భద్రతా లోపాలు.. భారత్ జోడో యాత్ర కుదింపు?

రాహుల్ భారత్ జోడో యాత్రను కుదిస్తారా? అనంతనాగ్ ప్రాంతంలో పాదయాత్ర కాకుండా జోడో యాత్ర వాహనాలలో సాగుతుందా? అంటూ కాంగ్రెస్ వర్గాలు ఔననే అంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ జోడో యాత్రను కుదించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. అనామక వ్యక్తులు జోడో యాత్రలోని అకస్మాత్తుగా వచ్చి చేరుతున్నారని కాంగ్రెస్ అనుమానిస్తోంది. రాహుల్ ను హగ్ చేసుకోవడానికి ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని ఛేదించుకుని రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. రాహుల్ భద్రత విషయంలో సరైన ప్రమాణాలు పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. ఆయన సెక్యూరిటీ మాత్రం రాహుల్ గాంధీ భద్రత పరమైన ప్రొటోకాల్ ను పాటించడం లేదని అంటున్నది. ఈ నేపథ్యంలోనే అనంతనాగ్ కు రాహుల్ జోడో యాత్ర చేరుకోగానే పాదయాత్రగా కాకుండా రాహుల్ వాహనంలో ప్రయాణించేందుకు అవసరమైన ఏర్పాట్లను కాంగ్రెస్ చేస్తోంది. అలాగే రూట్ మ్యాప్ లో కూడా మార్పులు చేయాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం రోజుకు పాతిక కిలోమీటర్లు  పాదయాత్ర సాగుతుందడా..దానిని కూడా తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే శ్రీనగర్ లో లాల్ చౌక్ లో భారత జెండా ఆవిష్కరణ కార్యక్రమం రద్దు చేసిన కాంగ్రెస్ పార్టీ అక్కడ కాకుండా మరో చోట రాహుల్ జాతీయ జెండా ఆవిష్కరిస్తారని చెబుతోంది. 

జగన్ సర్కార్ పై గవర్నర్ కు ఉద్యోగుల ఫిర్యాదు

జీతాల కోసం, ప్రైవేటు ఉద్యోగులు వీధుల్లోకి వచ్చారంటే అర్థం చేసుకోవచ్చును. ఆందోళనకు దిగారంటే సరిపెట్టుకోవచ్చు. సమ్మెకు దిగారంటే ఔను మరేంచేస్తారని సమాధాన పడొచ్చు. కానీ, ప్రభుత్వ ఉద్యోగులు వీధుల్లోకి రావడం, ఆందోళనలకు దిగడం, సమ్మె చేయడం కాదు ఏకంగా గవర్నర్  ను కలిసి, ప్రతి నెలా ఫస్ట్’ కు జీతాలు ఇప్పించండి మహా ప్రభో అని మొరపెట్టుకోవడం బహుశా  మరో రాష్ట్రంలో ఎక్కడా ఉండదేమో. ఆ ప్రత్యేక ‘గౌరవం’ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, రాష్ట్ర ‘గౌరవ’ ముఖ్యమంత్రి   వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కింది.  నిజానికి  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర  గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి, తమ సమస్యలను ఏకరవు పెట్టడమే కాదు, ఏకంగా తమ ప్రభుత్వం మీద తామే ఫిర్యాదు చేశారు. ఇది కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సర్కార్ కు మాత్రమే దక్కిన మరో ‘విశేష’ గౌరవం కావచ్చును. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభత్వ ఉద్యోగులు రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ఏదైతే వుందో అది నభూతో న భవిష్యతి.. అన దగిన ‘అద్భుత’  సన్నివేశం కావచ్చును.  నిజమే, ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులకు మధ్య వివాదాలు తలెత్తడం, జీతాల పెంపు కోసమో, పీఆర్సీ కోసమో సమ్మెలు చేయడం కొత్తకాదు  కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు రాష్ట్రంలో తమ పరిస్థితి ముందు నుయ్యి వెంక గొయ్యి అన్న చందంగా మారిందని, గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పీఅర్సీ విషయంలో మోసపోయినా, నష్ట పోయినా ప్రభుత్వం ఏదో విధంగా ఉద్యోగులను ఆదుకుంటుందనే ఓ చిన్న ఆశతో ఉండేదని  ఇప్పడు ఆ కాస్త ఆశ కూడా ఆవిరై పోవడంతో చేసేదిలేక  గవర్నర్  ఆశ్రయించామని ఉద్యోగ సంఘాల నాయకులు మీడియా ముందు గోడును వెళ్లబోసుకున్నారు. నిజానికి  వైసీపీ ప్రభుత్వం అధిఅక్రంలోకి వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోలి సంతకం చేసింది మొదలు రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ  పూర్తిగా గతి తప్పిందని  ఇంతవరకు విపక్షాలు, ఆర్థిక నిపుణులు మాత్రమే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాల నేతలు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఫిర్యాదు చేశారు. అనతరం మీడియాతో మాట్లాదారు .. వారేమన్నారంటే ...   రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సూర్యనారాయణ, ఆస్కారరావుతో పాటు మరో ఆరుగురు నేతలు గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు.  ఉద్యోగులకు వేతనాలను ప్రతి నెలా మొదటి తేదీనే ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సూర్యనారాయణ ఆరోపించారు. ఉద్యోగుల అనుమతి లేకుండా జీపీఎస్‌ను విత్‌డ్రా చేశారు. 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బులు తీసుకున్నారు. మేం ప్రశ్నిస్తే సాంకేతిక సమస్య వల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు. గవర్నర్‌ను కలిసి అన్ని విషయాలు వివరించాం. మా సమస్యలను గవర్నర్‌ సానుకూలంగా విని కొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేశారు. న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం అవమానకర రీతిలో వ్యవహరిస్తోంది. మేమేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను సమాయత్తం చేస్తాం. ఏప్రిల్‌ నుంచి రాష్ట్ర కౌన్సిల్‌ నిర్ణయం ప్రకారం ఆందోళన చేపడతాం. ఆర్థికశాఖ అధికారులు, మంత్రివర్గ ఉప సంఘానికి సమస్యలు చెప్పాం. వారు స్పందించకపోవడం వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశాం. బకాయిల చెల్లింపులపై జోక్యం చేసుకోవాలని ఆయన్ను కోరాం అని సూర్యనారాయణ తెలిపారు.

ఇదిగో ఇంకో .. ఫార్మ్ హౌస్ కథ

భారత రాష్ట్ర సమితి (భారాస) ఎమ్మెల్యేల కొనుగోలుకు,బీజేపీ నాయకత్వం ప్రయత్నించిందంటూ భారాస నాయకత్వం చేసిన ఆరోపణలు, ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేపట్టిన విచారణ  చిత్ర విచిత్ర మలుపులు తిరిగి, చివరకు సిబిఐకి చేరింది. సిట్  విచారణ చెల్లదని తేల్చిన రాష్ట్ర హై కోర్టు  విచారణను సిబిఐకి అప్పగించాలని ఆదేశించడంతో, డామిట్  కథ అడ్డం తిరిగిందని భారాస ప్రభుత్వం తల పట్టుకుంది. అయితే, పరిస్థితిని మదింపు వేసుకుని కేసును సీబీఐ విచారణకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ప్రభుతం అప్పీల్ కు వెళ్లింది.  కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీంతో ఇటు సిట్ దర్యాప్తుతో పాటు సీబీఐ దర్యాప్తు కూడా నిలిచిపోయింది.   అయితే, ఆ ఫార్మ్ హౌస్ కథ.. అలా ఉంటే టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి మరో ఫార్మ్ హౌస్ ఉదంతాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని సుమారు 25 మంది కాంగ్రెస్ నేతలతో కేసీఆర్ మాట్లాడారని రేవంత్ రెడ్డి  ఆరోపించారు. వారిని ఫామ్ హౌజ్ కు పిలిచి మాట్లాడారని అన్నారు. ఈ విషయం పార్టీ అధిష్టానానికి తెలిసిందని అన్నారు. ఆ నేతలకు రూ.500 కోట్ల ఆఫర్ ఇచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం తెలిసి తమ నేతలకు సైతం ఏఐసీసీ క్లాస్ తీసుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు. సునీల్ కనుగోలు రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్ పనిచేస్తున్నారని విమర్శించారు. సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి వెనుక చాలా కారణాలున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.  తక్కువ మార్జిన్‌తో గెలిచే నేతలను టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ ఈ పని చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ విషయం కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామికి కూడా తెలియదని చెప్పారు. బీఆర్ఎస్ మీటింగ్‌కు కుమారస్వామి రాకపోవడానికి అదే కారణమని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, భారాస ఆవిర్భావ సభ నేపథ్యంగా ఆయన చేసిన సంచలన ఆరోపణలు రాజకీయ వర్గాలో దుమారం రేపుతున్నాయి. నిజానికి  కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానంలో అందరికంటే ముందుగా ఆయనతో జట్టు కట్టింది, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్’ అధ్యక్షుడు కుమార స్వామి. అలాంటిది  పార్టీ అవిర్భావ సభకు ఆయనే రాలేదు. సరే, ఆయన బిజీగా ఉండి రాలేక పోయారని అనుకున్నా, అయన తరపున ఆయన కుమారుడో లేదా జేడీఎస్ మరో ముఖ్య నాయకుడో మరొకరో అయినా రావాలి కదా ..కానీ, ఎవరు రాలేదు. దీంతో రేవంత్ రెడ్డి ఆరోపణలలో ఎంతో కొంత  నిజం ఉండే ఉంటుందని  అంటున్నారు. నిజానికి , కేసీఆర్ జాతీయ రాజకీయాలలో ముందుకు సాగేందుకు, అడుగడుగునా ‘డబ్బు’ మూటలనే నమ్ముకుంటున్నారని అంటున్నారు. సో.. రేవంత్ రెడ్డి చేసియన్ సంచలన ఆరోపణల పై విచారణకు ఆదేశిస్తే, మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాని అంటున్నారు.

మిడిల్ క్లాస్ మెలోడీ మాయమౌతోందా?

