అమీర్, షారుక్ లు భయపడుతున్నారంట..!

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ లపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సోనమ్ కపూర్ ప్రస్తుతం "నీరజ" అనే చిత్రంలో నటిస్తుంది. దీనికి సంబంధించిన ఓపాటను నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షారూక్‌, ఆమీర్‌ లాంటి నటులు ఏదైనా మాట్లాడాలంటే భయపడుతున్నారని.. సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలు చెబుతుంటే వాటికి వ్యతిరేక విమర్శలు చేస్తున్నారని.. దేశంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని.. అది మంచైనా చెడైనా వారి అభిప్రాయాలను వినాలని సూచించారు. కాగా దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ అమీర్ ఖాన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు షారుక్ ఖాన్ మద్దతు తెలుపగా.. వారిద్దరిపై పెద్ద ఎత్తున విమర్శలు తలెత్తిన సంగతి విదితమే.

ఇక మీదట అక్కడ కనిపిస్తే కాల్చివేత…

పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్ మీద తీవ్రవాదుల దాడితో చావుతప్పి కన్నులొట్టపోయినట్లయింది మన రక్షణ దళాల పరిస్థితి. తీవ్రవాదులు అంత సులువుగా పఠాన్‌కోట్‌లాంటి స్థావరంలోకి ప్రవేశించడానికి కారణం మన రక్షణ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లే అని తేల్చేశారు రక్షణరంగ నిపుణులు. సమయానికి దేశ సైనికులు అప్రమత్తతో వ్యవహరించి ప్రాణాలకు తెగించి పోరాడబట్టి దేశం పరువు నిలిచింది. లేకపోతే పఠాన్‌కోటలో వేల కోట్ల విలువైన విమానాలను తీవ్రవాదులు ధ్వంసం చేసి ఉండేవారే. అందుకే ఇప్పడు పశ్చిమ వాయుదళానికి చెందిన 20 విమానస్థావరాల వద్ద ఇప్పుడు కనిపిస్తే కాల్చివేతని అమలు చేయాలని నిర్ణయించుకుంది. ఆగంతకులు ఎవరన్నా ఈ స్థావరాల లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే హెచ్చరించాల్సిన అవసరం కూడా లేకుండా వారిని కాల్చివేయవచ్చు. ఇంతేకాకుండా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలను వెచ్చించి దేశంలో ఉన్న మొత్తం 54 విమాన స్థావరాల వద్దా భద్రతని పెంచాలని నిర్ణయించింది. కాబట్టి ఇక మీదట తీవ్రవాదులు వైమానికి స్థావరాల మీద దాడి చేసే ప్రమాదాలు లేనట్లే!

బెంగళూరు సంఘటన సిగ్గుచేటు- సుష్మాస్వరాజ్‌!

  ఇటీవల బెంగళూరులో టాంజానియా విద్యార్థుల మీద జరిగిన దాడిని సిగ్గుచేటుగా పేర్కొన్నారు విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌. జనవరి 31 ఆదివారం రాత్రి బెంగళూరులోని హెసర్‌గట్టలో జరిగిన ఈ ఘటనలో టాంజానియాకి చెందిన ముగ్గురు విద్యార్థుల మీద స్థానికులు దాడి చేయడమే కాకుండా మరో టాంజానియా యువతిని వివస్త్రను చేశారు. అంతకు ముందు ఆ రోడ్డు పక్కన నిద్రిస్తున్న మహిళ మీద నుంచి ఓ సూడాన్‌ పౌరుడు తన కారుని నడపడంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు అదే దారిన వస్తున్న కొందరు ఆఫ్రికన్‌ జాతీయుల మీద తమ ఆవేశాన్ని ప్రదర్శించారు. వారి కారుని తగలబెట్టడమే కాకుండా, లోపల ఉన్న నలుగురు వ్యక్తుల మీదా పిడిగుద్దులు కురిపించారు. అకస్మాత్తుగా ఈ దాడి ఎందుకు జరుగుతోందో తెలియని వారు పరుగులు తీయగా, వెంటపడి మరీ దాడి చేశారు. వారిలోని ఒక యువతి మీద తమ ప్రతాపాన్ని చూపుతూ ఆమెను వివస్త్రను చేశారు.   ఈ దాడికి పాల్పిడిన వ్యక్తులందరినీ గుర్తించి వారి మీద కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోటీసులు చెబుతున్నారు. అయితే బెంగళూరులో ఆఫ్రికా పౌరుల మీద దాడి కొత్తేమీ కాదు. బహుశా ఇది చివరిది కూడా కాకపోవచ్చు. వేరే దేశాలలో భారతీయుల మీద దాడి జరుగుతోందని ఆవేదన చెందే నేతలు ఇలాంటి సంఘటనలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. అందుకే ఈసారి స్వయంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ సంఘటనలో నిందితులైనవారి మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడమంటూ ఆమె స్వయంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని సుష్మాస్వరాజ్ కోరారు.

