రాజ్యాంగ శిల్పి జయంతి!!

రాజ్యాంగం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు అంబేద్కర్. అందరికీ డా. బి.ఆర్ అంబేద్కర్ గా తెలిసిన ఈయన అసలు పేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్. 1891 ఏప్రిల్ 14 వ తేదీన పుట్టిన ఈయన భారతీయ చరిత్రలో ఓ సంచలనం. అంటరానితనం, అస్పృశ్యత, ఆర్థికంగా ఎదగలేకపోవడానికి నిరక్షరాస్యతే కారణమని తను ఎంతో ఉన్నత విద్యావంతుడవ్వడమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలిచాడు. భారతదేశ రాజ్యాంగానికి రూపునిచ్చి బడుగు వర్గాల జీవితాలలో వెలుగులు నింపడానికి కృషిచేసిన మహనీయుడు ఈయన. అంటరాని బాల్యం!!  నిజంగా మనిషికి డబ్బున్న కూడా గౌరవం లేని కాలంలో అంబేద్కర్ పుట్టాడు. ఈయన తండ్రి బ్రిటిష్ వారి దగ్గర సుబేదారుగా పనిచేసేవాడు. ఆర్థికంగా మరీ అంత కష్టాలు ఏమీ ఉండేవి కాదు. కానీ చుట్టూ ఉన్న అగ్రవర్ణాల వారి నుండి సమస్యలు ఎదుర్కునేవాళ్ళు. ఎవరూ ముట్టుకునేవాళ్ళు కాదు, అందరూ ఉపయోగించే వస్తువులు ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు.  దానికోక చిన్న ఉదాహరణ:- బడిలో నీళ్లు తాగాలి అంటే చెత్త ఊడ్చే అతను ప్రత్యేకంగా వీళ్లకు ఇచ్చేవాడు. అందరితో కలిసి ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు.  అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే "ఈరోజు చెత్త ఊడ్చే అతను లేడు. అందుకే తాగడానికి నీళ్లు లేవు" బాల్యంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న అంబేద్కర్ మహాశక్తిగా ఎదగడం వెనుక ఉన్నది కేవలం అక్షరాస్యత అంటే ఆశ్చర్యం వేస్తుంది. విద్య మనిషిని ఎంత గొప్పగా తయారుచేస్తుందో అర్థమవుతుంది. భారతదేశంలో ఉన్న విద్యాధికుల పేర్లు రాయాల్సి వస్తే అంబేద్కర్ పేరు ఎంతో గర్వంగా రాయచ్చు.  ఎంతో గొప్ప విశ్వవిద్యాలయాలలో పట్టాలు పుచ్చుకుని గొప్ప న్యాయవాదిగా మారినవాడు అంబేద్కర్. దళిత మహాసభతో మలుపు!! 1927 సంవత్సరంలో జరిగిన దళిత మహాసభ ఓ గొప్ప మలుపు అనుకోవాలి. చెరువులో నీటిని ముట్టుకునే అనుమతి కూడా లేని సందర్భంలో ప్రజలలో చైతన్యం నింపి ఆ చెరువు నీటిని అందరూ స్వీకరించేలా చేశారు ఈయన. ఆ తరువాత బహిష్కృత భారతి అనే పత్రిక స్థాపించాడు. ఆ పత్రికలోనే ఒక వ్యాసంలో అంబేద్కర్ ఇలా పేర్కొన్నారు. "తిలక్ గనుక అంటారానివాడుగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మహక్కు అని కాకుండా అస్పృశ్యతా నివారణ నా ద్యేయం, అదే నా జన్మహక్కు అని నినదించి ఉండేవాడేమో" అని. ఆ మాటలు చూస్తే అంబేద్కర్ తన జీవితంలో కులవివక్షత వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే బడుగు వర్గాల వారికి ఆర్థిక ఎదుగుదల ఉన్నప్పుడే దేశం ఆర్థికంగా ఎదుగుతుందని ఈయన విశ్వసించాడు. భారతజాతీయ కాంగ్రెస్ లో దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు తీసుకురావడం కోసం ఎంతో పోరాటం చేసి చివరకు విజయం సాధించాడు. రాజ్యాంగ రూపకల్పన!! నిజానికి రాజ్యంగం రూపొందించడానికి ఏడు మంది సభ్యులను నియమిస్తే అంబేద్కర్ తప్ప మిగిలిన అందరూ వివిధ కారణాల వల్ల రాజ్యాంగ పరిషత్తుకు దూరమయ్యారు. అందువల్ల అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి నడుం బిగించాడు. ఈయన గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అవ్వడం వల్ల రాజ్యాంగంలో బడుగు వర్గాల వారు బలపడేందుకు రిజర్వేషన్లను  పొందుపరిచారు.  ఎంతోమంది రిజర్వేషన్ల మూలంగా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యారు. అందుకే ఈయన బడుగు వర్గాల వారి పాలిట దేవుడయ్యాడు. మతమార్పిడి మరణం!! అంబేద్కర్ గారు దళిత వర్గం నుండి క్రిస్టియానిటిలో చేరారని ఆయన క్రైస్తవం పుచ్చుకోవడం వల్ల ఎంతోమంది దళితులు క్రైస్తవం వైపు దృష్టి పెట్టడం అందరికీ తెలిసిందే. అయితే అంబేద్కర్ గారు దళిత వర్గం నుండి క్రైస్తవం లోకి వెళ్ళలేదు అనేది నిజం. ఆయన ఎంతో ప్రాచీనమైనది, హిందూ మతానికి దగ్గరగా ఉన్నది అయిన భౌద్ధ మతంలోకి మారారు. ఈయన 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారు. భారతదేశానికి ఈయన అందించిన సేవలకు భారతరత్న ప్రకటించి విశ్వాసం నిలుపుకుంది భారతప్రభుత్వం. ప్రభావం!! భారత రాజకీయాలపై, విద్యార్ధులపై, దిగువ తరగతి వర్గాల వారిపై మాత్రమే కాకుండా విద్యావంతులపై కూడా అంబేద్కర్ ప్రభావం ఎంతో ఉంది. ఫలితంగా ఆయన ఎన్నో విధాలుగా అందరినీ ప్రభావం చేశారు. అది పరిస్థితులను అధిగమించి విద్యావంతుడుగా మారడం కావచ్చు, బడుగు జీవితాల కోసం శ్రమించడం కావచ్చు, రాజ్యాంగ కర్తగా కావచ్చు. ఏది ఏమైనా భారత రాజ్యాంగం నిలిచి ఉన్నంతవరకు దాన్ని లిఖించిన అంబేద్కర్ కూడా భారతావనిలో నిలిచే ఉంటాడు. ఓ ప్రభావితుడుగా…... ఓ ఆర్థిక వ్యూహకర్తగా…… ఈయన రచించిన పలు గ్రంథాలే వాటికి నిదర్శనాలు మరి.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

అధికారికి ఉండవలసిన గొప్ప లక్షణం ఇదే...

కరోతు కరటశ్శబ్దమ్ సర్వదా ప్రాంగణే వసన్, శశృణోతి బుధః ప్రీత్యా శృణోతి పిక భాషితమ్ । కాకులు ఎప్పుడూ అరుస్తూంటాయి. అందరూ వాటిని చూసి విసుక్కుంటారు. కాకి గోల అని కొట్టేస్తారు. అదే కోయిల ఒక్కసారి కూయగానే, ఆనందిస్తారు. కోకిల స్వరం కోసం చెవులు రిక్కిస్తారు. ఆఫీసులలోనూ, ఇతర సంస్థలలోనూ ప్రతి చిన్న విషయానికీ చిటపటలాడే అధికారి పరిస్థితి 'కాకి' పరిస్థితి అవుతుంది. అతడి మాటలను పట్టించుకోవటం మానేస్తారు. అతడు ఎప్పుడూ అరుస్తూ ఉంటే అతని కింద పనిచేసేవారు ఒకానొక నిర్లక్ష్య భావనలోకి జారిపోతారు. అది ఎలా ఉంటుంది అంటే…  'ఆ ఏదో అరుస్తాడులే' అని కూరలో కరివేపాకులా అతని మాటలను తీసిపారేస్తారు. అంటే, ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమంటే… ఏ గౌరవం ఆశించి సదరు అధికారి తన ఆ అధికారాన్ని ప్రయోగిస్తాడో, ఆ గౌరవమే అధికారికి లభించటం లేదన్నమాట. ఇప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భంలో దీనికి సంబంధించి  మరో విషయం ప్రస్తావించుకోవాలి. ఎప్పుడైతే వ్యక్తిలో అర్హత లేకున్నా, తాను ఉన్నతస్థానం ఆక్రమించాడన్న భావన కలుగుతుందో, అప్పుడు ఆ వ్యక్తిలో న్యూనతాభావం కలుగుతుంది. అందరూ తనని తక్కువగా చూస్తున్నారన్న ఆలోచన కలుగుతుంది. అందరూ తన గురించి మాట్లాడతున్నారని, హేళన చేస్తున్నారన్న భయం కలుగుతుంది. అంటే తనలో ఎలాంటి ప్రతిభ, తనున్న స్థానానికి తగిన అర్హత లేదని విషయం అతనికే స్వయంగా తెలుసు. అదృష్టమో… ఇతరుల రికమెండేషన్ తోనో.. లేదా తనకు వారసత్వంగా వచ్చిన స్థానంలోనో అతడు కూర్చుంటున్నాడు కానీ దానికి తనిఖీ అర్హత అతనికి ఉండదు. ఆ విషయం అతనికి అర్థమైతే… అటువంటప్పుడే అధికారి తన అధికారాన్ని ప్రదర్శించాలని ప్రయత్నిస్తాడు. కానీ తన కింద పనిచేసేవారు ఆ ధికారాన్ని నిర్లక్ష్యం చేస్తే అతడు భంగపడతాడు. అధికారిలోని ఈ ఆత్మవిశ్వాసరాహిత్యాన్ని కిందివారు సులభంగా అర్థం చేసుకుంటారు. దాన్ని మరింత ఎగదోస్తారు. ఇంకొందరు ఈ ఆత్మవిశ్వాసరాహిత్యాన్ని తమకు అనువుగా ఉపయోగించుకుంటారు. అతడిని పొగడుతూ, అతడి ఆశ్రయం సంపాదిస్తారు. పబ్బం గడుపుకుంటారు. కాబట్టి, అందరూ అన్ని విషయాల్లో నిష్ణాతులు కాలేరన్న విషయం అధికారి గ్రహించాలి. తన స్థానాన్ని, ఆ స్థానం ఇచ్చిన అధికారాన్ని సక్రమంగా ఉపయోగించే విచక్షణ ప్రదర్శించాలి. అప్పుడు అతడి అనర్హత కూడా అర్హతగా మారిపోతుంది. అతడికి అర్హత లేదని చులకనగా చూసేవారే, అతడి విచక్షణకు దాసోహం అంటారు.  అహంకారంతో, అధికార ప్రయోగంతో సాధించ లేనిదాన్ని విచక్షణతో, వినయంతో సాధించవచ్చు. గమనిస్తే, పూర్వకాలంలో రాజులు అవసరమైతే, అట్టడుగున ఉన్నవారి ముందు మోకరిల్లి విజ్ఞానాన్ని గ్రహించిన దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. భృగుమహర్షి తన వక్షస్థలం మీద తన్నినా దాన్ని విష్ణుమూర్తి చిరునవ్వుతో స్వీకరించటం మనకు తెలుసు. తన శక్తిని అవగాహన చేసుకున్న వ్యక్తి ప్రవర్తన ఇలా ఉంటుంది. అందుకే అధికారి అన్నవాడు 'అర్హత' గురించి ఆలోచించటమూ, విచక్షణతో, వినయంతో 'నేర్చుకోవటమూ' నేర్చుకోవాలి. మంచి ఎక్కడ ఉన్నా గౌరవించటం నేర్చుకోవాలి.                                          ◆నిశ్శబ్ద.

ఉత్తమ విద్యార్థులు కావాలంటే...!

