కేశినేని ఇక పండగ చేసుకోవచ్చా?

  ఈసారి ఒక్క సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో తప్ప మిగిలిన అన్ని పార్టీలలో అభ్యర్ధులకు టికెట్స్ టెన్షన్ తప్పలేదు. రెండేళ్ళ క్రితమే విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు కేశినేని నానికి చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ, చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ పొట్లూరి వర ప్రసాద్ టికెట్ ఇమ్మని పట్టుబట్టడంతో కేశినేనికి కూడా చివరి నిమిషం వరకు టెన్షన్ తప్పలేదు. కానీ, ఆయన పట్టిన పట్టు విడవకుండా గట్టిగా నిలబడటంతో చివరికి ఆయనకే చంద్రబాబు టికెట్ ఖరారు చేసి బీ-ఫారం కూడా అందజేసారు. దీనితో ఒక అధ్యాయం ముగిసింది. అయితే ఇల్లలకగానే పండగ కాదన్నట్లు, ఇక బలమయిన వైకాపా అభ్యర్ది కోనేరు ప్రసాదుని ఎన్నికలలో డ్డీ కొని ఓడించాల్సి ఉంటుంది. అప్పుడే పండగయినా!

పొట్లూరి ప్రసాద్ పోటీ చేస్తే తప్పేంటి? పవన్ కళ్యాణ్ ప్రశ్న!

  విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పొట్లూరి ప్రసాద్ పోటీ చేస్తే తప్పేంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కి సన్నిహితుడైన పొట్లూరి ప్రసాద్ విజయవాడ నుంచి తెలుగుదేశం ఎంపీ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించి విఫలమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్కామ్స్ లో వున్న పొట్లూరి ప్రసాద్ ఎన్నికలలో పోటీ చేయడమేంటి? దానికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడమేంటన్న ప్రశ్నలు వినిపించాయి. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు. పొట్లూరి ప్రసాద్ తన మిత్రుడే తప్ప తాను పొట్లూరి ప్రసాద్‌కి విజయవాడ ఎంపీ టిక్కెట్ కోసం రికమండ్ చేయలేదని చెప్పారు. అలాగే పొట్లూరి ప్రసాద్‌కి సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందని, లక్షల కోట్ల స్కామ్‌లో ఇరుక్కున్న జగన్ ఎన్నికలలో పోటీచేయగా లేని తప్పు సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిన పొట్లూరి ప్రసాద్ పోటీ చేస్తే తప్పేమిటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

గుంటలో పడ్డ మాగుంట?

      కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడు మాగుంటకు పసుపు కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మాగుంట చంద్రబాబుని పొగిడితే, చంద్రబాబు మాగుంటని మునగ చెట్టెకించారు. అయితే మాగుంట శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరడం ఆయన సన్నిహితులకు ఎంతమాత్రం ఇష్టం లేనట్టు తెలుస్తోంది.   తెలుగుదేశం పార్టీలో చేరడం అంటే మాగుంట తెలిసీ తెలిసీ గుంటలో పడ్డట్టేనని వారు భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవలి కాలంలో ఏ సంస్థ సర్వే నిర్వహించినా సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎంపీ స్థానాన్ని గెలుస్తుందని ఫలితాలు వచ్చాయని,  ఆ ఒక్క ఎంపీ ఎవరో కాదు.. మాగుంట శ్రీనివాసులురెడ్డేనని వారు భావిస్తున్నారు. ఎలాగూ గెలిచే అవకాశం వున్న మాగుంట ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల తన ఇండివిడ్యువాలిటీని కోల్పోయే ప్రమాదం వుందని, అలాగే చంద్రబాబు నియంతృత్వాన్ని కూడా భరించాల్సి రావొచ్చునని భయపడుతున్నారు.  పార్టీ మారేదేదో తెలుగుదేశంలోకి కాకుండా భారతీయ జనతాపార్టీలోకి మారి వుంటే బాగుందేదని వారు భావిస్తున్నారు.

జూ.యన్టీఆర్ పై తెదేపాలో అప్రకటిత నిషేధం ఉందా?

