పేరెంట్స్ వద్దంటున్నా స్కూళ్లెందుకు! కరోనాతో గేమ్స్ వద్దంటున్న జనాలు 

విద్యార్థుల జీవితాలతో ఏపీ సర్కార్ చెలగాటమాడుతుందా? స్కూళ్లు నడపించడంపై అత్యుత్సాహం చూపిస్తోందా?. అంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. స్కూళ్లకు వెళుతున్న ఉపాద్యాయులు, విద్యార్థులకు కరోనా పాజిటివ్ వస్తుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం గొల్లపల్లి స్కూల్‌లో ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో స్కూల్‌లోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అధికారులు హుటాహుటిన కరోనా టెస్టులు చేయిస్తున్నారు. తొలిరోజే ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు.    స్కూళ్ల ప్రారంభం, అవగాహనపై ఆదివారం పేరెంట్స్ కమిటి సమావేశాలు నిర్వహించారు. అయితే అనుమానాల నివృత్తికి పాఠశాలకు వచ్చిన విద్యార్థులలో కొత్తపట్నం మండలం గవండ్ల పాలెం జడ్పీ హైస్కూలు ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కొవిడ్‌ బారిన పడ్డారు. ముండ్లమూరు మండలం మా రెళ్ళ జడ్పీ హైస్కూలు విద్యార్థులు 8మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది.   కేంద్ర ప్రభుత్వం నవంబరు 30 వరకు పాఠశాలలు తెరవవద్దని సూచించినా జగన్ ప్రభుత్వం మాత్రం మొండిగా స్కూళ్లను తెరిచింది. కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా కొనసాగుతున్నా స్కూళ్లు తెరవడాన్ని తల్లిదండ్రులు కొందరు వ్యతిరేకిస్తున్నారు. పాఠశాలకు వచ్చిన తమ పిల్లలకు కరోనా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కొవిడ్‌ 19 సెకండ్‌ వేవ్‌పై వస్తున్న సమాచారం తెలుసుకుంటున్న తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు విముఖత చూపుతున్నారు.     కరోనా భయంతో మూత పడిన స్కూళ్లు సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం తెరుచుకున్నాయి. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లి దండ్రులు జంకుతున్నారు. దీంతో తొలిరోజు స్కూళ్లలో హాజరు 30శాతం కూడా దాటలేదు. విద్యార్థులు స్కూళ్లకు నామమాత్రంగానే హాజరయ్యారు. ఎవరిలోనూ ఉత్సాహం కనిపించలేదు. అంతా జాగ్రత్తలపైనే శ్రద్ధ చూపారు. అన్ని పాఠశాలలో కొవిడ్‌ 19తో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ఇతర ప్రైవేటు యాజమాన్యాల్లోని జూనియర్‌ కళాశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది.    కరోనా భయం ఇంకా ఉన్నా, కేంద్ర సర్కార్ నవంబర్ 30 వరకు స్కూళ్లు తెరవొద్దని చెప్పినా జగన్ సర్కార్ ఎందుకు అత్యుత్సాహం చూపుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో స్కూళ్లు తెరవలేదు. ఏపీకి పక్కనున్న మిగితా రాష్ట్రాల్లోనూ అంతే. అయినా విద్యార్థుల తల్లిదండ్రుల వ్యతిరేకిస్తున్నా స్కూళ్లు తెరవాల్సి అవసరం ఏముందని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తమ అనాలోచిత నిర్ణయాలతో జగన్ సర్కార్ పిల్లలకు ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తుందనే అభిప్రాయమే ఏపీలోని మెజార్టీ వర్గాల నుంచి వస్తోంది. స్కూళ్లు తెరవడంపై ఉప్యాద్యాయ సంఘాలు ఆందోళనగా ఉన్నాయి.  

ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహారంలో జగన్ సర్కార్ పై మండిపడ్డ హైకోర్టు 

ఏపీలోని జగన్ ప్రభుత్వంపై హైకోర్టు ఈరోజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ఎన్నికల కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడంలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై తాజాగా హైకోర్టు తన తీర్పు వెల్లడించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం వినతుల పై రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని కోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. తాము తొలగించిన వ్యక్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించడంతో.. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే సహాయ నిరాకరణ పద్దతిలో వ్యవహరిస్తోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలు మారుతాయి, కానీ రాజ్యాంగ సంస్థలు ఎప్పుడూ అలాగే ఉంటాయని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర వ్యవస్థ అని.. నిరంతరంగా పనిచేసేదని, అటువంటి వ్యవస్థలను కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని, లేకపోతే కూలిపోతుందని న్యాయస్థానం పేర్కొంది. అసలు రాష్ట్ర ప్రభుత్వం సహాయమందిస్తే ఎస్ఈసీ కోర్టును ఆశ్రయించే పరిస్థితి వచ్చేది కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎస్ఈసీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఈ సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం కావాలనేది ఎస్ఈసీ మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియచేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎస్ఈసీ కోరినవన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ ప్రభుత్వం అమలు చేయకపోతే అప్పుడు ఏం చేయాలనేది రాష్ట్ర హైకోర్టు నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది.

ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ముంబై తరహా ఉగ్ర దాడులు.. 

ఆస్ట్రియా దేశ రాజధాని వియన్నాలో కాల్పులు కలకలం రేపాయి. ఒకే సమయంలో ఆరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. అయితే భద్రతాదళాల చేతిలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. దీంతో వియన్నాలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. తప్పించుకున్న ఉగ్రవాదుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు.    2008 నవంబర్ (26 /11) లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల తరహాలో ఏక కాలంలో కాల్పులకు తెగబడాలని ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసినట్లు సమాచారం అందుతోంది. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాది ఇస్లామిక్ స్టేట్ సానుభూతిపరుడని ఆస్ట్రియా హోమ్ మంత్రి కార్ల్ నెహ్‌మర్ తెలిపారు. అయితే ప్రశాంతతకు మారు పేరైన ఆస్ట్రియాలో ఊహించని ఈ ఉగ్ర దాడులతో వియన్నా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.    ఇది ఇలా ఉండగా.. వియన్నాలో జరిగిన ఉగ్రవాదుల దాడిపై మన ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆస్ట్రియాకు భారత్ పూర్తి అండగా ఉంటుందని అయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.  

మాలీపై బాంబుల వర్షం! 50 మంది అల్ ఖైదా ఉగ్రవాదులు హతం?

