ఎమ్మెల్యే శ్రీదేవి వల్ల ప్రాణహాని: వైసీపీ బహిష్కృత నేత సెల్ఫీ వీడియో
posted on Nov 7, 2020 @ 12:35PM
గుంటూరు జిల్లా తాడికొండ రాజకీయాల్లో గంటకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఆ పార్టీ బహిష్కృత నేత సందీప్ మధ్య కొంత కాలంగా సాగుతున్న వివాదం కొత్త మలుపు తిరిగింది. సందీప్, సురేశ్ అనే వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే వైసీపీ బహిష్కృత నేత సందీప్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ఉండవల్లి శ్రీదేవిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే కారణంగా తనకు ప్రాణహాని ఉందని, తనను సీఎం జగనే కాపాడాలని వేడుకున్నారు సందీప్.
ఉండవల్లి శ్రీదేవి అక్రమకేసులు బనాయించి వేధిస్తున్నారని ఆరోపించారు సందీప్. సీఐ ధర్మేంద్ర, ఎమ్మెల్యే శ్రీదేవిలతో తనకు ముప్పు ఉందని, అక్రమ కేసుల కారణంగానే అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని వివరించారు. తన పరిస్థితి పట్ల కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారని, మరణం తప్ప తనకు మరోమార్గం లేదంటూ సందీప్ కన్నీటి పర్యంతమయ్యారు. ఉండవల్లి శ్రీదేవికి మొదటి నుంచి అండగా ఉన్నానని, పార్టీ కోసం ఎంతో శ్రమించానని వీడియోలా తెలిపారు సందీప్.
కొన్నిరోజుల కిందట సందీప్, సురేశ్ గుంటూరు మీడియా సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో వారిద్దరినీ పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో వారిద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ పరిణామాలతో అజ్ఞాతంలోకి వెళ్లిన సందీప్.. తాజాగా సెల్ఫీ వీడియో విడుదల చేశారు.