వాళ్లతో జాగ్రత్త.. ట్రస్ట్ ఆస్తులు కొట్టేయగలరు.. రఘురామరాజు సంచలన కామెంట్స్  

కొన్ని నెలల క్రితం మాన్సస్ ట్రస్ట్ చైర్‌పర్సన్ గా సంచయిత బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఆమెను నిత్యం వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ట్రస్ట్ కింద ఉన్న భూముల దగ్గర నుండి ఎంఆర్ కాలేజీ వరకు అన్ని నిర్ణయాలు వివాదానికి దారి తీస్తున్నాయి. అయితే తాజాగా సంచయిత గురించి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఈరోజు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆనంద్ గజపతి రాజు నుండి సంచయిత తల్లి ఉమా గజపతి రాజు విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఢిల్లీ వెళ్లిపోయారన్నారు. ఆ తరువాత కొద్దిరోజులకే ఉమ... రమేశ్ శర్మ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారని తెలిపారు. ఇదే విషయాన్నీ 2013 నవంబర్‌లో సంచయిత రాసిన ఒక ఆర్టికల్ లో పేర్కొన్నారని అయన తెలిపారు. అంతేకాకుండా ఢిల్లీలో చదువుకున్న సంచయిత.. తన తల్లిదండ్రుల గురించి ఆ ఆర్టికల్‌లో చాలా స్పష్టంగా తెలిపిందని, ఆమె తన స్కూల్ రికార్డులలో కూడా తన తండ్రి పేరు రమేశ్ శర్మ అని రాశారని అయన అన్నారు.   మరో పక్క "సంచయిత తల్లితో విడాకులు అయ్యాక ఆనంద గజపతి రాజు విజయనగరానికి చెందిన సుధా రాజును వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా ఆనంద గజపతి రాజు, సుధా రాజు లకు పుట్టిన అమ్మాయి ఊర్మిళా గజపతి రాజునే వారసురాలిగా ప్రకటిస్తూ వీలునామాలో ఆనంద గజపతి రాజు రాశారు. అయితే ఆనంద గజపతి రాజు చనిపోతే కనీసం చూడడానికి కూడా సంచయిత, ఆమె తల్లి రాలేదని.. అలా వారు పూర్తిగా ఆ కుటుంబానికి దూరం అయ్యారని అయన తెలిపారు. గత కొద్ది రోజులుగా వివాదాల నేపథ్యంలో ఊర్మిళ గజపతి రాజు టీవీలలో మాట్లాడుతూ... సంచయిత వివాదంపై కోర్టుకు వెళుతున్నట్టు తెలిపింది. అయినా సంచయిత ఇలా అకస్మాత్తుగా వచ్చి కలహాలు పెట్టడం సరికాదు. విజయనగర రాజా కుటుంబానికి చెందిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అవమానించే కుసంస్కారం రాజవంశీయులకైతే అసలు ఉండదు. ఎవరి అండో చూసుకుని సంచయిత చెలరేగిపోతే... రేపో మాపో కోర్టు ఆదేశాలు కూడా వస్తాయి. కాబట్టి అమ్మా సంచయితా.. నిన్ను అడ్డుపెట్టుకుని ఆస్తులను చేజిక్కించుకోవడానికి.. పంచ గ్రామాల్లోనే కాదు.. మాన్సస్ ట్రస్టుకు చెందిన ఆస్తులను కాజేయడానికి కొంత మంది చూస్తున్నారు. వారి ట్రాప్‌లో పడొద్దు. ట్రస్ట్ ఆస్తులు రక్షించుకోండి’’ అని రఘురామ రాజు హితవు పలికారు.

జగన్ సర్కార్ కు హైకోర్టులో మరో ఎదురు దెబ్బ.. 

ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ అడ్మిషన్లపై జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇంటర్మీడియట్‌లో ఆన్‌లైన్ అడ్మిషన్లు చేయాలంటూ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది. రెండు సంవ‌త్స‌రాల ఇంట‌ర్మీడియ‌ట్ కోర్సులో వొకేష‌న‌ల్, జ‌న‌ర‌ల్ కోర్సుల‌లో ప్ర‌వేశాల‌కు ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తులు స్వీకరించింది. దీన్ని కొంత‌మంది హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. దీని పై విచార‌ణ సంద‌ర్భంగా ఏపీ విద్యాశాఖ‌పై హైకోర్టు ప్ర‌శ్నల వర్షం కురిపించింది. ఏ చ‌ట్టం, ఏ రూల్ ప్ర‌కారం ఈ అడ్మిషన్ల ప్ర‌క్రియ చేప‌ట్టార‌ని సూటిగా ప్ర‌శ్నించింది. విద్యార్థులు ఏ కాలేజీలో చేరాలనేది వారి ఇష్టానికి వదిలేయాలని.. అసలు ప్రభుత్వమే కాలేజీలను ఎలా కేటాయిస్తుందని పిటిషనర్లు వాదించారు. దీంతో 10 రోజుల పాటు జీవోను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై త‌దుప‌రి విచార‌ణ‌ను న‌వంబ‌ర్ 9కు వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

రిటైరవుతున్నానంటూ షాక్ ఇచ్చిన పీవీ సింధు! అసలు ట్విస్ట్ ఇది!

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఒక్కసారిగా షాకిచ్చారు. తాను రిటైరవుతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరూ అవాక్కయ్యేలా చేశారు. అయితే ఆమె పెట్టిన పోస్టును మొత్తం చదివితే అసలు ట్విస్ట్ తెలిసింది. ఆమె రిటైరవుతున్నది క్రీడ నుంచి కాదని, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణం నుంచని అర్ధమవుతుంది. తన లేఖ మొత్తం చదివితే తాను తీసుకున్న నిర్ణయం సబబేనని అందరూ అంగీకరిస్తారని సింధు తన ప్రకటనలో తెలిపింది. సింధూ తన అభిప్రాయాన్ని పోస్టులో తెలిపినా.. దాన్ని మొత్తం చదవని వారు మాత్రం గందరగోళానికి గురయ్యారు.    పీవీ సింధు చేసిన పోస్టులో ఇలా ఉంది. "ఈ లేఖ మొదట్లో మీరు షాక్ అవుతారు, అయోమయానికి గురవుతారు. లేఖ పూర్తిగా చదివిన పిమ్మట మీరు కూడా నాతో అంగీకరిస్తారనుకుంటున్నా. ఈ కరోనా మహమ్మారి నాకో కనువిప్పు. కఠినమైన ప్రత్యర్థులను ఓడించేందుకు కఠోరంగా సాధన చేయొచ్చు. మ్యాచ్ లో చివరి షాట్ వరకు హోరాహోరీగా పోరాడవచ్చు. గతంలో నేను ఇలా చేశాను కూడా. కానీ ప్రపంచాన్నంతటినీ కట్టిపడేస్తున్న ఈ కంటికి కనిపించని వైరస్ మహమ్మారితో పోరాడడం ఎలా?   నెలల తరబడి ఇంట్లోనే ఉన్నాం, బయటికి వచ్చే ప్రతిసారి భయపడాల్సిన పరిస్థితి! కరోనా పరిస్థితుల నేపథ్యంలో హృదయాలు ద్రవించే గాథలు వింటున్నాం. అయితే నేను ప్రస్తుతం నెలకొని ఉన్న అనిశ్చితి నుంచి రిటైరవ్వాలని భావిస్తున్నా. ఈ ప్రతికూల వాతావరణం నుంచి రిటైరవుతున్నా. వదలక వెంటాడుతున్న భయం, సందిగ్ధత నుంచి రిటైర్ అవుతున్నా. ముఖ్యంగా, మన నాసిరకం పరిశుభ్రతా ప్రమాణాల నుంచి రిటైర్ అవుతున్నా, వైరస్ అంటే ఏముందిలే అనే నిర్లక్ష్య ధోరణి నుంచి రిటైర్ అవుతున్నా.. నికార్సయిన పోరాటం లేకుండా మ్యాచ్ ను అప్పగించడం నాకు తెలియదు. ఇప్పుడు కరోనా విషయంలోనూ అంతే. ఇదే పోరాటాన్ని నేను, మనం సురక్షితమైన ప్రపంచం సాకారమయ్యేదాకా కొనసాగిద్దాం" అంటూ సింధు సుదీర్ఘ ప్రకటన చేసింది.

