా ఉంటుంది వ్యవహారం. ప్రజలు ఓ వైపు తుపాను కారణంగా నానా ఇబ్బందులూ పడుతుంటే.. ప్రభుత్వ సాయం కోసం పడిగాపులు పడుతుంటే.. అదే వానలో   డ్యాన్సులు చేస్తూ  రీల్స్ చేయగలిగే ధైర్యం, తెగింపు రోజాకే చెల్లింది. అంతా నాఇష్ఠం ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్లుగా రోజా వ్యవహార శైలి ఉంటుంది.   ఇప్పుడు మళ్లీ కొత్తగా రోజా ప్రస్తావన ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. తాజాగా న్యూ ఇయర్ వేడుకల సందర్బంగా బెంగళూరులో ఓ పబ్బులో మంత్రి రోజా చేసిన డ్యాన్స్ చేస్తూ రోజా సామాజిక మాధ్యమంలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురయ్యారు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య రోజాను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రోజా తన తీరుతో ప్రభుత్వ పరువునే కాకుండా రాష్ట్రం పరువును కూడా తీసేస్తున్నారని పేర్కొంటూ ఆమెను వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని కోరుతూ సీఎం జగన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో రోజా లాంటి మంత్రిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా ఆయన రోజు మంత్రిగా అనర్హురాలని పేర్కొన్నారు. తనను గెలిపించిన నియోజకవర్గానికి రోజా చేసింది శూన్యమని విమర్శించారు. అటువంటి వ్యక్తం కేబినెట్ లో ఉండటం ప్రజా స్వామ్యానికే మాయని మచ్చ అంటూ ఫైరయ్యారు.   

గృహలక్ష్మి పథకం రద్దు.. ఇందిరమ్మ ఇళ్ల కు దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ ప్రభుత్వం గృహలక్ష్మీ పథకాన్ని రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం (జనవరి 2) ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే స్తోమత లేని పేదవారికి ఇంటికి మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకాన్ని గత తెరాస ప్రభుత్వం గత ఏడాది జారీ చేసిన ఉత్తర్వులను రేవంత్ సర్కార్ రద్దు చేసింది. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు ఉత్తర్వులు జారీ చేశారు.  గృహ లక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 2,12,095 కుటుంబాలకు  జారీ అయిన శాంక్షన్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. గృహ లక్ష్మీ పథకం స్థానంలో    ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకురానున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసింది. ఇందు కోసం దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నది. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా  సొంత  స్థలం ఉండి ఇళ్లు కట్టుకునే ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు ఇంటికి ఐదు లక్షల రూపాయల చొప్పున సాయం అందించనున్నది.    

రేపు  కెసీఆర్ ను పరామర్శించనున్న జగన్ 

రాజకీయ టక్కు టమారా  గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన తెలంగాణ మాజీ సిఎం కెసీఆర్ ను ఆయన చిరకాల మిత్రుడు ఎపి ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు.  గత నెలలో ఫామ్ హౌజ్ బాత్రూంలో కాలు జారిపడి తుంటి ఎముక విరిగి ఆస్పత్రి పాలైన  కెసీఆర్ ను జగన్  గురువారం నాడు  (జనవరి 4)  హైదరాబాద్ లో పరామర్శించనున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌  గత నెలలో ఫోన్ ద్వారా  పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు.  ఇప్పటికే టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు కెసీఆర్ చికిత్సపొందుతున్న సమయంలోనే యశోదా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే. కెసీఆర్ ను పరామర్శించడానికి చంద్రబాబు వచ్చిన సమయంలో కెటీఆర్, కవితలు మొహం చాటేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో  కనీసం అభినందించని కెసీఆర్ ను ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి పరామర్శించారు.  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం టిఆర్ఎస్  సహకరిస్తుందని, పోలవరం ప్రాజెక్టుకు సంపూర్ణ మద్దత్తు ఇస్తానని కెసీఆర్ గతంలో అన్నారు.

నాడు గెలిపించాయి.. నేడు ఓడిస్తాయి! జగన్ కు అన్నీ, అందరూ రివర్స్!

