రాహుల్ కి ముద్దుపెడితే చంపేసాడు

  ఎవరైన సినిమా తారలు, రాజకీయ నాయకులు.. ఇలా ఎవరైనా తమ గ్రామానికి వచ్చినప్పుడు ఒక షేక్ హ్యాండ్, కుదిరితే ఆటోగ్రాఫ్, ఫోటో దిగడం మాములుగా జరుగుతూనే ఉంటుంది. కానీ తన అభిమాన హీరో/నాయకుడికి ముద్దిచ్చే ఛాన్స్ వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి. కానీ ఆ ముద్దు ఇవ్వడం వల్ల తాను చనిపోతానని అసలు ఊహించలేము కదా! అసలు విషయమేమిటంటే... రాహుల్ గాంధీ ఇటీవలే అసోంలోని జోరత్ లో స్వయం సహాయక గ్రూపులతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు రాహుల్ కు మరింత దగ్గరగా వచ్చి అనుకోకుండా అతని చెంపలపైన, నుదిటిపైన ముద్దులు పెట్టేశారు. అయితే అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యురాలు బొంటీ ఉత్సాహం పట్టలేక రాహుల్ బుగ్గపై ముద్దు పెట్టింది.ఈ విధంగా అక్కడున్న కొంతమంది రాహుల్ కి ముద్దుల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమం అన్ని చానల్స్ లలో ప్రచారం అయ్యింది. అయితే ఈ విషయం తెలుసుకున్న బొంటీ భర్త తీవ్ర మనస్తాపానికి గురై, భార్యను నిలదీయగా ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దాంతో బొంటీ భర్త ఆవేశంతో భార్యను సజీవ దహనం చేసి, ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యయత్నం చేసాడు. బొంటీ ఆ మంటల్లో ఆహుతి అయ్యింది. కానీ ప్రస్తుతం బొంటీ భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం తాయిలం

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతీసారి సామాన్య ప్రజల గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. ఏ కొత్త పన్నులతో అవి తమ కష్టార్జితాన్ని దోచుకొంటాయో అని వారు భయపడతారు. అదేవిధంగా ఎన్నికలను చూసి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు బెంగపెట్టుకొంటాయి. ఐదేళ్ళు ప్రజలతో ప్రభుత్వాలు ఆడుకొంటే, ఎన్నికలు వచ్చినప్పుడు ఓ రెండు మూడు నెలలు వాటితో ప్రజలు ఆడుకొనే అవకాశం కలుగుతుంటుంది. కానీ ఆ మూనేళ్ళ ముచ్చటలో కూడా తమదే పైచేయి కావాలని ప్రభుత్వాలు వాటిని నడుపుతున్నరాజకీయ పార్టీలు తాయిలాలు విసురుతుంటాయి.   సబ్సీడీ గ్యాస్-ఆధార్ బందం త్రెంపి ప్రజలకు గ్యాస్ ట్రబుల్ నుండి విముక్తి కలిగించిన కేంద్ర ప్రభుత్వం, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 10 శాతం డీఏ పెంచి ఎన్నికల తాయిలాలు ఉదారంగా పంచిపెట్టింది. పేద, మధ్యతరగతికి చెందిన కార్మికులకు ప్రావిడెంట్ ఫండ్ పింఛన్ కనీస వెయ్యికి పెంచింది. నగరాలు, పట్టణాలలో ఉన్న ఓటర్లతో బాటు మారుమూల గ్రామాలలో భారంగా బ్రతుకులీడుస్తున్న గిరిజన ఓటర్లను కూడా మరిచిపోకుండా వారికి ఏడాదికి కనీసం 150 రోజులు ఉపాధి కల్పించేందుకు అంగీకరించింది. ఇంకా ఇటువంటివి చిన్నచిన్న తాయిలాలు చాలానే ప్రకటించింది. ఐదేళ్ళ పాటు అనేక కుంభకోణాలు చేసుకొంటూ కాలక్షేపం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు దగ్గర పడేసరికి ఒక్కసారిగా మేల్కొని అవినీతి చట్టాలను, మహిళా, గిరిజన సంరక్షణ చట్టాలు అంటూ చాల హడావుడి చేసింది. ఇక పార్లమెంటు సమావేశాలు కూడా ముగిసిపోవడంతో ఇప్పుడు ఇటువంటి తాయిలాలు పంచిపెడుతూ ప్రజలను మంచి చేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఐదేళ్ళ పాటు సమర్ధమయిన, అవినీతి రహితమయిన పాలన అందించి ఉంటే, ఈ తిప్పలు పడే బాధ ఉండేది కాదు కదా?