కులపోళ్లకే కీలక పోస్టులు! అక్కడా ఇక్కడా సేమ్ టు సేమ్

తెలుగు రాష్ట్రాల పాలనలో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వంలోని కీలకమైన పోస్టుల్లో అధికారుల అనుభవం, పని తీరు కాకుండా తన అనుకున్న వారికే అందలం ఎక్కిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇదీ మరీ ఎక్కువైందంటున్నారు. తన అనుకున్నవారితోనే ఆగకుండా ఇప్పుడు ఏకంగా తన కులానికి చెందిన వారికే  ముఖ్యమైన పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తెలంగాణలో తాజాగా  ప్రభాకర్‌రావును స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టే  ప్రభాకర్‌రావును స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.              కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ అధికారులను కీలక పోస్టులలో నింపుతున్నారనే విమర్శలు చాలా కాలంగా వస్తున్నాయి.  సీఐడీ, ఏసీబీ, విజిలెన్స్  వంటి కీలక విభాగాల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని, టీఆర్ఎస్ ను విమర్శించే కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసేందుకే ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్ శాఖల్లో తన వారిని ముఖ్యమంత్రి నియమించుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దీనిపై చాలా సార్లు గట్టిగానే మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే నేతలపై అక్రమ కేసులు పెట్ట జైలుకు పంపాలనే కుట్రలో భాగంగానే కేసీఆర్.. ఈ మూడు విభాగాలను తనవారితో నింపేశారని ఆరోపించారు.    తెలంగాణలో ఇప్పటికే చాలా మంది అధికారులను పదవి కాలం ముగిసినా కొనసాగిస్తున్నారు.  రిటైరై ఎక్స్ టెన్షన్ లో ఉన్నవాళ్లు, కన్సల్టెంట్లుగా నియమించినవాళ్లు దాదాపు 500 మంది వరకు ఉన్నట్లు అంచనా. వీళ్లే కాకుండా అన్ని శాఖలు, కమిషనరేట్లు, హెచ్.ఓ.డి. కార్యాలయాలు, జిల్లాల్లో చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో ఎక్కువ మంది ఒక సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారనే అరోపణలు వస్తున్నాయి. తనకు నచ్చిన వారిని కీలక పోస్టుల్లో నియమించడం.. నచ్చకపోతే లూప్ లైన్ లో పెట్టడం కూడా  జరుగుతుందనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి.    పోస్టింగుల్లో తమపై వివక్ష చూపుతున్నారంటూ గతంలో కొందరు ఐఏఎస్ లు ప్రత్యేకంగా సమావేశం పెట్టి సీఎస్ కు వినతిపత్రం ఇవ్వడం కలకలం రేపింది. పరిపాలనలో కీలక పాత్ర పోషించే ఐఏఎస్‌కూ వివక్ష తప్పడం లేదని, పదవుల నియామకంలో వివక్ష చూసి ప్రాధాన్యత లేని పోస్టింగులిస్తున్నారని ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కొందరు ఐఏఎస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.  సీనియారిటీ, అను భవం ప్రాతిపదికన కాకుండా ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తున్న కొందరి వల్ల అనుభవం లేకపోయినా ఒక సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు  ఐఏఎస్‌లు ఆరోపిస్తున్నారు.                ఆంధ్రప్రదేశ్ లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉందనే చర్చ జరుగుతోంది.  రాష్ట్రంలో  ఏ ప్రాధాన్యమైన పోస్టు ఖాళీగా ఉన్నా అది రెడ్లకే ఇవ్వడం జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందనే ప్రచారం జరుగుతోంది. జగన్ సర్కార్ వచ్చాకా భర్తీ చేసిన కీలక పోస్టుల్లో మెజార్టీ ఆ సామాజిక వర్గానికే దక్కాయనే ఆరోపణలు ఉన్నాయి. టీటీడీ చైర్మెన్ గా, అదనపు ఈవోగా రెడ్లు ఉండగానే.. టీటీడీ ఈవోగా జవహర్ రెడ్డిని నియమించడం దుమారం రేపింది. ఏపీలో కీలకమైన పోస్టులన్ని ఆ సామాజిక వర్గానికే కట్టబెడుతూ..టీడీపీ అధినేత చంద్రబాబు వర్గానికి చెందిన అధికారులను లూప్ లైన్ లో వేస్తున్నారు. సిన్సియర్ అధికారులుగా పేరున్న వారిని అప్రాధాన్య శాఖలకు తరలించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.    తెలుగు రాష్ట్రాల పాలనలో నెలకొన్న పరిస్థితులపై బ్యూరోకాట్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి మంచిది కాదనే చర్చ జరుగుతోంది. పనితీరు ప్రామాణికంగా తీసుకోకుండా పోస్టింగులు ఇస్తే ఐఏఎస్ ల్లో జవాబుదారి తనం లోపిస్తుందని మేథావులు హెచ్చరిస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు ఇలా  చేసుకుంటూ పోతే పాలనంతా గాడి తప్పుతుందని, ప్రజాసంక్షేమం మూలకు పడుతుందని చెబుతున్నారు. ప్రజల కోణంలో కాకుండా   తమ సొంత ప్రయోజనాల కోసం పాలకులు అధికారులకు పోస్టింగులు ఇస్తే  చాలా ప్రమాదమంటున్నారు రాజ్యాంగ నిపుణులు.

టీడీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా ఉధృతి కొంత తగ్గినప్పటికీ ఇంకా ప్రతి రోజు వేలలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో సామాన్య ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ కరోనా మహమ్మారి బారిన పడి కోలుకోగా తిరుపతి ఎంపీ దుర్గా ప్రసాద్ మాత్రం కన్ను మూసారు. తాజాగా ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రీసెంట్ గా అయన టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియ చేస్తూ.. తనను కలిసిన నేతలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం పయ్యావుల కేశవ్ హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.

రజనీతో ఆరెస్సెస్ మంత్రాంగం! బీజేపీకి మద్దతిచ్చే ఛాన్స్?  

తమిళనాట కొత్త రాజకీయ పార్టీపై సస్పెన్స్  కొనసాగిస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఏడాది క్రితం ప్రకటించిన రజనీకాంత్.. ఎన్నికల సమయం దగ్గరపడుతున్నా పార్టీ విషయం తేల్చలేదు. అయితే ఇటీవలే రజనీకాంత్ పార్టీపై మరో ప్రచారం జరిగింది.  రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నారని ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై రజనీకాంత్ కూడా స్పందించారు. ఆ లేఖ తనది కాదని, కానీ అందులో తన ఆరోగ్యం గురించి ఉన్న సమాచారం నిజమేనని స్పష్టం చేశారు. త్వరలోనే 'రజనీ మక్కల్ మండ్రం' సభ్యులతో చర్చించిన తర్వాత రాజకీయ పార్టీపై అధికారిక ప్రకటన ఉంటుందని రజనీ వెల్లడించారు.   అయితే తాజాగా ఆరెస్సెస్ సిద్ధాంత కర్త, ప్రముఖ ఆర్థికవేత్త ఎస్. గురుమూర్తి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రజనీకాంత్ తో ఆరెస్సెస్ ముఖ్య నేత దాదాపు గంటన్నర పాటు చర్చించారని తెలుస్తోంది.సూపర్‌స్టార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకపోయినా... బీజేపీకి మద్దతిస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. రాజకీయాల్లోకి రాకూడదనే నిర్ణయంపై పునరాలోచించుకోవాలని గురుమూర్తి రజనీకాంత్‌ను కోరినట్లు సమాచారం. వచ్చే తమిళనాడు ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని రజనీకాంత్‌ను గురుమూర్తి కోరినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా జాతీయ పార్టీ బీజేపీకి మద్దతు ప్రకటిస్తారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సీటీ రవి సూచన ప్రాయంగా ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి గతంలో రజనీకాంత్‌ పలుమార్లు మద్దతు ప్రకటించారని, బీజేపీ పరిపాలనను పలు సందర్భాల్లో మెచ్చుకున్నారని  ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.    అసెంబ్లీ ఎన్నికల్లోగా రజనీ రాజకీయ ఆరంగేట్రం చేస్తారని, ఎన్నికల్లో ఆయన పార్టీతో పొత్తుపెట్టు కోవాలని బీజేపీ ఎంతో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్రశాఖలో సినీ రంగ ప్రముఖుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం గా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా వెట్రివేల్‌ పేరుతో ప్రచార యాత్ర కూడా చేస్తోంది. రజనీ వృద్ధాప్య సమస్యలు, కరోనా వైరస్‌ కారణంగా పార్టీని ప్రారంభించే ఆలోచన విరమించు కుంటున్నట్టు చేసిన ప్రకటన బీజేపీ నేతలకు తీవ్ర నిరాశను కలిగించింది.అందుకే రజనీకాంత్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆరెస్సెస్ ముఖ్య నేత రజనీకాంత్ తో చర్చలు జరిపారని భావిస్తున్నారు.   రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టకపోయినా.. బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన చేసినా సరిపోతుందనే భావనలో తమిళ కమలనాధులు ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే రజనీకాంత్ తో స్టేట్మెంట్ ఇప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి నుంచి మోడీ సర్కార్ కు సానుకూలంగా ఉన్న రజనీకాంత్.. బీజేపీకి మద్దతుగా ప్రకటన చేయవచ్చని అంతా భావిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్ తీసుకోబోయే నిర్ణయంపై అధికార అన్నాడీఎంకే, డీఎంకేసు ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. రజనీ పార్టీ పెడితే తమకు ప్లస్ అవుతుందని అన్నాడీఎంకే అంచనా వేస్తోంది.

ఏడు నెలల తర్వాత రైట్ రైట్! తెలుగు రాష్ట్రాల మధ్య కుదిరిన డీల్       

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రవాణాకు లైన్ క్లియరైంది. ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చలు ఎట్టకేలకు సఫలమయ్యాయి. ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం ఏపీలో లక్షా  61 వేల 258 కిలోమీటర్ల మేర తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిప్పనుంది. ఇక తెలంగాణలో ఏపీ ఆర్టీసీ లక్షా 60 వేల 999 కిలోమీటర్ల మేర బస్సులు నడపనుంది. ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 826 బస్సులు తిప్పనుంది. అలాగే తెలంగాణలో ఏపీ 638 బస్సులు నడపనుంది.   రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసుల విషయంలో క్లారిటీ రావడంతో దాదాపు ఏడు నెలల తర్వాత ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియ నడుస్తున్నా.. బస్సు సర్వీసులు మాత్రం పునరుద్ధరించబడలేదు. పలుమార్లు ఇరు రాష్ట్రాల అధికారులు చర్చలు జరిపినా ఫలించలేదు. చివరికి చర్చలు కొలిక్కి రావడంతో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.    గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ తెలంగాణలో దాదాపు 2 లక్షల 65 వేల కిలో మీటర్ల తిప్పితే.. తెలంగాణ లక్ష మాత్రమే తిప్పేది. కొత్త ఒప్పందం ప్రకారం దాదాపు ఏపీఎస్‌ఆర్టీసీ లక్ష కిలోమీటర్లు తగ్గించుకోవడంతో పాటు కొన్ని బస్సులను కూడా తగ్గించింది. కొత్త ప్రతిపాదనలతో ఏపీఎస్‌ఆర్టీసీకి సంవత్సరానికి రూ.270 కోట్ల మేర నష్టం ఉండొచ్చని అంచనా. టీఎస్‌ఆర్టీసీ మాత్రం నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా కారణంగా బస్సులు నడవకపోవడంతో  ఇరు రాష్ట్రాలకు భారీగా నష్టం వాటిల్లింది. అయితే ఏపీకి నడిపే తెలంగాణ ఆర్టీసీ బస్సు చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని, టికెట్ల రేట్లు పెంచడం లేదని ఆ రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.

