అసలీ హెపటైటిస్ జబ్బు ఏంటి... దీన్ని అంత ప్రమాదంగా పరిగణిస్తారెందుకు?

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీన్ని జరుపుకోవడానికి కారణం ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, తద్వారా హెపటైటిస్ ప్రమాదాన్ని నివారించవచ్చు. హెపటైటిస్ అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. కాలేయం మన శరీరంలో ఒక ముఖ్యమైన భాగం, ఇది రక్తంలో టాక్సిన్లను శుభ్రపరచడంతో పాటు ఆహారాన్ని జీర్ణం చేసే ప్రక్రియలో సహాయపడుతుంది. అయినప్పటికీ, హెపటైటిస్ ఇన్ఫెక్షన్ కారణంగా కాలేయం వాపును కలిగిస్తుంది. దీని వల్ల కాలేయం ప్రభావితమవుతుంది. ఇది తీవ్రమైన  ప్రాణాంతక వ్యాధి, దీని చికిత్స సాధారణ రోగులకు  చాలా ఖరీదైనది. ఇలాంటి జబ్బు గురించి తెలుసుకుని, నివారణ చర్యలు పాటిస్తే ఈ జబ్బుకు దూరంగా ఉండొచ్చు. హెపటైటిస్ అంటే.. హెపటైటిస్ అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి, ఇది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ వ్యాధిలో కాలేయంలో వాపు ఉంటుంది. హెపటైటిస్ ఒక అంటువ్యాధిగా మారుతోంది. దీని కారణంగా ప్రతి సంవత్సరం మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇందులో కూడా రకాలు ఉన్నాయి.  ఈ వ్యాధిపై అవగాహన కల్పించడంతోపాటు పుట్టిన బిడ్డకు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా హెపటైటిస్ ప్రమాదాన్ని నివారించవచ్చు. హెపటైటిస్ రకాలు.. హెపటైటిస్ వైరస్ ప్రకారం ఐదు రకాలు ఉన్నాయి. ఇందులో హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ . మొత్తం ఐదు రకాల హెపటైటిస్ ప్రమాదకరమైనవి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, ప్రతి సంవత్సరం 1.4 మిలియన్ల మంది హెపటైటిస్ ఎతో బాధపడుతున్నారు. హెపటైటిస్  తీవ్రత ఆధారంగా గుర్తించబడుతుంది. తీవ్రమైన హెపటైటిస్‌లో , కాలేయం ఉన్నట్టుండి వాపుకు గురవుతుంది. దీని లక్షణాలు 6 నెలల వరకు ఉంటాయి. చికిత్స చేసినప్పుడు, వ్యాధి నెమ్మదిగా మెరుగవుతుంది. తీవ్రమైన హెపటైటిస్ సాధారణంగా HAV ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. రెండవదీర్ఘకాలిక హెపటైటిస్ ఉంది , దీనిలో HIV సంక్రమణ రోగి యొక్క రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. కాలేయ క్యాన్సర్,  కాలేయ వ్యాధి కారణంగా ఎక్కువ మంది మరణిస్తున్నారు.   హెపటైటిస్ కారణాలు వైరస్ ఇన్ఫెక్షన్  అనేక కారణాల వల్ల వస్తుంది. కలుషిత ఆహారం, కలుషిత నీరు తీసుకోవడం వల్ల హెపటైటిస్ ఎ వస్తుంది. హెపటైటిస్ బి సోకిన రక్తాన్ని మార్పిడి చేయడం,  వీర్యం  లేదా ఇతర ద్రవాలకు గురికావడం వల్ల కూడా సంభవించవచ్చు. హెపటైటిస్ సి రక్తం  సోకిన ఇంజెక్షన్ల వాడకం ద్వారా వ్యాపిస్తుంది హెపటైటిస్ డి హెచ్‌డివి వైరస్ వల్ల సంభవించవచ్చు. ఇప్పటికే HBV వైరస్ సోకిన వారు కూడా ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అయితే, ఒకే రోగిలో HDV మరియు HBV వైరస్‌లు రెండూ ఉన్నప్పుడు పరిస్థితి తీవ్రంగా మారుతుంది. హెపటైటిస్ E అనేది HEV వైరస్ వల్ల వస్తుంది. చాలా దేశాల్లో ఈ హెపటైటిస్ వైరస్ విషపూరితమైన నీరు,  ఆహారం కారణంగా వ్యాపిస్తుంది. ఇది కాకుండా, ఎక్కువ మందులు తీసుకోవడం కూడా కాలేయ కణాలలో వాపును కలిగిస్తుంది, హెపటైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం హెపటైటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ నేరుగా మన కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది.  దాని ప్రసరణ శరీరంలోని ఇతర భాగాలలో కూడా ప్రారంభమవుతుంది ఇది ప్రమాదంగా మారుతుంది. హెపటైటిస్ యొక్క లక్షణాలు.. ఎప్పుడూ అలసిపోయినట్లు అనిపిస్తుంది, చర్మం పసుపు రంగులోకి మారుతుంది, కళ్ళు  తెల్లటి పసుపు రంగులోకి మారతాయి. ఆకలి లేకపోవడం, వాంతులు,  వికారం. కడుపు నొప్పి,  ఉబ్బరం. తలనొప్పి,  మైకము. మూత్రం రంగు మార్పు, ఆకస్మికంగా  బరువు తగ్గడం. కామెర్లు లేదా జ్వరం చాలా వారాల పాటు కొనసాగడం మొదలైనవి లక్షణాలు. వీటిలో ఏ కొన్ని లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.  *నిశ్శబ్ద.

మూఢనమ్మకాలు ముంచేస్తాయ్!

నమ్మకాలు మనిషిని బలంగా ఉంచేవి, అభివృద్ధికి దోహదం చేసేవి అయి ఉండాలి. అంతేకానీ మనిషిని పిచ్చోళ్ళలా మార్చేవి కాకూడదు. కొన్ని నమ్మకాల వెనక శాస్త్రీయ కారణాలు ఉంటాయి. వాటిని కొట్టి పడేయలేం. కానీ మరికొన్ని కారణాలు ఎలాంటి శాస్త్రీయ కారణాలు లేకుండా కేవలం ఆచరించాలని చెబుతారు. అంతేనా వాటివల్ల మనుషులకు ఆర్థిక నష్టమే కాకుండా సమయానికి కూడా నష్టం జరుగుతుంది. కొన్నిసార్లు జీవితంలో ఎంతో ముఖ్యమైన అవకాశాలు కోల్పోవచ్చు, మరికొన్నిసార్లు ఎంతో గొప్పవైన మానవ సంభంధాలకు నష్టం కలగచ్చు. మొత్తానికి మనుషులను మనుషుల అభివృద్ధిని సమాజాన్ని వెర్రివాళ్లను చేసే మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయి.  బయటకు వెళ్తున్నప్పుడో లేక ముఖ్యమైన పనిమీద వెళ్తున్నప్పుడో పిల్లి ఎదురయ్యిందనో లేదా భర్త చనిపోయిన ఆడవాళ్లు ఎదురయ్యారనో, చనిపోయిన శవాన్ని ఎవరో తీసుకెళ్తున్నారనో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.  చాలామంది వీటిని అరిష్టం అని అపశకునం అని అనుకుంటారు. ముఖ్యమైన పనుల కోసమో, చాలా అవసరమైన వాటికోసమో ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఎదురవ్వగానే 90% ఖచ్చితంగా తిరిగి ఇంటికి వెళ్లడం, లేదా అలా ఎదురైన తరువాత సాదారణంగానే ఎక్కడో ఒకచోట కూర్చోవడం వంటివి చేస్తుంటారు. దానివల్ల వాళ్లకు ఆలస్యం అవడం, ముందున్నంత మానసిక దృఢత్వం తరువాత కోల్పోవడం జరుగుతుంది. ఒక్కసారి బాగా గమనిస్తే తుమ్ము వచ్చిందనో, పిల్లి ఎదురొచ్చిందనో చేసే ఆలస్యాలు, అపశకునం కాబట్టి ఏదో సమస్య ఎదురవుతుందని దానిగురించి చేసే ఆలోచనలు చెయ్యాల్సిన పనులను సరిగ్గా చేయనివవ్వు, సరిగ్గా జరగనివ్వవు. మనం చేసే ఆలస్యానికి సమయానికి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ లేదా బస్ ఎక్కడికీ వెళ్లకుండా మనకోసం స్టాప్ లోనే ఉంటాయా ఏంటి??  ముఖ్యమైన పనులు చెయ్యాల్సినప్పుడు మానసికంగా దెబ్బతింటే అప్పుడు చేసేపనిని సరైన ద్యాసతో చేయలేము. మనమే పనిమీద సరైన దృష్టిపెట్టకుండా ఎదురైన పిల్లుల మీద, చనిపోయిన మనుషుల మీద కారణాలు తోసేయడం ఎంతవరకు సరైనది. కాలం మారిపోయింది మూఢనమ్మకాలు ఇప్పుడెక్కడున్నాయిలే అని అందరూ అనుకుంటారు కానీ అభివృద్ధి చెందుతున్న, ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో అక్కడక్కడా జరుగుతున్న సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.  అప్పుడెప్పుడో బాగా చదువుకుని లెక్చరర్ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు కూతురిని చంపేయడం మూఢనమ్మకం అయితే తాజాగా ఒక దినపత్రికలో అష్టమి నాడు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త భార్యను హింసించడం అనే సంఘటన గురించి తెలిసినప్పుడు  ఈ సమాజంలో నమ్మకాలు ప్రజలను ఎంతగా వెర్రివాళ్లను చేస్తున్నాయో అర్థమవుతుంది. నమ్మకాలు ఏవైనా మనిషి మానసిక స్థితిని దెబ్బకొట్టేవే. ఆ విషయం అర్ధం చేసుకున్నప్పుడు ఏదో ఎదురొచ్చిందని, మరింకేదో అడ్డొచ్చిందని ఆగిపోరు. ఎదురయ్యే జంతువుల్ని, మనుషుల్ని, సంఘటనలను చూసుకుంటూ తమ పనులను నిర్లక్ష్యం చేయరు. ప్రతిదాంట్లో మంచిని చూస్తూ ప్రతి సమస్యకు తమ నమ్మకమే బలం అని తెలుసుకున్నవాళ్ళు తాము మొదలుపెట్టిన పనులను సమర్థవంతంగా పూర్తి చేసుకుని కార్యశూరులు అవుతారు. అంతేకానీ మూఢనమ్మకాల మధ్య జీవితాన్ని ముంచేసుకోరు.                                 ◆ వెంకటేష్ పువ్వాడ.

సంతోషంగా ఉండాలంటే యువత తెలుసుకోవలసిన విషయమిదే!

ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలనే కోరుకుంటారు. అయితే సంతోషంగా ఉన్నామనే దానికి కొలమానం ఏమిటి? యువత సంతోషంగా ఉండాలంటే కావల్సింది ఏమిటి? అని  ఒక సర్వే నిర్వహించారు. సంతోషంగా ఉండడానికి కావాల్సినవి 'కీర్తి, సంపదలు, అందం, ఆరోగ్యం' అని చాలా మంది ఆ సర్వేలో వెల్లడించారు. ఒకరు భోగ భాగ్యాలతో జీవిస్తున్నప్పటికీ అతనికి ఉన్న ఐశ్వర్యం సంతృప్తిని ఇవ్వకపోతే సంతోషం లేనట్లే కదా? మరొక వ్యక్తి తనకున్న సంపదతో సంతృప్తిగా జీవించగలిగితే అతడు సంతోషంగా ఉన్నట్లే! సంతోషానికి అర్థం సంతృప్తిగా జీవించడం. సంతోషం, సంతృప్తి మనస్సుకు సంబంధించినవి. సాధారణంగా మనం కోరుకున్నది మనకు లభించినప్పుడు సంతోషం కలుగుతుంది. అలాంటి ఆనందం మరొక కోరికకు దారితీస్తుంది. ఆ సంతోషం స్వల్పకాలం మాత్రమే. మనలో కోరికలు ఉన్నంత వరకూ నిజమైన ఆనందం పొందలేమనడానికి  భాగవతంలోని ఒక కథ ఉదాహరణగా నిలుస్తుంది.  “ఒక రోజు కొంతమంది బెస్తలు చేపలు పడుతున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గ్రద్ద రివ్వున క్రిందికి వచ్చి ఒక చేపను తన్నుకుపోయింది. గ్రద్ద నోటిలో చేప కనపడేసరికి, కాకులు గుంపులు గుంపులుగా దాని వెంటపడ్డాయి. ఆ గందరగోళంలో గ్రద్ద నోటిలో నుంచి చేప జారి క్రింద పడిపోయింది. తక్షణమే కాకులన్నీ గ్రద్దను వెంబడించడం మానేశాయి. అప్పుడు ఆ గ్రద్ద ఓ చెట్టుకొమ్మ మీద వాలి ప్రశాంతంగా కూర్చుని 'ఛీ! నికృష్టమైన ఆ చేప ఈ అనర్థాలన్నిటికీ మూలం! దాన్ని వదిలేసరికి నాకు మనశ్శాంతి లభించింది" అని అనుకుంది. మనలో ప్రాపంచిక కోరికలు ఉన్నంత వరకూ అశాంతి మనల్ని వెంటాడుతూనే ఉంటుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. స్వామి వివేకానంద తమ జ్ఞానయోగం పుస్తకంలో ఇలా వ్రాస్తారు: "మరణం అనేది ఉన్నంత వరకు సంతోషం కోసం పరుగులు, ప్రయాస జలగల్లాగ పట్టుకొని వేలాడతాయి. ఇవన్నీ కొంత కాలానికి అనిత్యాలుగా తోస్తాయి. జీవితమంతా ఎంతో బుద్ధిపాటవంతో, తదేక దీక్షతో, పరిశ్రమించి నిర్మించుకొన్న ఆశాసౌధాలు ఒక్క నిమిషంలో కుప్పకూలిపోతాయి.” సంతోషం బయటదొరికేది కాదు అని అర్థం అవుతుంది. కోరికల నుండి దూరమైనప్పుడే మనస్సు ప్రశాంతతను సంతరించుకొంటుంది. Happiness comes from being and not having సంతోషం అనేది మనలో ఉన్నదే కానీ బాహ్య వస్తువుల నుంచి వచ్చేదికాదు. కోరికలు లేకుండా ఉండడం అసాధ్యం కాబట్టి, జీవించడానికి అవసరమైనవాటిని, ఆత్మనిగ్రహానికి ఆటంకం లేనివాటిని మాత్రమే కోరుకోవాలి. ప్రకృతి ద్వారా వచ్చే ప్రతిబంధకాల నుండి అనాసక్తులమై ఉండగలగాలి. మనలో  ఉన్న సంతోషాన్ని, బాహ్యవస్తువుల ద్వారా వచ్చే సంతోషంతో అనుసంధానం చేయాలి. దానికై ధ్యానం క్రమం తప్పక చేయాలి. ఒక సాధువుగారు తన శిష్యుడితో సాయంకాలం ఊరి పొలిమేరలకు వెళ్ళారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు పచ్చగా కళకళలాడుతూ కనిపించాయి. ఎదురుగా పొలంలో వాడిపోయిన మొక్కలు కనిపించాయి. శిష్యుడు వెంటనే ఆ విధంగా ఉండడం చూసి గురువుగారిని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా సాధువు “నాయనా! ఈ చెట్ల వేర్లు భూమిలో నీటి మట్టం వరకు పోయాయి. కనుక ఈ చెట్లు కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. ఈ చిన్న మొక్కల వేర్లు పైపైనే ఉన్నాయి. అవి నీటి మట్టాన్ని తాకలేవు కాబట్టి వాడిపోయాయి" అని సమాధానం ఇచ్చాడు. ఎవరైతే తమ మనస్సును అంతరాత్మతో అనుసంధానం చేస్తారో వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలరు. ఎవరి మనస్సు అయితే నిత్యసత్యమైన ఆత్మను మరచి అనిత్యాలైన బాహ్యవస్తువుల వెంట పరుగులు తీస్తుందో అలాంటివారు. ఎన్నటికీ ఆనందంగా జీవించలేరు. కాబట్టి మనస్సును బాహ్య విషయాలపైకి పోనివ్వకుండా మనలో ఉన్న దివ్యత్వంతో అనుసంధానం చేసుకొని సంతోషంగా జీవించడానికి ప్రయత్నిద్దాం.                                        *నిశ్శబ్ద.

మనిషి అభివృద్ధికి అసలైన ఆటంకం ఇదే...

మనషి తన జీవితంలో గెలవలేకపోతున్నాడు అంటే దానికి కారణం అతను గెలుపు కోసం ప్రయత్నం చేయడం లేదని కాదు. అంతకు మించి ఆ మనిషిలో భయం ఉందని అర్థం. భయం మనిషిని ఓటమి అంచుల్లోకి తీసుకెళ్తుంది. ఎంత ప్రతిభావంతుడినైనా పరాజయుడిని చేస్తుంది. ఇంతకూ భయం మనిషికి శత్రువుగా ఎలా మారుతుంది?? అసలు భయం అంటే ఏంటి?? దాన్ని ఎలా జయించాలి?? ఈ విషయాలు నేటి తరం వారు తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది. మన సామర్థ్యం మీద మనకు నమ్మకం తగ్గిపోయి, గెలుపుకు వ్యతిరేకంగా ఉండే విషయాల ప్రభావానికి లోనైనప్పుడు మనిషిలో కలిగే ఒత్తిడిని, మార్పును, ప్రవర్తనను భయం అంటారు. మన పరాజయాలన్నింటికీ మూలకారణం భయమే!  భయం కలగడానికి ముఖ్య కారణాలు :  ఆత్మవిశ్వాసం లేకపోవడం :  మనం మన మీద విశ్వాసం కోల్పోయినప్పుడు ప్రతికూలభావాలు మనల్ని ఆవరిస్తాయి. "భయమే మరణం, భయమే పాపం, భయమే నరకం, భయమే దుఃఖానికి మూలకారణం. ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రతికూల భావాలూ ఉత్పన్నమయ్యేవి భయం అనే దుష్టశక్తి నుంచే" అని అంటారు స్వామి వివేకానంద. పరులపై ఆధారపడడం :  మన స్వశక్తిపై ఆధారపడకుండా ప్రతిదానికీ ఇంకొకరిపై ఆధారపడే స్వభావం మనల్ని నిస్సహాయులుగా, భయస్థులుగా మారుస్తుంది. ప్రతి విషయంలో ఇతరుల సహాయం అర్థించేవాడు స్వశక్తితో ఎన్నటికీ ఎదగలేడు. ఆధారపడటం అంటే మనిషిలో పిరికితనం పేర్చుకుంటూ పోవడమే. "Why are people so afraid? The answer is that they have made themselves helpless and dependent on others".- అంటారు స్వామి వివేకానంద. కాబట్టి నిస్సహాయత మనిషి భయానికి మూలం.  పని మీద నిబద్ధత, నమ్మకం కోల్పోవడం :  మనం చేసే పని ఎంత చిన్నదైనప్పటికీ ఇతరులు చులకనగా చూస్తారనే భావన మనలో రానివ్వకూడదు. దానివల్ల మనం పని మీద నిబద్ధతనూ, నమ్మకాన్నీ కోల్పోతాం. అలాంటి ఊహాజనిత భయాలను వీడితేనే ప్రగతి సాధ్యం. పేపర్లు వేసి డబ్బు సంపాదించడం, టీ అమ్ముతూ డబ్బు సంపాదించడం, చిరిగిపోయిన దుస్తులను కుట్టుకుని వాటిని ధరించడం, ఇలాంటి వాటికి మనిషి చిన్నతనంగా ఎవరో ఏదో అనుకుంటారేమో అని ఆలోచించాల్సిన అవసరం లేదు. విమర్శల గురించి అతిగా ఆలోచించడం:  ఇతరుల విమర్శలకూ, అభిప్రాయాలకూ భయపడితే ఏ కార్యంలోనూ విజయాన్ని సాధించలేం. కాబట్టి వాటి గురించి అతిగా ఆలోచించి భయపడకూడదు. We cannot succeed in anything, if we act in fear of other people's opinions.- భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి గారు ఇలా చెబుతారు. ఎవరైనా ఏమైనా అనుకుంటారని భయపడితే మనం విజయం సాధించలేము. భయాన్ని పోవాలంటే అందరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి... భయం మానసిక బలహీనత వల్ల కలుగుతుంది. 'A sound mind in a sound body' అనే నానుడి మనందరికీ తెలిసిందే! దృఢమైన మనస్సు ఉండాలంటే దృఢమైన శరీరం అవసరం. అందుకు ప్రతీరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం శరీరానికి అయినా ఎది మనసును కూడా దృఢంగా మారుస్తుంది. వ్యాయామం తో పాటు ధ్యానం మంచిది. ప్రతిరోజూ మనిషి తనగురించి, తను చేసిన పనుల గురించి ఆత్మవిమర్శ చేసుకోవడం మంచిది. క్రమశిక్షణతో కూడిన నీతిబద్ధమైన జీవితాన్ని గడపడం అలవరచుకోవాలి. అప్పుడు ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. అదే క్రమశిక్షణ లేకోతే మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండదు. ఇతరుల విమర్శలను మనలోని బలహీనతల్ని తొలగించు కోవడానికి ఉపయోగించుకోవాలి. అంతేకానీ ఎవరైనా ఎదైనా అంటే వారిని కోపం చేసుకుని, నోరు పారేసుకోకూడదు. నెమ్మదితనం విజ్ఞుల లక్షణం. పోలిక మనిషిని దారుణంగా దెబ్బతీస్తుంది. అందుకే ఇతరుల శక్తి సామర్థ్యాలతో పోల్చుకొని బాధపడకుండా నిరంతర తపన, నిర్విరామ కృషితో దేనినైనా సాధించగలమనే విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ప్రతి మనిషిలో లోటుపాట్లు అనేవి ఉంటాయి. మొదట్లోనే ఎవరూ సంపూర్మణులు కాదు. మనలోని లోటుపాట్లను అధిగమించడానికి అనుభవజ్ఞులైన పెద్దల నుంచీ, సన్నిహితుల నుంచీ సలహాలను స్వీకరించాలి.                                        *నిశ్శబ్ద.

వావ్ ఎమోజీస్... స్క్రీన్ మీద చిలిపి ముసుగులు...

వాట్సాప్, ఫేస్ బుక్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్.. ఓయబ్బో సోషల్ మీడియాకు  ఎన్ని అలంకార భూషితాలో..  పోస్టులు, ఆ పోస్టుల మీద రోస్టులు, పొగడ్తలు, వీటన్నింటికోసం విరివిగా చెక్స్ట్ కంటే ఎక్కువగా అందరూ ఇప్పట్లో ఉపయోగించేది ఎమోజీలే.. నవ్వు వ్చిచనా, ఏడుపు వచ్చినా, ప్రేమ పుట్టినా, అలిగినా, ముద్దు చేయాలన్నా ఇలా ఒకటనేమిటి నవరసాలకు మించి ఎమోజీలు ప్రతి ఒక్కరి మొబైల్ లో ఉంటాయి. అయితే ఈ ఎమోజీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. వాటితో ఎంత సరదా చేయచ్చనేది తెసుసుకుందాం. మనిషి భావానికి బదులుగా ఇంటర్నెట్ యుగంలో ఎమోజీలను వాడుతున్నాం. అయితే ఈ ఎమోజీ అనే పదాన్ని ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ లో 2015లో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఏడాది  జులై 17న ప్రపంచ వ్యాప్తతంగా ఎమోజీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఎమోజీలకు మొదటిరూపం ఎమోటికాన్. ఫుల్ స్టాప్, కమా, బ్రాకెట్ వంటి నమూనాలతో వీటిని రూపొందించేవారు. మొట్టమొదటి సారి 1862 సంవత్సరంలో అబ్రహం లింకన్ ప్రసంగానికి సంబంధించిన కాపీని ముద్రించడంలో జరిగిన పొరపాటుకు  - ':)' - అనే ఎమోటికాన్ వినియోగించబడింది. ఆ తరువాత 1881లో ఈ ఎమోటికాన్ లను అమెరికన్ వ్యంగ్య పత్రిక పక్ ద్వారా ప్రచురించింది.  ఆ తరువాత ఎమోజీలను చిన్న చిన్న బొమ్మల ఆకారంలో పరిచయం చేయడం మొదలుపెట్టారు. మొదటి ఎమోజీని జపనీస్ కళాకారుడు పిగెటకా కురిటా రూపొందించాడు. ఇది 1999నాటి ఆవిష్కరణ. 2010లో యూనికోడ్ లో ఎమోజీలను చూపించడం, కొత్త వాటిని జోడించడం మొదలుపెట్టారు. ఎమోజీల కోసం మొత్తం 198ఆకారాలు జత చేశారు. ఇదీ ఎమోజీ గురించి కొంత ఆసక్తికరమైన విషయాలు. అయితే ఈ ఎమోజీ రోజు స్నేహితులు, బంధుమిత్రులు ఎమోజీల ద్వారా సంభాషణ సాగించడం, కొత్త కొత్త ఎమోజీలు సృష్టించడానికి ప్రయత్నించడం వంటివి మంచి ఫన్ ను అందిస్తాయి.                                           *నిశ్శబ్ద.

