సీఎస్ కు నిమ్మగడ్డ మూడో లేఖ! హైకోర్టు తీర్పును జత చేసిన ఎస్ఈసీ 

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వెనక్కి తగ్గడం లేదు. వచ్చేఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటున్నారు. ఇప్పటికే సీఎస్‌ నీలం సాహ్నికి రెండుసార్లు లేఖ రాశారు. తాజాగా ఆయన మళ్లీ మరోలేఖ రాశారు. ఇందులో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహాయ, సహకారాలు అందించాలని కోరినట్లు తెలుస్తోంది.ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఈనెల 17న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కూడా ఆ లేఖతో పాటు నిమ్మగడ్డ పంపించినట్లు సమాచారం. ఎన్నికల సంఘం జారీ చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పునూ, ప్రభుత్వం నుంచి అవసరమైన సహచారం కోసం ఎన్నికల సంఘం మూడోరోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్న హైకోర్టు సూచననూ ప్రస్తావించారని సమాచారం. హైకోర్టు తీర్పు కాపీని లేఖకు నిమ్మగడ్డ జతచేసి పంపినట్లు చెబుతున్నారు. రాజ్యాంగ బద్ధ సంస్థలకు ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందని లేఖలో నిమ్మగడ్డ సీఎస్ కు గుర్తుచేశారని తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణ, కమిషన్ విధి నిర్వహణలో ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తీర్పులో న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ సహకారంపై తమకు మళ్లీ నివేదిక సమర్పించాలని తీర్పులో ఎన్నికల కమిషన్‌ను ధర్మాసనం ఆదేశించింది. ఇదే విషయాన్ని తన లేఖలో ఎన్నికల కమిషనర్ ప్రస్థావించారు.    స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధమని ఎన్నికల సంఘం అంటోంది. కరోనా తీవ్రత కారణంగా ఇప్పుడే ఎన్నికలు వద్దంటోంది ప్రభుత్వం. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రెండు సార్లు చీఫ్ సెక్రటరీ నీలం సాహ్నికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాశారు. అయితే ఆమె నుంచి సరైన ప్రతిస్పందన రాలేదు. దీంతో సీఎస్ కు నిమ్మగడ్డ రమేశ్ ముచ్చటగా మూడోసారి లేఖ రాశారు. ఎన్నికల ఏర్పాట్లకు సహకరించేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని ఆ లేఖలో సీఎస్ ను నిమ్మగడ్డ కోరారు.    ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, పంచాయతీరాజ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సీఎస్ సహకరించకపోవడంతో మీటింగ్‌ వాయిదా పడుతూ వస్తోంది. సోమవారం ఏర్పాటు చేసిన మీటింగ్‌కు అధికారులు ఎవ్వరు రాలేదు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు, ఆదేశాలు లేవని అధికారులు చెబుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్‌ నిర్వహించాలని నిమ్మగడ్డ రమేశ్‌ పట్టుదలతో ఉన్నారు. దీంతో  సీఎస్‌ నీలం సాహ్నికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మరో లేఖ రాశారు. ఎస్ఈసీ రాసిన మూడో లేఖపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.

అమరావతికి చేసిన ఖర్చు కూడా చెప్పలేరా.. జగన్ సర్కార్ పై హైకోర్టు సీరియస్ 

ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతికి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని, అదే సమయంలో నిర్మాణ పనులు ఆగిపోవడంతో జరిగిన నష్టం గురించి కూడా వివరాలు ఇవ్వాలని చాలా రోజుల కిందట హైకోర్టు ఆదేశించిన సంగతి తెల్సిందే. అయితే రాష్ట్ర అధికారులు మాత్రం హైకోర్టుకు వివరాలు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. అంతేకాకుండా అధికారులు ఇవ్వడం లేదని అకౌంటెంట్ జనరల్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతో ఈ అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం పై సీరియస్ అయింది. వచ్చే సోమవారం లోపు అమరావతి నిర్మాణానికి సంబంధించి తాము అడిగిన వివరాలు అందించాలని, అయితే వివరాల సమర్పణలో కనుక విఫలమైతే అకౌంటెంట్‌ జనరల్‌ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది. ఒకవేళ ఆయన వివరాలు సమర్పించలేకపోతే విజిలెన్స్‌, ఆదాయపు పన్నుల శాఖ నుంచి తెప్పించుకుంటామని తేల్చి చెప్పింది. ఈ కేసు పై తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.   ఈ కేసు విచారణ సందర్భంగా రాజధాని రైతుల తరుఫున లాయర్ మురళీధరరావు వాదిస్తూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అన్యాయం చేసి, వారి హక్కులను హరించేలా చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వాదించారు. రైతుల భూములు తీసుకున్నందుకు ప్రతిగా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయన గుర్తు చేశారు. ఆ మేరకు రైతులతో కుదిరిన ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం కుదరదని అయన స్పష్టం చేశారు. ‘‘రాజధానిని నిర్మిస్తామని భూములు తీసుకుని.. ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరించడం కుదరదు. రాజధాని వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ రాజధాని రైతులు, సాధారణ ప్రజలు ఇచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదు. కేవలం ముఖ్యమంత్రి ఆకాంక్షమేరకే జీఎన్‌రావు కమిటీని ఏర్పాటు చేసినట్లుంది. ఆ కమిటీ రాజధాని కోసం భూములిచ్చిన రైతులను సంప్రదించలేదు. బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) కూడా అదే తరహాలో నివేదిక ఇచ్చింది. జీఎన్‌రావు కమిటీ, బీసీజీ రూపొందించిన నివేదికలు, ఆ నివేదికలను అధ్యయనం చేసి మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ రూపొందించిన నివేదిక ఒకే తరహాలో ఉన్నాయి’’ అని తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తమకు సూచనలు చేయాలని బీసీజీని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదని అయన కోర్టుకు వివరించారు. అయితే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాయం వివరణ తీసుకుంటామని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.   ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు రాజధానికి చేసిన ఖర్చుపై అధికార, ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడమే కానీ.. ఇంత వరకూ అధికారిక లెక్కలు బయట పెట్టలేదు. గత టీడీపీ ప్రభుత్వం అమరావతికి పైసా ఖర్చు పెట్టలేదని పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ తో సహా పలువురు మంత్రులు, వైసిపి నాయకులు చెబుతూ వస్తున్నారు.ఇదే సమయంలో టీడీపీ నేతలు మాత్రం దాదాపు పదివేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటున్నారు. రాజధాని నిర్మాణంలో పాలుపంచుకున్న పలు సంస్థలు పనులు మధ్యలో నిలిపివేసాయి. ఒప్పందం ప్రకారం అలా పనులు నిలిపివేస్తే ప్రభుత్వం వాటికీ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ వివరాలన్నీ చాలా రహస్యంగా ఉన్నాయి. ఈ మొత్తం వివరాలు బయటకు వస్తే అపుడు అమరావతి కోసం అసలు ఎంత ఖర్చు చేసారు అనే వివరాలు బయటకు వస్తాయి.