  చంద్రబాబు నాయుడు ఈసారి పార్టీ ప్రచారం కోసం జూ.యన్టీఆర్ ని ఆహ్వానించకపోయినా కనీసం అతని గురించి సానుకూలంగా కూడా మాట్లాడలేదు. నారా లోకేష్ కూడా ‘అతను వస్తే రావచ్చునన్నట్లు’ మాట్లాడారే తప్ప రమ్మని పిలవలేదు. ఇక బాలకృష్ణ సంగతి సరేసరి! జూ.యన్టీఆర్ అనే ఒక వ్యక్తి ఉన్నడనే సంగతి కూడా ఆయనకు గుర్తులేనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఈ ముగ్గురు ప్రముఖుల అనాసక్తి చూసిన మిగిలిన నేతలు కూడా ఎక్కడా కూడా అసలు జూ.యన్టీఆర్ ప్రసక్తి రాకుండా జాగ్రత్తపడుతున్నారు. కానీ, ప్రజల తరపున అడిగేందుకు మీడియా ఉండనే ఉంది.   మొన్న వల్లభనేని వంశీకి గన్నవరం టికెట్ ఖాయం అయిన సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతున్నపుడు, “మీకు జూ.యన్టీఆర్ చాల మంచి స్నేహితుడు కదా! ఆయనను మీరయినా గన్నవరంలో ప్రచారానికి ఆహ్వానిస్తారా?” అని హటాత్తుగా మీడియా వాళ్ళు ప్రశ్నించేసరికి ఆయన కొంచెం ఇబ్బందిపడ్డారు. అయితే మళ్ళీ తేరుకొని “రాజకీయాలు వేరు వ్యక్తిగత విషయాలు వేరు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే తగిన నిర్ణయం తీసుకొంటారు” అని జవాబిచ్చారు.   ఇది చూస్తే పార్టీలో జూ.యన్టీఆర్ పై ఎంతగా అప్రకటితమయిన నిషేధం ఉందో స్పష్టమవుతోంది. పార్టీ నుండి ఏమీ ఆశించకుండా, కోట్లు వచ్చే తన సినిమాలను కూడా పక్కనబెట్టి పార్టీకి ప్రచారం చేసిన జూ.యన్టీఆర్ వంటి పార్టీ విధేయుడిని పార్టీకి దూరంగా పెట్టడం వలన అతనికేమీ నష్టం ఉండబోదు. కాకపోతే అతనిని వేరే పార్టీ వాళ్ళు ఆకర్షించి తమవైపు తిప్పుకొంటే, అప్పుడు తెదేపానే తీరికగా చింతించవలసి ఉంటుంది.

ప్రియాంకా.. గీత దాటొద్దు: వరుణ్‌ హెచ్చరిక!

      నా తమ్ముడు వరుణ్ గాంధీ తప్పుడు దారిలో నడుస్తున్నాడని, అతనిని దారిలో పెట్టాల్సిన అవసరం వుందని ప్రియాంక చేసిన కామెంట్లు అటు తిరిగి, ఇటు తిరిగి ఆమె మెడకే చుట్టుకుంటున్నాయి. ప్రియాంక ఎక్కువగా మాట్లాడుతోందని, అలా మాట్లాడితే మర్యాదగా వుండదని వరుణ్ గాంధీ తల్లి మేనకాగాంధీ ఇప్పటికే ప్రియాంకని హెచ్చరించింది. ఇప్పుడు వరుణ్ గాంధీ కూడా ప్రియాంక మీద మాటల దాడి చేశాడు. ప్రియాంక అనుకుంటున్నట్టు, ప్రచారం చేస్తున్నట్టు తానెప్పుడూ తప్పు దారిలో నడవటం గానీ, గీత దాటడం కానీ చేయలేదని అయితే ప్రియాంక తనమీద కామెంట్లు చేయడం ద్వారా గీత దాటిందని అన్నాడు. ప్రియాంక గీత దాటకుండా వుంటే బాగుండేదని కౌంటర్ ఇచ్చాడు. తన విషయంలో మరోసారి గీతదాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించాడు.

జగన్ మీద లోకేష్ డైరెక్ట్ ఎటాక్!

