సత్తా చాటుతున్న కొత్త కుర్రాళ్లు.. ఐదో వికెట్ కోల్పోయిన జింబాబ్వే

  జింబాబ్వే రాజధాని హరారే లో భారత్-జింబాబ్వే మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచి భారత్ ఫిల్డింగ్ ఎంచుకోగా.. జింబాబ్వే బ్యాటింగ్ కు దిగింది. అయితే టీమిండియాలో ఉందని కొత్త కుర్రాళ్లే అయినా తమ సత్తా చాటుతున్నట్టు తెలుస్తోంది. కెప్టెన్ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన కొత్త బౌలర్లు వరుసగా జింబాబ్వే వికెట్లు తీస్తున్నారు. 15 ఓవర్లు ముగిసేసరికి 49 పరుగులిచ్చిన భారత బౌలర్లు మూడు వికెట్లు పడగొట్టారు 77 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. 23.6 ఓవర్‌ వద్ద అక్సర్‌ బౌలింగ్‌లో ఇర్విన్‌ 21(45) ఫెయిజ్‌ ఫజల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు.

ఇంటికెళ్లండి... మగతనానికి పూజలు చేయండి... ప్రవీణ్ తొగాడియా

  విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) కీలక నేత ప్రవీణ్ తొగాడియా వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మరోసారి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి రచ్చ రచ్చ చేశారు. గుజరాత్ లోని భరూచ్ జిల్లా జంబూసార్ లో జరిగిన సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. హిందూ పురుషుల్లో ‘ఇంపోటెన్సీ’ (లైంగిక సామర్ధ్యం) నానాటికి తగ్గిపోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా.. ‘ఇంటికెళ్లండి... మగతనానికి పూజలు చేయండి’’ అని హిందువులకు ఓ సలహా కూడా ఇచ్చారు. ముస్లింల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది.. వారికి ధీటుగా హిందువులు కూడా పిల్లల్ని కనాలని.. లైంగిక పటుత్వాన్ని పెంచేందుకు తానో మందును తయారు చేశానని చెప్పిన ఆయన... రూ.600 విలువ కలిగిన సదరు మందును రూ.500లకే ఇవ్వనున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతుంది.

ప్రియాంక పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్దం..

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూతురు, ఇందిరా గాంధీ మనమరాలు ప్రియాంక గాంధీ పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్దమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమెను ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అంతేకాదు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కంటే.. ప్రియాంకా గాంధీని బరిలోకి దించితేనే గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకు సోనియా గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆమె యూపీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ప్రచార బాధ్యతలు  భుజాన వేసుకునేందుకు సిద్ధమయ్యారు. 2019లో రాహుల్ గాంధీ కాకుండా ప్రియాంక గాంధీనే యూపీ ఎన్నికల బరిలో దిగనున్నట్టు ప్రచారం సాగుతోంది.   మరోవైపు ఈ ఎన్నికలపై బీజేపీ కూడా  సాధ్యమైనన్ని సీట్లు సాధించడమే కాకుండా ఆ రాష్ట్ర అధికార పగ్గాలను కూడా చేజిక్కించుకునేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలపైనే దృష్టిసారించినట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో దెబ్బతిన్న కారణంగా మళ్లీ పుంజుకునేందుకు.. ఈ ఎన్నికలనే అస్త్రంగా భావిస్తుంది. మరి ప్రియాంక గాంధీ ఎంతవరకూ.. వారి ఆశలను నిజం చేస్తారో చూడాలి.

ముద్రగడ అరెస్ట్ పై చిరంజీవి ఆగ్రహం..

తుని ఘటనపై కాంగ్రెస్‌ నేత చిరంజీవి స్పందించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తుని ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని  డిమాండ్‌ చేశారు. కాపు, బలిజ, ఒంటరి కులాలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ముద్ర‌గ‌డ అరెస్టు అమానుష‌మ‌ని, పోలీసులు ఆయ‌న ప‌ట్ల వ్య‌వ‌హ‌రించిన తీరుపై చిరంజీవి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముద్ర‌గ‌డను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని తాము ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్ర‌భుత్వం ముద్ర‌గ‌డ‌పై వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరు క‌క్ష సాధింపు చ‌ర్య‌లా ఉంద‌ని ఆయ‌న అన్నారు.   కాగా ముద్రగడ పద్మనాభం రాజమహేంద్రవరం ఆస్పత్రిలో తన ఆమరణ దీక్షను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకపక్క ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నా వైద్య పరీక్షలు చేసుకునేందుకు మాత్రం ఆయన నిరాకరిస్తున్నారు. మరో వైపు ముద్రగడ అరెస్ట్‌కు నిరసనగా తూర్పుగోదావరి జిల్లాలో బంద్‌ కొనసాగుతోంది.