నిన్న మొన్నటి దాకా షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి, ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తారంటూ వచ్చిన వార్తలలో వాస్తవం ఎంత, ప్రచారం ఎంత అన్న అనుమానాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతూ ఉండేవి. షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తారని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు వంటి వారు మీడియా సమావేశంలో ప్రకటించేసినా కూడా షర్మిల నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఆమె కాంగ్రెస్ లోకి వస్తారా? రారా? అన్న అనుమానాలు అలాగే ఉండిపోయాయి. కానీ షర్మిల ఒకే ఒక్క మాటతో ఆ అనుమానాలన్నిటినీ నివృత్తి చేసేశారు. తనకు కాంగ్రెస్  నుంచి ఆహ్వానం ఉందనీ, ఆ పార్టీతో కలిసి ప్రయాణిస్తాననీ మీడియా సమావేశంలో విస్పష్టంగా ప్రకటించేశారు. అంతకు ముందు పార్టీ ముఖ్య కార్యకర్తలతో భేటీ అయిన షర్మిల తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు తెలిపారు. ఆ తరువాత పులివెందుల వెళ్లిన ఆమె వైఎస్ సమాధి వద్ద తన కుమారుడి పెళ్లి శుభలేఖ ఉంచి ఆశీస్సులు తీసుకున్నారు. బుధవారం (జనవరి 3) తన సోదరుడు జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లి శుభలేఖ అందించనున్నారు. ఆ తరువాత ఆమె హస్తిన వెళ్ల నున్నారు.  తెలంగాణ ఎన్నికలలో తన వైఎస్సార్టీపీని పోటీ కి దూరంగా ఉంచడం కాంగ్రెస్ కు లాభించిందనీ షర్మిల చెప్పారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఏపీలో పార్టీని కాపాడాల్సిందిగా కోరుతున్నారనీ, అందుకు తనకు ఇసుమంతైనా అభ్యంతరం లేదనీ చెప్పారు. విలీనం, ఇతర అంశాలపై చర్చించేందుకే తాను హస్తిన వెడుతున్నట్లు చెప్పారు. ఇక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీలో రాజకీయాలు చేస్తే జగన్ పరిస్థితి ఏమిటి అన్నది చూస్తే.. గత నాలుగున్నరేళ్లుగా ఏపీలో రివర్స్ పాలన సాగించిన జగన్ కు ఎన్నికల సమయం వచ్చే సరికి 2019 ఎన్నికలలో అనుకూలంగా ఉన్న ప్రతి అంశమూ ఇప్పుడు రివర్స్ అవుతోంది. ప్రతి కూలంగా మారుతోంది. గత ఎన్నికల సమయంలో జగన్ పార్టీ విజయంలో మేజర్ క్రెడిట్ షర్మిలకు కూడా దక్కుతుందనడంలో సందేహం లేదు. జగన్ పాదయాత్ర, ప్రచారం, వాగ్దానాలూ అన్నీ ఒకెత్తు అయితే.. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల చేసిన ప్రచారం ఒక్కటీ ఒకెత్తు అని చెప్పాలి.   నాడు జగన్ విజయానికి ఎంతగానో దోహదపడిన షర్మిల ఇప్పుడు జగన్ కు రివర్స్ అయ్యారు. సొంత అన్నకి భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు.  ఆమె కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ రాజకీయాలలో క్రీయాశీలంగా వ్యవహరించేందుకు సమాయత్తమౌతున్నారు. నేడో, రేపో ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఆమె ఏపీలో అడుగుపెట్టగానే ఆమె వెంట అడుగులు వేయడానికి మంగళగిరి ఎమ్మెల్యే, నిన్నటి వరకూ జగన్ కు నమ్మిన బంటు అన్నట్లుగా మెలిగిన ఆర్కే రెడీగా ఉన్నారు. ఇప్పటికే షర్మిల వెంటే తన అడుగులు అని ప్రకటించేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామా చేసేశారు.  నాడు జగన్ కోసం అమరావతిపై కేసులతో విషం కక్కిన ఆర్కే ఇప్పుడా కేసులను ఉపసంహరించుకోకతప్పని పరిస్థితి. షర్మిల వెంటే అని అడుగులు ప్రకటించిన ఆర్కే నిస్సందేహంగా కాంగ్రెస్ గూటికే చేరుతారు. అంటే ఏ నోటితో అయితే అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడారో అదే నోటితో ఇప్పుడు ఆయన అమరావతికి జై కొట్టక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలన్నిటిలోనూ అత్యంత ముఖ్యమైనది ప్రత్యేక హోదా, అమరావతి రాజధానికి కూడా కాంగ్రెస్ పూర్తి మద్దతు తెలిపింది. దీంతో ఇప్పుడు అనివార్యంగా ఆర్కే రాజధాని అమరావతికి అనుకూలంగా గళమెత్తక తప్పదు. అంటే తన చేత జగన్ అమరావతికి వ్యతిరేకంగా బలవంతంగా ప్రకటనలు చేయించారనీ, కేసులు పెట్టించారని చెప్పాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆ కేసులను కూడా ఉప సంహరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే షర్మిల సూచన మేరకు కేసుల ఉపసంహరణకు ఆర్కు అంగీకరించారని చెబుతున్నారు. అదే జరిగితే జగన్ చెప్పినట్లు దేవుడి స్క్రిప్ట్ జగన్ కు రివర్స్ గిఫ్ట్ ఇచ్చేసినట్లేనని చెప్పాలి.  ఇక 2019 ఎన్నికలలో జగన పట్ల సానుభూతి పెరగడానికి దోహదం చేసిన బాబాయ్ హత్య కేసు, జగన్ పై కోడికత్తి దాడి కేసులు ఇప్పుడు జగన్ మెడకే చుట్టుకున్నాయి. బాబాయ్ వైఎస్ వివేకా హత్య  సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది కోర్టులు తేల్చాల్సి ఉన్నప్పటికీ వారెవరన్న విషయం ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్ధమైపోయింది. బాబాయ్ హత్య కేసులో జగన్ ఎవరిని కాపాడుతున్నారో, ఎవరికి అండగా నిలుస్తున్నారో కూడా స్పష్టమైపోయింది. దీంతో నాడు సానుకూలంగా ఉన్న ప్రతి అంశమూ ఇప్పుడు ఆయనకు రివర్స్ గేర్ లో ఎదురు నిలుస్తోంది. నాడు విజయానికి దోహదపడిన అంశాలే ఇప్పుడు ఆయనకు మరో చాన్స్ దక్కే అవకాశం లేకుండా అడ్డం పడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

ఫిబ్రవరి 2న ఎలక్షన్ షెడ్యూల్.. మార్చి 6న ఏపీలో ఎన్నికలు!

ఎన్నికల షెడ్యూల్ డేట్ ఫిక్స్ అయిపోయిందా? వచ్చే నెల 2నే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందా? మార్చి మొదటి వారంలోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయా? అంటే విశ్వసనీయ వర్గాల నుంచి   ఔననే సమాధానమే వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోసం  కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తున్నది. 2024 ఫిబ్రవరి 2న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.  మార్చి 6న ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార వేగాన్ని పెంచాయి. ఏపీలో ఓటర్ల జాబితా పై తీవ్ర ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అధికార వైసీపీ ఓటర్ల జాబితాను ఇష్టారీతిగా ట్యాంపర్ చేసిందని తెలుగుదేశం తీవ్ర ఆరోపణలు చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలను సరి చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆధారాలతో సహా అందిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఆరోపణలు వాస్తవమేనని తేల్చింది. బాధ్యులైన అధికారులపై వేటు కూడా వేసింది. అన్ని అంశాలనూ పరిగణనలోనికి తీసుకుని ఓటర్ల జాబితాను తయారుచేసింది.     తాజాగా ఏపీలో వున్న ఓటర్ల సంఖ్యని ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఏపీలో సుమారు 3 కోట్ల 69 లక్షల 33 వేల 91 మంది ఓటర్లు వున్నారు.  ఇందులో పురుషుల ఓటర్లు 1,83,24,588 మంది వుండగా, మహిళలు 1,86,04,742 మంది వున్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు  3,761 మంది వున్నారని ఎన్నికల సంఘం  పేర్కొంది. రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధిక  ఓటర్లు వుండగా, అత్యల్పంగా నర్సాపురం నియోజకవర్గంలో వున్నారని ఎన్నికల సంఘం నిర్ధారించింది.

