రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ లో జోష్.. పాతిక పార్టీలతో ముగింపు సభకు భారీ సన్నాహాలు

రాహుల్ పాదయాత్రకు ముందు వరకూ.. కాదు కాదు రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభమైన తరువాత కూడా ఇటీవలి వరకూ దేశంలో కాంగ్రెస్ పునర్వైభవం తరించుకుంటుందన్న ఆశ ఎవరిలోనూ లేశ మాత్రంగానైనా లేదు. ఆఖరికి కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఆయన యాత్ర ఏదో అద్భుతం చేస్తుందనీ, పార్టీని అధికారంలోకి తీసుకువస్తుందనీ చిన్ప పాటి ఆశ కూడా కనిపించలేదు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ.. దేశంలో అత్యధిక కాలం అధికారంలో కొనసాగిన పార్టీగా మాత్రమే కాంగ్రెస్ ఉనికిని కాపాడుకుంటోందన్న భావనే సర్వత్రా కనిపించింది. అయితే ఎప్పుడైతే రాహుల్ గాంధీ రాజకీయ ప్రయోజనాలను ఆశించకుండా.. దేశంలో ద్వేష భావాన్ని రూపుమాపడానికే ఈ నడక అని ప్రకటించి యాత్ర ప్రారంభించారో అప్పటి నుంచి నెమ్మది నెమ్మదిగా ఆయన యాత్రకు సానుకూలత వ్యక్తం అవ్వడమే కాదు.. కాంగ్రెస్ లోనూ జోష్ పెరుగుతూ వస్తోంది. ఇక రాహుల్ యాత్ర ముగింపు దశకు వచ్చే సరికి బీజేపీయేతర పార్టీలన్నిటికీ.. ఒకటి రెండు మినమా.. అలా మినహా పార్టీలలో సమాజ్ వాదీ పార్టీ, కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయను కోండి అది వేరే సంగతి. సమాజంలోని అన్ని వర్గాలలో కూడా రాహుల్ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన లభించింది. తమిళనాడులోని కన్యా కుమారిలో సెప్టెంబరు 7న తొలి అడుగు పడింది మొదలు, మధ్యలో ఒకటి రెండు చిన్న చిన్న బ్రేకులు తీసుకున్నా,ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుడా, సాఫీగా సాగిపోతోంది. చివరకు, రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్రంలో పాదయాత్ర చేయలన్నా,అవరోధాలు, అరెస్టులు తప్పని, తెలంగాణ రాష్ట్రంలోనూ, ఏపీలోనూ  రాహుల్ గాంధీ యాత్ర మాత్రం ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండానే, రాష్ట్రం దాటేసింది. అలాగని రాహుల్ యాత్ర ఎవరికీ పట్టకుండా, ఎవరినీ పట్టించుకోకుండా సాగుతోందని చెప్పడానికి ఎంత మాత్రం వీల్లేదు. యువత, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పేదలు, నిరుద్యోగులు, మహిళలు, మాజీ బ్యూరోక్రాట్లు ఇలా ఈ వర్గం.. ఆ వర్గం అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు రాహుల్ గాంధీతో అడుగు కదుపుతున్నారు. జోడో యాత్రలో పాల్గొంటున్నారు. ఆయన యాత్ర కొనసాగుతుండగా జరిగిన ఎన్నికలలో పార్టీ పరాజయాన్నే ఎదుర్కొని ఉండొచ్చు. అయితే వాటిని వేటినీ ఇసుమంతైనా పట్టించుకోకుండా రాహుల్ ప్రదర్శించిన స్థితప్రజ్ణత జనతను ఆకట్టుకుంటోంది.  నిజానికి, రాజకీయ నాయకుల పాదయాత్ర అంటే, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండకచో కొద్దిమంది ఇతర రంగాల సెలబ్రిటీలు మాత్రమే పాల్గొంటారు. కానీ, రాహుల్ యాత్రలో రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తల కంటే, సెలబ్రిటీలే ఎక్కువగా పాల్గొంటున్నారా అన్నట్లుగా, యాత్ర చాలా కలర్ ఫుల్’గా సాగుతోంది. సినిమా స్టార్లే కాదు, కాలేజీ అమ్మాయిలు, విద్యార్ధులు, యువకులు, చివరకు చిన్న పిల్లలు కూడా రాహుల్ వెంట నడుస్తున్నారు.   సహజంగా రాజకీయ నాయకుల పాదయాత్రలలో గంభీర ఉపన్యాసాలు, సీరియస్ చర్చలు ఉంటాయి. జెండాలు, స్లొగన్స్ ఉంటాయి. కానీ రాహుల్ గాంధీ యాత్రలో రాజకీయ వాసనలు అంతగా కనిపించడం లేదు. రాహుల్  యాత్ర ఒక పిక్నిక్ లాగా సాగిపోతోందని, పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఆట పాటలు, సెల్ఫీలు, కరచాలనాలు, హగ్గులు, ఆలింగానాలు ఒకటని కాదు, ఒక ప్రత్యేక పంధాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది.  ఈ యాత్ర ఇప్పటికే  ముగింపు దశకు వచ్చేసింది. ఈ నెల 30న ముగియనుంది. పార్టీలో ఉత్సాహాన్ని నింపిన ఈ యాత్ర ముగింపును భారీగా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది, ముగింపు సభ కోసం  దేశంలో భావసారూప్యత కలిగిన 24 పార్టీల అధినేతలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. మాయావతి (బహుజన్ సమాజ్ పార్టీ), మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్ పార్టీ), నితీశ్ కుమార్ (జనతాదళ్ యూనియన్), చంద్రబాబు నాయుడు (తెలుగుదేశం పార్టీ), లాలూ ప్రసాద్ యాదవ్ (రాష్ట్రీయ్ జనతా దళ్), అఖిలేష్ యాదవ్ (సమాజ్‭వాదీ పార్టీ), కమ్యూనిస్ట్ పార్టీలు సహా మరికొన్ని పార్టీలకు స్వాగతం పలికారు. వీరిలో ఎవరు హాజరౌతారు, ఎవరు గైర్హాజరు అవుతారన్నది పక్కన పెడితే.. (ఇప్పటికే మాయావతి కాంగ్రెస్ వైపు చూసేది లేదని ఖరాఖండిగా ప్రకటించేశారు.)   ఈ నెల 30న జరిగే రాహుల్ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి  ఎంత మంది హాజరవుతారన్న విషయంలో ఉత్కంఠ కలిగిస్తోంది. అయితే.. ఎవరు హాజరౌతారు, ఎవరు గైర్హాజరౌతారు అన్నది పక్కన పెడితే.. రాహుల్ పాదయాత్ర.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కు ఇటీవల పదేళ్లలో కాగడాపెట్టి వెతికినా కనిపించని మద్దతును తీసుకు వచ్చింది. ఈ సానుకూలత 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్నది తెలియాలంటే వేచి చూడక తప్పదు.  

సిట్టింగులకు టిక్కెట్లు.. బీఆర్ఎస్ లోప్రకంపనలు

ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్  పక్క పార్టీల నుంచి గోడ దూకిన ఏమ్మేల్యీలు సహా, సిట్టింగు ఎమ్మెల్యేలు అందరికీ మళ్ళీ టిక్కెట్లు ఇస్తామని ఎప్పుడో  చెప్పేశారు. అది కూడా పార్టీ వేదిక నుంచి సభా ముఖంగా  ప్రకటించారు. ముఖ్యమంత్రి అంత ముందుగా ఆ ప్రకటన ఎందుకు చేశారు, ఎందుకు చేయవలసి వచ్చింది, అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన చేసిన ప్రకటన పార్టీలో పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్రకటన నేపధ్యంగానే ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ  ఎంపీ పొంలేటి సుధాకర రెడ్డి అలర్టయ్యారు. ఆత్మీయ సమ్మేళనాలు అంటూ సందడి చేశారు. భారాస ట్రబుల్ షూటర్, మంత్రి హరీష్ రావు దౌత్యంతో తుమ్మల వెనక్కి తగ్గారు కానీ, పొంగులేటి అయితే తగ్గేదేలే’అంటూ ముందుకు దూసుకు పోతున్నారు.  ఖమ్మంలో భారాస ఆవిర్భావ సభ జరిగే రోజు (జనవరి 18)నే ఢిల్లీలో ఆయన బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే ముహూర్తం విషయంలో ఇంకా కొంత సందిగ్దత కొనసాగుతున్నా, పొంగులేటి కారు దిగడం మాత్రం ఖాయమని తేలిపోయింది. ఖమ్మం కథ అలా ఉంటే, వరంగల్’ జిల్లాకు చెందిన భారాస సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి, కడియం శ్రీహారి ఏకంగా ఆత్మగౌరవ నినాదాన్నే ఎత్తుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న ఆయన  వచ్చే ఎన్నికలలో స్టేషన్ ఘనపూర్’ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్, సిట్టిగులకే టికెట్ ప్రకటన చేసినప్పటి నుంచి,  సిట్టింగ్ ఎమ్మెల్ల్యే కడియం  చిరకాల ప్రత్యర్ధి తాటికొండ రాజయ్యల మధ్య ఎప్పటినుంచో సాగుతున్న ప్రత్యన్న యుద్ధం పీక్ కు చేరింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కడియమ నేరుగా కేసీఆర్ నే టార్గెట్ చేశారు. అందుకే ఆయన ఎవరికీ తలవంచను, ఎవరికీ పాదాభివందనాలు చేయనని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి మహబూబాబాద్ పర్యటన సందర్భంగా, రాజయ్య సహా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీలు పడిమరీ ముఖ్యమంత్రికి పాదాభి వందనాలు చేశారు. ఆ సమావేశంలో ఉన్న కడియం మాత్రం తలవంచలేదు. కేసీఆర్ పాదాలకు మొక్కలేదు. ఈ నేపధ్యంలో  కడియం చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.  ఇదలా ఉంటే, కడియం సంచలన వ్యాఖ్యల నేపధ్యంలో  వరంగల్  జిల్లా మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేలలో, ఓ ఇరవై మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను మారిస్తే బీఆర్ఎస్ కు 100 సీట్లు గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. మహబూబాబాద్ జిల్లా  దంతాలపల్లిలో ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సన్నాహక సమావేశంలో మాట్లాడిన మంత్రి దయాకర్ రావు తాను సొంతంగా చేయించిన సర్వే ప్రకారం  వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 90 సీట్లు వస్తాయని.. అయితే 20 మంది సిట్టింగ్ లను మారిస్తే 100 సీట్లు ఖాయమని జోస్యం చెప్పారు. అయితే సిట్టింగ్ లందరికీ సీట్లు ఇస్తామని ఇప్పటికే  సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయినా, కొంతమంది ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనని దయాకర్ రావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. నిజంగా ఎర్రబెల్లి సర్వే చేయించారా? గతంలో ఎప్పుడు లేనిది ఇప్పడు ఆయన స్వయంగా సర్వే ఎందుకు చేయించారు.  కడియం ‘ఆత్మ  గౌరవం’ నినాదం  హాట్ టాపిక్ గా మారిన నేపధ్యంలో అందుకు కౌంటర్’గా ఎర్రబెల్లి సంచలన సర్వే బయట పెట్టారా?, ముఖ్యమంత్రి కేసీఆర్  కడియం ఇష్యూని డైవెర్ట్ చేసేందుకు, నమ్మిన బంటు ఎర్రబెల్లి సర్వేని తెరమీదకు తెచ్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ముఖ్యమంత్రి కేసేఆర్ స్వయంగా, కదిల్చిన తేనెతుట్టె భారసలో ప్రకంపనలు సృష్టిస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ తో టీమ్ ఇండియా క్రికెటర్లు

