చివరికి పవన్ కళ్యాణ్ కూడా దూరమయ్యాడు

  ఈరోజు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ మొట్ట మొదటి సినిమా షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమయింది. దానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితరులు అందరూ వచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగానయినా సోదరుడు చిరంజీవిని పలుకరించే ప్రయత్నం చేయలేదు. ఆయన అభిమానులను ఉద్దేశ్యించి మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయారు. అందరితో ఎంతో ఆత్మీయంగా మెలిగే పవన్ కళ్యాణ్ ఆయనను కనీసం పలుకరించేందుకు కూడా ఇష్టపడకపోవడం గమనిస్తే, ఆయన చివరికి కుటుంబ సభ్యులని కూడా ఎంతగా దూరం చేసుకొన్నారో అర్ధమవుతోంది. అంతకంటే ముఖ్యంగా ఆయన సగటు తెలుగు ప్రజల అభిమానాన్ని ఎంతగా పోగొట్టుకొన్నారో ఈ సంఘటన తెలియజేస్తోంది.   మూడు రోజుల క్రితం ఆయనే స్వయంగా “కాంగ్రెస్ అధిష్టానం నాకు ఏ భాద్యత అప్పగించినా సవినయంగా స్వీకరిస్తానని” చెప్పారు. కానీ మళ్ళీ ఆయనే ఈరోజు “నేను ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్నడూ అర్రులు చాచలేదు. మీడియానే ఈ విషయంలో అనవసరమయిన రాద్దాంతం చేసింది,” అని ఆయన చెప్పే మాటలు వినేందుకు మనస్కరించకే బహుశః పవన్ కళ్యాణ్ అక్కడి నుండి నిష్క్రమించారనుకోవచ్చు.   ఈవిధంగా చిరంజీవి కాక మరే రాజకీయ నాయకుడు ప్రవర్తించినా ప్రజలు కూడా అంతగా పట్టించుకొనేవారు కాదు. కానీ, ఇంతకాలంగా వారు గుండెల్లో పెట్టి పూజించుకొన్న తమ మెగా దేవుడే ఒక సామాన్య రాజకీయ నాయకుడిలా వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అదే అభిప్రాయం ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఈరోజు వెలిబుచ్చారనుకోవచ్చును. ఇదంతా చూసి బహుశః ఆయన మారే ప్రయత్నం చేస్తే చేయవచ్చు, చేయకపోవచ్చును. కానీ ఈ రెండేళ్ళ రాజకీయ జీవితంలో ఆయన బయటపెట్టుకొన్న తన అసలు రూపం ప్రజలెన్నటికీ మరిచిపోలేరు.

మెగా ప్రస్తానం

  మెగా స్టార్ చిరంజీవి సినీ పరిశ్రమ నుండి బయటకి వచ్చి రాజకీయాలలోకి అడుగుపెట్టిన తరువాత పరిశ్రమలో ఆయనకి ఎంత వ్యతిరేఖత ఉందో బయటపడింది. డా.రాజశేఖర్ రెడ్డి దంపతులు, మోహన్ బాబు, అనేక మంది చిన్ననిర్మాతలు ఆయనను ద్వేషించారు. ఇక యువ హీరో ఉదయ కిరణ్ సినీ జీవితం దెబ్బతినడంతో అతను అర్ధాంతరంగా జీవితానికి ముగింపు పలికి వెళ్ళిపోయినప్పుడు, చాలా మంది ఆయననే వేలెత్తి చూపారు.   రాజకీయాలలోకి వచ్చిన తరువాత కూడా ఆయన విమర్శలు మూటగట్టుకొంటూనే ఉన్నారు. ఆయన ప్రజారాజ్యం స్థాపించినపుడు లక్షలాది ఆయన అభిమానులు, ప్రజలు ఆయన వంక ఎంతో ఆశగా ఎదురు చూసారు. హనుమంతుడిలా అన్నకు జీవితాంతం తోడుంటానని చెప్పి పార్టీలో చేరిన ఆయన వీరాభిమాని పోసాని కృష్ణ మురళి, కొద్ది రోజులలోనే ఆయన తీరుని అసహ్యించుకొంటూ ఆయనకు దూరం జరిగారు. ఆ తరువాత ఆయనను నమ్ముకొని వచ్చిన రాజకీయనాయకులు, అభిమానుల ఆశలన్నీ అడియాసలు చేస్తూ ఎన్నికలు కూడా మొదలవక మునుపే ఆయన పార్టీ పతనం ప్రారంభమయి, ఫలితాలు వెలువడిన కొద్ది నెలలకే ప్రజారాజ్యం ప్రస్థానం ముగిసిపోయింది.   కేంద్రమంత్రి పదవి కోసం తనను నమ్ముకొన్న ప్రజలను, పార్టీ కార్యకర్తలను నట్టేట ముంచి ఆయన తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపి వేసినప్పటి నుండి క్రమంగా ప్రజలు, అభిమానులు, చివరికి స్వంత సోదరులు పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా దూరం కాసాగారు. తెలుగు ప్రజల అత్మాభిమానానికి, గౌరవానికి నిలువెత్తు ప్రతీకగా నిలుస్తారని అందరూ భావిస్తే, ఆయన సోనియాగాంధీ ముందు ‘జీ హుజూర్!’ అంటూ ఆయన చేతులు కట్టుకొని నిలబడటం తెలుగు ప్రజలకు, ముఖ్యంగా ఆయన అభిమానులకు చాలా బాధ కలిగించింది.   తెలంగాణా ఉద్యమాలు పతాక స్థాయిలో జరుగుతున్నపుడు ఆయన తాను సమైక్యవాదినని ప్రకటించుకొని తెలంగాణా ప్రజలనూ దూరంచేసుకొన్నారు. అయితే ఆయన సమైక్య వైఖరివల్ల కనీసం సీమాంద్రలో కూడా మంచి పేరు సంపాదించుకోలేకపోయారు. కారణం ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూల వైఖరి అవలంబించడమే. ఆ తరువాత రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆయన వ్యవహరించిన తీరుతో ఆయన మూడు దశాబ్దాలు శ్రమించి సంపాదించుకొన్న పేరు ప్రతిష్టలను చేజేతులా పాడుచేసుకొన్నారు. సీమాంధ్ర ప్రజలు రాష్ట్రవిభజన జరిగినందుకు ఎంతో బాధపడుతుంటే, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఆరాటపడటం చూసి ప్రజలు తీవ్ర ఆగ్రహం చెందారు. అయితే, వ్రతం చెడినా ఫలం దక్కనట్లయింది ఆయన పని. ముఖ్యమంత్రి పదవి ఆశించి అటు అధిష్టానం వద్ద భంగపడ్డారు. ఇటు ప్రజల ముందు కూడా చులకనయిపోయారు.

శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

      మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజాము నుంచే ఆలయాలకు భక్తులు బారులు తీరారు.   శ్రీశైలం: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచి భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవున్ని దర్శించుకుంటున్నారు. కేంద్రం మంత్రి పురంధేశ్వరి దంపతులు మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. వరంగల్ : శివరాత్రి సందర్భంగా వేయిస్తంభాల ఆలయానికి భక్తులు పోటెత్తారు. దుర్గేశ్వర ఆలయం, భోగేశ్వరాలయం, ఐనవోలు, పాలకుర్తి, సిద్ధేశ్వర ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని కృష్ణానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పాత శివాలయం, యనమలకుదురు, రామలింగేశ్వర ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చిత్తూరు : శివరాత్రి పండుగ సందర్భంగా జిల్లాలోని శివాలయాలు భక్తులతో పోటెత్తుతున్నాయి. శ్రీకాళహస్తి,కపిలతీర్థం. సదాశివకోన, కైలాసకోన, తలకోన సిద్దేశ్వర ఆలయం, మల్లయ్యకొండ, రుద్రకోటి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో శివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. నీలాద్రి, తీర్థాల, గణపేశ్వరస్వామి, మృత్యుంజయస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రాద్రి దేవాలయం శివనామస్మరణతో మార్మోగింది. భద్రాచలం గౌతమి తీరంలో భక్తుల కోలాహలం అధికంగా ఉంది. వైరా మండలం స్నానాలలక్ష్మీపురంలోని శివాలయంలో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ : పండుగ సందర్భంగా శివాలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. గోదవరిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శివున్ని దర్శించుకుంటున్నారు. జైపూర్ మండలం వేలాలలో శివరాత్రిజాతర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నిర్మల్, కాగజ్‌నగర్‌లోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.  