ఖడ్సే కు క్లీన్ చిట్.. దావూద్ ఇబ్రహీం ఫోన్ కాల్స్ కాదట..

  అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో లింకులు ఉన్నాయంటూ మహారాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఏక్ నాథ్ ఖడ్సేపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దావూద్ ఇబ్రహీంకు, ఖడ్సే కు మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని.. దావూద్ పలుమార్లు ఖడ్సేకు ఫోన్ చేశాడని కథనాలు వచ్చాయి. దీంతో ఆయన తన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఖడ్సేకు క్లీన్ చిట్ వచ్చినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు పాక్ నుంచి వచ్చినట్లుగా భావిస్తున్న ఫోన్ కాల్స్ దావూద్ ఇబ్రహీం ఇంటి నుంచి వచ్చినవి కావని..  దావూద్ ఇంటి నుంచి ఫోన్ కాల్స్ తనకు వచ్చాయని చెబుతున్న నెంబరును అసలు ఆయన ఏడాదిగా వాడటమే లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దావూద్ తో లింకుల విషయంలో ఖడ్సేకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ముంబై పోలీసులు సిద్ధమవుతున్నారు. మరి దీనిపై ఖడ్సే ఏవిధందా స్పందిస్తారో చూడాలి.

పుట్టినరోజు వేడుకల్లో లాలూ.. నితీశ్ కుమార్ శుభాకాంక్ష‌లు

  రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ అధ్య‌క్షుడు లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ తన 69వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. బీహార్‌ పాట్నాలోని త‌న నివాసంలో నేడు కుటుంబ సభ్యుల మ‌ధ్య ఆయ‌న ఈరోజు ఉద‌యం కేక్ క‌ట్ చేశారు. భార్య ర‌బ్రీదేవితో పాటు త‌న‌కూతురు ఈ సంద‌ర్భంగా ఇచ్చిన పుష్ప‌గుచ్చాని ఆయ‌న స్వీక‌రించారు. ఇంకా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా లాలూకి శుభాకాంక్షలు తెలిపారు. లాలూ నివాసానికి చేరుకుని ఆయ‌నకు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. లాలూ ఆరోగ్యంగా ఉండాల‌ని కోరుకున్నారు. ఇంకా లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ పుట్టిన రోజు వేడుక సంద‌ర్భంగా ఆయ‌న ఇంటి వ‌ద్ద పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

చోటా షకీల్ లిస్ట్ లో స్వామి చక్రపాణి కూడా..

  మాఫియా డాన్  చోటా రాజన్ ను మట్టుబెట్టే కేసులో దావూద్ ఇబ్రహీం అనుచరుడు చోటా షకీల్ ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇతనితో పాటు తాను రంగంలోకి దించిన నలుగురు కిల్లర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటపడింది. చోటా షకిల్ లిస్ట్ లో ఒక్క చోటా రాజన్ మాత్రమే లేడని.. హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. చక్రపాణి.. దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలంలో ఆయన కారును కొనుగోలు చేసి దానిపై పెట్రోల్ పోసి తగలబెట్టినందుకు గాను చక్రపాణిని కూడా చంపేయాలని చోటా షకీల్ ఆ కిల్లర్లకు ఆదేశాలు జారీ చేశాడట. మరి ఇంకా ఎంతమంది చోటా షకిల్ లిస్టులో ఉన్నారో..

మాల్యాకి బిగుస్తున్న ఉచ్చు.. ‘ప్రొక్లెయిమ్డ్ అఫెండర్’గా

  విజయ్ మాల్యా కేసులో దర్యాప్తు వేగవంతం చేయడానికి.. కేసును సిట్ బృందానికి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈడీ మరో కీలక అడుగు వేసినట్టు తెలుస్తోంది. మాల్యాను ‘ప్రొక్లెయిమ్డ్ అఫెండర్’గా ప్రకటించాలని ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై కోర్టు ఈ నెల 13న విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈడీ అభ్యర్థనకు కోర్టు సానుకూలంగా స్పందిస్తే... మాల్యా అరెస్ట్ కు అవకాశాలు మరింత మెరుగుపడతాయన్న వాదన వినిపిస్తోంది.   కాగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోకరా వేసి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విదేశాలకు చెక్కేసిన సంగతి తెలిసిందే. ఈయన పై ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేయించింది. ఇంకా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడానికి ప్రయత్నిస్తుంది.

అమరావతికి ఏపీ ఉద్యోగుల బదిలీలు ప్రారంభం..

