తెరాసకు దూరం జరుగుతున్న బీజేపీ

  తెలంగాణా జేయేసీలోభాగస్వామిగా కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ, ఇంతవరకు తెరాసతో అయిష్టంగానే కాపురం చేస్తున్నపటికీ, జాతీయపార్టీ అయిన తన మీద కూడా కేసీఆర్ కర్ర పెత్తనం చేయడం సహించలేకపోతోంది. కానీ, ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా తెలంగాణాలో తన ప్రాభల్యం పెంచుకొనే ఆలోచనతో తెరాసను, దాని అధినేత కేసీఆర్ ను భరించక తప్పట్లేదు.   పేరుకి అది తెలంగాణా జేయేసీ అయినా, అది కేవలం తెరాస చెట్టుకు మొలిచిన మరో కొమ్మగానే కేసీఆర్ భావిస్తునందున, భాగస్వామ్య పార్టీలను ఆయన ఎన్నడూ ఖాతరు చేయలేదు. ఇంతవరకు ఆయన కర్ర పెత్తనం సహించిన భారతీయ జనతా పార్టీ, ఆయన ఏకపక్షంగా తమ పార్టీకే చెందిన మహమూద్ ఆలీని యం.యల్సీ.అభ్యర్దిగా ప్రకటించడంతో తీవ్ర ఆగ్రహంతో ఆయనకు ఎదురు తిరిగింది.   అసలు కేసీఆర్ కు తెలంగాణా సాదించాలనే కోరిక, తాపత్రయం ఉన్నట్లు లేదని, అందువల్లే ఆలీని తమ పార్టీ అభ్యర్దిగా ప్రకటించి, తెలంగాణాను వ్యతిరేకిస్తున్న మజ్లిస్ పార్టీ మద్దతు కోరుతున్నాడని బీజేపీ విమర్శించింది. తెలంగాణా సాధనకు అవసరమయితే తమ పార్టీ అద్వర్యంలోనడిచే యన్.డీ.యే. కూటమిలో చేరుతామని ప్రకటిస్తున్న కేసీఆర్, మరో వైపు తెలంగాణాను వ్యతిరేకించే మజ్లిస్ పార్టీతో కలిసి ఏవిదంగా పని చేస్తారని బీజేపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో మరొకమాట మాట్లాడుతూ కేసీఆర్ తమతో ‘డబల్ గేం’ ఆడుతున్నాడని బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. కేసీఆర్ తమను సంప్రదించకుండానే అభ్యర్ధిని ప్రకటించి, మళ్ళీ అతనిని గెలిపించుకోవడానికి తిరిగి తమ మద్దతే కోరడాన్నిబీజేపీ తప్పు పట్టింది.   కేసీఆర్ అవకాశవాద, ద్వంద వైఖరిని, అతని కర్ర పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నభారతీయ జనతా పార్టీ, అతని వంటి రాజకీయ నాయకుడితో స్నేహం, ఎన్నికల పొత్తులు తమ పార్టీకి మేలు చేయకపోగా మరింత నష్టం తెచ్చే అవకాశం ఉందని భావిస్తోంది.   ఇక, కేసీఆర్ కూడా రాబోయే ఎన్నికలలోబీజేపీతో ఎన్నికల పొత్తులు గురించి ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్త పడుతూ, మొత్తం అన్నిస్థానాలకు తమ పార్టీ అభ్యర్డులనే ఖరారుచేసే ఆలోచనలో ఉన్నందున, త్వరలోనే బీజేపీకూడా తన దారి తానూ చూసుకోక మానదు. ఉద్యమాల వల్ల తెలంగాణాలో కొంచెం బలం పుంజుకొన్నభారతీయ జనతా పార్టీ బహుశః రాబోయే ఎన్నికలలో ఒంటరిపోరుకే సిద్దపడవచ్చును.