యువరాజవారి తాజా లెక్చర్

  మన యువరాజ వారికి అవకాశం దొరకాలే కానీ ఏవిషయంపైనైనా అనర్గళంగా లెక్చర్లు దంచుతుంటారు. కానీ, ‘ఎదుటవాడికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని ఎవరో కవి చెప్పినట్లు ఆయన లెక్చర్లు కూడా ఎదుటవాడి కోసమే తప్ప అవి తనకు, తన పార్టీకి వర్తింపవని ఆయన దృడంగా నమ్ముతారు. అందుకే తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోఉన్న డిల్లీలోనే ఏడాదిన్నర క్రితం ఒక అబల మీద బస్సులో సామూహిక అత్యాచారం జరిగితే నోరు మెదపని ఆయన, నిన్న అస్సోం డాన్ బాస్కో విశ్వవిద్యాలయంలో విద్యార్దినులతో మాట్లాడుతూ ‘మహిళలు-రక్షణ’ అనే అంశంపై చిన్న లెక్చర్ దంచిన తరువాత, అలా దంచినందుకు చాలా బాధ కలుగుతోందని, కానీ ఆవేశం ఆపుకోలేక దంచిపడేశానని ముగించారు. భారత్ జనాభాలో సగం ఉన్న మహిళలకు భద్రత, సమాజంలో సమాన హోదా, గౌరవం కల్పించిన తరువాతనే భారత్ సూపర్ పవర్ గా ఎదగడం గురించి మాట్లాడుకోవచ్చని ఒక ఉచిత అభిప్రాయం కూడా వ్యక్తం చేసారు. నిజానికి డిల్లీలో ఆ ఘోర సంఘటన జరిగిన తరువాత నుండి డిల్లీతో సహా దేశ వ్యాప్తంగా మహిళల మీద చివరికి అన్నెం పున్నెం ఎరుగని బాలికలు, పసిపిల్లల మీద అత్యాచారాలు విచ్చలవిడిగా జరుగుతున్నా, మన యువరాజవారు ఏనాడు నోరు మెదిపిన పాపాన పోలేదు. కనీసం తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాష్ట్రాలలోనయినా అటువంటి ఘోర అకృత్యాలు జరుగకుండా నివారించేందుకు తగిన చర్యలు చెప్పట్టమని గట్టిగా ఆదేశించి ఉండవచ్చును. కానీ, యువరాజవారికి లెక్చర్లు దంచడంపై ఉన్న మక్కువ, నేర్పు వాటిని ఆచరణలో పెట్టడంలో కనబడదు. కనుక, మతకలహాలు జరిగినప్పుడు ఆయన బీజేపీని విమర్శించవచ్చు. ఉగ్రవాదుల దాడులు జరిగినప్పుడు తండ్రిని నాయనమ్మను తలచుకొని బాధపడవచ్చును. అది ఎన్నికల సమయం అయితే ‘తను కూడా ఏదో ఒకనాడు ఉగ్రవాదుల దాడిలో చనిపోతానేమో’ నని సానుభూతి ఓట్లు ఆశించవచ్చును. ఆదర్శ్ కుంభకోణాలు బయటపడినప్పుడు తను ప్రతిపాదించిన అవినీతి బిల్లుల గురించి వాటికి ప్రతిపక్షాల సహాయ నిరాకరణ చేయడం గురించి లెక్చర్లు దంచవచ్చును. టాపిక్ ఏదయినా సరే లెక్చర్ కి రెడీ...దటీజ్ ప్రిన్స్ స్టైల్...

పాపం చిరంజీవి!

  చిరంజీవి ముఖ్యమంత్రి కావడం దాదాపు ఖాయమయిపోయినట్లేనని నిన్నటి వరకు వార్తలు వచ్చాయి. చిరంజీవిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దంగా ఉండమని దిగ్విజయ్ సింగ్ కోరినట్లు కూడా విన్నాము. చిరంజీవి కూడా తను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఏ బాధ్యతయినా చెప్పట్టేందుకు సిద్దమని ఒక స్టాండర్డ్ డైలాగ్ కూడా పలికేసారు. ఆ తరువాత ఆయన రాష్ట్రపతిని కూడా కలిసి వచ్చారు. ఇక మరో గంటో ఘడియలోనో కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరుని అధికారికంగా ప్రకటిస్తుందని అందరూ భావిస్తుంటే, మళ్ళీ రాష్ట్రపతిపాలన విదించబోతున్నట్లు వార్తలు గుప్పుమనడంతో చిరంజీవి ముఖ్యమంత్రి అవ్వాలనే కల పగటికలగానే మిగిలిపోనుందని స్పష్టమవుతోంది. డిల్లీ నుండి నిన్నహైదరాబాద్ కు తిరిగివచ్చిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను ముఖ్యమంత్రి రేసులో లేను. ఉన్నానని మీడియానే అనవసరంగా లేనిపోని ప్రచారం చేసింది,” అని చిరుబురులాడుతూ వెళ్ళిపోయారు.   అయితే చివరి నిమిషంలో ఇలా ఎందుకు జరిగింది? ఆయన ముఖ్యమంత్రి కాకుండా ఎవరు అడ్డు పడ్డారు? అని ఆలోచిస్తే పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్దులేనని చెప్పక తప్పదు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన చిరంజీవి నేరుగా కేంద్రమంత్రి పదవి పొందడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కూడా పోటీకి రావడం, ఆ పదవి ఆశిస్తున్న బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మి నారాయణలు జీర్ణించుకోవడం కష్టమే. కనుక వారిరువు చేతులు కలిపి మిగిలిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరినీ తమవైపు తిప్పుకోవడంతో చిరంజీవి పరిస్థితి అకస్మాత్తుగా తారుమారయి ఉండవచ్చును. పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న బొత్సకు మిగిలిన వారిని తనవైపు తిప్పుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ, రాజకీయ పరిపక్వత, తనకంటూ ఒక ముటా లేని మేస్త్రి చిరంజీవికి చెక్కభజన చేసేందుకు ఒక్క రామచంద్రయ్య తప్ప మరెవరూ లేకపోవడంతో రేసులో ఓడిపోయారు. ఇంతవరకు తన వెంట నీడలా మసులుకొంటూ నిత్యం గంట కొట్టే శ్రీనివాసరావు కూడా లేకపోవడంతో పాపం! చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఒంటరి జీవి అయిపోయారు.   ఈ అవమానం సరిపోదన్నట్లు, నిన్న తిరుపతి వచ్చిన కేంద్రమంత్రి జైరాం రమేష్ మీడియాతో మాట్లాడుతూ “చిరంజీవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘ఓపెనింగ్ బ్యాట్స్ మ్యాన్’ గా రాబోతున్నారని జోకేసారు. మూడు నెలలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ముచ్చట తీర్చుకోనేందుకే సహకరించని బొత్స, ఆనం, కన్నా, డొక్కా, కొండ్రు తదితరులు, ఎన్నికల తరువాత చిరంజీవిని శాస్వితంగా ముఖ్యమంత్రిగానో లేక పీసీసీ అధ్యక్షుడిగానో నియమించేందుకు ఎందుకు అంగీకరిస్తారు? అని ఆలోచిస్తే జైరాం కూడా కుళ్ళు జోక్ వేసారని అర్ధమవుతుంది. అయినా ఎన్నికలలో గెలుస్తుందో లేదో తెలియని కాంగ్రెస్ పార్టీ చిరంజీవి ఇంకా ఎందుకు ఆశలు కల్పిస్తోందంటే, కనీసం ఎన్నికలలో ప్రచారానికయినా పనికొస్తాడనే ఉద్దేశ్యంతోనే తప్ప వేరే దురుదేశ్యం ఏమీ లేదు.    