గుంటూరు ఈస్ట్ అక్కుంబక్కుం.. కమేడియన్ ఆలీ ఎంద చేట..

జగమెరిగిన కమెడియన్ అలీకి జగన్ గత తొమ్మిదేళ్లుగా అరచేతిలో వైకుంఠం చూపించి మరీ త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారు.  బాలా నటుడిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన  అలీ ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదుగుతూ.. వందల్లో కాదు వేల సినిమాల్లో నటించారు. కమెడియన్ గానే కాకుండా  కొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించి మెప్పించారు. అంతే కాకుండా అలీ తో సరదాగా  అనే కార్యక్రమంతో టీవీ యాంకర్  గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  మొత్తంగా తెలుగు సినిమా చరిత్రలో అలీ తనకంటూ ఒక స్థానాన్ని గౌరవాన్ని సంపాదించుకున్నారు. అందులో సందేహం లేదు.   అయితే   ఎప్పుడైతే ఆలీ బుర్రలోకి రాజకీయం అనే పురుగు దూరిందో.. అప్పటి నుంచీ అలీ తన కీర్తిని, ప్రతిష్టను వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్ కు తాకట్టు పెట్టేసి మరీ ఆశగా చట్ట సభలో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఆయన కళ్లు కాయలు కాస్తున్నాయే తప్ప జగన్ మాత్రం అలీకి ఆ అవకాశం ఇవ్వడం లేదు. కానీ ప్రతి సారీ జగన్ మాత్రం ఎంతో నమ్మకంగా అలీకి మంచి అవకాశం ఇస్తానని చెబుతూ వస్తున్నారు. గతంలో ఒక సారి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆలీని లంచ్ కి ఇన్వైట్ చేసి మరీ త్వరలోనే గుడ్ న్యూస్ చేపుతానంటే, రాజ్యసభ గ్యారంటీ అని గాలిలో మేడలు కట్టేశారు. అయితే  ఎంపీ, ఎమ్మెల్యే కాదంటే చివరకు ఏదో ఒక నామినేటెడ్ పదవి అంటూ కలలు కనేశారు.  అలా జగన్ ఆలీని ఊరించి ఊరించి ఎట్టకేలకు ఒక నామినేటెడ్  కట్టబెట్టి చేతులు దులిపేసుకున్నారు.  ఈ సారి కుదరలేదు.. నెక్స్ట్ టైం గ్యారంటీ అంటూ 2019 ఎన్నికలలో రిక్త హస్తం చూపించిన జగన్.. 2024 ఎన్నికల వరకూ ఆలీని కలల ప్రపంచంలో ఊరేగించారు.  ఇక్కడ ఒక్క సారి గతంలోకి వెడితే అలీ రాజకీయ ప్రవేశం ట్రయల్స్  తెలుగు దేశం టికెట్ కోసం ప్రయత్నించడంతో మొదలయ్యాయి.  అప్పట్లో తెలుగుదేశం తరఫున రాజమండ్రి నుంచి టికెట్ ఖరారైపోయిందన్న స్థాయిలో ప్రచారం జరిగింది. అయితే  ఆ ప్రచారం అంతా ఉత్తుత్తిదే అని తరువాత తేలిందనుకోండి అది వేరే సంగతి.  ఆ తరువాత అలీ సినిమా పరిశ్రమలో తనకు అత్యంత ఆప్తుడు, మిత్రుడు అని చెప్పుకునే  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరి రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరారు. అయితే అప్పట్లో టీడీపీ, జనసేన  పార్టీలకు బాగా దగ్గరగా మెసిలిన  అలీ..  ఆ రెండు పార్టీలలో టికెట్ రాదన్న కన్ఫర్మ్ చేసుకున్న తరువాత  జగన్ పంచన చేరి వైసీపీ కండువా కప్పుకున్నారు.   2019 ఎన్నికలలో వైసీపీ తరఫున పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా నిర్వహించారు. అయితే  ఆయనకు ఆశించిన విధంగా ఎమ్మెల్యే టికెట్ మాత్రం రాలేదు.  పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తీరిగ్గా మూడేళ్లు గడిచిపోయిన తరువాత పార్టీకి అలీ చేసిన సేవలను గుర్తించిన జగన్  ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవితో సరి పెట్టారు. అప్పటికే అన్ని ఆశలూ వదిలేసుకున్న అలీ  సలహాదారు పదవితో సంబరపడిపోయి.. తన స్థాయికి మించిన ప్రకటనలు చేశారు.  సినీ పరిశ్రమలో అలీ తనకు అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే పవన్ కల్యాణ్ పైనే పోటీకి సై అంటూ కామెడీ డైలాగులతో సవాళ్ళూ చేసేశారు.   ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే.. సలహాదారు పదవితో సముదాయించిన సందర్భంలోనే జగన్ వచ్చే ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేసే చాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారని అలీ అప్పట్లో చెప్పుకున్నారు.  అంతే కాకుండా 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ గ్యారంటీ అన్న ధీమాతో, అదీ గుంటూరు ఈస్ట్ అయితే తనకు అన్ని విధాలుగా విజయావకాశాలు ఉంటాయనీ భావించి అక్కడ పని చేసుకోవడం ప్రారంభించారు. అయితే జగన్  ప్రకటించిన నియోజకవర్గాల ఇన్ చార్జిల జాబితాలో గుంటూరు ఈస్ట్ నుంచి ఆలీ పేరు లేదు. అక్కడ నుంచి షేక్ నూరి ఫాతిమాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేశారు. దీంతో ఆలీకి జగన్ మరోసారి రిక్తహస్తమే చూపారని తేటతెల్లమైపోయింది.  మొత్తం మీద అన్నం పెట్టిన సినీ పరిశ్రమలో అయిన వాళ్లని కాదనుకుని మరీ జగన్ పంచన చేరిన అలీ తన ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆశలు మరోసారి ఆవిరైపోయాయనే అంటున్నారు.   

