బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణల నేపథ్యంలో మొదలైన దుబ్బాక పొలింగ్..
posted on Nov 3, 2020 9:24AM
తెలంగాణలో ఎంతో ఉత్కంఠ రేపుతున్న దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ కొద్దీ సేపటి క్రితం మొదలైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు మెల్లగా చేరుకుంటున్నారు. ఐతే కరోనా నేపథ్యంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటు వేసేందుకు వస్తున్న వారికి సానిటైజర్, గ్లౌజులు, మాస్కులు అందజేస్తున్నారు. మరో పక్క థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే ఓటు వేసేందుకు లోనికి అనుమతిస్తున్నారు. అలాగే అవసరమైన వారికీ మందులను కూడా అందుబాటులో ఉంచారు.
ఇదిలాఉండగా, ఉప ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు జరిగిన నేపథ్యంలో.. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత దుబ్బాక మండలం చిట్టాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో పక్క బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాక మండలం బొప్పాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.