టి బిల్లుకు ప్రణబ్ ఓకే: రేపు రాజ్యసభకు

      తెలంగాణ ముసాయిదా బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. రేపు 12-30 గంటలకు రాజ్యసభలో కేంద్రప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీతో కేంద్రమంత్రులు రాజీవ్ శుక్లా, సుశీల్ కుమార్ షిండే, జైరాం రమేష్, కమల్‌నాథ్‌లు చర్చలు జరుపుతున్నారు. టి. బిల్లుకు బీజేపీ మద్దతు అవసరం అయిన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీతో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి రాజీవ్ శుక్లా చర్చలు జరుపుతున్నారు.   బిల్లు పార్లమెంటుకు రాబోతున్న నేపథ్యంలో బ్రిటిష్ కాలంనాటి విభజించు పాలించు వాసనలు పార్లమెంటులో, రాష్ట్రపతి భవన్ లో కొనసాగుతున్నాయని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్రపతి సంతకం లేకుండా అఖిలపక్షంలో బిల్లు ప్రతులు పెడితే రాష్ట్రపతి ఎందుకు జోక్యం చేసుకోలేదని పయ్యావుల ప్రశ్నించారు. మా ప్రాంత ప్రజల కష్టాల గురించి పట్టించుకోనప్పుడు ఏం చేసేందుకైనా వెనుకాడమని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ బిల్లును అడ్డుకుంటాం: మమతా

      పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పెట్టబోయే తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తాము విభజనకు వ్యతిరేకమని, సమైక్యానికే మద్దతు తెలుపుతామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ను విభజించే తెలంగాణ బిల్లును పార్లమెంటులో అడ్డుకుంటామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రిన్ తెలిపారు. గతంలో వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మమతా బెనర్జీ ని కలిసి సమైక్యానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈరోజు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మమతాతో భేటి అయ్యే అవకాశం వుంది. ఆయన తెలంగాణ తో పాటు ఇతర రాజకీయాలపై మాట్లాడే అవకాశం వుంది.

గవర్నర్ ని కలిసిన ముఖ్యమంత్రి

  ఈ రోజు శాసనసభలో ఆర్ధికమంత్రి ఆనం రామినారాయణ రెడ్డి ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత సభ రేపటికి వాయిదా పడింది. ఆ వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేరుగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ నరసింహన్నికలిసి ఆయనతో దాదాపు అర్ధగంటసేపు సమావేశమయ్యారు. పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టగానే ఆయన రాజీనామా చేయబోతున్నారని ఆయన సన్నిహితులు ఇదివరకే మీడియాకు చెప్పడంతో, బహుశః ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కి అందించేందుకే వెళ్లి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. కానీ, అటువంటిదేమీ లేదని, బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత, ఆయన మర్యాదపూర్వకంగా కలిసారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు మీడియా ఊహాగానాలకు బ్రేకులు వేసే ప్రయత్నాలు చేసారు. ఎప్పుడు ఉల్లాసంగా కనబడే ముఖ్యమంత్రి గవర్నర్ ని కలిసి తిరిగి వెళ్ళేటపుడు చాలా ముభావంగా ఉండటంతో బహుశః ఆయన రాజీనామా లేఖ ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. ఏమయినప్పటికీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా దాదాపు ఖరారు అయిపోయినట్లే కనిపిస్తోంది. ఆయన ఈరోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం.

అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆనం: ముఖ్యాంశాలు

      శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తెలంగాణ నేతల ఆందోళనల మధ్య ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సభలో 2014-15 ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.1,83,129 కోట్లతో 2014-15 వార్షిక బడ్జెట్‌ను మంత్రి ఆనం ప్రతిపాదించారు. వరుసగా నాలుగో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఆనందంగా ఉందని మంత్రి ఆనం తెలిపారు.పరిపాలన పరంగా అత్యుత్తమ రాష్ట్రంగా ఇండియా టుడే అవార్డు లభించిందన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 20,346 కొత్త ఉద్యోగాలు మంజూరు చేశాం. 98,652 ఖాళీలను నేరుగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బడ్జెట్ పై అధ్యయానికి రేపు ఉభయసభలకు సెలవు ఇచ్చారు.   బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు: * ప్రణాళిక వ్యయం : రూ.67,950 కోట్లు * ప్రణాళికేతర వ్యయం :రూ. 1,15,179 కోట్లు * రెవెన్యూ నిధులు అంచనా : రూ. 474 కోట్లు * ద్రవ్యలోటు అంచనా: రూ. 25,402 కోట్లు  

తెలంగాణ ముసాయిదా బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం!

      రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విభజన బిల్లుకు ఆమోద ముద్ర వేసినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర పర్యటనలో వున్న ఆయన వద్దకు కేంద్రం బిల్లు పంపించగా...ఆయన వెంటనే ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. మంగళవారమే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం రంగం సిద్దం చేసినట్లు సమాచారం. అదే విధంగా బిజెపి దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారంలోనే రాష్ట్ర విభజన బిల్లుపై పార్లమెంటు ఆమోద ముద్ర పడే దిశగా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. రాష్ట్ర విభజన బిల్లుకు శుక్రవారం సాయంత్రం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే, దానిని ప్రధాన మంత్రి కార్యాలయం ద్వారా రాష్ట్రపతి కార్యాలయానికి పంపించింది.

ఫిబ్రవరి 12న కిరణ్ రాజీనామా?

  అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా డిల్లీలో ధర్నా చేసినప్పటికీ అది ఆయన అభిప్రాయ ప్రకటనగానే భావిస్తున్నందున ఆయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోనవసరం లేదని పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ చెప్పడం ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి పదవిలో కొనసాగాలనుకొంటే కొనసాగవచ్చని పరోక్షంగా సూచించారు. కానీ అదేసమయంలో, రాష్ట్ర శాసనసభ తిరస్కరించిన బిల్లునే యధాతధంగా పార్లమెంటులో ప్రకటించి, ఆయన కళ్ళను ఆయన వేలుతోనే పొడిచే ప్రయత్నం చేసింది. తామందరం కలిసి బిల్లుని ఇంత తీవ్రంగా వ్యతిరేఖించినా కూడా తమ అధిష్టానం ముందుకే సాగుతుండటంతో, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టిన రోజు (12) నే రాజీనామా చేద్దామని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహితుడయిన లగడపాటి చెప్పారు. మరో కాంగ్రెస్ యంపీ రాయపాటి సాంబశివరావు కూడా ఈ విషయాన్ని దృవీకరించారు. కానీ, ఆ సమయంలో శాసనసభ సమావేశాలు జరుగుతుంటాయి గనుక అవి ముగిసిన తరువాతనే ఆయన గవర్నర్ ను కలిసి తన రాజీనామ పత్రం అందజేసి, శాసనసభ రద్దుకు సిఫారసు చేయవచ్చును. అయితే ఈ విషయం ముందే ఊహించి కాంగ్రెస్ అధిష్టానం ఆయన స్థానంలో వేరే ఎవరినయినా నియమిస్తుందా? లేక రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపుతుందా? అనేది తేలవలసి ఉంటుంది.   ఇంత కాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేసి కొత్త పార్టీ స్థాపిస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ, లగడపాటి తదితరులు ఆయన  రాజీనామా చేయబోతున్నారనే వార్తలను ద్రువీకరిస్తున్న ఈసమయంలో, ముఖ్యమంత్రి సన్నిహితులయిన మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు ఆయన కొత్త పార్టీ స్థాపించకపోవచ్చని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. మరో యంపీ సబ్బంహరి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ కొత్తపార్టీ గురించి చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. ఒకవేళ రాష్ట్రవిభజన జరిగితే ముఖ్యమంత్రి కొత్త పార్టీ స్థాపించవచ్చని, విభజన జరుగకపోయినట్లయితే స్థాపించకపోవచ్చని తను భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కొత్త పార్టీ స్థాపించకపోతే అధిష్టానం దృష్టిలో చులకనయిఅపోయిన తరువాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? కొనసాగదలిస్తే ప్రజలకు ఏమని సంజాయిషీ ఇచ్చుకొంటారు? ఏవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని కోరగలరు?       

శాసనసభ చిట్టచివరి సమావేశాలు

  సోమవారం నుండి నాలుగు రోజులపాటు రాష్ట్ర శాసనసభ ఓట్-ఆన్-అకౌవుంట్ బడ్జెట్ సమావేశాలు జరుగబోతున్నాయి. ఈ సమావేశాలకు ముందు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతుంది. ఆ తరువాత ఆర్ధిక మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి ఓట్-ఆన్-అకౌవుంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెడతారు. మధ్యలో ఒకరోజు విరామం తరువాత 12,13 తేదీలలో సభ మళ్ళీ సమావేశమయ్యి బడ్జెట్ పై చర్చించి, ఆమోదిస్తారు. ఇవే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హయాంలో నిర్వహించబోయే ఆఖరు సమావేశాలు. ఒకవేళ పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందినట్లయితే ఇవే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే చిట్ట చివరి సమావేశాలవుతాయి. మామూలు పరిస్థితుల్లో ఇటువంటప్పుడు శాసనసభ్యులలో, మంత్రులలో చాలా భావోద్వేగం నెలకొని ఉంటుంది. కానీ, రాష్ట్ర విభజన నేపద్యంలో కాంగ్రెస్ నేతలందరూ రెండుగా చీలిపోయిన కారణంగా ఒకరినొకరు ద్వేషించుకొంటూ ఈ తంతు ముగించనున్నారు.   ఇంతకాలం ఒకే కుటుంబంగా మెలిగిన కాంగ్రెస్ వాదులు ఈవిధంగా విడిపోవలసిరావడం నిజమయిన ఏ కాంగ్రెస్ వాదికయినా చాలా బాధ కలిగించక మానదు. అయితే అందుకు వేరేవరినో కాక తమ అధిష్టాన దేవతనే తప్పుపట్టవలసి ఉంటుంది. కాంగ్రెస్ అధిష్టానం పుణ్యమాని ప్రజలే కాదు ఆ పార్టీ నేతలు కూడా రెండుగా విడిపోయారు. కనీసం చివరిసారిగా జరిగే ఈ సమావేశాలలోనయినా సజావుగా సాగుతాయనే నమ్మకం లేదు. సాగితే సంతోషమే.