గ్రేటర్ ఎన్నికల లెక్కింపు వాయిదా..!

గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా పడినట్టు తెలుస్తోంది. పాతబస్తీలోని పురానాపూల్‌ డివిజన్‌లో రీపోలింగ్ నిర్వహించడం వల్ల ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రానికి వాయిదా పడింది. ఎన్నికలు జరిగిన రోజు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ నేతల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అక్కడ మళ్లీ రీపోలింగ్ నిర్విహించాలని ఈసీ ఆదేశాలు జారీచేసింది. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు.  ఈ సందర్భంగా గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తామని.. 5 గంటలకల్లా తొలి ఫలితం వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది.

అనుపమ్‌గారూ పాకిస్తాన్‌కి రండి- 'నేను రానులేండి'

  ప్రసిద్ధ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ వీసా సీరియల్‌ ఇంకా సా…గుతోంది. ఈ నెల కరాచీలో జరగనున్న ఒక సమావేశానికి అనుపమ్‌ ఖేర్‌ వెళ్లేందుకు సిద్ధపడగా ఆ దేశం వీసా ఇవ్వకుండా తాత్సారం చేసిన సంగతి తెలిసింది. పాకిస్తాన్‌ కావాలనే తన వీసా గురించి జాప్యం చేస్తోంది అనుపమ్‌ ఖేర్‌ ఆరోపిస్తుండగా, తమకి అసలు ఆయన వీసా దరఖాస్తే అందలేదని పాకిస్తాన్ అంటోంది. ఈ విషయాన్ని అనుపమ్‌ ఖేర్‌ ఒక వివాదం కిందకి మార్చేయడంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.   భారతదేశంలోని పాకిస్తాన్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ అనుపమ్‌కి ఫోన్‌ చేసి తమ దేశానికి రమ్మని స్వయంగా ఆహ్వానించారు. అయితే అదను చూసుకున్న అనుపమ్‌ తనకు ఇప్పడు తీరిక లేదు ‘నో థాంక్స్‌’ అనేశారు. పైగా తనకు పాకిస్తాన్ వీసాను నిరాకరించడం ఇది మొదటిసారి కాదనీ… కశ్మీరీ పండిట్ల పక్షానా, ప్రధానమంత్రి మోదీ పక్షాన మాట్లాడుతున్నందుకే ఆ దేశం తన పట్ల వివక్ష చూపుతోందని మళ్లీ విరుచుకుపడ్డారు అనుపమ్‌! తమ దేశానికి రమ్మని పిలిచినా రాకపోగా పదేపదే తమని దుమ్మెత్తి పోస్తున్న అనుపమ్‌ని చూసి పాకిస్తాన్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మోదీ మీదకి పూలకుండీ….

  ఎప్పుడూ పూలు, పుష్పగుచ్ఛాలూ అందుకునే ప్రధానమంత్రి ఇవాళ పూల కుండీని ఎదుర్కోవలసి వచ్చింది. నరేంద్ర మోదీ కాన్వాయ్‌ దిల్లీలోని విజయ్‌చౌక్‌లో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ప్రధానమంత్రితో మాట్లాడేందుకు ఆయన కార్యాలయం తనకి అనుమతి ఇవ్వలేదన్న కక్షతో, ఒక మహిళ ఆయన కాన్వాయ్‌ మీదకు పూలకుండీని విసిరిరారు. ప్రధానమంత్రి రక్షణ సిబ్బంది అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకో, తమ కోపాన్ని వెల్లడించేందుకో దిల్లీలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత నెల కేజ్రీవాల్‌ మీద ఒక మహిళ ఇంకు పోయడంతో, ఆయన దీనికి కారణం బీజేపీనే అని ఆయన ఆరోపించారు. ఇప్పడు బీజేపీ ఏమంటుందో చూడాలి మరి!