గ్యాస్ పై కిరణ్‌ కు సింధియా షాక్

        ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వలేమని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి సింధియా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తనను కలిసారని, రాష్ట్రానికి అదనపు గ్యాస్ ఇవ్వాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. అయితే గ్యాస్ సమస్య దేశవ్యాప్తంగా ఉందని, అందుచేత ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వలేమని ఆయన వివరించారు. ఎవరికి వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాల్సిందిగా సింధియా సూచించారు. గుజరాత్..ఆంధ్రప్రదేశ్ గ్యాస్ ఒప్పందం విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని ఒక ప్రశ్నకు సమాధానంగా సింధియా చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం ఒప్పుకుంటే ఆంధ్రప్రదేశ్‌కు అదనపు గ్యాస్ ఇవ్వగలమని సింథియా వివరించారు.

బ్రదర్ అనిల్ న్యాయ పోరాటం

        వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పై ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన పోరాటం చేస్తామని జగన్ సలహాదారు సోమయాజలు చెప్పారు. ప్రతి కుంభకోణంతో అనిల్ కి లింక్ పెట్టి మాట్లాడుతున్నారని, అలా ఆరోపణలు చేసిన వారిపై ఆయన న్యాయ పోరాటం చేసే ఆలోచనలో వున్నట్లు తెలిపారు. పరువునష్ట దావా కూడ వేస్తారన్నారు. చంద్రబాబు నాయుడు సహనం కోల్పోయి బ్రదర్ అనిల్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే బ్రదర్ అనిల్ తనపై వచ్చిన విమర్శలపై వివరణ ఇవ్వకపోవడం, ఆయన తరపున వేరేవారు మాట్లాడడం సహజంగానే అనుమానాలకు తావిస్తుంది. నిజంగానే అనిల్ న్యాయపోరాటం చేస్తారా లేక పత్రిక ప్రకటనల వరకే పరిమితమౌతారో చూడాలి.

విశాఖ సీటు పై మళ్లీ మొదలైన రగడ

        విశాఖపట్నం నుంచి లోక్ సభకు తానే పోటి చెస్తానని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి పురంధేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే పురంధేశ్వరిని నర్సాపురం నుంచి పోటికి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సుబ్బిరామిరెడ్డి చెప్పారు. గతంలో సుబ్బరారెడ్డి విశాఖపట్నం నుంచి పోటీ చేసి విజయం కూడా సాధించారు. ఆ తర్వాత ఈ సీటును పురందేశ్వరికి కేటాయించగా ఆమె విజయం సాధించారు. సుబ్బరామిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవికాలం కూడా ముగియవస్తున్న నేపద్యంలో ఆయన విశాఖపట్నంలో పోటీచేయాలని బావిస్తున్నారు. గత ఏడాది నెల్లూరు కు జరిగిన లోక్ సభ ఉప ఎన్నికలో కూడా పార్టీ కోరిక మేరకు పోటీచేసి ఓడిపోయారు. అప్పుడే విశాఖ సీటు తనకు ఇవ్వాలన్న కండిషన్ పెట్టారని ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో తానే విశాఖ నుంచి పోటీచేస్తానని ఆయన మళ్లీ ప్రకటించారు. అయితే విశాఖపట్నం నుంచి మారడానికి పురంధేశ్వరి ఇష్టపడడంలేదు. ఇంతకు ముందు విశాఖపట్నం సీటు నుంచి పోటీ చేసే విషయంపై పురంధేశ్వరికి, టి. సుబ్బిరామిరెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆఖరికి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందో చూడాలి.