గులాబీకి గ్రేటర్ టెన్షన్! వరాలు పనిచేయవంటున్న విపక్షం

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందా? గులాబీ బాస్ ఎంట్రీకి అర్ధమేంటీ? కొత్త హామీలను జనాలు నమ్ముతారా?. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో పార్టీలన్ని స్పీడ్ పెంచాయి. బీజేపీ దూకుడుతో అధికార పార్టీలో ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ పరాజయంతోనే తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ కారుకు బ్రేకు పడితే.. ఆ పార్టీకి ముందు ముందు గండమేనన్న చర్చ జరుగుతోంది. దీంతో గ్రేటర్ ఎన్నికలపై స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారని చెబుతున్నారు. గతంలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికలను కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. ప్రచారం కూడా చేయలేదు. అయితే గ్రేటర్ ఎన్నికలను మాత్రం ఆయన మినిట్ మినిట్ మానిటర్ చేస్తున్నారని తెలుస్తోంది. డివిజన్ల వారీగా పార్టీ పరిస్ఖితులను తెలుసుకుంటూ.. వివిధ సంస్థల ద్వారా సర్వే చేయిస్తూ.. వాటి వివరాల ఆధారంగా  పార్టీ  ఇంచార్జులకు కేసీఆర్ సలహాలు, సూచనలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.    తెలంగాణ భవన్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను కేసీఆరే రిలీజ్ చేశారు. గ్రేటర్ లో రోజుకు రోజుకు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండటంతో సీఎం స్వయంగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. గ్రేటర్ జనాలకు ఆయన వరాలు కురిపించారు. అయితే కేసీఆర్ గ్రేటర్ హామీలపై గ్రేటర్ జనాల్లో చర్చ జరుగుతోంది. ఓటమి భయంతోనే కేసీఆర్ కొత్త హామీలు ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు. వరద సాయం పేరుతో గులాబీ నేతలకు దోచి పెట్టి.. ఎన్నికలయ్యాకా అందరికి ఇస్తామని చెప్పడమేంటనీ ముఖ్యమంత్రిని విపక్షాలు నిలదీస్తున్నాయి. సర్కార్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే వరద బాధితులకే నేరుగా డబ్బులు ఇచ్చేవారని చెబుతున్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతుందని సర్వేల్లో తేలడంతో కేసీఆర్ కొత్త ఎత్తులు వేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ జరుగుతోంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ కేసీఆర్ ప్రచారం చేయలేదు. గత గ్రేటర్ ఎన్నికల్లోనూ అంతా కేటీఆరే చూసుకున్నారు. ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక తమకు సవాల్ గా మారినా ప్రచారానికి వెళ్లలేదు కేసీఆర్. కాని గ్రేటర్ ఎన్నికలపై మాత్రం ఫోకస్ చేశారు. పార్టీ మేనిఫెస్టోను కూడా కేసీఆరే రిలీజ్ చేశారు. దీన్ని బట్టి గులాబీ నేతలకు ఓటమి భయం పట్టుకుందనే చర్చ జరుగుతోంది. అందుకే వరాలు ప్రకటించారని చెబుతున్నారు.    కరోనా సమయంలో క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లాక్ డౌన్ తో వాహనాలు రోడ్డు ఎక్కకపోవడంతో తినడానికి తిండలేక కొందరు డ్రైవర్లు అవస్థలు పడ్డారు. కరోనా సమయంలో వారిని అసలు పట్టించుకోలేదు కేసీఆర్ సర్కార్. పక్కన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆటో,  క్యాబ్ డ్రైవర్లకు 10 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇక్కడ కూడా అలానే తమను ఆదుకోవాలని క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు వేడుకున్నా టీఆర్ఎస్ సర్కార్ కనీసం స్పందించలేదు. లారీ డ్రైవర్లు కూడా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నారు. లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో అంతా అప్పుల పాలయ్యారు. మూడు నెలల క్రితమే రోడ్డు ట్యాక్సీ రద్దు చేయాలని లారీ యజమానులు ప్రభుత్వానికి విన్నవించారు. అయితే అప్పుడు స్పందించని సర్కార్.. గ్రేటర్ ఎన్నికల వేళ వారికి ఊరటనిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ ఎన్నికల్లో  ఎలాగైనా గట్టెక్కేందుకే కేసీఆర్ సర్కార్ తాజా వరాలు ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. గ్రేటర్ లో దాదాపు ఐదు లక్షల మంది ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారని అంచనా. వారంతా తమకు మద్దతిచ్చేలా రోడ్డు ట్యాక్స్ ను రద్దు చేశారని చెబుతున్నారు.    కేసీఆర్ ఇప్పుడు ఎన్ని వరాలు ప్రకటించినా గ్రేటర్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని ఎంత మెత్తుకున్నా పట్టించుకోకుండా.. ఎన్నికల వేళ చేయడాన్ని జనాలు కూడా అర్ధం చేసుకుంటారని చెబుతున్నారు. ఓట్ల కోసమే కేసీఆర్ కొత్త డ్రామాలు చేస్తున్నారని గ్రేటర్  ప్రజలు భావిస్తున్నారని, పోలింగ్ రోజున వారు తమ సత్తా చూపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు.గులాబీ నేతలు మాత్రం తాము ఇచ్చిన హమీలపై ప్రజల్లో మంచి స్పందన వస్తుందని, గ్రేటర్ ఎన్నికల్లో తమకు ప్లస్ కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరీ కేసీఆర్ హామీలు అధికార పార్టీని గట్టెక్కిస్తాయా లేక ప్రతిపక్షాలు చెబుతున్నట్లు ఓట్ల హామీగానే సిటీ జనాలు చూస్తారా చూడాలి మరీ..

భయపెడుతున్న కరోనా సెకండ్ వేవ్...  అప్రమత్తమైన తెలంగాణ సర్కార్

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో.. తెలంగాణ లోని కేసీఆర్ సర్కార్ అప్రమత్తమైంది. కరోనా తాజా పరిస్థితులపై సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న అన్ని పడకలకూ ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పించాలని ఈ భేటీలో నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 22 వేల పడకలు ఉండగా, ప్రస్తుతం 11 వేల పడకలకు మాత్రమే ఆక్సిజన్ సౌకర్యం ఉంది. అంతేకాకుండా వందకు పైగా పడకలు ఉన్న ఆసుపత్రులకు లిక్విడ్ ఆక్సిజన్ ను, మిగిలిన ఆసుపత్రులకు సాధారణ ఆక్సిజన్ ను సరఫరా చేయాలని ప్రభుత్వం పేర్కొంది.   అన్ని ఆసుపత్రుల్లో కలిపి అదనంగా మరో 5 వేల పడకలను ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా తొలి దశలో ఎదుర్కొన్న సంక్షోభ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, మరోసారి ఆ పరిస్థితి ఏర్పడకుండా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి గాంధీ ఆసుపత్రి వరకూ కరోనా చికిత్సలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలనూ సిద్ధంగా ఉంచాలని, అదే విధంగా వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.

కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ హర్షకుమార్‌

అమలాపురం మాజీ ఎంపీ హ‌ర్ష కుమార్ తిరిగి సొంతగూటికి చేరారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ కి దూరమైన ఆయ‌న.. ఇవాళ ఉమెన్‌చాందీ, శైలజానాథ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. విభజన హామీలు అమలు చేయకుండా బీజేపీ మోసం చేస్తోందని మండిపడ్డారు. బీజేపీపై పోరాడటంలో వైసీపీ, టీడీపీలు విఫలమయ్యాయని విమర్శించారు. ఏపీ ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని, ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని హర్షకుమార్ చెప్పారు.   కాగా, 2004-2014 వ‌ర‌కు వ‌రుస‌గా రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ త‌రుపున ఎంపీగా గెలుపొందిన ఆయ‌న‌, రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడ‌తున్నారు.

ఫేక్ పోస్టులు..ఫేక్ సర్వేలు.. కుళ్లు జోకులు! గతి తప్పిన సోషల్ క్యాంపెయిన్ 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. వారం రోజుల్లోనే పోలింగ్ ఉండటంతో పార్టీలన్ని సర్వశక్తులు ఒడ్డిపోరాడుతున్నాయి. ప్రచారంలో అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నాయి పార్టీలు. గ్రేటర్ ఎన్నికల్లో సోషల్ మీడియా  కీ రోల్ పోషిస్తోంది. అన్ని పార్టీలు ఆన్  లైన్ ప్రచారం కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే సోషల్ మీడియా ప్రచారం గ్రేటర్ సమరంలో హద్దులు దాటినట్లు కనిపిస్తోంది. అన్ లైన్ లో ఫేక్ ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది. తమ పార్టీకి కలిసొచ్చేలా, ప్రత్యర్థి పార్టీలకు డ్యామేజీ కలిగేలా ఫేక్ ఆడియో కాల్స్, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల సర్వేలంటూ ఫేక్ సర్వేలను క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.    గ్రేటర్ ఎన్నికలపై సర్వే అంటూ ఫేక్ సర్వేలు బయటికి వస్తున్నాయి. ఒకే సర్వే సంస్థ పేరుతోనూ డిఫరెంట్ ఫలితాలు ఉండే సర్వేలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాణక్య సంస్థ పేరుతోనే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు అనుకూలంగా సర్వేలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి 90-96, ఎంఐఎం 3035,  టీఆర్ఎస్ 24-29, కాంగ్రెస్ కు 4-6 సీట్లు వస్తాయని ఉన్న సర్వేలను బీజేపీ కేడర్ వైరల్ చేస్తోంది. టీఆర్ఎస్ కు 96- 106, ఎంఐఎంకు 40-45, కాంగ్రెస్, బీజేపీలకు 1-2 డివిజన్లు వస్తాయని సూచించే సర్వే మ్యాపులను గులాబీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు 80కి పైగా సీట్లు రాబోతున్నాయంటూ అదే చాణక్య పేరుతో హస్తం అభిమానులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏది నిజమో, ఏది అసత్యమో తెలియక గ్రేటర్ ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.    ఫేక్ ఆడియో కాల్స్, వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ గా టీఆర్ఎస్ అనుకూలురు ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. బండి సంజయ్ ను గ్రేటర్ ఎన్నికల బాధ్యత నుంచి తప్పించారంటూ ఓ న్యూస్ ఛానెల్ బ్రేకింగ్ పేరుతో  సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో సంజయే మీడియా ముందుకు వచ్చి అది ఫేక్ అని చెప్పుకోవాల్సి వచ్చింది. తమ పేరుతో అసత్య ప్రచారం జరుగుతుందని సదరు ఛానెల్ కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లుగా.. రాజా సింగ్  ట్వీట్ ను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారు. దానిపైనా రాజాసింగ్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మాజీ మంత్రి డీకే అరుణ తిరిగి కాంగ్రెస్ లో చేరబోతున్నారని, ఉత్తమ్ తో ఆమె సమావేశమయ్యారని కొన్ని వర్గాలు ప్రచారం చేశాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ కాంగ్రెస్ లో చేరారని కూడా కొందరు పోస్టులు పెట్టి వైరల్ చేశారు.    గ్రేటర్‌ ఎన్నికల వేళ సోషల్‌ మీడియాలో విద్వేషం హద్దులు దాటుతోంది. తమ ప్రత్యర్థులపై దిగజారుడు వ్యాఖ్యలు, విషపురాతలు రాస్తూ ప్రచారం చేస్తున్నారు. నేతల అలవాట్లు, ఆకారాలపై విద్వేషపు పోస్టులు పెడుతున్నారు. గుండోడు, బండోడు, బక్కోడు, బికారీ.. ఇలా  ప్రత్యర్థులపై అభ్యంతరకర, రాయలేని వ్యాఖ్యలతో చెలరేగుతున్నారు, రెచ్చగొడుతున్నారు. నాయకుల అలవాట్లు, ఆహార్యంపై సెటైర్లు, కుళ్లుజోకులు వేస్తున్నారు. వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. ప్రత్యర్థులను చులకన చేసే ప్రయత్నంలో దిగజారుడు పోస్టులు పెడుతున్నారు.  ఆకారం, అలవాట్ల ఆధారంగా కుళ్లుజోకులు వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీపై యువత మనసులో విద్వేషపు బీజాలు నాటుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఇలాంటి పోస్టులకు కొదవలేదు. వ్యక్తులను కించపరుస్తూ వీడియోలు, సినిమాల్లోని హాస్యపు బిట్లు, మీమ్స్, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్కులతో పోస్టులు రూపొందిస్తూ కొత్త ఓటర్లకు గాలం వేస్తున్నారు.    కొత్త ఓటర్లే లక్ష్యంగా ప్రైవేటు ఆర్మీల హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ నిత్యావసర వస్తువుగా మారింది. ఆన్‌లైన్‌ క్లాసుల పుణ్యమాని ఇప్పుడు ప్రతీ విద్యార్థికి స్మార్ట్‌ఫోన్‌ ఉంది. ముఖ్యంగా 18 ఏళ్లు దాటి డిగ్రీ, ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థుల ఓట్లే లక్ష్యంగా ఈ వ్యంగ్యపు, వెకిలి పోస్టులు రూపొందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగించే యువతలో నూటికి 90 శాతం వినోదానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే, వారి దృష్టిని తమవైపు తిప్పుకునేందుకు, ప్రత్యర్థి పార్టీలపై కుళ్లుజోకులతో విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగొచ్చని, దాడులకు పురిగొలిపే ప్రమాదముందని పోలీసులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే వీటి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.    గ్రేటర్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ రాగానే.. పార్టీల సానుభూతిపరులు అప్పటికపుడు ప్రత్యేకంగా కంటెంట్‌ రైటర్లు, డీటీపీ ఆపరేటర్లు, వీడియో ఎడిటర్లను నియమించుకున్నారు. కేవలం 20 రోజులకే వీరికి రూ.30 వేల నుంచి 40 వేల వరకు చెల్లిస్తూ ఇలాంటి పోస్టులను ప్రోత్సహిస్తున్నారు. పార్టీలకు అనుకూలంగా వారి అధికారిక సోషల్ వింగ్ లు చేసే పోస్టులు పద్ధతిగానే ఉంటున్నాయి.కొందరు అభిమానుల ముసుగులో ప్రైవేటు ఆర్మీలు నడిపిస్తున్నారు. వారంతా తమ పోస్టింగులతో ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియా  పోస్టులపై పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చేసిన, చేయబోయే పనులను చెప్పుకొని ఓట్లు అడగటం, ప్రత్యర్థులను విమర్శలతో ప్రశ్నించడం మంచి రాజకీయమని, కాని ఇలా విద్వేషాలకు దిగడం ప్రమాదమంటున్నారు పోలీసులు.