ప్రియాంక గాంధి కూతురు ఓ ఆట ఆడుకుంటోంది

  ప్రియాంక గాంధి అంటే దేశంలో తెలియనివారుడరు. రాహుల్‌ గాంధీని తప్పించి పార్టీ పగ్గాలను ప్రియాంకకు అప్పగించమని అడుగుతున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు! ప్రియాంక రాజకీయాలలో ఎంతవరకు రాణిస్తారో లేదో తెలియదు కానీ ఆమె కూతురు మాత్రం ఇప్పడు క్రీడలలో తెగ వెలిగిపోతున్నారు. పుదుచ్చేరిలో జరుగుతున్న జాతీయస్థాయి సబ్‌జూనియర్‌ బాస్కెట్‌బాల్‌ పోటీలలో ఇప్పడు అందరి చూపు ‘మిరాయా వాద్రా’ వైపే ఉన్నాయి. ప్రియాంక, రాబర్ట వాద్రాల గారాలపట్టి అయిన మిరాయా ఈ పోటీలలో హర్యానాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో హర్యానా జట్టు తమిళనాడు జట్టు ముందు చిత్తుగా ఓడిపోయినా, రెండో లీగ్ మ్యాచ్‌లో పశ్చిమ బెంగాల్ జట్టు మీద ఆధిపత్యం సాధించింది. ఈ రెండు మ్యాచ్‌లలోనూ మిరాయా వాద్రా చురుకుగా ఆడారని ప్రేక్షకుల అంటున్నారు. మిరాయా ఆట తీరుని చూడటానికి ప్రియాంక కూడా పుదుచ్చేరికి చేరుకున్నారట. గత ఏడాది జరిగిన రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలలో మిరాయా తొలిసారి మీడియా ముందుకి వచ్చారు. కేవలం ప్రియాంక కూతురుగానే ఆమెను అప్పట్లో భావించారు. ఇప్పడు క్రీడాకారిణిగా రెండోసారి కనిపిస్తున్నారు. మున్ముందు రాజకీయవేత్తగా కూడా మిరాయాను చూడాల్సి ఉంటుందేమో!  

దేవుడిని నమ్మనందుకు 800 కొరడా దెబ్బలు…

  అష్రఫ్‌ ఫయాద్‌ ఒక కవి. అతనికి దేవుడంటే అంతగా నమ్మకం లేదు. అదే విషయాన్ని ఆయన తరచూ తన కవితలలో, వ్యాసాలలో రాసేవాడు. అదే అతను చేసిన నేరం! సౌదీ అరేబియాకు చెందిన అష్రఫ్‌కు ఆ దేశం మరణశిక్షను విధించింది. అఫ్రఫ్‌ నాస్తికుడు అని నిరూపించేందుకు ఆయన రాసిన ‘Instructions within’ అనే పుస్తకాన్ని కోర్టు సాక్ష్యంగా తీసుకుంది. అఫ్రఫ్‌కు మరణదండన విధించారని తెలియగానే ఆయన తండ్రి గుండెపోటుతో చనిపోయారు. కనీసం తన తండ్రి అంత్యక్రియలకు కూడా అఫ్రప్ హాజరయ్యే అవకాశం లభించలేదు. అఫ్రఫ్‌కు విధించిన శిక్ష మీద ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో ‘జాలి’ తలచి ఆ శిక్షను ఇప్పుడు కాస్త కుదించింది. మరణశిక్షకు బదులుగా అష్రఫ్‌ ఎనిమిది ఏళ్ల కారాగార శిక్షనీ, 800 కొరడా దెబ్బలనీ భరించాల్సి ఉంటుంది. ఈ 800 కొరడా దెబ్బలనీ 16 దఫాలుగా విధిస్తారు. అఫ్రఫ్‌ తాను దైవద్రోహం చేసినట్లుగా బహిరంగంగా ఒక ప్రకటన కూడా చేయవలసి ఉంటుంది. ఇలాంటి శిక్షలు ప్రపంచానికి కొత్తేమో కానీ సౌదీ అరేబియాకు మాత్రం కాదు. చిన్నచిన్న నేరాలకి కూడా కఠినమైన శిక్షలను విధించడం అక్కడ పరిపాటే! పోయిన ఏడాది సౌదీ అరేబియా 153 మంది పౌరులకు మరణదండన విధించింది!