బొత్స తులసి వనంలో గంజాయి మొక్క: చంద్రబాబు

  బుధవారం సాయంత్రం విజయనగరంలో జరిగిన ప్రజాగర్జన సభలో ఊహించని స్థాయిలో ప్రజలు భారీగా తరలిరావడంతో చంద్రబాబు నాయుడులో ఉత్సాహం కట్టలు తెంచుకొంది. ఆ ఊపులో సోనియా గాంధీ, జగన్మోహన్ రెడ్డి మొదలు జిల్లా మంత్రి బొత్ససత్యనారాయణ వరకు అందరినీ తీవ్ర పదజాలంతో ఏకి పడేసారు. దేశంలో అన్ని సమస్యలకు మూల కారకురాలు సోనియాగాంధీయేనని, ఆమె ఒక పెద్ద అనకొండవంటి అవినీతి సర్పమని, రాష్ట్రంలో కూడా ఆమె అనేక చిన్నా పెద్దా అనకొండలను తయారు చేసి ప్రజల మీదకు వదిలిందని, వారిలో జగన్మోహన్ రెడ్డి, బొత్ససత్యనారాయణ కొందరని ఆయన ఎద్దేవా చేసారు. ఎందరో మహానుభావులు పుట్టి నడయాడిన విజయనగరం వంటి పవిత్రమయిన స్థలంలో బొత్ససత్యనారాయణ వంటి వారు తులసి వనంలో గంజాయి మొక్కలా పెరిగిపోయారని అందుకు విజయనగరం ప్రజలందరూ చాలా బాధపడుతున్నారని ఆయన అన్నారు. అటువంటి అవినీతి అనకొండలను ప్రజలందరూ బెబ్బులి పులిలా, జస్టిస్ చౌదరిలా ఎదుర్కొని ఓడించాలని ఆయన హితవు పలికారు. అసలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతీ వ్యక్తిని కూడా సమాజం నుండి వెలేయవలసిన అవసరం ఉందని అన్నారు.   తెదేపాను ఎన్నికలలో ఎదుర్కోలేక దొంగచాటుగా దెబ్బతీసేందుకు రాష్ట్ర విభజన చేసి తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు రాజధాని అంశంతో సీమాంధ్ర ప్రజల మధ్య చిచ్చుపెట్టి ఎన్నికల గండం గట్టెక్కాలని కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు. హైదరాబాదుని అభివృద్ధి చేసి రాష్ట్రానికి, దేశానికి అంతులేని సంపద సృష్టించిన తాను, అధికారం ఇస్తే హైదరాబాదును తలదన్నేలా గొప్ప రాజధాని నగరం నిర్మిమించగలనని హామీ ఇచ్చారు.   రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలను ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వేర్వేరు వేషాలు వేసుకొని ప్రజల ముందుకు వస్తోందని అందువల్ల ప్రజలందరూ అప్రమత్తతతో ఉంటూ వాటిని ఓడించాలని కోరారు. కాంగ్రెస్, జగన్ కాంగ్రెస్, కిరణ్ కాంగ్రెస్, తెరాసలలో ఏ ఒక్క పార్టీకి వేసిన తిరిగి అవి కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే జమా అవుతాయనే సంగతి ప్రజలు మరిచిపోరాదని ఆయన హెచ్చరించారు. కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే తెలుగు ప్రజలకు జవాబు దారీగా ఉంటుందని మిగిలిన అన్ని పార్టీలు డిల్లీ నుండి సోనియాగాంధీ ఏవిధంగా ఆడిస్తే ఆవిధంగానే ఆడుతాయని, ఆమెకు కానీ, ఆమె సృష్టించిన పార్టీలకు గానీ తెలుగు ప్రజల అభిప్రాయలు, సమస్యలు పట్టవని ఆక్షేపించారు.   స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడటం కోసం కేంద్రంతో అలుపెరుగని పోరాటం చేస్తే, బొత్ససత్యనారాయణ వంటి నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం తెలుగు ప్రజల గౌరవాన్ని సోనియా గాంధీ కాళ్ళ ముందు పెడుతున్నారని ఆక్షేపించారు. అందువల్ల అటువంటి సిగ్గుమాలిన, స్వార్ధ, అవినీతి రాజకీయ నేతలకు రానున్న ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కనీయకుండా ఓడించి గుణపాటం చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.