తాగినంత మందు.. పర్సునిండా నోట్లు! దుబ్బాక ఓటర్లకు పండుగ 

తెలంగాణలో కాక రేపుతున్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రలోభాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా.. పార్టీలన్ని ఓటర్ల ప్రసన్నం కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గతంలోఎప్పుడు లేనంతగా మందు, మనీ ప్రవాహం సాగుతోందని తెలుస్తోంది.  ఓటర్లకు జోరుగా ప్రలోభాలకు దిగుతున్నాయని చెబుతున్నారు. దీంతో దుబ్బాక నియోయజకవర్గంలో ఎక్కడ చూసినా పార్టీలిచ్చే పంపకాలపైనే చర్చ జరుగుతోంది.    ప్రలోభాల పర్వంలో అధికార పార్టీ అంతా సైలెంట్ గా పని కానిచ్చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రోజుల ముందే గ్రామాలకు డబ్బులు, మందును చేరవేసిన టీఆర్ఎస్ పార్టీ  పక్కా ప్రణాళిక ప్రకారం వాటిని ఓటర్లకు సరఫరా చేస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం యాబై మంది ఓటర్లకో ఇంచార్జ్ ని అధికార పార్టీ నియమించిందని తెలుస్తోంది. కుల సంఘాలు, మహిళా సంఘాలు, రైతులు, యువత .. ఇలా గ్రూపులుగా విడగొట్టి గంపగుత్తగా ఓట్లను  కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీసీలు టీఆర్ఎస్ పార్టీ వాళ్లే ఉన్నారు. దీంతో డబ్బు పంపిణి వారికి ఈజీగా మారిందని చెబుతున్నారు.    దుబ్బాక ఉప ఎన్నిక  ప్రచారంలో అధికార పార్టీకి ధీటుగా కనిపించిన బీజేపీ,,, తాయిలాల విషయంలో మాత్రం వెనకబడిందని చెబుతున్నారు. డబ్బుల పంపిణికి ప్రయత్నాలు చేసినా...  ఆ పార్టీకి వరుస షాకులు తగిలాయి. ఆదివారం హైదరాబాద్ బేగంపేటలో కోటి రూపాయల నగదు పట్టుబడగా.. అది బీజేపీ అభ్యర్థికి సంబంధించిన డబ్బుగా తేలింది. కారులో కోటి రూపాయలు తరలిస్తుండగా పట్టుకున్నామని, దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బావమరిదిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ ప్రకటించారు. పోలింగ్ కు కొన్ని గంటల ముందు కోటి రూపాయలు పట్టుబడటంతో బీజేపీ నేతలు షాకయ్యారని చెబుతున్నారు. నాలుగు రోజుల క్రితమే సిద్ధిపేటలోని రఘునంందన్ రావు మామ ఇంట్లో జరిగిన సోదాల్లో 18 లక్షలు పట్టుబడ్డాయి. అంతకుముందు దుబ్బాక శివారులో పట్టుబడిన  డబ్బుులు కూడా బీజేపీ నేతలవేననే అనుమానాలు ఉన్నాయి. ఇలా వరుసగా షాకులు తగలడంతో బీజేపీ అభ్యర్థికి పంపకాలు కష్టంగా మారాయనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది.    దుబ్బాకపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా పంపకాలను భారీగానే చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే  అన్ని గ్రామాల్లో బలమైన నాయకత్వం లేకపోవడంతో కాంగ్రెస్ కు కొంత ఇబ్బంది అవుతుందని తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ప్రచారాన్ని హోరెత్తించిన నేతలంతా వెళ్లిపోవడం, లోకల్ లీడర్లు అంతంతమాత్రంగానే ఉండటంతో .. ప్రజల్లో తమవైపు సానుకూలత ఉన్నా.. ఓటుగా మలుచుకోలేకపోతున్నామనే ఆందోళన హస్తం నేతల్లో వ్యక్తమవుతోంది.    దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు  పోలీసుల తనిఖీల్లో దాదాపు 2 కోట్ల వరకు నగదు దొరకగా... అందులో ఎక్కువ భాగం విపక్ష పార్టీలకు సంబంధించిన నేతల దగ్గరే దొరికిందని తెలుస్తోంది. దీనిపైనే పోలీసులపై ఆరోపణలు వస్తున్నాయి. అదికార పార్టీ నేతలు దర్జాగా  డబ్బులను తరలిస్తున్నా, ఓటర్లకు పంచుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష నేతలపై మాత్రం నిఘా పెట్టారని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు , స్థానికుల అధికారుల సహకారంతో గులాబీ నేతలు గుట్టుగా ప్రలోభాల పర్వం కొనసాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

దిశా చట్టానికే దిక్కు లేదు! ఈ నేరాలు, ఘోరాలు ఆపేదెవరు?

దిశ పోలీస్ స్టేషన్లు దిక్కు లేకుండా పోయాయా? దిశా చట్టం అటకెక్కిందా? నేరాలు, ఘోరాలను భరించాల్సిందేనా?. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి వస్తున్న సూటి ప్రశ్నలవి. ఆంధ్రప్రదేశ్ లో వరుసగా జరుగుతున్న దారుణ ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు అద్భుతుంగా ఉన్నాయని, గతంలో కంటే క్రైమ్ రేట్ 18 శాతం తగ్గిందని వైసీపీ నేతలు గొప్పలు చెప్పకుంటుండగా... క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితి మాత్రం దారుణంగా తయారైంది. రోజూ ఎదో ఒక చోటు దారుణం జరుగుతూనే ఉంది. మహిళలు, పిల్లలపై అమానుష ఘటనలు వెలుగు చూస్తున్నాయి . దారుణ హత్యలు జరుగుతున్నాయి.     విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థినిని ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి హత్యచేసిన దుర్మార్గాన్ని మరిచిపోకముందే విశాఖపట్నంలో మరో కిరాతకం జరిగింది. గాజువాకలో వరలక్ష్మి అనే విద్యార్థినిని అఖిల్ వెంకటసాయి అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. విశాఖ నగరం నడిరోడ్డుపై యువతి గొంతు ను కత్తితో కోసి దారుణానికి ఒడిగట్టాడు. కొన్నిరోజుల కిందట విజయవాడలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిని ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అంతకుముందు కుడా రాష్ట్రంలో దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దళితులపై దాడులు, శిరోముండనాల కేసులు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. న్యాయం కోసం  స్టేషన్ కు వచ్చిన వారిపై పోలీసులే శిరోముండనం వేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.    రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణే  లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి.  దిశ చట్టం చేశాం, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం అని ప్రకటనలు చేసి ప్రచారం చేసుకున్న పాలకులు రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న దాడులకు ఏం సమాధానం చెబుతారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.  చట్టాలు చేశామని చేతులు దులుపుకుంటే ఏమిటి ప్రయోజనం అని పేర్కొన్నారు. దిశ చట్టం ఇప్పటికీ అమల్లోకి రాకపోవడానికి కారణం ఏంటో ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. దిశ చట్టం అమలులోకి  తెచ్చామని చెబుతున్న వైసీపీ ప్రభుత్వ పెద్దలు.. వరుసగా జరుగుతున్న ఘటనలకు బాధ్యతగా  సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.   ప్రభుత్వ అసమర్దత వల్లే ఇలాంటి  ఘటనలు జరుగుతున్నాయని టీడీపీ, జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యమాలు, ఆందోళనలను  అణచివేయడంలో ఉక్కుపాదం మోపుతున్న ఏపీ సర్కారు ఇతర అసాంఘిక శక్తులను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతుందని నిలదీస్తున్నారు. విద్యార్థినులు, యువతులు, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించకూడదని హితవు పలికారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరి చేయాలని, యువతులకు, మహిళలకు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరి చేయాలని సూచిస్తున్నారు.  

సీజేఐకి అన్ని విషయాలు తెలుసు: అటార్నీ జనరల్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ పై కోర్టు ధిక్కారం కేసు నమోదుకు అనుమతి కోరుతూ భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు ఢిల్లీకి చెందిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ రాసిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సీజేఐకి రాసిన లేఖను బహిర్గతం చేయడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని అన్నారు. జగన్ పై 31 కేసులు ఉన్నాయని, ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి జస్టిస్‌ ఎన్వీ రమణ తీర్పు ఇచ్చిన తర్వాత.. జగన్ ఈ లేఖ రాయడం అనేక అనుమానాలకు దారి తీస్తోందన్నారు.    కాగా, ఈ లేఖపై స్పందిస్తూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తాజాగా అశ్వినీ ఉపాధ్యాయకు  ప్రత్యుత్తరం ఇచ్చారు. సీఎం జగన్ పై కోర్టు ధిక్కారం కేసు నమోదు కోసం తాను అనుమతి ఇవ్వలేనని స్పష్టం చేశారు. అన్ని విషయాలు సీజేఐకి తెలుసని, అందుకే ప్రత్యేకంగా కోర్టు ధిక్కారం కోసం తాను అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు.