యూనియన్ బడ్జెట్ అనగానే దేశంలో మధ్యతరగతి ఆశల పల్లకిలో ఊరేగడం మొదలెట్టేస్తోంది. ఇది ఏటా మామూలుగా జరిగే వ్యవహారమే. అయితే అదే మధ్య తరగతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి సంపన్నులకు సానుకూలంగా.. మధ్య తరగతిని దిగువ మధ్య తరగతిని డిమోషన్ ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన అన్నది పరిపాటిగా మారిపోయింది.  స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ నిర్లక్ష్యానికి గురౌతు వస్తున్న వర్గం ఏదైనా ఉందా అంటే అది మిడిల్ క్లాస్ వర్గం మాత్రమేనని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. మధ్యతరగతి ఆదాయం, పొదుపులపై ఎక్కవ శ్రద్ధ, దృష్టి పెడుతుంది. ప్రభుత్వాలు దానినే లక్ష్యంగా చేసుకుని బడ్జెట్ ల పేరుతో ఆ తరగతి మీద దాడి చేస్తున్నాయి. అంటే మధ్యతరగతిని దోచి సంపన్నులకు భారీగా, పేదలకు పరిమితంగా పంచి పెడుతున్నాయి. దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు బడ్జెట్‌ ప్రస్తావన వచ్చినా   మధ్యతరగతి వర్గం తమకు ఏదైనా మేలు జరుగుతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఏడున్నర దశాబ్దాలుగా మధ్యతరగతికి మిగిలింది ఆ ఎదురు చూపే.. ప్రభుత్వాలు మాత్రం మధ్యతరగతి నెత్తిన ఎంత పెద్ద బండ పెడితే.. అంతగా దేశాభివృద్ధి జరిగిందన్నట్లు భావిస్తూ ముందుకు సాగుతున్నాయి.  ప్రభుత్వం చెప్పే జీడీపీ పెరుగుదల మధ్యతరగతిని పీల్చి పిప్పి చేయడంపైనే ఆధారపడి ఉందని ప్రభుత్వాలు భావిస్తున్నాయి.   ఎందుకంటే దేశాబివృద్ధిలో అత్యంత కీలకమైన పన్నులు కట్టేది ఎక్కువగా మధ్య తరగతే. ధరల భారాన్ని మోసేదీ ఆ తరగతే. బడ్జెట్‌ వస్తోందంటే చాలు ఆ తరగతి జీవుల్లో  పన్నుల భయం పట్టుకుంటుంది. ఆ పన్నులపై శ్లాబులు ఇస్తే బాగుండుని, ఆదాయపన్ను మినహాయింపు పెంచితే చాలనీ కోరుకుంటుంది.  గత నాలుగేళ్లుగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ సమయం అయినా కాకపోయినా, సందర్భం వచ్చినా రాకున్నా తాను మధ్యతరగతికి చెందిన మహిళలని చెప్పుకుంటుంటారు. గత నాలుగు బడ్జెట్ లలో ఆమె మధ్యతరగతికి ఒరగబెట్టిందేమీ లేదు. ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో ఆమె వరుసగా ఐదో సారి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పుడు కూడా యథావిధిగా తాను మధ్యతరగతి మహిళలనీ, వారి కష్టాలు, బాధలు, ఆశలూ తనకు బాగా తెలుసుననీ చెప్పుకొచ్చారు.  ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీన తాను ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో మధ్యతరగతి మీద అదనపు పన్నుల భారం ఉండబోదని ఆమె ప్రకటించారు. అయితే అదనపు ఆదాయం కోసం ప్రభుత్వాలు ఎక్కువగా ఆధారపడేది మధ్యతరగతి మీదే.  ఆ తరగతి జీవుల ద్వారానే అధికంగా పన్నుల ద్వారా ఆదాయం సమకూరుతుంది.  అందువల్ల బడ్జెట్‌కు సంబంధించి ఏ ప్రస్తావన వచ్చినా మధ్యతరగతి జనులే ముందుగా స్పందిస్తుంటారు సాలీనా రూ. 5.30 లక్షలు సంపాదించే వారంతా మధ్యతరగతికి చెందినవారేనని ‘ప్రెస్‌’ అనే ఆర్థిక వ్యవహారాల అధ్యయన సంస్థ చెప్పింది. దాని ప్రకారం, దేశంలో 30 శాతం కుటుంబాలు మధ్య తరగతికి చెందినవే. 2018-19 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 5.60 కోట్ల మంది వ్యక్తులు ఆదాయ పన్ను రిటర్న్స్‌ దాఖలు చేయగా, అందులో కోటీ 90 లక్షల మంది అంటే 34 శాతం మంది రూ. 5.25 లక్షల లోపు ఆదాయం కలిగినవారే, అంటే మధ్య తరగతి వారే.   అంతేకాదు, దేశంలో అసలు సిసలు కొనుగోలుదారుల గణాంకాలను సేకరించినప్పుడు కూడా మధ్యతరగతి జనులే అధికం.   ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి మీద పన్నుల భారం వేయబోమని చెప్పిన నిర్మలా సీతారామన్‌, ప్రాథమిక సదుపాయాల కల్పన మీదే దృష్టి కేంద్రీకరింస్తామనీ, వీటి అభివృద్ధి మీదే భారీగా పెట్టుబడి పెట్టబోతున్నామనీ ప్రకటించారు. నిజానికి ప్రాథమిక సదుపాయాల కల్పన అనేది మధ్య తరగతికి పెద్దగా ప్రయోజనం కలిగించే అంశమేమీ కాదు. అది తమ జీవన స్థితిగతులను, జీవిత నాణ్యతను పెంచగ లదనే నమ్మకం ఆ తరగతి జీవులలో ఇసుమంతైనా లేదు. ఆరోగ్య సంరక్షణ, విద్య, రవాణా సౌకర్యాల వల్ల మధ్యతరగతి ప్రత్యక్షంగా లబ్ధి పొం దుతుందే తప్ప ప్రాథమిక సదుపాయాల వల్ల కాదన్నది పలు అధ్యయనాలు వెల్లడించాయి. మరి విత్త మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల మొదటి తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్ అయినా ఏదో ఒక మేరకు మధ్యతరగతి జనుల.. వీరిలో అత్యధికులు వేతన జీవులే ఆశలను నెరవేర్చేదిగా ఉంటుందా? చూడాలి.

కొయ్యా గుర్రం ఎగరావచ్చు!

మూడు పార్టీలకు చెందిన నలుగురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, మరో జాతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ... ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్బావ సభ వేదిక నుంచి ప్రసంగించిన నేతలు ఈ ఐదుగురు. సరే, ఐదుగురు నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, మోడీ ప్రభుత్వ విధానాలను విమర్శించారు. దేశం ఏమైపోతోందనే ఆవేదన, ఆగ్రహం వ్యక్తపరిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేసేఆర్  అయితే, 2024 ఎన్నికల తర్వాత ప్రధాని మోడీ ఇంటికి ...మేము ఢిల్లీకీ అని, చాలా విశ్వాసంగా ప్రకటించారు.  అయితే, ఈ ‘మేము’ లో ఉన్నది ఎవరు? వేదిక మీద ఐదు ముఖాలు కనిపించినా, ఉన్నది బీఆర్ఎస్  సహా  నాలుగే పార్టీలు.. అందులో లోక్ సభలో సింగిల్ సీటున్న పార్టీ ఒకటి (ఆప్), రెండే సీట్లున్న పార్టీ ( సిపిఐ) ఇంకొకటి, ఐదు సీట్లున్న పార్టీ (ఎస్పీ), మూడు సీట్లకు పరిమితం అయిన సిపిఎం మరొకటి. ఇక బీఆర్ఎస్ సంగతి చెప్పనే అక్కరలేదు. కారు సారు పదహారు ..కాస్తా తొమ్మిదికి చేరింది.  అంటే 545 సంఖ్యా బలమున్న లోక్  సభలో బీఆర్ఎస్ వేదికను అలంకరించిన జాతీయ నేతల టోటల్ స్ట్రెంక్త్  20కి లోపే. పోనీ ఈ నాలుగు పార్టీల ఐదుగురు నేతలు ఒకే మాట మీదున్నారా? అంటే  అదీ లేదు. ఎవరి అవసరాలకు తగ్గట్టుగా నలుగురూ నాలుగు పక్కలకూ లాగుతున్నారు. ముఖ్యంగా ఎంత చెడ్డా  లోక్ సభలో అధికారికంగా ప్రతిపక్ష హోదా ఉన్నా లేకున్నా, జాతీయ స్థాయిలో  బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనే ..అయినా కాంగ్రెస్ పొత్తు విషయంలో ఏ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఏ రెండు పార్టీలు కాదు, ఏ ఇద్దరు నాయకుల మధ్య కూడా ఏకాభిప్రాయం లేదు.   కేసీఆర్  బీజేపీతో పాటుగా కాంగ్రెస్ పార్టీని కూడా శత్రు పక్షంగా చూస్తున్నారు. ఆ రెండు పార్టీల నిర్వాకం వల్లనే దేశం ఈ దౌర్భాగ్య స్థితి చేరిందని ఆయన అంటున్నారు. మరో వంక సిపిఐ నేత డి.రాజా కాంగ్రెస్ సహా లౌకికవాద ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఒక్కటైతేనే కానీ, మోడీ పీఠాన్ని కదల్చలేమని అంటున్నారు. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సగం అటు సగం ఇటుగా ఉన్నారు. అదే పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి మాన్    బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేశారు. అలాగే సిపిఐ జాతీయ నేత రాజా, కాంగ్రెస్ తో కలిసి నడవాలని అంటే, కేరళ ముఖ్యమంత్రి (సిపిఎం) హస్తం పార్టీతో చేయి కలిపేది లేదని అంటున్నారు. అఫ్కోర్స్, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కూడా కాంగ్రెస్   కలిసిపోదామని అన్నా, గత ఏప్రిల్లో జరిగిన సిపిఎం కాంగ్రెస్  ఏచూరి ప్రతిపాదనను తోసి పుచ్చింది. జాతీయ స్థాయిలో ఏ పార్టీ, కూటమితో పొత్తు ఉండదని, సిపిఎం కాంగ్రెస్ ఆమోదించిన రాజకీయ తీర్మానంలో స్పష్టం చేసింది.  నిజానికి, ఈ నాలుగు పార్టీలు ఐదుగురు నాయకులే కాదు, ఓ వంక నుంచి మమతా బెనర్జీ, మరో వంక నుంచి నితీష్ కుమార్, ఎవరికి వారు 2024 ఎన్నికలలో మోడీని ఇంటికి పపంపాలని శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే, అది అయ్యే పనేనా? అందులోనూ... కాంగ్రెస్ ను పక్కన పెట్టి, అంటే ..ఏమో కొయ్యా గుర్రం ఎగరావచ్చు .. అంటున్నారు.

బీఆర్ఎస్ కు కుమార స్వామి దూరం ఎందుకంటే.. ?

ఖమ్మం బీఆర్ఎస్ సభకు జేడీఎస్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దూరంగా ఉన్నారు. ఆయనే కాదు.. జీడీఎస్ పార్టీ ప్రతినిధులెవరూ కూడా హాజరు కాలేదు.  దీంతో.. కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటూ పయనం ప్రారంభించనప్పటి నుంచీ ఆయనతో అడుగులు వేయడానికి ఉత్సాహం చూపిన జేడీఎస్, కుమారస్వామి.. బీఆర్ఎస్ కు దూరం జరిగారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ తన జాతీయ ఆకాంక్షను బయటపెట్టిన క్షణం నుంచీ..   కుమారస్వామి ఆయనకు మద్దతు పలికారు.  పార్టీ ప్రకటన సందర్భంలోనూ,  ఢిల్లీ లో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలోనూ కుమార స్వామి కేసీఆర్ వెంట నిలిచారు. కానీ   ఆవిర్భావ సభకు మాత్రం దూరం జరిగారు. బీఆర్ఎస్ వర్గాలు ఆయన బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారని చెబుతున్నా.. జేడీఎస్ కు సంబంధించి ఎవరూ ఖమ్మంలో బీఆర్ఎస్ తొలి సభకు హాజరు కాకపోవడాన్ని బట్టి చూస్తే ఎక్కడో ఏదో చెడిందన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి.  అలాగే.. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఖమ్మం ఆవిర్భావ సభలో ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్ కర్నాటక బాధ్యతలు ప్రకాశ్ రాజ్ చేపడతారన్నంతగా ప్రచారం జరిగినా.. అత్యంత కీలకమైన ఆవిర్భావ సభకు ఆయన గైర్హాజర్ కావడంతో ఏదో జరిగింది, బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు ప్రకాష్ రాజ్ దూరం జరిగారా, లేక కేసీఆరే పక్కన పెట్టారా అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.   తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తో పాటే జరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కుమారస్వామి బీఆర్ఎస్ తో ఎడం పాటించడంతో..   జేడీఎస్ బీఆర్ఎస్ మిత్రపక్షంగా ముందుకు సాగడానికి సుముఖంగా లేదన్న వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను రంగంలోకి దింపాలని భావిస్తుండటం జేడీఎస్ నేత కుమారస్వామికి నచ్చలేదనీ, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండి జేడీఎస్ అభ్యర్థుల కోసం ప్రచారానికే పరిమితమవ్వాలన్న ఆయన కండీషన్ ను కేసీఆర్ అంగీకరించలేదనీ ఒక ప్రచారం జరుగుతోంది. అందుకే బీఆర్ఎస్ తో పొత్తుకు ముందే కుమారస్వామి తెగతెంపులు చేసుకున్నారని అంటున్నారు.   అసలింతకీ ఖమ్మంలో జరిగిన ఆవిర్భావ సభతో కేసీఆర్ భారాస పార్టీ జాతీయ పార్టీగా అన్ని వర్గాల గుర్పింపు పొందేసినట్లేనా? అంటే ఔనన్న సమాధానం వస్తుందా, వచ్చిందా? అని స్పష్టంగా చెప్పలేము. కత్తీ పోయి డాలు వచ్చే ఢాంఢాంఢాం అన్నట్లుగా ఆవిర్బవం నుంచీ తొడుగా ఉన్న మిత్రుడు దూరమై కొత్త మిత్రులు వచ్చారు అని మాత్రమే చెప్పగలం.  జేడీఎస్ దూరమై ఆప్ దగ్గరైంది. వామపక్షాలు వచ్చి చేతులు కలిపినా.. ఆ పార్టీలకు కేసీఆర్ బలం కావాలే తప్ప కేసీఆర్ కు అవి బలంగా ఉండే అవకాశం లేదు. మరి ఖమ్మం సభ ద్వారా కేసీఆర్ సాధించిందేమిటయ్యా అంటే జేడీఎస్ ను దూరం చేసుకుని ఆప్ కు దగ్గరవ్వడం. కేసీఆర్ కు జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్ష ఎంత బలీయంగా ఉందో.. ఆప్ అధినేత కేజ్రీవాల్ కు కూడా అంతే బలీయంగా ఉంది. తెలుగు రాష్ట్రాలలో పాగా కోసం ఆప్ గతంలో కొంత ప్రయత్నం చేసినా సఫలీకృతం కాలేదు. దీంతో ఆయన వ్యూహం మార్చి తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి ఆప్ ను బలోపేతం చేయాలని భావిస్తున్నారు. గతంలో తెలుగుదేశం హస్తినలో ఆందోళనలకు దిగినప్పుడు కూడా స్వయంగా వచ్చి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారాస విషయంలో మాత్రం ఆయన ఖమ్మం సభకు రావడానికి ముందు వరకూ ఎటువంటి సానుకూలతా ప్రదర్శించలేదు. హిమాచల్, గుజరాత్ ఎన్నికలలో ఆప్ పరాభవం తరువాత వ్యూహం మార్చుకుని భారాస ఆవిర్భావ సభకు హాజరయ్యారు. భారాస అండతో తెలంగాణలో  బలోపేతం అన్న వ్యూహంతో ఆయన అడుగులు వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి కేసీఆర్ పార్టీ పూర్తిగా విస్తరించకముందే.. కొందరు మిత్రులను దూరం చేసుకుని కొత్త మిత్రులకు దగ్గరయ్యారు అని మాత్రమే భారాస ఆవిర్భావ సభ ద్వారా వెల్లడైంది. అయినా తనకు తానుగా జాతీయ నాయకుడినని భావిస్తున్న కేసీఆర్ కు నిజంగా ఆ గుర్తింపు వచ్చిందా? ఓ ముగ్గురు, నలుగురు ఇతర పార్టీల కు చెందిన నాయకులు మద్దతు పలికితే బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోతుందా? ఆయనకు జాతీయ నేతగా గుర్తింపు వచ్చేసిందా? ఆయనను కలిసిన వారంతా తమ నాయకుడిగా కేసీఆర్ ను అంగీకరించేసినట్లేనా?  అంటే కాదనే రాజకీయ వర్గాలు అంటున్నాయి. గత మూడు నాలుగేళ్లుగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన కేసీఆర్ సొంతంగా బీఆర్ఎస్ ఏర్పాటు చేసేసి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేస్తానంటున్నారు.  కానీ బీహార్ సీఎం నితీష్ కుమార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్  వంటి వారు జాతీయ రాజకీయాలలో బీజేపీ వ్యతిరేక పార్టీల ఐక్యత విషయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వారు ముగ్గురూ కూడా ఆది నుంచీ కేసీఆర్ తో అడుగులు వేయడానికి సుముఖంగా లేరు. స్టాలిన్ అయితే కాంగ్రెస్ లేకుండా బీజేపీయేతర శక్తుల ఐక్యత వీలుకాదని ఇప్పటికే కుండ బద్దలు కొట్టేశారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ది కూడా దాదాపు అదే బాణి, అదే బాట. ఆయన సొంత రాష్ట్రం బీహార్ లో జేడీఎస్ ఆర్జేడీ, కాంగ్రెస్ లతో పొత్తులో ఉంది. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఆవిర్బావ సభతో కేసీఆర్ సాధించిందేమిటన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది.  

ఫామ్ హౌస్ కేసు.. తెర వెనుక ఏదో జరుగుతోందా?

ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారంటూ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ట్రాప్ చేసి పట్టుకున్న ఫామ్ హౌస్ కేసు ఎటూ కాకుండా ఇరుక్కుపోయింది. సిట్ దర్యాప్తును వేసి.. బీఎల్ సంతోష్ లాంటి బీజేపీ పెద్ద తలకాయని ఇరికించేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినా చివరికి రివర్స్ అయింది. హైకోర్టు కేసును సీబీఐకి ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ వ్యూహం దెబ్బతింది. అనుకున్నదొకటీ అయినదొకటీ అన్నట్లుగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి.  ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యుత్సాహం  పార్టీ చేతిలోని ఆయుధాన్ని ప్రత్యర్థికి అప్పగించిందని పార్టీవర్గాలే అంటున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసు విషయంలో కేసీఆర్ బీజేపీ ఆయువుపట్టు మీద దెబ్బకొట్టానని సంబరపడినంత సేపు పట్ట లేదు.. ఆ కేసు తిరిగి తిరిగి తమ పార్టీ ఎమ్మెల్యేల మెడకే చుట్టుకుంటోందని తెలియడానికి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసును సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు నిర్ణయించడంతో బీఆర్ఎస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.  కేంద్రానికేనా దర్యాప్తు సంస్థలు.. రాష్ట్రాలకు లేవా అంటూ ఈ కేసు దర్యాప్తునకు సీట్ ను ఏర్పాటు చేసినప్పుడు పార్టీ క్యాడర్ లో,  పార్టీ మారాలంటూ  తమను ప్రలోభ పెట్టారంటూ ఫిర్యాదు చేసిన అప్పటి టీఆర్ఎస్, ఇప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కనిపించిన ధీమా హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించడంతో నీరుగారిపోయింది.  ఇందుకు  ఈ కేసులో అత్యంత కీలకంగా ఉన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గాభరా, కంగారూ  నిదర్శనం. ట్రాప్ జరిగిన సమయంలో పోలీసులు కోట్ల రూపాయలు పట్టుకున్నట్లు జరిగిన ప్రచారమే కానీ, అందుకు తగ్గ ఆధారాలు ఇప్పటికీ బయటకు రాలేదు.  నిజంగా అప్పట్లో సొమ్ము బయటపడి ఉంటే.. ఈడీ ఈ పాటికే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించేసి ఉండేది. అయితే ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతికి వెళ్లకూడదన్న ఉద్దేశంతోనే అప్పట్లో సొమ్ము రికవరీ చూపలేదన్న వాదన కూడా ఉంది. అయితే ఫామ్ హౌస్ కేసులో సొమ్ములు కనిపించకపోయినా  వ్యూహాత్మకంగా ఈడీ రంగప్రవేశం చేసింది. ఆ వెను వెంటనే హైకోర్టు   సీబీఐకి కేసు అప్పగించింది. దీంతో ఈ కేసు విషయంలో ఒక తార్కిక ముగింపునకు ఎంతో సమయం పట్టదన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లోనూ, రాజకీయ వర్గాలలోనూ కూడా వ్యక్తమైంది. సీబీఐ, ఈడీల రంగ ప్రవేశంలో ఇక ఫామ్ హౌస్ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ,   సింహ యాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌లే కాక, ఫిర్యాదు చేసి నలుగురు ఎమ్మెల్యేలూ కూడా దర్యాప్తు సంస్థల స్కాన్ లోనే ఉంటారు. ఎవరు ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నించారన్న దగ్గర నుంచి, ఎలా ట్రాప్ చేశారు, సొమ్ముల సమీకరణ ఎలా వరకూ అన్ని అంశాలనూ కేంద్ర దర్యాప్తు సంస్థలు వెలుగులోనికి తీసుకు వస్తాయి. ఇప్పటి వరకూ ఈ కేసులో సిట్ వైపు నుంచి మాత్రమే వివరాలు బయటకు వచ్చాయి. ఇక ఇప్పుడు సిట్ ఇంత వరకూ చేసిన దర్యాప్తు, వెల్లడించిన విషయాలూ అన్నీ పక్కకు వెళ్లిపోతాయి. ఎందుకంటే ఈ కేసు దర్యాప్తు చేసే అధికారం ఇక సిట్ కు లేదు.  సో.. ఆ దర్యాప్తును అంతా పక్కన పెట్టేసి కేంద్ర దర్యాప్తు సంస్థలు మళ్లీ మొదటి నుంచీ దర్యాప్తు ప్రారంభిస్తాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి రోహిత్ రెడ్డి కంగారు పడుతున్నారు. ఈడీ, సీబీఐలకు ఈ కేసు దర్యాప్తు చేసే అధికారమే లేదంటున్నారు. హైకోర్టు ఫామ్ హౌస్ ట్రాప్ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించిన తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ రోహిత్ రెడ్డి తన స్పందన తెలిపారు. కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారన్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అని నిందలేశారు. కోర్టు తీర్పు మేరకే కేసును సీబీఐ దర్యాప్తు చేయనుందన్న సంగతి విస్మరించి మరీ బీజేపీపై నిందలేశారు. అంతకు ముందు ఇదే కేసుకు సంబంధించి తనను ఈడీ విచారించిన తరువాత కూడా ఆయన ఇవే ఆరోపణలు చేశారు. రెండు సందర్భాలలోనూ ఆయనలో ఆందోళన, గాభరా స్పష్టంగా కనిపించింది. మీడియా ముందుకు రాలేదు కనుక మిగిలిన ముగ్గురూ ఎలా ఫీల్ అవుతున్నారన్న సంగతి తెలియడం లేదు.. కానీ ఈ ఫామ్ హౌస్ ట్రాప్ కేసులో మొదటి నుంచీ క్రియాశీలంగా ఉన్నదీ, కీలకంగా వ్యవహరించినదీ పైలట్ రోహిత్ రెడ్డే. ఈడీ విచారణ అనంతరం తనపై కేసులు నమోదౌతాయనీ, అరెస్టు చేస్తారనీ అనుమానం వ్యక్తం చేసిన ఆయన నందకుమార్ ఫిర్యాదు మేరకే తనపై కేసులు పెడతారన్నారు. అయినా ఫామ్ హౌస్ లో డబ్బుల చెలామణియే జరగలేదనీ, అలాంటప్పుడు కేసులు ఎలా పెడతారనీ కూడా ప్రశ్నించారు.   అసలు వాస్తవానికి రోహిత్ రెడ్డి నందకుమార్ ద్వారా బీజేపీ పెద్దలు తనను ప్రలోభపెట్టారనీ, పార్టీ మారితే వందకోట్లు ఇస్తామని ప్రతిపాదించారనీ ఆరోపించారు. ఇంతకీ ఈ నందకుమార్ స్వయంగా రోహిత్ రెడ్డికి పార్టనర్. ఈ నేపథ్యంలోనే ఫామ్ హౌస్ కేసులో ఇంత వరకూ బయటపడని మరింత లోతైన వ్యవహారం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఆ అనుమానాలన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో వెల్లడౌతాయని పరిశీలకులు అంటున్నారు. అలా వెల్లడౌతాయన్నకంగారు రోహిత్ రెడ్డి మాటల్లో బయటపడుతోందనీ అంటున్నారు.  మొత్తం మీద సిట్ దర్యాప్తు తో బీఆర్ఎస్ నేతల్లో కనిపించివన ధీమా ఇప్పుడు హైకోర్టు తీర్పుతో సీబీఐ రంగంలోనికి దిగనుండటంతో ఆవిరైపోయినట్లే అన్న  భావన సర్వత్రా వ్యక్తమైంది. అయితే ఆ తరువాతే కథ విచిత్రంగా మలుపులు తిరుగుతోంది. కేసును సీబీఐ విచారణకు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ అప్పీల్ కు వెళ్లింది.  కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అంతే ఇటు సిట్ దర్యాప్తుతో పాటు సీబీఐ దర్యాప్తు కూడా నిలిచిపోయింది.   సీబీఐ విచారణపై హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదు అయినా  ఆ దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించలేదు. జనరల్ కన్సంట్ లేదన్న సాకు చూపుతూ వాచారణ కోసం సీబీఐ తెలంగాణ సర్కార్ కు లేఖ రాసింది.  హైకోర్టు ఆదేశించినందున అలా అనుమతి కోరాల్సిన అవసరమే లేదు.  అయినా సీబీఐ అనుమతి కోరుతూ లేఖ రాసింది. కోర్టు తీర్పు కారణంగా అనుమతి నిరాకరించే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి లేదు. అందుకే అనుమతి నిరాకరించనూ లేదు.. అలాగని అనుమతి ఇవ్వనూ లేదు. ఇటు తెలంగాణ సర్కార్, అటు సీబీఐ కూడా కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయని భావించాలి. అన్నిటికీ మించి ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు, ప్రత్యారోపణల విషయంలో తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా హఠాత్తుగా అనూహ్యంగా మౌనం దాల్చాయి. కేసు కోర్టు పరిధిలో ఉంది కనుక మాట్లాడటం లేదని అనుకోవడానికి కూడా లేదు. దీంతో ఈ నిశబ్దం ఈ కేసు విషయంలో తెరవెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

శుభమన్ గిల్ డబుల్ సెంచరీ..న్యూజిలాండ్ తో తొలి వన్డేలో టీమ్ ఇండియా విజయం

హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్  విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు   ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో విజయం ఇరు జట్లతో దోబూచులాడింది. భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల వరకూ వెళ్లినా బ్రేస్ వెల్   బ్రేస్ వెల్ పోరాటం జట్టును పోటీలోకి తీసుకువచ్చింది.  తొలుత  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. ఓపెనర్  శుబ్ మన్ గిల్ 149 బంతులలో ఆరు సిక్సర్లు, 19 ఫోర్లతో అజేయంగా 208 పరుగులు చేశాడు. గిల్ మినహా మిగిలిన బ్యాటర్లెవరూ పెద్దగా రాణించలేదు. స్కిప్పర్ రోహిత్ శర్మ 38 బంతులలో 34 పరుగులు,   విరాట్ కోహ్లీ పది బంతులలో 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. తర్వాత ఇషన్ కిషన్ 14 బంతులలో 5 పరుగులు చేసీ ఔట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 26 బంతుల్లో 31 పరుగులు,  హార్దిక్ పాండ్యా 38 బంతులలో 28 పరుగులు చేశారు. ఇక చివరిలో వాషింగ్టన్ సుందర్ 14 బంతులలో 12 పరుగులు చేయగా .. శార్దుల్ ఠాకూర్ మూడు బంతులలో మూడు పరుగులు చేయడం జరిగింది. భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్  ఆరంభం నుండే వికెట్లు కోల్పోతూ వచ్చింది. 130 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన దశలో ఆ జట్టు విజయం గురించి ఎవరికీ అంచనాల్లేవు. ఆ స్థితిలో  బ్రేస్ వెల్, శాంట్నార్   క్రీజులో నిలదొక్కుకొని అటాకింగ్ గేమ్ ఆడి భారత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇ న్యూజిలాండ్ స్కోర్ బోర్డ్ ను రేసు గుర్రంలా పరుగులు పెట్టించారు. దీంతో న్యూజిలాండ్ విజయం సాధిస్తుందా అన్న అనుమానం కలిగింది. అయితే ఒక అధ్భుత బంతితో   సిరాజ్  శాంట్నార్(57)ను అవుట్ చేయడంతో న్యూజిలాండ్ జోరు తగ్గింది. ఆ తర్వాత బ్రేస్ వెల్.. ఒంటరి పోరాటం చేసినా మిగతా బ్యాట్స్ మెన్ లు…క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీంతో న్యూజిలాండ్ 337 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. దీంతో 12 పరుగుల తేడాతో ఇండియా గెలవడం జరిగింది. ఉత్కంఠ భరీతంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ బౌలర్ సిరజ్ 4 వికెట్లు తీశాడు.శుభమన్ గిల్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో డబుల్ సెంచురీ బాది తన సత్తా చూపారు శుభమన్. కేవలం 145 బంతుల్లోనే డబుల్ సెంచురీ చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో శుభమన్ ఆట క్రికెట్ లవర్స్ ను అలరించింది. ఇలా వన్డేల్లో డబుల్ సెంచురీ చేసిన ఐదవ ఇండియన్ క్రికెటర్ గా శుభమన్ గిల్ నిలిచాడు. డబుల్ సెంచురీ ఫీట్ లో భాగంగా ఆయన 19 బౌండరీలు, 8   సిక్సులు కొట్టి ఆకట్టుకున్నారు. వన్డేల్లో ఇలా డబుల్ సెంచురీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు శుభమన్ గిల్.

మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఎన్నికల షెడ్యూల్ ఇదే!

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది.  త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మేఘాలయ,నాగాలాండ్‌లలో కూడా ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుందని తెలిపింది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడతాయని తెలిపింది.   నాగాలాండ్ శాసన సభ గడువు మార్చి 12తోనూ, మేఘాలయ అసెంబ్లీ గడువు మార్చి 15తోనూ, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22తోనూ ముగియనున్న సంగతి తెలిసిందే. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్  బుధవారం (జనవరి 18)  మీడియా సమావేశంలో  త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసన సభల ఎన్నికల షెడ్యూలును ప్రకటించారు. ఎన్నికల అక్రమాలపై సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి తెలియజేస్తే తక్షణమే స్పందిస్తామని ఆయన పేర్కొన్నారు. స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరగాలంటే ప్రజా భాగస్వామ్యం తప్పని సరి అని ఆయన పేర్కొన్నారు.

కొత్త బడ్జెట్ పై కోటి ఆశలు .. శతకోటి సందేహాలు!

