మునుగోడు లో టిఆర్ఎస్ కు  షాక్‌.. మాజీ ఎంపీ బూర గుడ్ బై

పార్టీ అధినేత పార్టీ నేత‌ల‌కు అందుబాటులో ఉండాలి. వారి మాటా వినాలి. స‌ల‌హాలు విన‌క‌పోయినా ప‌ర వాలేదు. కానీ వారి అభిప్రాయాల‌కీ గౌర‌వం ఇవ్వాలి. కానీ వీటికి ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్ త‌న పార్టీ నుంచి మాజీ ఎం.పి బూర న‌ర్స‌య్య‌గౌడ్ వెళిపోవ‌డానికి కార‌కుల‌య్యారు. ఇటీవ‌లి కాలంలో కేసీఆర్  దేశ రాజ‌కీ యాల‌మీద ఆస‌క్తి చూప‌డం, పార్టీని ఆ విధంగా బ‌లోపేతం చేయ‌డం అస‌లు పార్టీ పేరునే మార్చి కేంద్రం లో బీజేపీకి ట‌గ్గ‌ఫ‌ర్‌గా నిలిచి  అక్క‌డి రాజ‌కీయాల్లో హ‌ల్‌చ‌ల్ చేయ‌డానికి సిద్ధ‌ప‌డ‌ట‌మే ఇక్క‌డ పార్టీ ప‌రిస్థితులప‌ట్ల అనాస‌క్తి పెంచింద‌నాలి. ఉద్య‌మ‌యోధునిగా, తెలంగాణా ఆవిర్భావానికి కార‌కునిగా, తొలి ముఖ్యమంత్రిగా ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొందిన కేసీఆర్ క్ర‌మేపీ ప్ర‌జ‌ల‌కంటే త‌న పార్టీ వారికే బాగా దూర‌మ య్యారన్న‌ది తెలుస్తోంది.  త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు, బీజేపీని దెబ్బ‌తీయ‌డం ప్ర‌ధాన ల‌క్ష్యంగా పావులు క‌ద‌ప‌డంలో పార్టీ మునుగోడు విజ‌యానికి ప‌టిష్టం చేయ‌డంపై ఆస‌క్తి చూపుతున్నారా అన్న ప్ర‌శ్న‌త‌లెత్త‌డానికి కేసీఆర్  స్వ‌యంగా కార‌కుల‌య్యారు. అభ్య‌ర్ధిని నిల‌బెట్టాలి గ‌నుక ఒక‌రిని ప్ర‌క‌టించ‌డం త‌ప్ప విజ‌యావ‌కాశాలు ఏ మేర‌కు ఉన్నాయ‌న్న లెక్క ప‌రిశీలించ‌డం లేదు. కార‌ణం ఆయ‌న కుటుంబం స‌మ‌స్య‌ల వ‌లయంలో చిక్కు కుంది. మ‌రీ ముఖ్యంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఆయ‌న కుమార్తె టిఆర్ ఎస్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత పేరు బ‌య‌టికి రావ‌డంతో ఆ మ‌చ్చ‌ను తొల‌గించుకునే ప‌నిలోప‌డ్డారు. రోజూ కేంద్రాన్ని, మోడీని, షానీ తిట్టు కోందే రోజు గ‌డ‌వ‌ని కేసీఆర్, ఇపుడు త‌న ప‌రువు కాపాడుకునేందుకు ఢిల్లీలోనే మ‌కాం పెట్టి ఢిల్లీ పెద్ద‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని చూస్తున్నారు. అయితే తిట్టిన నోటితోనే అన్నా నా కూతురుని నీవే కాపాడాలి, మా పాలిగ వెంక‌న్న‌వి, యాద‌గిరి న‌ర్సింహుడివీ అంటే ఎంత కాషాయంలో ఉన్న‌ప్ప‌టికీ మోదీ వింటారా? ప‌గ‌దీర్చుకోవ‌డానికి కేసీఆర్ స్వ‌యంగా దొరికిపోయారు. బుర‌ద‌ప‌డిన పార్టీలో ఎవ‌రు మాత్రం ఆస‌క్తితో, ఇష్టంతో ఉంటారు. ఎవ‌రి కెరీర్‌వారిది. ఎవ‌రి ఇష్టాయిష్టాలు వారివి. బూర వి అందుకు మిన‌హాయింపు కాదు. అందుక‌నే ఒక‌నాటి కేసీఆర్‌కి ఇప్ప‌టి రాటుదేలిన రాజ‌కీయ‌చ‌ద‌రంగం తెలిసిన కేసీఆర్‌కి ఎంతో వ్య‌త్యాసం గుర్తించి బూర న‌ర్సింగ్ గౌడ్ వంటి సీనియ‌ర్లు పార్టీ మార‌డానికి నిర్ణ‌యించు కున్నారు. పైగా  త‌న మాట‌ను, పిలుపుని ప‌ట్టించుకోని నాయ‌కుని ద‌గ్గ‌ర ఉండి అవ‌మానప‌డే కంటే వేరు పార్టీ పంచ‌న చేరి కాస్తంత గౌర‌వం ద‌క్కించుకోవ‌డానికి నిర్ణ‌యించుకున్నార‌నే అనుకోవాలి. ఇదేమంతగా కేసీఆర్‌కు న‌ష్టం క‌లిగించ‌క‌పోవచ్చు. కానీ హితుల‌ను దూరం చేసుకోవ‌డం భ‌విష్య‌త్తులో టీఆర్ ఎస్‌కు ఎంతో వ్య‌తిరేక ప్ర‌భా వ‌మే చూపుతుంది.  ఏ రోజు పదవి కోసం పాకులాడలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ఆకాంక్ష కొరకు మాత్రమే పోరాటం చేసినట్లు బూర చెప్పారు. తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా అంత బాధ పడలేదన్నారు. బీసీ వర్గాల సమస్యలను కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ముఖ్యమంత్రికి సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేదన్నారు. ఏ పార్టీ అయినా ప్రజల సమస్యలు పరిష్కరిస్తే వారితో ఉంటానని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. 

పిచిక‌ల‌ది, పిట్ట‌ల‌దీ గోల కాదు.. వినండి! 

సంగీతం అంద‌ర్నీ ఆక‌ట్టుకునే శ‌క్తి క‌లిగిన క‌ళ‌. అందులోనూ గాయ‌కులు మ‌రీ ప్ర‌త్యేకం.ఘంట‌సాల పాట దూరం నుంచి విన‌ప‌డ‌గానే క్ష‌ణం ఆగి వింటారు ఎవ్వ‌రైనా..వీల‌యితో ఒక‌టి రెండు చ‌ర‌ణాలు గుర్తుచేసు కుంటూ వెళ‌తారు. ల‌తామంగేష్క‌ర్‌, బాలు.. ఎవ‌రైనా స‌రే హిందీ అయినా, తెలుగయినా పాట పాటే, గాయ కుడు గాయ‌కుడే ఎవ‌రైనా అంతే గొప్ప ప్ర‌భావం చూపుతారు. మ‌నిషి మ‌న‌సు బాగోలేన‌పుడు, ఒంటరిగా ఉన్న‌పుడో ఒక్క పాట మ‌న‌సును తేలిక‌ప‌రుస్తుంది. ఇపుడు తాజాగా విదేశీ శాస్త్ర‌వేత్త‌లు కొత్త సంగ‌తి చెబు తున్నారు..కోయిల‌నే విన‌డం క‌ష్ట‌మే.. ప‌క్షుల కిల‌కిలారావాలు వింటే మ‌నసు ప్ర‌శాంత‌త పొందుతుంద‌ని. వాస్త‌వానికి ఇది మ‌న పూర్వీకుల మాటే. ప్ర‌కృతి వైద్య‌శాల‌ల్లో స‌గం మానిసిక వైద్యం ఇలానే జ‌రిగిపోతుంటుంద‌ని అంటూం టారు. అందుకే చెట్ల‌ను జీవుల‌ను ఎంతో ప్ర‌త్యేకంగా చూడాలం టారు.  ఎప్పుడయినా  మీ యింటి ప‌రిస‌రాల్లో చిల‌క‌లో, పిచిక‌లో కిల‌కిలారావం చేయ‌డం చెవొగ్గి విన్నారా? ఒక్క క్షణం.. అదీ మీ ఇంటి ఆవ‌ర‌ణ‌లో, అపార్ట్‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో చెట్లు ఉంటే, మీ కాల‌నీలో చెట్లు బాగా ఉంటే పొద్దుటే, మ‌ద్యాన్న‌మో పిచిక‌ల గోల క్ష‌ణం వినండి. చాలా బావుంటుంది. వాటి మ‌ధ్య స‌మాచార ప్ర‌వాహం ఎలా ఉంటుంద‌నేది తెలుస్తుంది. వినేకొద్దీ వినాల‌నిపిస్తుంది..అంటున్నారు జీవశాస్త్ర‌ వేత్త‌లు, ప‌ర్యావర‌ణ వేత్త‌లు. ఇంటికోసం చెట్టు కొట్టేసేట‌పుడు అదే ఆధానంగా ఉన్న పిట్ట‌లు ఏమ‌యి పోతాయ‌ న్న‌ది ఆలోచించాలి. ఎందుకంటే అవి మీకు ఎంతో మాన‌సిక ప్ర‌శాంత‌త‌నిచ్చే శ‌క్తి క‌లిగిన‌వి. అయితే ప‌ల్లెలు క్ర‌మేపీ అంత‌రించిపోతున్నాయి.. అంతా ప‌ట్ఠ‌ణ వాతావ‌ర‌ణం విస్త‌రించ‌డంలో చెట్టూ చేమ‌నీ అడ్డుగానే భావిస్తున్నారు ఈ త‌రం. పిట్ట‌లు గోల చేస్తున్న‌ట్టే ఉంటుంది. కానీ క‌ర్ణక‌ఠోరంగా అయితే ఉండ‌దు. ప‌క్షులు పాట‌లు పాడ‌వు, వాటిలో అవే మాట్లాడుకుంటూ అప్పుడ‌ పుడు కాస్తంత గొంత స‌వ‌రిస్తూంటాయి. అదీ ఒక్కటి రెండుర‌కాల ప‌క్షులే. అవి ఎలాగూ అపార్ట్‌ మెంటు ప్రాంతాల్లో క‌నిపిం చ‌వు. క‌నుక నిత్యం క‌నిపించే పిచిక‌లనే ప‌రిశీలించాలంటున్నారు శాస్త్ర‌వేత్త‌లు.  విదేశాల్లో వీటి గురించిన ప‌రిశోధ‌న జ‌రిగింది. మాన‌సిక వ్యాధుల‌తో ఇబ్బందిప‌డుతున్న‌వారిలో చాలా మంది స‌ర్వ‌సాధార‌ణ వాతావ‌ర‌ణంలో పిట్ట‌లు, ప‌క్షులు వీల‌యినంత‌గా ఉండే తోట‌ల్లో,  చెట్లు బాగా ఉన్న ప్రాంతాల్లో వాటిని వింటూ క్ర‌మేపీ మాన‌సిక వొత్తిడికి దూర‌మ‌వుతున్నార‌న్న‌ది రుజువ‌యింద‌ట‌. ఇది చిత్ర‌మేమీ కాదు. మ‌న‌మే మ‌న‌చుట్టూ ఉన్న ప‌రిస‌రాల‌ను, ప‌రిస్థితుల‌ను ప‌ట్టించుకోమంతే. విదేశాల్లో దీన్ని గురించి ప్ర‌త్యేక ప‌రిశోధ‌నే చేశారు. దీన్నే స‌హ‌జ‌సిద్ధ చికిత్స‌గానూ పేర్కొంటున్నారు. ఒక‌వేళ అలాంటి వాతావర‌ణం లేకున్నా రికార్డు చేసిన ప‌క్షుల మాట‌ల్ని కిల‌కిల‌ల‌ను  వినిపిస్తున్నార‌ట‌. అది ఎంతో గొప్ప అనుకూల ప్ర‌భావంచూపుతోందిట‌. ఈసారి స‌మ‌యం చూసుకుని మీరు ఓ క్ష‌ణం వినండి.. అదో అద్భుతం!

