పుదిచ్చేరికి ప్రత్యేక హోదా.. మరి ఏపీకి?  జగన్ రెడ్డి తాకట్టు పెట్టారా? 

ప్రత్యేక హోదా..  ఆంధ్రప్రదేశ్ కు అత్యంత కీలకం. విభజనతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిన  ఏపీకి ప్రత్యేక హోదానే శరణ్యం. రాష్ట్ర విభజన చట్టంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉంది. కాని రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు అవుతున్నా ప్రత్యేక హోదా.. ఆంధ్రాకు  కలగానే మిగిలిపోయింది.  ప్రత్యేక హోదా విషయాన్ని పట్టించుకోవడం లేదు కేంద్ర సర్కార్. ప్లానింగ్ కమిషన్ సిఫారసుల పేరుతో మాట మార్చింది మోడీ సర్కార్. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని, ఇక పై దేశంలో ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చేది ఉండదని చెబుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పుదిచ్చెరి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రత్యేక హోదా జపం చేస్తోంది కమలదళం. బీజేపీని గెలిపిస్తే పుదిచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. పుదిచ్చేరిలో బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా చెప్పారు. పుదిచ్చేరి ఎన్నికల్లో  బీజేపీ ఇచ్చిన హామీనే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో మంటలు రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అయితే... పుదిచ్చేరిలో ఎలా సాధ్యమని ఏపీ జనాలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీస్తున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ జనాలు ఏడేండ్లుగా పోరాడుతూనే ఉన్నారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ తిరుపతి వేదికగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కాని అధికారంలోకి వచ్చాకా మర్చిపోయారు. ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. అది కూడా ఇవ్వలేదు. కేంద్రం చేస్తున్న ఈ అన్యాయం భరించలేకే 2018లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చింది టీడీపీ. కేంద్రం తీరును ఎండగడుతూ పెద్ద ఎత్తున ఉద్యమించారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదానే తమ మొదటి లక్ష్యమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేశారు. వైసీపీకి అధికారం ఇస్తే కేంద్ర సర్కార్ మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు అయింది. వైసీపీకి 22 మంది లోక్ సభ సభ్యులున్నారు. కాని ప్రత్యేక హోదాపై మాత్రం మాట్లాడటం లేదు. కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ రెడ్డి... ఢిల్లీకి వెళ్లి కేంద్రం పెద్దల ముందు వంగుతున్నారనే  ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని కనీసం ప్రశ్నించడం లేదని ఏపీ జనాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. 22 మంది ఎంపీలున్నా పార్లమెంట్ లో ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నాయి. తన సొంత ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి జగన్ రెడ్డి తాకట్టు పెట్టారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల కోసం మోడీ సర్కార్ కు జగన్ తలవంచారని విమర్శిస్తున్నారు. బీజేపీ తీరు, వైసీపీ నేతల మౌనంపై ప్రతిపక్ష టీడీపీ నేతలుసీరియస్ గా స్పందిస్తున్నారు. జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్  ట్విటర్ వేదికగా  ఫైరయ్యారు. మోడీ మెడ ‌వంచి తెస్తాన‌న్న ప్ర‌త్యేక‌హోదాని ఫేక్ సీఎం తాకట్టు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు బీజేపీ పుదుచ్చేరికి స్పెష‌ల్ స్టేట‌స్ ఇస్తామంటోందని, ఏపీకి ముగిసిన అధ్యాయ‌మైన ప్ర‌త్యేక‌హోదా పుదుచ్చేరిలో ఎలా మొద‌ల‌వుతుందని లోకేష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో క‌మ‌లంతో ర‌హ‌స్య ప్ర‌యాణాన్ని క‌ట్టిపెట్టేసి, పుదుచ్చేరిలో బీజేపీ మిత్రుల గెలుపు కోసం పార్టీ నాయకులతో జగన్ రెడ్డి విస్తృత ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. కేసుల గురించి కాకుండా.. ప్ర‌త్యేక‌హోదా కోసం ఇప్ప‌టికైనా గ‌ట్టిగా అడ‌గండని నారా లోకేష్ ట్విట్టర్ వేదిగా సూచించారు. 

ఇద్దరిపై 8 మంది అత్యాచార*

విశాల భారతం లో నిత్యం విషాదాలే.. ఎక్కడ చూసిన ఏమున్నది స్త్రీ జాతి కన్నీరు తప్పా..  స్త్రీ  నెత్తురు నెల తడపడం తప్పా.. ప్రేమ పేరుతో ఒకడు. స్నేహం మాటున మరొకడు. పేరు ఏదైనా, పేగు బంధం ఏదైనా, పరిచయం ఏదైనా.. అమ్మాయిలపై నిత్యం వంచనే.. తాజాగా ఇద్దరు అమ్మాయిలు ఎనిమిది మంది కామవంచకు బలిఅయ్యారు.  ఇద్దరు బాలికలు.. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సాయంత్రం పూట అలా ద్విచక్రవాహనంపై కాలక్షేపానికి బయటకు వెళ్లారు. కట్ చేస్తే సినిమా లో సీన్ లా కొంత దూరం వెళ్లాక మరో ఆరుగురు.. వేరే వాహనాలపై వచ్చి వారితో కలిశారు. అంతా కలిసి రాత్రి ఏడున్నర గంటల సమయంలో బాలికలను దట్టమైన అడవిలోకి తీసుకెళ్లారు. ముందే పధకం వేసుకున్న దుర్మార్గులు అమ్మాయిలపై సామూహికంగా అత్యాచార* చేశారు. బాధితులు అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. భయపడిన నిందితులు అక్కడి నుండి పరారయ్యారు. పోలీసులతో కలిసి ఘటనా ప్రదేశానికి వెళ్లిన తల్లిదండ్రులు.. దారుణమైన స్థితిలో ఉన్న బాలికలను చూసి కన్నీరుమున్నీరయ్యారు . అనంతరం ఆసుపత్రిలో చేర్పించారు. ఒక బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు మరో ఆసుపత్రికి సిఫార్సు చేశారు. పోక్సో చట్టం కింద నిందితుల పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 24 గంటల వ్యవధిలో నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటన త్రిపుర రాష్ట్రము లోని ఖౌవాయి జిల్లాలో జరిగింది. 

రజనీకి దాదాసాహెబ్ ఫాల్కే.. ఓట్ల కోసం బీజేపీ ఎత్తుగడ?