కెసిఆర్ పై గెలుస్తా .... జగ్గారెడ్డి

  కెసిఆర్ పై గెలుస్తా .... జగ్గారెడ్డి   కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే, తెలంగాణావాది తూర్పు జయ ప్రకాశ్ రెడ్డి టి.ఆర్.ఎస్. అధినేత కెసిఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మొదటి నుండి సమైక్యవాది అయిన జయప్రకాశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వచ్చే ఎన్నికలలో తాను సమైక్యవాదిగానే సంగారెడ్డి నియోజకవర్గం నుండే పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుస్తానని ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ అనుమతిస్తే తెలంగాణాలోని ఏ స్థానం నుండైనా కిసిఆర్ కి ప్రత్యర్థిగా నిలబడి కెసిఆర్ ను మట్టికరిపిస్తానని కూడా చెపుతున్నారు. రాష్ట్ర విభజనవల్ల కొంతమంది లాభపడతారే తప్ప తెలంగాణాకు ఒరిగిందేమీ లేదని, రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే తెలంగాణా అభివృద్ధి చెందుతుందని విలేఖరుల సమావేశంలో తూర్పు జయప్రకాశ్ రెడ్డి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంపై వెంకయ్య మండిపాటు

  విశాఖలో సీఐఐ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న భాజపా జాతీయనేత ఎం.వెంకయ్యనాయుడు కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలివైన కేంద్ర ప్రభుత్వం ఉంటే ఈ విభజన ప్రక్రియను కాస్త ముందే పూర్తి చేసేది. రాష్ట్రాన్ని విభజించేసారు. కానీ ఏర్పాటుకు ఇంకా సమయముందని అంటున్నారు. అంటే వచ్చే అక్టోబరు వరకు సీమాంద్రలో ఆర్థిక పరిస్థితి ఎలా అనేది కేంద్రం పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు భవిష్యత్తులో అన్ని చోట్లా నిర్మించాలని సూచించారు. ఏ రాష్ట్రంలో అయిన అధికార వికేంద్రీకరణ జరగాలి అని అన్నారు.

