జయరామ్ కోమటికి తెలుగు ప్రజల ఘనస్వాగతం..

జయరామ్‌ కోమటి ఉత్తర అమెరికాలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియమితులైన అనంతరం ఆయన అమెరికా వెళ్లగా అక్కడి తెలుగు ప్రజలు, ఎన్నారై టీడీపీ అభిమానులు ఘనస్వాగతం పలికారు. బే ఏరియా తెలుగు అసోసియేషన(బాటా), ఎన్నారై టీడీపీ, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)కు చెందిన సుమారు రెండు వందల మంది ఆయనకు ఘనస్వాగతం పలికి పూలమాలలు, పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. అంతేకాదు శానఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుండి 150 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా మాతృ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని.. ఏపీ ప్రభుత్వానికి, ఎన్నారై తెలుగు కమ్యూనిటీకి మధ్య వారధిగా నిలిచి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతానని చెప్పారు.

డాక్టర్ పై కాల్పులు ఆపై ఆత్మహత్య

హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో శశికుమార్ అనే డాక్టర్ ఉదయ్ అనే మరో డాక్ట్రర్ పై కాల్పులు జరపిన సంగతి తెలిసిందే. అయితే ఉదయ్ పై కాల్పులు జరిపిన అనంతరం శశికుమార్ మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం ఉదయ్, సాయి, శశికుమార్ అనే ముగ్గురు వైద్యులు మాదాపూర్‌లో స్థాపించిన లారల్ ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. అయితే వీరి ముగ్గురికి ఆస్పత్రి ఆర్ధిక లావాదేవీల విషయంలో విబేధాలు రావడంతో శశికుమార్ ఉదయ్ పై కాల్పులు జరిపాడు. ఉదయ్ పై కాల్పులు జరిపిన అనంతరం మొయినాబాద్ నక్కలగుడ్డలో ఉన్న తన ఫాం హౌస్‌లో గన్‌తో రెండు రౌండ్లు కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అతని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు శశికుమార్ ఆత్మహత్య చేసుకొన్న ఫాం హౌస్లో సూసైడ్ నోట్ దొరికినట్టు పోలీసులు తెలుపుతున్నారు. తన చావుకు సాయి కుమార్, ఉదయ్ లే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తన వద్ద పని చేసిన వారే తనను మోసం చేశారని పేర్కొన్నారు. అంతేకాదు ఉదయ్ పైన తాను కాల్పులు జరపలేదని, మరో డాక్టర్ సాయి కాల్పులు జరిపాడని, నేను భయపడి పారిపోయానని తెలిపాడు.

విజయోత్సాహంలో… చంపేశారు!

ఎన్నికలలో గెలిస్తే ఎవరన్నా మిఠాయిలు పంచుకుంటారు, మరీ సరదాగా ఉంటే రంగులు చల్లుకుంటారు. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లో తుపాకులను గాలిలోకి కాలుస్తుంటారు. అలాంటి ఒక సంఘటనలో గత ఆదివారం ఒక అభంశుభం ఎరుగని పిల్లవాడు బలైపోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కైరానా పట్టణంలో స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇందులో సమాజ్‌వాదీకి చెందిన నఫీసా అనే అభ్యర్థి గెలుపొందారు. ఆ గెలుపు సందర్భంగా నఫీసా అనుచరులు గాల్లోకి కాల్పులు జరపడంతో అదే దారిలో రిక్షాలో వెళ్తున్న సమి అనే ఎనిమిదేళ్ల పిల్లవాడు మృతిచెందాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లో తుపాకుల రాజ్యం ఏలుతోందని ఇప్పటికే తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన ఘటన వల్ల తన ప్రభుత్వానికి మరింత మచ్చ ఏర్పడే అవకాశం ఉందని భావించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌. దాంతో స్థానిక పోలీస్‌ అధికారులను ఆగమేఘాల మీద సస్పెండ్‌ చేశారు. మరో పక్క పోలీసులు కూడా ఈ ఘటనకు కారణమైన ఒక ముగ్గురిని నిన్న అదుపులోకి తీసుకున్నారు. పిల్లవాడి తరఫున బంధువులు మాత్రం శోకసంద్రంలో మునిగిపోయారు.

15 పాఠశాలలకు బాంబు బెదిరింపు..