ధరణిలో సమస్యలు.. ఆందోళనలో జనాలు! గ్లోబరీనా ముంచుతుందా? 

అందరూ భయపడుతున్నట్లే జరుగుతోంది.. విపక్షాల అనుమానాలే బలపడుతున్నాయి.. రైతుల ఆందోళనే నిజమవుతోంది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన, సీఎం కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న ధరణి పోర్టల్ దరిద్రంగా ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లాలో  ప్రారంభించగా.. ఇవాళ్టి నుంచి అధికారికంగా సేవలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే అధికారులకు చుక్కలు చూపిస్తోంది ధరణి పోర్టల్. సాంకేతిక లోపాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఓపెన్ కావడం లేదని తెలుస్తోంది. ఓపెనా అయినా కొన్నివివరాలను చూపించడం లేదంటున్నారు.    శంషాబాద్‌లోని తహసీల్దార్‌ ఆఫీసులో ధరణి సేవలను సీఎస్ సోమేష్ కుమార్ ప్రారంభించారు. అపరేటర్ దగ్గర కూర్చుని పరిశీలించారు సీఎస్. అయితే  ప్రారంభమైన వెంటనే ధరణి వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. మండల ఆఫీసులోని ఆపరేటర్ దగ్గర కూడా ధరణి పోర్టల్‌ ఓపెన్ కాలేదు. రంగారెడ్డి జిల్లా మొత్తంలో కేవలం ఐదు స్లాట్ల బుకింగ్‌ మాత్రమే ఉంది. గండిపేట తహసీల్దార్‌ కార్యాలయంలో స్లాట్‌లు బుకింగ్‌ అవడం లేదు.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రారంభించిన తహసీల్దార్‌ ఆఫీసులోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ధరణి వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో రైతుల ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం నుంచే ఈ-సేవా కేంద్రాల వద్ద రైతులు క్యూ కట్టారు.    రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ధరణి వెబ్ సైట్ లో సాంకేతిక సమస్యలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. దీంతో రైతులు, భూములున్నవారు ఆందోళన చెందుతున్నారు. అస్తవ్యస్థంగా ఉన్న ధరణి పోర్టల్ తో తమ భూముల లెక్క తప్పుగా వస్తుందోమోనన్నఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు కూడా చేస్తున్నారట. చాలాకాలంగా రిజిస్ట్రేషన్లు నిలచిపోవడంతో రియల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధరణి సేవలు ప్రారంభం కావడంతో రిజిస్ట్రేషన్ కోసం వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతోంది. సాంకేతిక సమస్యలతో రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో ఇంకా ఎన్ని రోజులు ఎదురుచూడాల్సి వస్తుందేమోనని వారు ఆవేదన చెందుతున్నారు.                       నిజానికి ధరణి  పోర్టల్ పై మొదటి నుంచి అనుమానాలు, అభ్యంతరాలు వస్తున్నాయి. ప్రజల భూములకు సంబంధించిన సమాచారం ఉండే రెవిన్యూ శాఖ పోర్టల్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రైవేట్ సంస్థ అక్రమాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు  ఎదుర్కొవాల్సి వస్తుందని కొందరు రెవిన్యూ నిపుణులు కూడా హెచ్చరించారు. ప్రజల భూములను తనఖా పెట్టి ప్రైవేట్ సంస్థ రుణాలు తీసుకోదనే గ్యారంటీ ఏంటని ప్రతి పక్ష నేతలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయినా ప్రభుత్వం అలాగే ముందుకెళ్లింది. ఇప్పుడు ప్రజలు భయపడ్డట్టే జరుగుతుండటంతో ధరణి పోర్టల్ భద్రతపై ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.   ధరణి పోర్టల్ కు సంబంధించి మరో విషయం కూడా వెలుగులోకి వస్తోంది. గత సంవత్సరం ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తప్పులకు కారణమైన గ్లోబరీనా సంస్థే ధరణి పోర్టల్ ను తయారు చేసిందని చెబుతున్నారు.గ్లోబరీనా చేసిన నిర్వాకంతో ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా  లక్షలాదిమంది విద్యార్థులు సతమతమయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ కారణంగా మనస్తాపంతో 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ఇంటర్ ఫలితాల నిర్వహణ బాధ్యతను గ్లోబరీనా సంస్థకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అనుభవంలేని సంస్థకు మూల్యాంకన బాధ్యతలు అప్పగించిన కారణంగానే ఇబ్బందులు తలెత్తాయనే ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ కూడా ..  టెండర్ల నుంచి ఫలితాలు వెల్లడి దాకా జరిగిన అన్ని ఘటనలపై సమగ్ర విచారణ జరిపి  పొరబాట్లలో గ్లోబరీనాకు బాధ్యత ఉందని తేల్చింది.   ఇంటర్ ఫలితాల నిర్వహణలో ఘోరంగా విఫలమై కొందరు విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనాకు అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖ ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు ఆందోళన కల్గిస్తోంది. తమ ఆస్తులపై ప్రజలు, రైతులు కలవరపడుతున్నారు. పోర్టల్ లో తప్పులు జరిగితే భూముల లెక్కలన్ని తారుమారయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రజల ఆస్తులతో కేసీఆర్ సర్కార్ చెలగాటమాడుతుందని వారు ఆరోపిస్తున్నారు. ధరణి ద్వారా ఏమైనా తప్పులు జరిగితే అందుకే ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీపై మాయావతి సంచలన వ్యాఖ్యలు.. మతతత్వ పార్టీలతో జట్టుకట్టం

అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను కానీ బీజేపీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని బీఎస్పీ చీఫ్ మాయావతి స్పష్టం చేశారు. రాజ్యసభ, మండలి ఎన్నికల్లో సమాజ్‌ వాది పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు బీజేపీ లేదా ఇతర అభ్యర్థులకు తాము ఓట్లు వేస్తామంటూ ఆమె ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ, బీఎస్పీ మధ్య పొత్తుపొడిచే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన మాయావతి.. బీజేపీకి అనుకూలంగా ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్, సమాజ్‌ వాది పార్టీలు ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీఎస్పీ నుంచి ముస్లింలను దూరం చేసేందుకే తమకు వ్యతిరేకంగా ఆ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.    అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, సార్వత్రిక ఎన్నికల్లో గానీ బీజేపీతో తమ పార్టీ కూటమి కట్టే ప్రసక్తే లేదని మాయావతి స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీల సిద్ధాంతాల మధ్య తీవ్ర వైరుధ్యం ఉన్నందున జట్టుకట్టడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. తమది సర్వజన హితం కోరే పార్టీ అని, మతతత్వ పార్టీలతో స్నేహం చేయదని అన్నారు. కుల, మత, పెట్టుబడిదారీ సిద్ధాంతాలున్న వారితో బీఎస్పీ కూటమి కట్టడం జరగదు అని పేర్కొన్నారు. మతతత్వ పార్టీలపై తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, తాను ఎవరి ముందు మోకరిల్లే ప్రసక్తే లేదని చెప్పారు. తాను అవసరమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను కానీ అలాంటి పార్టీల కూటమిలో మాత్రం చేరబోనని మాయావతి స్పష్టం చేశారు. 

సీఎం కేసీఆర్ హరీష్ రావుకు షాక్ ఇవ్వబోతున్నారా..? 

దుబ్బాక ఉపఎన్నిక అటు బీజేపీకి ఇటు టీఆర్ఎస్ కు చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర మంత్రి హరీష్‌రావుకి సీఎం కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోందని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తాజాగా పేర్కొన్నారు. దుబ్బాక ఉపఎన్నిక తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి.. ఆ ఫలితాలు వచ్చిన వెంటనే కేటీఆర్‌కు సీఎం పీఠం అప్పగించేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేశారని సోషల్ మీడియా వేదికగా విజయశాంతి పేర్కొన్నారు. ‘‘దుబ్బాక ఉప ఉపఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రాకుండా చేయాలని కంటి మీద కునుకు లేకుండా.. చెమటోడ్చి పనిచేస్తున్న తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు గారికి ఆయన మామ, సీఎం కేసీఆర్ గారు ఊహించని షాక్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. దుబ్బాక ఉపఎన్నిక తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించి, ఆ ఫలితాలు వచ్చిన వెంటనే, సీఎం కేసీఆర్ గారు తన కుమారుడు కేటీఆర్‌ను సీఎం పదవిలో కూర్చోబెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్టు టీఆర్ఎస్ వర్గాలు ప్రచారం మొదలు పెట్టాయి. అంతేకాకుండా ఈ వాదనకు బలం చేకూర్చే విధంగా... మొదటిసారిగా సీఎం కేసీఆర్ నోట సీఎం పదవికి రాజీనామా మాట బయటకు వచ్చింది. బీజేపీ మీద నెపం పెట్టి... తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ సంకేతాలివ్వడం భవిష్యత్ రాజకీయానికి అద్దం పడుతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.   గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో ఉన్నప్పుడు.. కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దీనిపై అప్పట్లో స్పందించిన కేసీఆర్, నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడం కాదు... ఆధారాలను చూపించకపోతే అమిత్ షా గారిని తెలంగాణ భూభాగం నుంచి కదలనివ్వనని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోలేరు. తర్వాత ఆ వార్నింగ్ ఏమైందో ఎవరికీ అంతుబట్టలేదు. అంతేకాకుండా తనపైనా.. తన ప్రభుత్వం పైనా నిరాధార ఆరోపణలు చేస్తే, ప్రతిపక్ష నేతలను జైలుకు పంపిస్తానని కేసీఆర్ గారు బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తే వాటిపై విరుచుకుపడే కేసీఆర్ గారు, ఇప్పుడు సీఎం పదవికి రాజీనామా చేస్తానని కొత్త అంశాన్ని ఎందుకు తెరమీదకు తెచ్చారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక వైపు హరీష్ రావు గారు దుబ్బాకలో ప్రచారం చేస్తూ బీజేపీ నేతల మీద విరుచుకు పడుతున్న తరుణంలో.. ఆయన ప్రచారాన్ని కూడా డామినేట్ చేసే విధంగా సీఎం కేసీఆర్ గారు బీజేపీ నేతలకు సవాల్ విసరడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ప్రకటన అటు బీజేపీ నేతలకే కాదు.. ఇటు హరీష్ రావు గారికి కూడా పరోక్షంగా సంకేతం ఇచ్చినట్టే అని తెలంగాణ సమాజం భావిస్తోంది. మొత్తం మీద కేసీఆర్ గారి రాజీనామా ప్రకటన చూస్తుంటే.. దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించిన తర్వాత (ఒకవేళ గెలిస్తే) హరీష్ రావు గారికి ఆయన మామ ఐన కేసీఆర్ గారు బంపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని... ఆ గిఫ్ట్ ఏంటంటే.. తాను సీఎం పదవికి రాజీనామా చేసి, కేటీఆర్‌ను సీఎం గద్దెపై కూర్చోబెట్టబోతున్నారన్న వాదన వినిపిస్తోంది. ఎంతైనా నమ్మినవారిని గొంతు కోయడంలో కేసీఆర్ గారు అనుసరించే స్టైలే వేరు’’ అని విజయశాంతి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