మజ్లిస్‌తో తెరాస బంధం ముగిసిందా!

  గ్రేటర్‌ ఎన్నికలు ప్రశాంతంగానో, ఉద్రిక్తంగానో మొత్తానికి ముగిశాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ కూడా ఇప్పడు తెరాసకి అనుకూలంగా రావడంతో మేయర్‌ పదవిని సొంతంగానే దక్కించుకునే స్థితికి తెరాస చేరుకుంది. ఎలా చూసుకున్నా తమకి 75కి పైగానే సీట్లు వస్తాయనీ, 90 సీట్లు దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదనీ తెరాస నాయకులు సంబరపడిపోతున్నారు. ముఖ్యమంత్రి తనయుడు స్వయంగా రంగంలోకి దిగడం అంతా తానై అన్నీ తానై ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడంతో మొదటి నుంచీ ఈ ఎన్నికలు తెరాసకి అనుకూలంగా సాగే అవకాశాలు కనిపించాయి. దానికి తోడు నిన్న జరిగిన పోలింగ్‌ సరళి ఆసాంతం తెరాసకి కలిసొచ్చేలా ఉంది. దాంతో గ్రేటర్‌ పీఠం ఇప్పడు తెరాస పేరున దాదాపు ఖాయమైపోయింది. ఇప్పటి దాకా తెరాసకీ, మజ్లిస్‌కీ మధ్య కొంత సహృద్భావ వాతావరణమే ఉండేది. మజ్లిస్‌ని మంచి చేసుకునేందుకు తెరాస, నిజాంను సైతం పొగిడిన సందర్భాలు లేకపోలేదు. కానీ నిన్న మజ్లిస్‌ కార్యకర్తలు ఏకంగా ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ నివాసం మీదే దాడి చేయడం, ఆ సందర్భంలో నాయిని కూడా మజ్లిస్‌ మీద తీవ్ర పదజాలంతో విరుచుకుపడటం చూస్తుంటే ఈ మిత్రత్వం ఇక ముగిసిందేమో అనిపిస్తోంది. ఒకవేళ మేయర్‌ పదవిని దక్కించుకునేందుకు తెరాసకి తగినంత బలం చేకూరితే మజ్లిస్‌తో దోస్తీ చేయాల్సిన అసలే ఉండదు. అవసరం లేకుండా రాజకీయాలలో ఎవరూ మిత్రపక్షంగా ఉండరు కదా! మరి ఈ ఎన్నికల ఫలితాలతో మజ్లిస్‌ కాస్తా తెరాసకి కూడా దూరమైనట్లేనా!

మీ పిల్లల్ని అదుపులో ఉంచండి… గుజరాత్‌ ముఖ్యమంత్రికి మోదీ హెచ్చరిక!

  గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌ను సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న పనికి ఆహారభద్రత పథకం గుజరాత్‌లో సరిగా అమలు జరగడం లేదంటూ సుప్రీం కోర్టు ఆమెకు అక్షింతలు వేసింది. మరోవైపు తన వర్గానికి తగిన రిజర్వేషన్లు కల్పించాలంటూ హార్ధిక్‌ పటేల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తాజాగా మోదీ కూడా ఆమె పిల్లల తీరు గురించి ఆనందిబెన్‌ను హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆనంది బెన్ కొడుకు సంజయ్‌, కూతురు అనార్‌లు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల మీద ప్రభావం చూపిస్తున్నట్లు ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ కూడా రియల్‌ ఎస్టేట్‌ తదితర వ్యాపారాలు చేస్తూ తమ వ్యాపారానికి అనుగుణంగా ప్రభుత్వ విధానాలను రూపొందిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. దానికి తగినట్లుగానే రాష్ట్ర ఆర్ధిక శాఖ, రోడ్లు భవనాల శాఖ వంటి కీలక శాఖలన్నీ ఆనందిబెన్ చేతుల్లోనే ఉన్నాయి. అసలే ముఖ్యమంత్రి ఆపై ఆర్ధిక మంత్రి… ఇక ఆమె తల్చుకుంటే జరగంది ఏముంటుంది. ఆనందిబెన్‌ తీసుకునే కీలక నిర్ణయాలలో ఆమె పిల్లల పాత్ర ఉందన్న విషయం దిల్లీదాకా పాకడంతో మోదీ ఆమెను హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఆరోపణల్లో నిజం ఉన్నా లేకున్నా విపక్షాలకు అలాంటి విమర్శలు చేసే అవకాశం ఇవ్వవద్దని ఆమెకు మోదీ సూచించారట. మరి ఆమె వారసులు మోదీని చూసైనా వెనక్కి తగ్గుతారో లేదా!  

జికా వైరస్‌ పేరుతో టాటా కారు!

  ప్రపంచాన్నంతా వణికిస్తున్న వైరస్‌ జికా. పుట్టబోయే పిల్లలను సైతం వదలని ఈ వైరస్‌ ఇప్పడు టాటా సంస్థని కూడా తాకింది. కారణం! టాటా మూడేళ్లపాటు కృషి చేసి రూపొందించిన కారుకి జికాని పోలిన పేరు పెట్టుకోవడమే! తమ కారు వేగంగా ఉంటుంది అన్నదానికి సూచనగా టాటా తన కొత్త కారుకి Zippy Car అన్న పేరుని నిర్ణయించింది. దీన్ని పొడి అక్షరాలలో ZICAగా మార్చి అదే బ్రాండుతో విపణిలోకి వెళ్లాలని ఆశించింది. కానీ ఈ పేరు Zika Virusకు దగ్గరగా ఉండటంతో ఇప్పుడు టాటాకి లేనిపోని తలనొప్పులు మొదలయ్యాయి. ప్రచారం కోసం కావాలనే జికా వైరస్‌కు దగ్గరగా ఉన్న పేరుని ఎంచుకున్నారన్న విమర్శలూ మొదలయ్యాయి. విమర్శలే పనిచేశాయో లేకపోతే అలాంటి పేరు అసందర్భంగా ఉంటుందని తోచిందో కానీ ఇప్పుడు టాటా తన ZICA కారుకి మరో పేరుని వెతుక్కేనే పనిలో పడిపోయింది. కానీ అప్పటి వరకూ ఈ కారు పాత పేరుతోనే ఉంటుంది. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకూ డిల్లీలో జరిగే ఆటో ఎక్స్‌పోలో కూడా ఇదే పేరుతో ఈ కారుని ప్రదర్శించనున్నారు. ఈ కారు ఏమేరకు వ్యాపిస్తుందో చూడాలి మరి!

A-1 నిందితుడుగా ముద్రగడ పద్మనాభం

  గత నెల 31న తుని వద్ద జరిగిన హింసాకాండకి సంబంధించి పోలీసులు పలు కేసులను నమోదు చేశారు. రైల్వే ఆస్తులను తగలబెట్టడం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం, విధులలో ఉన్న పోలీసుల మీద దాడి చేయడం… ఇలా దాదాపు 50కి పైగా కేసులను మోపారు. వీటిలో కొన్ని కేసులలో ముద్రగడ పద్మనాభంని A-1 నిందితునిగా చేర్చడం జరిగింది. ఆందోళనకారులు చాలా కెమెరాలను, సెల్‌ఫోన్లనూ ధ్వంసం చేసినప్పటికీ విధ్వంసానికి తగిన సాక్ష్యాలని పోలీసులు సేకరించగలిగారు. వీటన్నింటి ఆధారంగా దాదాపు 300 మంది నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది. తునిలో జరిగిన సభ హింసాత్మకంగా మారడం అప్పటికప్పుడు జరిగిన పరిమాణం కాదనీ, దీని వెనుక ఒక వ్యూహం ఉందనీ పోలీసులు అనుమానిస్తున్నారు. రైలు పట్టాలకి దగ్గరగా సభాస్థలిని ఎంచుకోవడం, రత్నాచల్‌ వచ్చే సమయానికి రైల్‌రోకోను తీవ్రతరం చేయడం అనేవి ఒక ప్రణాళిక ప్రకారమే జరిగాయని అంటున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే ముద్రగడ పద్మనాభంతో పాటు సభ జరిగేందుకు స్థలాన్ని అందించిన కొబ్బరితోట యజమాని మీద కూడా కేసు మోపినట్లు చెబుతున్నారు.