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తన ట్విట్టర్ ఖాతాలో స్వయంగా ప్రకటించారు. "ఈ విషయాన్ని తెలియజేసేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. భారత సినీ రంగంలోని అత్యున్నత నటుల్లో ఒకరైన రజనీకాంత్ గారికి ఈ సంవత్సరం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందించనున్నాం. ఓ నటుడిగా, నిర్మాతగా స్క్రీన్ రైటర్ గా చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు నిరుపమానం. రజనీకాంత్ ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు నా ధన్యవాదాలు" అని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రజనీకాంత్ కు అవార్డు దక్కడంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 7న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకేతో బీజేపీ కలిసి పోటీ చేస్తోంది. అయితే తమిళనాడులో ఈసారి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమికే అధికారం ఖాయమని సర్వేలు వెల్లడించాయి.  ఈ నేపథ్యంలోనే తమిళ ఓటర్ల మద్దతు కోసమే రజనీకాంత్ కు కేంద్ర సర్కార్ ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. తమిళనాడులో రజనీకాంత్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. రజనీ అభిమానుల ఓట్ల కోసమే బీజేపీ ఈ ఎత్తుగడ వేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో రజనీకాంత్ కొత్త పార్టీ పెడుతున్నట్లు మూడేళ్ల క్రితం ప్రకటించారు. కాని పార్టీ పెట్టలేదు. అనారోగ్య కారణాలతో పార్టీ పెట్టడం లేదని ప్రకటించారు రజనీకాంత్. బీజేపీ డైరెక్షన్ లోనే రజనీకాంత్ పార్టీ వస్తుందనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి.  రజనీకాంత్ కొందరు బీజేపీ నేతలు మంతనాలు సాగించడం, ప్రధాని మోడీకి అనుకూలంగా ఆయన ప్రకటనలు చేయడంతో ఇది నిజమేనని అంతా భావించారు. రజనీకాంత్ ను బీజేపీలోకి రావాలని కేంద్రం పెద్దలు ఆహ్వానించినట్లు కూడా వార్తలు వచ్చాయి. అందుకు రజనీ అంగీకరించకపోవడంతో పార్టీ దిశగా బీజేపీ నేతలే నడిపించారని చెబుతారు. పార్టీ ఏర్పాటుపై వెనక్కి తగ్గాక కూడా రజనీతో బీజేపీ నేతలు చర్చలు జరిపారు. దీంతో తమిళనాడు ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతు రజనీకాంత్ మద్దతుగా ప్రకటన చేస్తారనే చర్చ జరిగింది. ఇప్పుడు పోలింగ్ సరిగ్గా వారం రోజుల ముందు రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం రాజకీయ కోణంలోనే జరిగిందనే అభిప్రాయమే  మెజార్టీ వర్గాల నుంచి వస్తోంది. డీఎంకే నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీ మాత్రం రాజకీయాలకు, అవార్డుకు సంబంధం లేదని చెబుతోంది. మొత్తానికి రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు తమిళనాట రాజకీయాల్లో కాక రేపుతోంది. 

సీఎం ఓఎస్డీ పీఏ నంటూ మోసాలు..

చెప్పేవాడికి వినేవాడు లోకువైనట్టు. వారు ఏది చెప్పిన నమ్మే వాళ్ళు ఉన్నంత కాలం వారికి పండగే. మోసం చేయాలంటే భయం కాదు భక్తి అని నమ్మాడు అతను. అందుకే దేవుడి విగ్రహాలే తన పెట్టుబడి. మాటలే అతడి డబ్బుల మూటలు. తాను సీఎం ఓఎస్డీ  పీఏ నంటూ ఘరానా మోసాలు చేశాడు. డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కావాలా.. ఉద్యోగం కావాలా.. గవర్నమెంట్ స్థలాలు రిజిస్టేషన్ కావాలా.. వీఐపీ ఇళ్లు కావాలా.. ఏదైనా పని చక చక చేస్తాను అని చెప్పాడు. ఎందుకంటే అతను  సీఎం ఓఎస్డీ  పీఏ నంటూ జనాలను నమ్మించాడు.  తన బాధితుల్లో సామీజీలు, డాక్టర్ వైఫ్, ప్రొఫెసర్స్ కూడా మోసపోయారంటే అతని ఎంతటి చాణుక్యుడో చూడండి మరి.   ముందు మనుషులను టార్గెట్ చేయడం. తర్వాత ఉజ్జయిని మహంకాళి..లక్ష్మీదేవీల పంచలోహ ప్రతిమలు గిఫ్ట్ గా ఇవ్వడం. ఆ తర్వాత మాటల్లోకి దించి ఇళ్లు, ఉద్యోగాలు కావాలంటూ ఆశ్రయించిన వారిని ఖరీదైన హోటళ్లకు తీసుకెళ్లి వారిని నమ్మించి మసిపూసి మారేడు కాయ చేయడం. వారు మోసం పసిగట్టే లోపు చిక్కకుండా చాకచక్యంగా అదృశ్యమవడం. నమ్మించి మోసం చేయాలంటే భక్తి, ఆతిథ్యాన్ని మించినవి అస్రాలు లేవని తెలుకున్నాడు. అవే తన అస్త్రాలుగా మలుచుకున్నాడు. హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో ప్రముఖ ఆలయాలు, ఆశ్రమాలకు వెళ్లి అక్కడే బాధితులను సెలెక్ట్ చేసుకుని మరీ  టార్గెట్ చేస్తూ మోసాలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.  కూకట్‌పల్లి-మియాపూర్‌ రూట్ లో ఉన్న ఓ ఆశ్రమానికి సుధాకర్‌ వన్ ఇయర్ నుండి తరచూ వెళ్లేవాడు. తన ఫార్చూనర్‌ కారు, అంగరక్షకుల హంగామా చూసి స్వామీజీ అనుచరులు అతడికి ఎక్కువ మర్యాదలు చేసేవారు. కొన్ని నెలలకు ముందు ఆశ్రమానికి వెళ్లిన అతను అక్కడున్న 50 మంది భక్తులు సహా, స్వామీజీ అనుచరులకు మహంకాళి అమ్మవారి పంచలోహ ప్రతిమలను బహుమతులు ప్రధానం చేశాడు. ఈ క్రమంలో ఒక బ్యాంకు మేనేజర్‌ భార్య పరిచయమైంది. ఆమెను అమ్మా అని పిలుస్తూ పేదలకు రెండు పడకలగదుల ఇళ్లు ఇప్పిస్తున్నానని మాయమాటలు చెప్పాడు. తనకు తెలిసిన వారున్నారని ఆమె చెప్పగా, రూ.5 లక్షల చొప్పున ఇస్తే మియాపూర్‌లో ఇప్పిస్తానన్నాడు. మీకు, మీ స్నేహితులకు ప్రత్యేకంగా వీఐపీ ఇళ్లు ఇప్పిస్తానని నమ్మించడంతో ఐదు నెలల క్రితం ఆమె రూ.1.23 కోట్లు వసూలు చేసి ఇచ్చింది. సంక్రాంతిలోపు ఇళ్లు ఇప్పిస్తానని చెప్పిన సుధాకర్‌ తర్వాత అటువైపు వెళ్లలేదు.   ఇది అలా ఉండగా సుధాకర్‌ మాయాజాలంలో మాములు మనుషులే కాదు. ఇద్దరు స్వామీజీలు చిక్కుకుని రూ.60 లక్షలు సమర్పించుకున్నట్టు తేలింది. అంతేకాదు..అతడి డాబూ దర్పం చూసి మోసపోయిన సికింద్రాబాద్‌లో ఉంటున్న ప్రధాన పార్టీ గల్లీ లీడర్‌ నామినేటెడ్‌ పోస్టు కోసం డబ్బులిచ్చేందుకు సిద్ధమయ్యాడంటే అతని మాట తీరు ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. నిందితుని అరెస్టు వార్త తెలుసుకున్న ఆయన ప్రస్తుతం హమ్మయ్యా! అని ఊపిరిపీల్చుకున్నాడట.      ఉస్మానియా విశ్వవిద్యాలయా ప్రాంతంలో ఇది ప్రభుత్వానికి చెందిన భూమి అనే బోర్డు కూడా ఉంది. ఆ భూమిలో 600 చదరపు గజాల స్థలం ఇప్పిస్తానంటూ సుధాకర్‌ ఒక ప్రొఫెసర్‌ను నమ్మించాడు. ఈ స్థలం తాలూకూ హక్కులు ప్రభుత్వానివేనని, ఎవరికైనా కేటాయించే అధికారం సీఎం కార్యాలయానికి ఉందంటూ నకిలీ ఉత్తర్వులు ఆ ప్రొఫెసర్‌కు చూపించాడు. రూ.33 లక్షలు తీసుకున్న తర్వాత నోటరీ సంతకాలు చేయించి ప్రొఫెసర్‌ పేరు మీద స్థలాన్ని రాసిచ్చాడు. వీటి ఆధారంగా స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఆయన వెళ్లారు. ప్రభుత్వ అధికారులు అడ్డుకోవడంతో మోసపోయానని గ్రహించిన ఆయన ఓయూ పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మూడు నెలల క్రితం సుధాకర్‌ పరిచయమయ్యాడని, అతని గుర్తింపు కార్డు, కారు, వ్యక్తిగత అంగరక్షకులను చూసి సీఎం ఓఎస్డీ వ్యక్తిగత సహాయకుడేనని నమ్మానంటూ పోలీసుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.   