కొనసాగుతున్నకేసిఆర్ ర్యాలీ..ఒంటెపై హరీష్

      కేసీఆర్ రాకతో బేగంపేట నుంచి గన్ పార్క్ వరకూ పెద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. అభిమానులు గులాబి పూలతో కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా కేసీఆర్ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రత్యేక వాహనంలో ముందుకు కదిలారు. కేసీఆర్‌ను చూడడంతోనే ప్రజలు జై తెలంగాణ అని నినాదించారు. బేగం పేట విమానాశ్రయం నుంచి గన్ పార్క్‌కు బయలుదేరిన ర్యాలీకి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం క్యాంపు ఆఫీసు, పంజగుట్ట, నిమ్స్, ఖైరతాబాద్, లక్డీ కా పూల్ మీదుగా ఈ ర్యాలీ గన్ పార్క్‌కు చేరుకుంటుంది. టీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు ఒక ఒంటెపై ఎక్కి కూర్చుని ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అందరూ వేర్వేరు వాహనాలలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలు అడుగడుగునా వారికి బ్రహ్మరథం పట్టారు.

కేసిఆర్ విజయోత్సవ ర్యాలీ ప్రారంభం

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్రవిభజన తరువాత తొలిసారిగా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన కేసిఆర్ కు తెలంగాణావాదులు, తెరాస కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జై తెలంగాణ, జై కేసిఆర్ నినాదాలతో విమానశ్రయ ప్రాంగణం మారుమోగింది. అక్కడ చిన్న చార్టర్డ్ విమానంలో బేగంపేట విమానశ్రయానికి చేరుకున్నారు. బేగంపేట విమానశ్రయంలో కేసిఆర్ కి ఘన స్వాగతం లభించింది. కేసిఆర్ ఆశీర్వదిస్తూ సర్వమత ప్రార్ధనలు చేశారు. ప్రత్యేక రూపొందించిన వాహనంలో ఆయన బేగంపటే విమానాశ్రయం నుంచి తన ర్యాలీని ప్రారంభించారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కెసిఆర్‌పై పూలవర్షం కురిపించారు. బేగంపేట నుంచి గన్ పార్క్ వరకు జరిగే ర్యాలీ సందర్బంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటులు చేశారు.

జేసి ప్రభాకర్ రెడ్డి భార్య అరెస్ట్

      మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసి దివాకర్ రెడ్డి కుటుంబానికి షాక్ తగిలింది. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం బస్సు దుర్ఘటన కేసులో జేసి ప్రభాకర్ రెడ్డి సతీమణి ఉమా ప్రభాకర్ రెడ్డిని సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. ఆమెకు మహబూబ్‌నగర్ కోర్ట్ బెయిల్ మంజూరు చేయడంతో విడుదల అయ్యారు. బస్సు ప్రమాదానికి మూడు కారణాలు అని సిఐడి చీఫ్ కృష్ణ ప్రసాద్ చెప్పారు. రోడ్డు డిజైన్, రోడ్డు నిర్మాణంలో లోపాలు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మంది నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. 36 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం వద్ద గత అక్టోబర్ 30న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు అగ్నిమాదానికి గురై 45 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే.

సమైక్యమనగా తెలంగాణాలో కూడా వైకాపా ఉండుట

  రాజకీయనాయకులూ, పార్టీలు చెప్పే మాటలని సరిగ్గా, పూర్తిగా అర్ధం చేసుకోవాలంటే తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణా ప్రజలందరూ కూడా తెలుగు భాషపై మరికొంత పట్టు సాధించవలసి ఉంది. ఒక రాజకీయ నాయకుడు, లేదా పార్టీ ఏదయినా ఒక అంశం లేదా పదం పలికితే, దానిని ప్రజలు ఒకలా అర్ధం చేసుకొంటే, నేతలు వేరొకలా భాష్యం చెపుతున్నారు. ఉదారణకి వైకాపా తెలంగాణా సెంటిమెంటుని గౌరవిస్తామంటే, పాపం! తెలంగాణా ప్రజలు తెలంగాణా ఏర్పాటుకి వైకాపాకి అభ్యంతరం లేదని అ(పా)ర్ధం చేసుకొన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తమకు తెలంగాణాను ఇచ్చేశక్తి, ఆపే శక్తి కూడా లేదని ముక్తాయింపు ఇవ్వడంతో తాము ఈ విషయంలో మాత్రం పొరబడలేదనే భ్రమలో షర్మిలమ్మ పాదయత్రలో పదం కలిపి, విజయమ్మ రచ్చబండ ముచ్చట్లు ఓపికగా విన్నారు. వాళ్ళిరువురూ కూడా రాజన్న రాజ్యం తెస్తామన్నారే తప్ప ఏనాడు తెలంగాణా ఇవ్వొద్దని అనలేదు.   కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు ‘సై’ అనడంతో వైకాపా తెలంగాణా నుండి రాత్రికి రాత్రి హై-జంపులు, లాంగు జంపులు చేసుకొంటూ సీమాంధ్రలో వచ్చిపడి ‘సమ న్యాయం’ అంది. సమన్యాయం అంటే వివరించమని ఆ పార్టీకే చెందిన కొండా సురేఖ వంటివారు విజయమ్మను కోరితే, ఆమె సమ న్యాయం అంటే ‘సమైక్యాంధ్ర’ అని వివరించడంతో వైకాపాకి కొండంత అండగా నిలబడ్డ సురేఖమ్మ కూడా కంగుతిన్నారు. అయినా తనకు తెలుగు భాష మీద సరయిన పట్టులేకపోవడం వలననే ఈ ఇబ్బంది అంతా అని గొణుక్కొంటూ ఆమెతో సహా అనేకమంది వైకాపా నుండి శలవు తీసుకొన్నారు.   ఆ తరువాత ‘సమైక్యాంధ్ర’కి ‘శంఖారావం’ కూడా జోడించి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు, బస్సు యాత్రలు, దేశ యాత్రలు, దీక్షలు, ధర్నాలు వగైరాలు చేసారు. అయితే ఆయన ఏమి చేసినా, ఏమి మాట్లాడినా కూడా అటు తెలంగాణా ప్రజలు, ఇటు సీమాంధ్ర ప్రజలు కూడా అనుమానంగానే చూస్తున్నారు. కారణం వారెవరికీ తెలుగు భాష మీద సరయిన పట్టులేకపోవడమే. ఆయన తెలంగాణా ఏర్పాటుని అడ్డుకొంటున్నాడని తెలంగాణా ప్రజలు భావిస్తే, ఆయన సమైక్య ముసుగులో రాష్ట్ర విభజన కోసం శ్రమిస్తున్నాడని సీమాంధ్ర ప్రజలు అ(పా)ర్ధం చేసుకొన్నారు తప్ప ఆయన మాటలని, వాటిలో భావాన్ని ఎవరూ సరిగ్గా అర్ధం చేసుకోలేకపోయారు.   ఆయన సమైక్యవాదో, విభజనవాదో ప్రజలకి అర్ధంయ్యేలోగానే రాష్ట్ర విభజన జరిగిపోయింది. అందువలన ఇప్పుడు ఇక ఆ ప్రసక్తి అనవసరం. కానీ, ఇప్పుడు ఆయన మళ్ళీ తెలంగాణాలో ఓదార్పు యాత్రతో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు కమిట్ అయినందున, తనను ఇంతగా అ(పా)ర్ధం చేసుకొన్న తెలంగాణా ప్రజలకు సమైక్యం గురించి కొంచెం బ్రీఫింగ్ ఇవ్వాలని అనుకోవడంతో ఈరోజు మరో రెండు పాత పదాలకు కొత్త అర్ధం చెప్పారు.   సమైక్యాంధ్ర, సమైక్యం అంటే అర్దం అన్ని ప్రాంతాల ప్రజలు కూడా తనవారేనని, అన్ని ప్రాంతాలలో ప్రేమ,ఐక్యతలు ఉన్నాయని అర్దమని వివరించారు. అన్ని ప్రాంతాలలో ప్రజలూ తనవాళ్ళే అయినప్పుడు మరి వారి సంక్షేమం కోసం తపించే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కూడా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి శలవిచ్చారు. తన జీవితంలో తన తల్లి, చెల్లి, భార్య అందరూ భాగమే గనుక త్వరలోనే తన ఓదార్పు యాత్రలతో బాటు, షర్మిలమ్మ పాద యాత్రలు, విజయమ్మ రచ్చబండ ముచ్చట్లు కూడా ఉంటాయని ఆయన ప్రకటించారు. గనుక, తెలంగాణా ప్రజలందరూ ఈలోగా తెలుగుభాషపై మరికొంత పట్టు సాధించగలిగితే, వాళ్ళు ముగ్గురూ వద్ద మరికొన్ని సరికొత్త తెలుగు పదాలు, అర్ధాలు నేర్చుకొనే అదృష్టం దక్కుతుంది.

కేసిఆర్ హైదరాబాద్ ర్యాలీలో మార్పులు

      టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ ఈ రోజు రాష్ట్రానికి చేరుకోనున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్దమవుతున్నారు. రాష్ట్రవిభజన తరువాత తొలిసారిగా తెలంగాణ గడ్డపై అడుగుపెడుతున్న కేసిఆర్ స్వాగతం పలకడానికి వివిధ జిల్లాల నుండి వేల సంఖ్యలో కేసీఆర్ అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే కేసిఆర్ ఢిల్లీ నుంచి రానున్న విమాన౦ ఆలస్యం కావడంతో విజయోత్సవ ర్యాలీ టైంలో మార్పులు చేశారు. మధ్యాహ్నం 2:45 గంటలకు కేసీఆర్ శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకునే అవకాశముందని సమాచారం. సాయంత్రం 4గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ఆయన ర్యాలీ ప్రారంభమయ్యే అవకాశముందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి.    బేగంపేట నుండి విజయోత్సవ ర్యాలీలో కేసీఆర్ పాల్గొంటారు. గన్‌పార్క్ వరకు ఆయన ర్యాలీ కొనసాగుతుంది. గన్‌పార్క్ చేరుకున్న ఆయన అక్కడ అమరవీరుల శ్ధూపాలకు ఘన నివాళులు అర్పించనున్నారు. తర్వాత అక్కడ నుండి తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం ఇంటికి బయల్దేరుతారు. 