ఫార్మా కంపెనీల వల్లే వ్యాధుల విస్తరణ.. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్య

ఫార్మా కంపెనీలు అనైతిక కార్యక్రమాలకు కార్యకలాపాలకు పాల్పడుతున్నాయా? వైరల్ వ్యాధుల విస్తరణకు ఫార్మా కంపెనీలు చట్ట వ్యతిరేక  చర్యలే కారణమా? మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలను బట్టి ఔననే అనుకోవాల్సి వస్తోంది.  కాగా ఇటీవలి కాలంలో ప్రజలు పబ్లిక్ డొమైన్ లో గ్రామీణ,పట్టణ ప్రాంతాలలోని ప్రభుత్వ ఆసుపత్రులలో   నిరుపేద రోగులకు  కాలం చెల్లిన మందులు  పంపిణీ చ్రేస్తున్నాయంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు    కొన్నిరకాల వ్యాధుల  వ్యాప్తికి ఫార్మా కంపెనీలు ఉద్దేశపూర్వకంగా ఒక పద్దతి ప్రకారం అనైతిక చర్యలకు పాల్పడటమే కారణమా అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది.  ఈ పిటిషన్ విచారించిన  మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ సుబ్రహ్మణ్యం   కాలం చెల్లిన మందుల పంపిణీ, వైరస్  వ్యాధుల విస్తరణ కు ఫర్మా కంపెనీలు దోహదపడేలా వ్యవహరిస్తున్నాయా అన్న అంశంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని తమిళనాడు ఆరోగ్య శాఖ, తమిళనాడు ప్రభుత్వాలను  ఆదేశించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి    సుప్రీం కోర్టు  ఫార్మా కంపెనీలు మంద్రుల ప్రచారానికి వేల కోట్ల రూపాయలు వినియోగించడంపై చేసిన వ్యాఖ్యలను ఉటంకించారు.  .  

ఆసియా ఛాంపియ‌న్ భార‌త్‌

మంద‌న‌, హ‌ర్మ‌న్‌ప్రీత్‌, రాణా, రాజేశ్వ‌రీగైక్వాడ్ విజృంభించ‌డంతో టీమ్ ఇండియా మ‌హిళ‌ల‌జ‌ట్టు ఆసి యా క‌ప్ టి20 ట్రోఫీని ఏడో ప‌ర్యాయం చేజిక్కించుకుంది. సిల్హ‌త్‌లో జ‌రిగిన ఫైన‌ల్లో భార‌త్ శ్రీ‌లంక‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. మంద‌న త‌న స‌హ‌జ బ్యాటింగ్ స‌త్తాతో లంక బౌల‌ర్ల‌ను చెండాడి 51 ప‌రుగు ల‌తో అజేయంగా నిలిచింది. శ్రీ‌లంక 20 ఓవ‌ర్ల‌లో  9 వికెట్ల న‌ష్టానికి కేవ‌లం 65 ప‌రుగులు చేయ‌గా భార‌త్ 2 వికెట్ల న‌ష్టానికి ఆ ల‌క్ష్యాన్ని పూర్తి చేసింది. ఈ టోర్నీ ఆరంభించిన‌ప్ప‌టి నుంచి చూస్తే భార‌త్ జ‌ట్టు అద్భు త ప్ర‌దర్శ‌న ఇస్తూనే ఉంది. అందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ శ‌నివారం మ‌హాద్బుతంగా ఆడి,  ఏడ‌వ ప‌ర్యా యం టైటిల్ కైవ సం చేసుకోవడ‌మే.  అసియాక‌ప్ ఫైన‌ల్ చాలా మామూలు మ్యాచ్‌లా స‌ర‌దా స‌ర‌దాగా ఆడి సునా యాసంగా  గెల‌వ‌డం ఎలా గ‌న్న‌ది మంద‌నా టీమ్ చూపించింది. అన్ని విధాలా ఆసియాక‌ప్ టోర్నీలో భార త్ జ‌ట్టు ప‌టిష్ట‌త‌ క్రికెట్ లోకానికి స్ప‌ష్ట‌మైంది. మొన్న‌టి సెమీస్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన శ్రీ‌లం క భార త్‌కు గ‌ట్టి పోటీని స్తుం ద‌ని లెక్క‌లు వేసుకున్న‌వారికి  భార‌త్‌జ‌ట్టు సునాయాసంగా గెలిచి స‌మా ధానం చెప్పింది.  శ్రీ‌లంక ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచే భార‌త్ బౌల‌ర్లు క‌ట్ట‌డి చేశారు. బౌల‌ర్ల‌కు ముఖ్యంగా స్పిన్న‌ర్ల‌కు ఎంతో అనుకూల‌మైన పిచ్ మీద ముందుగా లంక బ్యాట్ చేయ‌డ‌మే వారిని దెబ్బ‌తీసింది. భార‌త్ బౌల‌ర్లు వారి ఊహ‌ను దెబ్బ‌తీస్తూ వారి  స్టార్‌బ్యాట‌ర్లును క‌ట్టడి చేశారు. లంక‌జ‌ట్టులో ఎవ్వ‌రూ  నిల‌క‌డ‌గా ఆడి పెద్ద‌గా ప‌రుగులు చేయ‌లేక వెనుదిరిగి ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. భార‌త్ బౌలింగ్‌, ఫీల్డింగ్ స్థాయి ఎంతో పెరిగింద‌నేది ఈ మ్యాచ్ తెలియజేసింది. శ్రీ‌లంక ఇన్నింగ్స్‌లో ఇనోరా రణ‌వీరా అత్య‌ధి కంగా 22 బంతుల్లో 18 ప‌రుగులు చేసింది. భార‌త్ పేస‌ర్లు, స్పిన్న‌ర్ల ప్ర‌భావాన్ని ఇది తెలియ‌జేస్తుంది. రాజేశ్వ‌రీ గైక్వాడ్‌, స్నేహారాణా చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. పేస‌ర్ రేణుకాసింగ్ అద్బుతంగా ఇన్‌స్వింగ్స్‌తో లంక బ్యాట‌ర్ల‌ను భ‌య‌పెట్టింద‌నాలి. ఆమె మూడు ఓవ‌ర్లో కేవ‌లం 5 ప‌రుగు ల‌కు 3 వికెట్ల తీసుకున్న‌ది. అంటేనే లంక బ్యాట‌ర్లు ఎంత‌గా చిత్త‌య్యార‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతుంది.  హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ ధాటిగా ఆడుతూ భార‌త్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన‌ప్ప‌టికీ ఆమె వెనుదిర‌గ‌డం కొంత ఇబ్బంది పెట్టింది. అయితే మంద‌న మాత్రం ఎలాంటి బెరుకూ లేకుండా స‌హ‌జ‌సిద్ధ లెఫ్టీల ధాటిని ప్ర‌ద‌ర్శించ‌డంలో లంక బౌల‌ర్ల‌ను చిత‌క‌బాదింది. అయితే ఈ మ్యాచ్‌లో విజ‌య‌ల‌క్ష్యం అంత‌గా లేదు గ‌నుక ఓపెన‌ర్‌ ష‌ఫాలీ వ‌ర్మ ఫోర్ల‌తో విజృంభించి విజ‌యానికి బాట‌లు వేస్తుంద‌ని ఆశించారు. ధాటిగా ఆడుతూ వేగంగా స్కోర్ పెంచ‌డంలో ఆమె సిద్ధ‌హ‌స్తురాలు గ‌నుక ప్రేక్ష‌కులు ఆమె వీర‌విహారం చేస్తుం ద‌నే ఆశించారు. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆమె ఈ మ్యాచ్‌లోనూ పెద్ద‌గా ఆడ‌లేక‌పోయింది. 

మునుగోడు పై కేటీఆర్ స్పెషల్ ఫోకస్ ఎందుకంటే?

