కాంగ్రెస్ కు ఐదుచోట్ల , దేశంకు రెండు చోట్ల డిపాజిట్లు గల్లంతు

రాష్ట్రంలో 18 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అటు కాంగ్రెస్ కు, ఇటు తెలుగుదేశం పార్టీ తీవ్రనిరాశను మిగిల్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదుచోట్ల, తెలుగుదేశం పార్టీకి రెండు చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాంగ్రెస్ పార్టీ  అభ్యర్దులు పరకాలలో పాటు అనంతపురం, ప్రత్తిపాడు, మాచర్ల, పోలవరం నియోజకవర్గాల్లో దారుణంగా డిపాజిట్లు కోల్పోయారు. తెలుగుదేశం పార్టీ  అభ్యర్డులకు నర్సాపురం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో డిపాజిట్లు దక్కలేదు. తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోయిన ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్దులు గెలుపొందడం విశేషం.
   

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ  అభ్యర్ధి ధర్మాన కృష్ణదాసు 7,312 ఓట్లు మెజారిటితో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో లక్షా 74 వేల 930 ఓట్లుండగా, ధర్మాన కృష్ణదాసుకు 54,454 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గంలో కృష్ణదాసు గెలుపు ఆయన తమ్ముడు, మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావును గట్టి దెబ్బ తీసినట్లు అయింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్  అభ్యర్దిగా ధర్మాన సోదరుల్లో ఒకరైన రామదాసు పోటీ చేశారు.  ఆయనకు 47,142 ఓట్లు వచ్చాయి.


రాష్ట్రంలో అత్యంత ఆసక్తికరంగా సాగిన పరకాల ఎన్నికల్లో టిఅర్ఎస్ అభ్యర్ధి మొలుగూరి భిక్షపతి అతికష్టం మీద తమ సమీప ప్రత్యర్ధి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి కొండా సురేఖపై 1562 ఓట్ల తేడాతో గెలుపొందారు. లక్షా 87 వేల 268 కోట్లు ఉన్న ఈ నియోజకవర్గంలో భిక్షపతికి 51,936ఓట్లు, సురేఖకు 50,374ఓట్లు వచ్చాయి. జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సమ్మారావుకు 5,099ఓట్లు, తెలంగాణా తెచ్చేదీ ఇచ్చేదీ మేమే అంటూ ప్రగల్బాలు పలికిన మరో జాతీయ పార్టీ అయినా బిజెపి అభ్యర్ధి విజయచంద్రారెడ్డికి 9,160ఓట్లు మాత్రమే పోలయ్యాయి. పరకాలలో ఈ రెండు పార్టీల అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోగా టిడిపి అభ్యర్ధి ధర్మారెడ్డికి ఎవరూ ఊహించని విధంగా 30, 850 ఓట్లు పోలయ్యాయి. ఈ ఫలితాలు టిఆర్ఎస్ కు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించాయి. భిక్షపతి మంచి మెజార్టీతో గెలుస్తారని భావించగా, ఆయనకు చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా అయింది. తెలంగాణపై గుత్తాధిపత్యం తమదే అని ప్రకటించుకుంటున్న టిఆర్ఎస్ 51,936 ఓట్లు రాగా, సమైక్యవాదపార్టీలుగా పేరుపొందిన టిడిపి, వైఎస్ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలకు కలిపి సుమారు 86వేల ఓట్లు పోలవడం విశేషం.


తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది తోట త్రిమూర్తులు గెలిచారు. అయన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది, పిల్లి సుభాష్ చంద్రబోస్ పై 11,919 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ కాంగ్రెస్, టిడిపిలు కుమక్కు అయినట్టుగా కనిపిస్తోంది. త్రిమూర్తులు 77,298 ఓట్ల సాధించగా, టిడిపి అభ్యర్ది చిక్కాల రామచంద్రరావు కేవలం 6,256 ఓట్లు పొంది డిపాజట్లు కోల్పోయారు. ఇక్కడ బోస్ కు 65,373 ఓట్లు పోలయ్యాయి.


తిరుపతి నియోజకవర్గంలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది భూమా కరుణాకరరెడ్డి 18,117 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసి గెలిచినా చిరంజీవికి 15 వేల ఓట్ల  మెజార్టీ మాత్రమె వచ్చింది. ఈ స్తోత నియోజకవర్గంలో విసృతంగా ప్రచారం చేసిన చిరంజీవి కాంగ్రెస్ పార్టీని ఒడ్డున పడేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్సీని విలీనం చేయటం వాళ్ళ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పెరగాలి. కానీ, అందుకు భిన్నంగా ఓట్లు గణనీయంగా తగ్గటం ఆ పార్టీకి దిగ్బాంతిని కలిగించింది. దీనికి చిరంజీవి వైఖరి కారణమని కొందరు కాంగ్రెస్ నాయుకలు విమర్శిస్తున్నారు.


