సీజేఐకి అన్ని విషయాలు తెలుసు: అటార్నీ జనరల్
posted on Nov 2, 2020 @ 3:32PM
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై కోర్టు ధిక్కారం కేసు నమోదుకు అనుమతి కోరుతూ భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కు ఢిల్లీకి చెందిన న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం జగన్ లేఖ రాసిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సీజేఐకి రాసిన లేఖను బహిర్గతం చేయడం కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని అన్నారు. జగన్ పై 31 కేసులు ఉన్నాయని, ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి జస్టిస్ ఎన్వీ రమణ తీర్పు ఇచ్చిన తర్వాత.. జగన్ ఈ లేఖ రాయడం అనేక అనుమానాలకు దారి తీస్తోందన్నారు.
కాగా, ఈ లేఖపై స్పందిస్తూ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తాజాగా అశ్వినీ ఉపాధ్యాయకు ప్రత్యుత్తరం ఇచ్చారు. సీఎం జగన్ పై కోర్టు ధిక్కారం కేసు నమోదు కోసం తాను అనుమతి ఇవ్వలేనని స్పష్టం చేశారు. అన్ని విషయాలు సీజేఐకి తెలుసని, అందుకే ప్రత్యేకంగా కోర్టు ధిక్కారం కోసం తాను అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ పేర్కొన్నారు.