పని తీరు అద్భుతం.. కోల్డ్ స్టోరేజ్ అవసరం లేని కరోనా వ్యాక్సిన్ రెడీ

ఈ ఏడాది ప్రారంభంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుండి వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు ప్రయత్నాలు మొదలు పెట్టిన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రయత్నాలలో కొన్ని సంస్థలు విజయం సాధించి ఉత్పత్తి వైపు కూడా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఫైజర్, మోడెర్నా సంస్థలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ లు వాటి సగటు సామర్థ్యం 95 శాతమని తెలిపాయి. అయితే ఫైజర్ టీకా విషయానికి వస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలలో పంపిణీ పరంగా కొన్ని సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వ్యాక్సిన్ నిల్వ, రవాణాకు -70 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమవడమే ముఖ్య సమస్యగా నిపుణులు చెపుతున్నారు.   ఈ పరిస్థితుల్లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ సామార్థ్యానికి సంబంధించి అస్ట్రాజెనికా సీఈఓ పాస్కల్ సోరియట్ ఈరోజు సోమవారం కీలక ప్రకటన చేసారు. కరోనాకు వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్ సమర్ధవంతంగా పనిచేస్తోందని అయన చెప్పారు. బ్రిటన్, బ్రెజిల్ దేశాల నుండి చివరి దశ ట్రయల్స్ సమాచారం మేరకు ఈ టీకా సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టుగా తేలింది. ఈ వ్యాక్సిన్ సగటు సామర్థ్యం 70 శాతమని ప్రకటించింది.   అయితే క్లీనికల్ ట్రయల్స్‌లో భాగంగా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ విషయంలో అధికారులు రెండు రకాల డోసులు వలంటీర్లకు ఇచ్చారు. మొదటి విధానంలో వలంటీర్లకు మొదట సగం డోసు ఇచ్చి, ఆ తరువాత పూర్తి డోసు ఇవ్వగా.. వ్యాక్సిన్ 90 శాతం సామర్థ్యంతో పనిచేసినట్టు వెల్లడైంది. ఇక కరోనా వ్యాక్సిన్ డోసులకు సంబంధించిన రెండో విధానంలో ఈ వ్యాక్సిన్ ను కేవలం సగం డోసు వినియోగించగా దాని సామర్థ్యం 90 శాతంగా వెల్లడవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అని ఆస్ట్రాజెనెకా సీఈవో తెలిపారు. ఈ విధానం అన్నిటికంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తోందని, వ్యాక్సిన్ విషయంలో ఇదే పద్దతి అవలంబించాలని వివిధ దేశాల ఔషధ నియంత్రణ సంస్థలకు సూచిస్తామని అయన పేర్కొన్నారు.   అంతేకాకుండా ఎమ్‌ఆర్‌ఎన్ఏ ఆధారంగా రూపొందించిన మోడర్నా, ఫైజర్ టీకాలతో పోలిస్తే ఆక్సఫర్డ్ వ్యాక్సిన్ సగటు సామర్థ్యం కొంత తక్కువగా ఉన్నప్పటికీ వ్యాక్సిన్ పంపిణీ సౌలభ్యం పరిగణలోకి తీసుకుంటే ఆక్స్‌ఫర్డ్ టీకాయే భారత్ తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనువైనదని నిపుణులు అభిప్రాయడుతున్నారు. మిగిలిన వ్యాక్సిన్ల తో పోలిస్తే.. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ను సాధారణ రిఫ్రెజిరేటర్లలో కూడా నిలువ చేయగలగడం దీని ప్రధమానమైన అడ్వాంటేజ్ అని నిపుణులు అంటున్నారు. కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేని భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆక్సఫర్డ్ టీకాయే తగినదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు రెండు డోసులు కలిపి కేవలం రూ.1000లోపే లభ్యమయ్యే అవకాశం ఉంటడమనేది ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ కు సంబంధించి మరో సానుకూల అంశమని వారు అంటున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ క్లీనికల్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివిధ దేశాల వ్యాక్సిన్ నియంత్రణ సంస్థలకు అందించి, త్వరగా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటామని ఆస్ట్రాజెనెకా ఈ సందర్భంగా పేర్కొంది.