వైయస్ఆర్ జిల్లాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి నియోజకవర్గల్లో ఆ పార్టీ అభ్యర్దులు అమరనాథ్ రెడ్డి 22,768 ఓట్ల మెజార్టీతోనూ, శ్రీనువాసులు 22,148 ఓట్ల మెజార్టీతోనూ, శ్రీకాంత్ రెడ్డి 49 వేల  మెజార్టీతోనూ ఘన విజయం సాధించారు.                  


అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి 32,472 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టిడిపి అభ్యర్థి దీపక్ రెడ్డికి 46,695ఓట్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డికి 32,995ఓట్లు వచ్చాయి. దేశంలోనే అత్యంత ధనిక అభ్యర్ధిగా పేరుపొందిన దీపక్ రెడ్డి ఈ ఎన్నికల్లో కోట్లాది రూపాయలను వెదజల్లినా దానికి తగ్గట్లుగా ఓట్లను పొందలేకపోయారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి 36,896ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ఆమెకు 88,697ఓట్లు పోలవ్వగా, టిడిపి అభ్యర్థికి 25,374ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 51,801ఓట్ల పోలయ్యాయి. ఎమ్మిగనూరులో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి 20,103ఓట్ల మెజార్టీతోనూ, పోలవరంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం బాలరాజు 35,767ఓట్ల మెజార్టీతోనూ, ఒంగోలు వై.కా.పా. అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ 27,403ఓట్ల తేడాతో గెలుపొందారు.

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

  సుబ్రతో రాయ్ అరెస్ట్ ... సహారా సంస్థ అధినేత సుబ్రతో రాయ్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా సంస్థ సేకరించిన డబ్బుల విషయంలో కోర్టు సుబ్రతో రాయ్ కు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సహారా నుంచి స్పందన లేకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది. సుబ్రతో రాయ్ ను శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేశారని సుబ్రతో రాయ్ సీనియర్ అడ్వకేట్ రామ్ జట్మలాని సుప్రీం కోర్టుకు తెలిపారు.

విఫలమైన 'టి' కాంగ్రెస్

  విఫలమైన 'టి' కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పట్టుబట్టి మరీ విభజనను సాధించింది. అయితే ఈ విజయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే అటు ప్రెస్ మీట్ లు ఇటు రోడ్ షోలు నిర్వహిస్తూ సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు తప్ప తమ తమ నియోజకవర్గాలలో పర్యటించలేదు. అలాగే జంపింగ్ జపాంగ్ లు కూడా ఎక్కువ అవుతుండటం కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రలో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణాలోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని చూసింది. టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ మీద ఆశలు పెట్టుకుని విలీనానికి పట్టుబట్టింది. కానీ ఇప్పటికీ కెసిఆర్ ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడుధోరణిలో ఉన్నారు. ఎలెక్షన్లు దగ్గరపడుతుండటంతో తాము అధికారంలోకి రావాలో, రాహుల్ గాంధీని పిఎం సీట్లో ఎలా కూర్చోపెట్టాలో తెలియక తలపట్టుకుంటుంది.

31న చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభ౦

        చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించారని వారు తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు యాత్రను పునఃప్రారంభిస్తారని వివరించారు. అలాగే ఇకపై పాదయాత్ర దూరం విషయంలోకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపై రోజువారీ దూరాన్ని కూడా తగ్గించనున్నారు. ఇప్పటి వరకూ బాబు పాదయాత్ర 117 రోజులు పూర్తీ చేసుకుంది.

కాంగ్రెస్ ఎంపీలు భేటి: రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు. నిన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎం.పి.లు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు.

నారీ నారీ నడుమ జగన్మోహనుడు

  తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.   తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.   అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా?: కేసిఆర్ ఫైర్

      జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. చీము , నెత్తురు ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్.పిలు , కిందిస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ వారంతా పార్టీని వదలాలని ” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు జరపాల్సి ఉందని  కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటన చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణపై చర్చలు ఒక నాటకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామనడం ఒక బూటకం అని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటించినా కేంద్రం అనుకుంటే తెలంగాణ ఇవ్వవచ్చని అన్నారు.

కోటి సంతకాల కధకి సంజాయిషీలు

    వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.   “సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”