సెంట్రల్ మాలీపై ఫ్రాన్స్ భీకరంగా విరుచుకుపడింది. ఉగ్రవాదుల స్థావరాలపై  ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో  50 మంది వరకు అల్ ఖైదాకు చెందిన జీహాదీలు హతమయ్యారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం  అధికారికంగా ప్రకటించింది. బుర్కినా ఫాసో, నైగర్ సరిహద్దుల్లో వేచివున్న ప్రభుత్వ దళాలు ఉగ్రవాదులు ఉన్న ప్రదేశానికి చేరుకునేందుకు వీలును కల్పించేందుకు ఈ దాడులు చేసినట్టు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ  తెలిపారు. మాలీలో ఉన్న  బర్కానే దళాలతో కలిసి ఈ దాడులు చేశామని, ఉగ్రవాదులకు చెందిన ఆయుధాలను, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని  ఫ్రాన్స్ మంత్రి ప్రకటించారు.    మూడు దేశాల సరిహద్దుల్లో భారీ ఎత్తున మోటార్ సైకిల్ కారావాన్ సాగుతోందని తమ డ్రోన్లు గుర్తించిన తరువాత, విమానాలు వెళ్లి దాడులు చేశాయని ఫ్రాన్స్ రక్షణ మంత్రి స్పష్టం చేశారు. దాడుల నుంచి తప్పించుకోవాలని ఉగ్రవాదులు చెట్లు తదితరాల చాటుకు వెళ్లారని, ఈ దాడుల్లో రెండు మిరేజ్ జెట్లు, ఓ డ్రోన్ ను పంపి, మిసైల్స్ ను జారవిడిచామని పార్లీ తెలియజేశారు. ఈ దాడుల తరువాత నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు సైనిక అధికారి కల్నర్ ఫ్రెడ్రిక్ బార్బరీ తెలియజేశారు. దాడులు జరిగిన ప్రాంతం నుంచి పేలుడు పదార్థాలు, ఆత్మాహుడి దాడికి వినియోగించే దుస్తులు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఫ్రెడ్రిక్ తెలిపారు.    నైగర్ అధ్యక్షుడు మహమదౌ ఇసోఫౌవుతో ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ  సమావేశం జరిగిన గంటల వ్యవధి తరువాత ఈ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రేటర్ సహారా ప్రాంతంలోనూ ఆర్మీ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాదులను తుదముట్టించేందుకు 3 వేల మందికి పైగా ఫ్రాన్స్  సైన్యం రంగంలోది దిగిందని చెబుతున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి పార్టీ మారుతున్నారని ప్రచారం! హై టెన్షన్ మధ్య దుబ్బాక పోలింగ్ 

తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య కొనసాగుతోంది. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం కావడం తీవ్ర దుమారం రేపింది. పోలింగ్ ప్రారంభ సమయానికి ఈ ప్రచారం జరగడంతో కాంగ్రెస్ నేతలు, కేడర్ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ప్రచారంపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ నేతలు. ఓటమి భయంతోనే బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, మంత్రి హరీష్ రావులు తనపై కుట్రలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన తోగుంట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ చేస్తున్న ప్రచారంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం బీజేపీ,టీఆర్ఎస్ లు చిల్లర రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.                    దుబ్బాక  ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి దుబ్బాక రాజకీయాలు హాట్ హాట్ గానే సాగాయి. రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోయాయి. ఓటర్లకు జోరుగా ప్రలోభాలకు గురి చేశాయి పార్టీలు. ప్రచారంలోనూ పార్టీల మధ్య వాగ్వాదాలు జరిగాయి. పోలింగ్ కు కొన్ని గంటల ముందు కూడా తీవ్ర గొడవలు జరిగాయి. సిద్ధిపేటలోని ఓ హోటల్ లో బస చేసిన ఆందోలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తత స్పష్టించింది. హోటల్ కేంద్రంగా ఎమ్మెల్యే డబ్బులు పంపిణి  చేస్తుండగా  తాము అడ్డుకున్నామని, తమపైనే ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించగా.. తనను టార్గెట్ చేసుకునే వంద మంది బీజేపీ కార్యకర్తలు హోటల్ కు వచ్చారని ఎమ్మెల్సే క్రాంతి కిరణ్ చెప్పారు. ఈ ఘటనతో సిద్ధిపేటతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో  హై టెన్షన్ వాతావరణం నెలకొంది.    మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ హోరాహోరీగా సాగుతోంది. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ధగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఓటర్లు కూడా ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న సోలిపేట సుజాత  తన స్వగ్రామం చిట్టాపూర్ లో కుటుంబ సభ్యులతో కలిసి  ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు తన సొంతూరు బొప్పాపురం ఓటు  వేయగా.. తొగుట మండలం తుక్కపూర్ గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

