గుత్తా పోవడంతో శని పోయింది.. కోమటిరెడ్డి
posted on Jun 14, 2016 @ 2:49PM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుండి నలుగురు నేతలు టీఆర్ఎస్లోకి చేరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దీనిపై స్పందించిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పార్టీ నేతలపై మండిపడ్డారు. నల్గొండ లోక్సభ సభ్యుడు గుత్తా సుఖేందర్రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లిపోనుండడంతో కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని పోయింది అని ఆయన అన్నారు. గుత్తా, భాస్కర్ రావు పార్టీ కండువా మారుస్తోన్న సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సహేతుకమైనవి కావని ఆయన వ్యాఖ్యానించారు. వారు పార్టీని వీడుతున్నందుకు తమ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారని కోమటిరెడ్డి అన్నారు. పార్టీని వీడనున్న నేతలు రాజీనామా చేసి మళ్లీ గెలిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని కోమటిరెడ్డి ప్రకటించారు. కాగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, వినోద్, ఎమ్మెల్యే భాస్కరరావు టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.