బడ్జెట్ అనగానే, అందరికీ కామన్ గా ఉండే కోర్కెలు కొన్నుంటాయి. మరో వంక ఎవరి లెక్కలు వారి కుంటాయి.  ఎంత కాదనుకున్నా  ఎవరికివారు నాకేంటి? అని ప్రశ్నించు కుంటారు. అయితే, ఎవరి కోర్కెలు ఎలా ఉన్న సర్కార్ వారి ప్రాధాన్యతలు సర్కార్ వారి కుంటాయి.  చివరకు  మన తెలుగింటి కోడలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ ను ఎంత రుచిగా, శుచిగా సిద్దం చేస్తారో...  ఎంత చక్కగా వండి వార్చి వడ్డిస్తారో... చూడవలసిందే.  తినబోతూ రుచులేందుకు అనుకోవలసిందే. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, ఫిబ్రవరి 1న వరసగా ఐదవ సారి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, 2023- 2024 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు.  గత మూడేళ్ళుగా కొవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. అలాగే  పైపైకి పరుగులు తీసిన ద్రవ్యల్బణం కూడా గడచిన రెండు మూడు నెలలుగా మెల్ల మెల్లగా ఒక్కో మెట్టూ దిగి వస్తోంది.  నిజానిక ,కొవిడ్ అనంతర కాలంలో ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారులకు బడ్జెట్    కసరత్తులో ఎంత  ఒత్తిడి ఎదుర్కున్నారో వేరే చెప్పనక్కరలేదు. అయుతే ఈసారి ఆ ఒత్తిడి కాసింత తగ్గింది. నిధుల కేటాయింపు విషయంలో కొంత మేరకు  వెసులు బాటు కలిగిందని అనుకోవచ్చునని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే అదే సమయంలోప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతున్న నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఎంత మాత్రం అభిలషనీయం కాదని,   ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తునారు కూడా.   అదలా ఉంటే వచ్చేది ఎన్నికల సీజన్ ...  2023లో తొమ్మిది రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతో పాటుగా, 2024 లోక్ సభ ఎన్నికలకు కూడా ఈ బడ్జెట్టే దిక్సూచి.  వచ్చే సంవత్సరం 2024 ఏప్రిల్, మే నెలలలో లోక్ సభ ఎన్నికలు ఉంటాయి కాబట్టి, ఎన్నికలకు ముందు ప్రస్తుత మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే పూర్తి స్థాయి బడ్జెట్  ఇదే కావడంతో ఈ బడ్జెట్  పై అంచనాలు  అధికగానే ఉన్నాయి. అయితే, చివరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  ఎవరి అంచనాలను ఏ మేరకు నెరవేరుస్తారన్నది .. ఫిబ్రవరి 1న గానీ తెలియదు. కానీ, ఎంత కాదన్నా  ఎన్నికల సంవత్సరంలో ప్రజాకర్షక పథకాల విషయంలో ఆర్థిక మంత్రి కట్టుబాట్లను కొంత మేర సడలించుకోక  తప్పదని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.    అయినా ఎప్పటిలానే వడ్డింపులు ఉంటాయా? తాయిలాలు ప్రకటిస్తారా? మధ్య తరగతి ముచ్చట తీరుస్తారా? వేతన జీవులకు పన్నుపోటు నుంచి మరి కొంత ఉపశమనం కల్పిస్తారా? అనే చర్చ అయితే జోరుగానే సాగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వేతన జీవుల ఈసారి బడ్జెట్‌లో పన్ను స్లాబ్‌లలో మరింత సడలింపును ఆశిస్తున్నారు. కొత్త పన్నులు వద్దమ్మా .. అని నిర్మలమ్మను కోరుకుంటున్నారు. కోవిడ్ కాలంలో  ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఇబ్బంది పడుతున్న కార్మికవర్గం ఈసారి మోడీ ప్రభుత్వం పన్ను శ్లాబులలో మినహాయింపు ఇవ్వగలదని ఆశతో ఉన్నారు. కొత్తగా పన్నుల వడ్డన ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచన ప్రాయంగానే అయినా స్పష్టమైన సంకేతమే ఇచ్చారు.  కానీ, శ్లాబులపై ఇంకా స్పష్టత రాలేదు.  రాజకీయంగా ఒత్తిళ్ళు పెరుగతున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం , ప్రస్తుత బడ్జెట్  ఎన్నికల బడ్జెట్  గానే  వండి వారుస్తుందనే ఆశలు మాత్రం మధ్యతరగతి ప్రజల్లో మెండుగా ఉన్నాయి. అందుకే మధ్యతరగతి  ఫిబ్రవరి 1 కోసం ఎదురుచుస్తున్నది. అలాగే, నిరుద్యోగ యువత కొత్త బడ్జెట్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి కల్పన కోసం చేపట్టబోయే కార్యక్రమాలపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపధ్యంలో మధ్య తరగతి ప్రజల జీవనోపాధి అవకాశాలు కల్పనకు బడ్జెట్ దారి చూపుతుందని ఆశిస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య బీమా రంగం పుంజుకుంది. అయితే ఆరోగ్య బీమా విషయంలో ప్రభుత్వం నుంచి నిబంధనలలో కొంత సడలింపు ఉంటుందని అన్నివర్గాల ప్రజలు ఆశిస్తున్నారు. ఆరోగ్య బీమా, జీవిత బీమాలను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని కోరుతున్నారు. ఇలా మధ్య తరగతి కోర్కెల చిట్టా చాలానే వుంది. అయితే నిర్మలమ్మ  ఏమంటారో..  ఎవరిని ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి మరి ..

కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారం.. అదే బీజేపీ లక్ష్యం

ప్రధాని నరేంద్రమోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది జరగనున్న తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నదే ఆ దిశా నిర్దేశం. ఇప్పటికే వరుసగా రెండు సార్లు తన నాయకత్వంలో పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, దేశంలోని మోజారిటీ రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకునే లా విజయవంతంగా వ్యూహాలు పన్నిన మోడీ.. ముచ్చటగా హ్యాట్రిక్ విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహాలను అమలు చేయడమే కాకుండా.. పార్టీ శ్రేణులకు కార్యాచరణ ప్రాణాళికను కూడా ఇచ్చేశారు.   మరో 400 రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో విజయం కోసం పని చేయాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా యువ ఓటర్ల వద్దకు పార్టీ చేరుకోవాలని మోడీ పార్టీ కార్యవర్గ సమావేశాలలో ఉద్బోధించారు.  18-25 ఏళ్ల మధ్య ఉన్న ప్రజలందరినీ పార్టీ రీచ్ అవ్వాలనీ.. యువతను పార్టీ చేరుకోగలిగితే విజయం సులభ సాధ్యమౌతుందని ప్రధాని మోడీ  ప్రభోదించటం వెనుక భారీ స్కెచ్ ఉందంటున్నారు. పరిశీలకులు. దేశంలో యువ జనాభా, యువ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వీరిలో అత్యధికులు ఫస్ట్ టైం ఓటర్లే..కాబట్టి యువతను ఆకట్టుకుంటే ఆ కుటుంబాన్నంతా గంపగుత్తగా ఆకట్టుకున్నట్టేనన్నది మోడీ  ఉద్దేశంగా చెబుతున్నారు. యువతకు రాజకీయాలంటే ఆసక్తి ఉన్నా పెద్దగా పట్టుండదని పైగా చరిత్ర, సమకాలీన పరిస్థితులపై సరైన అవగాహనా ఉండదు కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇందుకు సామాజిక మాధ్యమాన్ని మించిన వేదిక, సాధనం లేదని మోడీ విస్పష్టంగా చెప్పారు. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఎకానమీగా భారత్ ను తీర్చిదిద్దిన ఘనత తమదేనంటూ ప్రజల్లో ఊదరగొట్టడాన్ని బీజేపీ తన అజెండాలో పెట్టుకోవడం వెనుక ఉన్న కారణం కూడా ఇదేనని పరిశీలకులు వివ్లేషిస్తున్నారు. రామ మందిర నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టడం మొదలు.. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 360ని ఉపసంహరించటం వరకూ గత రెండు దఫాలుగా మోడీ సర్కారు చేపట్టిన   నిర్ణయాలను ప్రచారంలోకి తేవాలని డిసైడ్ అయినట్టు మోడీ మాటలను బట్టి అవగతమౌతోంది.   సంతృప్తికరమైన పాలన అన్న నినాదంతో 2024 లోక్ సభ ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోందన్నది వారి విశ్లేషణల సారాంశం. అందుకే మోడీ బీజేపీ ఇప్పుడు కేవలం ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఒక సామాజిక ఉద్యమం అని మోడీ అంటున్నారు.  ప్రత్యర్థుల ఎత్తులను ఆదిలోనే చిత్తులు చేసేలా ఆస్త్రాలను సంధించే పని బీజేపీ ఇప్పటి నుంచే మొదలెట్టేసింది.  దేశ భవిష్యత్తు   గొప్పగా, ఉజ్వలంగా ఉంటుందని భరోసా కలిగేలా, విపక్షాలు అత్యంత బలహీనంగా ఉన్నాయని నమ్మేలా ప్రజలలో ప్రచారాన్ని ఊదరగొట్టేయడమే బీజేపీ తాజా వ్యూహం అని పార్టీ కార్యవర్గ సమావేశంలో మోడీ ప్రసంగాన్ని బట్టి అర్థమౌతుంది.   బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాలు అన్నీ తెలంగాణ బీజేపీని ఆదర్శంగా తీసుకోవాలన్న మోడీ మాటలు తెలంగాణ బీజేపీకి పెద్ద టానిక్ లా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ చేపట్టిన యాత్ర బాగుందని.. దీన్ని మిగతా రాష్ట్రాలు రోల్ మోడల్ గా తీసుకోవాలని మోడీ చెప్పటం మిగతా రాష్ట్రాలపై గట్టి ప్రభావం చూపటం ఖాయం. ఇంత భారీ యాత్రను బండి ఎలా చేపట్టారో అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపాలన్న మోడీ నిర్ణయం దక్షిణాదిలో బీజేపీకి మరింత ఉత్సాహాన్ని, ఊపునూ తీసుకువస్తుందన్నది ఆయన ఉద్దేశం, ఎత్తుగడగా కనిపిస్తోంది. దేశంలో మోడీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రభావమంతంగా ప్రచారం చేసుకోవడంలో పార్టీ సఫలం కాలేదన్నది రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయం.  అందుకే అన్నిరకాల ప్రచార, ప్రసార సాధనాలను గరిష్ఠంగా ఉపయోగించుకునేలా సన్నద్ధం కావాలన్నది మంగళవారం ముగిసిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయంగా చెప్పాలి. కర్నాటక, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుగనున్న ప్రతి అసెంబ్లీ ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే 2024లోక్ సభ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద బండి నడకేనన్నది మోడీ ప్రసంగ సారాంశం.  2023 ఏడాది పార్టీ దృష్ట్యా అత్యంత ముఖ్యమైన సంవత్సరమని పదేపదే నద్దా, మోడీ-షాలు పేర్కొంటుండటం వెనుక ఉన్న కారణం కూడా ఇదే. అలాగే బీజేపీకి  కొరకరాని కొయ్యలుగా మారిన 160 లోక్ సభ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆయా నియోజకవర్గాలలో పాగా వేసేలా  కార్యచరణను చేపట్టాలని మోడీ ఆదేశం. సబ్కా సాథ్ సబ్కా వికాస్ తోపాటు సబ్కా ప్రయాస్ కూడా అవసరం అంటూ మోడీ కొత్త నినాదాన్ని పార్టీకి అందించారు.  ఓబీసీలను మరింత మచ్చిక చేసుకుని, ఎస్సీ, ఎస్టీలను తమ పార్టీ వైపుకు పెద్ద ఎత్తున మళ్లించేలా కమలనాథులు చేస్తున్న కృషి సరిపోదని.. అన్ని రాష్ట్ర శాఖలు మరింత కృషి చేయాలంటూ ఎండ్ టు ఎండ్ ఎన్నికల సిద్ధాంతాన్ని వల్లె వేస్తూ బీజేపీ లీడర్లందరికీ కార్యవర్గ సమావేశం టార్గెట్లు నిర్దేశించింది.  ఈ ఏడాది జరిగే 9 అసెంబ్లీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేస్తే తప్ప వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం అన్న పార్టీ లక్ష్యం సాకారదన్న ఉద్దేశంతో బీజేపీ కార్యవర్గ సమవేశం వేదికగా నిర్ణయించింది. 