తెదేపా-బీజేపీ పొత్తుల ప్రకటన ఇక లాంఛనమే

  చంద్రబాబు రాజకీయ దక్షత, జాతీయ స్థాయిలో ఆయనకున్న రాజకీయ పరిచయాలు పార్టీకి ప్రయోజనం కలిగిస్తుందనే బలమయిన నమ్మకం బీజేపీ అధిష్టానానికి ఉన్నందునే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి తెలంగాణా నేతల అభ్యంతరాలు పట్టించుకోకుండా తెదేపాతో పొత్తుకి మొగ్గుచూపుతోంది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్లమెంటులో తెలంగాణా బిల్లుని ఓడించేందుకు అన్నిపార్టీల నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.   తెదేపాతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవాలని బీజేపీ భావిస్తున్నందున, తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చే విషయంలో ఆ పార్టీ వైఖరిలో చాలా స్పష్టమయిన మార్పు కనబడుతోంది. నిన్న దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ ఇరువురూ కలిసి బీజేపీ కార్యాలయానికి వెళ్లి ఆపార్టీ నేత వెంకయ్య నాయుడు కలిసి తెలంగాణా బిల్లుకి మద్దతు కోరినప్పుడు, కాంగ్రెస్ పార్టీ సీమంద్రా ప్రాంతానికి ఏవిధంగా న్యాయం చేయబోతోందని ప్రశ్నించారు. ఈరోజు ఆపార్టీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ, మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తేనే టీ-బిల్లుకి మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వారిరువురి మాటలు మారిన బీజేపీ వైఖరికి అద్దం పడుతున్నాయి. ఇక చంద్రబాబు కూడా ఈ రోజు తన పార్టీ నేతలతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు దాదాపు ఖరారయిందనట్లు చెప్పారు.అందువల్ల ఆ రెండు పార్టీల మధ్య పొత్తుల ప్రకటన ఇక లాంచనప్రాయమేనని చెప్పవచ్చును.