ఎస్వీ యూనివర్శిటీలో పేలుడు

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో బాంబు పేలుడు కలకలం రేపింది. వర్శిటీ ఆవరణలో ఉదయం రెండు నాటు బాంబులు పెద్ద శబ్దంతో పేలిపోయాయి. నాటుబాంబు పేలి అడివి పంది, కుక్క అక్కడికక్కడే మృతి చెందాయి. యూనివర్సిటీ ఆవరణలోని ఐ బ్లాక్ సమీపంలో ఈ  పేలుడు సంభవించింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో క్యాంపస్ లో అలజడి రేగింది.  పేలుడుపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న తనిఖీలు చేపట్టారు. ఇంకేమైనా బాంబులు ఉన్నాయేమోనని క్యాంపస్ లో  క్షుణ్ణంగా గాలించారు. అడవి పందులను వేటాడేందుకే బాంబులను అక్కడ పెట్టినట్టు గుర్తించారు పోలీసులు. పెరుమాళ్లపల్లెకు చెందిన ఇద్దరు అనుమానితులను యూనివర్సిటీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.   

కులాభిమానంతో సీఎం ప్రకటన! బీజేపీలో సోము ప్రకంపనలు 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్  అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన ప్రకటన పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా  అభిమతమని, అర్థం వచ్చేలా సోము వీర్రాజు ప్రకటించడం పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులను కలవరపాటుకు గురిచేసింది. ఖంగుతినేలా చేసింది. ఇదెక్కడి ఖర్మ.. ఎవరినో ముఖ్యమంత్రిని చేయడానికి బీజేపీ కార్యకర్తలు ఎందుకు పనిచేయాలి అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో ప్రముఖంగా కనిపిస్తున్నాయి. సోమువీర్రాజు ప్రకటన పార్టీని, అవమానించే విధంగా ఉందని, పార్టీ అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉందన్న బాధ, అగ్రహం కమలం పార్టీ కార్యకర్తలు వ్యక్త పరుస్తున్నారు.  అంతే కాదు వీర్రాజు ప్రకటన వెనక  కులాభిమానం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనే ఆరోపణలు కూడా పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.     గతంలో సుదీర్ఘ కాలం పాటు తెలుగు దేశం పార్టీతో కమల దళం చెలిమి కొనసాగింది. చంద్రబాబు నాయుడు విశ్వసనీయ మిత్రుడని, పార్టీ నాయకత్వం భావించింది. రాష్ట్ర నాయకులు వద్దన్నా వినకుండా కేంద్ర నాయకత్వం టీడీపీతో పొత్తు పెట్టుకున్న సందర్భాలున్నాయి. అంతే కాదు చివరకు, 2004లో  అలిపిరి సంఘటన నేపధ్యంలో చంద్రబాబు కోరిక మేరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లి బొక్కబోర్లా పడింది. కేంద్రంలో అధికారం కోల్పోయింది. అయినా, మళ్ళీ 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకుంది. మళ్ళీ ఏమి జరిగిందో వేరే చెప్పనక్కర లేదు. చంద్రబాబు నాయుడు చివరి క్షణంలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి ధర్మపోరాటం పేరిట బీజేపీ వ్యతిరేక శక్తులను చేరదీసి, ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటం చేశారు.అయితే, ఆయన  తను తీసుకున్న గోతిలో ఆయనే పడ్డారు, అందుకు ఆయనే ఎక్కువ మూల్యం చెల్లించారు అనుకోండి అది వేరే విషయం. అయినా, తెలుగు దేశంతో అంచెలవారిగా సాగిన స్నేహ ‘బంధం’ వలన బీజేపీ ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నట్లు మిగిలిపోయింది.అదలా ఉంటే, తెలుగు దేశం పార్టీతో పొత్తుకు ఒక సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నాయకులే కారణమని, అప్పట్లోనే కాదు ఇప్పటికి కూడా చాలామంది అభిప్రాయంగా వుంది.  ఇక చంద్రబాబు నాయుడుతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గొప్ప విజ్ఞత వివేచనగల నాయకుడు కాదు. కేవలం ఏడేళ్ళ కాలంలో ఆయన అన్ని పార్టీలను చుట్టి వచ్చారు. బీజేపీ, టీడీపీతో చేతులు చేశారు, కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి నడిచారు, మాయావతితో పొత్తు పెట్టుకున్నారు. అందరితో తెగతెంపులు చేసుకున్నారు. మళ్ళీ  మొదటికి వచ్చారు. బీజేపీతో చేతులు కలిపారు, తెలంగాణలో తెగతెంపులు చేసుకున్నారు. ఏపీలో తుమ్మితే ఊడే ముక్కు ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఇలాంటి పరిస్థితిలో సోము వీర్రాజు అంత పెద్ద ప్రకటన చేయడం రాజకీయ విజ్ఞత అనిపించుకోదని అంటున్నారు.  పార్టీ ఎదుగుదలకు బీజేపీ ఇతర రాష్ట్రాల్లో కూడా మిత్ర పక్షాలకు, మిత్ర పక్షాల నాయకులకు విలువ ఇస్తోందని, బీహార్’లో జనతా దళ్’ కంటే, బీజేపీకే ఎక్కువ సీట్లు వచ్చినా ముందు మాటిచ్చిన మేరకు నితీష్ కుమార్’ కు ముఖ్యమంత్రిని చేసిందని, సోము అనుకూల వర్గం గుర్తు చేస్తోంది. అలాగే, తెలుగు దేశం పార్టీతో కూడా బీజేపీ తెగతెంపులు చేసుకోలేదని, అలాగే, శివసేన, అకాలీ దళ్ విషయంలో కూడా, బీజీపీ మిత్రులను తనంతట తానుగా వదులుకోలేదని,అదే విధంగా పవన్ కళ్యాణ్ విషయంలోనూ బీజేపీ అధినాయకత్వం ఆయనకు విలువ ఇస్తోందని, అదే విషయాన్ని సోము వీర్రాజు చెప్పారని అంటున్నారు. అయితే, ఇతర రాష్ట్రాలు , ఇతర పార్టీల అనుభవాలకు, తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి ఉన్న చేదు అనుభవాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని మరో వాదన వినిపిస్తోంది. మరోవైపు సోము వీర్రాజు ప్రకటన, ఆశించిన ఫలితాలను ఇవ్వక పోగా.. పార్టీని నవ్వులపాలు చేసింది. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు విషయం ఎలా ఉన్నా, డిపాజిట్ దక్కే పరిస్థితి కూడా లేదని.. ఇందుకు, వీర్రాజు ప్రకటన కూడా ఒక కారణంగా పార్టీ వర్గాల్లో సాగుతున్న తాజా చర్చల సారాంశం. 

కరోనా కోరల్లో తెలంగాణ.. 