ఆర్టీసీ డీల్ తో ఏపీకి గండం! బినామీ ఆస్తుల కోసమేనన్న అచ్చెన్న 

ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. చర్చల మీద చర్చల తర్వాత రెండు రాష్ట్రాల మధ్య డీల్ కుదిరింది. చెరో 1.60 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పుకునేందుకు ఇరు రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చాయి. అయితే తెలంగాణలో గతంలో కంటే ఏపీ ఆర్టీసీ లక్ష కిలోమీటర్లను తగ్గించుకుంది. ఇదే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఏపీఎస్ఆర్టీసీ మనుగడకే ముప్పు తెచ్చేలా జగన్ సర్కార్ ఒప్పందం చేసుకుందనే ఆరోపణలు వస్తున్నాయి.   కొత్త ఒప్పందం కారణంగా ఏపీఎస్ఆర్టీసీ లక్షకు పైగా కిలోమీటర్లను కోల్పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ ఒప్పందం ఆర్టీసీనే కాకుండా కార్మికులను కూడా నష్టపరుస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేస్తోందని, రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారని అచ్చెన్న విమర్శించారు. తెలంగాణలో తన బినామీ ఆస్తులను కాపాడుకునేందుకు ఏపీ ప్రయోజనాలను జగన్మోహన్‌రెడ్డి పొరుగు రాష్ట్రానికి ధారాదత్తం చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆర్టీసీ విషయంలో ప్రయాణికుల సౌకర్యాలతో పాటు ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసేలా తెలంగాణ ప్రభుత్వంతో, జగన్‌ ప్రభుత్వం ఆనాలోచిత ఒప్పందం చేసుకుంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని  అచ్చెన్నాయుడు విమర్శించారు.    కరోనా లాక్ డౌన్ తో రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నిలిచిపోయాయి. లాక్ డౌన్ ఎత్తేసి నెలలు కావస్తున్నా.. రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆర్టీసీ బస్సులు రోడెక్కని పరిస్థితి తలెత్తింది. చివరకి దసరా సమయంలోనూ ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్  వారు భారీగా చార్జీలు పెంచి ప్రయాణికులను దోచుకున్నారు. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో పండగకు ఎలాగైనా ఊరు వెళ్లేందుకు ప్రజలు ఆ భారాన్నిభరించారు. కరోనా భయంతో ఏప్రిల్, మే నెలల్లో హైదరాబాద్ నుంచి వేలాది మంది ఏపీ వాసులు సొంతూర్లకు వెళ్లారు. లాక్ డౌన్ తర్వాత వారు తిరిగి తమ పనుల కోసం వచ్చేందుకు చూసినా ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.    ప్రజలు ప్రయాణాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని జగన్ సర్కార్.. ఇప్పుడు తమ సొంత ప్రయోజనాల కోసం ఏపీ ఆర్టీసీకి నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణలు ప్రజల నుంచి కూడా వస్తున్నాయి. మరోవైపు రాత్రి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అంతర్రాష్ట్ర బస్సులు మొదలైనా,,  తొలిరోజున దాదాపు ఖాళీగానే తిరిగాయి. బస్సులు తిరగడంపై ప్రజల్లో అవగాహన లేకనే స్పందన లేదని అధికారులు చెబుతున్నారు.  ఇటీవలి కాలంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు, కర్నూలు నుంచి హైదరాబాద్ కు రెండు వైపులా ప్రయాణాలు సాగిస్తున్న వారు బస్టాండ్లకు వెళ్లడం లేదు. ఏ వాహనం అందుబాటులో ఉంటే దానిలోనే ప్రయాణిస్తున్నారు.    సోమవారం నాడు స్వల్ప సంఖ్యలోనే బస్సులు సరిహద్దులను దాటాయి. ప్రయాణికుల సంఖ్య పెరిగితే, ఆ మేరకు బస్సులను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. దీపావళి నాటికి పూర్తి స్థాయిలో సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయన్న నమ్మకం ఉందన్నారు.

గెలుపు నాదే.. ఒపీనియన్ పోల్స్ తప్పు! చివరి సభలో ట్రంప్ 

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. అమెరికాలో మొత్తం దాదాపు 25.52 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి వుంది. అయితే ఇప్పటికే 30 శాతానికి పైగా ఓట్లు నమోదయ్యాయని తెలుస్తోంది. అంటే సుమారు 9 కోట్లకు పైగా ఓట్లు ఇప్పటికే బ్యాలెట్ బాక్సుల్లోకి చేరిపోయాయి.ఇవాళ మరో 30 శాతం ఓటింగ్ నమోదవుతుందని అంచనా. 2016లో  జరిగిన యూఎస్ పోలింగ్ లో 55.5 శాతం ఓటింగ్  నమోదైంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు  ట్రంప్, బైడెన్ తమ సర్వ శక్తులనూ వినియోగించారు. కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతున్నప్పటికీ ముమ్మరంగా ప్రచారం చేశారు.     అమెరికాలో ఈసారి ట్రంప్ కు షాక్ తప్పదని మెజార్టీ ఒపినియన్ పోల్స్ ప్రకటించాయి. ముందస్తుగానే భారీగా జరిగిన బ్యాలెట్ ఓటింగ్ లోనూ ట్రంప్ కంటే బైడెన్ చాలా ముందున్నారని సమాచారం. అయితే ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మాత్రం మరోసారి తన విజయం ఖాయమంటున్నారు.  అధ్యక్ష ఎన్నికలకు ముందు చివరి ప్రచారాన్ని నిర్వహించిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఎలాగైనా తానే గెలవనున్నానని కీలక వ్యాఖ్యలు చేశారు. నార్త్ కరోలినా పరిధిలోని ఫ్యేటవిల్లీలో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ఆయన, అధ్యక్ష ఎన్నికలపై వచ్చినవన్నీ తప్పుడు ఒపీనియన్ పోల్సేనని కొట్టి పారేశారు.    తన ప్రత్యర్థి బైడెన్ గెలిస్తే, అవినీతి పెరిగిపోతుందని, వైట్ హౌస్ లో ఆయన నిద్రించడం మినహా మరేమీ చేయలేరని విమర్శలు గుప్పించారు ట్రంప్. నాలుగేళ్ల క్రితం మీరు ఓ బయటి వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అతను అమెరికాను అగ్రరాజ్యంగా నిలిపాడు. ఇప్పుడు వెళ్లండి. అందరూ ఓటేయండి. నేను మిమ్మల్ని కోరేది అదే. వస్తున్న ఒపీనియన్ పోల్స్ ఫలితాలను నేనూ చూస్తున్నాను. వాటిని నమ్మకండి. అవి తప్పుడు పోల్స్" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణల నేపథ్యంలో మొదలైన దుబ్బాక పొలింగ్.. 

తెలంగాణలో ఎంతో ఉత్కంఠ రేపుతున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ కొద్దీ సేపటి క్రితం మొదలైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు మెల్లగా చేరుకుంటున్నారు. ఐతే కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వస్తున్న వారికి సానిటైజర్, గ్లౌజులు, మాస్కులు అందజేస్తున్నారు. మరో పక్క థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే ఓటు వేసేందుకు లోనికి అనుమతిస్తున్నారు. అలాగే అవసరమైన వారికీ మందులను కూడా అందుబాటులో ఉంచారు.  ఇదిలాఉండగా, ఉప ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో.. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో పక్క బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వాళ్లతో జాగ్రత్త.. ట్రస్ట్ ఆస్తులు కొట్టేయగలరు.. రఘురామరాజు సంచలన కామెంట్స్  

