గ్రేటర్ లో స్వింగ్ ఓటర్లే కీలకం! ఈసారి ఎటువైపో? 

ఎన్నికల్లో స్వింగ్ అనే పదం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎక్కువగా వినిపిస్తుంది. ఎన్నికల్లో విజయానికి కీలకంగా ఉండే వాటిని స్వింగ్ అంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఏడు రాష్ట్రాలు కీలకంగా ఉంటాయి. అక్కడ ఎవరికి మెజార్టీ వస్తే వారే యూఎస్ ప్రెసిడెంట్ అవుతుంటారు. అందుకే అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో ఆ ఏడు రాష్ట్రాలను స్వింగ్ రాష్ట్రాలు అంటారు. 2016లో స్వింగ్ రాష్ట్రాల్లో స్వీప్ చేసి ట్రంప్ గెలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలు జోబిడెన్ కు జై కొట్టడంతో ఆయనే ప్రెసిడెంట్ పీఠం అధిష్టించారు.    అమెరికా తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ స్వింగ్ ఓటర్లున్నారని, వారే పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్నారు. స్థానిక పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, సమీకరణాలను అనుగుణంగా అభిప్రాయాలను మార్చుకునే స్వింగ్​ ఓటర్లు డివిజన్ లో  18 శాతం వరకు ఉంటారని చెబుతున్నారు. గ్రేటర్ లోని దాదాపు 60  నుంచి 70  డివిజన్లలో స్వింగ్ ఓటర్లే కీలకం.  విద్యావంతులు, రాజకీయాలు, అభివృద్ధి అంచనా వేసేవారు, సమీకరణాలను చూసి గెలుపోటములు నిర్ధారించుకునే వారంతా స్వింగ్​ ఓటర్ల జాబితాలో ఉంటారు. ప్రస్తుతం గ్రేటర్ లో ఈసారి  రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల అభ్యర్థులకు స్వింగ్​ ఓటర్లు ఎవరి పక్షాన ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. అన్ని పార్టీలు ఇప్పటి నుంచే పోలింగ్​ సరళిని అంచనా వేసుకుంటున్నాయి. ప్రలోభాలతో పోలయ్యే ఓట్లు కొన్నింటిని ఖాతాల్లో వేసుకుంటున్నారు. ఆ తర్వాత సామాజిక వర్గాలు, కుల ప్రాతిపదికన, పథకాలకు ఆకర్షుతులు, ఏండ్ల తరబడి ఒకే పార్టీకి మద్దతుగా ఉండే ఓటర్ల వారీగా వివరాలు సేకరించుకుంటూ గెలుపోటములను అంచనా వేసుకుంటారు. అయితే  స్వింగ్​ ఓటర్లను మాత్రం అభ్యర్థులు, పార్టీలు అంచనా  వేయలేకపోతున్నాయి.   2016 గ్రేటర్​ ఎన్నికల్లో స్వింగ్​ ఓటర్లు మొత్తం అధికార పార్టీకి అండగా నిలిచారు. అందుకే కారు పార్టీ ఏకపక్ష విజయాలు సాధించి గతంలో ఎప్పుడు లేనట్టుగా ఏకంగా 99 డివిజన్లు గెలుచుకుంది. అయితే ఈసారి అలాంటి పరిస్థితులు లేవంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రభావం గ్రేటర్ లో కనిపిస్తుందని, స్వింగ్ ఓటర్ల మైండ్ సెట్ లోనూ మార్పు వస్తుందని తెలుస్తోంది. ఎల్​ఆర్​ఎస్​, బీఆర్​ఎస్​ వంటి స్కీంలు ప్రభుత్వంపై కొంత వ్యతిరేకతను పెంచాయని చెబుతున్నారు. కార్పొరేటర్ల అవినీతి, అక్రమ వ్యవహారాలపై చాలా అయిష్టతతో ఉన్నారట స్వింగ్ ఓటర్లు. దీంతో స్వింగ్​ ఓటర్లతో అధికార పార్టీకి కొంత ముప్పు ఉందని ప్రచారం జరుగుతోంది.    సాధారణంగా గెలిచే అవకాశాలున్న అభ్యర్థుల వైపు స్వింగ్ ఓటర్లు మొగ్గు చూపుతుంటారు. దీంతో వీరి ఓట్లు ఎవరికి లాభం చేకూర్చుతాయనేది సందేహంగానే మారింది. సికింద్రాబాద్ పరిధిలో స్వింగ్ ఓటర్లు బీజేపీకి మద్దతు ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు ఎక్కువుండే శేరిలింగం పల్లి ఏరియాలో కారుకు సపోర్ట్ చేయవచ్చంటున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో స్వింగ్ ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఉప్పల్​, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో  టీఆర్​ఎస్​, బీజేపీకి సమాన అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.సెటిలర్ ఓటర్లు ఎక్కువుండే కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో స్వింగ్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది.సెటిలర్లు ఎటువైపు మొగ్గు చూపితే వారికి ఫలితాలు వారికి అనుకూలంగా ఉంటాయని చెబుతున్నారు.

మానవత్వం మరిచి ఎస్సీ రైతులకి సంకెళ్లు వేసి జైళ్లో పెట్టారు: నారా లోకేష్

కృష్ణాయపాలెం ఎస్సీ రైతులకు జగన్ ప్రభుత్వం మానవత్వం మరిచి సంకెళ్లు వేసి జైళ్లో పెట్టిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. తమను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందంటూ బెయిల్ పై  విడుదలైన రైతులు లోకేశ్ తో సమావేశమై కన్నీటి పర్యంతమయ్యారు. వారిని పరామర్శించిన లోకేష్ అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసినవారే కంప్లైంట్ వెనక్కి తీసుకున్నా రైతులకు సంకెళ్లు వేయించటం జగన్ రెడ్డి శాడిజానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు.   "దాడులు దౌర్జన్యాలెన్నో భరిస్తూ ఎంతకాలమైనా వెన్నుచూప‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్షణ ఉద్యమందే అంతిమ విజ‌యమని లోకేష్ స్పష్టం చేశారు.  రైతుల పోరాటానికి తెలుగుదేశం పార్టీ అండ‌గా ఉంటుందని హామీ ఇచ్చారు. అన్నం పెట్టే అన్నదాతలు భూతల్లిని రాజధాని కోసం చేసిన త్యాగాలను లోకేష్ కొనియాడారు. అమ‌రావ‌తిని చంపేసే కుట్రల్ని నిర‌సిస్తూ శాంతియుతంగా ఉద్యమిస్తున్నవాళ్లని గుర్తు చేశారు. తమ త్యాగాల పునాదుల‌పై ఏర్పడిన ప్రజారాజ‌ధానికి స‌మాధి క‌ట్టొద్దంటూ నిన‌దించిన కృష్ణాయ‌పాలెం రైతులు, మూడుముక్కలాట‌కి మ‌ద్దతుగా వ‌చ్చిన బిర్యానీ ఆర్టిస్టుల్ని అడ్డుకోవ‌డ‌మే నేరంగా ప‌రిగ‌ణించి, ఎస్సీల‌పైనే ఎస్సీ, ఎస్టీ కేసు జగన్ రెడ్డి పెట్టించారని లోకేష్ ధ్వజమెత్తారు.