ఉప ఎన్నికల దేముంది, వస్తుంటాయి, పోతుంటాయి. ఒక అసెంబ్లీ నియోజక వర్గంలో తెరాస ఓడిపొతేనో బీజేపీ గెలిస్తేనో ప్రభత్వం ఏమన్నా కూలిపోతుందా? ఉపఎన్నికల్లో గెలుపు ఓటములతో వచ్చేది లేదు. పోయేది లేదు.. ఈ మాటలన్నది ఎవరో గుర్తుందా ? ఎస్, ఇప్పడు మునుగోడులో తెరాస అభ్యర్ధి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే, నియోజక వర్గాన్ని దత్తత తీసుకుని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ  ఇచ్చిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆరే.  గతంలో హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగానూ ఈ వ్యాఖ్య చేశారు.  నిజానికి కేటీఆర్ ఇంతకు ముందు ఎప్పుడూ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన లేదు.   ముఖ్యమంత్రి కేసీఆర్, ఇజ్జత్’కి సవాల్ గా తీసుకుని బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా  కోట్లాది రూపాయలు కుమ్మరించి  కొట్లాడిన హుజురాబాద్ హుజురాబాద్ ఉప ఎన్నిక విషయాన్నే తీసుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఇతర ముఖ్యనాయకులు హుజురాబాద్ ఉప ఎన్నికకు అనవసర ప్రాధాన్యత ఇస్తున్నారని  ఒక విధంగా అవహేళనా చేశారు.  నిజానికి ఒక్క హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలోనే కాదు, అంతకు ముందు తర్వాత జరిగిన హుజూర్ నగర్, దుబ్బాక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను  కూడా కేటీఆర్ లైట్ గా తీసుకున్నారు. ప్రత్యక్షంగానే కాదు పరోక్షంగా కూడా ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు. కానీ  అదే కేటీఆర్  మునుగోడు ఉపఎన్నికలో  బాధ్యతలను భుజానికి ఎత్తుకున్నారు. పరుగులు తీస్తున్నారు.   నిజానికి ముఖ్యమంత్రి కేసేఆర్  మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతను ఏ ఒక్కరికో అప్పగించలేదు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా సుమారు ఓ వంద మందికి  మునుగోడులో పార్టీ అభ్యర్ధిని గెలిపించే బాధ్యతలను అప్పగించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు మునుగోడులో తమకు పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. తమ పరిధిలో  మెజార్టీ ఓట్లు సాధించడం కోసం పని చేస్తున్నారు. మరో వంక మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డితో పాటుగా కేటీఆర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్  సమన్వయ బాధ్యతలు మాత్రమే అప్పగించారు. అయినా, జిల్లా మంత్రిగా జగదీష్ రెడ్డి, ముందు నుంచి తమదైన పద్దతిలో ప్రచారం సాగిస్తున్నారు. మరో వంక హరీష్ రావు, ఇంకా పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇవ్వలేదు.  పొరుగు రాష్ట్రం ఏపీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు, మంత్రులకు, గడప గడపకు పరీక్ష పెడితే, తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు, ఎమ్మెలకు మునుగోడు పరీక్ష పెట్టారు. సరే  ఆ పరీక్షలో ఎవరు గెలుస్తారు ఎవరు నిలుస్తారు అనే విషయం పక్కన పెడితే, హుజురాబాద్ లో కూల్ గా ప్రచారానికి దూరంగా ఉన్న మంత్రి కేటీఅర్ మునుగోడు ఉప ఎన్నిక పై ఎందుకు దూకుడు పెంచారు? అదే సమయంలో హుజురాబాద్ బాధ్యత  మొత్తం భుజానికి ఎత్తుకుని దూకుడుగా ప్రచారం సాగించిన హరీష్ రావు మునుగోడు విషయంలో ఎందుకో అంటీ ముట్టనట్లుగా ప్రకటనలకు మాత్రమే పరిమిత మయ్యారు.  ఈ నేపథ్యంలోనే   మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే  దుబ్బాక హుజురాబాద్ వరస ఓటముల తర్వాత హరీష్ రావు ఇమేజ్ కొంత మేర డ్యామేజ్ అయ్యింది. అందుకే అంతవరకు ట్రబుల్ షూటర్ గా గుర్తించి కీలక బాధ్యతలను ఆయనకే అప్పగించిన కేసేఆర్, మునుగోడులో వ్యూహం మార్చి హరీష్, కేటీఆర్ ఇద్దరికీ సమన్వయ బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అదీ కాకుండా దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికకు చాలా  వ్యత్యాసం ఉందని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నిక సెమీ ఫైనల్ లాంటిదని  ఇక్కడ ఓడిపోతే,  బీజేపీని ఎదుర్కోవడం కష్టమవుతుందని అంటున్నారు. ఇక్కడ గెలిచి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం తమదే అనే ప్రచారంతో దూసుకు పోయేందుకే బీజేపీ వ్యూహాత్మకంగా ఈ ఉప ఎన్నికను తెచ్చింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కూడా ఈ ఉప ఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంది. అందులో భాగంగానే, ఇప్పటికి  కాకున్నా రేపటి అసెంబ్లీ ఎన్నికలలో తెరాస మరో మారు గెలిస్తే  ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న కేటీఅర్ మునుగోడు మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారని అంటున్నారు. అయితే మునుగోడు ఫలితం కేటీఆర్ కలలను నిజం చేస్తుందా? హుజురాబాద్’ రిపీట్ అవుతుందా చూడవలసి ఉందని అంటున్నారు.

ఖర్గేదే కాంగ్రెస్ అధ్యక్ష పీఠం కానీ...పెత్తనం మాత్రం?

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల క్రతువు ఆఖరి ఘట్టానికి చేరుకుంది. మరో రెండు రోజుల్లో , అక్టోబర్ 17 పోలింగ్ జరుగుతుంది. 19 కౌంటింగ్. అయితే  ఫలితం కోసం అంతవరకూ ఆగవలసిందేనా అంటే  అవసరం లేదు. నిజమే ఇంచుమించుగా పాతికేళ్ళ తర్వాత జరుగతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే, మరో సీనియర్ నేత శశి థరూర్ పోటీ పడుతున్నారు.  అయితే, ‘కాపురం చేసే కళ కాళ్ళ పారాణి దగ్గరే తెలుస్తుంది’ అన్నట్లు నామినేషన్  వేసిన నాడే, శశి థరూర్ భవిష్యత్ ఏమిటో, తెలిసి పోయింది. ఎంత కాదన్నా, మల్లికార్జున ఖర్గే  సోనియా గాంధీ సెలెక్ట్ చేసిన పార్టీ అధిష్టానం అఫీషియల్ కాండిడేట్. అందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అక్కరలేదు. గాంధీలు (సోనియా, రాహుల్, ప్రియాంక) కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అంతే ఎవరు పోటీ చేసినా తటస్థంగా ఉండాలని సంకల్పం చెప్పుకున్నారు. శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరైనా ఎవరైనా పోటీ చేయవచ్చని  సోనియా గాంధీ  గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  చివరకు ఏమి జరగాలో అదే జరిగింది.  నిజానికి సోనియా గాంధీ ఏరికోరి  కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గేహ్లోట్ ను ఎంపిక చేశారు. అధిష్టానం అభ్యర్ధిగా ఆయన్ని బరిలో దించాలని ఆశించారు. అందుకు ఆయన అంతగా సుముఖత చూపక పోయినా, ఆయన్ని ఒప్పించారు. అయితే, రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోలేక గేహ్లోట్ అనూహ్యంగా ‘దమ్కీ’ ఇవ్వడంతో సోనియా గాంధీ  దిగ్విజయ్ వైపు కొద్దిగా మొగ్గుచూపినా చివరకు  మల్లికార్జున ఖర్గేను ఎంపిక చేశారు. రాత్రికి రాత్రి నిద్రలేపి మరీ  ఎనిమిది పదుల ఖర్గేను  నామినేషన్ కు సిద్ధం చేశారు.  ఇక శశి థరూర్  సంగతి చెప్పనే అక్కరలేదు. గాంధీల నాయకత్వాన్ని సవాలు చేసిన జీ 23 సభ్యుడు. సో, సోనియా గాంధీ ఆశీస్సులు ఎవరికున్నాయో వేరే చెప్పనవసరం లేదు. సో ..సో రేపు గెలిచేది ఎవరో గాంధీల ఆశీస్సులతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అందుకునేది ఎవరో వేరే చెప్పనక్కరలేదు. కొంచెం ఆలస్యంగానే అయినా, శశి థరూర్ కు విషయం అర్థమైనట్లుంది. అందుకే ఆయన తీరిగ్గా అభ్యర్థులకు సమాన అవకాశాలు లేవని  అభ్యర్థుల మధ్య తారతమ్యాలు చూపుతున్నారని అయిన వారికి ఆకుల్లో కానీ వారికీ కంచాల్లో అన్నట్లుగా పార్టీ నేతలు  కార్యకర్తలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అవును మరి నాడా దొరికిందని గుర్రాన్ని కొంటే ఇలాగే ఉంటుంది.  అయితే నిజానికి ఇప్పడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అవుతారు అనేది అసలు ప్రశ్నే కాదు. ‘జరిగినమ్మ జల్లెడతోనైనా నీళ్ళు తెస్తుంది’ అన్నట్లు అధిష్టానం అండదండలున్న మల్లిఖార్జున ఖర్గే సునాయాసంగా అధ్యక్ష పదవిని అందుకుంటారు. అందులో సందేహం లేదు. అయితే  ఇప్పుడు ప్రశ్న అది కాదు. కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు  అన్నదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం ఎప్పటిలానే  అన్నదే సమాధానం. శశి థరూర్, తనకు అవకాశం ఇస్తే  అధిష్టానం సంస్కృతి చేరిపేస్తానని చెప్పారు. కానీ ఖర్గే ఇతర విధేయ నాయకులు  పార్టీ అధ్యక్షుడు ఎవరైనా కావచ్చుని కానీ, సోనియా గాంధీ, రాజమాతగా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ రారాజుగా కొనసాగుతారని చెపుతున్నారు. ఖర్గే అధ్యక్షుడిగా ఉంటారు. రాహుల్ గాంధీ నాయకుడిగా కొనసాగుతారు. అంతే కాదు 2024 ఎన్నికలలో రాహుల్ గాంధీనే కాంగ్రెస్ ప్రధాని అభ్యర్ధి అవుతారు. ఇది కాంగ్రెస్ విధేయ నాయకులలోనే కాదు  అందరిలో ఉన్న అభిప్రాయం.  అయితే  ఇందుకు సంబధించి ఖర్గే  కాసింత ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఆ నిర్ణయం ఏదో పార్టీ అధిష్టానం తీసుకుంటుందని కాకుండా  అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆ నిర్ణయం ఏదో  తానే తీసుకుంటానని అన్నారు. అంతే కాదు, ‘బక్రీద్ మే బచేంగే తో.. మొహారం మే నాచేంగే’  అంటూ ఉర్దూ సామెతను ఉటంగించారు. అంటే, బక్రీద్ వేటు నుంచి బయటపడితే మొహారంలో నాట్యం చేయచ్చని చెప్పారు.    అయితే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరు గెలిచినా నిర్ణయాలు తీసుకునే అధికారం సోనియా కుటుంబానిదే అని పరిశీలకులు చెబుతున్నారు.  2024 లోక్‌సభ ఎన్నికలకు ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీయే ఉండాలని ఖర్గే సహా కాంగ్రెస్ నాయకత్వమంతా ఉమ్మడిగా కోరుకుంటోంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కూడా రాహులే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కోరుకున్నారు. అయితే అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ ససేమిరా అన్నారు. సోనియా కుటుంబం బయటవారే ఈసారి కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించాలని రాహుల్ పట్టుబట్టారు. అందుకే ఖర్గే,  థరూర్ బరిలో నిలిచారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా పార్టీ తరపున రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్ధిగా ప్రతిపాదిస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే  బాధ్యతలు లేని అధికారానికి అలవాటుపడిన రాహుల్ గాంధీ అందుకైనా అంగీకరిస్తారా? మోడీని ఢీ కొంటారా? అంటే అనుమానమే .. అంటున్నారు.

