"జికా వైరస్" పై ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జన్సీ

లాటిన్‌ అమెరికా దేశాల్లోని ప్రజలకు జికా వైరస్ ఈ మధ్య కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బ్రెజిల్ నుండి.. అమెరికా దేశాలకు వ్యాపించిన ఈ వైరస్ ను అరికట్టడానికి చాలా ప్రయత్నాలే చేస్తున్నా అవి మాత్రం విఫలమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ వల్ల గర్భిణీ స్త్రీలకు ఎక్కువ సమస్యలు వస్తున్న నేపథ్యంలోనే ఆదేశాల్లో 2018 వరకూ గర్భదారణ దాల్చవద్దని.. ఆదేశాలు కూడా జారీచేసింది. ఇప్పుడు ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని.. చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూ హెచ్ వో) కీలక సమావేశం నిర్వహించి.. ముందే మేల్కొని దీనికి తగిన చర్యలు తీసుకోవడానికి హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించింది. వైరస్ కు టీకాను కనిపెట్టే దిశగా పలుదేశాలకు చెందిన శాస్త్రవేత్తలు చర్చలు జరపనున్నారు.

పఠాన్‘కోట’లో పాగా

శత్రుదేశం గూఢచారులు నేరుగా మన సైనిక స్థావరాల్లో పాగా వేస్తున్నారు. కాబట్టే ఇటీవలి కాలంలో పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు పేట్రేగిపోతున్నారు. పంజాబ్ లోని పఠాన్ కోట కంటోన్మెంట్ లో ఇర్షాద్ అనే వ్యక్తి అరెస్టుతో ఈ దిగ్భ్రాంతికరమైన వాస్తవం వెలుగు చూసింది. ఇర్షాద్ ఐఎస్ఐ ఏజెంటు. ఇతడు పఠాన్ కోట కంటోన్మెంట్ లో కార్మికుడిగా చేరి అక్కడి రహస్యాలన్నీ పాక్ ఐెఎస్ఐకి చేరవేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. భారతీయుడైన ఇర్షాద్ స్మార్ట్ ఫోన్ నుంచి కంటోన్మెంట్ కు సంబంధించిన రహస్య సమాచారం స్వాధీనం చేసుకున్నారు. దీన్ని అతడు జమ్ములోని సజ్జాద్ కు పంపించాడు. సజ్జాద్ ను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భారత సైన్యంలో పఠాన్ కోట కంటోన్మెంట్ అత్యంత ప్రధానమైన  సైనిక స్థావరం. ఇంకా ఇలాంటి చీడపురుగులు ఎన్ని ఉన్నాయన్న దానిపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఇటీవలే పఠాన్ కోట ఎయిర్ ఫోర్స్ మీద జరిగిన దాడి దృష్ట్యా, వాటికి పాల్పడిన తీవ్రవాదులకు ఇర్షాద్ తోడ్పాటు కూడా ఉండి ఉంటుందని అనుమానిస్తున్నారు. పాక్ మన దేశంలో టెర్రరిజాన్ని ఫ్రోత్సహిస్తోందనడానికి ఇదొక నిదర్శనం.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సల్మాన్ ఖాన్ ఓటు..

జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న వేళ చాలా విచిత్రకరమైన అంశాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొంత మంది పేర్లు ఓటర్ల జాబితాలో లేకపోతే.. కొన్ని చోట్ల మాత్రం ఇక్కడ లేని వాళ్ల పేర్లు కూడా వచ్చి చేరుతున్నాయి. ఇప్పుడు ఓటర్ల జాబితాలోకి బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ పేరు వచ్చి చేరింది. ఈరోజు గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్ననేపథ్యంలో గౌలిపుర డివిజన్‌ లో ఒక ఓటరు పేరు సల్మాన్‌ఖాన్‌, తండ్రిపేరు సలీమ్‌ఖాన్‌గా పేర్కొంటూ సల్మాన్‌ ఫొటోతో జాబితాలో ఓటు ఉంది. అంతేకాదు అందులో సల్మాన్ వయసు 64 ఏళ్లుగా అధికారులు పేర్కొన్నారు. దీంతో అధికారుల నిర్లక్ష్యం వల్లనే జాబితాలో ఇలాంటి విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోర్టులోనే పెళ్లి చేసుకున్న క్రికెటర్..

