స్థానిక ఎన్నికలు: బ్యాలెట్ పేపర్ మింగేసిన ప్రబుద్ధుడు

      పోలింగ్ బూత్‌ల్లో రకరకాల విచిత్రాలు జరుగుతూ వుంటాయి. ఓటర్లని ప్రభావితం చేయడం, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకులు పోయడం, రిగ్గింగ్ చేయడం... రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఇలాంటి కళలు ఎన్నో ప్రదర్శిస్తూ వుంటారు. ఆ కళల్లో ఒక కళని అనంతపురం జిల్లాలో పోలింగ్ ఏజెంట్ పనిలో వున్న ఓ పార్టీ కార్యకర్త ప్రదర్శించాడు. ఆ కళ బ్యాలెట్ పేపర్ని అప్పడంలా నమిలి మింగేయడం. ఒక ఓటరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడాన్ని గమనించిన మరో పార్టీకి చెందిన ఆ వ్యక్తి ఓటరు దగ్గర్నుంచి బ్యాలెట్ పేపర్ని లాక్కున్నాడు. ఓటర్ దగ్గర్నుంచి బ్యాలెట్ పేపర్ ఎందుకు లాక్కున్నావ్? అంటూ అతని దగ్గరి నుంచి బ్యాలెట్ పేపర్ని తీసుకోవాలని అక్కడున్న అధికారులు ప్రయత్నించారు. దాంతో అతగాడు బ్యాలెట్ పేపర్ని నమిలి మింగేశాడు. అసలు ఇప్పుడేమైంది? నేను ఓటర్ దగ్గర్నుంచి బ్యాలెట్ పేపర్ లాక్కున్నానని ఎలా నిరూపిస్తారని ప్రశ్నించాడు. అతగాడి అతి తెలివి చూసి అధికారులు నెత్తీనోరూ బాదుకున్నారు.

కేజ్రీవాల్ కి బుద్దొచ్చింది

      ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి ఎన్నికల సందర్భంగా ఎండలో తిరిగీ తిరిగీ జ్ఞానోదయంతోపాటు బుద్ధి కూడా వచ్చినట్టుంది. అందుకే గతంలో తాను చేసిన తప్పుని ఒప్పుకుని చెంపలేసుకుంటున్నాడు. కేజ్రీవాల్ చేసిన తప్పు ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం. అమృత్‌సర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్ తొందరపడి ఆవేశంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్టు ఒప్పుకున్నాడు. మరికొంతకాలం పదవిలో వుండి ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై వాళ్ళకి పరిపాలనలో తనకు కలుగుతున్న ఆటంకాల గురించి వివరిస్తే బాగుండేదని చెప్పాడు.

ములాయం వ్యాఖ్యలపై నిర్భయ పేరెంట్స్ ఆగ్రహం

      రేప్ చేసిన వారికి ఉరిశిక్ష విధించడం దారుణమని, రేప్ లాంటి పొరపాట్లు జరుగుతూ వుంటాయని, వాటికి మరణశిక్ష విధించడం అన్యాయమని సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములాయం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని నిర్భయ తల్లిదండ్రులు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పట్ల వారు తీవ్రంగా స్పందించారు. కూతుర్ని పోగొట్టుకున్నవారికి, కూతుళ్ళు అత్యాచారాలకి గురైన వారికి ఆ బాధ తెలుస్తుందని వారు అన్నారు. అత్యాచారం అనేది మగవాళ్ళు చేసే తప్పు కాదని.. అది దారుణమైన నేరమని వారు అన్నరు. తనను తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా చెప్పుకుంటున్న ములాయం సింగ్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం విచారకరమని అన్నారు. ములాయంసింగ్ లాంటి నాయకుల వల్లే దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోతోందని అన్నారు. ములాయం లాంటి నాయకులు అధికారంలోకి రాకుండా ప్రజలు జాగ్రత్తగా వుండాలని వారు కోరారు.

చిట్టీల రాణి స్టోరీలో ట్విస్టు: జూనియర్ ఆర్టిస్టుల మోసం?