కేసీఆర్ దొర మాస్టర్ ప్లానే వేశారు! విజయశాంతి ట్వీట్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో అభ్యర్థులు స్పీడ్ పెంచారు. అయితే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ పై ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు విజయశాంతి. ఎంఐఎం పార్టీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే... కేసీఆర్ దానిని కట్టడి చేయలేకపోయారని ఆరోపించారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారిని కంట్రోలే చేయకపోగా.. ఎంఐఎం దౌర్జన్యాన్ని నిలదీసిన పార్టీలను నియంత్రించే విధంగా పోలీసు బలగాలను ప్రయోగించడానికి సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్ వేశారనే వార్తలు వస్తున్నాయని విజయశాంతి ట్వీట్ చేశారు.    'ఇంతకాలం ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను హైజాక్ చెయ్యడం లేదా ఎన్నికలు పూర్తయిన తర్వాత గెలిచిన ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులను ప్రలోభపెట్టి ఫిరాయింపులను ప్రోత్సహించడం కేసీఆర్ గారికి అలవాటుగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇలాంటి రాజకీయాలు ఫలించవనే నిర్ణయానికి రావడంతో ఏకంగా బలమైన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను శాంతిభద్రతల పేరుతో బరిలో నుంచి తప్పించడానికి గులాబీ బాస్ కొత్త ఎత్తుగడ వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కుట్రలకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తే తెలంగాణ సమాజం సహించదు, క్షమించదు అని రాములమ్మ ట్వీట్ లో చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్షాల దూకుడును తట్టుకోలేక బెంబేలెత్తిపోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఎంఐఎంతో కలసి కుట్రలు చేసి ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను చివరి క్షణంలో పోటీ నుంచి తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయని ఆమె  ట్వీట్ చేశారు.

కేసీఆర్ సభ టైంలోనే ప్రధాని టూర్! గ్రేటర్ వ్యూహమేనా?  

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగుతున్న సమయంలో ప్రధాని మోడీ హైదరాబాద్ రానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకే వస్తున్నా.. గ్రేటర్ ఎన్నికల సమయంలో పర్యటన ఉండటం పొలిటికల్ హీట్ పెంచుతోంది. అందులోనూ సీఎం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల సభ ఉన్న రోజునే.. అదే సమయానికే మోడీ హైదరాబాద్ వస్తుండటం మరింత చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  వ్యక్తిగత ఆరోపణలు, దూషణలు, రెచ్చగొట్టే ప్రసంగాలతో గ్రేటర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.    ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన పూర్తిగా అధికారిక కార్యక్రమమే అయినా.. ఎంపిక చేసుకున్న సమయంపై రాజకీయ ఆసక్తి నెలకొంది. సాధారణంగా ప్రధాని పర్యటన ఉంటే రాష్ట్రాల అధికారులకు వారం రోజుల ముందే సమాచారం వస్తుంది. ప్రధాని పర్యటనకు పోలీసులు ఏర్పాట్లు చేసుకోవడానికి వీలుగా ఇలా వారం రోజుల ముందే చెబుతారు. కాని ఈసారి ప్రధాని పర్యటనకు సంబంధించిన సమాచారం రాష్ట్ర అధికారులకు కేవలం రెండు రోజుల ముందే వచ్చింది. దీంతో పోలీసులు హడావుడిగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దీన్ని బట్టే  ప్రధాని హైదరాబాద్ పర్యటన అకస్మాత్తుగా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది.    జీహెచ్‌ ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  శనివారం సాయంత్రం 4 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ ఏర్పాట్లు కూడా చేస్తుంది. అయితే శనివారమే ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్నట్లు గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. కోవిడ్‌–19 వైరస్‌కు విరుగుడుగా  నగరానికి చెందిన భారత్‌ బయోటెక్‌ ఫార్మా కంపెనీ తయారుచేస్తున్న ‘కొవాగ్జిన్‌’ పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ప్రధాని వస్తున్నారని కేంద్ర సర్కార్ సమాచారమిచ్చింది. 28న మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా మోదీ హకీంపేట సైనిక విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి శామీర్‌పేట వద్ద గల భారత్‌ బయోటెక్‌ ల్యాబ్‌ను సందర్శిస్తారు. వ్యాక్సిన్‌ రూపకల్పనకు కృషిచేస్తున్న శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం పుణె పర్యటనకు వెళ్తారని అధికారవర్గాలు తెలిపాయి.   ఎల్బీ స్టేడియంలో 30 వేలమందితో బహిరంగసభ నిర్వహించి గ్రేటర్‌ ఎన్నికల వాతావరణాన్ని టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మలచుకోవాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. సరిగ్గా అదేరోజు ప్రధాని మోడీ అధికారిక పర్యటన ఖరారు కావడం వెనక బీజేపీ వ్యూహం ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో దూకుడుగా వెళుతూ ఓటర్లను ఆకర్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. చివరి అస్త్రంగా ప్రధాని మోడీని నగరానికి రప్పిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సీఎం బహిరంగసభ రోజే ప్రధాని నగర పర్యటన జరిగితే జాతీయ మీడియాతో పాటు స్థానిక మీడియాలోనూ ప్రధాని పర్యటనకు అధిక ప్రచారం లభించే అవకాశాలున్నాయని.. బల్దియా ఎన్నికల్లో బీజేపీకి ప్రధాని పర్యటన కొంత వరకు కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థాయి ముఖ్య నేతలు  బల్దియాలో ఎన్నికల ప్రచారం చేశారు. జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ ను కూడా బీజేపీ రంగంలోకి దింపింది.         జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి 2023లో జరగనున్న రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపునకు బాటలు వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందుకే అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  తమను గెలిపిస్తే గ్రేటర్ ప్రజలందరికి కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని బీజేపీ హామీ ఇవ్వడం.. ప్రధాని మోడీ కూడా కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలించేందుకు వస్తుండటం ఆసక్తిగా మారింది. ఇది కచ్చితంగా కమలనాధులకు కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  బీజేపీ నేతలు మాత్రం ప్రధాని మోడీ పర్యటనకు గ్రేటర్ ఎన్నికలకు సంబంధం లేదని చెబుతున్నారు.కరోనాపై ఇటీవలే సీఎంలతో ప్రధాని సమీక్ష నిర్వహించారని, అందులో వచ్చిన అభిప్రాయాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలించేందుకు ప్రధాని వస్తున్నారని క్లారిటీ ఇస్తున్నారు.   మరోవైపు  ప్రధాని మోడీ అధికారిక పర్యటన కోసం నగరానికి వస్తే ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం కేసీఆర్‌ సైతం ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ తరువాతే కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగసభకు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