జగన్ ఒక్క చాన్స్ కు ఎక్స్ పైరీ డేట్.. ఇక వందశాతం ఓటమే

ఒక్క చాన్స్ అంటూ 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ పార్టీకి ఆ చాన్స్ కు ఎక్సపైరీ డేట్ వచ్చేసింది. జనం ఆ ఒక్క చాన్స్ ఎందుకు ఇచ్చాంరా బాబు అని తలలు పట్టుకుంటున్నారు. ఒక్క జనం మాత్రమే కాదు.. జగన్ పార్టీలో ఎమ్మెల్యేలు, నాయకులు, చివరాఖరికి ఆ పార్టీ కార్యకర్తలూ కూడా ఎరక్కపోయి జగన్ ను నమ్ముకున్నాం, ఇప్పుడు ములిగిపోతున్నాం అన్న భావనలో ఉన్నారు. ఇదేదో జగన్ వ్యతిరేకులు, ఆయన ప్రత్యర్థి పార్టీల నాయకులు చెబుతున్న మాట కాదు.. స్వయంగా నిన్న మొన్నటి వరకూ జగన్మాయలో ఉండి, ఆయన అడుగులకు మడుగులొత్తిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, పూతలపట్టు ఎమ్మెల్యే బాబు వంటి మారు చెబుతున్న మాట.  నిజమే.. 2019 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఓడిపోయింది. నిజానికి  ఆ ఎన్నికల్లో తెలుగు దేశం ఎందుకు ఓడిపోయిందో, ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. రాష్ట్ర విభజన అరిష్టాలను ఎదుర్కుంటూ నవ్యాంద్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు, తమ అనుభవం అంతా రంగరించి, ప్రణాళికా బద్దంగా ముందుకు సాగారు. రాజధాని అమరావతిని  గ్రోత్ ఇంజిన్  నగరంగా అభివృద్ధి చేసేందుకు, చరిత్రలో కనీవినీఎరగని విధంగా  భూసేకరణ చేశారు. నిర్మాణాలు మొదలయ్యాయి.. మరొక్క ఐదేళ్ళు చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగితే, రాజధాని నగరం అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడమే కాదు  రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించి  అగ్రగామి రాష్ట్రంగా నిలిచేది. అయితే దురదృష్టవశాత్తు  2019 అసెంబ్లీ ఎన్నికలో తెలుగు దేశం పార్టీ ఒడి పోయింది. వైసీపీ అధ్యక్షడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్  అభ్యర్ధన సృష్టించిన  సింపతీ వేవ్ వైసీపీని గెలిచింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆతర్వాత ఏమి జరిగింది అన్నది కళ్ళ ముందు కదులుతున్న నడుస్తున్న చరిత్ర.  రాష్ట్ర విభజన అనతరం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం సగటున 10.8 శాతం వృద్ధి రేటు సాధిస్తే,  జగన్ రెడ్డి  పాలనలో అది 3 శాతం దిగువకు పడిపోయింది. 2 019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం వలన రాష్ట్రం ఏమి కోల్పోయిందో  ఈ గణాంకాలే చెబుతాయి.  అంతే కాదు జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాలు  అన్నీ ఇన్నీ కాదు. రాష్ట్రంలోని ఏ వర్గమూ జగన్ పాటన పట్ల సంతృప్తిగా లేదు. బటన్ నొక్కి జగన్ పంచుతున్న సొమ్ములు అందుకుంటున్న లబ్ధిదారులే.. అభివృద్ధి ఎక్కడ, మా పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలేవీ అంటూ నిలదీస్తున్నారు. అందుకే ఇప్పడు రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రన్న రావాలి ... వెలుగు తేవాలి  అంటున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన  యాత్రలకు జనం జననీరాజనాలు పట్టడం చూసే చాలు  జనం జగన్ పాలనతో ఎంతగా విసిగిపోయారో, చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎంతగా   కోరుకుంటున్నారో అర్థమవుతుంది.  కాంగ్రెస్ పాలనలో విసిగిపోయిన ఆంధ్రా జనం ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు ఉప్పెనలా ఎలా కదిలారో.. ఇప్పుడు చంద్రబాబు సభలు, సమావేశాలకు అలా కదులుతున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సందర్భంలో జనంలో వ్యక్తమైన ఆగ్రహం, మధ్యంతర బెయిలుపై ఆయన బయటకు వచ్చిన సందర్బంలో ఆయనకు స్వాగతం పలికేందుకు చిన్నా పెద్దా, ఆడా,మగా అన్న తేడా లేకుండా పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నీరాజనాలు పలకడం చూస్తేంటే బాబు విజయాన్ని, నాయకత్వాన్ని ఎంతగా కోరుకుంటున్నారో అర్ధమౌతుంది. ఏపీ చేసుకున్న అదృష్టం చంద్రబాబు అయితే దురదృష్టం జగన్ అని అంటున్నారు.   నిజానికి 2019 ఓటమి తర్వాత తెలుగు దేశం  అస్తిత్వం విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. తెలుగుదేశం  పుంజుకోవడం అంత ఈజీ కాదని విశ్లేషణలు వినిపించిన వారూ ఉన్నారు.  ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వయసు రీత్యా అంత చురుకైన పాత్రను పోషించలేక పోవచ్చని, అలాగే, పార్టీని ముందుకు నడిపించడంలో లోకేష్ అనుభవం సరిపోదని  చాలా మంది చాలా రకాల సందేహాలను వ్యక్త పరిచారు. అయితే ఇప్పుడు ఆ చాలామందే, అటు చంద్రబాబు, ఇటు లోకేష్ విషయంలో తమ అంచానాలు తప్పాయని అంగీకరిస్తున్నారు.  యువగళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ ప్రజా నాయకుడిగా ఎదిగారు.  మరోవంక జగన్ రెడ్డి ఒంటరి పోరాటం చేస్తున్నారు. 2019 ఎన్నికలలో అన్ని విధాల అండగా ఉన్న తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను జగన్ రెడ్డికి దూరమయ్యారు. నాడు షర్మిల తనను తాను జగనన్న వదిలిన బాణంగా చెప్పుకున్నారు. ఇప్పుడు అదే షర్మిల తాను జగనన్నకు గురిపెట్టిన బాణాన్ని అంటున్నారు.  తల్లి విజయమ్మ తాను కుమార్తెతోనే అంటున్నారు. ఇక పార్టీలో  కూడా ఆయన నమ్మే వారు ఒకరిద్దరు మినహా మరెవరు లేరు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దూరమవుతున్నారు. నియోజకవర్గ ఇన్ చార్జిల మార్పు పేరుతో ఆయన సిట్టింగులను మార్చేందుకు చేస్తున్న ప్రయత్నం బెడిసికొట్టింది. నేతల ధిక్కార స్వరం, రాజీనామాల బాట మొదలైంది. అందుకే, 2024 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ జగన్ ఓటమి తధ్యమని అంటున్నారు. అందుకే  తెలుగుదేశం విజయం ఖాయమని చెబుతున్నారు.