నాకూ ముఖ్యమంత్రి కావాలనే కోరికలేదు: అసదుద్దీన్

  నిన్న జానారెడ్డి, మొన్న బొత్స సత్యనారాయణ అంతకు మునుపు లెక్కలేనంత మంది ముఖ్యమంత్రి పదవికి రేసులో ఉన్నట్లు స్వయంగా ప్రకటించుకొన్నారు. ఇప్పుడు తాజాగా మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ‘తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరికలేదు’ అనే చిన్న స్టేట్మెంటుతో తానూ కూడా పదవికి ముఖ్యమంత్రి అర్హుడినేనని, నేడు కాకపోయినా రేపయినా ముఖ్యమంత్రి అవ్వాలనే మనసులో కోరికను బయటపెట్టారు.   ఇటీవల ఒక ప్రైవేట్ టీవీ చానల్ వారితో ఇంటర్వ్యు లో పాల్గొన్నఆయన, రాష్ట్రం రెండుగా విడిపోతే భారతీయ జనతా పార్టీ బలపడుతుందని తాము భావించబట్టే, సమైక్యంగా ఉండాలని కోరుకొంటున్నట్లు తెలిపారు. ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడుతూ అప్పటి పరిస్థితులను బట్టి ఎవరితో పొత్తులు పెట్టుకొవాలో నిర్నయించుకొంటామని అన్నారు. ఇక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో తమకు ప్రత్యేక మిత్రత్వం కానీ, శత్రుత్వంగానీ లేదని, మిగిలిన పార్టీల మాదిరిగానే దానితోను వ్యవహరిస్తామని అన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడుతూ, ఆయన ఒక సమర్డుడయిన నాయకుడని, గత ఎన్నికలలో భారతీయ పార్టీ సారద్యం వహిస్తున్న యన్.డీ.యే.కూటమి వైపు ఆయన మొగ్గు చూపిన కారణంగానే తెలుగు దేశం పార్టీకి తాము దూరమవ్వల్సివచ్చిందని అన్నారు. ఒకవేళ చంద్రబాబు నుండి సరయినరీతిలో స్పందన వస్తే, రానున్న ఎన్నికలలో పోత్తులకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆయన సూచించారు.   రాష్ట్రంలో ఉన్న ముస్లిం ఓటు బ్యాంకును స్వంతం చేసుకోవాలంటే ఏ రాజకీయ పార్టీకయినా మజ్లిస్ పార్టీతో పొత్తులు తప్పవు. వైయస్స్సార్ కాంగ్రెస్ మజ్లిస్ తో స్నేహం కోసం చాల కాలంగానే ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఆ పార్టీ ఇస్తున్న ఓపెన్ ఆఫర్ను ఎవరు ముందుగా స్వీకరిస్తారో వేచి చూడాలి.

విశ్వరూపం-2 షూటింగ్ కూడా పూర్తయిపోయిందా?

  పలు వివాదాలు ఎదుర్కొని అతికష్టం మీద విడుదలయిన ‘విశ్వరూపం’ సినిమా విజయవంతమయిన సందర్భంగా ఇటీవల హైదరాబాదులో జరిగిన సక్సస్ మీట్ లో ఆ సినిమాను నిర్మించి దర్శకత్వం వహించి, అందులో నటించిన కమల్ హస్సన్ ఈ ఏడాదిలోనే విశ్వరూపం సీక్క్వేల్ ‘విశ్వరూపం-2’ అనే సినిమాను కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే, ఎప్పటిలోగా విడుదల ఉంటుందో ఆయన చెప్పలేదు. కానీ, మీడియాలో ఆ సినిమా షూటింగ్ మొత్తం విశ్వరూపంతో బాటే పూర్తయిపోయిందని, కొద్దిగా మిగిలిపోయిన సన్నివేశాల షూటింగ్ కూడా పూర్తయిపోగానే, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవుతాయని ప్రచారం జరుగుతోంది. ఆ వార్తల ప్రకారం అయితే, ‘విశ్వరూపం-2’ ఈ వేసవి శలవులకే విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ, కమల్ హస్సన్ ఈ వార్తలను ఇంతవరకు దృవీకరించలేదు అలాగని ఖండించలేదు కూడా.

బ్రదర్ అనిల్ రెండో మ్యారేజ్..బైబిల్‌ను ధిక్కరించాడా?

        వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిలా భర్త బ్రదర్ అనిల్ కుమార్ కు కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. తాజాగా బ్రదర్ అనిల్ వ్యవహారం క్రైస్తవులకు తలనొప్పిగా మారిందని తెలంగాణ క్రైస్తవ సంఘాల అధ్యక్షుడు మట్టయ్య విమర్శించాడు. క్రైస్తవ ప్రచారం చేస్తున్న అనిల్ స్వయంగా బైబిల్ ను దిక్కరించాడని అన్నారు. బైబిల్ వ్యాఖ్య ప్రకారం ఏ వ్యక్తి తన భార్య బతికి ఉండగా రెండో పెళ్ళి చేసుకోకూడదని, అనిల్ రెండో పెళ్ళి చేసుకున్నారని ఆరోపించారు. రక్షణ టీవి, మణికొండ చర్చి స్థలాలను తెలంగాణకు చెందిన పేద క్రైస్తవులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అవినీతి, అక్రమాస్తులు, హెలికాఫ్టర్‌ కుంభకోణం, బయ్యారం, మణికొండలో దళితులు, బీసీల భూముల కబ్జా, క్రైస్తవ ఛానల్‌ రక్షణ టీవిని అవినీతి డబ్బుతో నడిపిస్తున్నారని తెలిసి క్రైస్తవులు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

అమర్ సింగ్ ఆరోగ్యం విషమం

        సమాజ్‌వాదీ పార్టీ బహిష్కృత నేత, రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ దుబాయ్ పర్యటనలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దుబాయ్ విమానాశ్రయంలో సృహ తప్పి కిందపడిపోయారు. దీంతో వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన పరిస్థితి విషయంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే ప్రస్తుతం స్థిమితంగానే ఉన్నారని వారు వివరించారు. అమర్‌సింగ్ కొన్నేళ్ల క్రితం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో మూత్రపిండాల సమస్యలకు చికిత్స పొందారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అదే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. హెల్త్ చెక్ఆప్ కోసం దుబాయ్ వెళ్ళిన అమర్ స్వదేశానికి తిరిగి వస్తున్న టైంలో ఉన్నట్టుండి అనారోగ్యం కుదిపేసింది. సమాజ్ వాదీ పార్టీ నుంచి బహిష్కృత నేతగా గుర్తింపు ఉన్న అమర్ ఆ మధ్య యూపీలో సొంతంగా ఒక పార్టీని ఏర్పరిచారు. అయితే అది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో తాను రాజకీయాల నుంచి రిటరవుతున్నానని అమర్ ప్రకటించారు.  

పాదయాత్రలకు ఈసి గ్రీన్ సిగ్నల్

        తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ‘వస్తున్నా..మీకోసం’యాత్ర, వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో అమల్లోకొచ్చిన ఎన్నికల కోడ్ తో వీరి యాత్రలు ఆగిపోతాయని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వీరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీరి కోసం కమిషన్ ఎన్నికల కోడ్ నియమాలనే సడలించింది. పాదయాత్రలో ప్రస్తుత ఎన్నికలకు సంబంధించిన రాజకీయ ప్రసంగాలు ఉండకూడదని స్పష్టం చేసిన ఎన్నికల కమిషన్ ఇప్పుడు వారిని ఆయాజిల్లాల్లోనే ఉండటానికి అనమతి నిచ్చింది. ప్రస్తుతం షర్మిల, బాబుల పాదయాత్రలు గుంటూరు, ప్రకాశంల పరిసరాల్లో సాగుతున్నాయి. గుంటూరుజిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల సందర్భంగా పోలింగ్‌ కేంద్రాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో బస చేయాలని కమిషన్ సూచించింది. వీరి పాదయాత్రల తీరును సమీక్షించడానికి  జిల్లాస్థాయి అధికారిని నియమించారు.

టిడిపిని వీడిన నేతలు 420లా!

        టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో స్పందిస్తుంటారు. తాజాగా టిడిపి వదిలిపోతున్న నాయకులపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజీకియ జీవితం ప్రారంభించిన కొందరు నేతలు, తమ స్వార్ధం కోసం ఇతర పార్టీలోకి వెళ్ళడం పై ఆయన మండిపడ్డారు. ఇలాంటి నేతలను ఏమనాలి..మోసగాళ్ళా..దగా కోర్లా..నిజాయితీ లేనివాళ్ళా లేక 420లా అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. మరీ స్వార్ధం కోసం పార్టీని వదిలిపోతున్న నేతలు లోకేష్ అడిగిన ప్రశ్న కి ఏం సమాధానం చెబుతారో వేచిచూడాలి.