రాహుల్ కోసం ప్రత్యర్ధి మద్దతు కోరుతున్న కాంగ్రెస్

  తెలంగాణా బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడే బీజేపీ అసలు రంగు బయటపడుతుందని దిగ్విజయ్ సింగ్ వ్యాక్యానించారు. అయితే, బిల్లులో ఏముందో కూడా తెలుసుకోకుండా బిల్లుకి మద్దతు ఇస్తామని ఏవిధంగా హామీ ఈయగలమనే బీజేపీ ప్రశ్నకూడా సమంజసమే.   అత్యంత పారదర్శకంగా జరుగవలసిన రాష్ట్ర విభజన వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ముందుగా తన వైఖరి, తన ఆలోచనలు, తన నిర్ణయాలు ప్రకటించకుండా గోప్యత పాటిస్తూ ప్రతిపక్షాల వైఖరి చెప్పమని కోరుతూ వాటిని ఇరుకున బెట్టే ప్రయత్నం చేస్తోంది. అందుకే దేశంలో నేడు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ వ్యవహారంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని మెచ్చుకోలేకపోతున్నాయి. అందుకే నేడు ఆ పార్టీ తన రాజకీయ ప్రత్యర్ధుల గుమ్మం ముందు నిలబడి వారి సాయం అర్ధించవలసి వస్తోంది. స్వంత పార్టీ వారే బిల్లుకి మద్దతు ఈయబోమని చెపుతున్నపుడు తన రాజకీయ ప్రత్యర్దులను కాంగ్రెస్ అధిష్టానం ఏమొహం పెట్టుకొని మద్దతు అడగ గలుగుతోందో దానికే తెలియాలి. రాహుల్ గాంధీని ప్రధానికుర్చీలో కూర్చోబెట్టేందుకు, రాష్ట్రం నుండి అవసరమయిన యంపీ సీట్లు పొందేందుకే రాష్ట్ర విభజనకు పూనుకొన్న కాంగ్రెస్ అధిష్టానం, అందుకు తన రాజకీయ ప్రత్యర్ధి బీజేపీ మద్దతు కోరడం మరీ సిగ్గు చేటు.   చివరికి తన స్వంత పార్టీ నేతలచేతే చ్చీ కొటించుకొంటున్నా దాని వైఖరిలో మార్పు కలగలేదు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో సహా పార్టీ నేతలందరూ డిల్లీలో తన కంటెదురుగా ధర్నా చేసినా దానిని అవమానంగా భావించకపోగా నిర్లజ్జగా సమర్ధించుకోవడం కాంగ్రెస్ అధిష్టానానికే చెల్లు. తన ఈ ఆశయం నెరవేర్చుకోవడం కోసం స్వంత పార్టీ నేతలని, వారి రాజకీయ భవిష్యత్తుని కూడా బలిపెట్టేందుకు సిద్దపడిన కాంగ్రెస్ అధిష్టానం, అసలేమీ జరగనట్లుగా సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు బిల్లుకి మద్దతు ఇస్తారని భావిస్తున్నానని దిగ్విజయ్ సింగ్ పలకడం సిగ్గుచేటు.   కాంగ్రెస్ స్వయంకృతాపరాధం వలన నేడు ఆ పార్టీ నేతలు ప్రజల ముందు తలెత్తుకొని తిరుగలేకపోతున్నారు. ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి సాహసించడం లేదు. చెట్టుకొకరు, పుట్టకొకరు చొప్పున సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెల్లాచెదురయిపోతున్నా కూడా కాంగ్రెస్ అధిష్టానం తన ఆశయం మరువలేదు. తన పంతం వీడలేదు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళన్నట్లుగా మొండిగా ముందుకు పోతోంది. వినాశకాలే విపరీత బుద్ది అన్నారు పెద్దలు. అందుకే కాంగ్రెస్ తన స్వంత పార్టీనే పణంగాపెట్టి ఈ విభజన జూదం ఆడుతోంది. తను ఏ అంశంతో కేంద్రంలో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలని భావిస్తోందో, అదే అంశం ఆ పార్టీకి భస్మాసుర హస్తంగా మారబోతోంది.

రేణుకా చౌదరి గోబ్యాక్

      ఢిల్లీలోని ఏపీభవన్ వద్ద ఎంపీ రేణుకా చౌదరికి చేదు అనుభవనం ఎదురైంది. భద్రాచలం డివిజన్, పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపకూడదంటూ ఏపీభవన్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ విద్యార్థి జేఏసీ ధర్నాకు దిగారు. వీరికి ఎంపీ రేణుకాచౌదరి మద్దతు తెలిపేందుకు అక్కడి వెళ్లగా, తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు అభ్యంతరం తెలిపారు. రేణుకాచౌదరి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు, ఉద్యోగుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఉద్యోగులపై రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తర్వాత ఇరువురు శాంతిచడంతో రేణుకాచౌదరి ధర్నాలో బైఠాయించారు. ఈ సందర్భంగా రేణుకాచౌదరి మాట్లాడుతూ భద్రాచలం డివిజన్ తెలంగాణదే అని స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ ఒక్క గ్రామాన్ని ఒదులుకోబోమని రేణుకాచౌదరి తెలిపారు.ఖమ్మం జిల్లాలో భద్రచలానికి ప్రత్యేక స్థానం ఉందని, భద్రాద్రి రాముడి ఆలయాన్ని కాపాడుకోవడం తమ లక్ష్యమని రేణుకా చౌదరి చెప్పారు. రామాలయం ఆస్తులపై తెలంగాణ బిల్లులో స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. విద్యార్థులకు సంఘీభావం తెలపడానికి మాత్రమే తాను వచ్చానని ఆమె స్పష్టం చేశారు.

దేశభద్రతో ఆటలాడుకుంటున్న యూపీఏ

      యూపీఏ, మణీపూర్ ప్రభుత్వాలు దేశ భద్రతో ఆటలాడుకుంటూన్నాయని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం దేశమంతటా పర్యటిస్తున్న నరేంద్ర మోదీ..ఈరోజు మణిపూర్ లోని ఇంఫాల్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఢిల్లీలో అరుణాచల్ విద్యార్థి హత్య దేశానికే సిగ్గు చేటు అని మోదీ వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాని ప్రాతినిత్యం వహిస్తున్నా ఒరిగిందేమీ లేదని, కాంగ్రెస్ వల్లే ఈశాన్య రాష్ట్రాల్లో అవినీతి పెరిగిందని ఆరోపించారు. భారత భూభాగం పొరుగుదేశాలకు ధారాదత్తమైందని మోదీ తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల ఆర్థికాభివృద్ధి కోసం ఏన్డీయే ప్రభుత్వం భారీ ప్యాకేజీ ఇచ్చిందని తెలిపారు. ఇతర ప్రాంతాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్దికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పర్యాటకరంగ అభివృద్దితోనే ఈశాన్య రాష్ట్రాల అభివృద్ది సాధ్యమవుతుందన్నారు. మోదీ బహిరంగ సభకు అభిమానులు, బిజెపి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ముఖ్యమంత్రి చాలా మంచోడు: దిగ్విజయ్ సింగ్