బీజేపీలోకి జంప్ అని ప్రచారం చేస్తారు.. నేను అలాంటోడ్ని కాదు.. రేవంత్

జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ పార్టీలు ప్రత్యర్థులపై ఎత్తులు పై ఎత్తులు, గిమ్మిక్కులతో ఓటర్లను బోల్తా కొట్టించే పనిలో బిజీగా ఉన్నాయి. ఈ ఎన్నికలలో గెలుపు కోసం ఎంతకైనా తెగించేలా పార్టీలు, నాయకుల వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ తరుఫున ప్రచారం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి లింగోజిగూడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నాకు పదవి ఇవ్వనన్నారని… దీంతో మోడీ, షాలను కలిసి బీజేపీలో చేరబోతున్నానని దుష్ర్ఫచారానికి బీజేపీ కుట్ర చేస్తోందని అయన ఆరోపించారు. దీనికోసం టీవీ ఛానెళ్ల లోగోలతో మార్ఫింగ్ చేసిన ఫేక్ వీడియోలు గ్రేటర్ పోలింగ్ కు ఒకరోజు ముందు రాత్రి సర్క్యూలేట్ చేయడానికి పెద్ద కుట్రకు ప్లాన్ చేశారన్నారు.   తనపై వచ్చే ఇలాంటి చిల్లర ప్రచారాలపై కార్యకర్తలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. నేను జెండా మోసేందుకే తప్ప.. పదవుల కోసం కాంగ్రెస్ లో చేరలేదని అయన స్పష్టం చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరెడ్డిపై దుష్ర్ఫచారం చేసినట్టు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో నాపై దుష్ర్ఫచారం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై నాకు నిర్దిష్టమైన సమాచారం కూడా ఉందన్నారు.   దుబ్బాక ఎన్నికకు ఒక్క రోజు ముందు కాంగ్రెస్ అభ్యర్థి టీఆర్ఎస్ లో చేరుతున్నాడంటూ ఒక ఛానెల్ లోగోతో దుష్ర్పచారాం చేశారని, అక్కడి యువత అది నిజమేననుకుని గందరగోళంలో పడి బీజేపీకి ఓటేశారన్నారు. అయితే ఈ కుట్రను గుర్తించి మేము తిప్పికొట్టే సరికే 40 శాతం పోలింగ్ కూడా అయిపోయిందని, ఇప్పుడు మరోసారి ఇలాంటి కుట్రను నాపై ప్రయోగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని రేవంత్ ఆరోపించారు.

గందరగోళం నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ మరో సారి... ఆస్ట్రాజెనికా వెల్లడి 

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా ఫార్మా సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాలలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో వ్యాక్సిన్ పనితీరును మరింత లోతుగా పరిశీలించేందుకు ప్రపంచవ్యాప్తంగా మరోమారు ట్రయల్స్ నిర్వహించాలని ఆస్ట్రాజెనికా పీఎల్సీ నిర్ణయించింది. తాజాగా ఈ విషయాన్ని సంస్థ సంస్థ సిఇవో పాస్కల్ సోరియట్ స్వయంగా వెల్లడించారు. వ్యాక్సిన్ ఫలితాల నివేదిక విడుదలైన తరువాత మొట్టమొదటిసారిగా అయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యాక్సిన్ పై జరుగుతున్న అధ్యయనంలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయని, దీంతో మరోసారి ట్రయల్స్ కు వెళుతున్నామని ఆయన చెప్పారు.   ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తక్కువ డోస్ తీసుకున్న వారిలో ఎక్కువ రోగ నిరోధక శక్తి పెరిగినట్టు ట్రయల్స్ లో రిపోర్టులు రాగా, దీని ఆధారంగానే వ్యాక్సిన్ ను మరింత లోతుగా విశ్లేషించనున్నామని పాస్కల్ తెలిపారు. అయితే, ఇప్పటికే అనుమతులు ఉన్నందున తాజా ట్రయల్స్ చాలా త్వరితగతినే పూర్తవుతాయని, అంతేకాకుండా చాలా దేశాల్లో ట్రయల్స్ జరుగుతాయని, వ్యాక్సిన్ పనితీరుపై అంతర్జాతీయ అధ్యయనం చేసిన తరువాత దీన్ని విడుదల చేస్తామని అయన తెలిపారు.   అదనపు ట్రయల్స్ కు మళ్ళీ నియంత్రణా సంస్థల నుంచి మరోమారు అనుమతి కోరాల్సిన అవసరం లేదని తెలిపిన ఆయన, యూకే, యూరప్ తో పాటు మరిన్ని దేశాల్లో ట్రయల్స్ జరుగుతాయని తెలిపారు. మరి కొన్ని దేశాల్లో ట్రయల్స్ కు అనుమతులు ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అయితే అమెరికాలో టీకాకు ఎఫ్డీయే నుంచి అంత త్వరగా అనుమతులు రావని, వేరే దేశంలో జరిగిన ట్రయల్స్ ఆధారంగా అమెరికా నిర్ణయం తీసుకోదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