తెలంగాణ రాష్ట్రంలో తాజాగా రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి 8 గంటల వరకు 59,297 కరోనా నిర్ధరణ టెస్టులు నిర్వహించగా.. కొత్తగా 887 కరోనా కేసులను గుర్తించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతిచెందారని తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1701కి చేరింది. కరోనా నుంచి మరో 337 మంది బాధితులు కోలుకోగా. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,01,564గా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 5,511 యాక్టివ్‌ కేసుల్లో 2,166 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 145 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకూ నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,02,10,906కు చేరింది.   ఇది ఇలా ఉండగా తాజాగా జగిత్యాలలో ఒక్కరోజే 101 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మెట్‌పల్లి పట్టణంలో 26 మందికి కరోనాగా నిర్ధారణ అయ్యింది. జిల్లా వ్యాప్తంగా 309 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.   

సీఎం పదవిని జానారెడ్డి వదులుకున్నారా?

కుందూరు జానారెడ్డి.. నల్గొండ జిల్లాకు చెందిన జానారెడ్డి తెలంగాణలో అత్యంత సీనియర్ రాజకీయ నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ కాలం మంత్రిగా పనిచేసిన నేతగా గుర్తింపు పొందారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014,2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేసులో ముందున్న నాయకుడు. కాంగ్రెస్ గెలవకపోవడంతో  2014 నుంచి 18 వరకు పెద్దలు జానా రెడ్డే సీఎల్పీ నేతగా ఆయనే ఉన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే   ముఖ్యమంత్రి పదవి ఆఫర్ వస్తే జానారెడ్డి వదులుకున్నారట. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి వెతుక్కుంటూ వచ్చినా వదిలేసిన గొప్ప నాయకుడు జానారెడ్డి అని కీర్తించారు. తెలంగాణకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు చెప్పిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రాజకీయ కాక రేపుతోంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న ప్రధాన పార్టీలు... తమ బలగాలన్నంతా సాగర్ లోనే మోహరించాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి , సీనియర్ నేత జానారెడ్డి పోటీ చేస్తుండటంతో .. ఆయన టార్గెట్ గా గులాబీ లీడర్లు ఆరోపణలు చేస్తున్నారు. మంగళవారం సాగర్ బీజేపీ నేత కడారి అంజయ్య యాదవ్ టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. జానారెడ్డికి శాశ్వతంగా రెస్ట్ ఇస్తామని అన్నారు. దీంతో జానా రెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సీరియస్ గా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి జానారెడ్డి కారణమని చెప్పారు  మాజీ మంత్రి షబ్బీర్ అలీ. ఉద్యమ సమయంలో జానారెడ్డి కి సీఎం పదవి ఆఫర్ ఇచ్చినా తీసుకోలేదంటూ సంచలన విషయం బయటపెట్టారు. తాను ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం రాదంటూ.. ఆ పదవిని వదులుకున్న గొప్ప నాయకుడు జానారెడ్డి అని చెప్పారు. జనారెడ్డి ఇన్నేళ్ల రాజకీయంలో కొడుకులని కానీ కుటుంబ సభ్యులని ఎవరని రాజకీయాల్లోకి తీసుకురాలేదన్నారు. కేసిఆర్ కుటుంబంలో మాత్రం అందరికి  ఉద్యోగాలు వచ్చాయని షబ్బీర్ అలీ విమర్శించారు. జనారెడ్డి పెట్టిన బిక్ష తో కెసిఆర్ సీఎం అయ్యారని మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆనాడు జానారెడ్డి సీఎం అయితే కేసీఆర్ ఎక్కడ వుండేవాడిని ప్రశ్నించారు. జానారెడ్డి పై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని మల్లు డిమాండ్ చేశారు. కెసిఆర్ రాజకీయ పతనం దుబ్బాక లో ప్రారంభమైందని.. నాగార్జున సాగర్ ఎన్నిక తరువాత తెలంగాణలో నిజమైన రాజకీయ పునరేకీరణ జరుగుతుందని మల్లు రవి అన్నారు. జానారెడ్డి ముఖ్యమంత్రి పదవిని వదులుకున్నారంటూ షబ్బీర్ అలీ, మల్లు రవి చేసిన ప్రకటనపై తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2009లో వైఎస్సార్ మరణం తర్వాత ఒక్కసారిగా తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. రోశయ్య హయాంలో ఉద్యమం ఉధృతంగా మారడంతో... కాంగ్రెస్ హైకమాండ్ కలవరపడింది. ఉద్యమాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారనే కారణంతో రోశయ్యను తప్పించి.. కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. అయితే తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఆ సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నేత జానా రెడ్డిని సీఎం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావించిందని తెలుస్తోంది. ఈ  విషయాన్ని జానా రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు చెప్పినా.. అప్పుడు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజీలో ఉండటంతో ఆయన వెనుకంజ వేశారని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి తీసుకుంటే తెలంగాణ ప్రజల దృష్టిలో ద్రోహీగా మిలిగిపోతాననే భయం వల్లే జానా రెడ్డి.. అందివచ్చిన పదవిని వదులుకున్నారని కొందరు కాంగ్రెస్ నేతల అభిప్రాయం తెలంగాణ తొలి దశ ఉద్యమ సమయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో అనాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎగిసిపడింది.1978లో ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ మర్రి చెన్నారెడ్డిని ఢిల్లీకి పిలిపించి మంతనాలు జరిపింది. కాంగ్రెస్ లో చేర్చుకుని ఆయనను ముఖ్యమంత్రిని చేసింది. దీంతో ఆనాడు తెలంగాణ ఉద్యమం చల్లారింది.  ఈ ఘటనలన్ని తెలుసు కాబట్టే జానారెడ్డి ముఖ్యమంత్రి పదవిని తీసుకోవడానికి ఆసక్తి చూపలేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

మమతా బెనర్జీపై మరోదాడి? 

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. తృణామూల్ కాంగ్రెస్, బీజేపీ హోరోహారీగా పోరాడుతుండటంతో ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. తాజాగా మరోసారి తనపై దాడి జరిగిందని మమతా బెనర్జీ ఆరోపించారు. ప్రత్యర్థులు జరిపిన దాడిలో గాయపడిన ఓ తృణమూల్ కార్యకర్తను కలిసేందుకు తాను వెళుతుండగా..  కొందరు వ్యక్తులు తన కారుపై దాడికి దిగారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చెప్పారు.  తనను హేళన చేస్తూ దాడికి పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు తన వద్ద ఉన్నాయని అన్నారు. తనపై దాడి చేసేందుకు వారికి ఎంత ధైర్యం వచ్చిందని మమత ప్రశ్నించారు. వీళ్లకు ఏ ద్రోహి ఆశ్రయం ఇచ్చాడోనని, అతను ఢిల్లీలో ఉన్నా, రాజస్థాన్ లో ఉన్నా, యూపీలో ఉన్నా బెంగాల్ కు లాక్కొస్తానని మమతా బెనర్జీ హెచ్చరించారు.  నందిగ్రామ్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామినేషన్ సందర్భంగా.. ఆమెపై దాడి జరిగిందన్న వార్తలు గతంలో తీవ్ర దుమారం రేపాయి. తనపై దాడి జరిగిందని మమత ఆరోపించగా... డ్రామా చేస్తున్నారని బీజేపీ నేతలు  కౌంటరిచ్చారు. మమత కాలుకు గాయమైందని అక్కడి వైద్యులు కూడా  చెప్పారు. ఈ ఘటన తర్వాచ మమత కొన్ని రోజులు వీల్ చైర్ లోనే ప్రచారం చేశారు.  మరోవైపు బెంగాల్ లో హైటెన్షన్ పుట్టిస్తున్న నందిగ్రామ్ నియోజకవర్గానికి  పోలింగ్ జరుగుతోంది. టీఎంసీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన కీలక నేత సువేందు అధికారి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. తనను సవాల్ చేసి వెళ్లిపోయిన సువేందును మట్టికరిపించాలనే పట్టుదలతో మమత ఉన్నారు. తాను పెద్ద మెజార్టీతో గెలుస్తానని సువేందు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతలో భాగంగా నందిగ్రామ్ తో పాటు మరో 29 నియోజక వర్గాలకుపోలింగ్ జరగనుంది. ఈ 30 స్థానాల్లో 191 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 75 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నందిగ్రామ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏకంగా 22 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు. 