జూనియర్ ఎన్టీఆర్, క్రికెటర్లు కలిసి సందడి చేశారు.  న్యూజిలాండ్ తో జరగనున్న వన్డే మ్యాచ్ కోసం టీమ్ ఇండియా క్రికెటర్లు  హైదరాబాద్  చేరుకున్నారు. హైదరాబాద్ లో  ఖరీదైన కార్ల కలెక్షన్ తో   మీడియా ద‌ృష్టిని ఆకర్షించిన నజీర్ ఖాన్ నివాసంలో జరిగిన ఒక కార్యక్రమానికి టీమ్ ఇండియా క్రికెటర్లు కొందరు హాజరయ్యారు. నజీర్ ఖాన్ వారికి స్నేహితుడు కావడంతో ఆయన ఆహ్వానం మేరకు క్రికెటర్లు వచ్చారు. అదే కార్యక్రమానికి హీరో ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ సినామాలోని నటనతో ఆబాలగోపాలాన్నీ తన అభిమానులుగా మార్చుకున్న ఎన్టీఆర్ కు టీమ్ ఇండియా క్రికెటర్లు కూడా అభిమానులే కావడంతో వారంతా ఎన్టీఆర్ తో ఫొటోలు దిగారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి.  వరల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఫొటోలను ట్వీట్ చేశారుఎన్టీఆర్ ను కలిసిన వారిలో యుజ్వేంద్ర చహల్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్ తదితరులు ఉన్నారు.  

అలనాటి అందాల తార జినా కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత అందగత్తెగా గుర్తింపు పొందిన అలనాటి అందాల తార జీనా తన 91 ఏళ్ల వయస్సులో కన్నుమూసింది. 50వ, 60వ దశకాలలో ఆమె హాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగింది.  సోలొమన్, షెబా వంటి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా లవ్ అండ్ డ్రీమ్స్ చిత్రంలోని నటనకు గాను అవార్డు పొందింది.  ఇటలీలో జన్మించి సినిమాల ద్వారా విశ్వ విఖ్యాతి పొందిన జీనా లోల్లోబ్రిగిడా రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడా రాణించారు.  1927లో లుజినియాలో జన్మించిన జినా అప్పటిలో అత్యంత ప్రతిభామంతురాలైన యూరోపియన్ నటిగా గుర్తింపు పొందింది. 18వ ఏటనే నటనలో ప్రవేశించిన జినా హాలీవుడ్ లో నాడు  సూపర్ స్టార్ లుగా వెలుగొందుతున్న వారి సరసన కూడా నటించి మెప్పించింది. 

కాళ్లు కడిగి మరీ క్షమాపణ చెప్పిన మధ్య ప్రదేశ్ మంత్రి

ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చూపడంలో విఫలమైతే క్షమాపణలు చెప్పుకునే సంస్కృతి ఇప్పుడు కాగడా వేసినా కనిపించదు. ఇచ్చిన వాగ్దానాలను విస్మరించడం, అదేమని అడిగితే ఆగ్రహించడం.. ఆందోళనకు దిగితే కేసులు నమోదు చేసి జైలుకు తరలించడం ప్రస్తుతం ప్రభుత్వాలకు సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. ప్రజా వాణి వినిపించకుండా అణచివేయడమే పోలీసుల విధి అన్నట్లుగా రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తుండటం కద్దు. ఏపీ విషయాన్నే తీసుకోండి.. ఏపీ సర్కార్ మద్య నిషేధం నుంచి.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల వరకూ అన్నీ కల్పిస్తామనీ, ప్రతి జిల్లాకూ ఓ హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మిస్తామనీ గత ఎన్నికల ముందు వాగ్దానాలు గుప్పించింది. తీరా అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు దాటుతున్నా.. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే విషయంలో మాట్లాడటం లేదు. పైపెచ్చు ఇదేమిటని ప్రశ్నిస్తున్న విపక్షాల నాయకులపై కేసులు నమోదు చేస్తోంది. సభలూ సమావేశాలూ నిర్వహించకోవడానికి వీల్లేదంటూ నిషేధాస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇక ముఖ్యమంత్రి అయితే తన పర్యటన వేల జనం ఎవరూ ఎదురుపడి ప్రశ్నించడానికి వీల్లేకుండా పరదాలు కట్టుకుని మరీ పర్యటనలు కొనసాగిస్తున్నారు. అయితే మధ్య ప్రదేశ్ లో ఒక మంత్రి  రోడ్ల దుస్థితికి తన నిర్లక్ష్యమే కారణమని అంగీకరించారు. ప్రజలకు క్షమాపణ చెప్పారు. అంతే కాదు ఆ అధ్వాన్నంగా ఉన్న రోడ్డుపై బురదలో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని ఆపి ఆ వ్యక్తి కాళ్లను స్వయంగా కడిగారు.   ఈ ఘటన గ్వాలియర్ లో జరిగింది. పైపులైన్ల కోసం రోడ్డును తవ్వి అలాగే వదిలేశారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా అయిన మంత్రి  ప్రధుమన్ సింగ్ తోమర్ ప్రజలకు చేతులు జోడించి క్షమాపణ చెప్పారు. ఆ రోడ్డుపై బురదలో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తి కాళ్లు కడిగి మరీ తక్షణమే మంచినీటి పైపుల కోసం తవ్వి వదిలేసిన రోడ్లను మరమ్మతు చేస్తానని హామీ ఇచ్చారు. రోడ్లు బాగుపడే వరకూ తాను చెప్పులు ధరించనని శపథం చేశారు. వెంటనే రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభం కావడంతో  ఆయన చెప్పులు ధరించడానికి అంగీకరించారు.మధ్య ప్రదేశ్ కే చెందిన కేంద్ర  పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ప్రద్యుమన్ సింగ్ తోమర్ కు కొత్త చెప్పులు అందించారు.  

ఫొటోల పిచ్చితో వందే భారత్ రైల్లో రాజమండ్రి టు విజయవాడ ఫ్రీ ట్రావెల్

ఫొటోల పిచ్చి ఓ వ్యక్తికి చుక్కలు చూపించింది. వందేభారత్ రైలులో తలుపులు మన ఇష్టం వచ్చినప్పుడు తీయడానికి, మూయడానికి అవకాశం ఉండని సంగతి తెలిసిందే కదా? అయితే ఆ విషయాన్ని మరచిపోయిన ఓ వ్యక్తి రాజమండ్రిలో వందే భారత్ రైలు ఎక్కి ఫొటోలు తీసుకుందామనుకున్నాడు. జనం అది ఆగే స్టేషన్లకు తండోపతండాలుగా వస్తున్నారు. అలాగే రాజమండ్రీలో రైలు చూసేందుకు వచ్చిన వ్యక్తి ఆగి ఉన్న రైలే కదా అని లోపలికి ఎక్కి ఫొటోలు తీసుకుందామనుకున్నాడు. అనుకున్నదే తడవు రైలెక్కేశాడు. ఫొటోల హడావుడిలో ఉండగానే రైలు డోర్లు మూసుకున్నాయి. ఆ డోర్ల ఆపరేటింగ్ అంతా  రైలు డ్రైవర్ చేతిలో ఉంటుంది. రైలు ప్లాట్ ఫాం మీద ఆగినప్పుడు వాటిని తెరవడం, రైలు బయలుదేరే ముందు వాటిని మూసి వేయడం అంతా డ్రైవర్ చేతిలో ఉంటుంది. అంటే అందుకు సంబంధించి బటన్ లోకో పైలట్ వద్ద ఉంటుంది. ఆ విషయం తెలియని మనోడు పాపం రైలు కదులుతుండగా దిగేద్దామనుకున్నాడు. తీరా రైలు బయలుదేరడం గమనించి బయటకు వచ్చేద్దామనుకునే సరికి రైలు డోర్లు మూసుకుపోయాయి. అవి మళ్లీ తెరుకుకునేది విజయవాడ స్టేషన్ లోనే. దీంతో ఆ ఫోటోల పిచ్చి యువకుడు విజయవాడ వరకూ రైలులోనే ఉండిపోవలసి వచ్చింది. కాబట్టి ఫొటోల పిచ్చి ఉన్న వారు వందేభారత్ రైలెక్కి   ఫొటోలు తీసుకునే విషయంలో కొంచం ముందు వెనుకలు ఆలోచించాలి మరి