స్వామీజీ ఆర్డర్ వేశారు.. మంత్రి గారు గప్ చుప్

జగన్ ప్రతిపక్షం లో ఉన్న సమయంలో ఆయనతో యాగాలు చేయించి మరీ తన ఆశీస్సులతో ఆయనను సీఎం పదవిలో కూర్చోబెట్టారు శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. అప్పటి నుండి స్వామి వారి హవా ఏపీలో అప్రతిహతంగా సాగుతోంది. దీంతో ఇటు ఏపీలోని ఉన్నతాధికారులతో పాటు బడా బడా నేతలు కూడా శారదా పీఠానికి క్యూ కడుతున్నారు. అయితే కొద్దీ రోజుల క్రితం తన పుట్టినరోజుకు అన్ని దేవాలయాల్లో పూజలు చేయించాలనే ఆర్డర్లు ఇప్పించి ఆ తరువాత ఆ విషయం వివాదం కావడంతో ఆ తరువాత వెనక్కు తగ్గారు. ఇప్పుడు ఎక్కడ ఏ దేవాలయంలో ఎవరు ట్రస్టీగా ఉండాలనేది కూడా ఆయనే డిసైడ్ చేసేస్తున్నారు.   తాజాగా భీమిలి దగ్గర గుడిలోవలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం విషయంలో కూడా అదే జరిగింది. ట్రస్టు బోర్డులో ఎవరెవరిని అపాయింట్ చేయాలో స్వరూపానందస్వామి పేర్లు ఇస్తే.. అక్కడి అధికారులు దానిని ఆమోదించేసారు. ఈ నియామకాలకు దేవాదాయశాఖ కమిషనర్ దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చేసిందట. అయితే ఎటొచ్చి స్థానిక ఎమ్మెల్యే ప్లస్ మంత్రి కూడా అయిన అవంతి శ్రీనివాసరావుకు మాత్రం అసలు సమాచారం లేదట. అయితే తీరా తెలిశాక ఆయన మండిపడ్డారట. ఫైనల్ గా ఆ రికమెండేషన్ ఎవరు చేశారో తెలిశాక పాపం గప్ చుప్ గా నోరు మూసుకున్నారని సమాచారం.

ప్రచారంలో కరోనా రూల్స్ పాటించాల్సిందే! ఎస్ఈసీ తాజా ఆదేశాలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఎవరూ కరోనా మార్గదర్శకాలు పాటించడం లేదు. మాస్కులు కూడా లేకుండానే గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో ఎక్కడా శానిటైజర్లు వాడటం లేదు. రాజకీయ నేతలు కూడా మాస్కులు లేకుండానే ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో హైదరాబాద్ లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. రాజకీయ పార్టీలకు మరోక సారి కరోనా మర్గదర్శకాలు జారీ చేసింది.    ఎన్నికల సందర్భంగా నిర్వహించే ఇంటింటి ప్రచారం, రోడ్‌షోలు, ర్యాలీల్లో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు, కార్యకర్తలు కచ్చితంగా కరోనా కోడ్‌ నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశించింది. పలు పార్టీలు ఎన్నికల సంఘం జారీ చేసిన కోవిడ్‌ నిబంధనలు పాటించడం లేదని గుర్తు చేసిన ఎన్నిక సంఘం.. ఎట్టి పరిస్థితుల్లోనూ కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించరాదని సూచించింది. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. అన్నిపార్టీల అభ్యర్ధులు, వారి కార్యకర్తలు ఎన్నికల ప్రచారం సందర్భంగా తప్పని సరిగా ముఖానికి మాస్క్‌ ధరించాలి. అలాగే శానిటైజర్లను వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించింది.    ఇంటింటి ప్రచారానికి వెళ్లినప్పుడు అభ్యర్ధితో పాటు ఐదుగురు మాత్రమే వెళ్లాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇతరులు ప్రచారంలో పాల్గొంటే తప్పని సరిగా ఫేస్‌మాస్క్‌ ధరించాలని ఎన్నికల కమిషన్ సూచించింది. తప్పని సరిగా శానిటైజర్‌ వినియోగిస్తూ భౌతిక దూరం పాటించాలని సూచించింది. రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించే సమయంలోనూ తప్పని సరిగా ఫేస్‌మాస్క్‌లను ప్రతి ఒక్కరూ ధరించేలా చూడాలని... చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని..సమావేశాలు, బహిరంగ సభల్లోనూ భౌతిక దూరం తప్పని సరి అని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది.

