జూయన్టీఆర్ ని అందుకే దూరం పెడుతున్నారా?

  ఈసారి జూ.యన్టీఆర్, ఆయన తండ్రి హరికృష్ణ ఇద్దరినీ కూడా చంద్రబాబు పూర్తిగా పక్కనపెట్టేసినట్లేనని నారా లోకేష్ తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన కృష్ణా జిల్లాలో మొదలుపెట్టిన యువ ప్రభంజనం యాత్రలో మీడియాతో మాట్లాడుతూ “బాలకృష్ణతో సహా మేమేవరినీ ప్రత్యేకంగా ఆహ్వానించలేదు. కానీ అందరూ కూడా పార్టీని తమదిగా భావించి తామంతట తామే స్వయంగా వచ్చి పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు. అందువల్ల జూ.యన్టీఆర్ ని పార్టీ ప్రచారంలో పాల్గొనమని ప్రత్యేకంగా ఆహ్వానించనవసరం లేదని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.   నాలుగు రోజుల క్రితం చంద్రబాబు కూడా ఇంచుమించు ఇదేవిధంగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన కొడుకు నారా లోకేష్ అదే విధంగా చెప్పడం గమనిస్తే వారిరువురికి కూడా ఈసారి ఎన్నికల ప్రచారానికి జూ.యన్టీఆర్ ని ఆహ్వానించే ఆలోచనలేదని స్పష్టమవుతోంది. అయితే అందుకు చాలా బలమయిన ఉందనిపిస్తోంది.   హరికృష్ణ తన కొడుకు జూ.యన్టీఆర్ ని తేదేపాలో ముందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నించినప్పుడు, చంద్రబాబు నాయుడు తన వియ్యంకుడు బాలకృష్ణ సహకారంతో తన కొడుకు నారా లోకేష్ ని తన రాజకీయ వారసుడిగా, తేదేపాకు భావి అధినేతగా ఎదిగేందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేసిన సంగతి అందరికీ తెలిసిందే. జూ.యన్టీఆర్ కి తన సినీరంగంపై తప్ప పార్టీ రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి ఏమీ లేకపోయినప్పటికీ, గత ఎన్నికలలో తాత స్వర్గీయ యన్టీఆర్ ను మరిపించేలా అలవోకగా సాగిన అతని వాగ్ధాటి, వేష బాషలు, ప్రచారశైలీ అన్నీ కూడా అతనే స్వర్గీయ యన్టీఆర్ కు నిజమయిన వారసుడు అని ప్రజలు, పార్టీ కార్యకర్తలు కూడా భావించేలా చేసింది.   బహుశః అప్పటి నుండే చంద్రబాబు క్రమంగా, ఆయన భాషలో చెప్పాలంటే ఒక పద్ధతి ప్రకారం జూ.యన్టీఆర్ ని దూరం పెడుతూ వచ్చేరు. ఆ తరువాత వారి మధ్య వైకాపా ఫ్లెక్సీ బ్యానర్లతో అడ్డుగా పరదాలు కట్టడంతో, హరికృష్ణ, జూ.యన్టీఆర్ క్రమంగా తేదేపాకు దూరమయ్యారు. అది జూ.యన్టీఆర్ సినీ జీవితంపై కూడా విపరీతమయిన ప్రభావం చూపడంతో ఆ దూరం మరింత పెరుగుతూ వచ్చింది. అయితే కాగల కార్యం గందర్వులే తీర్చారన్నట్లుగా, జూ.యన్టీఆర్ తనంతట తానే పార్టీకి దూరం అయినప్పుడు మళ్ళీ అతనిని ఇప్పుడు పార్టీ ప్రచారం కోసం ఆహ్వానించడమెందుకు, మరుగున పడిన పార్టీ వారసత్వ సమస్యని కెలుక్కోవడమెందుకనే ఉద్దేశ్యంతోనే బహుశః వారిరువురూ ఆవిధంగా మాట్లాడుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

వైకాపాలోకి సూపర్ సోదరుడు

  సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్, ఆయన తల్లి మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి ఇటీవలే తెదేపా తీర్ధం స్వీకరించిన సంగతి అందరికీ తెలిసిందే. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు కూడా తెదేపాలో చేరేందుకు సిద్దమయ్యారు. కానీ ఆయనకు టికెట్ విషయంలో చంద్రబాబు ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరిపోయారు. ఒకే కుటుంబం సభ్యులు ఇలా వేర్వేరు పార్టీలలో చేరడం కొత్తేమీ కాకపోయినా, బద్ద శతృవులయిన ఈ రెండు పార్టీలలో వారి కుటుంబ సభ్యులు చెరో వైపు చేరినందున విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోక తప్పనిసరి పరిస్థితి ఎదురయిన్నట్లయితే, అది వారి కుటుంబానికి అంత గౌరవంగా ఉండబోదని చెప్పవచ్చును.

త్వరలో కాంగ్రెస్ నేతల రిటర్న్ జర్నీ?

  ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ నుండి గుంపులు గుంపులుగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిపడిన కాంగ్రెస్ నేతలకు చంద్రబాబు షాక్ ఇస్తున్నారు. వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనతో బాటు వచ్చిన నలుగురు విశాఖ కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా ఉన్నారు. ఇంతవరకు వెలువరిచిన రెండు జాబితాలలో వారెవరి పేర్లు కనబడకపోవడంతో అందరిలో ఆందోళన మొదలయింది. ఇంకేముంది.. అందరూ అసమ్మతి గంట కొట్టేందుకు శ్రీనివాసరావు ఇంటిలో సమావేశమయిపోయారు.   వారిలో అవంతీ శ్రీనివాస్, కన్నబాబు తమకు టికెట్స్ దొరక్కపోతే పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు సిద్దమని చెపుతుంటే, గాజువాక యం.యల్యే. వెంకట్రామయ్య తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిపోయెందుకు చిరంజీవి, బొత్స సత్యనారాయణలతో అప్పుడే చర్చలు కూడా ఆరంబించేసారు. సీమాంద్రాలో పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవడంతో ఎన్నికలలో పోటీ చేసేందుకు అభ్యర్ధులు లేక దిక్కులు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు మళ్ళీ గాజువాక నుండి టికెట్ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తాజా సమాచారం.   అయితే చిరంజీవి అనుంగు సహచరుడు గంటా శ్రీనివాసరావు మాత్రం తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్దంగాలేరు. చంద్రబాబు తనని ఎక్కడి నుండి పోటీ చేయమన్నా అభ్యంతరం చెప్పకుండా పోటీ చేస్తానని, ఒకవేళ టికెట్ ఇవ్వకున్నా కూడా తెదేపానే అంటి పెట్టుకొని ఉంటూ పార్టీ నిలబెట్టిన అభ్యర్ధుల విజయానికి కృషి చేస్తానని చంద్రబాబుకి వినబడేలా బిగ్గరగా చెపుతున్నారు. గంటా శ్రీనివాసరావు ప్రదర్శిస్తున్న ఈ లౌక్యాన్ని చూసి చంద్రబాబు ఐస్ అయిపోయి టికెట్ ఇస్తారో లేదో నేడో రేపో తేలిపోతుంది.   అయితే ఇదంతా చూస్తుంటే చంద్రబాబు రాష్ట్ర విభజన వ్యవహారంతో తనను తన పార్టీని ఘోరంగా దెబ్బతీయాలని చూసిన కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకోనేందుకే ఆ పార్టీ నేతలని తెదేపాలోకి ఆకర్షించారా? అందుకే నామినేషన్లకు గడువు ముగిసేవరకు వారి టికెట్స్ వ్యవహారం ఎటూ తేల్చకుండా నాన్చుతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన ప్రకటించిన రెండు జాబితాలలో కలిపి కేవలం నలుగురైదుగురు కాంగ్రెస్ నేతలకు మాత్రమె టికెట్స్ వచ్చాయి. కానీ, కాంగ్రెస్ నుండి తెదేపాలోకి వచ్చిన వారి సంఖ్యా దాదాపు రెండు డజన్ల పైనే ఉన్నారు. మరి వారందరికీ కూడా చంద్రబాబు ఆఖరి నిమిషంలో హ్యాండివ్వబోతున్నారా?అనే సంగతి కూడా నేడో రేపో తుది జాబితా వెలువడగానే తేలిపోతుంది. అది కూడా తేలిపోతే కాంగ్రెస్ నేతలందరూ ‘ద్వారములు తెరిచియే ఉంచిన కాంగ్రెస్ గూటికి’ బిరబిరా పరుగులు తీస్తారేమో!   ఈలోగా కాస్త ముందు చూపు ఉన్న కన్నబాబు, అవంతీ శ్రీనివాస్ వంటి నేతలు స్వతంత్ర అభ్యర్ధులుగా నామినేషన్లు వేసి జాగ్రత్తపడుదామని భావిస్తుంటే, అంత రిస్కు తీసుకోవడం ఇష్టంలేని వెంట్రామయ్య వంటి నేతలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనే ప్రయత్నంలో తమకు టికెట్ రాదని గ్రహించగానే కాంగ్రెస్ గూటికి తిరిగి పయనమయిపోతున్నారు. ఇంతకీ వీరందరిలో ఎవరు తెలివయిన వారు? కాంగ్రెస్ నేతలకి పసుపు కండువాలు కప్పి వారికి షేక్ హ్యాండిస్తున్న చంద్రబాబా? లేక అవకాశవాదులయిన కాంగ్రెస్ నేతలా?              

