ఆమెకు ఛాన్స్ ఇస్తే.. అసెంబ్లీ, సెక్రటేరియట్ ను కూడా పేకాట క్లబ్ గా మార్చేస్తుంది: అనిత
posted on Nov 7, 2020 @ 8:59PM
తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై ఒకప్పటి ఆమె అనుచరుడు, ఆ పార్టీ బహిష్కృత నేత సందీప్ తాజాగా చేస్తున్న ఆరోపణల పై తీవ్ర దుమారం రేగుతోంది. ఊరికి దూరంగా ఉండే తోటలలో పేకాట క్లబ్ నడిపే విషయంలో ఎమ్మెల్యే శ్రీదేవి... సందీప్ సలహా కోరుతున్నట్టుగా తాజాగా ఒక ఆడియో బయటపడింది. దీనిపై టీడీపీ పార్టీకి చెందిన తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్ర విమర్శలు చేసారు. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన ఎమ్మెల్యే పదవిలో ఉండి కూడా పేకాట క్లబ్బులు నిర్వహించడం వైసీపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనం అని ఆమె అన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో ఊరూ, వాడా పేకాట క్లబ్బులు ఏర్పాటు చేసి ప్రజలను గుల్ల చేస్తున్నారని, అసలు అవకాశం రావాలే గానీ ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్ లలో కూడా పేకాట ఆడించేందుకు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రెడీగా ఉన్నారని ఆమె విమర్శించారు. తనను ఎన్నుకున్న తాడికొండ నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికొదిలేసి పేకాట క్లబ్ లపై దృష్టి పెట్టిన ఎమ్మెల్యే శ్రీదేవిపై పోలీసులు కేసు నమోదు చేయాలని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అనిత డిమాండ్ చేశారు. పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్న శ్రీదేవి ఎమ్మెల్యేగా పూర్తిగా అనర్హురాలు అని ఆమె స్పష్టం చేశారు.
ఏపీ సర్కారు వెంటనే స్పందించి తాజాగా మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఆడియో క్లిప్పింగ్ పై విచారణ జరిపించాలని అనిత డిమాండ్ చేసారు. పేకాట క్లబ్బులు నిర్వహిద్దామని స్వయంగా ఎమ్మెల్యేనే చెప్పడంపై సీఎం జగన్ స్పందించాలని అనిత కోరారు. లేటెస్ట్ గా వాటాల పంపిణీలో విభేదాలు రావడంతోనే తనకు ప్రాణహాని ఉందంటూ ఎమ్మెల్యే శ్రీదేవి నాటకాలు ఆడుతున్నారని అనిత ఆరోపించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోటాపోటీగా పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ రాష్ట్రాన్ని ఏకంగా జూదాంధ్రప్రదేశ్ గా మార్చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.