రెచ్చగొట్టే మాటలు.. విద్వేష ప్రసంగాలు! గాడి తప్పిన గ్రేటర్ ప్రచారం

రోహింగ్యాలు.. పాకిస్తాన్.. సర్జికల్ స్ట్రైక్.. కూల్చేస్తాం.. తరమికొడతాం. ఇవి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో వినిపిస్తున్న మాటలు. స్థానిక ఎన్నికల్లో సాధారణంగా స్థానిక సమస్యలే కీలకంగా ఉంటాయి. స్థానిక సమస్యలు, ప్రజల అవసరాల అంశాలపైనే గతంలో ప్రచారాలు జరిగేవి. కాని ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్థానిక అంశాల ప్రస్తావనే రావడం లేదు. జాతీయ , అంతర్జాతీయ అంశాలు గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా మారిపోయాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ కలకలం రేపుతున్నారు లీడర్లు.    నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో నేతల విద్వేశపూరిత ప్రసంగాలు దుమారం రేపుతున్నాయి. అన్ని పార్టీల నేతలు పోటీపడీ మరీ నోటికి పనిచెబుతున్నారు. ఒకరిని మించి మరొకరు రెచ్చగొట్టే ప్రసంగాలతో విరుచుకుపడుతున్నారు. ఇష్టమెచ్చినట్లుగా మాట్లాడుతూ అలజడి రేపుతున్నారు. జనం సమస్యలు పట్టించుకోకుండా.. కాంట్రవర్సీ కామెంట్లతో కాక రేపుతున్నారు. ప్రచారాల తీరు, నేతల దూకుడుతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం దారి తప్పిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులతో నగర ప్రజల్లో ఆందోళన కూడా పెరుగుతోంది.    బీజేవైఎం చీఫ్, బెంగళూరు బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య రాకతో మొదలైన గ్రేటర్‌ రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. మంగళవారం హైదరాబాద్‌ లో పర్యటించిన సూర్య.. ఎంఐఎం నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పాకిస్తాన్‌ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు.అసద్ ను పాకిస్తాన్‌ జాతిపిత మహ్మద్‌ అలీ జిన్నాతో పోల్చారు సూర్య. దేశ విభజన సమయంలో హైదరాబాద్‌ సంస్థానాన్ని పాకిస్తాన్‌లో విలీనం చేయాలని జిన్నా డిమాండ్‌ చేశారని, ఒవైసీ కూడా అదే ఆలోచన విధానం ఉన్న వ్యక్తి అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున రొహింగ్యాలు, పాకిస్తాన్‌ ఓట్లు ఉన్నాయని.. పాకిస్తాన్‌ మద్దతు దారులే ఎంఐఎం పార్టీలో ఉన్నారని వ్యాఖ్యానించారు. తేజస్వి సూర్య విమర్శలపై ఒవైసీ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లో పాకిస్తాన్‌, రొహింగ్యా ఓటర్లు ఉంటే కేంద్రహోం మంత్రి అమిత్‌ షా ఏం చేస్తున్నారు..? నిద్రపోతున్నారా? అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే భాగ్యనగరంలో రొహింగ్యాలకు షెల్టర్‌ ఇచ్చారని ఒవైసీ గుర్తుచేశారు.    ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలతో అలజడి సృష్టిస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పాతబస్తీలో సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామన్న ఆయన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. సంజయ్‌ కామెంట్స్‌ తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగానూ హాట్‌ టాపిక్‌గా మారాయి. సంజయ్ వ్యాఖ్యలపై దుమారం రేగుతుండగానే.. ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ రెచ్చిపోయారు. అక్రమ కట్టడాల తొలగింపుపై మాట్లాడుతూ.. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్‌ ఘాట్స్‌ను కూల్చివేయాలంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అక్భర్ కామెంట్లకు కౌంటరిచ్చిన బండి సంజయ్.. పీవీ, ఎన్టీఆర్ సమాధులు కూల్చివేస్తే రెండు గంటల్లో ఎంఐఎం కార్యాలయం దారుస్సలాంను నేలమట్టం చేస్తామని హెచ్చరించాారు. బండి సంజయ్. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.    గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు చేస్తున్న ప్రసంగాలపై నగర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని, ప్రస్తుత పరిణామాలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం వస్తుందని చెబుతున్నారు. గ్రేటర్ ప్రచారంలో జరుగుతున్న పరిణామాలపై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునే విధంగా పథకాలు, మేనిఫేస్టోలు తయారుచేసి, ఓటర్లను ఆకర్శించాలే గానీ ఇలా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలుకుతున్నారు.

సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు! రెచ్చగొట్టే పోస్టులు వద్దన్న డీజీపీ 

జనాలను రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. గ్రేటర్ ఎన్నికలను ఆసరాగా తీసుకొని విధ్వంసక శక్తులు మత కల్లోలాలకు కుట్ర చేస్తున్నాయని చెప్పారు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా వ్యవహిరిస్తే కఠినచర్యలు తప్పవని.. కుట్రలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. సోషల్ మీడియా పైన పోలీస్ శాఖ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసిందన్నారు. నూతన టెక్నాలజీని ఉపయోగించి అలాంటి వారిని గుర్తిస్తున్నామన్నారు. వదంతులు, నకిలీ వార్తల గురించి తెలిస్తే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలన్నారు.    తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయంగా ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. గత ఆరేళ్లుగా ప్రజల సహకారంతో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పోలీస్‌ శాఖ అన్ని చర్యలు తీసుకుందని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే వాటిని ఎవ్వరు ఫార్వర్డ్‌‌ చేయ్యొద్దని తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని కోరారు.    గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో 51,500 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశామని, ఎమర్జెన్సీ కోసం బ్లూ కోడ్స్ సీనియర్ అధికారులను అందుబాటులో ఉంచామని డీజీపీ తెలిపారు.ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై 50 కేసులు నమోదు చేశామని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తాం అన్న నేతలపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు. రోహింగ్యాలపై ఇప్పటి వరకు 50 నుంచి 60 కేసులు నమోదు చేశామని, క్రిమినల్ చరిత్ర ఉన్న వారే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఓయూ రిజిస్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య పై కేసు నమోదు చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన సస్పెన్షన్‌ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.    గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని క్యాట్ కూడా సమర్థించింది. ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీ దాఖలు చేసిన పిటిషన్‌ను క్యాట్‌ కొట్టివేసింది. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్‌ పై హైకోర్టు స్టే ఇచ్చింది.   హైకోర్టు ఆదేశాలను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది. మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఏబీ వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. ఛార్జిషీట్ ను ఏబీ వెంకటేశ్వరరావుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఫ్రీ కరోనా వ్యాక్సిన్.. ఎల్‌ఆర్‌ఎస్ రద్దు! గ్రేటర్ బీజేపీ మేనిఫెస్టో 

గ్రేటర్ హైదరాబాద్‌లో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. గ్రేటర్‌లో అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తామని ప్రకటించింది. నగరంలోని అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ సేవలు అందిస్తామని తెలిపింది. విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు, వై-ఫై సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. పేదలకు వంద యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని, లంచాలు లేని, నూటికి నూరుశాతం పారదర్శక జీహెచ్ఎంసీ పాలన సాగిస్తామని తెలిపింది.    మహిళల కోసం ఐదేళ్లలో 15 కొత్త మహిళా పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు, మహిళల కోసం నగరంలో కిలోమీటరుకో టాయిలెట్, టూవీలర్లు, ఆటోలపై ఇప్పటివరకు ఉన్న చలాన్లు రద్దు, గ్రేటర్‌లో ఇంటింటికి నల్లా కనెక్షన్, 24 గంటలు ఉచితంగా మంచినీరు సరఫరా, కులవృత్తులకు ఉచిత విద్యుత్ , ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ, వరదల నివారణకు సమగ్ర ప్రణాళిక, వరదసాయం కింద అర్హులందరికీ రూ.25 వేల చొప్పున నగదు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది బీజేపీ.    మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేతుల మీదగా గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. సామాన్యుడి ఆకాంక్షల మేరకే మేనిఫెస్టో విడుదల చేస్తున్నామని, ప్రజల సలహాలు స్వీకరించి మేనిఫెస్టోను రూపొందించామని ఫడ్నవీస్ తెలిపారు. కరోనా పేరుతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రులు సామాన్యులను దోచుకున్నాయని చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ప్రజలపై రూ.15 వేల కోట్ల భారం మోపారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మోడీ సర్కారు కాపాడుతోందని చెప్పారు. ఓటు బ్యాంకు కోసం చేసిన తప్పిదాల వల్లే హైదరాబాద్ మునిగిపోయిందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు.