  కాంగ్రెస్ చరిత్రలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లాగ ఇంతవరకు మరే ముఖ్యమంత్రి కూడా తన అధిష్టానం మీద ఇంతగా తిరుగుబాటు చేసి ఉండరు. అదేవిధంగా అధిష్టానం కూడా మరే ముఖ్యమంత్రిని ఇంతగా వెనకేసుకొచ్చిన దాఖలాలు లేవు. పార్టీని వ్యతిరేఖించడం, పార్టీ నిర్ణయాన్నివ్యతిరేఖించడం రెండూ వేర్వేరు అంశాలనే సరికొత్త సిద్దాంతాన్నికాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి కలిసి కనిపెట్టారు. ఆ సిద్ధాంతం ప్రకారం పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖించడం, దానిని తప్పుపట్టడం, తీర్మానాలు చేయడం, డిల్లీలో ధర్నాలు చేయడం అన్నీ కూడా అభిప్రాయ వ్యక్తీకరణ పద్ధులోనే రాసుకోబడుతాయి తప్ప పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన ఖాతాలో నమోదు చేయబడవని ఆ పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఇవ్వాళ మరోమారు స్పష్టం చేసారు. అయితే ఈ సిద్ధాంతం టీ-కాంగ్రెస్ నేతలకి బొత్తిగా అర్ధం కాలేదో లేక అర్ధమయినప్పటికీ అర్ధంకానట్లు నటిస్తూ కిరణ్ కుమార్ రెడ్డిని తప్పుపడుతున్నారో తెలియదు.   దిగ్విజయ్ సింగ్ ఈరోజు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేవలం పార్టీ తీసుకొన్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మాత్రమే వ్యతిరేఖిస్తున్నారు. ఆయన మొదట నుండి సమైక్యవాది గనుకనే తన నిరసనను తెలియజేసేందుకు మొన్న డిల్లీలో ధర్నా చేసారు. మేమే మా పార్టీ సభ్యులందరికీ రాష్ట్ర విభజన అంశంపై నిస్సంకోచంగా మాట్లాడమని, తమ తమ అభిప్రాయాలను చెప్పమని కోరాము. అటువంటప్పుడు తన అభిప్రాయం చెపుతున్న కిరణ్ కుమార్ రెడ్డి, క్రమశిక్షణ ఉల్లంఘించారని భావించలేము. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ అధిష్టానాన్ని కానీ, సోనియాగాంధీని గానీ ఎన్నడూ వ్యతిరేఖించలేదు” అని అన్నారు.   దిగ్విజయ్ సింగ్ చెపుతున్న ప్రకారం చూసినట్లయితే, అధిష్టానం ఆదేశాల ప్రకారమే ముఖ్యమంత్రి నడుచుకొంటున్నారని స్పష్టమవుతోంది. ఆయన అధిష్టానానికి వ్యతిరేఖంగా చేస్తున్నసమైక్య ప్రసంగాలు, విమర్శలు, తీర్మానాలు, ధర్నాలు అన్నీ కూడా అధిష్టానం అనుమతితోనే జరుగుతున్నాయని దిగ్విజయ్ సింగ్ చెప్పకనే చెప్పారు. అందువల్ల ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎటువంటి డోకా లేదని కూడా అర్ధమవుతోంది.   ఆయన డిల్లీలో ధర్నా చేసి పార్టీ పరువు మంట గలిపినందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆయనపై చాలా ఆగ్రహంతో ఉందని, అందువల్ల రాజ్యసభ ఎన్నికల తరువాత ఆయనను ముఖ్యమంత్రి పదవిలో నుండి తప్పిస్తారని మీడియాలో వచ్చిన వార్తలు కూడా నిజం కావని దిగ్విజయ్ తాజాగా ఇచ్చిన సర్టిఫికేట్ దృవీకరిస్తోంది. అందువల్ల కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి తనంతట తాను ఆట డిక్లేర్ చేసేసి తప్పుకొంటే తప్ప ఆయనకి ఇంకా చాలా లాస్ట్ బాల్స్ ఆడుకోవచ్చని థర్డ్ ఎంపైర్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేసారు.   ఇక ఇంతకాలం సమైక్యమంటూ ఊగిపోయిన మంత్రి గంటా శ్రీనివాసరావు కొత్త పార్టీ గురించి ఇప్పుడేమీ ఆలోచన చేయడం లేదని చెప్పడం చూస్తే,కిరణ్ కుమార్ రెడ్డి అందరినీ నిరాశపరుస్తూ కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అయిపోతారా అనే అనుమానం కలుగుతోంది.