బహిరంగంగానే తిట్టుకుంటున్న వైసీపీ నేతలు

ఏపీలో అధికార వైసీపీకి ఆ పార్టీ నాయకుల తీరు తలనొప్పిగా మారింది. ఇటీవల వైసీపీ నేతలు బహిరంగంగానే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న విశాఖలో డీఆర్సీ సమావేశంలో మాటల యుద్ధం జరిగింది. సమావేశంలో ఇతర ప్రజాప్రతినిధుల ముందే ఎంపీ విజయసాయిరెడ్డిపై చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విరుచుకుపడ్డారు. మరోవైపు.. ఇదే సమావేశంలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత సీఎం ఆఫీస్ వద్ద డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి 'బుద్ధి, జ్ఞానం ఉందా నీకు.. డిప్యూటీ సీఎం వా నువ్వు' అని దుర్బాషలాడిన ఘటన సంచలనంగా మారింది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు నువ్వెంతంటే నువ్వెంత అని వాగ్వాదానికి దిగారు.    తూర్పుగోదావరి జిల్లా డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. టిడ్కో ఇళ్లు విషయంలో కాకినాడలో అవినీతి జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్ పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కేకలు వేశారు. ఒకే పార్టీ లో ఉంటూ నాకు చెప్పాలి కదా అని బోసుపై దుర్భాషలాడారు. మేడ లైన్ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు వల్లే కాకినాడ నగరం మునిగిపోయిందని కూడా బోస్ ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే ద్వారంపూడి మరింత రెచ్చిపోయారు. ఈ విషయాలు తనకు చెప్పాలి కదా అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే ద్వారంపూడికి మంత్రి కన్నబాబు, ఇతర ఎమ్మెల్యేలు నచ్చజెప్పారు. దీంతో రాసభాస మధ్య సమావేశం అర్థాంతరంగా ముగిసిపోయింది.  

వైఎస్సార్‌ అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు

ఏపీ సీఎం వైఎస్ జగన్ తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై తెలంగాణలోని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌ ని విమర్శించే క్రమంలో "వెనుకటి ఒకాయన గిట్లే మాట్లాడి, గట్లే పోయిండు.. పావురాల గుట్టకు! నువ్వు కూడా గంతే. యాక్షన్ కు రియాక్షన్ కచ్చితంగా ఉంటుంది" అంటూ రఘునందన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై వైసీపీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. వైఎస్సార్ అభిమానులు బీజేపీకి ఓటు వేయొద్దని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘునందన్ స్పందించారు. వైఎస్సార్‌ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, తన వ్యాఖ్యల్లో ఎలాంటి దురుద్దేశం లేదని వివరించారు.    వైఎస్సార్‌ గురించి తాను చేసిన వ్యాఖ్యలను ఆయన అభిమానులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, వైఎస్సార్‌ అభిమానుల మనసు నొప్పించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. "సీఎం కేసీఆర్ కేసీఆర్ గతంలో వైఎస్సార్ పై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ నేను ఆ కుటుంబానికి హెచ్చరిక చేసినట్టుగా మాట్లాడాను. అంతేతప్ప నేను వైఎస్సార్ ను కించపరుస్తూ మాట్లాడలేదు." అన్నారు "ఈ సందర్భంగా వైఎస్సార్‌ అభిమానులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి తప్పుగా ట్రోల్ చేయకండి. నా వ్యాఖ్యల పట్ల మీరు బాధపడుతున్నందుకు చాలా చింతిస్తున్నాను" అని రఘునందన్ రావు ఓ ప్రకటన చేశారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. ఓట్లు అడగాలంటేనే భయపడుతున్న నాయకులు

ఎన్నికలు ఏముంది.. డబ్బు, మద్యం ఎవరు ఎక్కువ పంచితే వాళ్ళదే విజయం. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న నాయకులకు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్నికలు వస్తే కానీ మా వైపు తిరిగి చూడరా?, వరదలు వచ్చినప్పుడు ఏమైపోయారు? రోడ్లు ఏవి? అభివృద్ధి ఏది? అంటూ ఓటర్లు నాయకులను నిలదీస్తున్నారు. దీంతో ప్రచారానికి వెళ్లి ఓట్లు అడగాలంటేనే నాయకులూ భయపడే పరిస్థితి నెలకొంది.   జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మాల్కాజిగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనంపల్లి యాప్రాల్‌ వెళ్లారు. అయితే 'నో రోడ్‌-నో వోట్‌' అని నినాదాలు చేస్తూ స్థానికులు ఫ్లకార్డులతో నిరసనకు దిగారు. దీంతో ఎన్నికలు అయిపోగానే రోడ్డు వేయిస్తానని, అవసరమైతే సొంత డబ్బులతో వేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఆ మాటలకు స్థానికులు శాంతించలేదు. సొంత సొమ్ములు అవసరం లేదని, తాము ప్రభుత్వానికి పన్నులు కడుతున్నామని, వాటితో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేతో స్థానికులు అన్నారు. దీంతో ఎమ్మెల్యే తనపై ప్రమాణం చేసుకుని మరీ హామీ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లారు.   ఎంఐఎం తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ‌కు కూడా నిరసన సెగ తగిలింది. జాంబాగ్ ఎంఐఎం అభ్యర్థి రవీందర్‌ తరుఫున ప్రచారానికి వెళ్లిన ఓవైసీని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తమకు వరద సాయం పదివేలు అందలేదని... ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఏం చేస్తున్నారని ఆ మహిళలు ప్రశ్నించారు. గతంలో కూడా ఎంఐఎంని గెలిపిస్తే జాంబాగ్‌లో ఎలాంటి అభివృద్ధి లేదని, ఐదేళ్లకోసారి వచ్చి ఓట్లు అడిగి.. గెలవగానే ముఖం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆందోళనతో వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండానే అసదుద్దీన్‌ ఓవైసీ వెనుదిరిగారు.   ఇలా జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఓట్లు అడగడానికి వెళుతున్న నాయకులకు పలుచోట్ల చేదు అనుభవం ఎదురవుతోంది. స్థానికులు తమ ప్రాంతంలోని సమస్యల గురించి చెప్పి.. అవి తీరిస్తేనే ఓటేస్తామని తెగేసి చెబుతున్నారు. ఓటర్లలో వచ్చిన ఈ మార్పుని చూసైనా.. పదవిలో ఉన్నంత కాలం ఏం చేయకుండా.. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంచితే ఏ ఎన్నికల్లోనైనా గెలవొచ్చు అనుకునే నాయకుల తీరులో మార్పు వస్తుందేమో చూడాలి.

టీఆర్ఎస్ మేనిఫెస్టో.. డిసెంబర్ నుంచి ఉచిత నీటి సరఫరా

జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేశారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో మేనిఫెస్టోను విడుదల చేసిన ఆయన.. ఈ సందర్భంగా నగర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. డిసెంబర్‌ నుంచి వాటర్‌ బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదని చెప్పారు. 98శాతం ప్రజలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు. జంట నగరాల్లో ఇప్పుడు నీటి కొరత లేదని, పుష్కలంగా మంచి నీటి సరఫరా జరుగుతోందని చెప్పారు. సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్‌ లకు డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న దోబీఘాట్లను పునరుద్ధరిస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ సమయంలో మోటార్‌ వాహనాల పన్నును రద్దు చేస్తామని తెలిపారు. త్వరలోనే సమగ్ర జీహెచ్ఎంసీ చట్టాన్ని రూపొందిస్తామని తెలిపారు. అధికారుల్లో బాధ్యతను పెంచేలా కొత్త చట్టానికి రూపకల్పన చేస్తామని కేసీఆర్ చెప్పారు.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. అన్నిరాష్ట్రాల సీఎంల‌తో మోడీ మీటింగ్

దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ రేపు(మంగళవారం) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో కరోనా సెకండ్ వేవ్ వస్తున్న నేపథ్యంలో... ఆయా రాష్ట్రాలలో పరిస్థితులు, కరోనా వ్యాప్తి తీవ్రత, అలాగే వ్యాక్సిన్ పంపిణీ తదితర అంశాలపై మోడీ ఈ భేటీలో సీఎంలతో చర్చ జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆంక్ష‌లు కూడా విధించిన నేపథ్యంలో ప్రధాని, సీఎం ల సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ రెండు దఫాలుగా జరగనుంది. ఇప్పటికే కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ పై నీతి ఆయోగ్ ఒక సమావేశాన్ని నిర్వహించింది. వ్యాక్సిన్‌కు ఎంత ధర నిర్ణయించాలన్న విషయం కూడా నీతి ఆయోగ్ సభ్యుల మధ్య చర్చకు వచ్చింది. అంతేకాకుండా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తికాని వ్యాక్సిన్‌లను ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయాలన్నిటి పైనా ప్రధాని మోదీ సీఎంల అభిప్రాయాన్ని తీసుకొని.. వాటిపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఓల్డ్ సిటీ బాద్షా అసదుద్దీన్ కు తప్పని నిరసన.. సమాధానం చెప్పకుండానే వెనక్కి 

జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ప్రస్తుతం ప్రధాన పార్టీల ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తుండగా.. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయా పార్టీల ముఖ్య నేతలు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంఐఎం తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌కు నిరసన సెగ తగిలింది. జాంబాగ్ ఎంఐఎం అభ్యర్థి రవీందర్‌ తరుఫున ప్రచారానికి వెళ్లిన ఓవైసీని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. వరద సాయంపై వారు ప్రశ్నల వర్షం కురిపించారు. తమకు వరద సాయం పదివేలు అందలేదని... ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఏం చేస్తున్నారని ఆ మహిళలు ప్రశ్నించారు. మహిళల నిరసనతో అసదుద్దీన్ షాక్ తిన్నారు. గతంలో కూడా ఎంఐఎంని గెలిపిస్తే జాంబాగ్‌లో ఎలాంటి అభివృద్ధి లేదని, ఐదేళ్లకోసారి వచ్చి ఓట్లు అడిగి.. గెలవగానే ముఖం చాటేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల ఆందోళనతో వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండానే అసదుద్దీన్‌ ఓవైసీ ప్రచారం చేయకుండానే వెనుదిరిగారు.

కాంగ్రెస్ కు పెద్ద ఝలక్.. రేపు బీజేపీ గూటికి రాములమ్మ..! 

కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, సినీ నటి విజయశాంతి జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో హఠాత్తుగా రేపు మంగళవారం ఢిల్లీ బయలుదేరుతున్నారు. ఆమె ఢిల్లీ పర్యటనలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆ తరువాత ఢిల్లీలో బీజేపీ పార్టీ కేంద్ర నేతలతో ఆమె భేటీ అవుతారు. తాజాగా బీజేపీ వర్గాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ.. ఆమె ఢిల్లీ నుండి తిరిగి రాగానే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరుఫున విస్తృతంగా ప్రచారం చేస్తారని తెలిపారు. అంతేకాకుండా విజయశాంతికి బీజేపీలో కీలకమైన బాధ్యతలనే అప్పగిస్తారని తెలుస్తోంది.   గత కొంత కాలంగా కాంగ్రెస్ కు దూరంగా ఉంటున్న రాములమ్మ, కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్ పర్సన్ గా ఉన్నప్పటికీ దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారు. అదే సమయంలో ఆమె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ప్రత్యేకంగా మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. ఆపై తన అనుచరులతో సమావేశమైన విజయశాంతి, బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొంత కాలం నుండి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం పై అసంతృప్తిగా ఉన్న విజయశాంతిని బుజ్జగించడానికి కాంగ్రెసు తెలంగాణ ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది.

ఏసీ రూముల్లో కూర్చుంటే కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు

దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. వరుస ఓటములతో పార్టీ బలం రోజురోజుకి పాతాళానికి పడిపోతోంది. నాయకత్వ లేమి, నాయకుల తీరుతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మనుగడే ప్రశ్నార్ధకంగా మారిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చూసి సీనియర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పరిస్థితిపై ఆ పార్టీ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.    కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థ సంస్థాగతంగా కుప్పకూలిందని గులాం నబీ ఆజాద్‌ అన్నారు. పార్టీ పరిస్థితికి నాయకత్వాన్ని నిందించి ప్రయోజనం లేదని.. పంచాయతీ, మండల స్థాయి నుంచి పార్టీని తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌లో మొదట్లో ఉన్న పరిస్థితులు లేవని, నాయకుల్లో చాలా మార్పులు వస్తున్నాయన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌ నేతలకు మధ్య సంబంధం తెగిపోయిందని చెప్పారు. పార్టీ టికెట్‌ రావడమే ఆలస్యం ఫైవ్‌ స్టార్‌ హెటల్స్‌లో ప్రత్యక్షమవుతున్నారని, ప్రజల్లో కంటే ఏసీ రూముల్లోనే ఎక్కువగా సమయం వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి పోయే వరకు కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం కష్టమని, నాయకులు ఫైవ్‌స్టార్‌ హోటళ్లను వీడి క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు.     గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉందని, అయినా మనమేం కోల్పోతున్నామో గుర్తించాలని అన్నారు. గతంలో కర్ణాటక, ఏపీ, కేరళ రాష్ట్రాల్లో పార్టీ చాలా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తాను బాధ్యుడిగా ఉంటూ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చానని గుర్తుచేశారు. 2004, 2009 లో కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ఏపీ అని.. 7 స్థానాలు ఉన్న పార్టీకి 35 స్థానాల వరకు రాబట్టడంతోనే అధికారంలోకి వచ్చామని తెలిపారు. ఆ తర్వాత పరిస్థితులు దారుణంగా మారిపోయాయని.. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావాలంటే‌ నాయకులు ఏసీ రూములు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లను వీడి క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. 