కొడాలి నాని అడ్డాలోనూ బీఆర్ఎస్ ఫ్లెక్సీ!

తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ  బీఆర్ఎస్ గా ప్రకటించిన వెంటనే విజయవాడలో.. తర్వాత కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో.. తాజాగా ఇప్పుడు బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్న కొడాలి నాని అడ్డా గుడివాడ పట్టణం నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణను అడ్డగోలుగా విడగొట్టుకున్న కేసీఆర్ అంటే.. టీఆర్ఎస్ పార్టీ నేతలంటే ప్రతి ఆంధ్రుడిలోనూ ఇప్పటికింకా ఆగ్రహం తగ్గని పరిస్థితి ఉంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా   ప్రతి ఒక్కరూ ఆంధ్రులను ఇష్టం వచ్చినట్లు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసిన వైనం ప్రతి ఆంధ్రుడూ గాయం మీద కారం పూసిన చందంగానే ఫీలవుతున్నారు. అయినప్పటికీ ఇలా ఆంధ్రప్రదేశ్ లో కేసీఆర్ పార్టీ ఫ్లెక్సీలు వరుసగా వెలుస్తుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.  ప్రజలలో విస్మయం వ్యక్తమౌతోంది.  కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ విజయవాడలోని వారధి ప్రాంతంలో హోర్డింగ్ ఏర్పాటైనప్పుడు కలకలం రేగింది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట ఈ భారీ హోర్డింగ్ కనిపించింది. ‘జయహో కేసీఆర్.. నిరంతర పోరాట యోధుడు.. అనితర సాధ్యుడు.. నవ తెలంగాణ నిర్మాత.. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జాతీయ పార్టీ ప్రకటిస్తున్న సందర్భంగా వారికి ఇవే మా.. శుభాకాంక్షలు’ అంటూ బండి రమేష్ పేరిట ఈ భారీ ఫ్లెక్సీ దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరి కొద్ది రోజులకు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మరో ఫ్లెక్సీ వెలిసి కలకలం రేపింది. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన రెండు రోజుల్లోనే బీఆర్ఎస్ ఫ్లెక్సీలు అమలాపురంలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ‘జై బోలో.. జై కేసీఆర్.. బీఆర్ఎస్ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి రేవు బాలాజీరావు’ అంటూ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిశాయి. కైకలూరు నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తూ పలుచోట్ల ఫ్లెక్లీలు ఏర్పాటయ్యాయి. అల్లూరుకి చెందిన రెడ్డి సతీశ్ అరోరా పేరుతో గుడివాడ, సింగరాయపాలెం, అల్లురు సెంటర్, కోరుకొల్లు, కొత్తపాల్గొని రోడ్డు, కొండేటి రోడ్డు, భీమవరం, రోడ్డువాక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఛీప్ కేసీఆర్, మంత్రి కేటీఆర్, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫొటోలతో భారీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఇప్పుడు కొడాలి నాని అడ్డాలో కూడా బీఆర్ఎస్ ఫ్లెక్సీ ఏర్పాటవడం కలకలం రేపుతోంది. ‘టీఆర్ఎస్ టూ బీఆర్ఎస్.. శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి ఇవే మా శుభాకాంక్షలు’ అంటూ కేటీఆర్ యూత్ పేరిట రవి స్వీట్స్ అండ్ బేకరి.. గుడివాడ పేరుతో ఈ ఫ్లెక్సీ వెలిసింది. ఏపీ ప్రజలంటే పచ్చి మిరపకాయ కొరికిన చందంగా కారాలు మిరియాలు నూరిన కేసీఆర్ అండ్ కోను ఆహ్వానిస్తూ.. శుభాకాంక్షలు చెబుతూ ఏపీలోని నలు దిశలా ఫ్లెక్సీలు ఏర్పాటు అవడం వెనుక అధికార వైసీపీ నేతల హస్తం ఉండి ఉండొచ్చనే ఊహాగానాలు సర్వత్రా వస్తున్నాయి. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన సందర్భంగా.. మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఏపీలో ఉన్న అనేక పార్టీలతో పాటు బీఆర్ఎస్ కేవలం మరో పార్టీ అవుతుందని అనడం గమనార్హం. బీఆర్ఎస్ వల్ల ఏపీలోని వైసీపీపై ఎలాంటి ప్రభావమూ పడబోదనడం విశేషం. కాగా.. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించడం విశేషం. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం ఆహ్వానించదగ్గ అంశమని అన్నారు. కొత్త కొత్త పార్టీలు వస్తే రాజకీయ పార్టీల పనితీరు మరింత మెరుగవుతుందని ఆయన విశ్లేషించారు. సీనియర్ రాజకీయవేత్త, రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి తాను ఓటు వేయొచ్చని చెప్పడం గమనించదగ్గ అంశం. అయితే.. ఆంధ్రులను అంతలా తిట్టిపోసిన కేసీఆర్ కు ఏపీ సీఎం జగన్ కు సన్నిహిత సంబంధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పొలిటికల్ వర్గాల్లో పలు సందర్భాల్లో చర్చ జరుగుతుండడం విశేషం. ఏపీలో ఈ మూడున్నరేళ్లలో తన విధానాలు, పరిపాలనలో అనుభవ రాహిత్యంతో తీసుకున్న అనేక అసందర్భ నిర్ణయాలు, రాష్ట్ర ఆర్థిక స్థితిని అట్టడుగుకు నెట్టేసిన తీరు, సామాన్యుడు భరించలేనంతగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన వైనంతో ఇప్పటికే వైసీపీ అంటే జనం చీదరించుకునే స్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనం తమకు మరోసారి ఓటు వేసి గెలిపిస్తారనే ఆశలు జగన్ లో రోజు రోజుకూ సన్నగిల్లిపోతున్నాయంటున్నారు. ఒక పక్కన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. టీడీపీ పలు కార్యక్రమాలతో జనంలోకి దూసుకుపోతోంది. జగన్ బండారాన్ని  బట్టబయలు చేస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సైతం నడుం బిగించి మరీ ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో తిరుగుతున్నారు. పార్టీ శ్రేణులను ఉత్సాహ పరుస్తున్నారు. జనంలోకి టీడీపీని మరింతగా తీసుకెళ్లే కార్యక్రమాలను రూపొందించి, తమ పార్టీ నేతలు, శ్రేణులు నిరంతరం ప్రజల మధ్యే ఉండేలా చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ స్వయంగా చేయించుకుంటున్న సర్వేలు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందం కూడా వైసీపీలోని ఎక్కువ మంది సిటింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వ్యతిరేకంగా నివేదికలు ఇస్తోంది. ఇన్ని వ్యతిరేకతల మధ్య తనకు మరోసారి అధికారం అందని ద్రాక్ష అవుతుందేమో అనే ఆందోళన జగన్ లో పెరిగిపోతోందంటున్నారు. ఇలాంటి సమయంలో తన మిత్రుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే.. తన వ్యతిరేక ఓటు కొంతైనా చీలుతుందని, తద్వారా తనకు ప్రయోజనం కలుగుతుందనే యోచనలో జగన్ ఉన్నారంటున్నారు. అందుకే ఆ పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీని ఏపీలోకి ఆహ్వానిస్తున్నారంటున్నారు. అయితే.. కేసీఆర్ తిట్లు మరిచిపోయారా? సిగ్గు, శెరం లేని కొంతమంది వల్లే ఏపీ ఇంతటి దురవస్థకు చేరుకుందని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తుండడం కొసమెరుపు.

హైద‌రాబాద్‌కు అపూర్వ గౌర‌వం..ప్ర‌పంచ గ్రీన్ సిటీ అవార్డు

తెలంగాణా రాజ‌ధాని న‌గ‌రం, అనేకా చారిత్ర‌క క‌ట్ట‌డాల నెల‌వు హైద‌రాబాద్‌కు ప్ర‌పంచ గ్రీన్ సిటీ అవార్డు ల‌భించింది. ఇంట‌ర్నేష‌నల్ అసోసియేష‌న్  ఆఫ్ హార్టిక‌ల్చ‌ర్ ప్రొడ్యుస‌ర్స్‌(ఏఐపిహెచ్‌) ప్ర‌తి ష్టాత్మ‌క అవార్డు ల‌భించ‌డం ప‌ట్ల రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఏఐపిహెచ్‌ 2022 వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో హైదరాబాద్ మొత్తం 'వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ విభాగంలో మరొకటి గెలుచు కుంది.  నగరానికి ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ అవార్డులు రావ డం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ అవార్డులు తెలంగాణ, దేశ ఖ్యాతిని మరింత బలోపేతం చేశాయన్నారు. శుక్రవారం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ఎంపిక చేయబడిన ఏకైక భారతీయ నగరం హైద రాబాద్ మాత్రమే, కేటగిరీ అవార్డు మాత్రమే కాకుండా మొత్తం 'వరల్డ్ గ్రీన్ సిటీ 2022 అవార్డును గెలుచుకో వడం తెలంగాణ, భారతదేశానికి గర్వకారణం. మొత్తం 6 వర్గాల్లో. మునిసిపల్ శాఖ‌ మంత్రి కె.టి రామారావు మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ బృం దాన్ని, స్పెషల్ చీఫ్ సెక్రటరీ  అరవింద్ కుమార్‌ను అభినందించారు.