గ్యాస్ ట్రబుల్ నుండి ప్రజలకు విముక్తి

  ఎన్నికలలో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ప్రజలకు ఎన్ని హామీలయినా ఇస్తాయి. ఏదోవిధంగా ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తాయి. అధికారంలో ఉన్నపార్టీకయితే ఆ అవకాశం మరికొంచెం ఎక్కువ ఉంటుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వమయితే ఇక మరి చెప్పనే అక్కరలేదు. కనబడిన, కనబడని ప్రతీ అవకాశాన్ని విచ్చలవిడిగా వాడేసుకొంటుంది.   అటువంటి సవాలక్ష ఐడియాలలో నగదు బదిలీ పధకం, ఆధార్ కార్డ్, సబ్సీడీ గ్యాస్ వంటివి కూడా ఉన్నాయి. నగదు బదిలీ పధకంతో ఏదో అద్భుతం జరిగిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు చేసి ప్రచారం చేసింది. కానీ, కొన్ని రాష్ట్రాలలో అమలు చేసిన పైలట్ ప్రాజెక్టులే బెడిసికొట్టాయి. అయినా వెనక్కితగ్గల్లేదు. నగదు బదిలీతో ప్రజల ఓట్లన్నీ తన ఖాతాలోకే బదిలీ అయిపోతాయనే దురాశతో సబ్సీడీ గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం ఇస్తున్న రాయితీని ఆధార్ కార్డుల ద్వారా నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలోనే జమా చేయామని హుకుం జారీ చేసింది. అయితే ప్రజలకు నగదు బదిలీ చేసే సదుద్దేశ్యంతో గాక, పెట్రోలియం కంపెనీలు క్రమంగా గ్యాస్ ధరలను పెంచుకొంటూ, వారి చేతిలో చిక్కిన సబ్సీడీ మొత్తాన్ని తమ ఇష్టానుసారంగా సులువుగా కత్తిరించుకొనేందుకే ఈ పన్నాగం పన్నింది. లోపభూయిష్టమయిన ఈ విధానంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తడంతో, అదే అదునుగా ప్రత్యర్ధ రాజకీయ పార్టీలు దానిని తమకు ఎక్కడ నుకూలంగా మలచుకొంటారో అనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లపై సబ్సీడీని నగదు బదిలీ పధకం ద్వారా నేరుగా ఖాతాదారుల బ్యాంకు ఖాతాలలో జామా చేసే పద్దతిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గ్యాస్ డీలర్లకు పెట్రోలేయం కంపెనీల నుండి లేఖలు కూడా జారీ అయియ్యాయి. గనుక, ప్రజలు గ్యాస్ సిలిండర్-ఆధార్ కార్డ్-నగదు బదిలీ పధకం నుండి బంద విముక్తులు అయినట్లే! అయితే ఇందుకు సంతోషించి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఓటువేసి గెలిపించుకొంటారా లేదా అనేది వారే నిర్ణయించుకోవలసి ఉంటుంది.

ఐదుగురు భారతీయులను సజీవ సమాధి

  సౌదీలో ఐదుగురు భారతీయులను సజీవ సమాధి చేసారు. ఇది ఘోరం జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పొట్టకూటి కోసం సౌదీకి వెళ్ళిన ఈ ఐదుగురు భారతీయ కార్మికులను అక్కడి వారు చిత్రహింసలు పెట్టి మరీ చంపేసారట. ఈ హత్య కేసులో సౌదీ పోలీసులు దాదాపు 25మందిని అరెస్టు చేయగా..2010లో ఈ నేరం చేసినట్లుగా ముగ్గురు నిందితులు కోర్టులో అంగీకరించారు. కోర్టులో వారు చెప్పిన విషయమేమిటంటే... స్నేహితుడి సమాచారం మేరకు ఓ రోజు రాత్రి ఫ్రెండ్ ఫాంకి వెళ్లానని ఓ వ్యక్తి చెప్పాడు. అయితే అక్కడ ఉన్న ఐదుగురు వ్యక్తుల చేతులు కట్టేసి, అక్కడే ఉన్న ఓ యజమాని కూతురు, మరో మహిళను లైంగికంగా వేధించాడని తన స్నేహితుడు తనకు చెప్పినట్లుగా తెలిపాడు. అంతే కాకుండా మద్యం తాగిన తర్వాత భారతీయులను ఓ గదిలో బంధించి తీవ్రంగా కొట్టామని, ఆ తర్వాత వారిని తాళ్ళతో కట్టేసి, ట్రక్ లో తరలించి, ఫాంలో 2.5 మీటర్ల లోతున గొయ్యి తవ్వి, బ్రతికుండగానే వారిని, వారితో పాటు గుర్తింపు కార్డులను కూడా అందులో పూడ్చేసినట్లు తెలిపాడు. అయితే ఈ విషయంపై సౌదీలోని భారత రాయబార కార్యాలయం స్పందించి... బయటపడిన శవాల ఎముకలకు డీఎన్ఏ పరిక్షలు నిర్వహించిన తర్వాత ఓ నిర్ణయానికి వస్తామని, అసలు అవి భారతీయులవో కాదో అనే విషయం తెలియనుందని అన్నారు.