బైడెన్ గెలుపును మేము గుర్తించడంలేదు.. రష్యా అధ్యక్షుడు పుతిన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల తొలి ఫలితాలలో కొంత అస్పష్టత ఉన్నప్పటికీ తుది ఫలితాట్లు వచ్చేసరికి జో బైడెన్ స్పష్టమైన మెజారిటీ సాధించిన సంగతి తెల్సిందే. దీంతో పలు ప్రపంచదేశాలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపినా, చైనా, రష్యా వంటి కొన్నిదేశాలు మాత్రం కొంత వేచిచూసే ధోరణి అవలంబించాయి. అయితే చైనా ఇటీవలే బైడెన్ విజయాన్ని గుర్తిస్తున్నట్టు ప్రకటించగా, రష్యా మాత్రం నిన్నటివరకు స్పందించలేదు.   అయితే తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ అంశం పై స్పందించారు. అగ్రరాజ్య అధినేతగా జో బైడెన్‌ను గుర్తించడానికి తాము సిద్ధంగా లేమని స్పష్టం చేసారు. బైడెన్ గెలిచాడన్న విషయాన్ని ఇంకా అమెరికాలోనే చట్టబద్ధంగా ప్రకటించాల్సి ఉందని, అంతేకాకుండా బైడెన్ విజేత అని ఆయన ప్రత్యర్థి పక్షం కూడా గుర్తించాల్సి ఉందని పుతిన్ అభిప్రాయపడ్డారు.అంతేకానీ బైడెన్ ను అభినందించకపోవడం వెనుక ఎలాంటి వ్యూహాత్మక విధానం లేదని అయన అన్నారు.   అమెరికా ప్రజల నమ్మకం కలిగిన ఏ నాయకుడితోనైనా కలిసి పని చేయడానికి మేము సిద్ధం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో రష్యా అమెరికాల మధ్య ఉన్న సంబంధాలను మీ నిర్ణయం దెబ్బతీస్తుందా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడో క్షీణించాయి.. కొత్తగా దెబ్బతినడానికి ఏమీ మిగిలి లేదంటూ పుతిన్ బదులిచ్చారు. ఇదిలా ఉండగా 2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపుకు రష్యా తన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రహస్యంగా కృషి చేసిందంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

నేనొప్పుకోను.. నేనొప్పుకోను.. అయితే ఓకే!

స్థానిక సమరంపై ‘కమలం’లో ‘అరవ కామెడీ’   ముందు ఓకేనని, ఇప్పుడు నేనొప్పుకోనంటున్న వీర్రాజు   నేనొప్పుకోను.. నేనొప్పుకోను.. అయితే ఓకే!  అదేదో సినిమాలో హాస్యనటుడు కొండవస డైలాగిది! ముందు కాదని గంభీరంగా అన్న తన మాటనే,  తర్వాత అయితే ఓకేనని చెప్పే,  గందరగోళం కామెడీ టైపు క్యారెక్టరు ఆయనది. అయితే తెలుగు డైరెక్టు సినిమా కామెడీ అందరికీ అర్ధమవుతుంది. కానీ తమిళ డబ్బింగు సినిమాల అరవ కామెడీ ఎవరికీ అర్ధమయిచావదు. ఇప్పుడు ఏపీ బీజేపీలో ఇలాంటి కామెడీ ట్రాక్ , ఒక పాలిసీగా నడుస్తుండటమే పెద్ద కామెడీ. అందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం నేతల కప్పగంతులే నిదర్శనం. కాకపోతే.. ఇక్కడ కొద్దిగా రివర్సు. ముందు.. అయితే ఓకే అన్న బీజేపీ, ఇప్పుడు నేనొప్పుకోను అంటోంది. అదొక్కటే తే డా. మిగిలినదంతా షేమ్ టు షేమ్!   స్థానిక సంస్థల నిర్వహణ వ్యవహారం కమలంలో కితకితలు పెట్టిస్తోంది. గతంలో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను, తిరిగి జరిపించాలని వైసీపీ మినహా, అన్ని పార్టీలూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను డిమాండ్ చేశాయి. అంతకుముందే... అంటే స్థానిక సంస్థలు జరుగుతున్న సమయంలో.. బెదిరించి తమ పార్టీ అభ్యర్ధులను ఉపసంహరించేలా చూశారని బీజేపీ సహా అన్ని పార్టీలూ ఫిర్యాదు చేశాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సొంత మండలంలోనే, బీజేపీ అభ్యర్ధి చేయి నరికిన వైసీపీ నేతల దాడులను, నాటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  డీజీపీకి ఫిర్యాదు చేశారు. అసలు ఏకగ్రీవాలన్నీ రద్దు చేసి, తిరిగి ఎన్నికలు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే బీజేపీ అభిప్రాయం అదేనన్నమాట. ఆ తర్వాత ఆ పార్టీ ఎంపీ సుజనా చౌదరి కూడా అదే డిమాండ్ చేశారు.   ఇటీవల బీజేపీ పక్షాన ఎస్‌ఈసీ భేటీకి హాజరైన ఆ పార్టీ ప్రతినిధి పాకా సత్యనారాయణ కూడా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని  73వ సవరణ ప్రకారం, ఎన్నికలు నిర్వహించాలని గుర్తు చేశారు.  దానితోపాటు కొన్ని సందేహాలు, ప్రశ్నలతో కూడి న ఒక లేఖ కూడా ఇచ్చారు. పైగా గతంలో మాదిరి కాకుండా, ప్రచార వ్యవధి పెంచాలని కూడా కోరారు. ఆ మేరకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ కార్యాలయం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అంటే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ అంగీకరించిందని, ఆ పార్టీ ప్రతినిధి రాసిన లేఖ చదివిన బుర్ర-బుద్ధి ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది.   కానీ.. ఆ పార్టీని నడిపిస్తున్న మహా నాయకుడైన సోము వీర్రాజుకు మాత్రం,  ఇంకా తమ పార్టీ ఇచ్చిన లేఖ అర్ధం కానట్లుంది. తాజాగా ఆయన కాకినాడలో నిర్వహించిన ఓ విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే.. బీజేపీ ‘అరవ కామెడీ’లో పాత్రధారులు, ఎంత గందరగోళంగా నటిస్తున్నారో స్పష్టమవుతుంది. ఎవరు చెబితే రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వహిస్తున్నారన్న వీర్రాజు ప్రశ్న,  కమలనాధులకు సహజంగానే కామెడీలా అనిపించిందట. కరోనా సమయంలో హడావిడిగా ఎందుకు, ఎవరి డైరక్షన్‌లో మీరు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారని ఆయన సీఈసీని ప్రశ్నించారు.   తమ సారు వేసిన ఈ ప్రశ్నకు నవ్వాలో, ఏడవాలో అర్ధం కాక, కమలనాధులు తమకు తామే కితకితలు పెట్టుకుని నవ్వుకుంటున్నారట. ఎస్‌ఈసీ వద్దకు సత్యనారాయణ అనే నేతను, పార్టీ ప్రతినిధిగా వీరగంధం దిద్ది పంపించింది వీర్రాజు గారే. ఆ సమయంలో సహజంగా పార్టీ సంఘటనా మంత్రి, ఇన్చార్జిని సంప్రదించిన తర్వాతనే ఎస్‌ఈసీ వద్ద మాట్లాడవలసిన అంశాలు ఖరారు చేస్తారు. దానినే డ్రాఫ్టుగా త యారుచేస్తారు. ఇవన్నీ రాష్ట్ర అధ్యక్షుడి అనుమతి తర్వాతనే జరుగుతాయి. మరి అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు, తమ పార్టీ పూర్తి అనుకూలం అని లేఖ ఇచ్చి... ఇప్పుడు ఎవరినడిగి, ఎవరు చెబితే ఎన్నికలు నిర్వహిస్తున్నారని స్వయంగా అధ్యక్షుడే ప్రశ్నిస్తే.. అది ‘అరవ కామెడీ’నే అవుతుంది కదా అన్నది కమలనాధుల ప్రశ్న. మరి సన్నివేశాలు పండకపోతే , కథ మార్చాల్సిన..  పార్టీకి మార్గదర్శకుడైన సంఘటనా మంత్రి మధుకర్‌రెడ్డిజీ, ఈ కామెడీ కథలో తన పాత్రేమీలేదనట్లు.. మౌనంగా ఉండటమే కమలదళాల ఆశ్చర్యానికి మరో కారణం.   సహజంగా ఈ ప్రశ్న ఎస్‌ఈసీని వ్యతిరేకిస్తున్న, వైసీపీ అధికార ప్రతినిధులు వేయాలి. ఈ మధ్య వైసీపీ అధికార ప్రతినిధుల గొంతు బాగా తగ్గిపోయింది. వారు టీడీపీ అండ్ కోను, రోజూ తెగ తిట్టి అలసిపోయినట్లున్నారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డను దుమ్మెత్తిపోసి నోరు నొప్పిపుట్టి విశ్రాంతి తీసుకుంటున్నట్లునారు.  బహుశా ఆ లోటు కనిపించకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల సబ్జెక్టు, లైవ్‌లో ఉంచేందుకు.. చంద్రుడికో నూలుపోగులా, సోము వీర్రాజు.. వారి బాధ్యత తగ్గించేందుకు,  ఉడత సాయం చేస్తున్నారన్నది కమలనాధుల ఉవాచ. నిజం సోమేశ్వరుడికెరుక? -మార్తి సుబ్రహ్మణ్యం  