పెరటి మొక్క వైద్యానికి పనికి రాదన్నట్లు

  పెరటి మొక్క వైద్యానికి పనికిరాదనే ఒక సామెత అక్షరాల చిరంజీవికి సరిపోతుంది. ఆయన తన మెగా చరిష్మాతో సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేస్తాడని ఆశతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి ఎన్నికల ప్రచారకమిటీ చైర్మన్ గా కీలక బాధ్యతలు అప్పగించింది. అవసరమయితే ఆయనను ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కూడా పంపి ప్రచారం చేయించుకోవాలనుకొంది. అయితే ఆయన సీమాంద్రా ప్రజలనే ఆకట్టుకోలేనప్పుడు ఇతర రాష్ట్రాలలో మాత్రం ఏమి సాధిస్తారని అందరూ పెదవి విరుస్తున్నారు. పొరుగు రాష్ట్రాల సంగతి తరువాత చూసుకోవచ్చును, కనీసం నేటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగానే ఉన్న తెలంగాణాకు ఆయనను పంపి ప్రచారం చేయించుకొనే దైర్యం చేయలేకపోతోంది కాంగ్రెస్ పార్టీ.   ప్రస్తుతం టీ-కాంగ్రెస్ లో ప్రజాకర్షణగల సరయిన నేతలెవరూ లేకపోవడంతో, వారందరూ కలిసి కూడా ఒక్క కేసీఆర్ని గట్టిగా డ్డీ కొనలేక ఆపసోపాలు పడుతున్నారు. వారిని ఎదుర్కోవడానికి డిల్లీ నుండి జైరామ్ రమేష్ స్వయంగా రావలసి వచ్చిందంటే టీ-కాంగ్రెస్ పరిస్థితి అర్ధమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణాను వ్యతిరేఖించిన చిరంజీవిని ప్రచారానికి ఆహ్వానిస్తే అది కొరివితో తలగోక్కునట్లే అవుతుందని కాంగ్రెస్ నేతలకు తెలుసు. అందుకే సరయిన ప్రజాకర్షక నేతలు ఎవరూ లేకపోయినప్పటికీ టీ-కాంగ్రెస్ నేతలు అలాగే ఎలాగో నెట్టుకొస్తున్నారు తప్ప తమ పెరట్లోనే ఉన్న చిరంజీవి గురించి ఎన్నడూ ఆలోచించలేదు.

తిక్కుంది కానీ దానికో లెక్క లేదు

  నా కొంచెం తిక్కుంది..కానీ దానికో లెక్కుంది…అని పవన్ కళ్యాణ్  డైలాగ్ చాలా పాపులర్ అయింది.సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ పెట్టి రాజకీయాలలో ప్రవేశించిన ఆయన “తూచ్...ఇప్పుడు పోటీ చేయబోవడం లేదు. అందువల్ల జనాలూ..మీకు నచ్చినోళ్ళకే ఓట్లేసేసుకోండి!” అని వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించేసారు. విజయవాడ టికెట్ కోసం అన్ని పార్టీల గడపలు ఎక్కిదిగిన పొట్లూరి వరప్రసాద్, అందు కోసం బోలెడంత డబ్బు ఖర్చు చేసి పవన్ కళ్యాణ్ చేత జనసేన లాంచింగ్ చేయించగలిగారు కానీ ఆయన చేత ఎన్నికలలో పోటీ చేయించ లేకపోయారు. అయితే గజ్జి ఉన్నవాడికి అలా గోక్కొంటూ ఉంటేనే చాలా సుఖంగా ఉంటుందిట. అలాగే విజయవాడ నుండి లోక్ సభకు పోటీ చేయాలని తహతహలాడిపోతున్న పొట్లూరికి ఏదో విధంగా అక్కడి నుండి ఓసారి పోటీ చేసి మళ్ళీ చేతులు కాల్చుకొంటేనే కానీ ఆ దురద తీరేట్లు లేదు. అందుకే ఆయన టికెట్ కోసం పవన్ వెంటబడ్డారు. కానీ వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించేసిన తరువాత మళ్ళీ రంగ ప్రవేశం చేసి, తన అభ్యర్ధిని పోటీలో దింపి ఓడిపోతే ఉన్న పరువు కూడా పోయే ప్రమాదం ఉంది గనుక, తను (కోడ్ బాషలో) మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన తెదేపాకు ఎన్నికల సందర్భంగా ఒక మెగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. పొట్లూరికి ఒక టికెట్ ఇస్తే వన్ ప్లస్ వన్ ఆఫర్ క్రింద తెదేపా-బీజేపీ రెండు పార్టీలకు ఫ్రీగా ప్రచారం చేసిపెడతానని టెంప్టింగ్ ఆఫర్ ఇచ్చారు.   ఆ రెండు పార్టీలు పొత్తులయితే పెట్టుకోగలిగాయి కానీ నేటికీ సీట్ల సర్దుబాటు చేసుకోలేక తలలు పట్టుకొని కూర్చొన్నాయి. ఉన్న ఐదు రోజుల పుణ్యకాలంలో అప్పుడే ఒకరోజు గడిచిపోయింది కానీ వైజాగ్, విజయవాడ సీట్ల బేరం మాత్రం ఎంతకీ ఒక కొలిక్కి రావడం లేదు. ఆ రెండు సీట్లు కోసం ఆ రెండు పార్టీలు సిగపట్లు పడుతుంటే మధ్యలో పొట్లూరికి టికెట్ అంటూ పవన్ కూడా వారితో జాయిన్ అయ్యారు. తమ వాళ్ళని కాదని పొట్లూరికి టికెట్ కట్టబెడితే ఇక ఆ రెండు పార్టీలలో ముసలం పుడుతుంది. ఇవ్వకపోతే పవన్ ‘జై జనసేన’ అంటూ పొట్లూరిని పోటీలో నిలబెడితే అదొక పెద్ద సమస్య అవుతుంది.   రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయాల గురించి చిన్నపుడు నుండే సుదీర్గ పరిశోధన చేసి, ప్రపంచంలో ఉన్న అన్ని ఇజాలను మిక్సీ గ్రైండర్ లో వేసి రుబ్బి మరో కొత్త ఇజం కనిపెట్టిన పవన్ కళ్యాణ్, విజయవాడ టికెట్ కోసం ఆ రెండు పార్టీల కుస్తీ పట్ల గురించి తెలుసుకోలేకపోవడం విచిత్రమే. అయినా ఆయన స్వంత కుంపటిని వంటింట్లో దాచుకొని, పొరుగింటి పిన్నిగారి కుంపటి మీద గారెలు, పరమాన్నం వండుకోవాలనుకోవడం విడ్డూరంగానే ఉంది కదా! నిజమే.. అతనికి తిక్కయితే ఉంది గాని దానికో లెక్క మాత్రం లేదని జనాలు కూడా ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు.