49 మంది అభ్యర్థులకు నేరచరిత్ర! గతంలో కంటే బెటర్

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల బరిలో 49 మంది నేర చరిత్ర గల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌, మజ్లిస్‌ అభ్యర్థుల అఫిడవిట్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌ నుంచి తీసుకుని విశ్లేషించిన ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. నేరచరిత కలిగిన అభ్యర్థులు పార్టీల వారిగా చూస్తే టీఆర్‌ఎస్‌ నుంచి 13 మంది, బీజేపీ తరపున 17 మంది, కాంగ్రెస్‌ నుంచి 12, మజ్లిస్‌ నుంచి ఏడుగురు ఉన్నారు. ఎన్నికల బరిలో ఉన్న ఆరుగురి మహిళా అభ్యర్థులపైనా కేసులున్నాయని ఎఫ్‌జీజీ తెలిపింది. గ్రేటర్‌లో నేరచరిత్ర కలిగిన వారు పోటీ చేస్తున్న వార్డుల సంఖ్య 41 కాగా .. మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులందరికీ నేరచరిత్ర ఉందని ఎఫ్‌జీజీ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలిపారు.    కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ప్రీతం కుమార్‌ రెడ్డిపై అత్యధికంగా 9 కేసులు ఉన్నాయి. ఆ తర్వాత షాలిబండ 48 వార్డు నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం అభ్యర్ధి మహ్మద్‌ ముస్తఫా అలీపైన 7 కేసులు ఉన్నాయి. మారెడ్‌పల్లి వార్డు బీజేపీ అభ్యర్థి టి. శ్రీనివాస్‌ రెడ్డిపై 5 కేసులు, మోండా మార్కెట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో దిగిన ఆకుల రూపపైన 5 కేసులు ఉన్నాయని ఎఫ్‌జీజీ వెల్లడించింది. మిగతా వారిలో కొందరిపై నాలుగు, మరికొందరిపై మూడు, రెండు కేసులు ఉండగా చాలా మంది అభ్యర్ధులు కేవలం ఒకే కేసులో నిందితులుగా ఉన్నారు.   గత గ్రేటర్‌ ఎన్నికల్లో 72 మంది నేరచరితులకు వివిధ పార్టీలు టికెట్లు ఇవ్వగా ఈ సారి 49 మందే ఉన్నారు. పోటీ చేస్తున్న వారిలో నేర చరిత్ర ఉన్న వారు తగ్గడం శుభపరిణామని పద్మనాభరెడ్డి చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో నేరమయ రాజకీయాలు తగ్గిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మంచి నాయకుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఓటు వేసి తమకు అవసరమైన వారిని ఎన్నుకోవాలని పద్మనాభరెడ్డి విజ్ఞప్తి చేశారు. 

బీజేపీ, ఎంఐఎంల మధ్య ఫోన్ కాన్ఫరెన్స్! అమిత్ షానే సంధానకర్తన్న రేవంత్ రెడ్డి

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో నేతలు చేస్తున్న హాట్ కామెంట్స్ కాక రేపుతున్నాయి. అక్బరుద్దీన్, బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. బీజేపీ, ఎంఐఎం నేతల మధ్య ప్రతిరోజు రాత్రి ఫోన్ కాన్ఫరెన్స్ నడుస్తోందని ఆరోపించారు. ఫోన్ కాన్ఫరెన్స్ కు అమిత్ షానే సంధానకర్తగా ఉన్నారని చెప్పారు. రాత్రి సమయంలో బండి సంజయ్, అరవింద్, అసద్, అక్బరుద్దీన్ స్క్రిప్ట్ తయారు చేసుకోవడం..ఉదయం సురభి నాటకానికి తెర లేపుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.   పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను బీజేపీ, ఎంఐఎంలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని రేవంత్ రెడ్డి విమర్శించారు. సొంత పార్టీ నేతలైన అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్ లను గౌరవించుకోలేని బీజేపీ.. పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తోందని ఎద్దేవా చేశారు. పీవీ, ఎన్టీఆర్ లపై నిజంగా బీజేపీకి ప్రేమ ఉంటే వారిద్దరికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29న హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా.. ఆ మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదని తెలిపారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదన్నారు. ప్రజలు ఇలాంటి ఎమోషన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు రేవంత్ రెడ్డి.

కాయో పండో తేలని ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కథ.. తయారీలో తప్పు జరిగిపోయిందట

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి నుండి కాపాడే వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోంది. సామాన్యులలో ఎంతో ఆసక్తిని రేపుతున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తుది దశ ట్రయల్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్ గురించి ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా ఫార్మాలు మరో సంచలన విషయం ప్రకటించాయి. తాము రూపొందించిన కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియలో తప్పు జరిగిపోయిందని, దీంతో వ్యాక్సిన్ ట్రయల్స్ లో వచ్చిన ప్రాధమిక ఫలితాలు అనేక ప్రశ్నలను రేపాయని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. తామిచ్చిన వ్యాక్సిన్ డోస్ లను తీసుకున్న వారిలో కరోనా నిరోధక శక్తి భారీగా పెరిగిందని ఆక్స్ ఫర్డ్ ప్రకటించిన కొన్ని రోజుల తరువాత, కొంతమంది వాలంటీర్లు రెండు డోస్ లను తీసుకున్నా, వారిలో వ్యాధి నిరోధకత పెంపొందలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఆస్ట్రాజెనికా ఫార్మా స్పందించింది. ఆ వాలంటీర్లు తీసుకున్న వ్యాక్సిన్ తయారీలో తప్పు జరిగిందని తెలిపింది.   అసలు విషయం ఏంటంటే ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తక్కువ డోస్ తీసుకున్న వారిలో కరోనా వైరస్ ను ఎదుర్కునే శక్తి ఎక్కువగా ఉందని, అయితే నిర్దేశించిన రెండు డోస్ లను తీసుకున్న వారిలో మాత్రం రోగనిరోధక శక్తి ఆశించిన స్థాయిలో లేదని తన ట్రయల్స్ ఫలితాల రిపోర్టులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తక్కువ డోస్ తీసుకున్న వారిలో 90 శాతం పనితీరు కనిపించిందని, అయితే రెండు డోస్ లను పొందిన వారిలో ఇది 62 శాతంగా నమోదైందని ఆస్ట్రాజెనికా వెల్లడించింది. ప్రస్తుతం బ్రిటన్ తో పాటు బ్రెజిల్ లోనూ ఈ వ్యాక్సిన్ పైన పెద్ద ఎత్తున ట్రయల్స్ జరుగుతున్నాయి. ఆస్ట్రాజెనికా ఈ రెండు దేశాల్లో జరుగుతున్నా ట్రయల్స్ ఫలితాలను విడుదల చేయగా వాటిలో ఈ తేడాలు కనిపించాయి. దీంతో ప్రజలలో ఈ వ్యాక్సిన్ పై గందరగోళం నెలకొంటున్నది.