అవన్నీ పుకార్లే: లక్ష్మినారాయణ

  అవినీతి, అసమర్ధత, స్వార్ధ రాజకీయాల కారణంగా నానాటికి ప్రజల దృష్టిలో పలుచనవుతున్న రాజకీయ పార్టీలు, ప్రజలలో మంచి పేరున్న ఒక సినిమా స్టార్ లేదా సామాజిక కార్యకర్త లేదా మరెవరినయినా పార్టీలోకి రప్పించి, వారిని ముందుంచుకొని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తుంటాయి. లేదా ఫలానా గొప్ప వ్యక్తి తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకొంటాయి.   సీబీఐ జేడీగా పనిచేసిన లక్ష్మినారాయణ, గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ గనుల త్రవకాల కేసులు, జగన్ అక్రమాస్తుల కేసులు చేధించి ప్రజల దృష్టిలో ఒక హీరోగా నిలిచారు. నీతి నిజాయితీలకు మారుపేరుగా, ప్రభుత్వ,రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ముక్కు సూటిగా దూసుకుపోయే ఒక అత్యుతమ అధికారిగా, మంచి పేరు సంపాదించిన సీబీఐ జేడీ లక్ష్మినారాయణకు, ఆయన నీతి నిజాయితీ, సమర్ధతలే శాపంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వమే ఆయనను జగన్ కేసులలో దర్యాప్తుకు నియమించినప్పటికీ, మరెవరి ఒత్తిళ్లకు లొంగడం వలననో ఆయనకు ఎటువంటి పోస్టింగు ఇవ్వకుండా మహారాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది నెలలపాటు ఖాళీగా కూర్చోబెట్టింది. కానీ, ఆయన తన మనోస్తయిర్యం కోల్పోలేదు. పైగా ఆ సమయాన్ని పూర్తిగా సద్వినియోగించుకొంటూ యువతకు స్వామీ వివేకానంద వంటి మహనీయుల భోదనల గురించి వివరిస్తూ దేశమాత సేవలో వారు కూడా పాల్గొనవలసిన అవసరముందని యువతకు ప్రేరణ కలిగించేవారు.   అయితే, ఆయన పరిస్థితిని అలుసుగా తీసుకొన్న రాజకీయ పార్టీలు ఆయన త్వరలోనే తన పదవికి రాజీనామా చేసేసి తమ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం చేసుకోసాగాయి. ఆయన ఆమాద్మీ పార్టీలో చేరుతున్నారని, బీజేపీలో చేరుతున్నారని ప్రచారం మొదలయింది. ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి తాను ఏ రాజకీయ పార్టీలోను చేరబోవడం లేదని, తను పూర్తికాలం సర్వీసులోనే కొనసాగుతానని స్పష్టం చేసారు. తను రాజకీయ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని ఆయన స్పష్టం చేసారు.

రాష్ట్రపతి పాలనను స్వాగతిస్తున్నా: ఆనం

  ఆనం అనం రామినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉన్నపటికీ ఎన్నికల ముందు తిరిగి అధికారం చెప్పట్టాలనే తాపత్రయం లేనందునే కేంద్రం రాష్ట్రపతి పాలన విదించిందని, దానిని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. అయితే, ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చినప్పటికీ ఐదేళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించలేక కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసి మళ్ళీ నాలుగు దశాబ్దాల తరువాత కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రం మీద రాష్ట్రపతి పాలన బలవంతంగా రుద్దిందని చంద్రబాబు ఎద్దేవా చేసారు. పైగా ఆ పార్టీకి చెందిన మంత్రి దానిని స్వాగతిస్తున్నానని సిగ్గులేకుండా చెపుతున్నారని ఆయన ఎద్దేవా చేసారు.