నోటా లేకపోవడంతో పోలింగ్‌ శాతం తగ్గిందా!

  అత్యంత ఆర్భాటంగా సాగిన గ్రేటర్‌ ఎన్నికలలో నోటా గుర్తులేకపోవడం వల్ల ఏమన్నా నష్టం జరిగిందా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు పౌరులు. 2013 సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులలో ఎవ్వరూ కూడా ఓటరుకి నచ్చకపోతే అతను NONE OF THE ABOVE (NOTA) గుర్తుని ఎంచుకోవడం ద్వారా తన అయిష్టతను తెలియచేయవచ్చు. 2013 తరువాత వచ్చిన అన్ని ఎన్నికలలోనూ నోటాని అమలుచేశారు. పైగా కొన్ని స్థానిక ఎన్నికలలో సైతం నోటాని బ్యాలెట్‌లోకి చేరుస్తున్నారు. కానీ ఓటర్లందినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ గ్రేటర్‌ ఎన్నికలలో నోటా సదుపాయం లేకుండా పోయింది. చాలామంది విద్యావంతులు తమకి ఏ అభ్యర్థీ ఇష్టం లేకపోయినప్పటికీ, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నోటాని ఒక అస్త్రంగా భావిస్తారు. కానీ ఆ సౌకర్యం ఈసారి ఎన్నికలలో లేకపోవడంతో వారు పోలింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలిసింది. దీనివల్ల కనీసం రెండు శాతం ఓట్లు తగ్గినట్లు అంచనా! ఎన్నికల కమీషన్‌ మాత్రం స్థానిక ఎన్నికలలో నోటాకి సంబంధించిన స్పష్టత లేకపోవడం వల్లే తాము దానిని అమలుచేయలేదని చేతులు దులిపేసుకుంది.

షబ్బీర్‌ అలీ మీద దాడి!

  గ్రేటర్‌ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ చివరి అంకంలో బాహాబాహీ యుద్ధాలు తప్పలేదు. పాతబస్తీలో జరిగిన పురానాపూల్‌ సంఘటనలో సాక్షాత్తు కాంగ్రెస్‌ ముఖ్యనేత షబ్బీర్‌ అలీ మీదే దాడి జరిగింది. అక్కడ మహమ్మద్‌ గౌస్ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గౌస్‌ ఒకప్పుడు మజ్లిస్‌ తరఫున గెలిచి ఇప్పడు కాంగ్రెస్‌ పక్షానికి మారడంతో స్థానిక మజ్లిస్‌ కార్యకర్తలంతా ఆయన మీద గుర్రుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే అరెస్టులు, వాగ్వాదాలు సాగాయి. సాయంత్రానికి ఇరుపక్షాల నేతలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిపోయింది. గౌస్‌కి మద్దతుగా వచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాహనాన్ని మజ్లిస్‌ కార్యకర్తలు ధ్వంసం చేయడమే కాకుండా, అందులో ఉన్న షబ్బీర్‌ అలీ మీద భౌతికంగా దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు చోద్యం చూస్తుండిపోవడం గమనార్హం. చివరికి పోలీసులు జోక్యంతో ఉద్రిక్తత చల్లారింది.

TRSదే గెలుపు!