వీరప్పన్ అనుచరుల ఊరిపై సుప్రీంకోర్ట్ స్టే

      వీరప్పన్ అనుచరుల ఉరి శిక్ష అమలుపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే ఇచ్చింది. వీరప్పన్ నలుగురు అనుచరులకు ఈరోజు అమలు కావాల్సిన ఉరి శిక్ష నిలిచిపోయింది. వీరప్పన్ అనుచరులు పెట్టుకున్న పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు బుధవారం వరకు ఉరిశిక్షను అమలు చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషన్‌పై తదుపరి విచారణ బుధవారం 20వ తేదీ కొనసాగనున్నట్లు కోర్టు పేర్కొంది. నిందితులు జ్ఞానప్రకాశ్, సైమన్, మీ సేకర్ మాదయ్య, బిలవెంద్రన్‌లు కర్నాటకలోని పాలర్ ప్రాంతంలో మందుపాతర పేల్చి 22 మంది పోలీసులను బలిగొన్న కేసులో వారికి మరణశిక్ష అమలు చేయాలని 2004లోనే సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.

స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్ట్ గ్రీన్ సిగ్నల్

        స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 18.3 శాతం, ఎస్టీలకు 8.25 శాతం రిజర్వేషన్లకు కోర్టు అవకాశం కల్పించింది. అయితే కొత్త జనాభా ఎన్నికల ప్రకారం కాకుండా, రెండువేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు జరపవచ్చని కోర్టు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టిడిపి ఆహ్వానించింది. ఆపార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ 2001 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు నష్టపోతారన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్లే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం అయ్యిందన్నారు. ఈసీ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

స్వామి గౌడ్ తాపత్రయం అధికారం కోసం కాదుట!

  సకల జనుల సమ్మెతో తన రాజకీయ జీవితానికి బలమయిన పునాదులు వేసుకొని అంచెలంచెలుగా ఎదిగిన స్వామిగౌడ్ ప్రస్తుతం తెరాస, తెలంగాణా జేయేసీలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కేసీఆర్ దయతో ఇప్పుడు తెరాస అభ్యర్ధిగా పట్టభద్రుల కోటాలో శాసనమండలికి పోటీ కూడా చేస్తున్నారు. ఆయన ఈ ఎన్నికలలో గెలవడం ద్వారా, తన రాజకీయ జీవితంలో మరో మెట్టు పైకెదగనున్నారు.   నిజం చెప్పాలంటే, కేసేఆర్ ఆయనను చాల తక్కువ అంచనా వేయడంవల్లనే శాసనమండలికి టికెట్ ఇచ్చారు. అయితే, ఆయన అందుకు చిన్నబుచ్చుకోకుండా దొరికిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకొంటూ తన రాజకీయ జీవితంలో మరోమెట్టు పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికలలో గెలిచిన తరువాత ఆయన రాజకీయ ఎదుగుదల ఏవిదంగా ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి ఆయన పూర్తి రాజకీయ పరిపక్వత ప్రదర్శిస్తూ, అటు కాంగ్రెస్ పార్టీలోకో లేదా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకో దూకి మంత్రివర్యులుగా పదవి చేపట్టినా ఎవరూ ఆశ్చర్యపోనవసరం లేదు. ఇంకా చెప్పుకోవాలంటే, రేపు కేసీఆర్ కన్నా ఉన్నత స్థాయికి ఎదిగే లక్షణాలు కూడా ఆయనలో పుష్కలంగా కనిపిస్తున్నాయి.   కానీ, ప్రస్తుతం మాత్రం స్వామిగౌడ్ తనదారిలో ఎదురయిన ప్రతీ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొంటూ ముందుకు సాగిపోతున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ఆయన శాసనమండలికి కూడా పోటీ చేస్తుంటే అయనపై కొన్ని తీవ్రవిమర్శలు చెలరేగుతున్నాయి. ఎందరో అమాయక విద్యార్దులు బలయిన తెలంగాణా ఉద్యమాన్ని అడ్డంపెట్టుకొని, ఆయన ఈ విధంగా తన రాజకీయ జీవితాన్ని చక్కబెట్టుకోవడాన్ని చాలామంది ఆక్షేపిస్తున్నారు.   కానీ, ఆయన మాత్రం తనను తానూ సమర్దించుకొంటూ, తానూ రాజకీయంగా ఎదగాలనే తాపత్రయంతోనో, లేక పదవీ కాంక్షతోనో ఎన్నికలలో పోటీచేయడం లేదని, కేవలం సీమంద్రవాదులకు తన ఎన్నికతో గట్టిగా బుద్ధి చెప్పాలనే ఒకే ఒక్క ఆలోచనతోనే పోటీ చేస్తున్నానని ఒక వితండవాదం మొదలుపెట్టారు.   ఒకవేళ నిజంగా ఆయనకి అదే ఆశయమయితే, మరేవరినో నిలబెట్టి ఆయనను గెలిపించామని అడిగి ఉండాలి. కానీ, అధికారం వచ్చి ఒళ్లో వాలుతున్నపుడు ఎవరు మాత్రం వద్దంటారు? ఎవరు వదులుకొంటారు? అసలు తెలంగాణాలో జరుగుతున్న ఈఎన్నికలతో ఏ సంబందమూ లేని సీమంద్రులకి ఈ ఎన్నికల ద్వారా బుద్ధి చెప్తాననడమే ఒక తప్పు కాగా, తెలంగాణా అమరవీరుల శవాలనే తన రాజకీయ సోపానాలుగా చేసుకొని పైకెదగాలనుకోవడం మరో పెద్ద తప్పు.   ఎప్పుడయితే, అయన తెలంగాణా అంశాన్ని పక్కనబెట్టి ఎన్నికలు, టికెట్లు అని ఆలోచనలు మొదలు పెట్టారో, అప్పుడే తెలంగాణా గుండెల మీద కాలుమోపి ఎదిగే ఆలోచన చేసినట్లే అనుకోక తప్పదు. సాక్షాత్ కేసీఆర్ సోదరుడు మధుసూదన్ రావే ఆయన అవినీతి భాగోతాలు గురించి చెప్తున్నపుడు, ఇక ఆయనకి వేరే వారి సర్టిఫికెట్లు ఎందుకు?   రాజకీయాలు ఆయనకీ కొత్తగావచ్చును, కానీ ప్రజలకు ఇటువంటి రాజకీయనాయకులను చూడటం మాత్రం కొత్త కాదు గనుక, ఇకనయినా, ఈ బుకాయింపులు, సంజాయిషీలు అనవసరం అని స్వామి గౌడ్ తెలుసుకోవాలి.