వర్షాకాలం ఇవి వద్దు... ఇలా చేస్తే ముద్దు!

అసలే వర్షాకాలం. బయటకు వస్తే చలి... అలాగని వెచ్చదనం కోసం ఇంట్లోనే కూర్చుంటే చదువులెలా సాగుతాయి? ఉద్యోగాలెలా చేస్తాం? రెయిన్‌ కోటు తగిలించుకునో గొడుగేసుకునో బయటికి వెళ్లక తప్పదు. అయితే మనం ధరించే దుస్తులు మాత్రం వానకు తగ్గట్టు లేకపోతే అసౌకర్యం తప్పదు మరి. ఈ వానలకు ఎలాంటి దుస్తులయితే బాగుంటుంది, యాక్సెసరీస్‌ ఏవి బాగుంటాయి... ఒకసారి తెలుసుకుందాం. వర్షాకాలంలో యువతరం బట్టల గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇక కాలేజీకి వెళ్లే విద్యార్ధులకు దీని పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఎండల్లో పల్చని రంగులు వాడినప్పటికీ ఇప్పుడు ముదురు రంగులు వాడటం ఉత్తమం. ఎందుకంటే వర్షాకాలంలో తడి , బురద ఉంటుంది .. పల్చని రంగులయితే మరకలు పడితే త్వరగా వదలవు . అలాగని మందపాటి దుస్తులు వాడకూడదు . తేలికపాటివి అయితేనే మంచిది. వాటిలో తెలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ఈ కాలంలో ఎంతో శ్రేయస్కరం. ఇవి వద్దు! ఇలా చేస్తే మేలు : 1. వర్షాకాలంలో ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే దుస్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. 2. బట్టలు పొడిగా వుంచుకోవాలి. తడి వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. అందుకే ఎక్కువసేపు తడిగా వుండకూడదు. 3. తెలుపు రంగు బట్టలు అసలు వాడొద్దు . మురికి పట్టిందంటే తొందరగా వదలదు. 4. ఏ చిన్న మరక పడ్డా దూరానికి కూడా కనిపించి అసహ్యంగా వుంటుంది కాబట్టి ముదురు రంగు బట్టలు వాడితే మంచిది. ఇవి బాగుంటాయి! 1. కాటన్, సింథటిక్‌ ఫ్యాబ్రిక్‌ వంటి దుస్తులను వాడటం మంచిది. 2. సాయంకాలం సమయంలో ఫ్రాక్స్, అనార్కలీ బాగుంటాయి. 3. స్కిన్‌ టైట్, లెగ్గింగ్స్‌ కూడా బాగుంటాయి. 4. అదే విధంగా చీరలు, చుడిదార్లు ధరించే వారు శాండిల్స్, షూస్‌ వంటి వాటిని వేసుకుంటే మంచిది. 5. హ్యాండ్‌ బ్యాగులు చిన్న సైజులో కాకుండా, కాస్త పెద్దవిగా ఉన్నవి అయితేనే నయం. 6. వర్షాకాలంలో ఎక్కువగా మేకప్‌ వేసుకోకపోవడమే మంచిది. 7. అలాగే వర్షాకాలంలో స్లిప్పర్స్‌ కంటే షూ వాడడం బెటర్‌. లేదంటే శాండిల్స్‌ అయినా ఫరవాలేదు. 8. స్లిప్పర్స్‌ వేసుకుంటే మాత్రం బట్టలపై బురద మరకలు పడి అసహ్యంగా కనిపిస్తాయి.

మతం గురించి వివేకానంద చెప్పిన మాటలు ఏంటంటే..

ఈ ప్రపంచంలో మతానికున్న శక్తి చాలా పెద్దది. కొందరు మతాన్ని ఆయుధంగా మలచుకుంటారు. ప్రపంచాన్ని అయోమయంలోకి తోస్తారు. భారతదేశం భిన్న మతాల సమ్మేళనం. అయితే ఈ మతాల కొట్లాటలు ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ. ఈ మతం గురించి స్వామి వివేకానంద చెప్పిన మాటలు వింటే మతం గురించి అందరికీ అవగాహన వస్తుంది. వివేకానంద ఏమి చెప్పాడంటే… మతం యొక్క అసలు రహస్యం ఆచరణ రూపంలో నిరూపితమవుతుంది కానీ సిద్ధాంతాల్లో కాదు. మంచిగా నడచుకోవడం, మంచిని ఆచరించడం అదే మత సారాంశం. భగవన్నామాన్ని బిగ్గరగా అరవడం మతం కాదు. భగవానుని నిర్ణయాలను అమలు చేయడమే నిజమైన మతం. నైతిక పథంలో వ్యక్తి సంచరించాలి. వీరోచితంగా నడచుకోవాలి. హృదయపూర్వకంగా కర్తవ్యాన్ని నిర్వహించాలి. సడలని నైతిక పథంలో, భయమెరుగని సాహసంతో వ్యక్తి జీవించాలి. వ్యక్తి పవిత్రాత్ముడైతే అతడు అపవిత్రతను దర్శించలేడు. దానికి కారణం అతని అంతరంగ ప్రవృత్తే బాహ్యంలో ప్రతిబింబించడం. మన లోపల మలినం ఉంటే తప్ప బాహ్యప్రపంచంలో మలినాన్ని చూడలేం. ఈ విజ్ఞానాంశాన్ని ప్రతి ఒక్కరూ తమ తమ జీవితాల్లో అనుసరించడం శ్రేయస్కరం. సర్వజన సంక్షేమం, నైతిక పథ గమనం సాధించాలంటే ముఖ్యంగా స్వార్థరాహిత్యాన్ని అవలంబించాలి. 'నీ కొరకు నేను, నా కొరకు కాదు' అనే భావాన్ని ప్రతి వ్యక్తీ అలవరచుకోవాలి. స్వర్గం, నరకం అనేవి ఉన్నాయో లేవో ఎవరికీ అవసరం లేదు. ఆత్మ పదార్థమనేది ఉందో, లేదో ఆలోచించాల్సిన పని లేదు. 'చిత్తు, సత్తు' అంటూ వాటిని గురించి వితర్కించుకోవాల్సిన పని లేదు. మన ఎదురుగా కనిపించే ప్రపంచాన్ని గురించి మాత్రమే మనం విచారించాలి. ఈ ప్రపంచం అంతా దుఃఖ భూయిష్ఠంగా ఉంది. బుద్ధుడి లాగే మనం కూడా ప్రపంచంలో సంచరించి, ప్రజల కష్టాల్ని రూపుమాపడానికి శాయశక్తులా కృషి చేయాలి. ఆ ఉద్యమంలో మనం ఆత్మాహుతికి కూడా సిద్ధమవ్వాలి. ఒక వ్యక్తి నాస్తికుడా, ఆస్తికుడా, భౌతికవాదా, వేదాంతా, క్రైస్తవుడా, మహమ్మ దీయుడా అని విచారించాల్సిన పని లేదు. పరోపకారం పరమోత్కృష్ట ధర్మం. అలాగే పరపీడనం పరమ నికృష్టకార్యం. పరులను ప్రేమించడం ఉత్తమ లక్షణం కాగా, ఇతరులను ద్వేషించడం హైన్యం. దైవశక్తి పట్ల విశ్వాసం, ఆత్మ విశ్వాసం సద్గుణాలు అవుతాయి. సంశయించే ప్రవృత్తి పాపంగా పరిగణిత మవుతుంది. సమైక్యభావం శ్లాఘనీయం. భేదభావం నైచ్యం అవుతుంది. ఇదీ విలివేకానందుడు చెప్పిన మాటలు.. *నిశ్శబ్ద.

మీరు చేసే ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారా?

ప్రస్తుత సమాజంలో చదివింది ఒకటయితే చేసే ఉద్యోగం మరొకటి అవుతుంది. చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరకటం చాలా కష్టంగా వుంటుంది. జీవితంలో ఎదురయ్యే ఆర్థిక అవసరాలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబ కారణాలు కావచ్చు చదివిన చదువుకు సంబంధించినది కాకుండా పరిచయం లేని, దాని గురించి ఏమీ తెలియని ఉద్యోగం చేయాల్సి రావచ్చు.  చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం లభించకపోవటం వల్ల మనలో నిరాశ, అసంతృప్తి అనేవి చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తుతం ఉన్న యువతలో చాలా బాగా గమనించవచ్చు. దానివల్ల  మానసిక ప్రశాంతత అనేది కరువైపోతుంది. ఈ మానసిక ప్రశాంతత లేని కారణంగానే  ఇబ్బందులకు గురి అవుతున్నాము. మానవ జీవితాలలో అత్యంత ప్రాముఖ్యత వహించే అంశం ఉద్యోగం, మనకు అనుకూలమైన ఉద్యోగం దొరకనప్పుడు దొరికిన దానితో సంతృప్తి చెందుతూనే మనకు అనుకూలమైన ఉద్యోగం దొరికేంత వరకు దాని కోసం కృషి చేయాలి, దానిని సాధించుకోవాలి. అంతే తప్ప మనకు తగినది దొరకలేదనే కారణంతో ఏదీ చేయకుండా కాలాన్ని వృధా చేస్తూ ఉండటం వివేకవంతుల లక్షణం కాదు.  దీనికంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది అని మనం మానసికంగా ఫీల్ అవ్వాలి అటువంటి మంచి ఉద్యోగం పొందే సామర్థ్యాన్ని, అంటే అర్హతలు మనకున్నాయో లేదో గమనించుకుని ఆ అర్హతలు సాధించేందుకు అవిశ్రాంతంగా కృషి చెయ్యాలి. అలాగని చెప్పి, ఉన్న ఉద్యోగం వదులుకుని, నిరుద్యోగిగా ఆఫీసులచుట్టూ ప్రదక్షిణలు చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. చేస్తున్న ఉద్యోగం మంచి క్రమశిక్షణతో అంకిత భావంతో చేస్తూనే మన సమర్ధతకు సరిపోయే ఉద్యోగం కోసం కృషి చేయాలి. కృషి చేస్తే ఈ ప్రపంచంలో సాధించలేనిదేదీ లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఉద్యోగాలు లేక, దొరికిన ఉద్యోగాలు చేయలేక ఆత్మనూన్యతాభావంతో ఎన్నో రకాలైన మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. కాని అది సమంజసం కాదు. ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుంటే అసమర్ధుడిగా ముద్రపడే ప్రమాదం ఉంది. అందుకే దొరికిన ఉద్యోగం చేసుకుంటూ మనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకోవాలి. నిజానికి పరిచయం లేని పని దొరికినా ఆ కొత్త పనిలో విషయాన్ని, ఆ పనికి సంబంధించిన మెలకువలను ఆసక్తిగా తెలుసుకునేవాడు ప్రతిభావంతుడు అవుతాడు. ఎదురయ్యే ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకోవడమే వివేకవంతుల విజయాల వెనుక కారణం. ప్రస్తుతం సమాజంలో వ్యక్తి నైపుణ్యానికి తెలివికి విలువలేని కాలంలో తనకు గుర్తింపు లేదనో, తన తెలివికి తగ్గ ఉద్యోగం లేదనో బాధపడుతూ అశాంతికి గురి అవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన తెలివిని మన నైపుణ్యాన్ని గుర్తించే రోజు ఒకటంటూ వుంటుందని గ్రహించాలి, విశ్వసించాలి. పరిస్థితులను అర్ధం చేసుకుని జీవించాలి. మనం వున్న పరిస్థితులలో మౌనంగా ఉంటూ, మన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. ఆఫీసులో ఉద్యోగం చేసుకుంటూనే నిత్య జీవితంలో తమ ప్రతిభను వెల్లడించాలి, మనం కొంతమందిని చూస్తూ వుంటాము. వారు ఎదుటివారి దోషాలు చూపటం వల్ల తాను గొప్పవాడైనట్టు భావిస్తుంటారు. తప్ప, తమలోనూ లోపాలున్నాయని అనుకోరు. ఎదుటివారిలో తప్పులు వెతకడం మాని, తనలోని లోపాలను గుర్తించి, సరిదిద్దుకునే వ్యక్తికి ఉన్నత అవకాశాలు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి.                                       ◆నిశ్శబ్ద.