ఏపీలో సంక్రాంతి.. మందు బాబులు ఎంత తాగేశారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో దశల వారీ మద్య నిషేధం ఒక మిధ్య. గత ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తరువాత దశల వారీ మద్య నిషేధం అంటూ ఏపీలో సరి కొత్త మద్యం విధానాన్ని ప్రవేశ పెట్టారు. స్వయంగా ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసేలా ఆ కొత్త విధానాన్ని రూపకల్పన చేసిన జగన్ సర్కార్.. ఇక అక్కడ నుంచీ దశల వారీగా మద్యం అమ్మకాల పెంపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఎక్కడా కనబడిన బ్రాండ్ లను ఏపీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  విక్రయిస్తోంది. ధరలను విపరీతంగా పెంచేసింది. దశలవారీ మద్య నిషేధం అన్న వాగ్దానాన్ని ఆరు నిలువుల గోతిలో పాతేసి రోజు రోజుకూ మద్యం విక్రమాయలను పెంచేస్తోంది. అలు మద్యం అలవాటు మాన్పించడానికి ధరలు పెంచామని చెప్పుకున్న సర్కార్.. మందు బాబుల బలహీనతను సొమ్ము చేసుకోవడమే కాకుండా నాసిరకం బ్రాండ్లతో వారి ఆరోగ్యాలనూ గుల్ల చేస్తోంది. తాజాగా సంక్రాంతి వేళ ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి.   ఈ సంక్రాంతి వేళ రాష్ట్ర సర్కార్ కు మద్యం అమ్మకాల ద్వారా భారీగా లాభాలు వచ్చాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా రోజుల్లో రోజుల్లో ఏకంగా రూ.214 కోట్ల మద్యం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2 .33 లక్షలకుపైగా లిక్కర్, 83 వేలకుపైగా బీర్ కేసులు అమ్ముడుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రూ.27.81 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. అసలు ఏపీలో  జగన్ ఎన్నికల సమయంలో మ‌ద్య నిషేధం అమ‌లు చేస్తామ‌ని హామీ ఇచ్చి మ‌హిళా ఓట్లు దండుకుని ఇప్పుడు ఆ వాగ్దానాన్ని విస్మరించి మద్యపానాన్ని ప్రోత్సహించడమే ప్రభుత్వ విధానం అన్నట్లుగా ఏపీ సర్కార్ ముందుకు సాగుతోంది.  మ‌ద్య నిషేధం అమ‌లు చేయ‌క‌పోవటంపై ప్ర‌జ‌ల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర‌వ్వ‌డంతో వైసీపీ ప్ర‌భుత్వం.. మ‌ద్యం రేట్లు పెంచింది. మ‌ద్యం ధ‌ర‌లు పెంచ‌డం ద్వారా మ‌ద్యం తాగేవారి సంఖ్య త‌గ్గుతుంద‌ని ప్ర‌భుత్వం చెబుతూ వస్తోంది.  మ‌ద్యం తాగేవారి సంఖ్య త‌గ్గ‌డం అటుంచితే.. మ‌ధ్య త‌ర‌గ‌తి, పేద వ‌ర్గాల‌కు చెందిన మందుబాబుల జేబులు గుల్ల‌వుతున్నాయి. అదే సమయంలో కొత్త కొత్త బ్రాండ్ల పేరుతో ఏపీలో సరఫరా చేస్తున్న మద్యంతో ప్రజారోగ్యం కూడా ప్రమాదంలో పడింది.   మాట తప్పం, మడమ తిప్పం అని చెప్పుకొనే జగన్ ఆదాయం కోసం మద్య నిషేధం సంగతి అటుంచి మద్యపాన ప్రోత్సాహం అనే విధానం అమలు చేస్తున్నారనిపించక మానదు.  ఇప్పటికే వచ్చే పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు చేసిన జగన్ మద్యం ధరలు పెంచి మద్యపానం అలవాటును తగ్గిస్తానని చెప్పడం తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేత కోసం అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. 

అయోధ్య రామమందిరం లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు ఉగ్ర కుట్ర

దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడం, కల్లోలం సృష్టించడమే లక్ష్యంగా ఉగ్ర కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు ఉగ్ర సంస్థ రామమందిర విధ్వంసాన్ని లక్ష్యంగా చేసుకుందని చెబుతున్నాయి.  అయోధ్య రామజన్మభూమి వివాదానికి ముగింపు పలుకుతూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు భారతదేశ చరిత్రలో  ఓ కొత్త అధ్యాయాన్ని ఆవిష్కృతం చేసింది. దేశ రాజకీయ, సామాజిక అంశాలపై తీవ్ర ప్రభావం చూపిన శతాబ్ద కాలం నాటి అయోధ్య వివాదానికి సర్వోన్నత న్యాయస్థానం తార్కిక ముగింపు పలికింది హిందువుల మత విశ్వాసాలకు అనుగుణంగా వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి బాటలు వేస్తూ..  ఇటు ముస్లింల కోసం అయోధ్యలోనే ఐదెకరాల భూమిని కేటాయించాలని ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పును అన్ని వర్గాల వారూ ఔదాల్చారు. అయోధ్యలోనూ మందిరం, మసీదులకు అవకాశం కల్పిస్తూ సుప్రీం తీర్పు దేశ భిన్నత్వంలో ఎకత్వానికి నిజమైన అర్ధం చెప్పినట్లైంది. మత సామరస్యం వెల్లివిరిసేలా చేసింది.   సుప్రీంకోర్టు చరిత్రలోనే సుదీర్ఘకాలం విచారణ సాగిన రెండో కేసుగా ఆయోధ్య కేసు గుర్తింపు పొందింది.  అలాగే ఈ తీర్పు సమయంలో న్యాయస్థానం సరికొత్త సంప్రదాయానికి తెరతీసింది. ఏదైనా కేసు తీర్పు వెలువరించేటప్పుడు ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఒక్కొక్కరూ అభిప్రాయాలను వెల్లడిస్తారు. కానీ, దీనికి భిన్నంగా అయోధ్య తీర్పు విషయంలో సుప్రీం వ్యవహరించింది. తీర్పును చదువుతున్నప్పుడు ధర్మాసనంలోని సభ్యులు పేర్లను ప్రస్తావించలేదు. ఎవరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారో చెప్పకుండా చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరిస్తున్నట్టు తెలిపారు. ఇక అయోధ్య వివాదం సమసిపోయిందనుకుంటున్న తరుణంలో రామమందిరం లక్ష్యంగా ఉగ్ర కుట్ర ను నిఘావర్గాలు పసికట్టాయి. అయోధ్య రామమందిరంపై దాడికి పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కుట్ర పన్నిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశంలో మత సామరస్యానికి భంగం కలిగించడమే లక్ష్యంగా ఈ దాడికి కుట్ర పన్నినట్లు పేర్కొన్నాయి. రామమందిరం లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు ప్రణాళికలు రచించినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. రామమందిరాన్ని ధ్వసం చేయడమే లక్ష్యంగా జైషే ఉగ్ర మూకలు నేపాల్ మీదుగా భారత్ లో ప్రవేశించే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అయోధ్యలో, నేపాల్ భారత్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని దేశంలోని కీలక నగరాలు, ప్రదేశాల్లో ఉగ్రదాడులకు అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. అలాగే జీ20 సదస్సు లక్ష్యంగా కూడా ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.  

ఖమ్మం సభతో కేసీఆర్ కు జాతీయ నాయకుడిగా గుర్తింపు వచ్చేసినట్లేనా?