వైసీపీ బండారం బయటపెట్టిన నిడదవోలు క్లాత్ మర్చంట్స్

రైతుల మహా పాదయాత్రకు వ్యతిరేకంగా ఆ పాదయాత్ర మార్గంలో వెలుస్తున్న ఫ్లెక్సీల గుట్టు రట్టయ్యింది. వివిధ సంఘాలు, వ్యక్తుల పేర్లతో వైసీపీ ఏర్పాటు చేస్తున్న ఆ ఫ్లెక్సీల లోగుట్టును  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో వెలిసిన ఓ పోస్టర్ వైసీపీ చేస్తున్న దుష్ట రాజకీయాన్ని ఎలుగెత్తి చాటింది. రైతుల మహాపాదయాత్రకు వ్యతిరేకంగా నిడదవోలులో క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. ఆ పోస్టర్లలో వైసీపీ ఎమ్మెల్లే శ్రీనివాసనాయుడి ఫోటో పెద్దగా ఉంది. అయితే ఆ పోస్టర్ వెలసిన వెంటనే క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు ఎమ్మెల్యేను కలిసి తమకు కనీస సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా ఇలా ఫ్లెక్సీలు వేయడం సరికాదని ఆయనకు చెప్పారు. వాటిని వెంటనే తొలగించేయాలనీ కోరారు. అయితే ఎమ్మెల్యే మాత్రం.. మీకు ఏం కాదు.. వాటి సంగతి నేను చూసుకుంటానంటూ సర్ది చెప్పి పంపించేశారు. అయితే క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు మాత్రం ఎమ్మెల్యే సమాధానంతో సమాధాన పడలేకపోయారు. దీంతో వారే రైతులు, ప్రజలకు విజ్ణప్తి చేస్తూ మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీపై గత ఫ్లెక్సీతో తమకేమీ సంబంధం లేదనీ, వాటిని ఎవరు ఏర్పాటు చేశారో, ఎందుకు చేశారో అన్న విషయంపై తాము చర్చించదలచుకోలేదనీ, వారి విజ్ణతకే వదిలేస్తున్నామనీ పేర్కొన్నారు. దీంతో రైతుల మహాపాదయాత్ర మార్గంలో  ఆ పాదయాత్రను వ్యతిరేకిస్తూ వెలుస్తున్న ఫ్లెక్సీలు, నిరసనల లోగుట్టు ఏమిటన్నది అందరికీ బోధపడిపోయింది. వైసీపీ వారే కుట్ర పూరితంగా సంఘాలు, సంస్థల   అనుమతితో సంబంధం లేకుండా వారి, వాటి పేర్లతో రైతులకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని నిడదవోలు క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ వారు తాజాగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తో తేటతెల్లమైపోయింది. వైసీపీ బండారం బయటపడిపోయింది. ఇక వికేంద్రీకరణకు అనుకూలంగా విశాఖలో తలపెట్టిన ర్యాలీకి డ్వాక్రా మహిళలను తీసుకురావడానికి మొత్తం అధికార యంత్రాంగాన్నే నియోగించిన తీరు వైసీపీ ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నది తేటతెల్లం చేసింది. 

రికార్డు స్థాయిలో యు.ఎస్‌.వీసాలు

పెద్ద చ‌దువుల‌కో,  పెద్ద ఉద్యోగాల్లో స్థిర‌ప‌డాల‌నుకుంటున్న యువ‌త చాలామంది  అమెరికా వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లోనే ముందడుగు వేస్తున్నారు. ముఖ్యంగా ఇంజ‌నీరింగ్ విద్యార్థులు చ‌దువు ముగియ‌గానే విమానం ఎక్కేయాల‌న్న ఆతృతే క‌న‌ప‌రుస్తున్న‌వారు. ఈ ఏడాది అమెరికా ప్ర‌భుత్వం కూడా భార‌త్ విద్యార్ధుల‌కు రికార్డు స్థాయిలో వీసాలు విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. చాలామంది భార‌త్‌విద్యార్ధులు త‌మ దేశంలో విశ్వ‌విద్యాల‌యాల్లో సీట్లు సంపాదించి వీసా పొంద‌డం ప‌ట్ల అమెరికా వ్య‌వ‌హారాల‌భార‌త్ ప్ర‌తినిధి పెట్రీషియా ఎంతో ఆనందం వ్య‌క్తం చేశారు. గ‌తేదాడి కోవిడ్ కార‌ణంగా అక్క‌డి వ‌ర్సిటీల్లో అడ్మి ష‌న్ల‌లో జాప్యం వ‌ల్ల విద్యార్ధులు చేర‌లేక‌పోయారు. కాగా 2022 ఏడాదికి రికార్డుస్థాయిలో 82 వేల మంది విద్యార్థుల‌కు వీసాలు విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం.  స్వ‌ల్ప‌కాలం ఉ్య‌దోగ లేదా వ్యాపార‌నిమిత్తం అమెరికా వెళ్లాల‌నుకున్న వ్యాపారులు, టూరిస్టుల వీసాలు ముఖ్యంగా బి1, బి2 వీసాలు మాత్రం 2024 మ‌ధ్య‌కాలంలోనే అందుబాటులోకి వ‌స్తాయ‌ని  ఆమె ఒక ప్ర‌క‌ట న‌లో తెలియ‌జేశారు. అయితే అన్ని దేశాల కంటే అమెరికా లో విశ్వ‌విద్యాల‌యాలు, సంస్థ‌ల ప‌ట్ల భార‌త్ విద్యార్థులు, ఉద్యోగార్థులు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూప‌డం ప‌ట్ల ఆమె ఆనందం వ్య‌క్తం చేశారు. ఉన్న‌త విద్య‌కు ప్ర‌పంచంలోకెల్లా ఎన్న‌ద‌గ్గ కేంద్రంగా అమెరికాను గుర్తించ‌డం ప‌ట్ల అమెరికా ఎంబ‌సీ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ ట్వీట్ చేసింది. రెండు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాల‌ను విద్యార్ధులు, ఉద్యోగులు మ‌రింత ఉన్న‌త‌స్థాయికి తీసికెళుతుండ‌డం ప‌ట్ల అమెరికా ప్ర‌భుత్వం  రెండు దేశాల మ‌ధ్య సంబంధాల‌ను మెరు గుప‌రుస్తుంద‌ని పెట్రీషియా అన్నారు. న్యూఢిల్లీ, చెన్నై,హైద‌రాబాద్‌, కోల్‌క‌తా, ముంబైల‌లోని అమెరికా దౌత్య కార్యాల యాలు గ‌త నాలుగు మాసాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్ధి వీసాల‌కు ద‌ర‌ఖాస్తులు పంపాయి. కోవిడ్  త‌ర్వా త గ‌తేడాది కూడా అమెరికా రికార్డు స్థాయిలో 62వేల వీసాలు ప‌ర్యాట‌కుల‌కు జారీచేసింది. 