రజనీకాంత్ మద్దతుతో మారనున్న సమీకరణాలు

  తమిళనాడులో ఏదో ఒక స్థానిక పార్టీ అండ లేకపోయినట్లయితే ఎంత పెద్ద జాతీయపార్టీనయినా తమిళ తంబిలు ఆదరించరు. కానీ, తమిళనాడులో రెండు ప్రధాన ద్రవిడ పార్టీలయిన డీయంకే, అన్నాడీయంకేలు ఈసారి ఎన్నికలలో తిరుగులేని మెజార్టీతో గెలిచి రాష్ట్రంలో, కేంద్రంలో కూడా చక్రం తిప్పాలని భావిస్తుండటంతో కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులకు అంగీకరించలేదు. అందువల్ల ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో మిగిలిన చిన్నా చితకా పార్టీలను ఆశ్రయించక తప్పలేదు. కానీ వాటితో పొత్తుల వలన లాభం కంటే అధికారం చేపట్టిన తరువాత వారి గొంతెమ్మ కోరికలన్నిటినీ తీర్చలేక తలనొప్పులే అధికంగా ఉంటాయని ఇదివరకు చాలాసార్లే రుజువయింది. అందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఆన్వేషిస్తున్న బీజేపీ తమిళనాట సినీ హీరోలకు ప్రజలలో విపరీతమయిన ఆదరణ ఉన్న సంగతి గ్రహించి తెలివిగా పావులు కదిపింది.   సినీ తారలతో, రాజకీయ నాయకులతో మంచి పరిచయాలున్న తుగ్లక్ పత్రిక సంపాదకుడు, పాత్రికేయుడు, నటుడు అయిన చో రామస్వామి ద్వారా సూపర్ స్టార్ రజనీకాంత్ ని బీజేపీ మద్దతు ఇమ్మని కోరారు. ఊహించని విధంగా రజనీకాంత్ నరేంద్ర మోడీకి మద్దతు తెలుపుతున్నట్లు వెంటనే ప్రకటించడమే కాకుండా రేపు నరేంద్ర మోడీని స్వయంగా కలిసేందుకు బయలుదేరుతున్నారు.   రజనీకాంత్ కి తమిళనాట లక్షలాది అభిమానులున్నారు. అదేవిధంగా ఆంధ్ర, కర్నాటక, కేరళలో కూడా చాలా మంది అభిమానులున్నారు. ఆయన స్వయంగా బీజేపీ ప్రచారంలో పాల్గొనకపోయినా, తాను బీజేపీకి మద్దతు ఇస్తున్నాని చెపితే ఆయన అభిమానులు కూడా బీజేపీకే ఓట్లు వేసే అవకాశం ఉంది. ఇది తమిళనాడులో రెండు ప్రధాన ద్రవిడ పార్టీలయిన డీయంకే, అన్నాడీయంకేలకు మింగుడుపడని విషయమే. అది వారి విజయావకాశాల మీద కూడా పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే అలాగని ఆ రెండు పార్టీలు రజనీకాంత్ ని వేలెత్తి చూపే దుస్సాహసం చేయలేవు. ఇప్పుడు వాటి పరిస్థితి కుడితిలో పడిన ఎలుకల్లా తయారయిందని చెప్పవచ్చును. ఈ ఊపులో బీజేపీ మరి కొంతమంది సినీ తారలను పార్టీకి మద్దతు ఇచ్చేలా ప్రోత్సహిస్తే ఇక ఆ రెండు పార్టీలు తమ అతిశయం చంపుకొని కాంగ్రెస్, బీజేపీలను ఆశ్రయించక తప్పదేమో!