ఏపీలో బీఆర్ఎస్ ఉన్నట్లా.. లేనట్లా?

ఆంధ్రప్రదేశ్ లో భారత రాష్ట్ర సమితి ఏం చేస్తోంది? అసలు ఆ పార్టీ రాష్ట్ర శాఖ ఉన్నట్లా? లేనట్లా? గతంలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేసి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాలలోకి దూకేశారు.  ఆ సమయంలో ఆయన బాగా దృష్టి పెట్టిన రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందు పీఠిన ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్ సహకారంతో రాష్ట్రంలో కొన్ని పార్లమెంటు స్థానాలను  బీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవచ్చన్న భావన గట్టిగా వ్యక్తమయ్యేది. అలాగే బీఆర్ఎస్ సహకారంతో మరోసారి ఏపీలో జగన్ ను అధికారంలోకి వచ్చేలా చేయొచ్చన్నదీ ఆయన వ్యూహంగా పరిశీలకులు అప్పట్లో పలు విశ్లేషణలు చేశారు. అయితే అదంతా గతం.. కేసీఆర్ జాతీయ రాజకీయ ఆకాంక్షలకు పురిట్లోనే సంధి కొట్టినట్లుగా తెలంగాణలో పరాజయం ఎదురైంది. అయినా ఆయన దేశమంతా కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగినా దరి చేరిన వారు కానీ దగ్గరకు రానిచ్చిన వారు కానీ కనిపించలేదు.  తెలంగాణలో పరాజయం పాలైన బీఆర్ఎస్  ఇప్పుడు జాతీయ స్థాయిలో తన సత్తా చాటడానికి ముందుకు వస్తుందా..? ఒక వేళ వచ్చినా ఎక్కడైనా కనీసం ఉనికి చాటుకోగలుగుతుందా అంటే అదీ అనుమానమే. ముఖ్యంగా ఏపీ రాజకీయాలలో బీఆర్ఎస్ పరిస్థితి పబ్బలో పుట్టి మఖలో మాడిపోయిన చందమేనని అంటున్నారు. 2019 ఏపీ ఎన్నికలలో పరోక్షంగా పాల్గొని జగన్ విజయానికి  తన వంతు పాత్ర పోషించి టీడీపీ పార్టీకి, బాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు తమ పార్టీకి రేవంత్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ షాక్ లో ఉన్నారు.  ఇటువంటి పరిస్థితులలో కేసీఆర్ తిరిగి ఏపీ రాజకీయాల వైపు దృష్టి పెడతారా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు.   ఏపీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి తోట చంద్రశేఖర్ ను ఏపీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించిన కేసీఆర్ ఏపీ ఎన్నికల బరిలో దిగుతారా..? లేక గతం మాదిరే తమ తస్మదీయులకు పరోక్ష మద్దతు ఇస్తారా..? లేక తెలంగాణలో పార్టీ కోల్పోయిన పట్టును తిరిగి నిలబెట్టు కోవడానికి పక్క రాష్ట్రాల వైపు తమ కారు స్టీరింగ్ ను తిప్పకుండా గమ్మునుంటారో..? వేచి చూడాలి.   తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి ఏపీలో అసలు ఉందా? ఆ పార్టీ రాష్ట్ర శాఖను ఘనంగా  ఏర్పాటు చేసిన తరువాత ఏం జరిగింది? ఏం జరుగుతోంది? అంటే ఎవరి నుంచీ సరైన సమాధానం రావడం లేదు. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతానంటూ  ఘనంగా బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించిన కేసీఆర్ తెలంగాణలో కంటే ముందుగా ఏపీలోనే బీఆర్ఎస్ రాష్ట్ర శాఖను ప్రారంభించారు.  పెద్ద ఎత్తున బీఆర్ఎస్ హోర్డింగులతో హడావుడి చేశారు. ఇక ఆ పార్టీలో చేరికలకు ఏపీకి హైదరాబాద్ నుంచి వాహనాలు పంపి మరీ నాయకులను రప్పించుకున్నారు. దారి పొడవునా బీఆర్ఎస్ లోకి స్వాగతం అంటూ హోర్డింగులు, ఫ్లెక్సీలూ ఏర్పాటు చేశారు.   ఏపీలో బీఆర్ఎస్ బహిరంగ సభలు నిర్వహిస్తుందనీ, కేసీఆర్ ఆ సభలలో పాల్గొంటారనీ పెద్ద ఎత్తున ప్రచారంతో ఊదరగొట్టేశారు. అంతే ఆ తరువాత ఏపీలో బీఆర్ఎస్ ను పట్టించుకున్న నాథుడే లేడు. ప్రచారార్భాటం వినా ఆ పార్టీ ఏపీ శాఖ చేసిందీ, పీకిందీ ఏమీ లేదు.  ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్ ప్రతినిథి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్క ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మాత్రమే. ఆయన కూడా ఉండేది హైదరాబాద్ లోనే.  ఆయన వ్యాపారాలూ, భూములూ అక్కడే  ఉండటంతో బీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి అధికారంలోకి వస్తుందన్న ఉద్దేశంతో మాత్రమే ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు తెలంగాణలోనే బీఆర్ఎస్ పరాజయం పాలు కావడంతో ఇక ఆయన పార్టీలో కొనసాగుతారని కానీ, కొనసాగినా క్రియాశీలంగా ఉంటారని కానీ ఎవరూ భావించడం లేదు.   మొత్తంమీద బీఆర్ఎస్ పేరుకే జాతీయ పార్టీ కానీ ఉనికి మాత్రం తెలంగాణకే పరిమితమని , ఇప్పుడు ఆ తెలంగాణలోనే ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కాళేశ్వరం అవినీతిపై కిషన్ రెడ్డి గాభరా ఎందుకు?

కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటే తమను వ్యతిరేకించేవారిని వేధించడానికి మాత్రమే అని బీజేపీ భావిస్తోందన్న విమర్శలు చాలా ఏళ్లుగా దేశంలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ విమర్శలలో వాస్తవం ఉందా అనిపించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖ రాయలని తాజాగా ఆయన తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  కాళేశ్వరం అవినీతిపై బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కాంగ్రెస్, బీజేపీలు రెండూ విమర్శలు చేశాయి. అయితే బీజేపీ విమర్శలకు కేవలం విమర్శలకే పరిమితం అన్నట్లుగా ఉన్నాయి. ఎందుకంటే నిబంధనలను తోసి రాజని మరీ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్రం రుణాలు ఇచ్చింది. ఒక్క జాతీయ హోదా ఇవ్వలేదు తప్పితే.. అన్ని విధాలుగా కాళేశ్వరానికి సహాయ సహకారాలు అందించింది. మళ్లీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంగా మారిపోయిందని విమర్శలూ గుప్పించింది. కానీ ఏనాడూ కాళేశ్వరం అవినీతిపై విచారణకు పట్టుబట్టలేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ విమర్శలకు మాత్రమే పరిమితమైంది. పలు అంశాలలో కేసీఆర్ ను నోటితో విమర్శిస్తూ, చేతలలో సహకారం అందించిన బీజేపీ ఆ పార్టీతో రహస్య మైత్రి కొనసాగించడంతో బీఆర్ఎస్, బీజేపీలు దొందూ దొందే అని జనం నమ్మడంతోనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో రెండు పార్టీలూ కలిసి మునిగిపోయాయి.  ఇప్పుడు మాత్రం బీజేపీ కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరాలని కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేస్తున్నది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఈ డిమాండ్ చేస్తున్నారు. మరి ఇదే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఈ డిమాండ్ ఎందుకు చేయలేదు. కాళేశ్వరంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఎందరు హస్తినకు వెళ్లి మరీ ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి తరువాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కాళేశ్వరం అవినీతి బాగోతాన్ని వెలికి తీస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడం ఏమిటి అని పరిశీలకులు ఫిర్యాదు చేస్తున్నారు. వారం రోజులలో కాళేశ్వరంపై జ్యుడీషియల్ ఎంక్వైరీ వేస్తామని రేవంత్ ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. అయితే కిషన్ రెడ్డి మాత్రం కేంద్రంలో బీజేపీ ఉండగా, జ్యుడీషియల్ ఎంక్వైరీ ఏమిటి? మేం చెప్పినట్లు వినే సీబీఐ ఉందిగా అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇలా లేఖ రాయడం తరువాయి అలా సీబీఐ విచారణ మొదలయ్యేలా చూస్తామని చెబుతున్నారు. రేవంత్ సర్కార్ సీబీఐ విచారణకు ముందుకు రాకపోతే.. బీఆర్ఎస్ తో కుమ్మక్కైనట్లేనని అంటున్నారు.  కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ అంటూ హడావుడి పడుతున్న కిషన్ రెడ్డి తీరు చూస్తుంటే.. రేవంత్ సర్కార్ కాళేశ్వరం అవినీతి పై విచారణ జరిపించడం ఇష్టం లేనట్లుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఢిల్లీ లిక్కర్ స్కాం పేరు చెప్పి .. బీఆర్ఎస్ తో రాజకీయం చేసిన బీజేపీ.. ఇప్పుడు కాళేశ్వరం ను కూడా తమ చేతుల్లోకి తెచ్చుకుని  అవినీతి బయటకు రాకుండా చేయాలని చూస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ సర్కార్ కొలువుతీరి నిండా నెల రోజులు కూడా అయ్యిందో లేదో   బీజేపీ హడావుడి మొదలెట్టేసింది. కాళేశ్వరం అవినీతిపై ఏళ్ల తరబడి మౌనం వహించిన బీజేపీ.. ఇప్పుడు దానిని వెలికి తీయడానికి ప్రయత్నాలను రేవంత్ సర్కార్ ప్రారంభించగానే గగ్గోలు పెడుతోంది.   బీజేపీ, బీఆర్ఎస్ ల రహస్య మైత్రి ఇకెంత మాత్రం రహస్యం కాదన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు రేవంత్ పట్టుబట్టడం, మరో వైపు ఎమ్మెల్సీ కవిత హిందుత్వ ఎజెండాను ఎత్తు కోవడం చూస్తుంటే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, బీఆర్ఎస్ లు లోపాయికారీ అవగాహనతో పని చేయడానికి నిర్ణయించుకున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయంటున్నారు.  మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బయటకు రాకూడదన్నదే కిషన్ రెడ్డి ఉద్దేశంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎట్టకేలకు 27 మందితో వైసీపీ ఇన్ చార్జిల జాబితా