      వైకాపా అధినేత జగన్ తెలుగుదేశాధినేత చంద్రబాబు మీద విమర్శలు చేస్తుంటే, జగన్ మీద చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మాటలతో డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నాడు. జగన్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కక్కిస్తామని నారా లోకేష్ చెప్పాడు. ఆ కక్కించిన డబ్బు ఏం చేస్తావు నాయనా అని అడిగితే, రైతుల రుణాల మాఫీకి ఆ డబ్బు సరిపోతుందని సమాధానమిచ్చాడు. జగన్ తాను అధికారంలోకి వచ్చాక ఈ ఫైలు మీద సంతకం చేస్తా.. ఆ ఫైలు మీద సంతకం చేస్తానని చెబుతున్నాడని, అయితే కేవలం నాలుగు సంతకాలతోనే ప్రజల సొమ్మంతా దోచుకునే తెలివిగల వ్యక్తి జగన్ అని నారా లోకేష్ విమర్శించాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 40 ఏళ్ళ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు కావాలి? లేక 16 నెలలు జైలులో వున్న జగన్ కావాలా అని లోకేష్ ఓటర్లని ప్రశ్నిస్తున్నాడు.

హిందూపురం నుంచి బాలకృష్ణ: ఏడవలేక నవ్వుతున్న సిట్టింగ్

      నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వుండటం ఆయన అభిమానులలో, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఉత్సాహభరితమైన వాతావరణంలో గురువారం నాడు బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేబోతున్నారు. అంతటా ఉత్సాహంగానే వున్నారు. అందరూ హాయిగా నవ్వుతున్నారు. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ కూడా అందరితోపాటు నవ్వుతున్నారు.   బాలకృష్ణ కోసం తన సీటు త్యాగం చేయడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని నవ్వుతూ చెబుతున్నారు. కానీ ఆ నవ్వు వెనుక బోలెడంత ఏడుపు వుందని, ఆయన ఏడవలేకే నవ్వుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈసారి తెలుగుదేశం సీమాంధ్రలో పవర్లోకి వస్తే తనకి మంత్రిపదవి దక్కుతుందని ఇంతకాలం ఆశించిన ఆయన తన స్థానం నుంచి బాలకృష్ణ పోటీ చేయడానికి అంగీకరించడంతో నిరాశకు గురయ్యారు. అయితే తన నిరాశను బయటపెట్టే సాహసాన్ని కూడా ఆయన చేయలేకపోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు మంత్రి పదవి లేదు, ఎమ్మెల్యే పదవి కూడా వుండదు. నియోజకవర్గంలోని మిగతా కార్యకర్తల తరహాలోనే తాను కూడా బాలకృష్ణ వెంట తిరిగే కార్యకర్తలా వుండిపోవాల్సి వస్తుందన్న ఆవేదన అబ్దుల్ ఘనీలో ఘనీభవించి వుందని తెలుస్తోంది.

దేశమంతటా పవన్ కళ్యాణ్ ప్రచారం?

      బీజేపీకి చేరువైన పవన్ కళ్యాణ్ మొదట ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి అంగీకరించాడు. ఆ తర్వాత తన ప్రచార సేవలను విస్తరించి కర్నాటకలో కూడా మంగళవారం నాడు ప్రచారం చేయడానికి అంగీకరించాడు. పవన్ కళ్యాణ్ కర్నాటకలో మాత్రమే కాకుండా, దేశంలో తెలుగువారు ఉన్న ఏ రాష్ట్రంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కర్నాటకలోని కోలార్‌లో పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో తానే బయటపెట్టాడు. మోడీకి ప్రచారం చేయడానికి ఒక్క కర్నాటక మాత్రమే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రచారం చేయడానికి సిద్ధంగా వున్నానని పవన్ ప్రకటించాడు. మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడకి వెళ్ళాన్నా, ప్రచారం చేయమన్నా తాను సిద్ధంగా వుంటానని పవన్ ప్రకటించాడు. పవన్ ఇలా ప్రకటించడం బీజేపీ నాయకులకు సంతోషాన్ని కలిగిస్తోంది.

కర్ణాటక ప్రచారం: పవర్ తగ్గిన పవన్ ప్రసంగం!