ఇటీవలే అస్ట్లేలియాలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చి అందరిని భయానికి గురిచేశారు దుండగలు. ఇప్పుడు అలాంటి పరిణామమే తమిళనాడులో చోటుచేసుకుంది. తమిళనాడులోని కడలూరులో పాఠశాలలకు బాంబు బెదిరింపు ఫోన్లు వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు ఫోన్లు రావడంతో భయపడి పాఠశాలలను మూసివేశారు. అధికారులు వెంటనే స్పందించి బాంబు స్క్వాడ్‌ సిబ్బందిని తెప్పించి పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. దీంతో పాఠశాలల్లో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. కాగా తల్లిదండ్రులు ఎవరూ భయభ్రాంతులకు గురి కావద్దని పిల్లలందరూ క్షేమంగానే ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. విద్యార్థులందరిని వారి వారి ఇళ్లకు పంపించివేశారు.

అసదుద్దీన్‌ ఒవైసీ అరెస్టు… విడుదల!

గ్రేటర్‌ ఎన్నికలలో జరిగిన ఒక దాడి కేసులో మజ్లిస్‌ పార్టీ నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ నేడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనకు ఆరోగ్య తనిఖీలను నిర్వహించిన పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం వేళకి అసదుద్దీన్‌ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి ఆయనను ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు మీద విడుదల చేశారు. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా పాతబస్తీలోని పురానాపూల్ వద్ద అసదుద్దీన్ తన అనుచరులతో కలిసి కాంగ్రెన్ నేతల మీద దాడి చేశారన్నది ప్రధాన అభియోగం. ఈ దాడిలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వాహనం ధ్వంసం కాగా, షబ్బీర్ అలీకు స్వల్ప గాయాలు అయ్యాయి. కాంగ్రెస్ నేతల అభియోగం మేరకు పురానాపూల్‌లో మళ్లీ రీపోలింగ్‌ సైతం జరిగింది. దాడికి అసదుద్దీన్‌ నేతృత్వం వహించారనీ, భౌతిక దాడికి పాల్పడ్డారనీ… ఆయన మీద కేసు నమోదైంది.

గోమూత్రం గురించి సలహాలివ్వండి- మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి!

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ఆవులంటే మహాప్రేమ. తన అధికారిక నివాసంలో కొన్ని ఆవులను పెంచడమే కాకుండా, త్వరలోనే ఒక గోశాలని కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు ఆయన. అలాంటి శివరాజ్ సింగ్ ఈమధ్యనే ఒక రైతు సంఘంతో సమావేశం అయ్యారు. 'భారతీయ కిసాన్‌ సంఘ్‌' అనే ఈ రైతుల సంఘాన్ని కలుసుకున్న శివరాజ్‌సింగ్‌… గోమూత్రం గురించి ఏం చేయాలో ఆలోచించమని అడిగారు. వృధాగా పోతున్న గోమూత్రాన్ని, గోమయాన్ని అమ్ముకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఒక సలహాసంఘం ద్వారా తనకి తెలియచేయమని చెప్పారు. దానికి సదరు రైతులు ప్రభుత్వమే ఎంతో కొంత చెల్లించి వీటిని కొనుగోలు చేసుకుంటే బాగుంటుందని సూచించారట!!!

ముద్రగడ దీక్షపై అచ్చెన్నాయుడు.. అభిమానుల సంబరాలు..

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారం దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈయన డిమాండ్లకు గాను ప్రభుత్వం సానుకూలంగా స్పందిచి.. ఆయనతో రాజకీయ నేతలు దీక్ష విరమణ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ముద్రగడతో చర్చలు సానుకూలంగా జరిగాయని.. చర్చలు సఫలం కావడంతో ఆయన దీక్ష విరమించారని వెల్లడించారు. అంతేకాదు కాపులను బీసీల్లో చేర్చే విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది..వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వాలని కమిషన్‌ను కోరామని అచ్చెన్నాయుడు తెలిపారు. మరోవైపు ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించడంతో కిర్లంపూడిలో ముద్రగడ నివాసం ఎదుట బాణా సంచా కాలుస్తూ ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

రసాయనాల కంపెనీలో అగ్నిప్రమాదం… ఆరుగురి మృతి!