పెళ్లిళ్లు ఒక్కొక్కళ్లు ఒక్కొరకంగా చేసుకుంటారు. కొంత మంది చాలా సింపుల్ గా పెళ్లిళ్లు చేసుకుంటే.. కొంతమంది చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. ఇప్పుడు క్రికెటర్ వరుణ్ ఆరోన్ కూడా చాలా వెరైటీగా పెళ్లి చేసుకున్నారు. టీమిండియాలో పేసర్ గా పేరుతెచ్చుకున్న వరుణ్ ఆరోన్ సింఫుల్ గా అదీ కోర్టులో పెళ్లి చేసుకొని అందరిని విస్మయానికి గురి చేశారు. జంషెడ్ పూర్ లోని కోర్టులో వరుణ్ తన చిన్ననాటి స్నేహితురాలైన రాగిణి సింగ్ ను పెళ్లాడారు. చాలా సింపుల్ గా చట్టబద్ధంగా కోర్టులో ఏకమైన ఈ జంట.. ఫిబ్రవరి 4న క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంటారని చెబుతున్నారు.

మీరూ ఓటేయ్యండి.. ఎన్టీఆర్.. ఒంటి గంట వరకు 25.83 శాతం పోలింగ్

జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ పోలింగ్ కేంద్రానికి తన తల్లి, భార్యతో వచ్చి ఓటు వేశారు. ఈసందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తనకు అనారోగ్యంగా ఉన్నా కూడా తన ఓటు హక్కును తాను వినియోగించున్నానని.. అలాగే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు వేయడానికి సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది అందరూ వచ్చి ఓటేయండి అని విజ్ఞప్తి చేశారు. ఓటుపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందన్నారు. తాను అనారోగ్యంగా ఉన్నప్పటికీ ఓటు వేయడానికి వచ్చానని తెలిపారు. కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 25.83 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న వారందరికి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

అనుపమ్‌ ఖేర్‌కు మరో ఎదురుదెబ్బ!

అనుపమ్‌ ఖేర్‌కు పద్మభూషణ్ వచ్చిన సంబరం త్వరలోనే అడుగంటిపోయేట్లు ఉంది. బీజేపీని తరచూ సమర్థించే ఈ నటుడు అందుకు బదులుగా ఏదో చిక్కులో ఇరుక్కుంటూనే ఉన్నాడు. ఇప్పడు తాజాగా అనుపమ్‌ని పాకిస్తాన్‌లో అనుమతించేందుకు ఆ దేశం వీసాని మంజూరు చేయకపోవడంతో అనుపమ్ పేరు కాస్తా పొరుగుదేశాలకి కూడా పాకినట్లుంది. కరాచీలో జరిగే సాహిత్య సమావేశానికి హాజరయ్యేందుకు అనుపమ్ వీసాను కోరడంతో, పాకిస్తాన్‌ దాన్ని తిరస్కరించింది. ఒక పక్క బీజేపీకి మద్దతుని అందించడం వల్లే అనుపమ్‌కి పద్మభూషణ్‌ వచ్చిందని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. దానికి తగినట్లుగానే అనుపమ్‌ తనను మైకు దగ్గరకు పిలిచిన చోటల్లా దేశంలో అసహనం ఏమాత్రం లేదు అని అడగకుండానే చెబుతున్నారు. నిన్నటికి నిన్న కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌కి ‘కాంగ్రెస్‌ చెంచా’ అని బిరుదునిచ్చి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పడు తన వీసాను తిరస్కరించినందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని ఏం దుమ్మెత్తి పోస్తారో చూడాలి మరి! పాకిస్తాన్‌ అధికారులు మాత్రం ఈ వివాదంలో తలదూర్చేందుకు సిద్ధంగా లేరు. అసలు అనుపమ్‌ ఖేర్‌ వీసా దరఖాస్తు తమకు అందలేదంటూ చేతులు దులిపేసుకున్నారు. అవును మరి... మాటల మాంత్రికుడు అనుపమ్‌తో తలపడేందుకు ఎవరు మాత్రం సిద్ధంగా ఉంటారు!