షర్మిలతో పెళ్లికి ముందు బ్రదర్ అనిల్ మతం మార్చారు!

        భారతీయ జనత పార్టీ అధికార ప్రతినిధి ఎన్.వి.ఎస్.ప్రభాకర్ బ్రదర్ అనిల్ పై దాడి కొనసాగిస్తున్నారు. మానవత్వమే మా మతమని చెబుతున్న వైఎస్ కుటుంబం..అనిల్ కి షర్మిలా తో పెళ్ళి చేసే ముందు ఆయన మతాన్ని మార్చారని, ఇదేనా మీ మానవత్వం అని ప్రభాకర్ ప్రశ్నించారు. రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు ఆయన కుమార్తె షర్మిలా ఆస్తుల విలువ రెండు కోట్ల లోపేనని..ఆ తరువాత షర్మిలా, బ్రదర్ అనిల్ లు వివిధ కంపెనీల్లో వందల కోట్ల పెట్టుబడులు ఎలా పెట్టాగలిగారని, అంతా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. బ్రదర్ అనిల్ తన బినామీ బెన్ హర్ తో రక్షణ టీవి ఏర్పాటు చేయించి, అందులో కోట్ల పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పాల్పడకపోతే వందల కోట్లు ఎలా సమాకురాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దోచుకున్నవారి బండారాలన్ని౦టిని బయటపెడతానని చెప్పారు. అనిల్, షర్మిలాల అక్రమాస్తులను బయటకు తెచ్చేవరకూ రాజకీయపోరాటం చేస్తామని వెల్లడించారు.