మనకు మనమే మిత్రుడు, శత్రువు అంటారు ఇందుకే..

మనిషి జీవితంలో మానసిక దృక్పథం గొప్ప పాత్ర పోషిస్తుంది. సరైన మానసిక దృక్పథంతో, మనల్ని మనం చక్కగా అదుపులో పెట్టుకున్నప్పుడు, మన శ్రేయస్సును మనమే ప్రోదిచేసుకుంటాము. అలా కాక చెదిరిన మనస్సుతో, అజ్ఞానపు మబ్బులు క్రమ్మిన మనస్సు మనకే శత్రువుగా తయారవుతుంది. మనల్ని మనం కించపరుచుకున్న ప్రతిసారీ మనలోని ఉన్నతమైన ఆత్మకు మనం వ్యతిరేకంగా పనిచేస్తున్నామన్న మాట.  నిజానికి మనల్ని మనం కించపరచుకున్నప్పుడు మనలో ఉన్న ఆత్మశక్తిపై మనకు నమ్మకం లేదని అర్థం. మనల్ని మనం నాశనం చేసుకోవడానికి ఇదే కారణం. అదే విధంగా, మనం గర్వం, అహంకారంతో మిడిసిపడుతున్నప్పుడు కూడా మనం ఆ ఆత్మశక్తి నుంచి మరలిపోతున్నామన్నమాట. ఈ అహంకారం రెండు విధాలుగా పనిచెయ్యగలదు. దంభాన్ని, దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పుడే కాక విషాదంలో, నిస్పృహలో మునిగిపోయినప్పుడు కూడా ఈ అహంకారమే మనలో పనిచేస్తూ ఉంటుంది. దీనిని బట్టి, మనకు అన్నిటికన్నా మించి ఒక సమస్థితి కలిగిన మనస్సు కావాలి అని అర్థమవుతుంది. ఆ సమస్థితితో మనస్సు ఒక అంచు నుంచి మరొక అంచుకు పరుగులు తీయకుండా ఉండాలి. మనం ధనవంతులమనీ, అధికారం కలవారమనీ మిడిసిపడటం ఒకవైపు అయితే, మనకేమీ లేదనీ, పేదవారమనీ, దుఃఖాలలో మునిగి ఉన్నామనీ అనుకోవడం రెండవవైపు. ఈ రెంటికీ మధ్యనున్న మార్గాన్ని మనం అనుసరించాలి. వేదాలలో కనిపించే బోధలు, మనకు ఆ మార్గాన్ని అత్యంత శక్తిమంతంగా, స్పష్టంగా చూపాయి. మిగిలిన విషయాలన్నింటికన్నా మిన్నగా మనకు ఈ సమస్థితి కావాలనీ, ఇది కేవలం ఆధ్యాత్మిక జీవితంలోని ఉన్నత శిఖరాలకు చేరుకునేవారి కోసం మాత్రమే కాక మన రోజువారీ జీవితంలో కూడా అంతే అవసరం.  కొందరు చిన్నచిన్న విషయాలను కూడా తట్టుకోలేరు. వాతావరణం కొద్దిగా వేడెక్కినా, కొద్దిగా చలిగాలి వీచినా వారు గోరంతలు కొండంతలు చేసి తమ బాధల్ని వివరిస్తారు. కానీ అదంతా వారి మనస్సులో తయారయినదే. నిజానికి మనం అత్యంత విషాదం అని భావించే పరిస్థితి కూడా మన మనస్సులో తయారు చేసుకున్నదే. మన విషయమేమిటో మనమే ముందుగా గమనించాలి. ఒకరోజు మనం మంచి ఉత్సాహం నిండిన మనస్సుతో, ధైర్యంతో, నిర్భయంగా, అంతా భగవదర్పణమే అన్నట్టు పనిచేస్తాము. మరొకరోజు నిరాశతో, సంశయంతో, అసంతృప్తితో పనిచేస్తాము. వీటియొక్క ప్రభావం మన జీవితం మీద ఎలావుంటుందో మనం గమనిస్తే, 'మనకు మనమే మిత్రుడు, మనకు మనమే శత్రువు' అని ఎందుకు చెప్పారో ఇట్టే అర్ధమవుతుంది. నిస్పృహ వల్ల మనల్ని మనమే అధోగతి పాలుచేసుకోవడం కాక తోటివారిని కూడా మనతో పాటు క్రిందికి లాగుతాము.  ఎవరైతే అలాంటి నిరాశానిస్పృహలలో మునిగిపోయి ఉంటారో, వారికి వేరొకరి జీవితాన్ని తాకే అధికారం లేదు అని ఒక గొప్ప గురువు చెప్పుతూ ఉండేవాడు. జీవితమనేది విషాదంగా ఉండటం కోసం కాదు. మన నెత్తిమీద ఉన్న బరువును వేరొకరిని మోయమనడం సమంజసం కాదు. విచ్చలవిడి ప్రవర్తన వల్ల ప్రయోజనం లేదు.  కొందరు విషాదంలో మునిగితేలుతూ ఉంటారు. చూడబోతే వారికి అదే చాలా ఇష్టంగా కనిపిస్తున్నట్టు తోస్తుంది. మీరు వారిని అందులోనుండి ఒకసారి బయటకు లాగితే వాళ్ళు తిరిగి అందులోనే పడిపోతూ ఉంటారు. వారికి ఆ నిస్పృహ అనే పంజరంలో ఉండటం అలవాటయిపోయింది. ఇక వారు తమకు తామే అందులోనుంచి బయట పడాలి. ప్రపంచంలోని మతాలన్నీ కలసి, అత్యున్నతమైన ఆదర్శాలన్నీ వారికి బోధించినా, వారిని వారు మేల్కొల్పుకునేవరకూ, వాటివల్ల వారికి ఏ ప్రయోజనమూ ఉండదు. అందుచేతనే భగవద్గీత ఎలుగెత్తి ఘోషించింది - "నిన్ను నీవు, నీచేతనే ఉద్దరించుకోవాలి! నిన్ను నీవు దిగజార్చుకోకూడదు!" అని.                                         ◆నిశ్శబ్ద.

 ఇంకొంచెం సంతోషంగా జీవిద్దాం 

 జీవించడానికి, బతకడానికి మధ్య ఒక సన్నని గీతను చూపెడుతుంటారు కొందరు. అయితే సాధారణ జీవితాల్లో బంధాలు, భాధ్యతలు, సర్దుకుపోవడాలు త్యాగాలు, వీటన్నిటికీ మించి  కాలం తో పాటు అన్నిటికి అలవాటు పడుతూ కుటుంబంలో అందరితో సమన్వయంగా ఉంటూ ఇలా కొనసాగడం ఎక్కువ మంది చేసే పని. బహుశా ఇట్లా చేసే పనుల్లో ఇష్టం, తృప్తి కంటే బాధ్యత కాబట్టి చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే మెంటాలిటీనే ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక విషయం. ఇలా చేసే పని వల్ల సంతోషం ఉంటుందా?? యాంత్రికంగా, కృత్రిమత్వంగా చేసే పనికి, ఇష్టంగా చేసే పనికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆ రెండిటి మీదనే మనిషిలో తృప్తి తాలూకూ స్పందనలు కూడా ఉంటాయి. ఈ విషయాన్ని బహుశా చాలామంది గమనించరు. అలా గమనించకపోవడం అనేది కూడా ఆ యాంత్రికం మరియు కృత్రిమత్వంలో భాగమే. అయితే కొందరు మాత్రం చేసే పనిలో కూడా ఎంతో తృప్తిని చవిచూడగలుగుతారు కారణం ఏమిటి అని ప్రశ్న వస్తే కొందరు చెప్పే సమాధానం. బహుశా నచ్చిన పని కావచ్చు అందుకే అంత సంతోషం అనేస్తారు.  కానీ అసలు నచ్చిన పని ఏమిటి?? నచ్చని పని ఏమిటి?? మనిషికి, సంతోషానికి, ఇష్టానికి మధ్య సంబంధం ఏమిటి?? ఇవన్నీ ఆలోచించాల్సి వస్తే మొదట మనసును ప్రభావితం చేసిన పరిస్థితులు, చేతనైనది, చేతకానిది, లేదా నైపుణ్యం సాధించింది ఇలా ఎన్నో పరిగణలోకి వస్తాయి. కానీ ఏ పనిని అయినా ఒక అవగాహనతో, ఒక ప్రణాళికతో చేయాలని అనుకుంటే మాత్రం తప్పని సరిగా ఆ పనిలో తృప్తిని పొందగలం. వాస్తవాన్ని స్వీకరించి, కాలాన్ని ప్రేమించాలి వాస్తవం ఏది అనేది తెలిసినప్పుడు దాన్ని నిజాయితీగా స్వీకరించాలి. ఎప్పుడూ అది కాదు, అది బాగలేదు, అది నాకు సంబంధించినది కాదు వంటి మభ్యపెట్టుకునే ఆలోచనల్లో ఉండకూడదు. వాస్తవాన్ని ఎప్పుడైతే ఉన్నది ఉన్నట్టు స్వీకరిస్తామో అప్పుడు కాలాన్ని కూడా ప్రేమించగలుగుతాము. ఇదంతా కూడా కొన్ని భ్రమలు, కొన్ని కల్పనలను బుర్రలో నుండి వదిలేసి స్పష్టమైన కోణంలో ఆలోచించడం వల్ల కలిగేది.  ఒక వస్తువును చూడాలి అంటే కాగితాన్ని అడ్డు పెట్టుకుంటే ఎలాగైతే మసకగా కనిపిస్తుందో అలాగే కొన్ని సిద్ధాంతాలు, కొన్ని నియమాలు, షరతులు, మనసును కట్టిపడేసే పద్ధతులు అన్నిటి మధ్య చూస్తే వాస్తవం అనేది స్పష్టంగా కనిపించదు, అర్థం కాదు. అలా కాకుండా కేవలం విషయాన్ని, దాని తాలూకూ కారణాలను మాత్రమే చూస్తూ, విశేక్షించుకుంటే వాస్తవం తొందరగా బోధపడుతుంది. ఇక కాలాన్ని ప్రేమించడమంటే అన్ని దశలను కూడా ప్రేమించడం. ఇక్కడ మనిషి పరిపక్వతను సూచించేది ఏదైనా ఉందంటే అది కచ్చితమై కాలం. అదే వర్తమానం. పరిపక్వత కలిగిన మనిషి గతాన్ని గురించి బాధపడడు, భవిష్యత్తు గురించి ఖంగారు పడడు. కేవలం వర్తమానాన్ని ఎంత సమర్థవంతంగా ఎంత సంపూర్ణంగా వినియోగించుకుంటున్నాం. మన పనులను వర్తమానంలో ఎంత బాగా చేస్తున్నాం అనే విషయం మీదనే శ్రద్ధ పెడతాడు. కాబట్టి ఇక్కడ తెలిసొచ్చేది ఏమిటంటే మనం సాధారణంగా ఏ పని చేసిన కూడా దాన్ని మనసుకు తీసుకునే విధానంలోనే సంతోషం అనేది ఆధారపడి ఉంటుంది. అందుకనే చేసే పని ఏదైనా దాన్ని ఇష్టంతో చేయగలిగితే మరింత సంతోషంగా ఉండవచ్చు. ఆ పాజిటివ్ కోణమే మీ జీవితాన్ని కూడా సంతోషంగా ఉంచుతుంది.                                                                                                                                                                                                                                                                                              ◆ వెంకటేష్ పువ్వాడ

యోగం జీవనరాగం!