కాంగ్రెస్ పార్టీకి విశాఖ ఎమ్మెల్యే ఝలక్

  వైజాగ్ కాంగ్రెస్ యంయల్యే తైనాల విజయకుమార్ పార్టీకి ‘గుడ్ బై’ చెప్పేసి రేపు వై.కాంగ్రెస్ లో చేరిపోతున్నట్లు తాజా సమాచారం. వైకాపాలో చేరేందుకు ఇంతకాలంగా తటపటాయించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరియు ఆయన అనుచరులు రేపు శ్రీకాకుళంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి జగన్ సమక్షంలో వైకాపా తీర్ధం స్వీకరించనున్నారు. వారితోబాటే తైనాల కూడా వైకాపా తీర్ధం పుచ్చుకోబోతున్నారని తాజా సమాచారం. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా మసలిన తైనాల, ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయిన తరువాత, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ యం.యల్యేలతో బాటు ఆయన కూడా సంతకాలు సేకరణ చేశారు. కానీ, ఆ తరువాత జగన్ కాంగ్రెస్ పార్టీ నుండి బయటకి వెళ్లిపోయి వైకాపా స్థాపించినపుడు, వైయస్సార్ అభిమానులు చాలా మంది వైకాపాలోకి వెళ్ళినప్పటికీ తైనాల మాత్రం ఎందుకో ఆ పార్టీలో చేరలేదు. కానీ, నిన్న కేంద్రం రాష్ట్ర విభజన బిల్లుని ఆమోదిస్తున్నట్లు ప్రకటించిన తరువాత, ఇంకా కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉంటే, ఆ పార్టీతో బాటు తను కూడా మునగడం ఖాయమని భయపడ్డారో ఏమో, వెంటనే తను కాంగ్రెస్ వీడి వైకాపాలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ధర్మాన, తైనాల వంటి అనేకమంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తూ వైకాపాలో చేరుతున్నట్లు చెప్పుకోవడం వినడానికి బాగానే ఉంది. కానీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే కూటమికి మద్దతు ఇస్తామని చెపుతున్న వైకాపాలోకి చేరడం చూస్తే, వారు రానున్నఎన్నికలలో గెలవడం కోసమే పార్టీ మారుతున్నారు తప్ప, పార్టీని, దాని నిర్ణయాన్ని వ్యతిరేఖించి కాదని అర్ధమవుతోంది.

రాజ్యసభ ఫలితాలు...అందరూ అనుకున్నట్టే

      రాజ్యసభ ఎన్నికల ఫలితాలు అందరూ అనుకున్నట్టే వచ్చాయి. ఎలాంటి ట్విస్ట్ లు లేవు. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్ధి ఆదాల ప్రభాకర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో ఆరుగురి ఎంపీల ఎంపిక  లాంఛనప్రాయమేనని భావించారు. ఈరోజు జరిగిన ఎన్నికలో  కేవీపీ రామచంద్రరావుకు 46 తొలి ప్రాధాన్యతా ఓట్లు పోలయ్యాయి. అలాగే ఎంఏ ఖాన్ కు 49, తిక్కవరపు సుబ్బరామిరెడ్డికి 46 లెక్కన వచ్చాయి. తెలుగుదేశం అభ్యర్థుల్లో గరికపాటికి 36 ఓట్లు రాగా, సీతా రామలక్ష్మికి 38 ఓట్లు వచ్చాయి. తెరాస అభ్యర్థి కె. కేశవ రావు 26 ఓట్లు వచ్చాయి. తెరాసకు 17 మంది శాసనసభ్యులు ఉండగా, తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు ఆయనకు ఓటేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 248 మంది శాసనసభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైకాపా, బిజెపి, సీపీఎం సభ్యులు ఓటింగ్ కు దూరంగా వున్నారు.

విభజన బిల్లుకు కేబినెట్ ఆమోదం

      రాష్ట్ర విభజనపై ఢిల్లీలో పనులన్నీ వేగంగా జరిగిపోతున్నాయి. ప్రధాని నివాసంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ౦ సమావేశంలో తెలంగాణ బిల్లుపై చర్చించి ఆమోదం తెలిపింది. దాదాపు రెండు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. పోలవరం ముంపు ప్రాంతాలన్ని సీమా౦ధ్రలో కలపాలని కేబినేట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు కోరగా అందుకు కేబినెట్ అంగీకరించలేదు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లును వీలైతే ఈ రాత్రికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపి౦చనున్నారు. సోమవారానికి బిల్లు రాజ్యసభకు చేరేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.