జగన్ తీరుతో పాలన అస్తవ్యస్తం.. భవిష్యత్ పై వైసీపీ నేతల అయోమయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీరు కారణంగా వైసీపీ  నేతలలో అయోమయం నెలకొంటోంది. దీంతో వారు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో.. ఏ అంశానికి ఎలా స్పందిస్తున్నారో వారికే తెలియన పరిస్థితి ఆవిష్కృతమౌతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తాను అమరావతికి వ్యతిరేకమని ఎన్నడూ అనలేదని చెప్పడమే నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. తాను అమరావతికి వ్యతిరేకం కాదని అంటూనే వికేంద్రీకరణే మా లక్ష్యం అని చెప్పడం ఆయనలో నెలకొన్న అయోమయానికి, ఎటూ తేల్చుకోలేని సందిగ్ధతకు నిదర్శనంగా చెబుతున్నారు. మరో వైపు ఎన్నికల సమయం దగ్గరపడుతుండటం.. రాష్ట్రం నలుమూలలా మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటమౌతుండటంతో జగన్ తీరుతో తమ రాజకీయ భవిష్యత్ ఏమౌతుందన్న భయం, ఆందోళన వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇప్పటికే మూడేళ్ల పాలనలో బటన్ నొక్కడం తప్ప మరో పని చేయలేదంటూ ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ రేంజ్ లో వ్యక్తమౌతోందో గడపగడపకూ కార్యక్రమంలో కళ్లకు కడుతోంది. అయితే పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు గడప గడపకూ కార్యక్రమంలో పడుతున్న ఇబ్బందులు, ఎదొర్కొంటున్న నిరసన సెగలనూ పట్టించుకోకుండా జగన్.. ఆ కార్యక్రమంలో చురుకుగా లేని వారికి వచ్చే ఎన్నికలలో టికెట్లు హుళక్కి అంటూ హెచ్చరికలు జారీ చేస్తండటంతో వారిలో నిరాశ, నిస్తేజం పెరిగిపోతున్నది. అయ్యేది కాక మానదు.. అన్న నైరాశ్యంతో అధినేత మాటలను ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసే పరిస్థితికి వచ్చినట్లుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అమరావతి విషయంలో ఒకే సమయంలో రెండు విధాలుగా అంటే అమరావతికి మద్దతుగా, వ్యతిరేకంగా మాట్లడడాన్నిఈ సందర్భంగా ఎత్తి చూపుతున్నారు. గడపగడపకూ సమీక్షలో జగన్ బొత్స తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బొత్స లాంటి సీనియర్ మంత్రికే ఉక్కపోత తప్పని విధంగా సీఎం జగన్ తీరు ఉందంటే.. మిగిలిన వారి పరిస్థితి ఏమిటో ఇట్టే అవగతం చేసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే మూడున్నరేళ్ల సమయం గడిచిపోయింది. మరో ఏడాదిన్నరలో ( ముందస్తు లేకపోతే) మళ్లీ ప్రజల ముందుకు వెళ్లాలి. ఏం చేశామని, ఏం సాధించామని మరో సారి అవకాశం ఇవ్వాలంటే ప్రజలను ఓట్లు అడగగలమన్న ఆందోళన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కనిపిస్తోంది. రాజధాని అంశంలో స్థిరత్వం లేని జగన్ వైఖరిని ఇప్పుడు రాష్ట్రమంతా ప్రశ్నిస్తుంటే.. తమను మూడు రాజధానులకు అనుకూలంగా ప్రజలలో ప్రచారం చేయాలని ఆదేశించడమేమిటని ఎమ్మెల్యేలు తమలో తాము మధన పడుతున్నారు. అమరావతే రాజధాని అంటూ రైతుల మహాపాదయాత్రను జనం నిరాజనాలు పలుకుతుంటే.. తాము ఆ మహాపాదయాత్రకు వ్యతిరేకంగా ప్లకార్డులతో ప్రదర్శనలు చేయాల్సిన పరిస్థితి తమను ప్రజలలో మరింత చులకన చేస్తున్నదని మధన పడుతున్నారు. ఈ విషయాన్ని పలువురు వైసీపీ నేతల అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేశారు. ఒక్క అమరావతే అని కాదు.. రాష్ట్రంలో ఏ వర్గం కూడా జగన్ పాలన పట్ల, తీరు పట్ల సంతృప్తిగా లేదని ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల వద్ద అంగీకరిస్తున్న పరిస్థితి. గత ఎన్నికలలో తమ విజయంలో కీలక పాత్ర పోషించిన దాదాపు అన్ని వర్గాలలోనూ ఇప్పుడు అసంతృప్తి గూడుకట్టుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని చూపుతున్నారు. ఇక వ్యవసాయ మీటర్లకు మోటర్లు బిగించడంతో రైతులలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయంటున్నారు. థర్మల్ స్టేషన్లను   అదానికి అప్పగించే కుట్ర, విశాఖలో భూ కబ్జా దందాలు.. ఇలా ఒకటనేమిటి.. జగన్ సర్కార్ తీసుకుంటున్న ప్రతి చర్య, ప్రతి నిర్ణయం వివాదాస్పదంగానే ఉంటోందని పరిశీలకులు అంటున్నారు.   ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూలా మారిన మూడు రాజధానుల అంశాన్నే తీసుకుంటే.. కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా మూడు రాజధానులంటూ మొండిగా జగన్ ముందుకు వెళ్లడాన్ని ఎలా అర్దం చేసుకోవాలో అర్ధం కావడం లేదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఏ విధంగా చూసినా మూడు రాజధానుల నిర్ణయంతో ముందుకు సాగలేని పరిస్థితి నెలకొని ఉంటే.. ఏ ఉద్దేశంతో మూడు రాజధానులే ముద్దంటూ ముందుకు సాగాలన్నది అవగతం కావడం లేదని వైసీపీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. 

పెద్ద నోట్ల రద్దుపై సమీక్షకు సుప్రీం ఓకే..!

ఆరేళ్ల కిందట దేశంలో మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపిన పెద్ద నోట్ల రద్దు చర్యపై సమీక్షకు సుప్రీం ఓకే చెప్పింది. అవినీతి నిర్మూలన, నల్ల ధనం వెలికితీత లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ అప్పట్లో (నవంబర్ 8, 2016) ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పెద్ద నోట్ల రద్దు లక్ష్యం నెరవేరిందా అన్న ప్రశ్నకు లేదనే సమాధానం నిర్ద్వంద్వంగా వస్తుందనడానికి ఈ ఆరేళ్లలో నల్లధనం రెండింతలు పెరగడమే.. అలాగే అవినీతి పెచ్చరిల్లడమే నిదర్శనం అని పరిశీలకులు అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు లక్ష్యంపై ప్రశ్నలు సంధించిన వారిని దేశ వ్యతిరేకులుగా ముద్ర వేసే పరిస్థితి నేటికీ నెలకొని ఉంది. ఆరేళ్ల తరువాత కూడా ఇప్పటికీ పద్ద నోట్ల రద్దు ద్వారా సాధించిందేమిటీ, ఒనగూరిన ప్రయోజనం ఏమిటి అన్న విషయంలో కేంద్రం సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదు. అసలు నోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు పార్లమెంటును కానీ, అఖిలపక్ష నేతలను కానీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఏక పక్షంగా వ్యవహరించిన ప్రభుత్వం ఆ తరువాతనైనా ఎన్నడూ నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఒనగూరిన ప్రయోజనాలను జాతికి వివరించిన పాపాన పోలేదు.    పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల జనం దేశంలో ప్రజల దైనందిన కార్య కలాపాలు గందరగోళంలో పడ్డాయో అందరికీ తెలిసిందే.  దేశంలో నల్ల ధనాన్ని అరికట్టడానికే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాన మంత్రి మోడీ స్వయంగా పలు సార్లు తెలిపారు. అయితే నోట్ల రద్దు వల్ల నల్లధనం అరికట్టడమన్న లక్ష్యం నెరవేరకపోగా... ఆ బెడద మరింత పెరిగింది.   పెద్దనోట్ల రద్దు నిర్ణయం బెడిసి కొట్టిందని అధికార పార్టీకి చెందిన నాయకులే పలు సందర్భాలలో అంగీకరించారు. ఆ నిర్ణయం వల్ల చిన్న వ్యాపారులు, తోపుడు బండ్లపై పళ్ళు, కూరగాయలు వంటి నిత్యావసరాలను అమ్ముకునే రోజువారీ వ్యాపారులే ఎక్కువగా దెబ్బతిన్నారన్నది ఎవరూ కాదనలేని  వాస్తవం. ఈ విషయంపై నిర్వహించిన పలు సర్వేలు కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాయి. ఈ నేపథ్యంలోనే పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై దాఖలైన పిల్ విచారణ సందర్బంగా సమీక్షకు సుప్రీం కోర్టు నిర్ణయించింది. అలాగే  పెద్ద నోట్ల రద్దుకు దారి తీసిన పరిస్థితులు, పర్యవసానాలు, ఫలితాలపై అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్నీ, రిజర్వు బ్యాంకును ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులను, ముఖ్యమైన నిర్ణయాలను ప్రశ్నించకూడదన్న లక్ష్మణ రేఖ తమకు తెలుసుననీ, అయినా, దేశ ప్రజలను ప్రభావితం చేసిన ఈ నిర్ణయం గురించిన వివరాలను తెలుసుకుకోగోరు తున్నామని జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ బోపన్న, జస్టిస్‌ రామసు బ్రహ్మణ్యం, జస్టిస్‌ బీవీ నాగరత్నంలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. 

మ‌రో జంతువ‌నుకుని ఢీకొట్టి గాయ‌ప‌డ్డ రైనో సేఫ్

రోడ్డుమీద వెళుతున్న టీవీల‌ర్ వేగంగా వ‌స్తూ అక్క‌డ ఆగిన ఆటోకి త‌గులుకుంది, కుర్రాడు కింద‌ప‌డ్డాడు. వాడికి దెబ్బలు త‌గిలాయా లేదా అన్న‌ది కాకుండా అస‌లు పార్కింగ్ ప్లేస్ కానిచోట ఆటో నిలిపిన ఆటో డ్రైవ ర్ ఆటో మీద గీత ప‌డింద‌ని ఆ కుర్రాడిని తిటిపోశాడు. కొద్దిరోజుల త‌ర్వాత ఇలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది మ‌రో వ్య‌క్తికి గాయాల‌య్యాయి. ఆ సంగ‌తి వ‌దిలి కారు పెద్ద మ‌నిషి రెండువేలు క‌ట్టించుకు న్నా డు. మ‌నుషులం గ‌నుక గాయ‌ప‌డినా, బండికి దెబ్బ‌త‌గిలినా గొడ‌వ‌ప‌డ‌తాం, ఆస్ప‌త్రికి వెళ‌తాం. మ‌రి నోరులేని జంతువు ఢీకొని గాయ‌ప‌డితే? అవును ఇది ఊహించ‌ని ప్ర‌మాద‌మే. చాలా ప్రాంతాల్లో అట‌వీ ప్రాంతాల్లోంచి రోడ్డు దాటి వెళుతూ గాయ‌ప‌డుతూంటాయి, ఒక‌టో అరో చ‌నిపోతూనూ ఉంటాయి. కానీ ఏ ప్ర‌భుత్వం కూడా వాటి సంగ‌తి ప‌ట్టించుకోవు.  కానీ అస్సాం ముఖ్య‌మంత్రి బిశ్వ‌శ‌ర్మ మాత్రం ప‌ట్టించుకు ని రైనో బాగోగులు క‌ను గొన్నారు.  క‌జిరంగా నేష‌న‌ల్ పార్కు స‌మీపంలో ఒక లారీ ఆగిఉంది. సాధార‌ణంగా జింక‌లు, లేళ్లు, కుందేళ్లు వంటివి ఆ ప్రాంతాల్లో రోడ్డు దాటి వెళుతూంటాయి. అలాగే మొన్నామ‌ధ్య ఒక రైనో రోడ్డుమీద‌కి వ‌చ్చింది. లారీని చూసింది. ఇదేదో త‌న‌వంటి పెద్ద జంతువు అనుకుని పొడ‌వ‌డానికి దూసుకువెళ్లింది. దానికి  అది ఆగి  ఉన్న లారీ అన్న‌ది తెలీదుగదా. లారీ ప‌క్క‌భాగాన్ని బ‌లంగా ఢీకొట్టింది. కానీ లారీ కాస్తంత క‌దిలిం ది. మ‌ళ్లీ ఢీకొట్టిం ది కానీ లారీ ప‌క్క‌భాగానికి ఉండే రేకు సొట్ట‌బ‌డిందంతే. రైనో మాత్రం బాగానే గాయ‌ప‌డి ప‌డి పో యింది. లేవ బోయింది..కానీ దానివ‌ల్ల కాలేదు. ఇంత‌లో లారీ వెళిపోయింది. రైనో లేచి మెల్ల‌గా అడ‌విలోకి వెళిపోయింది. దాని సంగ‌తి తెలిసి అధికారులు డ్రోన్ స‌హాయంతో అది ఎక్క‌డుందో తెలుసు కుని ప్రాణాపాయం లేద‌ని తెలిసి హ‌మ్మ‌య్య అనుకున్నారు. అదే సంగ‌తి ముఖ్య‌ మంత్రి బిశ్వ‌శ‌ర్మ‌కి తెలియ‌జేశారు.  అస‌లు అట‌వీ ప్రాంతం ద‌గ్గ‌ర్లోని హైవేల‌కు స్పీడ్ బ్రేక‌ర్లు గురించి చాలాకాలం నుంచే అక్క‌డి వారు గోడు పెడుతున్నారు. కానీ ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అక్క‌డే కాదు దేశంలో చాలాప్రాంతాల్లో ఈ ప‌రిస్థితి ఉంది. క‌నీసం ఆ ప్రాంతాల్లో వేగం త‌గ్గించి వాహ‌నాలు వెళ్లాల‌న్న హోర్డింగ్ హెచ్చ‌రిక‌లూ లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే మూగ‌జీవాలు చాలా ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అట‌వీశాఖ‌, రైల్వే శాఖ‌కు, రోడ్డుర‌వాణాశాఖ‌కు అనేక ఫిర్యాదులు వెళ్లినా ఏ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మూ ప‌ట్టించుకోవ‌డం లేదు. మూగ‌జీవాల సంర‌క్ష‌ణ గురించి పెద్ద ప్ర‌చారం చేసేవారంతా ప్ర‌ధానంగా ఈ విష‌యంలో వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. 