భారతీయ సనాతన వ్యవస్థ చాలా గొప్పది. ఎన్నో వేల సంవత్సరాల నుండి మహర్షులు, ఋషులు, పూర్వీకులు కొన్ని విశిష్టమైన జీవనవిధానాలను ఆచరిస్తూ తమ ముందు తరాల వారికి కూడా వాటిని అందజేశారు. అలా తరాలుగా వస్తున్న గొప్ప జీవనశైలిలో ఎంతో అద్భుతమైనమార్గం యోగ. యోగను రోజువారీ చేసేపనులలో అంటే ఉదయం లేవడం, ఇంటి  పనులు, వ్యాయామం, ఆహారం తినడం వంటి పనుల్లా యోగా కూడా ఒక గంటనో, లేక కొన్ని నిమిషాలో సాగే ప్రక్రియగా భావిస్తారు చాలామంది. యోగ అంటే ఏంటి? యోగ అంటే శరీరాన్ని వివిధ భంగిమలలోకి వంచి ఆసనాలు వేయడం అని కొందరు అనుకుంటారు. ధ్యానం చేయడం అని మరికొందరు అనుకుంటారు. రెండింటిని కలిపి చేయడం అని కొందరు అనుకుంటారు. కానీ యోగ అనేది ఒకానొక జీవనవిధానం అనే విషయం కొద్దిమందికే మాత్రమే తెలుసు.  మనుషుల జీవన విధానాలు కూడా వర్గాలుగా ఉన్నాయా?? వేరు వేరుగా ఉంటాయ అని అనుమానం వస్తుంది. మనిషి జీవనశైలిని బట్టి మనిషి జీవనవిధానం విభిన్నంగా ఉంటుంది. ఆ విభిన్నతే మనిషి శారీరకంగా మానసికంగా ఎలా ఉన్నాడు అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మనిషిని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతూ ఈ వేగవంతమైన కాలంలో కూడా నిశ్చలమైన మనసును కలిగి ఉండటం, సహజత్వానికి, ప్రకృతికి దగ్గరగా జీవించడమే యోగమని ఆ మార్గాన్ని యోగ అని అంటారు. జీవితాన్ని రీఛార్జి చేస్తుంది! యోగ అనేది జీవితాన్ని రీఛార్జి చేసే గొప్ప మార్గం. నిజానికి ఇది ఒక మంచి మెడిసిన్ లాంటిది. జీవితం నిస్సారంగా మారిపోయి ఎలాంటి ఆశ లేదనుకునే స్తాయిలోకి జారిపోయినప్పుడు యోగ మనిషికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది.  జీవన సరళి! అప్పటివరకు గందరగోళంగా ఉన్న జీవితాన్ని ఒక గట్టుకు చేర్చేదే యోగ.  క్రమశిక్షణను, స్పష్టతను కలిగి ఉండేది.  ఉదయాన్నే లేచి ఆసనాలు చేసి, ముక్కు మూసుకుని ప్రాణాయామం, ధ్యానం చేయగానే యోగ చేసినట్టు కాదు. జీవితంలో ప్రతిరోజూ ప్రతి  క్షణాన్ని, ప్రతి నిమిషాన్ని, ప్రతి పనిని అనుభూతి చెందుతూ చేయడమే యోగం.  నేటి కాలంలో యోగ ప్రాముఖ్యత! ప్రస్తుత కాలంలో యోగ అంటే ధ్యానం, ఆసనాలు, ప్రాణాయామం ఇవే అనుకుంటున్నారు. నిజానికి ఇవన్నీ చేయడం కూడా ఇప్పటి జనాలకు పెద్ద టాస్క్ లాగా తయారయ్యింది. పట్టుమని పది నిమిషాల ధ్యానం, నాలుగు రకాల ఆసనాలు వేయడం రానివాళ్లు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్లకు అందరూ చెప్పుకునే యోగ గురించి అయినా సరిపడినంత అవగాహన కలిగించడం ఎంతో ముఖ్యం. యోగా క్లాసులు, అవగాహన సదస్సులు, నాటి మన మహర్షుల జీవనవిధానం వంటివి తెలుసుకుంటూ ఉండాలి. ఇప్పట్లో అయితే సద్గురు జగ్గీ వాసుదేవ్, బాబా రాందేవ్ వంటి గురువులు యోగా మీద అవగాహన పెంచడానికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. భారతీయ యోగ గొప్పతనాన్ని గుర్తించిన విదేశీయులు సైతం భారతీయ జీవనవిధానానికి తమ మద్దతు తెలుపుతూ దాన్ని పాటిస్తూ తమ తమ జీవితాలను ఎంతో అందంగా మార్చుకుంటున్నారు. పెద్ద పెద్ద వృత్తులలో ఉన్నవారు, విద్యాధికులు యోగా మార్గాన్ని అనుసరిస్తూ లక్ష్యాలు సాధిస్తూ తమ విజయాలు అందరి ముందుకు తెస్తున్నారు. కాబట్టి యోగ అనేది రోజువారీ జీవితంలో మనం అన్నం తిన్నట్టు, నిద్రపోయినట్టు అప్పుడప్పుడూ చేసే ప్రక్రియ కాదు. నిరంతరంగా శ్వాసక్రియ జరిగినట్టు నిరంతరంగా జీవితంలో అది ఒక భాగం అయిపోవాలి. అప్పుడు ఆ యోగ మనిషి శరీరానికి జీవశక్తిని పెంపొందిస్తుంది, జీవితానికి అద్భుత రాగమవుతుంది.                                  ◆వెంకటేష్ పువ్వాడ.

నాన్నంటే నీలాకాశం..

ప్రతి వైకాఠి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర అనిర్వచనీయమైనది. తాము తినకపోయినా పిల్లల కడుపు నింపడానికి ఎన్నో ఇబ్బందులు పడే తల్లిందండ్రులు ఎందరో ఉన్నారు. తల్లి నవమాసాలు మోసి కంటే, తండ్రి జీవితాన్ని ఇస్తాడు. తన జీవితం ముగిసేవరకు నేలమీద తిరగాడుతున్న బిడ్డకు ఆకాశమంత గొడుగై ధైర్యాన్ని, భరోసాను ఇస్తూ కాపాడుకుంటాడు. కానీ గుర్తింపు విషయంలో  నాన్నలు ఎందుకో వెనకబడుతారు.. భార్య కడుపులో నలుసు పడింది మొదలు బిడ్డకోసం ఆరాటపడే మగాళ్లు తండ్రులయ్యాక తమను తాము కోల్పోతారు.  భర్తగా, తండ్రిగా ఆ రెండు పాత్రల్లోనే జీవితాన్ని లాగిస్తారు. భార్య, పిల్లల కోరికల్ని నెరవేర్చడానికి ఎంత కష్టాన్ని అయినా సంతోషంగా అనుభవిస్తారు.  పిల్లల ప్రపంచం.. ప్రతి తండ్రికి తన పిల్లలంటే వల్లమాలిన ప్రేమ. భార్య కంటే కూడా పిల్లల మీద తండ్రికి ప్రేమ ఉంటుంది. ప్రతి తండ్రి మనసులో తన కొడుకు ఓ రాజకుమారుడు, కూతురు ఓ రాజకుమారిలా మెదులుతారు.  చిట్టి చిట్టి పాదాలతో తండ్రి గుండెల మీద పిల్లలు తంతున్నా వారికేమీ బాధ ఉండదు. కానీ పిల్లలే పెద్దయ్యాక తండ్రుల నమ్మకం మీద, తండ్రి గుండెల మీదా తన్నేసి పోతుంటారు. పాపం మగాళ్లకు ఏడవడం కూడా ఇబ్బందే.. కానీ తండ్రులు అయితే బిడ్డల్ని తలచుకుని మనసులోనే ఏడుస్తారు.  నాన్నంటే భరోసా.. చిన్నప్పుడు ఎవరైనా కొడితే మా నాన్నకు చెబుతా అని ధైర్యంగా చెప్పుకోవడం నుండి.. పిల్లలు పెరిగి పెద్దయ్యాక నాన్నకు చెప్పి తీరాలా?? అని ఎన్నో వెర్రి పనులు చేసి తీరా సమస్యల్ని నెత్తికి తెచ్చుకున్నాకా అదే నాన్న పంచన చేరి తన బాధను చెప్పుకునే కుర్రాళ్ళలు లెక్కే లేదు ఈకాలంలో.  చందమామ కావాలని మారం చేసిన బాలరాముడికి నీళ్లలో చందమామను చూపించి ఏమార్చిన  దశరథుడి లాంటి మనసు ప్రతి తండ్రిలోనూ ఉంటుంది. దశరథుడి వల్ల రాముడికి కీర్తి దక్కిందా?? రాముడి వల్ల దశరథుడి పేరు కీర్తికెక్కిందా అని తరచి చూస్తే.. పితృవాక్య పాలకుడైన రాముడి వలన దశరథుడికి దక్కిన కీర్తి, గౌరవం గొప్పదని చెప్పవచ్చు.  ఓడి గెలిచే నాన్న.. పిల్లల దగ్గర ఓడిపోవడానికి తండ్రి ఏమాత్రం బాధపడడు. తనకు తలకు మించిన పనులలో అయినా ప్రత్యక్షంగా పిల్లల్ని వారించినా, వ్యతిరేకత వెలిబుచ్చినా, చివరికి పిల్లల కోరికను తీర్చడంలో నాన్న ఎప్పుడూ ముందుంటాడు. అందుకే తను ఓడిపోయినా గెలుస్తాడు నాన్న. ప్రతి తండ్రి ఓ నీలాకాశం లాంటి వాడు. ఉరుముతాడు, మెరుస్తాడు, మండుతాడు, రాత్రివేళ నిశ్శబ్దంలో ఒంటరిగా జీవితాన్ని నెమరు వేసుకుంటాడు. ఆ ఆకాశానికి చల్లని వెన్నెల జత చేయాల్సింది పిల్లలే..                                        ◆నిశ్శబ్ద.

డబ్బే ప్రామాణికం అంటున్నారా?

డబ్బుకు లోకం దాసోహం అన్నారు పెద్దలు. అదే నిత్యసత్యం కూడా. మనిషి ఆలోచనలు ఎప్పుడూ డబ్బు వెంట తిరుగుతూ ఉంటాయి. ఈకాలంలో పెద్దల తీరు ఎలా ఉంటోంది అంటే పిల్లలకు ఇంకా మాటలు కూడా రాకముందే డబ్బు గురించి ఎన్నో విషయాలు ప్రవర్తనల ద్వారా నేర్పిస్తున్నారు. పిల్లలు కూడా డబ్బును బట్టి స్పందిస్తారు. నిజానికి ఎంతటి సంపదనైనా మనిషి పరిమితంగానే అనుభవించగలడు. ఆ విషయం తెలియకుండా మనం ప్రతి నిమిషాన్నీ పైకంతోనే ముడేస్తున్నాం. ముఖ్యంగా మారుతున్న సమాజంలో వ్యక్తి విలువను బేరీజు వేసేందుకు అతని సిరిసంపదలనే ప్రామాణికంగా తీసుకోవడం అలవాటుగా మారింది అందరికీ. అందుకే ప్రతి ఒక్కరూ ఆస్తిపాస్తుల పెంపకంలో పోటీ పడుతున్నారు.ఇది సహజమే అన్నట్టుగా ఉంటారు అందరూ… కానీ ఇది ఒక ప్రమాదకరమైన ధోరణి! ప్రాణం లేని నోట్ల కట్టలు, నిలువెత్తు సజీవమూర్తి అయిన మనిషి విలువను వెలకడుతున్నాయంటే ఎంత ఆశ్చర్యకరమో అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి! ఈ ప్రపంచంలో మనిషిని ఎప్పుడైనా ఎక్కడైనా పరిగాణలోకి తీసుకుని గౌరవించాలి అంటే ముఖ్యంగా చూడాల్సింది ఆ వ్యక్తిలో ప్రవర్తన, నైతిక విలువలు, మంచితనం, హుందాతనం ఇతరులకు మేలు చేసే గుణం మొదలైనవి.  కానీ ప్రస్తుతం అందరూ వాటన్నిటినీ పక్కనపెట్టి కేవలం మనిషి దగ్గర డబ్బు ఉంటే చాలు అతడే గొప్ప వ్యక్తి అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. డబ్బుతో మనిషి తెచ్చిపెట్టుకున్న స్థాయిని విలువగా భావించి అతనే గొప్పవాడనే కితాబు ఇస్తున్నారు. ఇదంతా కూడా ఆ మనిషి దగ్గర డబ్బు ఉన్నంత వరకే.. అనే విషయం వారికి తెలియకపోయినా వారిని గౌరవిస్తున్నవారికి మాత్రం కచ్చితంగా తెలుసు. అంటే డబ్బున్నవాడు గొప్ప, అదే వ్యక్తి దగ్గర డబ్బు లేకపోతే అతని గొప్పతనం కనుమరుగైపోతుంది.  డబ్బెంత అశాశ్వతమో, ఆ డబ్బు ద్వారా వచ్చే పేరు, పొగడ్తలు, ఇతర పలుకుబడి కూడా  అంతే అశాశ్వతం. పైగా ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. అనుకోకుండా వచ్చిపడే డబ్బును నడమంత్రపు సిరి అని అంటారు. ఈ  నడమంత్రపు సిరి మనషులను నేలపై నిలబడనివ్వని అహంకారాన్ని తెచ్చిపెడుతుంది. కన్నూ మిన్నూ కనబడకుండా ప్రవర్తించేలా చేస్తుంది. అలాంటి డబ్బు మనుషులకు  భవిష్యత్తులో దారిద్ర్యమే గుణపాఠం నేర్పుతుంది.  ఆదిశంకరాచార్యులు డబ్బు గురించి చెబుతూ పంచితేనే పరమసంతోషం అని అంటారు.. అంటే డబ్బును పంచేయమని ఈయన ఉద్దేశ్యం కాదు. గృహస్థుగా ధనార్జనను విస్మరించమని కూడా శంకరాచార్యులు చెప్పలేదు. కానీ ఆ వైభోగాల పట్ల వ్యామోహాన్ని వదులుకోమని అంటున్నారు.  యవ్వనం దాటగానే మనిషికి డబ్బు వేట మొదలవుతుంది. మధ్యవయసు దాటి వార్ధక్యం లోకి అడుగుపెడుతున్న క్షణం నుంచి ఆ సంపదలపై వ్యామోహాన్ని తగ్గించుకోవడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. ఆ వయసులో వీలున్ కలిగినప్పుడల్లా మనస్ఫూర్తిగా నలుగురికీ దానధర్మాలు చేయాలి. మనిషిని అతలాకుతలం చేసే ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండాలి.  భగవాన్ శ్రీరామకృష్ణులు “ధనవంతుడు దానం చేయాలి. పిసినారుల డబ్బు హరించుకుపోతుంది. దానం చేసేవాడి ధనం సంరక్షింపబడుతుంది. సత్కార్యాలకు వినియోగింపబడుతుంది. దానధర్మాలు చేసేవాడు ఎంతో ఫలాన్ని ప్రాప్తించుకుంటాడు. నాలుగు పురుషార్థాలనూ సాధించుకుంటాడు" అని అంటారు. వీటిని బట్టి చూస్తే డబ్బు అనేది మనిషికి ఎంత అవసరమో.. మనిషి తనదగ్గర అదనంగా ఉన్న డబ్బుకు దూరంగా ఉండటం అనేది కూడా అంతే అవసరం.                                ◆నిశ్శబ్ద.