  ఏపీ సీఎం చంద్రబాబు ఈనెల 27 నాటికి హైదరాబాద్లో ఉన్న ఉద్యోగులందరూ ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతికి రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే ఉద్యోగులకు అద్దెలు ఎక్కువగా ఉన్నాయన్న కారణంగా.. వారికి హెచ్ఆర్ఏ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఇంకా ఏపీ స్థానికతకు కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాడు.   దీంతో అమరావతికి ఏపీ ఉద్యోగుల బదిలీలు ఈరోజు నుండే ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రేపటి నుంచి ఈ నెల 20 వరకు బదిలీలు కొనసాగుతాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగులంతా ఏపీకి తరలాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐదేళ్లు ఒకేచోట పని చేసినవారంతా కదలాల్సిందేనని పేర్కొంది. అయితే, బదిలీకి కనీసం రెండేళ్ల సర్వీసు ఉండాలని నిబంధన విధించింది. అయితే వ్యవసాయశాఖ ఉద్యోగులకు మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రుతుపవనాలు వచ్చేయడంతో వ్యవసాయ శాఖలో బదిలీలు ఉండవని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

గాంధీతో పనిచేసిన స్వాతంత్య్ర సమరయోధుడు కన్నుమూత

జాతిపిత మహాత్మాగాంధీతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో పనిచేసిన సమరయోధుడు సుభాంశు జిబాన్‌ గంగూలీ మరణించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గుండె పోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు 99 ఏళ్లు. 1930లో తంగలుబెరియా పోలీస్‌ స్టేషన్‌ ముట్టడించినందుకు రెండేళ్లు, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు మూడేళ్లు జైలు జీవితం గడిపారు. 1946లో కోల్‌కతా, నోవఖలిలో జరిగిన అల్లర్ల సమయంలో గాంధీజీతో కలిసి శాంతియుత ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం గంగూలీ పశ్చిమ్‌బంగా స్వాతంత్ర్య యోధుల సలహాదారుల సంఘానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నిన్న విధులకు కూడా హాజరయ్యారు. కానీ ఈరోజు గుండెనొప్పితో మరణించారు

బెంచ్ పై నుంచున్న బీజేపీ ఎమ్మెల్యే.. వినూత్న నిరసన..

  సాధారణంగా అసెంబ్లీల్లో నిరసన తెలియజేయాలంటే.. సభ జరగకుండా అడ్డుకోవడమో.. లేక స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి నినాదాలు చేయడమో చూస్తుంటాం. కానీ ఢిల్లీ అసెంబ్లీలో మాత్రం ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒక ఎమ్మెల్యే తన నిరసనను తెలియజేయడానకి ఏకంగా బెచ్ ఎక్కేశాడు. ఢిల్లీ శాసనసభలో విపక్ష నేతగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా ట్యాంకర్ల స్కాం గురించి తన నిరసనను వ్యక్తం చేసేందుకు అసెంబ్లీలో బెంచ్ ఎక్కారు. దీంతో విజేంద్ర గుప్తా చేసిన పనికి మిగతా ఎమ్మెల్యేలు అవాక్కయ్యారు. అయితే స్పీకర్ రామ్ నివాస్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ విధంగా నిరసన తెలిపిన వారిని చూడటం ఇదే మొదటిసారి అంటూ విజేంద్ర గుప్తా చేసిన పనికి మండిపడ్డారు. సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ స్పీకర్ మందలించినప్పటికీ విజేంద్ర గుప్తా ఏమాత్రం తగ్గలేదు. ఆ సమయంలో సభలో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా ఉండటం గమనార్హం.

ఆడ వేషంలో 11 పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు.

  ఓ ఘనుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. పురుషుడే స్త్రీవేషం వేసుకొని 11 మందిని పెళ్లిచేసుకున్నాడు. ఈ విచిత్రమైన ఘటన చైనాలో చోటుచేసుకుంది. చైనాలో మియావూ సొంగాటో అనే వ్యక్తి నిత్యం మహిళలా అందంగా ముస్తాబై ఆన్ లైన్ లో ఛాటింగ్ చేస్తూ.. ప్రోఫైల్ బాగున్న అబ్బాయిలను ఆడగొంతుతో మాయచేసేవాడు. కేవలం వెబ్ ఛాట్ ద్వారా వారిని పెళ్లి వరకు తీసుకెళ్లేవాడు. ఇలా ఏడాదిలో 11 మంది అబ్బాయిలను ఆడవేషంలో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత గిఫ్టులు, పెళ్లి వారింట్లో డబ్బులు పట్టుకుని మెల్లిగా చెక్కేసేవాడు. అయితే 11వ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సొంగాటో అసలు రంగు బయటపడింది. అతని ఇంటిపై దాడి చేసిన పోలీసులు, పెద్దఎత్తున స్త్రీలు ఉపయోగించే దుస్తులు, మేకప్ సామాన్లను స్వాధీనం చేసుకున్నారు.