గద్దర్ గాయెబ్.. మునుగోడు ప్రజాశాంతి పార్టీ ఆభ్యర్థిగా పాల్

మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ రంగంలోకి దిగుతారని ప్రచారమైనా చివరి నిముషంలో ఆయన గాయబ్ కావడంతో రంగంలోకి స్వయంగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ దిగారు. ఇక నామినేషన్ లకు గుడువు ముగుస్తుందనగా చివరి నిముషంలో కేఏ పాల్ వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. వాస్తవానికి ఈ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్ ను నిలబెడుతున్నట్లు పాల్ స్వయంగా కొద్ది రోజుల కిందట ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ఏం జరిగిందో కానీ.. చివరి నిముషంలో పాల్ స్వయంగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే తానే స్వయంగా నిమినేషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందో పాల్ వివరించారు. నామినేషన్ వేయకుండా గద్దర్ ను పోలీసులు అడ్డుకోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తానే నామినేషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని పాల్ ఆరోపించారు. డబ్బు ఆశ చూపుతూ జనాన్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కో ఓటుకు  రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

వెన్నుపోటు వక్ర భాష్యానికి ఫుల్ స్టాప్ పెట్టిన బాలయ్య అన్ స్టాపబుల్ షో

అరచేతిని అడ్డు పెట్టి సూర్య కాంతిని ఆపలేరు. అలాగే, నిప్పులాంటి నిజాన్నిగుప్పిట పట్టి దాచలేరు. అందుకే పెద్దలు నిజం నిలకడ మీద తెలుస్తుందని అంటారు. కానీ, నిజం గడపదాటే లోగా, అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. అబద్ధాన్ని నిజం చేస్తుంది అదీ నిజమే.  అదీ పెద్దలు చెప్పిన మాటే.  అయితే, సత్యాన్వేషణ క్సోం జరిగే సంఘర్షణలో  అసత్యాన్నే నమ్ముకుని, రాజకీయం చేయాలనుకునే వారు, తాత్కాలికంగా కొంత పైచేయి సాధిస్తే సాధించవచ్చును కానీ, చివరకు సత్యమే జయిస్తుంది. సత్యమేవ జయతే.  అదే అంతిమ సత్యం.కానీ, ఈలోగా జరగకూడని అనర్ధం జరిగిపోతుంది. నిజం,నిలకడ మీద తెలిసినా మచ్చ మాత్రం అలాగే మిగిలి పోతుంది.   తెలుగు దేశం పార్టీ చరిత్రలో, అలా మిగిలిన మచ్చే, ఆగస్టు  సంక్షోభం. నిజం, 1995లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన ఆగస్టు సంక్షోభానికి సంబంధించి ఇన్నేళ్ళుగా దుష్ప్రచారం జరుగుతూనే వుంది. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని,నిలబెట్టే పవిత్ర ఆశయంతో, నందమూరి తారక రామా రావు స్థాపించిన తెలుగు దేశం పార్టీని మొగ్గలోనే  తుంచేందుకు, దుష్ట శక్తులు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశాయి. నాదెండ్ల భాస్కర రావు (30 రోజుల ముఖ్యమంత్రి) కుముద్ బెన్ జోషీ (అప్పటి రాష్ట్ర గవర్నర్) ను పావులుగా, ప్రయోగించి తెలుగు దేశం పార్టీని,  ఎన్టీఆర్ ఆశయాలను రాజకీయంగా హత్యచేసేందుకు,రాజకీయ దుష్టశక్తులు చేసిన విఫల ప్రయత్నాలు చెరిపేస్తే చెరిగి పోయేవి కాదు. అవే దుష్ట శక్తులు లక్ష్మీ పార్వతి రూపంలో మరో ప్రయత్నం చేశాయి. ఇది నిజం. నిజమైన చరిత్ర. అయితే, చరిత్రను వక్రీకరించిన, ఇప్పటికీ అదే ప్రయత్నం చేస్తున్న దుష్ట శక్తుల దుష్ట పన్నాగాలను, సమర్ధవంతంగా ఎదుర్కుని, పార్టీని, ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకుపోయేందుకు చంద్రబాబు చేసిన విరుగుడు యజ్ఞాన్ని  ‘వెన్నుపోటు’ గా చిత్రించిన, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం ఈ రోజుకు కూడా జరుగుతూనే వుంది. అయితే, ఇప్పడు, ఆనాటి సంక్షోభానికి సూత్రదారులుగా, పాత్రదారులుగా అపవాదులు మోస్తున్న, ఎన్టీఅర్ నిజమైన వారసులు, చంద్రబాబు నాయుడు, నందమూరి బాల కృష్ణ నోరు విప్పారు. నిజాన్ని అవిష్కరించారు. ఇదుకు వేదికగా నిలిచింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవరిస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' సీజన్-2. సక్సెస్‘ఫుల్’గా సాగిన సీజన వన్, కొనసాగింపుగా మొదలైన 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే  సీజన్-2, ప్రేక్షకులలో సహజంగానే ఆసక్తిని పెంచింది. అందులోనూ, బావా, బావ మరుదుల సంవాదం మధ్యలో బాలయ్యా  అల్లుడు, మేనల్లుడు లోకేష్ బాబు ఎంట్రీతో  రక్తికట్టించిన సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో ఆ ఆసక్తిని మరింతగా పెంచింది ఈ ప్రోమో విడుదలైన నాలుగు రోజుల్లోనే 30 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 7,996 కామెంట్లు లభించాయి. ఈ రియాల్టీ షోలో చంద్రబాబు తన వ్యక్తిగత, రాజకీయ విశేషాలను ఎలాంటి ముసుగులు లేకుండా అవిష్కరించారు. నిజానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఎప్పుడూ, ఎన్నడూ బయట పెట్టని కాలేజీ అల్లర్ల మొదలు, వైఎసార్ తో స్నేహం వరకు, అలిపిరి ఘటన తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లడం రాజకీయంగా తప్పయిందని అంగీకరించడం వరకు చాలా విషయాలను ప్రస్తావించారు. అయితే, ఈ అన్నిటినీ మించి రాష్ట్ర రాజకీయాల్లో మరీ ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ చరిత్రలో ఒక మలుపుగా మిగిలిన 1995 ఎపిసోడ్ కు సంబంధించి చంద్రబాబు నాయుడు, బాలయ్య బాబు  మనసు విప్పి మాట్లాడారు.. చంద్రబాబు నాయుడు తమ రాజకీయ జీవితంలో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం గురించి, బాలయ్య  అడిగిన ప్రశ్నకు చంద్రబాబు  చరిత్రను ఉన్నది ఉన్నట్లుగా ఆవిష్కరించారు.  1995 డెసిషన్‌. దీనికి ముందు వచ్చిన ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చాం. అధికారంలోకి వచ్చాం. అయితే.. దీనికి ముందే.. ఫ్యామిలీలో సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత ఎమ్మెల్యేలంతా తిరుగుబాటు చేశారు. ఐదుగురు ఆ నిర్ణయం వెనుక సాక్ష్యంగా ఉన్నారు. ఐదుగురం కలిసి ఎన్టీఆర్‌ను కలి శాం. రాజకీయాలపై చర్చించాలని కోరాం. అప్పుడు వచ్చిన వారిలో ఇద్దరిని (హరికృష్ణ, బాలకృష్ణ) బయటకు పంపించాక. 3 గంటలు చర్చించారు. నేను చాలా సేపు రిక్వెస్ట్‌ చేశాను.  మీటింగ్‌ పెట్టుకుందామన్నా. చివరకు కాళ్లు పట్టుకుని అడుక్కున్నా. మీరు ఒక్కటంటే ఒక్క  మీటింగ్‌ పెట్టి ధైర్యం ఇస్తే చాలండి.. ఇంకేం జరగదని చెప్పా. ఆయన వినలేదు. తర్వాత మీకు కూడా తెలిసిందే.  రామాంజనేయ యుద్ధమే జరిగింది. అది చరిత్ర. ఎన్టీఆర్‌తో ముందుకు వెళ్లాలనేది అందరి అభీష్టం. అయినా.. వ్యక్తి కన్నా.. ఆయన సిద్ధాంతాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అందరం ముందుకువెళ్లాం. అప్పుడు ఆ సమయం లో మీరు (బాలయ్య) కూడా ఉన్నారు. అప్పుడు.. ఆ సమయం లో మనం తీసుకున్న నిర్ణయం తప్పా? బయట నుంచి వచ్చి న వ్యక్తి ప్రభావం ఆయనపై పెరిగింది. ఆయన అడిగింది ఎప్పుడూ కాదనలేదు. అనేక ప్రయత్నాలు విఫలమయ్యాకే.. ఈ ‘నిర్ణయం’ వచ్చింది. ఆ రెండు మూడు నెలలు.. మీరు ఎంత మథనపడ్డారు? ఆయనకు చాలా రకాలుగా చెప్పాం. ఆయనకు నమ్మినబంట్లుగా ఉన్నవారు కూడా చాలా సార్లు చెప్పారు” అంటూ ఆరోజు జరిగిన వాస్తవ చిత్రాన్ని అవిష్కరించారు. ఆలాగే, ఆ రోజు తీసుకున్న నిర్ణయం తప్పా? అంటూ చంద్రబాబు నాయుడు, అడిగిన ప్రశ్నకు బాలయ్య   కాదని, స్పష్టంగా సమాధానం ఇచ్చారు. అంటే కాదు, బాలయ్య   నందమూరి కుటుంబ సభ్యుడిగా చెబుతున్నా. ఒక పార్టీ సభ్యుడిగా చెబుతున్నా. ఒక పౌరుడిగా చెబుతున్నా.1999 ఎన్నికలు అదే నిరూపించాయి. ఇవాల్టికీ ఆయన చరిత్రలో మిగిలారంటే.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు  ఆయనకు ఇచ్చిన గౌరవమే కారణం అని స్పష్టం చేశారు.   తమిళనాడులో రామస్వామి నాయకర్‌ విషయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆయన ఓ 20 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటి వరకు ఉన్నవారు ఆయనతో విభేదించారు. తర్వాత,  ఆయన సిద్ధాంతాలను మాత్రం ముందుకు తీసుకువెళ్లారు. అదే ఎన్టీఆర్‌ చరిత్ర కూడా!!  ఇది.. మీ బిగ్‌ డెసిషన్‌ కాదు.. మన కుటుంబాల డెసిషన్‌.  ఇది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం, అని చెప్పారు.   అయితే, చరితను చరిత్రగా చూడలేని, కొందరు, ముఖ్యంగా తల్లికి చెల్లికి, వెన్నుపోటు పొడిచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన భజన బృందం  ఇప్పటికీ నిజాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేదు. అయిత విచిత్రం ఏమంటే,  బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లు  అబద్ధాలలో పీహెచ్డీలు చేసిన వైసేపీ నేతలు లక్ష్మీ పార్వతిని, నాదెండ్ల భాస్కరరావు, దగ్గుబాటి వెంకటేశ్వర రావును, వారు రాసిన ‘పవిత్ర’ గ్రంధాలను ఉటంకిస్తున్నారు. అయితే, ఇప్పటికే 1999 ఎన్నికలు మొదలు ఇప్పటివరకు నిజం ఏమిటో ప్రజలే నిరూపించారు. మళ్ళీ మళ్ళీ నిరుపిస్తునే ఉంటారు. అందులో సందేహం లేదు.