జీవీఎల్.. లోకలా? నాన్ లోకలా?

కోర్ కమిటీలో ఆయనొక్కరికే ఆహ్వానమా?   కన్నా, సుజనా, రమేష్, వెంకటేష్ లు అంటరానివారా?   జీవీఎల్‌ను ఏ అర్హతతో ఆహ్వానించారు?   బీజేపీలో ఇదో లిమిటెడ్  పాలిటిక్స్   జీవీఎల్ నరసింహారావు. బీజేపీ యుపి రాజ్యసభ సభ్యుడు. మొన్నటి వరకూ ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. దక్షిణ భారతదేశం నుంచి తానొక్కడినే జాతీయ అధికార ప్రతినిధిని కాబట్టి.. అమరావతిపై తాను చెప్పిందే ఫైనలన్నది, మొన్నటి వరకూ ఆయన వాదన. రైటే. ఇప్పుడాయనకు జాతీయ పార్టీలో ఏ హోదా లేదు. ఇప్పటిక యితే.. జీవీఎల్ గారు కేవలం, యుపి బీజేపీ రాజ్యసభ సభ్యుడు మాత్రమే. మరి విశాఖలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి, ఆయనొక్కరినే ఎలా ఆహ్వానించారు?  ఏపీ బీజేపీ మాజీ దళపతి కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులయిన కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, టిజి వెంకటేష్‌ను ఎందుకు పిలవలేదు? మరి వీరంతా ఏపీకి చెందిన వారే కదా? వీరికి లేని అర్హతలు, జీవీఎల్‌కు మాత్రమే ఉన్న అర్హతలేమిటి? అంటే జాతీయ పార్టీ కూడా.. రాష్ట్రాల్లో ‘లిమిటెడ్ లీడర్స్’కు పరిమితమవుతుందా? అసలు ఇది జాతీయ విధానమా? లేక ఏపీలో మాత్రమే సంఘటనా కార్యదర్శి వైఫల్యంతో నడుస్తున్న స్వతంత్ర విధానమా?.. ఇదీ ఇప్పుడు ఏపీ బీజేపీలో జరుగుతున్న చర్చ.   విశాఖలో ఆదివారం కోర్ కమిటీ భేటీ జరిగింది. దానికి ఏపీ ఇన్చార్జి సునీల్ దియోథర్, పార్టీ సంఘటనా జాతీయ కార్యదర్శి సతీష్‌జీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందీశ్వరి, యుపి ఎంపి జీవీఎల్ నరసింహారావు, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. అయితే, రాష్ట్రానికి చెందిన ఎంపీలనెవరినీ ఈ భేటీకి ఆహ్వానించని వైనంపై చర్చ జరిగింది. దీనిపై.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి స్పందిస్తూ, ఇది సంస్థాగతపరమైన సమావేశమేనని, అందులో ఎంపీలు ఉండరని చెప్పారు. బాగానే ఉంది. ఆయన చెప్పిందే నిజం. మరి.. జీవీఎల్ నరసింహారావు కూడా ఎంపీనే కదా? ఆయనొక్కరినే ఎలా ఆహ్వానించారు?పోనీ కోర్ కమిటీ సభ్యుడైనందుకే ఆయనను పిలిచారనుకున్నా... మరి ఆ లెక్కన, మిగిలిన ముగ్గురు ఎంపీలు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడిని కూడా పిలవాలి కదా? అన్నది ప్రశ్న.   నిజానికి జీవీఎల్‌కు, ఏపీతో సాంకేతికంగా ఎలాంటి సంబంధం లేదు. ఆయన సాంకేతికంగా యుపి నుంచి ఎన్నికయిన రాజ్యసభ సభ్యుడు మాత్రమే. గతంలో ఉన్న జాతీయ అధికార ప్రతినిధి హోదా కూడా లేదు. ఇటీవల ఆయనకు ఓ కార్పొరేషన్ స్థాయి పదవి ఇచ్చారు. అది పార్టీ సమావేశాలకు సంబంధం లేదు. అధికారికంగా ఆయనకు కోర్ కమిటీలో ఆహ్వానం పంపడానికి వీల్లేదు. రాష్ట్రానికి సంబంధించిన వారు మాత్రమే ఆ కమిటీలో ఉండాలి. ఆ లెక్కన ఆయన ఏపీ నుంచి ఎన్నికయిన ఎంపీ కాదు. గతంలో నిర్మలాసీతారామన్ ఏపీ నుంచి ఎన్నికయినందున, ఆమె కోర్ కమిటీ సభ్యురాలయ్యారు. ఇప్పుడు పురందీశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి. పైగా ఆమె గతంలో కూడా కోర్ కమిటీ సభ్యురాలే కాబట్టి, ఆమె హాజరవడాన్ని అర్ధం చేసుకోవచ్చు.  కానీ, జీవీఎల్‌ను ఏ ప్రాతిపదికన కోర్ కమిటీ భేటీకి పిలిచి, ఏ అనర్హతతో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ముగ్గురు ఎంపీలను అంటరానివారిగా పక్కనపెట్టారన్న ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసలు రాష్ట్రంలో ఉండే లోకల్ లీడర్లకు, వేరే రాష్ట్రం ఎంపీగా ఉంటూ ఢిల్లీలో ఉండే నాన్ లోకల్ లీడర్ జీవీఎల్‌కు, సంబంధం ఏమిటన్న లాజిక్కు నేతల నుంచి వినిపిస్తోంది. సోము వీర్రాజు అధ్యక్షుడయిన తర్వాత, పార్టీ కార్యక్రమాలు-తీసుకుంటున్న నిర్ణయాలన్నీ, ‘లిమిటెడ్ వ్యవహారం’గా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.   సోము అండ్ కో నిర్ణయాలు నచ్చని ఓ  రాజ్యసభ సభ్యుడు, తనను టెలికాన్ఫరెన్సులకు పిలవద్దని నిర్మొహమాటంగా చెప్పారట. ఇటీవల కేంద్ర మంత్రి ఒకరు టెలికార్ఫరెన్సు తీసుకుంటే, దానికి ఎంపీలతో సహా పార్టీ నేతలంతా హాజరయ్యారు. అయితే, సదరు మంత్రి మాత్రం,  చివరలో ఒక్క జీవీఎల్‌ను ఉద్దేశించి మాత్రమే మాట్లాడటంతో, ఎంపీలంతా అగ్గిరాముళ్లయ్యారట. దానితో ఓ ఎంపీ, ఇకపై తనను టెలీకాన్ఫరెన్సులకు తీసుకోవద్దని నిర్మొహమాటంగానే చెప్పారట.   అసలు సాంకేతికంగా, ఏపీకి ఎలాంటి సంబంధం లేని జీవీఎల్‌కు..ఏపీ పార్టీ వ్యవహారాల్లో,  పెద్ద పీట వేయడం ఏమిటని సీనియర్లంతా గుర్రుమంటున్నారు. ఆయన ఏ అర్హతతో ఏపీ కోర్ కమిటీ సమావేశాలకు వస్తున్నారు? ఏపీ రాజ్యసభ సభ్యులు యుపి కోర్ కమిటీకి వెళితే, వారిని అనుమతిస్తారా? అందాకా ఎందుకు.. ఇప్పుడు కర్నాటక ఎంపీ అయిన నిర్మలాసీతారామన్, ఏపీ కోర్‌కమిటీలో వస్తే అనుమతిస్తారా? మరి ఆమెది కూడా ఏపీనే కదా? ఈ విషయంలో ఒక్క జీవీఎల్‌కు మాత్రమే ఎలా మినహాయింపు ఇస్తున్నారు? ఆయన ఏపీకి చెందిన వారయినప్పటికీ.. యుపీ నుంచి ఎన్నికయిన ఎంపీ కాబట్టి, ఇక్కడ కోర్ కమిటీలో ఉండకూడదు కదా? అని నిలదీస్తున్నారు.   అయినా ఆయనను రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర సంఘటనా కార్యదర్శి ఎలా అనుమతిస్తున్నారు? అంటే వాళ్లిద్దరే ఆయనను ప్రోత్సహిస్తున్నారని భావించాలా? అసలు రాష్ట్ర సంఘటనా కార్యదర్శి మధుకర్‌రెడ్డిజీ  స్వతంత్రంగా పనిచేస్తున్నారా? లేక అధ్యక్షుడి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారా? అదీకాకపోతే, అంతా కలసి ఓ వర్గంగా పనిచేస్తున్నారా? జాతీయ సంఘటనా కార్యదర్శి సతీష్‌జీ కూడా, ఇలాంటి చర్యలను ఖండించకపోవడం ఏమిటి? జీవీఎల్ కోర్ కమిటీకి ఎలా హాజరవుతారు? మిగిలిన ఎంపీలను ఎందుకు పిలవలేదని సతీష్‌జీ ప్రశ్నించకపోవడం ఏమిటి? అన్న ప్రశ్నలు సీనియర్ల నుంచి వినిపిస్తున్నాయి.   -మార్తి సుబ్రహ్మణ్యం