మా డబ్బు మాకు కట్టండి:హోటల్ ముందు బ్యాంక్ సిబ్బంది ఆందోళన

వేలకోట్ల రూపాయలు బ్యాంకులకు టోపి పెట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా ఎఫెక్ట్‌తో దేశంలోని బ్యాంకులన్ని అలర్టయ్యాయి. పొగుబడుతున్న బకాయిలను వసూలు చేసుకోవడానికి పలు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబ్బంది వినూత్నంగా ఆలోచించారు. నగరంలోని మాదాపూర్ ట్రైడెంట్ హోటల్ యాజమాన్యం హోటల్ నిర్మాణం, నిర్వాహణ కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.118 కోట్లు అప్పుగా తీసుకుంది. గతేడాది సెప్టెంబర్ నుంచి వాయిదాలు చెల్లించడం లేదు. బ్యాంక్ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చినా..స్పందించకపోవడంతో ఈ రోజు హోటల్ ముందు బ్యాంక్ సిబ్బంది ధర్నాకు దిగారు. ఎలాంటి నినాదాలు లేకుండా ఫ్లకార్డులతో ఆందోళన నిర్వహించారు.

ఒకే అమ్మాయి కోసం ఇద్దరు యువకులు ఘర్షణ..

అదేదో సినిమాలో ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రేమించినట్లుగా..అచ్చం అలాగే ఒకే అమ్మాయిని ఇద్దరు యువకులు ప్రేమించారు. హైదరాబాద్ నాంపల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన ఇద్దరు యువకులు ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఈ విషయం ఒకరికొకరికి తెలియదు. మరి ఎలా తెలిసిందో ఏమో గానీ నిజం ఇద్దరికి తెలిసిపోయింది. దీంతో అమ్మాయిని వదలకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ వీరిద్దరి మధ్య తరచూ వాగ్వాదాలు చోటుచేసుకునేవి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి ఇదే విషయంపై మరోసారి గొడవపడ్డారు. అది తారాస్థాయికి చేరడంతో కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించగా..పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న అబిడ్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.

నాన్ వెజ్ తినేవాళ్లలో తెలంగాణ రాష్ట్రమే ఫస్ట్..

  ఇటీవల ఒక్క రోజులో సమగ్ర సర్వే చేసినందుకు తెలంగాణ రాష్ట్రానికి లిమ్కా అవార్డ్ దక్కింది. ఇప్పుడు మరో విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. మాంసాహారం తినే వాళ్లలో తెలంగాణ వాసులే ఫస్ట్ ప్లేస్ కొట్టేశారు. దేశంలోని నాన్ వెజ్ ఎక్కువగా తినే వారిమీద అన్ని రాష్ట్రాల్లో సర్వే నిర్వహించగా తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలను వెనక్కి నెట్టేసి ముందు ప్లేస్ దక్కించుకుంది. ఈ అంశాన్ని శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) పేర్కొంది. తెలంగాణ‌లో మాంసాహారాన్ని తీసుకుంటోన్న వారి శాతం 98.7గా ఉంద‌ని.. ఆ తరువాతం 98.55 శాతంతో  పశ్చిమ బెంగాల్  రెండవ స్థానంలోఉందని ఎస్ఆర్ఎస్ తెలిపింది. ఇక ఒడిశా, కేర‌ళ రాష్ట్రాల్లో వ‌ర‌స‌గా 97.35, 97 శాతం మంది ప్ర‌జ‌లు మాంసాహారాన్ని తీసుకుంటున్నారని.. గుజ‌రాత్‌లో గతంలో క‌న్నా మాంసాన్ని తినే వారి సంఖ్య 40 శాతం పెరిగిందని తెలిపింది.

భారత్-పాక్ లపై సుబ్రహ్మణ్యస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు

  బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కామన్. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడే స్వామి ఇప్పుడు తాజాగా పాకిస్థాన్-భారత్ ల మధ్య సంబంధాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా గతంలో సోవియట్ రష్యా వ్యవహరించిన తీరుగా వ్యవహరిస్తున్నదని అన్నారు. అప్పట్లో భారత ఆర్థిక వ్యవస్థపై సోవియెట్ రష్యాకు పూర్తి పట్టు ఉండేదని, ఇప్పడు అమెరికా తీరు అప్పటి సోవియెట్ యూనియన్ ను తలపిస్తున్నదని స్వామి పేర్కొన్నారు. అప్పట్లొ తాను భారత ఆర్థిక వ్యవస్థపై రష్యా పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడానని పేర్కొన్నారు. అయితే మోడీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి దీనిపై ఇంకా ఎంత దుమారం రేగుతుందో చూడాలి.