కొన్ని నెలల క్రితం మాన్సస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ గా సంచయిత బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఆమెను నిత్యం వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ట్రస్ట్ కింద ఉన్న భూముల దగ్గర నుండి ఎంఆర్ కాలేజీ వరకు అన్ని నిర్ణయాలు వివాదానికి దారి తీస్తున్నాయి. అయితే తాజాగా సంచయిత గురించి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఈరోజు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆనంద్ గజపతి రాజు నుండి సంచయిత తల్లి ఉమా గజపతి రాజు విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఢిల్లీ వెళ్లిపోయారన్నారు. ఆ తరువాత కొద్దిరోజులకే ఉమ... రమేశ్ శర్మ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారని తెలిపారు. ఇదే విషయాన్నీ 2013 నవంబర్‌లో సంచయిత రాసిన ఒక ఆర్టికల్ లో పేర్కొన్నారని అయన తెలిపారు. అంతేకాకుండా ఢిల్లీలో చదువుకున్న సంచయిత.. తన తల్లిదండ్రుల గురించి ఆ ఆర్టికల్‌లో చాలా స్పష్టంగా తెలిపిందని, ఆమె తన స్కూల్ రికార్డులలో కూడా తన తండ్రి పేరు రమేశ్ శర్మ అని రాశారని అయన అన్నారు.   మరో పక్క "సంచయిత తల్లితో విడాకులు అయ్యాక ఆనంద గజపతి రాజు విజయనగరానికి చెందిన సుధా రాజును వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా ఆనంద గజపతి రాజు, సుధా రాజు లకు పుట్టిన అమ్మాయి ఊర్మిళా గజపతి రాజునే వారసురాలిగా ప్రకటిస్తూ వీలునామాలో ఆనంద గజపతి రాజు రాశారు. అయితే ఆనంద గజపతి రాజు చనిపోతే కనీసం చూడడానికి కూడా సంచయిత, ఆమె తల్లి రాలేదని.. అలా వారు పూర్తిగా ఆ కుటుంబానికి దూరం అయ్యారని అయన తెలిపారు. గత కొద్ది రోజులుగా వివాదాల నేపథ్యంలో ఊర్మిళ గజపతి రాజు టీవీలలో మాట్లాడుతూ... సంచయిత వివాదంపై కోర్టుకు వెళుతున్నట్టు తెలిపింది. అయినా సంచయిత ఇలా అకస్మాత్తుగా వచ్చి కలహాలు పెట్టడం సరికాదు. విజయనగర రాజా కుటుంబానికి చెందిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అవమానించే కుసంస్కారం రాజవంశీయులకైతే అసలు ఉండదు. ఎవరి అండో చూసుకుని సంచయిత చెలరేగిపోతే... రేపో మాపో కోర్టు ఆదేశాలు కూడా వస్తాయి. కాబట్టి అమ్మా సంచయితా.. నిన్ను అడ్డుపెట్టుకుని ఆస్తులను చేజిక్కించుకోవడానికి.. పంచ గ్రామాల్లోనే కాదు.. మాన్సస్ ట్రస్టుకు చెందిన ఆస్తులను కాజేయడానికి కొంత మంది చూస్తున్నారు. వారి ట్రాప్‌లో పడొద్దు. ట్రస్ట్ ఆస్తులు రక్షించుకోండి’’ అని రఘురామ రాజు హితవు పలికారు.

జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ.. 

ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ అడ్మిషన్లపై జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇంటర్మీడియట్‌లో ఆన్‌లైన్ అడ్మిషన్లు చేయాలంటూ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. రెండు సంవ‌త్స‌రాల ఇంట‌ర్మీడియ‌ట్ కోర్సులో వొకేష‌న‌ల్, జ‌న‌ర‌ల్ కోర్సుల‌లో ప్ర‌వేశాల‌కు ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తులు స్వీకరించింది. దీన్ని కొంత‌మంది హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. దీని పై విచార‌ణ సంద‌ర్భంగా ఏపీ విద్యాశాఖ‌పై హైకోర్టు ప్ర‌శ్నల వర్షం కురిపించింది. ఏ చ‌ట్టం, ఏ రూల్ ప్ర‌కారం ఈ అడ్మిషన్ల ప్ర‌క్రియ చేప‌ట్టార‌ని సూటిగా ప్ర‌శ్నించింది. విద్యార్థులు ఏ కాలేజీలో చేరాలనేది వారి ఇష్టానికి వదిలేయాలని.. అసలు ప్రభుత్వమే కాలేజీలను ఎలా కేటాయిస్తుందని పిటిషనర్లు వాదించారు. దీంతో 10 రోజుల పాటు జీవోను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై త‌దుప‌రి విచార‌ణ‌ను న‌వంబ‌ర్ 9కు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

రిటైరవుతున్నానంటూ షాక్ ఇచ్చిన పీవీ సింధు! అసలు ట్విస్ట్ ఇది!

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఒక్కసారిగా షాకిచ్చారు. తాను రిటైరవుతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరూ అవాక్కయ్యేలా చేశారు. అయితే ఆమె పెట్టిన పోస్టును మొత్తం చదివితే అసలు ట్విస్ట్ తెలిసింది. ఆమె రిటైరవుతున్నది క్రీడ నుంచి కాదని, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణం నుంచని అర్ధమవుతుంది. తన లేఖ మొత్తం చదివితే తాను తీసుకున్న నిర్ణయం సబబేనని అందరూ అంగీకరిస్తారని సింధు తన ప్రకటనలో తెలిపింది. సింధూ తన అభిప్రాయాన్ని పోస్టులో తెలిపినా.. దాన్ని మొత్తం చదవని వారు మాత్రం గందరగోళానికి గురయ్యారు.    పీవీ సింధు చేసిన పోస్టులో ఇలా ఉంది. "ఈ లేఖ మొదట్లో మీరు షాక్ అవుతారు, అయోమయానికి గురవుతారు. లేఖ పూర్తిగా చదివిన పిమ్మట మీరు కూడా నాతో అంగీకరిస్తారనుకుంటున్నా. ఈ కరోనా మహమ్మారి నాకో కనువిప్పు. కఠినమైన ప్రత్యర్థులను ఓడించేందుకు కఠోరంగా సాధన చేయొచ్చు. మ్యాచ్ లో చివరి షాట్ వరకు హోరాహోరీగా పోరాడవచ్చు. గతంలో నేను ఇలా చేశాను కూడా. కానీ ప్రపంచాన్నంతటినీ కట్టిపడేస్తున్న ఈ కంటికి కనిపించని వైరస్ మహమ్మారితో పోరాడడం ఎలా?   నెలల తరబడి ఇంట్లోనే ఉన్నాం, బయటికి వచ్చే ప్రతిసారి భయపడాల్సిన పరిస్థితి! కరోనా పరిస్థితుల నేపథ్యంలో హృదయాలు ద్రవించే గాథలు వింటున్నాం. అయితే నేను ప్రస్తుతం నెలకొని ఉన్న అనిశ్చితి నుంచి రిటైరవ్వాలని భావిస్తున్నా. ఈ ప్రతికూల వాతావరణం నుంచి రిటైరవుతున్నా. వదలక వెంటాడుతున్న భయం, సందిగ్ధత నుంచి రిటైర్ అవుతున్నా. ముఖ్యంగా, మన నాసిరకం పరిశుభ్రతా ప్రమాణాల నుంచి రిటైర్ అవుతున్నా, వైరస్ అంటే ఏముందిలే అనే నిర్లక్ష్య ధోరణి నుంచి రిటైర్ అవుతున్నా.. నికార్సయిన పోరాటం లేకుండా మ్యాచ్ ను అప్పగించడం నాకు తెలియదు. ఇప్పుడు కరోనా విషయంలోనూ అంతే. ఇదే పోరాటాన్ని నేను, మనం సురక్షితమైన ప్రపంచం సాకారమయ్యేదాకా కొనసాగిద్దాం" అంటూ సింధు సుదీర్ఘ ప్రకటన చేసింది.