టీఆర్ఎస్ కీలక నేతతో బీజేపీ పెద్దల భేటీ

తెలంగాణలో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. దుబ్బాక విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. ఇతర పార్టీ నేతలకు గాలం వేస్తూ పార్టీని బలోపేతం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నాయకులు ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలను కలిశారు. పలువురు నాయకులు త్వరలో బీజేపీ చేరడానికి సిద్దమయ్యారు కూడా. ఈ తరుణంలో బీజేపీ నాయకులు.. అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన నేతని కలవడం ఆసక్తికరంగా మారింది.   శనివారం సాయంత్రం టీఆర్ఎస్ నేత, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ను కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కలిశారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్‌ ను పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలోస్తున్నాయి. స్వామిగౌడ్‌ త్వరలోనే కాషాయం కండువా కప్పుకోకున్నారని ప్రచారం జరుగుతోంది.   పార్టీ మార్పు వార్తలపై స్వామిగౌడ్ స్పందించారు. భేటీ అనంతరం స్వామిగౌడ్ మాట్లాడుతూ.. పార్టీ మారితే చెప్పి మారతానని అన్నారు. బీజేపీ నాయకులతో కేవలం ఆత్మీయ కలయిక మాత్రమేనని తెలిపారు. స్నేహితులను కలిశాను.. అది కూడా తప్పేనా? అని స్వామిగౌడ్‌ ప్రశ్నించారు.   మరోవైపు, బీజీపీతో కలిసి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని లక్ష్మణ్‌ తెలిపారు. స్వామిగౌడ్‌తో తమది స్నేహపూర్వక భేటీ మాత్రమేనని పేర్కొన్నారు. స్వామిగౌడ్‌తో రాజకీయాలు కూడా చర్చించామని, అయితే స్వామిగౌడ్‌ కు బీజేపీ నుంచి ఏ ప్రతిపాదనలు పెట్టలేదన్నారు. ఏదైనా ఉంటే భవిష్యత్తులో వెల్లడిస్తామని లక్ష్మణ్‌ తెలిపారు.   ఇది స్నేహపూర్వక భేటీ అని స్వామిగౌడ్, లక్ష్మణ్‌ చెబుతున్నప్పటికీ.. ఈ భేటి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే, కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీ పట్ల స్వామిగౌడ్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలతో భేటి కావడంతో ఆయన కచ్చితంగా బీజేపీ చేరే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

జనం లేని సేన, సైన్యం లేని సేనాని.. పవన్ పై మరోసారి విరుచుకు పడ్డ టీఆరెఎస్

నిన్నటి వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ ను పల్లెత్తు మాట అనని టిఆర్ఎస్ నేతలు.. జిహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించగానే ఆయనపై తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకు పడుకున్నారు. ఈరోజు ఉదయం టీఆరెఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పవన్ పై మాటల దాడి చేయగా తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి ఇటు పవన్ కళ్యాణ్, అటు బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తెలంగాణపై అవమానకర రీతిలో మాట్లాడిన పార్టీ బీజేపీ అని ఆయన మండిపడ్డారు. పార్లమెంటులో తలుపులు మూసేసి బిల్లును ఆమోదించి, తల్లిని చంపి బిడ్డను కన్నది అంటూ తెలంగాణను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసింది బీజేపీ నేతలు కాదా అని అయన నిలదీశారు.   ఇటువంటి బీజేపీ నేతలకు నాయకుడు ప్రధాని మోదీ.. ఆ పార్టీ వాళ్లు ఈరోజు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. మరో పక్క జనసేన పార్టీ నాయకుడ్ని ఎపిలో ఛీకొట్టారు. తెలంగాణ ఇచ్చినందుకు తాను 11 రోజులు అన్నం తినలేదని చెప్పిన నాయకుడు పవన్. ఆయనకు తెలంగాణపై అంతగొప్ప ప్రేమ ఉంది. "జనసేన అనేది జనం లేని సేన, ఆయన సేనలేని సేనాని" అంటూ పవన్ ను అయన పార్టీని ఎద్దేవా చేసారు. తెలంగాణపై తమ విషం  కక్కడానికే అయన బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అంతేకాకుండా "ప్రజాక్షేమం కోసం బేషరతుగా జిహెచ్ఎంసి ఎన్నికల బరి నుంచి విరమించుకుంటున్నాం అని పవన్ చెప్పారు. అయితే అయన ఏ ప్రజల క్షేమం కోసం ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారో చెప్పాలి" అంటూ నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.