      కర్నాటకలోని మూడు ప్రాంతాలలో బుధవారం నాడు పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలు భారతీయ జనతాపార్టీ ఏర్పాటు చేసింది. పవన్ కళ్యాణ్ మొదట కోలార్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రెండు సభలలో పవన్ కళ్యాణ్ ఎంతో దూకుడుగా మాట్లాడారు. కర్నాటకలో కూడా అదే తరహా దూకుడుని, పవర్ని ప్రదర్శిస్తారని అందరూ అనుకున్నారు. అయితే పవన కళ్యాణ్ అలాంటి పవర్‌తో కూడిన ప్రసంగం చేయకుండా, ఆగి ఆగి, ఆచితూచి, మెల్లమెల్లగా ప్రసంగించాడు. ఈ తరహా ప్రసంగాన్ని ఆయన నుంచి ఊహించని ప్రజలు, బీజేపీ నాయకులు తెల్లబోయారు. పవన్ సుదీర్ఘంగా ప్రసంగించినప్పటికీ ఆ ప్రసంగం ఉత్తేజభరితంగా లేకపోవడం నిరాశని కలిగించిందని కొందరు అంటున్నారు. కోలార్ సభ తర్వాత బీజేపీ వర్గాలు పవన్‌ని కలిసి మిగిలిన రెండు సభల్లో మాంచి పవరున్న ప్రసంగం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం.

కనబడిపోవడానికి రాలేదు: పవన్ కళ్యాణ్

  జనసేన పార్టీ స్థాపించిన తరువాత కనబడకుండా పోయిన ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మళ్ళీ చాలా రోజుల తరువాత కర్ణాటకలో రాయచూర్ లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో కనబడ్డారు. అక్కడ స్థిరపడిన తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ “ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఇలా హెలికాఫ్టర్ లో నుండి దిగి నాలుగు ముక్కలు చెప్పేసి, మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు మొహం చూపించకుండా మాయమయిపోయే రాజకీయ నేతల వంటివాడిని కాను నేను. ఈ దేశంపట్ల నాకూ బాధ్యత ఉందని భావించి ప్రజల తరపున పోరాడేందుకే జనసేన పార్టీ స్థాపించాను. మన దేశాన్నిసరయిన మార్గంలో నడిపించగల బలమయిన నాయకుడు నరేంద్ర మోడీయేనని నేను దృడంగా నమ్మినందునే, ఆయనను సమర్ధిస్తున్నాను. ఆయనకు వెనుక ఆస్తులు ఏవీ లేవు. రాజకీయాలలోకి తీసుకొని వచ్చేందుకు ఆయనకు బంధువులు లేరు. అందువలన ఆస్తులు సంపాదించుకోవాలనే యావ ఆయనకి లేదు. ఆయన జీవితం ఈదేశం కోసమే పూర్తిగా ధార పోశారు. మంచి పరిపాలనా దక్షుడు, సమర్ధుడు, అనుభవశాలి, గుండె దైర్యం ఉన్నవాడు అయిన మోడీ వంటి వారి నేతృత్వంలోనే మన దేశం అభివృద్ధి పధంలో పయనించగలదు. అందుకే అటువంటి నాయకుడిని ఎన్నుకోవలసిన అవసరం ఉందని చెప్పేందుకే మీ ముందుకు వచ్చాను,” అని పవన్ కళ్యాణ్ అన్నారు.

జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్, టిడిపి మధ్య ఘర్షణ

      నల్గొండలో తెలుగుదేశం కార్యకర్తలకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. హుజూర్ నగర్ టిడిపి అసెంబ్లీ అభ్యర్ధి స్వామి గౌడ్ తన డోర్ పోస్టర్లలలో పవన్ కళ్యాణ్ పోటో ముద్రించి, జూనియర్ ఎన్టీఆర్ ఫోటో లేకపోవడంతో ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించి౦ది. దీనిపై వెంటనే స్వామి గౌడ్ ను వివరణ కోరేందుకు జూనియర్ అభిమానులు ఆయన ఇంటికి వెళ్లారు. పోస్టర్లలలో ఎన్టీఆర్ పోటో ఎందుకు ముద్రించలేదని..పార్టీ సభ్యత్వం లేని పవన్ ఫోటో ఎలా ముద్రిస్తారని ప్రశ్నించారు? అక్కడే వున్న డోర్ పోస్టర్లలను బయటకు తెచ్చి దహనం చేయబోతుండగా టిడిపి కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. చంద్రబాబు వున్న పోస్టర్లను మీరు ఎలా దహనం చేస్తారని వారిపై ఎదురుదాడికి దిగడంతో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. వెంటనే సమాచారం ఆ పట్టణ ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకోని కొందరు టీడీపీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులను అరెస్ట్ చేశారు.