తెలంగాణకు వరుణ గండం.. మరో మూడు రోజులు వానలే వానలు

తెలంగాణను వరుణుడు విడవడం లేదు. భారీ వర్షాలు తెరిపిచ్చాయన్న ఆనందం ఒక్క రోజులోనే ఆవిరయ్యేలా హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికకు తగినట్లుగానే హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంది. నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. వాతావరణ కేంద్రం హెచ్చరికతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలలో సిబ్బందిని మోహరించింది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. 

కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారు?

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లినా మీడియాలో ఆయన పర్యటన వివరాలు, ఎవరెవరితో భేటీ అయ్యారు. ఎవరెవరు ఆయనను కలిశారు అన్న వివరాలు ప్రముఖంగా వస్తాయి. ముఖ్యంగా తెరాస సామాజిక మాధ్యమంలో ఈ వివరాలను, విషయాలనూ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. గత కొంత కాలంగా ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ పై విమర్శలతో విరుచుకుపడుతుండటంతో ఆయన ప్రసంగాలూ, ప్రకటనలూ జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా వస్తున్నాయి. అలాంటిది ఆయన జాతీయ పార్టీని ప్రకటించిన తరువాత భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేతగా తొలి సారి హస్తిన పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆయన పర్యటనకు సంబంధించి ఎటువంటి వార్తలూ బయటకు పొక్కడం లేదు. అసలు ఆయన ఢిల్లీలో ఏం చేస్తున్నారు. ఎవరెవరితో భేటీ అవుతున్నారు అన్న విషయాలను కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే ఆయన హస్తినలో బస చేసి నాలుగు రోజులు అయ్యింది. తొలి రెండు రోజులలో ఆయన బీఆర్ఎస్ కోసం కిరాయికి తీసుకున్న భవనాన్ని పరిశీలించారనీ, అలాగే ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న తెరాస భవనాన్ని పరిశీలించి కొన్ని సూచనలు చేశారనీ మాత్రమే వార్తలు వచ్చాయి. అంతే ఆ తరువాత ఆయన హస్తినలో ఏం చేస్తున్నారు అన్న విషయాలపై ఎటువంటి సమాచారం తెలియడం లేదు. పార్టీ వర్గాలు కూడా ఈ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గోప్యతను పాటిస్తున్నారు. అన్నిటికీ మించి ఈ పర్యటనలో ఆయన వెంట ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమార్తె కల్వకుంట్ల కవిత, మరో బంధువు సంతోష్ ఉన్నారు. దీంతో ఆయన హస్తిన పర్యటనకు కారణాలపై రాజకీయ వర్గాలలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే తాను కొత్తగా ఏర్పాటు చేసిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ గురించి ఆయన హస్తినలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించిందీ లేదు. అలాగే పార్టీ ప్రకటన తరువాత ఇప్పటి వరకూ ఒక బహిరంగ సభ నిర్వహించిందీ లేదు. పార్టీ జెండా, అజెండాలపై వివరాలేవీ వెల్లడించలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చాలని చేసిన తీర్మానాన్ని పార్టీ ప్రతినిథుల ద్వారా ఈసీకి సమర్పించి ఇక ఆ విషయంపై నోరెత్తడం లేదు. కేసీఆర్ సహజంగా చిన్న విషయానికి కూడా బ్రహ్మాండమైన ప్రచారం ఇస్తారు. బ్రహ్మాండం అన్నది ఆయన ఊతపదంలా వాడుతారు. అయితే బీఆర్ఎస్ విషయంలో మాత్రం ఆయన బ్రహ్మాండమైన మౌనం మాత్రమే పాటిస్తున్నారు. కనీసం తెలంగాణ ప్రజలకు కూడా ఆయన బీఆర్ఎస్ గురించి తన నోటి ద్వారా ఒక్క మాట చెప్పలేదు. ప్రజలతో సంబంధం లేకుండానే పేరు మార్పు తంతును కానిచ్చేశారు.  జాతీయ పార్టీని ప్రకటించిన దసరా రోజున ఆయన మీడియాతో మాట్లాడలేదు. జాతీయ పార్టీ కదా హస్తిన వేదికగా ఆయన మాట్లాడతారని పార్టీ వర్గాలు భావించాయి. కానీ ఆయన హస్తినలో బస చేసి నాలుగు రోజులైనా ఇప్పటి వరకూ కొత్త పార్టీ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. దీంతో ఆయన హస్తిన పర్యటన వెనుక జాతీయ పార్టీకి మద్దతు కూడగట్టడానికి మించిన స్వకార్యమేదో ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి.

వివేకా హత్య కేసులో సాక్షుల భద్రతపై ఏపీ సర్కార్ కు సుప్రీం అక్షింతలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ బయట విచారించాలని ఆయన కుమార్తె సునీత  దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు సాక్షుల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేసు తీవ్రతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ స్పందన లేదని వ్యాఖ్యానించింది.  సాక్షులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించలేని దుస్థితిలో ఉందని వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా 1+1 భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పగా, అది సరిపోతుందా అని ప్రశ్నించింది. ఈ కేసు విషయంలో మీ(రాష్ట్ర ప్రభుత్వం) తీరు ఎలా ఉందో అర్దమౌతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.  ఏపీ సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానదరెడ్డి హత్య కేసులో సాక్షుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సాక్షులకు భద్రత కల్పించే విషయంలో తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని విస్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని.. సాక్షులకు ఏమైనా జరిగితే పరిస్థితేంటని నిలదీసింది. ఈ దశలో సాక్షులకు ఉన్న ముప్పు వివరాలను కోర్టుకు సమర్పించామని, ఇప్పటికే ఇద్దరు సాక్షులు మరణించారని సునీత తరఫు న్యాయవాది పేర్కొన్నారు.    తదుపరి విచారణను సుప్రీం కోర్టు ఈ నెల  19వ తేదీకి వాయిదావేసింది. కాగా ఈ కేసులో ఇంప్లీడ్ అవుతామని కోరుతూ వివేకా బంధువు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. కాగా ఇదే కేసులో ఇంప్లీడ్‌కు   నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన దరఖాస్తును అనుమతించింది. 

తెదేపా గూటికి కాసాని జ్ణానేశ్వర్

కాసాని జ్ఞానేశ్వర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే బీసీ నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి.  రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా పని  చేసిన కసాని జ్ణానేశ్వర్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశారు. 2007లో మన పార్టీ స్థాపించి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. బీసీ నేతగా ఆయనకు ఉన్న గుర్తింపు ప్రత్యేకం. ఆయన తెలుగుదేశం గూటికి చేరారు. కాసాని జ్ణానేశ్వర్ న తమ పార్టీలో చేరాల్సిందిగా తెరాస, బీజేపీలు కోరాయి. మంత్రి హరీష్ రావు స్వయంగా జ్ణానేశ్వర్ నివాసానికి వెళ్లి మరీ తెరాసలోకి ఆహ్వానించారు. అలాగే ఈటెల కూడా బీజేపీ గూటికి రావాల్సిందిగా ఆయనను కోరారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఈటెల ఆహ్వానాన్ని కాసాని మన్నిస్తారనీ, ఆయన కాషాయ కండువా కప్పుకుంటారనీ అంతా భావించారు. అయితే అనూహ్యంగా కాసాని హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయన సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. కాసాని తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు ఎన్టీఆర్‌ సిద్ధాంతాలతో పార్టీని తెలంగాణలో బలోపేతం చేద్దాం. సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టండి  అని కాసానికి సూచించారు.