గ్రేటర్‌ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్‌ పోల్స్ సందడి మొదలైంది. ఇవి కాకుండా వివిధ పార్టీలు కూడా తమ వర్గాల ద్వారా ఓటర్ల ఎవరికి విజయాన్ని కట్టబెట్టారన్న దానిమీద ఒక నిర్ణయానికి వచ్చాయి. శాతం ఓటర్లు, పోలింగ్‌ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నదాని ప్రకారం ఈ ఎన్నికలలో టీఆర్ఎస్‌ తాను కూడా ఊహించనన్ని సీట్లను గెల్చుకోబోతోంది. మరో పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేకుండానే తాను సొంతగా మేయర్‌ అభ్యర్థిని గెలిపించుకునే స్థాయిలో ఈ పార్టీకి విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్‌ పోల్స్ ప్రకారం టీఆర్ఎస్‌ 75 నుంచి 80 వార్డులను కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక రెండో స్థానం ఎవరిదన్నదే ఇప్పుడ తేలాల్సిన విషయం. అటు టిడిపి-బిజేపీ కూటమికీ, ఇటు ఎంఐఎంకీ కూడా 30 సీట్లు వస్తాయని ఊహిస్తున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్‌ ప్రకారం కాంగ్రెస్ నాలుగో స్థానానికి పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు 10 మించి వార్డులు దక్కవని కొందరి అంచనా! మరో వైపు 600కి పైగా ఉన్న స్వతంత్ర అభ్యర్థులు చాలామంది దారుణంగా ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

పోలింగ్‌ అద్భుతంగా జరిగింది- ఎన్నికల అధికారి!

  ఏవో చిన్నా చితకా సంఘటనలు మినహా పోలింగ్‌ అద్భుతంగా జరిగిందని ఎన్నికల అధికారి జనార్ధనరెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికలలో ఓటింగ్‌ శాతం పెరిగిందని చెప్పారు. 2009తో 40.9 శాతం పోలింగ్ జరగగా అది ఇప్పుడు 45 శాతానికి పెరగడం సంతోషకరమన్నారు. ఈసారి కేవలం 4 దొంగ ఓట్లు మాత్రమే పడ్డాయనీ, గతంతో పోల్చుకుంటే ఇది నామమాత్రమేనన్నారు. ఇక ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు మొరాయించిన సందర్భాలు కూడా చాలా తక్కువేనన్నారు జనార్ధనరెడ్డి. 7802 యంత్రాలలో కేవలం 9 యంత్రాలు మాత్రమే… అది కూడా కొద్ది నిమిషాల సేపే మొరాయించాయని చెప్పారు. ఈసారి వెబ్‌కాస్ట్ ద్వారా ఓటింగ్‌ జరిగే విధానాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం వల్ల చాలా సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించగలిగామని చెప్పారు. అయితే పోలింగ్‌ 50 శాతం కంటే తక్కువగా ఉండటం తనకు కూడా నిరాశ కలిగించే అంశమన్నారు. నగర పౌరులలో ఉన్న ఈ జడత్వం పోయేందుకు తాము చాలా కృషి చేశామనీ అయితే ఓటర్లలో అవగాహన కలిగించేందుకు ఇది సరిపోయినట్లు లేదన్నారు. వచ్చే ఎన్నికల నాటికైనా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించారు జనార్ధనరెడ్డి.

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్!

  ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన హైదరాబాద్‌ నగరపాలిక ఎన్నికలు ఎట్టకేళకు ముగిసాయి. దాదాపు 45 శాతం చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాతంగానే ముగిసిందంటూ ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. లంగర్‌హౌజ్‌ వద్ద బీజేపీ- టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మధ్య కొంత తోపులాట చోటుచేసుకుంది. ఇక అజంపురాలోని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ ఆలీ నివాసం మీద మజ్లిస్‌ కార్యకర్తలు దాడి చేయడంలో పోలీసులు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. మరోవైపు సమస్యాత్మకంగా భావించే పాతబస్తీలోనూ కొంత ఉద్రిక్తత నెలకొంది. పాతబస్తీలోని మీర్‌చౌక్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌- మజ్లిస్‌ పార్టీలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ సంఘటనలో కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌ అలీలకు స్వల్ప గాయాలు అయ్యాయి.