అమెరికాలోనూ మతాల రాజకీయమే!

అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ వారం ఒక మసీదుని సందర్శించనున్నారు. అధ్యక్షుని హోదాలో ఆయన తన దేశంలో ఒక మసీదులోకి అడుగుపెట్టడం ఇది తొలిసారి. అమెరికాలో నివసిస్తున్న ముస్లిం పౌరులలో సద్భావాన్ని నింపేందుకు ఈ చర్య తీసుకున్నానని చెబుతున్నారు ఒబామా. కానీ ఈ చర్యని తరచి చూస్తే భారతీయ తరహా రాజకీయ సూత్రాలు కొన్ని బయటపడక మానవు. ఈ సంవత్సరం జరగనున్న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఒబామా సొంత పార్టీ అయిన డెమాక్రెటిక్‌ పార్టీకీ రిపబ్లికన్‌ పక్షానికి మధ్య తీవ్రమైన పోరు జరుగుతోంది. రిపబ్లికన్ తరఫున అభ్యర్థిగా నిలిచే అవకాశం ఉన్న డొనాల్డ్ ట్రంప్ చీటికీమాటికీ ముస్లిం ప్రజల మీద విద్వేషాన్ని చిమ్ముతున్నారు. మసీదులని మూసివేయాలనీ, ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టాలనీ… రకరకాల ప్రకటనలు చేస్తున్నారు ట్రంప్‌. ట్రంప్ మాటలకు ప్రపంచం నలుమూలల నుంచీ నిరసన వినిపిస్తోంది. బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యులైతే ఏకంగా ట్రంప్‌ను తమ దేశంలోకి అడుగుపెట్టనీయకూడదని అంటున్నారు. ఆశ్చర్యకరంగా అమెరికాలో మాత్రం ట్రంప్‌కు ప్రజల మద్దతు పెరిగిపోతోంది. ట్రంప్‌ను నిలువరించేందుకు ఇప్పుడు ఒబామా మసీదులోకి అడుగుపెడుతున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. పైగా సందర్శన కోసం ఒబామా ఎంచుకున్న ‘బాల్టిమోర్‌’ మసీదుకి తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ISIS ఉగ్రవాదంతో ముస్లింలకీ ఇతర మతస్తులకీ మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకే ఒబామా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఎవరేమన్నా ఒబామా నిజంగా దేశ సమైక్యత కోసమే ఈ పని చేస్తుంటే అంతకంటే కావల్సింది ఏముంది!

టీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్.. 12 గంటల వరకు 21.65 శాతం పోలింగ్

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయ్యారు. నెరేడ్‌మెట్ పోలింగ్ బూత్ వద్ద డబ్బులు పంచుతూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసుల  ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మధ్యాహ్నం 12 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి 60 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. జంట నగరాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా యువతీయువకులు ఉత్సాహంతో ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.

60 మంది విద్యార్ధుల ఆత్మహత్య..