మోడీకి రజనీకాంత్ మద్దతు

        రాజకీయ రంగంలో మరో సంచలనం ఆవిష్కృతమైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ బీజేపీకి మద్దతు ప్రకటించాడు. ఇప్పుడు మరో స్టార్ కూడా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నాడు. ఆ స్టార్ మరెవరో కాదు.. స్టార్లకే స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ మోడీకి మద్దతు పలకనున విషయం తమిళనాడు రాజకీయాలతోపాటు దేశ రాజకీయాలలో సంచలనం సృష్టించింది. రజనీకాంత్ మోడీకి మద్దతు పలుకుతారన్న విషయాన్ని రజనీకాంత్ సన్నిహితుడు చో రామస్వామి వెల్లడించారు. ఆదివారం ఉదయం చెన్నైలోని రజనీకాంత్ నివాసానికి మోడీ వెళ్ళి రజనీని కలిసే అవకాశం వున్నట్టు తెలుస్తోంది.ఈ అంశంపై చెన్నైలో ముందుగానే పోస్టర్లు వెలిశాయి.    

ఈ కత్తుల పొత్తుల మతలబేoది

  నిజామాబాద్ నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న తెరాస అభ్యర్ధి కవిత తన ప్రచారం ప్రారంభిస్తూ బీజేపీకి ఓటేస్తే అది సీమాంధ్రుడయిన చంద్రబాబుకి వేసినట్లే అనే ఒక సిద్ధాంతం ప్రతిపాదించారు. కానీ అదే నియోజక వర్గం నుండి లోక్ సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి ఎండల లక్ష్మీనారాయణ ఆమె కనిపెట్టిన సిద్ధాంతాన్నే తెరాసకు కూడా వర్తింపజేస్తూ, తెరాసకు ఓటేస్తే అది కాంగ్రెస్ కు వేసినట్లేనని ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ-తెదేపాలు పొత్తులు పెట్టుకొన్నాయి గనుక అవి ఎన్నికలలో గెలిస్తే అధికారం కూడా పంచుకోవచ్చును. గనుక ఆమె ఆవిధంగా ఆరోపణలు చేసి ఉండవచ్చును.   కానీ, తెరాస కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోకపోయినా కూడా ఎన్నికల తరువాత పరిస్థితులను బట్టి ఆ పార్టీకి మద్దతు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అంటే వారి మధ్య కూడా ఒక రహస్య అవగాహన ఉందని స్పష్టమవుతోంది. అయితే ఇప్పుడు మాత్రం కాంగ్రెస్, తెరాస పార్టీలు రెండూ బద్ద శత్రువులులా ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకొంటూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఇప్పుడు ఆ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నపటికీ ఎన్నికల తరువాత వారు ఒకరికొకరు సహకరించుకోవడం ఖాయం. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి పూర్తి మెజార్టీ సాధించే అవకాశం లేదు. ఒకవేళ అది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయిన మద్దతు కూడగట్టగలిగితే, అప్పుడు తెరాస తప్పకుండా దానికే మద్దతు ఇస్తుంది. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో తెరాస చెప్పుకొంటున్నట్లు దానికి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు గనుక ప్రభుత్వ ఏర్పాటుకి కాంగ్రెస్ మద్దతు తీసుకోక తప్పదు. కనుక తెరాసకు ఓటేస్తే కాంగ్రెస్ ఓటేసినట్లేనని బీజేపీ అభ్యర్ధి చేస్తున్న వాదన సమంజసమేనని చెప్పవచ్చును.   మరి ఎన్నికల తరువాత కలిసి పనిచేసే ఉద్దేశ్యం ఉన్నపుడు, కేసీఆర్ దురాశకు పోకుండా కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకొని ఉండి ఉంటే, ఓట్లు చీలకుండా ఉండేవి. కాంగ్రెస్-తెరాస కూటమికి మరిన్ని ఓట్లు పడేవి. కానీ అలా చేయకుండా ఈ ముసుగులో గుద్దులాటలు దేనికో ప్రజలను మభ్యపెట్టడం దేనికో వారే చెప్పాలి.

హిందూపురం నుంచి బాలయ్య పోటీ..రాణించగలడా?