ఏప్రిల్ రెండో వారంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని ప్రస్తుతం తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. ఏప్రిల్ 17న తిరుపతి పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే ఏపీలో తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు ముందే మరో ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పి,స్తున్నాయి. గత ఏడాది మార్చిలో కరోనా కారణంగా నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తిరుపతి బైపోల్ కంటే ముందే నిర్వహించే ప్రయత్నాలు చేస్తోంది జగన్ సర్కార్.  ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. గత మార్చిలో ఆగిపోయిన ఎన్నికలను వెంటనే పూర్తి చేయాలనే యోచనలో జగన్ సర్కార్ ఉంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించడంతో అదే జోష్ లో పరిషత్ ఎన్నికలు కూడా ముగించాలని వైసీపీ ప్రభుత్వం భావించింది. అందుకే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఒత్తిడి తెచ్చింది. అయితే తన వాల్ల కాదంటూ నిమ్మగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఏప్రిల్ 1న నిమ్మగడ్డ స్థానంలో కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఏపీ సర్కార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.  ఎస్ఈసీగా నీలం సాహ్నీ బాధ్యతలు తీసుకున్న వెంటనే స్థానిక ఎన్నికలపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ఆమె తొలి ప్రెస్ మీట్ లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ వస్తుందని తెలుస్తోంది. ఏప్రిల్ 1న ప్రకటన ఇచ్చి.. ఏప్రిల్ 8 లేదా 10వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం.కరోనా వ్యాక్సినేషన్ కు ఈ ఎన్నికలు అడ్డంకిగా మారాయని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఏప్రిల్ మొదటివారంలోనే దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చనే ప్రచారం అప్పట్లో జరిగింది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఏప్రిల్ 1న ఎన్నికలకు సంబంధించిన కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. 2020 మార్చిలో  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది. విత్ డ్రాలు కూడా అయిపోయాయి. అప్పటికి పోలింగ్ కు వారం రోజుల ముందు కరోనా లాక్ డౌన్ తో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. 6 రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉండటంతో.. ఏప్రిల్ మొదటి వారంలో ప్రకటన వస్తే.. 8, 10వ తేదీలు లేదా.. 12వ తేదీ లోపు ఎన్నికలు ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే నామినేషన్లు వేసిన వారు, ఏకగ్రీవంగా ఎన్నికన వారిలో కొందరు మృతి చెందడంతో ఎస్ఈసీ ప్రకటన ఎలా ఉండబోతుందనేది అసక్తికరంగా మారింది.  

రాహుల్ కంటే ప్రియాంక బెటర్

నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది, భారతీయ జనతా పార్టీ ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. అస్సాంలో అధికారం నిలుపుకోవడం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలలో అధికారాన్ని కైవసం చేసుకోవడం లక్ష్యంగా, కమల దళం పావులు కదుపుతోంది.ఈ మూడు రాష్ట్రాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా, ఇంకా ఇతర జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఒక్క బెంగాల్లోనే ఓ పాతిక  మంది వరకు కేంద్ర మంత్రులు ‘ప్రత్యేక’ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇతర రాష్టాల నుంచి కార్యకర్తలు, నాయకులు ఎన్నికలు జరుగతున్న రాష్ట్రాలలో తిష్ట వేసే ప్రచారం సాగిస్తున్నారు.  అలాగే పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు అన్నీ కాలంతో పాటు పరుగులు తీస్తూ ప్రచారం సాగిస్తున్నాయి. మమతా బెనర్జీ కాలికి గాయమైన, పట్టించుకోకుండా ప్రచారంలో పరుగులు తీస్తున్నారు.అలాగే, తమిళ నాయుడులో ద్రవిడ పార్టీలు, కేరళలో కమ్యూనిష్టులు, ఏ చిన్న అవకాశం వదులుకోకుండా, ప్రత్యర్ధులను చిత్తు చేసే ఎత్తుగడలతో ముందుకు సాగుతున్నారు.  అయితే, జాతీయ స్థాయిలో బీజేపీ  ప్రధానప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇంకా ఎన్నికల జోష్ కనిపించడంలేదు. కాంగ్రెస్ ప్రధాన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అస్సాం, కేరళ, డీఎంకేతో పొత్తు పెట్టుకున్న తమిళ నాడులో మాత్రం, రాహుల్ గాంధీ, ప్రియాంక ప్రచారంలో పాల్గొంటున్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఎవరూ కూడా ప్రచారంలో చురుకైన పాత్రను పోషించడం లేదు.  ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ప్రచారం వినూత్నంగా సాగుతోంది. ఆయన ఎన్నికల ర్యాలీలు,  బహిరంగ సభల కంటే, విద్యార్ధులు, యువకులతో ఇంటరాక్షన్’ వైపు మొగ్గు చూపుతున్నారు. బస్కీలు, దండీలు తీయడం, కాలేజీ అమ్మాయిలకు మార్షల్ ఆర్ట్స్‘లో శిక్షణ ఇవ్వడం చేస్తూ చిత్ర  విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. అక్కడక్కడా నాలుగు మాటలు మాట్లాడినా అందులో ప్రజలను ఆకట్టుకునే మాట కనిపించడం లేదు, కేవలం మోడీని దూషించడం  వరకే పరిమితం అవుతున్నారు. ఉదాహరణకు బుధవారం అస్సాంలో పర్యటించిన రాహుల్ గాంధీ  గౌహతీలో కామాఖ్యా ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. పేద్ద  బొట్టు పెట్టుకున్నారు. ఆ తర్వాత కామ్‌రూప్ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 24 గంటలూ అబద్ధాలాడుతూనే ఉంటారని విరుచుకుపడ్డారు. అలాగే, నిరుద్యోగ సమస్య, ఇతర సమస్యలను ప్రష్టావించినా, గెలుపు పై ధీమాతో కనిపించలేదు.కిల్లింగ్ ఇన్స్టింక్ట్ మాటల్లో దూసుకు రావడం లేదు. మరో వంక మోడీ, అమిత్ షా ఇతర బీజేపీ నాయకులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో, రాహుల్ ప్రచారం ప్రజలను ఆకట్టుకులేక పోతోందని,రాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు.  అలాగే రాహుల్ కంటే ప్రియాంక ప్రచారం ప్రజలను, మీడియాను కూడా బాగా  అకట్టుకుంటోంది. ప్రియాంక రాహుల్’కు భిన్నంగా ఎక్కడికి వెళితే అక్కడి ప్రజల సమస్యలను ప్రస్తావించడంతో పాటుగా, ప్రత్యర్ధులకు గట్టిగా  చురకలు వేస్తున్నారు.ఉదాహరణకు,బుధవారం కేరళలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక అధికార  వామ పక్ష కూటమి, ఎల్డీఎఫ్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి విజయన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను అమ్మివేస్తోందని విమర్శలు గుప్పించారు. బంగారం స్మగ్లింగ్ ఆరోపణలను అస్త్రాలుగా చేస్కున్నారు. అందుకే  ప్రచారం వరకు అయితే, రాహుల్ కంటే ప్రియాంక బెటర్ అనిపించుకున్నారు.

నందిగ్రామ్ సంగ్రామ్.. అందరి చూపు అటువైపే..