అదరగొట్టిన ఆసీస్ అమ్మాయిలు

        ఆస్ట్రేలియా అమ్మాయిలు ఆరోసారి వరల్డ్ కప్ సొంతంచేసుకున్నారు. ప్రపంచ కప్ ఫైనల్ లో ఆల్ రౌండ్ షో తో అదరగొట్టి ఆరోసారి ప్రపంచ విజేతలుగా నిలిచారు. ఆదివారం ముంబై లో జరిగిన ఫైనల్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 259 పరుగులు చేసింది. జెస్ కామెరూన్ 76 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 75పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో విజృంభించగా, హేన్స్ 52 పరుగులుకు తోడు జోడి ఫీల్డ్స్ 38 బంతుల్లో 36 నాటౌట్, లానింగ్ 31, పెర్రీ 22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 25 నాటౌట్ గా నిలిచి జట్టును ఆదుకున్నారు. క్వింటినె మూడు వికెట్లు తీసింది.   259 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన విండీస్ ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్ కి క్యూ కట్టారు. 41పరుగులకే 3వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ విండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఆసీస్ మీడియం పేసర్ పెర్రీ వరుసగా మూడు వికెట్లు తీసి విండీస్‌ను చావు దెబ్బతీసింది. విండీస్ ను145 పరుగులకు ఆలౌట్ చేసి సూపర్ సిక్స్ దశలో ఎదురైన పరాభవానికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకు౦ది.

ప్రధానిని చేయమన్న మాయావతి

  అనేక కుంభకోణాలలో సిబిఐ విచారణలు, కోర్టు కేసులు ఎదుర్కొంటున్న బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత్రి మరియు మాజీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి నిన్న నాగపూర్ లో జరిగిన పార్టీ ర్యాలీలో తన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికలలో మీరు మన పార్టీని భారీ మెజార్టీతో గెలిపించించాలి. అప్పుడే నేను ప్రధాన మంత్రిగా ఎర్రకోట నుండి జాతినుద్దేశించి ప్రసంగించగలను. నా కల సాకారం అవ్వాలంటే దానికి మీ అందరి మద్దతు చాల అవసరం ఉంది. రానున్న ఎన్నికలలో మీరంతా కలిసికట్టుగా కష్టపడి పనిచేసి మన పార్టీని గెలిపించితే, అధికారం మన స్వంతం కావడం ఖాయం. ఇతర పార్టీలు వేసే ఎరలకు ఆశపడకుండా అందరూ కలిసి కష్టపడి మన పార్టీని గెలిపించుకోవాలి.”   ఇటువంటి స్వార్దపరులయిన నేతలు కూడా దేశంలో అత్యున్నతమయిన ప్రధాన మంత్రి పదవిని ఆశిస్తున్నారంటే అందుకు కారణం రెండు ప్రధాన జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు క్రమంగా తమ ప్రాభల్యం కోల్పోతూ, తమ మనుగడకోసం ప్రాంతీయ పార్టీలపై ఆధారపడవలసి రావడమే అని చెప్పవచ్చును. రోజుకో కొత్త కుంభకోణంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంటే, సరయిన దిశానిర్దేశం లేక భారతీయ జనతా పార్టీ చతికిలబడింది. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా దేశంలో మూడో పార్టీ లేకపోవడం వల్ల, క్రమంగా కేంద్రంలో ప్రాంతీయ పార్టీల పెత్తనం పెరుగుతూ వచ్చి, చివరికి జాతీయ పార్టీలను శాసించే స్థాయి నుండి, వాటిని వెనక్కు నెట్టి తామే చక్రం తిప్పే స్థాయికి ఎదిగాయి. తత్ఫలితమే, లాలూ, మాయావతి, చౌహాన్ వంటి ప్రాంతీయ నేతలు తాము కూడా ప్రధాన మంత్రి పదవికి అర్హులమేనని భావించేలా చేస్తున్నాయి.   ప్రాంతీయ పార్టీ నేతలు జాతీయ స్థాయిలో చక్రం తిప్పకూడదని నియమేమీ లేకపోయినా, అవినీతికి మారుపేరుగా నిలిచి, రాష్ట్రాలను అన్ని విధాలుగా భ్రష్టుపట్టించిన రాజకీయ నేతలు, కేంద్రంలో కీలక బాధ్యతలు చేపడితే ఇక దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతారో ఊహించడమే కష్టం. కనుక ప్రధానమంత్రి వంటి కీలక పదవులకు నిష్కళంక చరితులను ఎన్నుకోవడం ఆవశ్యకం అవుతుంది.    