చివరి దశకు చేరుకొన్న విభజన బిల్లు

  సుప్రీంకోర్టు రాష్ట్ర విభజన అంశంలో ఇక జోక్యం చేసుకోదని స్పష్టమయింది గనుక ఇక కేంద్రం కూడా దైర్యంగా ముందుకు సాగవచ్చును. ఈరోజు సాయంత్రం జరగనున్న కేంద్రమంత్రి మండలి సమావేశంలో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టబడుతుంది. సీమాంధ్ర మంత్రుల ఒత్తిడి మేరకు జీ.ఓ.యం. ఆ బిల్లులో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం వంటి సవరణలు ఏమయినా చేసి ఉంటే, వాటిపై ఈ సమావేశంలో మరోమారు చర్చించిన తరువాత, బిల్లుని ఆమోదించి రాష్ట్రపతికి పంపుతారు.   ముఖ్యమంత్రితో సహా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు అనేకమంది ఇచ్చిన విజ్ఞప్తులను, చేసిన అభ్యర్ధనలను ఆయన పరిగణనలోకి తీసుకోనేమాటయితే బిల్లుకి మళ్ళీ ఆటంకం ఏర్పడవచ్చును. కానీ, ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు కలుగజేసుకోబోదని తేల్చిచెప్పినందున, బహుశః ఆయన కూడా తన వద్దకు వచ్చిన బిల్లుని యధాతధంగా ఆమోదించి పంపే అవకాశం ఉంది.   ఆ దశ దాటిపోయినట్లయితే, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడానికి తగిన మద్దతు కూడగట్టవలసి ఉంటుంది. ఒకవేళ బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఈ వ్యవహారంలో తమ చేతికి మసి అంటకుండా తప్పుకోదలిస్తే, ఓటింగ్ సమయంలో సభ సజావుగా నడవడం లేదనే వంకతోనో లేకపోతే మరొక కుంటి సాకు చెప్పో వాకవుట్ చేసి సభనుండి బయటపడినట్లయితే, కాంగ్రెస్ అధిష్టానం ఉభయ సభలలో తనకున్న బలంతో ఆ గందరగోళం నడుమే రాష్ట్ర విభజన బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదింపజేయవచ్చును.   కానీ, హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తే మాత్రం తెలంగాణావాదులు కూడా సభలో బిల్లుని తీవ్రంగా వ్యతిరేఖించవచ్చును. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదింపజేసేందుకు సిద్దపడినట్లయితే, ఎలాగు సీమాంధ్రలో ఇప్పటికే తీవ్ర వ్యతిరేఖత మూటగట్టుకొంది గనుక, హైదరాబాద్-కేంద్రపాలిత ప్రాంతం ప్రతిపాదనను కూడా బుట్ట దాఖలు చేయడం వలన పార్టీకి సీమాంధ్రలో కొత్తగా జరిగే నష్టం ఏమీ ఉండదు గనుక అలా చేసినా ఆశ్చర్యం లేదు.

సమైక్యవాదులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

  రాష్ట్ర విభజన బిల్లుకి వ్యతిరేఖంగా పయ్యావుల కేశవ్ తదితరులు తొమ్మిది మంది వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది. జస్టిస్ దత్తు, జస్టిస్ బాబ్డేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పిటిషనర్ల తరపున వాదించిన సీనియర్ న్యాయవాదులు నారిమన్ మరియు మోహన్ లాల్ శర్మల వాదనలు విన్న తరువాత తీర్పు వెలువరిస్తూ “ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అంశంలో కోర్టు కలుగజేసుకోలేదని తేల్చి చెప్పారు.పిటిషనర్లు తరపున వాదించిన న్యాయవాదులు, కేంద్రం ఆర్టికల్ మూడుని దుర్వినియోగం చేస్తోందని అందువల్ల విభజన ప్రక్రియను వెంటనే నిలిపివేయమని ఆదేశించాలని కోరినప్పటికీ కోర్టు వారి అభ్యర్ధనను మన్నించలేదు. రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా ఇదివరకు వారు చేసిన వాదనలకు, ఇప్పుడు వారు చేస్తున్న వాదనలకు పెద్ద తేడా లేదని, అందువల్ల ఈవిషయంలో కోర్టు కలుగజేసుకోలేదని తేల్చి చెప్పింది. అంతేగాక వారు లేవనెత్తిన మరో అంశం-కేంద్రం పంపిన విభజన బిల్లుని రాష్ట్ర శాసనసభ తిరస్కరించింది గనుక దానిపై కోర్టు తన అభిప్రాయం తెలిపి స్పష్టత ఇవ్వాలని వారి అభ్యర్ధనను కూడా కోర్టు పట్టించుకోలేదు.