నాలుగు రాష్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీలకు ఎన్నికలు జరుగతున్నా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాత్రం పశ్చిమ బెంగాల్ ఒక్కటే. బెంగాల్ శాసనసభలో 294 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయినా అన్నింటిలో ఒక్క స్థానం మాత్రం చాలా ప్రత్యేకం. అదే నందిగ్రామ్. ఇక్కడి నుంచే 15 ఏళ్ల క్రితం మమతా బెనర్జీ, అప్పటి వామపక్ష కూటమి ప్రభుత్వంపై భూపోరాట సమర శంఖాన్ని పూరించారు. అప్పుడు ఆమె కుడు భుజంగా నిలిచిన నేత సువేందు అధికారి. ఆ ఇద్దరు సాగించిన పోరాటమే 34 ఏళ్ళు ఎదురులేకుండా రాష్ట్రాన్నిపాలించిన వామపక్ష కూటమి ప్రభుత్వానికి చరమ గీతం పాడింది.   ఇప్పుడు ఆ నియోజక వర్గం నుంచి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. అంతే కాదు, ఆమె ప్రత్యర్ధి బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి. ఆయనా సామాన్యుడు కాదు. సింగూరు ఉద్యమ కాలం నుంచి నిన్న మొన్నటి వరకు మమత బెనర్జీ కుడి భుజంగా పనిచేసిన, నందిగ్రామ్ నియోజక వారం సిట్టింగ్ ఎమ్మెల్యే.అంతే  కాదు  ఈ ప్రాంతం అధికారి ఫ్యామిలీ సామ్రాజ్యం. ఒక్క నందిగ్రామ్ నియోజక వర్గం మాత్రామే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఓడజనుకు పైగా నియోజక వర్గాల్లో ‘అధికారి’ ఫ్యామిలీదే అధికారం.అందులోనూ నందిగ్రామ్ సువేందు ఫ్యామిలీ కంచుకోట. అందుకే, ఇంకొకరు, ఇంకొకరు అయితే, నందిగ్రామ్ లో సువేందు అధికారిని ఎదుర్కునే సాహసం చేయరు. కానీ, మమతా బెనర్జీ, సువేందు అధికారి చేసిన  సవాలును స్వీకరించి బరిలో దిగారు. మరో నియోజక వర్గం నుంచి పోటీ చేయడం లేదు. అంటే, ఈ నియోజక వర్గంలో ఆమె ఓడిపోతే, ఆమె పార్టీ అధికారంలోకి వచ్చినా, మూడవ సారి  ముఖ్యమంత్రి కావాలన్న ఆమె ఆశ మాత్రం నెరవేరదు. ఆ విధంగా చూస్తే ఆమె చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. అందుకే, నందిగ్రామ్ పోరును, దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. అదలా ఉంటే, గురువారం సెకండ్ ఫేజ్’లో పోలింగ్’కు వెళ్ళే ఈ నియోజక వర్గంలో అటు, తృణమూల్,ఇటు బీజేపీ చివరి క్షణం వరకు,హోరాహోరీగా ప్రచారం సాగించాయి. ప్రచారం ప్రారంభంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నందిగ్రామ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అలాగే కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నాయకులు కూడా నియోజక వర్గంలో విస్తృతంగా ప్రచారం సాగించారు. చివరకు ఫినిషింగ్ టచ్, కేంద్ర హోం మంత్రి అమిత్ ఇచ్చారు. ప్రచార గడువు ముగిసిన మంగళవారం అమిత్ షా, రోడ్ షో నిర్వహించారు. మమతా బెనర్జీ ఇంటి గడప వరకు వెళ్లి మరీ ప్రచారం చేశారు. నందిగ్రామ్ లో తమ తాత్కలిక నివాసం కోసం మమతా బెనర్జీ అద్దెకు తీస్కున్న రెండస్తుల భవనానికి కేవలం 500 మీటర్ల  దూరంలోని శివాలయంలో స్వామి దర్శనం చేసుకుని, అక్కడే కార్యకర్తలు, నాయకులతో కలిసి దోసకాయలు తిన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన షా, నందిగ్రామ్ నియోజక వర్గం నుంచి సువేందు అధికారి భారీ మెజారిటీతో గెలుస్తున్నారని ప్రకటించారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆయన చెప్పుకొచ్చారు.  మరోవైపు, మమతా బెనర్జీ వరసగా మూడు రోజులు సొంత నియోజక వర్గంలోనే బస చేసి, రోడ్ షో, బహిరంగ సభల్లో ప్రసంగించారు. మరో నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్న నందిగ్రామ్ ప్రజ్లపి ఉన్న విశ్వాసంతో ఒకే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. అందుకే బీజేపీ , తృణమూల్ రెండు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా పోరాడుతున్న నందిగ్రామ్ సంగ్రామం, మదర్ ఆఫ్ ఆల్ బ్యాటిల్స్, అన్నట్లుగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

మాస్కులపై పోలీస్ యాక్షన్.. 

కరోనా.. ఆ పేరు వింటే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. కానీ కొంత మంది భయం లేకుండా బలాదూర్ గా తిరుగుతున్నారు. ఇక పై కరోనా నిబంధనలు పాటించకుంటే భారీమూల్యం చెల్లించాలిందేనంటున్నారు పోలీసులు. ఈ నిర్లక్ష్య ధోరణికి తప్పదు చరమగీతం అంటున్నారు. మాస్కులు లేకుంటే కేసులు. ఆపై జరిమాణాలతో అదరగొడుతున్నారు.  కరోనా స్టార్టింగ్ లో ప్రజలను వణికించింది. కానీ ఇప్పుడు ప్రజల్లో కరోనా భయం కొంతైన కనిపించడం లేదు. కనీసం జాగ్రత్తలు పాటించడంలేదు. మాస్కులు లేకుండానే విచ్చలవిడిగా బజారున తిరుగుతున్నారు. దీంతో పోలీస్ శాఖ మరోసారి రంగంలోకి దిగింది. మాస్కులు పెట్టుకోకుండా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తున్నారు. రామగుండం కమినషరేట్ పరిధిలో మాస్క్ పెట్టుకోకుండా తిరుగుతున్న 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరో 30 మందికి జరిమానాలు విధించారు. రాబోయే రోజుల్లో మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

జానారెడ్డిని ఏకగ్రీవం చేయాలి.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి..

నాగార్జున సాగర్ ఎన్నిక తర్వాత తెలంగాణలో నిజమైన రాజకీయ పునరేకీకరణ జరుగుతుందన్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ రాజకీయ పతనం దుబ్బాకలో ప్రారంభమైందని.. సాగర్‌తో మరింత స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు. జానారెడ్డిపై కేసీఆర్ చేసిన కామెంట్లపై టి.కాంగ్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జానారెడ్డికి పర్మినెంట్ రెస్ట్ ఇస్తానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ మల్లు రవిలు తీవ్రంగా ఖండించారు.  తెలంగాణ రాష్ట్రం రావడానికి జానారెడ్డే కారణమని.. అప్పట్లో సీఎం పదవి ఆఫర్ చేసినా ఆయన తీసుకోలేదన్నారు. జానారెడ్డి పెట్టిన బిక్షతోనే కేసీఆర్ సీఎం అయ్యారన్నారు కాంగ్రెస్ నేతలు. జానారెడ్డి ఇన్నేళ్ల రాజకీయంలో కొడుకులని కానీ, కుటుంబ సభ్యులని కానీ ఎవరినీ రాజకీయాల్లోకి తీసుకురాలేదన్నారు. అదే, కేసీఆర్ మాత్రం తన కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చారన్నారు.  నాగార్జున సాగర్‌లో డబ్బుతో కేసీఆర్ గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో డబ్బుల సంచులు అందించారన్నారు. మండలానికి 5 కోట్లు చొప్పున.. ఆరు మండలాలకు చెందిన నాయకులకు ఇప్పటికే డబ్బులు అందాయని ఆరోపించారు.  నాగార్జున సాగర్ ఎన్నికలో అధికార పార్టీ 100 కోట్లు ఖర్చు పెట్టబోతోందని మండిపడ్డారు. కేసీఆర్ మాటలు, డబ్బు మూటలు జానారెడ్డి ముందు పని చేయవన్నారు షబ్బీర్ అలీ, మల్లు రవిలు.  జానారెడ్డి మచ్చలేని నాయకుడు.. రాజకీయాలకే దిక్చూచి లాంటి వాడు.. జానారెడ్డిని ఏకగ్రీవంగా ఎమ్మెల్యే పదవికి ఎంపిక చేసి ఆయన్ను గౌరవించాలన్నారు కాంగ్రెస్ నేతలు.  జానారెడ్డిపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల తరువాత కేసీఆర్ శాశ్వతంగా ఫామ్‌హౌజ్‌కే పరిమితమవుతారన్నారు. 