హైదరాబాదుకి అతి సమీపంలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలోని మంకాళ్‌ పారిశ్రామికవాడలో ఈ రోజు ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. హాసిత అనే రసాయనాల కర్మాగారంలో వేర్వేరు రసాయనాలను కలుపుతుండగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో చత్తీస్‌ఘడ్‌కు చెందిన నలుగురు కార్మికులతో సహా మొత్తం ఆరుగురు మృత్యువాత పడ్డారు. హాసిత కర్మాగారానికి సరైన లైసెన్స్‌ కానీ ఇతరత్రా అనుమతులు కానీ లేవనీ… దాదాపు ఎనిమిది నెలల కిందటే వీరిని సంస్థను మూసివేయమని చెప్పినా కూడా అనధికారికంగా కర్మాగారాన్ని నడుపుతున్నారనీ తెలుస్తోంది. స్థానిక శాసనసభ్యుడైన తీగల కృష్ణారెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నవారిని పరమామర్శించారు. మృతులు కుటుంబాలకు కనీసం 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలంటూ సంస్థ యాజమాన్యాన్ని హెచ్చరించారు!

ముద్రగడ దీక్ష విరమణ...

నాలుగురోజులుగా కిర్లంపూడిలో సాగుతున్న ఉద్రిక్తతకు తెరపడింది. ప్రభుత్వ ప్రతినిధులైన అచ్చెన్నాయుడు, కళావెంకట్రావులు ముద్రగడ పద్మానాభం దంపతులకు నిమ్మరసాన్ని అందించి దీక్షను విరమింపచేశారు. ముద్రగడ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వం కొన్ని స్పష్టమైన హామీలను అందించడంతో ఆయన దీక్షను విరమించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం, కాపు కార్పొరేషన్‌కు ఏటా వేయి కోట్లు అందించడమే కాకుండా... కార్పొరేషన్‌కు ఇప్పటివరకూ వచ్చిన అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాపులను బీసీలలోకి చేర్చేందుకు ఏర్పాటు చేసిన మంజునాధ కమీషన్ కాలపరిమితిని కూడా వీలయినంతగా తగ్గించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉండటంతో ముద్రగద దీక్షను విరమించారు. తుని సంఘటన సందర్భంగా నమోదైన కేసులు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తుని సంఘటలకు అకారణంగా ఎవరినీ బాధ్యులను చేయమనీ, దానికి సంబంధించి ఎలాంటి కఠినమైన కేసులనూ నమోదు చేయమని ప్రభుత్వం తరఫున ముద్రగడకు హామీ లభించినట్లు సమాచారం.

శవాన్ని ఇంట్లో దాచిపెట్టి పెళ్లి!

నవీన్‌, ఆర్జూ ఇద్దరూ ప్రేమించుకున్నారు. కానీ వారి పెళ్లికి నవీన్‌ ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. పెద్దలకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇబ్బంది పడటం ఇష్టం లేని ఆ జంట ఇక ఎప్పటికీ కలవకూడదని నిర్ణయించుకుంది. ఇంతదాకా బాగానే ఉంది. కానీ నవీన్‌కి వేరొకరికతో వివాహం నిశ్చయం కావడంతో సమస్యలు మొదలయ్యాయి. పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకోవాలని ఆర్జూ పట్టుపట్టింది. తన పెళ్లి గురించి ఆర్జూని ఒప్పించడమో, ఆమె పెద్దలని హెచ్చరించడమో చేస్తే సరిపోయేదానికి వేరే నిర్ణయాన్ని తీసుకున్నాడు నవీన్‌. దిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆర్జూని గతవారం బయటకి తీసుకువచ్చాడు. మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లాడు. నవీన్‌ తనను పెళ్లి చేసకునే ఉద్దేశ్యంతోనే ఉన్నాడన్న సంతోషంలో ఉన్న ఆర్జూని... సజీవ దహనం చేశాడు! ఆమె శవాన్ని తన ఇంట్లోనే దాచిపెట్టి, ఏమీ ఎరగనట్లు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. రోజులు గడిచినా ఆర్జూ కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె గురించి వెతకడం మొదలుపెట్టారు. వెతుకులాటలో భాగంగా నవీన్‌ ఇంటిని చేరుకున్న పోలీసులకి అక్కడ ఆర్జూ శవం కనిపించింది. ఈ సంఘటన ఇటు ఆర్జూ ఇంట్లోనే కాదు, అటు కొత్త పెళ్లికూతురు ఇంట్లోనూ విషాదాన్ని నింపింది!

దాసరిగారూ... కిర్లంపూడికి వెళ్లొద్దు!