కులపోళ్లకే కీలక పోస్టులు! అక్కడా ఇక్కడా సేమ్ టు సేమ్

తెలుగు రాష్ట్రాల పాలనలో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వంలోని కీలకమైన పోస్టుల్లో అధికారుల అనుభవం, పని తీరు కాకుండా తన అనుకున్న వారికే అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇదీ మరీ ఎక్కువైందంటున్నారు. తన అనుకున్నవారితోనే ఆగకుండా ఇప్పుడు ఏకంగా తన కులానికి చెందిన వారికే  ముఖ్యమైన పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో తాజాగా  ప్రభాకర్‌రావును స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టే  ప్రభాకర్‌రావును స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.              కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ అధికారులను కీలక పోస్టులలో నింపుతున్నారనే విమర్శలు చాలా కాలంగా వస్తున్నాయి.  సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్  వంటి కీలక విభాగాల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని, టీఆర్ఎస్ ను విమర్శించే కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసేందుకే ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ శాఖల్లో తన వారిని ముఖ్యమంత్రి నియమించుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దీనిపై చాలా సార్లు గట్టిగానే మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నేతలపై అక్రమ కేసులు పెట్ట జైలుకు పంపాలనే కుట్రలో భాగంగానే కేసీఆర్.. ఈ మూడు విభాగాలను తనవారితో నింపేశారని ఆరోపించారు.    తెలంగాణలో ఇప్పటికే చాలా మంది అధికారులను పదవి కాలం ముగిసినా కొనసాగిస్తున్నారు.  రిటైరై ఎక్స్ టెన్షన్ లో ఉన్నవాళ్లు, కన్సల్టెంట్లుగా నియమించినవాళ్లు దాదాపు 500 మంది వరకు ఉన్నట్లు అంచనా. వీళ్లే కాకుండా అన్ని శాఖలు, కమిషనరేట్లు, హెచ్.ఓ.డి. కార్యాలయాలు, జిల్లాల్లో చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో ఎక్కువ మంది ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారనే అరోపణలు వస్తున్నాయి. తనకు నచ్చిన వారిని కీలక పోస్టుల్లో నియమించడం.. నచ్చకపోతే లూప్ లైన్ లో పెట్టడం కూడా  జరుగుతుందనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి.    పోస్టింగుల్లో తమపై వివక్ష చూపుతున్నారంటూ గతంలో కొందరు ఐఏఎస్ లు ప్రత్యేకంగా సమావేశం పెట్టి సీఎస్ కు వినతిపత్రం ఇవ్వడం కలకలం రేపింది. పరిపాలనలో కీలక పాత్ర పోషించే ఐఏఎస్‌కూ వివక్ష తప్పడం లేదని, పదవుల నియామకంలో వివక్ష చూసి ప్రాధాన్యత లేని పోస్టింగులిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఐఏఎస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.  సీనియారిటీ, అను భవం ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్న కొందరి వల్ల అనుభవం లేకపోయినా ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు  ఐఏఎస్‌లు ఆరోపిస్తున్నారు.                ఆంధ్రప్రదేశ్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందనే చర్చ జరుగుతోంది.  రాష్ట్రంలో  ఏ ప్రాధాన్యమైన పోస్టు ఖాళీగా ఉన్నా అది రెడ్లకే ఇవ్వడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందనే ప్రచారం జరుగుతోంది. జగన్ సర్కార్ వచ్చాకా భర్తీ చేసిన కీలక పోస్టుల్లో మెజార్టీ ఆ సామాజిక వర్గానికే దక్కాయనే ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ చైర్మెన్ గా, అదనపు ఈవోగా రెడ్లు ఉండగానే.. టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డిని నియమించడం దుమారం రేపింది. ఏపీలో కీలకమైన పోస్టులన్ని ఆ సామాజిక వర్గానికే కట్టబెడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు వర్గానికి చెందిన అధికారులను లూప్ లైన్ లో వేస్తున్నారు. సిన్సియర్ అధికారులుగా పేరున్న వారిని అప్రాధాన్య శాఖలకు తరలించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.    తెలుగు రాష్ట్రాల పాలనలో నెలకొన్న పరిస్థితులపై బ్యూరోకాట్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి మంచిది కాదనే చర్చ జరుగుతోంది. పనితీరు ప్రామాణికంగా తీసుకోకుండా పోస్టింగులు ఇస్తే ఐఏఎస్ ల్లో జవాబుదారి తనం లోపిస్తుందని మేథావులు హెచ్చరిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇలా  చేసుకుంటూ పోతే పాలనంతా గాడి తప్పుతుందని, ప్రజాసంక్షేమం మూలకు పడుతుందని చెబుతున్నారు. ప్రజల కోణంలో కాకుండా   తమ సొంత ప్రయోజనాల కోసం పాలకులు అధికారులకు పోస్టింగులు ఇస్తే  చాలా ప్రమాదమంటున్నారు రాజ్యాంగ నిపుణులు.

టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా ఉధృతి కొంత తగ్గినప్పటికీ ఇంకా ప్రతి రోజు వేలలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ కరోనా మహమ్మారి బారిన పడి కోలుకోగా తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మాత్రం కన్ను మూసారు. తాజాగా ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రీసెంట్ గా అయన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియ చేస్తూ.. తనను కలిసిన నేతలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం పయ్యావుల కేశవ్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

రజనీతో ఆరెస్సెస్ మంత్రాంగం! బీజేపీకి మద్దతిచ్చే ఛాన్స్?  