దగ్గుబాటి ఓటేందుకు వేయలేదు

  కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఈరోజు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలలో పార్టీ నిలబెట్టిన అభ్యర్దులెవరికీ ఓటేయకుండా తిరస్కరించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేఖంగా తమ పార్టీ రాష్ట్ర విభజన చేస్తున్నందుకు నిరసనగానే తాను పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులకు ఓటు వేయకుండా తిరస్కరించి తన నిరసన వ్యక్తం చేసానని తెలిపారు. ఆయన ఈవిధంగా ప్రజాస్వామ్యబద్దంగా తనకున్న హక్కుని వినియోగించుకొని నిరసన తెలపడం అభినందనీయం.   రాష్ట్రాన్నిసమైఖ్యంగా ఉంచాలని కోరుతూ సీమాంధ్ర నేతలందరూ పార్టీపై పోరాటం చేస్తూనే, రాజ్యసభ టికెట్స్ కోసం అర్రులు చాచడం, తిరుగుబాటు అభ్యర్ధుల కారణంగా ఎన్నికలలో ఓడిపోతామేనని విలపించడం, ఆ తరువాత ముఖ్యమంత్రితో సహా అందరూ కలిసి తాము ఏ అధిష్టానానికి వ్యతిరేఖంగా పోరాడుతున్నారో ఆ అధిష్టానం నిలబెట్టిన అభ్యర్ధులని గెలిపించుకోవడం కోసమే, సమైక్యవాదుల తరపున పోటీలో నిలబడిన తిరుగుబాటు అభ్యర్ధి చైతన్యరాజుని అప్రదిష్ట పాలుచేసి, చివరికి పోటీలో నుండి బలవంతంగా విరమింపజేయడం అందరం కళ్ళారా చూసాము. కానీ, దగ్గుబాటి వెంకటేశ్వర రావు మాత్రం, నిర్భీతిగా, నిర్ద్వందంగా పార్టీ నిలబెట్టిన అభ్యర్ధులను తిరస్కరించగలిగారు.   అయితే, ఆయన భార్య మరియు కేంద్రమంత్రి అయిన దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్ర విభజన అనివార్యమని భావిస్తూ సీమాంధ్ర కోసం కేంద్రాన్ని ప్యాకేజీలు కోరుతున్నారు. కానీ, ఆయన ఆమెను ఎందుకు వారించడం లేదో తెలియదు. రాష్ట్ర విభజనపై వారిరువురు ఏనాడు తమ ఉమ్మడి నిర్ణయం లేదా అభిప్రాయం ప్రకటించిన దాఖలాలు లేవు గనుక, ఆమె తన భార్య అయినప్పటికీ, ఆమె అభిప్రాయాలను గౌరవిస్తూ ఆ విషయాన్ని ఆమె విజ్ఞతకే వదిలిపెట్టారనుకోవలసి ఉంటుంది.   ఇక ఆయన సుబ్బిరామి రెడ్డిని తిరస్కరించడానికి కారణం అందరికీ తెలిసిందే. వైజాగ్ లోక్ సభ సీటు కోసం సుబ్బిరామి రెడ్డి, పురందేశ్వరికి పొగబెట్టే ప్రయత్నం చేయడం, ఆ సందర్భంగా ఆయనకీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు మధ్య జరిగిన గొడవ కోర్టులో పరువు నష్టం దావా వేసుకొనే వరకు వెళ్ళింది. అటువంటప్పుడు మళ్ళీ ఇప్పుడు దగ్గుబాటి ఆయనకే ఓటువేస్తారని ఆశించలేరు. ఇక యం.ఏ.ఖాన్, కేవీపీలకి ఓటు వేయపోవడానికి కారణం మాత్రం ఆయన చెప్పిన కారణమే అయి ఉండవచ్చును.

రాజ్యసభ ఎన్నికలు...దగ్గుబాటి తిరస్కరణ ఓటు

      రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొదట శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా తమ ఓటును వేశారు. టిడిపి పార్టీ తమ ఇద్దరూ అభ్యర్ధులకు 37 ఓట్లు కేటాయించింది. లోక్ సత్తా అధినేత జేపీ కూడా తన ఓటును టిడిపికి వేయనున్నట్లు ప్రకటించారు. వైకాపా,బిజెపిలు ఓటింగ్ కు దూరంగా వున్నాయి. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తొలిసారిగా తిరస్కరణ ఓటు వినియోగించుకున్నారు. ఆయన ఏ అభ్యర్ధికి ఓటు వేయలేదు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పే తిరస్కరణ ఓటు వేసినట్లు తెలిపారు. విభజన బిల్లు సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేసేలా లేదని విమర్శించారు. సీమాంధ్రుల అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదని, అందుకే తిరస్కరణ ఓటు వేసినట్లు తెలిపారు.