తెరాసను బీఆర్ఎస్ గా మార్చేసి జాతీయ పార్టీ అని ప్రకటించేసి.. తనకు తానుగా జాతీయ నాయకుడినని భావిస్తున్న కేసీఆర్ కు నిజంగా ఆ గుర్తింపు వచ్చిందా? ఓ ముగ్గురు, నలుగురు ఇతర పార్టీల కు చెందిన నాయకులు ఆయనను కలిసినంత మాత్రాన బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయిపోతుందా? ఆయనకు జాతీయ నేతగా గుర్తింపు వచ్చేసిందా? ఆయనను కలిసిన వారంతా తమ నాయకుడిగా కేసీఆర్ ను అంగీకరించేసినట్లేనా? ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జోరుగా జరుగుతున్న చర్చ ఇది. ఎందుకంటే.. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముందు తనను తాను జాతీయ నాయకుడిగా ఆవిష్కరించుకోవడానికీ, గుర్తింపు కోసమూ చేయని ప్రయత్నం లేదు.  ఎక్కని గడప లేదు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక వేరు దారి లేక సొంతంగానే పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాలలోకి దూకేశారు. అంతకు ముందు దాదాపు నాలుగుళ్లు ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశం కోసం అన్ని రకాలుగా ప్రయత్నించారు. సఫలీకృతులు కాలేకపోయారు. చివరాఖరకు   ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను ఎంగేజ్’ చేసుకున్నా  లాభం లేక పోయింది. ప్రాతీయ పార్టీల జాతీయ కూటమి అంటూ దేశం పట్టుకు తిరిగారు. శరద్ పవార్ మొదలు అరవింద్ కేజ్రీవాల్ వరకు, నితీష్ మొదలు అఖిలేష్ వరకు, మమత మొదలు స్టాలిన్ వరకు ఎక్కని  గడప లేదన్నట్లుగా బీజేపీ వ్యతిరేక నేతలందరినీ కలిశారు. అయినా జేడీయు నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి మినహా మరెవ్వరు, కేసీఆర్ తో కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అప్పడు ఇక  చేసేదేం లేక తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)  పేరును భారత రాష్ట్ర సమితి ( భారాస)గా మార్చి, జాతీయ రాజకీయాల్లోకి దూకేశారు.   అయితే, భారాస జాతీయ పార్టీ అని  కేసీఆర్ ఆయన పరివారం ప్రచారం చసుకున్నంత మాత్రన  భారాస జాతీయ పార్టీ కాదు. ఔను నిజమే భారాస ప్రాంతీయ పార్టీ కాదు. కేంద్ర ఎన్నికల సంఘం, తెరాస పేరు మార్పును అంగీకరించిందే కానీ,   జాతీయ పార్టీగా గుర్తించలేదు. నిజానికి  అది కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో పని కూడా కాదు.  దేశంలో తెరాస/ భారాస వంటి ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి. అలాగే, రిజిస్టర్ అయిన పార్టీలు.. కాని పార్టీలు చాలానే ఉన్నాయి. అయితే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందిన పార్టీల సంఖ్య రెండంకెలు కూడా దాటలేదు. గుజరాత్, అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతం వరకు ఓట్లు సాధించి,  ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో కలిపి, మొత్తం తొమ్మిది పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. గతంలో కాంగ్రెస్‌, భాజపా, సీపీఐ, సీపీఎం, బీఎస్సీ, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలకు మాత్రమే జాతీయ పార్టీ హోదా ఉండగా.. 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసి అవసరమైన ఓట్లు, సీట్లు సాధించడం ద్వారా నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) జాతీయ పార్టీ హోదాను పొందింది. ఈ పార్టీకి అంతకముందు మణిపూర్‌, మేఘాలయా, నాగాలాండ్‌లలో గుర్తింపు ఉండగా.. 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించడం ద్వారా 2019 జూన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్‌పీపీకి జాతీయ హోదాను కల్పించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు జాతీయ పార్టీల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక తాజగా ఈ జాబితాలో తొమ్మిదో పార్టీగా ఆప్‌ అర్హత సాధించింది. అందుకే ఇప్పటికీ కేసీఆర్ అంటే ఆయన నాయకత్వం వహిస్తున్న పార్టీ పేరులో భారత్ ఉన్నా జాతీయ మీడియా, జాతీయ నాయకులు ఇప్పటికీ ప్రాంతీయ పార్టీ నాయకుడిగానే గుర్తిస్తున్నారు. అందుకే ఆయన తన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను ఘనంగా నిర్వహించి.. జాతీయ రాజకీయాలో ప్రవేశాన్ని చాటుకోవాలని భావిస్తున్నారు. ఇందు కోసం ఆయన తొలుత ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావించారు. అదే బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ కావాలని.. తద్వారా దేశ రాజధానిలో తన తొలి అడుగు ఘనంగా పడేలా ఉండాలని భావించారు. అయితే తానొకటి తలిస్తే.. అన్నట్లుగా అన్ని ఆప్షన్లనూ కాదనుకుని బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు ఖమ్మం వేదిక చేశారు. ఈ సభకు ఢిల్లీ, కేరళ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, యూపీ మాజీ సీఎంను ఆహ్వానించారు. కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించి వారంతా ఖమ్మం సభకు తరలి వస్తున్నారు. అలా వచ్చిన వారికి ఆయన తాను పునర్నిర్మించిన యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని చూపించనున్నారు.  ఖమ్మం సభకు వామపక్షాల జాతీయ నేతలు సైతం వస్తున్నారు. ఎంత లేదనకుండా దాదాపు వంద మంది ప్రముఖులు వస్తున్నట్లు సమాచారం. వీరందరికీ కేసీఆరే ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారనీ చెబుతున్నారు. దీంతో అనివార్యంగా బీఆర్ఎస్ ఖమ్మం సభకు జాతీయ మీడియా కూడా ప్రాధాన్యత ఇస్తుందని అంటున్నారు. అయితే కొన్ని పార్టీల అధినేతలు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరైనంత మాత్రాన కేసీఆర్ కు జాతీయ నాయకుడిగా గుర్తింపు వచ్చేస్తుందా? బీజేపీ వ్యతిరేక పోరాటంతో తమ నేతగా ఆయా నాయకులు కేసీఆర్ కు  పట్టం కట్టేసినట్లేనా అంటే పరిశీలకులు కాదనే చెబుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. ఖమ్మం సభను కేజ్రీవాల్ అందుక ఒక అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంది. హస్తినలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవడమే కాకుండా, నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించిన ఆప్ సర్కార్.. కేసీఆర్ ను జాతీయ స్థాయిలో నాయకుడిగా అంగీకరించి వెనుక ర్యాలీ అవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా కొనసాగింపు!

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జెపి నద్దానే కొనసాగించే అవకాశాలు ప్రస్ఫుటమౌతున్నాయి. ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ, ఈ ఏడాది 9 రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని,  తిరిగి ఆయననే   అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశాలున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు  , ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ తాత్కాలిక జాతీయ అధ్యక్షుడిగా జెపి నద్దాను కొనసాగనున్నట్లు దాదాపు ఖరారైందని చెబుతున్నారు.   తన సొంత హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ ఓటమి పాలయినందున, నద్దాను అధ్యక్షుడిగా తొలగిస్తారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. అయితే ఇప్పుడు అధ్యక్షుడిని మారిస్తే.. కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున, నడ్డానే కొనసాగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఆ కారణంగానే పార్టీ సభ్యత్వ కార్యక్రమాలు ఈ ఏడాది చేపట్టలేదని అంటున్నాయి. నడ్డా హయాంలో పలు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ,  ఆయన సొంత రాష్ట్రంలో మాత్రం, పార్టీని విజయపథంలో నడిపించడంలో విఫలమయ్యారు. అలాగే సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో పార్టీలో వర్గ విభేదాలను పరిష్కరించడంలో కూడా విఫలమైన నడ్డాను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించే అవకాశాలు లేవని గత కొంత కాలంగా విస్తృతంగా ప్రచారం జరిగింది.   ఒక్క నడ్డానే  కాకుండా  ఏపీ, బిహార్‌, రాజస్థాన్‌, కేరళ, తెలంగాణ రాష్ట్రాలలో కూడా  పార్టీ అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని జరిగిన ప్రచారం కూడా కూడా జరిగింది.  ఏపీ, బిహార్‌, రాజస్థాన్‌కి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.  కేరళ అధ్యక్షుడిపై నిధుల దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో ఆయన మార్పూ ఖాయమని కూడా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ మార్పులేవీ జరగకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.   తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ను మార్చాలన్న డిమాండ్‌, సీనియర్ల నుంచి చాలాకాలం నుంచి వినిపిస్తోంది. ఆ క్రమంలో ఆయ స్థానంలో మాజీ మంత్రి చేరికల కమిటీ ఇన్చార్జి ఈటల రాజేందర్‌ను నియమించి, సంజయ్‌ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకుంటారన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌.. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా, బండి సంజయ్‌ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళతామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కానీ,   అధ్యక్షులను  కానీ మార్చే అవకాశాలు లేవని, పార్టీ వర్గాలు చెబుతున్నాయి . 

ఇదేమి స్నేహం ఇదేమి బంధం !