పవన్ ను కాదని నానికే బాబు సీటు

      తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ సీటు ఎవరికి దక్కుతుంది అనే దానిపై గత రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఆఖరికి కేశినేని నానికే విజయవాడ ఎంపీ సీటును టిడిపి అధినేత బాబు ఖరారు చేశారు. దీంతో కేశినేని భవన్ వద్ద టిడిపి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేశినేనికే ఎంపీ సీటు దక్కుతుందని భావిస్తున్న తరుణంలో సడన్ గా పవన్ కల్యాణ్ సిఫార్సుతో రంగంలోకి వచ్చిన పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ నాని పరిస్థితిని గందరగోళంలో పడేశారు.   వ్యాపారవేత్త పొట్లూరి ప్రసాద్‌కి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారని మీడియాలో వార్తలు రావడంతో కేశినేని నానికి షాక్ తగిలింది. ఆ తరువాత బాబుతో ఆయన భేటి అవ్వగా ఒత్తిళ్ల కారణంగా సీటును ఇవ్వలేకపోతున్నానని, అర్థం చేసుకుని అసెంబ్లీకి పోటీ చేయాలని  బాబు చెప్పిన నాని వినలేదు. విజయవాడ స్థానం నుంచే పోటీ చేస్తానని భీష్మించారు. ఆయనకు సర్ది చెప్పాలని బాబు ప్రయత్నించినప్పటికీ కేశినేని నాని దారిలోకి రాలేదు. నానీని మార్చడం సరికాదంటూ చంద్రబాబుపై స్థానిక నేతల నుంచి ఒత్తిడి, మీడియాలో కూడా పార్టీకి వ్యతిరేక వార్తలు రావటంతో సీను మారింది.  దీంతో సాయంత్రం నానితో చర్చలు జరిపిన బాబు ఆయనకే సీటు ఇస్తానని చెప్పడంతో కథ సుఖాంతమైంది.