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటూ హడావుడి చేస్తున్న జగన్ నియోజకవర్గ ఇన్ చార్జీల మార్పే అందుకు కొలమానంగా ఎంచుకున్నారు. తొలుత ఆర్భాటంగా 11 మంది ఇన్ చార్జీలను మార్చేసిన జగన్ రెండో విడత మార్పులను ప్రకటించేందుకు ధైర్యం చేయలేకపోయారు. నేడు, రేపు అంటూ తాత్సారం చేసి, అసంతృప్తుల బుజ్జగింపు సమన్వయకర్తలకు అప్పగించి ఎట్టకేలకు మంగళవారం రాత్రి రెండో విడత మార్పులను అధికారికంగా ప్రకటించారు. 40కి పైగా నియోజకవర్గాలలో మార్పులు అంటూ హడావుడి చేసిన జగన్ చివరకు 27 మందిని మాత్రమే మారుస్తు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తిరుగుబాటు భయంతో నిలువెల్లా వణికిన ముఖ్యమంత్రి చిట్ట చివరకు ఎలాగైతేనేం ధైర్యం చేసి మంగళవారం రాత్రి 27 మందితో రెండో జాబితాను విడుదల చేశారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ  మీడియా సవావేశంలో నియోజకవర్గ ఇన్ చార్జిల పేర్లు ప్రకటించారు.  ఆ మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జిగా మాలగుండ్ల శంకరనారాయణ, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జిగా జోలదరాశిశాంత అలాగే అరకు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ చార్జిగా డాక్టర్ తాలే రాజేష్ లను నియమించారు.  ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే అనకాపల్లికి మలసాల భరత్ కుమార్, పాయకరావు పేట ఎస్పీ నియోజకవర్గానికి కంబాల జోగులు, రామచంద్రపురం నియోజకవర్గానికి పిల్లి సూర్యప్రకాష్ లను ఇన్ చార్జిలుగా నియమించారు. పీ. గన్నవరం (ఎస్సీ) నియోజకవర్గానికి విప్పర్తి వేణుగోపాల్, పిఠాపురం నియోజకవర్గానికి వంగా గీత, జగ్గం పేట నియోజకవర్గానికి తోట నరసింహం, ప్రత్తిపాడుకు వరుపుల సుబ్బారావులను నియమించారు.అదే విధంగా రాజమహేంద్రవరం సీటీకి మార్గాని భరత్, రూరల్ కు చెల్లుపోయిన వేణగోపాల కృష్ణమూర్తిలను ఇన్ చార్జిలుగా నియమించారు.  పోలవనం ఎస్టీ నియోజకవర్గానికి తెల్లం రాజ్యలక్ష్మి, కదరికి బీఎస్ మక్బూల్ అహ్మద్,  ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గానికి తాటిపర్తి చంద్రశేఖర్ ను ఇన్ చార్జిలుగా నియమించారు. అదే విధంగా ఎమ్మిగనూరు, తిరుపతి,  గుంటూరు ఈస్ట్ లకు వరుసగా మాచాని వెంకటేష్, భూమన అభినయ్ రెడ్డి, షేక్ నూరి ఫాతిలాలను ఇన్ చార్జిలుగా నియమించారు. మచిలీపట్నం నియోజకవర్గానికి పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరి నియోజకవర్గానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలను, పెనుగొండకు కేవీ ఉష శ్రీ చరణ్, కళ్యాణదుర్గం కు తలారి రంగయ్యలను ఇన్ చార్జిలుగా నియమించగా, అరకు ఎస్టీ నియోజవకర్గ ఇన్ చార్జిగా గొడ్డేటి మాధవి, పాడేరు ఎస్టీ నియోజకవర్గ ఇన్ చార్జిగా మత్స్యరాస విశ్వేశ్వర రాజును నియమించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ చార్జిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ కు షేక్ ఆసీఫ్ ను ఇన్ చార్జిగా నియమించారు. 

తెలుగుదేశం గూటికి దాడి!.. రేపు చంద్రబాబుతో భేటీ

ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకులలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా ఒకరు. అయితే ఆ సినియారిటీని కాపాడుకోవడానికి ఎన్నడూ ఆయన ప్రయత్నించలేదు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఆ పార్టీ తరఫున అనకాపల్లి నియోజకవర్గం నుంచి వరుసగా  నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ కేబినెట్ లో కీలకమైన సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రిగా కూడా పని చేశారు.  అయితే 2014 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీని వీడి వైకాపా గూటికి చేరారు. ఆ ఎన్నికలలో తన కుమారుడు దాడి రత్నాకర్ కు ఎమ్మెల్యే టికెట్ కోసమే ఆయన పార్టీ మారారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.  సరే దాడి కోరుకున్నట్లే ఆ ఎన్నికలలో ఆయన కుమారుడు రత్నాకర్ కు వైసీపీ టికెట్ లభించింది. కానీ ఏం లాభం ఆయన పరాజయం పాలయ్యారు.  అంతే ఇక వైసీపీలో ఆయనకు కనీస గుర్తింపు కూడా లేకుండా పోయింది. పార్టీలో ఆయనను పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. తెలుగుదేశం  గూటికి చేరేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో 2019 ఎన్నికలకు ముందు ఆయన మళ్లీ వైసీపీ గూటికే చేరారు.  కానీ ఆయనకు కనీసమైన గుర్తింపు పార్టీలో దక్కలేదు. అయితే ఓపిగ్గా ఎదురు చూసిన ఆయన 2014 ఎన్నికలలో పార్టీ టికెట్ ఆశించారు.  కానీ ఆ అవకాశం లేదని నిర్ధారణ కావడంతో వైసీపీకి రాజీనామా చేసేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కుమారుడు దాడి రత్నాకర్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి రాజీనామా చేసినట్లు ధృవీకరించారు.   అలాగే తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. బుధవారం (జనవరి 3)న తండ్రి దాడి వీరభద్రరావుతో కలిసి తాను, కార్యకర్తలు చంద్రబాబు, లోకేష్ తో భేటీ కానున్నట్లు చెప్పారు. ఈ మేరకు అప్పాయింట్ మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. ఇలా ఉండగా తెలుగుదేశంలో దాడి వీరభద్రరావు చేరిక పట్ల ఉత్తరాంధ్ర తెలుగుదేశంలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి వారితో పార్టీకి ఇసుమంతైనా ప్రయోజనం ఉండదని అంటున్నారు.   