అందరూ జీవితం గురించి, సమస్యల గురించి, పరిష్కారాల గురించి, ఇంకా రేపటి గురించి, ఎన్నో రకాల భవిష్యత్ కార్యాచరణల గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ విద్యార్థుల గురించి చెప్పేవారు, మాట్లాడేవారు చాలా తక్కువ. విద్యార్థులకు చక్కని మార్గాలు, మెళకువలు అందించేవారు తక్కువ. అయితే విద్యార్థుల కోసం కొన్ని ఆచరించదగ్గ చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే విద్యార్థులు తమ విద్యాభ్యాసంలో, కలిగే ఫలితాలలో మార్పులను స్పష్టంగా గమనించగలుగుతారు.  అప్పుడు వారు ఉత్తమ విద్యార్థులూ అవుతారు. అయితే ఉత్తమ విద్యార్థులు కావడం కోసం కొన్ని చిట్కాలు... రాయడానికి కానీ, చదవడానికి కానీ కూర్చున్నవారు తమ శరీరాన్ని అనవసరంగా కదిలించకూడదు. చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి అపసవ్యమైన భంగిమల్లో కూర్చుంటూ ఉంటారు. ఇక కొందరుంటారు. ఏదో దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయినవాళ్ళలా ఏదో ఒకదాన్ని రెప్పవాల్చకుండా చూస్తూ కూర్చుంటారు. మరికొందరు చదువుకొనేటప్పుడు పెన్నులు, పెన్సిళ్ళు నోటిలో పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి  అలవాట్లు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏకాగ్రతను భంగం కలిగించేవే! కదులుతున్న పాత్ర తనలోని నీటిని సైతం కదిలించినట్లే, శరీరం తన భంగిమను మార్చినప్పుడల్లా మనస్సు చలిస్తూ ఉంటుంది. కాబట్టి, చదువుకొనేటప్పుడు హుందాతో కూడిన స్థిరమైన భంగిమలో కూర్చోవడం ముఖ్యం. నిర్ణీత సమయంలో ఏదో ఒకే అంశాన్ని తీసుకొని, దానినే అధ్యయనం చేయాలనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. అయితే, ఒక అంశాన్ని ఎంచుకొన్నప్పుడు ఇక కనీసం ఓ గంట పాటు పూర్తిగా ఆ అంశంలోనే మనస్సును లీనం చేయాలి. కేవలం పుస్తకాన్ని చదువుకొంటూ వెళ్ళినంత మాత్రాన ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసినట్లు కాదు. పుస్తకాన్ని పట్టి చదవడానికీ, పూర్తిగా అధ్యయనం చేయడానికీ మధ్య ఉన్న తేడాను మొదట తెలుసుకోవాలి. కానీ, ఒక్క విషయం. పుస్తకాన్ని చదవడానికైనా, అధ్యయనం చేయడానికైనా  రెండిటికీ ఏకాగ్రత కావాల్సిందే! పేజీలు తిరగేస్తూ పుస్తకాన్ని పైపైన చదవడం వల్ల దానిలోని సారాంశమేమిటో పాఠకుడికి తెలియవచ్చు. కానీ, పుస్తకాన్ని క్షుణ్ణంగా చదవడం వల్ల మనస్సు దానిలోని అంశాల లోతుల్లోకి వెళుతుంది. వాటి అంతరార్థాన్ని తెలుసుకొంటుంది. తరచుగా అందులో దాగున్న సారాన్నీ గ్రహిస్తుంది. దీనివల్ల సంబంధిత అంశం మీద గట్టి పట్టు వస్తుంది. మరింత చదవడానికి తోడ్పడుతుంది. చదువుకోవడానికి ఓ అంశాన్ని ఎంచుకొని. చదువుకొనే బల్ల దగ్గరకు వచ్చాక పైన చెప్పినట్లుగా పూర్తిగా ఓ గంట సేపు దాని మీదనే ఏకాగ్రత  కొనసాగించాలి. అది చాలా ముఖ్యం. సాధారణంగా, ఓ కొత్త అంశాన్ని వెంటనే గ్రహించి, అర్థం చేసుకోవడానికి మనస్సు సిద్ధంగా ఉండదు. రోజు పొడుగూతా మనం చేసిన రకరకాల పనులు కానీ, మిత్రులతోనూ, ఇతరులతోనూ జరిపిన సంభాషణలు కానీ, చదువుకోవడానికి కూర్చొనేందుకు సరిగ్గా ముందే మన మనస్సుల్లో నిండిన ఆలోచనలు కానీ మనలో ఇంకా అలాగే ఉంటాయి. అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కాబట్టి, ప్రస్తుతం చదువుకోవాలి అనుకున్నప్పుడు దానికి తగ్గట్టు మనస్సు సిద్ధం కావడానికి కనీసం ఎనిమిది నుంచి పది నిమిషాల దాకా సమయం పట్టవచ్చు. మనస్సును సిద్ధం చేసి, చదువుకోవడం  ప్రారంభించాక అది క్రమంగా చదువుతున్న అంశం లోతుల్లోకి వెళుతుంటుంది. సరిగ్గా అప్పుడు ఉన్నట్టుండి చదవడం ఆపేస్తే, ఏకాగ్రత పోతుంది. చదువు దెబ్బతింటుంది.  కాబట్టి, చదవడం మొదలుపెట్టిన కొద్ది నిమిషాల తరువాత మనస్సు ఏకాగ్రత అయ్యాక, మరింత లోతుగా వెళ్ళి, గాఢంగా చదవడానికి  ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆ రకంగా నిరంతరాయంగా కనీసం ఓ గంట పాటు అధ్యయనం సాగించడానికి మనస్సును వినియోగించాలి.  ఇలా మనం చదువుకొనే సమయంలో కుటుంబ సభ్యులెవరైనా పిలిచి, ఏదైనా పని చెప్పవచ్చు. కాబట్టి, "ఓ గంట సేపు నన్నెవరూ దయచేసి పిలవకండి" అని ఇంట్లోని వాళ్ళందరికీ ముందుగానే చెప్పేయాలి. ఎందుకంటే, ఎవరూ పిలవకపోయినా,  ఎవరైనా మధ్యలో పిలిచి, అంతరాయం కలిగిస్తారేమోనన్న ఆలోచన మనస్సు లోలోపల ఉన్నా చాలు, చదువు మీద మనస్సును పూర్తిగా లగ్నం చేయలేం. వస్తారేమో… పిలుస్తారేమో అనే ఆలోచన వల్ల మనసు కుదురుగా చదువు మీద నిలువదు. అందుకే చదువుకునే సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ముందే ఎవరూ పిలవకండి అని చెప్పాలి. ఇలా చదువుకునే పిల్లలు పై చిట్కాలు ఫాలో అయితే ఉత్తమ విద్యార్థులు అవుతారు.                                ◆నిశ్శబ్ద.  

సలహాలు ఇవ్వడం ఎంతవరకు మంచిది?

'సలహా ఇచ్చేవాడు బుద్ధిహీనుడు' అంటారు శ్రీ జిడ్డుకృష్ణమూర్తిగారు. అంటే ఆయన ఉద్దేశం ఎవరైనా ' మీ అనుభవంలో షేవ్ చేసుకోవడానికి ఏ బ్లేడు మంచిదంటారు?' అని అడిగినప్పుడు ఏమీ చెప్పకుండా ఉండాలని కాదు, అలాగే ఒక చోటినుండి మరో చోటికి వెళ్ళడానికి ఏ రూటు బస్సుల్లో ఏదెక్కి వెళ్తే త్వరగా చేరే అవకాశముంటుంది అని అడిగినప్పుడు సలహా చెప్పకూడదని కాదు, జీవితంలో ముఖ్యమైన సమస్యలు అనగా వివాహం చేసుకోవాలా, చేసుకోవడం మానేయాలా లేక ప్రొఫెసర్ ఉద్యోగానికి వెళ్ళమంటారా అని ఎవరైనా సలహా అడిగితే ఇలాంటి సమస్యలకు ఎవరికి వారే సరిగా ఆలోచించుకొని సరైన నిర్ణయం చేసుకోవాలని వారి అభిప్రాయం. ఈ విషయాల్లో సలహాలివ్వాలనుకున్నవాడు చివరకు చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఇలాంటి వాటిలో ఎవరైనా వచ్చి అడిగినప్పుడే సలహా ఇవ్వడం మంచిది. కాదని అనుకున్నప్పుడు ఇక అడగక ముందే సలహా ఇవ్వజూడడం మరీ అధ్వాన్నమని వేరే చెప్పనక్కరలేదు. ఒకాయనకు "ఫలాని సినిమా చూచి రావోయ్ చాలా బాగుంది" అని సలహా ఇచ్చాడు అతడి మిత్రుడు. అతడి ఆర్థిక ఇబ్బందులు ఏమిటో తెలుసుకోకుండా ఈ సలహా తొందరపడి ఇచ్చాడని చెబుతున్నట్టుగా అతను  ఎగాదిగా చూసి "ఈ సారి ఇలాంటి సలహాలిచ్చేప్పుడు, సలహాతోబాటు నాకూ నా ఫామిలీకి టిక్కెట్లకు సరిపడే డబ్బుకు ఒక చెక్కు రాసి పంపించు" అన్నాడు. ఆ మాటలు ఆ సలహా ఇచ్చిన సదరు స్నేహితుడి నసాళానికి అంటటంతో ఇలా ఇతరులకు ఉచిత సలహాలివ్వకూడదు అని అప్పటి నుండి సలహాలు ఇవ్వడం ఆపేసాడు.  పిచ్చుక గూడు కట్టుకునప్పుడు దాని ద్వారాన్ని క్రిందివైపుగా ఉంచుతుంది. అందువల్ల వర్షం పడినా ఒక్క చుక్క కూడా ఆ గూట్లోకి వెళ్ళకుండా ఆ గూడెప్పుడూ చక్కగా పొడిగా వుంటుంది. బోరున వర్షం కురిసిన ఒకనాడు ఒక పిచ్చుక తన గూటిలో తలదాచుకొని, వర్షం వెలసిన తర్వాత తిన్నగా బయటికి వచ్చి ఒక ఇంటి కప్పుమీద వాలింది. పక్కనే ఒక చెట్టుకొమ్మమీద ఒక కోతి కనిపించింది. కోతికి గూడు నిర్మించుకునే ఆనవాయితీ లేనందువల్ల, వర్షం పడేప్పుడు కూడా అది ఏ చెట్ల కొమ్మలమధ్యో కూచొని అలాగే తడుస్తూ వుంటుంది. చప్పగా తడిసి విచారగ్రస్తమైన మొహంతో కూచున్న కోతిని చూచి ఆ పిచ్చుక దానిస్థితికి జాలిపడి "మిత్రమా నిన్ను చూస్తే నాకు బాధగా ఉంది. నాకుండేదల్లా ఈ ముక్కొక్కటే, అయినప్పటికీ నేనా ముక్కు సహాయంతోనే ఇంత చక్కటి గూడు కట్టుకున్నాను. నీకు చూస్తేనా, మనిషికుండే చేతులూ కాళ్ళూ అనే నాలుగంగాలు ఉండటమే కాక తోక కూడా ఒకటుంది. వీటన్నిటి సహాయంతో నీవో చిన్న నివాసం సులభంగా ఏర్పరుచుకోవచ్చు. అప్పుడు నువ్వీ విధంగా ముద్దగా తడిసిపోవలసిన అవసరముండదు కదా” అన్నది. సద్బుద్ధితో పిచ్చుక ఇచ్చిన ఈ సలహాను కోతి అపార్థం చేసుకున్నది. తనని ఆటలు పట్టించి ఏడ్పించడానికే ఈ పిచ్చుక ఇలా మాట్లాడుతున్నది అని భావించింది. “నీకు మంచి గూడున్నదనీ అందువల్ల నీవు తడవలేదనీ నీకు మహా మిడిసిపాటుగా వున్నట్లుంది. నేను వర్షంలో తడిశానని నన్ను వెక్కిరించడానికి ఆ గూటిలో నుండి ఈ ఇంటి కప్పుమీదికి ఎగిరి వచ్చావన్న మాట. మహా ఎగిరి పడుతున్నావ్, నీ గర్వమణుస్తాను ఆగు" అని అంటూ ఒక్క దుముకు దుమికి ఆ పిచ్చుక గూడును చిందరవందర చేసి నాలుగు వైపులా పారేసింది. "పైసారి వర్షం వచ్చినప్పుడు నాతో బాటు నువ్వూ తడుద్దుగాని” అని హూంకరిస్తూ వెళ్ళిపోయింది. "మనుష్యుల్లో కూడా ఈ కోతి మనస్తత్వం చాలా మందిలో కనిపిస్తుంది” అంటారు స్వామి సచ్చిదానంద. “అలాంటి వారెవరితోనైనా “పోనీ ఇట్లా చేస్తే...”. అని మనం అనే లోగానే వారికి మనమీద చెప్పరాని ఆగ్రహం కలుగుతుంది. అందుచేత వారి గతికి వారిని వదిలివేయడమే శ్రేయస్కరం. అయాచితంగా వారికి సలహాలివ్వవద్దు. వారంతట వారు వచ్చి అడిగేంతవరకూ ఏమీ చెప్పద్దు. చిరునవ్వుతో ముందరికి సాగిపోతూవుండటమే మంచిది.”                                     ◆నిశ్శబ్ద.

ప్రపంచంలో అద్భుత మంత్రం.. జీవితాలకు వెలుగు కెరటం ఇదే..