జయమ్మకు కోపం వచ్చింది

  మన దేశంలో ప్రధానమంత్రి కావాలని కోరుకొనే రెండు డజన్ల మంది నేతలలో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత కూడా ఒకరు. ఆ కారణంగానే అటువంటి కోరికున్న నేతలందరూ కలిసి పెట్టుకొన్న థర్డ్ ఫ్రంటులో ఆమె కూడా చేరారు. కానీ అంత మందితో వేగడం కంటే, తనకి బాగా పట్టున్న తన స్వంత రాష్ట్రంలో ఉన్న మొత్తం 40 యంపీ సీట్లు సంపాదించుకొంటే, అప్పుడు ‘మీరే ప్రధాని కావాలని’ కోరుతూ వారందరూ తన చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారని జయలలిత భావించారు. అందుకే ఎంతో కష్టపడి థర్డ్ ఫ్రంట్ వేదికని నిర్మించిన లెఫ్ట్ పార్టీలతో కూడా పొత్తులకు ఆమె ‘నో’ చెప్పేసి షాక్ ఇచ్చేసారు. అటువంటప్పుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనుకొంటున్న కాంగ్రెస్ పార్టీకో, లేకపోతే మోడీని ప్రధాని అభ్యర్ధిగా చెప్పుకొంటున్న బీజేపీతోనో ఆమె పొత్తులు పెట్టుకొంటారని ఆశించడం అవివేకమే అవుతుంది.   అయినప్పటికీ, బీజేపీ శాస్త్రం ప్రకారం ఆమెను కూడా ఓసారి కదిపి చూసింది, కానీ ఊహించినట్లే వారికి కూడా ఆమె ‘నో’ చెప్పేశారు. రెండాకుల పార్టీకి అధినేత అయిన ఆమే బీజేపీని పొమ్మని చెపుతున్నపుడు, ఆమెకంటే నాలుగాకులు ఎక్కువే చదివిన తాము మాత్రం కాంగ్రెస్, బీజేపీలను ఎందుకు చేరదీయాలని అనుకొన్న డీయంకే అధినేత కరుణానిధి కూడా వాటికి ‘నో’ చెప్పేయడంతో పాపం చేసేదేమీలేక ఆ రెండు జాతీయ పార్టీలు తమిళనాడులో వీదికొకటి చొప్పున ఉండే చిన్న చితకా పార్టీలను పోగేసుకొని ఎన్నికలు ఎదుర్కోవడానికి నానా తిప్పలు పడుతున్నాయి.   అయితే ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని ఎవరో సిమ్కార్డ్ అమ్ముకొనే వాళ్ళు చెప్పిన సంగతి గుర్తుకురావడంతో బీజేపీ, తమిళనాట ఆ రెండు పార్టీలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్, మంచి ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ కి ఏకంగా వలేసేపట్టేసింది. దానితో కంగారు పడిన జయమ్మ, కాకి మీద పిల్లి మీద పెట్టి తిట్టిన్నట్లు బీజేపీని, పనిలోపనిగా ఆ నోటితోనే తన ప్రియమయిన ముసలి శత్రువు కరుణానిధిని కలిపి, కావేరీ నది జలాల పంపకం వంక పెట్టి తిట్టిన తిట్టు మళ్ళీ తిట్టకుండా తిట్లు లంఖించుకొన్నారు.   గత నాలుగయిదు దశాబ్దాలుగా ఆమెతో నిరవధికంగా ‘టామ్ అండ్ జెర్రీ షో’ నడిపిస్తూ తమిళ ప్రజలందరికీ మంచి వినోదం కల్పిస్తున్న కరుణానిధికి ఆమె బాధ ఏమిటో అర్ధమయింది, కానీ అరవం ఒక్క ముక్క కూడా అర్ధం కానీ బీజేపీ నేతలు మాత్రం ఆమె అంత తీయతీయగా తమిళంలో తిట్టి పోస్తుంటే, రజనీకాంత్ తో తాము దోస్తీ చేసినందుకు ఆమె తమను తిడుతోందో లేక పోగుడుతోందో తెలియక వెర్రి నవ్వులు నవ్వుతున్నారు.

మోడీకి అంత సీను లేదు: బీజేపీ నేత జోషి

  బీజేపీ నరేంద్ర మోడీని తమ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ప్రకటించిన తరువాత నుండే ఆ పార్టీకి దేశంలో మంచి ఊపు వచ్చింది. నాటి నుండి నేటి వరకు మోడీ విస్తృతంగా చేస్తున్న ప్రచారం వలన నానాటికి ఆయన రేటింగ్, దానితో బాటే పార్టీ రేటింగ్ కూడా బాగా పెరిగింది. ఇది కాంగ్రెస్ నేతలు కూడా కాదనలేని సత్యం. అయితే ఆయన కోసం తన వారణాసి సీటుని వదులుకోవలసివచ్చిన మురళీ మనోహర్ జోషీ మాత్రం అలా భావించడం లేదు. దేశంలో అందరూ చెప్పుకొంటున్నట్లు మోడీ ప్రభంజనమేమీ లేదని అధికేవళం బీజేపీ ప్రభంజనమని దాని వలన మోడీయే లబ్ది పొందుతున్నారని అన్నారు. అంతే కాక మోడీ కేవలం పార్టీలో ఒక ముఖ్యమయిన పదవికి ఎంపిక చేయబడిన వ్యక్తి మాత్రమేనని అన్నారు. ఈ ఎన్నికలలో ఎలాగయినా విజయం సాధించి కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకోవాలని బీజేపీ ఉవ్విళ్ళూరుతుంటే, ఇటువంటి అతి కీలకమయిన సమయంలో స్వంత పార్టీకి చెందిన మురళీ మనోహర్ జోషీ వంటి సీనియర్ నేతే వ్యక్తిగత కారణాలతో మోడీకి అంత సీను లేదని కించపరుస్తూ మాట్లాడటం వలన పార్టీకే కాదు, ఆయనకీ నష్టమే కలిగిస్తుంది. ప్రత్యర్ధ కాంగ్రెస్ పార్టీని డ్డీ కొనవలసిన ఈ తరుణంలో ఆయన స్వంత పార్టీ ప్రధాని అభ్యర్ధి మీదే బాణాలు ఎక్కుపెడితే అందుకు కాంగ్రెస్ కూడా చాలా సంతోషిస్తుంది.