పెళ్ళయితే అయింది కానీ, కలిసి కాపురం చేసింది లేదు. బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కథ కుడా అలాగే సాగుతోంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరి మూడేళ్ళు దాటింది. కానీ, ఇంతవరకు కలిసి కూర్చున్నది లేదు, మాట్లాడుకున్నది లేదు. ఉమ్మడి పోరాటాలు, ఆందోళనలు అసలే లేవు. నిజానికి, గడచిన మూడేళ్ళ పై చిలుకు కాలంలో  బీజేపీ, జనసేన నాయకులు ఏ స్థాయిలోనూ ఒక్కటంటే ఒక్క ఉమ్మడి కార్యక్రమం నిర్వహించ లేదు. చివరకు, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల సమయంలోనూ, రెండు పార్టీల నాయకులు కలిసి ప్రచారం చేయలేదు. కార్యకర్తల మధ్య సయోధ్య  కనిపించలేదు.  మరోవంక ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా  సహా ఇతర బీజేపీ జాతీయ నాయకులు ఏపీకి  వచ్చి పోతున్నా, మిత్ర పక్షం జనసేన నాయకులను కలిసింది లేదు, వారితో మాట్లాడింది లేదు.కొద్ది నెలల క్రితం బీజేపీ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర పర్యటనకు వచ్చిన సమయంలో జనసేన  నాయకులు తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలనికోరారు. ప్ల కార్డులు పట్టుకుని ప్రదర్శనలు నిర్వహించారు. అయినా  నడ్డా పట్టించుకోలేదు, పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా అభ్యర్ధిగా ప్రకటించకపోవడమే కాదు, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి గంటకు పైగా చేసిన ప్రసంగంలో కనీసం పవన్ కళ్యాణ్ పేరైనా ప్రస్తావించలేదు. పవన్ కళ్యాణ్  ఎప్పుడో సంవత్సరం  క్రితమో ఏమో రోడ్ మ్యాప్ అడిగారు. బీజేపీ స్పందించలేదు. మరోవంక జనసేన ఎక్కడా బీజేపీని మిత్ర పక్షంగా గుర్తించిన దాఖాలు లేవు. కేవలం టీవీ చర్చల్లో చెప్పుకోవడమే కానీ, క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేసింది లేదు. ఎవరి దారిన వారు పోతున్నారు.   బీజేపీ అగ్ర నేతల మనసులో ఏముందో ఆ పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా తెలియదు. మరో వంక ఏపీలో బీజేపీకి నిండా ఒక శాతం ఓటు కూడా లేదు. నాయకులు లేరు. ఉన్న గుప్పెడు మంది నాయకుల మధ్య సయోధ్య లేదు. కొందరు వైసీపీ కొమ్ముకాస్తే మరి కొందరు టీడీపీ కొమ్ము కాస్తారు. అందుకే, పవన్ కళ్యాణ్  బీజేపీతో పొత్తు ఇక చాలను కున్నారో, ఏమో కానీ, టీడీపీతో కలిసి వైసీపీ పాలనకు చరమ గీతం పాడాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ ఇప్పటికి రెండు సార్లు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. రెండవసారి స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరీ రెండున్నర గంటల పాటు వన్ టూ వన్ భేటీ జరిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట పోరాటం చేస్తామని మీడియా ఎదుట ప్రకటించారు. చాలా స్పష్టంగా వైసీపీని ఓడించే లక్ష్యంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని చెప్పారు. నిజానికి ఏపీలో ఓటంటూ ఉందంటే, వైసీపీ, టీడీపీలకు,జనసేన పార్టీలకే వుంది. మిగిలిన పార్టీలకు ఒకటి రెండు శాతం ఓటు కూడాలేదు. సో, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చుస్తానని చెప్పడం టీడీపీతో పొత్తుకు సిద్దమని ప్రకటించడంతో సమానమని వేరే చెప్పనక్కర లేదు.  అయితే, ఇంత జరుగుతున్నా బీజేపీ మాత్రం పవన్ మా మిత్రుడే అంటోంది. పైగా జస్ట్ అలా పవన్ వెళ్ళి చంద్రబాబుని కలిశారంతే అని చెబుతోంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అయితే బీజేపీ జనసేన బంధం కొనసాగుతుంది అని నమ్మ బలుకుతున్నారు.ఏపీలో మా రెండు పార్టీల మధ్యనే పొత్తు ఉంది అని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఎందుకు కలిశారు అంటే కలవడంలో తప్పు లేదు కదా అంటున్నారు. పైగా అంశాల వారీగా రెండు పార్టీల మధ్య అవగాహన కావచ్చు అని కొత్త బంధాన్ని తెర మీదకు తెచ్చారు. నిజమే, బీజేపీ రాష్ట్ర నాయకులకు కేంద్ర నాయకత్వం మనసులో ఏముందో తెలియదు. అందుకే, బీజేపీ రాష్ట్ర నాయకులు ఇలా ... తలాతోకా  లేకుండా మాట్లాడుతున్నారని అంటున్నారు. మరో వంక జనసేన  బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.చివరకు సామాన్య ప్రజలు కూడా పెళ్లి చేసుకున్నతర్వాత చేస్తే పద్దతిగా సంసారం  చేయాలి, లేదంటే విడాకులు తీసుకోవాలి .. అంతే కానీ, అటూ ఇటూ కాకుండా ఉంటామంటే ఎలా? ఇదేమీ స్నేహం ? ఇఎమి బంధం ? అని నవ్వుకుంటున్నారు.

ఆర్వీఎంలకు ఓకే కానీ... తెలుగుదేశం

ఈవీఎంల గురించి ప్ర‌తిప‌క్షాలు ప‌లుమార్లు ఆరోప‌ణ‌లు, అనుమానాల‌ను వ్య‌క్తంచేశాయి. ఆ ఆరోపణలకు సరైన సమాధానం చెప్పకుండానే, ఆ అనుమానాలను నివృత్తి చేయకుండానే   ఎన్నిక‌ల సంఘం ఇప్పుడు మరో లెవెల్ కు ఓటింగ్ ప్రక్రియను తీసుకువెళ్లేందుకు ప్రతిపాదించింది. అదే   రిమోట్ ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మిష‌న్ల (ఆర్వీఎం) విధానాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ముందుగా ఈవీఎంలపై తమ అనుమానాలు నివృత్తి చేయాలనీ, తాము ఈవీఎంలనే వ్యతిరేకిస్తుంటే..ఆర్వీఎం అంటూ కొత్త విధానాన్ని ప్రతిపాదించడమేమిటని నిలదీస్తున్నాయి. ఆర్వీఎంవిధానానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశాయి.   రిమోట్ ఓటింగ్ యంత్రంపై ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిపాద‌న‌ను వ్యతిరేకిస్తామ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు  దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిపాద‌న‌లో స్ప‌ష్ట‌త లేద‌న్న ఆయన కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీలు వ్య‌తిరేకించాల‌ని నిర్ణ‌యించాయ‌ని స్పష్టం చేశారు. అయితే ఆ ప్రతిపాదనను మరింత ముందుకు తీసుకు  వెళ్లిన సీఈసీఆర్వీఎంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. సోమవారంజరిగినఈ కార్యక్రమంలో ఆర్వీఎం పనితీరు గురించి వివరించింది. అలాగే రాజకీయ పార్టీల అభిప్రాయాన్నీ కోరింది.  ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిన ప్రజలకు ఓటు సదుపాయం కల్పించే అంశంపై కూడా చర్చించింది. ఈ కార్యక్రమానికి 8 జాతీయ‌ పార్టీలు,  57 ప్రాంతీయ పార్టీల‌కు చెందిన‌ అధ్య‌క్షులు, జ‌న‌ర‌ల్‌ సెక్ర‌ట‌రీలు   హాజ‌రు కావాల‌ని ఈసీ కోరిన విషయం విదితమే. అలాగే  ఆర్వీఎంల ప‌నితీరుకు సంబంధించి, ఎన్నిక‌ల ప‌ద్ధ‌తిలో మార్పులు, దేశంలోని వ‌ల‌స కూలీల‌ ఓట్ల గురించి త‌మ అభిప్రాయాలను రాత పూర్వ‌కంగా ఈనెల 31లోపు తెలియ‌జేయాల‌ని కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలను కోరింది. కాగా తెలుగుదేశం పార్టీ ఆర్వీఎంలను సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు చెబుతూనే..ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది. రాజకీయ పార్టీలతో విస్తృత చర్చలు జరపకుండానే ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడాన్నితప్పుపట్టింది. విస్తృత చర్చల ద్వారా ఏకాభిప్రాయాన్ని సాధించిన తరువాత మాత్రమేఆర్వీఎం విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ముందుగా డెమో చేసి ఆ తరువాత ఏకాభిప్రాయం సాధించిన మీదటే దీనిని  అమలు చేయాలని పేర్కొంది. ఈ విధానంపై పార్టీలు తమ అభిప్రాయం రాతపూర్వకంగా తెలియజేయడానికి విధించిన డెడ్ లైన్ ను పొడిగించాలన్నారు.  ఏ ఒక్క ఓటరు కూడా ఓటువేసే అవకాశం కోల్పోకూడదని చెబుతున్న ఈసీ  కొత్త విధానాన్ని తీసుకురావడానికి ముందు ఆ విధానంపై ఉన్నఅనుమానాలన్నిటినీ నివృత్తి చేయాలని తెలుగుదేశం పేర్కొంది. ఓటింగ్‌కు దూరంగా ఉంటున్న రమారమి30శాతంమందిలో  వలస వెళ్లిన వారే అత్యధికులని చెబుతున్న ఈసీ దీనిపై శాస్త్రీయ అధ్యయనం చేసిందా అని ప్రవ్నించింది.   తమ పరిశీలన మేరకు  వలస కూలీలు తమ గ్రామాల్లో ఓటు వేస్తున్నారని.. కానీ యువత, పట్టణ, నగర ధనిక వర్గాలే ఓటింగుకు దూరంగా ఉంటున్నాయనీ తెలుగుదేశం వివరించింది. ఈసీ నిర్వహించిన అఖిలపక్షసమావేశానికి తెలుగుదేశం తరఫున సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. 

మెడికల్ మాఫియాగా భద్రాచలం ఆస్పత్రులు.. పద్ధతి మార్చుకోకుంటే శిక్ష తప్పదు.. మావోల హెచ్చరిక