ముద్రగడ దీక్షకు మద్దతుగా కిర్లంపూడికి ప్రముఖుల వలస మొదలైది. వీరి రాక వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. తమ ఆందోళనను పట్టించుకోకుండా ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వస్తే తునిలో జరిగిన సంఘటనలే పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముద్రగడను కలుసుకునేందుకు బయల్దేరిని దాసరి ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు. ఆయనను కలిసిన పోలీసులు కిర్లంపూడికి వెళ్లవద్దని ఆయనను కోరినట్లు సమాచారం. మరోపక్క దీక్ష మొదలై 70 గంటలు దాటిపోవడంతో ముద్రగడ దంపతుల ఆరోగ్యం గురించి భయాందోళనలు మొదలయ్యాయి. ముద్రగడ దంపతులు వైద్య పరీక్షలను కూడా నిరాకరించడంతో... ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసే అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల తూర్పుగోదావరి జిల్లా అంతటా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పవన్‌ కళ్యాణ్ తన అన్నకంటే దారుణం... వర్మ

నిరంతర ప్రచార స్రవంతి రాంగోపాల్ వర్మకి ఈసారి పవన్‌ చక్కగా దొరికిపోయారు. తుని సంఘటన గురించి పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు నొప్పించక తానొవ్వక అన్న చందంగా సాగిపోయిన సంగతి తెలిసిందే! అసలే ఎప్పడెప్పుడు పవన్‌ కళ్యాణ్‌ని టార్గెట్‌ చేద్దామా అని కాచుకుని ఉండే వర్మకి ఈ సంఘటన వరంలా మారింది. అసలు పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడిన విషయాలు తనకన్నా అర్థమయ్యాయా అని తన ట్టిట్టర్‌లో ఎద్దేవా చేశారు వర్మ. పవన్‌ కళ్యాణ్‌ ఎవరివో చెప్పడు మాటలు విని ప్రభావితం అయ్యారనీ... అందుకే ఆయన మాటలలో నిజాయితీ లోపించిందని ఆరోపించారు. ఎంతో ఆర్భాటంగా రాజకీయాలలోకి దిగిన పవన్‌ తన అన్నకంటే దారుణమైన స్థితిలోకి జారిపోతున్నారంటూ విమర్శలు గుప్పించారు. పైగా ఈ విషయంలో తనతో ఏకీభవించని పవన్‌ అభిమానులంతా నమ్మకద్రోహులంటూ చురకలు అంటించారు. మరి ఇంతకీ వర్మ చెప్పిన మాటల్లో నిజం ఉన్నట్లా లేనట్లా అంటే పవన్ ఉపన్యాసాన్ని మరోసారి వినాల్సిందే!

నేడు కిర్లంపూడికి చిరంజీవి...

తునికి ప్రముఖుల పరామర్శలు వెల్లువెత్తనున్నాయి. చిరంజీవి, బొత్స సత్యనారాయణ, దాసరి నారాయణరావు... తదితర కాపు ప్రముఖులంతా నేడు కిర్లంపూడికి ప్రయాణం కడుతున్నారు. వీళ్ల రాకతో ఉద్యమంలో ఎలాంటి మార్పులు వస్తాయో అని పోలీసు అధికారులు ఉద్విగ్నంగా ఉన్నారు. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన చిరంజీవి, తన వర్గంవారి అంచనాలని అందుకోలేకపోయారన్న విమర్శను మూటగట్టుకున్నారు. మరి తిరిగి వారి నమ్మకాన్ని తిరిగి చూరగొనేందుకు చిరంజీవి సంచలనాత్మక ప్రకటన ఏదన్నా చేస్తారేమో! ఇక తన దగ్గర చాలా సంచలన విషయాలున్నాయంటూ తరచూ ఊరించే దాసరి, ఇవాళ కూడా తనదైన శైలిలో ప్రభుత్వం మీద విరుచుకుపడే అవకాశం ఉంది.

మేయర్ సెలక్షన్ కు నోటిఫికేషన్

హైదరాబాద్‌ మహా నగర మేయర్‌ ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. మొత్తం ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ రాహుల్‌ బొజ్జ 150 మంది కార్పొరేటర్లు, 67 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులకు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ హాల్‌కు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 11న ఉదయం పది గంటలకు మేయర్‌ ఎన్నిక జరగనుంది. ఎక్స్‌ అఫీషియో సభ్యుల్లో 24 మంది ఎమ్మెల్యేలు, 29 మంది ఎమ్మెల్సీలు, పదిమంది రాజ్యసభ, నలుగురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. నోటిఫికేషన్ విడుదలవడంతో, మేయర్‌ ఎవరు అన్నదానిమీదే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేయర్ ను సొంతంగానే ఏర్పాటు చేసే మెజార్టీ ఉన్న టిఆర్ఎస్, ఆ పీఠాన్ని ఎవరికి ఇవ్వబోతోంది..? బీసీ జనరల్‌కి ఇచ్చేలా ఉంటే ఎవరికి లభిస్తుంది..? మహిళలకు అవకాశం కల్సించలేదనే విమర్శలపాలవుతున్న గులాబీ దండు, మేయర్ పదవిని మహిళకు కేటాయిస్తే, ఆ స్థానం ఎవరిది..? ఇవీ ఇప్పుడు జోరుగా షికారు చేస్తున్న ప్రశ్నలు..పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడైన కేకే కుమార్తె విజయలక్ష్మికే ఎక్కువ ఛాన్స్ ఉందనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే పదకొండో తారీఖు వరకూ వెయిట్ చేయక తప్పదు.