సోనియాగాంధీకి ముద్దు : వెల్లువెత్తిన విమర్శలు

  ముస్లింలు కాంగ్రెస్ పార్టీ వెంటే వున్నారు. వాళ్లు సోనియాగాంధీని ఎంతో ఇష్టపడుతున్నారన్న కలరింగ్ ఇవ్వడం కోసం కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ చేసిన ఒక చీప్ ట్రిక్‌కి దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్నామధ్య సోనియాగాంధీ కర్నాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. అక్కడ ఆమె తన సెక్యూరిటీ సిబ్బంది నుంచి దూరంగా వెళ్ళిపోయి జనంలో కలిసిపోయారు. మహిళలు ఆమెను ఎంతగానో ఆదరించారు. అప్పుడు కొంతమంది ముస్లిం మహిళలతో సోనియాగాంధీ ముచ్చటిస్తూ వుండగా, ఒక ముస్లిం అమ్మాయి సోనియాగాంధీకి ముద్దు పెట్టేసింది. అక్కడే వున్న మిగతా ముస్లిం మహిళలు ఈ దృశ్యాన్ని ఆనందంగా గమనిస్తున్నారు. ముస్లిం యువతి చేత ముద్దు పెట్టించుకున్న సోనియా కూడా సంతోషించారు. దీనిని ఎవరో ఫొటో తీస్తే ఆ ఫొటోని దిగ్విజయ్ సింగ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అయితే ఇది చూడటానికి మామూలుగా అనిపించవచ్చుగానీ, ఇది దేశంలోని ముస్లింలను ఆకట్టుకోవడానికి, వారి ఓట్లు కొల్లగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ చేసిన ఒక ట్రిక్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓట్లకోసం దేనికైనా దిగజారే కాంగ్రెస్ పార్టీ దిగజారుడు తనానికి ఇది ఒక ఉదాహరణ అని కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి.

విమాన ప్రమాదం : మాయావతి బతికిపోయింది!

  ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో వున్న మాయావతి ఒక చార్టర్ ఫ్లయిట్ ఉపయోగిస్తున్నారు. ఆదివారం నాడు మాయావతి మహారాష్ట్రలో ప్రచారం ముగించుకుని విమానంలో లక్నోకి తిరిగి వచ్చారు. ఆమె ప్రయాణిస్తున్న ఫ్లయిట్ లక్నో ఎయిర్‌పోర్ట్ లో లాండ్ అయ్యే సమయంలో విమానం ముందు చక్రం తెరుచుకోలేదు. దాంతో విమానం పైలెట్ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే విమానాశ్రయంలో ఎమర్జెన్సీ లాండింగ్‌కి సన్నాహాలు చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే మాయావతిని కాపాడటానికి అంబులెన్స్ ని కూడా రన్ వే దగ్గరకి పిలిపించారు. చివరికి పైలెట్ విమానాన్ని సేఫ్‌గా లాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పిల్లల బుర్రతిన్న హేమమాలిని: కేసు నమోదు

  మధుర పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో వున్న బాలీవుడ్ నటి హేమమాలిని మీద ఎన్నికల అధికారులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. మధురలోని ఓ విద్యాలయంలో హేమమాలిని ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ప్రసంగం చేశారు. నియోజకవర్గంలో ప్రచారానికి హేమమాలిని అనుమతి తీసుకున్నప్పటికీ స్కూల్‌లో ప్రసంగించడానికి మాత్రం అనుమతి తీసుకోలేదు. తమ స్కూలుకి వచ్చిన హేమమాలినిని చూసి సదరు స్కూలు పిల్లలు ఆనందించినప్పటికీ, ఆమె ప్రసంగం ఒక్క ముక్క కూడా అర్థంకాక నోళ్ళు వెళ్ళబెట్టారు. స్కూలు పిల్లల దగ్గర రాజకీయ ప్రసంగం చేసిన హేమమాలిని మీద ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు.