వాళ్లతో జాగ్రత్త.. ట్రస్ట్ ఆస్తులు కొట్టేయగలరు.. రఘురామరాజు సంచలన కామెంట్స్
posted on Nov 2, 2020 @ 6:50PM
కొన్ని నెలల క్రితం మాన్సస్ ట్రస్ట్ చైర్పర్సన్ గా సంచయిత బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ఆమెను నిత్యం వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ట్రస్ట్ కింద ఉన్న భూముల దగ్గర నుండి ఎంఆర్ కాలేజీ వరకు అన్ని నిర్ణయాలు వివాదానికి దారి తీస్తున్నాయి. అయితే తాజాగా సంచయిత గురించి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు ఈరోజు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఆనంద్ గజపతి రాజు నుండి సంచయిత తల్లి ఉమా గజపతి రాజు విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఢిల్లీ వెళ్లిపోయారన్నారు. ఆ తరువాత కొద్దిరోజులకే ఉమ... రమేశ్ శర్మ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారని తెలిపారు. ఇదే విషయాన్నీ 2013 నవంబర్లో సంచయిత రాసిన ఒక ఆర్టికల్ లో పేర్కొన్నారని అయన తెలిపారు. అంతేకాకుండా ఢిల్లీలో చదువుకున్న సంచయిత.. తన తల్లిదండ్రుల గురించి ఆ ఆర్టికల్లో చాలా స్పష్టంగా తెలిపిందని, ఆమె తన స్కూల్ రికార్డులలో కూడా తన తండ్రి పేరు రమేశ్ శర్మ అని రాశారని అయన అన్నారు.
మరో పక్క "సంచయిత తల్లితో విడాకులు అయ్యాక ఆనంద గజపతి రాజు విజయనగరానికి చెందిన సుధా రాజును వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా ఆనంద గజపతి రాజు, సుధా రాజు లకు పుట్టిన అమ్మాయి ఊర్మిళా గజపతి రాజునే వారసురాలిగా ప్రకటిస్తూ వీలునామాలో ఆనంద గజపతి రాజు రాశారు. అయితే ఆనంద గజపతి రాజు చనిపోతే కనీసం చూడడానికి కూడా సంచయిత, ఆమె తల్లి రాలేదని.. అలా వారు పూర్తిగా ఆ కుటుంబానికి దూరం అయ్యారని అయన తెలిపారు. గత కొద్ది రోజులుగా వివాదాల నేపథ్యంలో ఊర్మిళ గజపతి రాజు టీవీలలో మాట్లాడుతూ... సంచయిత వివాదంపై కోర్టుకు వెళుతున్నట్టు తెలిపింది. అయినా సంచయిత ఇలా అకస్మాత్తుగా వచ్చి కలహాలు పెట్టడం సరికాదు. విజయనగర రాజా కుటుంబానికి చెందిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అవమానించే కుసంస్కారం రాజవంశీయులకైతే అసలు ఉండదు. ఎవరి అండో చూసుకుని సంచయిత చెలరేగిపోతే... రేపో మాపో కోర్టు ఆదేశాలు కూడా వస్తాయి. కాబట్టి అమ్మా సంచయితా.. నిన్ను అడ్డుపెట్టుకుని ఆస్తులను చేజిక్కించుకోవడానికి.. పంచ గ్రామాల్లోనే కాదు.. మాన్సస్ ట్రస్టుకు చెందిన ఆస్తులను కాజేయడానికి కొంత మంది చూస్తున్నారు. వారి ట్రాప్లో పడొద్దు. ట్రస్ట్ ఆస్తులు రక్షించుకోండి’’ అని రఘురామ రాజు హితవు పలికారు.