అన్నీ పోగొట్టుకున్నప్పుడు, ఆశ ఒక్కటే మనల్ని మంచి భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. మనలో ఉన్న నిజమైన ధైర్యాన్ని, తెగువను, సమయస్ఫూర్తిని వెలికితీస్తుంది. అందుకే ఆశ గొప్ప ఆయుధం అవుతుంది మనిషి జీవితంలో.  జీవితంలో ఎంతోమంది విషయాల్లో ఆశ ముఖ్య పాత్ర పోషించినా పిల్లల జీవితానికి ఇది ఇంతో అవసరం.  ఈ ప్రపంచంలో ఎంతోమంది పిల్లలు శారీరక, మానసిక, లైంగిక దాడికి బలైపోతున్నారు. ఇలాంటి పిల్లలు జీవిఘం మీద భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. భవిష్యత్తు ఎలా ఉంటుందనే పెద్ద ప్రశ్న వీరిని నిరంతరం వేధిస్తూ ఉంటుంది. కేవలం ఇలాంటి వేధింపులు మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలు కూడా కోకొల్లలు. వీరికి జీవితం మీద ఆశను కల్పించడం అందరి కర్తవ్యం. జీవితంలో ఎదురయ్యే బాధాకర పరిస్థితులను ఎదుర్కోవడానికి వీరికి తగినంత సపోర్ట్ అవసరం అవుతుంది. పెద్దలు కూడా ఇలాంటి పరిస్థితులలో ఉంటారు. ఇలా జీవితంలో ఎన్నో కోల్పోగున్న వారికి ఆశను కలిగించే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో మొదటి బుధవారంను వరల్డ్ హాప్ డే గా జరుపుకుంటారు.  నిర్లక్ష్యానికి, వేధింపులకు గురయ్యే ఎంతోమంది పిల్లలు పెద్దలు చివరికి చావు వైపు అడుగులేస్తున్నారనే విషయం ప్రపంచాన్ని కలవపరుస్తుంది.  ఆశ లేకపోతే.. హాప్ అంటే ఆశ. జీవితమంతా ఈ ఆశతోనే ముందుకు కదులుతుంది. కానీ ఎప్పుడైతే జీవితంలో గందరగోళ సంఘటనలు చోటు చేసుకుంటాయో.. అప్పుడే జీవితం మీద విరక్తి, వైరాగ్యం, నిస్సహాయత అన్నీ కమ్ముకుంటాయి. సమస్యలను అధిగమించలేని తనం మనిషిని ఆవరిస్తే.. చేతకాని వాళ్ళం అనుకుని ఆత్మన్యూనతా భావంలోకి జారిపోతారు. ఇదే ఆత్మహత్యలకు మూల హేతువు. ఇలాంటి సందర్భాలలో ఆశ ఉంటే జీవితంలో నడక ఆగదు. కానీ ఆశ లేకపోతే కాలం పరిగెట్టినా దాంతో మనం పరిగెట్టలేక స్తంభించిపోతాము. మనమింతే అని మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. హాప్ డే రోజు ఏమి చెయ్యాలి?? ఆశ జీవితానికి ఆయువు అయినప్పుడు దానిని పెంపోంచించడం అవసరం. ఓ మనిషి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఆక్సిజన్ పెడితే ఎలాగైతే మెల్లిగా జీవశక్తితో ఉత్తేజం అవుతాడో.. అలాగే మనిషి కూడా ప్రతి కూల పరిస్థితులలో ఉన్నప్పుడు ఆశతో చైతన్యం అవుతాడు. అయితే ఆశ అనేది మనిషిలో పుట్టాలంటే దానికదే జరగదు. ఆత్మన్యూనతలో ఉన్నప్పుడు ఆశ పుట్టదు. అందుకే అలాంటి పరిస్థితులలో ఉన్నవారి జీవితానికి భరోసా ఇవ్వాలి. ఇలాంటి మార్గం ఒకటుందని ఆశను చూపించగలగాలి.  ఎంతోమంది మానసిక ఒత్తిడిలోనూ.. సమస్యలలోనూ చిక్కుకుపోయి ఉంటారు. వాటికి తగిన పరిష్కారాలు ఉన్నా దాన్ని తెలుసుకోలేనితనం వారిలో ఉంటుంది. అలాంటి వాళ్లకు మార్గం చూపిస్తే అదే ఆశ అవుతుంది. మానసికంగా ఉత్తేజం చేయడం, అయోమయంలో ఉన్నవారికి నిజమేంటో తెలియజెప్పడం, మానసిక ఒత్తిడిలో ఉన్నవారిని మోటివేట్ చేయడం, ఇలా ఎన్నో విధాలుగా ఆశ పెంపొందించవచ్చు.  పిల్లలను సమస్య నుండి బయటకు తీసుకురావడం, వారి భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం, వారిలో ప్రతిభను తెలపడం, అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని, రక్షణను ఇవ్వడం చేస్తే పిల్లల భవిష్యత్తు అందంగా ఉంటుంది. ఇలా ప్రపంచంలో ఎంతో మందిని ఆశ అనే ఒకే ఒక్క అద్భుతం మంత్రం ముందు నడిపిస్తుంది. కొత్త శక్తిని పొగుచేస్తుంది. అందుకే అందరిలో ఆశ ఉండాలి. అది లేనివారికి ఆశను అందించే వారు మీరవ్వాలి..                                ◆నిశ్శబ్ద.

ప్రపంచానికి మహావీరుడు చెప్పిందేంటి?

జైన మతం చివరి ఆధ్యాత్మిక గురువు మహావీరుడు. ఈయన జ్ఞాపకార్థం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జైన సంఘం మహావీరుడి జయంతిని జరుపుకుంటుంది. ఈ రోజున, మహావీరుడి విగ్రహం ఊరేగింపు నిర్వహించబడుతుంది, దీనిని రథయాత్ర అంటారు. భక్తులు జైన దేవాలయాలను సందర్శిస్తారు. మహావీరుడు జైనమతం ఆఖరి తీర్థంకరుడు.  తీర్థంకరుడు అంటే అర్థం తెలుసా? జైనమతంలో రక్షకుడు, ఆధ్యాత్మిక గురువును తీర్థంకరుడు అని అంటారు. జైన గ్రంధాల ప్రకారం ప్రతి సంవత్సరం మహావీర్ జయంతి తేదీ మారుతుంది. చైత్ర మాసంలో పాడ్యమి మొదలయ్యాక పదమూడు రోజులకు మహావీరుడి జయంతి వస్తుంది. మార్చి లేదా ఏప్రిల్ నెలల మధ్య వస్తుంది. మహావీరుడి జీవితం వాస్తవానికి మహావీరుని పేరు వర్ధమానుడు. అతను సుమారు 599 BC లో జన్మించాడు, చాలా మంది పండితులు ఈ తేదీని 100 సంవత్సరాల ముందుగానే నమ్ముతారు, అప్పుడు మహావీరుడు బహుశా బుద్ధుడు నివసించిన సమయంలోనే జీవించి ఉండవచ్చు, అతని సంప్రదాయ పుట్టిన తేదీ కూడా తిరిగి అంచనా వేయబడింది. మహావీరుడు ప్రపంచంలోని సత్యాన్ని కనుగొనడానికి తన ఇంటిని విడిచిపెట్టాడు. అతను సన్యాసి జీవితాన్ని గడిపాడు. ప్రపంచమంతా తిరుగుతూ, ఆహారం కోసం భిక్షాటన చేశాడు. విభిన్న సంస్కృతులు నేపథ్యాల నుండి అనేక మంది వ్యక్తులతో కలిసిన తర్వాత, అతను ప్రపంచంలోని బాధల గురించి తెలుసుకున్నాడు. ఆ తరువాత  ఉపవాసం ధ్యానంపై తన దృష్టి కేంద్రీకరించాడు. తత్ఫలితంగా జ్ఞానోదయం పొందాడు. జైన తత్వాన్ని బోధించడానికి దక్షిణాసియా అంతటా పర్యటించాడు. మహావీరుడి బోధనలు.. అహింసా (అహింస), సత్య (సత్యం), అస్తేయ (దొంగతనం), బ్రహ్మచర్యం (పవిత్రత), అపరిగ్రహ (అనుబంధం లేనిది) ప్రతిజ్ఞను పాటించడం జీవిత నాణ్యతను పెంచడానికి అవసరమని అతను బోధించాడు. మహావీరుడి బోధలను గౌతమ స్వామి (ముఖ్య శిష్యుడు) సంకలనం చేశాడు. ఇవి  జైన ఆగమాలుగా  పిలవబడ్డాయి.   మహావీరుని ఆధ్యాత్మిక తత్వశాస్త్రంలో ఎనిమిది ప్రధాన సూత్రాలు ఉన్నాయి. వాటిలో మూడు మెటాఫిజికల్ కాగా.. ఐదు నైతికమైనవి. అతను విశ్వం యొక్క బాహ్య ఉనికిని విశ్వసించాడు, అది సృష్టించబడదు లేదా నాశనం చేయబడదు. అతని ప్రకారం, విశ్వం అనేది ఆత్మలు, స్థలం, సమయం, భౌతిక అణువులు, చలన మాధ్యమం మరియు విశ్రాంతి మాధ్యమం అనే ఆరు శాశ్వత పదార్ధాలతో రూపొందించబడింది. మానవులు ఉనికిలో ఉన్న బహుముఖ వాస్తవికతను సృష్టించడానికి ఈ భాగాలు స్వతంత్రంగా మారుతాయి. అతను అనేకతత్వ ఉనికిని సూచించే అనేకాంతవాద (నిరంకుశత్వం యొక్క సూత్రం) తత్వశాస్త్రాన్ని కూడా పరిచయం చేశాడు. స్యాదవద్ లేదా సెవెన్ ఫోల్డ్ ప్రిడిక్షన్స్ సూత్రంతో బహుముఖ వాస్తవికత బాగా వివరించబడింది. మహావీరుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.. మహావీరుడు పుట్టకముందే తీర్థంకరునిగా నిర్ణయించబడ్డాడనేది కొందరి నమ్మకం. మహావీరుడిని ఐదు రకాల పేర్లతో పిలుస్తారని చెబుతారు. మహావీరుడు దాదాపు 12 సంవత్సరాలు ధ్యానం చేశాడని చెబుతారు. ఈయన ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి ఐదు సిద్ధాంతాలను అందించాడు.  ప్రస్తుత కాలచక్రాన్ని సూచించే అవసర్పిణి చివరి తీర్థంకరుడు. కల్ప స్త్రం ప్రకారం, మహావీరుడు తన జీవితంలో మొదటి 42 సంవత్సరాలు ఆస్తికగ్రామం, చంపాపురి, పృష్టిచంప, వైశాలి, వాణిజాగ్రామ, నలంద, మిథిల, భద్రిక, అలభిక, పణితభూమి, శ్రావస్తి మరియు పావపురిలలో నివసించాడు. జ్ఞానోదయం పొందిన తర్వాత, అతను ముప్పై సంవత్సరాలు భారతదేశం చుట్టూ తిరుగుతూ తన తత్వశాస్త్రంపై బోధించాడు, అతను తన అనుచరులను సన్యాసి (సాధు), సన్యాసిని (సాధ్వి), సామాన్యుడు (శ్రావకుడు) సామాన్య స్త్రీ (శ్రావిక) అనే నాలుగు రెట్లు క్రమంలో ఏర్పాటు చేశాడు. మహావీరుడుకి 14,000 మంది పురుష సన్యాసులు, 36,000 మంది స్త్రీ సన్యాసులతో పాటు, కల్ప సూత్రం ప్రకారం, 1,59,000 మంది సాధారణ అనుచరులు, 3,18,000 మంది మహిళా అనుచరులు ఉన్నారు. ప్రపంచ శాంతి, మెరుగైన పునర్జన్మ, చివరికి స్వేచ్ఛ కోసం ఇతను చెప్పిన విషయాలు.  వీటి ప్రధాన లక్ష్యం అతని బోధనలను వ్యాప్తి చేయడం ఒక వ్యక్తి జననం, జీవితం, నొప్పి, దుఃఖం, మరణం ఇవన్నీ ఒక చక్రంలో సాగుతాయి. వీటి నుండి సంపూర్ణ స్వేచ్ఛను ఎలా పొందవచ్చో తెలుసుకోవడం. అలాగే, ఒక వ్యక్తి శాశ్వతమైన ఆనందకర స్థితిని సాధించడం వీటి లక్ష్యం. దీనినే విముక్తి, మోక్షం, సంపూర్ణ స్వేచ్ఛ అని కూడా అంటారు.  ◆నిశ్శబ్ద.

ఇది చదివాక మీరు నీటి సంరక్షణలో భాగమవుతారు!

ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్ (A drop of water is a grain of gold) ఎడారి ప్రాంతమైన తుర్క్‌మెనిస్తాన్‌లో నీటిని ఇలా వర్ణిస్తారు. ఒక్క చుక్క నీరు బంగారాన్ని పండిస్తుంది  అనేది దీని అర్ధం. దీన్ని బట్టి వారు నీటికి ఎంత విలువ ఇస్తారు అనేది అర్థమవుతుంది. సహజంగా ఎక్కడైతే ఒక వనరు చాలా తక్కువగా ఉంటుందో.. అక్కడ ఆ వనరు విలువ గరిష్టమవుతుంది. దీన్ని బట్టే ఆ వనరుకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తుర్క్‌మెనిస్తాన్‌లో నీటి కొరత చాలా దారుణంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో అక్కడి ప్రజలు ఎన్నో అవసరాలను తగ్గించుకుని నీటిని పొదుపుచేస్తారు.  కేవలం ఎడారి దేశాల్లోనే కాకుండా మన భారతదేశంలో కూడా వివిధ ప్రాంతాలు కరువుకు కేరాఫ్ అడ్రస్ గా ముద్రవేయబడ్డాయి. ఆయా ప్రాంతాలలో తాగునీటికి కూడా సతమతమైపోతున్నవారు ఎందరో.. ఇళ్లలో కుళాయిలు తిప్పగానే హాయిగా నీటిధారను ఒడిసిపట్టుకునే ప్రజలు కిలోమీటర్ల కొద్దీ నడిచి బిందెల్లో నీటిని నింపుకుని వచ్చేవారి కష్టాన్ని, వారి ఇబ్బందులను ఒక్కసారైనా గుర్తుచేసుకోవాలి.  స్నానాల కోసం, ఇంటి అవసరాల కోసం బకెట్ల కొద్దీ నీటిని వృధా చేసేవారు నీటికోసం పడరాని పాట్లు పడుతున్న ప్రజల కోణంలో ఆలోచించాలి. పిల్లల నుండి పెద్దల వరకు నీటి విలువను గుర్తించాలి. హాయిగా మూడుపూటలా తింటున్నామంటే దానిక్కారణం రైతులు పండించే పంటలే.. సగటు రైతుకు పంట దిగుబడి బాగుండాలంటే.. నీటి సరఫరా అంతే బాగుండాలి. మనిషి శరీరంలో 60-70% శాతం నీరు ఉంటుంది. అలాగే భూమిలో కూడా అంతే మొత్తంలో నీరు ఉండాలి. కానీ మనిషి మాత్రం భూగర్భజలాలను దారుణంగా వాడేస్తున్నాడు.  ఇది కేవలం తుర్క్‌మెనిస్తాన్‌ ప్రజలు పాటించే రోజు అయినా ప్రతి దేశం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ ప్రధాన దేశమైన భారతదేశంలో నీటికి చాలా ప్రాధాన్యత ఉంది. భూగర్భజలాలను ప్రభావితం చేసే ప్రతి అంశం పట్లా అవగాహన పెంచుకోవాలిప్పుడు.  వాయుకాలుష్యం, వర్షపు నీటిని ఒడిసిపట్టడం, నదీ జలాల సంరక్షణ, నీటి కాలుష్యం అరికట్టడం, నీటి పొదుపు, అదే విధంగా చెట్ల పెంపకం, అడవుల సంరక్షణ ద్వారా నీటి వనరులు పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇవి పాటిస్తే.. మన నీటి వనరులు దేశంలో బంగారు సిరులు పండిస్తాయి.                                    ◆నిశ్శబ్ద.

ఆటిజం సమస్యపై అవగాహనా బాణం ఎక్కుపెట్టాలిప్పుడు!

ఆటిజం అనేది శరీరంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం ద్వారా ఎదురయ్యే సమస్య. న్యూరోడైవర్సిటీ వరల్డ్ ఆటిజం అవేర్‌నెస్ డే అనేది వాస్తవానికి 1990ల చివరలో ఆస్ట్రేలియన్ సామాజిక శాస్త్రవేత్త జూడీ సింగర్ కనిపెట్టిన పదం..డైస్ప్రాక్సియా, డైస్లెక్సియా, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ మొదలైన న్యూరోమైనారిటీలలో ఆటిస్టిక్ స్పెక్ట్రమ్ ఒకటి. ఆటిస్టిక్ వ్యక్తులు ఇతర ఇబ్బందులతో పాటు పక్షపాతాన్ని అనుభవిస్తారు.  ప్రపంచ ఆటిజం అవేర్‌నెస్ డే 2023 థీమ్.. ప్రతి సంవత్సరం ఒకో థీమ్ నిర్ణయించబడి దాని ప్రకారం ప్రణాళికలు, ఆలోచనలు, కార్యక్రమాల నిర్వహణ, టార్గెట్లు జరుగుతాయి. ఈ సంవత్సరం "Transforming the narrative: Contributions at home, at work, in the arts and in policymaking"(  " కథనాన్ని మార్చడం: ఇంట్లో, పనిలో, కళలలో మరియు విధాన రూపకల్పనలో సహకారం" ). అనే థీమ్ తో ప్రజల్లోకి వెళ్లనున్నారు.  ఆటిజం గురించి అవగాహనను తీసుకురావడానికి పిలుపునివ్వడం ద్వారా సమాజంలో, పనిలో ఆటిస్టిక్ వ్యక్తులను అంగీకరించడం, వారికి మద్దతు ఇవ్వడం. ఆటిజం గురించిన అవగాహన పెంచడం,  పనిలో, కళలలో ఆటిజం ఉన్నవారికి స్నేహపూర్వక విధానంతో హామీ ఇవ్వడం ద్వారా వీరికి ప్రపంచ దేశాల నుండి సమాజం వరకు సహకారాన్ని పెంచడమనే టాస్క్ తో ఈ థీమ్ నడుస్తుంది. ఈ సంవత్సరం, ఏప్రిల్ 2వ తేదీ ఆదివారం, ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వర్చువల్ ఈవెంట్ నిర్వహించబడతాయి. ఆటిజం ను జయించినవారు, దీని గురించి అవగాహనకు కృషి చేసేవారు, ఆటిజం నియంత్రణకు పాటు పడేవారు ఇందులో పాల్గొంటారు.  చరిత్ర డిసెంబర్ 18, 2007న నిర్వహించిన 76వ ప్లీనరీ సమావేశంలో, ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 2వ తేదీని ప్రపంచ ఆటిజం అవేర్‌నెస్ డేగా ప్రకటించింది, దీనిని 2008 నుండి ప్రతి సంవత్సరం పాటిస్తున్నారు.  ఎవరిలో ఆటిజం వచ్చే అవకాశాలు ఉంటాయంటే.. ఆటిజం  సమస్యలో  జన్యుశాస్త్రం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఒకేలాంటి కవలలలో, ఒక బిడ్డకు ఆటిజం ఉంటే, మరొకరికి ఆటిజం వచ్చే అవకాశం 36-95% ఉంటుందని అధ్యయనాలు కనుగొన్నాయి.  ఆటిజం ఉన్న పిల్లల తోబుట్టువులకు కూడా ఈ రుగ్మత వచ్చే ప్రమాదం 2-8% ఉంటుంది.  మానసిక రుగ్మతలు ఉన్న వారికి, ప్రత్యేకించి స్కిజోఫ్రెనియా  వంటి ప్రభావిత రుగ్మతలు ఉన్నవారు ఆటిజం సమస్యతో  ఉన్న పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది.  నెలలు నిండకుండానే (2500 గ్రాములు) జన్మించిన పిల్లలలో ఆటిజం ప్రమాదం 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది.   క్లోరిపైరిఫాస్ వంటి పురుగుమందులకు పిండం గురికావడం వల్ల కూడా ఆటిజం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది  గర్భిణీ తల్లులు, ముఖ్యంగా 1వ లేదా 2వ నెలలో, వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లకు గురికావడం, వారి పిల్లలలో ఆటిజంతో సహా న్యూరోసైకియాట్రిక్ వ్యాధుల ప్రమాదాన్ని 13% పెంచుతుంది.                                          ◆నిశ్శబ్ద.

చెడు స్నేహాలు..... పర్యవసానాలు!

జీవితంలో అన్ని విషయాలలోనూ మంచి చెడు అనే రెండు కోణాలు ఉంటాయి. వాటిని బట్టే మనుషులను కూడా మంచి చెడు అని పేర్కొంటాము.  ఎదుటివాడి ఆశయాలను, ఇష్టాయిష్టాలను గౌరవించే స్నేహమే నిజమైన స్నేహం. తాను చెప్పిందే ఎదుటివాడు వినాలి, తాను రమ్మన్నప్పుడు రావాలి, చేయమన్న పని చేయాలి అనేది బానిసత్వం అవుతుంది. అది స్నేహం ఎప్పటికీ కాదు. తన స్నేహితుడిలోని లక్షణాలను విశ్లేషించి, స్నేహం గురించి విచక్షణతో నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. జీవితంలోని ప్రతి విషయంలోనూ ఇది వర్తిస్తుంది. గమనిస్తే అనేక మంది విజేతలు ఏదో ఓ దశలో సమాజంలో పిచ్చివారుగా పరిగణనకు గురైనవారే. తమ లక్ష్యంపై వారి దృష్టి ఎంతగా కేంద్రీకృతమై ఉంటుందంటే ఇతర విషయాలన్నీ వారికి పనికిరానివిగా కనిపిస్తాయి. ఎప్పుడైతే ఇతర విషయాలను పట్టించుకోవడం మానేస్తారో అప్పుడే వారి మీద విమర్శలు మొదలవుతాయి. అవెలా ఉంటాయంటే స్థాయి పెరిగేకొద్దీ మనుషుల్ని మరచిపోతారు అనేలా. తన దృష్టి దేనిపై కేంద్రీకృతమై ఉందో ఆ విషయానికి సంబంధించినవి మాత్రమే విజేతలకు గుర్తుంటాయి. ఒకే రకమైన పక్షులు ఒకే గూటికి చేరతాయంటారు. కాబట్టి మనిషి మంచివాడైనా, చెడ్డవారితో స్నేహం వాడి మంచితనాన్ని మరుపుకు తెస్తుంది. ఒకే గూటి పక్షి అయిపోతాడు.  "తాటి చెట్టు పాలు తాగడం" కథ ఇక్కడ వర్తిస్తుంది. మంచివాడైనా, దుష్టులతో కలిసి తిరిగితే చెడ్డవాడనే అని అందరూ అంటారు. స్వతహాగా ఇతను మంచివాడే అయినప్పటికీ, చెడ్డ లక్షణాలు ఉండి ఉంటాయని అనుమానిస్తారు. చెడ్డవాడుగానే పరిగణిస్తారు. సాధారణంగా, ప్రతివ్యక్తికీ ఇష్టాయిష్టాలుంటాయి. ఆ ఇష్టాయిష్టాలు అతడు పెరిగిన వాతావరణం, సంస్కారం వంటి అంశాలపై ఆధారపడి వుంటాయి. ఆ ఇష్టాయిష్టాల ఆధారంగా అతడు కొందరు వ్యక్తులకే సన్నిహితుడవుతాడు. అందరితో కలిసి తిరుగుతున్నా కొందరితోనే అత్యంత సన్నిహితంగా వెళ్ళగలుగుతాడు. ఈ సన్నిహితులెవరో గమనిస్తే చాలు, వ్యక్తి స్వభావ స్వరూపాలు బోధపడతాయి. వారు మంచివారైతే పరవాలేదు. అదే వారు చెడ్డవారైతే వ్యక్తి మంచి వాడైనా అనుమానాస్పదుడే అవుతాడు. ఎందుకంటే అటువంటి వారి ప్రభావం వ్యక్తిపై ఎంతైనా వుంటుంది. ఏదో ఓ రోజు అది ఫలితాన్ని చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మంచి ఆలోచనలపైనే దృష్టిని నిలపాలి. అలా కాక దుర్మార్గులు, దుష్టులుగా పరిగణించే వారి సాంగత్యంలో వుంటే వాళ్ళ నడుమ తుచ్ఛమైన ఆలోచనలే వస్తాయి. అవి మనపై ప్రభావం చూపిస్తాయి. కొందరు అంటారు మనం బాగుంటే ఇతర విషయాలు మనల్ని ఏమీ చేయలేవు అని.  వజ్రం ఎంత విలువైనది అయినా దాన్ని బంగారంలో పెట్టి ఆభరణంగా మారిస్తే దాని స్వరూపం ఎంతో బాగుంటుంది. అదే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి గులకరాళ్ల మధ్య వేస్తే దాన్ని గుర్తించేవారెవరు?? పరీక్షల కోసం బాగా చదివే విద్యార్థిని మాటమాటికి వచ్చి బయటకు రమ్మని పిలిచే స్నేహం అంత మంచిది కాదు. చాలా మంది తాము బాగా చదువుకుని తమ విరామ సమయాన్ని గడపడానికి వచ్చి, ఏమీ చదవనట్టు పరీక్షంటే లెక్కలేనట్టు మాట్లాడతారు. కష్టపడి చదివే వాడిని వెక్కిరిస్తారు. దాంతో చదివేవాడు సైతం తానేదో తప్పు చేస్తున్నట్లు బాధపడతాడు. చదువు వదలుతాడు దెబ్బ తింటాడు. కాబట్టి, చదవాలనుకున్న వాడు చదువుతుంటే వచ్చి ఏకాగ్రతకు భంగం కలిగించేవాడి స్నేహాన్ని నిర్మొహమాటంగా వదల్చుకోవాలి. ఎందుకంటే కొందరు పైకి మంచిగా నటించినా మనసులో వేరే రకంగా భావిస్తూంటారు. అటువంటివారితో స్నేహం ఎప్పడైనా ముప్పు తెస్తుంది. ఈవిషయం అందరూ గమనించండి. చెడ్డవారితో స్నేహాన్ని వదులుకోండి. తమ జీవితానికి చెడ్డవారి వల్ల కలిగే నష్టాన్ని ఆ నష్టం ఎదురయ్యే వరకు కాకుండా వ్యక్తుల ప్రవర్తనలో గుర్తించి దూరంగా ఉంటేనే మంచిది.                                       ◆నిశ్శబ్ద.

సాధకులే విజెలవుతారు.. విజయం ఎలా చేకూరుతుంది?