వంటపని కోసం 4000 దరఖాస్తులు!

ప్రభుత్వ ఉద్యోగం అంత సుఖం లేదన్నది ఇప్పటి యువత అభిప్రాయం. అందుకే ప్రభుత్వం ఏ ఉద్యోగం కోసం పిలుపునిచ్చినా… వేలు, లక్షలుగా జనం తరలి వస్తున్నారు. తాజాగా జార్ఖండ్  పోలీసు శాఖ వంటపని వారు కావాలంటూ ప్రకటన జారీచేసింది. ఆ ప్రకటనకి బదులుగా వేలమంది అభ్యర్థులు స్పందించారు. అందులో 4000 మందికి ఆ రాష్ట్ర రాజధాని రాంచీలో నిన్న వంట పరీక్షలు కూడా జరిగాయి. ఇందులో ఎవరు బాగా వంట చేశాలో నిర్ణయించి ఆ నాలుగువేల మందిలోంచి 78 మందికి రాష్ట్రంలోని వివిధ పోలీసు శాఖలలో వంటవాడిగా ఉద్యోగాన్ని ఇవ్వనుంది అక్కడి ప్రభుత్వం. ‘ప్రభుత్వ ఉద్యోగం అంటే భవిష్యత్తు గురించి చింత ఉండదనీ, ఆడుతూ పాడుతూ నెలకో ఇరవై వేలు సంపాదించుకోవచ్చనీ’ అభ్యర్థులలో చాలామంది చెప్పుకు వచ్చారు.

పరిహారం చెల్లించనందుకు… రైలు ఇంజను జప్తు

ఎవరన్నా ప్రభుత్వానికి బాకీ పడితే వారి నుంచి అధికారులు ముక్కుపిండి మరీ రుణాన్ని వసూలు చేసుకుంటారు. కుదరని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి వారి ఆస్తులను జప్తు చేసుకుంటారు. కానీ ఏకంగా రైల్వే శాఖే ప్రజలకు బాకీని తీర్చకపోతే ఏం చేయాలి. అందుకనే కర్ణాటకలోని ఒక న్యాయస్థానం, రైల్వేవారి ఆస్తులైన రైలింజనును జప్తు చేసుకోవలసిందిగా ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే… కర్ణాటకలోని చిత్రదుర్గ-రాయదుర్గల మధ్య రైల్వే లైనుని నిర్మించేందుకు రైల్వే శాఖ కొందరు రైతుల నుంచి భూమిని తీసుకుంది. అయితే ఇందుకోసం తగిన నష్టపరిహారాన్ని చెల్లించకపోవడంతో 30 ఏళ్లుగా రైతులు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఎట్టకేళకు గత నవంబరు నెలలో, కోర్టు తీర్పు రైతులకు అనుకూలంగా వచ్చింది. వారికి వీలైనంత త్వరలో పరిహారాన్ని చెల్లించమని న్యాయస్థానం, రైల్వే శాఖను ఆదేశించింది. అయితే ఈ కోర్టు తీర్పుని కూడా రైల్వేవారు లెక్కచేయకపోవడంతో ‘హరిహర-చిత్రదుర్గ-బెంగళూరు’ మధ్య తిరిగే ప్యాసింజరు రైలుని జప్తు చేసుకోవల్సిందిగా కోర్టు ఆదేశించింది. అప్పుడు కానీ రైల్వే అధికారులు దిగారాలేదు. గత శుక్రవారం రైలు జప్తు కావడంతో ‘ఈసారి తప్పకుండా పరిహారాన్ని చెల్లిస్తాం. దయచేసి మా ఇంజనుని విడిచిపెట్టండి’ అంటూ కోర్టుని వేడుకున్నారు అధికారులు. కోర్టు దయతో తిరిగి ఇంజను కదిలింది! మరి ఈసారైనా రైతులకి పరిహారం లభిస్తుందో లేదో!