      నందమూరి బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈనెల 16వ తేదీన బాలకృష్ణ నామినేషన్ వేయడానికి సన్నాహాలు కూడా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో నలుగుతున్న ఒకే ఒక ప్రశ్న ‘‘బాలకృష్ణ పాలిటిక్స్ లో రాణించగలడా?’’. బాలకృష్ణ స్వతహాగా తన తండ్రి మాదిరిగానే ఆవేశపరుడు. జీవితంలో ఎప్పుడైనా ఆవేశాన్ని ప్రదర్శించిన సందర్భాలే తప్ప రాజకీయాలు నడిపిన దాఖాలు లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజకీయాలలో ఎంతవరకు రాణించగలడన్న సందేహాలు కలుగుతున్నాయి.   అలాగే సినిమా రంగంలో పొగడ్తలు అందుకుంటూ పెరిగిన బాలకృష్ణ రాజకీయ రంగంలో మీదపడే విమర్శలను తట్టుకోగలరా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. తన ‘కప్ ఆఫ్ టీ’ కాని విషయంలోకి బాలకృష్ణ అత్యుత్యాహంతో ఎంటరవుతున్నాడా అన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. రాజకీయాలు నడపటంలో సిద్ధహస్తుడైన తెలుగుదేశాధినేత చంద్రబాబునాయుడు కూడా ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాంటి వాతావరణంలోకి బాలకృష్ణ వచ్చి ఎలా నిలదొక్కుకుంటాడని జనం అనుకుంటున్నారు. అదీ కూడా చంద్రబాబు వద్దన్నా వినకుండా బాలకృష్ణ ఎన్నికలలో పోటీ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనితోపాటు ఆయన రాజకీయాల కోసం తన సినిమా కెరీర్‌ని పణంగాపెడుతున్నారన్న ఆందోళన కొంతమంది అభిమానులలో వుంది. చాలాకాలం తర్వాత బాలకృష్ణకి ‘లెజెండ్’ రూపంలో భారీ విజయ అందింది. ఈ ఉత్సాహంలో కెరీర్‌లో మరింత ముందుకు వెళ్ళే అవకాశాలున్నాయి. వాటిని కాదనుకుని రాజకీయాల్లోకి దిగితే అది బాలకృష్ణ కెరీర్ మీదే ప్రభావం చూపించే ప్రమాదం వుందని భయపడుతున్నారు. ఎవరు ఎన్ని అనుకున్నా బాలకృష్ణ రాజకీయాల్లో రాణించడగలడా లేదా అనే విషయం అతి కొద్దికాలంలోనే తేలిపోనుంది.  

గుల్జార్‌కి ఫాల్కే పురస్కారం

      ప్రముఖ హిందీ సినిమా పాటల రచయిత, దర్శకుడు గుల్జార్‌కి భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రకటించింది. కవిగా, అనువాదకుడిగా, సినీ గీత రచయితగా, దర్శకుడిగా పలు రంగాలలో విశేష కృషి చేసిన గుల్జార్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి అన్నివిధాలా అర్హుడు. 1936, ఆగష్టు 18న ప్రస్తుత పాకిస్తాన్ భూభాగంలోని దినాలో సిక్కు కుటుంబంలో గుల్జార్ జన్మించారు. దేశ విభజన తరువాత ఆయన కుటుంబం ఢిల్లీకి వలస వచ్చింది.   గుల్జార్ అసలుపేరు సంపూర్ణసింగ్. హిందీ, ఉర్దూ, పంజాబీ భాషలలో రచనలు చేసి పేరు సంపాదించిన గుల్జార్ 2004 లో భారత ప్రభుత్వపు పద్మభూషణ్ అవార్డును, 2002లో సాహిత్య అకాడమీ అవార్డును పొందగా ఇటీవల ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాతమైన ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో పొందినాడు. ఇప్పుడు ఆయన కీర్తి కిరీటంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా చేరింది. గుల్జార్‌ని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ఎంపిక చేయడం పట్ల భారతీయ సినిమా రంగంలో హర్షం వ్యక్తమవుతోంది.

రాహుల్ గాంధీ నామినేషన్: 500 కిలోల పూలు!

      కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం నాడు అమేథీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో, అత్యంత విలాసంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు. మిగతావన్నీ అలా వుంచితే, ఈ కార్యక్రమం కోసం 5 వందల కిలోల పూలు కొనుగోలు చేశారు. నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయన మీద చల్లడంతోపాటు రాహుల్ గాంధీ ఎంతదూరం నడిస్తే అంతదూరం పూలమీదే నడిచే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఏర్పాట్లన్నీ చూసి స్థానికులు చిరాకుపడుతున్నారు. ఇలాంటి బిల్డప్పులు అవసరమా అని అనుకుంటున్నారు.

మధు యాష్కిని ఓటమి భయం పట్టుకుంది!

      నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎంపీ మధు యాష్కికి ఓటమి భయం పట్టుకున్నట్టుంది. ఈ స్థానం నుంచి యాష్కికి పోటీగా తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె కవిత పోటీ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెరాస వారితో, టీ కాంగ్రెస్ నేతలతో పోటీపడి మరీ సీమాంధ్రుల మీద నోరు పారేసుకున్న యాష్కి తనకు మరోసారి గెలుపు ఖాయమని నమ్ముతూ వచ్చారు.   కవిత కూడా తనమీద పోటీ చేయదని మొన్నటి వరకూ భావిస్తూ వచ్చిన మధు యాష్కి తాను అనుకున్నట్టు జరగకపోవడంతో షాకయ్యారు. మొదట్లో తన గెలుపు మీద బీరాలు పలికినప్పటికీ రోజులు గడుస్తున్నకొద్దీ ఆయనలో ఓటమి భయం పెరిగిపోతూ వుంది. కవితకు మహిళల ఓట్లు మొత్తం టర్న్ అయ్యే అవకాశం వుంది. అది తన ఓటమికి దారి తీయొచ్చన్న అనుమానం ఆయనలో కలుగుతోంది. ఈ భయాలు, అనుమానాలతో ఆయన మాట్లాడుతున్న మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తనను ఓడించడానికి కేసీఆర్, కేవీపీ రామచంద్రరావు కుమ్మక్కయ్యారని విచిత్రమైన ఆరోపణలు ఆయన చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఒక్కటై తనమీద కవితని నిలబెట్టాలని డిసైడ్ చేశారట. మధు యాష్కి వ్యవహారశైలి చూస్తున్న కాంగీయులు ఆయన మీద జాలి పడుతున్నారు. ఎన్నికల ముందే తన ఓటమిని తానే డిసైడ్ చేసుకున్నట్టు మాట్లాడుతున్న ఆయనని ఆ దేవుడే కాపాడాలని అనుకుంటున్నారు. ఓడిపోయిన తర్వాత చేయాల్సిన ఆరోపణలు ఇప్పుడే మధుయాష్కి చేస్తున్నారని అంటున్నారు.