ఓటమి ఓ గుణపాఠమే!

ప్రతి మనిషి తన జీవితంలో చేసే ప్రయత్నాలు అన్నీ మొదలుపెట్టే పనిలో గెలవాలనే చేస్తారు. ఆ ప్రయత్నాలలో ఎప్పుడూ విజయాలే కాదు ఓటమిలు కూడా ఎదురవుతాయి. మనం విజయాన్ని సాధించాలంటే కొన్నిసార్లు ఓటమిని తప్పనిసరిగా అంగీకరించాలి. ఓటమి విజయానికి తొలిమెట్టు అనే మాటను ఎప్పుడూ మరచిపోకూడదు.  ఓటమి అనేది మనం విజయాన్ని ఎలా సాధించాలో తెలియజేస్తుంది. అంటే ఓటమితో దాగున్న గొప్ప గుణం అనుభవం. అనుభవం ఎదురైనప్పుడు మనం చేస్తున్న తప్పేమిటో చాలా తొందరగా అర్థమైపోతుంది. చాలామంది వారు చేసే పనులలో ఓటమి ఎదురయినప్పుడు ఓటమికి భయపడి ఆ పనిని చివరివరకు పూర్తిచేయకుండా వారు అనుకున్నది సాధించలేక వారి ఆశలను నిరాశలను చేసుకుంటున్నారు. చివరివరకు పనిని పూర్తిచేయడం అంటే ఓటమి ఎదురవ్వగానే ఇక ప్రయత్నం ఆపేయడం. అది మంచి పద్ధతి కాదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండాలి. విఫలం అయిన ప్రతిసారి చేసిన తప్పేంటో అర్థం చేసుకుని అది తిరిగి పునరావృతం కాకుండా ముందడుగు వేయాలి. ఓటమి ఎదురయితే కృంగిపోకూడదు. అలాచేస్తే అది మనల్ని డిప్రెషన్లోకి తీసుకువెళుతుంది. ఆ డిప్రెషన్ వల్ల మనుషులకు కొన్నిరకాల చెడు వ్యసనాలు అలవాటు అవుతాయి. మనుషులు డిప్రెషన్ కి లోనైనప్పుడు, నిరాశ ఆవరించినప్పుడు నచ్చిన వ్యక్తులను కలవడానికి, విషయ పరిజ్ఞానం పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే నిరాశానిస్పృహల నుండి తొందరగా బయటపడవచ్చు.  అసలు ఓటమి అంటే ఓడిపోవడమా?? కానే కాదు!! ఓటమి అంటే ఎప్పటికీ ఓడిపోవడం కాదు. గెలుపు ఇంకా అందుకోలేదని అర్ధం, గెలుపుకు తగిన సన్నద్ధత ఇంకా రాలేదని అర్థం. ఓటమి అంటే భయంతో అసలు పనిచేయకపోవడం కాదు. ఆ పని మరొక విధంగా చేస్తే బావుంటుందేమోనని ప్రయత్నించటం. కొన్నిసార్లు చేసే పనుల వల్ల  కూడా వైఫల్యాలు ఎదురవుతాయి.   పరాజయం అనేది ఉందా?? చాలామంది పరాజయాన్ని నిర్వచిస్తారు. గెలవలేకపోతే ఇక పరాజయం పాలైనట్టు చెబుతారు. కానీ అన్నీ మనం చేసే పనులకు వచ్చే ఫలితాలు మాత్రమే. మనం నిర్వహించే పని సరైనది అయినప్పుడు వచ్చే ఫలితాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. మనం అనుకున్న ఫలితాలు సరిగారానప్పుడు చేసేపనిలో, పద్దతిలో మార్పు తీసుకురావడం ద్వారా కోరుకున్న ఫలితాలు వచ్చేంతవరకూ మార్పులు తీసుకువస్తూ ఉండాలి. అందువల్ల ఫలితాలే తప్ప పరాజయాలు లేవు. వచ్చే ఫలితాలు ఆశించినవి కాకపోవచ్చు కానీ అసలు పలితం అంటూ లేకుండా లేదు కదా!! సముద్రంలో ప్రయాణం చేసే ఓడ తుఫానుని ఎదుర్కొనవలసి వస్తుందని భయపడి హర్భర్ లోనే ఉంచితే అది తుప్పుపడుతుంది. అప్పుడు ఓడను నిర్మించిన లక్ష్యం నెరవేరదు. ఓడను హార్బర్ లో పెట్టడానికి ఎవరూ తయారుచేయరు కదా!! దాన్ని తయారుచేయించుకున్న వ్యక్తి సముద్రంలో తిప్పుతూ డబ్బు సంపాదించాలని మాత్రమే కాదు, అది సముద్రంలో సమస్యకు లోనయ్యి నష్టం వచ్చినా భరించడానికి సిద్ధంగానే ఉంటాడు. అలాగే గెలవడం కోసం ఎప్పుడూ ప్రయత్నం చేసేవాడు గెలుపుమీద ఆశతో ఉండాలి అలాగే ఓటమి ఎదురైతే దాన్ని స్వీకరించే మనసు కూడా ఉండాలి.   ఓడిపోయేవారు భద్రత కోసం ఆలోచిస్తారు. గెలవాలనుకొనేవారు అవకాశాలకోసం ఎదురు చూస్తారు. ఓటమి పొందటం నేరం కాదు. ఓటమికి అసలు కారణాలు తెలుసుకోలేకపోవటం అతిపెద్ద నేరం. ఓటమికి గల అసలు కారణాలు తెలుసుకోగలిగితే మనం సగం విజయాన్ని సాధించినట్లే. ఓటమి, విజయం ఈ రెండూ కూడా మన వ్యక్తిత్వం మీదే ఆధారపడి ఉంటాయి. వ్యక్తిత్వపరంగా వ్యక్తిలోని లోపాలే వారికి విజయాన్ని దక్కకుండా చేస్తాయి. మన ఆలోచనలు, అలవాట్లు, చర్యలు, మన వ్యక్తిత్వాన్ని నిర్ధారిస్తాయి. మన లోపాలను సరిదిద్దుకుని మంచి నడవడికను మనదిగా చేసుకుంటే స్థిరమైన వ్యక్తిత్వం సొంతమవుతుంది. ఓటమి భయంతో నిర్ణయాలు తీసుకోకపోవటం తప్పు, ఓటమి రావటం తప్పుకాదు. కానీ ఆ ఓటమిని తలచుకుంటూ, కుమిలిపోతూ జీవిస్తూ, ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేయకపోవటం మరింత తప్పు.                                         ◆నిశ్శబ్ద.

మనిషిలో సంఘర్షణలు.. వాటి తీరు..

మనిషి తన జీవితంలో సంఘర్షణలు ఎదుర్కోవడం  సహజం. సంఘర్షణ అంటే ఏమిటి?? అని ప్రశ్న వేసుకుంటే మనసులో ఉన్న అభిప్రాయానికి, బాహ్య పరిస్థితుల వల్ల ఎదురయ్యే అనుభవాలను మధ్య మనిషికి అంతర్గతంగా అంగీకారం కుదరకపోవడం వల్ల కలిగేది సంఘర్షణ. ఏకాభిప్రాయం ఎప్పుడైతే కలగదో.. అప్పుడు మనిషి వ్యతిరేకభావంలోకి వెళతాడు. మనిషిలో ఉన్న వ్యతిరేకభావం కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సి వస్తుంది. ఈ తరహా రెండు విరుద్ధ భావాల మధ్య మనిషి ఊగిసలాడటం వల్ల కలిగేది సంఘర్షణ. మనిషిలో ఇలాంటి సంఘర్షణలు చాలానే ఉంటాయి. చాలా సందర్భాలలో సంఘర్షణలు అనుభవిస్తూ ఉంటారు. అయితే ఈ సంఘర్షణలలో కూడా రకాలు ఉన్నాయని… అవి వివిధ వైఖరులు కలిగి ఉంటాయని చాలామందికి తెలియదు.  కావాలి-వద్దు అనిపించే సంఘర్షణలు:- కొన్నిటి నుండి దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. ఉన్నదాన్ని వదిలేసుకోవాలని అనిపిస్తుంది. కానీ అది వదిలేసుకొని వెళ్ళిపోతే ఆ తరువాత జీవితం క్లిష్టం అవుతుందేమో అనే భయం, ఈ సమస్యను చూసి వెళ్ళిపోతే.. ఆ తరువాత కూడా సమస్యలు ఎదురవ్వడం వల్ల ఇబ్బంది తప్పదనే ఆలోచన మనిషిని సంఘర్షణలోకి నెట్టేస్తాయి.  ఉదాహరణకు..  భర్త పెట్టే కష్టాల్ని భరించలేని ఓ మహిళ వివాహ బంధం నుంచి విముక్తి పొందాలని ఆలోచించవచ్చు. అయితే వివాహంలో ఉన్న భద్రత, విడిపోతే ఎదురయ్యే సమస్యల గురించి కూడా ఆమె ఆలోచిస్తూ ఉండిపోతుంది. భర్తకు దూరంగా వచ్చేసే  స్త్రీ గురించి ఈ సమాజం ఆలోచనా తీరు, సమాజంలో పౌరుల ప్రవర్తన ఆ మహిళను ఒక నిర్ణయం తీసుకోనీయకపోవచ్చు.  ఇక్కడ ఆ మహిళ ఏ నిర్ణయం తీసుకున్నా దానికుండే మంచీ చెడు, కష్టనష్టాలు దానికుంటాయి. జీవితంలో ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఎదురౌతూ ఉంటాయి. అవి ఒత్తిడికి దారి తీసి అదే క్రమంగా డిప్రెషన్ అనే సమస్యను క్రియేట్ చేస్తుంది.  అదే విధంగా  పెద్ద చదువులు చదవాలని అనుకొనే విద్యార్ధి ఏమి చదవాలా అనే ఆలోచనతో సరైన నిర్ణయం తీసుకోలేకపోవచ్చు. ఆ ఆలోచనలోనే సంఘర్షణకి లోను కావచ్చు. అయిదారు సబ్జెక్టులలో ఒకటి ఎంచుకోవటం అతనికి కష్టం కావచ్చు. రెండూ కావాలనిపించే సంఘర్షణ:- దీన్నే చాలామంది అవ్వా కావాలి, బువ్వా కావాలి అని సామెతకు అన్వయిస్తారు. ఒక వ్యక్తి దగ్గర చాలా మొత్తమే డబ్బు ఉంది. ఆ డబ్బు ఆ వ్యక్తికి ఇల్లు కాని, కారు కాని ఏదో ఒకటి  కొనుక్కోవటానికి సరిపోతుందనుకుంటే… ఇక్కడ అతనిలో సంఘర్షణ మోడ్స్లవుతుంది. ఇల్లు కొనుక్కుందామని అనుకుంటే… కారు గుర్తుకు వస్తుంది. పోనీ కారు కొనుక్కుందామని అనుకుంటే… ఇల్లు గుర్తుకువస్తుంది. రెండూ కావాలని అనిపిస్తుంది కానీ ఏదో ఒకటే అతని తాహతుకు సరిపోతుంది. ఇందులో పైన చెప్పుకున్నా సంఘర్షణ కంటే దీని తీవ్రత తక్కువే ఉన్నా ఇది సాధారణంగా పెద్దలలో కంటే.. పిల్లలలో ఇంకా యువతలో ఎక్కువగా ఎదురవుతూ ఉంటుంది.  రెండూ వద్దనిపించే సంఘర్షణ:- ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంటుంది కొందరి పరిస్థితి. కానీ ముందుకో, వెనక్కో తప్పకుండా అడుగు వెయ్యాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ  వ్యక్తికి మాత్రం రెండు దారులూ ఇష్టం ఉండవు. ముందు వెళ్లడమూ నచ్చదు, వెనక్కు రావడమూ నచ్చదు. ఇలాంటి సందర్భాలలో సంఘర్షణ ఏర్పడుతుంది. కొందరికి ఒకవైపు పెళ్లి వయసు దాటిపోతూ ఉంటుంది. మరొకవైపు ఉద్యోగం ఉండదు. రెండూ ఉండక మనిషి జీవితం స్తబ్దుగా ఉంటుంది. కానీ ఓ వయసు దాటాక ఉద్యోగం చేయడం మీద ఆసక్తి పోతుంది, అలాగే పెళ్లి అంటే ఆసక్తి పోతుంది. కానీ పెద్దల పోరు వల్ల రెండూ చేయాల్సి వస్తుంది. ఇలాంటి వ్యక్తి సంఘర్షణ మాటల్లో చెప్పలేనిది. కొందరు ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అనే ఆలోచన చేస్తుంటారు కూడా.  ఇలా మనిషి తన జీవితంలో ఎన్నో సంఘర్షణలకు లోనవుతూ ఉంటాడు.                                       ◆నిశ్శబ్ద.