అలవాటులో పొరపాటు.. హస్తం గుర్తుకే మీ ఓటు అని నాలుక కరుచుకున్న జ్యోతిరాదిత్య

రెండు తరాలుగా సింధియా వంశం కాంగ్రెస్ లో కొనసాగిన సంగతి తెలిసిందే. తండ్రి మాధవరావు సింధియా.. ఇపుడు జోతిరాధిత్య సింధియా కూడా కాంగ్రెస్ నాయకులే అయినా.. కొద్దీ నెలల క్రితం జ్యోతిరాదిత్య కాంగ్రెస్ ను వీడి బీజేపీ లో చేరిన సంగతి తెలిసిందే. అయితే అయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నా, జ్యోతిరాదిత్య సింధియా నోటి వెంట కాంగ్రెస్ అనే మాట మాత్రం అనుకోకుండా వచ్చేస్తోంది. తాజాగా దబ్రా నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచార సభలో ఇదే విషయం ఆయనను ఇబ్బందికి గురి చేసింది. అక్కడ బీజేపీ అభ్యర్థిని ఇమర్తీ దేవి తరుఫున ప్రచారం చేస్తున్న ఆయన అనుకోకుండా "హస్తం గుర్తుకే మన ఓటు" అని గట్టిగా పిలుపునిచ్చి.. అందరినీ ఆశ్చర్యపరచి.. తరువాత జరిగిన పొరపాటు తెలుసుకుని నాలుక కరుచుకున్నారు .   కొద్ది రోజుల క్రితం కమల్ నాథ్ ఇక్కడ ఒక సభలో మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థి ఇమర్తీ దేవిని ఉద్దేశించి "ఐటమ్" గ పేర్కొనడంతో తీవ్ర విమర్శలు పాలైన సంగతి తెలిసిందే. తాజాగా, ఆమె తరఫున ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన జ్యోతిరాదిత్య కూడా "దాబ్రా ప్రజలారా, మీ చేతులు కలపండి. నన్ను, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ను గెలిపిస్తామని చెప్పండి. 3వ తేదీన జరిగే పోలింగ్ లో మీరంతా హస్తం గుర్తుకు ఓటు వేయాలి" అని అన్నారు. అయితే వెంటనే జరిగిన తప్పును తెలుసుకున్న ఆయన, వెంటనే దాన్ని సరిదిద్దుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియాలో జ్యోతిరాదిత్య సింధియా వీడియోలు వైరల్ కావడంతో, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోకు విపరీతమైన ప్రచారం కల్పిస్తూ.... "సింధియా గారూ... మధ్యప్రదేశ్ ప్రజలు కూడా నవంబర్ 3న హస్తం గుర్తుకు ఓటు వేస్తామని చెబుతున్నారు" అని క్యాప్షన్ పెట్టింది. ఇది ఇలా ఉండగా.. ఇమర్తీ దేవితో సహా కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు గత మార్చిలో కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో అక్కడ ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

కరోనా వాక్సిన్ వచ్చేది అప్పటికే... తేల్చి చెప్పిన భారత్ బయోటెక్

కరోనా వైరస్ సెకండ్ వేవ్ తో ప్రపంచం మొత్తం మరోసారి గడగడా వణుకుతున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మన దేశానికి చెందిన భారత్ బయోటెక్ రూపొందించిన "కొవాక్సీన్"  టీకా మూడో దశ ట్రయల్స్ దేశ వ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 25 నుంచి 30 కేంద్రాల్లో మొదలు పెట్టబోతున్న సంగతి తెలిసిందే.  దీని కోసం ఒక్కో కేంద్రంలో 2 వేల మందిని వాలంటీర్లను సిద్ధం చేసినట్లు భారత్ బయోటెక్ అంతర్జాతీయ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ తెలిపారు. అంతేకాకుండా మూడవ దశ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం అయి, ప్రభుత్వం నుండి అనుమతులు వస్తే, వచ్చే సంవత్సరం ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో కొవాక్సీన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అయన ప్రకటించారు.   అయితే ప్రస్తుతం మూడవ దశ ట్రయల్స్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, విజయవంతంగా పూర్తి చేయడంపైనే తాము దృష్టి పెట్టామని, దీని కోసం బలమైన క్లినికల్ ఎవిడెన్సులతో పాటు.. వ్యాక్సిన్ సామర్థ్యం, సమాచార భద్రత తదితర అంశాలు ఈ దశలో కీలకమని అన్నారు. వాక్సిన్ కు భారత నియంత్రణ సంస్థల అనుమతి లభిస్తే, వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అయన తెలిపారు.   అంతేకాకుండా వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కోసం రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల నిధులను పెట్టుబడిగ పెట్టనున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలకు కూడా తాము వాక్సిన్ ను అందిస్తామని తెలిపారు. ఇక వాక్సిన్ ఎగుమతికి సంబంధించి పలు దేశాల ఫార్మా కంపెనీలతో ఇప్పటికే ప్రాథమిక చర్చలు సాగుతున్నాయని సాయి ప్రసాద్ తెలిపారు.