ఈ ప్రపంచంలో ఎంతో మంది కలలు కనే పదం విజయం. ఈ పదాన్ని పలకడం ఎంత సులభమో.. ఆ విజయాన్ని సాధించడం అంత కష్టం. కేవలం కష్టం మాత్రమే కాదు.. వ్యక్తిలో కృషి, పట్టుదల, తెలివితేటలు, ఆత్మస్తైర్యం, పోటీపడే తత్వం, విషయం పట్ల అవగాహన ఇవన్నీ ఉండాలి విజయం సాధించాలంటే.. అందుకే విజయానికి కొందరు మాత్రమే అర్హులు అవుతున్నారు.  ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన world achievers day ని జరుపుకుంటారు. ఆయా రంగాలలో కృషి చేసి విజయాలు సాధించినందుకు వారిని గుర్తుచేసుకోవడం ఈ అచీవర్స్ డే ని జరుపుకుంటారు.   జనాదరణ పొందినవారినో.. కేవలం ప్రముఖులు, ప్రభావవంతమైన వారినో  గౌరవించే రోజు కాదు ఇది.  ప్రతి వర్గంలో.. ప్రతి వ్యక్తిని గుర్తించే దినం. వ్యక్తి స్తాయితో సంబంధం లేకుండా.. ప్రతిభ కలిగిన అందరినీ గుర్తించాలని చెప్పడమే ఈ రోజు ఉద్దేశం. పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, పౌర సేవకులు ఇలా ప్రతి ఒక్కరూ వారి స్థాయికి కాకుండా వారి కృషికి అనుగుణంగా గౌరవించబడతారు, గుర్తుచేసుకోబడతారు.  వారి తెలివితేటలు, ధైర్యం, నిస్వార్థత, సృజనాత్మకత ద్వారా  ప్రపంచాన్ని మరింత మెరుగ్గా  మార్చడానికి కృషి చేశారు. అలాగే దేశాల ప్రగతిని ఇనుమడింపజేస్తూ  తెలివితేటలతో ఎదుగుతున్న  అత్యుత్తమ విద్యార్థులు కూడా ఈ సందర్భంగా గౌరవానికి అర్హులే.. ఈ రోజున ఎవరైనా సరే..  వారి వయస్సు, లింగం, సామాజిక స్థితి, విద్యా స్థాయి లేదా జాతితో సంబంధం లేకుండా..  జీవితంలోని ఏ రంగంలోనైనా ఏదైనా వినూత్నమైన లేదా ప్రత్యేకమైన ఘనత సాధించిన వారికి పతకం, సర్టిఫికేట్, బహుమతి లేదా ఏదైనా ఇతర అవార్డును అందజేయడం జరుగుతుంది. తద్వారా వారు మరింత కృషి చేసేదిశగా గొప్ప ప్రోత్సాహం అందించినట్టు అవుతుంది.  ఈ అచీవర్స్ డే సందర్భంగా.. పిల్లలకు వివిధ రంగాలలో కృషి చేసిన గొప్పవారి గురించి పరిచయం చేయడం, పిల్లల్లో ప్రతిభ పెంచుకోవాలనే తపనను క్రమంగా పెంచడం. లక్ష్య సాధనకై పిల్లలను నడిపించడం చేయవచ్చు.  విజయం ఎలా చేకూరుతుంది?? ఈ ప్రపంచంలో గొప్ప ఆవిష్కరణలు చేసి, గొప్పగా ఎదిగిన వ్యక్తులు విజయాన్ని అక్కున చేర్చుకోవడానికి వెనుక ఎంత కృషి చేసారు?? వారి కష్టాలు, సమస్యలు, సవాళ్లు, త్యాగాలు ఇలా ఎన్నో విషయాలను పిల్లలకు వివరించడం ద్వారా పిల్లలో విజేతలు లక్షణాలు పెంపొందించవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు.. నేటి ప్రతిభావంతులు రేపటి విజేతలు అవుతారు. కాబట్టి పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడం పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని వ్యక్తుల చేతుల్లోనే ఉంది.                               ◆నిశ్శబ్ద.

ఉపవాసాల మాసం.. రంజాన్ మాసం..

అటు తెలుగువారి ఉగాది పండుగ అయిపోగానే.. ఇటు ఇస్లాం మతస్థుల పవిత్రమాసం ప్రారంభమవుతుంది. ముస్లిం మస్తస్తులకు ఎంతో పవిత్రమైన మాసం రంజాన్ మాసం.  ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల అయిన రంజాన్, ఉపవాసాలతో పవిత్ర మాసంగా భాసిల్లుతుంది.  ఈ సంవత్సరం ఇది మార్చి 23 నుండి ఏప్రిల్ 22 వరకు నడుస్తుంది. అల్లా ఇస్లాం మతానికి అయిదు ముఖ్యవిషయాలు తెలిపాడు.  అవి.. షహదా, సలాత్, జకాత్, స్వామ్ మరియు హజ్. స్వామ్ (ఉపవాసం) అనేది రంజాన్‌లో పాటించేది. ఈ పేరు అరబిక్ మూలం 'అర్-రామద్' నుండి వచ్చింది, దీని అర్థం మండే వేడి. రంజాన్ ప్రారంభ, ముగింపు తేదీలు ప్రతి ఏటా మారుతూ ఉంటాయి.  ఎందుకంటే చంద్రుని గమనాన్ని బట్టి వీరి సమయం ఉంటుంది. వివిధ దేశాలలో వేర్వేరు ప్రారంభ ముగింపు తేదీలు ఉంటాయి. ఇస్లామిక్ సంవత్సరం గ్రెగోరియన్ సంవత్సరం కంటే తక్కువగా ఉంటుంది అందువల్ల రంజాన్ ప్రతి సంవత్సరం 10-12 రోజుల ముందుగా ప్రారంభమవుతుంది, ఇది 33 సంవత్సరాల చక్రంలో ప్రతి సీజన్‌లో వస్తుంది. రంజాన్ చాలా ప్రత్యేకమైన ఆశీర్వాద రాత్రి. దేవదూత జిబ్రీల్ ప్రవక్త ముహమ్మద్‌కు మొదటిసారిగా ఖురాన్‌ను వెల్లడించాడు. అదే లైలతుల్ ఖద్ర్.  ఈ రాత్రి రంజాన్ చివరి పది రాత్రులలో ఉంటుంది. ప్రతి రంజాన్‌లో పదిలో నిర్దిష్ట రాత్రి మారుతుంది. అల్లాహ్ ఇలా అంటాడు..  "ఆ దేవుడి  ఆజ్ఞ దొరికిన రాత్రి వెయ్యి నెలల కంటే ఉత్తమమైనది" అని.   ఇక ఈ రంజాన్ నెలలో ఉపవాసం, మసీదులో ప్రార్థనలు,  ఖురాన్ పఠించే సమయం. చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.  రంజాన్ సందర్భంగా, అల్లా పాపాలను క్షమిస్తాడు. తప్పులు చేసిన వారిని ప్రతి రాత్రి నరకాగ్ని నుండి విడిపిస్తాడు. ముస్లింలు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మంచినీళ్లు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసం చేస్తారు.  సూర్యాస్తమయ ప్రార్థన తర్వాత వారి ఉపవాసాన్ని విరమించుకోవడానికి వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో వారి ఇళ్లలో లేదా మసీదులలో సమావేశమవుతారు. ఈ భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. ఉపవాసం ప్రారంభానికి ముందు తెల్లవారుజామున జరిగే భోజనాన్ని సుహూర్ అంటారు. కాబట్టి, ఉపవాసం సుహూర్ నుండి ఇఫ్తార్ వరకు విస్తరించి ఉంటుంది. రంజాన్ తర్వాత ఈద్ అల్-ఫితర్ వస్తుంది. ఇది ఉపవాసం ముగింపును సూచిస్తుంది. ఇది మూడు రోజుల పాటు కొనసాగుతుంది, ఈ సమయంలో ముస్లింలు ఆనందంగా ఉంటారు. సంతోషాన్ని ఒకరికొకరు పంచుకుంటారు. ఈ నెలలోనే దానధర్మాలు చేస్తారు. బీదలకు సహాయం చేస్తారు. ఈద్ ప్రత్యేక ప్రార్థన ఉంటుంది.  ఇకపోతే ఉపవాసం చేయలేని వారు కొందరు ఉంటారు. ఇలాంటి వారు బీదలకు సహాయం చేయడం, ఉపవాసం ఉండే ఇతరులకు ఇఫ్తార్ విషయంలో సహాయం చేయడం లాంటివి చేయొచ్చు. వీలైనంత వరకు పేదవారికి చేసే సహాయం ఎంతో ప్రముఖ్యతగా ఉంటుంది రంజాన్ మాసంలో. రంజాన్ మాసం గురించి కొన్ని ముఖ్య విషయాలు.. *క్రీ.శ570లో  ప్రవక్త ముహమ్మద్ జన్మించారు. క్రీ.శ 610 లో  ఖురాన్ మొట్టమొదట దేవదూత జిబ్రీల్ ద్వారా ప్రవక్త ముహమ్మద్‌కు వినిపించారు. ఇలా ఖురాన్ అవతరించింది. క్రీ.శ622లో  చంద్ర ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభబమయ్యింది. క్రీ.శ622లో  ప్రవక్త ముహమ్మద్ హింస నుండి తప్పించుకోవడానికి మక్కా నుండి మదీనాకు వలస పూర్తి చేశాడు. క్రీ.శ624 అల్లా రంజాన్‌లో ఉపవాసాన్ని విధిగా పాటించాలని సూచించాడు. ఖురాన్ అవతరించిన ఈ మాసంను ఎంతో పవిత్రంగా భావిస్తారు ముస్లిం సోదరులు. ఖురాన్ ను ఇస్లాం మతానికి పవిత్ర గ్రంథంగా భావిస్తారు. అందుకే ఈ నెలకు అంత ప్రాముఖ్యత.                                         ◆నిశ్శబ్ద.

ప్రకృతిలో త్రిగుణాలు ఎలా ఉంటాయి?

ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులో అంటే కదలనివి (పర్వతములు, కొండలు, గుట్టలు, రాళ్లు), కదలకుండా కదిలేవి (చెట్లు, మొక్కలు, వృక్షములు), కదిలేవి (నాలుగు కాళ్ల, రెండు కాళ్ల జంతువులు, మనుషులు), మూడు గుణములు అంటే సత్వ రజో తమోగుణములు ఉన్నాయి అని తెలుసుకున్నాము. ఉదాహరణకు, పర్వతములు, కొండలు, గుట్టలు, రాళ్లు, ఇవి కదలవు. వీటిలో తమోగుణము 98 శాతం ఉంటే రజోగుణము 1 శాతం సత్వగుణం 1 శాతం ఉంటుంది. రెండవ రకం వృక్షములు, చెట్లు, మొక్కలు, అవి కదలవు కానీ నీటిని పీల్చుకుంటాయి, శ్వాసిస్తాయి. వాటి ఆకులు వివిధగుణములు కలిగి ఉంటాయి. కొన్ని మొక్కలు అయితే తన దగ్గరకు వచ్చిన జంతువులను తనలోకి లాక్కుంటాయి. కొన్ని తాకితే ముడుచుకుంటాయి. కొన్ని స్పందిస్తాయి. మొక్కలు పుట్టడం, పెరగడం, పెద్దవి కావడం మన కళ్లముందే జరుగుతుంది. కాని కదలలేవు. వీటిలో తమోగుణము 50శాతము, రజోగుణము 45 శాతము, సత్వగుణము 5 శాతం ఉంటుంది. ఇంక జీవజాతులు, రెండు కాళ్ల మనుషులు, నాలుగు ఇంకా అనేక కాళ్లతో నడిచే జంతువులు, వీరిలో వారి వారి ప్రవృత్తులను బట్టి మూడు గుణాల నిష్పత్తి మారుతూ ఉంటుంది. జంతువులలో వాటి స్వభావాన్ని బట్టి గుణాలు ఒకేసారి మారతాయి.  కాని మానవుడికి వయసు పెరిగే కొద్దీ పరిసరాలకు అనుగుణంగా, కాలానికి అనుగుణంగా, వారి వారి గుణాలు మారుతుంటాయి. కొంతమంది సాత్వికులు అవుతారు, మరి కొంత మంది రజోగుణ ప్రధానులు అవుతారు. మరి కొంత మంది తమోగుణ ప్రధానులు అవుతారు. అది ఎలాగంటే. ఈ మూడు గుణములు పైన చెప్పబడిన వాటిలో ఒకే విధంగా, ఒకే మోతాదులో ఉండవు. హెచ్చుతగ్గులుగా ఉంటాయి. సత్వగుణము మోతాదు ఎక్కువగా ఉంటే, అది మిగిలిన రజో, తమోగుణములను అణగదొక్కుతుంది. తాను మాత్రమే ప్రధానంగా ప్రకటితమౌతుంది. అదే రజోగుణము ఎక్కువగా ఉంటే అది సత్త్వ, తమోగుణములను అణగదొక్కి తాను మాత్రమే ఎక్కువగా ప్రకటితమౌతుంది. అలాగే తమోగుణము ఎక్కువగా ఉన్నప్పుడు అది సత్వ, రజోగుణములను అణగదొక్కుతుంది. ఈ విధంగా ఒక్కొక్క పదార్థములో ఒక్కో గుణము ఎక్కువగా ఉంటుంది. కొందరిలో రెండుగుణాలు ఎక్కువ ఒక గుణము తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఈ మూడు గుణములు వివిధములైన పాళ్లలో బంధనములను కలుగజేస్తుంటాయి. అంతే కాదు. ప్రతిరోజూ ప్రకృతిలో కూడా ఈ గుణాలు మారుతుంటాయి. సాధారణంగా మానవులలో ఉదయం 4 నుండి 8 వరకు సత్వగుణము ప్రధానంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలోనే స్నానం, సంధ్య, హెూమం, పూజ చేయాలని చెప్పారు. ఎండ ఎక్కేకొద్దీ రజోగుణము ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ సమయంలో ఎవరెవరికి నిర్దేశింపబడిన కర్మలు వారు చేయాలి. సూర్యుడు అస్తమించగానే, తమోగుణము ప్రధానంగా ఉంటుంది. కాబట్టి నిద్రపోవాలని చెప్పారు. (కాని మనం ఏం చేస్తున్నాము! ధన సంపాదన కొరకు, రాత్రిళ్లు పని చేస్తూ, పగలు కునికిపాట్లు పడుతున్నాము. లేక విలాసాలతో రాత్రి 1 గంటదాకా క్లబ్బులు పబ్బులలో గడుపుతూ నిశాచరులము అవుతూ ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాము. కాబట్టి వివేకి అయినవాడు ఏ గుణమునకు బంధితుడు కాకూడదు. అన్నీ సమానంగా, పరిమితంగా అనుభవించాలి. దేనికీ అడిక్ట్ కాకూడదు. అతి, విపరీతధోరణి పనికిరాదు. శాస్త్రఅధ్యయనం చేయాలి. ఇష్టదైవాన్ని ఉపాసించాలి. ధ్యానం చేయాలి. జీవనానికి ఏదో ఒక ఉద్యోగం, వ్యాపారం ధర్మబద్దంగా, న్యాయబద్ధంగా, శ్రద్ధతో చేయాలి. అవసరము ఉన్నంత వరకే సంపాదించాలి. జీవితం ఆనందంగా గడపాలి. అంతేకానీ ఏదో ఒక గుణమునకు కట్టుబడి పోకూడదు.  ◆ వెంకటేష్ పువ్వాడ.

