తెలంగాణకు కొత్త గవర్నర్ ?
posted on Jan 10, 2023 9:23AM
తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి ఇంచు మించుగా మూడున్నరేళ్లు పూర్తయ్యాయి. 2019 సెప్టెంబర్ లో ఆమె తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఆ లెక్కన ఆమె పదవీ కాలం ముగిసేందుకు ఏడాదిన్నరకు పైగానే సమయముంది. అయితే త్వరలోనే ఆమె స్థానంలో తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
ప్రస్తుతం తమిళి సై తెలంగాణ గవర్నర్ బాధ్యతలతో పాటుగా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపధ్యంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు పూర్తి స్థాయిలో ఆమెకు అప్పగించి, తెలంగాణకు కొత్త వారిని గవర్నర్ గా నియమించే ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెల్సుస్తోంది.
అయితే గవర్నర్ మార్పునకు, ఇదీ కారణం అని స్పష్టంగా తెలియక పోయినా ఇటీవల కాలంలో గవర్నర్ కు ముఖ్యమంత్రికి, రాజ్ భవన్ , ప్రగతి భవన్ (ముఖ్యమంత్రి నివాసం )కు మధ్య దూరం పెరిగిపోవడం, రాజ్యాంగ వ్యవస్థల మధ్య వివాదాలు తలెత్తడం వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం ఒక కారణం అయితే కావచ్చును కానీ, అదే ప్రధాన కారణం అయితే కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వంతో తలెత్తిన వివాదాలకు సంబంధించి గవర్నర్ తమిళి సై పలు మార్లు కేంద్ర హోం మంత్రికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వంలో బాధ్యతగల మంత్రులు ఇతర అధికారులు మీడియా ముఖంగా లేవనెత్తిన అంశాలను పరిశీలించిన మీదట కేంద్ర హోం శాఖ అధికారులు, తెలంగాణకు రాజకీయ నాయకుల కంటే రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ గవర్నర్ గా నియమించడం అవసరమని నిర్ణయానికి వచ్చారని, అందుకే తమిళి సై స్థానంలో రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ను నియమించేందుకు వీలుగా ఆమెను పుదుచ్చేరికి పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో తెలంగాణ ఆందోళన ఉదృతంగా ఉన్న రోజుల్లో (2010)లో ఉమ్మడి రాష్త్రం గవర్నర్ గా వచ్చిన మాజీ ఐపీఎస్ ఈఎస్ఎల్ నరసింహన్ రాష్ట్ర విభజన తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా వరసగా 9 ఏళ్ళు కొనసాగడమే కాకుండా విభజన వ్యవహారాలను సమర్ధవంతంగా నిర్వహించిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్న రోజుల్లో గవర్నర్, ముఖ్యమత్రి మధ్య సత్సంబంధాలు ఉండేవి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో అన్ని విషయాలు చర్చంచి, సలహాలు తీసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వ్యక్తిగత స్థాయిలోనూ ఇద్దరి మధ్య గౌరవప్రదమైన సంబంధాలే చివరి వరకు కొనసాగాయి. ముఖ్యమంత్రి గవర్నర్ దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి, ఆశీస్సులు అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. పండగలు పబ్బాలకు శుభాకాంక్షలు ఇచ్చి పుచ్చుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
ఈ అంశాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని, ఉత్తరది రాష్ట్రాలకు చెందిన రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ను తెలంగాణ కొత్త గవర్నర్ గా నియమించే అలోచనలో కేంద్ర హోం శాఖ ఉందని అంటున్నారు. అయితే, ఇప్పటికే గవర్నర్ గా పనిచేసిన అనుభవం ఉన్న మాజీ సివిల్ సర్వెంట్ ను నియమిస్తారా? లేక కొత్తవారికి అవకాశం ఇస్తారా,అనేది ఇంకా తెలియవలసి వుంది. అదలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న గవర్నర్ మార్పు నిర్ణయం రాజకీయంగానూ చర్చనీయాంశం మవుతోందని అంటున్నారు. ముఖ్యంగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారాసల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో గవర్నర్ మార్పుకు . రాజకీయ ప్రాముఖ్యతను కూడా కాదన లేమని అంటున్నారు.