కేంద్రాన్ని అడ్డంగా ఇరికించిన కేసీఆర్

పెన్షన్ పైసలపై రాజీనామాకు సవాల్   రుజువు చేస్తేనే బీజేపీకి విలువ   పెన్షన్లపై తరచూ సవాళ్లు విసురుతున్న బీజేపీ నేతలకు, తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుగులేని సవాల్ విసిరారు. కేంద్రం.. రాష్ర్టానికి పెన్షన్ల కింద ఏడాదికి ఇచ్చే సొమ్ము కేవలం 107 కోట్లు మాత్రమేనని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. దీనిని కాదని నిరూపిస్తే, రాజీనామా చేసేందుకు సిద్ధమేనన్న సవాల్ విసిరి, కమలనాధులను ఆత్మరక్షణలో నెట్టడం చర్చనీయాంశమయింది.   కొంతకాలం నుంచి, తెలంగాణ బీజేపీ నేతలు పెన్షన్లపై చర్చను విస్తృతం చేస్తున్నారు. పెన్షన్లలో సింహభాగం సొమ్ము, నరేంద్రమోదీ సారధ్యంలోని కేంద్రం ఇస్తోందని ప్రచారం చేస్తున్నారు. ఆ సొమ్ముతో కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై దమ్ముంటే చర్చకు రావాలని.. బండి సంజయ్ నుంచి, రాష్ట్ర నేతల వరకూ టీఆర్‌ఎస్‌కు సవాళ్లు విసురుతున్నారు. ఇటీవల ఆర్ధికమంత్రి హరీష్‌రావు.. కేంద్ర నిధుల విడుదలపై చేసిన సవాలుకు, బీజేపీ నేతలెవరూ నేరుగా స్పందించలేదు. అసలు లెక్కలను బయటపెట్టలేదు.   తాజాగా.. కేసీఆర్ రంగంలోకి దిగి, ఈ సవాళ్లను కొత్తమలుపు తిప్పారు. తెలంగాణలో.. 38 లక్షల 64 వేల 751 మందికి అన్ని రకాల పెన్షన్లు ఇస్తుంటే, అందులో కేంద్రం కేవలం 7 లక్షల మందికే, అది కూడా మనిషికి 200 రూపాయలు మాత్రమే పెన్షన్లు ఇస్తోందన్నారు. అవన్నీ కలిపితే 105 కోట్లు మాత్రమేనని బట్టబయలు చేశారు. కానీ తన ప్రభుత్వం, 10 నుంచి 11 వేల కోట్లు ఖర్చు పెడుతోందంటూ తన వద్ద ఉన్న కాగ్ రిపోర్టును చూపించారు. ఇది కాదని రుజువు చేస్తే, తాను ఒక్క నిమిషంలోనే రాజీనామా చేసి వెళ్లిపోతానని సవాల్ విసరడం సంచలనం సృష్టించింది.   సహజంగా కేసీఆర్ అనేక సందర్భాల్లో అనేక సవాళ్లు విసిరినా, రాజీనామా అంశాన్ని ప్రస్తావించలేదు. గతంలో తాను సీఎం పదవి దళితుడికి ఇస్తానని చెప్పడంతోపాటు, అనేక అంశాల్లో తాను చెప్పిన హామీలకే విరుద్ధమైన వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. కానీ ఇప్పుడు పెన్షన్ల అంశాన్ని బీజేపీ యాగీ చేస్తుండటంతో, ఆయన హటాత్తుగా కేంద్ర నిధులపై తాడోపేడో తేల్చుకునేందుకు, ఎదురుదాడి ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆయన వైఖరి బీజేపీ బండారాన్ని తేల్చాలన్నట్లుగానే కనిపించింది. కాగ్ రిపోర్టు ఆధారంగా, ఆయన సంధించిన అస్త్రం.. సహజంగానే బీజేపీని సంకటంలో పడేసింది.   ఇక ఇప్పుడు పెన్షన్ల బంతి బీజేపీ కోర్టులోనే ఉంది. కేసీఆర్ చేసిన సవాలుకు, నిర్దిష్టమైన జవాబు ఇవ్వడంపైనే, ఆ పార్టీ విశ్వసనీయత ఆధారపడిఉంది. ఇప్పటికే సవాళ్లు విసిరి, పారిపోతున్నారన్న విమర్శను మూటకట్టుకున్న బీజేపీ.. కనీసం తాను చేసిన పెన్షన్ల అంశం ఆరోపణలకయినా, కట్టుబడి ఉండక తప్పదు. ఒకవేళ కాదని తప్పించుకుని తిరిగే మార్గాలు ఎన్నుకుంటే.. బీజేపీ బురద రాజకీయాలకే పరిమితమవుతుందన్న విమర్శను, స్థిరం చేసుకోవలసి వస్తుంది.   తాము కేసీఆర్ చెప్పిన దానికంటే, ఎక్కువగా రాష్ర్టానికి పెన్షన్లు ఇస్తున్నామని నిరూపించుకునే బాధ్యత, కచ్చితంగా కమలదళానిదే. బీజేపీ నేతలు, తమ వివరణ పత్రంలో కేసీఆర్ చెప్పినట్లే లెక్కలు చూపిస్తే మాత్రం, ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబడక తప్పదు. ఒకవేళ అంతకుమించి చూపిస్తేనే, కేసీఆర్ సర్కారు బోనెక్కే అవకాశం ఉంటుంది. నిజానికి ఇది కమలదళానికి, కేసీఆర్ ఇచ్చిన అపూర్వ అవకాశం. ఇద్దరూ సవాళ్లు విసిరినందున, ఎవరి మాట నిజమో, ఎవరి వాదన అబద్ధమో తెలుసుకునే హక్కు ప్రజలకూ ఉంది.   నిజంగా బీజేపీ నాయకత్వానికి.. కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ను, జనం ముందు ముద్దాయిగా నిలబెట్టాలన్న లక్ష్యం ఉంటే, కేసీఆర్ విప్పిన కాగ్ నివేదిక చిట్టా తప్పని నిరూపించాల్సిందే. ఆమేరకు వాస్తవ గణాంకాలు విడుదల చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. కమలం పార్టీ నాయకులు, కేవలం కాగితం పులులన్న ముద్ర నిజం చేసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటిదాకా కేసీఆర్‌వి.. జూటా మాటలని ధ్వజమెత్తుతున్న కమలదళాలు, వాటిని నిరూపించుకోవాలి.   కేసీఆర్ విప్పిన కాగ్ లెక్కలన్నీ టీఆర్‌ఎస సర్కారు సొంతగా సృష్టించినవి కాదు. ఏ రాష్ర్టానికి కేంద్రం ఎంత ఇస్తుందో, ఆ సంస్థ నివేదిక రూపంలో ఇస్తుంది. ఒకవేళ కేసీఆర్ మాటలు అబద్ధమని తేల్చాలన్నా, కమలదళం మళ్లీ కాగ్ లెక్కలే బయటపెట్టాలి. చూడాలి ఏం జరుగుతుందో? సరే.. ఇంతకూ మరి, పెన్షన్ల గుట్టు విప్పే బాధ్యత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీసుకుంటారా? లేక అధ్యక్షుడు బండి సంజయ్ తీసుకుంటారా అన్నదే చూడాలి.   -మార్తి సుబ్రహ్మణ్యం

సారీ చెబితే సరిపోతుందా.. సారూ?

రైతులకు బేడీలు వేసిన పోలీసులపై సస్పెన్షన్లు ఎత్తవేత   రైతులని తెలియక బేడీలు వేశారట   మరి తెలియక పోస్టింగులు పెట్టారంటే కేసులు ఎత్తివేస్తారా?   పోలీసులు అమాయకులు. వారికి ఏ పాపమూ తెలియదు. ఏదో పాపం తెలియక.. రైతుల చేతికి జస్ట్ బేడీలు వేశారు. అంతే. వారి అమాయకత్వంపై ప్రాధమిక విచారణ జరిపి సస్పెన్షన్లు ఎత్తేశారు. ఇదీ అమరావతి రైతుల చేతికి, బేడీలు వేసిన పోలీసులపై విధించిన సస్పెన్షను ఎత్తవేస్తూ.. పోలీసు బాసులు ఇచ్చిన ప్రకటన.   అమరావతి రైతుల ఉద్యమానికి పోటీగా.. అధికార వైసీపీ నేతలు రంగంలోకి దించిన,  పెయిడ్ ఆటో బ్యాచ్‌ను  రైతులు అడ్డుకున్నారు. వారి ఆధార్ కార్డులు చూపమని నిలదీశారు. దానితో ఆ పెయిడ్ బ్యాచ్‌ను అడ్డుకున్న రైతులపై, ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. కేసులు బనాయించిన వారిలో ఎస్సీ, ఎస్టీలు కూడా ఉండటం మరో విచిత్రం. అంటే ఎస్సీలే ఎస్సీలపై కేసులు పెట్టడం తమాషా అన్నమాట. ఈ ప్రకారంగా.,. దళితులకు బాసటగా నిలవాల్సిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చ ట్టం, రాజకీయుల చేతిలో ఏవిధంగా దుర్వినియోగం అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.   రైతుల చేతికి బేడీలు వేసిన వైనం, రాష్ట్రంలో ఆందోళనకు దారితీసింది. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన పోలీసుల తీరు, రైతాంగం గుండెను రగిలించింది. వారి ఆత్మాభిమానం దెబ్బతీసింది. అయినా.. ఇప్పటివరకూ సర్కారు ఆ ఘటనపై, కనీసం విచారం వ్యక్తం చేయలేదు. ప్రభుత్వాలకు రైతులపై ఉన్న ప్రేమ అదన్నమాట! సరే.. దానిపై మీడియా విరుచుకుపడటంతో, ఎస్కార్టుగా వచ్చిన పోలీసులను, జిల్లా ఎస్పీ సస్పెన్షన్ వేటు వేశారు. మళ్లీ అంతలోనే సదరు పోలీసులంతా అమాయకులని సర్టిఫికెట్ ఇచ్చి, అది తెలియక చేసిన తప్పిదంగా అభివర్ణించారు. అంటే వారంతా దోపిడీదొంగలు, హంతకులనే భావించి, ఎస్కార్టు పోలీసులు రైతుల చేతికి బేడీలు వేశారన్నది అధికారుల కవిహృదయం!     ఫర్వాలేదు. కింది స్ధాయి సిబ్బందిపై, పోలీసు బాసులకు ఆపాటి సానుభూతి ఉండటం మెచ్చతగిందే. కింది వారు చేసిన తప్పులను, మాఫీ చేసే ధైర్యం కూడా అధికారులందరికీ సాధ్యం కాదు. కానీ, శాఖాపరమైన విచారణ జరుగుతుందని మాత్రం సెలవిచ్చారు. ఎలాగూ,  తెలియక బేడీలు వేశామని చెప్పిన వారిని మన్నించారు కాబట్టి.. మళ్లీ శాఖాపరమైన విచారణలెందుకు? సమయం వృధా తప్ప!   సరే.. పాపం ఏదో తెలియక చేసిన తప్పు అని,  సస్పెన్షన్లు ఎత్తేసిన ఖాకీ కామందుల వారు .. మరి తెలియక సోషల్ మీడియాలో,  పోస్టింగులు పెడుతున్న చిరంజీవులపై మాత్రం ఎందుకు కేసులు పెడుతున్నారు? వారిని రాష్ర్టాల సరిహద్దులు దాటి మరీ వెతికి పట్టుకొచ్చి, ఎందుకు కేసులు నమోదు చేస్తున్నారు? ఆ చర్యలు కూడా, ఏదో తెలియక చేసిన తప్పులుగానే భావించాలి కదా?   ఆ మేరకు రైతుల చేతికి బేడీలు వేసిన పోలీసులపై సస్పెన్షన్లు ఎత్తివేసినట్లే.. పోస్టింగులు పెట్టిన వారిని, షేర్ చేసిన వారిపై కేసులు ఎత్తివేయాలి కదా? ఎవరో అన్న మాటలను టెలికాస్టు చేసి, ఎవరో అధికారి ఇచ్చిన ఉత్తర్వునే ప్రసారం చేసిన జర్నలిస్టులను.. సీఐడి పోలీసులు విచారణ పేరిట వేధించకుండా, కేసులు తొలగించాలి కదా? అదే కదా చట్టం? న్యాయం-చట్టం అందరికీ సమానమైనప్పుడు, మళ్లీ ఈ వివక్ష ఎందుకు సారూ?   చట్టం కళ్లతో కాకుండా పాలకుల కళ్లతో చూడటం వల్లే.. బుద్ధిజీవులకు ఈ సందేహాలు వస్తున్నాయి. ధర్మం-చట్టం-న్యాయం నాలుగుపాదాల నడుస్తున్న ఆంధ్రాలో.. ఈ ప్రశ్నలకు బదులిచ్చే పోలీసు పెద్దసార్లు ఎవరున్నారు? పనిలో పనిగా, మానవ హక్కులు దివ్యంగా వెలిగిపోతున్న ఏపీలో,  ఇలాంటి అమాయక పోలీసులు ఉన్న విషయం,  మానవ హక్కుల కమిషన్ చెవిన పడేస్తే బాగుండేది. రైతుల చేతికి బేడీలు వేసిన పోలీసులను, వారిపై సస్పెన్షన్ ఎత్తివేసిన అధికారులకు.. మానవ హక్కుల కమిషన్‌తో  సన్మానం చేయించుకునే, గొప్ప అవకాశాన్ని పోలీసు బాసులు వదులుకోవడమే ఆశ్చర్యం. ఈ లెక్కన కొంపదీసి.. హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా,  సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టిన వారంతా.. అమాయకులనే నిర్ణయించి, అరెస్టు చేయకుండా వదిలేశారా?.. ఏమో? ఏపీలో ఏదైనా సాధ్యమే. -మార్తి సుబ్రహ్మణ్యం

భలేవాడికి అన్నయ్య.. ఏపీ సీఎం జగనన్నయ్య!