తాము ఆత్మహత్య చేసుకుంటామని 60 మంది దళిత విద్యార్దులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఘటన బీహార్ లో జరిగింది. వివరాల ప్రకారం.. బీహార్‌, భువనేశ్వర్‌లోని రాజ్‌ధాని ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో చదువుతున్న 60 మంది విద్యార్ధులు ప్రభుత్వానికి ఈ రకమైన హెచ్చరిక జారీ చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న వీరికి ప్రభుత్వం ఉపకార వేతం చెల్లించకపోవడంతో విద్యార్థులు కళాశాలనుంచి, హాస్టల్‌నుంచి బైటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వం తమకు ఉపకార వేతనాలు చెల్లించాలని.. ఎస్‌సి,ఎస్‌టి సంక్షేమ శాఖ నిర్లక్ష్యం కారణంగా తమ భవిష్యత్తు అంధకారంలో పడినందున తాము ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ

జీహెచ్ఎంసీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. జంట నగరాల్లో దాదాపు 7వేలకు పైగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. అంతేకాదు పోలింగ్ కేంద్రాల్లో జరిగే పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు అత్యాధునికమైన ఇంటిగ్రేటేడ్ ఈ-సర్వేలేన్స్ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని, బందోబస్తును పోలీసు ఉన్నతాధికారులు కమెండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 811 సమస్యాత్మక, 286 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.

ఓటు వేసేందుకు వెళ్తున్నారా!

- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. - 5 గంటలలోపల క్యూలో ఉన్నవారు ఎంత ఆలస్యమైనా ఓటు వేసి వెళ్లవచ్చు. - ఇవాళ కూడా ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి ఓటరు స్లిప్‌ను పొందవచ్చు(ghmc.gov.in) - ఓటు వేసే చోట సెల్‌ఫోన్లను అనుమతించరు. - పోలింగ్‌ కేంద్రం లోపల ఫొటోలు తీయడం నిషిద్దం. - అంధులు తమ ఓటు వేసేందుకు వేరొకరిని వెంటపెట్టుకుని రావచ్చు. - ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా ఉంటుంది. - వికలాంగులు నేరుగా వీల్‌చైరుతో పోలింగ్‌ కేంద్రం లోపలికి వెళ్లవచ్చు. - ఇప్పటికే వేరెవరన్నా మీ ఓటు వేసేసి ఉంటే అక్కడి ఉన్న అధికారికి ఫిర్యాదు చేయండి.

ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే…

  ఓటు ఉంటే చాలు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఫర్వాలేదు అంటున్నారు ఎన్నికల అధికారులు. తాము సూచించిన గుర్తింపు కార్డులలో ఏది ఉన్నా కూడా పోలింగ్‌కు అనుమతిస్తామని అంటున్నారు. ఓటరు తన గుర్తింపుని నిరూపించుకునేందుకు ఎలక్షన్‌ అధికారులు 21 రకాల పత్రాలను అనుమతించారు. ఆధార్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, బ్యాంకు లేదా పోస్టాపీసు జారీ చేసిన పాస్‌పుస్తకం, ప్రభుత్వ సంస్థలు లేదా పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీ చేసిన సర్వీసు గుర్తింపు పత్రం, రేషన్‌ కార్డులు, ఆహార భద్రత కార్డులు, కులధృవీకరణ ప్రతాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఏటీఎం కార్డు… ఈ జాబితాలో ముఖ్యమైనవి. వీటిలో ఏది చూపించినా కూడా నేడు జరుగుతున్న జి.హెచ్‌.ఎం.సి ఎన్నికలలో పాలుపంచుకోవచ్చు.

గ్రేటర్ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్దం..

రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌లో 25624 మంది, సైబరాబాద్ పరిధిలో 16 వేల సిబ్బందితో కలిపి మొత్తం 41624 మందిని నియమించామని పేర్కొన్నారు. 4860 ఆర్మీ రిజర్వు ఫోర్స్‌తోపాటు 3 వేల ఎన్నెసెస్, 1400 మంది ఎన్సీసీ వాలంటీర్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించినట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. తమకు కేటాయించిన వరుసల్లో వెళ్లి మహిళా, పురుష ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 3200 పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేసి దానిని కమిషనర్ కార్యాలయంలోని కమాండ్, కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.