చంద్రబాబు కోటరీ కొంప ముంచుతుందా?

      చంద్రబాబు నాయుడు చుట్టూ వున్న కోటరీ ఈసారీ ఆయన కొంప ముంచేలా వుందన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో వ్యక్తమవుతోంది. చంద్రబాబు తన చుట్టూ వుండే వారి విషయంలో గత రెండు ఎన్నికల సందర్భంలో ఎలాంటి పొరపాట్లు చేశారో, ఈ ఎన్నికల సమయంలో కూడా అలాంటి పొరపాట్లే చేస్తున్నారని వారు అంటున్నారు.   ప్రస్తుతం చంద్రబాబు చుట్టూ వున్నవారు చంద్రబాబుకి సరైన గైడెన్స్ ఇవ్వడం లేదన్న ఆరోపణలు వున్నాయి. అలాగే వారు చంద్రబాబుని తప్పుదారిలో నడిపిస్తున్నారన్న ఆవేదన కూడా పార్టీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం  చంద్రబాబుకు రైట్ హ్యాండ్‌గా వున్న ఒక నాయకుడి విషయంలో పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీని నమ్ముకుని, పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి, ఎన్నో త్యాగాలు చేసిన వారు పార్టీకి దూరమవ్వడానికి ఆ వ్యక్తి కారణమవుతున్నారని అంటున్నారు. గతంలో తెలంగాణలో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే టీడీపీకి మేలు జరుగుతుందని చంద్రబాబుకు బ్రెయిన్ వాష్ చేసి ఒప్పించిన సదరు వ్యక్తి ఆ నిర్ణయం ద్వారా తెలుగుదేశం పార్టీకి చాలా నష్టం కలిగించారు. ఇప్పుడు అదే వ్యక్తి చంద్రబాబు వెంటే వుంటూ ఆయన్ని తప్పుదోవలో నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీమాంధ్రలోని చాలా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అంతగా బలం లేని అభ్యర్థులను నిలబెట్టడానికి ఆ వ్యక్తే కారణమని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. సదరు వ్యక్తితోపాటు చంద్రబాబు చుట్టూ వున్న మరికొందరు వ్యక్తులు కూడా ఆయనకి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారని అంటున్నారు. ఈ కోటరీ ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కొంప ముంచేస్తుందేమోనన్న భయాందోళలను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.  

16న బాలయ్య నామినేషన్

  హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి బాలకృష్ణ పోటీ చేయడం కన్ఫర్మ్ కావడంతో బాలకృష్ణ అభిమానులలో, హిందూపురం తెలుగుదేశం కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు ఉరకలు వేస్తున్నాయి. నందమూరి తారక రామారావు పోటీచేసి విజయాలు సాధించిన స్థానం నుంచి ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ పోటీ చేయడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. స్థానిక ప్రజలు కూడా బాలకృష్ణ పోటీ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఈనెల 16వ తేదీన బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి అప్పుడే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా వున్న అనేకమంది బాలకృష్ణ అభిమానులు ఆ కార్యక్రమానికి తరలి వెళ్ళనున్నారని తెలుస్తోంది.

హిందూపురం నుంచి బాలయ్య పోటీ!

      అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ పోటీ చేయడానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. హిందూపురం స్థానం నుంచి పోటీ చేస్తానని బాలకృష్ణ గతంలోనే ప్రకటించారు. అయితే ప్రస్తుతం వున్న రాజకీయ పరిస్థితుల్లో బాలకృష్ణ పోటీ చేయకపోవడమే ఉత్తమమని చంద్రబాబు సూచించినప్పటికీ బాలకృష్ణ పోటీ చేయడానికే నిర్ణయించుకున్నారు. ఒకవైపు హిందూపురం తెలుగుదేశం కార్యకర్తలు కూడా బాలకృష్ణ పోటీ చేయడానికి అనుమతి ఇవ్వాలని చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం బాలకృష్ణ తనను మరోసారి కలిసి పోటీ మీద ఆసక్తి కనబరచడంతో చంద్రబాబుకు ఇష్టం లేనప్పటికీ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేయడానికి చంద్రబాబు అంగీకరించారన్న వార్తలు రావడంతో హిందూపురం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల్లో, బాలకృష్ణ అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.

వారి ప్రచారం వల్ల లాభమా నష్టమా ఎంత శాతం?