లిక్కర్, బదిలీలపై రివర్స్ గేర్   తత్వం తెలుసుకుంటున్న ఏపీ సీఎం   సహజంగా మనం అతను భలేవాడని అంటుంటాం. కానీ ఏపీ సీఎం జగనన్న మాత్రం.. ఆ భలేవాడికి అన్నయ్యలా ఉన్నాడన్న కొత్త సామెత ఒకటి,  ఇప్పుడు వాడుకలోకి వచ్చింది. ముందు కాదనడం, ఆ తర్వాత దానినే తూచ్ అవుననడం అలవాటయిపోయింది. బహుశా అందుకే ఈ పద ప్రయోగం ప్రచారంలోకి వచ్చినట్లుంది. మొన్నటికి మొన్న సీఎస్ రేసులో ఉన్న ఓ సీనియర్ ఐఏఎస్‌ను బదిలీ చేసి, మళ్లీ రెండోరోజునే పోస్టింగు ఇచ్చి హాశ్చర్యపరిచారు.   నిన్నటికి నిన్న లిక్కర్ పాలిసీపై అసెంబ్లీలో దంచికొట్టి చేసిన ప్రసంగాలన్నీ, తాజా రేట్ల తగ్గింపుతో.. తస్సాదియ్యా తుస్సుమన్నట్లయింది. ఫర్వాలేదు. పాలకులు వెనకడుగు వేసినంత మాత్రాన విమర్శించకూడదు. ఆలస్యంగానయినా తత్వం బోదపడినందుకు సంతోషించాలి. ఇప్పుడు మొండివాడిగా పేరున్న ఏపీ సీఎం జగనన్నను, ఆ మేరకు అఖిలాంధ్రులు అభినందించాలి.   మద్యం మాన్పించేందుకు.. షాక్ కొట్టేలా మందు ధరలు పెంచామన్నారు. మద్యాన్ని దశల వారీగా నిషేధించే క్రమంలోనే, వాటి రేట్లు కావాలనే పెంచామని.. జగన్ అండ్ ‘పెద్దగొంతు’ అంబటి రాంబాబు సభలో సెలవిచ్చారు. పెంచిన ధరలు, ప్రపంచంలో ఎక్కడా లేని మందు బ్రాండ్లు చూసిన జనం కూడా,  జగనన్నయ్య అండ్ అంబటి అన్నయ్యలు చెప్పింది నిజమే కామోసనుకున్నారు.   చంద్రబాబులా తమకు, మద్యం నుంచి ఆదాయం సంపాదించే ఖర్మ లేదన్న మాటనూ జనం నమ్మేశారు. దానిని మద్యనిషేదానికి ఏర్పాటుచేసిన, కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మణరెడ్డి కూడా సమర్ధించారు. అది చాలదన్నట్లు.. కోట్ల రూపాయలు పెట్టి పత్రికల్లో ప్రకటనలూ ఇచ్చారు. ఇంతమంది మహానుభావులు, మహనీయులు చెప్పింది ఎవరు మాత్రం తప్పనుకుంటారు చెప్పండి? పైగా ఈ జన్మలో.. గాంధీ గారి అంశలో పుట్టిన,  జగనన్నయ్య చెప్పిన తర్వాత ఇక తిరుగే ఉండదు కదా?!   కానీ, విచిత్రంగా.. మద్యం మాన్పించేందుకే కొండెక్కించిన మందు ధరలను, కొండ కిందకు దించేశారు. పైగా పిచ్చి బ్రాండ్లతో పాటు,  ప్రీమియం  బ్రాండ్ల రేట్లపైనా దయదలిచారు. యస్. నిజంగా ఇవన్నీ మొండివాడుగా పేరున్న,  మన అఖిలాంధ్రకోటి జగనన్నయ్య తీసుకున్న నిర్ణయాలే. సంతోషం. మందు తాగనివారికి ఈ గోలతో ఎలాగూ సంబంధం ఉండదు. కానీ కొన్న నెలల తరబడి, పిచ్చి బ్రాండ్లు తాగలేకపోతున్న మందుబాబుల దృష్టిలో,  జగనన్నయ్య దేవుడయిపోయారు. బాగానే ఉంది. మందు అలవాటు పూర్తిగా మార్పించి, ద శలవారీ మద్యనిషేధంలో భాగంగానే... మందురేట్లు పెంచామని భాష్యం చెప్పిన.. ఒక అంబటి రాంబాబు, ఇంకో బొత్స సత్తిబాబు, మరో శ్రీకాంత్‌రెడ్డి అండ్ అదర్స్.. తగ్గించిన రేట్లపై ఏం భాష్యం ఇస్తారో చూడాలి.   పక్క రాష్ర్టాల నుంచి,  మద్యం స్మగ్లింగ్ జరుగుతున్నందున  మందు ధరలు తగ్గించామని,  సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొంది. బాగుంది. ఈ విషయం అంతకుముందు తెలియదా? సరిహద్దు రాష్ర్టాల  పక్కనే ఉన్న వైన్‌షాపులో.. వెయ్యి రూపాయలకు  బ్రాండెడ్ మందు దొరుకుతుంది.  కానీ సొంత రాష్ట్రంలోని పిచ్చి బ్రాండ్ల రేట్లు దానితో పోలిస్తే మూడింతలు ఎక్కువ. అప్పుడు బుద్ధి-బుర్ర ఉన్న ఎవరైనా, సరిహద్దు దాటి తీసుకుంటాడన్న అంచనా, అధికారులకు అప్పుడు లేదా? మరిప్పుడు ధరలు తగ్గించారు కాబట్టి.. బ్రాండెడ్ మందుతో జనం ఆరోగ్యం పదికాలాల పాటు చల్లగా, తమ ఖజానా వెచ్చగా ఉండేందుటే పెంచామని చెబుతారా? అన్నవి ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు. హేమో... చెప్పినా చెప్పగల సమర్ధులు మరి?!   సరే.. జగనన్నయ్య తన నిర్ణయం వాపసు తీసుకున్నందుకు, ఆయననేమీ తప్పు పట్టాల్సిన పనిలేదు. ఎందుకంటే తప్పులు చేయడం మానవ సహజం. సజ్జల, చల్లా రామకృష్ణారెడ్డి చెప్పినట్లు.. జగనన్నయ్య ఆధునిక గాంధీ మహాత్ముడు అయినప్పటికీ, మహాత్ములు కూడా తప్పులో కాలేస్తుంటారు. కాబట్టి, జగనన్నయ్యను నిందించాల్సిన పనిలేదు. కాకపోతే.. ఈ 17 నెలల పరిపాలనా కాలంలో తత్వం తెలుసుకుంటున్నందుకు, ఆయనను అభినందించాలి.   తగులుతున్న ఎదురుదె బ్బలే, ఆయనకు గుణపాఠాలుగా మారుతున్నాయి. ఏది మంచి, ఏది చె డు? ఏది ఆదాయం? ఏది వృధా అన్న వాస్తవాలు,  అనుభవంలో తెలిసివస్తున్నట్లు కనిపిస్తోంది. యువకుడు, పులివెందుల బిడ్డ.. పైగా రాజారెడ్డి మనువడు ప్లస్ 151 మంది ఎమ్మెల్యేల బలం.. వీటికి మించి రాజకీయ ప్రత్యర్థుల కుట్రకు బలయి,  16 నెలలు జైల్లో మగ్గిన నాటి జ్ఞాపకాలు! ఇవన్నీ కలసి వెరసి,  జగనన్నయ్యను అలా తయారుచేశాయని అనుకోవడంలో తప్పు లేదు. అనుభవాలు-ఎదురుదె బ్బలే గుణపాఠాలయినప్పుడు, ఏ మనిషి మారినా స్వాగతించడమే గొప్పతనం. అందుకు జగనన్నయ్య కూడా మినహాయింపు కాదు.   కాబట్టి మందు రేట్ల తగ్గింపుపై.. జగనన్నయ్యను కాకుల్లా పొడవకుండా, మారిన జగన్‌బాబును, ఈ  విశాల ప్రపంచంలోకి ఆహ్వానించండి. పనిలో పనిగా మారిన జగనన్న.. పోస్టింగులివ్వకుండా, అధికారుల పట్ల అనుసరిస్తున్న  వేధింపు పర్వానికి తెరదించితే, ఆయనను నిజంగానే ఈ విశాల ప్రపచంలోకి ఆహ్వానిస్తారేమో?  కానీ.. ఆ సీఎంఓ సైంధ వుడు ఇక్కడ కూడా అలవాటు ప్రకారం, అడ్డం పడితే చేసేదేమీ లేదు!   -మార్తి సుబ్రహ్మణ్యం