ఇళ్ల పేరుతో దందా.. సొమ్మొకరిది సోకు ఇంకొకరిది..

సరసమైన ధరలకు ఇళ్ల పట్టాలు. ఇది పథకం కాదని వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న భూదందా అని ఆరోపించారు ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు. జిల్లా కేంద్రాల్లో లేఅవుట్‌లు అభివృద్ధి చేసి ఇస్తామనడంలో దందా కోణం దాగుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు టూ వీలర్స్‌ ఇస్తామంటున్నారని.. పింఛన్లు ఇవ్వడానికే నిధులు లేకపోతే ఇక వెహికిల్స్‌కు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.    పశువులకు అంబులెన్స్ అంటూ మరో పథకం పెట్టారని.. దానికంటే పశువైద్యులకే టూ వీలర్స్‌ ఇచ్చి అక్కడికి పంపితే బాగుంటుందన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో వేసుకుంటున్నారని ఆక్షేపించారు. సర్పంచ్‌ల అధికారాలను లాక్కొంటున్నారని రఘురామకృష్ణరాజు విమర్శించారు.  ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష కట్టి ఎన్నో ప్రయత్నాలు చేసినా మొక్కవోని ధైర్యంతో ఆయన ముందుకెళ్లారన్నారు. నిమ్మగడ్డకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు రఘురామకృష్ణరాజు.

8 పెళ్లిళ్లు.. గంజాయి గ్యాంగులు.. వాడు మామూలోడు కాదు గురు..  

అతడు నిత్య పెళ్లి కొడుకు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు.  కట్ చేస్తే.. ఆ నిత్య పెళ్లి కొడుకు తిక్క కుదిర్చారు పోలీసులు.  స్టైల్  గా తయారు అవ్వడం. రోడ్ల వెంట రోమియోలా తిరగడం.. ఒంటరిగా  కనిపించిన అమ్మాయిలకు మస్కా కొట్టడం.. తన లైఫ్ చాలా రిచ్ అని నమ్మించడం. బుట్ట బొమ్మల్ని బుట్టలో వేసుకోవడం. తనను పెళ్లి చేసుకుంటే సుఖమైన జీవితం ఉందంటూ మొదట వెంటపడతాడు. వారిని నమ్మించి తనపై నమ్మకం కలిగే వరకు ప్రేమించమని ప్రాధేయపడతాడు. అతడి మాటలు నమ్మి ప్రేమించడానికి అమ్మాయి ఒప్పుకుంటే త్వరగానే పెళ్లికి అంగీకరిస్తాడు.. ఆ తరువాతే మనోడి అసలు రూపం బయటపడుతుంది. ఆ తర్వాత తన మాట వినాల్సిందే.. లేదంటే కత్తులు, గన్ చూపిస్తాడు.  చంపేస్తానంటూ బెదిరిస్తాడు.  విశాఖపట్నానికి చెందిన అరుణ్ కుమార్ కు వ్యభిచార ముఠాలు, గంజాయి గ్యాంగులతో సంబంధాలున్నాయి. వాళ్లకి అమ్మాయిలను,గంజాయిను సరఫరా చేస్తూ డబ్బు బాగానే సంపాదిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బుతో అమ్మాయిలను వలలో వేసుకుంటాడు. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటాడు. తరువాత వ్యభిచార రొంపిలోకి దింపుతాడు. తాజాగా తన మొదటి భార్య వ్యభిచారానికి నిరాకరించడంతో ఆమె కుమార్తెను అమ్మేస్తాను  అంటూ బెదిరింపులకు దిగాడు. కేవలం ఆమెనే కాదు.. తనను నమ్మి వివాహం చేసుకున్న వారందర్నీ ఇలానే బెదిరించాడు.  వ్యభిచార ముఠా, గంజాయి గ్యాంగులతో సంబంధాలు కారణంగా మారణాయుధాలు కూడా అతడి దగ్గర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అది కూడా సినిమాల్లో ఏవైనా మారణాయుధాలను చూస్తే..అచ్చం అలాంటి వాటినే తయారు చేయించి తన దగ్గర పెట్టుకున్నట్టు పోలీసులు తేల్చారు. ఎవరైతే తన మాట వినరో వారికి కత్తులు, తుపాకులను చూపించి చంపేస్తానని బెదిరిస్తున్నట్టు చెప్పారు.  తన మొదటి భార్య ఎదురు తిరగడంతో ఈ నిత్య పెళ్లి కొడుకు లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తన కూతురిని అమ్మేస్తానని చెప్పడమే కాకుండా, కత్తులు, తుపాకులతో బెదిరించాడని ఆమె కంచరపాలెంలోని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకోకపోవడంతో ఆమె మహిళా సంఘలను ఆశ్రయించింది. అయితే బాధిత మహిళలు మాత్రం అరుణ్ కుమార్ కు పోలీసులతో స్నేహ సంబంధం ఉందని ఆరోపణలు చేస్తున్నారు. మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగడంతో అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి దగ్గర నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకుని.. అతడిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా అతడి బాధితులు ఉంటే ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.

వేటగాళ్లు.. వాళ్లు చాలా ముదుర్లు..  

వికారాబాద్ లో వేట. వీకెండ్ వస్తే చాలు తుపాకుల మోత. బడాబాబుల చేతిలో అడవి జంతువుల కోత. జింకలు, ఆవులే వాళ్ళ టార్గెట్. అటవీశాఖ అధికారులు వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు. ఆ వన్యప్రాణుల ప్రాణాలు తీయడంలో వాళ్లంతా భాగ్యస్వామ్యులే.  హైదరాబాద్ నుంచి కొందరు వేటగాళ్లు సరదాగా అడవిబాట పడుతున్నారు. దామగుండం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఫామ్ హౌసుల్లో బస చేస్తూ.. అడవుల్లో వేట కొనసాగిస్తూ. రాత్రి వేళ్లల్లో వారి కంటపడ్డ వన్యప్రాణులను తుపాకీ తూటాలకు బలి చేస్తున్నారు.  రెండు నెలల క్రితం ఆవుపై కాల్పులు జరిపిన ఘటన మరువకముందే  మళ్లీ కొందరు వేటగాళ్లు మరోసారి తుపాకీ పేల్చారు. ఓ కృష్ణ జింకను బలితీసుకున్నారు. దామగుండం అడవుల్లో కృష్ణ జింక కళేబరాన్ని స్థానిక పశువుల కాపర్లు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే వారు ఘటనా స్థలానికి వెళ్లకుండానే కుక్కల దాడిలో జింక చనిపోయిందని అధికారులు తేల్చేశారని స్థానికులు మండిపడుతున్నారు. వేటగాళ్లంతా బడాబాబులు కావడంతో  వారి కనుసన్నల్లోనే ఫారెస్టు అధికారులు పనిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేటగాళ్ల ముసుగులో కొందరు పెద్దలు  వన్యప్రాణులను బలితీసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

అసత్య ప్రచారం తగదు.. టీటీడీ వ్యాఖ్యలు సిగ్గుచేటు..