రైతులను అడ్డుకుంటున్న పోలీసులు! ఢిల్లీ బార్డర్ లో హై టెన్షన్! 

రైతుల ఆందోళనతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో హై టెన్షన్‌ నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రైతు, కార్మిక సంఘాలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పంజాబ్‌ నుంచి వేలాది మంది రైతులు హర్యానా మీదుగా రాజధాని వస్తుండగా... వారిని అడ్డుకునేందుకు హర్యానా సర్కార్‌ పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. బారికేడ్లు పెట్టి ఎక్కడిక్కడ రైతులను, కార్మిక సంఘాల నేతలను అడ్డుకుంటోంది. పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌, రాజస్తాన్‌ హర్యానా రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీకి బయలుదేరడంతో ఢిల్లీ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. రైతులను జల ఫిరంగులు ప్రయోగిస్తూ ఎవరినీ కూడా నగరం లోపలకు అనుమతించకుండా అడ్డుకుంటున్నారు. ఢిల్లీ సరిహద్దులైన గురుగ్రామ్, ఫరీదాబాద్ వద్ద కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.    రైతుల నిరసనలతో రెండు రోజుల పాటు పంజాబ్‌కు బస్సు సర్వీసులను హర్యానా ప్రభుత్వం నిలిపివేసింది. హర్యానాలో బారీగేట్లను పెట్టి ట్రాఫిక్‌ను మళ్లించారు. పంజాబ్‌కు చెందిన వేలాది రైతులు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కవాతుగా ఢిల్లీకి బయలుదేరారు. వారంతా హర్యానా సరిహద్దు వద్ద సమావేశమయ్యారు. దీంతో వారిని అడ్డుకునేందుకు హర్యానా ప్రభుత్వం తన భద్రతా సిబ్బందిని సరిహద్దుల దగ్గర మోహరించింది. కరోనావైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం నగరంలో ఎటువంటి ర్యాలీని అనుమతించడం లేదు. దీంతో ఢిల్లీ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఏపీ బీజేపీ నాయకత్వం తీరు... ఏమీ బాగోలేదట!

తిరుపతిలో మేమే పోటీ చేస్తాం   ఏకపక్షంగా అభ్యర్ధిని ఎలా ప్రకటిస్తారు?   అమరావతి-పోలవరంపై స్పష్టత కావలసిందే   జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ కావాలన్న పవన్   నద్దాతో జనసేనాధిపతి భేటీ   బీజేపీ ఏపీ నాయకత్వ పనితీరుపై జనసేనాధిపతి పవన్‌కల్యాణ్.. ఆ పార్టీ జాతీయ దళపతి నద్దాకు ఫిర్యాదు చేశారా? అమరావతిపై జీవీఎల్, సోము, విష్ణువర్దన్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను, జనసేనాధిపతి కమలదళపతికి ఫిర్యాదు చేశారా? అమరావతిలోనే రాజధాని ఉండాలన్న విషయంపై బీజేపీ స్పష్టత ఇవ్వాలని కోరారా? వీటికి మించి... తిరుపతి లోక్‌సభ ఎన్నికలో తమ పార్టీ పోటీచేస్తుందని స్పష్టం చేశారా? అసలు తమతో సంప్రదింకుండానే ఎంపీ జీవీఎల్.. బీజేపీ అభ్యర్ధి పోటీ చేస్తారని ప్రకటించడంపై పవన్ అగ్గిరాముడయ్యారా?.. తాజాగా ఢిల్లీలో బీజేపీ బాస్ నద్దాతో, జనసేనాధిపతి పవన్ భేటీ వివరాలివేనని జనసేన వర్గాలు చెబుతున్నాయి.   జనసేన  వర్గాల సమాచారం ప్రకారం... రానున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో,  జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని పవన్ స్పష్టం చేశారట. బీజేపీ నాయకత్వ సూచన ప్రకారం తాము గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకున్నందున, తిరుపతి లోక్‌సభ తమకే ఇవ్వాలని పవన్, బీజేపీ బాసును కోరారట. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్న తమ అభిప్రాయం తెలుసుకోకుండా, తమతో చర్చింకుండానే తిరుపతిలో బీజేపీ పోటీ చేస్తుందని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు  చెబుతున్నారు. అసలు తాము తిరుపతి విషయంలో ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదని, అయితే ఏదో లీకు వార్తలకు బీజేపీ నేతలు  స్పందించడమంటే.. తమను అవమానించినట్లేనని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.   అదేవిధంగా అమరావతి అంశంపై,  రాష్ట్ర బీజేపీ నాయకత్వం వ్యవహారశైలిపై పవన్ ఫిర్యాదు చేశారట. రాజధాని అమరావతిలోనే ఉండాలన్నది జనసేన విస్పష్ట విధానమని, కానీ జీవీఎల్-సోము వీర్రాజు-విష్ణువర్దన్‌రెడ్డి అందుకు విరుద్ధమైన ప్రకటలిచ్చి,  రైతుల్లో గందరగోళం రేపడాన్ని నద్దా వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. బీజేపీ అమరావతికి అనుకూలమని చెబితేనే, తాను మీకు మద్దతునిచ్చిన విషయాన్ని నద్దాకు గుర్తు చేశారట. దీనిపై ఏపీ నాయకత్వం స్పష్టతనివ్వాలని సూచించారు. రాష్ట్ర  బీజేపీ నాయకత్వం, తాము ఆశించిన స్థాయిలో జగన్ ప్రభుత్వంపై పోరాడటం లేదని.. కొన్ని సంఘటనలు-అంశాలను నద్దా దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం.   అటు పోలవరంపైనా గందరగోళం నెలకొందని, ఆ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టాలని పవన్ కోరారట. అయితే ఆ విషయంలో కేంద్రం ఒకే అభిప్రాయంతో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం రావడంలో ఆలస్యమవతుతోందని నద్దా వివరించారట. రెండు పార్టీల మధ్య కీలక అంశాల్లో అభిప్రాయబేధాలు తలెత్తుతున్నందున, తక్షణమే రెండు పార్టీలతో సమన్వయ కమిటీ వేయాలని పవన్ సూచించారట.  అందుకు నద్దా అంగీకరించినట్లు చెబుతున్నారు. తాము హైదరాబాద్‌కు వస్తున్నందున, మరోసారి అక్కడ చర్చిద్దామని పవన్‌తో అన్నారట.  -మార్తి సుబ్రహ్మణ్యం