సోనియమ్మకు సీమాంధ్ర స్వాగతం: బొత్స

  రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విదించడంతో ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న ముగ్గురు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల పరిస్థితి వ్రతం చెడినా ఫలం దక్కనట్లయింది. ముఖ్యమంత్రి పదవి దక్కకపోగా అందుకు అర్రులు చాచినందుకు ఉన్న పరువు కూడా పోయింది. పైగా వారి పోటీ కారణంగానే రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్రపతి పాలన కూడా విదింప బడిందనే అపవాదు కూడా మూటగట్టుకొన్నారు. అయితే, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో పది సీట్లయినా గెలుస్తుందో లేదో తెలియకపోయినా బొత్స సత్యనారాయణ మాత్రం విభజన పూర్తయిన తరువాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యేందుకు గాను సోనియమ్మను ఇప్పటి నుండే ఏదోవిధంగా ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టేసారు.   సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయిన ఆమె వారి గురించి ఒక మాట మాట్లాడేందుకు సాహసించలేకపోతున్నఈ తరుణంలో ఆమెను సీమాంధ్రలో పర్యటించవలసిందిగా బొత్స సత్యనారాయణ కోరారు. ఆమెను, కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్న ప్రతిపక్షాలను ఎదుర్కొని పార్టీని బ్రతికించుకోవాలంటే ఆమె తప్పనిసరిగా సీమంధ్రలో పర్యటించాలని ఆయన కోరుతున్నారు. ఒకసారి ఆమె సీమాంధ్రకు వచ్చి ప్రజల కోసం తమ పార్టీ ఏమేమి చేయబోతోందో చెపితే చాలు వారు గ్యారంటీగా పడిపోతారని ఆయన హామీ ఇస్తున్నారు. అయితే ఆమె మాత్రం వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.   ఆమె రాజకీయ సలహాదారులు మాత్రం ఈ విభజన వేడి తగ్గి ప్రజలు శాంతించే వరకు మరికొంత కాలం ఆగి వెళితేనే మేలని సూచిస్తున్నారు. కానీ తమ రాజకీయ ప్రత్యర్ధి నరేంద్ర మోడీ పర్యటన ఖరారు అవుతుండటంతో బహుశః కనీసం యువరాజ వారినయినా సీమాంధ్ర ప్రజలను అనుగ్రహించేందుకు పంపించవచ్చును.

త్వరలో మోడీ సీమాంధ్ర పర్యటన

  పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు అమోదం పొందిన వెంటనే, అందుకు సహకరించిన బీజేపీ సీమాంధ్ర ప్రజల ప్రతిస్పందన తెలుసుకొనేందుకు వెంకయ్య నాయుడిని పంపింది. ఆయన విజయవాడలో నిర్వహించిన కొన్ని సమావేశాలలో ఎటువంటి వ్యతిరేఖత కనబడకపోవడంతో, ఆయన త్వరలోనే నరేంద్ర మోడీని కూడా సీమాంధ్ర పర్యటనకు తీసుకువస్తానని ప్రకటించారు. ఆ తరువాత రెండు మూడు రోజులలోనే ఆయన పర్యటన దాదాపు ఖరారు అయిపోయింది. పార్టీ సీనియర్ నేత హరిబాబు మాట్లాడుతూ నరేంద్ర మోడీ వచ్చే నెల20- ఏప్రిల్ 10తేదీల మధ్య వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి నగరాలలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేస్తారని ప్రకటించారు. ఆయన పర్యటన పూర్తి వివరాలను త్వరలో తెలియజేస్తామని ఆయన మీడియాకు తెలిపారు.

తెరాస కాదంటే కాంగ్రెస్ ఖేల్ ఖతం?

  తెరాస, కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోయినా కనీసం పొత్తులకయినా అంగీకరిస్తుందని నిన్నటి వరకు కూడా అందరూ భావించారు. కానీ ఒక్క రోజులోనే పరిస్థితులు, వ్యూహాలు అన్నీ మారిపోయాయి. ఇప్పుడు రెండు పార్టీలు ఒకదానిపై మరొకటి కత్తులు నూరుకొంటున్నాయి. అందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ తన సీమాంధ్ర శాఖను పణంగాపెట్టి మరీ తెలంగాణా రాష్ట్రం మంజూరు చేసినప్పటికీ, కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా, కనీసం ఎన్నికల పొత్తులకి కూడా అయిష్టత చూపడమే. పార్లమెంటులో తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన తరువాతనే విలీనాలు, పొత్తుల గురించి ఆలోచిద్దామని ఇంతకాలం చెపుతూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు బిల్లు ఆమోదం పొందిన తరువాత కాంగ్రెస్ పార్టీతో కనీసం పొత్తులకి కూడా అంగీకరించకుండా ఉండేందుకు ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకొనే ఆలోచనలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహంగా ఉంది. అందుకే నిన్న కేంద్రమంత్రి జైరాం రమేష్ తెరాసపై తీవ్రంగా విరుచుకు పడ్డారు.   అయితే, కేసీఆర్ మరియు ఆయన అనుచరులు కూడా ఏదో విధంగా కాంగ్రెస్ పార్టీని వదిలించుకోనేందుకే చూస్తున్నారు గనుక, జైరాం రమేష్ చేసిన విమర్శలు అందిపుచ్చుకొని ప్రతివిమర్శలు చేస్తూ, పద్ధతి ప్రకారం తెగతెంపులకి సిద్దమయిపోయారు. రాష్ట్ర విభజన చేసి తెలంగాణాలో అనుకూల ఓటుతోను, సీమాంధ్రలో కిరణ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల ద్వారా వ్యతిరేఖ ఓటుతోను కేంద్రంలో మళ్ళీ అధికారం చేజిక్కించుకొనేందుకు కీలకమయిన యంపీ సీట్లు పోగేసుకోవాలని అడియాసకు పోయి కాంగ్రెస్ అధిష్టానం రచించిన వ్యూహం బెడిసికొట్టినట్లు కనబడుతోంది ఇపుడు పరిస్థితులు చూస్తుంటే. ఒకవేళ తెరాస ఇప్పుడు గిల్లి కజ్జాలు ఇప్పుడు తెరాస గిల్లి కజ్జాలు పెట్టుకొని దూరమయిపోయినట్లయితే తెలంగాణాలో తెరాసను డ్డీకొని ఎదురునిలవలేక అక్కడా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినప్పటికీ ఆవిషయాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్ళడంలో ఘోరంగా విఫలమయిన టీ-కాంగ్రెస్ నేతలు, ఇక విజయోత్సాహంతో ఉన్న తెరాసను ఏవిధంగా ఎదుర్కొని నిలువగలరు?   ఒకవేళ తెరాస కనుక బీజేపీతో చేతులు కలిపినట్లయితే ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఒక్కసీటు కూడా సాధించడం కల్ల. ఆ రెండు పార్టీలు చేతులు కలిపినట్లయితే ఆధాటికి కాంగ్రెస్ పార్టీ గడ్డిపోచలా కొట్టుకుపోవడం ఖాయం. వారికి నరేంద్ర మోడీ కూడా వచ్చి జేరితే ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా తయారవుతుందో చాలా తేలికగానే ఊహించుకోవచ్చును.   ఆరిపోయే దీపం మరింత ఎక్కువ వెలిగినట్లు బహుశః కాంగ్రెస్ పార్టీకి చివరి ఘడియలు వచ్చినందునే ఇటువంటి అతితెలివికిపోయి తన భస్మాసుర హస్తాన్ని తన నెత్తి మీదే పెట్టుకొంది పాపం!

తెదేపాలోకి కాంగ్రెస్ నేతల వలసలు

  ఇంతకాలం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి సమైక్య పోరాటం చేసిన మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్ తదితరులు ఇప్పుడు ఆయన కొత్త పార్టీ పెట్టబోతుంటే అందులో చేరకుండా తెదేపాలో చేరేందుకు సిద్దపడటం ఆశ్చర్యం కలిగిస్తున్నా మంచి రాజకీయ అనుభవజ్ఞులయిన వారు ముగ్గురు రానున్న ఎన్నికలలో తెదేపాకే విజయావకాశాలున్నాయని ఖచ్చితంగా నమ్ముతున్నట్లు అర్ధమవుతోంది. వారితో బాటు కాంగ్రెస్ శాసనసభ్యుడు అదలా ప్రభాకర్ రెడ్డి కూడా నిన్న చంద్రబాబుని కలిసి మాట్లాడారు. అందువలన ఆయన కూడా తెదేపాలో చేరుతున్నట్లే భావించవచ్చును. వీరు గాక వైజాగ్ నుండి నలుగురు కాంగ్రెస్ శాసనసభ్యులు కూడా తెదేపాలో చేరబోతున్నారు. ఇది తేదేపాకు శుభసూచకమే అయినప్పటికీ ఒకేసారి ఇంతమంది కొత్తవారు వచ్చి పార్టీలో చేరుతుంటే, ఎంతో కాలంగా పార్టీని నమ్ముకొని పనిచేస్తూ టికెట్స్ ఆశిస్తున్న వారు ఆందోళన చెందవచ్చును. అందరికీ టికెట్స్ కేటాయింపు సాధ్యం కాదు గనుక బహుశః త్వరలోనే తెదేపాలో అలకలు, బుజ్జగింపుల పర్వం మొదలవుతుందేమో!

ఏపీ యన్జీవోలకు కొత్త పార్టీలో టికెట్స్

కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టడం గురించి ఆయన నేరుగా మాట్లాడకుండా తన సహచరులతో ఒకటొకటిగా వివరాలు వెల్లడిస్తున్నారు. ఆయన మార్చి రెండవ తేదీన రాజమండ్రీలో భారీ బహిరంగ సభపెట్టి అక్కడ తన కొత్త పార్టీ జెండా, ఎజెండా, పార్టీ చిహ్నం, మ్యానిఫెస్టో ప్రకటిస్తారని కొద్ది రోజుల క్రితమే ఆయనకు సన్నిహితంగా మెలుగుతున్న ఒక మాజీ మంత్రి ఒకరు ప్రకటించారు. ఇప్పుడు యంపీ రాయపాటి సాంభశివరావు మీడియాతో మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి మరొక రెండు మూడు రోజుల్లో  కొత్త పార్టీ ప్రకటిస్తారని, అందులో 50శాతం టికెట్స్ ఏపీయన్జీవోలకు, మిగిలిన 50శాతం రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా పోరాడిన నేతలకి కేటాయిస్తారని ప్రకటించారు.ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలని ఉవ్విళ్ళూరుతున్న ఏపీ యన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు, మరికొందరు ఉద్యోగులు కిరణ్ పెట్టె కొత్త పార్టీ ద్వారా రాజకీయ ఆరంగ్రేటం చేయబోతున్నారని స్పష్టమవుతోంది.

కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి

      మెదక్ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటి అయిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ కండువా కప్పి విజయశాంతిని పార్టీలోకి ఆహ్వానించారు. శివుడి భక్తురాలినని, శివరాత్రి చాలా మంచి రోజు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. తెలంగాణ పై సోనియా గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో చేరుతానని చెప్పానని, అందుకే తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని అన్నారు. రాజకీయ నాయకులు ఎవరైనా మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలని చెప్పారు.

బాబుతో భేటి: టిడిపిలోకి 7గురు ఎమ్మెల్యేలు

      తెలుగుదేశంలోకి కాంగ్రెస్ కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల చేరిక ఖరారు అయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టికి చెందిన టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు. గత కొంతకాలంగా వీరు టిడిపిలో చేరుతారని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ భేటి ప్రాధాన్యతను సత్కరించుకుంది. వీరే కాకుండా విశాఖ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్ (భీమిలి), వెంకట్రామయ్య (గాజువాక), రమేష్ బాబు (పెందుర్తి), కన్నబాబు (ఎలమంచిలి) కూడా టిడిపి అధినేతతో సమావేశమయ్యారు. వీరందరూ తమ జిల్లాలలో ప్రజాగర్జన సభలు నిర్వహించే సమయంలో పార్టీలో చేరనున్నట్లు సమాచారం.