మెడికల్ మాఫియాకు భద్రాచలం ఆస్పత్రులు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. మూడు రాష్ట్రాల సరిహద్దు అయిన భద్రాచలంలో ఆస్పత్రులు సంపాదనే ద్యేయంగా అమయాక గిరిజనులను నిలువునా దోచుకుంటున్నాయి. ఆరోగ్యం బూచిగా చూపి కాసులు దండుకుంటున్నాయి. పద్ధతి మార్చుకోకుంటే ప్రజా కోర్టులో శిక్ష తప్పదు. ఇదీ మావోయిస్టులు భద్రాచలంలో సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్న ఆస్పత్రుల యాజమాన్యాలకు మావోయిస్టులు రాసిన బహిరంగ లేఖ సారాంశం.   మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచలం ఇప్పుడు మెడికల్ మాఫీయాకు  అడ్డాగా మారి కాసుల వర్షం కురిపిస్తోంది.  ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని సంపాదనే ధ్యేయంగా ఆసుపత్రులు పని చేస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని బూచిగా చూపి వారిని భయబ్రాంతులకు గురి చేసి రోగుల రక్తం పిండుకుంటున్నారని  భద్రాచలంకొత్తగూడెం - అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ (బీకే-ఏఎస్ఆర్)  కార్యదర్వి ఆజాద్ పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు.  ఛత్తీస్ఘడ్, ఒడిస్సా, ఆంధ్ర ప్రాంత గిరిజనులు, గిరిజనేతరులతో పాటు స్థానిక తెలంగాణ ప్రాంత ప్రజలను వైద్యంపేరుతో రోజులు తరబడి ఆసుపత్రుల్లో ఉంచి అవసరం లేకున్నా నానా రకాల టెస్టులూ  ల్యాబులు, ఆసుపత్రులు, వైద్యులు జనాన్ని సొమ్ముల కోసం హింసిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు.   ప్రజల ప్రాణాలు ఇప్పడు ఆసుపత్రులకు డబ్బులు కురిపించే వనరులుగా మారిపోయాయని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు.  ప్రజల పాలిట కొందరు వైద్యులు రాక్షసుల్లా తయారయ్యారనీ,  రోగుల రక్తం జలగల్లా పీలుస్తున్నారనీ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆరోగ్య సమస్యలను అలుసుగా టెస్టుల పేర జనంలో భయాన్ని సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో పని చేసే వైద్యులు సైతం   సొంత క్లినిక్కులు ఏర్పాటు చేసుకుని ఎక్కవ సమయం వాటికే కేటాయిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.   ప్రధానంగా మెడికల్ మాఫియాగా మారిన వైద్య వృత్తి ఫార్మ కంపెనీలతో జతకడుతూ తక్కువ ధరకు అమ్మాల్సిన మందులను బ్రాండుల పేర్లతో ఎక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఇక్కడి వైద్యులు మనుషులను కరెన్సీ నోట్లు ముద్ర వేసే యంత్రాల్లా భావిస్తూ నోటికి వచ్చిన టెస్టుల పేర్లు చెప్తూ.. చేతికి వచ్చిన ఖరీదైన మందుల పేర్లు రాస్తూ పేద ప్రజలను రాబందుల్లా పీక్కుతింటున్నారని మావోయిస్టలు విమర్శించారు.   ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు వారి సమయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేటాయించకుండా ఇలానే ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గిరిజన ప్రాంతమైన భద్రాచలం ప్రాంతంలో సంపాదనే ధ్యేయంగా ప్రైవేటు ఆసుపత్రులను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల అమాయకత్వాన్ని అసరా చేసుకొని కోట్లకు పడగెత్తిన వైద్యులు, ల్యాబ్, మెడికల్ షాప్ ల యజమానులు తమ పద్ధతిని మర్చుకోక పోతే ప్రజకొర్టు లో శిక్ష తప్పదని మావోయిస్టులు ఆ లేఖలో హెచ్చరించారు. .

కొడాలి నాని హీరోగా వీవీవినాయక్ దర్శకత్వంలో సినిమా?

 కొడాలి నాని హీరోగా త్వరలో ఒక సినిమా రాబోతోందా? ఆ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడా? ఈ ప్రశ్నలు గుడివాడలో జరిగిన సంక్రాంతి వేడుకలలో వినాయక్ ప్రసంగం కారణంగా పుట్టుకొచ్చాయి.  హిట్ సినిమాల దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన వీవీ వినాయక్ ఇప్పుడు చేతిలో సినిమాలు లేక దాదాపు ఖాళీగా ఉన్నారు. సినిమా ప్రారంభోత్సవాలకు, లేదా తొలి షాట్ దర్శకత్వానికి పరిమితమైపోయారు. సరే పనిలో పనిగా  ఈ మధ్య ఓ సినిమాలో హీరోగా కూడా నటించేస్తున్నారు. ఇలా దర్శకత్వం వినా అన్నీ చేసేస్తున్న వీవీ వినాయక్.. తాజాగా తనే కొడాలి నానికి ఒక ప్రపోజల్ చేశారు. అదేమిటంటే తన దర్శకత్వంలో కొడాలి నాని హీరోగా ఓ సినిమా చేస్తాననీ, అందుకు నాని అంగీకరించాలని. అది కూడా ఎక్కడంటే..గుడివాడలో జరిగిన సంక్రాంతి వేడుకలలో.. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఏటా జరిగే సంక్రాంతి వేడుకలకు ఈ ఏడాది వీవీ వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా కొడాలి నానిపై పొగడ్తల వర్షం కురిపించిన వీవీ వినాయక్.. కొడాలి నాని అంగీకరిస్తే ఆయన హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమని ప్రకటించేశారు. అయితే ఆయన ప్రతిపాదనకు కొడాలి నాని నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. అయితే బూతులే డైలాగులుగా చెప్పే కొడాలి నానిని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు జనం సిద్ధంగా ఉంటారా అన్న అనుమానం కూడా వీవీ వినాయక్ కు రాకపోవడానికి కారణం.. ఆయన వైసీపీలో ఏదో  ఒక గుర్తింపు పొందేందుకు చేస్తున్న ప్రయత్నంగానే చూడాలని వైసీపీ శ్రేణులే జోకులేస్తున్నాయి. ఇటీవలి కాలంలో వీవీ వినాయక్ వైసీసీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నారనే చెప్పాలి. ఇటీవల కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా నియమితుడైన సందర్భంలో కూడా వీవీ వినాయక్ జక్కంపూడి రామ్మోహన రావుపై పొగడ్తల వర్షం కురిపించారు. వైఎస్ హయాంలో జక్కంపూడి రామ్మోహనరావు మంత్రిగా పని చేసిన సంగతి విదితమే. అదే సమయంలో వీవీ వినాయక్ ముఖ్యమంత్రి జగన్ పై కూడా ప్రశంసల వర్షం కురిపించి తన అభిమానాన్ని చాటుకున్నారు. జగన్ ప్రసంగాలు తనలో స్ఫూర్తి నింపాయని కూడా చెప్పుకున్నారు. వైసీపీ ఇటీవలి కాలంలో ఏ రంగంలోనైనా ఏదో పాటి గుర్తింపు ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చేందుకు ఉవ్విళ్లూరుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పొత్తుల విషయంలో క్లారిటీ ఇచ్చేసినప్పటి నుంచీ కాపు సామాజిక వర్గం మద్దతు కోసం వైసీపీ పాకులాట ఎక్కువగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే తన నియోజకవర్గంలో తన ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు కొడాలి నాని వీవీ వినాయక్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని చెబుతున్నారు. అదే సమయంలో సినీ రంగంలో అవకాశాలు తగ్గిపోయిన వినాయక్ కూడా రాజకీయంగా వైసీపీ పంచన చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని అంటున్నారు. 

కమలదళం పల్లె బాట.. బీజేపీ వ్యూహం మార్చిందా?

తెలంగాణలో ఇంతవరకు కొంత దూకుడు ప్రదర్శించిన బీజేపీ, ఇప్పడు వ్యూహం మార్చింది. ఒకటి రెండు చోట్ల భారీ బహిరంగ సభలు నిరహించడం వలన అంతగా ప్రయోజనం ఉండదని పార్టీ నాయకులు గుర్తించారు. అందుకే రూట్ మార్చి  ఉరూరా సభలు , సమావేశాలు, నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, లేదా ఇతర జాతీయ నాయులు, కేంద్ర మంత్రులను ఆహ్వానించి  భారీ బహిరంగ సభలు నిరహించడం వలన, పార్టీకి  కొత్త జోష్ వస్తుంది. అందులో సందేహం లేదు. అయితే, ఓట్ల లెక్కల దగ్గర కొచ్చేసరికి లెక్క మారుతుందని, బీజేపే నాయకత్వం గుర్తించింది. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే విషయం తేలిపోయింది.  అలాగే  కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలోపోయి రోడ్డెక్కిన తర్వాత, ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ బలం మరింత పెరిగిందని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు.  అయితే రాజకీయ వాతావరణం అనుకూలంగా ఉన్నా జాతీయ నాయకుల భుజాల మీద నుంచి ఓటరుకు గురి పెట్టినా  అంతగా ప్రయోజనం ఉండదని అందుకే నేరుగా ఓటరు ఇంటి తలుపు తట్టాలని కమలం పార్టీ నిర్ణయించుకుంది. అలాగని జాతీయ నేతల పర్యటనలు పబ్లిక్ మీటింగ్స్ ఉండవా అంటే, ఉంటాయి, కానీ, ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి, స్థానిక సమస్యలకు జాతీయ పరిష్కారాలపై చర్చించడంపై దృష్టిని కేద్రేకరించాలనే నిర్ణయంతో బీజేపీ కొత్త ప్రణాళికను సిద్డం చేసినట్లు చెపుతున్నారు. ఇపుడు రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా తెలంగాణలో భారాసకు ప్రధాన ప్రత్యామ్నాయం బీజేపీ     అని అంతా  అంగీకరిస్తున్నారు. చివరకు జైరాం రమేష్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా తెలంగాణలో బీజేపీ బలం పెరిగిందని  ఒప్పుకుంటున్నారు.   ఈ నేపధ్యంలో కమల దళం ఇక క్షేత్ర స్థాయిలో బలపడాలన్న ఆలోచనకు వచ్చింది.  అందుకే.. గ్రామ, గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు,  శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల  బలోపేతం వంటి వాటితో  ఇక క్షేత్ర స్థాయి కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని నిర్ణయించింది. ముఖ్య నాయకుల పాదయాత్రలు, బస్సు యాత్రల సంగతి ప్రస్తుతానికి పక్కన పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టి ఏకంగా 11 వేల సభలు, సమావేశాలు నిర్వహంచాలని కమలనాథులు నిర్ణయించారు. అలాగే 119 నియోజక వర్గాలలో  9 వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి 56 బూత్‌ కమిటీలకు ఒక శక్తి కేంద్రం ఉంటుంది.  ప్రతి గ్రామంలో కాషాయ జెండాలు కనిపించేలా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ప్రతి శక్తి కేంద్రానికి ప్రముఖ్‌ను నియమించారు.బూత్‌ స్థాయిలో ఎలక్షన్‌ ఇంజనీరింగ్‌ చేసేందుకు ఈ కమిటీలు ఉపయోగపడతాయి.  ఫిబ్రవరి నుంచి ప్రతి రోజూ ప్రజల కళ్ల ముందు కనిపించేలా విస్తృతంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది.  ఫిబ్రవరిలో ప్రధాని మోడీ, హూంమంత్రి అమిత్‌ షా వంటి అగ్రనేతలు సహా పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. మరో వంక, ఫిబ్రవరిలో సిట్టింగ్, మాజే ఎమ్మెల్యేలతో పాటు, నియోజక వర్గ స్థాయి నేతలు  పెద్ద ఎత్తున పార్టీ చేరతారని బీజేపీ వర్గాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి.  కాగా, ఈరోజు ఢిల్లీ ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో,తెలంగాణ పై ప్రత్యేక చర్చః, తీర్మానాలు ఉంటాయని అంటున్నారు. అదే విధంగా పార్టీ రాష్ట్ర నాయకత్వ మార్పు, కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి మరొకరికి స్థానం కల్పించే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటుగా, 2024 లోక్ సభ  ఎన్నికలో 12 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునే వ్యూహంతో కమల దళం కదులుతోందని అంటున్నారు.అయితే, పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బండి సంజయ్ ని తొలిగించి  ఆ బాధ్యతలను ఈటల రాజేందర్  కు  అప్పగించే విషయంలో మాత్రం పార్టీ అధిష్టానం ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదని విశ్వసనీయంగా తెలుస్తోంది.