ఇదేమి న్యాయం కేసీఆర్ చిన్నానా? రేణుక

  ఇంతవరకు తెలంగాణా ఉద్యమంలో తెరాస అధ్యక్షడు కేసీఆర్ అయన కుటుంబం సభ్యులనూ ప్రశ్నించేవరెవరూ లేరనేచేప్పాలి. తెలంగాణా ఉద్యమానికి కేసీఆర్ ఏకఛత్రాధిపత్యం వహిస్తుండగా, ఆయన కుమారుడు కేటీఅర్, కుమార్తె కవిత, అల్లుడు హరీష్ రావు ఆయన సైన్యాధికారువలె పనిచేస్తున్నారు. అయితే, త్వరలో జరగనున్న శాసనమండలి ఎన్నికలు, వారి కుటుంబములో నివురు గప్పిన నిప్పుల దాగిఉన్న కలహాలను బయట పెట్టింది.   ఈ ఎన్నికలలో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నకేసీఅర్ అన్నగారు మధుసూధనరావు, తన తమ్ముడు తనను పక్కనపెట్టి నిన్నగాక మొన్నవచ్చిన స్వామిగౌడ్ ను ఈఎన్నికలలో చంకనెత్తుకోవడంతో ఆగ్రహంతో ఉన్నారు. అదేవిధంగా అయన కుమార్తె రేణుక కూడా చిన్నాన కేసీఆర్ మీద కోపంతో రగిలిపోతున్నారు. నిన్నవారిరువురూ మీడియా వారితో మాట్లాడుతూ స్థానికుడయిన స్వంత అన్నను కాదని, స్థానికేతరుడు, అవినీతుపరుడు అయిన స్వామిగౌడ్ కు మద్దతు ప్రకటించడం తప్పు పట్టారు.   “అనేక కేసులో ఇరుకొని, అనేక అక్రమాలకి పాల్పడిన స్వామిగౌడ్ కు కేసీఆర్ ఎందుకు మద్దతు ఇస్తున్నారో తెలియదు. స్థానికుడయిన నాన్నగారిని కాదని స్థానికేతరుడయిన స్వామిగౌడ్ కు ఏకారణంగా మద్దతు ఇస్తున్నారో ఆయనే చెప్పాలి. నేను స్వామిగౌడ్ అవినీతి గురించి ప్రజలకి చెప్పి,ఎవరి మద్దతు ఉన్నా లేకపోయినా ప్రజల మద్దతుతో మా నాన్నగారిని తప్పక ఈ ఎన్నికలలో గెలిపించుకొంటాను.”

షర్మిలా పై విహెచ్ ఫైర్

        వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలపై కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు మండిపడ్డారు. తమ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను విమర్శించే నైతిక హక్కు షర్మిలకు లేదన్నారు. నిత్యం ప్రజా సంక్షేం గురించి ఆలోచించే తమ పార్టీ ముఖ్య నేతలను ఏమైనా అంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జగన్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు కూడా విహెచ్ సూచనలు చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్లకు పరిమితం కాకుండా ప్రజల్లో తిరగాలను సూచించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వలే కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరుగాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలహీనపడుతోందన్నారు. బొత్స, కిరణ్ ఏకపక్ష నిర్ణయాలతో పార్టీపై ప్రజలకు విశ్వాసం పోతోందన్నారు. నిన్న గాక మొన్న వచ్చిన పార్టీ, రాజకీయాలు తెలియని షర్మిల ప్రజల్లో తిరుగుతున్నారని బొత్స, కిరణ్‌లకు గుర్తు చేశారు. రాహుల్ రాష్ట్ర పర్యటన కంటే ముందుగానే పార్టీని బలోపేతం చేయాలన్నారు.