టీఆర్ఎస్ వీలినంపై వివాదం

      గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో టీఆర్ఎస్ వీలినం పై జోరుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా వీలినం పై రాష్ట్ర టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల వైఖరిలో మార్పు రావడంతో కొత్త వివాదానికి తెరలేచింది. కాంగ్రెస్ లో వీలినం పై టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మీడియాతో మాట్లాడారు. మీడియాలో వీలినంపై వస్తున్న వార్తలన్నీ కల్పితమేనని కొట్టిపారేశారు. పార్టీ వీలిన౦పై కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నేతలెవరు ఈ వార్తలను నమ్మవద్దని సూచించారు. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ మాత్రం వీలినంపై చర్చలు జరుగుతున్నాయని ప్రకటించడం విశేషం. కేసిఆర్ తో వీలిన౦పై ప్రాధమిక చర్చలు జరిగాయని, విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని అన్నారు. త్వరలో దీనిపై ఓ నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు.

చివరి సీఎంగా చిరంజీవి!

      ఒకప్పుడు మెగా స్టార్ గా కోట్లాది ప్రజల నీరాజనాలు అందుకొని, ప్రజా రాజ్యం పార్టీ అధినేతగా అనేకమంది సీనియర్ రాజకీయ నాయకులను శాసించిన చిరంజీవి, కాంగ్రెస్ పట్ల, సోనియా, రాహుల్ గాంధీల పట్ల చూపిన వినయ విదేయతలకు మెచ్చి ఆయనను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేందుకు సోనియమ్మ అనుగ్రహించినట్లు తాజా సమాచారం. ఆయనకున్న ప్రజాకర్షణను ఉపయోగించుకొని ప్రజలలో ఉన్న కాంగ్రెస్ వ్యతిరేఖతను అధిగమించి ఎన్నికల గండం గట్టెక్కాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఆయనను ముఖ్యమంత్రిని చేసినట్లయితే ఎన్నికలలో కాపు కులస్థుల ఓట్లు అన్ని గంపగుత్తగా తమకే పడిపోతాయని కాంగ్రెస్ అడియాసకు పోతోంది. అయితే గతంలో ఆయన పార్టీ పెట్టిన్నపుడు ఆయనను నమ్ముకొని వెళ్ళిన వారందరి పరిస్థితి ఏమయిందో, ఆ తరువాత ఆయన తను రాజకీయంగా ఏవిధంగా పైకెదిగేరో, ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం రాష్ట్ర విభజన వ్యవహారంలో కోట్లాది సీమాంధ్ర ప్రజల మనోభావాలను కించపరుస్తూ వారి ఆత్మగౌరవాన్ని ఏవిధంగా సోనియమ్మ పాదాల చెంతపెట్టారో కళ్ళార చూసిన తరువాత కూడా ప్రజలు, ఆయన అభిమానులు, ముఖ్యంగా కాపు కులస్తులు ఆయనని చూసి కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని భావించడం అడియాసే అవుతుంది.

కొత్త పార్టీ స్థాపనకు కూడా అధిష్టానం అనుమతి కావాలా?

  కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తరువాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళీ అధికారం చేప్పట్టి సీమాంధ్రలో పార్టీని కాపాడుకోవాలని చాలా ఆరాటపడుతోంది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగినంత మంది శాసనసభ్యులు లేనందున, కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు, పార్టీ నుండి బహిష్కరింపబడిన సీమాంధ్ర నేతలు మళ్ళీ పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తామని నిన్న దిగ్విజయ్ సింగ్ సిగ్గు విడిచి ప్రకటించినా సానుకూల స్పందన రాలేదు. అందుకే ఆయన మళ్ళీ తన విధేయులైన సీమాంధ్ర మంత్రులతో వార్ రూమ్ లో తలుపులేసుకొని మంతనాలు మొదలుపెట్టారు.   ఇక కిరణ్ కుమార్ రెడ్డి గూటికి చేరుకొన్న సబ్బంహరి ఆయన స్థాపించబోయే కొత్త పార్టీకి అ(న)ధికార ప్రతినిధిలా ఎప్పటికప్పుడు మీడియాకు తాజా సమాచారం తెలియజేస్తూ చాలా పుణ్యం కట్టుకొంటున్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ “డిల్లీలో పరిణామాలను మేము చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాము. వాటిని బట్టే మేము కూడా మా భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకొంటామని” తెలిపారు. కొత్త పార్టీ పెట్టడానికి డిసైడ్ అయిపోయిన తరువాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా డిల్లీ వైపు ఎందుకు చూస్తున్నారు? అనే అనుమానం ఎవరికయినా కలగడం సహజం.   కొత్త పార్టీ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రానందునే కిరణ్ కుమార్ రెడ్డి ముందుకు వెళ్ళడం లేదని ఆయన ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయదలిస్తే, ఆయన స్వయంగా వెళ్లలేకపోయినా, కనీసం తన అనుచరులను పంపి ప్రభుత్వాన్ని నిలబెట్టే అవకాశం ఉంది. అదే ఇప్పుడే ఆయన కొత్తపార్టీ పెట్టేస్తే ఇక కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డిని వెనక్కిరమ్మని సిగ్గు విడిచి పిలిచినా ఆయన కానీ, ఆయన వెంట వెళ్ళినవారు గానీ వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదుకోలేరు.   బహుశః అందుకే “డిల్లీలో పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని” సబ్బం హరి శలవిస్తున్నరేమో! కాంగ్రెస్ అధిష్టానం తెరాస, మజ్లిస్ పార్టీల మద్దతు కన్ఫర్మ్ చేసేసుకొని, కొత్త ముఖ్యమంత్రి పేరు ఫైనల్ చేసేసుకోగానే ఇక కిరణ్ కుమార్ రెడ్డి నిశ్చింతగా కొత్త పార్టీ పెట్టేసుకోవచ్చును. ఎంతయినా ఆయన కూడా కాంగ్రెస్ ఉప్పు తిన్న మనిషే కదా!