తమిళనాట కొత్త రాజకీయ పార్టీపై సస్పెన్స్  కొనసాగిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఏడాది క్రితం ప్రకటించిన రజనీకాంత్.. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా పార్టీ విషయం తేల్చలేదు. అయితే ఇటీవలే రజనీకాంత్ పార్టీపై మరో ప్రచారం జరిగింది.  రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రజనీకాంత్ కూడా స్పందించారు. ఆ లేఖ తనది కాదని, కానీ అందులో తన ఆరోగ్యం గురించి ఉన్న సమాచారం నిజమేనని స్పష్టం చేశారు. త్వరలోనే 'రజనీ మక్కల్ మండ్రం' సభ్యులతో చర్చించిన తర్వాత రాజకీయ పార్టీపై అధికారిక ప్రకటన ఉంటుందని రజనీ వెల్లడించారు.   అయితే తాజాగా ఆరెస్సెస్ సిద్ధాంత కర్త, ప్రముఖ ఆర్థికవేత్త ఎస్. గురుమూర్తి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రజనీకాంత్ తో ఆరెస్సెస్ ముఖ్య నేత దాదాపు గంటన్నర పాటు చర్చించారని తెలుస్తోంది.సూపర్‌స్టార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా... బీజేపీకి మద్దతిస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. రాజకీయాల్లోకి రాకూడదనే నిర్ణయంపై పునరాలోచించుకోవాలని గురుమూర్తి రజనీకాంత్‌ను కోరినట్లు సమాచారం. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని రజనీకాంత్‌ను గురుమూర్తి కోరినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా జాతీయ పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటిస్తారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సీటీ రవి సూచన ప్రాయంగా ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి గతంలో రజనీకాంత్‌ పలుమార్లు మద్దతు ప్రకటించారని, బీజేపీ పరిపాలనను పలు సందర్భాల్లో మెచ్చుకున్నారని  ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.    అసెంబ్లీ ఎన్నికల్లోగా రజనీ రాజకీయ ఆరంగేట్రం చేస్తారని, ఎన్నికల్లో ఆయన పార్టీతో పొత్తుపెట్టు కోవాలని బీజేపీ ఎంతో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్రశాఖలో సినీ రంగ ప్రముఖుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం గా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా వెట్రివేల్‌ పేరుతో ప్రచార యాత్ర కూడా చేస్తోంది. రజనీ వృద్ధాప్య సమస్యలు, కరోనా వైరస్‌ కారణంగా పార్టీని ప్రారంభించే ఆలోచన విరమించు కుంటున్నట్టు చేసిన ప్రకటన బీజేపీ నేతలకు తీవ్ర నిరాశను కలిగించింది.అందుకే రజనీకాంత్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆరెస్సెస్ ముఖ్య నేత రజనీకాంత్ తో చర్చలు జరిపారని భావిస్తున్నారు.   రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టకపోయినా.. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన చేసినా సరిపోతుందనే భావనలో తమిళ కమలనాధులు ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే రజనీకాంత్ తో స్టేట్మెంట్ ఇప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి నుంచి మోడీ సర్కార్ కు సానుకూలంగా ఉన్న రజనీకాంత్.. బీజేపీకి మద్దతుగా ప్రకటన చేయవచ్చని అంతా భావిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ తీసుకోబోయే నిర్ణయంపై అధికార అన్నాడీఎంకే, డీఎంకేసు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. రజనీ పార్టీ పెడితే తమకు ప్లస్ అవుతుందని అన్నాడీఎంకే అంచనా వేస్తోంది.

ఏడు నెలల తర్వాత రైట్ రైట్! తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన డీల్       

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రవాణాకు లైన్ క్లియరైంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం ఏపీలో లక్షా  61 వేల 258 కిలోమీటర్ల మేర తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిప్పనుంది. ఇక తెలంగాణలో ఏపీ ఆర్టీసీ లక్షా 60 వేల 999 కిలోమీటర్ల మేర బస్సులు నడపనుంది. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 826 బస్సులు తిప్పనుంది. అలాగే తెలంగాణలో ఏపీ 638 బస్సులు నడపనుంది.   రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల విషయంలో క్లారిటీ రావడంతో దాదాపు ఏడు నెలల తర్వాత ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియ నడుస్తున్నా.. బస్సు సర్వీసులు మాత్రం పునరుద్ధరించబడలేదు. పలుమార్లు ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిపినా ఫలించలేదు. చివరికి చర్చలు కొలిక్కి రావడంతో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.    గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో దాదాపు 2 లక్షల 65 వేల కిలో మీటర్ల తిప్పితే.. తెలంగాణ లక్ష మాత్రమే తిప్పేది. కొత్త ఒప్పందం ప్రకారం దాదాపు ఏపీఎస్‌ఆర్టీసీ లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవడంతో పాటు కొన్ని బస్సులను కూడా తగ్గించింది. కొత్త ప్రతిపాదనలతో ఏపీఎస్‌ఆర్టీసీకి సంవత్సరానికి రూ.270 కోట్ల మేర నష్టం ఉండొచ్చని అంచనా. టీఎస్‌ఆర్టీసీ మాత్రం నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా కారణంగా బస్సులు నడవకపోవడంతో  ఇరు రాష్ట్రాలకు భారీగా నష్టం వాటిల్లింది. అయితే ఏపీకి నడిపే తెలంగాణ ఆర్టీసీ బస్సు చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని, టికెట్ల రేట్లు పెంచడం లేదని ఆ రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