సంతోషానికి సిగ్నేచర్ ఈరోజే..

సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. వారి మాట నీటిమూట కాదు. ప్రపంచ దేశాలే సంతోషం మనిషి హక్కు అని నినదిస్తున్నాయి. సంతోషంగా ఉండటానికి దనికులుగానే పుట్టక్కర్లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ ప్రస్తుతకాలంలో కనీస నిత్యావసరాలు తీరాలన్నా ధనం మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి డబ్బు లేకుండా సంతోషం అనివార్యమైన విషయం. ఇకపోతే సంతోషం ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి ప్రాథమిక హక్కు. దాన్ని సాధించుకోవడం మనిషి కర్తవ్యం అయితే.. ప్రజలకు సంతోషాన్ని అందించడం ఆయా దేశాల కర్తవ్యం. ప్రతి మనిషి జీవితంలో సంతోషం ఉండాలని, ఆ సంతోషం పెంపుదలకు ఎన్నో నిర్ణయాలు, మరెన్నో ప్రణాళికలు అమలుచేయాలని నిర్ణయించారు. సంతోషమైన ప్రపంచం కోసం ఒక రోజును వరల్డ్ హ్యాపీనెస్ డే గా ప్రకటించి జరుపుకుంటూ వస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చి 20 వ తేదీన ఈ సంతోషకరమైన దినోత్సవం జరుపుకోబడుతుంది. ఐక్యరాజ్యసమితి 160 దేశాలకు చెందిన వ్యక్తులతో యాక్షన్ ఫర్ హ్యాపీనెస్ అనే గ్రూప్ లాభాపేక్షలేకుండా చేసిన పనికి ధన్యవాదాలు తెలుపుతూ  అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీని అంతిమ లక్ష్యం ఏమిటంటే, పురోగతి అనేది దిగువ స్థాయిలను పెంచడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం మాత్రమే కాదు, ప్రజల శ్రేయస్సు, మనుషుల ఆనందం కూడా ఉండాలి. అప్పుడే అది సంతోషం అని పిలవబడుతుంది. 2011లో, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది, ఇది ఆర్థిక అవకాశాలకు సమానమైన ప్రాధాన్యతను ఇవ్వడాన్ని ప్రాథమిక మానవ లక్ష్యంగా చేసింది.  రెండు సంవత్సరాల తరువాత, 2013లో, ఐక్యరాజ్యసమితిలోని  మొత్తం 193 సభ్య దేశాలు ప్రపంచంలోని మొదటి అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని జరుపుకున్నాయి మరియు అప్పటి నుండి అది పెరుగుతూనే ఉంది. ఈ కారణంగా ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ సంతోష దినోత్సవ వేడుక నిర్వహించబడుతుంది. ఈ దినోత్సవ లక్ష్యాల ప్రకారం.. సంతోషం మనిషి నవ్వు ద్వారా.. చర్యల ద్వారా వ్యక్తమయ్యేది కాట్రమే కాదు.. సంతోషమంటే వ్యక్తి జీవితంలో అభివృద్ధి. ఆ అభివృద్ధి వ్యక్తి జీవితాన్ని పెరుగుపరచాలి. ఇలా ఉన్నపుడే సాధారణ పౌరులు కూసా సంతోషంగా ఉండగలుగుతారు. ఇకపోతే వ్యక్తి జీవితంలో తృప్తిగా ఉండటం ఎలాగో నేర్చుకోవాలి. తృప్తి ఉన్నచోట సంతోషం నీటి ఊటలా బయటకొస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈ సంతోషం మరింత మెరుగు పడాలని ఆశిద్దాం.                                     ◆నిశ్శబ్ద.

కాలుష్యపు దెబ్బకు రీసైక్లింగ్ మందు...

ప్రతి సంవత్సరం, భూమి బిలియన్ల టన్నుల సహజ వనరులను ఇస్తోంది. ఇలా ఆలోచిస్తే మనం ఎంతో అదృష్టవంతులం. కానీ ఈ సహజవనరుల గురించి ఆలోచించాల్సింది మరొకటి ఒకటి ఉంది. అదేంటంటే.. ఈ సహజవనరుల అన్నీ భవిష్యత్తులో ఏదో ఒకప్పుడు అయిపోతాయి. ఇలా సహజ వనరులు అయిపోవడానికి కారణం.. కేవలం మనం సహజవనరులను ఇష్టానుసారం వాడెయ్యడమే కాదు. ఆ సహజవనరుల ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తూ.. వాటిని ప్రకృతికి నష్టం కలిగిస్తున్నాం.  అందుకే మనం ఈ ప్రకృతిలో కలిపేసే వస్తువుల  గురించి మరోసారి ఆలోచించాలి - వృధా కాకుండ చూడాలి. గత పదేళ్ల కాలం గమనిస్తే..  రికార్డు స్థాయిలో అత్యంత వేడిగా ఉంది. ఇప్పుడు అసమానమైన వాతావరణ మార్పులు, ఊహించని ప్రళయాలు  ఎదుర్కొంటున్నాము. మనం గణనీయమైన, వేగవంతమైన మార్పులు చేయకుంటే, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, మంచుగడ్డలు కరగడం, వివిధ దేశాలు, ప్రాంతాలు అంతమయ్యే దశకు చేరుకోవడం, అడవులు తగ్గిపోవడం వంటివి చాలా దారుణంగా తయారవుతాయి.   ప్రపంచంలో పెరుగుతున్న పేదరికం, ప్రాంతాల  వలసలు, ఉద్యోగ నష్టాలు, ప్రజలు నివసించే ప్రాంతాలు కనుమారుగైపోతూ.. కరువు కారణంగా ప్రపంచమంతా దారిద్య్రం ఏర్పడుతుంది. మానవాళిని ఇది నేరుగా ప్రభావితం చేస్తుంది. దీనిని ఎదుర్కోవడానికి శాశ్వతమైన మార్పులు చేసుకోవాలి. దీనికోసం ఐక్యరాజ్యసమితి గ్లోబల్ రీసైక్లింగ్ డే ని ప్రతి సంవత్సరం మార్చి 18 వ తేదీన జరుకునేలా ప్రకటించింది. 2030 నాటికల్లా.. కొన్ని లక్ష్యాలను ఈ గ్లోబల్ రీసైక్లింగ్ డే సందర్భంగా నిర్ణయించింది.  గ్లోబల్ గ్రీన్ ఎజెండాకు మద్దతుగా అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలు ప్రత్యక్ష చర్యలు తీసుకోవడం మనం ఇప్పటికే చూస్తున్నాము. రీసైక్లింగ్ అనేది వృత్తాకార ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం, ఇది మన సహజ వనరులను రక్షించడంలో సహాయపడుతుంది. ప్రతి సంవత్సరం 'సెవెన్త్ రిసోర్స్' (పునర్వినియోగపరచదగినవి) CO2 ఉద్గారాలలో 700 మిలియన్ టన్నులకు పైగా ఆదా చేస్తుంది. ఇది 2030 నాటికి 1 బిలియన్ టన్నులకు పెరుగుతుందని అంచనా వేయబడింది. మన భవిష్యత్తును కాపాడటానికి మనుషుల్లో ఉన్న స్పృహ రీసైక్లింగ్ ప్రక్రియలో ముందు వరుసలో ఉంటుంది. అంటే.. భావితరాలకు మనం సహజవనరులను అందించాలనే స్పృహ మనతో ఈ ప్రకృతి సంరక్షణ పనులు చేయిస్తుంది. మన విలువైన ప్రాథమిక వనరులను సంరక్షించడం, మన భూ గ్రహ భవిష్యత్తును సురక్షితం చేయడంలో రీసైక్లింగ్ ప్రాముఖ్యతను చాలా ఉంటుంది. ఈ  ప్రాముఖ్యతను గుర్తించడంలోనే ఈ గ్లోబల్ రీసైక్లింగ్ డే జరుపుకోబడుతుంది.  అందుకోసమే.. 2018లో గ్లోబల్ రీసైక్లింగ్ డే సృష్టించబడింది. ప్రపంచం ఏకతాటిపైకి వచ్చి భూమిని కాపాడుకోవడానికి ప్రయత్నించడం, ఆ ప్రయత్నాలకు తగిన ఆలోచనలు, ప్రణాళికలను ప్రపంచానికి చాటి చెప్పడం గ్లోబల్ రీసైక్లింగ్ డే రోజు చేసే పని.   గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ ద్వారా నిర్దేశించబడిన గ్లోబల్ రీసైక్లింగ్ డే లక్ష్యం రెండు రెట్లు: రీసైక్లింగ్ అనేది గ్లోబల్ సమస్య కాకూడదని, ఇది చాలా ముఖ్యమైనదని  చెబుతారు. ఈ రీసైక్లింగ్‌కు ఒక సాధారణ, ఉమ్మడి విధానం తక్షణం అవసరమని ప్రపంచానికి తెలిసేలా చెప్పడం. మన చుట్టూ ఉన్న వస్తువుల విషయానికి వస్తే, వనరులను వృధా చేయకూడదని ఈ భూమ్మీద ఉన్న అందరూ ప్రజలకు తెలియజేయడం.   అవార్డులు రివార్డులు ఉన్నాయి దీనికి.. గ్లోబల్ రీసైక్లింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ రంజిత్ బాక్సీ ఇలా వ్యాఖ్యానించారు. “కరోనా కాలంలో  రీసైక్లింగ్ హీరోలు చేసిన విశిష్ట సహకారానికి మేము వారిని గుర్తించాలనుకుంటున్నాము. గత 12 నెలల్లో రీసైక్లింగ్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్న వ్యక్తులు, సంఘాలు, వ్యాపారాల నుండి నామినేషన్లు ఆహ్వానించబడ్డాయి. వారి ప్రయత్నాలు మన ప్రపంచం యొక్క పచ్చని భవిష్యత్తుకు దోహదపడతాయి. రీసైక్లింగ్ అనేది వాతావరణ మార్పు చక్రంలో అంతర్భాగం. ప్రపంచ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో, రక్షించడంలో సహాయపడుతుంది. రీసైక్లింగ్ 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల CO 2 ఉద్గారాలను ఆదా చేస్తుందని అంచనా వేయబడింది . ఈ అవార్డు కింద 1000 అమెరికన్ డాలర్లు బహుమానంగా ఇస్తారు. కలుషితమైపోతున్న ఈ ప్రపంచాన్ని కాపాడుకోవడం మన చేస్తుల్లోనే ఉంది. మన చుట్టూ ఉన్న వనరులను దీర్ఘకాలంగా, పొదుపుగా ఉపయోగించుకోవాలి. అలా చేస్తే మన వంతు ప్రయత్నంలో మనం సఫలమే..                                   ◆నిశ్శబ్ద.

శాస్త్రవేత్తలు  ప్రపంచ ఆయువుకు ఊపిరితిత్తులు..

