న్యాయం చేయలేకపోతే గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చో.. వైసిపి ఎమ్మెల్యే పై ఘాటు వ్యాఖ్యలు
posted on Nov 19, 2020 @ 10:50AM
నంద్యాల అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో బాధితులకు న్యాయం చేయడం చేతకాకపోతే చీర, గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చోవాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డిని ఉద్దేశించి ఎంఐఎం పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్ జునైద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుని 16 రోజులవుతున్నా ఈ కేసులో ఇప్పటివరకు ఎటువంటి పురోగతి లేకపోవడంపై ఆయన ఘాటుగా స్పందించారు. అబ్దుల్ సలాం అత్త మాబున్నీసాను పరామర్శించేందుకు ఎంఐఎం నాయకులు బుధవారం నంద్యాలకు వచ్చారు. ఆమెను పరామర్శించిన తరువాత ఎంఐఎం నాయకులు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవికి చీర, గాజులు అందించేందుకు వెళ్తుండగా స్థానిక బొమ్మలసత్రం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడినుండి అబ్దుల్ సలాం న్యాయపోరాట కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం సర్కిల్లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించి దీక్షలకు మద్దతు తెలిపారు.