రాములమ్మకు సిగ్నల్ రాలేదా! ఆ సెంటిమెంటే భయపెడుతోందా? 

తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరున్న విజయశాంతి రాజకీయ భవిష్యత్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ గా ఉన్న విజయశాంతి.. కొంత కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ప్రజాక్షేత్రంలో తిరగకున్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు రాములమ్మ. టీఆర్ఎస్ సర్కార్, సీఎం కేసీఆర్ పని తీరుపై ఆమె ఘాటుగా ఆరోపణలు సంధిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ లను వ్యక్తిగతంగానూ టార్గెట్ చేస్తున్నారు విజయశాంతి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో ఆమె బీజేపీలో చేరతారనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. కాని కమలం గూటికి ఇంకా చేరలేదు రాములమ్మ.    దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనే విజయశాంతితో సమావేశమయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మెదక్ జిల్లాకు గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన రాములమ్మ దుబ్బాకలో కాంగ్రెస్ తరపున ప్రచారం కూడా చేయలేదు. దీంతో అప్పుడే ఆమె బీజేపీలో చేరతారని భావించారు. కాని ఎందుకో ఆమె జాయినింగ్ ఆగిపోయింది. దుబ్బాకలో రఘునందన్ రావు విజయంతో ఆమె బీజేపీలో చేరడం ఖాయమనుకున్నారు. అది కూడా జరగలేదు. గ్రేటర్ ఎన్నికలకు ముందు విజయశాంతి కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. ఈనెల 14న రాములమ్మ ఢిల్లీకి వెళుతున్నారని, జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. కాని ఆమె ఢిల్లీ వెళ్లలేదు.. బీజేపీలో చేరలేదు. గ్రేటర్ పోలింగ్ సమయం దగ్గరపడుతున్నా విజయశాంతి కమలం గూటి చేరే ముహుర్తం ఇంకా ఫిక్స్ కాలేదు.    బీజేపీలో విజయశాంతి చేరిక ఆలస్యమవుతుండగా.. శాసనమండలి చైర్మెన్ స్వామి గౌడ్ ఢిల్లీకి వెళ్లి జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. స్వామి గౌడ్ బీజేపీలో చేరడం.. ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా విజయశాంతి ఇంకా జాయిన్ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. విజయశాంతి బీజేపీలో చేరుతారని రాష్ట్ర నేతలు కూడా చెబుతూ వస్తున్నారు. కాని ముహుర్తం ఫిక్స్ చేయడం లేదు. దీంతో విజయశాంతి బీజేపీలో చేరికపై కొత్త చర్చలు మొదలయ్యాయి. విజయశాంతి పార్టీలో చేరికకు బీజేపీ హైకమాండ్ ఇంకా సిగ్నల్ ఇవ్వలేదనే చర్చ జరుగుతోంది. దీనికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు.    రాజకీయాల్లో విజయశాంతికి ఐరెన్ లెగ్ అనే ప్రచారం ఉంది. ఆమె ఏ పార్టీలో చేరినా ఆ పార్టీకి వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెబుతుంటారు. 2009లో విజయశాంతి టీఆర్ఎస్ లో చేరగా.. ఆ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. 56 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 10 ఎమ్మెల్యే సీట్లనే గెలుచుకుంది. కేసీఆర్ తో పాటు ఆమె మాత్రం ఎంపీలుగా విజయం సాధించారు. 2014లో రాములమ్మ కాంగ్రెస్ లో చేరగా.. ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు విజయశాంతిని ప్రచార కమిటి చైర్మెన్ గా నియమించింది కాంగ్రెస్. ఆ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కథ మారలేదు. దీంతో విజయశాంతి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మంచి ఫలితాలు రావనే సెంటిమెంట్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలోనే విజయశాంతి చేరికపై బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారని చెబుతున్నారు. విజయశాంతికి ఉన్న ఐరెన్ లెగ్ ముద్ర కమలనాధులను భయపెడుతున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలకు ముందు ఆమె పార్టీలో చేరితే వ్యతిరేక ఫలితాలు వస్తాయోమనన్న ఆందోళన కొందరు బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారట. అందుకే గ్రేటర్ ఎన్నికల తర్వాతే విజయశాంతిని పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ నిర్ణయించిందని చెబుతున్నారు.

ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందని చార్మినార్‌ను కూల్చాలంటే! 

పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు విజయశాంతి. అక్భరుద్దీన్ ఒవైసీకి, ఎంఐఎం నేతలకు ఆమె చురకలంటించారు. అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఆక్రమణల పేరుతో పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలని డిమాండ్ చేస్తే, మరి కొందరు ప్రజలు ఎఫ్‌టీఎల్ వాటర్ సమస్యలో ఉంది కాబట్టి తాజ్‌మహల్‌ని కూల్చమని అనవచ్చని విజయశాంతి ట్వీట్ చేశారు. ట్రాఫిక్‌కు అడ్డంగా ఉంది కనుక చార్మినార్‌ను కూల్చాలని కూడా అనవచ్చని ఆమె అన్నారు. ఈ విధమైన ప్రకటనలు అక్బరుద్దీన్ ఒవైసీ జీ ఎర్రగడ్డ ప్రాంతంలో మాట్లాడినప్పుడు చేసినందువల్ల.. స్థల ప్రభావంగా భావించి పెద్దగా స్పందించనవసరం లేదని అభిప్రాయపడుతున్నానని విజయశాంతి చురకలంటించారు.