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాభవమే.. రఘురామ ఫ్లాష్ సర్వే వెల్లడి

రాష్ట్రంలో ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ ఊహకు అందనంత మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని వైసీపీ రెబల్ ఎంపీ  కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలు టిడిపికి దన్నుగా నిలిచే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయనిరఘురామకృష్ఱం రాజు అన్నారు.   తాను ప్రాంతాల వారిగా ఇటీవల నిర్వహించిన ఫ్లాష్  సర్వేలో తెలుగుదేశం కూటమికి స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని తేట తెల్లమయిందని చెప్పారు. మంగళవారం (జనవరి 17) రచ్చబండ కార్యక్రమంలో  ఆయన ఉత్తరాంధ్ర లో పది నుంచి 12 శాతం టిడిపికి  ఎడ్జ్ ఉంటే, ఉభయగోదావరి జిల్లాలలో అది 14 నుంచి 16 శాతం, కృష్ణా, గుంటూరు జిల్లాలలో 12 నుంచి 14 శాతం, ఒంగోలు నెల్లూరులలో ఎనిమిది నుంచి పది శాతం, అనంతపురం, కర్నూలులలో 10 నుంచి 12 శాతం, కడప చిత్తూరులలో 6 నుంచి 8 శాతం   ఉందని వివరించారు. టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని తాను మొదటి నుంచి చెబుతున్నానని రఘురామకృష్ణం రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వై నాట్ 175 అని  వైసీపీ అధినేత, ఆ పార్టీ నాయకులు ఎంతగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా, వాస్తవం వారికి పూర్తిగా ప్రతికూలత ఉందని స్పష్టమైతోందని పేర్కొన్నారు.   ప్రస్తుత ట్రెండ్ పరిశీలిస్తే వైసీపీకి దారుణమైన పరాభవం తప్పదని అనిపిస్తోందని అన్నారు. గత ఎన్నికలలో వైసీపీ గెలుపునకు దోహదపడిన బాబాయ్ హత్య, కోడి కత్తి కేసులు ఇప్పుడు అధికార పార్టీకి బూమరాంగ్ అవుతాయన్నారు. అప్పుడు వైసీపీ వైఎస్ వివేకా హత్య వెనుక తెలుగుదేశం ఉందని ఆరోపించిందనీ, అలాకే కోడి కత్తి తో తనను హత్య చేయడానికి తెలుగుదేశం ప్రయత్నించిందని చాటుకుని జగన్ సానుభూతి పొందారనీ, ఇప్పుడా రెండు కేసుల వెనుక ఉన్నది ఎవరన్నది స్పష్టంగా తేలిపోవడంతో.. నాడు వైసీపీకి ప్లస్ అయిన ఈ రెండు కేసులూ కూడా మైనస్ అయి ఆ పార్టీ పుట్టి ముంచబోతున్నాయని రఘురామకృష్ణం రాజు అన్నారు.

కుక్కలతో పాము ఫైట్

మామూలుగా వీధికుక్కల ఫైట్ చూస్తూనే ఉంటాం. అయితే ఒక పాముతో వీధికుక్కలు వీరోచితంగా ఫైట్ చేసిన సన్నివేశానికి మాత్రం హైదరాబాద్ మణికొండలోని పంచవటి కాలనీ పార్క్ వేదిక అయ్యింది. నాలా లోంచి బయటకు వచ్చిన పాము పరిసరాలలోని ఇళ్ల వైపు వెడుతుండగా గమనించిన రెండు వీధికుక్కలు దానిని అడ్డగించాయి. ఫైట్ చేశాయి. ఆ ఫైట్ లో పాము కాటుకు గురై ఒక కుక్క చనిపోయింది. అయినా సరే మరో కుక్క దానిని ఇళ్ల వైపు వెళ్ల కుండా అడ్డుకుంది. చివరకు ఆ పామే.. యుద్ధం విరమించి పొదల్లోకి పాక్కుంటూ వెళ్లిపోయింది. ఈ ఫైట్ కు సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. అవి వైరల్ అయ్యాయి. 

నడ్డా సారధ్యంలో సెమీస్ కు రె‘ఢీ’!

నిజానికి ప్రధాని నరేంద్ర మోడీ  హోం మంత్రి అమిత్ షా జోడీ పార్టీ ప్రధాన జోడీగా  పగ్గాలు చేపట్టిన తర్వాత  బీజేపీ రాజకీయాలు పూర్తిగా ఎన్నికల చుట్టూనే తిరుగు తున్నాయి. సమయం సందర్భం ఏదైనా క్రింది స్థాయి సామాన్య కార్యకర్త నుంచి పార్టీ అగ్ర నేతల వరకు ప్రతి ఒక్కరూ ఎన్నికల ఆలోచనలే చేస్తారనేది  అందరికీ తెలిసిన  అందరూ అంగీకరించే వాస్తవం. నిజమే  ఏ రాజకీయ పార్టీకి అయినా అంతిమ లక్ష్యం అధికారం. అందుకోసమే రాజకీయ పార్టీలు ప్రతి అడుగులోనూ ఓట్లు సీట్లు లెక్కలు వేసుకుంటూ ముందుకు  సాగుతుంటాయి.  భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తమది ఎన్నికల యాత్ర కాదని ప్రకటించినా, అల్టిమేట్ గా  ఆయన ఆలోచనలు కార్యరూపం దాల్చాలంటే  అధికారమే శరణ్యమవుతుంది. బీజేపీ విషయంలోనూ అదే జరిగింది. సరే అది అలా ఉంచితే, దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇతర ముఖ్య అంశాలు  దేశం ఎదుర్కుంటున కీలక సమస్యల గురించి ఏ మేరకు చర్చించారో ఏమో కానీ  ప్రధాని నరేంద్ర మోడీ  రెండవ సారి పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన (?) జేపీ నడ్డా ప్రసంగాలు మాత్రం  తెలంగాణ సహా ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే తొమ్మది రాష్ట్రాల రాజకీయాల చుట్టూనే తిరిగాయి.   ముఖ్యంగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక ముగింపు ప్రసంగం చేసిన ప్రధాని మోడీ  ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు కీలకంగా వ్యవహరించాలని  సూచించారు. అంతే కాదు వచ్చే 400 రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై రోడ్డు మ్యాప్ ను నేతల  ముందుంచారు. మరీ ముఖ్యంగా, అన్ని వర్గాలను అక్కున చేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల యువతపై బీజేపీ నేతలు దృష్టిసారించాలని, అందులో విధ్యవంతులైన ముస్లిం యువత కూడా ఉండాలని ప్రధాని మోడీ బీజేపీ నేతలకు సూచించారు. మరో వంక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  ఉపోద్ఘాతాలు, ఉత్ప్రేక్షలు లేకుండా నేరుగా ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి గెలవాలని పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే 9 రాష్ట్రాలకు గానూ తొమ్మిది రాష్ట్రాల్లోనూ బీజేపీ జయకేతనం ఎగరవేయాల్సిందేనని జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఇందులో మినహాయింపులు ఉండవని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్ దృష్ట్యా బీజేపీ ప్రస్థానంలో 2023 చాలా ముఖ్యమైన సంవత్సరమని చెప్పిన నడ్డా, ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో పోరాడి గెలవాలి, ఆపై 2024లో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని స్పష్టం చేశారు.  అయితే అది అనుకున్నంత మాత్రాన అయ్యే పనేనా అంటే అది వేరే విషయం. వేరే చర్చ. కానీ  జాతీయ కార్యవర్గ సమావేశాల వేదిక నుంచి బీజేపీ పార్టీ క్యాడర్కు సప్ష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. దిశా నిర్దేశం చేసింది. అసెంబ్లీ ఎన్నికల గుండా 2024 సార్వత్రిక ఎన్నికల ప్రస్థానానికి శ్రీకారం చుట్టింది.  కాగా ఈ సంవత్సరం ఎన్నికలు జరిగే తొమ్మిది రాష్ట్రాలలో తెలంగాణతో పాటు కర్నాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, త్రిపుర,మేఘాలయా,నాగాలాండ్,మిజోరాం రాష్ట్రాలున్నాయి. ఫిబ్రవరి మార్చిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్‌లో ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత మేలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. నవంబరులో మిజోరం ఎన్నికలు జరగనున్నాయి.  అనంతరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తారు.  2024 మేలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనుండడంతో.. ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్నారు.

వరుణ్ వస్తానన్నా రాహుల్ వద్దంటారా!