  కాంగ్రెస్ అధిష్టాన దేవతలు సీమాంధ్రలో అడుగుపెట్టి తెలుగు గడ్డను పావనం చేయడానికి, అక్కడి ప్రజలను పునీతులను చేయడానికి మరికొంత టైం తీసుకోవచ్చును. ఎందుకంటే చిరంజీవి, రఘువీర వంటి రాష్ట్ర నేతల సభలు, సమావేశాలకే జనాలు మొహాలు చాటేస్తున్నారు. అటువంటప్పుడు ఇక అధిష్టాన దేవతల సభలకు అదే పరిస్థితి ఎదురయితే పరువు పోతుంది గనుక, ముందుగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన తరువాత అప్పుడు సభలు నిర్వహిస్తే, వారే జనసమీకరణ కోసం ఆ తిప్పలేవో పడతారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. కానీ కాంగ్రెస్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీమాంధ్ర ప్రజల ముందుకు రాష్ట్ర విభజనకు కారకులయిన కాంగ్రెస్ అధిష్టాన దేవతలు ఇద్దరూ వేంచేస్తే దానివల్ల లాభమా నష్టమా? ఎంత శాతం అని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేసుకొంటున్నారు.

బాలకృష్ణ పోటీ చేయరు: టీడీపీ వర్గాలు

      ఈ ఎన్నికలలో నందమూరి బాలకృష్ణ పోటీ చేసే అవకాశాలు లేవని టీడీపీ వర్గాలు అంటున్నాయి. బాలకృష్ణ పోటీ చేయాలన్న ఆసక్తి అభిమానులలో బాగా వుంది. బాలకృష్ణ కూడా హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఉత్సాహం చూపించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చాలా క్లిష్టంగా వుండటం వల్ల బాలకృష్ణ ఎన్నికలలో పోటీ చేయడం కంటే విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా తెలుగుదేశం విజయానికి తోడ్పడితే మంచిదన్న అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమయినట్టు తెలుస్తోంది. తన పోటీ విషయంలో పార్టీలో భిన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో బాలకృష్ణ మొదట్లో మనసు కష్టపెట్టుకున్నప్పటికీ, పరిస్థితిని అర్థం చేసుకుని పోటీ యోచనను విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ఈ క్షణం వరకూ బాలకృష్ణ పోటీ చేసే అవకాశం లేదని వారు అంటున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బాలకృష్ణ పోటీ చేసే అవకాశం లేదని వారు చెబుతున్నారు.

బిజెపికి పవన్ ప్రచారం..!

      భారతీయ జనతా పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులు క్రితం బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని కలిసి తన మద్దతును తెలిపిన పవన్ కళ్యాణ్ ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవడానికి ఆ పార్టీ రంగం సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 13 వ తేదీ నుంచి పవన్ భారతీయ జనతా పార్టీ తరపున కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు. తెలుగుప్రజలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పర్యటించి రాష్ట్ర విభజన అంశంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎండగడతారని అంటున్నారు. అలాగే ఆంధ్రా, తెలంగాణ రెండు ప్రాంతాల్లోనూ పవన్ ప్రచారం చేయనున్నట్టు సమాచారం. రోడ్‌షోలు, పబ్లిక్ మీటింగ్‌లలో పవన్ పాల్గొననున్నారు.

వల్లభనేనికి గన్న’వరం’

  తెదేపా విడుదల చేసిన సీమాంధ్ర అభ్యర్ధుల తాజా జాబితాలో ఈసారి వల్లభనేని వంశీకి గన్నవరం (అసెంబ్లీ నియోజక వర్గానికి) నుండి టికెట్ ఖరారయింది. విజయవాడ పార్టీ అర్బన్ అధ్యక్షుడిగా ఉన్న వంశీని గతేడాది చంద్రబాబు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆ పదవి నుండి తప్పించడమే కాకుండా, ఆయన పోటీ చేయాలనుకొంటున్న విజయవాడ లోక్ సభ టికెట్టును కేశినేని నానికి కేటాయించడంతో వంశీ భగ్గుమన్నారు. అయితే వంశీ కోరుకొన్న విధంగా ఈసారి ఎన్నికలలో గన్నవరం టికెట్ ఆయనకే కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇవ్వడంతో శాంతించారు.   అయితే, తనకు గన్నవరం టికెట్ కేటాయించారని గత కొన్ని నెలలుగా వంశీ చేసుకొంటున్న ప్రచారాన్ని సిట్టింగ్ యం.యల్యే. దాసరి బాలవర్ధన రావు తీవ్రంగా ఖండించారు. వంశీపై పార్టీ అధిష్టానానికి పిర్యాదు కూడా చేసారు. కానీ ఇప్పుడు వంశీకే గన్నవరం టికెట్ ఖరారవడంతో బాలవర్ధన రావు పరిస్థితి అయోమయంగా మారింది. మరి అక్కడ నుండే పోటీ చేయాలను కొంటున్న ఆయనకీ ఇప్పుడు చంద్రబాబు ఏవిధంగా నచ్చజెప్పుకొంటారో, వేరే ఎక్కడి నుండయినా టికెట్ ఇచ్చి శాంతింప జేస్తారో చూడాలి.