      సినిమా, టీవీ రంగాల్లో వున్న అనేక మంది దగ్గర్నుంచి చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి విజయరాణి అనే టీవీ నటి బిచాణా ఎత్తేసిందన్న వార్తలు ఈమధ్యకాలంలో వచ్చాయి. ఇప్పటి వరకూ అందరూ చిట్టీల విజయరాణిని విలన్‌గా ప్రొజెక్ట్ చేశారు. అయితే బెంగుళూరులో పోలీసులకు దొరికిపోయిన విజయరాణిని హైదరాబాద్‌ పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. ఈ ఇంటరాగేషన్‌లో ఎవరూ ఊహించని విషయాలు బయటకి వచ్చాయని తెలుస్తోంది. నిజానికి విజయరాణి ఎవరినీ మోసం చేయలేదని, ఆమెనే కొంతమంది జూనియర్ ఆర్టిస్టులో మోసం చేశారని తెలుస్తోంది. విజయరాణికి వడ్డీకి డబ్బులు ఇచ్చిన కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఆమె దగ్గర నుంచి కోట్లాది రూపాయలు బెదిరించి తీసుకున్నారట. దాంతో ఆమె దిక్కుతోచని స్థితిలో బెంగుళూరుకి పారిపోయి, అక్కడ రోడ్లమీద తిండికూడా లేకుండా పిచ్చివాళ్ళు తిరిగినట్టు తిరిగిందట. ఈ విషయాలు విజయరాణి నుంచి తెలుసుకున్న పోలీసులు ఆమెను మోసం చేసిన జూనియర్ ఆర్టిస్టుల కోసం అన్వేషణ ప్రారంభించినట్టు తెలుస్తోంది. వాళ్ళు కూడా దొరికాక ఈ స్టోరీలో వాళ్ళేం ట్విస్టు ఇస్తారో చూడాలి.

రేప్‌కి గురైనవారిని ఉరితీయాలి: అబు అజ్మీ

      సమాజ్‌వాది పార్టీ నాయకులు అందరిచేతా ఛీ కొట్టించుకునే స్టేట్‌మెంట్లు ఇచ్చి ఈ ఎలక్షన్లలో అదనపు ప్రచారం పొందాలని ప్రయత్నిస్తున్నట్టుగా వుంది. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ నిన్న ఏదో కుర్రాళ్ళు రేప్ చేసినంతమాత్రాన ఉరిశిక్ష వేసేస్తారా అని ఆవేశంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ములాయం చేసిన వ్యాఖ్యల మీద దేశమంతా భగ్గుమంటోంది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు. పార్టీ అధ్యక్షుడు ములాయంసింగే పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తుంటే నేను మాత్రం ఎందుకు చేయకూడని అనుకున్నాడేమో సమాజ్‌వాది పార్టీ మహారాష్ట్ర చీఫ్ అబు అజ్మీ ములాయం సింగ్‌కి మించిన కామెంట్స్ చేశాడు. ‘‘భర్తతో కాకుండా పర పురుషుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలను ఉరితీయాలి. అలాగే రేప్‌కి గురైన మహిళలను కూడా ఉరితీయాలి. ఎందుకంటే ఒక మహిళ ఒక పురుషుడితోనే సంబంధం కలిగి వుండాలి’’ అని దారుణంగా వ్యాఖ్యానించాడు. రేప్‌కి గురైన మహిళను సదరు రేపిస్టుతో కలిపి ఉరి తీసేయాలని అబు ఆజ్మీ చెప్పాడు. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఇలా చెయ్యమని ఇస్లాంలో చెప్పారని అంటున్నాడు.

మోడీపై కాంగ్రెస్ ‘మహిళాస్త్రం’

      బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్రమోడీని బద్నామ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ శాయశక్తులా కృషి చేస్తోంది. గోద్రా అల్లర్లు మోడీయే దగ్గరుండి చేయించారన్నట్టు హడావిడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మోడీ పెళ్ళికి సంబంధించి కూడా మాటల దాడి చేస్తూ వచ్చింది. నిన్నటి వరకూ మోడీకి పెళ్ళయినా పెళ్ళి కాలేదని చెబుతున్నాడు. ఆ వివరాలు బయటపెట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెట్టింది. ఇప్పుడు మోడీయే స్వయంగా తన పెళ్ళికి సంబంధించిన వివరాలను బయటపెట్టడంతో కాంగ్రెస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. తమ దగ్గర ఉన్న ఒక అస్త్రం పోయిందే అని బాధపడింది. అంతలోనే తేరుకుని మరో అస్త్రాన్ని బయటకి తీసింది. ఆ అస్త్రం పేరు ‘మహిళాస్త్రం’. దేశంలో కాస్తంత నోరున్న కాంగ్రెస్ మహిళా నాయకులను రంగంలోకి దించింది. సొంత భార్యకే న్యాయం చేయలేని మోడీ దేశంలోని మహిళలకు ఏం న్యాయం చేస్తాడని వాళ్ళచేత స్టేట్‌మెంట్లు ఇప్పించింది. మన రాష్ట్రం నుంచి మోడీ మీద మహిళాస్త్రాన్ని సంధించే బాధ్యతని తెలంగాణ ఆడపడుచు రేణుకా చౌదరి స్వీకరించారు. మోడీని మహిళా వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మొత్తమ్మీద ఈ సాకు చూపించి మోడీని మహిళలకు దూరం చేయాలన్న ప్లాన్‌లో కాంగ్రెస్ పార్టీ వుంది. ఏమవుతుందో చూడాలి.

శేరిలింగంపల్లిలో తెరాసలీలలు!

      హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో టీఆర్ఎస్ ఆడిన డ్రామా ప్రత్యర్థి పార్టీలను మాత్రమే కాకుండా టీఆర్ఎస్ నాయకులను కూడా బితరపోయేలా చేసింది. సీట్ల కేటాయింపులో ఈరకం నాటకాలు కూడా ఆడవచ్చా, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు ఈ టైపులో జెల్ల కొట్టవచ్చా అని ఈ నియోజకవర్గంలోని రాజకీయ వర్గాలు నోళ్ళు నొక్కుకుంటున్నాయి. ఈ నియోజవర్గంలో తెరాసలీలల గురించి చెప్పాలంటే, టీఆర్ఎస్ పార్టీ పుట్టిన దగ్గర్నుంచీ శేరిలింగంపల్లి నియోజకవర్గం బాధ్యతలను కొండకల్ శంకర్‌గౌడ్ అనే నాయకులు నిర్వర్తిస్తున్నారు. అప్పటి నుంచి పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. కోట్లకు కోట్లు డబ్బు ఖర్చుపెట్టారు. ఈసారి ఎన్నికలలో శంకర్‌గౌడ్‌కి టీఆర్ఎస్ టిక్కెట్ ఖాయమని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే టీఆర్ఎస్ శంకర్‌గౌడ్‌కి టిక్కెట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ విషయం తెలిసిన కొండకల్ శంకర్‌గౌడ్ సంబరాలు చేసుకున్నారు. పార్టీకి తాను చేసిన సేవకి గుర్తింపు లభించిందని సంతోషించారు. అయితే ఆ తర్వాత తెలిసిన న్యూస్ విని బిత్తరపోయారు. టీఆర్ఎస్ శేరిలింగంపల్లి టిక్కెట్ శంకర్‌గౌడ్‌కే ఇచ్చింది. కానీ పార్టీకి పన్నెండేళ్ళుగా సేవ చేసిన కొండకల్ శంకర్‌గౌడ్‌కి కాదు.. నిన్నగాక మొన్న టీఆర్ఎస్‌లో చేరిన తెలుగుదేశం నాయకుడు కొమరగాని శంకర్‌గౌడ్‌కి!  ఈ విషయం తెలిసి కొండకల్ శంకర్‌గౌడ్ గుండెలో  మండిపోతోంది.  

దేవెగౌడకి పిచ్చెక్కిందా?

      మాజీ ప్రధాని దేవెగౌడకి పిచ్చిగానీ ఎక్కిందా అనే సందేహాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. దేవెగౌడ ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుకున్నందువల్ల ఏ అర్హత లేకపోయినా అప్పట్లో దేశ ప్రధాని అయ్యారు. మన దేశానికి ప్రధానులుగా పనిచేసిన వారిలో అత్యంత అసమర్థుడన్న అప్రతిష్ట కూడా మూటగట్టుకున్నారు. ప్రధానమంత్రిగా పనిచేసినంతకాలం నిద్రపోవడం మినహా మరేమీ చేయని ప్రధానమంత్రిగా ఆయనకి పేరొచ్చింది. అలాంటి దేవెగౌడ ఈ ఎన్నికల తర్వాత తాను మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం వుందని ప్రకటించడం ఆయన రాజకీయ ప్రత్యర్థులకు మంచి మేటర్‌ ఇచ్చింది. దేవెగౌడ చెప్పేదాని ప్రకారం దేవెగౌడ పార్టీకి 12 ఎంపీ సీట్లు వస్తే చాలు. ప్రధానమంత్రి పీఠం మీద తాను మళ్ళీ కూర్చుంటారు. ప్రధాన మంత్రి పదవికి పోటీ పడుతున్న నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ ఇద్దరికీ ఆ పదవి మీద కూర్చునే అర్హత లేదని, తనకు మాత్రమే అర్హత వుందని ఆయన చెప్పారు.  దేవెగౌడ వ్యక్తం చేసిన ఈ అతి విశ్వాసాన్ని అతి తెలివితేటలు అనాలా, అమాయకత్వం అనాలా అని రాజకీయ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క దేశమంతా మోడీ ప్రభంజనం వీస్తుంటే దేవెగౌడకి మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలన్న కోరిక పుట్టడం, ఆ కోరిక తీరుతుందని నమ్ముతూ వుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వారు అంటున్నారు.

రాజీపడిన కోడెల: సత్తెనపల్లి నుంచి పోటీ

      చాలామంది తెలుగుదేశం నాయకులు ప్రస్తుతం రాజీనామా బాటలో నడవలేక రాజీబాటలో నడుస్తున్నారు. నిన్నగాక మొన్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం కావాల్సిందేనని పట్టుబట్టిన రేవంత్‌రెడ్డి, చంద్రబాబు కాదని అనడంతో పార్టీని వదిలి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే తెలుగుదేశం నాయకులు బుజ్జగించి, నచ్చజెప్పిన మీదట కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి అంగకరించారు. ఇలాంటి పరిస్థితే సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ ఎదుర్కొన్నారు. రాష్ట్ర రాజకీయ రంగంలో కోడెల శివప్రసాద్ అంటే నరసరావుపేట. నరసరావుపేట అంటే కోడెల శివప్రసాద్. అలాంటి స్థానాన్ని బీజేపీ పొత్తులో ఇచ్చేయడంతో కోడెల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. పొత్తుల్లో ఇవ్వడానికి తన స్థానం తప్ప మరో స్థానం చంద్రబాబుకి దొరకలేదా అని కోడెల మథనపడిపోయారు. తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టేసి అక్కడే ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేయాలని డిసైడైపోయారు. అయితే షరా మామూలుగానే పార్టీ నాయకులు కోడెలను బుజ్జగించి శాంతపరిచారు. దాంతో సత్తెనపల్లి నుంచి పోటీ చేయడానికి కోడెల అంగీకరించారు. అయితే నరసరావుపేట తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు వారిని శాంతపరిచేందుకు కోడెల ప్రయత్నిస్తున్నారు.

స్థానిక ఎన్నికలు: జగన్ పార్టీ నాయకుల దౌర్జన్యాలు

      స్థానిక ఎన్నికలలో పైచేయి సాధించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతకైనా తెగించేట్టున్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా సదరు పార్టీ నాయకుల దౌర్జన్యకాండ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలింగ్ కేంద్రాలో వైసీపీ నాయకులు దౌర్జన్యాల పరంపరను కొనసాగిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. కర్నూలు జిల్లాలోని దేవరకొండ మండలం కప్పట్రాళ్ళలో వైసీపీ కార్యకర్తలు తమ విశ్వరూపాన్ని చూపించారు. పోలింగ్ బూత్ దగ్గర వున్న టీడీపీ ఏజెంట్‌ని చావగొట్టి చెవులు మూసి అక్కడి నుంచి బయటకి పంపేశారు. ముఖ్యంగా రాయలసీమలోని పలు పోలింగ్ కేంద్రాలలో వైసీపీ నాయకులు ఏదో ఒక హడావిడి సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలలో తమ అడ్రస్ గల్లంతైపోతుందన్న భయంతోనే వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యాలకు దిగుతున్నారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

అత్యాచార౦ చేస్తే ఉరితీస్తారా?.. ములాయం ప్రశ్న

      సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అత్యాచార నిరోధక చట్టాన్ని వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారానికి పాల్పడితే ఉరి వేస్తారా? అని ప్రశ్నించారు. 'వాళ్లు పిల్లలు. పిల్లలన్నాక తప్పులు చేస్తారు. దానికే ఉరి శిక్ష వేయాలా?' అని నేరస్థులకు మద్దతు తెలిపారు. ఇద్దరు ప్రేమికుల మధ్య విభేదాలు రాగానే, అబ్బాయి తనను రేప్ చేశాడంటూ అమ్మాయి ఫిర్యాదు చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. అత్యాచారం పేరిట తప్పుడు కేసులు పెట్టే మహిళలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఢిల్లీలో గ్యాంగ్ రేప్ అనంతరం కేంద్రం తెచ్చిన ‘నిర్భయ’ చట్టాన్ని తాము సవరిస్తామని ఎన్నికల సభలో హామీ ఇవ్వడం ఆశ్చర్యకరంగా వుంది.   అయితే ములాయం చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ములాయం ఆ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఈ వ్యాఖ్యలు మహిళలకే కాదు.. సమాజానికే వ్యతిరేకమని అన్నారు. ములాయం సింగ్ యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.  

తెరాస ఐడియాలకు జేజేలు

  బహుశః మన రాష్ట్ర రాజకీయ నాయకులలో కేసీఆర్ కుటుంబ సభ్యులంతా మాటకారులు మరెవరూ లేరేమోననిపిస్తుంది వారి మాటలు విన్న ప్రతీసారి. నిజామాబాద్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న కేసీఆర్ కుమార్తె కవిత ఈరోజు అక్కడ ప్రచారం ప్రారంబించి, ఆమె ఒక సరికొత్త సిద్ధాంతం ప్రతిపాదించారు. “బీజేపీకి ఓటు వేస్తే అది సీమాంధ్రుడయిన చంద్రబాబుకు వేసినట్లేనని, ఎందుకంటే బీజేపీ చంద్రబాబు జేబు సంస్థగా మారిపోయిందని” అని సూత్రీకరించారు.   ఒకవేళ తెదేపాతో పొత్తులు బెడిసికొడితే బీజేపీతో తామే పొత్తులు పెట్టుకొందామని తెరాస తెరవెనుక ప్రయత్నాలు చేసినప్పుడు,వారికి బీజేపీ మంచిగానే కనబడింది. కానీ తెదేపాతో పొత్తులు పెట్టుకోగానే, బోడి గుండుకి మోకాలికి ముడేసినట్లు, బీజేపీని చంద్రబాబుతో ముడేసి, దానిపై కూడా ‘ఆంధ్రా బ్రాండు’ ముద్ర గుద్దేయవచ్చనే ఆలోచన కేవలం తెరాస నేతలకే సాధ్యం.   కాంగ్రెస్ మీద అవినీతి ముద్ర, వైకాపా, తెదేపాలకు, తెదేపాతో పొత్తు పెట్టుకొన్నబీజేపీ మీద ‘ఆంధ్రా ముద్రలు’ గుద్దేసి అన్ని పార్టీలు కూడా తెలంగాణాలో పోటీకి అనర్హమయినవిగా ప్రకటించేసి, తమ పార్టీకి మాత్రం ‘ఇంటి పార్టీ’ అని ముద్రవేసుకొని ప్రజలను ఆకట్టుకోవాలనే ఐడియా నిజంగా అమోఘం. నిజానికి తెరాసకే అధికారం ఉండి ఉంటే, తెలంగాణాలో తమ పార్టీ తప్ప మరే ఇతర పార్టీలు లేకుండా నిషేదించేసేదేమో!

గండం గడిచిన విజయశాంతి

      రాములమ్మ విజయశాంతికి గండం గడిచింది. మెదక్ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయాలని మొదట్లో అనుకున్న విజయశాంతి ఆ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నట్టు తెలియడంతో ఎందుకొచ్చిన రిస్క్ అని ఆమె మెదక్ అసెంబ్లీ స్థానానికి షిఫ్ట్ అయిపోయారు. అయితే మెదక్ అసెంబ్లీ స్థానం మీద ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్న శశిధర్‌రెడ్డి కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ వేశారు. నియోజకవర్గం మీద మంచి పట్టు వున్న శశిధర్‌రెడ్డి రెబల్‌గా నామినేషన్ వేయడంతో విజయశాంతి కంగారుపడిపోయారు.   రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అయితే బిత్తరపోయింది. శశిధర్‌రెడ్డి నామినేషన్ వేసిన రోజు నుంచి కాంగ్రెస్ నాయకులు శశిధర్‌రెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని గడ్డం, కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నా ఆయన మెట్టు దిగలేదు. దాంతో రాములమ్మకి బీపీ హై పిచ్‌కి చేరుకుంది. మొత్తానికి కాంగ్రెస్ నాయకులు చేసిన మంతనాలు, హామీలు, బుజ్జగింపులు ఫలించి శశిధర్‌రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకోవాడానికి అంగీకరించాడు. పార్టీ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే పోటీ నుంచి తప్పుకుంటున్నానని, మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి విజయశాంతి గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానని ప్రకటించాడు. దాంతో విజయశాంతి బీపీ డౌనయి శాంతించింది. గండం గడిచిందని ఊపిరి పీల్చుకుంది.

హుస్నాబాద్: బీజేపీకి దెబ్బమీద దెబ్బ!

      తెలంగాణలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి దెబ్బపడింది. హుస్నాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన అసలు అభ్యర్థితోపాటు డమ్మీ అభ్యర్థి నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది. ఈ నియోజకవర్గానికి 21 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ స్థానంలో బీజేపీ గెలిచే అవకాశాలు కూడా వున్నాయి. అయితే నామినేషన్లను పరిశీలించిన రిటర్నింగ్ అధికారి మధుసూదన్ బీజేపీ అభ్యర్థి దేవిశెట్టి శ్రీనివాసరావు నామినేషన్‌ని తిరస్కరించారు.   నామినేషన్‌తోపాటు ఏ, బీ ఫారాలను అందజేయాల్సి వుండగా శ్రీనివాసరావు కేవలం బీ ఫామ్ మాత్రమే జతచేశారు. దాంతో ఆయన నామినేషన్ తిరస్కరణకి గురైంది. సర్లే ప్రధాన అభ్యర్థి నామినేషన్ పోతే పోయింది. డమ్మీ అభ్యర్థి నామినేషన్ ఉంది కదా అనుకున్న బీజేపీకి మరో షాక్ తగిలింది. బీజేపీ డమ్మీ అభ్యర్థి పోలు లక్ష్మణ్ ఏ ఫారంతోపాటు బీ ఫారం కూడా దాఖలు చేయకపోవడంతో ఈయన నామినేషన్‌ కూడా గల్లంతయింది. ఇలా ఈ నియోజకవర్గంలో బీజేపీకి దెబ్బమీద దెబ్బ పడిపోవడంతో రాష్ట్ర బీజేపీ లబోదిబో అంటోంది.

ఓటు వేయని మీరాకుమార్!

      ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల కమిషన్ భారీ స్థాయిలో ప్రచారం చేస్తూ వుంటుంది. ఓటు అనేది హక్కు కాదు బాధ్యత అని స్టేట్ మెంట్లు ఇస్తూ వుంటుంది. అయితే ఇవన్నీ సామాన్య ప్రజలకు చెప్పే నీతులు. బాధ్యత కలిగిన వారు ఓటు వేయకుండా తప్పించుకుంటున్నరు. ఇక సామాన్య ప్రజల సంగతి చెప్పేదేముంది? లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ గారు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. బీహార్‌లోని ససారం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మీరాకుమార్ గతంలో రెండుసార్లు ఇక్కడి నుంచి లోక్‌సభకు ఎంపికయ్యారు. ముచ్చటగా మూడోసారి కూడా గెలవాలన్న ఉద్దేశంతో పాపం కష్టపడి ప్రచారం చేస్తున్నారు. ఆమె ఓటేమో ఢిల్లీలో వుంది. ఢిల్లీకి ఫ్లయిట్‌లో వెళ్ళి ఓటు వేసే తీరిక కూడా లేనంతగా ప్రచారం చేస్తున్న మీరాకుమార్ గారు ఓటు వేయడం కంటే ప్రచారం చేసుకోవడమే ముఖ్యమనుకుని ఓటు వేయలేదు. లోక్‌సభ స్పీకర్ స్థానంలో వుండి ఓటు వేయకుండా ఊరుకున్న మీరాకుమార్ ధోరణిని ప్రజాస్వామ్యవాదులు గర్హిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో మలేసియా విమానం?

      మలేసియా ఎయిర్‌లైన్స్‌ కి చెందిన ఎంహెచ్370 విమానం అదృశ్యమై నెలరోజులు దాటుతోంది. ఈ విమానం కోసం ఎన్నో దేశాలు వెతుకుతున్నా విమానం ఎక్కడ వుందో ఆచూకీ ఎంతమాత్రం తెలియడం లేదు. అయితే తాజాగా రష్యాకి చెందిన ఇంటెలిజెన్స్ సీక్రెట్ సర్వీస్ సంస్థ ఎఫ్ఎస్‌బి ఈ విమానానికి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించినట్టు ఎఎన్ఐ వార్తాసంస్థ చెబుతోంది. రష్యన్ సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ చెబుతున్నదాని ప్రకారం.... ఇంతవరకూ అందరూ ఈ విమానం హిందూ మహాసముద్రంలో కూలిపోయిందని అనుకుంటున్నారు. కానీ ఈ విమానం హైజాక్‌కి గురైంది. విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్లు పాకిస్తాన్ సరిహద్దులో వున్న ఆఫ్ఘనిస్తాన్ భూ భాగంలో విమానాన్ని దించారు. విమానంలో వున్న 259 ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. మొత్తం ప్రయాణికులను ఏడు బృందాలుగా విభజించి ఒక్కో బృందాన్ని ఒక్కోచోట వుంచారు. ప్రయాణికులందరూ మట్టితో చేసిన చిన్న చిన్న పాకల్లో ఆహారం లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. అలాగే ఆసియాకి చెందిన 20 మందిని పాకిస్తాన్‌లో ప్రత్యేకంగా నిర్మించిన బంకర్లలో వుంచారు. రష్యన్ సీక్రెట్ సర్వీస్ సంస్థ వెల్లడించిన విషయాలు నిజాలా లేక కాకమ్మ కథలా అనే విషయం త్వరలో తెలుస్తుంది.

సోనియా మంత్రగత్తె: నరేంద్ర మోడీ

      బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ‘మంత్రగత్తె’ (Black Magician) గా అభివర్ణించారు. భారతదేశాన్ని గత పది సంవత్సరాలుగా మంత్రగత్తె పరిపాలిస్తోందని ఆయన అన్నారు. అంతకు ముందు సోనియాగాంధీ మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ ఒక మాంత్రికుడిని రంగంలోకి దించింది అని మోడీని ఉద్దేశించి అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ మోడీ సోనియాగాంధీని మంత్రగత్తెగా అభివర్ణించారు. జంషెడ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. సోనియాని మంత్రగత్తె అన్నప్పుడు సభలో వున్న జనం నుంచి మంచి ప్రతిస్పందన వచ్చింది. సదరు మంత్రగత్తె నుంచి తమను తాము కాపాడుకోవడానికి, దేశాన్ని కాపాడటానికి ప్రతి పౌరుడూ ఉద్యమించాలని మోడీ పిలుపు ఇచ్చారు. నేను పేదరికంలో పుట్టాను. పేదల కష్టాలు నాకు తెలుసు. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వాళ్ళకి పేదల కష్టాలు, కన్నీళ్ళు ఏం తెలుస్తాయని ఆయన ప్రశ్నించారు.