తమ్ముడు తమ్ముడే పేకాట,పేకాటే..ఇది అందరికీ తెలిసిన నానుడి. అంటే, అన్నదమ్ముల అనుబంధాలు, రక్త సంబంధాలు వ్యాపార వ్యవహారాలో పని చేయవని చెప్పే సందర్భంలో ఈ నానుడిని వాడుతుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఈ నానుడిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు పార్టీలలో ఉండి ఒకరిపై ఒకరు పోటీ చేయవలసి వచ్చినప్పడు లేదా అన్నదమ్ములు, మంచి మిత్రులు ఒకరిపై ఒకరు పోటీ చేసినప్పుడు, కూడా ఇలాంటి వాఖ్యలే వినిపిస్తుంటాయి. ఇప్పడు అది యాధృచ్ఛికమే కావచ్చును కానీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరుడు ( కజిన్) బీజేపీ ఎంపీ  వరుణ్ గాంధీ (సంజయ్ గాంధీ, మేనకా గాంధీ కుమారుడు) గురించి ఇంచు మించుగా అలాంటి అర్థం వచ్చే వ్యాఖ్యలే చేశారు. నిజానికి, వరుణ్ గాంధీ తండ్రి సంజయ్ గాంధీ ఆకస్మిక అనుమానస్పద మృతి తర్వాత, మేనకా గాంధీ, అత్తింటిని వదిలి వచ్చారు. ఆ తర్వాత, ఆ రెండు  కుటుంబాల మధ్య పెద్దగా సంబంధాలులేవు. గాంధీ నెహ్రూల కుటుంబం నుంచి బయటకు వచ్చిన మేనకా గాంధీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చారు.  బీజేపీలో చేరారు. ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. తల్లి బాటలో వరుణ్ గాంధీ కూడా బీజేపీలో చేరారు.  ఉత్తర ప్రదేశ్ లోని పిలిభిత్ నుంచి వరసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. అయితే చాల కాలంగా ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి.  అయితే, అదెలా ఉన్నా, ఇప్పడు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రవచించే హిందూ జాతీయ వాదానికి వ్యతిరేకంగా  భారత్ జోడో యాత్ర సాగిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ తమ సోదరుడు వరుణ్ గాంధీతో తమ సంబంధాలు అంతవరకే పరిమితమని, రాజకీయంగా ఎవరి దారి వారిదే’ అని స్పష్తం చేశారు.  పంజాబ్ గుండా సాగుతున్నా భారత్ జోడో యాత్రలో భాగంగా  మంగళవారం (జనవరి 17) నిర్వహించిన ప్రెస్ మీట్లో సోదరుడు వరుణ్ గాంధీతో సంబంధాలపై స్పందించారు. తమకు రెండు భిన్నమైన సిద్ధాంతాలు ఉన్నాయని, తమ్ముడు స్వీకరించిన సిద్ధాంతాన్ని తాను అంగీకరించలేనని అన్నారు.  నేను  కావాలంటే వరుణ్ ను కలవగలను, కౌగలించుకోగలను,  కానీ నేను ఆ భావజాలాన్ని అంగీకరించలేను  అని రాహుల్ తేల్చి చెప్పేశారు. వరుణ్ గాంధీ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారని, ఆయన భారత్ జోడో యాత్రలో నడిస్తే అది అతనికి సమస్య కావచ్చని రాహుల్ గాంధీ పరోక్షంగానే అయినా వరుణ్ గాంధీకి కాంగ్రెస్ పార్టీలో చోటు లేదని చెప్పకనే చెప్పారు. అయితే, అందుకు ఆయన భావజాల సంఘర్షణను కారణంగా చూపినా అసలు కారణం వేరే ఉందని అంటారు. సోనియా, మేనక గాంధీల మధ్య మొదటి నుంచి కూడా సత్సంబంధాలు లేవని, అంటారు. అయితే ఆ విషయాన్ని కప్పి పెట్టి రాహుల్ గాంధీ,  తాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్ ) కార్యాలయానికి ఎప్పటికీ వెళ్ళలేనని రాహల్ తెలిపారు. అలా వెళ్లవలసి వస్తే తన తల నరుక్కోవాల్సి వస్తుందన్నారు. తన కుటుంబానికి ఓ సిద్దాంతం ఉందని  ఏదో ఒక సమయంలో, ఇప్పుడు కూడా వరుణ్ దానికి భిన్నమైన దానికి స్వీకరించాడని, తాను ఆ భావజాలాన్ని అంగీకరించలేనని, తమ్ముడు తమ్ముడే పేకాటే  అని చెప్పు కొచ్చారు.

బండి పదవి పదిలం.. ఎన్నిల సారధి ఆయనే

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, మరో రెండేళ్ళ పాటు అదే పదవిలో కొనసాగుతారు. బీజేపీ ఆయన సారధ్యంలోనే తెలంగాణ 2023 అసెంబ్లీ, 2024 లోక్ సభ ఎన్నికలను ఎదుర్కుంటుంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.   మంగళవారం(జనవరి 17)తో ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో  పార్టీ సంస్థాగత మార్పులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, ఈ సంవత్సరం (2023)లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులను మార్చరాదని బీజేపీ జాతీయ కార్యవర్గం  నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ సహా ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ట్రాలలో ప్రస్తుత అధ్యక్షులనే 2024 లోక్ సభ ఎన్నికల వరకు కొనసాగించాలని సూత్రప్రాయంగా బీజేపే జాతీయ కార్యవర్గం నిర్ణయించింది.  దీంతో,ఇంతవరకు సంజయ్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని, ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే ఊహాగానాలకు తెర పడింది. అలాగే, బీజేపీ జాతీయ అధ్యక్షుడిని మారుస్తారనే ఊహాగానలకూ జాతీయ కార్యవర్గం తెర దించింది.  మరో నలుగు రోజుల్లో రెండేళ్ళ పదవీ కాలం ముగుస్తున్న పార్టీ అధ్యక్షుడు జీపీ నడ్డా  పదవీ కాలన్ని మరో రెండేళ్ళు పొడిగించాలని  కార్యవర్గం నిర్ణయించింది. అదలా ఉంటే బండి అధ్యక్ష పదవిలో కొనసాగడం ఖాయమైన నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో జరగనున్న కేంద్ర  మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ నుంచి ఎవరికి స్థానం లభిస్తుందనే విషయంలో కొత్త చర్చ తెరపై కొచ్చింది. రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు ఎంపీలలో పాత కాపులు ఇద్దరికీ పదవులు దక్కాయి. కిషన్ రెడ్డికి కేంద్ర కాబినెట్ లో స్థానం దక్కితే బండి సంజయ్’ పార్టీ అధ్యక్షినిగా కొనసాగుతున్నారు.  కాగా, 2019 ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఆదిలాబాద్  ఎంపీ సోయం బాబు రావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ లో ఒకరికి మంత్రి పదవి దక్క వచ్చని అంటున్నారు. అరవింద్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంలో ఉన్న నేపథ్యంలో గిరిజన ఎంపీ సోయం బాబూ రావును మంత్రి పదవి వరించే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి గత విస్తరణలోనే ఆయన పేరు ప్రముఖంగా వినిపించినా చివరి క్షణంలో వచ్చిన అవకాశం చేజారి పోయింది. సో ..  ఈ సారి బాబూ రావుకు బెర్త్ ఖాయమని అంటున్నారు. అయితే  యూపీ నుంచి రాజ్య సభకు ఎన్నికైన మరో పాతకాపు, డాక్టర్ కే. లక్ష్మణ్ పేరు కూడా తెలంగాణ కోటాలో పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పదవులన్నీ పాత  వారికే ఇస్తే  కొత్తగా వచ్చే వారిలో ఆసక్తి లేకుండా పోతుందని, రావాలనుకునే వారికీ తప్పుడు సంకేతం  వెళుతుందని  అదుకే  గిరిజన ఎంపీ సోయం బాబూ రావుకు మంత్రి పదవి ఖాయమని అంటున్నారు. అలాగే,ఈటల రాజేందర్ కు కీలక పదవి దక్కుతుందని అంటున్నారు. అలాగే, మంత్రివర్గ  విస్తరణ తర్వాత పార్టీలోనూ మరికొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు.

అన్నా .. అందుకో వందనం!