  ఈ ప్రపంచంలో చాలా రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలను వాటి వెనుక కారణాలను కనిపెట్టేవారు శాస్త్రవేత్తలు.  శాస్త్రవేత్తలు లేకుంటే ఈ ప్రపంచం ఒక జంతుచర్యల కేంద్రంగా ఉండేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శాస్త్రవేత్తలు ప్రపంచ ఆయువుకు ఊపిరితిత్తుల లాంటి వాళ్ళు. అలాంటి శాస్త్రవేత్తలను గుర్తుచేసుకుంటూ, వారి కృషిని గుర్తిస్తూ ప్రతి ఏడూ శాస్త్రవేత్తల దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరీ ముఖ్యంగా మార్చి 14వ తేదీన ఆల్బర్ట్ ఐన్ స్టీన్ పుట్టినరోజు సందర్భంగా శాస్త్రవేత్తల దినోత్సవం జరుపుకుంటారు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ పుట్టినరోజుతో పాటుగా మార్చి 14న సెలబ్రేట్ సైంటిస్ట్స్ డే జరుపుకుంటారు. ఈ రోజున, మేము గతం మరియు వర్తమానం నుండి శాస్త్రీయ సహకారాన్ని గమనించాము. మన జీవితాలను సులభతరం చేయడంలో శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి శాస్త్రవేత్తలకు మనకంటే ఎక్కువ తెలుసు.  ప్రాణాలను కాపాడటానికి, పర్యావరణాన్ని రక్షించడానికి, వ్యాధులను నయం చేయడానికి, మనకి దూరంగా ఉన్న గ్రహాల గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తల ఆలోచనలు, పరిశోధనలు, వారి కృషి తోడ్పడుతుంది.  చాలా మంది అరిస్టాటిల్‌ను మొదటి శాస్త్రవేత్తగా భావిస్తారు. ఈయన క్రీ.పూ నాల్గవ శతాబ్దంలో  పరిశీలనలు, తర్కానికి మార్గదర్శకత్వం వహించాడు, అరిస్టాటిల్ పని, ఈయన తత్వశాస్త్రం మధ్య యుగాలలో పాశ్చాత్య సమాజాన్ని ప్రభావితం చేశాయి, రాబోయే వేల సంవత్సరాల్లో శాస్త్రీయ అధ్యయనానికి తగిన ఆలోచనలను రూపొందించాయి. ఈయన తరువాత ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ నియమాలను కనుగొన్నాడు. గణితంలో కొత్త రూపమైన కాలిక్యులస్‌ను కనుగొన్నాడు. కానీ న్యూటన్ ఒక శాస్త్రవేత్తగా గుర్తింపు పొందలేదు.  పరిణామ సిద్ధాంతం  గురించి మనకు తెలిసేలా చేసిన చార్లెస్ డార్విన్ ఘనత పొందాడు, అయితే న్యూటన్ లాగా, ఈయన తన ఆలోచనలను ప్రజల ముందు బహిర్గతం చేయడంలో వెనుకాడాడు. డార్విన్ తన ప్రారంభ పరిశీలనలను  20 సంవత్సరాల తర్వాత అంటే..  1859 వరకు తన పరిశోధనల సమాహారమైన  "ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసిస్" ను ప్రచురించలేదు. సహజ విజ్ఞాన రంగంలో విస్తృత పరిశోధనలు చేయడం ద్వారా శాస్త్రవేత్తగా తన ఖ్యాతిని పెంపొందించుకోవడానికి అతను అన్ని  సంవత్సరాలు కష్టపడ్డాడు. సముద్ర జీవులపై ఆయన చేసిన కొన్ని అధ్యయనాలు నేటికీ అనేక సంస్థలలో  బోధించబడుతున్నాయి. 1930ల వరకు పరిణామంపై డార్విన్ కనుగొన్న విషయాలను శాస్త్రీయ సమాజం విస్తృతంగా అంగీకరించలేదు. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, నిస్సందేహంగా ఆధునిక కాలంలో అత్యంత ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త. ఈయన గణిత, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు కానీ తిరస్కరించబడ్డాడు. తిరస్కరించారనే నిరాశతో ఆ మార్గాన్ని వదులుకుని ఉంటే.. మనం సాపేక్షత సిద్ధాంతం, ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావం, క్వాంటం మెకానిక్స్ గురించి ఎప్పటికీ నేర్చుకోలేకపోయేవాళ్ళం. సైంటిస్ట్ డే సందర్భంగా కొన్ని ముఖ్యమైన విషయాలు.. 1628 సర్క్యులేషన్ సిద్ధాంతం బ్రిటీష్ వైద్యుడు విలియం హార్వే గుండె శరీరం చుట్టూ రక్తాన్ని పంప్ చేస్తుందని ప్రతిపాదించాడు, రక్త ప్రసరణ వ్యవస్థకు కాలేయం ఇంజిన్ అనే దీర్ఘకాల నమ్మకాన్ని వివాదాస్పదం చేసింది. 1844 లో మొదటి టెలిగ్రాఫ్ సందేశం మే 24న శామ్యూల్ మోర్స్ వాషింగ్టన్ DC నుండి బాల్టిమోర్‌కి మొదటి టెలిగ్రాఫ్ సందేశాన్ని పంపాడు, అందులో ఉన్న సారాంశం "దేవుడు ఏమి చేసాడు?" 1869 లో DNA యొక్క ఆవిష్కరణ ఫ్రెడరిక్ మీషెర్, స్విస్ రసాయన శాస్త్రవేత్త, DNA అణువును గుర్తించారు. 1905 - 1915 సాపేక్ష సిద్ధాంతం ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రచురించాడు. 1969 చంద్రునిపై మొదటి మనిషి అపోలో 11 మొదటిసారిగా చంద్రునిపైకి మనిషిని తీసుకువెళ్లింది.                                ◆నిశ్శబ్ద.

కలల కాన్వాసు మనమే గీసుకుందాం!

కలలు కనండి, కలలను సాకారం చేసుకోండి అని అంటారు అబ్దుల్ కలాం. ఈయన మన భారతీయులకు గొప్ప ప్రేరణ. ఎక్కడో పేద కుటుంబంలో జన్మించి, దీపం వెలుగులో చదువుకుని, అంతరిక్షానికి రాకెట్లను పంపే విజ్ఞానాన్ని ఒడిసి పట్టి శాస్త్రవేత్తగా ఎదిగాడు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకు అంటే.. కలలను సాకారం చేసుకోమని ఈయన ఇచ్చిన ఆలోచన ఎంత గొప్పదో చర్చించుకోవడానికి. అలాగే ఈ ఆలోచనకు మరొక రూపమా అన్నట్టుండే మరొక విషయాన్ని, ప్రపంచానికి అంతగా తెలియని వ్యక్తిని గురించి మాట్లాడుకోవడానికి. NAtional dream day… కలలను కనడం వాటిని నిజం చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఈ గొప్పతనం వెనుక మనిషి కృషి, పట్టుదల, అవిరామ సాధన ఎంతో ఉంటుంది. కలలను గూర్చి కథలుగా మాత్రమే చెప్పుకునే కాలం కాదు జీవితాలను కథలు కథలుగా, స్ఫూర్తి మంత్రాలుగా చెప్పుకునే కాలమిది. మనిషి గొప్పగా ఎదగడానికి అడ్డుకునేది ఏదీ ఈ ప్రపంచంలో లేదు.. ఉన్న అడ్డంకల్లా మనకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయని మొదటే మనం అభిప్రాయపడటం. బిడ్డ పుట్టాక ఏడుపు నుండి నవ్వుతూ ఉండటానికి సమయం పడుతుంది. పిల్లవాడికి పండ్లు మొలిచేటప్పుడు ధవడలు చెప్పలేనంత నొప్పిని అనుభూతి చెందుతాయి. ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు మోకాళ్ళు గీరుకుపోయి నొప్పి పెడతాయి. అవన్నీ సమస్య అనుకుంటే ఎవరూ నడక నేర్వలేరు కదా… అలాగే మనిషి దశలు మారేకొద్ది సమస్యలు కూడా విభిన్న రూపాలు దాలుస్తాయి. సమస్యలను చూసుకుని ఆగిపోయే వారు జీవితంలో గొప్ప స్థానానికి వెళ్లలేరు.  అందుకే కలలను కనమని ప్రోత్సహించే రోజు ఒకటుంది. ప్రతి ఏటా మార్చి 11న జరుపుకునే జాతీయ కలల దినోత్సవం జరుపుకుంటారు. ఈ  రోజున మన జీవితంలో జరగవులే అనే ఆలోచనతో వదిలిపెట్టేసిన  మీ కలలను తిరిగి వేటాడటం మొదలుపెట్టండి. యువకుల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ దీనికి అర్హులే.. కావాల్సిందల్లా సంకల్ప బలమే.. "ది మిలీనియం మ్యాన్," రాబర్ట్ ముల్లర్ చేత ప్రేరణ పొంది ఈ కలల దినోత్సవం ఏర్పడింది.   ప్రతి సంవత్సరం అతని పుట్టినరోజున దీన్ని జరుపుకుంటారు. డ్రీమ్ స్కూల్ ఫౌండేషన్ పిల్లల కలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తుంది.  ఇది అన్ని వయసుల వారికి స్ఫూర్తినిచ్చినప్పటికీ, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తోంది.  ఎవరు రాబర్ట్ ముల్లర్.. మన దేశానికి కలాం తెలుసు..  ఈ ప్రపంచానికి ముల్లర్ తెలుసు. చాలామందికి తెలియని విస్తృతమైన ప్రపంచం ఇది. రాబర్ట్  ముల్లర్ ఒక శరణార్థి, జైలు శిక్ష తప్పించుకునే భయానక పరిస్థితులను అనుభవించాడు.  ఫ్రెంచ్ ప్రతిఘటనలో సభ్యుడు కూడా అయ్యాడు. అతను 25 సంవత్సరాల వయస్సులో ఐక్యరాజ్యసమితిలో ఇంటర్న్‌గా చేరాడు, అక్కడ తన జీవితంలోని తరువాతి 40 సంవత్సరాలను అంకితం చేశాడు. అనేక అవార్డులు, నామినేషన్లు ఈయన సొంతమయ్యాయి. 14 పుస్తకాలు వేలకొద్దీ రచనలు తరువాత, 1986లో కోస్టా రికాలో  పదవీ విరమణ చేసాడు, అక్కడ అతను ఐక్యరాజ్యసమితి యొక్క యూనివర్శిటీ ఫర్ పీస్ ఛాన్సలర్‌గా పనిచేశాడు, దీన్ని స్థాపించడంలో సహాయం చేశాడు. బెంచ్ ఆఫ్ డ్రీమ్స్ డ్రీమ్ బెంచ్ డైరీని కూడా రూపొందించాడు.  ఇలా ఒక శరణార్థిగా ఉన్న వ్యక్తి తన జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. రాబర్ట్ ముల్లర్ గూర్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే.. 1923 "ది మిలీనియం మ్యాన్" రాబర్ట్ ముల్లర్ మార్చి 11న బెల్జియంలో జన్మించాడు. 1948 ముల్లర్ ఐక్యరాజ్యసమితిలో ఇంటర్న్‌గా చేరాడు. 1987 మీ కలల కోసం ఒక బెంచ్ సృష్టించాలని.. ముల్లర్ డెస్ బెర్గోఫర్ మరియు గెర్రీ స్క్వార్ట్జ్ సహాయంతో బెంచ్ ఆఫ్ డ్రీమ్స్‌ అనే ఆలోచనతో ముందుకు వచ్చాడు. 1995 జాతీయ కలల దినోత్సవాన్ని డ్రీమ్ స్కూల్ ఫౌండేషన్ రూపొందించింది. పెద్దకలలు కనడం వాటిని నిజం చేసుకోవడం ప్రతి మనిషికి అవసరం.                                     ◆నిశ్శబ్ద.

కిడ్నీల మీద కాస్త కనికరం చూపండి!