తలనీలాల విషయంలో టీటీడీపై సోషల్ మీడియాలో అనవసర నిందలు వేస్తున్నారని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. మిజోరం పోలీసులు నమోదు చేసిన కేసులో టీటీడీ పేరు లేదని స్పష్టం చేశారు. అన్‌ ప్రాసెస్డ్‌ హెయిర్‌ను పట్టుకున్నట్టు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. ప్రాసెస్‌ చేయకుండా తలనీలాలు విక్రయించమని.. కట్టుదిట్టమైన భద్రతతో తలనీలాలు తిరుపతికి తరలిస్తామని.. ఒక్క వెంట్రుక కూడా దొంగతనంగా బయటకు వెళ్లే అవకాశం లేదన్నారు అదనపు ఈవో ధర్మారెడ్డి. అత్యంత పారదర్శకంగా ఈ-వేలం ద్వారా తలనీలాలను విక్రయిస్తామని, దీనిపై అసత్య ప్రచారం తగదని హితవు పలికారు.   అయితే.. టీటీడీ వివరణపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి తలనీలాలు ఎక్కడో చైనాకు తరలిస్తుండగా పట్టుబడితే, టీటీడీ అధికారులు తమకేం సంబంధమనడం సిగ్గుచేటని మండిపడ్డారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. తలనీలాల కాంట్రాక్ట్ పొందిన సంస్థ పూర్వాపరాలు టీటీడీ అధికారులకు తెలియవా అని ప్రశ్నించారు. తలనీలాలు తీసుకెళ్లి సదరు సంస్థ ఎక్కడ విక్రయిస్తుందో, ఏం చేస్తుందో తెలుసుకోకుండానే పాలకవర్గం, టీటీడీ అధికారులు కాంట్రాక్ట్ కట్టబెట్టారా అని నిలదీశారు. తలనీలాల ఘటనకు సిగ్గుపడకుండా, ధర్మారెడ్డి ఎవరిపై కేసులు పెడతారని మండిపడ్డారు.  హిందువుల వైకుంఠమైన తిరుమలను జగన్మోహన్‌రెడ్డి వ్యాపార కేంద్రంగా మార్చేశాడని బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. పరమతానికి చెందిన ముఖ్యమంత్రి జరిగిన ఘటనకు బాధ్యులైన జవహర్ రెడ్డి, ధర్మారెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయించాలన్నారు. టీటీడీ పాలకవర్గాన్ని తక్షణమే రద్దు చేయాలని బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు.

కేసీఆర్ మెడలో గంట కట్టేదెవరు?

తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరమా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. అయితే, ఎవరికీ వారు సొంత దుకాణాలు పెట్టుకుంటే, ప్రయోజనం ఉండదని, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శక్తి యుక్తులను సమర్ధవంతంగా ఎదుర్కునే, ఉమ్మడి వేదికగా కొత్త పార్టీ ఏర్పాటు కావాలన్న అభిప్రాయం ఇటు రాజకీయ వర్గాల్లో, అటు మేథావి, మీడియా వర్గాలలోనూ వినవస్తోంది. అయితే, పిల్లి మెడలో గంట కట్టేది ఎవరన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.  ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన టీఆర్ఎస్ మాజీ ఎంపీ విశ్వేశ్వర రెడ్డి తెరాసకు ధీటైన ప్రత్యాన్మాయం అవసరం చుట్టూ ఆలోచనలను నడిపిస్తున్నారు. అయితే ఆయన కూడా ఇదమిద్దంగా ఇదీ ఐడియా, ఇదీ బ్లూ ప్రింట్ అని కాకుండా, అటు అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులతో, అదే విధంగా కాంగ్రెస్, బీజేపీ సహా అనేక ఇతర పార్టీలలో ఉన్న నాయకులతో బహిరంగంగా, లోపాయికారిగా చర్చలు జరుపుతున్నారు. మీడియా ముందు తమ ఆలోచనలను ఉంచుతున్నారు. ఒక విధంగా మేథోమథనం సాగిస్తున్నారు. అయితే, అది అంత సులభంగా అయ్యే పని కాదన్న వాదన కూడా వినిపిస్తోంది.  కేసీఆర్‌పై వ్యతిరేకత విషయంలో ఏకాభిప్రాయం ఉన్నా.. నాయకత్వం విషయంలో ఏకాభిప్రాయం కుదరడం అయ్యే పని కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే, తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన కోదండరామ్, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి, రాణి రుద్రమ ఇలా చాలా మంది టీఆర్ఎస్‌కు, మరీ మాట్లాడితే కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏర్పాటు చేశారు. అయినా అందరూ విఫలమయ్యారు. ఒక విధంగా, ఎవరి కుంపటి వారు పెట్టుకోవడం వలన మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కారు పార్టీ విజయం సాధించింది. అంతే కాదు, కేసీఆర్ కుటుంబ పాలనపై ఒంటరి పోరాటం చేసిన తీన్మార్ మల్లన్న ఓటమికి, వీరంతా కారణమయ్యారు. ఒక విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్ధులను కేసీఆర్ వ్యతిరేకులంతా ఎవరికి వారే విడిపోయి గెలిపించారు. ఈ పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలంటే, టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు అన్నీ ఏకం కావాలి. అలా అందరినీ ఏకం చేయాలంటే అందుకు మరో కేసీఆర్ కావాలి.. అన్న అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.  అదలా ఉంటే, ప్రాతీయ పార్టీలకు చెక్ పెట్టడం ప్రాంతీయ పార్టీలకు మాత్రమే సాధ్యమన్న విషయంలోనూ ఏకాభిప్రాయం లేదు. బలమైన ప్రాంతీయ పార్టీకి బలమైన ప్రాంతీయ పార్టీనే ప్రత్యాన్మాయం అని ఆలోచించే వారు.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఉదాహరణగా చూపుతున్నారు. మరోవైపు ప్రాతీయ పార్టీకి జాతీయ పార్టీ, జాతీయ పార్టీకి ప్రాంతీయ పార్టీ ప్రత్యాన్మాయం కాగలుగుతాయని చూపేందుకు అనేక ఉదాహరణలు చూపుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తెలుగు దేశం సుదీర్ఘ కాలం పాటు ప్రత్యాన్మాయంగా నిలిచింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో  ప్రాంతీయ పార్టీ తృణమూల్ కు జాతీయ పార్టీ బీజేపీ ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచింది. ఉత్తర ప్రదేశ్ లో సుదీర్ఘకాలం పాటు ఆ రాష్ట్రానికే చెందిన ఎస్పీ, బీఎస్పీలు ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు, బీజేపీ అధికారంలో ఉంది. అలాగే, అస్సాం, బీహర్ సహా  ఇంకా చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ, జాతీయ పార్టీలు ప్రత్యర్దులుగా పోటీ పడుతున్నాయి. మిత్ర పక్షాలుగా మెలుగుతున్నాయి. సో.. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బలమైన ప్రత్యాన్మాయం అవసరం కానీ, అది ప్రాంతీయ పార్టీనే కావాలని అనుకోవడంతో మాత్రం అర్థం లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.