రాష్ట్రాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్

  ఈ రోజు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ “డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేసిన 24గంటలలోనే డిల్లీలో రాష్ట్రపతి పాలన విదించిన కాంగ్రెస్ పార్టీ, కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి వారం రోజులయినా ఎందుకు పట్టించుకోవడం లేదు?” అని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని రాజ్యాంగ నిబంధనలని తుంగలో త్రొక్కి తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంటే తెదేపా చూస్తూ కూర్చోదని ఆయన హెచ్చరించారు.   “ఎన్నికలు ముంచు కొస్తున్న ఈ తరుణంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే, అధికార దుర్వినియోగం చేసేందుకు వీలుపడదు గనుకనే, తనకు తగినంత మెజార్టీ లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని” తేదేపాకు సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.   డిల్లీలో తను అధికారంలోకి వచ్చే అవకాశం లేదు గనుకనే కాంగ్రెస్ పార్టీ వెంటనే రాష్ట్రపతి పాలన విదించింది. కానీ, ఇప్పుడు రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విదించాలంటే పార్లమెంటు ఆమోదం అవసరమనే సాంకేతిక కారణాన్ని సాకుగా చూపి కాంగ్రెస్ వారం రోజులుగా రాష్ట్రాన్నిగాలికొదిలేసింది. తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలనే శ్రద్ధ, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడంలో చూపించడం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ నుండి నిష్క్రమించడంతో ఆయనతో బాటు కొంతమంది పార్టీని వీడివెళ్లిపోయారు. మరి కొంతమంది కాంగ్రెస్ నేతలు ఇతర పార్టీలలో చేరేందుకు తరలిపోయారు. అందువలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమయిన మెజార్టీ లేకపోవడంతో మద్దతు కోసం కొత్త మిత్రుడు కేసీఆర్ వైపు దీనంగా చూస్తోంది. అయితే ఆయన సోనియాగాంధీ తో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారే తప్ప విలీనం, పొత్తుల సంగతి ఇంకా తేల్చేలేదు. ఆ సంగతి తేల్చకపోయినా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకి సిద్దపడితే దానికి మద్దతు ఇస్తారో లేదో అనే సంగతయినా తేల్చిచెప్పితేనే కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆలోచన చేయగలదు. లేకుంటే అంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్ధులని ఇంటర్వ్యూలు చేసుకొంటూ వారితో వార్ రూమ్ సమావేశాలు నిర్వహించుకొంటూ కాలక్షేపం చేయక తప్పదు. అంతవరకు ప్రజలు, చంద్రబాబు కూడా కొంచెం ఓపిక పట్టక తప్పదు మరి.

శాసనసభ ఎన్నికలు వాయిదా పడవు: ఈసీ

      రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులలోనూ గడుపులోపే శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజనతో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శాసనసభ ఎన్నికలు వాయిదా పడుతాయని వార్తలు వస్తుండడంతో...ఎన్నికల కమిషన్ మీడియాకు ఓ లేఖను విడుదల చేసింది.   రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు వాయిదా వేసే ప్రసక్తే లేదని పేర్కొంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల సీట్లు పెరగవని ఎన్నికల కమిషన్ పేర్కొంది. రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం జూన్ రెండుతో ముగుస్తుందని, లోక్‌సభ పదవీ కాలం మే 20తో ముగుస్తుందని ఈసీ పేర్కొంది. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాతే మార్పులు చేర్పులకు అవకాశముంటుందని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి.

సీఎం సీటు కోరిన చిరు

      ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలు మరోసారి జోరందుకున్నాయి. రాష్ట్ర విభజనకి నిరసనగా రాజీనామా చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు మొదలు పెట్టింది. సీఎం సీటు కోసం ఇరుప్రాంత కాంగ్రెస్ నేతలు ఢిల్లీ లో లాబీయింగ్ లు మొదలుపెట్టారు. ఈ రోజు దిగ్విజయ్ సింగ్ తో భేటి అయిన కేంద్ర మంత్రి చిరంజీవి ముఖ్యమంత్రి పదవి ఇస్తే పార్టీకి పునరుత్తేజం కల్పిస్తానని హామి ఇచ్చారట. ఎన్నికలలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణ ఆయనకి వివరించినట్లు సమాచారం. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ కూడా దిగ్విజయ్ తో సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.