ఎర్రగంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిలు సమంజసం కాదు.. సుప్రీం

ఎర్ర గంగిరెడ్డికి ఏపీ హై కోర్టు డిఫాల్ట్ బెయిలు మంజూరు చేయడం సమంజసం కాదని దేశ సర్వోన్నత న్యాయ స్థానం పేర్కొంది. నిందితుడిపై నాన్ బెయిలబుల్ కేసు ఉన్నప్పుడు చార్జిషీట్ దాఖలు కాలేదన్న కారణంతో కేసులోని మెరిట్స్ పరిగణనలోకి తీసుకోకుండా డిఫాల్ట్ బెయిలు మంజూరు చేయడం తగదని సుప్రీం కోర్టు విస్పష్టంగా చెప్పింది. ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిలు రద్దు కాదంటూ ఏపీ హై కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారించిన సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టు నిర్ణయాన్ని తప్పుపట్టింది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగా బెయిల్ అంశంపై మరో సారి విచారణ చేపట్టాలని తెలంగాణ కోర్టుకు సూచిస్తూ.. ఏపీ హై కోర్టు తీర్పుపై తెలంగాణ హై కోర్టులో మరో సారి విచారణ జరపాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పులివెందులలోని తన స్వగృహంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి విదితమే. ఈ కేసులో నిందితుడు ఎర్రి గంగిరెడ్డిని  సీబీఐ గతంలో అరెస్టు చేసింది. ఆ తరువాత గంగిరెడ్డికి కింది కోర్టు బెయిలు మంజూరు చేసింది. చార్జిషీట్ దాఖలు చేయనందున ఎర్ర గంగిరెడ్డికి బెయిలు మంజూరు చేస్తున్నట్లు కింది కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టు తీర్పును తప్పుపడుతూ, ఎర్రగంగిరెడ్డి బెయిలుపై తెలంగాణ  హైకోర్టు మరోసారి విచారించాలనీ, మెరిట్స్ ఆధారంగా తీర్పు ఇవ్వాలని సూచించింది. వైఎస్ వివేకా హత్య కేసును సుప్రీం కోర్టు ఏపీ హై కోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదలీ చేసిన సంగతి విదితే. 

వ్యూహాత్మక వైరమేనా?

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య వైరం వ్యూహాత్మకమేనా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఈ ఎనిమిదిన్నరేళ్ల కాలంలో అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత నుంచి ప్రధాని మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి మోడీ ఇరువురి మధ్యా మైత్రి పలు సందర్భాలలో ప్రస్ఫుటంగా కనిపించిందని చెబుతున్నారు.   ఇప్పుడు కూడా ఉప్పూ నిప్పులా.. కనీసం ఒకరిని ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడనంతగా డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేస్తున్నా.. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన ముచ్చటగా మూడవసారి ఎన్నికల్లో గెలిచి   హ్యాట్రిక్ సాధించేందుకు అనుసరిస్తున్న వ్యూహమే తప్ప మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు. వ్యూహాత్మకంగా  నువ్వు కొట్టి నట్లు చేయి నేడు ఏడ్చినట్లు చేస్తాను అన్నట్లుగానే వీరి తీరు ఉందని చెబుతున్నారు.  ఇద్దరి మధ్య ఏదో భీకర యుద్ధం సాగుతోందనే భ్రమలు కలిపించేందుకు, అటు నుంచి ఇటు నుంచి ఉభయ పార్టీలూ   మాటల తూటాలు సంధించుకుంన్నారని విశ్లేషిస్తున్నారు.  విశ్లేషకుల మాటలు ఎలా ఉన్నా టీపీసీసీ చీఫ్ రెవంత్ కూడా ఇదే అంటున్నారు. ఇరువురూ కలిసి ప్రజలను మోసం చేసి  అటు కేంద్రంలో మోడీ, ఇటు రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న వ్యూహంతో పావులు కదుపుతున్నారని అంటున్నారు.  విజయ దశమి పండగ పూట కేసేఆర్, తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు. కేంద్రంలో ప్రదాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకే కేసేఆర్ ప్రాంతీయ పార్టీ పేరు మార్చి జాతీయ పార్టీగా ప్రకటించుకున్నారు. మోడీ గుజరాత్ మోడల్ కు కేసీఆర్ తెలంగాణ మోడల్  ప్రత్యామ్నాయం అంటున్నారు. అయితే కేసీఆర్ ఈ ఏడాది 9 రాష్ట్రాలకు జరగనున్న   అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పాలిత రాష్ట్రాలపై గురి పెట్టడం లేదు. ఆయన తన దృష్టి మొత్తాన్నీ ఏపీపైనే కేంద్రీకృతం చేశారు. అలాగే గత ఏడాది చివరిలో జరిగిన  గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.  ఇప్పడు కూడా మహారాష్ట్ర, కర్ణాటకలలో పోటీ చేస్తామంటున్నారు కానీ..  తన జాతీయ పార్టీకి అధ్యక్షుడిని నియమించడానికి మాత్రం ముందుగా ఏపీనే ఎన్నుకున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుగుతాయి. అక్కడ ముందస్తు ఎన్నికలు జరుగుతాయని వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకూ అవి ఊహాగానాలు మాత్రమే.   నిజానికి, కేసేఆర్ జాతీయ రాగం ఎత్తుకున్నదే, కేంద్రంలో మళ్ళీ మరో సారి, మోడీని గెలిపించెందుకే  అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  చెబుతున్నది నిజమేనా అన్న అనుమానం కలగడానికి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అనుసరిస్తున్న విధానమే కారణం. అన్నిటికీ మించి ఆయన తెలంగాణలో వేసే ప్రతి అడుగూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీనం చేయడానికే అన్న విధంగా ఉంటోంది.  తమిళ నాడులో కాంగ్రెస్ మిత్ర పక్షంగా అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన డిఎంకే అధినేత, ఆ ర్రాష్ట ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్  ను కలిసి కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రతిపాదన చేశారు.   మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమిలోని, శివసేన, ఎన్సీపీలను కాంగ్రెస్ నుంచివిడదీసే ప్రయత్నం చేశారు. జార్ఖండ్ లోనూ కాంగ్రెస్ తో కలిసున్న ఝార్ఖండ్ ముక్తి మోర్చా ( జేఎంఎం) ను థర్డ్ ఫ్రంట్ కు ఆహ్వానం పలికారు. సరే అవేమీ కార్యరూపం దాల్చలేదనుకోండి.. కానీ ఆ ప్రయత్నం అయితే కేసీఆర్ చేశారు.  అవన్నీ విఫలమైన తరువాత కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేసి కూడా బీజేపీ అధికారంలో ఉన్న  గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్టాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ ఊసే ఎత్తలేదు.  ఇప్పుడు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న కర్ణాటక, మహారాష్ట్రలలో పోటీ చేస్తామంటున్నారు. అక్కడ పోటీ చేస్తే చీలేది బీజేపీ వ్యతిరేక ఓటేననడంలో సందేహం లేదు. అంతవరకు ఎందుకు, గడచిన ఎనిమిది సంవత్సరాలలో  తెలంగాణలోనే కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీ, సిపిఐ, పార్టీలకు చెందిన 40 మందికి పైగా ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను ప్రలోభాలకు గురి చేసి గోడ దూకించిన కేసీఆర్, బీజేపే వైపు మాత్రం కన్నెత్తయినా చూడలేదు.  అందుకే  కేసీఆర్ తెర తీసిన భారతీయ రాష్ట్ర సమితి, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తన పార్టీ మరో సారి అధికారాన్ని పదిల పరుచుకోవడానికేనని విశ్లేషకులు అంటున్నారు. 

గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. మరో వివాదం

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్  కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాల గురించి  ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.  ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక ముఖ్యమంత్రి, గవర్నర్  సంబంధాల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ఉప్పు నిప్పు అంటే బాగుంటుందేమో , ఆ ఇదరి మధ్య మాటలు లేవు. మాట్లాడుకోవడాలు లేవు.  వివాదాలకు మాత్రమే ఉన్నాయి. అధికార పరిధి మొదలు ప్రోటోకాల్ ఉల్లంఘనల  వరకు ఒకటని కాదు రెండు కీలక రాజ్యాంగ వ్యవస్థల నడుమ వివాదాలకు కొదవ లేదు.  అనేక వివాదాల  చుట్టూ దుమారం రేగుతోంది.  ఇప్పటికే అనేక పర్యాయాలు ఇదే విషయంగా చాలా చాలా చర్చ జరిగింది. జరుగుతూనే వుంది. అనివార్యం అయితే తప్ప  ముఖ్యమంత్రి  మంత్రులు మాత్రమే కాదు, సీఎస్, డీజీపీ సహా ఇతర అధికారులు  ఎవరూ..  రాజ్ భవన్ వైపు చూడడమే మానేశారు.  అదలా ఉంటే ఇప్పుడు మరో సారి మరో వివాదం తెరపై కొచ్చింది. ఇటీవల మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  డెలీవరీ కోసం  అడ్మిట్  అయిన  ఇద్దరు మహిళలు  మృతి చెందారు. మరి కొందరు తీవ్ర  అనారోగ్యానికి గురయ్యారు. ఈ దుర్ఘటనపై గవర్నర్ స్పందించారు.  స్పందనలోనే సందేహాలు వ్యక్త పరిచారు. మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో బాలింతల మృతి చెందడంపై  తనకు  అనేక అనుమానాలున్నాయని  గవర్నర్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. రాజ్ భవన్ లో  ఆదివారం (జనవరి 15) నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో గవర్నర్ పాల్గొన్నారు.  ఈ  సందర్భంగా మీడియాతో మాట్లడుతూ మలక్ పేట ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమన్నారు. బాలింతల మరణాలపై  ఓ గైనకాలజిస్ట్ గా తనకు ఎన్నో అనుమానాలు,  ఉన్నాయని అన్నారు. గవర్నర్  గా మాత్రమే కాకుండా ఒక డాక్టర్ గా కొన్ని అనుమానాలున్నాయని అన్నారు. నిజానికి, ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నా కానీ, పండుగ  కారణంగా  వెళ్లలేకపోయానని అన్నారు.  గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించిన విషయాన్ని గవర్నర్ గుర్తు  చేశారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మెరుగుపరచ వలసిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను  మరింతగా  మెరుగు పరచాల్సిన అవసరాన్ని  గవర్నర్ నొక్కి చెప్పారు.  ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. అలాగే  రాష్ట్ర శాసన సభ ఆమోదం తెలిపిన కీలక బిల్లులకు సంబదించి, గవర్నర్ ప్రభుత్వ బిల్లులు పెండింగ్ లో లేవని, తన పరిశీలనలో  ఉన్నాయని    తెలిపారు.   వర్సిటీ నియామకాల బిల్లులో  అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటి నియామకాల బిల్లు వివాదాలతో  ఆలస్యం కారాదన్నదే  తన అభిమతమని గవర్నర్ వివరించారు. ఈ తరహా విధానాలను గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా గవర్నర్ గుర్తు చేశారు.   యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని  గవర్నర్  కోరారు. అయితే సాధారణ పరిస్థితులలో అయితే ఇలాంటి వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యత ఉండక పోవచ్చును కానీ  ఒక్క తెలంగాణలోనే కాకుండా ఇరుగు పొరుగు రాష్త్రాలలోనూ గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు నడుమ దూరం పెరిగిన నేపధ్యంలో, గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీయవచ్చని అంటున్నారు .

బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో పొలిటికల్ క్లారిటీ?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం ఇటీవలి కాలం వరకూ అత్యంత సంక్లిష్టంగా ఉండేది. ఔను అభివృద్ధీ నినాదానికీ.. సంక్షుమం ప్రలోభాలకూ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న భావన ఉండేది. అన్ని ఫ్రీ.. అంతా ఫ్రీ విధానానికీ.. కష్టపడదాం, పని చేద్దాం సంపద పెంచుదాం అన్న విజన్ కూ మధ్య పోటీ అన్న వాతావరణం ఉండేది. అయితే ఇప్పుడు ఒక్క సారిగా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. తెరాస బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని ఏపీ గడ్డపై అడుగుపెట్టడంతో ఇక ఫ్రీ విధానానికి చెల్లు చీటీ పడిపోయింది. నిన్న మొన్నటి వరకూ అభివృద్ధి లేమి, పరిశ్రమలు పరార్ అంటూ ఏపీని చూపి తెలంగాణలో ఓట్లు దండుకున్న తెరాస ఇప్పుడు అదే అభివృద్ధి నినాదంతో ఏపీలో అడుగు పెట్టేసింది. ఏపీలో అడుగు పెట్టడానికి తెరవెనుక రాజకీయం మరేదో ఉందన్న అనుమానాలను పక్కన పెడితే.. ఆత్మగౌరవం, అభివృద్ధి అజెండాను బీఆర్ఎస్ తెరపైకి తీసుకు వచ్చింది. అదే సమయంలో గతంలో అంటే 2014, 2019 ఎన్నికల సమయంలో అప్పట్లో తెరాసగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రాంతాన్ని, ఆంధ్రప్రజలను తూలనాడిన వ్యక్తి ఇప్పుడు ఏపీలో రాజకీయం చేస్తానంటూ ముందుకు రావడంతో.. ఆయనకు చెక్ పెట్టేందుకు ఏపీ జనం సమాయత్తమౌతున్నారు.  బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడి నియామకం తరువాత రాష్ట్రంలో గతంలో ఏపీ లక్ష్యంగా, తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులు టార్గెట్ గా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది.  అంత మాత్రాన  బీఆర్ఎస్ ప్రభావం ఏపీ రాజకీయాలపై ఏ మాత్రం ఉండదా అంటే కచ్చితంగా ఉంటుంది. నిజానికి, ఒక్కఎపీలోనే కాదు దేశంలో ఏ ఒక్క ఒక రాష్ట్రం నుంచి పేరున్న పార్టీలు ,వ్యక్తులు ఎవరు కూడా కేసేఆర్ తో చేతులు కలిపేందుకు, సిద్ధంగా లేరు.  అయినా, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. చిన్నా చితక పార్టీలు, ప్రజాసంఘాలను కూడగట్టి జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.  సో.. బీఆర్ఎస్ ప్రభావం ఏపీ పై అసలే ఉందని చెప్పలేము, కానీ ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది విషయంలో మాత్రం దాదాపు ఏకాభిప్రాయమే వ్యక్తమౌతోంది. ఆయన ఏపీలో నిలదొక్కుకోవడం అంత వీజీ కాదనేదే. అన్నిటికీ మించి బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ.. ఎవరు ఔనన్నా కాదన్నా దెబ్బకొట్టేది.. వైసీపీ ప్రయోజనాలనే అన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.  కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏపీ కొవిడ్ రోగులను సరిహద్దుల వద్దే అడ్డుకున్న కేసేఆర్, అదే సరిహద్దు దాటి ఏపీలో ఎంటర్ అవుతానంటే, ఎలా అనుమతిస్తామని జనం అంటున్నారు? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసేఆర్ ఆంధ్రులను అవమానించిన తీరును ఎలా మరచిపోగలమంటున్నారు? నిన్నగాక మొన్న తెలంగాణ శాసన సభలో ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్ కు  రెడ్ కార్పెట్  వేసి స్వాగతం ఎందుకు పలుకుతారని ప్రశ్నిస్తున్నారు.   కేసీఆర్, నేను మరిపోయాను నమ్మడానికి సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. కేసీఆర్ పట్ల వ్యతిరేకతే ఆయన పార్టీని రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతిస్తున్న వైపీపీపైనా పడక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నిజానికి ప్రాంతీయ వాదం పునాదిగా, రాజకీయంగా ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆయన అవసరాల కోసం    తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని, పక్కన పెట్టి జాతీయ నినాదాన్ని అందుకున్నారు. అందు కోసం  ఆయన దసరా పండగ రోజున తెలంగాణ భవన్ వేదికగా, తెరాస పార్టీ పేరును మార్చారు. భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి అడ్డుగా ఉన్న ‘తెలంగాణ’ అనే పదాన్ని తెసీసి ‘భారతీయ’ అనే పదాన్ని చేర్చారు.   ప్రొఫెసర్ కోదండ రామ్’  చెప్పినట్లుగా తెరాస పేరు మార్పు వెనక ఉన్న మూల సూత్రం మాత్రం తెలంగాణలో అధికారాన్ని, కుటుంబ పాలనను నిలుపుకోవడం. ఇదొక్కటే ఇప్పుడు కేసీఅర్ ముందున్న లక్ష్యం. ఇదొక్కటే ఆయన ముందున్న సవాలు. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకుని 1200 యువకుల బలిదానాల బాటలో అధికార పీఠాన్ని అందుకున్న కేసేఆర్, వారి త్యాగాలన్నిటినీ విస్మరించి, ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నారు. ఈ కొత్త దారికి అడ్డుపడేది ఏదైనా ఉంటే అది తెలంగాణ పదమే అన్న నిర్ణయానికి వచ్చి పార్టీలోని తెలంగాణ పేరును తుడిచేసి భారత్ అని చేర్చారు. ఈ మార్పు  తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను  ఎలా ప్రభావితం చేస్తుంది.  జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే,   ఆంధ్ర ప్రదేశ్  రాజకీయాలను ఏ మేరకుప్రభావితం చేస్తుంది? అంటే.. ఏపీ జనులు మాత్రం బీఆర్ఎస్ కు ఇక్కడ స్థానం లేదని అంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ పార్టీని భుజానికి ఎత్తుకుంటున్న వైకాపాను తిరస్కరించడానికి కూడా జనం సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.