మెరుపు సమ్మెతో   పెట్రోల్ బంక్ ల ముందు నో స్టాక్ బోర్డ్ లు 

ట్రక్కు డ్రైవర్లకు  హిట్ అండ్ ర‌న్ కేసుల్లో కొత్త చ‌ట్టం ప్ర‌కారం శిక్ష‌ను ప‌దేళ్ల‌కు పెంచారు. దీంతో కొత్త చ‌ట్టంపై దేశ‌వ్యాప్తంగా వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతున్న‌ది. ట్ర‌క్కు డ్రైవ‌ర్లు  మెరుపు సమ్మెతో ఆందోళ‌న చేప‌ట్టి   మంగళవారం విరమించారు. న‌గ‌దు జ‌రిమానాను పెంచ‌డాన్ని కూడా ట్ర‌క్కు డ్రైవ‌ర్లు వ్య‌తిరేకిస్తున్నారు. కేంద్ర స‌ర్కారు కొత్తగా భార‌తీయ న్యాయ సంహిత చ‌ట్టాన్ని తీసుకువ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఐపీసీ స్థానంలో ఆ చ‌ట్టాన్ని అమ‌లు చేయ‌నున్నారు. అయితే హిట్ అండ్ ర‌న్ కేసుల్లో కొత్త చ‌ట్టం ప్రకారం ట్ర‌క్కు డ్రైవ‌ర్ల‌కు భారీ శిక్ష ప‌డ‌నున్న‌ది. రోడ్డు ప్ర‌మాదాల్లో పెనాల్టీని పెంచేశారు. ఒక‌వేళ హిట్ అండ్ ర‌న్ కేసు అయితే ఆ డ్రైవ‌ర్‌కు ప‌దేళ్ల జైలుశిక్ష ప‌డే ఛాన్సు ఉంది. అనుకోని ప‌రిస్థితిల్లో ప్ర‌మాదం జ‌రిగితే .. ఐపీసీ సెక్ష‌న్ ప్ర‌కారం కేవ‌లం రెండేళ్ల జైలుశిక్ష మాత్ర‌మే ఉండేది. కొత్త చ‌ట్టంలో జైలుశిక్ష‌ను పెంచ‌డాన్ని నిర‌సిస్తూ ట్ర‌క్కు డ్రైవ‌ర్లు దేశ‌వ్యాప్తంగా ధ‌ర్నా చేప‌ట్టి విరమించారు.  నిర్ల‌క్ష్యంగా వాహ‌నాన్ని న‌డ‌ప‌డం, ర్యాష్ డ్రైవింగ్ వ‌ల్ల జ‌రిగే ప్ర‌మాదాల‌కు కొత్త చ‌ట్టాన్ని అమ‌లు చేయాలని సంకల్పించింది. ఈ కేసుల్లో ఏడేళ్ల జైలుశిక్ష‌తో పాటు భారీ జ‌రిమానా విధించ‌నున్న‌ట్లు భార‌తీయ న్యాయ సంహిత బిల్లులో పేర్కొన్నారు. ఒక‌వేళ ప్ర‌మాదం చేసిన వ్య‌క్తి ఘ‌ట‌న గురించి ఫిర్యాదు చేయ‌కుంటే, అప్పుడు ఆ శిక్ష‌ను ప‌దేళ్ల‌కు పెంచ‌నున్నారు. దీంతో పాటు ఏడు ల‌క్ష‌ల ఫైన్ విధించ‌నున్నారు. కొత్త చ‌ట్టం క్రూరంగా ఉంద‌ని, భారీ వాహ‌నాల‌కు వ్య‌తిరేకంగా ఉన్న‌ట్లు ట్ర‌క్కు డ్రైవ‌ర్లు ఆరోపిస్తున్నారు. భారీ జ‌రిమానా వేయ‌డాన్ని డ్రైవ‌ర్లు నిర‌సిస్తున్నారు. త‌మ ద‌గ్గ‌ర అంత భారీ అమౌంట్ ఎక్క‌డ ఉంటుంద‌ని ఓ డ్రైవ‌ర్ ప్ర‌శ్నించాడు. ప్ర‌మాద స‌మ‌యంలో గాయ‌ప‌డ్డ‌వారిని త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నిస్తే అప్పుడు జ‌నం దాడి చేస్తున్నార‌ని, ఇది ఆందోళ‌న‌క‌రంగా ఉంటుంద‌ని నిర‌స‌న‌కారులు పేర్కొన్నారు. ట్ర‌క్కు, ప్రైవేట్ బ‌స్సు, గ‌వ‌ర్న‌మెంట్ బ‌స్సు, క్యాబ్ డ్రైవ‌ర్లు ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. మెరుపు సమ్మెతో ఇవ్వాల పెట్రోల్ బంక్ లు కిక్కిరిసిపోయీయాయి. పెట్రోల్ బంక్ ల ముందు నోస్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించడంతో మరికొద్ది సేపట్లో పెట్రోల్ , డీజిల్ వాహనాలు తమ పెట్రోల్ బంక్ లకు వచ్చి ఆయిల్ నింపునున్నాయని బంక్ యజమానులు చెబుతున్నారు.