తాగినంత మందు.. పర్సునిండా నోట్లు! దుబ్బాక ఓటర్లకు పండుగ 

తెలంగాణలో కాక రేపుతున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రలోభాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా.. పార్టీలన్ని ఓటర్ల ప్రసన్నం కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గతంలోఎప్పుడు లేనంతగా మందు, మనీ ప్రవాహం సాగుతోందని తెలుస్తోంది.  ఓటర్లకు జోరుగా ప్రలోభాలకు దిగుతున్నాయని చెబుతున్నారు. దీంతో దుబ్బాక నియోయజకవర్గంలో ఎక్కడ చూసినా పార్టీలిచ్చే పంపకాలపైనే చర్చ జరుగుతోంది.    ప్రలోభాల పర్వంలో అధికార పార్టీ అంతా సైలెంట్ గా పని కానిచ్చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రోజుల ముందే గ్రామాలకు డబ్బులు, మందును చేరవేసిన టీఆర్ఎస్ పార్టీ  పక్కా ప్రణాళిక ప్రకారం వాటిని ఓటర్లకు సరఫరా చేస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం యాబై మంది ఓటర్లకో ఇంచార్జ్ ని అధికార పార్టీ నియమించిందని తెలుస్తోంది. కుల సంఘాలు, మహిళా సంఘాలు, రైతులు, యువత .. ఇలా గ్రూపులుగా విడగొట్టి గంపగుత్తగా ఓట్లను  కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీసీలు టీఆర్ఎస్ పార్టీ వాళ్లే ఉన్నారు. దీంతో డబ్బు పంపిణి వారికి ఈజీగా మారిందని చెబుతున్నారు.    దుబ్బాక ఉప ఎన్నిక  ప్రచారంలో అధికార పార్టీకి ధీటుగా కనిపించిన బీజేపీ,,, తాయిలాల విషయంలో మాత్రం వెనకబడిందని చెబుతున్నారు. డబ్బుల పంపిణికి ప్రయత్నాలు చేసినా...  ఆ పార్టీకి వరుస షాకులు తగిలాయి. ఆదివారం హైదరాబాద్ బేగంపేటలో కోటి రూపాయల నగదు పట్టుబడగా.. అది బీజేపీ అభ్యర్థికి సంబంధించిన డబ్బుగా తేలింది. కారులో కోటి రూపాయలు తరలిస్తుండగా పట్టుకున్నామని, దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిదిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ ప్రకటించారు. పోలింగ్ కు కొన్ని గంటల ముందు కోటి రూపాయలు పట్టుబడటంతో బీజేపీ నేతలు షాకయ్యారని చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితమే సిద్ధిపేటలోని రఘునంందన్ రావు మామ ఇంట్లో జరిగిన సోదాల్లో 18 లక్షలు పట్టుబడ్డాయి. అంతకుముందు దుబ్బాక శివారులో పట్టుబడిన  డబ్బుులు కూడా బీజేపీ నేతలవేననే అనుమానాలు ఉన్నాయి. ఇలా వరుసగా షాకులు తగలడంతో బీజేపీ అభ్యర్థికి పంపకాలు కష్టంగా మారాయనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.    దుబ్బాకపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా పంపకాలను భారీగానే చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే  అన్ని గ్రామాల్లో బలమైన నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్ కు కొంత ఇబ్బంది అవుతుందని తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రచారాన్ని హోరెత్తించిన నేతలంతా వెళ్లిపోవడం, లోకల్ లీడర్లు అంతంతమాత్రంగానే ఉండటంతో .. ప్రజల్లో తమవైపు సానుకూలత ఉన్నా.. ఓటుగా మలుచుకోలేకపోతున్నామనే ఆందోళన హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది.    దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు  పోలీసుల తనిఖీల్లో దాదాపు 2 కోట్ల వరకు నగదు దొరకగా... అందులో ఎక్కువ భాగం విపక్ష పార్టీలకు సంబంధించిన నేతల దగ్గరే దొరికిందని తెలుస్తోంది. దీనిపైనే పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. అదికార పార్టీ నేతలు దర్జాగా  డబ్బులను తరలిస్తున్నా, ఓటర్లకు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష నేతలపై మాత్రం నిఘా పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు , స్థానికుల అధికారుల సహకారంతో గులాబీ నేతలు గుట్టుగా ప్రలోభాల పర్వం కొనసాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

దిశా చట్టానికే దిక్కు లేదు! ఈ నేరాలు, ఘోరాలు ఆపేదెవరు?

దిశ పోలీస్ స్టేషన్లు దిక్కు లేకుండా పోయాయా? దిశా చట్టం అటకెక్కిందా? నేరాలు, ఘోరాలను భరించాల్సిందేనా?. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తున్న సూటి ప్రశ్నలవి. ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న దారుణ ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు అద్భుతుంగా ఉన్నాయని, గతంలో కంటే క్రైమ్ రేట్ 18 శాతం తగ్గిందని వైసీపీ నేతలు గొప్పలు చెప్పకుంటుండగా... క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. రోజూ ఎదో ఒక చోటు దారుణం జరుగుతూనే ఉంది. మహిళలు, పిల్లలపై అమానుష ఘటనలు వెలుగు చూస్తున్నాయి . దారుణ హత్యలు జరుగుతున్నాయి.     విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థినిని ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి హత్యచేసిన దుర్మార్గాన్ని మరిచిపోకముందే విశాఖపట్నంలో మరో కిరాతకం జరిగింది. గాజువాకలో వరలక్ష్మి అనే విద్యార్థినిని అఖిల్ వెంకటసాయి అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. విశాఖ నగరం నడిరోడ్డుపై యువతి గొంతు ను కత్తితో కోసి దారుణానికి ఒడిగట్టాడు. కొన్నిరోజుల కిందట విజయవాడలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అంతకుముందు కుడా రాష్ట్రంలో దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దళితులపై దాడులు, శిరోముండనాల కేసులు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. న్యాయం కోసం  స్టేషన్ కు వచ్చిన వారిపై పోలీసులే శిరోముండనం వేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.    రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణే  లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.  దిశ చట్టం చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం అని ప్రకటనలు చేసి ప్రచారం చేసుకున్న పాలకులు రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులకు ఏం సమాధానం చెబుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.  చట్టాలు చేశామని చేతులు దులుపుకుంటే ఏమిటి ప్రయోజనం అని పేర్కొన్నారు. దిశ చట్టం ఇప్పటికీ అమల్లోకి రాకపోవడానికి కారణం ఏంటో ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. దిశ చట్టం అమలులోకి  తెచ్చామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు.. వరుసగా జరుగుతున్న ఘటనలకు బాధ్యతగా  సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.   ప్రభుత్వ అసమర్దత వల్లే ఇలాంటి  ఘటనలు జరుగుతున్నాయని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యమాలు, ఆందోళనలను  అణచివేయడంలో ఉక్కుపాదం మోపుతున్న ఏపీ సర్కారు ఇతర అసాంఘిక శక్తులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందని నిలదీస్తున్నారు. విద్యార్థినులు, యువతులు, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించకూడదని హితవు పలికారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరి చేయాలని, యువతులకు, మహిళలకు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు.  