హస్తసాముద్రికం నిజంగానే నిజమా? ఏ చెయ్యి ఉన్నవారికి ఎలాంటి యోగం ఉంటుందంటే...

ప్రతి వ్యక్తి జీవితం వేరుగా ఉన్నట్టే మనిషి అరచేతి ఆకారం, దాని పరిమాణం కూడా భిన్నంగా ఉంటుంది. అరచేతి రేఖలు, గుర్తులను చూసి వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉంటుందో, అదే విధంగా అరచేతి ఆకారాన్ని చూసి మనిషి వ్యక్తిత్వం ఎలాంటిదో చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎంత అదృష్టవంతుడో, జీవితంలో ఎంత పురోగతి సాధిస్తాడో తెలుసుకోవాలంటే అతని అరచేతి ఆకృతి చూడాలంటారు. నిజానికి ఇవన్నీ కట్టుకథలుఅని కొట్టిపారేసేవారున్నా హస్తసాముద్రిక శాస్త్రం ఎంతో పేరు ప్రఖ్యాతులు కలది. ఒక వ్యక్తి  అరచేతి  ఆకృతి, దాని పొడవు  వెడల్పును చూడటం ద్వారా వ్యక్తి  గురించి చాలా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఇంతకీ విభిన్నమైన అరచేతులు ఎలా గుర్తించాలి? ఎలాంటి చెయ్యి కలిగిన వారికి ఎలాంటి వ్యక్తిత్వం ఉంటుంది? ఇవన్నీ జ్యోతిష్యం చెప్పేవారే ద్వారానే కాదు సాధారణంగా కూడా తెలుసుకోచ్చు. ఎలాగంటే.. అరచేయి చిన్నగా ఉంటే.. అరచేతులు చిన్నగా ఉన్న వ్యక్తులు  చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. వీరికి చాలా  స్వచ్ఛమైన హృదయం ఉంటుంది. చిన్న అరచేతులు ఉన్నవారిలో దేవుడి పట్ల భక్తి, విశ్వాసం అధికంగా ఉంటాయి.  దైవారాధనను వీరు బాగా ఇష్టపడతారు. చిన్న అరచేతులు ఉన్న వ్యక్తులు జీవితంలోని అన్ని ఆనందాలను సంపాదించగలుగుతారు.  ఈ వ్యక్తులు వారి వ్యక్తిత్వాన్ని వారు చాలా ఇష్టపడతారు.  కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉంటారు. అరచేయి పెద్దగా ఉంటే.. పెద్ద అరచేతులు ఉన్న వ్యక్తులు తెలివిగా,  గంభీరంగా ఉంటారు. ఇలాంటి వారు తమ పనిని బాధ్యతగా చేస్తారు. వీరు తమ  జీవితంలో  కష్టపడి మంచి విజయాలు సాధిస్తారు.  సామాజిక,  మతపరమైన కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటారు. మృదువైన అరచేతులు ఉంటే.. అరచేతులు మృదువుగా, మందంగా  ఉన్న వ్యక్తులు నిజంగా అదృష్టవంతులే అని చెప్పవచ్చు.  అలాంటి వారిని అదృష్టలక్ష్మి వెంబడిస్తూనే ఉంటుంది.  వీరు జీవితంలో  చాలా  ఆనందాన్ని పొందుతారు. జీవితంలో సంతోషాన్ని వెతుక్కోవడానికి కష్టపడరు. అరచేతులు గట్టిగా ఉంటే.. గట్టి అరచేతి ఉన్నవారు జీవితంలో ఆనందం కోసం చాలా  కష్టపడాల్సి ఉంటుంది. సంతోషం కోసం, సుఖవంతమైన జీవితం కోసం వీరు బాగా   కష్టపడతారు. అలాగే పని పట్ల ఇతర విషయాల్లో నిజాయితీగా ఉంటారు. ఈ వ్యక్తులు ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు.                                                                               *నిశ్శబ్ద.

నేటికాలంలో అధికారుల తీరు ఎలా ఉంది?

మనిషి ఎంతటి నీచుడైనా, పిరికిపంద అయినా, రాజసేవకుడైతే అతడిని ఎవరూ అవమానించలేరు. ఇది లోకరీతి, "నువ్వు గొప్ప పని సాధించకున్నా పరవాలేదు, గొప్పవాడి పక్కన నిలబడితే చాలు వాడి గొప్ప కొంత నీకూ అంటుకుంటుంది" అని ఓ సామెత ఉంది. అందుకే బలహీనులు, చేత కానివారు, స్వయంగా ఏమీ సాధించలేనివారు శక్తిమంతుడి చుట్టూ చేరాలని ప్రయత్నిస్తారు. శక్తిమంతుడి పంచన చేరి, అతడి శక్తి ద్వారా తమ పనులు సాధించుకోవాలని చూస్తారు. తమకు లేని గొప్పను ఆపాదించుకోవాలని చూస్తారు. అధికారి అహాన్ని సంతృప్తి పరచి, అతడి నమ్మకాన్ని పొందుతారు. ఆపై, అధికారి దగ్గర తమకున్న ప్రాబల్యాన్ని ప్రకటిస్తూ, ఇతరులను భయపెట్టి తమ ఆహాన్ని సంతృప్తి పరచుకుంటారు. ఇటువంటివారిని గుర్తించటం కష్టం. కానీ ఇటువంటి వారిని చేరదీయటం వల్ల అధికారి ఎంత మంచివాడైనా చెడ్డ పేరు సంపాదిస్తాడు. పాలను గలసిన జలమును బాల విధంబుననే యుండు, బరికింపంగా,  బాల చవి జెరుచు, గావున  బాలసుడగువాని పొందు వలదుర సుమతీ! పాలతో కలిసిన నీరు పాలలాగే ఉంటుంది. కానీ పాల రుచిని పోగొడుతుంది. అలాగే చెడ్డవారితో స్నేహం వల్ల మంచి గుణాలు పోతాయి. కాబట్టి అంతరంగికులను ఎన్నుకునే విషయంలో అధికారి ఎంతో జాగరూకత వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఆఫీసుల్లో పనివారిని రెండు రకాలుగా విభజించవచ్చు. పని చేయనివారు ఒక రకం. వీరితో పని చేయించటం బ్రహ్మతరం కూడా కాదు. పని చేసేవారు రెండో రకం. వీరిని పని చేయకుండా ఉంచటం బ్రహ్మతరం కాదు. అయితే పని చేయనివారిని మరి కొన్ని రకాలుగా విభజించవచ్చు. పనిచేయగలిగి చేయనివారు ఒకరకం. పని చేయలేక చేయనివారు ఇంకో రకం. అలాగే పనిచేసే వారిలో, ఎదుటివాడి గురించి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయేవారో రకం, తాము పనిచేస్తూ ఎదుటివాడు పని చేయటం లేదని ఏడుస్తూ పని చేసేవారు ఒక రకం, తమపనికి గుర్తింపు లభించటం లేదని బాధపడుతూ పనిచేసేవారు ఇంకో రకం. ఇటువంటి వారందరినీ వారివారి మనస్తత్వాలను అనుసరించి వ్యవహరిస్తూ నియంత్రించవచ్చు. కానీ.. ప్రమాదకరమైన ఇంకో రెండు రకాల పనివారున్నారు ఉంటారు.  వీరు పని చేస్తున్నట్టు నటిస్తారు, నమ్మిస్తారు. మంచి పేరు సంపాదిస్తారు. ఆఫీసర్ విశ్వాసం సంపాదించిన తరువాత ఎదుటివారిమీద పితూరీలు చెప్తారు. ఎదుటివారిని తక్కువ చేయటం వల్ల తమ ఆధిక్యాన్ని చాటుకుంటారు. మరో ప్రమాదకరమైనవారు, పనిచేస్తారు. కానీ పనిచేస్తూ వక్రకార్యాలకు పాల్పడుతారు. వక్రమార్గంలో ప్రయాణిస్తారు. తమ అక్రమచర్యల నుండి రక్షణ పొందేందుకు ఆఫీసర్ను ఆశ్రయిస్తారు. అతడికి సేవలు చేస్తారు. అవసరమైనవి అడగకుండానే అందిస్తారు. ఆఫీసరు అడుగులకు మడుగులొత్తుతారు. విశ్వాసం సంపాదిస్తారు. తద్వారా తమ పనులు సాధించుకుంటారు. ఈ రెండు రకాల మనుషుల వల్లా అధికారికి చెడ్డ పేరు వస్తుంది. కానీ ఇటువంటివారే అధికారులకు దగ్గరవటం జరుగుతుంది. ఎందుకంటే, పని చేసేవాడికి స్వతహాగా ఉండే ఆత్మవిశ్వాసం వల్ల వాడు ఎవరి ప్రాపు సంపాదించటానికీ ఇష్టపడడు. తనను ప్రజలు గుర్తించాలని ఆరాటపడకుండా రత్నం ఎలా భూమిలోనే ఉండిపోతుందో, అలా వీరు కూడా ఆఫీసర్ దృష్టిని ఆకర్షించాలని ప్రయత్నించరు. తమ పని తాము చేసుకుంటూ పోతారు. ఇందుకు భిన్నంగా, ఆఫీసరు దృష్టిని ఆకర్షించాలని, దగ్గరవ్వాలని ప్రయత్నించే వారికి స్వలాభాలుంటాయి, ఉద్దేశ్యాలుంటాయి.  కానీ అధికారిలో ఉన్న అహం, తన ప్రాపు కోసం తాపత్రయపడేవారిని చూసి సంతృప్తి చెందుతుంది, వారే ఇష్టులవుతారు. తమని లెక్క చేయని పనివారంటే ఆఫీసర్లో కోపం కలుగుతుంది. అతడి అహం దెబ్బ తింటుంది. తన చుట్టూ చేరినవారి ప్రభావంతో, తప్పు అని తెలిసి కూడా, పని చేసేవారిని బాధించాల్సి వస్తుంది. చెడ్డ పేరు మూటకట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది నేటికాలంలో అధికారుల తీరు.                                      ◆నిశ్శబ్ద.