కిడ్నీలు మన శరీరంలో ముఖ్య అవయవాలు. ఇవి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి. వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపుతాయి. అయితే మనం రోజూ వారీ జీవితంలో చేస్తున్న కొన్ని తప్పులు మూత్రపిండాల పనితీరుకు అడ్డంకి అవుతున్నాయి. చాలా తొందరగా పాడైపోతున్నాయి. ఎంతో చిన్న వయసులో మూత్రపిండాల సమస్యలు అనుభవిస్తున్నారు. ఆరోగ్యం గురించి ఆలోచిస్తే.. కిడ్నీల విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. పైగా ఈ కిడ్నీ సమస్యలు మన చెప్పుచేతల్లో నుండి జారిపోయేవరకు బయటపడవు.   ప్రతి సంవత్సరం మార్చి 9వ తేదీని ప్రపంచం కిడ్నీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా అందరూ కిడ్నీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారవిహారాలు తెలుసుకుంటే..  నీళ్లు.. కిడ్నీ ఆరోగ్యానికి మంచినీరు మొదటి ఔషధం. ప్రతిరోజు శరీరానికి అవసరమైనంత నీటిని తీసుకోవడం ద్వారా కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. శరీరం హైడ్రేట్ గా ఉంటే కిడ్నీలు సేఫ్ గా ఉంటాయి. మంచినీరు తగినంత తీసుకుంటే.. కిడ్నీలు వ్యర్థాలను వడపోయడం తేలిక అవుతుంది.  ఆహారం.. ట్యూనా, సాల్మన్ లేదా ట్రౌట్ వంటి చేపలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలను సులువుగా పొందవచ్చు. క్యాబేజీలో పొటాషియం మరియు సోడియం రెండూ తక్కువగా ఉంటాయి, అయితే ఫైబర్, విటమిన్ C మరియు K సమృద్ధిగా ఉంటాయి. క్యాప్సికం గా పిలుచుకునే బెల్ పెప్పర్ లో విటమిన్ B6, B9, C మరియు K,  విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో మంచి  ఫైబర్ ఉంటుంది. ఇందులో  యాంటీఆక్సిడెంట్లను కూడా బాగుంటాయి. ముదురు ఆకుకూరలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు వీటి నుండి బాగా అందుతాయి. మన దగ్గర ఎప్పుడూ ఉండే గొప్ప యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ వెల్లుల్లి. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే నిర్దిష్ట సమ్మేళనం ఉంటుంది. ఇది మూత్ర పిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యాలి ఫ్లవర్, బ్రోకలి కిడ్నీ ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుతాయి. అలవాట్లు.. ద్రవ పదార్థాల దగ్గరి నుండి, ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్కటీ కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడేదిగా ఉండాలి. శీతల పానీయాలు, ఆల్కహాల్, ఎక్కువ పవర్ ఉన్న మందులు, కఠినమైన ఆహార పదార్థాలు దూరం పెట్టాలి. ఫైబర్, విటమిన్ సి, తాజా ఆకుకూరలు, కూరగాయలు, ముల్లంగి, తీసుకోవడం. శారీరక వ్యాయామం. యోగా సాధన పాటించాలి. అవయవదానం.. ప్రస్తుత కాలంలో కిడ్నీ సమస్యలు ఫేస్ చేస్తున్నవారు చాలామంది ఉన్నారు. కొందరు కిడ్నీ దాతలు లేక మరణిస్తున్నారు. ఇలాంటి వారి కోసం అవయవదానం చెయ్యాలి. మరణం తరువాత, ఊహించిఅని మరణాలు సంభవించినప్పుడు కుటుంబ సభ్యులు కూడా అవయవ దానానికి  మద్దతు ఇవ్వాలి.   సంవత్సరానికి ఒకసారి అయినా వైద్యుడిని సంప్రదించి కిడ్నీల ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకోవాలి. ఇలా చేస్తే కిడ్నీ ఆరోగ్యం పదిలం.                                        ◆నిశ్శబ్ద.

ముత్యమంత పంటికి ముచ్చటైన సేవకులు!

ఎదుటి వారిని మనవైపు తొందరగా ఆకర్షించాలంటే మన మాటతీతుతో పాటు మంచి చిరునవ్వు కూడా ముఖ్యం. అంతర్గత అందం మనసుతో వచ్చేది అయినప్పుడు అది కేవలం ప్రవర్తనలో, ఇతరులతో కలిసి చేసే పనులను బట్టి ఇతరులకు అర్థమవుతుంది. కానీ కొన్ని బహిర్గతమయ్యే విషయాలు కూడా మనుషులలో ఆత్మవిశ్వాసం పెంచుతాయి. అలాంటి వాటిలో ఒకటి తీరైన పలువరుస. తెల్లగా మెరిసిపోయే దంతాలు, దానిమ్మ పలువరుస కలిగిన దంతాలు ఎంతో గొప్ప ఆకర్షణను తెచ్చిపెడతాయి. అయితే దురదృష్ట వశాత్తు నేటి కాలంలో చాలామంది దంత సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ముప్పయ్యేళ్లు నిండకనే గట్టి పదార్థాలు తినాలంటే సంకోచించే స్థితిలో ఉన్నారు. అయితే వీరందరికీ ఉత్తమ పరిష్కారాలు ఇచ్చి దంత సంరక్షణకు దారి చూపేవారు దంత వైద్యులు. సాధారణ డాక్టర్లతో పోలిస్తే దంత వైద్యులు కాస్త తక్కువ గుర్తింపు పొందారని చెప్పవచ్చు.  ఇప్పటి కాలంలో ఎంతోమంది దంత సంబంధ సమస్యలతో బాధపడినా దంత వైద్యులను సంప్రదించేవారు తక్కువే.. సమస్య మరీ తీవ్రమైతే తప్ప దంతవైద్యుల దగ్గరకు వెళ్లరు చాలామంది. కానీ ప్రతి సంవత్సరం మార్చి 6 వ తేదీన జాతీయ దంతవైద్యుల దినోత్సవం జరుపుకుంటారు. దంతాలు చిగుర్ల సమస్యలు, పుచ్చిన పళ్ళు, పంటి నొప్పి, పంటి మీద గారా, చిగుర్ల వాపు, చిగుర్లు రక్తం కారడం, బలహీనంగా ఉండటం. చల్లని, వేడి పదార్థాలు తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉండటం. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఓడిన పళ్ళ స్థానంలో కొత్త పళ్ళు కట్టడం, పళ్ళ సెట్టు వంటివి అమర్చి ఎంతోమందికి తిరిగి తమకు తాము ఆహార పదార్థాలు నమిలి తినేలా దోహదం చేస్తారు. ఇంకా చెప్పాలంటే.. దంత ఆరోగ్యం మన మొత్తం ఆరోగ్యానికి మూలంగా ఉంటుంది. శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే అది పళ్ళమీద, గొర్ల మీద, చర్మ, జుట్టు వంటి బాహ్య మూలకల మీద సులువుగా గుర్తించవచ్చు.  ఇంత ప్రాముఖ్యత కలిగిన దంతాలకు డెంటిస్ట్ ల తోడ్పాటు ఎంతో అవసరం. ఈ డెంటిస్ట్ డే సందర్భంగా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటే. క్రీ.పూ 5000 సంవత్సరాల క్రితం సుమేరియన్లు ఉండేవారు. వీరు దంతాలలో పురుగుల వల్ల దంత క్షయం, కావిటీస్ వస్తాయని నమ్మేవారు.  2600 bc లో పురాతన ఈజిప్టుకు చెందిన హెసీ-రా తొలి దంత వైద్యులలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు. 1530లో ఆర్ట్జ్నీ బుచ్లీన్ దంత ఆరోగ్యంపై మొదటి పుస్తకం రాసారు. అందులో  అన్ని రకాల వ్యాధులు మరియు దంతాల బలహీనతలకు సంబంధించిన విషయాలుంటాయి. దీన్ని "లిటిల్ మెడిసినల్ బుక్" అంటారు. 1990 నుండి దంతవైద్యం పెరుగుతూ వచ్చింది. దంతాలకు సంబంధించిన సేవలు పలు చోట్ల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.  దంత సంరక్షణకు ఏమి చెయ్యాలి?? దంత వైద్యుల దినోత్సవం సందర్భంగా నిపుణులైన దంతవైద్యులు ప్రతి ఒక్కరూ పాటించదగిన దంత సంరక్షణ జాగ్రత్తలు, పాటించాల్సిన జాగ్రత్తలు తెలిపారు. దంత సంరక్షణకు మొదటి మార్గం శుభ్రంగా పళ్ళు తోముకోవడం. ఉదయం నిద్ర లేవగానే, రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవడం వల్ల దంత శుభ్రతను మైంటైన్ చేయవచ్చు. ప్రతి 6నెలలకు ఒకసారి దంతవైద్యుడ్ని సంప్రదించి పళ్ళ స్థితిగతులు, వాటి బల, బలహీనతలు వెతికి తీసుకోవలసిన జాగ్రత్తలు అడిగి తెలుసుకోవాలి. మీకు దంత సమస్య ఏమైనా ఉండి, వైద్యుల ద్వెస్రా అవి పరిష్కరమయి ఉంటే.. మరచిపోకుండా ఆ వైద్యులకు కృతజ్ఞతలు తెలపండి.  దంతాలు బాగుంటే.. దంతాలు బాగుంటే మనిషిలో చెప్పలేని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. కల్గేట్ యాడ్ లో ఆరోగ్యవంతమైన దంతాలు మొత్తం శరీరానికి ఆత్మవిశ్వాసాన్ని,  ఆరోగ్యాన్ని ఇచ్చినట్టు దంతాలు బాగుంటే ఎలాంటి చింతా ఉండదు. అయితే ఈ దంత సంరక్షణ కులం పళ్ళు బాగా తొముకోవాలి.  ఇతరుల ముందు నవ్వడానికి, మాట్లాడటానికి తడబడేవారు, ఇబ్బందిగా ఫీలయ్యే వారు  దంతవైద్యుని సహకారంతో వారి పరిస్థితిని అధిగమించగలుగుతారు. దంతాలకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు తీసుకోవడం మంచిది. దంత వైద్యుడి సలహాలు పాటించడం మరీ మంచిది. ఇలా దంత సంరక్షణ నుండి, దంతాల ప్రాధాన్యత వరకు అన్నీ తెలుసుకుని పాటించాలి.                                  ◆నిశ్శబ్ద.

అన్ ప్లగ్గింగ్ డే.. సెల్ ఫోన్లు, టీవీలూ ఆపేయండి!

ప్రపంచం చాలా పెద్దది అనుకుంటాం కళ్ళతో చూసినప్పుడు. కానీ అదే ప్రపంచం చాలా చిన్నగా కనిపిస్తుంది మొబైల్ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు. అయితే ఈ బయటి ప్రపంచం సంగతి పక్కన పెడితే ప్రతి మనిషికి తనకంటూ ఓ ప్రత్యేక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో తల్లిదండ్రులు, స్నేహితులు, ఆత్మీయులు, భార్యా, భర్త, పిల్లలు ఇలా ఎన్నో ప్రధాన పాత్రలు పోషించేవారు ఉంటారు. కానీ ఆ అనుబంధాల ప్రపంచం కాస్తా చేతిలో ఉన్న టెక్నాలజీ వల్ల మసకబారిపోతోంది. కుటుంబంలో ప్రతి ఒక్కరి చేతిలో తప్పకుండా ఓ మొబైల్ ఉంటుంది. ఇంట్లో ఉన్న సమయంలో ఆ మొబైల్ ఏ వారి ప్రపంచం. అందులో సినిమాలు, యూట్యూబ్, ఇతరులతో చాటింగ్, ఇంకా ఎన్నో వైరల్ విషయాలు చూస్తూ కాలాన్ని కరిగించేస్తారు. ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు ఉద్యోగం ముఖ్యం కదా అని చెబుతారు. స్నేహితులతో వెళ్ళినప్పుడు.. ఫ్రెండ్స్ తో కొంచెం సేపు కూడా సరదాగా ఎంజాయ్ చేయకూడదా అంటారు. మరి కుటుంబం గురించో… ఎప్పుడైనా ఆలోచన చేస్తారా కుటుంబం గురించి. కొందరు తెలివిమీరిన ఫిలాసఫర్ లు కుటుంబం మనల్ని అర్థం చేసుకోకుంటే ఎలా.. అని ఎదుటివారి నోటిని మూసేస్తారు. ఇప్పటి కాలంలో కుటుంబ ప్రాధాన్యత తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. కుటుంబంతో సంబంధాలు మెరుగ్గా ఉంచుకోవడానికి అన్ ప్లగ్గింగ్ డే నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మార్చ్ మూడవ తేదీన ఈ అన్ ప్లగ్గింగ్ డే జరుపుకోవడం ఉంటుంది. ప్రతి వ్యక్తికి కుటుంబం ఎంతో అవసరం. కుటుంబ సభ్యుల మధ్య బంధాలు ఆరోగ్యంగా ఉంటే వారి జీవితాలు కూడా సంతోషంగా ఉంటాయి. ఏం చెయ్యాలి? అన్ ప్లగ్గింగ్ డే రోజు మీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్, టీవీ లు, సిస్టం లు అన్నిటినీ ఆఫ్ చేసేయ్యాలి. ఈ ఒక్కరోజు అయినా ఎలాంటి కార్యకలాపాలు లేకుండా హాయిగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి. మీతో మాట్లాడాలని అనుకుని, మీ బిజీ షెడ్యూల్ చూస్తూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్న మీ తల్లిదండ్రులతో మనసు విప్పి మాట్లాడవచ్చు. మీ ఉరుకులు పరుగుల రోజులో మీకోసం అన్నిటినీ ఓపికగా సమకూర్చుతున్న మీ జీవిత భాగస్వామితో ఏకాంత సమయాన్ని గడపవచ్చు. ఉద్యోగానికి ఉదయం వెళ్లి రాత్రి ఎప్పుడో ఇంటికి చేరుకోవడం ద్వారా మీ రక్తం పంచుకు పుట్టిన పిల్లలకు సమయాన్ని కేటాయిస్తూ వారితో సరదాగా గడపవచ్చు. ఇలా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలు మాత్రమే కాకుండా మీకున్న ఆత్మీయులు, మీరు కలవలేకపోయిన స్నేహితులను కలుసుకుని వారితో సమయాన్ని మనసారా గడపడం ద్వారా మీ మధ్యన బంధాలు బలపడతాయి. ఎంన్ సమయాన్ని చాలా సునాయాసంగా కిల్ చేసే సామాజిక మద్యమానికి కామా పెట్టడం ద్వారా ఈరోజును మీదైన దినంగా మీకు నచ్చినట్టుగా మలచుకోవచ్చు. కాబట్టి జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అండ్ స్విచ్ ఆన్ యువర్ హార్ట్.                                    ◆నిశ్శబ్ద.