సీజేఐకి అన్ని విషయాలు తెలుసు: అటార్నీ జనరల్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ పై కోర్టు ధిక్కారం కేసు నమోదుకు అనుమతి కోరుతూ భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు ఢిల్లీకి చెందిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ రాసిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సీజేఐకి రాసిన లేఖను బహిర్గతం చేయడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని అన్నారు. జగన్ పై 31 కేసులు ఉన్నాయని, ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి జస్టిస్‌ ఎన్వీ రమణ తీర్పు ఇచ్చిన తర్వాత.. జగన్ ఈ లేఖ రాయడం అనేక అనుమానాలకు దారి తీస్తోందన్నారు.    కాగా, ఈ లేఖపై స్పందిస్తూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తాజాగా అశ్వినీ ఉపాధ్యాయకు  ప్రత్యుత్తరం ఇచ్చారు. సీఎం జగన్ పై కోర్టు ధిక్కారం కేసు నమోదు కోసం తాను అనుమతి ఇవ్వలేనని స్పష్టం చేశారు. అన్ని విషయాలు సీజేఐకి తెలుసని, అందుకే ప్రత్యేకంగా కోర్టు ధిక్కారం కోసం తాను అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు.

ధరణిలో సమస్యలు.. ఆందోళనలో జనాలు! గ్లోబరీనా ముంచుతుందా? 

అందరూ భయపడుతున్నట్లే జరుగుతోంది.. విపక్షాల అనుమానాలే బలపడుతున్నాయి.. రైతుల ఆందోళనే నిజమవుతోంది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన, సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న ధరణి పోర్టల్ దరిద్రంగా ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో  ప్రారంభించగా.. ఇవాళ్టి నుంచి అధికారికంగా సేవలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే అధికారులకు చుక్కలు చూపిస్తోంది ధరణి పోర్టల్. సాంకేతిక లోపాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఓపెన్ కావడం లేదని తెలుస్తోంది. ఓపెనా అయినా కొన్నివివరాలను చూపించడం లేదంటున్నారు.    శంషాబాద్‌లోని తహసీల్దార్‌ ఆఫీసులో ధరణి సేవలను సీఎస్ సోమేష్ కుమార్ ప్రారంభించారు. అపరేటర్ దగ్గర కూర్చుని పరిశీలించారు సీఎస్. అయితే  ప్రారంభమైన వెంటనే ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. మండల ఆఫీసులోని ఆపరేటర్ దగ్గర కూడా ధరణి పోర్టల్‌ ఓపెన్ కాలేదు. రంగారెడ్డి జిల్లా మొత్తంలో కేవలం ఐదు స్లాట్ల బుకింగ్‌ మాత్రమే ఉంది. గండిపేట తహసీల్దార్‌ కార్యాలయంలో స్లాట్‌లు బుకింగ్‌ అవడం లేదు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రారంభించిన తహసీల్దార్‌ ఆఫీసులోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ధరణి వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో రైతుల ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం నుంచే ఈ-సేవా కేంద్రాల వద్ద రైతులు క్యూ కట్టారు.    రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ధరణి వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో రైతులు, భూములున్నవారు ఆందోళన చెందుతున్నారు. అస్తవ్యస్థంగా ఉన్న ధరణి పోర్టల్ తో తమ భూముల లెక్క తప్పుగా వస్తుందోమోనన్నఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు కూడా చేస్తున్నారట. చాలాకాలంగా రిజిస్ట్రేషన్లు నిలచిపోవడంతో రియల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధరణి సేవలు ప్రారంభం కావడంతో రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతోంది. సాంకేతిక సమస్యలతో రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తుందేమోనని వారు ఆవేదన చెందుతున్నారు.                       నిజానికి ధరణి  పోర్టల్ పై మొదటి నుంచి అనుమానాలు, అభ్యంతరాలు వస్తున్నాయి. ప్రజల భూములకు సంబంధించిన సమాచారం ఉండే రెవిన్యూ శాఖ పోర్టల్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేట్ సంస్థ అక్రమాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు  ఎదుర్కొవాల్సి వస్తుందని కొందరు రెవిన్యూ నిపుణులు కూడా హెచ్చరించారు. ప్రజల భూములను తనఖా పెట్టి ప్రైవేట్ సంస్థ రుణాలు తీసుకోదనే గ్యారంటీ ఏంటని ప్రతి పక్ష నేతలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయినా ప్రభుత్వం అలాగే ముందుకెళ్లింది. ఇప్పుడు ప్రజలు భయపడ్డట్టే జరుగుతుండటంతో ధరణి పోర్టల్ భద్రతపై ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.   ధరణి పోర్టల్ కు సంబంధించి మరో విషయం కూడా వెలుగులోకి వస్తోంది. గత సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తప్పులకు కారణమైన గ్లోబరీనా సంస్థే ధరణి పోర్టల్ ను తయారు చేసిందని చెబుతున్నారు.గ్లోబరీనా చేసిన నిర్వాకంతో ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా  లక్షలాదిమంది విద్యార్థులు సతమతమయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ కారణంగా మనస్తాపంతో 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఇంటర్ ఫలితాల నిర్వహణ బాధ్యతను గ్లోబరీనా సంస్థకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అనుభవంలేని సంస్థకు మూల్యాంకన బాధ్యతలు అప్పగించిన కారణంగానే ఇబ్బందులు తలెత్తాయనే ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా ..  టెండర్ల నుంచి ఫలితాలు వెల్లడి దాకా జరిగిన అన్ని ఘటనలపై సమగ్ర విచారణ జరిపి  పొరబాట్లలో గ్లోబరీనాకు బాధ్యత ఉందని తేల్చింది.   ఇంటర్ ఫలితాల నిర్వహణలో ఘోరంగా విఫలమై కొందరు విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనాకు అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. తమ ఆస్తులపై ప్రజలు, రైతులు కలవరపడుతున్నారు. పోర్టల్ లో తప్పులు జరిగితే భూముల లెక్కలన్ని తారుమారయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆస్తులతో కేసీఆర్ సర్కార్ చెలగాటమాడుతుందని వారు ఆరోపిస్తున్నారు. ధరణి ద్వారా ఏమైనా తప్పులు జరిగితే అందుకే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.