జీవితంలో అవకాశాల పాత్ర ఏమిటి?

జీవితంలో మనిషిని మరొక స్థాయికి తీసుకెళ్ళేవి అవకాశాలు. ఒక అవకాశం మనిషి ఆర్థిక, సామాజిక స్థితిగతులనే మార్చేస్తుంది. కానీ కొందరు అవకాశాల్లేవని సాకులు చెపుతూ ఉంటారు.  కష్టపడటాన్ని ఇష్టపడకపోవడమే వాళ్ళు అలా చెప్పడానికి కారణం. కష్టం ఉంటేనే మనిషికి జీవితం విలువ, జీవితంలో అవకాశాలు, ఎదుగుదల మొదలైన వాటి విలువ అర్థమవుతుంది.  "అవకాశాలకు అనుగుణంగా జీవిస్తూ వనరులను పెంచుకోవటమే మానవుని అద్భుత విజయం" అంటారు   -వాలేనార్గ్స్.  ప్రపంచంలో చాలామంది వ్యక్తులు వున్న అవకాశంతోనే సంతృప్తిపడి, నూతన అవకాశాల కోసం ఎదురుచూడరు. కొంతమంది విజేతలు నిరంతరం అవకాశాలకేసి చూస్తుంటారు. చాలామంది ఉద్యోగులు అన్ని అర్హతలు ఉండికూడా వారు చేస్తున్న వృత్తిలో సుఖాన్ని, క్షేమాన్ని పొందుతూ నూతన ప్రయత్నాలు చేయరు. వారికి ఇంకా గొప్ప గొప్ప అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేస్తారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోగలిగితే జీవితంలో గొప్ప వ్యక్తులుగా మార్పు చెందవచ్చు. అవకాశం అనేది మనల్ని అదృష్టవంతుల్ని చేస్తుంది. అవకాశాలు అనేవి అందరికీరావు, అవి కొంతమందికే వస్తాయి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. వాటిని సద్వినియోగ పరచుకోవాలి. అవకాశాలు మీ ఇంటి తలుపు తట్టినపుడు మీరు లేకుంటే మరోసారి ఆ అవకాశాలు ఇంక మీ ఇంటికి రావు అని ఎవరైనా అంటే వారు తప్పు చెప్పినట్లే ! ఎందుకంటే అవకాశాలు ప్రతిరోజూ మీ ఇంటి బయట నిలబడి నిద్రలేపి, పోరాడి విజయలక్ష్మిని చేపట్టమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంటాయన్న విషయం మరచిపోవద్దు ! ఒక్కొక్కసారి అవకాశాలు మనకి కష్టమైనవిగా, సాధించలేనివిగా, చేయలేనివిగా అనిపిస్తాయి. పెద్ద అవకాశాలు పెద్ద పెద్ద ఫలితాలను ఇస్తాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుని, పట్టుదలతో ప్రయత్నిస్తే, విజయాలు సాధించవచ్చు. మనం వదిలేసిన అవకాశాలను సమర్థులు ఎగరేసుకు పోతారు. అవకాశాలు అనేవి అదృష్టాలు కావు, వారసత్వాలు అంతకంటే కావు, వాటిని పట్టుదల తో సాధించుకోవాలి. చెట్టుపైనుండి ఆపిల్ క్రిందపడటాన్ని చూసిన న్యూటన్ కి అది కొత్త సిద్ధాంతానికి ప్రేరణగా, అవకాశంగా అనిపించింది. అంతకుముందు ఆపిల్ క్రిందపడటాన్ని చూసిన కొన్ని లక్షలమంది దాన్ని కొత్త ఆవిష్కరణకు అవకాశం అనుకోలేదు. తినడానికి దొరికిన పండుగా అనుకున్నారు. న్యూటన్ దాని కొత్త ఆవిష్కరణకి అవకాశం అనుకుని, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. చరిత్రలో నిలిచాడు. ఆ విధంగా మనంకూడా అవకాశాలను సృష్టించుకోవాలి.  అవకాశాల కోసం కాచుకుని ఉండటం బలహీనుల లక్షణం, అవకాశాలను సృష్టించుకోవడం బలవంతుల లక్షణం. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎదురుచూడడం కన్నా మనమే అవకాశాలకోసం వెతుక్కుంటూ వెళ్లాలి. అవకాశాలు వాటంతట అవిరావు. వాటిని మనమే సృష్టించుకోవాలి. అవకాశం కోసం జీవితాంతం ఎదురుచూడకూడదు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓ కొమ్మమీదో, ఓ గూటిలోనో ఎక్కువసేపు ఉండని పక్షి లాంటిదే అవకాశం. ఒక అవకాశాన్ని మనం జారవిడుచుకున్నప్పుడు విచారించకూడదు. మరొక అవకాశం చేజారిపోకుండా జాగ్రత్తపడాలి. అవకాశాలను అందుకోవడమే కాదు. దొరికిన అవకాశాన్ని జారవిడుచుకోకపోవడం కూడా ముఖ్యమే ! అవకాశాలు అందిపుచ్చుకోవడం అంటే ఉన్నత భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం. అవకాశాల ద్వారా డబ్బులు, పేరు ప్రతిష్ఠలు, కీర్తి, అధికారాల్ని మంచి జీవితాన్ని సంపాదించు కోవచ్చు. అందుకే మనిషి తన జీవితంలో అవకాశాల కోసం ఎదురుచూస్తూ కూర్చోకుండా తనచుట్టూ ఉన్న అవకాశాలను కనుగొని వాటి సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే తనున్న పరిస్థితులకు అనుగుణంగా అవకాశాలను సృష్టించుకోవాలి.                                      ◆నిశ్శబ్ద.

భయాన్ని జయించే మంత్రం!!

జీవితంలో మనిషి కలలు చాలా ఉంటాయి. అయితే కలను నిజం చేసుకోవడానికి ఒక్కో ప్రయత్నం చేస్తూ వెళ్తాడు మనిషి. ఆ ప్రయత్నం అందరి జీవితంలోనూ సఫలం అవ్వడం లేదు ఎందుకు??   ప్రశ్నించుకుంటే చుట్టూ బోలెడు కారణాలు కనబడతాయి. అయితే అవన్నీ తమను, తమ సామర్త్యాన్ని తక్కువ చేసుకోకుండా కప్పిపుచ్చుకునే చక్కెర గుళికలు. ఎప్పుడైతే మనిషి శరీరానికి చక్కెర శాతాన్ని ఎక్కువగా అందిస్తాడో అప్పుడే డయాబెటిస్ వైపు అడుగులు వేగంగా పడిపోతాయి. ఫలితంగా ఏదో ఒకరోజు శరీరమంతా చక్కెర వ్యాధితో నిండిపోయిందనే వార్త వినాల్సివస్తుంది. అలాంటిదే జీవితంలో ఈ కప్పిపుచ్చుకోవడం కూడా.  నిజానికి మనిషి ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు.  తనకు నచ్చింది చేయడానికి భయం, ఎవరైనా ఆ పనిని వేలెత్తి చూపుతారని. పని చేసాక అపజయం ఎదురైతే భయం. తను ఆ పనిని అంత శ్రద్దగా చేయలేదనే విమర్శ ఎదురవుతుందని. విజయం సాధించగానే భయం. తదుపరి విజేతగా కొనసాగుతూ ఉండగలనా లేదా అని. రేపు అంటే భయం. ఏమవుతుందో ఏంటో?? అని. ఇట్లా అడుగడుగునా అన్నీ భయాలే…..  వీటికి కారణం ఏమిటి?? అని ఒకసారి ఆలోచిస్తే అందరూ చేస్తున్న భయంకరమైన తప్పేంటో తెలిసిపోతుంది. అది చేదు గుళికలా అనిపించినా తమని తాము సరిదిద్దుకునే ఔషధం అవుతుంది.  ఇంతకు ఆ తప్పేంటి అంటే, గతాన్నో, భవిష్యత్తునో ఆలోచిస్తూ వర్తమానాన్ని వృథా చేయడం. మనం జీవించాల్సిన అమూల్యమైన క్షణాలను గతం లిస్ట్ లోకి పనికిమాలిన క్షణాలుగా మార్చి పడదోయడం. మనిషికి ఆలోచన మంచిదే. తమని తాము విశ్లేషించుకోవడం ద్వారా తదుపరి అడుగులను మరింత మెరుగ్గా వేసేందుకు దోహాధం చేస్తుందది. అయితే ఎప్పుడూ అదే ఆలోచన చేయడం వల్ల, ఆలోచనల్లో, ఊహల్లో తప్ప ఎక్కడా మనిషి ఉనికి కనబడనంత పాతాళంలోకి తోస్తాయి అవి. అంతే కాదు ఇలా ఎప్పుడూ ఆలోచించడం వల్లే ప్రతి పనిలో భయం తొంగిచూస్తూ ఉంటుంది.  ఇంతకు పరిష్కారం ఏమిటి?? ముందుగా తెలుసుకోవలసిన విషయం. ఈ భయం అనేది శారీరక విషయం కాదు. నోప్పో, నలతో కాదు. ఇది కేవలం మానసికమైనది. ఈ విషయాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి. ఈ భయం అంతా మన బుర్రలో కంటే, మన ఆలోచనల నుండి సృష్టించబడుతున్నదే అధికం. బుర్రకు, ఆలోచనలకు తేడా ఉంది. మెదడు పాజిటివ్, నెగిటివ్ రెండు విధాలుగా కూడా ఉండగలదు. అయితే ఈ అతి ఆలోచన అనేది పూర్తిగా నెగిటివ్ కోవలోకి జరిగిపోయి మానసికంగా బలహీనులను చేసి, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసి, అనవసరపు భయాన్ని అడుగడుగునా జోప్పిస్తుంటుంది. కాబట్టి ముందు మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. మానసిక పరిస్థితి మెరుగవ్వడానికో అద్భుతమైన మార్గం ఉంది. మానసిక సమస్యలు చాలా కఠినమైనవి, వీటిని అధిగమించడం ఎంతో కష్టతరమైన పని. అనుకుంటూ వుంటారు చాలా మంది. అయితే అది నిజమే కావచ్చు కానీ అది కేవలం అలా భావించే వాళ్లకు మాత్రమే. ఈ మానసిక సమస్యలు అన్ని కూడా చూసే చూపును బట్టే ఉంటాయి. చిన్న సమస్య అనుకుంటే చిన్నగా, పెద్దగా అనుకుంటే కొండంతగా అనిపిస్తాయి. అయితే దీన్ని అధిగమించడానికి ఒక అద్భుత మార్గం ఉంది. అదే వర్తమానంలో జీవించడం. ఇది వినగానే కొందరికి నవ్వు రావచ్చు. మరికొందరు ఆలోచనలో పడిపోవచ్చు. కానీ అదే నిజం. భయాలు అన్నిటికి తరువాత, రేపు, జరిగిపోయిన గతం అనేవి 90% కారణాలుగా ఉంటున్నపుడు వాటిని గూర్చి వదిలి కేవలం వర్తమానం గురించి ఆలోచించడం చాలా గొప్ప పరిష్కారం కదా. మరి వర్తమానంలో భయం ఉండదా?? వర్తమానం గురించి భయం వేయదా?? అని ఎవరైనా అనుకోవడం కూడా పరిపాటే. అయితే వర్తమానంలో, కేవలం ఉన్న క్షణాలలో జీవించడం అంటే మనం చేస్తున్న ఏ పనిలో అయినా పూర్తి స్పృహాతో ఉంటూ దాన్ని పూర్తి చేయడం. ఇలా చేయడం వల్ల ఆ పని మీదనే ఏకాగ్రత పెరిగి 100% ఆ పనికి న్యాయం చేయగలుగుతాం. కాబట్టి మన శక్తిసామర్ధ్యాల మీద మనకు శంక అవసరమే ఉండదు. భయం అనే రాక్షసి మంత్రమేసినట్టు మాయం అవుతుంది మన జీవితాల్లో నుండి.  కాబట్టి భయాన్ని జయించే మంత్రం అయిన వాస్తవంలో జీవించడాన్ని మిస్సవకండి. లేకపోతే మీ క్షణాలు అన్ని గతంలోకి చూసినపుడు పనికిమాలినవిగా కనబడతాయి. ◆ వెంకటేష్ పువ్వాడ