నందమూరి తారక రామా రావు... ఎన్టీఆర్... ఈ పేరుకు ఇక వేరే పరిచయ వాక్యాలు అక్కరలేదు. నందమూరి అనగానే, అన్న ఎన్టీఆర్  అపురూప రూపం కళ్ళ ముందు కదులుతుంది. ఒక సినిమా హీరోగా ఆయన జీవించిన పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహా నటుడు ఎన్టీఆర్. రాముడు. కృష్ణుడు, వెంకన్న దేవుడు ఇలా ప్రతి పౌరాణిక పాత్రకు  సజీవ రూపంగా నిలిచిన మహానటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్. రాముడు ఎలా ఉంటాడంటే, ఆ నాటి  నుంచి ఈ నాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్ లా ఉంటారు, అంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా...  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయంగా జీవించారు. మచ్చలేని మహారాజులా నిష్క్రమించారు. అందుకే ఆయన కన్నుమూసి 27 ఏళ్ళు అయినా ఈ నాటికీ ఆయన్ని తెలుగు గుండె గుర్తుచేసుకుంటోంది.  అవును ఈరోజు ... జనవరి 18, ఎన్టీఆర్ 27 వ వర్ధంతి. ఎన్టీఆర్ సినిమా రంగానికే కాదు, సమాజానికీ సేవలందించారు. ఆరు పదులకు పైగా వెండి తెరను ఏలిన ఎన్టీఆర్, తనను అంతవాడిని చేసిన తెలుగు ప్రజలకు సేవచేసే  పవిత్ర సంకల్పంతో   రాజీకీయ అరంగేట్రం చేశారు.  చరిత్రను సృష్టించారు.  అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదుగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ చిక్కని, సాధ్యం కాని విధంగా చరిత్రను సృష్టించారు.  ఆంధ్రుల ఆత్మగౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీన తెలుగు దేశం జెండాను ఎగరేశారు. “నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ,  నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం” అని ప్రకటించారు. ఆంధ్రుల  అన్నగా అవతారం ఎత్తారు. తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంత వరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా 1993 జనవరి 9, అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి ఎన్టీఆర్ రాజకీయ జీవితం చాలా చిన్నది. నిండా పుష్కర కాలం కూడా లేదు. ఆ స్వల్ప కాలంలోనూ ఆయన అనేక ఆటు పోట్లను ఎదుర్కున్నారు. అయినా రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలనూ ప్రభావితం చేశారు. జాతీయ స్థాయిలో తెలుగు వారి ఆత్మ గౌరవ బావుటాను ఎగరేసిన ఎన్టీఆర్, కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు చెక్  పెట్టి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్  వ్యతిరేక శక్తులను ఏకం చేసి కాంగ్రెస్ తిరోగమానానికి ఆనాడే ఆయన శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు.  అందుకే ఎన్టీఆర్ సారథ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో చిర స్థాయిగా ఒక మెయిలు రాయిలా నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.  అందుకే ఈనాటికీ  జాతీయ స్థాయి నేతలంతా ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు. గౌరవంగా స్మరించుకుంటున్నారు.    మంగళవారం(జనవరి 17) ముగిసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ  తన ప్రసంగంలో ఎన్టీఆర్‌ పేరును ప్రస్తావించారు. ప్రజా క్షేత్రంలో ఎన్టీఆర్ కింది స్థాయిలో పోరాడి అధికారంలోకి వచ్చారని కొనియాడారు. నిత్యం ప్రజలతో మమేకమై ఎన్టీఆర్‌ ముందడుగు వేశారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీని స్థాపించి ఎన్టీఆర్‌ పోరాడిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు. నిజానికి ఒక మోడీ అని కాదు, రాజకీయాలకు అతీతంగా జాతీయ నేతలందరూ ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పిస్తున్నారు. అలాగే ఎన్టీర్ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు అడుగుజాడల్లోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. పథకాల పేర్లు మారవచ్చును కానీ, స్పూర్తి మాత్రం  అదే.  ఎన్టీఅర్ ప్రవేశ పెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం, పేదలకు పక్కా ఇళ్లు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు ఇలా ఎన్నో ఎన్నెన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన మహా నేత ఎన్టీఆర్. అలాగే, పారదర్శక పాలన, ప్రజల వద్ధకే  పాలన వంటి పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. అంతే కాదు, తెలుగుంటి ఆడపడుచులకు పెద్దన్నగా మహిళలకు సమాన ఆస్తి హక్కు వంటి చట్టాలు తెచ్చారు.  నిజానికి  ఆధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్థానంలో ఎన్టీఆర్  ఒక మేలి మలుపుగా నిలుస్తారు. ఎన్టీఅర్ కు ముందు ఒకటి  రెండు కులాలకే పరిమితం అయిన రాజకీయ అధికారాన్ని,అందరికీ చేరువ చేసిన సామాజిక చైతన్య స్పూర్తి ఎన్టీఆర్. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన, బడుగుల అత్మబందువు ఎన్టీఆర్.  అందుకే నిబద్ధత, నిజాయితీ, నిస్వార్ధం, నిర్భీతి ప్రధాన ఆయుధాలుగా సాగిన  ఎన్టీఆర్ అనే మూడక్షరాల రాజకీయ ప్రస్థానం తెలుగుజాతి ఉన్నంతవరకు చిరస్థాయిగా నిలిచి పోతుంది. ఒక మహా నటుడిగా, ఒక మహోన్నత వ్యక్తిగా, ప్రస్వామ్య స్పూర్తి ప్రదాతగా, ఒక పరిపాలన దక్షునిగా, సంస్కరణలకు శ్రీకారం చుట్టిన చరిత్ర పురుషునిగా, పేద ప్రజల ఆరాధ్య దైవంగా...ఇలవేల్పుగా తెలుగు వారి గుండెల్లో కొలువైన విధాతగా ఎన్టీఆర్ శాశ్వతంగా ఉండి పోతారు ఎన్టీఆర్..  అన్నా ..అందుకో వందనం..

మరో ఏడేళ్లలో కేసీఆర్ ప్రరాస?!

తేదీ..17 జనవరి 2029.. ఈ  రోజున ప్రపంచం అంతా గొప్ప హడావుడిగా ఉంది. ఈ రోజు ఉదయమే భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక గొప్ప తీర్మానం చేసింది. భారత ప్రధాని,  భారాస అధినేత,  సిధ్ధాంత కర్త,   కల్వకుంట్ల చంద్రశేఖర‌ రావు మనోభీష్టం మేరకు భారాస పార్టీని అంతర్జాతీయ రాజకీయ పార్టీగా మారుస్తూ భారాస సర్వ సభ్య సమావేశం తీర్మానించింది. హైదరాబాద్ నగరంలోని ప్రధానమంత్రి నివాసం ప్రగతి భవన్లో  జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో సభాధ్యక్షుడు కేసీఆర్ ప్రపంచంలో పరిస్థితులను వివరిస్తూ ప్రసంగించారు.    దేశాలు మధ్య తరచూ గిల్లి కజ్జాలతో ప్రపంచశాంతికి భంగం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే కొనసాగితే సమీప భవిష్యత్ లో ప్రపంచం నాశనం అవుతుందనీ,  ఆ విషయాన్ని పట్టించుకోకుండా అమెరికా, చైనా, రష్యా లాంటి   దేశాలు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయని విమర్శిచారు.    యుధ్ధాలను నివారించవలసిన ఐక్యరాజ్య సమితి ఆచరణలో  విఫలం అయ్యిందని పేర్కొన్న కేసీఆర్.. ఇక ఐరాస కాలం చెల్లిన సంస్థ అని ప్రకటించారు. ఇప్పుడు వినాశనానికి చేరువలో ఉన్న ప్రపంచాన్ని రక్షించాల్సిన బాధ్యత తాను తీసుకుంటున్నారనీ, అందుకే భారత్ రాష్ట్ర సమితి( భారాస)ను ప్రపంచ రాష్ట్ర సమితి (ప్రరాస)గా మారుస్తున్నాననీ కేసీఆర్ ప్రకటించారు. భారత దేశాన్ని కాపాడేందుకు నాడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను భారత రాష్ట్ర సమితి (భారస)గా మార్చినప్పుడు కూడా తనను ఎందరో ఎన్నో రకాలుగా విమర్శించారనీ, ఎద్దేవా చేశారనీ.. కానీ భారాస వల్లనే ఏపీ, తెలంగాణ సహా దేశంలోని రాష్ట్రాల మధ్య వివాదాలు సమసిపోయింది నిజం కాదా? అని ప్రశ్నించారు.  ఇప్పుడు కూడా   ప్రరాస   దేశాల మధ్య వివాదాలు కూడా బ్రహ్మాండంగా పరిష్కారం చేస్తుందన్నారు. ఆ హామీ, పూచీ తనదని వక్కాణించారు.  క్రమంగా అన్ని ముఖ్య దేశాలలోనూ ప్రారాసాను అధికారంలోకి తీసుకురావడం ద్వారా  యుధ్ధాలను నివారించి ప్రపంచ శాంతిని తీసుకువస్తామన్నారు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే భారాస పార్టీని ప్రపంచ రాజ్య సమితిగా మార్చుతూ సభ తీర్మానించాలని ఆర్డర్ లాంటి విజ్ణప్తి చేశారు. సరే ఆ తీర్మానాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత బలపరిచారు. మహారాష్ట్ర గవర్నర్ సంతోష్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హరీష్ రావు కూడా  బలపరచారు. ఆ వెంటనే సభ తీర్మానం ఆమోదించింది. అంతే ఆఘమేఘాల మీద తీర్మానం ఆమోదం పొందిందని ఇక నుంచీ భారాస ప్రరాసా అయిపోయిందని కేసీఆర్ ప్రకటించారు.  త్వరలోనే జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నిలబడబోతున్నాడని ప్రకటించారు. అమెరికా దేశంలో భారతీయులు ఎంతో సంఖ్యా బలం కలిగి ఉన్నారనీ, వారిలో తెలుగు వారు అందునా మన తెలంగాణా వారు అత్యధికులు అనీ అన్నారు. వారంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తే మన పార్టీ వాడు అమెరికా అద్యక్షుడు కావటం తథ్యం. దానిని ఆపే మొనగాడు పుట్టలేదు - పుట్టబోడు అనీ కరతాళధ్వానాల మధ్య  ప్రకటించారు. ఈవార్త వెలువడిన వెంటనే అమెరికాలో భారతీయులలో సంబురాలు అంబరాన్నంటాయి. ఆస్ట్రేలియా నుండీ మరికొన్ని దేశాల నుండీ కూడా తమ దేశాల్లోనూ ప్రరాస తప్పకుండా అధికారం చేపట్టాలని కోరుతూ తీర్మానాలు వెల్లువెత్తాయి. ప్రరాస అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీని అమెరికా అధ్యక్షుడు స్వాగతించారు. మాది ఫ్రీ కంట్రీ అనీ ఎవరైనా పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చన్నారు.  రష్యా ఈవిషయంలో స్పందించటానికి ఆసక్తి చూపలేదు. చైనా స్పందన తెలియరాలేదు. ఐరాస సెక్రటరీ జనరల్ మాత్రం ఐరాస కాలం చేసిందని భారత ప్రధాని కేసీఆర్ అనడాన్ని తప్పుపట్టారు.  ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించే సమయం ఆసన్నం అయినదనీ చంద్రశేఖర రావు తప్ప నేడు ప్రపంచశాంతి సుస్థిరతలను నెలకొల్పగల మహానాయకుడు ఎవరూ ముల్లోకాల్లోనూ లేరని ఐరాసలో భారత ప్రతినిధి ఉద్ఘాటించారు.  ప్రపంచాన్ని ఏలబోయేది మనమే అంటూ హైదరాబాద్ నగరంలో వేలాది పెద్ద పెద్ద కటౌట్లు వెలిసాయి. ప్రధాన రహదారులూ గల్లీలు అన్న తేడా లేకుండా   ర్యాలీలతో హోరెత్తుతున్నాయి.  దునియాకీ నేతా కేసీఆర్ అన్న నినాదంతో   దేశం అంతా మార్మోగింది.  (కేవలం సరదాగా..)

జీవో నంబర్ 1 సస్పెన్షన్ సవాల్ చేస్తూ సుప్రీం కు జగన్ సర్కార్

రాష్ట్రంలో సభలూ సమావేశాలను నిషేధిస్తూ జారీ చేసిన జీవో నంబర్ 1 ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ మేరకు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ సర్కార్ జీవో నంబర్ 1 ను  ఈ నెల 23 వరకూ సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి విదితమే. రాష్ట్రంలో అనుమతి లేకుండా సభలూ, రోడ్ షోలు  నిర్వహించడాన్ని నిషేధిస్తూ జగన్ సర్కార్ జీవో నంబర్ 1 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ జీవోను చూపే కుప్పంలో చంద్రబాబు నాయుడి సభను అడుగడుగునా జగన్ ప్రభుత్వం అడ్డుకుంది. భారీగా పోలీసులను మోహరించి చంద్రబాబు కార్యక్రమానికి జనం రాకుండా అడ్డుకుంది.